రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

1165 : రివ్యూ!


రచన - దర్శకత్వం : విఘ్నేష్ శివన్
తారాగణం : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, రెడిన్ కింగ్స్ లే, కాలా మాస్టర్ తదితరులు.
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదీర్, విజయ్ కార్తీక్ కణ్ణన్
బ్యానర్ : రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
నిర్మాతలు : విఘ్నేష్ శివన్, ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల : ఏప్రెల్ 28, 2022
***
        మిళంలో కాతువాకుల రెండు కాదల్ (పిల్ల గాలిలో రెండు ప్రేమలు) తెలుగులో కె ఆర్ కె (కన్మణి, రాంబో, ఖతీజా) గా విడుదలైంది. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ఆకర్షించే తారాగణం. సమంత పుట్టిన రోజు ఏప్రెల్ 28 న విడుదల. ఈ శుభ సందర్భంగా ఈ ముగ్గురితో ముక్కోణపు ప్రేమ కథ ప్రాణం పోసుకుంది. ప్రాణం పోసుకున్నాక పోషించే బాధ్యత 4 సినిమాల దర్శకుడు విఘ్నేష్ శివన్ తీసుకున్నాడు.

        పాపులర్ తారాగణానికి విఘ్నేష్ పేరు తోడై మూవీకి ఓ క్రేజ్ ఏర్పడింది. కారణం అజిత్ తో ఏకే 62 యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహించబోతున్నాడు. సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ తో తానే నిర్మాతగా ఇంకో నిర్మాతతో భాగస్వామ్యంలో ఈ ముక్కోణ ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించాడు. అయితే నిర్మించడానికి ఏమైనా విషయముందా, లేక ముగ్గురు పాపులర్ తారల్ని వెండి తెర మీద అటూ ఇటూ తిప్పి కేవలం గ్లామర్ షోగా మార్చేశాడా? ఇది తెలుసుకుందాం... 

కథ

పుట్టగానే రాంబో (విజయ్ సేతుపతి) తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయింది గాక తను తల్లితో వుంటే ఆమె ఆరోగ్యం చెడుతూ వుంటుంది. దీంతో దురదృష్ట జాతకుడుగా పేరు పడి మళ్ళీ తిరిగి రాకుండా ఎటో వెళ్ళిపోతాడు. పగలు క్యాబ్ నడుపుతాడు, రాత్రిళ్ళు బార్ లో బౌన్సర్ గా పని చేస్తాడు. పబ్ లో కన్మణి (నయనతార) పరిచయమై రాత్రి ప్రేమాయణం  ప్రారంభిస్తుంది. ఈ ప్రేమాయణాన్ని ఎంజాయ్ చేస్తూ వుండగా ఖతీజా (సమంత) పరిచయమై పగటి  ప్రేమాయణాన్ని ప్రారంభిస్తుంది.

        ఈ ప్రేమాయణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ వుండగా పెళ్ళి మాట వస్తుంది. పెళ్ళి మాట రాగానే డిస్ససోటివ్ డిజార్డర్ అనే మానసిక రోగాన్ని నటించడం మొదలెడతాడు. ఎవర్ని పెళ్ళి చేసుకోవాలో తేల్చుకోలేక మానసిక రోగాన్ని నటిస్తున్న రాంబోతో పెళ్ళి కథ ఏమయిందన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ

రెండు గంటల 40 నిమిషాల ఎడ తెరిపిలేని టార్చర్ ఈ ట్రాయాంగులర్ లవ్. పిల్లగాలిలో రెండు ప్రేమలు కాదు, వడగాలిలో రెండు వడదెబ్బలు. ముక్కోణ ప్రేమ సినిమాలు ముల్లోకాలు నిండిపోయేంత వచ్చాయి. ఇద్దర్ని ప్రేమించిన, లేదా ఇద్దరు హీరోయిన్లు ప్రేమిస్తున్న హీరో ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడన్న సిల్లీ కథల సినిమాలతో తలపండిపోయారు ప్రేక్షకులు. ఇంకా మభ్యపెట్టబోతే శృంగభంగం తప్పదు.

        ఈ ట్రాయాంగులర్ రోమాంటిక్ కామెడీ పేరుకే. ప్రేమించడం రాకపోయినా, నవ్వించడమూ చేతగాలేదు. అసలు విజయ్ సేతుపతిలో ఏం చూసి నయనతార, సమంతలు ప్రేమిస్తారో అర్ధం గాదు. అతను మానసిక రోగాన్ని నటిస్తున్నాడని తెలుసుకోక అతడికోసం సిగపట్లకి దిగే చిల్లర వ్యవహారం కూడా అర్ధం గాదు. కేవలం ఈ ముగ్గురు స్టార్ల ని గ్లామర్ షోకి వాడుకోవడం తప్పితే మరేమీ లేదు. ఏ గ్రేడ్ స్టార్స్ కి సి గ్రేడ్ కథ అంటగట్టి సినిమా అయిందన్పించాడు దర్శకుడు. ఈ సినిమాని ఈ ముగ్గురు స్టార్లు ఎలా ఒప్పుకున్నారో ఇంకో అర్ధంగాని విషయం.

నటనలు- సాంకేతికాలు

విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే. ట్రయాంగులర్ రోమాంటిక్ కామెడీ అంటేనే బోలెడు ఫన్. ఈ ఫన్ లేని లోటు అతనెందుకు తెలుసుకో లేదో తెలీదు. కామెడీ పేరుతో సిల్లీ డైలాగులతో  మనం తెల్లబోయేట్టు చేశాడు. మానసిక వ్యాధి నటించే ఎపిసోడ్స్ తో నవ్వించక పోగా నిద్ర పుచ్చాడు. సమంతని వేధిస్తున్న వాణ్ణి కొట్టే సీనులో బీస్ట్ గా మారి పోయి ఓవరాక్షన్ చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, విషయం లేక ఆచార్య ఎంత డొల్లగా వుందో, విజయ్ సేతుపతితో కె ఆర్ కె అంత బోలుగా వుంది.

