రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, ఆగస్టు 2014, గురువారం

సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
ఐదేళ్ళలో అంతా డిజిటల్ మయం!
కెమెరామాన్ ఎస్.గోపాలరెడ్డి 


మనమిప్పుడు డిజిటల్ టెక్నాలజీ ముఖద్వారంలో సవాలక్ష సందేహాలతో నిలబడి వున్నాం. 



       ఐతే  1970 లలో సస్పెన్స్ బ్రహ్మ అని పిలుచుకునే ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్  ‘ఫ్యామిలీ ప్లాట్’ అనే సినిమాని రంగుల్లో తీస్తూ, ఆ కొత్త టెక్నాలజీని కథ చెప్పే టెక్నిక్ కి అర్ధవంతంగా వాడుకుని టెక్నాలజీకే తాత అన్పించుకున్నాడు. రెండే రెండు దృశ్యాలు  –ప్రారంభంలో గోల్ఫ్ కోర్సు సీనులో గాఢమైన రంగుల్ని వాడుకుని బీభత్స రస స్థాయిని ఉన్నతీకరించాడు. ఆ తర్వాత ముగింపులో కారు తగలబడే దృశ్యంలో భావోద్రేకాల మీద రంగుల ప్రభావాన్ని గుర్తెరిగి, వాటితో అలజడి సృష్టించాడు. ఈ రెండు చోట్ల తప్పిస్తే, మిగతా సినిమా అంతా కథకి తగ్గ మూడ్ ని కాపాడేందుకు మాత్రమే రంగుల్ని వాడుకున్నాడు. కొత్త టెక్నాలజీని సృజనాత్మకంగా ఎలా వినియోగించుకోవాలో తెలిస్తే, ఏ కొత్త ఆవిష్కరణా భయపెట్టదు.


          సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల రెడ్డి కూడా ఈ కోవకే చెందుతారు. సీనియారిటీతో  సొంతమయ్యే ఆస్తేమిటంటే, సాధికారత! ఈ సాధికారత అనే సంపదతో సీనియర్లు ముందడుగు వేయకపోతే,  ఇతరులు వృత్తిపరమైన సందేహాలతో మిగిలిపోతారు. అందుకే గోపాల రెడ్డి ఏకంగా ఓ బిగ్ కమర్షియల్ సినిమాకి డిజిటల్లో చిత్రీకరణ జరపడానికి పూనుకున్నారు. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా తో నిర్మిస్తున్న- ‘వస్తాడు నా రాజు’ కి  ఆయన చకచకా చిత్రీకరణ చేసుకుపోతూంటే, ఇతర కెమెరామెన్లు ఆసక్తితో ఆయనకు ఫోన్లు చేస్తున్నారు. డిజిటల్ తో వున్న సులువేమిటో తమకూ చెబితే ఆ ప్రవాహంలో తామూ దూకుతామని తొందర పెడుతున్నారు. ఈ సినిమా విడుదలయ్యే వరకూ ఓపికపట్టి, స్వయంగా పరిశీలించుకుని ముందడుగు వేయాల్సిందిగా  గోపాలరెడ్డి హితవు చెబుతున్నారు.ఇంటర్వ్యూకి సంభాషణ ప్రారంభించడమే – “ఇంకో ఐదేళ్ళ తర్వాత ముడి ఫిలిం ఉండదు!”- అంటూ పంచ్ ఇచ్చారు గోపాల రెడ్డి. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా తెలుగు సినిమాల భవిష్య (డిజిటల్) యానాన్ని వివరించుకొచ్చారు.
      

