రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, మే 2014, శుక్రవారం


   రివ్యూ..         

                              సృజనాత్మక నివాళి!
రచన- దర్శకత్వం : విక్రమ్ కె. కుమార్
తారాగణం : అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంతా, శ్రియ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ  తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్ - ఛాయాగ్రహణం :  పి ఎస్ వినోద్ - కళ : రాజీవన్ - ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
యాక్షన్ : విజయన్ - నృత్యాలు : బృంద  - సంభాషణలు : హర్షవర్ధన్
బ్యానర్ : అన్నపూర్ణా స్టూడియోస్  - నిర్మాతలు : అక్కినేని కుటుంబం
విడుదల :  23 మే, 2014 - సెన్సార్ : U/A
***
డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు నిండు జీవితం సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అయినట్టు ఆయన నటించిన చివరి చలనచిత్రం సెలెబ్రేషన్ ఆఫ్ న్యూ యేజ్ తెలుగు సినిమా.  ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే నవరసాల పనోరమా. ఈ శుక్రవారం నుంచి మల్టీ స్టారర్ సినిమాలకి కొత్తర్ధం చెబుతూ కొత్త శకం ప్రారంభమయిందని చెప్పొచ్చు.

దర్శకుడు విక్రం కుమార్ ముందుగా ’ఇష్క్’ తో ప్రూవ్ చేసుకున్నాకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మీద సాహసించి చె య్యేసేందుకు అనుమతి లభించింది. వేసిన చెయ్యి సరాసరి అక్కినేనికి నిజమైన సృజనాత్మక నివాళి అయి నిరూపించుకుంది. ఒక కుటుంబంలోని మూడు తరాలకి చెందిన నల్గురు హీరోలతో కొత్తతరహా కథా సంవిధానంతో కట్టిపడేసే చాతుర్యం ఈ దర్శకుడిది.

మల్టీ స్టారర్ ‘మనం’ వాణిజ్య సినిమాలతో వుండే అన్ని మూఢ విశ్వాసాల్నీ బద్దలు కొడుతూ, మూస పద్ధతుల అన్ని సంకెళ్ళనీ తెంపేసుకుంటూ, తెలుగు ప్రేక్షకులు సినిమా నిరక్షరాశ్యులనే స్థిరపడిన నమ్మకాల్ని, అవకరాల్ని  అపహాస్యం చేస్తూ ఇవాళ బిగ్గెస్టు బాక్సాఫీసు బొనంజా అయికూర్చుంది.

దీని క్రెడిట్ ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించే అక్కినేని నాగార్జునకి పోతుంది. ‘మనం’ సినిమా చూడకపోతే మనోలోకాల లోతుల సెలెబ్రేషన్ కి మనుషులు దూరమైనట్టేనని లాకులు ఎత్తేసి మరీ చెబుతున్నారు...


వందేళ్ళ ప్రయాణంలో బంధాలు!
1920లో ప్రారంభమై, ప్రస్తుత కాలానికి ఐదారేళ్ళు ముందుకెళ్ళి 2020 లో ముగిసే శతాబ్ద కాలపు ఈ పునర్జన్మల సైకో ఎనాలిసిస్ కథ,  1983లో ప్రారంభమై ఇలా సాగుతుంది... రాధామోహన్ (నాగ చైతన్య), కృష్ణవేణి (సమంత) లు పెళ్ళిచేసుకుని బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు ని కంటారు. నాగేశ్వరరావు ఐదారేళ్ళు వున్నప్పుడు ఇద్దరూ కొట్లాడుకుని విడిపోదామనుకుంటారు. లాయర్ ని కలవడానికి కారులో బయల్దేరినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతారు. ముప్పై ఏళ్ల తర్వాత బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు (నాగార్జున) బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగి ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ నడుపుతుంటాడు. ఓరోజు ఫ్లయిట్ లో పక్కసీట్లో కూర్చున్న కాలేజీ స్టూడెంట్ ని చూసి స్టన్ అవుతాడు. ఈ స్టూడెంట్ నాగార్జున (నాగచైతన్య) అచ్చం తన తండ్రి రాధా మోహన్ లాగే ఉండడంతో తండ్రే మళ్ళీ పుట్టాడని - నాన్నా-  అంటూ దగ్గరవుతాడు. తండ్రే మళ్ళీ పుడితే తల్లికూడా పుట్టే ఉంటుందని ఆమెకోసం వెతుకుతుంటాడు.


ఇంకో బిజినెస్ మేనేజ్ మెంట్ స్టూడెంట్ గా అచ్చం తన అమ్మలాగే ప్రియ (సమంత) కన్పించడంతో అమ్మా అని పిలుస్తూ ఆమెకి దగ్గరవుతాడు. ఇలా  అమ్మానాన్నలతో  ఇంటరాక్ట్ అవుతూ  గతజన్మలో పోట్లాడుకుని విడిపోయిన వీళ్ళిద్దర్నీ కలిపేదెలా అని లోచిస్తున్నప్పుడు, ఒక యాక్సిడెంట్ కేసులో డాక్టర్ అంజలి(శ్రియ) పరిచయమవుతుంది. ఈమె కోరిక మీద ఆ ప్రమాద  బాధితుడు చైతన్య (అక్కినేని నాగేశ్వర రావు ) కి రక్తదానం చేయడాని నాగేశ్వర్రావు వెళ్ళినప్పుడు,  అక్కడ ఎనభై ఏళ్ల చైతన్య వీళ్ళిద్దర్నీ పూర్వ జన్మలో తన తల్లిదండ్రులుగా గుర్తించి ఎక్సైట్ అవుతాడు. 1920లలో వీళ్ళిద్దరూ లక్ష్మీ- సీతారాముడులు!

గతజన్మలో ప్రియ, నాగార్జునలు నాగేశ్వరరావు తల్లిదండ్రులైతే, నాగేశ్వర్రావూ అంజలిలు చైతన్య పేరెంట్స్ అన్నమాట. ఆర్టిస్టులుగా చెప్పుకుంటే, నాగ చైతన్య నాగార్జున తండ్రి అయితే, నాగార్జున అక్కినేని నాగేశ్వర రావు తండ్రి అన్నమాట!

ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సరికొత్త కాన్సెప్ట్, కాంబినేషన్లు. ఇలా సూపర్ స్టార్ల కుటుంబాలతో చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ రొటీన్ మూస ఫార్ములా సినిమాలే. కొన్నయితే వాళ్ళ  వంశాలదే గొప్ప అన్న టైపులో ఇగోలకి పోయిన చిత్రీకరణలు. ‘మనం’లో ఈ మూస లేదు, మీసాలు తిప్పడాలూ లేదు. మనమంటూ .. సినిమాచూసే ఆబాలగోపాలాన్నీ తమతో బాటూ కలుపుకుపోయే సమ్మిళిత వినోదాల పంట. ఓ పాత పాటని గుర్తు తెచ్చుకుంటే, ‘రానున్న విందులో నీవంతు అందుకో’ అని ప్రేక్షకుల్ని సమాదరించిన  నిరాడంబరత. అక్షరాలా ప్రేక్షకులు అక్కినేని కుటుంబపు ఈ సెలెబ్రేషన్ లో తామూ పాలుపంచుకుంటున్న ఫీలింగ్ ని పంచిపెట్టిన హ్యూమిలిటీ.

తమిళ-తెలుగు సినిమాల దర్శకుడు విక్రం కుమార్ - మిమ్మల్ని ఇంద్రుల్నీ చంద్రుల్నీ చేసి చూపిస్తానని అక్కినేని హీరోలతో చెప్పివుండొచ్చు. దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చి వుంటే ఈ సినిమా గురించి ఇవ్వాళ్ళ చెప్పుకోడానికి ఏమీ వుండేది కాదు. ఎన్నో జన్మలు, పునర్జన్మలు –ఏంతో సంక్లిష్టత-అయినా చాలా సింప్లిసిటీ, కన్ఫ్యూజన్ లేని క్రియేటివిటీ, పాత్ర చిత్రణలు, సంభాషణలు. ఇక  సంగీతం, ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం, యాక్షన్ కోరియోగ్రఫీ, ఎడిటింగ్  సమస్తం అంతర్జాతీయ ప్రమాణాలకి తీసిపోకుండా  వున్నాయి.

మెలోడ్రామానీ, విషాదాల్నీ చూపించినట్టే చూపించి, కట్ చేసే మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ చిత్రీకరణ పద్ధతితో గురుదత్ ‘ప్యాసా’ ని తలపించే దర్శకత్వాన్ని చూడొచ్చిక్కడ.

అయితే 1920ల నాటి పల్లె వాతావరణాన్ని చూపిస్తున్నప్పుడు, ఆ దృశ్యాత్మక విశేషాలకి తగ్గట్టే కాలీన స్పృహ తో సంగీతబాణీలూ ఉండాల్సింది. ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘రివాల్వర్ రాణి’లో ఇలాటిదే 1990ల నాటి కాలానికి తగిన బాణీలతో ఓ పాట పెట్టారు. ‘మనం’ లో కూడా సంగీతపరంగా ఆ ఫ్లాష్ బ్యాక్ కి పీరియడ్ ఫీల్ తీసుకు రావొచ్చు- ‘ఆదిత్య -369’ లో ‘జాణవులే’ పాటతో ఇళయరాజా తెచ్చినట్టు. డిజైనర్ పీరియడ్  ఫ్లాష్ బ్యాక్ వల్ల వేరియేషన్ లోపించి కథాకాలాలన్నీ ఒకేలా తయారయ్యాయి.

ఇక నాగార్జున-నాగచైతన్యల బాండింగ్, సమంతాతో నాగార్జున కెమిస్ట్రీ, నాగచైతన్య-సమంతాల కెమిస్ట్రీ/ఫిజిక్సూ, మళ్ళీ నాగార్జున-శ్రియల రెండుజన్మల ‘ఐలవ్యూ అంటే ఇలాఇవ్వు’ రోమాన్స్...మొత్తం వీళ్ళందరితో వయసుమీరిన అక్కినేని నాగేశ్వరరావు రియల్ టైమ్ తక్కుటమారాలూ... ‘ధర్మదాత’ లో ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి-అని కొడుకుల్ని తరిమేసిన వైరాగ్యం నుంచీ ఇప్పుడందరూ వున్న ఏకాకిలా అక్కినేని ఎంతో హుషారు నటన కనబర్చి జోష్ తెప్పించారు. చివర్లో సూపర్ ఇంపోజ్ చేసిన ‘నేను పుట్టాను’ పాట బిట్ తో అల్లరల్లరి!


విడుదలకాని ‘ఆటోనగర్ సూర్య’ ని పట్టుకుని సినిమాలేక త్రిశంకు స్వర్గంలో వున్న నాగచైతన్య బాగా ఇంప్రూవ్ అయి తిరిగొచ్చాడు. వెళ్ళిపోయిన తాతగారి  లెగసీని ముందుకు తీసుకుపోయేందుకు తాతగారికి హామీపడినట్టు నటించాడు. అయితే నటించినవన్నీ-ఒకటిరెండు తప్ప-కామెడీ సీన్లే కావడంతో అతనెంత వరకూ ఆల్ రౌండర్ అవగలడో ఈ సినిమాతో చెప్పడం కష్టం.

సీనియారిటీ కొచ్చిన నాగార్జునకి సీనియర్ శ్రియతో రోమాన్స్ వల్ల ఇబ్బందేం ఏర్పడలేదు. హీరోయిన్ సమంత యూత్ అప్పీల్ కే గాక, పాత్రలో వున్న ‘బరువుబాధ్యతల్ని’ కూడా మోయడానికి సరీగ్గా సరిపోయింది. కమెడియన్లు బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ లు అంత కామెడీ లేని పక్కపాత్రలకి సర్దుకున్నారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రానున్న మరో అక్కినేని వంశాంకురం అఖిల్ ల అతిధి పాత్ర ప్రవేశాలతో కలుపుకుని ఈ ‘మనం’ పరిపూర్ణం అయింది.

స్క్రీన్ ప్లే సంగతులు

ఈ స్క్రీన్ ప్లే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏమిటంటే, నిజజీవితంలో అక్కినేని హీరోల బంధుత్వాల్ని తిరగేసి చూపించడం! ఇదే లేకపోతే ఈ  పునర్జన్మల కథలకి కొత్తదనమే లేదు. మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలోనే పునరావృత మవుతూ వస్తున్న  అవే పునర్జనల కథలకి ఇది అనూహ్యమైన టర్నింగ్ పాయింట్. వంశంలో మూడు నాలుగు తరాల హీరోలు ఉంటేతప్ప సాధ్యంకాని అపూర్వ  ప్రయోగం.

అయితే సమస్యల్లా ఓ నూరేళ్ళ సుదీర్ఘ కాలపు కథ చెప్పాల్సి రావడం. దీన్ని ఎక్కడ ప్రారంభించి, ఏ ఏ మజిలీలు దాటించి, గమ్యానికి చేర్చాలి?

