రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 27, 2023

 

724 : విస్మృత సినిమాలు - 'పాలపిట్ట' ఆర్టికల్

(ఇప్పటి తెలుగు సినిమా ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో సస్పెన్స్ అనే ఎలిమెంటే వుండడం లేదు. అదేదో మిస్టరీ, క్రైం, యాక్షన్ కథల వ్యహారమనుకునే దురవగాహనతో వుంటున్నారు. పైగా గత రెండు దశాబ్దాలుగా తెలుగులో అవే రోమాంటిక్ కామెడీలూ, లేదంటే అవే మాస్ యాక్షన్లూ మాత్రమే చూస్తూ పెరిగిన కొత్తతరం దర్శకులు ఇంకో కళాప్రక్రియని  వూహించలేక పోతున్నారు. ఎప్పుడైనా కుటుంబ కథ తీస్తే ఆ పాత్రల జీవితాల్లో థ్రిల్లే వుండదు, సస్పెన్సే వుండదు. పాసివ్ పాత్రలతో చప్పగా పాసివ్ కథనాలు చేసి చేతులు దులుపు కుంటున్నారు. ఈ నేపథ్యంలో టైమ్ లాక్ కథా సంవిధానంతో టెక్నికల్ గా రాసి తీసిన మనసేమందిరం ని స్టడీ చేయడం నేటి మేకర్స్ కి అవసరం. 29 ఏళ్ళ వయసులో యువ దర్శకుడుగా  సి వి శ్రీధర్ చేసిన కళాసృష్టి మరోసారి చదవండి)

    తెలుగు ప్రేక్షకుల సినిమాభిరుచి అప్పుడూ ఇప్పుడూ ఒకే తరహాలో తీర్చిదిద్దుకు న్నట్టుంది. సినిమాలు పక్కా వినోదాత్మకంగా వుండాలన్నదే మెజారిటీ వర్గం ప్రేక్షకులు శిలాశాసనం రాసుకున్న ఏకైక అభిరుచేమో. స్టాంపు వేసిన ఈ అభిరుచి ప్రకారం సినిమాలు వుండకపోతే  విషయం లేని సినిమాల కింద మరణశాసనం రాసేస్తారు. బలమైన కథ వుందంటే, ఇక విషయం లేనట్టేనని తీర్పు ఇచ్చేస్తారు. ఈ వర్గం ప్రేక్షకులు కాలగర్భంలో కలిపేసిన సినిమాలన్నీ విస్మృత సినిమాలు కావు. తగిన కథాబలమూ, కథా ప్రయోజనమూ వుండి, వాళ్ళ అభిరుచికి దూరంగా వుండిపోయినవే విస్మృత సినిమాలన్పించుకుంటాయి. వాళ్ళ దృష్టిలో వీటికి వినోదాత్మక విలువ వుండదు. వినోదాత్మక విలువలు లేని సినిమాలు ఇతర భాషల్లో హిట్టయి చరిత్రలో నిల్చిపోతే, అవే తెలుగులో పునర్నిర్మించినప్పుడు ఫ్లాపయి పౌరసత్వాన్ని కోల్పోతాయి. ఇలాటిదే ఇంకో విస్మృత సినిమా ‘మనసే మందిరం’. ఇది తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హిట్టయి, విచిత్రంగా తెలుగులో టైటిల్ మాత్రమే పాపులరైంది. 

          
మిళ మాతృక నుంచి ఈ రీమేకులన్నీ జరిగాయి. వినోదాత్మక విలువలు లేని, పూర్తి శోక రసమయమైన ఈ మాతృకని, ఎలా ఇన్ని భాషల్లో రీమేక్ చేయడానికి సాహసించారనేది జవాబు దొరకని ప్రశ్న. బహుశా కథని నమ్మడం వల్ల, కథకిచ్చిన ముగింపుకి దాసోహమై పోవడం వల్ల. ఇంతకంటే కారణాలు కన్పించవు. అదింకా 1960 ల నాటి కాలం. ట్రాజడీలని ఆదరిస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ లో సి.వి. శ్రీధర్ అనే నిర్మాత, దర్శకుడు, రచయిత ‘నెంజిల్ ఒరు ఆలయం’ అనే విషాదాంత ప్రేమాయణం తీశాడు. సి.వి. శ్రీధర్ ( చిత్తమూర్ విజయ రాఘవులు రెడ్డియార్ శ్రీధర్, 1933 – 2008) తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి పేరున్నదర్శకుడు.1954 లో 21 వ యేట దర్శకుడైన శ్రీధర్, 1991 వరకూ 37 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో 66 సినిమాలు తీశాడు. వీటిలో 47 తమిళం, 10 తెలుగు, 9 హిందీ వున్నాయి. ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, రాజ్ కపూర్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ కుమార్, శశికపూర్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, శత్రుఘ్న సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మీనాకుమారి, వైజయంతీ మాలా, రాజశ్రీ, హేమమాలిని, ముంతాజ్, సావిత్రి, కృష్ణకుమారి, బి. సరోజా దేవి, దేవిక...ఇలా కనువిందు చేసే అగ్ర తారాతోరణంతో ఆయన సినిమాలు కళకళ లాడేయి. 

         ఐతే 1962 లో రాసి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘మనసే మందిరం’ మాతృక ‘నెంజిల్ ఒరు ఆలయం’ మహోజ్వల చిత్రరాజం నాటికి అతడేమీ వయసుమీరిన అనుభవశాలి కాదు. అప్పటికింకా 29 ఏళ్ళే! దీనికి పాపులర్ హీరోని తీసుకోక కన్నడ, తమిళ హీరో కళ్యాణ్ కుమార్ ని తీసుకున్నాడు. దేవిక కథానాయిక. ఆర్. ముత్తు రామన్ సహాయపాత్ర. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. విలువలు గుర్తించిన మనుషులు స్వార్ధానికి పోరనీ, విలువల కోసం త్యాగాలు చేస్తారనీ, ప్రాణత్యాగానికి సైతం వెరవరనీ నీతిని ప్రకటిస్తూ ఇది సంచలన విజయం సాధించడమే గాక, ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది.

          వెంటనే 1963 లో హిందీలో రీమేక్ చేశాడు. అప్పుడు బొటాబొటీ ముప్ఫై
 ఏళ్ళే!  రాజేంద్ర కుమార్, మీనా కుమారి, రాజ్ కుమార్ లాంటి ఉద్దండులతో  ‘దిల్ యేక్ మందిర్’. తీశాడు. శంకర్ – జైకిషన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. ఇది 175 రోజులు ఆడి భారీ విజయం సాధించింది (అప్పట్లో కోటీ పది లక్షలు). ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. రాజ్ కుమార్ కి ఫిలిం ఫేర్ సహాయ పాత్రధారి  అవార్డు లభించింది. 1966 లో తెలుగులో ‘మనసే మందిరం’ గా ఇంకో రీమేక్ చేశాడు. అప్పుడు 33 ఏళ్ళు! అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య నటీనటులు. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, బాలు ఛాయాగ్రహణం.  

          1976 లో మలయాళంలో ‘హృదయం ఒరు క్షేత్రం’ గా, 1977 లో కన్నడలో ‘కుంకుమ రక్షే’ గా అక్కడి నిర్మాతలు, దర్శకులు రీమేక్స్ చేశారు. ఇలా మాతృకతో కలుపుకుని మొత్తం ఐదు సినిమాలయ్యాయి. తెలుగులో తప్ప అన్నీ హిట్టయ్యాయి. ఒక్క   శ్రీధర్ తీసిన తమిళ, హిందీ, తెలుగు రీమేకులు తెలుపు – నలుపులో అయితే; మలయాళ, కన్నడ రీమేకులు రంగుల్లో తీశారు. హాలీవుడ్ నుంచి జగ్ ముంద్రా దీన్ని ఇంగ్లీషులో రీమేక్ చేయాలనీ కూడా విఫలయత్నం చేశాడు.