        హీరోయిన్లు నయనతార, సమంతలు గ్లామర్ షో కోసమే నిండు అందచందాలతో వున్నారు. పాత్రలేమిటో చూసుకోలేదు, నటనలు పట్టించుకోలేదు. నాయన తార  ఓ చిన్న సేల్స్ గర్ల్, సమంత నిరుద్యోగి. అయినా అంత ఖరీదైన కాస్ట్యూమ్స్ తో -  ప్రేక్షకులు నవ్విపోతే మాకేటి సిగ్గనట్టు ప్రవర్తించారు. అసలు విజయ్ సేతుపతి కోసం జుట్లు పట్టుకుని కొట్టుకునే పాత్రలకి మాన మర్యాదలేమిటన్నట్టు కూడా దర్శకుడి కంటే రెండాకులు ఎక్కువే చదివి తలంటు పోశారు ప్రేక్షకులకి.

       అనిరుధ్ రవిచందర్ ఏం పాటలిచ్చాడో అలా ఇవ్వడానికి కారణముంది. రొడ్డ కొట్టుడు సినిమాకి ఇంతకంటే తగ్గట్టు పాటలెలా ఇవ్వగలడు. పాటలిలా వున్నాయేమిటని సదరు ముగ్గురు స్టార్ల మనోభావాలు కూడా దెబ్బతిననట్టున్నాయి. కెమెరా మాన్ బాగా చూపించినందుకు మాత్రం సంతోషించి వుంటారు.

        దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా పాత మోడల్ సినిమా తీస్తూ తెలుగు తమిళ భాషల్లో నవ్వుల పాలయ్యాడు ఈ నవ్వించని సినిమాతో. వరుసగా తమిళ దర్శకులిస్తున్న అట్టర్ ఫ్లాపు సినిమాలు చూస్తూంటే ఇక తమిళ టాలెంట్ ఒకప్పటి మాటే అనుకుని సరిపెట్టుకోవాలి.

సికిందర్

1164 : రివ్యూ!



రచన – దర్శకత్వం : కొరటాల శివ
తారాగణం : చిరంజీవి, రామ్ చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్, జిశ్శూ సేన్ గుప్తా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మణిశర్మ
, ఛాయాగ్రహణం :
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
విడుదల : ఏప్రెల్ 29
, 2022

***

        దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందు కొచ్చారు. కోవిడ్ వల్ల ఆచార్య నిర్మాణం, విడుదల ఆలస్యమై అభిమానులు అల్లాడిపోయారు. అభిమానుల్ని ఊరడించడానికి పాటలు, ట్రైలర్స్ విడుదల చేస్తూ అభయమిచ్చారు. పాటలు ఊరడించినా, చివరి ట్రైలర్ ఉస్సూరనిపించింది. ట్రైలర్ కమర్షియల్ గా లేకపోవడం అలా వుంచితే, విషయం కూడా లేక చప్పగా వుంది. అయితే ట్రైలర్ లో విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచామనీ, అది సినిమాలో రివీల్ అవుతుందనీ దర్శకుడు కొరటాల శివ విచిత్ర వివరణ. ట్రైలర్ లో విషయం లేకపోతే బుకింగ్స్ సవ్యంగా వుంటాయా అన్నది ప్రశ్న.

        నిస్సందేహంగా బుకింగ్స్ డల్ గా వున్నాయి. ట్రైలర్ చూసి విషయం లేదని పసిగట్టేశారా ప్రేక్షకులు? మెగా స్టార్ చిరంజీవి, మెగా రాక్ స్టార్ రామ్ చరణ్ తండ్రీ కొడుకులు కలిసి తొలిసారిగా వెండితెరని పావనం చేస్తూంటే ఎందుకీ పరిస్థితి? దారుణంగా 1.5, అంటూ 2 అంటూ రేటింగ్స్ ఎందుకు పడుతున్నాయి? ఇంత మెగా దురదృష్టం ఎందుకు ప్రాప్తించింది? తెలుసుకుందాం...

కథ

    మునిసిపల్ ఛైర్మన్ బసవ (సోనూసూద్) ప్రసిద్ధ ఆలయమున్న ధర్మస్థలి అనే గ్రామాన్ని రాథోడ్ (జిశ్శూ సేన్ గుప్తా) కి ధారాదత్తం చేసేందుకు సిద్ధమవుతాడు. ఈ గ్రామాన్ని పాదఘట్టం అనే ఇంకో గ్రామపు గిరిజనులు కాపాడుతూంటారు. ధర్మస్థలిని ఆక్రమించేందుకు బసవ దుర్మార్గాలు  పెరిగిపోవడంతో నక్సల్ ఆచార్య (చిరంజీవి) రంగప్రవేశం చేస్తాడు. ఆచార్యతో సిద్ధ (రామ్ చరణ్) కలుస్తాడు. ఎవరీ సిద్ధ?  ఆచార్యతో అతడికున్న సంబంధమేమిటి? వీళ్ళిద్దరూ కలిసి ధర్మస్థలిని  ఎలా కాపాడారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
    పూర్వం రావు గోపాలరావు విలన్ గా గ్రామ కక్షల సినిమాలు ఆనాటి అందరు హీరోలతో వచ్చాయి. వాటినే రీసైక్లింగ్ చేసి ఒక సమకాలీన మార్కెట్ యాస్పెక్ట్ లేని, వర్తమాన బాక్సాఫీసు ఫ్రెండ్లీ కాని, యూత్ అప్పీల్ కూడా లేని, అరిగిపోయిన పాత మూస ఫార్ములా ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇది తక్షణం బెడిసికొట్టింది.

