రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఏప్రిల్ 2017, శుక్రవారం

షార్ట్ రివ్యూ!


స్క్రీన్  ప్లే దర్శకత్వం : రాజ మౌళి

 తారాగణం: ప్రభాస్, రానా, అనూష్కా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు
కథ
: వి.విజయేంద్రప్రసాద్సంగీతంఎం.ఎం.కీరవాణి, చాయాగ్రహణం : కె.కె.సెంథిల్కుమార్
బ్యానర్ :  ఆర్కా మీడియా వర్క్స్
సమర్పణ: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్దేవినేని
***
       రెండేళ్లుగా ఎదురు చూస్తున్న బాహుబలి రెండో బాగం రానేవచ్చింది. కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకి సమాధానం చెబుతూ విచ్చేసింది. మొదటి భాగం కంటే రెండో భాగానికే టికెట్ల దగ్గర ప్రేక్షకులు బాహుబలులవ్వాల్సిన అత్యవసర పరిస్థితిని కల్పిస్తూ – టికెట్టు దొరికిన వాడే బాహుబలి అన్పించేలా చేస్తూ- టికెట్టు దొరకని వాణ్ణి కట్టప్ప క్వశ్చన్ కి ఓపిక పట్టుతప్ప, ఎవర్నుంచీ తెలుసుకోకంటూ  మెత్తగా వార్నింగ్ కూడా ఇస్తూ ‘బాహుబలి- 2’ చెప్పిన సంగతులేమిటంటే...


కథ
          మొదటి భాగం కొనసాగింపు కథ ఈ రెండో భాగంలో ఇలా వుంటుంది : మొదటి భాగంలో కాలకేయుడి మీద యుద్ధాన్ని గెలిచిన నేపధ్యంలో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) ని మహారాజుగా ప్రకటిస్తుంది రాజమాత శివగామి(  రమ్య కృష్ణ).  ది భల్లాల దేవుడు (రానా) కి, అతడి తండ్రి బిజ్జలదేవుడు ( నాజర్) కీ నచ్చదు. పట్టాభిషేకానికి ముందు దేశాన్ని చూసి రమ్మని అమరేంద్రని పంపిస్తుంది శివగామి. అమరేంద్ర మామ కట్టప్ప (సత్యరాజ్) తో బయల్దేరి వెళ్తాడు. వీళ్ళ పర్యటనలో భాగంగా కుంతల రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ యువరాణి దేవసేన (అనూష్కా) ని చూసి ప్రేమిస్తాడు అమరేంద్ర. దేవసేన చిత్రపటం చూసిన భల్లాలదేవుడు ఆమెతో పెళ్లి జరిపించమని శివగామిని కోరతాడు. దేవసేనని తీసుకురావాల్సిందిగా కబురంపుతుంది శివగామి. అమరేంద్ర ఆమెని తీసుకుని వస్తాడు. తీరా దేవసేనకి భల్లాల దేవుడితో శివగామి సంబంధం ఖాయం చేసేసరికి, మహారాజు పదవిని వదులుకుని సైన్యాధ్యక్షుడిగా వుంటాడు దేవసేనని పెళ్లి చేసుకున్న అమరేంద్ర. అయినా భాల్లాలదేవుడు అమరేంద్ర మీద పగదీర్చుకునే కుట్రలే చేస్తూ, శివగామి అతణ్ణి వెలివేసేలా చేస్తాడు.  

          ఇప్పుడు రాజ్యం వదులుకుని దేవసేనతో సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోయిన  అమరేంద్ర ఇకపైన ఏం చేశాడు? అతడి మీద ఇంకేమేం కుట్రలు జరిగాయి? కట్టప్ప అతణ్ణి ఎందుకు చంపాల్సివచ్చింది? అన్నవి ప్రశ్నలు. ఇవన్నీ తెలుసుకుని తన తండ్రి అమరేంద్ర బాహుబలి మరణానికి కారకుడైన పెదనాన్న భల్లాలదేవుడి మీద మహేంద్ర బాహుబలి ( ప్రభాస్) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ
          ఈ రెండో భాగం కథ మొదటి భాగానికి ఫ్లాష్ బ్యాక్ తో బాటు ఉపసంహారం. మొదటి భాగంలో చూపించిందంతా ఉపోద్ఘాతం. కథ ఈ రెండో భాగంలోనే ప్రారంభమవుతుంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ దాదాపు రెండుగంటలా 10 నిమిషాలు నడుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో సాంతం  అంతఃపురపు కుట్రలే వుంటాయి. షేక్స్ పియర్ తరహా  ‘యూటూ బ్రూటస్?’  వెన్ను పోట్లూ వుంటాయి. మొదటి భాగం కథలేక వినోదాత్మకంగా వుంటే, ఈ రెండో భాగం రీలీఫ్ నివ్వనంత సంఘర్షణాత్మకంగా వుంటుంది కథతో. 

