రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జూన్ 2014, ఆదివారం

ఆర్టికల్ 

రెండోది తీస్తే అంతేనా!
సీక్వెల్ సినిమాల సంకటం!




             గతంలో సాధించిన ఘన విజయాలకి ఓ అంకె కలుపుకుని మళ్ళీ విజయాలు సాధించవచ్చన్న పేరాశే నేడు విచ్చలవిడిగా తెరకెక్కుతున్న కొనసాగింపు చిత్రాల పరంపర. . కొత్తవి సృష్టించలేక, సృష్టించాలన్నా అవే కథల్ని బాహాటంగా రిపీట్ చేయాల్సిన అవమానాన్ని భరించలేక, గత హిట్లకి అంకెలేసి అవే కథల్ని సాగదీసి మళ్ళీ తీయడమే కాస్తయినా పరువు నిలుపుతుందని నమ్ముతూ పాల్పడుతున్న సరికొత్త నిర్మాణాలే,  నేటి సీక్వెల్స్ అనే దిగుమతి చేసుకున్న మరో సరికొత్త హాలీవుడ్ సంస్కృతి!

            విచిత్రమేమిటంటే గతంలో రెండు తడవలుగా తీసిన తెలుగు సీక్వెల్ సినిమాలే మెగా స్టార్ చిరంజీవి సహా  ఎవరు నటించినా హిట్టయిన పాపాన పోలేదు. అయినా ఇంకేదో సర్ది చెప్పుకుంటూ మళ్ళీ సీక్వెల్స్ కి తెరతీయడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుందేమో. గతంలో రామ్ గోపాల్ వర్మతీసినపుడు మొదటిసారి, తర్వాత చిరంజీవి నటించినప్పుడు రెండో సారీ సీక్వెల్స్ నిర్మాణాలు ఊపందుకుని అదొక ట్రెండ్ గా స్థిర పడలేదు. కానీ ఈసారి మామూలు ట్రెండ్ కాదు- గజ ట్రెండ్ గా ఘీంకరిస్తూ ముందుకొస్తున్నాయి చిన్నా పెద్దా సీక్వెల్  సినిమాలు!
గబ్బర్ సింగ్-2, అదుర్స్ -2, పోకిరి-2, రేసుగుర్రం -2, కిక్-2, స్వామిరారా-2, బిందాస్-2, అంతః పురం-2,  ప్రేమకథా చిత్రం-2, యమలీల-2, అల్లరి-2, ఆనందం -2, దొంగాట -2, మంత్ర -2...ఇలా రెండో నంబర్ సినిమాల లిస్టుకి అంతే వుండదు. ఇలా అంకెలే కాకుండా టైటిల్స్ ని స్వల్పంగానో, పూర్తిగానో మార్చుకుని కూడా సీక్వెల్ సినిమాలు వరస కడుతున్నాయి...’ఆదిత్య-369’ కి సీక్వెల్ గా ‘ఆదిత్య-999’,  ‘లాహిరి లాహిరి లాహిరి’ కి సీక్వెల్ గా ‘కృష్ణా ముకుందా మురారీ’, ‘సీతయ్య’ కి కొనసాగింపుగా  ‘ఎవరి మాటా వినడు’, ‘లేడీస్ టైలర్’ కి  సాగతీతగా ‘ఫ్యాషన్ డిజైనర్- సన్నాఫ్ లేడీస్ టైలర్’... ఇలా దర్శన మివ్వబోతున్నాయి.

           వీటిలో కొన్నిటి ని  ఒరిజినల్ దర్శకులే తీయడం లేదు. దొంగాట -2, ఆనందం -2 లతో  వీటి ఒరిజినల్ దర్శకులైన కోడి రామకృష్ణ, శ్రీను వైట్ల లకి ఏ సంబంధమూ లేదు. అలాగే తమిళ మెగా దర్శకుడు శంకర్ అప్పట్లో తీసిన ‘జీన్స్’ సీక్వెల్ కి ఆయనా దర్శకుడు కాదు. ఇక ప్రస్తుతం  ‘రేయ్’  నిర్మాణంలో తలమునకలై వున్న దర్శకుడు వైవీఎస్ చౌదరి ఏకంగా గతంలో తను తీసిన ‘లాహిరి లాహిరి లాహిరి’,  ‘సీతయ్య’ ల సీక్వెల్స్ ని ప్రకటించుకున్నారు.