        దేవాలయాలకి సంబంధించిన కథ మెగాస్టార్ తో వూహిస్తే హైకాన్సెప్ట్ మహోజ్వల గాథవ్వాలి నిజానికి. అంతకి తగ్గించి ఓ గ్రామం, అక్కడో గుడి, దాంతో ఓ మునిసిపల్ ఛైర్మన్ అక్రమాలనే చిన్న హీరోల స్థాయికి కథని కుదిస్తే, మెగా స్టార్ కి అన్యాయమే అవుతుంది.

        కేవలం వ్యక్తి అక్రమాలు మెగాస్టార్ కి చాలవు, పై స్థాయిలో ప్రభుత్వ/వ్యవస్థ  అక్రమాలై వుంటే సమవుజ్జీగా, లెవెల్ గేమ్ ప్లేయింగ్ గా వుంటాయి. దీనికి బదులు కథ చిన్నది కావడంతో, అదీ బలహీనంగా చెప్పడంతో,  మెగా స్టార్ కి నిజమైన బాక్సాఫీసు పని లేకుండా పోయింది...

నటనలు - సాంకేతికాలు

    ముందుగా, చిరంజీవి ఆచార్య నక్సల్ పాత్ర చాలా పేలవంగా వుందని చెప్పక తప్పదు. ఎమోషనల్ అప్పీల్ అనేదే  లేదు. పాత్ర తీరు యాంత్రికంగా, కృత్రిమంగా వుంది. కథలో విషయం లేనప్పుడు పాత్రకి బలం ఎలా వస్తుంది. పోనీ విషయం లేనప్పుడు కామెడీ, రోమాన్సులతో ఎంటర్టయిన్ చేయొచ్చు. ఇది కూడా లేదు. చిరంజీవికి హీరోయిన్ లేదు. ఒక గ్రూప్ సాంగ్, రామ్ చరణ్ తో ఇంకో సాంగ్ తప్ప ఫ్యాన్స్ కి హుషారు తెప్పించే సందర్భాలు లేవు. పేలవమైన కథా కథనాల వల్ల ఫైట్స్ కి సందర్భ బలం కూడా లేదు. రామ్ చరణ్ తో కలిసి క్లయిమాక్స్ ఫైట్ అయితే, సాగదీసి సాగదీసి సాగుతూనే వుంటుంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయేలా.

        చిరంజీవి ఫిజిక్, లుక్ ఇవి బావున్నాయి. తను ఇంత బావున్నప్పుడు తానేం డిమాండ్ చేసి తీసుకున్నాడు దర్శకుడి నుంచి? ఏమీ లేదు. కథే చిరంజీవిని డిమాండ్ చేయడం లేదు. ఎంతంటే, రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చే ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ సహన పరీక్ష పెట్టేంతగా. ఫస్టాఫ్ చిరంజీవితో ఇంత బోరు కొడుతుందని వూహించం. తను నటించిన ఏ సినిమాలోనూ ఇలా జరగలేదు. కాకపోతే బయట ఎండలు మండిపోతున్నాయి కాబట్టి థియేటర్లో ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తూ కూర్చోగలం. మంచి డైలాగులు, ఫన్నీ డైలాగులు, బలమైన డైలాగులు, మాస్ పంచ్ డైలాగులు  కూడా లేవు. ఇది ట్రైలర్స్ లోనే బయటపడింది.

        ఇక రామ్ చరణ్ ఇంటర్వెల్లో ఎంట్రీ ఇచ్చి సెకండాఫ్ నైనా కాపాడతాడనుకుంటే అదీ లేదు. పూజా హెగ్డే తో రోమాన్స్ కూడా పాతబడిన వ్యవహారమే. పూజా హెగ్డే కి ప్రాధాన్యమేమీ లేదు, పాటలు, రోమాన్స్ తప్పితే. వరసగా తనకి రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య ఫ్లాప్సే.

        సోనూ సూద్, జిశ్శూ సేన్ గుప్తాల విలనీ, నటనలు అవే మూస టెంప్లెట్లు. ఇతర సహాయ నటుల గురించి చెప్పుకోవడాన్నికేమీ లేదు.

        భారీగా ఖర్చు పెట్టిన ప్రొడక్షన్ విలువలు తప్పితే, మణిశర్మ సంగీతంలో పాటలు (ఓ రెండు తప్ప) కూడా వూపు తీసుకురాలేదు. రామ్ లక్ష్మణ్ ల పోరాటాలైతే సందర్భం తక్కువ సందడి ఎక్కువన్నట్టున్నాయి. కొరటాల శివ దర్శకత్వం దారుణం. కోవిడ్ కాలంలో తీశారు కాబట్టి మేకింగ్ డిస్టర్బ్ అయిందా అనుకోవడానికి లేదు. కోవిడ్ విరామాల్లో స్క్రిప్టు లోపాల మీద దృష్టి పెట్టినట్టు లేదు- రామ్ చరణ్ కొరటాల శివ సహ రచయిత!

చివరికేమిటి

    ట్రైలర్ లో విషయం లేకపోవడానికి సంబంధించి కొరటాల ఇచ్చిన వివరణ - ఉద్దేశపూర్వకంగా ట్రైలర్ లో విషయం దాచామనీ, అది సినిమాలో రివీల్ అవుతుందనీ చెప్పడం సరైంది కాదు. సినిమాలో విషయమనేదే  లేదు. ఫస్టాఫ్ కబ్జాదార్లు, సెకండాఫ్ నక్సల్ ఫ్లాష్ బ్యాకు - అని  పెట్టుకున్న స్కీములో విషయమే లేదు.

