రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, ఏప్రిల్ 2017, శనివారం

నాటి సినిమా !







           2012  సృష్టి విలయ రహస్యాన్ని మోనాలిసా బొమ్మ ఇముడ్చుకుందన్న మాటే నిజమైతే, జానపద సినిమాల్నీ, సాహిత్యాన్నీ అటక మీదికి చేరుస్తున్న  మానవజాతి,  ముందే తన మానసిక వినాశాన్నీ  కొనిదెచ్చుకుంటున్న  మాటా అంతే  నిజమౌతుంది.

           స్పీడు యుగంలో యాంత్రికంగా బతకడం అలవాటు చేసుకున్నాడు మనిషి. తన నుంచి తానూ పూర్తిగా వేర్పడిపోతూ దిక్కు తోచని స్థితిలో పడుతున్నాడు. దారీ తెన్నూ తెలీక దొరికిన వ్యక్తిత్వ వికాస పుస్తకమల్లా చదవడం మొదలెట్టాడు. కానీ ఇవే విజయానికి సోపానాల గురించి  ఏనాడో పురాణాల్లోనే,  జానపద కథల్లోనే  రాసిపెట్టారన్న సంగతే గుర్తించ లేకపోయాడు. ఇదీ మనిషి మానసిక దివాళాకోరుతనం.  పురాణాలు ఆత్మని కడిగితే, జానపదాలు మేధస్సుని పెంచుతాయి. నిగూఢంగా వున్న  మానసిక శక్తుల్ని పైకి లాగి - పోరా ఆకాశమే నీ హద్దూ అనేసి బతకడాన్ని బ్యాలెన్సు చేస్తూ జీవిత ప్రాంగణంలోకి ముందుకు తోస్తాయి. 

          ఈ పని జానపద చలన చిత్రాల తిరుగులేని కథానాయకుడిగా టీఎల్ కాంతారావు కొన్ని వందలసార్లు చేసి వుంటారు. కాంతారావు చేసిన మేలు మనం అప్పుడు తెలుసుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే  జానపద సినిమాలతో వ్యక్తిత్వ వికాసానికి బ్రాండ్ అంబాసిడర్ కి తక్కువకాని  హోదాని తనే ఆనాడే  పోషించారు!


          ఈ పని ‘సప్తస్వరాలు’ తో ఇంకా పరమ నిష్ఠగా చేశారు. ఈ సినిమా మొత్తంగా ఒక సైకలాజికల్ విహార యాత్ర. ఇందులోకి ప్రవేశిస్తే మనల్ని మనం తెలుసుకోగలం
. నిమిష నిమిషానికీ మన మనసు చేసే మాయ, చిత్ర విచిత్రాలూ- వీటన్నిటినీ ఒక దారిలో పెట్టి, లక్ష్యాన్ని సాధించేందుకు మనం చేసే విశ్వ ప్రయత్నాలూ- దీన్నొక కదిలే బొమ్మల పర్సనాలిటీ క్విజ్ గా నిలబెడతాయి.
     కృష్ణుడికి ఎన్టీఆర్ నీ, దేవదాసుకి ఏఎన్నార్ నీ పర్మనెంట్ సింబల్స్ గా ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రించి వదిలిపెట్టిన సినిమాయే,  జానపద కథానాయకుడికి సింబల్ గా స్ఫురద్రూపియైన కాంతారావు  రూపాన్ని అచ్చు గుద్ది, పక్కనే నిలువెత్తు కత్తినీ గుచ్చి వదిలింది! తను పోతూ ఆ కత్తినీ పట్టుకుపోయారు కాంతారావు. కత్తి కూడా స్వరాలు పలికిస్తుందని ఆయన నిర్ధారణ. సప్తస్వరాల మాలిక సంగీతమైనట్టే, యుద్దాల్లో కత్తులూ ఏడు రకాల శబ్దాలు విన్పిస్తాయట! ఇదీ కాంతారావు ప్రకటన! యుద్ధాలూ,  సమురాయ్ కత్తుల విన్యాసాలూ గురించి కసక్ కసక్ మని రాసే పాల్ సియోలో కూడా ఈ సంగతి చెప్పలేదు మనకి! 

          అలాగని సప్తస్వరాలు ఏవో కత్తులు పాడుకునే సంగీత సమ్మేళన మనుకుంటే  కత్తుల మీద కాలేసినట్టే. సప్త స్వరాలు కేవలం మాధుర్యాన్ని చిలికే సరిగమలే కావనీ, సప్త సముద్రాలు, సప్త గిరులు, సప్తర్షులు, సూర్యుడి సప్తమాశ్వాలూ ... ఇవన్నీ మానవ కోటికి  మహత్తర వరాలనీ, సప్త సంఖ్యామయమైన ఈ జగత్తే మొత్తంగా ఈ సప్తస్వరాల్లో ఇమిడి వుందనీ, ఈ సప్త స్వరాలని జయించిన వాడే శారదా పీఠాన్ని అందుకోగల్గుతాడనీ ఈ సినిమా  కథలోని భావం. మెంటల్ పోస్ట్ మార్టం మేడీజీ అన్నమాట. 