ఇలాటి సందేహమే వరల్డ్ క్లాసిక్ ‘గాంధీ’ (1982) తీసిన దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకీ వచ్చిందని సిడ్ ఫీల్డ్ పేర్కొంటాడు ‘ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’ అన్న పుస్తకంలో. శాఖోప శాఖలుగా విస్తరించిన ఓ మహావృక్షంలాంటి మహాత్ముడి జీవితాన్ని సినిమా కథగా  ఎలా రూపొందించాలి? మహాత్ముడి జీవితంలో అన్ని ఘట్టాలనీ చూపించుకు రాలేం. అప్పుడది డాక్యుమెంటరీ అవుతుంది. క్రియేటివిటీ తో పనుండదు. అందుకని అటెన్ బరో శల్యపరిక్ష జరిపి మహాత్ముడి జీవితంలో మూడే ఘట్టాలు స్క్రీన్ ప్లేకి బలమైన ఫౌండేషన్స్ కాగలవని నిర్ణయించాడు. అవి 1. దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా పోరాట జీవితం, 2. భారత దేశంలో సహాయ నిరాకరణోద్యమం, 3. హిందూ ముస్లిముల సమస్య. ముగింపుగా హత్య!

ఈ మూడింటి ఆధారంగానే  సంఘర్షణాత్మక కథ అల్లి,  తెరమీద మహాత్మాగాంధీ జీవిత చరిత్రకి సమగ్రత సాధించాడు అటెన్ బరో. సిడ్ ఫీల్డ్  చేసిన ఈ విశ్లేషణ ప్రకారమే చూస్తే,  2007లో అబ్బాస్ ఖాన్ తీసిన ‘గాంధీ మై ఫాదర్’ సినిమాకీ ఇదే స్క్రీన్ ప్లే ఫౌండేషన్ కన్పిస్తుంది. గాంధీ కుమారుడి యాభై ఏళ్ల జీవితకాలాన్ని అటెన్ బరో ఫార్ములా ననుసరించే చిత్రించినట్టు మనకర్ధమౌతుంది.
2007 లోనే శేఖర్ కమ్ముల తీసిన సూపర్ హిట్  ‘హ్యాపీ డేస్’ స్క్రీన్ ప్లే కీ ఇదే అటెన్ బరో ఫౌండేషన్ కన్పిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఓ నాల్గేళ్ళు  హ్యాపీ గా గడిచిపోయే అనుభవాల సారంగా ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు, ఆ అనుభవాల్లో వేటిని తీసుకుని కథ తయారుచేయాలి? అనుభవాలు కలగాపులంగా వుంటాయి. వ్యక్తిగత, కాలేజీ గత, ప్రాపంచిక...ఇలా విభిన్న పార్శ్వాలుగా  అనుభవాలు కలగలిసిపోయి వుంటాయి. గాంధీ జీవిత కథ  లాంటి సమస్యే ఇక్కడ కూడా. కాకపొతే టైంలైన్ తక్కువ. అప్పుడు 1. కాలేజీలో కొత్త విద్యార్థుల ర్యాగింగ్, 2. చదువుల్లో ఎదురయ్యే సమస్యలు, 3.  ప్రేమల గురించి స్ట్రగుల్- అనే మూడు బ్లాకులుగా నాల్గేళ్ళ  టైంలైన్ ని విభజించి, వాటి తాలూకు అనుభవాల్ని మాత్రమే పొందుపర్చడంతో స్క్రీన్ ప్లేకి అంత బలం చేకూరింది.

 ‘మనం’ లో నూరేళ్ళ  టైం లైన్ని చూసినప్పుడు ఇందులో మూడు జీవిత కాలాలు ఇమిడివున్నాయి.  1. నాగార్జున-శ్రియ ల పూర్వజన్మ జీవితకాలం, 2. నాగ చైతన్య- సమంతల పూర్వజన్మ జీవితకాలం, 3. తిరిగి అక్కినేని నగెశ్వర రావుని కలుపుకుంటూ, ఈ రెండు జంటల వర్తమాన జీవితకాలం. వీటిన్నిటినీ కలిపి ఓ కథగా చెప్పాలంటే ఈ జీవితకాలాల్లో ఏ ఏ ఘట్టాల్ని ప్రధానంగా తీసుకోవాలి?

ఈ కథ ఆదిమధ్యంతాలన్నిటా (గత జన్మల్లో, ఇప్పుడూ) ఓకే సంఘటన పునరావృతమవుతూంటుంది. అది మోటారు వాహన ప్రమాద సంఘటన. దీంతో చావుపుట్టుకల చక్రభ్రమణంలో పడి పాత్రలు నలుగుతూంటాయి. చావకపోతే పునర్జన్మ లేదుకాబట్టి వేర్వేరు కాలాల్లో రెండు జంటల చావులు చూపించక తప్పదు. మళ్ళీ పునర్జన్మల్లో వాళ్ళకి పుట్టిన పిల్లలతో కనెక్ట్ చేయకా తప్పదు. ఇలా కథా పథకం డిసైడ్ అయితే వాటికి  తగ్గ ఘట్టాల్ని  ఎంపిక చేసుకోవడం సులభమే.

1. నాగచైతన్య-సమంతల ప్రేమా పెళ్ళీ, రోడ్డు ప్రమాదంలో మరణం, వాళ్ళ కొడుకుగా నాగార్జున మిగలడం, 2. నాగార్జున- శ్రియల ప్రేమాపెళ్ళీ, రోడ్డుప్రమాదంలో మరణం, వీళ్ళ కొడుకుగా అక్కినేని నాగేశ్వర రావు మిగలడం, 3. మొత్తం అందరూ కలిసి వర్తమానకాలంలో మళ్ళీ రోడ్డు ప్రమాద ఘటనలో చిక్కుకోవడం!

ఐతే కథ ఎక్కడ్నుంచీ ప్రారంభించాలి? 1920లలో నాగార్జున- శ్రియల కథ దగ్గర్నుంచా? ఇలాటి పని అటెన్ బరో కూడా చేయలేదు. అటెన్ బరో 1948లో గాంధీ హత్యతో సినిమా ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి గాంధీ కథ మొదట్నుంచీ చెప్పుకొస్తాడు. అలాగని మరీ గాంధీ ప్రారంభ దినాల జోలికి పోకుండా, 55 ఏళ్ల క్రితం 1893లో 24 ఏళ్ల యువలాయర్ గా వున్నప్పుడు, దక్షిణాఫ్రికాలో జాత్యాహంకారంతో అతణ్ణి రైల్లోంచి తోసేసే- అతడి జీవితాన్ని సమూలంగా మలుపుతిప్పేసే - సంఘటనతో ప్రారంభిస్తాడు.

ఎందుకిలా చేశాడంటే, పాశ్చాత్య స్క్రీన్ ప్లేలని సశాస్త్రీయంగా రచించు కుంటారు కాబట్టి. సొంత నమ్మకాలతో ఏదో బుద్ధికి ఎంత తోస్తే అంత రాసుకునే  మనబోటి వాళ్ళం రచిస్తే, భలే సెంటిమెంటల్ గా ఉంటుందని, గాంధీ బాల్యజీవితం దగ్గర్నుంచీ ఎత్తుకుని అవతలివాడికి తెగ బోరు కొట్టిస్తూ, మనం తెగ సంతృప్తి చెంది తరిస్తాం!
శాస్త్రీయంగా ఓ కథ అనుకోవాలంటే,  ముందుగా ప్లాట్ పాయిట్ -1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్-2 లని గుర్తించి, వాటినాధారంగా చేసుకుని ఆలోచించకపోతే, సినిమా కథ సవ్యంగా రానట్టే!

అందుకే, మొదటి అంకం అంతంలో ప్లాట్ పాయింట్- 1 కి దారి తీసేందుకు పనికొచ్చే, కథని మలుపు తిప్పే ‘రైలు సంఘటన’ గాంధీ జీవితంలో ఉందని గుర్తించిన అటెన్ బరో- దాంతోనే కథని (మొదటి అంకాన్ని) ప్రారంభించాడన్న మాట సశాస్త్రీయంగా!

‘మనం’ లో కూడా మరీ 1920 ల దాకా వెనక్కెళ్ళ కుండా, మధ్యస్తంగా 1983 లో,  నాగచైతన్య 23 ఏళ్ల కుర్రాడిగా వున్నప్పట్నుంచే  కథ నెత్తుకున్నాడు దర్శకుడు. యువ పాత్రలతో కథ ప్రారంభించడం బాక్సాఫీసు అప్పీలుకి దోహదం చేస్తుంది కాబట్టి ‘గాంధీ’ లో ఫాలో అయినట్టే  ‘మనం’ లోనూ ఫాలో అయ్యారు.

contd...




















ప్రకటనేసుకుని పొగత్రాగొచ్చు!


సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టూ...పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలి మెట్టూ!’...అన్నాడు తెలుగు సినీకవి.  ‘మై జిందగీకా సాథ్ నిభాతా చలాగయా...హర్ ఫిక్ర్ కో ధువేమే ఉఢాతా చలాగయా’ (జీవితం ఎలా సాగితే అలా సాగిపోతున్నా- వర్రీస్ ని పొగలో ఊది పారేస్తున్నా! ) అన్నాడింకో  హిందీ సినీ కవి. నిన్నమొన్న కాదు, ఎప్పుడో రెండుతరాల క్రితం అర్ధ శతాబ్దం కూడా దాటిపోయిన ...ఆ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో... ఇంటిల్లిపాదీ ఈ సినిమాలకెళ్ళి ఎంజాయ్ చేసిన ఈ సిగరెట్ పాటలు, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిల్చిపోయి, ఇప్పటికీ సిగరెట్ పాటలన గానే ఇవే గుర్తొచ్చేట్టు మనోఫలకాల మీద ముద్రించుకు పోయాయి!

‘రాముడు-భీముడు’లో రేలంగి- గిరిజలు  జంటగా,  ’హమ్ దోనో’ లో దేవానంద్ సోలోగా వెలింగించిన ఈ పాటలు కామెడీ ఒకటైతే, ఫిలాసఫీ మరొకటిగా ఉత్త కాలక్షేప సాహిత్యంగా గాక, జీవితసత్యాలకి దర్పణం పట్టాయి.
ఆ తర్వాత సినిమాల్లో సిగరెట్ తాగడం స్టయిల్ స్టేట్ మెంట్ కింద మారిపోయి కాస్త వన్నె తగ్గుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ ని  పైకెగరేసి నోటకరిచే ట్రిక్కుగా కమర్షియల్ గా  ఎంత పండిందో, ఆయన్ని అనుకరిస్తూ అటు హిందీలోనూ శత్రుఘ్న సిన్హా అదే ట్రిక్ ని కాపీ కొడితే అంతగానూ పేలింది. దుర్వ్యసనాలతో ఈ పాటలేంటి, హీరోయిజాలేంటీ అని ఎవరూ చీదరించుకోలేదు.

చీదరించుకోవడం ఎప్పట్నుంచీ మొదలయ్యిందంటే,  ఈ శతాబ్దం ఆరంభంనుంచీ అప్పుడున్న హీరోల మార్కెట్ తగ్గుతూ, కొత్త కొత్త కుర్ర హీరోల రాకతో,  వాళ్ళు పోషించే ఆకతాయి స్టూడెంట్స్ పాత్రలు ఎడాపెడా సిగరెట్లూ మద్యం లాగించేసే సీన్లతో నిండిపోవడం ప్రారంభమై నప్పట్నుంచీ!

అప్పుడు 2005లో గత కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరచింది. సినిమాల్లో ధూమపానాన్నిపూర్తిగా  నిషేధించింది. 2003లోనే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణా చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టంతో  సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్ని నిషేధించింది. 2004 లో ఇతర అన్ని ప్రసార-ప్రచార మాధ్యమాల్లోనూ ప్రకటనలపై నిషేధం విధించింది. అప్పుడు 2005లో సినిమాలపై దృష్టి సారించింది. నవతరం సినిమాలతో పొగాకు ఉత్పత్తులు దొడ్డిదారిన విచ్చలవిడిగా ప్రచారమవుతున్నాయని గుర్తించి- సినిమాలతో పాటు టీవీ సీరియళ్ళలోనూ ఏ పాత్రా పొగాకు ఉత్పత్తుల్ని వాడుతున్నట్టు చూపించరాదని  నిషేధం విధించింది. పాత సినిమాలు ప్రదర్శించాల్సి వస్తే ముందుగా హెచ్చరిక వేయాలని  ఆదేశించింది గత ప్రభుత్వంలోని కేంద్ర ఆరోగ్య శాఖ.

ఐతే ఈ ఆదేశాల్ని అమలుపర్చాల్సింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. ఈ శాఖ పై ఆదేశాల్ని పరిశీలించి కొంత సడలింపు నిస్తూ సృజనాత్మక స్వేచ్ఛ ని కాపాడాలని నిర్ణయించి, ధూమపాన  దృశ్యాలు తప్పని  సరయితే ఆ సినిమాలకు ‘ఏ’ సర్టిఫికేట్ జారీచేయాలని కేంద్రీయ సెన్సార్ బోర్డుకి  సూచించింది. అంతే గాక సినిమాల్లో  పొగత్రాగిన నటుడి చేత సినిమా ప్రారంభంలో పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరమనే  ప్రకటన  ఇప్పించాలనీ, ఆ దృశ్యాల కిందిభాగంలో  కూడా ఇదే హెచ్చరిక స్క్రోలింగ్ వేయాలనీ ఉత్తర్వు లిచ్చింది.