        వీటికి చూపించిన దృశ్యాలన్నీ  ఒరిజినాలిటీ లేని ఇదివరకు ఎన్నో సినిమాల్లో వచ్చేసిన టెంప్లెట్ సీన్లే. ఓ పది పాత సినిమాలు ఒకే చోట చూస్తున్నట్టు వుంటుంది. ఎక్కడా సస్పెన్స్, టెన్షన్, థ్రిల్, ఫీల్ తో కూడిన సీన్లే లేవంటే - ఈ  బిగ్ బడ్జెట్ మూవీని ఏ ధైర్యంతో తీసి వుంటారో.

        చిరంజీవి- రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దర్నీ కలిపి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకుల కోరిక కూడా తీరే విధంగా లేదు. ఇద్దరూ కలిసి వున్న సీన్లు కూడా పేలవంగా వున్నాయి- ఇద్దరూ కలిసి స్టెప్పు లేసిన ఓ పాటతప్ప- మినిమమ్ మల్టీ స్టారర్ కమర్షియల్ హంగులూ హంగామా లేని అనవసర హైరానా అయింది ఆచార్య.

—సికిందర్


28, ఏప్రిల్ 2022, గురువారం

1163 : టిప్స్


 

    థా నడక (పేసింగ్) గురించి మాట్లాడేప్పుడు తెలుగు సినిమాల్లో వుంటున్న స్పీడుగా కదిలే సీన్ల పేసింగ్ దేనికి పనికొస్తోంది? గంటన్నరకి ఇంటర్వెల్ వరకూ కథలోకే వెళ్ళదు బిగినింగ్ ఉపోద్ఘాతపు పేసింగ్. బిగినింగ్ తో అంతసేపూ కాలహరణ చేయడం పేసింగ్ అన్పించుకుంటుందా? తెలుగు సినిమాలు ఆడే థియేటర్లలో ప్రేక్షకుల మొహాలు లైటింగ్ తో వెలిగిపోతూంటాయి. ఏమిటా అంటే స్మార్ట్ ఫోన్ల లైటింగ్. తెరమీద ఓపికని పరీక్షించే ఫస్టాఫ్ ని కట్ చేసి, సెకండాఫ్ చూసుకునే రిమోట్ లేదు కాబట్టి, స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తూంటారు. మేకర్లకి ఈ మేకింగ్ ఫాల్టు పట్టదు. ఫస్టాఫ్ చకచకా రన్ చేసి బ్రహ్మాండంగా మెప్పించామనుకుంటారు. రన్ చేసింది ఉపోద్ఘాతమే తప్ప కథ కాదని తెలుసుకోరు. ఈ రన్ చూసి  థియేటర్లలో  ప్రేక్షకుల  పరిస్థితేమిటో తొంగి చూసి తెలుసుకోవడం వుండదు.

        2. కమర్షియల్ సినిమా అనే పదార్ధం- ఇంటలెక్చువల్ అనే పదం రెండూ ఒక  ఒరలో ఇముడుతాయా? ఇంటలెక్చువల్స్  కమర్షియల్ సినిమాలు తీసెంత కింది స్థాయిలో వుండరు. వాళ్ళ సినిమాలు పై స్థాయికి చెందినవి. తలపండిన మేధావులు చూసేవి. కమర్షియల్ సినిమా అర్ధవంతంగా వుండాలంటే కేవలం అది ఇంటలిజెంట్ రైటింగ్ ని డిమాండ్ చేస్తుంది. ఇంటలిజెంట్ రైటింగ్ కి ఇంటలెక్చువల్  అయి తీరాల్సిన పని లేదు. ఏవేవో సినిమా పుస్తకాలు చదివేసి మెదడుని బాధ పెట్టుకోనవసరం లేదు. ఉన్న కమర్షియల్ సినిమా క్రాఫ్ట్ నీ, క్రియేటివిటీనీ కంటెంట్ పరంగా అర్ధవంతంగా ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి స్థాపించగల సామర్ధ్యం వుంటే సరిపోతుంది.  మయూరి,  కంచెఇలాటి ఇంటలిజెంట్ రైటింగ్స్ తో విజయవంతమైన కమర్షియల్ సినిమాలు. ఇంటలిజెంట్ అయివుంటే చాలు, ఇంటలెక్చువల్ అవనవసరంలేదు కమర్షియల్ సినిమాలకి. 

        3. కాలపరీక్షకి తట్టుకు నిలబడింది ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ళ నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో ఫిలిం రీళ్ళతో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు కథనాన్ని రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్ళే, ఎపిసోడ్లే తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ళ నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వెన్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే!

        4. స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్యా స్థాపనా జరిగిపోతే, చప్పున అరగంట- ముప్పావు గంట లోపు కథ పాయింటు కొచ్చేసే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షణాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్ళివెళ్ళి  ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి -  క్లయిమాక్స్ కొచ్చేస్తుంది కథ!  

