రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, అక్టోబర్ 2022, శనివారం

1227 : రివ్యూ!


 రచన - దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

తారాగణం : నాగార్జున, సోనల్ చౌహాన్, గుల్ పనాగ్, అనైకా, రవివర్మ తదితరులు
సంగీతం : మార్క్ రాబిన్, ఛాయాగ్రహణం : ముఖేష్
బ్యానర్స్ :  శ్రీ వేంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
విడుదల :  అక్టోబర్ 5, 2022
***
        చాలా కాలం నిర్మాణంలో వున్న నాగార్జున అక్కినేని నటించిన ది ఘోస్ట్ దసరాకి విడుదలైంది. రాజశేఖర్ తో గరుడ వేగ అనే హిట్ తీసిన ప్రవీణ్ సత్తారు నుంచి మరో యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీ కోసం నాగార్జున క్రవ్ మగా, కటానా అనే కత్తి పోరాటాలు నేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. హీరోయిన్లు మారిపోతూ చివరికి సోనల్ చౌహాన్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఇంకో పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకా చాలా ఆకర్షణీయమైన అంశాలున్నాయి. అయితే సినిమా అంటే కేవలం ఆకర్షణీయమైన అంశాలేనా, ఇంకేమైనా వుండాలా? ఏముండాలి? ఇది తెలుసుకుందాం.

కథ

విక్రమ్ (నాగార్జున) ప్రేమిస్తున్న ప్రియ (సోనల్ చౌహాన్) తో కలిసి దుబాయ్ లో ఇంటర్ పోల్ అధికారిగా పని చేస్తూంటాడు. క్రిమినల్స్ మీద చేపట్టిన ఒక ఆపరేషన్ లో ఒక చిన్న పిల్లాడు చనిపోవడంతో విచారంలో మునిగిపోతాడు. మానసికంగా దెబ్బ తిన్న అతడ్ని చూసి ప్రియ దూరమవుతుంది. ఇంతలో ఇరవై ఏళ్ళక్రితం దూరమైన చెల్లెలు అనుపమ (గుల్ పనాగ్) నుంచి విక్రమ్ కి కాల్ వస్తుంది. తననీ తన కూతురు అదితి (అనైక) నీ కాపాడమని వేడుకుంటుంది. దాంతో విక్రమ్ ఊటీకి బయల్దేరతాడు. ఇక చెల్లెల్ని, ఆమె కూతుర్నీ కాపాడడంలో అతడికి ఎదురైన ప్రమాదాలేమిటి, చెల్లెలికి ఎవరు ఎందుకు హాని తలపెడుతున్నారు, అసలు అన్నా చెల్లెళ్ళ కథేమిటన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

యాక్షన్ జానర్ కథ. అయితే కథ లేదు. ఆకర్షణీయమైన అంశాలు చాలా వున్నాయి గానీ, కథ కూడా వుండాలని మనస్ఫూర్తిగా నమ్మ లేదు. అందుకని కథ లేని యాక్షన్ సీన్సే వున్నాయి. అసలే చెల్లెల్ని కాపాడే సిస్టర్ సెంటిమెంటు అరిగిపోయిన పురాతన పాయింటు అయితే, ఈ అరిగిపోయిన పురాతన పాయింటుతో కథెందుకు అనుకున్నట్టు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కథ వదిలేసి యాక్షన్ సీన్లు జోడించుకుంటూ పోయాడు. బాక్సాఫీసులో బుకింగ్ క్లర్కు నోట్లు జోడించక పోయినా డోంట్ కేర్ అనుకున్నట్టుంది. చెల్లెలి కుటుంబాన్ని కాపాడే మెయిన్ స్టోరీని, ప్రేమించిన ప్రియకి దూరమైన సబ్ ప్లాట్ నీ ఫ్లాప్ కి తాకట్టు పెట్టేసి, శత్రువులు వర్సెస్ నాగార్జున అన్నట్టుగా వాళ్ళు ఎడతెరిపి లేకుండా కొట్టుకునే ...కొట్టుకునే...నరుక్కునే...నరుక్కునే అద్భుత దృశ్యాలతో రూపకల్పన చేశాడు. కొట్టుకుంటే కోటి ఇస్తామన్నట్టుంది నిర్మాతలు. ఎన్ని సార్లు కొట్టుకుంటే అన్నీ కోట్లు! సినిమా ఇలా కూడా వుంటుందని కొత్త విధానం చెప్పే ఆభినందనీయ ప్రయత్నం ఆహ్లాదకరంగా చేశాడు.