దీనిపై ప్రముఖ హిందీ నిర్మాత మహేష్ భట్  ఢిల్ల్లీ హై కోర్టుని ఆశ్రయించారు. 2009 లో ఢిల్ల్లీ హై కోర్టు ధూమపానం పై సెన్సార్ ఆంక్షల్ని కొట్టి వేసింది. అయినప్పటికీ, ప్రజారోగ్య పరిరక్షణకు రాజ్యాంగం ప్రకారం ఓ పరిధిలో చర్యలు తీసుకునే వెసులుబాటు వుందని వాదిస్తూ,  కేంద్ర ప్రభుత్వం అదే సంవత్సరం సుప్రీం కోర్టు కెళ్ళింది. సుప్రీం కోర్టు ఢిల్ల్లీ  హైకోర్టు ఆదేశాల్ని కొట్టి వేసింది. అప్పట్నుంచీ 2011 వరకూ కేంద్ర ప్రభుత్వం ఇటు తనకూ, అటు సినిమా రంగానికీ అనుకూలంగా  వుండే సవరణల్ని ప్రతిపాదించడానికి  ఆలోచిస్తూ వుండి  పోయింది. అప్పుడు అదే సంవత్సరం నవంబర్ 14 నుంచి అమలయ్యేలా కొత్త నోటిఫికేషన్ని విడుదల చేసింది.

2011 అక్టోబర్ 27న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం...

1. ధూమపానం చేసే దృశ్యాలున్న సినిమాలకి ఏ/యూఏ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలి , 2. ధూమపానం చేసిన నటుడి వాయిసోవర్ తో, సినిమా ప్రారంభం లోనూ మళ్ళీ విశ్రాంతి తర్వాతా 20సెకన్ల నిడివితో డిస్ క్లెయిమర్ వేయాలి, 3. ధూమ పానం చేస్తున్న దృశ్యాల మీద పొగత్రాగడం ప్రాణాలకు హానికరం అన్న స్క్రోలింగ్ వేయాలి, 4. ఈ నోటిఫికేషన్ అమలయ్యే తేదీ, 2011 నవంబర్ 14 నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘న్యూ ఫిలిమ్స్’ వర్గీకరణతో సర్టిఫై చేయాలి, 6. ఇవన్నీ అమలయ్యాయా లేదా చూసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖాధికారి ఒకరు సెన్సార్ బోర్డు స్క్రీనింగ్ లో పాల్గొనాలి, 7. ఈ నోటిఫికేషన్ కంటే ముందున్న ‘పాత’ సినిమాలకి సంబంధించి సదరు ప్రదర్శనాశాల నిర్వాహకుడు 30సెకన్ల పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక హెల్త్ స్పాట్ ని సినిమా ప్రారంభ్నికి ముందు ప్రదర్శించాలి, 8. హలీవుడ్/వరల్డ్ సినిమాలకు ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు వుంటుంది, ఎందుకంటే అవి దిగుమతైన సినిమాలు కాబట్టి...

ఈ చట్టం ఈ రూపం తీసుకోవడానికి ఆరేళ్ళు పట్టింది. 2005 లోనే ఈ చట్ట సవరణకి  బీజం వేసినప్పటికీ, భారతీయ సినిమాల్లో  పొగత్రాగే దృశ్యాల ప్రభావం పై 2003లోనే హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాని ప్రకారం భారతదేశం ప్రతియేటా 8 కంటే ఎక్కువ  భాషల్లో 900 సినిమాలని ఉత్పత్తి చేస్తోంది. ఈ సినిమాలు పాతిక కోట్ల యువతని ఆకర్షిస్తున్నాయి.  వీటిలో 76% సినిమాలు పొగత్రాగే దృశ్యాలతో నిండి ఉంటున్నాయి. పొగత్రాగే అలవాటున్న యువతలో 52% మంది సినిమాల్లో చూసే నేర్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2500 మంది పొగాకు ఉత్పత్తుల సేవనం కారణంగా చనిపోతున్నారు. సిగరెట్లు, గుట్కా, బీడీల వంటివి ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉంటున్నాయి. టీనేజిలో వుండే ప్రేక్షకులు తమ అభిమాన తార తెరమీద తరచూ పొగత్రాగడం చూసి ప్రభావితం అయ్యే అవకాశాలు పదహారు రెట్ల కంటే ఎక్కువే వుంటుంది.  హాలీవుడ్ సినిమాల్లో లాగే భారతీయ సినిమాల్లోనూ పొగత్రాగే దృశ్యాల సరళి ప్రమాదకర పోకడలకి పోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఈనేపధ్యంలో సినిమాల్లో ఈ పోకడల్ని అరికట్టే విధాన నిర్ణయాలు తీసుకుని అమలుపరచాలని వివిధ దేశాలకు సిఫార్సు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

మరో అధ్యయన సంస్థ ప్రకారం పొగత్రాగే వారి శాతం 1991లో 13% వుంటే, 2002 లో అది 52 శాతానికి పెరిగింది. హాలీవుడ్ సినిమాల్లో లాగే భారతీయ సినిమాలూ స్మోకింగ్ ని క్యాజువల్ చర్యగా చూపిస్తున్నాయి. అలాగే ఇళ్లల్లో పొగత్రాగే వారి సంఖ్య తగ్గి, బయట త్రాగే వారి సంఖ్య పెరిగింది. 16-18 మద్య వయసున్న యువతీ యువకుల్ని సర్వే చేస్తే, సినిమాల్లో పొగ త్రాగడాన్ని ఫ్యాషన్ అన్న అర్ధంలో చూపిస్తూంటే,  అది చూసి తామూ పొగత్రాగడం అలవాటు చేసుకున్నామనీ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత  సుభాష్ ఘాయ్ అయితే,  తను  టీనేజిలో వున్నప్పుడు తెర మీద దేవానంద్ పొగత్రాగడం చూసి ప్రభావితుడ్ని అయ్యానని చెప్పుకున్నారు. అప్పట్లో సిగరెట్ తాగే వ్యక్తి గొప్ప ఆలోచనాపరుడై ఉంటాడని భావించే వాళ్ళమనీ, అలాగే సిగరెట్ తాగే నటుడుకి మంచి నటనాసామర్ధ్యం కూడా ఉంటుందని అభిప్రాయముండే దనీ, సిగరెట్ తాగని నటుడికి టాలెంట్ గానీ, సృజనాత్మకతగానీ పెద్దగా ఉండవని డిసైడ్ అయ్యేవాళ్ళమనీ  వివరించారు.

ఈ అధ్యయనం ప్రకారం పొగ త్రాగడాన్ని యువత దైనందిన జీవితంలో ఒక భాగంగా తేలిగ్గా తీసుకుంటోంది. హిందీ సినిమాలతో బాటు దక్షిణాది సినిమాల్లో విలన్ గాక, హీరోయే  సిగరెట్లు తాగే దృశ్యాలు  పెరిగిపోతున్నాయి. సినిమాలకీ, యువత ప్రవర్తనలకీ  మధ్య బలమైన సంబంధం వుంది. సినిమాల్లో చూపిస్తున్న పొగ త్రాగే దృశ్యాల తీవ్రత వాస్తవంగా దేశంలో పొగత్రాగే పరిస్థితి కన్నా బాగా ఎక్కువ వుంది.

ఇంతవరకూ బాగానే వుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గత కేంద్రప్రభుత్వం చట్ట సవరణలు చేసి అమలుపరచడం మొదలుపెట్టింది- ఈ అమలు పరచడం దగ్గరే విమర్శల పాలవుతోంది! ధూమపాన నిషేధ బాధ్యతంతా సినిమాలదే అన్నట్టు చేతులు దులిపేసుకుంటోంది...

పాటకు తగ్గట్టే  పాట్లు!

మళ్ళీ సరదా సరదా సిగిరెట్టూ పాటేసుకుంటే..

‘ఊపిరి తిత్తుల క్యాన్సర్ కిదియే కారణం అన్నారు డాక్టర్లూ... కాదన్నారులే పెద్ద యాక్టర్లూ!
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు దీయు పొమ్మన్నారూ ...దద్దమ్మలు అది విన్నారూ!’

ఈ పాట స్ఫూర్తి తోనే స్పాట్ రూపొందించారేమో అన్నట్టుంది నిర్వాకం ... హాస్పిటల్ బెడ్ మీద నోటి క్యాన్సర్ రోగి...గుట్కాలు తిని తన పరిస్థితి ఎలా  తయారయ్యిందో చూడమన్నట్టు  స్టేట్ మెంట్. ఊపిరితిత్తుల్ని పిండుతున్న చేతులు...ఆ ఊపిరితిత్తుల్లోంచి సిగరెట్లలో వుండే టార్ –పాటలో అన్నట్టు ‘కఫము’ అందామా- కాలుష్యం పిండే కొద్దీ చిక్కటి ద్రవరూపంలో నల్లగా బీకరులోకి కారే దృశ్యం...శుభమా అంటూ సినిమాని ఎంజాయ్ చేసేందు కొస్తే వెగటు పుట్టే ఈ జుగుప్సాకర దృశ్యాలేమిటిరా బాబూ అన్పించే ట్టు, సినిమా మొదట్లో, మళ్ళీ ఇంటర్వెల్లో రిపీట్ చేసే ఆనందం!

ఈ స్పాట్లో కన్పించే నోటి క్యాన్సర్ రోగి ముఖేష్ హరానే అమాంతం ఈ పొగాకువ్యతిరేక ఉద్యమం చేపట్టిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ‘బ్రాండ్  అంబాసిడర్’ గా మారిపోయాడు. అంతలో చనిపోయాడనుకోండి, అది వేరే విషయం. అయితే స్మోకింగ్ సీన్లున్న సినిమాలకి ఈ స్పాట్ ని తప్పనిసరి చేయడంతో ప్రేక్షకుల పడిన నరకయాతన ఇంతా అంతా కాదు. పొగత్రాగడం వల్ల నష్టాలకన్నా ఈ హింస ఎక్కువైపోయింది. ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఈ హింసని ప్రేక్షకుల మీద రుద్దడం  భావ్యమా అని దేశంలో  ఏ నిర్మాత  కూడా ఆలోచించలేదు. ఆలోచించి వుంటే ఈ హింస నుంచి ప్రేక్షకుల్ని కాపాడడానికైనా స్వచ్చందంగా సిగరెట్ సీన్లు చిత్రీకరించే వాళ్ళు కాదు. ఈ రకంగా సినిమాల్లో ప్రభుత్వం ఉద్దేశించిన ధూమపాన దృశ్యాల నిషేధం అమలైపోయేది. సిగరెట్ ఫ్రీ సినిమాలతో కొత్తగా యువత స్మోకింగ్ అలవాటూ కొని తెచ్చుకునే ప్రమాదమూ  తప్పేది.

కానీ ఒక మంచి పని జరగడానికి అస్సలు వీల్లేదుగా?  ప్రజలే చచ్చినట్టూ వాళ్ళ యుక్తి కొద్దీ చెడు ప్రభావాల బారి నుంచి తెలివిగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడాలి.  ప్రభుత్వమూ నిర్మాతలూ పొగత్రాగని ప్రేక్షకుల మనోభావాలని పట్టించుకోకుండా,  అంత జుగుప్సాకర స్పాట్ తో పొగత్రాగే వాళ్ళనీ భయపెట్టినా ఫలితం లేకపోవడం వల్లనేమో- దాన్ని ఉపసంహరించుకుని మరో స్పాట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘సిగరెట్ సినిమా’ లకి ఇదే అమలవుతోంది.  ‘ఏమయ్యిందీ నగరానికీ...’  అంటూ ఆందోళనగా ప్రారంభమయ్యే ఈ స్పాట్లో ఫ్యామిలీ రెస్టారెంట్ ని చూపిస్తూ,  అందులో కూర్చుని ఆడవాళ్ళు ఇబ్బంది పడేలా పొగ మేఘాలు సృష్టిస్తున్న పొగరాయుళ్ళ మీద కామెంట్లు చేస్తుంది...చూడగానే ఈ స్పాట్ ఎంత తెలివితక్కువైనదో తెలిసిపోతుంది. ఫ్యామిలీ రెస్టారెంట్లు కాదుకదా, ఇతర ఏ హోటళ్ళలోనూ కూర్చుని పొగ తాగరాదన్న ఇంగితజ్ఞానం స్మోకర్లకుంది. చాయ్ సిగరెట్లకి ఘనతవహించిన అడ్డాలైన చాలా ఇరానీ హోటళ్ళలో కూడా నో స్మోకింగ్ నోటీసులు పెట్టేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చాలన్నా పక్కనెవరైనా వుంటే దూరంగా వెళ్లి కాలుస్తున్నారు స్మోకర్లు. స్మోకర్లకి ఈపాటి  స్మోకింగ్ మర్యాద తెల్సు. వాళ్ళని అవమానిస్తూ ఇంత  అవాస్తవికమైన స్పాట్ ని తయారుచేసి సినిమాహాళ్ళకి అంటగడితే ఏ ప్రయోజనం నెరవేరుతుంది? అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినా, ఇంకే అధ్యయన సంస్థ అయినా ఘోషిం చిందేమిటి? ప్రభుత్వం కూడా గుర్తించిం దేమిటి? సినిమాలు చూసి టీనేజర్లు సిగరెట్లకి అలవాటు పడుతున్నారనేగా? అలాటి టీనేజర్లని టార్గెట్ చేసే స్పాట్ లేనా ఇవి? టీనేజర్ల పాత్ర లేని ఇలాటి స్పాట్స్ ఎన్ని వేసి ఏం లాభం? ఈ హెచ్చరికలు మనక్కాదులే, పొగత్రాగే పెద్దోళ్ళకి – అనుకోరా వాళ్ళూ?