          ఈ అంతరంగ ప్రయాణం ప్రారంభించే ముందు ఏడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. లేకపోతే
  అగాథంలోకి పతనం ఖాయం. దీంతో తొలిసారిగా సినిమా నిర్మాణానికి పూనుకున్న కాంతారావు, తన ఉత్తమాభిరుచులేమిటో అడుగడుగునా దృశ్యాల్లో ప్రతిఫలించేలా చేశారు. దీని ఆర్ధిక పరాజయానికి కొన్ని రాజకీయాలు కారణమై వుండొచ్చు, కానీ విషయపరంగా దీన్ని శాశ్వత తత్వానికి  ఎదురేదీ లేదు.

          దేవదాసు లాంటి భగ్న ప్రేమికుడి విషాదాంతంతో బాగా- బాగా-  ఏడ్పించేసి  వదిలిన వేదాంతం రాఘవయ్య కి,  ఈ ‘సప్తస్వరాలు’ గమ్మత్తుగా భగ్నప్రేమికుడి విజయగాథ! ఈ మహా దర్శకుడి చిత్రీకరణలో పాత్రల నిమ్నోత్తమాలు, వాటి తాలూకు భావోద్వేగాలు, అభినయ విలాసాలు, అన్నీ మహోన్నతంగా ఉట్టి పడతాయి.  కాంతారావు, నాగయ్య, రామకృష్ణ, ధూళిపాళ, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబు, బాలకృష్ణ (అంజి గాడు), రాజశ్రీ, విజయలలిత, విజయనిర్మలల బారెడు తారాతోరణంతో  రాఘవయ్య దర్శకత్వ లాఘవం మనల్ని కదలకుండా కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు. అదే నీవంటివీ, కృష్ణయ్యా గడసరి కృష్ణయా... వంటి పాపులర్ గీతాలతో, నృత్యాలతో, సూటిపదాల సంభాషణలతో; రాజకోట, మాంత్రికుడి కళాత్మక సెట్స్ తో, సమ్మోహనకర ట్రిక్ ఫోటోగ్రఫీతో, కత్తి పోరాటాలతో... ఓ పరిపుష్ట పంచభక్ష్య పరమాన్న విందిది. నిర్మాణ వ్యయాన్ని  వేదాంతం ఆరు లక్షలకి  పైగా లాగేశారని కాంతారావు వాపోయినా, వేదాంతం ఇచ్చిన విందు ముందు కాంతారావు ఖేదం బేఖాతర్ మనకి!

       విచిత్రంగా జానపదంలో పౌరాణీకాన్ని కలుపుకున్న జానర్ ప్రయోగమిది. దీంతో ఇది ఆథ్యాత్మిక యానం కోసం చేసే మనోవైజ్ఞానిక విహార యాత్రవుతోంది. హాలీవుడ్ చలన చిత్ర రాజం  ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’  లో ఆథ్యాత్మిక శక్తులున్న ఆర్క్ కోసం జరిపే పోరాటం ద్వారా మహా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఏం చెప్పాలనుకున్నాడో, సరీగ్గా ఆ లోక కల్యాణాన్నే ప్రబోధిస్తోంది ‘సప్త స్వరాలు’ కూడా!
          అనేక సమస్యలతో, అన్యాయాలూ అక్రమాలతో పుచ్చి పోయింది మానవ లోకం సమస్తం. అజ్ఞానమే దీనికంతటికీ మూలం.  దీంతో నారదుడు (రామకృష్ణ), గంధర్వుడు (కాంతారావు) లు కలిసి  వెళ్లి సరస్వతి (విజయనిర్మల) కి ఈ సంగతి మొరపెట్టుకుంటారు. అప్పుడామె ఓ శారదా పీఠాన్ని అందించి, దాంతో మనుషుల అజ్ఞానాన్ని తొలగించి మానవ కల్యాణాన్ని పునఃప్రతిష్ఠాపన చెయ్యమనీ ఉపదేశించి పంపుతుంది. ఈ శారదా పీఠాన్ని  వైజయంతి (విజయలలిత) వ్యామోహంలో పడిన గంధర్వుడు పోగొడతాడు. దీంతో – నువ్వెళ్ళి భూలోకంలో అలాగే బాధలనుభవించమని నారదుడు శపిస్తాడు.