        ఇక నాగార్జునతో ‘డాన్’ తీసిన లారెన్స్ రాఘవ ‘డాన్-2’ కూడా తీస్తున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అదేమయ్యిందో తెలీదుగానీ, ఇప్పడు ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘మిర్చి-2’ లో నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

        కనీసం గతంలో హిట్టయిన సినిమాల టైటిల్స్ తో వేరే సినిమాలు తీస్తే కొన్నైనా  హిట్టయ్యాయి. తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ నాటినుంచీ ఈ సరళిని గమనించవచ్చు. ‘భక్త ప్రహ్లాద’- 1931- 1967, ‘ఆలీబాబా 40దొంగలు’- 1940- 1970,  ‘అపూర్వసహోదరులు’- 1950- 1986-1989, ‘బందిపోటు’- 1963-1988, ‘పవిత్రబంధం’- 1971-1996, ‘ఆహానా పెళ్ళంట’- 1987-2011 ... స్థలాభావం చేత ఇవి కొన్ని మాత్రమే . జాబితా తీస్తే ఇలా రిపీట్ టైటిల్స్ తో హిట్టయిన సినిమాలు డజన్ల సంఖ్యలో వుంటాయి.  కానీ  సీక్వెల్స్ కీ  అదృష్టం కూడా లేదు.  ఒక్కటీ హిట్టవదు. హాలీవుడ్ లో ఏనాడో సినిమాలు పుట్టిన తొలి నాళ్లలో 1930 ల నుంచే  సీక్వెల్స్ తీయడం ఆరంభిస్తే, తెలుగులో రాంగోపాల్ వర్మ పుణ్యమా అని హిట్టయిన ‘మనీ’ (1993) కి, 1995లో  సీక్వెల్ గా ‘మనీ మనీ’ వచ్చింది. అది మట్టి కర్చింది. ఆతర్వాత 2004 వరకూ సీక్వెల్స్ జోలికి పోలేదు. 2004లో చిరంజీవితో ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ హిందీకి రీమేకుగా హిట్టయిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ కి సీక్వెల్ తీశారు. హిందీలో అదే ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ కి సీక్వెల్ గా సూపర్ హిట్టయిన ‘లగే రహో మున్నా భాయ్’ ని తీసుకుని మళ్ళీ చిరంజీవితో ‘ శంకర్ దాదా జిందా బాద్’ అని సీ క్వెల్ తీస్తే అది సూపర్ ఫ్లాపయ్యింది. ఇలా తెలుగులో మొదటి రెండు సీక్వెల్సూ ఘోరపరాజయాల పాలయ్యాక కూడా  ధైర్యం చేసి అల్లు అర్జున్ తో  ‘ఆర్య -2’ తీశారు 2009లో. ఇది కూడా ఫ్లాపయ్యింది. వర్మ తీసిన ‘గాయం-2’, ‘సత్య -2’,  ‘ఏ ఫిలిం బై అరవింద్ -2’ లు కూడా ఫ్లాపయ్యాయి. నిజానికి ఈ మూడిటి ప్రీక్వెల్స్ (తొ లిచిత్రాలు) అయిన ‘ఆర్య’, ‘గాయం’, ‘సత్య’ ‘ఏ ఫిలిం బై అరవింద్’ లు రికార్డులు సృష్టించిన చిత్రాలే. కానీ సాగదీస్తే చతికిలబడ్డాయి. పోసాని కృష్ణమురళి తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ ఎంత హిట్టయ్యిందో, ‘ఆపరేషన్ దుర్యోధన-2’ అంతగా  ఫ్లాపయ్యింది. వర్మ ‘రక్త చరిత్ర’ తీసిన తర్వాత,  అట్టహాసంగా ‘రక్తచరిత్ర-2’ తీస్తే ఏమైందో తెలిసిందే!

           సాక్షాత్తూ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన మెగా హిట్ ‘చంద్రముఖి’ కి సీక్వెల్లో మళ్ళీ ఆయన నటించలేదు గానీ, మన విక్టరీ వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ సూపర్ డూపర్ అట్టర్ ఫ్లాపయ్యింది. తగుదునమ్మా అని జేడీ చక్రవర్తి మళ్ళీ ‘మనీ’ , ‘మనీ మనీ’ లకి ట్రీక్వెల్ గా ‘మనీ మనీ మోర్ మనీ’ (2011) అని తీస్తే,  షరామామూలుగా  ఏమాత్రం మనీ తిరిగి రాలేదు. మోర్ మనీ అని ఆశలు మాత్రం చాలా  పెట్టుకున్నారు.

