రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, జులై 2016, శనివారం

షార్ట్ రివ్యూ!


రచన- దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మప్రియదర్శి పులికొండ,
నందు, అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నగేష్‌ బానెల్‌
బ్యానర్‌: ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌
సమర్పణ: డి. సురేష్‌బాబు
నిర్మాతలు: రాజ్‌ కందుకూరి, యష్‌ రంగినేని
విడుదల : జులై 29, 2016
***
      చిన్న బడ్జెట్ సినిమా అంటే పెద్ద బడ్జెట్ సినిమాల హంగూ ఆర్భాటాల్ని అనుకరించే నాసిరకం ఉత్పత్తులుగా, ఒక జోకుగా, హాస్యాస్పదంగా మారిపోయి- వారంవారం కుప్పతెప్పలుగా వచ్చిపడుతున్న  హవా నడుస్తూండగా, చెంపపెట్టులా ప్రత్యక్షమయింది ‘పెళ్లి చూపులు’ అనే రియలిస్టిక్ ఫిక్షన్. చిన్న బడ్జెట్ సినిమా అంటే రియల్ లైఫ్ అనీ, పెద్ద బడ్జెట్ సినిమా అంటే లార్జర్ దేన్ లైఫ్ అనీ  నిర్వచనాన్ని కూడా వదిలేసి టోకున ఖజానా ఖాళీ చేసుకుంటున్న చిన్నచిన్న నిర్మాతలకీ, పెద్ద సినిమాల మత్తులో జోగే ఛోటా మోటా దర్శకులకీ లాగి లెంప కాయకొట్టినట్టు దర్శనమిచ్చింది ‘పెళ్లిచూపులు’. నిజమైన సినిమా చూసే భాగ్యానికి నోచుకోనివ్వకుండా ప్రేక్షకుల నెత్తిన నానా చెత్త రుద్దుతున్న- అసలీ నోట్లు తీసుకుని నకిలీ సినిమాలు చూపిస్తున్న వాళ్ళందరికీ ‘బయటికి పోవు దారి’ చూపిస్తున్నట్టు బెత్తం పుచ్చుకుని వచ్చింది ‘పెళ్లిచూపులు’... 

         
కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ క్రాసోవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది రోమాంటిక్ కామెడీయే అయినా నేటి రోమాన్స్ ని షార్ట్ ఫిలిం మేకర్స్ ఎలా ఫీలవుతున్నారో గత కొన్ని రివ్యూల్లో చెప్పుకున్నాం. రుచీ పచీ వుండని మూస ఫార్ములా ప్రేమ సినిమాలకి ఆవల పల్లెల్లో, నగరాల్లో యూత్ ప్రేమల రియలిస్టిక్ ప్రపంచమంటూ ఒకటుంది. ఆ ప్రేమల్ని షార్ట్ ఫిలిం మేకర్స్ పట్టుకుని లవ్ మార్కెట్ లో వాస్తవికతని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ముందు మూస సినిమాల మాసిపోయిన ప్రేమలు వెలవెలబోతున్నాయి. అందుకే కృత్రిమ ప్రేమ సినిమాల వైపు యువ ప్రేక్షకులు కన్నెత్తి చూడ్డం లేదు. దీన్ని బ్రేక్ చేస్తూ నేటి యూత్ కి నచ్చే రియలిస్టిక్ ఫిక్షన్ తో ‘పెళ్లి చూపులు’ తీశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. 

        ‘పెళ్లి చూపులు’ అనగానే ఇదేదో పెళ్లి వ్యవస్థమీద అంటూ కృష్ణ వంశీ తీసిన ‘మొగుడు’ లాంటి, నందినీ రెడ్డి తీసిన ‘కళ్యాణ వైభోగమే’ లాంటి యూత్ కి ఏమాత్రం పట్టని పురాతన సోకాల్డ్ సందేశాల సంతర్పణ కాదిది. జీవితం పట్ల అత్యధిక శాతం  యువత కుండే భిన్నదృక్పథాల వితరణ ఇది. భుక్తి మార్గమేమిటో కూడా తెలుసుకోకుండా అర్జెంటుగా పెళ్ళో అంటూ ప్రాకులాడే సత్యదూరమైన అపరిపక్వ హీరో హీరోయిన్ల మూస ఫార్ములా పాత్రలు కావివి... పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు డాన్సులూ ఫైట్లూ కామెడీ లాంటి పెద్ద సినిమాల హంగుల  కోసమైతే ఈ సినిమా చూడక్కర్లేదు (ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవనీ, మాస్ వేల్యూస్ కూడా లేవనీ ఓ  రివ్యూ రైటర్ బాధ పడ్డాడు! అన్ని సినిమాల్నీ ఒకే రంగుటద్దాల్లో చూడాలన్న అవగాహనతో వున్నాడు కాబోలు ...)

       
అసలిప్పుడు ప్రేమంటే ఏమిటో?

కథ
      ప్రేమంటే వృత్తి వ్యాపకాలు. ఏ వృత్తీ లేనివాడికి ప్రేమే దక్కదు. కానీ ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) కి వృత్తి చేసుకు బతకాలంటేనే బద్ధకం. ఏ పనీలేక సోమరిపోతులా జీవించడమే ఇష్టం. కోటి రూపాయలు కట్నమిస్తే బ్యాంకులో ఎఫ్ డీ చేసుకుని ఆ వచ్చే  వడ్డీ మీద బతుకు లాగించెయ్యాలని ప్లాన్. అపసోపాలుపడి ఎలాగో ఇంజనీరింగ్ చేసిన కొడుకు ప్రశాంత్ ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవడంతో విసిగిపోయిన తండ్రి,  పెళ్లి చేసి పడేస్తే వాడి పాట్లు వాడు పడతాడని ఒక సంబంధం చూస్తాడు. ఆ పెళ్ళిచూపులకి వెళ్తే ఆ అమ్మాయి చిత్ర (రీతూ వర్మ) తో పొరపాటున గంట సేపు గదిలో బందీ అయిపోతాడు.  ఆమె ఎంబీఏ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయే ప్లాన్ తో వుంది, ఈ పెళ్ళీ గిళ్ళీ ఏమీ పట్టడం లేదు. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు తండ్రి ఇవ్వడం లేదు. ఏదో బిజినెస్ చేసి ఆ డబ్బు సంపాదించే ఆలోచనతో వుంది. ఆ బిజినెస్ పెట్టబోతే బాయ్ ఫ్రెండ్ మోసం చేసి పారిపోయాడు...

        ప్రశాంత్  తను కూడా ఎవత్తితో ఎలా తిరిగితే ఏం జరిగిందో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు. మార్చి మార్చి చెప్పుకునే ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాకులూ తూర్పు పడమరలు. ఒకే పాయింటు  దగ్గర ఇద్దరి అభిరుచులూ కలుస్తాయి : అది సాస్ లేకుండా సమోసా తినే దగ్గర. 

        మొత్తానికి కెరీర్ మైండెడ్ గా వున్న ఈమె, కెరీర్ నే  సన్యసించిన తనకి లొంగే అవకాశం లేదని నిరాశ పడ్డాక, అసలు విషయం తెలుస్తుంది- తను రాంగ్ అడ్రసుకి పెళ్లి చూపుల కొచ్చాడని. తను వెళ్ళాల్సింది వేరే ఎనిమిదో నంబర్ వీధిలో ఇంటికని!

        మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, కలిస్తే అక్కడ్నించీ వాళ్ళ సంబంధం ఎలా కొనసాగింది, అప్పుడేమేం జరిగాయన్నది మిగతా ద్వితీయార్ధపు కథ. 

ఎలావుంది కథ 
     చాన్నాళ్ళకి తెలుగులో ఒక ఫ్రెష్ కథ చూస్తున్నట్టు వుంది. కథంటే పాత్రలూ సంఘటనలూ కూడా కాబట్టి, ఇవి కూడా ఎక్కడా మూస ధోరణుల్లోకి తిరగబెట్టకుండా ఆద్యంతం ఎక్కడికక్కడ ఆధునిక పోకడలతో, ఆధునిక మనస్తత్వాల మదింపుతో ఆలోచనాత్మకంగా వుంది- ఇదంతా తెలుగు నేటివిటీని  కాపాడుతూనే. ప్రధానంగా ఈ కథ  పేరెంట్స్ కీ వాళ్ళ పిల్లలకీ  మధ్య వుండే అంతరాల గురించే తప్ప, రొటీన్ గా ప్రేమికుల మధ్య ప్రేమకి వుండే అడ్డంకుల గురించి కాకపోవడంతో, ఆ అంతరాలు కూడా పైన చెప్పుకున్న ‘మొగుడు’ లో లాగా,  కళ్యాణ వైభోగమే’ లోలాగా పెద్దలు చాదస్తపు క్లాసులు పీకే తత్త్వంతో కాక, ఆయా పరిణామాలే పరస్పరం పిల్లల్నీ పెద్దల్నీ మార్చే విజువల్ నేరేషన్ వల్ల ఈ కథ వాస్తవికతతో కూడుకున్న వినోదాత్మక విలువలతో  వుంది. ఎలాటి కృ త్రిమత్వపు ఛాయల్లేకుండా మనచుట్టూ జరిగే నిజప్రపంచం లాగే వుంది ఈ కథ. 