జరిగేదంతా లోపలే 
      ‘మనసేమందిరం’ తెలుగు రీమేక్ లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలతో బాటు, గుమ్మడి, నాగభూషణం, రేలంగి, చలం, శాంతా కుమారిలు నటించారు. సంభాషణలు, పాటలు ఆచార్య ఆత్రేయ రాశారు. ఒక పాట కార్తీక్ రాశారు. ఘంటసాల, పి. సుశీల, ఎల్లారీశ్వరి, పిబి శ్రీనివాస్ లు గానం చేశారు. ‘అల్లారు ముద్దు కదే అపరంజి ముద్ద కదే’ (పి. సుశీల), ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’ (పిబి శ్రీనివాస్) పాటలు రెండూ ఇప్పటికీ హిట్టేనని తెలిసిందే. 

          మాతృకతో బాటు రీమేకులన్నీ పూర్తిగా హాస్పిటల్లో తీసినవే. ఒక ప్రేమ సన్నివేశం, హిందీలో ఒక పాట తప్ప, హాస్పిటల్ దాటి బయటికి రాని ఇండోర్ కథా కథనాలతో తీశారు. మొదటి సీనుతో హస్పిటల్లోకి వెళ్ళే కెమెరా, చివరి సీనులో మాత్రమే హాస్పిటల్ దాటి బయటి దృశ్యాని కొస్తుంది. ఈ రెండున్నర గంటల ఇండోర్ డ్రామా 30 రోజుల్లో తీశారు. తెలుగులో సారధి స్టూడియోలో తీశారు. పాటల విషయాని కొస్తే, హిందీలో ఎక్కువ హిట్టయిన వెంటాడే పాటలున్నాయి : ‘యహా కోయీ నహీ తేరే మేరే సివా’ (రఫీ), ‘హమ్ తేరే ప్యార్ మే సారా ఆలమ్’ (లత), ‘యాద్ న జాయే భీతే దినోకీ (రఫీ), రుక్ జా రాత్ ఠెహర్ జారే చందా’ (లత),  ‘దిల్ యేక్ మందిర్ హై’ (రఫీ, సుమన్ కళ్యాణ్ పూర్).

రెండు వారాల కథ 
      10 వ తేదీన క్యాలెండర్లో కాగితం చినగడంతో ప్రారంభమయ్యే కథ, క్యాలెండర్లో 24 వ తేదీతో ముగుస్తుంది. ఇది టైం లాక్ కథా సంవిధానం. డాక్టర్ రఘు (అక్కినేని నాగేశ్వర రావు) ఆపరేషన్ కి ప్రకటించే రెండు వారాల గడువులోపల జరిగే సంఘటనల సమాహారమే ఈ కథ. ఈ టైంలాక్ చేయడంవల్ల, డెడ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ ఏం జరగబోతోందన్న సస్పెన్స్ వెంటాడుతూంటుంది. డాక్టర్ రఘు చేతిలో ఆపరేషన్ సక్సెస్సా, ఫెయిలా? ఉత్కంఠ రేపే ఈ సస్పెన్స్ తో కూడిన కథనం ప్రతీదృశ్యాన్నీ విడువకుండా చూసేలా చేస్తుంది.   క్యాలెండర్లో లెక్కపెట్టి ఒక్కో తేదీ మారుతూంటే, ఆపరేషన్ ఫెయిలయ్యే ముందస్తు సూచనలే, పరిణామాలే (కుక్క ఏడ్పు, బాలిక మరణం లాంటివి) ఆందోళన పరుస్తూంటాయి. ఆపరేషన్ ఫెయిలయితే డాక్టర్ రఘు తీవ్ర ప్రమాదంలో పడిపోయే గండం పొంచి వుంటుంది. అప్పుడతను జీవించినా మరణించినట్టే లెక్క. ‘ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకు’ గా విశ్వసనీయత కోల్పోయి పతనమై పోతాడు. అయినా ఈ భారీ మూల్యం చెల్లించుకునే రిస్కుకే  సిద్ధపడతాడు. ఇలా కథలో ఒక పాత్రగా క్యాలెండర్ అనే ప్లాట్ డివైస్, కథనంలో సస్పెన్స్ అనే ఎలిమెంట్, క్యారెక్టర్ కి అధిక రిస్కుతో కూడిన గోల్ – ఈ మూడూ బలమైన ప్రధాన పనిముట్లుగా కుదిరి, ఈ ప్రేమకథ స్క్రీన్ ప్లేతో ఎప్పుడో అరవై ఏళ్ల నాడే, నూతన దృక్పథంతో  అత్యత్భుత కథన చాతుర్యాన్ని కనబర్చాడు యంగ్ శ్రీధర్. ఇందుకే జగ్ ముంద్రా ఇంగ్లీషులో రీమేక్ చేయాలనుకుని వుంటాడు.  

          హాస్పిటల్లో నవంబర్ తొమ్మిదవ తేదీ క్యాలెండర్ కాగితం చించి రోజు ప్రారంభిస్తాడు డాక్టర్ రఘు (ఏఎన్నార్). తల్లి (శాంత కుమారి) వచ్చి,  ఇంటికి రాకుండా హాస్పిటల్లోనే వుండిపోతున్నావు, ఒకసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడుతుంది. తనకి హస్పిటలే జీవితమంటాడు. హాస్పిటల్ కి సీత (సావిత్రి) వస్తుంది. ఆమెని చూసి ఖిన్నుడవుతాడు రఘు. ఆమె కూడా అతణ్ణి చూసి కంగారు పడుతుంది. ఇద్దరూ గతంలో ప్రేమికులు. ఆమె కూడా భర్త వుంటాడు. అతడి ముందు బయటపడకుండా జాగ్రత్తపడతారు. భర్త రాము (జగ్గయ్య) కి క్యాన్సర్ వుందనీ, చికిత్స కోసం తీసుకు వచ్చాననీ అంటుంది. 

          డాక్టర్ రఘు వైద్య విద్య కోసం విదేశాల కెళ్ళినప్పుడు, తను ప్రేమిస్తున్న సీతకి ధనికుడైన రాముతో బలవంతపు పెళ్లి చేసేస్తాడు ఆమె తండ్రి. ఇది తెలుసుకున్న రఘు మానసికంగా దెబ్బతిని, ఇక పెళ్ళే చేసుకోనని, హాస్పిటల్ కి అంకితమై పోతాడు. 

          ఇప్పుడామె భర్తకి క్యాన్సర్. ఆమె సందిగ్ధంలో పడుతుంది. ఈ హాస్పిటల్ రఘుదని తెలీక వచ్చేసింది. ఇప్పుడు భర్తని ఇతడి చేతిలో పెడితే నయం చేస్తాడా, కక్ష తీర్చుకుంటాడా? రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడని రఘు అనేస్తాడు. ఆమె భర్తని కాపాడాలనే తప్ప అతడి మనసులో ఇంకే ఉద్దేశాలూ వుండవు. రాముకి వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసిపోతుంది. అతను అర్ధం జేసుకుని, ఆపరేషన్ లో తను మరణిస్తే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని తీర్మానిస్తాడు. సీతకి ఇది జీర్ణంకాక రామూని బతికించుకోవాలని తీవ్ర సంఘర్షణ ప్రారంభిస్తుంది. రాము మాటలతో రఘు ధైర్యం కోల్పోతాడు. ఆపరేషన్ ఏ మాత్రం విఫలమైనా అది సీత తన సొంతమవుతుందన్న ఆశతోనే చేశాడని అందరూ అనుకుంటారు. ఇది భరించలేడు. దీంతో ఆపరేషన్ మీది బెంగతో నిద్రాహారాలు మాని, సర్జరీ శాస్త్రాలన్నీ తిరగేస్తూ పిచ్చివాడై పోతాడు. చివరికి ఆపరేషన్ రోజు రానే వస్తుంది. ఆపరేషన్ సక్సెస్ చేసి కుప్పకూలి మరణిస్తాడు డాక్టర్ రఘు.