          కృష్ణుడు తో ‘వినాయకుడు’ హిట్టయ్యాక, మళ్ళీ’ విలేజిలో వినాయకుడు’ గా వస్తే ఉండ్రాళ్ళు దక్కలేదు. ఓ మాదిరిగా హిట్టయిన ‘వెన్నెల’ ని నటుడు వెన్నెల కిషోర్ దర్శకుడిగా మారి అ కథతో సంబంధంలేని ‘వెన్నెల వన్ పాయింట్ ఫైవ్’ తీసి సీక్వెల్ గా ప్రచారం చేసుకోవడం ఏమాత్రం ప్రేక్షకుల్ని ఒప్పించలేదు. అలాగే హిట్టయిన తమిళ డబ్బింగ్ ‘విల్లా’ కి సంబంధంలేని ‘విల్లా-2’ వస్తే తిప్పికొట్టారు ప్రేక్షకులు. సీక్వెల్స్ ఇలా అడ్డగోలుగా వెర్రితలలేసే స్థాయికి పడిపోతున్నాయి. సేక్వెల్ అర్థాన్నే మార్చేస్తున్నాయి. ఇంకా పాత హిట్స్ అయిన ‘ బొబ్బిలి రాజా’, ఖైదీ’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ లకి కూడా సీక్వెల్స్ తీస్తా మని బెదిరిస్తున్నారు ఈ  సినిమాలు తీయని వేరే దర్శకులు. పాత సినిమాలని మళ్ళీ నిర్మిస్తున్నప్పుడు దర్శకులు మారినా అభ్యంతర ముండదు. అక్కినేని నాగేశ్వరరావు  ‘దేవదాసు’ ని విజయనిర్మల రీమేక్ చేస్తే అదేంటీ అని ఎవరూ అనలేదు. రీమేక్స్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ సీక్వెల్స్ కి ఓ పధ్ధతి వుంటుంది. ఒరిజినల్ దర్శకుడి సొత్తు అయిన ఓ హిట్ ని వేరే దర్శకుడు సొంతం చేసుకుని సీక్వెల్ తీయడం ఏమాత్రం వృత్తి  తత్త్వం అన్పించుకోదు. కానీ ఉన్న అనేకానేక అనారోగ్య ధోరణకి ఇది కూడా ఓ ట్రెండ్ గా తోడై పోయిందిప్పుడు.
అసలిదంతా హిందీ వైపు చూసి వేసుకుంటున్న వాతలు. అయితే హిందీలో ఒకరి సృజనాత్మక ఆస్తితో మరొకరు  సీక్వెల్స్ తీసే అపసవ్య ధోరణి కన్పించదు.  ఒరిజినల్ తీసిన  దర్శకులే సీక్వెల్స్ మీద సీక్వెల్స్  తీస్తూ హిట్లు కొడుతున్నారు. హేరాఫేరీ-2, కోయీ మిల్ గయా-2,  మున్నాభాయ్ -2, దబంగ్-2,  దోస్తానా- 2 , జన్నత్-2, ఆషికీ-2, రేస్-2, ఢమాల్-2,  రాగిణి ఎం ఎం ఎస్-2, మర్డర్-2,3, రాజ్-2,3, క్రిష్- 2,3,   ధూమ్- 2,3,  గోల్ మాల్ -2,3,4. ...ఈ దశాబ్దంన్నర కాలంలో ఇవన్నీ ఇవన్నీ హిట్లూ సూపర్ హిట్లే.
తెలుగులో ఎందుకు హిట్ కావడం లేదంటే, కేవలం క్రియేటివిటీ లోపించడం వల్లే. మొదటి దాన్ని మరిపించేదిగా రెండోది వుండాలి. కానీ రెండోది తీస్తే ఇక అంతే  సంగతులు అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి.

            తమిళం వైపు చూస్తే, నాన్ అవన్ ఇల్లై, ముని, పిజ్జా లకి సీక్వెల్స్ తీస్తే హిట్టయ్యాయి. సింగం తర్వాత సూర్య సింగం-2 లో నటిస్తే అదీ హిట్టయ్యింది. కమలహాసన్ విశ్వరూపం-2, మురుగ దాస్  తుపాకీ-2 తీయబోతున్నారు. ఇండియన్, రోబోలకి దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ( బాక్స్ చూడండి). తెలుగులో లాగా  తమిళం లో అంత సీక్వెల్స్ వేలంవెర్రి లేదు. అతి తక్కువ సంఖ్యలో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కొనసాగింపుల్ని పక్కన బెట్టి కొత్త కథల మీదే దృష్టి పెడుతున్నారు.