ఎవరెలా చేశారు
     ప్రతీ వొక్కరూ సహజ నటనతో రక్తి కట్టిస్తారు ఇందులో. హీరో విజయ్ దేవరకొండ –హీరోయిన్ రీతూ వర్మల నేచురల్ నటన ఎసెట్ ఈ సినిమాకి. పాత్రచిత్రణలు సింపుల్ గానే  వున్నా వీళ్ళవి  సంకీర్ణ పాత్రలు. ఇద్దరి మధ్యా సమస్య పెద్దదే, అయినా సంఘర్షణ భీకరంగా ఉండనవసరం లేదు. డ్రామా, మెలోడ్రామా,  సెంటి మెంట్లు మొదలైన వాటికి దూరంగా మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ టెక్నిక్ తో నిలబడ్డ పాత్రలివి. బిగ్ కమర్షియల్ సినిమాల్లో చూసినా ఏ టాప్ హీరోయినూ వేయనంత  ముద్ర తన సింపుల్ నటనతోనే సాధిస్తుంది రీతూ వర్మ. ఆమె ఫీలింగ్స్ నీ, ఆలోచనల్నీ  క్లోజప్స్ లో పట్టుకున్న తీరుతో ఆమె కలకా లం గుర్తుండిపోతుంది. అలాగే కామన్ బాయ్ గా కన్పించే విజయ్ పాత్రలోని హాస్య ధోరణి, అతడి ఫ్రెండ్స్ గా  నటించిన ప్రియదర్శి పులికొండ, అభయ్ ల ఫన్నీ కామెడీ కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యంగా హైదరాబాదీ తెలుగులో ప్రియదర్శి పులికొండ తన మాట తీరుతో ఒక భిన్నమైన కమెడియన్ గా పరిచయమవుతాడు. విజయ్- ప్రియదర్శి-అభయ్ ముగ్గురూ వున్న ప్రతీ సీనూ ఓ కామిక్ టానిక్కే. 

       పెద్దవాళ్ళ పాత్రల్లో అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ లు చాలా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా మనుషులిలాగే వుంటారు- సినిమాల్లో కొచ్చేసి నాటకీయంగా, ఓవర్ యాక్షన్స్ తో, సినిమా డైలాగులతో ఎందుకుండాలి? సినిమా చూస్తున్నట్టు వుంటే అది సినిమా ఎందుకవుతుంది? 

        ఎక్కడా సినిమా డైలాగులు విన్పించకుండా, ఎక్కడా సినిమా చూస్తున్నట్టు అన్పించకుండా దర్శకుడు కళా దర్శకత్వాన్నీ, ఛాయాగ్రహణాన్నీ, సంగీతాన్నీ, నటీనటుల ఆహర్యాన్నీ, లొకేషన్స్ నీ, సమస్తాన్నీ -  తన ఆధీనంలోకి తెచ్చుకుని- ఏ వొక్కటీ దేన్నీ డామినేట్ చేయకుండా ఏకత్వాన్ని సాధించడమే దర్శకత్వం అన్నట్టు పనిచేసుకుపోయాడు దర్శకుడు. 

    నటీనటుల దగ్గర్నుంచీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ తెలంగాణీయులే కావడం మరో ప్రత్యేకత. సాధారణంగా  తెలంగాణా సినిమా అంటే చిన్న చూపు వుంది. కారణం- ఎంతసేపూ అవే పోరాట కథలు తీస్తారని. కానీ ప్రధాన స్రవంతి లోకొచ్చి  ప్రాంతీయత కతీతంగా  కమర్షియల్ సినిమాని  తామూ  తీయగలమని ప్రప్రథమంగా ఈ సినిమాలో ప్రతీ వొక్కరూ నిరూపించారు. అదీ ఇంత  డిఫరెంట్ గా, ఇంత జనరంజకంగా!

చివరికేమిటి
        ప్రేక్షకులకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, తీస్తున్నవి సినిమాలనుకుంటూ ఇరు రాష్ట్రాల ప్రేక్షకుల్ని రాచిరంపాన పెడుతున్న వాళ్ళకి కనువిప్పూ!


-సికిందర్
http://www.cinemabazaar.in




       
       

       
       
       

29, జులై 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!








రచన- దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ


తారాగణం: సునీల్, మన్నారా చోప్రా, కబీర్ సింగ్, సత్యప్రకాష్ ,
పృథ్వీ, సప్తగిరి, పోసాని, నాగినీడు,
మాటలు : భవానీ ప్రసాద్, సంగీతం : దినేష్, కెమెరా : రాం ప్రసాద్ సి
బ్యానర్ : ఆర్పీఏ క్రియేషన్స్
విడుదల 29 జులై, 2016
***

      తెలుగులో హీరోగా తన కంటూ ఒక స్థానం కోసం సునీల్ ఇంకా దండయాత్రలు చేసే పరిస్థితుల్లోనే ఉండాల్సిరావడం నిజంగా ట్రాజడీయే. కమెడియన్ గా మొదటి సినిమాతోనే ఎస్టాబ్లిష్ అయిపోగల్గిన తను తీరా హీరోగా మారాలనుకునే సరికి- ఈ విభాగంలో  కమర్షియల్ సినిమాల స్థితిగతులు పరిశీలించుకున్నట్టు లేదు. స్టార్లు నటిస్తున్న కమర్షియల్ సినిమాలకే ఠికానా లేదు, వాటి కథాకమామీషులు అలా ఉంటున్నాయి- అలాటిది హీరోగా, ఇంకా యాక్షన్ హీరోగానూ  మారిపోయి కొత్తగా సునీల్ కూడా వస్తే, ఇటువైపు విభాగంలో పరిస్థితులేమీ మారిపోవు. అవే పరిస్థితుల మధ్య, అవే అరిగిపోయిన, ఇతర హీరోలు నటించేసిన, అవే  పాత మూస వ్యవహారాల్లోనే చిక్కుకుని గిలగిల్లాడాల్సి వుంటుంది. అదే ఇప్పుడూ జరిగింది ‘జక్కన్న’ తో. ‘బ్యాక్ టు ఎంటర్ టైన్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తూ, ఎంటర్ టైన్మెంట్ కి తన దృష్టిలో అర్ధం ఇదా అన్నట్టు  ముక్కున వేలేసుకునేట్టు చేయడం మరీ  ట్రాజడీ. 

      దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ  నాల్గు తెలుగు సినిమాల కట్ అండ్ పేస్ట్ దర్శకుడుగానే తప్ప సొంత టాలెంట్ గల వ్యక్తిగా ఏ కోశానా కన్పించక పోవడం ఈ సినిమాలో ప్రత్యేకత. కనీస స్క్రీన్ ప్లే, కథాకనాలు, పాత్ర చిత్రణల నాలెడ్జి కొరవడినట్టు మొదటి సీను దగ్గర్నుంచే తెలిసిపోతుంది. పైపెచ్చు శ్రీను వైట్ల వాడి వాడీ కెరీర్ మీదికి తెచ్చుకున్న ‘విలన్ ఇంట్లో హీరో చేరి వాణ్ణి బకరా చేయు కన్ఫ్యూజ్  కామెడీ  అనబడు సింగిల్ విండో స్కీమ్’  నే ఈ దర్శకుడూ  అరువు దెచ్చుకుని సునీల్ కి అంటగట్టడం సాహసాల్లో కెల్లా సాహసం! 

        సినిమాలు చూడ్డంలో ప్రేక్షకులకి  ఎబిసిడిలు తెలీనట్టు ఈ కథా ప్రారంభం ఎలా వుంటుందంటే...

నీతి కథ!

        నగనగా ఒక వూళ్ళో ఒక మేష్టారు పిల్లలకి నీతి కథ చెప్తాడు. చిన్నప్పటి హీరో ఈ నీతి  కథ వినని అచ్చు అలా మారిపోతాడు. నీతికథ సారాంశమేమిటంటే,  నీకెవరైనా సాయం చేస్తే దానికి నువ్వు రెట్టింపు సాయం చెయ్ అనేది. పెద్దవాడైపోయిన హీరో గణేష్ అలియాస్ జక్కన్న (సునీల్) బ్యాగు భుజానికి తగిలించుకుని వైజాగ్ వచ్చేస్తాడు. కాగితం మీద ఒకడి బొమ్మ పట్టుకుని వాడి కోసం వెతుకుతూ, మరోవైపు సహస్ర (మన్నారా చోప్రా) అనే అమ్మాయి వెంట ప్రేమకోసం  పడుతూ వుంటాడు.జక్కన్న వెతుకుతున్న బైరాగి (కబీర్ సింగ్) అనే వాడు వైజాగ్ ని గడగడ లాడిస్తూన్న గూండా. అయితే అతనెలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఇది హీరో తెలుసుకుని అతడికి  సాయం చేసేందుకు వెంటపడతాడు. ఎందుకంటే ఈ బైరాగి జక్కన్న చిన్నప్పుడు ప్రాణాలు కాపాడి గొప్ప సాయం చేశాడు. కనుక  ఇప్పుడు తిరిగి వాడికి సాయం చేసేందుకు జక్కన్న వచ్చేశాడన్న మాట!

        ఏం సాయం చేశాడు, ఎలా చేశాడు, దాన్ని సాయం అంటారా వెటకారం అంటారా, సాయం చేయించుకున్న గూండా బకరాలా మారిపోయి ఎలా చేయించుకున్నాడూ, చేయించుకున్నప్పుడు ఏమయ్యాడూ మొదలైనవి వెండి తెరమీద చూసి తరించాల్సిందే!