చిన్నప్పుడు చెల్లెలితో నాగార్జున ఫ్లాష్ బ్యాక్ కూడా  భావోద్వేగాలుంటే అది మనుషుల లక్షణం కాదనుకుని, మట్టి బొమ్మలుగా చేసి ప్రదర్శించాడు. యాక్షన్ సీన్స్ లో ఎమోషన్స్ వుండడానికి వీల్లేదని తీర్మానించాడు. గుంటూరు టాకీస్ వంటి రియలిస్టిక్ ఎమోషనల్ హిట్ తీసిన ప్రవీణ్ సత్తారులో ప్రావీణ్యం ఇలా జీరో ఐందేమిటని ఆశ్చర్యపోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. 2017 లో గరుడ వేగ అనే టెర్రరిజం సినిమా తీసినప్పుడు ప్రావీణ్యం ట్రాకులోనే వుందికదా అని పోల్చడం తెలివి తక్కువ తనమని ఆగ్రహించాడు.

ఇలా ది ఘోస్ట్ ప్రేక్షకుల పాలిట భూతమైపోయింది. యాక్షన్ సీన్స్ కి కూడా అయిడియాలు కొరవడినట్టు కేజీఎఫ్ నుంచి, కమల్ హాసన్ విక్రమ్ నుంచీ కాపీ కొట్టినట్టు వుండడం ఇంకా అన్యాయం. చెల్లెలి కుటుంబాన్ని కాపాడడమనే ఏదో ఒక లైను పెట్టుకుని, దానికైనా కథ లేకుండా స్టయిలిష్ యాక్షన్ సీన్స్ సిరీస్ గా సినిమా తీసేస్తే ప్రేక్షకులు భరించగలరను కోవడం పొరపాటు. సుదీర్ఘ కాలం సినిమా నిర్మాణంలో వుందంటేనే విషయంతో  ఏదో ప్రాబ్లం వున్నట్టు అర్ధం జేసుకోవాలి.

నటనలు – సాంకేతికాలు

నాగార్జున స్టయిలిష్ లుక్ తో డీసెంట్ గా వున్నాడు. యాక్షన్ సినిమాలు తనకి కొత్త కాదు. అరవై దాటిన వయసులో ఈ యాక్షన్ తో సత్తా చాటాడు. మరీ చేయలేని విన్యాసాలు చేయకుండా వయసు అనుమతించిన మేరకు ఓకే అనిపించాడు. అయితే పోరాటాలతో బాటు కాస్త పాత్ర, దాంతో కథ, పోరాటాలకి దిగడానికి బలమైన నేపథ్యం, ఆ నేపథ్యంలోంచి భావోద్వాగాలూ లేకపోవడంతో తన స్టార్ స్టేటస్ సినిమాని కాపాడలేకపోయింది. గత యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ లాగే ఇది కూడా తనకి ఐరన్ లెగ్ సినిమా. తల్వార్లు, తుపాకులు, బాంబులు వీటితోనే తను నటిస్తే, వీటిని పరీక్షిస్తున్నట్టు అన్పిస్తే, అది డెమో అవుతుందేమో గానీ మూవీ కాదు.