        5. నిజంగా మిడిల్ అనేది ఓ కీకారణ్యం. ఎటు వైపు ప్రయాణించాలో తెలీదు. ఎప్పుడు? రూట్ మ్యాప్ లేనప్పుడు. దాంతో కంపార్ట్ మెంటలైజ్ చేసుకోనప్పుడు. ప్లాట్  పాయింట్- 1 విలువని గుర్తించకపోతే, లేదా ప్లాట్ పాయింట్ -1 ముందే ఏర్పడిపోయిందన్న స్పృహే  లేకపోతే, మిడిల్ నిజంగా కీకారణ్యంలాగే కన్పించి ఎటు వైపు వెళ్ళాలో తెలియకుండా చేస్తుంది. బెంగాల్ టైగర్లో సినిమా ప్రారంభమైన పదినిమిషాల్లోనే చక్కగా బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ -1 ఏర్పాటయితే, పెళ్ళి చూపులప్పుడు ఆ అమ్మాయి నువ్వు ఫేమస్ కాదని హీరోని తిరస్కరించడంతో హీరోకి గోల్ ఏర్పడి మిడిల్ సంఘర్షణ ప్రారంభమైతే, ఇది గుర్తించకుండా ఇంటర్వెల్లో వచ్చిన టర్నింగే  కథకి మలుపు అనుకుని, వేరే పగాప్రతీకారాల కథ ఎత్తుకున్నారు. సైజ్ జీరోఇంటర్వెల్ దగ్గర ఆలస్యంగా ప్లాట్ పాయింట్ -1 ఏర్పడి బరువు తగ్గాలని నిశ్చయించుకున్న హీరోయిన్ నిఇంటర్వెల్ తర్వాత ఆ సమస్యతో సంఘర్షించక, బోగస్ హెల్త్ సెంటర్ మీద పోరాటానికి ఒడిగట్టే హీరోయిన్ గా మార్చేశారు. మిడిల్ తో ఇంత కన్ఫ్యూజన్ అన్నమాట! అదీ పెద్ద బడ్జెట్ సినిమాలకి!

          6. సినాప్సిస్ అంటే కథా సంగ్రహం లేదా క్లుప్తంగా కథ.  దీని రచనకి హాలీవుడ్ లో కొన్ని మార్గదర్శకాలున్నాయి. సినాప్సిస్ -4 సైజు పేజీల్లో వుండాలి. ఒక పేజీకి మించి వుంటే డబుల్ స్పేస్ లో, ఒక పేజీ మాత్రమే  వుంటే సింగిల్ స్పేస్ లో టైపు చేయాల్సి వుంటుంది. లెఫ్ట్ ఎలైన్ మెంట్  వుండాలి. వర్డ్ డీ ఫాల్ట్ మార్జిన్స్ ని మార్చకూడదు. పేరాలో మొదటి లైను అర ఇంచు ఇండెంట్ వుండాలి. ఫాంట్  టైమ్స్ న్యూ రోమన్ 12 పాయింట్ వుండాలి. పాత్రల పేర్లు మొదటిసారి  ప్రస్తావించినప్పుడు వాటిని కేపిటల్ లెటర్స్ లో వుంచాలి. పేజీ నంబర్లు హెడర్ కుడి వైపు వేయాలి. సినాప్సిస్ అని టైటిల్ కింద డబుల్ స్పేస్ ఇచ్చి టైప్ చేయాలి. దీనికింద నాల్గు స్పేస్ లిచ్చి సినాప్సిస్ ని టైప్ చేయాలి. ఇలా ఇంకా చాలా నిర్దుష్ట  సాంకేతికాంశాలతో ముడిపడి వుంటుంది వ్యవహారం. స్క్రీన్ ప్లే స్క్రిప్టుకి కూడా ఇలాటి మార్గదర్శకాలు అనేకం వుంటాయి. వీటిలో ఒక్కటి తప్పినా స్క్రీన్ ప్లేని, లేదా సినాప్సిస్ నీ అవెంత బాగున్నా, మొదటే తిప్పికొట్టేస్తారు. వాటి సృష్టి కర్తని హీనంగా చూస్తారు. ఇది మనకి వర్తించేది కాదు.

        7. తెలుగు సిన్మాప్సిస్ - టైపింగ్ లో సినాప్సిస్ బదులు సిన్మాప్సిస్  అని పడిపోయింది! ఇదేదో బాగానే వున్నట్టుంది. కొన్ని పదాలు ముద్రారాక్షసాల వల్ల కాయిన్ అయిపోతాయి. ఇక నుంచి తెలుగు సినిమాలకి సిన్మాప్సిస్ అనే అందాం. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ బాక్సులో తెలియజేయండి. రెండు లైకులు కొట్టి, సబ్ స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. షేర్ చేయండి.

        8. తెలుగు సిన్మాప్సిస్ లు హాలీవుడ్ టైపులో వున్నట్టు రెండు మూడు పేజీల్లో సంక్షిప్తంగా వుంటే పనికిరావు. హాలీవుడ్ లో నిర్మాతలో,  ఏజెంట్లో ముందు సంక్షిప్త సిన్మాప్సిస్ లు చదివి నిర్ణయం తీసుకుంటారు. మన దగ్గర ఈ మధ్య నిర్మాతలు, హీరోల మేనేజర్లు ముందు సిన్మాప్సిస్ లు పంపమనడం ఎక్కువైంది. అలా మేకర్లు సినాప్సిస్ లు పంపిస్తే ఎటుపోతున్నాయో తెలీదు. రెస్పాన్స్ వుండదు. చదివారో లేదో కూడా తెలీదు. తెలుగులో కథ వినడానికి కొంత టైమిచ్చే సాంప్రదాయం పోయి, సిన్మాప్సిస్ లు అడుగుతున్నారు. కొందరు ఇంగ్లీషులో అడుగుతారు. మేకర్ల కోసం ఇవి రాసి పెడితే వృధా అవుతున్నాయి. తెలుగుకి ఈ హాలీవుడ్ లో పంపే సిన్మాప్సిస్ లాంటివి పనికి రావని తేలుతోంది.