విశిష్ట కథనం, పాత్రచిత్రణలు 
       పైన చెప్పుకున్నట్టు ఈ కథనానికి సస్పెన్స్ ప్రాణమై నిల్చింది. ఇప్పటి తెలుగు సినిమా ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో సస్పెన్స్ అనే ఎలిమెంటే వుండడం లేదు. అదేదో మిస్టరీ, క్రైం, యాక్షన్ కథల వ్యహారమనుకునే దురవగాహనతో వుంటున్నారు. పైగా గత రెండు దశాబ్దాలుగా తెలుగులో అవే రోమాంటిక్ కామెడీలూ, లేదంటే అవే మాస్ యాక్షన్లూ మాత్రమే చూస్తూ పెరిగిన కొత్తతరం దర్శకులు ఇంకో కళాప్రక్రియని  వూహించలేక పోతున్నారు. ఎప్పుడైనా కుటుంబ కథ తీస్తే ఆ పాత్రల జీవితాల్లో థ్రిల్లే వుండదు, సస్పెన్సే వుండదు. పాసివ్ పాత్రలతో చప్పగా పాసివ్ కథనాలు చేసి చేతులు దులుపు కుంటున్నారు.

          ‘మనసే మందిరం’ ముఖ్య పాత్రలు మూడూ పాసివ్ పాత్రలు కాదు. ఈ కథ ట్రాజడీయే అయినా తలరాతని విధికే వదిలేసి ఏడుస్తూ కూర్చునే పాసివ్ పాత్రలు కావు. తలరాతని మార్చుకోవడానికి పరిస్థితులతో సంఘర్షించే, లక్ష్యమున్న యాక్టివ్ పాత్రలు. డాక్టర్ రఘు పాత్రలో ఏఎన్నార్ కి ఆపరేషన్ విజయవంతం చేయాలన్న లక్ష్యం, దాంతో సంఘర్షణ;  సీత పాత్రలో సావిత్రికి మృత్యు ముఖం లోంచి భర్తని కాపాడుకోవాలన్న లక్ష్యం, దాని తాలూకు సంఘర్షణ; క్యాన్సర్ రోగి రాము పాత్రలో జగ్గయ్యకి వాళ్ళిద్దర్నీ కలపాలన్న లక్ష్యం, దీని తాలూకు సంఘర్షణ. లక్ష్యం మాటల్లో వుంటే చాలదు, అది చర్యల్లో విజువల్ గా కన్పించాలి. జగ్గయ్య వాళ్ళిద్దరికీ కలిపి వీలునామా కూడా రాసేసి లక్ష్య శుద్ధిని చాటుకుంటాడు. 

          ఈ కథనంలో ఆలస్యం చేయకుండా రెండో సీన్లోనే కథ ప్రారంభించేస్తాడు దర్శకుడు. మొదటి సీనులో తల్లి వచ్చి, ఇంటికి రమ్మని ఏఎన్నార్ తో చెప్పి వెళ్ళాక,  రెండో సీన్లోనే సావిత్రి జగ్గయ్యతో వచ్చేస్తుంది. జగ్గయ్యకి క్యాన్సర్. ఏఎన్నార్ కి ఎదుట వున్న సావిత్రితో పాత జ్ఞాపకాల తూఫాను, సావిత్రికి ఏఎన్నార్ మీద అనుమానం, వ్యతిరేకత. ఇలా కథకి ప్రధాన పాత్ర ఏఎన్నార్ అయితే, వ్యతిరేకించే ఎదుటి పాత్రగా సావిత్రి, వీళ్ళిద్దరి మధ్య గార్డియన్ పాత్రగా జగ్గయ్య. ఇలా బలాబలాల సమీకరణ పూర్తయ్యింది ఇక సంఘర్షణ అనే కథనరంగానికి. 

          ఈ రెండో సీన్లోనే ఎక్స్ రే చూస్తున్నప్పుడు, ఏఎన్నార్ కి సావిత్రితో గతం తాలూకు ఒక దృశ్యం మెదులుతుంది. వీళ్ళిద్దరూ పూర్వ  ప్రేమికులని దృశ్యపరంగా క్లుప్తంగా చెప్పడం. ఈ సంక్షిప్త దృశ్యంలో పెళ్లెప్పుడని సావిత్రితో ఏఎన్నార్ అంటాడు. తండ్రితో మాట్లాడతానని ఆమె చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతకి మించి వీళ్ళిద్దరి పూర్వ ప్రేమ సన్నివేశాలు కథనంలో మరెక్కడా రావు. హాలీవుడ్ స్క్రీన్ ప్లే సూత్రమొకటుంది :  కథనంలో డిమాండ్ ని సృష్టించు, సరఫరాని ఆపెయ్యి అని. 

          ఇలా ఈ వొక సీనులో వాళ్ళ ప్రేమని అరకొరగా చూపించేసి, మనకి పూర్తిగా చూడాలన్పించే డిమాండ్ ని సృష్టించాడు దర్శకుడు. కానీ మరెక్కడా ఏఎన్నార్ – సావిత్రి హిట్ రోమాంటిక్ జంటతో మనకి చూడాలన్పించే ఆ పూర్తి  ప్రేమ తాలూకు నులి వెచ్చని సన్నివేశాలని సరఫరా చేసి,  డిమాండ్ ని తీర్చే పాపాన పోడు దర్శకుడు. కవితాత్మకంగా వూహకే వదిలేశాడు. దీంతో ఈ కథన భంగం (సీనస్ ఇంటరప్టస్) ఒక తియ్యటి బాధలా మిగిలిపోతుంది మనకి. ఇలాటి తియ్యటి బాధల్ని సృష్టించడం గొప్ప దర్శకుల వల్లే అవుతుంది. సినిమా ద్వితీయార్ధంలో ఒక చోట సావిత్రే తానెందుకు జగ్గయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మాటల్లో చెప్తుంది. ఇప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ వేయలేదు. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. అది కథవదు. కనుక మాటల్లో చెప్పేస్తే సరిపోతుంది. దాన్నే ఫ్లాష్ బ్యాకువేసి చూపిస్తూ పోతే,  అది ప్రధాన కథ స్క్రీన్ టైముని తినేసి, అదే ప్రధాన కథ అన్నట్టుగా తయారవుతుంది. 

       ఒకసారి ఇప్పుడొస్తున్న దర్శకుల సినిమాల సరళిలో ఈ కథనాన్ని పెట్టి చూస్తే, తమాషాగా ఇలా వుంటుంది – సావిత్రి జగ్గయ్యతో వచ్చి క్యాన్సర్ అని ఏఎన్నార్ తో చెప్తుంది. ఏఎన్నార్ ఎక్స్ రే చూస్తూ సావిత్రిని వూహించుకుంటాడు. అంతే,  ఫ్లాష్ బ్యాక్ తన్నుకొచ్చేస్తుంది. కాలేజీలో వాళ్ళిద్దరి చదువులు, ప్రేమలు, వాళ్ళిద్దరి కుటుంబ పరిస్థితులు, యుగళ గీతాలు, విద్య కోసం ఏఎన్నార్ విదేశీ యానం, సావిత్రి కి తండ్రి వల్ల జగ్గయ్యతో బలవంతపు పరిణయం, ఏఎన్నార్ స్వదేశాగమనం, ఇక ప్రేమంతా మంటగలిసిందని వైద్య సేవల్లో కలిసిపోవడం. 

          ఇలా రొడ్డకొట్టుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యే సరికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక్కడ్నుంచి జగ్గయ్య ఆపరేషన్ గురించిన అసలు కథ. ఏ కథైనా ఈ చట్రంలోనే వేసి రంగులరాట్నం తిప్పడం. రెండు మాటల్లో చెప్తే పోయే పాత పురాణాన్ని సగం సినిమా ఫ్లాష్ బ్యాకుగా వేసి, అది కూడా  ప్రధాన కథే అన్నట్టుగా విన్యాసాలు చేయడం. ఒకే సినిమాలో రెండు ప్రధాన కథలుండవన్న ఇంగిత జ్ఞానంలేక. ఉన్న ప్రధాన కథ లోతుపాతుల్లోకి వెళ్ళడం తెలీక, ఎత్తుకున్న ప్రధాన కథ నడపడమూ తెలీకా, ఇలా ఇంటర్వెల్ వరకూ వృధా కాలక్షేపం చేయడం. కథని వీలయినంత తక్కువ స్క్రీన్ టైముకి కుదిస్తూ, సెకండాఫ్ లో ఏదో కథ చెప్పేసి, బయటికి దూకెయ్యడం. ఆ వికృత సినిమాల్ని ప్రేక్షకుల చేతిలో పెట్టడం. 