ఎవరెలా చేశారు
          మొదటి భాగంలో కథ లేక, అందువల్ల పాత్రకి లక్ష్యం ఏర్పాటు కాక వుండిపోయిన ప్రభాస్ పోషించిన మహేంద్ర బాహుబలి పాత్ర, తిరిగి ఈ రెండో భాగంలో ఫ్లాష్ బ్యాక్ పూర్తయిన తర్వాతే క్లయిమాక్స్ యుద్ధ దృశ్యాల్లో తెరపైకి వస్తుంది.  తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో  ప్రధానంగా వుంటుంది. కుట్రలకి బలయ్యే ఈ పాత్రలో ప్రభాస్ బాగానే భావోద్వేగాలు కనబర్చినా,  మేకప్ ఆ భావోద్వేగాలకి సపోర్టు చేయలేదు. చెమట బిందువులు కూడా చిందని ముఖారవిందంతో సాఫీగా వుండిపోయాడు. పోరాట దృశ్యాల్లోనూ అంతే. కొన్ని వీరత్వం ఉట్టి పడే సింగిల్ లైన్ డైలాగులతో ప్రేక్షకుల్ని ఉర్రూత లూగిస్తాడు. 

          అనూష్కా కూడా బాధాకరమైన సన్నివేశాల్లో, లేదా పోరాట దృశ్యాల్లో సాఫీ మొహంతోనే కనిపిస్తుంది. సరైన ఒరిజినాలిటీ ఉట్టిపడే ఫేస్ ఎవరిదంటే యుద్ధ సన్నివేశాల్లో కన్పించే తమన్నాదే. ఆ ఫేస్ తో ఆమె సరీగ్గా యుద్ధనారిలానే వుంటుంది రఫ్ గా. ఆమె కన్పించేది కూడా క్లయిమాక్స్ యుద్ధంలో ఆ నాల్గు షాట్స్ లోనే. 

          రమ్యకృష్ణది కూడా ఒడిదుడుకు లనుభవించే పాత్ర. రాజమాత దర్పం ఆమెకే సరి. మాయల్లో పడి మోసపోయి ప్రాణత్యాగంతో పునీతమయ్యే దాకా   ఆమెదొక ట్రాక్ లో  వుండే పాత్ర. ఇక విలన్ గా రానా ది పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర. బాగా చేశాడు. 

          ఇతర పాత్రల్లో సత్యరాజ్, నాజర్, సుబ్బరాజులు ఫర్వాలేదు.
          సంగీతపరంగా పాటలకంటే నేపధ్య సంగీతం కీరవాణి బాణీల్లో పకడ్బందీగా వుంది. నిజం చెప్పుకోవాలంటే కథలో డ్రామాకన్నా, పోరాటాలకన్నా ఈ నేపధ్యసంగీతమే కూర్చోబెడుతుంది. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఆయన శైలిలో టెక్నికల్ గా బాగానే వున్నా, మొదటి భాగంలో వున్నట్టు పోయెటిక్ గా లేదు. ఛాయాగ్రహణ పరంగా గుర్తుండిపోయే అద్భుతాలేమీ లేవు. అలాగే పోరాటాలకీ, విజువల్ ఎఫెక్ట్స్ కీ మొదటి భాగానికే మార్కులు వేయాల్సి వస్తుంది.