ఎలా వుంది కథ

       
పైన చెప్పుకున్నట్టు సింగిల్ విండో స్కీము కథ. ఈ స్కీము సృష్టి కర్తలైన కోన వెంకట్ ట్- గోపీ మోహన్ ద్వయమే అల్లరై దానికి మూత పెట్టేసుకోగా, ఇంకేం చేద్దామని జక్కన్న వచ్చాడో అర్ధంగాదు. ఇంకా ఎంటర్ టైన్మెంట్ అంటే ఇదే అనుకుంటూ ‘బ్యాక్ టు ఎంటర్ టైన్మెంట్’ అంటూ రావడం చాలా హ్యూమరస్ గా వుంది. సునీల్ పాత్ర పేరుగా పెట్టుకున్న గణేష్ కి నిక్ నేమ్ జక్కన్న ఎలా సూట్ కాదో, అలా సాయం చేసే గుణానికీ సాగదీసిన ఈ అరిగిపోయిన పాత  మూస కథకీ సంబంధమే లేదు! 

ఎవరెలా చేశారు 

       రెండు చోట్ల కమెడియన్ సప్తగిరి రియల్ ఫన్ చేశాడు, ఈ మాత్రం కూడా సునీల్ కామెడీ చేయలేదు. అన్ని పాత్రలకీ కామెడీ పేర దొర్లించిన తెలుగింగ్లీషు ప్రాస డైలాగులతో శబ్దకాలుష్య మే తప్ప నవ్వనే మాటకి చోటే లేదు. సునీల్ పోషించిన పాత్ర నిజానికి మానసిక రోగి పాత్ర. ఏదో కాకతాళీయంగా సాయపడ్డ ప్రతీవాడికీ పనిగట్టుకుని తిరిగి సాయపడాలనుకోవడం, సాయం చేసే పేరుతో వేధించడం కామెడీ అన్పించుకోదు, మానసిక రుగ్మత అన్పించుకుంటుంది. ఇలాటి పాత్రతో ఎంజాయ్ మెంటు తక్కువ ఎలర్జీ ఎక్కువగా తయారయ్యింది. ఇంతగా అర్ధంపర్ధం లేని పాత్ర ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ లేదు. 

        హీరోయిన్ చాలా మైనస్ ఈ సినిమాకి. హీరోయిన్ విషయంలో కూడా సునీల్ టేస్టు కనబర్చుకో లేదు.  ఇంకా చీటికీమాటికీ వచ్చి పడి చిరాకు పుట్టించే  బోలెడు మంది కమెడియన్లు వున్నారు. అలవాటుగా రొటీన్ గా, పృథ్వీ తో అదే బాలకృష్ణ డైలాగుల పేరడీ కూడా వుంది. కామెడీ పేరుతో  ఇంత హంగామాకీ  కింది క్లాసు ప్రేక్షకులు కూడా నవ్వకుండా, సైలెంటుగా ఏదో తప్పని తద్దినం అన్నట్టు చూశారంటే అది దర్శకుడి గొప్పతనమే.  

        పాటలూ రోటీన్ గానే వుంటే, కెమెరా మాన్ గా సీనియర్ రామ్ ప్రసాద్ చాలా నీరసంగా చిత్రీకరణ జరిపారు. ఆయనకీ ఈ సినిమాలో కిక్కు లభించలేదేమో, చుట్టి అవతల పడేశారు. 

చివరికేమిటి?

       
ముంది, సునీల్ కి మరింకో దండయాత్రే.  ఏకైక కామెడీ హీరో అల్లరి నరేష్ పరిస్థితి అలా వుంటే, ఏకైక కండల హీరోగా మారాలనుకున్న కమెడియన్ సునీల్ పరిస్థితి ఇలా వుంది. స్టార్ల జోన్లో సినిమాల పరిస్థితి ఎలా వుంటోందో, ఇందులోకి ఎంటరైన సునీల్ పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ వుండదు. ఎంతకాలమైనా  ఈ త్రిశంకు  స్వర్గం తప్పదు.


-సికిందర్
cinemabazaar.in








25, జులై 2016, సోమవారం

ఆర్టికల్ :









     ప్రతీ సంస్కృతీ హీరోల్ని కలిగి వుంటుంది.  దాదాపు కథలన్నీ హీరో చుట్టే తిరుగుతాయి. మైథాలజిస్టు జోసెఫ్ క్యాంప్ బెల్ హీరో పాత్ర రూపకల్పనలో చోటు చేసుకునే వివిధ దశల క్రమాన్ని గుర్తించారు. హీరో అంటే తన రోజు వారీ సాధారణ ప్రపంచపు సరిహద్దులు దాటుకుని,  సవాళ్ళతో కూడిన అసాధారణ ప్రపంచంలోకి ప్రవేశించి, తనవాళ్ళ శ్రేయస్సు కోసం పోరాడి, అంతిమంగా వారికా విజయ ఫలాల్ని అందించేవాడు- ‘కబాలి’ లో రజనీకాంత్ లాగా. ‘కబాలి’ లో రజనీ కాంత్ మలేషియాలో తమిళుల హక్కుల కోసం పోరాటం చేయడాన్ని చూపించారు. 
          ఒక సాధారణ వ్యక్తి  హీరోగా అవతరించాలంటే  అతను అనుభవించాల్సిన దశలు 11 వుంటాయని క్యాంప్ బెల్ అంటారు. ముందుగా ఆ కాబోయే హీరో తన చుట్టూ వున్న పరిస్థితులతో అసౌకర్యాన్ని ఫీలవుతాడు. అప్పుడు అతడికి ఆ పరిస్థితుల్ని మార్చక తప్పదన్నట్టుగా ఒక అనుభవం ఎదురవుతుంది- ఆ అనుభవంతో అతడికి ముందు కెళ్ళాలంటే ప్రమాదకర పరిస్థితులుంటాయి. అప్పుడు అతడికి పెద్ద దిక్కుగా వున్న పాత్ర ముందుకు వెళ్లేందుకే అతడ్ని ప్రోత్సహిస్తుంది. దాంతో సమీకరణలు చోటు చేసుకుంటాయి- అనుచరులు ఒక వైపు- ప్రత్యర్ధులు ఒక వైపు గుమికూడతారు. ఇక మిగిలిన కథ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం గురించి, దాన్ని సాధించడం గురించి, ఆ విజయ ఫలాలతో తిరిగి రావడం గురించీ వుంటుంది. క్యాంప్ బెల్ పురాణ పాత్రలకి సంబంధించే హీరో పాత్ర నిర్మాణం గురించి చెప్పినా, ఇది నేటి సినిమా స్క్రిప్టులకి కూడా వర్తిస్తుంది. శక్తియుక్తుల్ని ప్రదర్శించే హీరో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. కబాలీ ఇదే చేస్తాడు. 

      క్యాంప్ బెల్ ఇలా అంటారు : పురాణాల, పారంపర్యంగా వస్తున్న ఆచారాల ప్రధాన కర్తవ్యం మానవశక్తి పురోగమించడానికి అవసరమైన ప్రతీకాత్మలని అందించడమే ...అయితే వాస్తవానికి, మానవ బలహీనతలు పెచ్చు మీరుతున్న కొద్దీ ప్రతీకాత్మలు అందించే ఆధ్యాత్మిక  విలువలు  కూడా గుర్తింపుని కోల్పోతూంటాయి...

          అంటే హీరో అనేవాడు ఆధ్యాత్మిక ప్రదాత అన్నమాట. అతను మన ఆలోచనల్ని ప్రభావితం చేసి మనం ఉన్నతంగా ఎదిగేందుకు మనల్ని తన వెంట తీసుకుపోతాడన్న మాట- ఎలా వున్న వాళ్ళని అలా వదిలెయ్యకుండా. కబాలి ఇది సాధించాడా?

       హీరో అనేవాడు తను వేసే ప్రతీ అడుగూ ఉన్నతాశయపు పవిత్రతని కాపాడేందుకే వేస్తాడు. కథలో భాగంగా వుండే  ఎలాటి హింసకైనా అతీతంగా అతడి మంచితనం ప్రకాశిస్తుంది. చెబుతున్న  కథ ప్రభావశీలంగా వుండేందుకు కొన్ని అతిశయోక్తులకి పాల్పడక తప్పదు. కాబట్టి మంచితనమా - హింస ఈ రెండిటినీ పోటాపోటీగా  కొంచెం అతి చేసి చిత్రించడం అవసరమే.

      జైన మతస్థులు ఈ పరిస్థితిని మేనేజ్ చేసేందుకు ఒక ఆసక్తికర విధానాన్ని కనుగొన్నారు. ప్రతీ కథలో మూడు ప్రధాన పాత్రలుంటాయి. నాలుగు కూడా వుండొచ్చు. నాల్గోపాత్ర కథలో వున్నా లేకపోయినా, దాన్ని చక్రవర్తి అన్నారు. మిగతా మూడు పాత్రలు బలదేవుడు  లేదా హీరో పాత్ర, వసుదేవ లేదా సెకండ్ హీరో పాత్ర, ప్రతి వసుదేవ  లేదా యాంటీ హీరో అంటే విలన్ పాత్ర. ప్రతి వసుదేవ అన్న పేరే సగం ప్రపంచానికి అతను అధిపతి అన్న అర్ధాన్నిస్తోంది. ఎలాగైతే వసుదేవులు ప్రపంచాన్ని ఏలతారో, అలా యాంటీ వసుదేవులు ప్రపంచం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తారు. అయితే ఇది విలనిజంతో కూడుకుని వుంటుంది.  

          బలదేవుడు ఎవర్నీ చంపడు. అతను  జైనుల అహింసా సిద్ధాంతపు పరిరక్షకుడుగా వుంటాడు. వసుదేవుడు చంపి పాతాళానికి పోతాడు. ప్రతి వసుదేవ కూడా వాడి దుర్మార్గాల రీత్యా నరకానికే పోతాడు. అత్యున్నత ఆధ్యాత్మిక పాత్రయిన బలదేవుడు మాత్రం జైనుల  ధర్మం ప్రకారం పరిత్యాగం చేసి మోక్షం పొందుతాడు. 