          కానీ శ్రీధర్ ప్రధాన కథ రెండో సీన్లో వెంటనే ప్రారంభమయింది మొదలు, చివరంటా రెండున్నర గంటలూ  ఎడతెగని బిగితో ఆద్యంతం జ్వలిస్తూ సాగుతుంది ఫ్లాష్ బ్యాక్ ని ఎగేస్తూ. ఇందులో ఏఎన్నార్ – సావిత్రిల పూర్వ ప్రేమ కథని నామమాత్రం చేయడంలో ఇంకో ఉద్దేశం కూడా వుండొచ్చు. దర్శకుడు దీన్ని పూర్తి స్థాయి సస్పెన్స్ కథగా చెప్పాలనుకున్నాడు. పూర్వ ప్రేమ తాలూకు ఏ మాత్రం ఫ్లాష్ బ్యాక్ వేసినా, నడుస్తున్న ప్రధాన కథ తాలూకు సస్పెన్స్ ధార చెదిరిపోతుంది. కథనిండా మేట వేసిన శోక రసాన్ని మరిపించడానికి సస్పెన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చాడు – ‘ముత్యాల ముగ్గు’ లో బాపు - రమణలు కథా మూలంలో వున్న శోక రసాన్ని మరిపించే, అద్భుత రసపు షుగర్ కోటింగుతో హుషారైన కథ చెప్పినట్టు. శ్రీధర్ కూడా ఈ షుగర్ కోటింగ్ ని కాపాడుకునే కథనమే చేశాడు సస్పెన్సు అనే ఏకసూత్రతని కాపాడుకుంటూ.

రెండు విడతల సస్పెన్స్ 
       రెండో సీన్లోనే జగ్గయ్యకి ఆపరేషన్ అనీ, అది రెండు వారాల్లోననీ ఒక టైం లాక్ తో సమస్య నేర్పాటు చేశాక, నడిపే కథనంలో సస్పెన్సు రెండు విడతలుగా కన్పిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఆపరేషన్, దీని తాలూకు పరిణామాలతో కూడిన సస్పెన్సుతో ఏర్పడే సెన్సాఫ్ డేంజర్ ని ఇప్పట్నుంచే ఫీలవ్వం మనం. ఇది మొదలవడానికింకా టైముంది. దీనికంటే ముందు ఇంకో సెన్సాఫ్ డేంజర్ ప్రారంభించిన కథలోనే తోస్తోంది మనకి. అది ఏఎన్నార్ - సావిత్రిలు జగ్గయ్య ముందు దాచిపెడుతున్న పూర్వ ప్రేమాయణం. ఇది బయటపడే ప్రమాదం పొంచి వుంది. ఇలా ప్రస్తుతం ఈ సెన్సాఫ్ డేంజర్ ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడేంటి? ఎప్పుడో జరిగే ఆపరేషన్ సంగతి సరే, ఇప్పుడున్న వీళ్ళ రహస్యం మాటేమిటి? దాచి పెడుతున్నది బయట పడక తప్పదు. అప్పుడేం జరుగుతుంది? ఇది ముందు తేల్చడం ఈ కథ ముందుకు సాగడానికి అవసరం. కాబట్టి అనివార్యంగా ముందు చేపట్టాల్సిన కథనం దీనికి సంబంధించిందే అయింది. 

          ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ లో సమస్యల్ని డీల్ చేసే విధానముంటుంది. ప్రతీ సమస్యా ఓ గతంతో ముడిపడి వుంటుంది. ఆ గతాన్ని సరిచేస్తే సమస్య  పరిష్కారమైపోతుంది. పాలకులు సరి చేయరు. వాళ్లకి కాష్ఠం రగులుతూ వుండాలి. రచయితలు సరి చేయాల్సి వుంటుంది. రచయితలు కూడా పాలకుల పాలెగాళ్ళయితే చెయ్యరు. అది వేరే సంగతి. ఆపరేషన్ సమస్యతో ఏఎన్నార్, సావిత్రిల పరస్పర భయసందేహాలు తీరి పరిష్కారమవాలంటే, వాళ్ళ గత సంబంధాన్ని తేల్చెయ్యాలి. అంటే గార్డియన్ పాత్రగా వున్న జగ్గయ్యకి ఈ వ్యవహారం తెలిసిపోయి, అతనో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆపరేషన్ తో సమస్య పరిష్కారమవుతుంది. అంటే కథనం జగ్గయ్యకి తెలిసే ముందు, తెలిసిన తర్వాతా అనే ద్విముఖాలుగా వుండాలి. తెలిసేముందు రిలేషన్ షిప్ తో ఒక సస్పెన్స్, తెలిశాక ఆపరేషన్ తో ఇంకో సస్పెన్స్. ఇలా రెండు విడతల సస్పెస్ తో కథాపథకం. ఈ స్పష్టత, ఈ విభజన, ఈ ప్లానింగ్ లేకపోతే  ఏం కథ చేస్తున్నామో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మాటల్లో సినిమా కథంటే సైకో థెరఫీయే.

తొలి విడత సస్పెన్స్ 
        రెండు వారాల్లో ఆపరేషన్ చేయాలనీ నిర్ణయించాక,  జగ్గయ్య హాస్పిటల్లో అడ్మిటవుతాడు. సావిత్రి కూడా అక్కడే వుండిపోతుంది, బట్టలూ అవీ తెప్పించుకుని. ఏఎన్నార్ నివాసం ఎలాగూ అక్కడే. ఒక రాత్రి పూట సావిత్రితో దిగిన పాత  ఫోటో చూసుకుంటూ పాటలోకెళ్ళి పోతాడు. ఆ పాటలో సుమంగళిగా ఆమె సుఖాన్నే కోరుకుంటాడు. పాట పూర్తయ్యాక జగ్గయ్య వచ్చేస్తాడు. కంగారుపడి ఫోటోని పత్రికలో దాచేస్తాడు ఏఎన్నార్. చదువు కోవడానికి ఏమైనా పుస్తకాలుంటే ఇమ్మని పత్రిక తీసేసుకుంటాడు జగ్గయ్య. ఏఎన్నార్ గుండె ఢామ్మంటుంది. ఏం చేసే లోగా పత్రికతో వెళ్ళిపోతాడు జగ్గయ్య. పత్రిక తిరగేస్తోంటే ఆ ఫోటో జారి కింద పడుతుంది. ఇది చూసి సావిత్రి గుండె ఢామ్మంటుంది.  ఎలాగో జగ్గయ్యని లోపలికి పంపి ఆ ఫోటో తీసెయ్యబోతే, ఏఎన్నార్ తీసుకుని వెళ్ళిపోతూంటాడు గబగబా.

          ఈ గండం గడిచాక మరో గండం ఎదురవుతుంది. ఏఎన్నార్ తల్లి హాస్పిటల్ కొస్తుంది. ఆమె కొడుకు జీవితం గురించి సావిత్రి, జగ్గయ్యల ముందు వాపోతుంది, “ఎవరో ఒకమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకొకర్ని పెళ్లి చేసుకుందట. దాంతో వాడి మనసు విరిగిపోయి పెళ్ళే చేసుకోలేదు” అని.

          ఇక్కడున్న సావిత్రియే కొడుకు ప్రేమించినమ్మాయని ఆమెకి తెలీదు. ఇదెక్కడ బయటపడుతుందోనని సావిత్రికి ఒకటే ఆందోళన. జగ్గయ్య అంతా విని నిర్వేదంగా, “ఈ రోజుల్లో ప్రేమించడం సరదా అయిపోయింది. దీనివల్ల ఎందరి జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో ఎవ్వరూ వూహించడం లేదు. నేనూ సీతా మీ అబ్బాయికి నచ్చజెప్పి ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తాం” అంటాడు. 