          భూలోకంలో ఓ సంగీత కారుడు (నాగయ్య) కి  ముత్యపు చిప్పలో మగ శిశువు దొరుకుతాడు. వాడికి సారంగ అని పేరు పెట్టి పెంచుకుంటూ సంగీతం నేర్పుతూంటాడు. ఇంకో ముత్యపు చిప్పలో మహారాజు (ధూళిపాళ) కి ఆడ శిశువు దొరుకుతుంది. దానికి దేవ మనోహరి అని నామకరణం చేసి పెంచుకుంటూ, నాట్యం నేర్పిస్తూంటాడు. సంగీతం
నేర్చుకుని పెద్దవాడైన  సారంగ (కాంతారావు), జయంతి (రాజశ్రీ) తో ప్రేమ కలాపాలు సాగిస్తూంటాడు. ఇది తండ్రికి తెలిసి మందలిస్తాడు. ఎందుకంటే, సారంగాకి తను ఒక లక్ష్యంతో సంగీతం నేర్పుతున్నాడు. ఆ లక్ష్యం స్వర్గలోకం నుంచి భూమండలంలో పతనమైన శారదా పీఠాన్ని  సాధించడం. అది ప్రస్తుతం సోపాన మంటపం మీద ప్రత్యక్షమై వుంది.  దాన్ని సాధించే వాడు సంగీతంలో స్రష్ట అయి, మాతృగర్భంలో జన్మించని అయోనిజుడై వుండాలి. స్త్రీ స్పర్శ ఎరుగని బ్రహ్మచారియై కూడా వుండాలి. ఇది విన్న సారంగ  చకితుడవుతాడు. తను అయోనిజుడు సరే, బ్రహ్మచర్యమంటే ఎలా సాధ్యం? జయంతి  తన సర్వస్వం. ఎటూ తేల్చుకోలేక ఈ సంకటంలో వుండగా,  అప్పుడు వూడిపడతాడు అభేరి (సత్యనారాయణ)  అనే తాంత్రిక విద్యల తుచ్ఛుడు. వీడికి మానవ జాతి పచ్చగా వుంటే నచ్చదు. ఆ శారదా పీఠాన్ని చేజిక్కించుకుని, మానవ లోకాన్ని ముక్కలు చెక్కలు చెయ్యాలని చూస్తూంటాడు. 

        ఇక మొదలవుతుంది రసవత్తర క్రీడ. మామూలు ప్రేక్షకులకి మామూలు భాషలో సస్పెన్స్, థ్రిల్స్, టెంపో, యాక్షన్, అడ్వెంచర్ లాంటివి అన్నీ ఇందులో వుంటాయి. ఈ ఎలిమెంట్సే  రసజ్ఞులకి  ఒకొక్కటీ ఒక్కో  సైకలాజికల్ ట్రూత్ గా ఆశ్చర్య పరుస్తాయి. స్థాపించిన కథా ప్రపంచంలో పైకి కన్పించని ఈ హిడెన్ ట్రూత్  ఆసాంతం రసమయ సంగీతమనే రజాయిని వెచ్చ వెచ్చగా కప్పుకుని వుంటుంది.

          ప్రతీ పాత్రా,  ప్రతీ సన్నివేశమూ సంగీతాన్నే వొలికిస్తాయి. లక్ష్య సాధన కోసం కాంతారావుకే ద్రోహం చేసే నాగయ్య, ఆ ద్రోహంతో ప్రేమలో పిచ్చి వాడయ్యే కాంతారావు మీదికి విషకన్య విజయలలితని ప్రయోగించే సత్యనారాయణ విద్రోహం, మధ్యలో తిక్క వేషాల ధూళిపాళ చెత్త పనులు, మరోవైపు గడ్డీ గాదం మేసి దిట్టంగా సంగీతం నేర్చుకోవాలనుకునే రాజబాబు హాస్య ప్రహసనాలు, రాజశ్రీ సోయగాల కనువిందూ... కలిసి ఓ మహోజ్వల జానపద చలనచిత్ర రాజం!   
  
          వీటూరి కథా మాటలూ రాస్తే; పాటలు సినారె తో బాటు వీటూరి కూడా రాశారు. టీవీ రాజు సంగీతం సమకూరిస్తే, అన్నయ్య ఛాయాగ్రహణాన్నీ, ఎస్ ఎస్ లాల్  ట్రిక్ ఫోటోగ్రఫీనీ పోషించారు. నృత్యాలు వెంపటి సత్యం, కళా దర్శకత్వం బీఎన్ కృష్ణ వహించారు.