      నిజమే, హీరో కూడా హింసకి పాల్పడాల్సి వస్తుంది. అయితే అది విలన్ పాత్ర పాల్పడే స్థాయిలో భయానక బీభత్సభరితంగా వుంటే, నిర్దాక్షిణ్యంగా చంపడమే హీరోయిజ మనుకుంటే, అతను  రక్తపాతానికి అతీతుడైన ధర్మ పరాయణుడైన హీరో ఎలా అవుతాడు? కబాలిలో చూపించినట్టుగా మనుషుల్ని చంపడమంటే దోమల్ని చంపడంతో సమానమా? అసలు చంపడాలు లేని బ్రాండ్ హీరోయిజాన్ని మనం ప్రమోట్ చేయలేమా?


-సుధామహి రఘునాథన్
(టైమ్స్ ఆఫ్ ఇండియా)



         

         



          

22, జులై 2016, శుక్రవారం

రివ్యూ :






రచన- దర్శకత్వం : పా. రంజిత్ 

తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, రిత్విక, దినేష్ రవి, కళయరాసన్, జాన్ విజయ్, విన్ స్టన్ చావో, రోస్యమ్ నోర్ తదితరులు 
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : జి. మురళి 
విడుదల : 22 జులై, 2016 
***
        సూపర్ స్టార్ రజనీకాంత్ తో మారుతున్న ప్రేక్షకాభిరుచిని అర్ధంజేసుకోవడంలో దర్శకులు విఫలమవుతున్నట్టు సూచనలు కన్పిస్తున్నాయి. రజనీతో రొటీన్ మాస్ కమర్షియల్స్ తీయడానికి ఇంకా ఏమీ మిగల్లేదనే, మెగా దర్శకుడు శంకర్ రజనీతో  ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ తీసి ప్రేక్షకుల్ని ఓ కొత్త వూహా ప్రపంచంలోకి తీసికెళ్ళాడు. తిరిగి ప్రస్తుతం తనే తీస్తున్న ‘రోబో- 2’ అనే మరో సైన్స్ ఫిక్షన్ తో ఇంకో కొత్త ఊహా ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. కానీ ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ లో రజనీని ప్రేక్షకులు మరమనిషి గా అంగీకరించారు కదాని, మనంకూడా ఇంకో అడుగు ముందుకేస్తున్నట్టు భ్రమించి, మరమనిషి నుంచి అసలే ప్రాణంలేని త్రీడీ గ్రాఫిక్స్ రూపానికి దించి,  రజనీ కుమార్తె ఐశ్వర్య ‘విక్రమ సింహా’ తో ప్రేక్షకుల్ని అపరిమితంగా  పరిహాసమాడింది. వెంటనే ‘లింగా’ తో అందుకుని, కె ఎస్ రవికుమార్ పాత మూస రజనీ కాంత్ నే మళ్ళీ చూపించి ప్రేక్షకాభిమానుల్ని అనుచితంగా హతాశుల్ని చేశాడు. ఇప్పుడు రియలిస్టిక్ సినిమాల రంజిత్ వచ్చేసి రజనీతో ఏం చేసుకోవాలో అర్ధంగాక ఏమేమో చేసి –ఆఖరికి ప్రేక్షకులు నవ్వుకునే స్థితికి సూపర్ స్టార్  సినిమాని దిగజార్చాడు. 


       ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించి  ఐశ్వర్య దర్శకుడు రంజిత్ ని ప్రశ్న అడిగింది- మీ స్క్రిప్టులో ఎంటర్ టైన్ మెంట్ అనేది లేదు కదా కాస్త ఉండేట్టు చూడమని. దీనికి రంజిత్- ఇందులో ఎంటర్ టైన్ మెంట్ కుదరదనడం సహజంగానే అతడి నాన్-కమర్షియల్ మైండ్ సెట్ కి మచ్చుతునక. ఇప్పటి రజనీకాంత్ యిప్పటి అమితాబ్ బచ్చన్ కాదని తెలుసుకోకపోవడమే అతడితో వచ్చిన చిక్కు.  తమ రజనీకాంత్ ఎప్పటికీ ఆల్ రౌండరే అని నిద్రలో లేపి అడిగినా సాక్ష్యం చెప్తారు అభిమానులు. 


      ‘కబాలీ’ అనే బ్రహ్మండమైన పవర్ఫుల్ ఇగోయిస్టిక్ టైటిల్, దీనికి తగ్గట్టు విపరీతమైన క్రేజ్ సృష్టించిన ట్రైలర్స్, రెండు పరాజయాల తర్వాత ఈసారి రజనీ చాలా జాగ్రత్త తీసుకుంటారన్న అతిపెద్ద భరోసా, పైగా మొట్ట మొదటిసారిగా ఒరిజినల్ రూపంతో రజనీకాంత్ దర్శనం, దేశవ్యాప్తంగా గొప్ప పండగవాతావరణం...ఇదీ నేపధ్యబలం. దీంతో వెయ్యేనుగుల బలం వచ్చినట్టు ఫీలయ్యి థియేటర్లోకి అడుగుపెడితే...


తెర మీద కన్పించే కథ     
      మ
లేషియాలో కబలీశ్వరన్ అలియాస్ కబాలి (రజనీకాంత్) పాతికేళ్ళు జైలు శిక్ష అనుభవించి విడుదలవుతాడు. మలేషియాలో తరాలుగా జీవిస్తున్న తమిళ బడుగు జీవుల సమస్యలు తీర్చే మాఫియా డాన్ అతను.  జైలు నుంచి వచ్చాక తన పాత శత్రువు టోనీ (విన్ స్టన్ చావో) చేస్తున్న దందాల్ని బంద్ చేయించే ప్రయత్నాలు మొదలెడతాడు. అతణ్ణి చంపడానికి టోనీ అనుచరులు దాడులు ప్రారంభిస్తారు. తన పాత  అనుచరుల పిల్లలు కూడా ఈ మార్గం పట్టకూడదని వాళ్ళకి చదువు చెప్పించే స్కూలు నడుపు తున్న కబాలీ  ఆ స్టూడెంట్స్ అడిగితే  తన గతం చెప్పుకొస్తాడు. 


        ఆ రోజుల్లో సీతారామరాజు ( నాజర్) తమిళుల పెద్ద దిక్కుగా ఉంటాడు. అతను హత్యకి గురవడంతో వారసత్వం కబాలీకి లభిస్తుంది. దీంతో ద్వేషం పెంచుకున్న మరో అనుచరుడు టోనీ తో కుమ్మక్కయి కబాలీని అడ్డు తొలగించే ప్రయత్నంలో గర్భవతి అయిన కబాలీ భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే)  మీద దాడి  చేస్తాడు. అతణ్ణి కబాలీ చంపేసి జైలు కెళ్తాడు.

        ఇలాటి గతమున్న తను ఇప్పుడు వృద్ధాప్యంలో భార్య జ్ఞాపకాలతో బాధగా గడుపుతూంటాడు. ఇప్పుడు యోగి (ధన్సిక) అనే అమ్మాయిని కబాలీని చంపేందుకు నియమిస్తాడు టోనీ. తీరా చూస్తే  ఈమె తన కూతురే అని తెలుస్తుంది కబాలీకి. అంతలో భార్య కూడా బతికే వుందని తెలుస్తుంది...


        పాతికేళ్ళ క్రితం టోనీవల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే ఇక ఇక్కడ్నించీ కబాలీ కథ. 


ఎలావుంది కథ
       
సారి రజనీ జాగ్రత్త పడతారన్న భరోసాకాస్తా అవిరైపోయేలా వుంది కథ. రజనీ ఇందులో ‘బాషా’ ని చూశారా, ‘నాయకుడు’ ని చూశారా, లేక ఏకంగా ‘గాడ్ ఫాదర్’ నే చూశారా? ఈ కథలో తను ప్రజల కోసం పోరాడారా, కుటుంబం గురించి పగదీర్చుకున్నారా? ఈ కథలో తను డానా, ఫ్యామిలీ మ్యానా? రజనీ సార్ తన ఒల్డేజి పాత్రలో బాధపడే దిలీప్ కుమార్ ని చూశారా, మండిపడే అమితాబ్ బచ్చన్ ని చూశారా? చాలా కన్ఫ్యూజన్. కథలో కొత్త దనం లేదు. ఉన్న కథలో హేతుబద్ధత లేదు. కథ దేని గురించన్న స్పష్టత లేదు సరే, నేటివిటీ- కమర్షియాలిటీలు కూడా కరువయ్యాయి. కథలో వున్న ఫ్యామిలీ డ్రామాకి తగిన భావోద్వేగాలు కూడా కరువే. కథ ఎప్పుడూ పాత్ర ద్వారానే వ్యక్తమవుతుంది. నిజ జీవితంలో ఎలా వుండే రజనీని అలాగే వుంచి పాత్రకి సిద్ధం చేయడం ఓ కొత్త ప్రయోగమే, కానీ పాత్రని సీరియస్ పాత్రగా మల్చడమే పొరపాటయి పోయింది. దీంతో చాలా  విషయాల్లో  కమర్షియాలిటీ లేకుండా పోయింది. రజనీ కాంత్ సీరియస్ గా వుండడమంటే ప్రపంచమంతా కూమ్ రివర్ లో కొట్టుకు పోయినట్టే. పాతికేళ్ళ క్రితం ‘చనిపోయిన’ భార్య బిడ్డల గురించే ఇంకా బాధపడే పాత్రా- ఆ పాత్రకి తగ్గట్టు పంచ్ డైలాగుల్లేని, సహజ రజనీ మార్కు హాస్యం లేని, ఏ మ్యానరిజమ్సూ లేని, హుషారు లేని, కసి లేని, ఖుషీ లేని – దుర్భిక్ష పరిస్థితి ఏర్పడిన వాతావరణం. 