       “రంగుల సినిమా అరవై ఐదేళ్ల ప్రస్థానంలో రంగుల బొమ్మల్ని కంటికి చేరువగా తీసుకొచ్చేందుకు విశేష కృషి జరిగింది. డిజిటల్ లోనూ కంటికీ - బొమ్మకూ కొద్దిగా ఎడం మిగిలి వున్నా, దాన్నీ పూడ్చే ప్రయత్నాలు తప్పక జరుగుతాయి. సాంప్రదాయ ఎనలాగ్ (ముడి ఫిలిం) కెమెరాలతో పనిచేసిన కెమెరా మెన్లు డిజిటల్ మీద పట్టు సాధించడం వాళ్ళ వాళ్ళ మేధస్సు మీద ఆధార పడి వుంటుంది. ఇప్పుడున్న రెడ్ ఒన్, వైపర్, డీ21, సోనీ వంటి అత్యాధునిక డిజిటల్ కెమెరాలని అంత తేలికగా తీసివేయలేం. అంత శక్తిమంత మైనవి అవి. వాటి సాంకేతిక ఔన్నత్యంతో సమానంగా మన మేధస్సుని పెంచుకోవాల్సి వుంటుంది. విష్ణు నటిస్తున్న సినిమాకి ఉపయోగిస్తున్నది రెడ్ కెమెరానే. దీని వాడకంలో  ఇబ్బందులేవీ ఎదురుకావడంలేదు, ఒక్క మనదేశ వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త వేడెక్కడం తప్ప. ఓ పది నిమిషాలు విశ్రాంతి నిస్తే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. లక్షలాది అడుగుల ముడి ఫిలింతో చేస్తున్న పనిని ఇది కొన్ని చిప్స్ తో సరిపెట్టేస్తుంది. ఇలా ఎంతో డబ్బు ఆదా అయినట్టే. ఇక నిర్మాణాననంతర కార్యక్రమాల్లో స్కానింగ్ తంతు కూడా పరిసమాప్త మవుతుంది. చెన్నైలో ఈ మార్పు లేప్పుడో వచ్చేశాయి. మన వైపు కూడా థియేటర్లు డిజిటల్ ప్రదర్శనలకి అనువుగా మారుతున్నాయి. కెమెరామెన్ల ఆత్మవిశ్వాసమే నిర్మాతల్ని, దర్శకుల్నీ, నటుల్నీ పూర్తిస్థాయి డిజటలీకరణ వైపు అడుగులేయిస్తుంది...” అన్నారాయన.
“మరి డీఐ (డిజిటల్ ఇంటర్మీడియేట్), గ్రాఫిక్స్ ల వంటి టెక్నాలజీలతో కెమెరామెన్ల రిలేషన్ షిప్ ఎలాటిది? ఈ రెండూ కూడా సినిమాటోగ్రఫీలో అంతర్భాగాలే కదా..” అని అడిగితే, కెమెరామాన్ పర్యవేక్షణ లేకుండా ఈ రెండూ పూర్తికావన్నారు గోపాల రెడ్డి. డీఐ తో ఎన్నో షూటింగ్ అనివార్యతల్ని అధిగమించ వచ్చన్నారు... “ఒక షాట్ తీస్తున్నప్పుడు కిటికీ లోంచి ఎండ పడుతోంటే మనం ఏమీ చేయలేకపోవచ్చు. అయితే తర్వాత డీఐతో ఆ ఎండని ఆ దృశ్యం లోంచి తొలగించుకో వచ్చు. లేదా కావాల్సిన తీవ్రతకి  మార్చుకోవచ్చు. ఇలాటి సదుపాయాలెన్నో డీఐతో వున్నాయి. ఓ బొమ్మ గీశాక బాగా అన్పించని భాగాల్ని రబ్బరుతో చెరిపేసి తిరిగి వేయడం లాంటిదే డీఐ కూడా!” అని వివరించారు.