మీ ఆశయాలు నాకొద్దు బాబూ!

ఇలాటి  ధూమపానం నిషేధ విధానంతో ప్రభుత్వ నిర్వాకం చూసి ప్రేక్షకులు ఇంకో విధంగా కూడా నష్టపోతున్నారు. అసలు కాస్త కళాభిరుచి వున్న ప్రేక్షకులెవరికైనా ఈ ప్రభుత్వ విధానం కళారూపాల  పట్ల దొరతనంగానే  అన్పిస్తుంది. ఎందుకంటే విసుగుతో చూడాల్సి వచ్చే స్పాట్స్, అంతే గాక  సిగరెట్ సీన్లు  వచ్చినప్పడల్లా  ఆరోగ్యానికి హానికరమని కింద స్క్రోలింగ్...ఇవి ఓ  చిత్రకారుడు గీసిన బొమ్మ మీద ఇంకెవరో వచ్చి గీతలు గీసిన ఫీలింగ్ ని కలగజేస్తాయి. కోపం తెప్పిస్తాయి. దృశ్యం మీద నుంఛి ఆ స్క్రోలింగ్ మీదికి దృష్టి మళ్లుతూ,  మొత్తంగా సినిమా వీక్షణా నుభవం భంగమౌతుంది. ఇలా ఈ స్క్రోలింగ్- స్పాట్ ల వీరంగం ఇప్పటివరకూ దేశంలో ఏ దర్శకుడికీ, నిర్మాతకీ అభ్యంతరకరంగా తోచలేదు- ఆ ఒక్కడికి తప్ప! ఆయన సుప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు వుడీ అలెన్!  మీ మతిమాలినతనంతో నేను తీసిన దృశ్యాల్ని కలుషితం చేసుకోలేను, మీ ఆశయాలకో నమస్కారం , నా సినిమాని  మీ దేశంలో విడుదల చెయ్యను పొమ్మని వెళ్ళిపోయాడు.

తను తీసే సినిమాలకి ఎప్పుడూ ఏదో ఒక ఆస్కార్ అవార్డు పొందే దర్శకుడు వుడీ  అలెన్ 2013లో తీసిన ‘బ్లూ జాస్మిన్’ కి మనదేశంలో సెన్సార్  పొగ సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం జేసింది . అందులో హీరోయిన్ కేట్ బ్లాంచెట్ పొగత్రాగే దృశ్యాలు రెండున్నాయి. వీటిమీద స్క్రోలింగ్ వేసి, సినిమా లో రెండు సార్లు స్పాట్ వేయాలని కోరింది సెన్సార్ బోర్డు. వుడీ అలెన్ తీవ్రంగా మండిపడ్డాడు. నా దృశ్యాల మీద  మీరెవరు పెత్తనం చెలాయించడానికి? అని విరుచుకు పడి, నా సినిమాని మీ దేశంలో విడుదల చెయ్యనని స్పష్టం చేశాడు. ఆ విధంగా ఆ సినిమాని చూసే అవకాశాన్ని ప్రేక్షకులు కోల్పోయారు. తర్వాత డీవీడీ ల్లో చూడొచ్చు, అది వేరు. అయితే  ఈ సినిమాలో సిగరెట్లు తాగి నటించిన కేట్ బ్లాంచెట్ కి ఆస్కార్ ఉత్తమనటి అవార్డు లభించడాన్ని ఎలా అర్ధం జేసుకోవాలో సెన్సార్ బోర్డే చెప్పాలి!

1975 ఎమర్జెన్సీ కాలం లో సినిమాల్లో మద్యం, రక్తం చూపించ కూడదని నిబంధనలు విధించినప్పుడు , విలన్ పాత్రలు విధిలేక కూల్ డ్రింకులు మాత్రమే  త్రాగి రంకె లేసేవి. రక్తాలు పారించలేక పిడిగుద్దులు మాత్రమే గుద్దుకుని ఫైటింగ్  సీన్లు ముగించేసేవి. పద్మాలయా బ్యానర్ లో  హీరో కృష్ణ తీసిన ‘రామరాజ్యంలో రక్తపాతం’ అన్న టైటిలున్న పోస్టర్లలో  ‘రక్తపాతం’ మీద ‘రక్త పాశం’ అంటూ సాత్వికమైన స్లిప్పులు అతికిం చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో సృజనాత్మక స్వే చ్ఛా అంటూ నినదించడానికి వీల్లేదు. అప్పట్లో ఏ స్వేచ్ఛ కీ రోజులుకావు. ఇప్పడు అన్ని స్వేచ్ఛలూ పరిఢవిల్లుతున్నా ఏ గొంతూ పెగలడం లేదు. ఒక్క ఆ విదేశీయుడు మాత్రమే తన సృజనాత్మక స్వేచ్చ కోసం తన సినిమా విడుదలనే వదులుకుని పోయాడు.

ప్రకటనేసుకుంటే ఎంత ఉవ్వెత్తున పొగమేఘాలు సృష్టించుకున్నా మాకేం అభ్యంతరం లేదనే ధోరణిలో ప్రభుత్వ ప్రవర్తన వుంటే,  ఈ మాత్రం దానికి సృజనాత్మక స్వేచ్చంటూ మనకెందుకు గొడవని ప్రకటనేసేసి ఉధృతంగా పోగసీన్లు జొప్పించేస్తున్నారు మన నిర్మాతలు. బాలీవుడ్ లో చెప్పనవసరం లేదు, టాలీవుడ్ లోనూ మహేష్ బాబు దగ్గర్నుంచీ అల్లుఅర్జున్ వరకూ ప్రతీ పేరున్న యువ స్టారూ వెండితెర మీద పొగత్రాగేసి తరిస్తున్నారు.  దక్షిణ కొరియాలో కూడా ఈ ధోరణే ప్రబలి ఎక్కడికి దారితీసిందో తెలుసుకుంటే పొగ త్రాగకుండానే భయంతో జబ్బున పడతాం. దక్షిణ కొరియాలో సినిమాల్లో స్మోకింగ్ దృశ్యాలపై నిషేధాన్ని కచ్చితంగా అమలుపర్చక పోవడంతో, సినిమాల్లో కావాలని హీరోల చేత సిగరెట్లు తాగే సీన్లు ఎడాపెడా పెట్టేస్తూ, అది సృజనాత్మక స్వేచ్చంటూ దబాయిస్తూ పోయారు. ఫలితంగా దేశ జనాభాలో 80 శాతం  మంది పోగారాయుళ్ళుగా మారిపోయి ప్రమాదం అంచున చేరుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు సిగరెట్ల కంపెనీలు నిర్మాతల్ని ఇంకా ఎగదోసి, హీరోయిన్ల చేత కూడా తాగించడం మొదలెట్టించారు. అదేమని నిలదేస్తే,  మహిళా శక్తినీ , ఇంకా మాట్లాడితే స్త్రీ స్వేచ్చనీ ప్రమోట్ చేస్తున్నామంటున్నారు! ఆ విధంగా దేశంలో స్త్రీలు కూడా సిగరెట్లు తాగేట్టు ఎగదోసి వ్యాపారాలు పెంచుకుం టున్నారు.

ఈ పరిస్థితి మనదాకా రాదనీ గ్యారంటీ లేదు. అప్పుడు మనదేశంలో దమ్ముకొట్టే ఆడా మగా లెక్కకందకుండా పోయి, ఆ సమూహం థియేటర్ లలోకూడా స్మోకించుకోవడానికి ఛాన్సివ్వాల్సిందే నంటూ పెద్ద  ఉద్యమం చేపట్టినా ఆశ్చర్యం లేదు.

ఇందాకటి పాటని ఇంకో సారి వేసుకుంటే...

థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించి నారందుకే...కలక్షన్లు లేవందుకే! ‘ అన్నట్టు తయారవుతుంది ప్రకోపించిన పొగరాయుళ్ళ తో/పొగరాయమ్మ లతో పరిస్థితి!

కొసమెరు పేంటంటే –  గత ప్రభుత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల్ని అమలుపర్చాల్సిన కేంద్ర సమాచార ప్రసారాల  శాఖ మంత్రివర్యులే - అంత సీనేం లేదు,  పొగగోల మనకెందుకు లెండి, లైట్ తీసుకోండి –అని కేంద్రీయ సెన్సార్ బోర్డు చెవిలో ఊదినట్టు ఓ ఎన్జీఓ  సంస్థ కూపీలాగి బయటపెట్టింది!


-సికిందర్
('ఈవారం' మేగజైన్, జూన్' 2014 సంచిక )
















4, మే 2014, ఆదివారం

రివ్యూ..


పండని  ప్రయోగ కళలు 
రచన- దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
తారాగణం : కృష్ణుడు, కిషోర్, కృష్ణేశ్వర్ రావు, నరేష్, ఆమని, లక్ష్మి మంచు, రిచా పనాయ్, శామినీ అగర్వాల్ తదితరులు
సంగీతం : మిక్కీ జె. మేయర్,   ఛయాగ్రహణం : ఆర్. సురేష్
బ్యానర్ : ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్      నిర్మాత : చాణక్య బూనేటి  
విడుదల :  ఏప్రెల్  25, 2014       సెన్సార్ : U/A
***
తెలుగులో ప్రయోగాత్మక సినిమాల్ని ఆదరించరనే ఘాటు విమర్శల్ని అలా వుంచి, అసలా ప్రయోగాత్మక సినిమాల తీరుతెన్నులెలా వుంటున్నాయో చూస్తే మాత్రం చింతించాల్సిందే. ఈమధ్యే చూసుకుంటే ‘బంగారు కోడిపెట్ట’ నుంచీ ‘కమలతో నా ప్రయాణం’ దాకా, ‘లడ్డు బాబు’ నుంచీ ‘చందమామ కథలు’ దాకా, వాటి ప్రచారాల్లో చేస్తున్న ఆర్భాటమంతా తీరా ఆ ప్రయోగాల సృజనాత్మకతల్లో లోపించి సెలవు తీసుకోవాల్సివస్తోంది. ఆదరించడం లేదని హాహాకారాలు చేసేముందు, అసలు  తమ సరుకెలా వుందో  సరిచూసుకుంటే  అటూ ఇటూ బ్యాలెన్స్ అయి బయటపడతారు.
ఓకే కథతో సినిమా తీస్తే ప్రేక్షకులకి నచ్చుతుందో లేదో, అందుకని ఏదో ఒక కథ నచ్చి హిట్టవక పోతుందా అన్న ఆశాభావంతో  మూడు కథల బంగారంగా   ‘బంగారు కోడిపెట్ట’ తీశానని చెప్పుకున్న సదరు దర్శకుడి బడాయి కూడా బాక్సాఫీసు ముందు ఎందుకు బలాదూరయ్యిందో తెల్సిందే.

ఇప్పుడు తాజాగా అందరికంటే భిన్నంగా ఆలోచించి, భిన్నంగా  సినిమాలు తీస్తున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు చేసిన ‘చందమామ కథలు’  ప్రయోగంలో ఎనిమిది కథలున్నాయి. ఒక కథ పూర్తయి ఇంకో కథ ప్రారంభమయ్యే ఆంథాలజీ లాగాక, సమాంతర ఖండికలుగా వచ్చి పోతూంటాయి. 2007లో అనురాగ్ బసు హిందీలో తీసిన బహుళ కథా చలన చిత్రం ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’’, దీనికి ముందు 2003 లో రాంగోపాల్ వర్మ నిర్మాణంలో ప్రవాళ్ రమణ్  దర్శకత్వం వహించిన ఆరు కథల ‘డర్నా మనా హై’, 2007లో రామ్ గోపాల్ వర్మతో కలుపుకుని ఏడుగురు దర్శకుల ‘డర్నా జరూరీ హై’ అనే ఏడు కథల ఆంథాలజీ వచ్చాయి. ఈ మూడూ విజయాలు సాధించాయి.  దక్షణాదిన చూసుకుంటే, 2009లో మలయాళంలో పదకొండు మంది దర్శకుల పదకొండు కథల ‘కేరళ కేఫ్’ వచ్చింది. ఇదీ హిట్టయ్యింది.

మరి చందమామ కథల  సంగతేంటి?

సుఖ దుఃఖాలు సగం సగం!

సారధి (కిషోర్) అనే కథా రచయిత తన కూతురి వ్యాధి చికిత్సకి అవసరపడ్డ డబ్బుల్ని ఏం రాసి సంపాదించాలా అని ఆ లోచిస్తున్నప్పుడు తట్టేవే అతను చూసిన  జీవితాల ఈ  క్రింది తిప్పలు..

1. బాగా లావెక్కిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకటేశ్వర్రావ్ (కృష్ణుడు) కి ముప్ఫై దగ్గర పడుతున్నా పెళ్లి కావడం లేదని బెంగపడి, పెళ్ళికోసం విఫల యత్నాలు చేస్తూంటాడు.