హీరోయిన్ సోనల్ చౌహాన్ గ్లామర్ ప్రదర్శన, ఓ యాక్షన్ సీనులో విజృంభణ వరకే పరిమితం. గుల్ పనాగ్ సిస్టర్ సెంటిమెంటుతో వుంటే, ఆమె ఎదిగిన కూతురుగా, దుర్వ్యసనాల బారిని పడ్డ ధనిక అమ్మాయిగా అనైకా నటించింది. చాలా మైనస్ ఎవరంటే విలన్. ఇన్నేసి యాక్షన్ సీన్స్ కి తెరతీస్తున్న దుష్టుడు దుష్టుడులాగా లేకుండా దిష్టి బొమ్మలాగా వుండడం ప్రవీణ్ సత్తారు ప్రావీణ్యానికి ఇంకో మచ్చు తునక.

ప్రొడక్షన్ విలువలు మాత్రం బ్రహ్మాండంగా వున్నాయి. ముఖేష్ కెమెరా, మార్క్ రాబిన్ సంగీతం, లవ్ సాంగ్ తో బాటు పార్టీ సాంగ్ చిత్రీకరణా ఆసక్తికరంగా వున్నాయి. ఇలా ఎంతో ఆసక్తిరేపుతూ వార్తల్లో వుంటూ వచ్చిన నాగ్ -సత్తారు కాంబినేషన్లో ది ఘోస్ట్ ఇంత వేస్టయిపోవడం సమస్యేం కాదు- ఓటీటీ వుందిగా!  

—సికిందర్

1226 : స్పెషల్ ఆర్టికల్


    సెప్టెంబర్ లో నిర్వహించిన జాతీయ సినిమా దినోత్సవానికి లభించిన ప్రతిస్పందనని  చూసి మరో మూడు రోజులు పండుగని పొడిగించాయి మల్టీప్లెక్స్ కంపెనీలు. కొత్త సినిమాల విడుదలల సాకు చూపించి తెలుగు రాష్ట్రాల్లో పండుగ నిర్వహించలేదు. ఇతర రాష్ట్రాల్లో 75 రూపాయల టికెట్ కి 90 శాతం ఆక్యుపెన్సీతో మల్టీప్లెక్సులు కళకళ లాడడం చూసి కళ్ళు తెరిచారు. ఇటీవల ప్రేక్షకులు సినిమాలకి దూరమవడానికి కారణం భారీగా పెంచిన టికెట్ రేట్లు అని గ్రహించారు. చౌక వినోద సాధనమైన సినిమాని ఖరీదైన విలాస వస్తువుగా మార్చడంతో ప్రేక్షకులు తగ్గిపోయారని తెలుసుకున్నారు. టికెట్ ధరలతో బాటు తినుబండారాల ఖర్చు ఫైఫ్ స్టార్ లెవెల్లో వుండడంతో సామాన్యులు సినిమాలకి దూరమైపోయారు.

హైదరాబాద్ లో ఉప్పల్ఎల్బీ నగర్మేడ్చల్ వంటి శివారు ప్రాంతాల్లో మల్టీ ప్లెక్స్ టికెట్ ధర మూడేళ్ళ క్రితం 100 రూపాయలుండేది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వెళ్ళే సగటు ప్రేక్షకులు మల్టీప్లెక్సుల వైపు మరలారు. ఇంతలో ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజు ఎత్తేయడంతోపార్కింగ్ ఫీజుల నష్టాల్ని పూడ్చుకోవడానికా అన్నట్టు టికెట్ ధరలు 150 కి పెంచేశారు. పార్కింగ్ ఫీజులున్నప్పుడు బైక్ కి 20కారుకి 30 రూపాయలుండేది. పార్కింగ్ ఫీజు ఎత్తేయడంతో టికెట్ ధర 150 చేశారు. దీంతో 2030 రూపాయలు నష్టం  ప్రేక్షలకే తప్పమల్టీప్లెక్సులకి టికెట్టు మీద 2030 రూపాయలు అదనపు లాభమే. పార్కింగ్ ఫీజులు ఎత్తేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మల్టీప్లెక్సులకే అదనపు ఆదాయంగా మారింది! అయినా సగటు ప్రేక్షకులు భరించారు.