ఎవరెలా చేశారు
       
జనీది అంత  ఈలలూ చప్పట్లు పడే పాత్ర కాదని ఈ పాటికే అర్ధమైపోయి వుంటుంది. పోనీ ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ రజనీ పాత్రయినా ఎంటర్ టైన్ చెయ్యదు. అసలా యంగ్ గ్ రజనీ కంటే ఓల్డ్ రజనీయే చాలా బెటర్. ఓల్డ్ రజనీ కూడా ఒక్క క్లయిమాక్స్ లో విలన్ తో చెప్పే నాల్గు డైలాగులే పవర్ఫుల్ గా వున్నాయి. ఇంకెక్కడా రజనీకి డైలాగులే సరీగ్గా లేవు. ఇది వాస్తవిక కథాచిత్రమన్నట్టు మాటలు రాశాడు దర్శకుడు. కమర్షియల్ డైలాగ్ రైటింగ్ అనేది ఏ  పాత్రకీ లేదు. 

        స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ‘షిండ్లర్స్  లిస్ట్’ వుంది. ఇందులో  హీరో లియాం నీసన్ ఒక హోటల్ రూమ్ లో ఒపెనవుతాడు. ముఖం కనపడదు. వస్తువులు కనబడుతూంటాయి. ఖరీదైన వాచీ ధరిస్తాడు. షర్ట్ కఫ్ లింక్స్ పెట్టుకుంటాడు. కోటు కి నాజీ పార్టీ గుర్తుగల పిన్ పెట్టుకుంటాడు. టేబుల్ సొరుగు లోంచి గుప్పెడు కరెన్సీ నోట్లు తీస్తాడు. నైట్ క్లబ్ లోకి ఎంటర్ అవుతాడు...ఇలాగే వుంటుంది జైల్లో రజనీకాంత్ ఎంట్రీ సీను కూడా. ఇది సరిపోలేదు, ఇంకా హైప్ వుండాల్సింది. రజనీకాంత్ తాను పాత్ర వయసుకి తగ్గట్టు గంభీరంగా నటిస్తున్నాననుకున్నారే గానీ, నిజానికి అది కుటుంబ ట్రాజడీ బాధ బరువు కింద కమర్షియాలిటీని ఖూనీ చేస్తున్నా ననుకోలేదు. 

        ఇక రాధిక ఆప్టే, ధన్సిక లు నటించారు గానీ, అవి రియలిస్టిక్ పాత్రలు. విలన్స్ లో కిషోర్, చైనీస్ నటుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరెవరో చిల్లరమల్లర తమిళ కొత్త ముఖాలుగా వున్నారు. రజనీ డాన్సుల్లేవు. వయసుకి తగ్గట్టు తుపాకీ కాల్పులతో యాక్షన్ సీన్స్ వున్నాయి. మ్యూజికల గానూ బలహీనంగా వుంది సినిమా. 


చివరికేమిటి
        సూపర్ స్టార్ రజనీ కాంత్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు రెండు సినిమాల కొత్త దర్శకుడు రంజిత్. ఒల్డేజి రజనీని వెండితెర మీద చూపించడమంటే ఆయన్ని వేగంగా అటు నడిపించడానికీ, లేదా హడావిడిగా ఇటు అడుగులేయించడానికీ మించి విజువలైజేషన్ కన్పించదు  దర్శకుడిలో. రకరకాల సూట్స్ ధరిపంజేయడంలో కనబర్చిన  శ్రద్ధ, ఆ స్టయిలిష్ నెస్ కి తగ్గట్టు మాటల తూటాలు విసిరే ఫన్నీ కోణాన్ని పట్టుకోలేక్పోయాడు. 

        పాతికేళ్ళ తర్వాతా భార్యా బిడ్డలు పోయారన్న విచారంతో వుండే పాత్రగా చిత్రించడం పూర్తిగా-సైకలాజికల్ గా-  అవగాహనా రాహిత్యం. అసలు పాతికేళ్ళ క్రితం జరిగిన దాడిలో గర్భవతైన భార్య  పోవడమనే ఆలోచన పాత్రకి కల్పించడమే అర్ధరహితం.  బహిరంగంగా జరిగిన దాడిలో దాడి  చేసిన వాణ్ణి తాను చంపేస్తే,  పోలీసులు తనని అరెస్టు చేసి పట్టుకెళ్తే, భార్య ఏమయ్యిందో తెలుసుకోడా? చనిపోతే పోలీసులు ఆ సంగతి చెప్పి అంతక్రియలకి అనుమతించారా? చనిపోకుండా ఆస్పత్రిలో ప్రసవిస్తే బిడ్డ పుట్టిన విషయం కూడా చెప్పరా పోలీసులు? భర్త జైలు కెళ్లాడని బతికున్న భార్యకి కూడా తెలీదా పాతికేళ్ళూ? హేతుబద్ధత లేని ఈ ఫ్లాష్ బ్యాక్ మీద పునాది కట్టి మొత్తం కథ నడిపాడు దర్శకుడు. 


        రజనీకాంత్ జైల్లోంచి వచ్చిన పదినిమిషా వరకూ వుండే ఆసక్తి  ఆతర్వాత కథా కథనాల్లో కన్పించక పోవడం, ఇంటర్వెల్  దగ్గర భార్య ఫలానా వూళ్ళో  జీవిస్తోందని తెలిశాక, ఆ తర్వాతి సీన్లో డైరెక్టుగా ఆమెతో కలిపెయ్యకుండా, సెకండాఫ్ లో ఆమెకోసం కావాలని రజనీకాంత్ ని ఊరూరా తిప్పడం (‘బ్రహ్మోత్సవం’  లో మహేష్ బాబు ఏడుతరాల బంధువుల కోసం తిరిగే సీన్లు జ్ఞప్తికి తెస్తూ),  ఆ భార్య కలవగానే- శత్రువుల దాడితో క్లయిమాక్స్ కి వెళ్ళిపోవడం...ఇదంతా విషయలేమిని పట్టి చూపుతుంది. 


        ప్రజల కోసం కబాలీ ఏం చేశాడన్నది ఎక్కడా కన్పించదు. కుటుంబం కోసం పరితపించేవాడు కబాలీ అని బిల్డప్ తో పేరు పెట్టుకుని తిరగనవసరం లేదు. అది కాబూలీవాలా తిరిగి నట్టు వుంటుంది. జైల్లోంచి వచ్చాక అక్కడి ప్రజల కోసం పాటుబడుతూ (ఔటర్ ఎమోషన్), లోలోపల కుటుంబం కోసం బాధపడుతోంటే (ఇన్నర్ ఎమోషన్) - అప్పుడది సమగ్ర పాత్రవుతుంది. ఔటర్ ఎమోషన్ తో ప్రజలకోసం ప్రత్యర్ధుల్ని చీల్చి చెండాడే ప్రచండుడిగా చెలరేగుతోంటే కబాలీ మామూలుగా వుండడు- అడ్వాన్సు బుకింగ్స్ ని దాటి మళ్ళీ వారం కూడా గర్జిస్తూనే వుంటాడు- ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలని!!



-సికిందర్    


18, జులై 2016, సోమవారం

స్క్రిప్ట్ నోట్స్!


హాలీవుడ్ లో స్క్రిప్టుల మీద స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చాలా అధికారాలుంటాయి. కళాత్మక- వ్యాపారాత్మక విలువల దృష్టితో స్క్రిప్టులు చదివి ఎడా పెడా  స్క్రిప్ట్ నోట్స్ పంపిస్తూంటారు రైటర్లకి. ఆ ప్రకారం రైటర్లు మార్పు చేర్పులు చేస్తూపోవాలి. దరిమిలా స్క్రిప్టు తామే గుర్తు పట్టలేనంతగా మారిపోనూ వచ్చు. రెండు సార్లు ఆస్కార్ అవార్డులు పొందిన ప్రసిద్ధ రచయిత ఇంప్రూవ్ మెంట్ పేర, ఓ రచయిత రాసిన స్క్రిప్టు మీద మరికొందరు రచయితలతో కలిసి పని చేశాక- తీరా సినిమా చూస్తే-  తాను రాసిన డైలాగు చిట్టచివర్లో ఒకే ఒక్కటి వుందట! వెరసి ఈ స్క్రిప్ట్ నోట్స్ అనేవి పెద్ద జోకు కింద  మారిపోయాయని ఆడిపోసుకునే వాళ్ళూ లేకపోలేదు. ప్రముఖ హ్యూమరిస్టు  బ్రియాన్ కల్డిరోలా తాజాగా గత ఏప్రిల్ లో ‘టైటానిక్’  సినిమా స్క్రీన్ ప్లే పేజీ మీద స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు  ప్రతాపం చూపిస్తే దాని రూపం ఎలా వుంటుందో- తానే కరెక్షన్స్ తో ఒక స్క్రిప్టు నోట్ ని  తయారు చేశారు. ‘టైటానిక్’  స్క్రీన్ ప్లే లో ఒక సీను పేపర్ మీద ఎగ్జిక్యూటివ్ ఎన్ని తప్పులు పట్టుకుని,  ఎలాటి కామెంట్ లు చేస్తాడో తెలుపుతూ బ్రియాన్ కల్డిరోలా సృష్టించిన కామెడీని  ఈ కింద  మీరే చూడండి! 


***

16, జులై 2016, శనివారం

సాంకేతికం!