2. ఒకప్పుడు మోడల్ గా వెలిగిన లీసా స్మిత్ (మంచు లక్ష్మి) ఇప్పుడు అవకాశాల్లేక, సహజీవనం చేస్తున్న డబ్బున్న వాడు కూడా వేరొకామెని చూసుకోవడంతో, మిడిల్ క్లాస్ ఫ్లాట్ లో అద్దెకుంటూ తాగుడూ సిగరెట్లు మరిగి టెన్షన్ తో గడుపుతూంటుంది.

3. ఓల్డ్ సిటీలో సూపర్ మార్కెట్ నడిపే అష్రఫ్ ( అభిజిత్)ని  హసీనా (రిచా పనాయ్) ప్రేమలోకి దింపి, పెద్దలతో సంబంధం మాట్లాడమని ఒత్తిడి చేస్తూంటే ఇరకాటంలో పడతాడు అష్రఫ్.

4. ఇంటర్ రెండో సంవత్సరం చదివే రఘు ( నాగ శౌర్య) క్లాస్ మేట్ అయిన రాజకీయనాయకుడి కూతురు రేణు (శామిలీ  అగర్వాల్) ని కాదనలేని పరిస్థితుల్లో ఇరికించి, పెళ్ళిచేసుకుని,  జీవితంలో సెటిలై పోవాలని పథకా లేస్తూంటాడు.


5. ఇంకో పనీపాటా లేని రఘు (కృష్ణ చైతన్య)  వూళ్ళో నానమ్మ (పావలా శ్యామల) నిఘాలో వున్న ముగ్గురు మనవరాళ్ళలో గౌరీ ( అమితా రావ్) అనే అమ్మాయిమీద మీద కన్నేసి,  ముగ్గులోకి దింపాలని కాని పనులు చేస్తూంటాడు.

6.  భార్యకి విడాకులిచ్చి వచ్చిన ఎన్నారై మోహన్ (నరేష్) అనుకోకుండా మాజీ ప్రేమికురాలు సరిత (ఆమని) ని విధవరాలిగా చూసి, కొడుకులూ కోడళ్ళూ వున్నామెతో తిరిగి స్నేహం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటాడు.

7. ఓ బిచ్చగాడు (కృష్ణేశ్వర్ రావు) పన్నెండు లక్షలు విలువజేసే ఒకింటికి ఎలాగైనా యజమాని కావాలన్న కలలతో బిచ్చ మెత్తుకుంటూ భారీ యెత్తున డబ్బు పోగేస్తూంటాడు.

8. ఈ కథ రచయితదే.. సగంసగం కథలు రాసుకెళ్ళి ఐదు లక్షలు అర్జెంటుగా అడ్వాన్సు ఇమ్మని అడిగితే, కథలు పూర్తి చేసుకు రమ్మంటాడు ప్రచురణకర్త (సూర్య)...


ఇదీ విషయం. ఇక్కడ్నించీ తన సమస్య మళ్ళీ మొదటికొచ్చి,  సగం సగం కథల్ని పూర్తి చేసే శక్తియుక్తుల్ని కూడదీసుకుని  కష్టిష్తాడు సారధి...ఓ పక్క కూతురి ఆపరేషన్ దగ్గర పడుతూంటుంది. పూర్తి చేయాల్సిన ఏడు కథల్లోనూ సంఘర్షణ లున్నాయి. వాటిలో సగం సుఖాంతాలు, సగం దుఖాంతాలూ వున్నాయి...తీరా పూర్తిచేసి ప్రచురణకర్త దగ్గరికి తీసికెళ్తే తన కథే దుఖాంతమయ్యింది ! ఇప్పుడేం చేయాలి ? ఆపరేషన్ కి డబ్బు ఎలా?

గతనెల ‘రౌడీ’ లో మోహన్ బాబు పెద్దకొడుకుగా నటించిన కిషోర్ ఈసారి కాఫీ షాపుల్లో కూర్చుని ఇంగ్లీషులో  రాసే లాప్ టాప్  రచయితగానూ సరిపోయాడు. అయితే పాత్ర వ్యక్తిత్వమే చివరికి చట్టు బండలయ్యింది. రాసిన కథలూ కథల్లా వుండవు..తనచేతుల్లోనే తన అదృష్టముంది. వేరే ప్రచురణకర్త ని నమ్ముకుని భంగ పడాల్సిన అవసరమే  లేదు....ఇదెలా జరగొచ్చో తర్వాత  ‘స్క్రీన్ ప్లే సంగతులు’ లో చూద్దాం.


ఇతర పాత్రలు పోషించిన జ్యూనియర్ /సీనియర్ నటీనటు లందరూ బాగా నటించారు.  బిచ్చగాడి పాత్రలో కృష్ణేశ్వర్ రావు మాత్రం గుర్తుండి పోతాడు. సినిమాకి యూత్ అప్పీల్ నిచ్చిన మంచు లక్ష్మి మోడరన్ పాత్ర ఆమె మాత్రమే  చేయగలదేమో.

టెక్నికల్ గా, మిక్కీ జె మేయర్ కూర్చిన సంగీతపరంగా,  సినిమా ఉన్నత స్థాయిలోనే వుంది. దర్శకుడుగా ఎన్నారైగా వచ్చిన ప్రవీణ్ సత్తారు ఇంకొంచెం మెరుగయ్యాడు. రచయితగా బాగా మెరుగులు దిద్దుకుంటేనే కమర్షియల్ సక్సెస్ సాధించ గల్గేది!

స్క్రీన్ ప్లే సంగతులు

contd..

1, మే 2014, గురువారం

రివ్యూ..

రీమేకు – రీజనింగ్
ఏం చెప్పాలనుకున్నారో మిస్టరీ!


రచన- దర్శకత్వం : శేఖర్  కమ్ముల
తారాగణం : నయనతార, వైభవ, పశుపతి, హర్షవర్ధన్ రాణే ,నరేష్ తదితరులు
సంగీతం : ఎం ఎం కీరవాణి,  ఛాయాగ్రహణం : విజయ్ సి. కుమార్,  ఎడిటింగ్ : మార్తాండ్ కే. వెంకటేష్
బ్యానర్ : వయాకాం 18, లాగ్ లైన్ ప్రొడక్షన్స్
విడుదల : మే 1, 2014      సెన్సార్ : U/A
***
సొంత రచన కాస్సేపాపి, 2012 లో హిందీలో  విజయవంతమైన ‘కహానీ’ మీద ఎనలేని మక్కువ పెంచుకుని శేఖర్ కమ్ముల తెలుగులో రీమేక్ చేసిన ‘అనామిక’ ఎట్టకేలకు విడుదలైంది. రీమేకు నిర్వచనాన్నే తిరగరాస్తూ, ఒరిజినల్ చూసి వున్న ప్రేక్షకులకి సైతం సరికొత్త అనుభూతులనిచ్చే   ‘కహానీ’ చెప్పాలన్న తపనతో కమ్ముల  పాల్పడిన సృజనాత్మక స్వేచ్చ ఎంత శోభ నిచ్చిందో, కళాత్మకంగా తనదైన ముద్ర వేయడంలోనూ అంతే సొగసుగా నిల్చింది. ఫీల్ గుడ్ సినిమా రధసారధి కాస్తా తనదికాని మిస్టరీ/సస్పెన్స్ థ్రిల్లర్ ప్రాంగణంలోకి తొలిసారిగా అడుగెట్టి నిరూపించుకోవాలనుకున్న ప్రతిభ ఏ మేరకు ప్రభవించిందో, చెప్పాలనుకున్న విషయం ఆ మేరా అంతే ప్రకాశించింది. అసలే కురచ కాన్సెప్ట్ తో  ఎలాగో బాక్సాఫీసు గట్టెక్కగల్గిన ‘కహానీ’ కథని తిరగరాసి కొత్త బాక్సాఫీసు మంత్రానికి ఎలా వూపిరులూదాలనుకున్నారో, అలా తెలుగు ప్రేక్షకుల మనోభావాలనీ శాసించీ కూర్చోబెట్టాలనుకున్నారు.

సింపుల్ గా చెప్పాలంటే ఏ తెలుగు ప్రేక్షకుల సువిశాల అప్పీల్ నిమిత్తం అనుకుంటూ  నయనతార పాత్ర  చిత్రణని మార్చేశారో, అదే చివరికి యాంటీ సెంటిమెంటల్ వురితాడు కి వేలాడాల్సి వచ్చింది!

ఇకపోతే, టెర్రరిజం మీద తెలుగులో వచ్చే సినిమాలన్నీ విశ్వసనీయత లేని అపరిపక్వ చిత్రీకరణలుగా ఎందుకుంటు న్నాయో ఎవరికి  వాళ్ళే ప్రశ్నించుకోవాలి.  ఈ సినిమా ఒరిజినల్ లో లేని టెర్రరిజం  నేపధ్యాన్ని తెలుగులో ఇంత గందరగోళంగా చూపించనవసరం లేదేమో!

2. ఆమె మానవతా దృక్పథం అమోఘమే కానీ..
విదేశాలనుంచి ఒక వివాహిత వస్తుంది. పేరు అనామిక (నయనతార). ఓల్డ్ సిటీ లోని ఓ పోలీస్ స్టేషన్ కెళ్ళి భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. నగరంలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్ధన్ రాణే)  రెండువారాలుగా రెస్పాండ్ కావడం లేదని పోలీసులకి చెప్తుంది. ఓల్డ్ సిటీలోనే గెలాక్సీ హోటల్లో వుండే వాడని వివరాలందిస్తుంది. ఏఎస్సై  పార్ధసారధి (వైభవ్) కేసు తీసుకుని ఆమెతో కలిసి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అదే గెలాక్సీ హోటల్లో దిగుతుందామె. సారధితో కలిసి భర్తని అన్వేషిస్తూంటే, ఈమె కలిసిన వ్యక్తులు ఒకరొకరే హత్యకి గురవుతూంటారు.  ఒక మౌలానా, ఇంకో సర్కిల్ ఇన్స్ పెక్టరూ  చనిపోతారు. హంతకుడు ఈమె మీద కూడా హత్యాయత్నం చేస్తాడు. అతణ్ణి కాల్చేస్తుందామె.  అతని దగ్గర దొరికిన ఒక హార్డ్ డిస్కు దాచేస్తుంది. ఆ డిస్కులో ఏముంది? దాని కోసం ఇంకో పోలీసు అధికారి అమ్జద్ అలీ ఖాన్ (పశుపతి) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? దాంతో హోం మంత్రి (నరేష్) కి సంబంధ మేమిటి? ఇంతకీ అనామిక వెతుకుతున్న భర్త అజయ్, తొమ్మిది నెలల క్రితం నగరంలో బాంబులు పేల్చి  వందలమంది చావుకి కారకుడైన మిలింద్ దామ్జీ పోలికలతో ఎందుకున్నాడు? ఇప్పుడేం చేసింది  అనామిక?

ఇదీ కథ. ఈమె ఏం చేసిందనేది చెప్పుకోవాల్సి వస్తే, గొప్ప మానవతా దృక్పథాన్నే ప్రదర్శించింది. వందలమంది ప్రాణాల్ని బలిగొన్న ‘టెర్రరిస్టు’ని  పట్టుకుని శిక్షించాలన్న విశాల దృక్పథంతో వచ్చి పని పూర్తి చేసింది. హిందీ ఒరిజినల్ లోని హీరోయిన్ కి లేని విశాల దృక్పథ మిది. అయితే... అయితే...ఈ క్రమంలో తాను  దర్శకుడి తెచ్చి పెట్టుకున్న విజన్ కి  బందీ అయిపోవడంవల్ల బాక్సాఫీసు అప్పీల్ కి కూడని పని చేసేసింది. దీనిగురించి ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో విపులంగా తెలుసుకుందాం.

సాంకేతికాల  సరిగమలు..

అనామిక  పాత్రలో నయనతార ఎప్పుడూ సీరియస్ గానే కన్పించడంతో డార్క్ మూడ్ క్రియేటయ్యే అగత్యమేర్పడింది. ‘కహానీ’లో విద్యా బాలన్ పోషించినలాంటి రిలీఫ్ ఓరియెంటెడ్ క్యారక్టర్ కాదిది. ఇక్కడ గమనించాల్సిన దర్శకుడి ముఖ్యమైన క్రియేటివ్ పంథా ఏమిటంటే, నేపధ్య  వాతావరణంలో కథ తాలూకు డార్క్ మూడ్ విష్పష్టంగా వ్యక్త మయ్యేందుకు  ఎక్కడా కృత్రిమ లైటింగ్ వాడని  స్కీముతో కెమెరా పనితనం వుంటుంది. ఈ  బ్యాక్ డ్రాప్ లో  మసిలే  విద్యాబాలన్ పాత్ర మాత్రం సరదాగా వుంటుంది. దేనికది ఈ వైరుధ్యాల ఉన్నతీకరణల  వల్ల ప్రేక్షకుల వీక్షణానుభవం బాగా ద్విగుణీకృతమయ్యే అవకాశ మేర్పడింది.