        9. తెలుగులో నిర్మాతలకో, హీరోలకో మౌఖికంగా కథ చెప్పడమే పనికొచ్చే పద్ధతి. అందుకని మేకర్స్ కథ చెప్పడానికి తమ కోసం తాము సిన్మాప్సిస్ లు తయారు చేసుకోవడం ముఖ్యమవుతోంది. ఈ సిన్మాప్సిస్ రెండు మూడు పేజీల్లో వుంటే సరిపోదు. గంట పాటు కథ చెప్పగల్గే నన్ని పేజీల్లో వుండాలి. ఈ పేజీలు డిటిపిలో 30 పైనే  వుండొచ్చు. ఏడు వేల పదాలు. మేకర్స్ వాళ్ళ కథతో సంప్రదించినప్పుడు ముందు ఐడియాని నిర్మించి, సిన్మాప్సిస్  రాయాలంటే 30 రోజుల పైనే పడుతోంది. స్టోరీ సిట్టింగ్స్ సంగతి తర్వాత, ముందు సిన్మాప్సిస్ సిట్టింగ్స్ తప్పదు.

        10. ఇక్కడ సిన్మాప్సిస్ అంటే టూకీగా కథ అనుకుని రాసుకుంటే సరిపోదు. మొత్తం రెండు- రెండున్నర గంటల పాటూ సాగే కథ వివరంగా అనుకోవాలి. ఎక్కడెక్కడైతే ఆ వివరం రీసెర్చి కోరుతుందో ఆ రీసెర్చినంతా చేయాలి. ఇలా ఆ సవివరమైన కథని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో కూర్చోబెడుతూ, బిగినింగ్ మిడిల్ ఎండ్ విడివిడి విభాగాలతో ఒక పెద్ద కథ లాగా సిన్మాప్సిస్ రాయాలి. అంటే సిన్మాప్సిస్ అంటే మొత్తం ఆ కథకి స్క్రీన్ ప్లే అన్నట్టే. ఇదే రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది.

        11. అన్నీ చోట్లా గంట టైమివ్వక పోవచ్చు నిర్మాతలు, హీరోలు. అరగంటలో చెప్పమనొచ్చు, 10 నిమిషాలే అనొచ్చు. కాబట్టి అదే పెద్ద కథని గంట- అరగంట- 10 నిమిషాల్లో చెప్పే పద్ధతిని కూడా ఈ బ్లాగులోనే వివరించాం (ఇంతకీ కథెలా చెప్పాలి?). కాబట్టి గంట సిన్మాప్సిస్ ఆధారంగా అరగంట, 10 నిమిషాలు వుండే మినీ సిన్మాప్సిస్ లు కూడా తయారు చేసుకోవచ్చు.

        12. సమస్య ఎక్కడొచ్చిందంటే, హీరో లెవరూ ఖాళీగా లేరు. నిన్న మొన్నొచ్చిన కొత్త హీరోలు కూడా ఖాళీగా లేరు. కథలు వినే మాటే లేదు. మేకర్స్ అందరికీ పేరున్న హీరోలే కావాలి. మేకర్స్ సంఖ్య హీరోల సంఖ్యకి పది రెట్లుంది. ఒక హీరో చుట్టూ పది మంది కథ చెప్పడం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఆ హీరోలకి రెండేళ్ళూ ఖాళీ లేదు. తమ నంబర్ ఎప్పుడొస్తుందో తెలీదు. వదిలెయ్యండి, కొత్త వాళ్ళతో చిన్న సినిమాలు తీసుకోండంటే- చిన్నతనం ఫీలవడం. దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ లాంటి దర్శకులు కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలే తీశారు- వాళ్ళకి లేని చిన్నతనం ఇప్పటి మేకర్స్ కెందుకు? చిన్నవి తీసి సక్సెస్ చేసుకుంటే పెద్ద హీరోలనుంచి ఫోన్లు అవే వస్తాయి. ఏడాదికి రెండు మూడు చిన్నవి తీసుకుంటూ వుంటే ప్రేక్షకుల్లో, మార్కెట్లో  పేరు నలుగుతూ వుంటుంది కనీసం. పేరు నలగడం, సర్క్యులేషన్ లో వుండడం చాలా ముఖ్యం- పేరున్న హీరోల కోసం ప్రయత్నిస్తూ ఐపు లేకుండా పోవడం కంటే.
       
 సరే, ఇక నెక్స్ట్ స్క్రీన్ ప్లే టిప్స్ విత్ పుచ్చకాయ జ్యూస్ తో మళ్ళీ కలుద్దాం!

—సికిందర్

 

26, ఏప్రిల్ 2022, మంగళవారం

సీన్ టెక్నిక్


 
సీనుకి కూడా స్ట్రక్చ వుంటుంది. మొత్తం కథ స్క్రీన్ ప్లేకి బిగినింగ్, మిడిల్, ఎండ్ లెలా వుంటాయో, అలా కథ లోపల సీన్లకీ బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో స్ట్రక్చర్ వుంటుంది. ఈ స్ట్రక్చర్ ని ‘జస్టిస్ చౌదరి’ లో ఎన్టీఆర్ - సత్యనారాయణలు నటించిన ఒక సీన్లో ఎలా వుందో చూద్దాం. సీను ఇలా ప్రారంభమవుతుంది...
        బిగినింగ్ విభాగం:
        చౌదరి : ఎవరు మీరుఎందుకు వచ్చారు? (1)
        పాపారావు : మా అమ్మ ముగ్గురు బిడ్డల్ని కన్నది. పెద్దవాడు ఇప్పుడు మీముందున్న నేను. రెండో వాడు రెండేళ్ళ  క్రితం మీరు లాయర్ గా వున్నప్పుడు మీ చలవ వల్ల ఉరికంబం ఎక్కాడు. మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదురేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను. (2)
          చౌదరి : మిస్టర్ పాపారావ్నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! (3)
          పాపారావు : నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినామీరు నిర్దోషియని తీర్పు చెప్పి...(4)
          చౌదరి :  గెటవుట్! ఐ సే గెటవుట్!! (5) - (ప్లాట్ పాయింట్ వన్, బిగినింగ్ విభాగం సమాప్తం) 
         మిడిల్ విభాగం :
        మళ్ళీ చౌదరి :  నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్!! (6)
          పాపారావు :  మిస్టర్ చౌదరీతొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...(7 )
          చౌదరి : ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి! (8)
          పాపారావు : చూడు మిస్టర్ చౌదరీత్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు! (9) (ప్లాట్ పాయింట్ టూ, మిడిల్ విభాగం సమాప్తం)
      ఎండ్ విభాగం:
        చౌదరి : మిస్టర్ పాపారావ్నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్నౌ గెటవుట్!! (10 )
          పాపారావు : ఆల్ రైట్. (11 )