          హేమా ఫిలిమ్స్  సంస్థని స్థాపించిన టీఎల్ కాంతారావు, 1969 లో నిర్మించి నటించిన న ఈ కళాఖండాన్ని గురువు హెచ్ ఎం  రెడ్డికి అంకితమిచ్చారు.

చరిత్రలో ఒక పేజీ...
       అప్పటి సినిమాల్లో రాజనాల గొప్ప విలనే. అయితే ఈ విలన్ పాత్రని అప్పుడప్పుడూ నిజజీవితంలో కూడా పోషిస్తూ ఎలా అవమానపర్చే వాడో, ‘బందిపోటు’ షూటింగు సమయంలో ఇచ్చిన డైలాగులతో కావాలని పెట్టిన ముప్పు తిప్పలూ, అది దారి తీసిన పెద్ద గొడవా సీనియర్ రచయిత త్రిపురనేని మహారధి ఈ వ్యాసకర్తకి ఒకసారి వివరించారు.

           కాంతారావుకీ ఇలాటిదే జరిగిందన్నారు త్రిపురనేని. ఎక్కడో చదివిన కథని వీటూరి చేత ‘సప్త స్వరాలు’ స్క్రిప్టుగా రాయించుకుని, రాజనాల దగ్గరికి వెళ్తే, ఆయన  స్క్రిప్టుని సరీగ్గా పట్టుకోకుండా కావాలని కింద పడేసి, ‘ఇప్పుడు రాహుకాలం. నేను కథలు వినను, నీ సినిమాలో నటించను ఫో!’ అనేశారు. దెబ్బతిన్న కాంతారావు వెళ్లిపోయి వేదాంతం రాఘవయ్యకి చెప్పుకుంటే, ఆయన సత్యనారాయణని విలన్ గా తీసుకుందామని సలహా ఇచ్చారు. అలా నాల్గు వేలు పారితోషికంగా తీసుకుని సత్యనారాయణ విలన్ పాత్ర వేసి మెప్పించారు.

          సినిమా 1969 లో విడుదలయ్యింది. అప్పుడు రాజకీయాలు ఈ సినిమాని తినేశాయి. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలం. ‘ప్రేక్షకులారా మీరు తెలంగాణా వాడు తీసిన ఆ సినిమా చూస్తారో, ఆంధ్రా వాడు తీసిన ఈ సినిమా చూస్తారో తేల్చుకోండి!’ అని కృష్ణతో  ‘లవ్ ఇన్ ఆంధ్రా’  తీసిన భావనారాయణ ప్రచారం చేయడంతో కాంతారావు గుండె పగిలింది. అయితే ఆ ఉద్యమ ప్రభావానికి ‘సప్తస్వరాలు’ తో బాటు ‘లవ్ ఇన్ ఆంధ్రా’ కూడా మట్టి కర్చింది. 

డైలాగ్ డిష్ 
నాగయ్య :
           * నాకు స్వార్ధమా? భార్యలా బిడ్డలా సంసారమా...  ఏముందని, ఎవరున్నారని నాకు స్వార్ధం?
           ఎవరేం చేసినా చేయకపోయినా,  కళాకారుడు మాత్రం తన కళ ద్వారా దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలనుకుంటాడు.
 కాంతారావు :
           * ఆశా లేదు, నిరాశా లేదు. అనుకున్నదీ లేదు, అనుకోనిదీ లేదు. లేదనుకుంటే ఏదీ లేదు, అవునా?
           * నవ్వీ నవ్వీ నవ్వీ ...గుండె బండబారిపోయింది...
           * పాదాలు పట్టుకునే ఆడదాన్నీ, కన్నీళ్లు పెట్టుకునే మగవాణ్ణీ నమ్మ కూడదు.
 రాజబాబు :
           * చచ్చింది గొర్రె! నా నోట్లో నువ్వు గింజ కూడా నానదే!
           * ఇంత వరకూ భూమి కనిపించింది, ఇక ముందు చుక్కలు కనపడతాయి.


-సికిందర్ 
(సాక్షి- నవంబర్, 2009)
cinemabazaar.in


         





         
         
                   



రివ్యూ!