అళగర్ సామి 







        తెలుగులో నేటి మెగా బడ్జెట్ల  హై - ఎండ్ టెక్నాలజీ సినిమాల్లో ఏది గ్రాఫిక్స్, ఎంతవరకు కళాదర్శకుడి పరిధీ అన్నది తెలియనంతగా పాలూ నీళ్ళలా కలగలిసిపోయి,  ఈ రెండు విభాగాలూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఒకసారి మహేష్ బాబు నటించిన ‘అర్జున్’ లో మధుర మీనాక్షి దేవాలయ సముదాయం సెట్ నే చూడండి- అదంతా కళా దర్శకుడి అద్భుత ప్రతిసృష్టి లాగే అన్పిస్తుంది చూసే కళ్ళకి. కానీ అందులో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కళాదర్శకుడు వేసిన సెట్ అనీ, మిగతా పై అంతస్తులన్నీ గ్రాఫిక్స్ తో చేసిన కల్పనే అనీ తెలిస్తే భలే ఆశ్చర్య పోతారు! అదీ అళగర్ సామి ప్రతిభ. ‘దశావతారం’ లో కమలహాసన్ ని విగ్రహాకి కట్టి  జలసమాధి చేసే యాక్షన్ దృశ్యం కూడా అళగర్ సామి గ్రాఫిక్  సృష్టే. నిజానికక్కడ సముద్రమనేదే లేదు, అపరబ్రహ్మలా అళగర్ సామి సృష్టించిన గ్రాఫిక్స్ సముద్రమే తప్ప!

          ‘భిన్న ప్రాంతాలనుంచి విభిన్న సంస్కృతుల  నుంచీ యానిమేటర్లు ఈ రంగంలోకి వస్తున్నా కొద్దీ మనం అంతర్జాతీయ స్థాయిని మించిపోతాం!’ అని అంటారీయన గర్వంగా. అన్నట్టు హైదరాబాద్ ఐటీ కూడలి అన్నది పాత మాట.గ్రాఫిక్స్ కి కూడా జంక్షన్ అనేది తాజా మాట. అళగర్ సామి చెన్నై లోని స్టూడియో కేంద్రంగా పనిచేస్తున్నా, ఆరు నెలల క్రితం హైదరాబాద్ లో వెన్ శాట్  టెక్ సర్వీసెస్ పేరుతో  సంస్థ ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ గా వుంటున్నారు.తెలుగులో అల్లు అర్జున్ నటించిన  ‘వరుడు’ కి గ్రాఫిక్స్ సమకూర్చారు. 2003 ఓ ‘ఒక్కడు’ నుంచీ గుణశేఖర్  సినిమాలకి సేవలందిస్తున్నారు.

నమ్మలేని నిజాలు
గ్రాఫిక్స్ కి ముందు   
      ‘వరుడు’ లో కీలక సన్నివేశాల వెనుక నమ్మలేని నిజాలున్నాయి. లైవ్ డెమో సాక్షిగా అది చూపించారు అళగర్ సామి. చూస్తే- మొదట బ్లూమ్యాట్ నేపధ్యంగా కళ్యాణ మండపం సెట్ తప్ప మరేమీ లేదు. దాని చుట్టూ అందమైన పూదోట గానీ, పైన సూర్యోదయపు సువిశాలాకాశం గానీ లేవు. కథ ప్రకారం ఉదయం ఏడున్నరకి పెళ్లి ముహూర్తం. ఆ సన్నివేశాల చిత్రీకరణకి కొన్ని రోజులైనా పట్టొచ్చు. అన్ని రోజులూ అదే ప్రాతఃకాలపు టెంపరేచర్ టోన్ నీ, మేఘాల ఆవరణాన్నీ, చుట్టూ పూల మొక్కల తాజా దనాన్నీ, యధాతధ స్థితిలో వుంచేందుకు ఏం చేయాలన్న సమస్యతో దర్శకుడు గుణశేఖర్ వస్తే, అళగర్ సామి ఇచ్చిన ప్లానే  ఈ లైవ్ డెమోలో ఇప్పుడు చూపిస్తున్న తర్వాతి షాట్లు. ఇప్పడు బ్లూమ్యాట్ కట్ అయిపోయింది. మండపం చుట్టూ ముగ్ధ మనోహర పూదోటా, పైన ఉదయకాలపు బంగారు వన్నెతో మెరిసిపోయే గగనతలమూ, అంతా అళగర్ సామి మాయాజాలం! మళ్ళీ ఇది చాలనట్టూ - పిల్ల వాయువులు వీస్తున్నట్టూ, దాంతో నాజూకైన పూల రేకలు అటూ ఇటూ కదులుతున్నట్టూ అదనపు ఎఫెక్ట్! సినిమాలో తర్వాత మొత్తం మండపం కూలిపోయే సీను కూడా గ్రాఫిక్సేనని చెప్పారు.

గ్రాఫిక్స్ తర్వాత 

    క్లయిమాక్స్  సీన్లో 120 అడుగుల ఎత్తుగల పొగ గొట్టం మీద అల్లు అర్జున్ - విలన్ ఆర్యల మధ్య పోరాట దృశ్యాలు ఇంకా వేరే గ్రాఫిక్స్ కళ. ఇందుకు  రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. 20 అడుగుల ఎత్తులో నిర్మించిన బావి లాంటి సెట్ మీద అర్జున్ - ఆర్య లు కలబడతారు. దీన్ని కూడా బ్లూమ్యాట్ బ్యాక్ డ్రాప్ లోనే షూట్ చేశారు. ఇలా గ్రాఫిక్స్ కోసం సృష్టించే ఏదైనా సెట్ ని రిఫరెన్స్ పాయింట్ అంటారు. ఇలాటి ఈ ‘బావి’ అనే రిఫరెన్స్ పాయింటుని  ఆధారంగా చేసుకుని  గ్రాఫిక్స్ తో 120 అడుగుల ఎత్తున్నట్టు పొగ గొట్టాన్ని సృష్టించి, దాని మీద 20 అడుగుల బావి సెట్ మీద చిత్రీకరించిన అర్జున్- ఆర్యల పోరాటాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఇంకా ఆ పోరాటం ధాటికి పొగ గొట్టం పెచ్చు లూడుతున్నట్టు అదనపు ఎఫెక్ట్ కల్పించారు. 


        ఈ క్లయిమాక్స్ దృశ్యం ‘ఎక్స్ మెన్ వోల్వోరిస్’ అనే హాలీవుడ్ మూవీ లోనిది కదా అంటే, ఒప్పుకున్నారు అళగర్ సామి. ‘ఈ సినిమాలో మనం చూస్తే హీరో - విలన్ లిద్దరికీ అతీంద్రయ శక్తులుంటాయి. అందువల్ల అంత ఎత్తులో వాళ్ళ పొగ గొట్టం ఫైట్ కి విశ్వసనీయత చేకూరింద
నుకోవచ్చు. అదే అల్లు అర్జున్ కి ఇక్కడ ఈ ఫైట్ లో అలాటి మానవాతీత శక్తులు లేవు. సైకో కాబట్టి ఆర్యకి వున్నాయన్న భ్రమ కల్గించారు. ఇందువల్లే ఈ క్లయిమాక్స్ ని ప్రేక్షకులు ఎంజాయ చేయలేక పోయారేమో?’ అంటే, ఇదీ ఒప్పుకున్నారు అళగర్ సామి.

        ‘దేశంలో బాలీవుడ్ తర్వాత ధైర్యమున్న పరిశ్రమ టాలీవుడ్డే’  అని కుండబద్దలు  కొట్టారు. తమిళంలో 10 సినిమాలు నిర్మిస్తే అందులో బిగ్ బడ్జెట్స్ రెండో మూడో వుంటాయనీ, అదే తెలుగులో అయిదారు వుంటున్నాయనీ అభిప్రాయపడ్డారు.  తెలుగులో గుణశేఖర్ సినిమాలతో బాటు ‘స్టాలిన్’, ‘శ్రీ రామదాసు’, ‘పోకిరి’, ‘అతడు’, ‘అతిధి’, ‘సైనికుడు’, ‘దేశముదురు’, ‘వర్షం’, ‘అరుంధతి’, ‘కిక్’, ‘కొమరం పులి’  మొదలైన సినిమాలకి గ్రాఫిక్స్ సమకూర్చారు. 

       ఇంతకీ గ్రాఫిక్స్ లో కెలా వచ్చారంటే, 1994 లో ‘జురాసిక్ పార్క్’ చూసి ఎక్సైట్ అయి యానిమేషన్ కోర్సులో చేరిపోయానన్నారు. అది పెంటా మీడియా సంస్థలో ప్రవేశం కల్పించిందనీ, అక్కడ వార్నర్ బ్రదర్స్, పండోరా ఫిలిమ్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలకి  లెక్కలేనన్ని యానిమేషన్ చిత్రాలు రూపొందించాననీ వివరించారు.  ‘పాండవాస్’ అనే ఇంకో  యానిమేషన్ కి అవార్డు వచ్చిందనీ, ఆ తర్వాత 1998 లో శంకర్ తీసిన ‘జీన్స్’ తో సినిమారంగ ప్రవేశం చేశాననీ చెప్పుకొచ్చారు ఫ్రెండ్లీ గా వుండే అళగర్ సామి.

         అక్కడ్నించీ ‘రోబో’ వరకూ శంకర్ తీసిన సినిమాలన్నిటికీ పని చేశానన్నారు. హిందీతో కలుపుకుని అన్ని భాషల్లో 250 సినిమాల వరకూ గ్రాఫిక్స్ చేశానన్నారు. వీటిలో 95 వరకూ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా చేసిన సినిమాలున్నాయనీ , ఇవన్నీ చేస్తూనే మరోవైపు ఎంబీఏ కూడా పూర్తి చేశాననీ,  తన  స్వస్థలం మధురై సమీపంలోని చిన్న గ్రామమనీ చెప్పారు. 