       ఈ పై సీనుని విశ్లేషిస్తే, ఇందులో మొదటి 5 సంభాషణలు బిగినింగ్తర్వాతి 4 సంభాషణలు మిడిల్మిగిలిన 2 సంభాషణలు ఎండ్ లుగా వున్నాయి.  బిగినింగ్ బిజినెస్ అంటే పాత్రల పరిచయంనేపధ్య వాతావరణంసమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనసమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అని కదా

        బిగినింగ్ లో ఈ  5 సంభాషణలతో ఇవెలా జరిగాయో చూద్దాం. ఈ సీనుకొచ్చేసరికి జస్టిస్ చౌదరి పాత్ర మనకూ పాపారావుకీ తెలిసిందే. పాపారావు తనని చౌదరికి పరిచయం చేసుకున్నాడు రెండో సంభాషణతో. పాత్రల పరిచయాలు ముగిశాయి. నేపధ్య వాతవరణం తెలుస్తూనే వుంది- పాపారావు న్యాయాన్ని కొనడానికొచ్చిన వాతావరణం. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చూస్తే - పాపారావు పరిచయ డైలాగులోనే – ‘మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదురేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను’ అనడంతో ప్రారంభమైంది.

        ఈ ప్రారంభం ఇలా కొనసాగింది -  3 వ డైలాగుతో చౌదరి : మిస్టర్ పాపారావ్నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! అని గద్దించడంతో,  4 వ డైలాగుతో పాపారావు -నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినామీరు నిర్దోషియని తీర్పు చెప్పి...  అనడంతో పరిస్థితి తీవ్రమైంది. కేసు విషయంలో పాపారావు ప్రలోభ పెట్టడానికి వచ్చాడని స్పష్టమైంది. ఇలా చౌదరికీపాపారావుకీ మధ్య సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన 2 వ డైలాగుతో మొదలై4 వ డైలాగుతో ముగిసింది. 

        దీనికి మండిపోయి చౌదరి- గెటవుట్ఐ సే గెటవుట్’  అని 5వ డైలాగు పేల్చడంతో సమస్య ఏర్పాటై పోయిబిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇక ఈ సమస్యని ఎలా డీల్ చేయాలన్న గోల్ ఏర్పడింది ప్రధాన పాత్రయిన చౌదరికి.

        ఇప్పుడు మిడిల్ చూద్దాం- మిడిల్ అంటే తలెత్తిన సమస్యతో రెండు పాత్రల యాక్షన్ రియాక్షన్లే కాబట్టిఇక్కడ సమస్యేమిటో చెప్పి గోల్ ఏర్పాటు చేసిన నేపధ్యంలో మిడిల్ ఇలా నడిచింది – 6 వ సీనుతో చౌదరి సమస్యని డీల్ చేసే గోల్ తో అన్నాడు - నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్’  అని. ఇది యాక్షన్ తీసుకోవడం.  

        దీనికి  7 వ డైలాగులో  పాపారావు - మిస్టర్ చౌదరీతొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...  అనడం రియాక్షన్ చూపడం.  

        దీనికి 8 వ డైలాగులో  చౌదరి - ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి  అనడం మరో యాక్షన్ తీసుకోవడం. 

        దీనికి 9 వ డైలాగుతో పాపారావు  - చూడు మిస్టర్ చౌదరీత్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అనడం మరో రియాక్షన్ చూపడం. 

         మిడిల్లో యాక్షన్ రియాక్షన్లు - పోనుపోను సీరియస్ అయి మిడిల్ బిజినెస్ ని కొలిక్కి తెస్తాయి కదాఅలా ఇక్కడ పాపారావు మాటలతో కొలిక్కి వచ్చింది. రావడమే కాకుండా చూడు మిస్టర్ చౌదరీ’ అంటూ అతను ఏకవచన సంబోధనకి మారడం పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాడని తెలుపుతోంది. తగ్గివున్న ప్రత్యర్ధి కోరలు చూపిస్తున్నాడు. మొత్తం కథకి స్క్రీన్ ప్లేలో మిడిల్ చివరి సీను ప్రత్యర్ధి చేతిలో వుండాలని రూలు కదాఇదే ఇక్కడ సీనుకీ వర్తిస్తోంది. 

        ప్రధాన పాత్ర చౌదరి వైపు నుంచి చూస్తేఅతను పతనా వస్థకి చేరాడు పాపారావు రియాక్షన్ తోచూడు మిస్టర్ చౌదరీ’ అని జస్టిస్ అయిన తనని అనడం ముమ్మాటికీ తలవొంపే. పైగా త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’ అని తన షరతులు విధిస్తున్నాడు. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అని పరోక్షంగా అల్టిమేటం ఇస్తున్నాడు. 