          ఆమె వెళ్ళిపోయాక సావిత్రితో అంటాడు, “చూశావా సీతా, ఒక పురుషుడికి ఒక స్త్రీ చేసిన ద్రోహం. ప్రేమించింది ఒకర్ని, పెళ్ళాడింది ఒకర్ని. ఆ అమ్మాయి ఎంత మోసగత్తె అయి వుండాలి. నా బాధంతా పాపం ఆ డాక్టర్ గురించే. ఇంత చదువూ తెలివీ వుండి కూడా ప్రేమంటే ఒక ఆట వస్తువుగా భావించే ఆడదాన్ని నమ్మి ఎలా మోసపోయాడో చూశావా?”

          సావిత్రికి గుండె పగిలిపోతూంటుంది తనని ఇంతింత మాటలంటూంటే, “ ఏమో ఆ అమ్మాయి మంచిది కాదని ఎలా అనగలం?”  అనేస్తుంది. అందుకు జగ్గయ్య, “మంచిదెలా అవుతుంది సీతా? ఆమె నిజంగా డాక్టర్ని ప్రేమించి వుంటే, తర్వాత ఆ భర్తకి మనసెలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ భర్త పట్ల నిజాయితీగా వుంటే, డాక్టర్ తో ఆమె ప్రేమంతా నాటకమే కదా?” అని.  ఆమె తట్టుకోలేక భోరుమంటుంది.

         ఇక్కడ కథాపరమైన తొలి విడత సస్పెన్స్ నిర్వహణతో బాటు, పాత్రచిత్రణల వికాసం కూడా వుంది. ఏఎన్నార్ తల్లి రాకతో జగ్గయ్యకి ఏఎన్నార్ విషయం తెలిసి అతడి పెళ్లి ఆలోచన స్ఫురించింది. ఇది మున్ముందు కథలో ఏఎన్నార్ కి పెళ్లి అనే చర్య తీసుకోవడానికి దారి తీస్తుంది. రెండోది, సావిత్రికి తన రహస్యం ఎక్కడ బయట పడుతుందోనన్న భయాందోళనలతో బాటు, పైకి చెప్పుకోలేని తన నిర్దోషిత్వం గురించిన భావోద్వేగాలు అనుభవించడం. తను మోసగత్తె కాదని ఎలా చెప్పుకోవాలి? అసలేం జరిగిందో ఎలా చెప్పుకుంటుంది? చెప్పుకోవడానికి మొహం చెల్లకే ఏఎన్నార్ తో ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు కథాపరమైన మొదటి విడత సస్పెన్సుకి తోడు అసలు గతంలో ఏం జరిగి ఏఎన్నార్ నుంచి సావిత్రి విడిపోయిందన్న అనుబంధ సస్పెన్సుని ప్రేక్షకుల మీద రుద్దాడు దర్శకుడు. ఇప్పుడు మనకి వాళ్ళ రోమాంటిక్ గతం తెలుసుకోవాలన్న డిమాండ్ పక్కకి వెళ్ళిపోయి, ఆ ట్రాజిక్ గతమేంటో తెలుసుకోవాలన్న డిమాండ్ పెరిగిపోయింది. దీన్నె ప్పుడు సరఫరా చేస్తాడు దర్శకుడు? ఇది అనుబంధ సస్పెన్స్. 

          దీంతో అయిపోలేదు. సావిత్రీ ఏఎన్నార్ లకి జగ్గయ్యతో ఇంకో గండం. సావిత్రి ముందు ఏఎన్నార్ కి కౌన్సెలింగ్ చేస్తాడు జగ్గయ్య. ఏఎన్నార్ పాత ప్రేమని తోడుతాడు. ఆ ప్రియురాలిని నిందిస్తాడు. ఈ ప్రేమలు ఒట్టి కబుర్లనీ, బతకడానికి తెలియని వాళ్ళే వీటిని పట్టుకుని ప్రాకులాడతారనీ, దీన్నుంచి తేరుకుని పెళ్లి చేసుకుని తల్లిని సంతోష పెట్టమనీ అంటాడు.

          తర్వాత ఏఎన్నార్ సావిత్రిని ఏకాంతంలో కలిసి మాట్లాడుతూండడంతో వినేస్తాడు జగ్గయ్య. ఈ సందర్భంగా సీత అంటుంది, “నా భర్త నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు. ఒకనాడు మీరు ప్రేమించిన అమ్మాయి నేనేనని తెలిస్తే వారి హృదయం బద్దలై పోతుంది. అందువల్ల ఏర్పడే విపరీత పరిణామాలకు మీరు కారణం కాకూడదనే నా కోరిక”  అని. 


      ఏఎన్నార్ మాటిస్తాడు, అసలు తను తెలిసినట్టు కూడా ప్రవర్తించనంటాడు. అయితే ఒక్క సందేహం తీర్చి మనశ్శాంతి కల్గించమంటాడు. ఇందుకామె, “డాక్టర్, మీకు కొంచెమైనా మనశ్శాంతి కల్గించడం నాకు చేతనైతే నేను చేసిన పాపానికి అదే ప్రాయశ్చిత్తం, చెప్పండి?”  అంటుంది.  అసలెందుకు విడిపోయావని అడుగుతాడు. 

          ఆమె చెప్పుకొస్తుంది. ఆమె తండ్రి బ్యాంకు క్యాషియర్. యాభై వేలు పోయిన నేరం మీద పడింది. బ్యాంక్ డైరెక్టర్ ని కలిసి చెప్పుకుంటే, జైలుకెళ్ళకుండా  వుండాలంటే తన కొడుక్కి కూతుర్నివ్వా లన్నాడు డైరెక్టర్. కూతురికి చెప్పుకుంటే, తను ఏఎన్నార్ ని  ప్రేమించానని చెప్పుకుని ససేమిరా అంది. “నీ సుఖం కోసం జైలు పాలవ్వాలా నేనూ? ఈ ఇంటికోసం ప్రేమని త్యాగం చేయలేవా?’ అని నిలదీశాడు తండ్రి. తను జైలుకెళ్తే తల్లి గుండాగి చస్తుందని కూడా అన్నాడు. ఇక విధిలేక జగ్గయ్యని చేసుకుంది. చేసుకున్నాక తెలిసింది అతడికి క్యాన్సర్ అని. జగ్గయ్య తండ్రి ఇది దాచిపెట్టి తనకి తాళి కట్టించాడని అర్ధమైంది...

          ఇలా  సావిత్రి చెప్పేసరికి ఏఎన్నార్ ఆమె పరిస్థితికి కదిలిపోతాడు. అటు చాటుగా వుండి  వింటున్న జగ్గయ్య ఛాతీ పట్టుకుని ఉక్కిబిక్కిరైపోతాడు. అసలే గుండెకి ముదిరిన క్యాన్సర్. అందులో ఇలాటి అగ్నిపర్వతం బద్ధలవడం... దీంతో ఏఎన్నార్ – సావిత్రిల తాలూకు రహస్యం కొలిక్కి వచ్చింది. ఇప్పుడు బంతి జగ్గయ్య కోర్టులో పడింది. మనకీ గతం తాలూకు అనుబంధ సస్పన్స్ తీరిపోయింది.  

          సావిత్రి ఇలా చెప్పేసి ఆగదు. ఆ ఫోటో ఇచ్చెయ్యమంటుంది. అదొక్కటే తను సాంత్వన పొందడానికి మిగిలిన ఆధారమంటాడతను. ప్రేమని మర్చిపోలేనంటాడు. మానవ జీవిత పరమార్ధం వలచి విలపించడం కాదంటుంది. అతడి వృత్తి, పేరు ప్రతిష్టలు తన మూలంగా నాశనమై, తానో సమాజ ద్రోహిగా నిలబడ లేనంటుంది. ఇక మర్చి పొమ్మంటుంది. చేసేది లేక ఫోటో చించేస్తాడు. 