‘అనామిక’లో ఈ  క్రియేటివ్ పంథా తిరగబడి - కథలో ఉత్పన్నమయ్యే డార్క్ మూడ్ ప్రభావం చిత్రీకరణలో లోపించి- రసోత్పత్తికి వ్యతిరేకంగా కృత్రిమ లైటింగ్ తో వైభవోపేతంగా దృశ్యాలు వెలిగిపోతూంటే, నయనతార పాత్ర విషాద ముద్రతో కన్పిస్తుంది. ప్రేక్షకులతో సైకలాజికల్ కనెక్షన్ ని ఏమాత్రం లక్ష్యపెట్టని  కెమెరా పనితనమనొచ్చు దీన్ని. ‘నేనొక్కడినే’ లో మహేష్ బాబు సీరియస్ నెస్ బాక్సాఫీసుకి ఏ మాత్రం లాభించిందో,   ‘అనామిక’ లో నయనతార విషాదవదనమూ అంతే పనికొచ్చింది.

 విజయ్ సి. కుమార్ ఛాయాగ్రహణం ఎందుకనో శేఖర్ కమ్ముల ముద్రకి కూడా దూరంగా ఉండిపోయింది. ‘కహానీ’ దర్శకుడు సుజయ్ ఘోష్ – ‘కోల్ కతా  లో పుట్టి పెరిగిన వాణ్ణి గనుక ఆ నగరపు  ఆత్మని దృశ్యాల్లో అంతబాగా పట్టుకోగాలిగా’ నని చెప్పుకున్నాడు. ఛాయాగ్రాహకుడు సేతు నిర్వహించిన  కెమెరాపనితనంలో కృత్రిమత్వం వుండదు. ప్రయోగాత్మకంగా  అతి తక్కువ సహజ లైటింగ్ తోనే  కోల్ కతా  నగరపు లోలోతుల్లోకి లాక్కెళ్ళాడు.  ఈ ఫలితాలు రాబట్టడానికి పనిగట్టుకుని టెక్నికల్ గా ‘గెరిల్లా ఫిలిం మేకింగ్’ కి పాల్పడ్డాడు. దీంతో అన్నీ రియల్ లొకేషన్సే అత్యంత సహజత్వం ఉట్టిపడుతూ కనువిందు చేస్తాయి. తెలుగులో మాత్రం ఓ ఓల్డ్ సిటీ వీధి  సెట్ వేసి చిత్రీకరించారు. ఎక్కడా హైదరబాద్ ఆత్మనే పట్టుకోలేక పోయారు.

దర్శకుడు ఘోష్ తాను  కొన్ని సత్యజిత్ రే సినిమాల్లోని దృశ్యాల్ని యధాతధంగా వాడుకున్నానని  నిజాయితీగా చెప్పుకున్నాడు. లాడ్జిలో వేణ్ణీళ్ళు  రాని సీను సత్యజిత్ రే- ‘జోయ్ బాబా ఫెలూ నాథ్’ సినిమాలోదని ‘టెలిగ్రాఫ్’ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. తెలుగులో ఇది మక్కీకి మక్కీగా వుంది. అలాంటప్పుడు ఇది తెలుగు నేటివిటీ ఎలా అవుతుంది? ఏ బాపు సినిమాలోదో వాడుకుంటే తెలుగు నేటివిటీ అయ్యేదేమో?

అసలా లాడ్జి రూమే ‘రే’ తీసిన ‘చారులత’ లో పోలిన రూము అనికూడా స్పష్టం చేశాడు ఘోష్. లాడ్జి కోసం వాడుకున్న మోనాలిసా గెస్ట్ హౌస్ సినిమా విడుదలయ్యాక కోల్ కతా లో ఎంత పాపులర్ అయ్యిందంటే, కుతూహలం కొద్దీ వచ్చి చూసే జనంతో అదొక యాత్రా స్థలంలా  కిటకిటలాడిపోయింది!

 ‘రే ‘ దృశ్యీకరించిన కోల్ కతా నగరమంతా ‘మహానగర్’ సినిమాలో బాగా నిక్షిప్తమై ఉందనీ, దాన్నుంచి స్ఫూర్తి పొంది తాను కోల్ కతా నగర దృశ్యాల చిత్రీకరణకి సాహసించా నని కూడా వెల్లడించాడు ఘోష్. అంతే గాదు, విద్యాబాలన్ కీ ఏఎస్సైకీ మధ్య సంక్లిష్ట ఎమోషన్స్ కి సంబంధించి అనుసరించిన విధానమంతా కూడా ‘రే’ తీసిన ‘నాయక్’ లోనిదని చెప్పాడు!

కారులో విద్యాబాలన్ ప్రయాణించే దృశ్యాల్ని కూడా సత్యజిత్ రే తీసిన ‘ అరణ్యేర్ దిన్ రాత్రి’ నుంచి స్ఫూర్తిపొంది తీశాడు ఘోష్. ఆ సినిమాలో కారులో ప్రయాణించే నాలుగు పాత్రలతో బాటే ప్రేక్షకులూ ప్రయాణిస్తునట్టుండే చిత్రీకరణ వుంది. దాన్ని విద్యాబాలన్ కారులో ప్రయాణించే సీనుకి వాడుకున్నాడు.

సత్యేజిత్  రే సినిమాలే గాకుండా, 1970-80 లలో వచ్చిన విజువల్ గా కొట్టొచ్చి నట్టుండే ‘దీవార్’ లాంటి సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇక దృశ్యాల కలర్ స్కీము విషయానికొస్తే, 1915 లో బెంగాలీ చిత్రకారుడు గగనేంద్ర నాథ్ ఠాగూర్  వేసిన ‘ప్రతిమా విసర్జన్’ అనే పెయింటింగ్ లోని వాటర్ కలర్స్ కి నకలుగా తీసుకున్నాడు.

పాటలు లేని ‘అనామిక’ లో  కీరవాణి నేపధ్య సంగీతం చెప్పుకోదగ్గది. చాలా నెమ్మదిగా సాగే కథనం పరుగులు పెడుతున్న ఫీల్ ని కల్గించింది ఈ సంగీతమే. అయితే రీమేక్ ని కమ్ముల తన శైలిలోకి మార్చుకుని తీయడమంటే ఒరిజినల్లోని కళాత్మక విలువల్ని  బుల్ డోజ్ చేసుకుంటూ పోవడం కాదు కదా? దృశ్య సంగీత నేపధ్యమంతా కోల్ కతా నగరపు సంస్కృతీ- నేటివిటీ ఉట్టిపడే  కహానీ లోని కథమీద మాత్రమే సొంత నమ్మకాలు రుద్దడం గాకుండా, మిగతా మేకింగ్ లోనూ కాస్త కవిభావాన్ని కూడా  అర్ధం జేసుకుని వుంటే,  ఇది ఒరిజినలంతటి కళాఖండ మయ్యేది తప్పకుండా.
హిందీ కి సంగీతం సమకూర్చిన విశాల్-శేఖర్ లు ఆ  నేపధ్య సంగీతానికి ఆర్డీ బర్మన్ స్వరపరచిన హిందీ- బెంగాలీ బాణీలు వాడుకున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో హైదరాబాద్ నేటివిటీకి ఈ సృష్టే జరగలేదు. అంతా రొటీన్ హాలీవుడ్ తరహా కంపోజిషనే.
రిమేక్ అంటే కథ మాత్రమే  కాదు, ఇంకా చాలా వుంటాయి. ‘కహానీ’ మేకింగ్ లో ఇంతటి పరిశీలన, పరిశోధనా, పరిశ్రమా వున్నాయి. ఈ ఈస్థటిక్స్ ని అర్ధంజేసుకోకుండా ప్రయత్నిస్తే అది రీమేకింగ్ అవదు, ‘మాకింగ్’ అవుతుంది.

ఇతర నటులు..
ఇతర నటుల  విషయానికొస్తే, ఏఎస్సై గా నటించిన వైభవ్, టాస్క్ ఫోర్స్ అధికారిగా నటించిన పశుపతి, హోం మంత్రిగా నటించిన నరేష్ సైతం మూస ఫార్ములా సినిమాల్లో వుండే వేషభాషలు, శారీరక భాషలతోనే సరిపుచ్చేశారు. ఏమాత్రం  నలగని యూనీఫాం, క్రాఫు, మేకప్ లతో వైభవ్ యమ నీటుగా కన్పిస్తే, పశుపతీ ఇందుకేం తీసిపోలేదు. ఇక నరేష్ సరేసరి.

కహానీ లో నిత్యజీవితంలో  మనకి కన్పించే సామాన్య ప్రజల ఆహార్య వ్యవహారాల సరళిని ప్రతిబిం బించే  నటులు కన్పిస్తారు.
పరమ్ బ్రతా ఛటోపాధ్యాయ 
 నిజానికి ఏఎస్సై పాత్ర వేయడానికి పరమ్ బ్రతా  ఛటోపాధ్యాయ చాలా భయపడ్డాడు. తాను నగరంలో పుట్టి పెరిగిన వాడు, పాత్రేమో పల్లెటూరి నేపధ్యం గలది. ఎలా సాధ్యం? ఈ అనుకరణని, బజార్లో మనకి కన్పించే సామాన్య పోలీసు వేషభాషలతో సహా సుసాధ్యం చేసి చూపించి మరపురాని నటుడిగా నిలచిపోయాడు. స్వయంగా కొన్ని పోలీస్ స్టేషన్లు సందర్శించి, పోలీసుల పనితీరుగురించి, వాళ్ళ మనస్తత్వాల గురించీ కొంత రీసెర్చి చేశాడు.

ఇక ఐబీ  ఉన్నతాధికారిగా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ అప్పటికి మూడు సినిమాల నటుడే. బక్కపలచగా సగటు జీవిలా వుండే ఇతను ఐబీ ఉన్నతాధికారిగా పాత్రకి ఎంత సహజత్వాన్ని తీసుకొచ్చాడో తెలిసిందే. చవకబారు సిగరెట్ తాగడం, పచ్చిగా మాట్లాడడం, ఇట్టే జనసమూహంలో కలిసిపోయి కన్నింగ్ గా ఆపరేషన్లు నిర్వహించడం అచ్చంగా నిఘా విభాగం ఉద్యోగి లక్షణాలే.


నవాజుద్దీన్ సిద్దిఖీ 
ఇక బాన కడుపు కాంట్రాక్ట్ కిల్లర్ బాబ్ బిస్వాస్ పాత్ర పోషించిన శాశ్వతా ఛటర్జీ అయితే ఏకంగా ఆ పాత్రని అజరామరం చేసిపెట్టాడు. ‘నోమోష్కార్...ఆమి బాబ్ బిశ్వాస్..ఏక్ మినట్?’ అని పలికి సునాయాసంగా మర్డర్లు చేసే ఈ పాత్ర ఎంతగా పండిందంటే, ఇంటర్నెట్ లో దీని మీద సెటైర్ల దాకా వెళ్ళింది. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లో బాబ్ బిస్వాస్ జోకులంటూ కూడా హడావిడి చేశారు ఈ  పాత్ర అభిమానులు. ఒక గ్రాఫిక్ నవల, ఇంకో టీవీ షో ఈ పాత్రమీద ప్లాన్ కూడా చేశారు! ఈ పాత్ర ‘ముత్యాల ముగ్గు’లో రావుగోపాలరావు పాత్రలా కల్ట్ ఫిగరై పోయింది. ఈ కిరాయి హంతకుడి  పాత్రకి కలర్ ఫుల్ కాంట్రాస్ట్ ఏమిటంటే,  ఇతను లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ కూడా! శేఖర్ కమ్ముల సినిమాలో జీవంతో తొణికిసలాడే ఇలాటి ద్వంద్వాల పాటింపు మచ్చుకి కన్పించదు!
శాశ్వతా ఛటర్జీ 

కోల్ కతా నేపధ్యపు కథ కాబట్టి సాధ్యమైనంతవరకూ బెంగాలీ నటుల్నే తీసుకున్నాడు దర్శకుడు సుజయ్ ఘోష్. విద్యాబాలన్ పాత్ర భర్తకి కూడా బెంగాలీ  నటుడే కన్పిస్తాడు. ‘అనామిక’ ని తమిళంలో కూడా తీయడం వల్ల ఈ నేటివిటీ కూడా కొందరు నటుల విషయంలో సాధ్యపడలేదు సరిగదా, కాంట్రాస్ట్ లు కూడా కొరవడి రొటీన్ ఫార్ములా  సినిమా నటనలతో  అసంతృప్తి కల్గిస్తాయి.
తెలుగు సినిమాకింతే, తెలుగు ప్రేక్షకుల టేస్టు ఇంతకన్నా బెటర్ గా ఉండదు- అని భావించుకుని ఓ  రీమేక్ చేసేస్తే ఎవరూ కాదనడానికి లేదు. కానీ ఇది జీవితాల్లోంచి పుట్టిన చాలా కళాత్మక విలువలున్న, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ పొందిన కల్ట్ మూవీకి రీమేక్ అయ్యింది. అ కల్ట్ మూవీ పార్స్వాల్ని తడమకుండా పైపైన ‘అనామిక సమీక్ష’  చేసేసి తప్పో గొప్పో ప్రేక్షకుల నిర్ణయానికి వదలడం సాధ్యం కాదు!

3. స్క్రీన్ ప్లే సంగతులు!
ఇంతకీ ఈ కథ మిస్టరీ తరగతికి చెందిందా, లేక సస్పెన్స్ థ్రిల్లర్ కోవకి చెందుతుందా?

ఈ స్పష్టత లేకపోతే కథా  నిర్వహణ కనాకష్టమై పోతుంది. ఆ గజిబిజిని జీర్ణించుకోవడం కష్టమైపోతుంది.