           ‘ఇప్పుడు కథకులు లేరు, కథలకి ఐడియాలు కొరవడుతున్నాయి. ఐడియాలు  వున్నా కొత్త  కథలతో సాహసించ లేకపొతున్నారు. పూర్తి అభద్రతా భావంతో కొట్టు మిట్టాడుతున్నారు. సురక్షిత మార్గం సీక్వెల్స్ తీయడమే నని భావిస్తున్నారు. ఒకసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పాత్రతో మళ్ళీ తీస్తే గట్టెక్కుతామని నమ్ముతున్నారు. కొత్త కథలే కాదు, కొత్త పాత్రల్ని సృష్టించాలన్నా ఏదో భయం, దీన్ని భయం అనేకన్నా భావ దారిద్ర్యం అనాలి...’అని అంటున్న సీనియర్ హిందీ రచయిత కమలేష్ పాండే మాటలు హిందీకి కన్నా తెలుగుకే ఎక్కువ వర్తిస్తాయేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇలా తీస్తున్న హిందీ సీక్వెల్సే హిట్టవుతున్నాయి. ఈ కిటుకు ఏంటో ముందు పట్టుకో గలిగితే, తర్వాత  తీరిగ్గా తెలుగు సీక్వెల్స్ గురించి ఆలోచించవచ్చు.

              రవితేజతో కిక్- 2 కి కమిటయిన దర్శకుడు సురేంద్ర రెడ్డి,   ఒరిజినల్ లోని రవితేజ పాత్రని తీసుకుని కొనసాగింపుగా కాకుండా,  కొత్త కథ తయారు చేసినట్టు చెబుతున్నారు. ఈ పాత్ర ‘కిక్’ తో ఎంతో పాపులర య్యింది. దీన్ని మళ్ళీ ఎంజాయ్ చేయవచ్చు ప్రేక్షకులు. హిట్టయిన పాత్రలాధారంగా సీక్వెల్స్ తలపెడితే సత్ఫలితా లుండొచ్చు, కానీ, హిట్టయిన కథలాదారంగా తీస్తే ఏమౌతుందో చెప్పలేం. ప్రస్తుతం తలపెడుతున్న చిన్నా పెద్దా సీక్వెల్స్ లో చాలా వాటికి హిట్టయిన పాత్రల్లేవు. హిందీలో చూస్తె ఎక్కువగా హిట్టయిన పాత్రలతోనే తీస్తున్నారు. కథలతో తీసినా చాలావరకూ హిట్టయ్యాయి. అంటే క్వాలిటీ కి కట్టు బడ్డారన్న మాట. మున్నాభాయ్, హేరాఫేరీ, కోయీ మిల్ గయా, గోల్ మాల్, దబంగ్, ధూమ్, క్రిష్, దోస్తానా, రేస్   లలోని పాత్రలు బాగా హిట్టయినవే. ఆషికీ, రాజ్, మర్డర్, రాగిణి- ఎం ఎం ఎస్ మొదలైనవి చిన్న చిత్రాలు. వీటిని కథా  బలం ఆధారంగా సీక్వెల్స్ తీసి విజయాలు సాధించారు.తెలుగులో ‘గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ ది విలక్షణ పాత్ర. అది కౌబాయ్ ప్రవర్తనల గుర్తుండి  పోయే పోలీసు పాత్ర. కానీ ‘పోకిరి’ లో మహేష్ బాబుది సాధారణ అండర్ కవర్ పోలీసు అధికారి పాత్రే. దీనికి ఏ ప్రత్యేకతలూ లేవు. అలాగే ‘అదుర్స్’ లో ఎన్టీఆర్ పురోహితుడి సాత్విక పాత్ర ఆ సినిమా వరకే చెల్లుతుంది గానీ, సీక్వెల్ కి పనికొచ్చేంత క్రేజీ పాత్రేం కాదది. ‘రేసుగుర్రం’ లో అల్లు అర్జున్ పాత్ర సైతం డిటో. పైగా దీనికి పాత్ర చిత్రణా పరమైన  లోపాలెన్నో వున్నాయి. విశ్లేషిస్తే ఇదొక అసమర్ధ పాత్ర. పైగా టైటిల్ కి తగ్గట్టు రేసు గుర్రమే కాదు. నటి ‘లేడీస్ టైలర్’ లో