        సరే, మళ్ళీ మొదటి కొస్తే- ఇలా కళాదర్శకత్వం - గ్రాఫిక్స్ రెండూ కలగలిసి
పోయినప్పుడు, స్థూలదృష్టికి ఆ క్రెడిట్ కళాదర్శకుడికే పోతుంది, అలాగే యాక్షన్ దృశ్యాల క్రెడిట్ యాక్షన్ డైరెక్టర్లకి పోతుంది. మరి గ్రాఫిక్స్ నిపుణుల స్థాన మెక్కడ? వాళ్ళు అస్తిత్వ బాధితులుగా ఇలా మిగిలిపోవాల్సిందేనా?’ అని అడిగితే,  ఇది ఆయన ఎదురు చూడని ప్రశ్న అయింది...ఈ పాయింట్ తన కెప్పుడూ తట్టనే లేదట! 

        ఇక్కడే వున్నమార్కెటింగ్ చీఫ్ సుఖ్విందర్ సింగ్ అయితే కాసేపటి వరకూ తేరు కోలేకపోయారు. ఇక్కడే వున్న సీనియర్ మేనేజర్ కొండల రెడ్డి- ‘మేమెంత వర్క్ చేశామో, ఆర్ట్ డైరెక్టర్లు, యాక్షన్ డైరెక్టర్లూ ఎంత చేశారో లోలోపల మాకు తెలుస్తుంది’ అని ఏదో సర్ది చెప్పుకోబోయారు. 

        ఈలోగా సుఖ్విందర్ సింగ్ తేరుకుని- ‘మా ప్రొఫెషన్ లో ఈ ప్రశ్న మాకే తట్టలేదు, ఇంతవరకూ ఇలాటి ప్రశ్న ఇంకెవరూ ఎవరూ వేయలేదు’ అని  చెంపలు రుద్దుకున్నారు. అయితే తెలుగు మీడియాలో మొట్ట మొదటి సారిగా ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా తమ  ఉనికి గురించి బయటి ప్రపంచానికి ఇలా తెలుస్తోంది గనుక ఇక నిశ్చింతగా  వుంటామన్నారు.


-సికిందర్
(సెప్టెంబర్ 2010, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక’)

15, జులై 2016, శుక్రవారం

రివ్యూ!





స్క్రీన్ ప్లే – దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి


తారాగణం : అల్లరి నరేష్, సాక్షీ చౌదరి, కామనా రణౌత్, రవిబాబు, పృథ్వీ, నాగినీడు. సప్తగిరి, షకలక, సత్య తదితరులు
మాటలు : డైమండ్ రత్నం, సంగీతం : సాయికార్తీక్, ఛాయాగ్రహణం : లోకనాథ్
 బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్ – గోపీ ఆర్ట్స్
నిర్మాత : చలసాని రామబ్రహ్మం చౌదరి
విడుదల : 15 జులై, 2016  
 ***

       అల్లరి నరేష్ కి ఇంకా అల్లరి తక్కువ అయోమయం ఎక్కువా అన్నట్టు తయారయ్యింది. 2012 లో ‘సుడిగాడు’  తర్వాత ఇంతవరకూ ఇంకో హిట్ కూడా లేని (వరసగా 9 ఫ్లాపులు) తనకి ఇప్పడు మరో ఫ్లాపు కూడా తోడయ్యింది. తన బ్రాండ్ అల్లరిని పూర్తిగా మర్చిపోయి, ఎంతసేపూ  ‘సుడిగాడు’ నే అనుకరిస్తూ,  అదేపనిగా ఇతర హీరోలని పేరడీ చేసే మూసలో పడిపోవడం ఈ ఏకైక కామెడీ హీరోకి  ట్రాజెడీగా పరిణమించింది. పేరడీలమయమైన ‘సెల్ఫీరాజా’ టైటిల్ ని  ‘స్పూఫీ రాజా’ గా పెట్టుకుని ఇది మరో పేరడీ గారడీ అని  డైరెక్టుగా చెప్పేస్తే సరిపోయేది- ‘సెల్ఫీ రాజా’  టైటిల్ తో ఈ సినిమా కథ(?) కేం సంబంధం లేదు!

       దర్శకుడు జి. ఈశ్వర్ రెడ్డి ఇంకా గత శతాబ్దంలోనే వుండిపోవాలనుకుంటే వుండి పోవచ్చు. కానీ బయ్యర్లూ ప్రేక్షకులూ  ఈ శతాబ్దంలో వుండాలనుకుంటున్నారు. అందుకు పది వారాలుగా ‘బిచ్చగాడు’ ని ఆడిస్తున్నారు. ఇంకా కథా కాకరకాయా లేని పేరడీలూ; పాములతో, మారు వేషాలతో, దాగుడుమూతల దొంగాటలతో చెలామణి చేద్దామనుకునే చైల్డిష్  కామెడీల్ని, బూతు వ్యవహారాల్నీ ఎంజాయ్ చేసే ఓపికతో  ప్రేక్షకులు లేరు. గృహమే కదా స్వర్గసీమా అన్నట్టు ఈ దర్శకుడు తనలోకంలో తాను  ఎంజాయ్ చేసిందే కామెడీ అనుకుంటూ సబ్జెక్టివ్ గా ప్రేక్షకుల నెత్తిన రుద్దిన ‘సి’ గ్రేడ్ సరుకులా వుందిది. 

        కథంటూ వుంటే అది ఇంటర్వెల్ లోపే అయిపోవడం,  ఆపైన సాగదీసిందంతా తలాతోకాలేని, ఏమిటో అర్ధంకాని, గజిబిజి గందరగోళం కావడం-  ఇదంతా ఈసారి కామెడీతో పరాకాష్టకి చేరిన అల్లరి నరేష్ పరిహాసంలా వుంది! 

కథ 
      రాజా (అల్లరి నరేష్) సెల్ఫీ  పిచ్చితో ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, నోటి దూలతో తనే ఇబ్బందుల్లో పడ్డం జీవితంగా గడుపుతూంటాడు. ఏం చేస్తూంటాడో మనకి  తెలీదు, చెవిటి వాళ్ళయిన బాబాయ్- పిన్నీలతో  వుంటాడు. ఒకరోజు పోలీస్ కమిషనర్ (నాగినీడు) కూతురు శ్వేతతో (సాక్షీ చౌదరి) తో ప్రేమలో పడతాడు. ఈమె కూడా ఏం చేస్తూంటుందో మనకి తెలీదు. ఇద్దరికీ పెళ్లి నిశ్చయమై  ఆ పెళ్లి  కాస్తా జరిగిపోతుంది. మొదటి రాత్రి  రాజా గర్ల్  ఫ్రెండ్ ఒక గిఫ్ట్ పంపడంతో రాజాతో కొట్లాడి శ్వేత విడిపోతుంది. ఆమెకి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తాడు, వెళ్లి చావమంటుంది. చావడానికి విఫలయత్నాలు చేస్తాడు. ఒక కాకి (కాంట్రాక్ట్ కిల్లర్- రవిబాబు) కన్పిస్తాడు. అతడికి డబ్బిచ్చి తనని చంపమంటాడు.  ఇంతలో శ్వేత వచ్చి రాజా గర్ల్ ఫ్రెండ్ గురించి తను తప్పుగా అర్ధం చేసుకున్నానని  కాళ్ళ మీద పడుతుంది. రాజా కంగారు పడతాడు, తనని చంపకుండా కాకి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు...

 ఎలావుంది కథ 
        పైన చెప్పుకున్నంత వరకే కథ- ఆపైన కథ వుండేందుకు అవకాశం లేదు. ఎప్పుడైతే  శ్వేత వచ్చి కాళ్ళ మీద పడిందో ఆ గంట లోపే కథ ఖతం! ఇంకో గంట కథ ఉండాలి కాబట్టి లేని కథకి – ఎలాగైతే ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో ఇంటర్వెల్ నుంచీ వేరే  దొంగల కథ తెచ్చి అతికించారో -  అలా అంతకంటే రసాభాసగా అర్ధంపర్ధంలేకుండా నింపేశారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ కి కవల తమ్ముడు ‘సెల్ఫీ రాజా’. 

 ఎవరెలా చేశారు 
      ఎవరూ ఏమీ చేయలేదు. చేసి వుంటే మొదటి గంట లోపే - కథ ఉన్నంత సేపే- అల్లరి నరేష్, సప్తగిరి, తాగుబోతు రమేష్, పృథ్వీ, మరికొందరు జబర్దస్త్ కమెడియన్లు చేశారు. ఆ తర్వాత చేసిందంతా తలకాయనొప్పి. బూతు- చివరి షాటు వరకూ ‘‘గే’ కామెడీ. మొదటి గంటలోపు కామెడీకి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ - థాంక్స్ టు  డైమండ్ రత్నం డైలాగ్స్- రెండో గంటంతా లేదు. ఇక రెండో పాత్రలో అల్లరి నరేష్ దిగడం వున్న అర్ధంకాని వ్యవహారానికి ఇంకా సహన పరీక్షయి కూర్చుంది. సినిమా అంటే నిమిషానికో పాత్రని దింపుకుంటూ పోవడమే అన్నట్టుంది- ఏ పాత్ర ఏమిటో ఎందుకో అర్ధంగాక ఫాలో అవడం మానేస్తాం మనం. ఇక హీరోయిన్లకి పాత్రలే లేవు- వున్నట్టుండి వచ్చే పాటల్లో  కన్పించి వెళ్లిపోతూంటారు. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్  కూడా ఏమంత గ్లామరస్ గా లేదు. పాత్ర ఎలా ఎస్టాబ్లిష్  అయింది, ఎలా చిల్లర కామెడీ కింద దిగజారిందీ తెలిసీ పాపం రవిబాబు నానా కంగాళీ చేస్తూంటే జాలిపడాల్సి వస్తుంది మనకి.  