 

        ఇక కోవిడ్ తర్వాత టికెట్ ధర 200 కి పెంచేశారు. ఆన్ లైన్ బుక్కింగ్ చేసుకుంటే 30 రూపాయలు అదనం. కోవిడ్ దెబ్బతో కోట్లాది కుటుంబాలు ఆర్ధికంగా  ఛిన్నాభిన్నమవగాకోట్లమంది మధ్యతరగతి జీవులు దారిద్ర్య రేఖకి దిగువకు జారిపోగాసినిమా టికెట్ల రేట్లు పెంచడం తెలివి తక్కువ నిర్ణయమే. పైగా పెద్ద సినిమాలు విడుదలైతే 300400 రూపాయలు వసూలు చేయడం దోపిడీయే. తినుబండారాలు కూడా 30గ్రా పాప్ కార్న్ 100 రూపాయలు70 గ్రా పాప్ కార్న్ 200 రూపాయలు! టీ కాఫీలు 40 రూపాయలు! ఇదంతా కోవిడ్ కాలంలో మల్టీప్లెక్సులు మూతబడి భారీ నష్టాలు చవి చూసినందుకని కారణం చెప్పారు. మరి కోవిడ్ కాలంలో చితికిపోయిన ప్రజల నష్టాలు  ఎవరు తీరుస్తారు. తమ నష్టాల్ని ప్రజలు తామే భరించినట్టుమల్టీప్లెక్సులు వాటి నష్టాల్ని అవే భరించాలి. ఎవరి నష్టాల్ని వారే జీర్ణం చేసుకోవాలి తప్ప ఇంకొకరి ద్వారా పూడ్చుకోవాలని చూస్తే అసలుకే ఎసరురే వస్తుంది.

 

        ఇదే జరిగింది. మల్టీప్లెక్సుల నష్టాల్ని పూడ్చడానికి ప్రేక్షకులు ససేమిరా అని సినిమాలకి డుమ్మా కొట్టడం ప్రారంభించారు. మల్టీప్లెక్సుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక గ్రూపు కంపెనీ ఇంకో గ్రూపుకి మల్టీప్లెక్సులు అమ్మేసి చేతులు దులుపుకుంది. సినిమాలు ఫ్లాపవడానికి రకరకాల కారణాలు వూహించారు. వాటిలో ఓటీటీలు ఒకటి. ఓటీటీలతో నిర్మాతలు లాభపడుతున్నారుమల్టీప్లెక్సులకి నష్టాలే. అమెరికాలో కోవిడ్ కాలంలో దూరమైన ప్రేక్షకుల్ని తిరిగి రప్పించడానికి 3 డాలర్ల టికెట్టుతో జాతీయ సినిమా దినోత్సవం నిర్వహించారు. ఇది బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇది చూసి ఇండియాలో నిర్వహించారు. ఇక్కడ కూడా విజయవంతమైంది. దీన్ని మూడు రోజులు పొడిగించి చూశారు. ప్రేక్షకులు తగ్గలేదు.

 

        దీంతో వ్యాపారం అర్ధమైంది. ప్రేక్షకులు సినిమాలకి దూరమవడానికి ఓటీటీలు పూర్తి కారణం కాదనీపెంచేసిన టికెట్ల ధరలేననీ జ్ఞానోదయమైంది. సినిమా పండగ రోజు హిందీలో ‘చుప్ - రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ నిర్మాతలు వెనుకాడకుండా 75 రూపాయల టికెట్ ధరకే సినిమా విడుదల చేశారు. 90 శాతం ఆక్యుపెన్సీ తో ఆటలు కళకళ లాడాయి. దీన్ని మూడు రోజులు పొడిగించారు. ఇంకా బాగా ప్రేక్షకులొచ్చారు. అంటే చిన్న సినిమాలకి ప్రేక్షకులు దూరమయ్యారనే అభిప్రాయం కూడా తప్పని రుజువయ్యింది.  ఇదే ‘చుప్’ కి 200300 రెగ్యులర్ టికెట్ రేట్లు వసూలు చేస్తే అన్ని చిన్న సినిమాలకి లాగే ఇదీ మల్టీప్లెక్సుల రెంట్లు కట్టుకుని వెనక్కి వచ్చేది.