          కథనంలోఈ తొలి  విడత సస్పెన్స్ విభాగంలో, రాబోయే మలి విడత సస్పన్స్ విభాగపు కథనానికి అడ్డు పడకుండా కొన్నిసమస్యల్ని పరిష్కరిస్తున్నాడు దర్శకుడు. ప్రేమని అతను మర్చిపోకపోతే చేయబోయే ఆపరేషన్ కి అది అడ్డుపడుతుంది. కానీ చేయబోయే ఆపరేషన్ కి జగ్గయ్య ప్రకటించే నిర్ణయం అడ్డుపడబోతోంది. అందువల్ల రెండు కారణాలు అడ్డుపడితే గజిబిజి అవుతుందని, మొదటి కారణమైన ప్రేమ ని క్లియర్ చేసేశాడు దర్శకుడు. ఇప్పుడు వీళ్ళ పూర్వ ప్రేమ తెలిసిపోయిన నేపధ్యంలో, జగ్గయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడనే మలి విడత సస్పెన్స్ తో కథనం మొదలు.
  జగ్గయ్యకి తెలియక ముందు కథనం పూర్తయి, తెలిసింతర్వాత కథనం ఇక మొదలవుతోంది.

మలి విడత సస్పెన్స్ 
       “డాక్టర్ మీరు నాకో సహాయం చేయాలి. ఆపరేషన్ చేస్తే నేను బతుకుతానంటారా? నేను పిరికి వాణ్ణి కాను, మీ మనసులో వున్న నిజాన్ని ధైర్యంగా చెప్పండి. చచ్చిపోతానని నేను భయపడ్డం లేదు. నేను బ్రతికి సాధించేది లేదు. ఇంతవరకూ నా జీవితంలో నాకెలాటి కొరతా కలగలేదు. ఐశ్వర్యం లోపుట్టాను, అల్లారు ముద్దుగా పెరిగాను. ఆనందంగా జీవించాను. అందం, గుణం వున్న పిల్లనే చేసుకున్నాను. ఈ క్షణం వరకూ ఆమెకే లోటూ రానివ్వకుండా ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను. అన్నివిధాలా అందరికీ అసూయ కల్గించే జీవితాన్ని నేననుభవించాను...”
          “ఇక ముందు కూడా మీకిలాగే జరుగుతుంది”
          “మీరు చెప్తున్నది జ్యోతిషం, నేను చెప్తున్నది నిజం... మీరొక వాగ్దానం చెయ్యాలి. నేను చనిపోతే ఆమెకి మళ్ళీ పెళ్లి జరిపించే బాధ్యత మీది...”

          ఏఎన్నార్ నెత్తిన పిడుగులు పడతాయి. ససేమిరా అంటాడు జగ్గయ్య. సరే, ఆమె అంగీకరిస్తే తన వాగ్దానం తప్పక నేరవేరుస్తానంటాడు ఏఎన్నార్. ఇక్కడ జగ్గయ్య వ్యూహాత్మకంగా నేరుగా ఆమెని పెళ్లి చేసుకోమనడం లేదు. సావిత్రితో కూడా ఇలాగే వ్యూహాత్మకంగా అంటాడు. నేరుగా చెప్పేసి షాకివ్వదల్చుకోలేదు. ఇప్పుడు సావిత్రి, ఏ ఎన్నార్ లకి జగ్గయ్య చావుబతుకుల సమస్య ముఖ్యమైపోతుంది. పూలూ పసుపూ తెప్పించుకుని సుమంగళిలా అలంకరించుకుని పూజలు చేస్తుంది. ఇంతలో ఓ ఐదేళ్ళ బాలికకి ఏఎన్నార్ చేసిన ఆపరేషన్ విఫలమై చనిపోతుంది. దీంతో సావిత్రికి ఏఎన్నార్ సామర్ధ్యం మీద నమ్మకం పోతుంది. జగ్గయ్యని ఇక్కడ్నించి తీసికెళ్ళి పోతానంటుంది. 

          “డాక్టర్, ఏదైనా జరిగితే మీరు కారణం కాకూడదని నా కోరిక. మీరు నా హృదయంలో శాశ్వతంగా వుండాలంటే నా భర్త ఇక్కడ చచ్చిపోకూడదు. నన్ను ప్రేమించి విఫలమయ్యారని మీరు కక్ష సాధించారని నేనేనాడూ అనుకోకూడదు”

          జగ్గయ్యకి కూడా చెప్పేస్తుంది ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామని. ఏఎన్నార్ ని అవమానించడం తగదంటాడు అతను. దీంతో ఉద్రిక్తత సడలుతుంది. మళ్ళీ పెట్రేగుతుంది. ఈసారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని జగ్గయ్య నేరుగా చివరి కోరిక వెల్లడించడంతో. ఇద్దర్నీ ఏడ్పిస్తాడు. ఇద్దరూ నిరసిస్తారు. అయినా చేసేది చేసుకుపోతాడు జగ్గయ్య. లాయర్ ని పిలిపించుకుని ఇద్దరికీ తన ఆస్తి వీలునామా రాసేస్తాడు. ఇక లాభం లేక సావిత్రి తన నిర్ణయం తానూ తీసుకుంటుంది. 

          సరీగ్గా రెండు వారాల గడువు పూర్తయి ఆపరేషన్ మొదలవుతూంటే, గదిలో కెళ్ళి తలుపులు బిడాయించుకుంటుంది. ఏఎన్నార్ చేతిలో భర్త మరణ వార్త వింటే, అదే క్షణం తన చావూ జరిగిపోవాలని గదిలో వుండి పోతుంది.

          ఏఎన్నార్ పరిస్థితి కొన్ని రోజుల ముందునుంచే దారుణంగా వుంటుంది. ఆపరేషన్ చేయగలుగుతాడా అన్న గొప్ప ఆత్మనూన్యతా భావానికి లోనవుతాడు. ఒక ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకుగా నీతో ఎలాటి స్వార్ధానికీ పోనని అన్నా కూడా ఆమె నమ్మదు. కన్న తల్లిని సాక్ష్యంగా చేసి చెప్పడం కన్నా ఉత్కృష్ట  నివేదన ఇంకేం వుంటుంది. ఆమె నమ్మదు. ఆమె పరిస్థితులు ఆమెకున్నాయి. ఆమె కూడా నమ్మనప్పుడు డాక్టర్ గా తన సామర్ధ్యం పట్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా కరిగిపోతుంది. తిండి మానేసి, నిద్ర మానేసి, శస్త్ర చికిత్స పుస్తకాలు చదివేస్తూంటాడు.  ఎలాగైనా ఆపరేషన్ సక్సెస్ చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలి...

          నిరూపించుకుంటాడు. కానీ అది యాంటీ క్లయిమాక్స్ కి దారి తీస్తుంది. జగ్గయ్యకి ఆపరేషన్ సక్సెస్ అయిందని తలుపు కొట్టి కొట్టి సావిత్రిని పిల్చి, ఆమె తలుపు తీశాక శుభవార్త చెప్పేసి కుప్పకూలి మరణించి పోతాడు.      