        కొత్త టెక్నాలజీతో ఎవరి అర్హతలూ తగ్గిపోవని అభిప్రాయ పడ్డారు. అయితే సంతకాలు చె రిగిపోవా అన్నది మనకొచ్చే సందేహం. ఎలాగంటే, పూర్వం మనం చూసిన సినిమాల్లో వీ ఎస్సార్ స్వామి, పుష్పాల గోపీకృష్ణ, కన్నప్ప, అటు హిందీలో చూస్తే సుదర్శన్ నాగ్, పీటర్ ఫెరీరా లాంటి ఛాయగ్రాహకులెందరో వాళ్ళవైన ప్రత్యేకశైలులతో ఐడెంటిఫై అయ్యే వాళ్ళు. పేరు చూడకుండానే ఆ చిత్రీ కరణ  లెవరివో చెప్పగల్గే వాళ్ళం. ఇప్పుడొస్తున్న ఛాయాగ్రాహకుల పేర్లు చూస్తే తప్ప చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. డీఐతో రంగుల్నీ, వెలుగునీడల్నీ దిద్దుబాటు చేసుకుంటూ కెమెరామెన్ల సంతకాలు చెరిపి వేస్తున్నారన్న విమర్శ వుంది-దీనికే మంటారు గోపాల రెడ్డి?


       బొమ్మే చూసి ఫలనా కెమెరామాన్ అని ప్రేక్షకులు చెప్పలేరని ఆయన సమాధానం. ఒక చిత్ర పటంలో కుంచె విరుపుల్నిబట్టి ఆ చిత్రకారుడెవరో మరో చిత్రకారుడే చెప్ప గలడ న్నారు -  “ సినిమాల్లో లైటింగ్ చూసి నేను అది అశోక్ మెహతానా లేకపోతే సంతోష్ శివ న్నా చెప్పగల్ను, ఆడియెన్స్ చెప్పలేరు”-  అని స్పష్టం చేశారు. అయితే టెక్నాలజీతో  సంతకాలు గల్లంతవుతున్నాయన్న మాట మాత్రం నిజమేనని అంగీకరించారు రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్న ఏస్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాలరెడ్డి.



-సికిందర్

(అక్టోబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ )




సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 



వాస్తవికత లేని మిక్సింగ్ వృధా!



దేవీకృష్ణ కడియాల

(సౌండ్ ఇంజనీర్-రామానాయుడు స్టూడియో) 

తెలుగు సినిమాలన్నీ డీటీఎస్ మయమే! పోస్ట్ ప్రొడక్షన్ లో మా సినిమాకి డీటీఎస్ జరుగుతోందని చెప్పుకునే వాళ్ళే గానీ డోల్బీ జరుగుతోందని చెప్పే వాళ్ళెవరూ కన్పించరు!

దీనికి కారణం కడియాల దేవీకృష్ణ మాటల్లో, డోల్బీ ఖర్చూ, నిర్వహణా వ్యయమూ డీటీఎస్ తో పోల్చుకుంటే యాభై శాతం అధికంగా ఉండడమే. అయితే ఫిలిం అంచు మీద డీటీఎస్ టైం కోడ్ దెబ్బతింటే, సంబంధిత సౌండ్ డిస్కులు లాక్ అయిపోయే సమస్య వుంది. అలాంటప్పుడు ప్రింటు మీద విధిగా ముద్రించే మోనో ఆడియో ఫార్మాట్ ని రన్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు.

అది సరే, ఒకవిమానం ఎగురుతూంటుంది. తెర మీద కుడి పక్కకో, ఎడం పక్కకో టేకాఫ్ తీసుకుని, మన నడి నెత్తి మీద నుంచి గయ్యి మని దూసుకెళ్తుంది. అప్పుడు థియేటర్ సీలింగ్ లో స్పీకర్లే వుండవు. అయినా చెవులు చిల్లులు పడే శబ్దం పైనుంచే వస్తుంది. ఇదెలా సాధ్యం?


రామానాయుడు స్టూడియోలో డీటీఎస్ మిక్సింగ్ హెడ్ గా వున్న దేవీక్రుష్ణ దీనికిచ్చిన వివరణ ఏమిటంటే - ఈక్యూ (ఈక్విలైజేషన్ కంట్రోల్) చూసుకుని, పిక్చర్ సౌండ్ ని ఎలా అడుగుతోందో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ స్టేజి (తెర వెనుక కుడి, ఎడమ, మధ్యమ స్పీకర్స్) లో పెట్టుకుని, సరౌండ్స్ ( హాల్లో కుడి వరస, ఎడమ వరస, వెనుక వైపూ వున్న స్పీకర్స్) లో తగ్గించుకుని, బ్యాలెన్స్ చేస్తూ పోతే,  పైన చెప్పుకున్న శబ్ద ఫలితాన్ని మనం అనుభవిస్తాం.