    

టెంప్లెట్ - దర్శకత్వం : పూరీ జగన్నాథ్.
తారాగణం: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్ లిన్ స్కీ,  తులసి, అనూప్సింగ్ఠాకూర్, సుబ్బరాజు, అలీ, అవినాష్, ఎజాజ్ ఖాన్
సంగీతం: సునీల్కాశ్యప్, ఛాయాగ్రహణం: ముకేష్ బ్యానర్‌: తన్వి ఫిలింస్
నిర్మాత: సి.ఆర్‌. మనోహర్, సి.ఆర్‌. గోపి
విడుదల : మార్చి 31, 2017
***

     ఒక దర్శకుడు ఎన్నేళ్ళు పోయినా అవే సినిమాలు అలాగే తీస్తూపోతున్నాడంటే ప్రేక్షకుల సహన శక్తి మీద అంత నమ్మకమన్న మాట. ప్రేక్షకులకి ఈ సహన శక్తి ఏ సినిమాకా సినిమా తను మార్చేసే స్టార్స్ ని చూసి వస్తూండవచ్చు. ఇది తన అదృష్టమే. చాలా కొద్ది మందికే ఇలా చెల్లిపోతుంది. వాళ్ళల్లో  పూరీ జగన్నాథ్ ఒకరు. తనని స్టార్స్ కరుణిస్తున్నంత కాలం శాశ్వత ప్రాతిపదికన, ఎక్కడో ఘనీభవించిన-  శిలాసదృశమైన  తన రాత- తీత పనికే ఢోకా వుండదు. తను రాసిందే కథ, తను తీసిందే సినిమాగా,  స్త్రీ ద్వేషమే  తన అమ్మకపు సరుకుగా కార్యకలాపాలు సాగించుకోవచ్చు. 

         
దృష్ట్యా పూరీ సినిమాలకి రివ్యూలే అవసరం లేదు. ఏముంటుంది రాయడానికి రాసిందే రాయడం తప్ప. అలాగే కొత్త తరం దర్శకులు నేర్చుకోవడానికి ఏముంటుంది పూరీ సినిమాల్లో, చూసిందే చూడడం తప్ప. అయితే ఎవరో పసిగట్టేసి అల్లరి చేస్తున్నారని కాబోలు, కాస్త మారినట్టూ కన్పించడమూ తనకే సాధ్యమైంది. కానీ మారినట్టు కన్పించినంత మాత్రాన  కొత్తగా తీసిన  ‘రోగ్’ కాస్తా రోగరహితమై పోతుందా? రోగాన్ని దాచుకుని పైపైన స్ప్రే కొట్టుకు తిరిగితే ఆ స్ప్రే మార్నింగ్ షో వరకే సరిపోతుంది. ఇక ప్రతీ షోకీ ప్రేక్షకులు స్ప్రే కొట్టుకుని చూడాల్సి వస్తే సహనశక్తి పూర్తిగా నశించిపోతుంది. 




          టెంప్లెట్ సినిమాలు తీసి తీసి, అల్లరయ్యాకా ఎందుకు ఫ్లాపవుతున్నాయో తెలుసుకుని, ‘రోగ్’ ని టెంప్లెట్ నుంచి కాస్తా తప్పించినట్టు కన్పించేలా చేద్దామనుకున్నట్టుంది. పూరీ మార్కు టెంప్లెట్ అంటే- తాజాగా గత వారం  వచ్చిన  ‘కాటమ రాయుడు' అనే అట్టర్ ఫ్లాపే. ఆ దర్శకుడు పూరీని ఆదర్శంగా తీసుకుని టెంప్లెట్ లో అన్నీ సర్దేశాడు. పూరీ టెంప్లెట్ ప్రకారం ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్  లో హీరోయిన్ కట్ అయిపోయి విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపు.

          ఇదే టెంప్లెట్ ని ఇంకో విధంగా కూడా చూపించారు-
అదే కథ, అవే పాత్రలు, వాటికి  ఒక యాక్షన్ సీన్ ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాటమళ్ళీ ఒక యాక్షన్ సీన్- ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట; మళ్ళీ ఒక...ఇలా ఇవే రౌండ్లేస్తూ  వుండడమన్నమాట.

          అవతల మూసని బ్రేక్ చేసే తెలుగు టాలెంట్స్  తో  ఒక ‘ఘాజీ’ రానీ, ఇంకో ‘గురు’ రానీ- ఈ టెంప్లెట్  ఏమాత్రం గిల్టీ  ఫీలవదు. టెంప్లెట్ కి కాలంతో పని లేదు, కాలమ్స్ కి సరిపడా పాత రేషన్ ని డంప్ చేయడమే దాని పని.