        ఇంతకంటే దీనావస్థ లేదు చౌదరికి. స్క్రీన్ ప్లే మిడిల్ ముగింపు సీనుతో ప్లాట్ పాయింట్ టూ ఏర్పడినప్పుడుఅది ప్రధాన పాత్రని పతనావస్థకి చేర్చే సీనుగా వుండాలని రూలు కదా?  ప్లాట్ పాయింట్ వన్ప్లాట్ పాయింట్ టూలు ఎదురెదురు అద్దాలుగానే వుంటాయిగాప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ఏర్పడితేప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ గోల్ గల్లంతై కన్పిస్తుంది కదాఇదే కదా పాయింట్ వన్ కీప్లాట్ పాయింట్ టూకీ మధ్య వుండే మిడిల్లో జరిగే యాక్షన్ రియాక్షన్ల బిజినెస్ఇదే ఇక్కడ సీనులో ప్లాట్ పాయింట్ టూకీ వర్తిస్తోంది. ఈ మిడిల్ బిజినెస్ లో జస్టిస్ చౌదరి గోల్, ప్లాంట్ టూ దగ్గర గల్లంతైంది. ప్రత్యర్ధి పాపారావుది పై చేయి అయింది నియమాల ప్రకారం.  

        ఇక ఎండ్ - ఎండ్ అంటే స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింటూలో కుంగి పోయిన స్థితి నుంచి ప్రధాన పాత్ర పైకి లేవడం కదాలేచి దెబ్బ కొట్టడం కదా పట్టు వదలని గోల్ కోసంఎండ్ విభాగంలో ఇక యాక్షన్ రియాక్షన్ల కథనం వుండదు. పైచేయి ప్రధాన పాత్రదేపారిపోవడం ప్రత్యర్ధి పనే. 

        ఈ విధంగా ఇప్పుడు 10 వ డైలాగుతో చౌదరి -  మిస్టర్ పాపారావ్నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్నౌ గెటవుట్ అని పై చేయి సాధించాడు. 
        పాపారావు నోర్మూసుకుని ఆల్ రైట్ అని గెటవుటై పోయాడు.

        ఇదీ సీను స్ట్రక్చర్. మరి సీను ధర్మం పాత్ర గురించి కొత్త విషయాన్ని తెలియజెప్పడమోలేదా కథని ముందుకి నడిపించే సమాచారమివ్వడమో  అయివుండాలని  కదామరి పై సీనులో ఏది జరిగింది?  మిడిల్ 9 వ డైలాగులో పాపారావు - త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’  అనడం ద్వారా కథని ముందుకి నడిపించే సమాచారమిచ్చారు. చౌదరిని ఎవరో కలుస్తారన్న మాటఎవరుఆ వచ్చే వ్యక్తి అడిగితే చౌదరి నిర్ణయం మార్చుకుంటాడన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు కూడా పాపారావు. ఇలా రాబోయే సీన్లలో ఏం జరగబోతోందన్న సస్పన్స్ ని సృష్టిస్తూకథని ముందుకు నడిపించే సమాచార మిచ్చారు. 
        సీనుకి ఇలా స్ట్రక్చర్ వల్ల అర్ధవంతమైన డ్రామా పుడుతుంది. సీనుకి స్ట్రక్చర్ వల్ల పాత్ర చిత్రణలు సవ్యంగా కూడా వుంటాయి. సీనుకి స్ట్రక్చర్ వల్ల సీక్వెన్సు స్ట్రక్చర్ లో వుంటుంది. సీక్వెన్సులకి స్ట్రక్చర్ వల్ల యాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంటాయి. యాక్ట్స్ కి స్ట్రక్చర్ వల్ల మొత్తం స్క్రీన్ ప్లేకి బలంగా చేకూరుతుంది. 

        ఇంకో సూక్షం కూడా తెలుసుకోవాలి. అసలు మొట్టమొదట స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ ఎక్కడ పుడుతుంది? కథకి అనుకున్నప్పుడు ఆ అయిడియా దగ్గర పుడుతుంది. ఆ కథ తాలూకు రెండు మూడు వాక్యాల ఐడియాలో బిగినింగ్ మిడిల్ ఎండ్ స్ట్రక్చర్ లేకపోతేఇక దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఆ కథకి సంబంధించిన అయిడియాలో ఎలా బిగినింగ్మిడిల్ఎండ్ విభాగాలుగా కథ కుదురుకుంటుందో, అదే కూర్పు తర్వాత సినాప్సిస్ లోఆ తర్వాత వన్ లైన్ ఆర్డర్లో, ఇంకా తర్వాత వరసగా సీక్వెన్స్ ట్రీట్ మెంట్చివరికి డైలాగ్ వెర్షన్లలో - ఈ ఐదంచెల ప్రక్రియలో ప్రస్ఫుట మవ్వాలి. డైలాగ్ వెర్షన్ అంటే సీన్లు క్రియేట్ చేయడమే. ఈ సీన్లు ఐడియా స్ట్రక్చర్ కి లోబడి అదే స్ట్రక్చర్ లో వున్నప్పుడే తెరమీద స్క్రీన్ ప్లేకి చైతన్యం వస్తుంది. ‘జస్టిస్ చౌదరి’ సీను రహస్యమిదే.

        కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1982 లో విడుదలైన ‘జస్టిస్ చౌదరి’ తారాగణం ఎన్టీఆర్, శ్రీదేవి, శారద, జయంతి, రావుగోపాలరావు, సత్య నారాయణ, అల్లురామలింగయ్య తదితరులు. కథ- సంభాషణలు సత్యానంద్, సంగీతం చక్రవర్తి, ఛాయగ్రాహణం కె. ఎస్. ప్రకాష్, నిర్మాత టి. త్రివిక్రమరావు.  

సికిందర్

(వీడియో ఎడిటింగ్ : విజయ్ కృష్ణ)