మిస్టరీకీ, సస్పెన్స్ కీ తేడా ఏమిటంటే- ఉదాహరణకు-ఒక ప్రముఖ రాజకీయనాయకుడి హత్యోదంతాన్ని కథగా తీసుకుంటే, మిస్టరీలో అయితే ఆ రాజకీయనాయకుడి హత్య కథా ప్రారంభంలోనే జరిగిపోతుంది. ఆతర్వాత కథంతా హంతకుల్ని కనుగొనేందుకు దర్యాప్తు/పరిశోధనలతో సాగి, చివర్లో హంతకుల్ని పట్టేసుకుంటారు. అంతవరకూ హంతకులేవరనేది రహస్యంగా వుంటుంది. అందుకే అది మిస్టరీ.

అదే సస్పెన్స్ థ్రిల్లర్ లోనైతే  ప్రారంభంలో-ఫలానా రాజకీయనాయకుడ్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని సమాచారం అందుతుంది. కుట్రదారులెవరో ప్రేక్షకులకి/పాఠకులకి ముందే తెలిసిపోతుంది. పోలీసులకి కథాక్రమంలో తెలుస్తుంది. హత్యని ఆపేందుకు పోలీసులూ- హత్య చేసేందుకు కుట్ర దారులూ ఆడే ఓపెన్ గేమ్ గా కథనం వుంటుంది. అందుకే ఇది సస్పెన్స్ థ్రిల్లర్.

సస్పెన్స్ జరగబోయే నేరాన్ని ఆపేందుకు ద్విముఖ డ్రామా ని సృష్టిస్తే, మిస్టరీ జరిగిపోయిన నేరాన్ని పరిష్కరించేందుకు ఏకోన్ముఖ సంఘర్షణని క్రియేట్ చేస్తుంది.

మిస్టరీ ది ఎండ్ సస్పెన్స్ కథా ప్రక్రియ అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ ది సీన్-టు సీన్ సస్పెన్స్ కథా విన్యాసం. మిస్టరీది విలన్ కన్పించని ఏకపక్ష గొడవ అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ ది విలన్ కూడా కన్పించే వైరిపక్షాల సిగపట్లు. చివరిదాకా విలన్ కన్పించని ‘మిస్టరీ’ సినిమా ప్రేక్షకులకి సహన పరీక్ష అని ఎప్పుడో హాలీవుడ్ తేల్చేసి, వాటి జోలికి పోకుండా వుంటే, ఇండియాలో ఇంకా పనిగట్టుకుని  ‘ఆ ఒక్కడు’, భద్రం’, ‘సామ్రాట్ అండ్ కో’ లాంటి మిస్టరీ లు తీస్తూ  చేతులు కాల్చు కుంటున్నారు. మిస్టరీ నవలకి బావుంటుంది, సస్పెన్స్ సినిమాకి ప్లస్ అవుతుంది.

ఈ పూర్వరంగంలో ‘కహానీ’ ఏమిటి - దీని రీమేక్ అయిన ‘అనామిక’ ఏమిటి –అని చూస్తే, ‘కహానీ’ స్పష్టాతి స్పష్ట మైన మిస్టరీ! ‘అనామిక’ మిస్టరీయో సస్పెన్స్ థ్రిల్లరో స్పష్టత లేని కాక్ టెయిల్! మరి పైన చెప్పుకున్నదాని ప్రకారం మిస్టరీ ‘కహానీ’ హిట్ కాకూడదుగా, ఎందుకు హిట్టయ్యింది?

ఎందుకంటే అందులో సినిమాకి నష్టదాయకమైన ఎండ్ సస్పెన్స్ ప్రక్రియని కాచుకునే మరో ఎండ్ సస్పెన్స్  వుంది గనుక! అది గర్భం అనే అతిముఖ్యమైన ప్లాట్ డివైస్ గనుక! ఈ గర్భం అనేపాయింటుతో అంతవరకూ ప్రేక్షకులకి తెలియని ఎండ్ సస్పెన్స్ తో షాకిచ్చాక, ఎదురుచూస్తున్న పాయింటుతో (అదృశ్యమైన భర్త) ఎండ్ సస్పెన్స్ బాధ ప్రేక్షకులు ఫీలవలేరు గనుక!

ఒక సమస్య తాలూకు విసుగు నుంచి దృష్టి మళ్లించాలంటే, ఇంకో పాయింటు ని ఓపెన్ చేసి షాకివ్వాలన్న స్క్రిప్టింగ్ మెళకువ మత్రమే ఇది!

It’s all nothing but a psychological  game played beautifully  with the audiences’  perception, as was done similarly  by the deft hand of Sri K. Balachander  in ‘Maro Charitra’ ,   where as he pulled off  the impending danger of dullness successfully,  with plot climax  instead of  the anticipated story climax! Got it ?

కహానీ v/s అనామిక !
రచయిత్రి అద్వైతా కళా 
ఇది జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డుపొందిన రచన. దర్శకుడు సుజయ్ ఘోష్ ఈ కథని నవలా రచయిత్రి ( ‘ఆల్ మోస్ట్ సింగిల్’ ఫేమ్ ) అద్వైతా కళా కి చెప్పాడు. ఆమెకి 1999 లో తన బాయ్ ఫ్రెండ్ అన్వేషణలో కోల్ కతా నగరంలో అనుభవమైన సంఘటనలు మెదిలాయి. నగరానికి తను పరాయిది. ఇక్కడి కోలాహలమైన జీవన పరిస్థితులు, పేదరికం, గందరగోళం ఎలావున్నప్పటికీ, ఇక్కడి ప్రజల మెత్తని హృదయాలు ఆమెని కట్టి పడేశాయి. కథా రచనకి ఇవన్నీ సాధనాలుగా పెట్టుకుని, మరో వైపు ఇంటలిజెన్స్ వ్యవహారాల మీద రీసెర్చి చేసింది. భారత గూఢచార సంస్థ రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్ (raw- ‘రా’) మాజీ జాయింట్ సెక్రెటరీ మేజర్ జనరల్ వీకే సింగ్ రాసిన ‘ఇండియాస్ ఎక్స్ టర్నల్ ఇంటలిజెన్స్: సీక్రేట్స్ ఆఫ్ రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్’ గ్రంధంతో బాటు, ఇదే అంశం పై ఇతరులు రాసిన కొన్ని గ్రంథాలూ ఏంతో తోడ్పడ్డాయి. వీటన్నిటి ఆధారంగా 185 పేజీల కథరాసి ఘోష్ కి అందిస్తే అతను దానికి స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నాడు.

నిజానికి టెర్రర్ దాడులు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ ) పరిధి లోకొస్తాయి. రాష్ట్రాల టాస్క్ ఫోర్సులకీ, హోం మంత్రులకీ ఎలాంటి సంబంధమూ  వుండదు. ఆయా రాష్ట్రాల అనుమతుల అవసరం లేకుండానే ఈ సంస్థ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. 2008 ముంబాయి టెర్రర్ దాడుల దరిమిలా కొత్తగా ఈ సంస్థ ఏర్పాటయింది. ఇందుకే ‘కహానీ’ లో ‘టెర్రర్’ దాడికి తీసిపోని కేసుకి సంబంధించిన కథనం కోసం ఇంటలిజెన్స్ బ్యూరో వ్యవహారాలూ, ఆ పాత్రలూ  అవసరమయ్యాయి. రియలిస్టిక్ సినిమా కథనం అన్నాక  లాజిక్కే కదా మానమూ, ప్రాణమూ?

టూకీగా ఈ కథేమిటో చూద్దాం...
కోల్ కతా మెట్రో రైల్లో ఓ రోజు  విషవాయువు దాడిజరిగి అనేక మంది చనిపోతారు. ఇది టెర్రరిస్టు దాడి కాదు. ఇంటలిజెన్స్ బ్యూరో లో తిరుగుబాటు ఉద్యోగి ఒకడు మిలన్ దామ్జీ - డిపార్ట్ మెంట్ మీద కక్ష సాధించేందుకు ఈ దుశ్చర్యకి పాల్పడతాడు. రెండేళ్ళ తర్వాత లండన్లో ఉంటున్న విద్యాబాలన్ భర్తని వెతుక్కుంటూ వచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఈమె గర్భవతి. ఇలా భర్తని వెతికే క్రమంలో కొన్ని ఘటనలు జరిగి, మిలన్ దామ్జీ ని పట్టుకుని హతమారుస్తుంది. తీరా చూస్తే గర్భవతి కాదు. అలా నటించింది. ఆనాడు మెట్రో ట్రైన్లో జరిగిన జీవాయుధ దాడిలో మృతి చెందిన వాళ్ళలో తనభర్త కూడా వున్నాడు. రెండేళ్ళు గడిచినా ఆ మిలన్ దామ్జీ ని పోలీసులు పట్టుకోక పోవడంతో తనే ఇలా నటిస్తూ వచ్చి ప్రతీకారం తీర్చుకుందన్న మాట.

తెలుగులో నగరంలోని పీపుల్స్ ప్లాజాలో బాంబు  దాడి జరిగి అనేక మంది చనిపోతారు. ఇది పక్కా టెర్రరిస్టు దాడే. ఆ దొరకని టెర్రరిస్టు పేరు మిలింద్ దామ్జీ. తొమ్మిది నెలలతర్వాత, విదేశాలనుంచి నయనతార భర్తని వెతుక్కుంటూ వచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఈమె గర్భవతికాదు. భర్తని వెతికే క్రమంలో కొన్ని ఘటనలు జరిగి మిలింద్ దామ్జీని పట్టుకుని చంపేస్తుంది. అతను తన భర్తే. అతనే ఉగ్రవాది! ఈ కథకి విలన్.

ముందుగా ముగింపు విషయానికొస్తే, ఇది హిందీకి భిన్నమైన  యాంటీ సెంటిమెంటల్ ముగింపు . హిందీలో సుఖాంతమైతే, తెలుగులో అదే డార్క్ మూడ్ తో నెగెటివ్ ముగింపునే ఇచ్చారు. గతంలో బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ హిందీ రీమేక్ కి ముగింపు మార్చాలంటూ చాలా వొత్తిడి వచ్చింది. బాలచందర్ ఒప్పుకోలేదు. తెలుగు ముగింపు తో అలాగే  హిందీ తీశారు. సూపర్ హిట్టయ్యింది !

శాడ్ గా మొదలయ్యే కథలు హేపీగా ఎండ్ అవడం, హేపీగా మొదలయ్యే కథలు శాడ్ గా ఎండ్ అవడం అతి పురాతన ప్రాథమిక సూత్రమే.  హేపీగా మొదలయ్యే కథ హేపీగా ఎండ్ అయితే ఏ ప్రమాదమూ లేదు, కానీ ‘అనామిక’ లోలాగా శాడ్ గా మొదలయ్యి శాడ్ గానే ముగిస్తేనే మునుగుతుంది కొంప!

‘కహానీ’లో శాడ్ గా మొదలయ్యింది, భర్త మరణానికి కారకుడైన వాణ్ణి మట్టుబెట్టడంతో హేపీ ఫీల్ తో ఎండ్ అయింది.

ఇక ఝాన్ర్ విషయానికొస్తే, ‘కహానీ’లాగే ‘అనామిక’ మౌలికంగా మిస్టరీయే అయినప్పటికీ హీరోయిన్ని శక్తిమంతురాలిగా చూపించాలన్న మార్పు జరగడంతో, ఆమె ఫీలవుతున్న మహిళా శక్తికి తగ్గట్టుగా సస్పెన్స్ థ్రిల్లర్ లక్షణాలూ వచ్చి చొరబడ్డాయి. ‘కహానీ’లో ఎండ్ సస్పెన్స్ ఫీల్ కి సేఫ్టీ వాల్వ్ గా ఉపయోగించుకున్న ‘గర్భం’ అనే ప్లాట్ డివైస్ ని కూడా  ‘అనామిక’ లో తీసేయడంవల్ల,  ఆ సేఫ్టీ వాల్వ్ లేక ఆసాంతమూ ఎండ్ సస్పెన్స్ తో విసిగిన  ప్రేక్షకులు సహజంగానే ఈ సినిమాని తిరస్కరించారు. ఈ సేఫ్టీ వాల్వ్ ఉండుంటే ఎంత మిస్టరీ/సస్పెన్స్ ల కన్ఫూజుడు ఝాన్ర్ అయినా  ప్రేక్షకుల్ని మరపించేదేమో.

ఇక కాన్సెప్ట్ విషయానికొస్తే, హిందీలో అది టెర్రరిజంతో సంబంధం లేని  ‘తిరుగుబాటు పోలీసు’ దాడి కాబట్టే అతను మెజారిటీ వర్గపు మిలన్ దామ్జీ అయ్యాడు. తెలుగులో పక్కా టెర్రరిస్టు దాడి అయినప్పుడు అతను అదే మెజారిటీ వర్గపు మిలింద్ దామ్జీ ఎలా అవుతాడు? ఇతను ఓల్డ్ సిటీలో మైనారిటీ వర్గపు టెర్రరిస్టు గ్రూపులో ఎలా చేరాడు? వాళ్ళని సమర్ధి స్తున్నాడా, లేకపోతే కోవర్టా? ఇంకా లేకపోతే, దేశంలో కొన్ని దాడులు చేసినట్టు  రైట్ వింగ్ టెర్రరిజానికి ప్రతినిధా?