లోటు తీర్చే ప్రయత్నాలు 
       సంక్లిష్ట కథా కథనాలు, సంక్లిష్ట పాత్ర చిత్రణలు. 29 ఏళ్ల శ్రీధర్ విరచిత విన్యాసాలు. నటత్రయం అభినయ వైశిష్ట్యాలు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యల గురించి చెప్పుకోవాలంటే వాక్యాలందవు. చూసి తరించాల్సిందే. ఏ వొకరి ముఖంలోనూ సంతోషం పలకని గూడు కట్టిన విషాదమే. అభిమాన తారలు ఇంత విషాదంతో వుండిపోతే ప్రేక్షకులకి ఇబ్బందే. అక్కినేని ఎక్స్ రే చూస్తూ తలచుకున్నప్పుడు సావిత్రితో ఒక సంక్షిప్త ప్రేమ సన్నివేశం తప్ప,  ఇంకే రిలీఫ్ కూడా వుండదు. ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు కూడా వాళ్ళ గతం తాలూకు రోమాంటిక్ మాంటేజీలు పడవు. దీనికి భిన్నంగా హిందీ రీమేక్ లో వుంది. రాజేంద్రకుమార్ ఎక్స్ రే చూస్తున్నప్పుడు మీనా కుమారితో పాటలోకి వెళ్ళిపోతాడు (తేరే మేరే సివా యహా కోయీ నహీ). ఇది సినిమాకి మాంచి యూత్ అప్పీల్ ని సరఫరా చేస్తుంది. తర్వాత ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు (యాద్ న జాయే భీతే దినోకీ) విరివిగా వచ్చే వాళ్ళ పూర్వ ప్రేమ తాలూకు మాంటేజీలు మరోసారి యూత్ అప్పీల్ కి న్యాయం చేస్తాయి. ముందంతా విషాదమే చూపిస్తున్నప్పుడు ప్రారంభంలో ఈ మాత్రమైనా వినోదపర్చాలి. తమిళ మాతృక తర్వాత హిందీ రీమేక్ అయింది. దీని తర్వాత తెలుగు రీమేక్. కానీ ఎందుకనో అప్డేట్ చేసిన హిందీ రీమేక్ ని తెలుగుకి అనుసరించలేదు. తమిళ మాతృకనే ఫాలో అయ్యారు.  హిందీలో పత్రికలోంచి ఫోటో బయటపడే సీన్లో థ్రిల్, సస్పెన్సుల పోషణ  భలే వుంటుంది. బ్లాక్ అండ్ వైట్ వెలుగు నీడలతో ఛాయాగ్రహణం కూడా ఉన్నత ప్రమాణాలతో వుంటుంది. ఇక అన్నిపాటలూ ప్రజాదరణ పొందాయి. తెలుగులో రెండే (అపరంజి బొమ్మ, తలచినదే) హిట్టయ్యాయి. ఈ విషాద కథ హిందీలో మ్యూజికల్ హిట్టయితే, తెలుగులో అది కూడా కాలేదు.  మూడు సార్లు తీసిందే తీస్తూ అలసిపోయి వుంటాడు శ్రీధర్. 

          కథ పూర్తి విషాదం కాబట్టి కామెడీ ట్రాకు పెట్టారు. చలం – గిరిజ – రేలంగిలు వేసుకునే కామెడీ వేషాలు కథతో సంబంధం లేకుండా హాస్పిటల్లో ఓ పక్క వచ్చి పోతూంటాయి. వినోదం లేని లోటు ఇలా తీర్చినట్టున్నాడు. కానీ వినోదం ప్రధాన పాత్రలతో కూడా కాస్త వుండాలి. ఇక హాస్పిటల్లో కొందరి పేషంట్లతో సబ్ ప్లాట్స్ (ఉపకథలు) వుంటాయి. ఇవి ప్రధాన కథలో సంఘర్షిస్తున్న ఏఎన్నార్, సావిత్రి, జగ్గయ్య పాత్రల ప్రవర్తనల్ని నియంత్రించే దిశగా వుంటాయి. సబ్ ప్లాట్స్ లో ఉత్పన్నమయ్యే అర్థాలు మెయిన్ ప్లాట్స్ లో ప్రతిఫలిస్తూంటాయి. ఇలా ఇన్ని పొరలుగా కథ వున్నప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనే ఇంకో పొర కల్పిస్తే ఎక్కువైపోయే మాట నిజమే. అందుకని ఫ్లాష్ బ్యాక్ ని పరిహరించడం మేలే చేసింది. 

            దర్శకుడితో బాటు తెరవెనుక ఆత్రేయ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన మాటల మాంత్రికుడు కాదు. మాయ చేయడు. జీవితాలు పలికే పలుకులనే నిరాడంబరంగా స్వచ్ఛంగా పలికిస్తాడు. సంభాషణల బలం ఈ ట్రాజడీకి  ప్రధాన ఆకర్షణ. 

          ఐతే ఈ కథలో దర్శకుడు కూడా జవాబు చెప్పలేని ప్రశ్న వొకటుంది. ఈ ప్రశ్న వేస్తే  కథేమవుతుందో, పాత్రలేమై పోతాయో తెలీదు. సినిమా కూడా వుండే అవకాశమందో లేదో తెలీదు. కానీ మన బుద్ధికి ఇలా తోస్తుంది : జగ్గయ్య తాను చనిపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నాడు. చనిపోకపోతే? ముగ్గురూ ఇలాగే సిగపట్లు పడుతూ వుండిపోతారా ముగింపు లేకుండా? దేవుడు జోక్యం చేసుకుని ఏఎన్నార్ ని తప్పించడం జగ్గయ్య అదృష్టమే!

సికిందర్


         

Thursday, February 23, 2023

1308 : స్క్రీన్ ప్లే సంగతులు


        ప్పుడున్న గ్లోబల్ ట్రెండ్స్ లో ప్రేక్షకులు -ముఖ్యంగా యువప్రేక్షకులు సినిమాల నుంచి ఏం ఆశిస్తున్నారని చూస్తే, గత కాలపు మూస సినిమాలు ఇంకెంత మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన అమిగోస్ కి స్క్రీన్ ప్లే సెట్టింగ్ వర్క్ చేస్తున్నప్పుడు కోవిడ్ లాక్ డౌన్లతో ఆ వర్క్ ఆగిపోయి, తర్వాత ఏం జరిగిందో మనకి సమాచారం లేని నేపథ్యంలో, తీరా సినిమా చూస్తే ఆందోళనకరంగా వుంది- స్క్రీన్ ప్లే అంటే ఒక దురవగాహనతో తక్షణ పరాజయానికి సరిపడా బీజాలతో సినిమా ముస్తాబయింది. కాన్సెప్ట్ చూస్తే డపెల్ గేంగర్ అనే పబ్లిసిటీతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన యూనిక్ పాయింటు. రచన చూస్తే ఆ యూనిక్ నెస్ ని నీరుగార్చే పాత మూస టెంప్లెట్ త్రిపాత్రాభినయ వ్యవహారం. ప్రేక్షకులెలా అంగీకరిస్తారు? ఎంతసేపూ స్టార్ కి ఇంత మార్కెట్ వుందని సినిమాలు తీయడం కాకుండా, కాస్త ఆ సబ్జెక్టు మార్కెట్ యాస్పెక్ట్ గురించి కూడా ఆలోచించాలిగా? ముందు మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయమైతే దాన్ని బట్టి వుండే క్రియేటివ్ యాస్పెక్ట్ చూసుకో వచ్చు.  

        మూస ఫార్ములా చిత్రణలతో ప్రేక్షకులు విసిగి వేసారి పోయారు. ప్రేక్షకులు టికెట్లకి చెల్లిస్తున్న నోట్లు చాలాసార్లు కొత్తగా మారిపోయాయి, కానీ సినిమాలు చూస్తే అవే పాత మిడతంభొట్లు. కనీసం తీస్తున్న సినిమా జానర్ మర్యాదలకి కట్టుబడినా మూస సినిమాలు రావు. పాత సినిమాల్లో ఐదణాల ఆనందరావు ఆంధ్ర పత్రిక పేపరు చదువుతూ, ఏమోయ్ కాఫీ రెడీయా?’ అన్న ఓపెనింగ్ డైలాగుతో సినిమాకి క్లాప్ కొట్టి శ్రీకారం చుడితే, ఆరణాల అన్నపూర్ణమ్మ పరపరలాడే పట్టుచీరలో కులుకుతూ కాఫీకప్పుతో వచ్చేలాంటి, నీరస కాఫీ గింజల సీనుని కొంచెం మార్చి, ప్రారంభ సీనుగా వేస్తే, యూనిక్ అమిగోస్ కి యూత్ ఫుల్ యాక్షన్ జానర్ మర్యాదై పోతుందా?
        