          ఇప్పుడు రూపం మార్చుకున్న టెంప్లెట్ లో ఈ కింది విధంగా ఏడు కాలమ్స్ వున్నాయి :

          ఇవే ఏడు కాలమ్స్ పాత టెంప్లెట్ లో ఇలా వుండేవి :

            ఫస్టాఫ్ ఇంటర్వెల్ దాకా హీరోయిన్ ని పడేసే హీరో కామెడీ ఇప్పుడు లేదు, మార్పు కోసం మిస్టర్  రోగ్ హీరోయిన్స్ ని సీరియస్ గా ద్వేషిస్తూంటాడు, అంతే. ఓపెనింగ్ లోనే పోలీస్ కమీషనర్  పాత్రనీ, అతడి చెల్లెలైన హీరోయిన్ పాత్రనీ రొటీన్ గా భూతకాలంలోంచి దిగుమతి చేసుకుంటాడు. హీరోయిన్ పెళ్లవుతూంటే వచ్చి అడ్డుపడతాడు. అందర్నీ కొడతాడు, ఒక పోలీసు కాళ్ళు  విరగ్గొడతాడు. హీరోయిన్ పెళ్లి మాత్రం జరిగిపోతుంది. దాంతో ఆమె  మోసానికి  స్త్రీ లందర్నీ ద్వేషించడం మొదలెడతాడు. హీరోయిన్ పేరు అంజలి అనే టెంప్లెట్ పేరు. దీంతో అంజలి పేరుతో  ఏ టెంప్లెట్  అమ్మాయి కన్పించినా  పట్టుకు కొట్టేస్తాడు. 

          ఈ రోగ్ కి  అసలే మైనారిటీ లో పడిపోతున్న మాస్ ప్రేక్షకులని బుజ్జగించడానికి  చంటి అనే ఇంకో టెంప్లెట్ పేరు. ఇక బుజ్జగింపు రాజకీయాలు మొదలు. పోలీసు కాళ్ళు విరగ్గొట్టినందుకు ఈ చంటి రోగ్ రెండేళ్ళు జైలుకి పోతాడు. ఈ జైలు సీన్లు మైనారిటీలో పడిపోతున్న మాస్ ప్రేక్షకుల్ని బుజ్జగించేందుకు ప్రత్యేకించినవి. జైలుకొచ్చి కలిసిన పెళ్ళయిన హీరోయిన్, అటు మొగుడితో కూడా ఎలా నాటకాలాడుతోందో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో అమ్మాయిలు మేథమెటిక్స్ అనీ  - అబ్బాయిలు పోయెట్రీ అని  డిసైడ్ చేసుకుంటాడు రోగ్. అబ్బాయిలే పవిత్రులూ, అమ్మాయిలు అపవిత్రులన్న డైలాగులు ఇక సాంతం రాజ్యమేలతాయి. ఇక ఏ ఆడ పాత్రకీ పూచిక పుల్ల విలువుండదు. వాళ్ళని ఎంత కించపరిస్తే అంత బాక్సాఫీస్ గలగలలు విన్పిస్తాయన్నట్టు. ఇదంతా అసలే మైనారిటీలో పడిపోతున్న –అదికూడా పూరీ సినిమాలకి కొందరు అబ్బాయిలకే పరిమితమైపోయిన యువ ప్రేక్షకుల చేత కేరింతలు కొట్టించడానికే. నీట్లో తడిసిన హీరోయిన్- ‘పంది కూడా తడిస్తే అందంగా వుంటుంది’ అన్నదాకా ఈ డైలాగుల పంద్యారం సాగుతుంది.

         ఇంతకీ రోగ్ ఇవన్నీ చేసేది కోల్ కత మహా నగరంలోనే. జైలునుంచి విడుదలై  టెంప్లెట్ ప్రకారం ఇంటికి పోతే టెంప్లెట్ ప్రకారమే తండ్రి వెళ్ళ గొడతాడు. కాళ్ళు విరగ్గొట్టిన పోలీసు కుటుంబాన్ని ఆదుకుందామని పోతాడు. వాళ్ళు ఛీ కొట్టినా ఇంటి ముందే వుంటున్న బెగ్గర్స్ గుంపుతో  మకాం వేస్తాడు. ఆ కానిస్టేబుల్ చెల్లెలు ఇంకో హేరోయిన్. ఈమె కోల్ కత నైట్ క్లబ్ లో టెంప్లెట్ ప్రకారం తెలుగు పాటలు పాడుతూ అన్న కుటుంబాన్ని పోషించుకునే త్యాగమయి- ఈమె కూడా ‘బజారుమయి’ అయిపోతుంది. సౌజన్యం : రోగ్ గారి స్త్రీ ద్వేషం. పైగా ఈమె పేరూ అంజలి. రోగ్ గారు కర్ర తీసుకుని చావబాదుతూ బిర్యానీలు కూడా తినిపిస్తాడు ఈమె ఇంటిల్లిపాదినీ.