 

           సినిమా పండుగ జరిగే సెప్టెంబర్ 23 వ తేదీన తెలుగులో అల్లూరికృష్ణ వ్రింద విహారి (ఇదొక వికృత టైటిల్)దొంగలున్నారు జాగ్రత్త అని మీడియంచిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందుకని తెలుగు రాష్ట్రాల్లో 75 రూపాయల సినిమా పండుగని రద్దు చేశారు. రద్దు చేసి లాభపడిందేమీ లేదు.  75 రూపాయల టికెట్ కే ఈ మూడు సినిమాలు చూపించి వుంటే మీడియంచిన్న సినిమాలకి 200 రూపాయల టికెట్ కారణంగా  దూరమైన ప్రేక్షకుల స్పందన వేరేగా వుండేదేమో- ‘చుప్’ కి లాగా!

 

        ఇక కనీసం తెలుగులో చిన్నమధ్య తరహా  సినిమాల  నిర్మాతలు పునరాలోచించు కోవాలేమో. ప్రేక్షకులకి సినిమా అంటే 100 రూపాయల వస్తువే. సగటు ప్రేక్షకులకి సైతం. మల్టీప్లెక్స్ కంపెనీలు ఈ కోవలోనే ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. దీనికో ఎజెండా రూపొందిస్తున్నారు. చిన్నమధ్య తరహా బడ్జెట్ సినిమాలకి వేరియబుల్ ధర వుంటుంది. ఈవినింగ్నైట్ షోలుఅలాగే వారాంతాల్లో ఉద్యోగాలు చేసే యువ ప్రేక్షకులు ఎక్కువగా వుంటున్నారు. వీరిని వీలైనన్ని ఎక్కువ సార్లు రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎక్కువగా విడుదలయ్యే చిన్నమధ్య తరహా సినిమాల టికెట్ల ధర్ల 100 రూపాయలు నిర్ణయించితినుబండారాల ధరలూ బాగా తగ్గించాలని ఆలోచిస్తున్నారు. ఈ చర్యలు  రాబోయే నెలల్లో విడుదలయ్యే మధ్య స్థాయి హిందీ సినిమాలని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు.


‘బ్రహ్మాస్త్రా
’,  ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ లకి ప్రయోగాత్మకంగా గత వారం 100 రూపాయల టిక్కెట్‌లని  విక్రయించారు. స్పందన బావుంది. నవంబర్‌లో షెడ్యూల్ చేసిన అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ కి 50 శాతం తగ్గింపుని ఆఫర్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్‌బై’  ప్రారంభ రోజున ₹150 లకే టికెట్స్ ని అందించారు. మరి కొంత సమయం తీసుకునిటిక్కెట్ ధరలు తగ్గిస్తే థియేటర్లకి  వచ్చే ప్రేక్షకుల ఫ్రీక్వెన్సీ నిజంగా పెరుగుతుందో లేదో విశ్లేషిస్తారు. టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా వుంటే పెట్టుబడిని తిరిగి పొందలేని భారీ-బడ్జెట్ చిత్రాలకి సాధ్యం కాదు. అయితే అక్టోబర్‌లో విడుదలయ్యే చిన్న తరహా సినిమాలకి నిర్మాతలు ప్రయోజనమే పొందుతారు.

 

        ఒకే ప్రాపర్టీ ఒకే సమయంలో ప్రీమియంతో బాటు  తక్కువ ధర టికెట్లని  అమలు చేయగల డ్యూయల్ టికెటింగ్ వ్యూహంకూడా ప్రయోజనం చేకూరుస్తుంది. చౌకగా వున్నందున యువకులుశ్రామిక తరగతి ఫ్రేక్షకులు పెరుగుతారని ఆశిస్తున్నారు. ఈ సంస్కరణలకి తెలుగు నిర్మాతలు అంగీకరిస్తారో లేదో చూడాలి.

***