మన దగ్గర ఇదంతా డిజైనర్ (రూపకల్పన చేసిన)సౌండ్. అదే విదేశాల్లోనైతే లైవ్ రికారింగ్ వుంటుంది. ఎలాటి శబ్దాలనైనా లైవ్ గా రికార్డ్ చేసి పట్టుకొస్తారు. నటీనటులడైలాగుల్ని కూడా షూటింగ్ సమయంలోనే శక్తివంతమైన మైక్రోఫోన్స్ తో రికార్డు చేసి, దాన్నే మిక్సింగ్ లో వాడుకుంటారు. అక్కడ మనలాగా వేరే డబ్బింగ్ అనేది వుండదు. దీనివల్ల నటనలో లీనమైన వాళ్ళ భావోద్వేగాలన్నీ లైవ్ గా వాళ్ళ గొంతుల్లోంచే వచ్చి సహజత్వం వస్తుంది. అదే తెర మీద నటనని చూస్తూ డబ్బింగ్ చెప్తే రాదు. ఇక మన సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్సు గురించి చెప్పాలంటే, కీబోర్డు నుంచి అన్ని వాద్యపరికరాల బాణీల్ని  సృష్టించగల్గి నట్టే, హాలీవుడ్ సినిమాల్లోంచి తీసి సీడీలుగా తయారు చేసిన  సౌండ్ ఎఫెక్ట్సు నే  వాడతారు. విమాన శబ్దమైనా, గన్ షాట్స్ అయినా, ఇంకేదైనా ఈ సీడీల్లోని ప్రీ రికార్డెడ్ –డిజైనర్ సౌండ్ ఎఫెక్ట్స్ నుంచే తీసి వాడుకుంటారు.  

పై విషయాలన్నీ చెప్పుకొస్తూ, అసలు ఆడియోని స్క్రిప్టు దశలోనే డిజైన్ చేసుకుంటే అత్యత్తమ ఫలితాలొ స్తాయంటారు దేవీకృష్ణ. ఎంతవరకూ హీరో అడుగుల చప్పుడుండాలి, ఎక్కడ్నించీ రీరికార్డింగ్ ప్రారంభం కావాలీ మొదలైన శబ్ద విన్యాసాలు ఆడియో సెన్స్ తో ముందే నిర్ణయించుకుని షూటింగ్ జరుపుకుంటే, ప్రేక్షకులకి కల్గించే ఆ థ్రిల్లే వేరంటారు.

ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడమనేది దేవీకృష్ణ యూనిక్ సెల్లింగ్ పాయింటేమే అన్పిస్తుంది, ఆయన మాటల్ని వింటూంటే.  శబ్దాన్ని రసాత్మకంగా ఆవిష్కరించే సీనియర్ సౌండ్ ఇంజనీర్ పి.మధుసూదన్ రెడ్డికి ఈయన ప్రియ శిష్యుడు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం కి చెందిన ఈయన అక్కడే ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా పూర్తి చేశాక,  నేరుగా వచ్చి రామానాయుడు స్టూడియోలో  చేరిపోయారు. అనుభవంతో సౌండ్ ఇంజనీరింగ్ ని నేర్చుకున్నారు. 1998లో రికార్డింగ్ శాఖలో చేరి, 2001 కల్లా అదే రామానాయుడు స్టూడియోలో  డీటీఎస్ కి పి మధుసూదన్ రెడ్డికి అసిస్టెంట్ అయ్యారు. 2009 లో డీటీఎస్ హెడ్ గా ప్రమోటయ్యి , మొదటి సినిమాగా ‘రైడ్’ చేశారు. ప్రస్తుతం ‘బావ’,చంద్రముఖి-2’ సినిమాలకి పని చేస్తున్న ఈయన ఇప్పటి వరకు 25 సినిమాలు పూర్తి చేశారు. ‘అది నువ్వే’ ఇటీవలే విడుదలైన సినిమా.