           ఇక ‘యమలీల’ సహా రాబోయే చిన్న చిన్న సీక్వెల్స్ అన్నీ కథా బలం ఆధారంగా తీసుకోవాల్సినవే. ఐతే ‘యమలీల’ సీక్వెల్ కాదంటున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి. కొనసాగింపు కాకుండా కొత్త కథతో ఇది సిరీస్ చిత్రం అంటున్నారు. సిరీస్ చిత్రమ నుకుంటే దీని తర్వాత ఇంకా తీస్తూ వుండాలి, హాలీ వుడ్ లో జేమ్స్ బాండ్ చిత్రాల్లాగా. కృష్ణా రెడ్డి ఒకటి తీసి సిరీస్ అనకుండా మరి కొన్ని యమలీలలు తీస్తూ పోతారేమో  చూడాలి.

              ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయంలో, సీక్వెల్ అనేది ప్రీక్వెల్ కి సహజ సిద్ధమైన కొనసాగింపుగా వుండాలి, కానీ మన నిర్మాతలు, దర్శకులూ సంబంధంలేని వేరే కథ జోడించి పార్ట్ టూ అని ప్రచారాలు చేసుకుంటున్నారు, ప్రీక్వెల్  హేంగోవర్ తో వుండే  ప్రేక్షకులు,  తీరా థియేటర్ లోకెళ్ళి చూసి కంగు తింటున్నారు...

            ఒక పంపిణీ దారుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలి బుచ్చారు. ముందు తీసిన సినిమాతో రెండో దానికి సంబంధంలేని కథ ఉండడమే వీటి వైఫల్యాలకి కారణమంటున్నారు. నిజమే, మొదటే కథల్నీ పాత్రల్నీ ఇక సృష్టించుకునే ఓపికా తీరికా లేక సులభమార్గం సీక్వెల్స్ ని ఎంచుకున్నప్పుడు, వీటితో కూడా ప్రేక్షకులతో నిజాయితీగా ఉండకపొతే ఎలా?

            చూడబోతే ఈ ఏడాది, వచ్చే ఏడాదీ నంబర్ టూ సినిమాలు ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేట్టున్నాయి. ఐతే ఇలా డజన్ల సంఖ్యలో క్యూ కడుతున్న తెలుగు సీక్వెల్స్ లో ఒకటి రెండూ మెప్పించలేకపోయినా, మిగిలిన వాటి మొహం చూడక పోయే ప్రమాదముంది ప్రేక్షకులు. గ్రాఫిక్స్ సినిమాలు, త్రీడీ సినిమాలూ ఎలా వెన్వెంటనే మొహం మొత్తాయో సీక్వెల్స్ హంగామా కూడా అయ్యోరామా అన్పించుకునే అపాయం పొంచే  వుంటుంది. కనుక అందరూ ఒకే సారి పోటాపోటీగా ప్రారంభించకుండా, ఒకటి రెండిటి ఫలితాలు చూసి ముందడుగు వేయకపోతే ఇంతే  సంగతులవుతుంది. ఎలాగూ రెండోది తీస్తే ఏమయ్యిందో దాఖాలాలున్నాయి ఇదివరకే.
ప్రేక్షకులు కొత్త  పాత్రలతో, కొత్త  కథలతో ముందు కెళ్లాలనుకుంటారు. ఉన్న చోటే వుండి పోయి ఈ రెండేళ్ళూ అవే పాత్రలూ, అవే టైటిల్స్ తో అవే కథల కొనసాగింపులూ చూస్తూ బోరు కొట్టించుకోవాలనుకోరు. అసలే ఇంట్లో జీడిపాకం సీరియళ్ళతో నానా యాతనలు  పడుతున్నారు. ఇంకా జీడిపాకం సినిమాలని  కూడా అంటే ఎవరికీ చెప్పుకుంటారు?   ధోరణి ఇలాగే కొనసాగితే  టాలీవుడ్ లో సరుకై పోయిందని మొత్తంగా థియేటర్లకి డుమ్మా కొట్టినా కొట్టొచ్చు!

-సికిందర్
( 'ఈవారం'- జులై 2014)