        సాయికార్తీక్ కూర్చిన పాటలు మాత్రం క్యాచీగా వున్నాయి, అలాగే లోకనాథ్ ఛాయాగ్రహణం ప్లెజంట్ గా వుంది. ఈశ్వర్ రెడ్డి కథా నిర్వహణ, దర్శకత్వం మాత్రం చాలా దిగువ స్థాయిలో  వున్నాయని చెప్పక తప్పదు. అతనింకా బేసిక్ గా సినిమా అంటే ఏమిటో, ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ అవాలో అ ఆ ల దగ్గర్నుంచీ నేర్చుకోవాల్సి  వుంది- కళాఖండాల గురించి కాదు, ఉత్త కమర్షియల్స్ గురించే!

చివరికేమిటి
        అరగంట లోపు బిగినింగ్ ని సెటప్ చేస్తే అది ప్రాణాంతాకంగా మారడం పరిపాటైంది ఈ మధ్య తెలుగు సినిమాలకి. అరగంటలోపే  హీరోని సమస్యలో పడేశాక ఆతర్వాత మిగతా గంటన్నరో, రెండు గంటలో కథ ఎలా నడపాలో అంతుచిక్కక  ఇంటర్వెల్ కల్లా చేతు లెత్తేస్తున్నారు. తాజాగా  ‘రోజులు మారాయి’ లోకూడా చూశాం. ఇప్పుడు ‘సెల్ఫీ రాజా’ లోనూ అరగంటలో అల్లరి నరేష్ పెళ్లి చేసేసి భార్యతో సమస్యలో పడేస్తూ ఆశ్చర్య పరుస్తుంది. ఇక్కడ్నించీ ఫస్టాఫ్ అంతా, ఇంకా సెకండాఫ్ అంతా ఆ సమస్యతో ఎలా నడుపుదామని?

         
దర్శకుడు అల్లరి నరేష్ కిచ్చింది యాక్టివ్ క్యారక్టరేనా? అది పాసివ్ క్యారక్టర్ కాదా? మరైతే భార్య తనని అనుమానించినప్పుడు- అసలా గిఫ్ట్  పంపిన ఆకాశరామన్న  ఎవడో  తనే తెలుసుకుని-  భార్య  అనుమానం తీర్చకుండా వూరికే భార్యకి నచ్చజెప్పుకునే విఫలయత్నా లెందుకు చేస్తాడు? ఆకాశరామన్న ఎవడో  పోలీస్ కమీషనర్  అయిన మామ తెలుకోవాల్సి వచ్చింది! అప్పుడు భార్య వచ్చి కాళ్ళ మీద పడితే అల్లరి నరేష్ సమస్య తీరిపోయింది! ఇది పాత్రేనా? దీంతో ఇదొక కథేనా?

        దీనికంటే ముందు విసిగిన భార్య వెళ్లి చావమంటుంది. నరేష్ చావాలనుకోవడం మంచి మలుపే. కానీ దీనికి తగ్గ సెటప్ ఏదీ? బిగినింగ్ ని ముగిస్తూ భార్య విడిపోయినప్పుడు,  నరేష్ కి పెట్టిన సమస్య కి - అపార్ధం తొలగించాలన్న గోల్ కీ - ఉండాల్సిన సీరియస్ బ్యాక్ గ్రౌండ్ ఏదీ? కామేడీల్లో బ్యాక్ గ్రౌండ్ సీరియస్ గా లేకపోతే   హీరోకి కామెడీతో సమస్య ఎలా పుడుతుంది? గోల్ ఎలా ఏర్పడుతుంది? ఆపైన కామెడీ ఎలా వర్కౌట్ అవుతుంది? కామెడీల్లో బ్యాక్ గ్రౌండ్  సీరియస్ గా వుండి, హీరో సీరియస్ గా వుండనవసరం లేదు కదా?  బ్యాక్ గ్రౌండూ సీరియస్ గా లేకుండా, నరేష్  కామెడీగా వుండడం వల్లే కదా అతను చావాలనుకోవడం అల్లాటప్పా వ్యవహారంగా మారిపోయింది?

        చావాలనుకోవడం పాసివిజం కాదు, బ్యాక్ గ్రౌండ్ సీరియస్ గా వుంటే! నరేష్  తనే ఆకాశ రామన్నని పట్టుకుని నిజం నిరూపించినా ఎందుకో నమ్మని భార్య- ఇంకా బలమైన మాటలతో  గాయపరిస్తే - అప్పుడు మాత్రమే చావాలనుకోవడం వర్కౌట్ అవుతుంది. సానుభూతి కూడా పుడుతుంది. ఐరనీ లోంచే హాస్యం పుడుతుంది. ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ అనే హిందీ హిట్ కామెడీ లోనూ ఇంతే. అప్పుడు చావాలకునే గోల్ తో నరేష్  ఎంత అసంబద్ధ కామెడీ నైనా సృష్టించవచ్చు. చావడానికి రెండో ప్రయత్నంగా అల్లరి నరేష్ బిల్డింగ్ ఎక్కినప్పుడు తాగుబోతు రమేష్ అతణ్ణి తోసెయ్యడం, అక్కడ్నించీ ఇంకెవరొచ్చినా   తోసిపారేస్తూ వుండడం పడీ పడీ నవ్వించ గల్గిన కామెడీనే. ఇంత సామర్ధ్యం ఆతర్వాత దర్శకుడిలో ఏమైపోయింది? బ్యాక్ గ్రౌండ్ లో సీరియస్ నెస్ లేకపోయినా ఇది వర్కౌటయింది. కానీ పదే పదే వర్కౌట్ కాదు. అప్పుడు తనని చంపమని కాకికి సుపారీ ఇచ్చాడు నరేష్. అంటే ఈ పాయింటుతో కథ ఇక్కడ్నించీ రన్ అవుతుందని అర్ధం. ఈ పరిణామాలన్నీ సమస్యతో నరేష్ చేస్తున్న సంఘర్షణలో భాగం  కిందికే వస్తాయి. 

        దీంతో అభ్యంతరం లేదు గానీ- భార్య వచ్చి కాళ్ళ మీద పడగానే ఓ ఫ్లాష్ బ్యాక్ వేసి అంతకి ముందు కాకికి తను కాంట్రాక్ట్ ఇచ్చింది చూపించి వెంటనే ఇంటర్వెల్ వేసెయ్యడం  ఉరుములేకుండా పిడుగు పడేసినట్టుంది. హఠాత్తుగా  ముగించి పారేసే సినిమాల్ని చూశాం గానీ, ఇలా హఠాత్తుగా ఇంటర్వెల్ వేసే సినిమాల్ని చూసి వుండం! తెల్లబోయి ఖాళీ వెండి తెర కేసే చూడ్డం మన వంతవుతుంది! 

     వాస్తవానికి భార్య దారికొచ్చి నప్పుడే  అల్లరి నరేష్ ఏమీ చేయకుండానే ఇంటర్వెల్ లోపే కథ సుఖాంతమైంది. ఇక మిగిలింది కాకి గురించిన ఫినిషింగ్ టచ్చేనా? ఒకసారి కాంట్రాక్టు తీసుకున్నాక చంపకుండా వదలనన్న వాడి గురించేనా? వాడి సంగతి కూడా నెక్స్ట్ సీన్లోనే పోలీస్ కమీషనర్ మామ చూసుకుని ఫినిషింగ్ టచ్ ఇస్తాడుగా- ఆపైన ఇంటర్వెల్ లేకుండా శుభం కార్డు వేసేస్తూ?


        చంపాలన్న కాకి ఏటో పోతాడు. కమీషనర్ తో ఇరవైఏళ్ల పగ వున్న  రౌడీ ఒకడు   నరేష్ ని చంపాలని వెంటబడతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ పృథ్వీ చేసిన బూతు పనికి ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ గుంపుతో అతడి వెంటపడతారు. రవిబాబు, అతడితో బాటు నరేష్ తన పాములతో పాల్పడిన ఇంకో బూతుకి అవి చచ్చాయని ఓ పాములోడు షకలక శంకర్ వాళ్ళిద్దరి వెంటా  పడతాడు. రవిబాబు తమ్ముణ్ణి అంటూ ఇంకో అల్లరి నరేష్ దిగుతాడు. ఇతన్ని చంపడానికి ఇంకెవరో....గోలగోలగా అరుపులూ, కొట్టుకోవడాలూ పారిపోవడాలూ...అసలు మొదలెట్టిన కథేమిటి? ఫోకస్ చెదిరి జరుగుతున్న దేమిటి? 

        భార్య అప్పుడే కాళ్ళ మీద పడకుండా,  తనని చంపమని కాకికి అల్లరి నరేష్ ఇచ్చిన కాంట్రాక్టుతో మరో కోణంలో మరిన్ని విఫలయత్నాలు చూపిస్తూ కథని ఫోకస్ లో పెట్టుకోకుండా,  దర్శకుడు తానొక్కాడు ఆనందిస్తే చాలు అదే కామెడీ అనుకోవడం నిజానికి కామెడీ అనుకోవాలి ఇక్కడ!


-సికిందర్
http://www.cinemabazaar.in