          టెంప్లెట్ ప్రకారమె ఒక వడ్డీల వ్యాపారికి వసూళ్ళ ఏజెంటుగా కుదిరి, ఆ వచ్చిన కమిషన్ తో  కానిస్టేబుల్ అప్పులు తీర్చడం మొదలెడతాడు రోగ్. కానిస్టేబుల్ కి ప్రభుత్వం నష్టపరిహారం అదీ బాగానే ఇచ్చే వుండాలి, చెల్లెలికి ప్రభుత్వోద్యోగం కూడా ఇచ్చే వుండాలి. అయినా రోగ్ ఆదుకుంటానని వేధిస్తూంటాడు. ఇంకా చాలా చేస్తూంటాడు. పెళ్ళయిన హీరోయిన్ ఇంటికి కూడా వెళ్లి భర్తకి, పోలీస్ కమీషనర్ అయిన ఆమె అన్నకీ ఆమె మీద గాసిప్స్ చెప్పి చెడగొట్టాలని చూస్తూంటాడు. టెంప్లెట్ ప్రకారం ఇంటర్వెల్ కి  ముందు విలన్ వచ్చే దాకా ఈ రోగ్ స్త్రీ ద్వేషిగా టైం పాస్ చేయాలి కాబట్టి- కామెడీ చేయరాక అరుస్తూ వుండాలి కాబట్టి, అడ్డొచ్చిన వాళ్ళని కొడుతూ వుండాలి కాబట్టి- ఇవన్నీ చేస్తూండగా, ఇక టైము చూసుకుని వచ్చేస్తాడు టెంప్లెట్ విలన్. 


         వీడు సైకో. హీరో రోగ్ అయితే, విలన్ సైకో. ఈ సైకోకి ఇంకా హీరోయిన్ కన్పించాలి కాబట్టి అప్పటి దాకా రోగ్ తో దోస్తానా చేస్తూంటాడు. హీరోయిన్ కన్పించగానే  టెంప్లెట్ ప్రకారం కామెడీగా వెంటపడతాడు. ఈ కామెడీ సైకోతో ఆమెకి కథ వుంది. క్లాస్ రూమ్ లో వీడు ఒకమ్మాయిని కాల్చి చంపాడు. అప్పుడు పెట్రోలు పోసుకుని వున్న వీణ్ణి లైటర్ తో అంటించేసి చంపాలనుకుంటుంది హీరోయిన్. కానీ చేతిలో ఆ లైటర్ వెల్గించి పట్టుకుని ఆ పనే చెయ్యదు. ఫ్రెండ్ చస్తే చచ్చింది, నేనెందుకు వీణ్ణి చంపి జైలుకి పోవాలనుకుందో ఏమో- అలాగే ముందు ముందుకు వెళ్తూంటుంది లైటర్ తో. వాడి మీదికి విసిరేస్తే వాడే భస్మీ పటలమైపోతాడు. కానీ ఆ పనే చెయ్యదు. సైకో కూడా గట్టిగా వూదితే ఆరిపోయే లైటర్ కి భయపడతాడే గానీ, వూదేసి పారిపోవాలనుకోడు. పోలీసులు వచ్చే దాకా లైటర్ ని చూస్తూ భయపడుతూ స్టూడెంట్స్ చేత తన్నులు తిని, పోలీసులకి దొరికిపోతాడు. ఇప్పుడు జైలు నుంచి తప్పించు కొచ్చి హీరోయిన్ పని బడుతున్నాడన్న మాట. 

        ఇదీ విషయం. ఇక వీణ్ణి ఎదుర్కొని హీరోయిన్ని కాపాడుకోవాలి రోగ్. ఈ రీసైక్లింగ్ కథ కాదుగానీ, దీంతో పూరీ పడ్డ పాట్ల గురించే చెప్పుకోవాలి. ఎలాగైనా దీన్ని నిలబెట్టాలన్న ఆదుర్దా, ఆందోళనలే ప్రతీ చోటా కన్పిస్తాయి. ఏం చేస్తున్నాడో తనకే తెలీనట్టు ఎడాపెడా అర్ధం లేని సీన్లు వచ్చిపడుతూంటాయి. సెకండాఫ్ లో ఇదెక్కువై పోతుంది. అప్పటికప్పుడు సెట్లో సీన్లు రాసుకున్నారన్నట్టు తయారవుతుంది. పోనూ పోనూ పూర్తిగా అదుపుతప్పి పోతుంది. తనకి హీరోయిన్ దక్కకుండా చేస్తున్నారని ఊళ్ళో ఆడవాళ్ళందర్నీ సైకో కిడ్నాప్ చేయడం, కానిస్టేబుల్ కి కాళ్ళు తెప్పించే  ఆపరేషన్ కోసం రోగ్ కి పది లక్షలు కావాల్సి వచ్చి సైకో సాయమే తీసుకోవడం, ఆ సైకో ఏకంగా దోపిడీలే చేయడం....ఏమిటో,  కథంటే ఎలా అంటే అలా నరుక్కు పోతూంటే ఎక్కడో దార్లో పడకపోతుందా అన్నట్టు- సిల్వర్ స్క్రీన్ మీదే సినిమా చూపిస్తూ పూరీ రఫ్ కాపీ రాసుకుంటున్నట్టు వుంటుంది... ఈ ‘రోగ్’ రఫ్ కాపీయే. దీన్ని చక్కదిద్ది ఫైనల్ కాపీ ఎప్పుడు చూపిస్తారో. ఫైనల్ కాపీయే  ఇంకో కథగా, ఇంకో టెంప్లెట్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు. 