చివరికేమిటి
          రాజుల కథ అనగానే వాళ్ళల్లో  వాళ్ళు చేసుకునే కుట్రలు  చూపించడమే  ఆనవాయితీ గా వస్తోందింకా. బాహుబలి అయినా, శాతకర్ణి అయినా, రుద్రమదేవి అయినా ఈ కథల్లో సామాన్య ప్రజలకే మాత్రం చోటుండదు. పెద్ద పెద్ద కోటల్లో అట్టహాసంగా సంపదని ప్రదర్శించుకుంటూ రాజులుంటే, ఒంటిమీద గుడ్డలు సరిగా లేని బీదా బిక్కీ జనం వాళ్ల ముందు సామూహికంగా కీర్తి గానాలు చేస్తూంటారు. ఈ దృశ్యాలే  చూడ్డానికి ఇబ్బందిగా వుంటాయి. ఈ రాజులు, వీళ్ళ రాజ్యాలూ ఎంత మానవీయంగా వున్నాయో పట్టిస్తూంటాయి. ఇవి ఫ్యూడలిస్టిక్ చిత్రణలే తప్ప, సోషలిజం కాదు. కానీ కమర్షియల్ సినిమా అంటే సోషలిజమే. మాస్ ప్రేక్షకులు కూడా చూడకపోతే సినిమాలుండవు. మరి మీ బతుకు లింతే అన్నట్టు రాజుల సినిమాల్లో సామాన్యుల్ని చూపిస్తే, ఆ  కథల్లో ప్రేక్షకులెలా ఇన్వాల్వ్ అవుతారన్నది ప్రశ్న. రాజులు వాళ్ళలో వాళ్ళు ఏం చేసుకుంటే మాకెందుకు, మా గురించేమిటన్నది సామాన్య ప్రేక్షకుడికి తట్టే ప్రశ్న. 

          ఇలా  బాహుబలి లాంటి భారీ పాత్ర సమాజంకోసం ఏం చేశాడంటే ఏమీ లేదు. కానీ హై కాన్సెప్ట్ సినిమాల్లో లెజండరీ పాత్ర ప్రజల కోసమే త్యాగాలు చేస్తాయితప్ప, బాహుబలిలాగా ఇంట్లో ఇష్టంలేని పెళ్లి చేసుకుని కుట్రలకి బలికావు. ప్రేమకథలు చూపించవు. 

          బాహుబలిలో  ఇబ్బంది పెట్టే  బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏమిటంటే,  ప్రజలకోసం అతనేం చేశాడు?
          ఇక ఫస్టాఫ్ లో  అనూష్కాతో ప్రభాస్ ప్రేమ ట్రాకు ఇంకా అద్భుతంగా ఉండాల్సింది. ఆమె బావగా ఫార్ములా పాత్రలో సుబ్బరాజుతో సిల్లీ కామెడీ చేయించారు. సెకండాఫ్ పది నిమిషాలు గడిచేవరకూ ఎమోషనల్ కనెక్ట్ వుండదు- ప్రభాస్ అనూష్కాతో రాజ్యం వదిలి వెళ్ళిపోయే సన్నివేశం దగ్గర్నుంచే కథకి బలం కన్పిస్తుంది. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న మిలియన్ డిస్కుల ప్రశ్నకి సమాధానం చెప్పిన తీరు ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో  చెప్పివుంటే షాకింగ్ గా వుండేది. ఎందుకంటే, ఈ ప్రశ్నకి సమాధానం షాక్ వేల్యూ ని ఎలివేట్ చేయాలి. ఎందుకు చంపాల్సి  వస్తోందో ముందే సీన్లు  చూపించేసి, అప్పుడు చంపి బాహుబలికి చెప్పడం వల్ల బాఅది షాకేమో గానీ ప్రేక్షకులకి కాదు. ప్రేక్షకులు ఏంతో  ఎదురు చూస్తున్న సమాధానాన్ని నీరు గార్చినట్టయ్యింది. 

          దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పూర్తి చేసిన ఈ రెండోభాగం ద్వితీయార్ధంలో బలం పుంజుకున్నా, చిత్రీకరణలో మొదటి భాగానికి సాటి రాదు. మొదటి భాగంలో విషయం లేకపోయినా విజువల్స్, పోరాట దృశ్యాలు  అద్భుతంగా వచ్చాయి. తమన్నా- ప్రభాస్ ల డ్యూయెట్ ఒక్కటి చాలు మొదటి భాగం గొప్పతనానికి. అలాగే ఈ రెండో  భాగంలో అవే పాత్రలు కంటిన్యూ అవడం వల్ల కూడా ఒక ఉత్సాహం కలగదు. కనీసం ఇద్దరు ప్రముఖ నటుల్ని కొత్తగా ప్రవేశ పెట్టాల్సింది. మొదటి భాగం క్లయిమాక్స్ లో  కాలకేయుడు వచ్చిన లాంటి థ్రిల్  ఫీలింగ్ రెండో భాగంలో కంటిన్యూ అయిన ఆర్టిస్టులతో అంతగా అన్పించదు. కనీసం ఇద్దరు కొత్త ఆర్టిస్టులని సర్ప్రైజ్ ఎంట్రీ గా ఇచ్చి వుంటే మొనాటనీ వుండేది కాదు.



-సికిందర్
http://www.cinemabazaar.in