రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, డిసెంబర్ 2022, గురువారం

1253 : రివ్యూ!


రచన -దర్శకత్వం : ఏఆర్ మోహన్
తారాగణం : అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీ తేజ్, రఘుబాబు తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకా, ఛాయాగ్రహణం : రాంరెడ్డి
బ్యానర్స్ : జీ స్టూడియోస్, హాస్య మూవీస్ 
నిర్మాణం : జీ స్టూడియోస్, రాజేష్ దండా
విడుదల ; నవంబర్ 25, 2022
***

        హీరోగా అల్లరి నరేష్ కామెడీ సినిమాలతో ఓ వెలుగు వెలిగాక ఆ వైభవం తగ్గి, హీరోల సరసన సహాయ పాత్రలేశాడు. అలా కొనసాగుతూండగా నాంది అనే సీరియస్ సామాజికంలో హీరోగా నటించే అవకాశం లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పోలీసులతో సామాన్యుడి పోరాటం నాంది హిట్ తర్వాత, అదే మార్గంలో కొనసాగాలన్నట్టు ఇప్పుడు ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం అనే మరో సీరియస్ సామాజికంలో నటించాడు. ఇందులో గిరిజనుల సమస్యల్ని చేపట్టాడు. ఇలా సెమీ రియలిస్టిక్ సినిమాలవైపు దారి మళ్ళించుకుని నటిస్తున్న అల్లరి నరేష్ సినిమా అంటే కొత్త అసక్తితో థియేటర్ల వైపు అడుగులేస్తున్నారు ప్రేక్షకులు. ఇలా సెకెండ్ ఇన్నింగ్స్ తో తిరిగి డిమాండ్ వున్న హీరోల మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవుతున్న నరేష్ ఈ రెండో ప్రయత్నంతో రాణించాడా? ఈ ప్రయత్నంలో కొత్త దర్శకుడు ఏఆర్ మోహన్ ఎంతవరకు సహకరించాడు? ఇవి తెలుసుకుందాం...

కథ

శ్రీపాద శ్రీనివాస్ (నరేష్) ప్రభుత్వ స్కూల్లో తెలుగు టీచర్. అందరికీ సహాయపడాలనుకుం
టాడు. తెలుగు టీచర్ అయినందుకు పెళ్ళి సంబంధాలు రాక జోకులకి టార్గెట్ అవుతాడు. అదే స్కూల్లో పరమేశ్వర్ (వెన్నెల కిషోర్) డబుల్ ఎమ్మే ఇంగ్లీషు టీచర్. ఇతడి డిగ్రీలు కూడా పెళ్ళికి పనికి రాక ఈసురోమని జీవిస్తూంటాడు. ఇద్దరికీ ఏజెన్సీ ఏరియా మారేడుమిల్లి ఉప ఎన్నిక డ్యూటీ పడుతుంది. అక్కడ గిరిజన ప్రాంతాల్లో మూడు శాతమే నమోదవుతున్న ఓటింగ్ ని 100 శాతానికి పెంచే బాధ్యత మీద పడుతుంది. అక్కడికి బయల్దేరి వెళ్తారు.

వీఆర్వో బాబు (ప్రవీణ్) వెంటవుడి అడవిలో కాలి నడకన తీసుకుపోతాడు. చుట్టు పక్కల 12 గిరిజన గ్రామాలుంటాయి. ఆ గ్రామాలకి ఓ పెద్ద వుంటాడు. కండా (శ్రీతేజ్) అనే అనుచరుడు వుంటాడు. ఆ పెద్దతో బాటు గిరిజనులు శ్రీనివాస్ బృందం ప్రవేశాన్ని వ్యతిరేకిస్తారు. ఓట్లు వేసేది లేదు పొమ్మంటారు. 30 ఏళ్ళుగా మొర పెట్టుకుంటున్నా రోడ్లు వెయ్యరు, స్కూళ్ళు పెట్టరు, ఆస్పత్రులు తెరవరు- అనారోగ్యంతో ఆస్పత్రి కెళ్ళేందుకు నది దాటాలంటే వంతెన కట్టరు- అందుకని ఓట్లు వెయ్యం పొమ్మంటారు.

శ్రీనివాస్ ఒక అత్యవసర పరిస్థితిలో వాళ్ళని ఆదుకోవడంతో కరిగి, అతడి మాట వింటారు. ఓట్లు వేయడానికి ముందుకొస్తారు. 100 శాతం ఓట్లు నమోదవుతాయి. అయితే శ్రీనివాస్ బృందం డ్యూటీ ముగించుకుని బ్యాలెట్ బాక్సులతో విజయవంతంగా తిరిగి వెళ్తూంటే, కండా కిడ్నాప్ చేస్తాడు. దీంతో ప్రభుత్వంలో కలకలం రేగుతుంది. ఆ ప్రాంతానికి పరుగులు తీస్తారు.

కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఇప్పుడు శ్రీనివాస్ ఏం చేశాడు? గిరిజనుల సమస్యలు తీర్చడానికి వ్యవస్థతో ఎలా పోరాడాడు? అతడికి లచ్మి (ఆనంది) ఎలా సహకరించింది? కలెక్టర్ అర్జున్ త్రివేది (సంపత్ రాజ్) ఎలాటి చర్యలు తీసుకున్నాడు? మధ్యవర్తిగా వెళ్ళిన మార్కెట్ కమిటీ సెక్రెటరీ కోటేశ్వరరావు (రఘుబాబు) ఏమయ్యాడు? చివరికి శ్రీనివాస్ ఆశయం నెరవేరిందా? ఇవి తెలుసుకోవాలంటే సెకండాఫ్ చూడాలి.

ఎలావుంది కథ

గిరిజనుల ఇవే సమస్యల గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే ఇందులో ఎన్నికల సిబ్బంది కిడ్నాప్ ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలనే ఎత్తుగడ కొత్తది. ఓట్లు వేశాం కాబట్టి మా సమస్యల్ని ఇప్పుడే పరిష్కరిస్తే బ్యాలెట్ బాక్సులిస్తామని మెలిక పెట్టడం ద్వారా కొత్త డ్రామాకి తెర తీయడం బావుంది. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే దీని కథా నిర్వహణ కలిసిరాలేదు. దీంతోబాటు ముగింపు హాస్యాస్పదంగా మారింది.

ఒక కలెక్టర్ గిరిజనులకి తన అధికార పరిధిలో లేని వందల కోట్ల రూపాయల బ్రిడ్జిని తనే శాంక్షన్ చేసి సంతకం పెట్టి ఎలా ఇస్తాడు. ముఖ్యమంత్రి మంజూరు చేస్తేనే చెల్లుతుందని టీచర్ శ్రీనివాస్ కి తెలియదా? కలెక్టర్ రాసిచ్చిన కాగితం తీసుకుని విజయోత్సాహం జరుపుకోవడమేమిటి? సినిమా కోసం సినిమాటిక్ గా తీశారని ప్రేక్షకులు సర్దుకుపోవాలా? రాజకీయ వర్గాలు, ప్రభుత్వాలు గిరిజనుల్ని మభ్యపెడుతున్నాయని ఆరోపిస్తూనే - ఈ సినిమాని కూడా గిరిజనుల్ని మభ్యపెట్టేలా తీశారేమో? రాజకీయం-ప్రభుత్వం-సినిమా ఒక తానులోని ముక్కలనుకోవాలా?

ఉథృతంగా పారుతున్న నదిలో సురక్షితంగా శ్రీనివాస్ చేసే ప్రసవ ఏర్పాట్ల సీను, గిరిజనుల కుల దైవాలైన పశువులు కలెక్టర్ ని, పోలీసుల్నీ అడవిలో కుమ్మే యాక్షన్ సీను, తీవ్రంగా గాయపడ్డ కలెక్టర్ని గిరిజనులు నది దాటించే సీనులో అనుభవపూర్వకంగా అతడికి తెలిసివచ్చే గిరిజనుల కష్టాలు - ఈ మూడు భావోద్వేగాలకి గురిచేసే ఘట్టాలు తప్ప మిగతా సినిమాలో వుండాల్సిన విషయం, కూర్చోబెట్టే కథా కథనాలు కనిపించవు.

ఇంటర్వెల్లో రొటీన్ గా అన్పించే కిడ్నాప్, సెకండాఫ్ ప్రారంభంలో ఆ కిడ్నాప్ లో వున్న రహస్యంతో ఆసక్తి పెంచుతుంది. దీంతోనే శ్రీనివాస్ సెకండాఫ్ కథ నడుపుతాడు. అయితే వ్యవస్థతో ప్రత్యక్షంగా పోరాడకుండా, తను కిడ్నాపైన బందీగా వుండిపోయి- గిరిజనులకి ఐడియాలిచ్చి వాళ్ళు పోరాడేలా చేయడంతో- శ్రీనివాస్ గా నటించిన నరేష్ కి పని లేకుండా పోయింది. గిరిజనులు పోరాడుతూంటే, తను అప్పుడప్పుడు ఓ ఏడెనిమిది సీన్లలో మాత్రమే కనిపిస్తాడు! దీంతో హీరో లేని కథగా సెకండాఫ్ బెడిసి కొట్టింది. నరేష్ పోషించింది పాసివ్ క్యారక్టరైపోయింది.

ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు పోలింగ్ సీను వరకూ వెన్నెల కిషోర్-ప్రవీణ్ ల కామెడీ సీన్లు కథ సీరియెస్ నెస్ ని దెబ్బతీస్తూ ఫస్టాఫ్ ని బలహీనం చేస్తాయి. మళ్ళీ సెకండాఫ్ లో రఘుబాబు గుండెపోటు కామెడీ ఘోరంగా వుంటుంది. ఫస్టాఫ్ లో లచ్మి పాత్ర ఆనందికి నరేష్ ప్రపోజ్ చేయడం, ఆమె కాదనడం జరిగాక, మళ్ళీ ఆ లవ్ ట్రాక్ జోలికి పోకుండా అసంపూర్ణంగా అక్కడితో వదిలేశారు.

సెకెండాఫ్ లో గిరిజనులతో నరేష్ పన్నే వ్యూహాలు కూడా ఈ రియలిస్టిక్ కథలో లాజిక్ లేని మూస ఫార్ములా ధోరణితో వుంటాయి. 248 ఓట్లు పోలైన బ్యాలెట్ బాక్సుల కోసం ఏకంగా మిలిటరీ దిగడం ఇల్లాజికల్. చివరికి వ్యూహకర్తగా ఏమీ చేయలేని పరిస్థితిలో నరేష్ పడితే, ప్రభుత్వంలో అనుకోకుండా చోటు చేసుకునే ఒక పరిణామమే నరేష్ ని గట్టెక్కిస్తుంది తప్ప- నరేష్ గొప్పతనమేమీ లేనట్టుగా పాత్ర చిత్రణ చేసేశారు.

ఇలా గిరిజన సమస్యలతో బాటు కథలో సమస్యలు చాలా వున్నాయి. ముందు చేతిలో కథగా రాసుకున్న కాగితాలే ఇలా వుంటే, గిరిజనుల తలరాతలేం మారుస్తాడు కొత్త దర్శకుడు.

నటనలు- సాంకేతికాలు

అందరూ బాగా నటించారు. నరేష్ కూడా కమర్షియల్ గిమ్మిక్కులు కాకుండా రియలిస్టిక్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. కామెడీ జోలికి పోలేదు. సీరియస్ పాత్రలు కూడా నటించగలడని రెండోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అయితే సెకండాఫ్ లో తెరమరుగై ఓ ఏడెనిమిది సీన్లలో మాత్రం కన్పించి సరిపెట్టేయడం రియలిస్టిక్ సినిమాకైనా వర్కౌట్ అయ్యేది కాదు. క్లయిమాక్స్ లో యాక్షన్లోకి దిగి ప్రేక్షకుల్ని కాస్త సంతృప్తి పరుస్తాడు, అంతే.

హీరోయిన్ ఆనందిది వ్యక్తిత్వమున్న పాత్రేగానీ కథలో అంతగా పనిలేక బ్యాక్ గ్రౌండ్ లో కన్పించే పాత్రగా వుండిపోయింది. విలన్ గా కలెక్టర్ పాత్ర నటించిన సంపత్ రాజ్ నటన ఫర్వాలేదుగానీ, రాష్ట్రపతి అవార్డు పొందిన కలెక్టర్ గా గిరిజనుల్ని అంతలా హింసిస్తాడా అన్నది ప్రశ్న. మిగిలిన పాత్రల్లో అందరూ మంచి నటులే.

సీనియర్ రచయిత అబ్బూరి రవి సంభాషణలు బలంగా వుండాల్సిన చోట బలంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. వీటికి తగ్గ కథా కథనాలే కొత్త దర్శకుడి కలం నుంచి జాలువారలేదు. శ్రీచరణ్ పాకాసంగీతంలో సిట్యుయేషనల్ సాంగ్స్ వున్నాయి. రాంరెడ్డి ఛాయాగ్రహణంలో అటవీ దృశ్యాలు అద్భుతంగా వున్నాయి. పశువులు కుమ్మే సీను చిత్రీకరణ హైలైట్.

మొత్తం మీద అల్లరి నరేష్ నటించిన రెండో సామాజికం ఇంటలిజెంట్ గా వుండేట్టు చూసుకోవాల్సింది. ఈసారికి ఎన్నో లోపాలతో, వర్కౌట్ కాని ముగింపుతో ప్రేక్షకులు సరిపెట్టుకోవాలి.

—సికిందర్