ఇందులోకి హోం మంత్రీ, టాస్క్ ఫోర్స్ అధికారీ ఎలా వచ్చారు? టెర్రరిజం కేసు వాళ్ళ అధికార పరిధిలోదా? తెలుగు ప్రేక్షకులు అర్ధవంతమైన కథా కథనాలు కోరుకోరా?

హీరోయిన్ తన భర్త మిస్సింగ్ కేసు తీసుకున్న పోలీసులకి భర్త ఫోటో లందిస్తే అది టెర్రర్ కేసులో నిందితుడుగా వున్న  మిలింద్ దామ్జీయే నని ఎందుకు గుర్తుపట్టరు పోలీసులు? గుర్తుపట్టి ఆమెని ఎందుకు వెంటనే అరెస్టు చెయ్యరు? ఆమె అంత ఫూలిష్ గా పోలీసుల దగ్గరికి వచ్చి టెర్రరిస్టు భర్త ఫోటో లందించి సహాయం కోరుతుందా? హిందీ సినిమాలో టెర్రరిజం తో సంబంధం లేని భర్త వివరాలివ్వడంలో అర్ధముంది- తెలుగులో ఈ కథ మారిందే?

చివరికి సీఐ హత్య జరిగినా అతడి ఇంట్లో పరిశోధన చేయకుండా వదిలేసిన కథనం కథా సౌలభ్యం కోసం వున్నట్టుందే తప్ప, ప్రొఫెషనలిజంలా లేదు.

లాడ్జి పిల్లాడు అర్ధరాత్రిపూట మసక చీకట్లో దుండగుల రూపురేఖలు ఎలా చూడగల్గుతాడు? వాడెలా విట్నెస్ అవుతాడు? ఓ పెళ్ళికి వస్తున్న అనుమానితుల్ని గుర్తు పట్టేందుకు వాణ్ని తీసుకెళ్ళిన హీరోయినూ, ఏఎస్సయ్యీ అక్కడిం కేదో గొడవలో పడి వచ్చిన అంత ముఖ్యమైన పని వదిలేసి ఎలా వెళ్ళిపోతారు?

ఇలా చెప్పుకుంటూ పోతే ప్లాటింగ్ లోపాలు, పేఆఫ్ కాని సెటప్స్ చాలావున్నాయి. డిటెయిల్ మేనేజిమెంటు లేదు.

ఇవి ‘కహానీ’లోనూ బోలెడు కన్పిస్తాయి. ఇంకా రిటెన్ ఫైళ్ళల్లో రహస్యాలుండడం, మాజీ ఐబీ అధికారిని ముందు కెప్టెన్ అని పరిచయం చేసి, తర్వాతంతా కల్నల్  అంటూ సంబోధించడం లాంటి వి...అతిపెద్ద లొసుగు ఏమిటంటే, రెండేళ్లుగా నిందితుణ్ణి ఏ వ్యవస్థా పట్టుకోలేక పోవడం, హీరోయిన్ మాత్రం వచ్చి దేవీనవరాత్రుల పదిరోజుల్లోనే పట్టేసుకోవడం! అసలు ఏ ఏర్ పోర్టు చెకింగ్ లోనూ దొరక్కుండా పెరిగిన పొట్ట ( కృత్రిమ గర్భం) తో స్వదేశానికి రావడం!

స్క్రిప్టింగ్ సమస్యలు
‘అనామిక’  చూసిన ప్రతివాళ్ళూ ఫిర్యాదు చేస్తున్న  ‘ఫస్టాఫ్ బోరు’ ప్రాబ్లం ఎందుకొచ్చిందంటే, అంకాల్ని, అంక విభజననీ దృష్టిలో పెట్టుకోకుండా రచన చేయడం వల్ల!  హిందీ మాతృకలో  స్పష్టంగా 40 వ నిమిషంలో  దామ్జీ ఫైలుకోసం జరుగుతున్న ప్రయత్నాలు ఢిల్లీలో ఐబీ చీఫ్ దృష్టి కొచ్చి – ఇద్దరు ఐబీ అధికారుల్ని కోల్ కతా పంపడంతో మొదటి అంకం ముగిసి రెండో అంకంలో పడుతుంది కథ.

ఈ మజిలీలో స్పష్టంగా ఎష్టాబ్లిష్ చేసిన ఛేంజ్ ఓవర్ ఏమిటంటే, భర్త కోసం హీరోయిన్ సాగిస్తున్న అన్వేషణ పైన చెప్పిన విధంగా బ్యూరోక్రటిక్  టర్న్ తీసుకోవడం.  హీరోయిన్ వ్యక్తిగత సమస్య కాస్తా ఉన్నట్టుండీ  ప్రభుత్వ సమస్యగా మలుపు తీసుకోవడం! కథనానికి కొత్త అధ్యాయం తెరవడం!


ఇలాటి టర్నింగ్ తో కొత్త మూడ్ ని క్రియేట్ చేయలేకపోయారు  ‘అనామిక’ లో...అంకాల్ని దృష్టిలో పెట్టుకుని కథా పథకాన్ని నిర్వహించినట్టు గోచరించదు.  హోం మంత్రి టాస్క్ ఫోర్స్ అధికారిని చనిపోయిన సీ ఐ స్థానంలో పంపడంతో- కథకి ఓ  మలుపుని ఎష్టాబ్లిష్ చేసేందుకు అవకాశమిస్తున్న  కీలక అంశం  దామ్జీ హార్డ్ డిస్క్ ప్రస్తావన మిస్సయి, అతను అనవసరంగా హీరోయిన్ తో వాదన పెట్టుకుని నిస్సిగ్గుగా లొంగిపోతాడు. ఇదంతా హీరోయిన్ని పవర్ఫుల్ గా చూపించేందుకు టైం వేస్టు చేసుకున్న సీను. లేకపోతే ఆ అధికారి ఇందుకు బదులుగా నేరుగా చనిపోయిన ఆ సీఐ ఇంటికెళ్ళిపోయి  హార్డ్ డిస్క్ కోసం  సోదాజరిపేసేవాడు- అక్కడ  హీరోయిన్ తో, కిరాయి కిల్లర్ తో అవాంతరం సృష్టించి వుంటే – అది అంక విభజనకి బాట వేసి,  అక్కడ్నించీ  డిస్క్ కోసం మూడు వర్గాల వేటతో టెంపో పెరిగి  రెండో అంకంలో పడేది కథ! 


అంకాల్ని బట్టి కథ నడిచి వుంటే ఇంటర్వెల్ సీను కూడా చప్పబడేది కాదు. రెండో అంకం ఎప్పుడూ సంఘర్షణ తీవ్రతని పెంచుకుంటూ పోయేదే. హిందీలో  రెండో అంకం ఇంటర్వెల్ దగ్గర సీను వెన్ను జలదరింప జేస్తుంది...రైల్వే ప్లాట్ ఫాం మీద నిలబడి చూస్తున్న హీరోయిన్ని -హఠాత్తుగా అప్పుడే వస్తున్న రైలు ముందుకు తోసేస్తాడు కిరాయి కిల్లర్!

తెలుగులో ఈ ఇంటర్వెల్ లేదు, ఎందుకంటే కథ మార్చారు కాబట్టి ఇక్కడ హీరోయిన్ కి రైళ్లతో సంబంధంలేదు. అందుకని డైలాగులతో నీరసంగా  విశ్రాంతి తీసుకున్నారు.


4.పాత్రోచితానుచితాలు

హిందీలోలాగా హీరోయిన్ని గర్భవతిని చేసి చుట్టూ బోలెడు సానుభూతిని ప్రోది చేసుకునేలా చూపడం బలహీన స్త్రీ పాత్రవుతుందని అభ్యంతరపడి, అబలని కాక సబలని చూపాలన్న ధ్యేయంతో గర్భం పాయింటుని తీసేసినట్టు దర్శకుడి వివరణ. ఒక స్త్రీ ఒంటరిగా వస్తే సమాజంలో చుట్టూ ఏం జరుగుతుందో, వాటినామె  ఎలా ఎదుర్కొంటుందో చూపాలనుకున్నారు పనిలోపనిగా . ఇదే రసభంగమంటే. అసలే మిస్టరీ ఝాన్ర్ కి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో విఘాతం కలిగిందనుకుంటే- మహిళాశక్తి ప్రదర్శన ఒకటి. 

ఈ మిస్టరీ- పోనీ-సస్పెన్స్ కథ ఆమె స్త్రీత్వంగురించికాదు, భర్త జాడ గురించి! ఏకసూత్రత పాటించకుండా ఒక తరహా కథని ఇంకో తరహా కథగా చెప్పలేరు. సామాజిక సమస్యలు/ పరిస్థితులు -  మిస్టరీ/సస్పెన్స్ కథలకి పట్టవు. వాటిని వేరే సినిమాగా తీసుకోవాలి. రియలిస్టిక్ సినిమా గాకుండా మూస ఫార్ములా తీయాలనుకుంటే అన్నీ కలిపి కొట్టొచ్చు! 

‘అనామిక’ కాస్సేపు రియలిస్టిక్ అన్పిస్తుంది, కాస్సేపు కొన్ని మూస పాత్రలతో పాత మూస ఫార్ములా అన్పిస్తుంది. కాసేపు మిస్టరీగా,  మరికాసేపు సస్పెన్స్ థ్రిల్లర్ గా తోస్తుంది. అసలు ఏది తీయాలనుకున్నారు?

మహిళా శక్తిని కూడా చూపాలనుకుంటే, సారంలో ఏం తేలింది? ఆమె బలహీనురాలిగా , అతి తెలివి హీనురాలిగా తేలింది. భర్త టెర్రరిస్టని తను అమెరికాలో ఉండగానే తెలిసివుంటే, వారం క్రితం వరకూ అతను హైదరాబాద్ లో ఫోన్ కాంటాక్టు లోనే వుంటే ఏం చేస్తూ వుండి  పోయింది? అతను మిస్సయ్యాక రావడమేమిటి?  అందులోనూ పోలీస్ స్టేషన్ కి వెళ్లడమేమిటి? వాళ్లకి టెర్రరిస్టు భర్త ఫోటో నే ఇవ్వడమేమిటి? హిందీలో హీరోయిన్ కథ, ఈమె కథా  ఒకటి కాదుగా? ఆమెలా ఈమె ఎలా ప్రవర్తిస్తుంది?

రాత్రిపూట ఎవడుపడితే వాడొచ్చి తలుపు కొడుతూంటే గాభారపడిపోయి వాళ్ళ సందేహాలు తీర్చడమేమిటి?

ఆమెకి గర్భం పాయింటు తీసేయడంవల్ల పోలీసులు నీచంగా మాట్లాడి, ఆమెని వాడుకుందామని చూసే సీన్లు విచ్చలవిడిగా  వేసుకోవడానికి మార్గం ఏర్పడి నట్టయ్యింది.



ఒరిజినల్లో ఈ మహిళా శక్తి ప్రదర్శన లేదని ఎలా అంటాం? చాలా తెలివిగా, పరోక్షంగా వుంది. తను మామూలుగా వచ్చి  భర్తకోసం వేధిస్తే పోలీసులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆమెకి తెల్సు. అందుకని తెలివిగా ప్లాన్ చేసి, అలాటి పోలీసుల్ని బుట్టలో వేసుకోవాలంటే గర్భవతిగా నటించాలని నిర్ణయించుకుంది. కింది నుంచీ పైదాకా పోలీసులు అయ్యోపాపమని అనుకుని సహకరించే వాళ్ళే  అయ్యారు. అలా తన డిగ్నిటీ కాపాడుకుంటూ, వాళ్లకి కహానీ ల మీద కహానీలు చెప్పి బురిడీ కొట్టించి- తన పని కానిచ్చేసుకుని బయటపడింది- వాళ్ళు తెల్లబోయేలా చేసింది- ఇదీ మహిళా శక్తంటే!

ఆమె వ్యక్తిత్వ  ప్రదర్శన  గర్భం ఆలంబనగా, సరదా సరదాగా,  పైకి చెప్పని సబ్ టెక్స్ట్ గా , అంతర్లీనంగా ఉన్నాక- ఏం తగ్గింది?
కాకపొతే, ముగింపులో సమస్యని పరిష్కరిస్తూ ఇద్దరూ-నేలబారుగా మిగిలిపోయారు.

విద్యాబాలన్ ది కేవలం భర్త చావుకి వ్యక్తిగత ప్రతీకారం.  భర్తతో బాటు మరెందరో చనిపోయిన నేపధ్యంలో వాళ్ళందరి ప్రతినిధి గానూ తానుండాలన్న స్పృహ లేకపోయింది. దీంతో ఆమె ఆశయం చాలా చిన్నదై జేమ్స్ బానెట్ వర్గీకరించే స్టోరీ వీల్  మెట్లలో అట్టడుగున- స్వవిషయమే తప్ప ఇంకేమీ పట్టని అట్టడుగు స్థాయి పాత్రగా- కథగా ఉండిపోయింది. ప్రారంభంలో చెప్పుకున్నట్టు కురచ కాన్సెప్ట్ అయ్యింది!

నయనతారది పైకి సామాజిక బాధ్యతలా అన్పించినా,  లోలోపల తనని మోసం చేశాడన్న కసి ఉందేమో ఎవరికితెలుసు? ఈ మీమాంస వల్ల  తనుకూడా డిట్టో!!


-సికిందర్