          ఇలా తను టెంప్లెట్ నుంచి బయటపడ్డానని అన్పించుకోవడానికి, టెంప్లెట్ కే కొత్త రూపం తొడిగి మభ్యపెట్టబోతే ఫలితాలు డిటో గానే వచ్చాయి. టెంప్లెట్స్ రాయకుండా పూరీ స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకున్నప్పుడు ఫలితాలు వేరేగా వుంటాయి. అన్నట్టు పూరీ స్క్రీన్ ప్లే ఎప్పుడు రాసినట్టు? అసలు ఒక్క స్క్రీన్ ప్లే రాయకుండా రెండు దశాబ్దాలు చెలామణీ అవడం రికార్డే. 

         ఐతే ఈసారి టెంప్లెట్ కి స్టార్ ఎట్రాక్షన్ లేకుండా పోయింది. కన్నడ వ్యక్తిని హీరోగా పరిచయం చేస్తూ  స్టార్ ఎట్రాక్షన్ లేని లోపంతో సతమతమవాల్సి వచ్చింది. కొత్త హీరో ఇషాన్ ఫైట్లు డాన్సులు బాగా చేయడం గొప్పేం కాదు. ఈ రోజుల్లో అవి లేకుండా తెరంగేట్రం చేయలేరు. నటన ఎంతన్నదే పాయింటు. తనలో గనుక నటుడే వుంటే, నటనకి ఏమాత్రం అవకాశమివ్వని ఈ ‘రోగ్’ బ్యాడ్ ఆప్షనే తనకి. నటనంటే అరుపులు అరవడమే, లంగ్ పవర్ చూపడమే అని పూరీ అనుకుంటే, తన ద్వారా పరిచయమయ్యే హీరోల కెరీరే ప్రారంభం కాదు. 

          హీరోయిన్లు ఏంజెలా
క్రిస్ లిన్ స్కీ , మన్నారా చోప్రా లు ఎందుకున్నారో వున్నారు. అలీ, అతడి గ్రూపు బెగ్గర్ కామెడీ నీరసంగా వుంది. సైకో అనూప్ సింగ్ హీరో కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ,  రూపాయికి రూపాయిన్నర శ్రమని అమ్ముకున్నాడు. చాలా రోజులకి కన్పించిన సుబ్బరాజు ఎన్ కౌంటర్ స్పెషలిస్టు టెంప్లెట్ పాత్రలో ఏమీ చేయకుండానే వుం డిపోయాడు. రోగ్ గారి మాతృమూర్తిగా తులసిది అయోమయం పాత్ర. 

          పూరీ చేతిలో మంచి స్క్రిప్టు లేకపోయినా ముఖేష్ జి రూపంలో మంచి కెమెరా మాన్ దొరకడం అదృష్టం. స్క్రిప్టు విషయంలో తను అవుట్ డేటెడ్ గా వుంటే,  ఆ కెమెరా మాన్ కి అన్యాయం చేయడమే అవుతుంది. చిరిగిన చొక్కా మీద కోటేసుకున్న చందాన తను టెక్నీషియన్ లని వాడుకోవడం ఇకనైనా మానుకుంటే మంచిది. అలాగే సునీల్ కాశ్యప్ సంగీతాన్ని ఆస్వాదించాలంటే సినిమాకో అర్ధంపర్ధం కూడా వుండాలిగా.

          పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభించిన రోజున ప్రేక్షకులు తిరిగి రావడం ప్రారంభిస్తారు తన సినిమాలకి. ఈ సంవత్సరం ఈ మూడు నెలల్లో ‘రోగ్’ తో కలిపి ‘కాటమ రాయుడు’, ‘విన్నర్’, ‘మా అబ్బాయి’, ‘నేనోరకం’, ‘గుంటూరోడు’ అనే ఆరు  టెంప్లెట్ సినిమాలు వస్తే  అరింటినీ నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టారు క్లాస్ మాస్ ప్రేక్షకులందరూ. ఇప్పటికైనా టెంప్లెట్ ని మూసిపెట్టుకుంటారా? ఇలాగే  కోటాను కోట్లు పోగొట్టుకుంటూ వుంటారా? 

-సికిందర్
cinemabazaar.in