ఎప్పుడైనా ఏదైనా సన్నివేశంలో, సంగీత దర్శకుడు చేసిన రీ- రికార్డింగ్  ట్రాక్ అవసరం లేదన్పించవచ్చు. అలాంటప్పుడు మీరేం చేస్తారన్న ప్రశ్నకి- ఆ సినిమా దర్శకుడ్ని కన్విన్స్ చేసి, కంటిన్యూటీ దెబ్బ తినకుండా, జర్క్ లేకుండా తీసేస్తా మన్నారు. ఎఫెక్ట్స్ తో త్రిల్ కల్గించడమే ప్రధానమైతే, రసాస్వాదన ఎలా కుడుర్తుందని అడిగితే - అలాటి సన్నివేశాలుంటే వాటి ఫీల్ చెడకుండా జాగ్రత్త తీసుకుంటా నన్నారు. ఏ ఫీల్ కైనా ప్రత్యేకించి వాస్తవికతని దృష్టిలో పెట్టుకుంటా నన్నారు.

అయితే విడుదలకి పదిరోజుల ముందు హడావిడిగా వచ్చేసి  సినిమాలు అప్పగిస్తారనీ, దాంతో నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు పనిచేయాల్సి వస్తుందనీ, ఎంత చేసినా ఈ పనిలో ఆనందమే వేరనీ చెప్పుకొచ్చారు. కొన్ని సార్లు రిలీజ్ టెన్షన్ వల్ల  సినిమాని విభజించి  నాల్గైదు చోట్ల డీటీఎస్ కిస్తారన్నారు.
తను చేసే డీటీఎస్ మిక్సింగ్ తో బాధ్యత తీరిపోయిందనుకోకుండా, అ సినిమా ప్రివ్యూల్లోనూ, థియేటర్ల లోనూ ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్ళ స్పందన కూడా విధిగా తెలుసుకుంటానన్నారు దేవీ కృష్ణ.


***
సినిమాల్లో శబ్దాన్ని మోనో అవస్థల నుంచి డోల్బీ, డీటీఎస్ కంపెనీలు  5.1 మల్టీ ఛానెల్ సిస్టంతో విముక్తి కల్గించాక, మరి కొంచెం ముందుకు సాగి, 6.1, 7.1  వెర్షన్స్ తో వైవిధ్య శీలతని ప్రదర్శించాయి. తాజాగా సోనీ సంస్థ రంగప్రవేశం చేస్తూ, ఏకంగా 8.1 ఎస్ డీడీ ఎస్ ( సోనీ డైనమిక డిజిటల్ సౌండ్ తో) తో ఆసక్తి రేపింది. కానీ ఇవేవీ సౌండ్ ఇంజనీర్లతో క్లిక్ కాలేకపోయాయి. ఒక్క 5.1 సిస్టం తప్ప. ఇది ఇచ్చే కిక్కే వేరంటారు వాళ్ళు. అయినా ఈ కంపెనీ లన్నీ కలిసి ఆడియో ఫార్మాట్ ని ఫిలిం రీలు అంచు మీద ఎలా పంచుకున్నాయో ఈ ప్రక్కన పటం లో చూడవచ్చు..


-సికిందర్
(అక్టోబర్, 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

(PS : పై ఇంటర్వ్యూలో 5.1, 6.1,7.1, 8.1 సౌండ్ సిస్టమ్స్  అని సాంకేతిక పదాలు దొర్లాయి. వీటి అర్ధమేమిటో వేరే సౌండ్ ఇంజనీర్ల  ఇంటర్వ్యూల్లో త్వరలో తెలుసుకుందాం)