అసలు సింగిల్ జానర్ సినిమాలు ఇప్పటి మార్కెట్ కే రిస్కేమో అన్పిస్తున్నప్పుడు, తీసే సింగిల్ జానర్ సినిమాలైనా వాటివైన నిర్దుష్ట జానర్ మర్యాదలు పాటిస్తే కొత్తదనం ఫీలవడానికి ఆస్కార ముంటుంది. కానీ హాలీవుడ్ లో  సింగిల్ జానర్ సినిమాల బోరు నుంచి ప్రేక్షకులకి విముక్తి కల్గిస్తూ, మల్టీ జానర్ లేదా క్రాస్ జానర్ సినిమాలు తీస్తున్నారు. ఇన్సెప్షన్, నైవ్స్ ఔట్, కౌబాయ్స్ అండ్ ఎలియెన్స్ లాంటివి.
        
తెలుగులోనూ దీని అవసరం గుర్తిస్తే మంచిదే. సినిమా అంటే ఒక లవ్ ట్రాక్, ఒక హీరో ట్రాక్, ఒక విలన్ ట్రాక్, ఒక ఎండ్ అనే నాల్గు పంక్చరు టైర్ల టెంప్లెట్లకి బదులుగా - నాల్గు వేర్వేరు జానర్లతో కొత్త రూపు రేఖలు తొడగడం మంచిదే. కొత్త దర్శకుడు మురళీ కిషోర్ వినరో భాగ్యము విష్ణు కథ తో ఇదే ప్రయోగం చేశాడు. అయితే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు, ఈ యూనిక్ మల్టీ జానర్స్ ప్రయోగంలో మళ్ళీ అదే అలవాటైన కాఫీ గింజల సీన్లు తిష్ఠ వేసి తినేశాయి.  To make a great film you need three things - the script, the script and the script.- అని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అంటాడు. దీన్ని ఇలా చెప్పు కోవచ్చు- To make a great Telugu film you need three things - cut the coffee ginjalu, cut the coffee ginjalu, and cut the coffee ginjalu first-  అని.  

1. ఏది మల్టీ జానర్?

గోల్డ్ రష్ తీసినప్పుడు చార్లీ చాప్లిన్ ఇదే అంటాడు- అనుకున్న స్టోరీ ఐడియాని ఆద్యంతం దాని అనుభూతితో నిలబెట్టడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడే చాలా మంది దారి తప్పి పోతారు. ఒక కొత్త స్టోరీ ఐడియాని ధూంధాం చేస్తూ ప్రేక్షకుల మధ్యకి తీసికెళ్తాం. కానీ దానిని ఫ్లాట్ గా తయారు చేసి దాని ఖర్మానికి వదిలేస్తాం. చివరికి చూస్తే చింతపండు బెల్లం తప్ప ఏమీ వుండదు- అనేసి.
        
పై తెలుగు సినిమాని దైవ భక్తి, దేశభక్తి, రాజకీయం, సామాజికం, మాఫియా, రోమాంటిక్ కామెడీ, మర్డర్ మిస్టరీ - అనే ఏడు జానర్లతో మల్టీ జానర్ సినిమాగా తీశారు. మళ్ళీ ఇందులో రెండు కథలు : హీరోతో ఒక కథ, హీరోయిన్ తో ఇంకో కథ. దీని గురించి చివర్లో చెప్పుకుందాం. ప్రస్తుతం జానర్స్ కి పరిమితమవుదాం. ఇలా పైన చెప్పుకున్న ఏడు జానర్లతో ఏ జానర్ సినిమాగా అనుభూతి చెందుతూ సినిమా చూడాలి మనం? ఏదీ అనుభూతించ లేని విధంగా వుంది. మరి జానర్లని ఎలా నిర్వహిస్తే మల్టీ జానర్ సినిమాని మానమర్యాదలతో  అనుభూతించగలం? 
        
ఇది ఆసక్తికప్రశ్న. సినిమాలున్నవి అనుభూతించడానికే, రసాస్వాదనకే. దీన్ని గుర్తించడం లేదీ రోజుల్లో. కానీ తీసే సినిమాకి ఒకటి కంటే ఎక్కువసార్లు చూసే రిపీట్ ఆడియెన్స్ స్టేటస్ రావాలంటే ఇదే ముఖ్యం : అనుభూతి. కథని రూపొందించే ప్రక్రియలో వచ్చే మొదటి ప్రశ్నల్లో ఇవి కొన్ని- కథ కూడా ప్రాణియే కాబట్టి- కథ ఏ జానర్? ప్రతీ జానర్ దానిదైన పాత్రచిత్రణల్ని, గతిని, స్వరాన్ని, శైలినీ డీఫాల్టుగా కలిగి వుంటుందని ముందు అర్ధం జేసుకోవాలి.
        
మల్టీ జానర్ మూవీని రాసినప్పుడు, కథని చేపట్టే  విధానం ఎలా వుండాలో, ఆ విధానాన్ని ఆద్యంతం ఎలా నిర్వహించాలో ఎలా తెలుసుకోవాలి ? దీనికొక్కటే మార్గం : చెప్పాలనుకున్న కథ వివిధ జానర్స్ ల బొకేలో ఏ జానర్ కి అనుగుణంగా వుందో దాన్నందుకుని ప్రధాన జానర్ గా చేపట్టడమే. అంటే కథ యాక్షన్ కామెడీ అయితే, అది యాక్షన్ తో కూడిన కామెడీ కథనా, లేక కామెడీతో కూడిన యాక్షన్ కథనా ముందు నిర్ణయించాలి. యాక్షన్ తో కూడిన కామెడీ కథయితే, కామెడీని ప్రధాన కథగా చేసుకుని యాక్షన్ తో చెప్పాలి. కామెడీతో కూడిన యాక్షన్ కథయితే, యాక్షన్ ని ప్రధాన కథగా తీసుకుని కామెడీగా నడపాలి. అలాగే  కథ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయితే, అది థ్రిల్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ కథనా, లేక సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన థ్రిల్లర్ కథనా ముందు నిర్ణయించాలి.  థ్రిల్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ కథయితే, సైన్స్ ఫిక్షన్ ప్రధాన కథగా థ్రిల్స్ తో నడపాలి.  సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన థ్రిల్లర్ కథయితే, థ్రిల్లర్ ని సైన్స్ ఫిక్షన్ తో నడపాలి.

2. ఇన్సెప్షన్ ఒక ఉదాహరణ

ఇన్సెప్షన్ చూద్దాం. ఇది యాక్షన్, క్రైమ్, సైన్స్ ఫిక్షన్ ల మల్టీ జానర్ మూవీ. క్రిస్టఫర్ నోలన్ దీన్నెలా తీశాడు? పక్కా క్రైమ్ సినిమాగానే తీశాడు- కార్పొరేట్ క్రైమ్. అంటే యాక్షన్, క్రైమ్, సైన్స్ ఫిక్షన్ ఈ మూడిట్లో ఓ కార్పొరేట్ కంపెనీని కుప్ప కూల్చే క్రైమ్ చుట్టూ సాగే కథగానే దీన్న నిర్ణయించాడు. అంతేగానీ కార్పొరేట్ కంపెనీని కుప్ప కూల్చే యాక్షన్ కథ గానో, సైన్స్ ఫిక్షన్ కథగానో నిర్ణయించ లేదు.
        
ఎవరైనా ఇన్సెప్షన్ ఏ జానర్ సినిమా అంటే చటుక్కున సైన్స్ ఫిక్షన్ అనేస్తారు. కానీ కాదు. సైన్స్ ఫిక్షన్ తో ఎలా కుప్ప కూలుస్తారు- నేరం (క్రైమ్) చేసి మాత్రమే కుప్ప కూల్చగలరు. ఈ మూలంశాన్ని- కోర్ పాయింటుని పట్టుకోవాలి. కాబట్టి తన కథకి క్రైమ్ ని ప్రధాన జానర్ గా తీసుకుని సైన్స్ ఫిక్షన్, యాక్షన్ లని సబ్ జానర్లుగా చేసుకుని, వీటితో కథనం చేశాడు. నోలన్ ఈ దృష్టితో ప్రేక్షకుల్ని టార్గెట్ చేయడంతో, మూవీ అంతటా ఎడతెగని ఒకే  పొందికైన అనుభూతిని ప్రేక్షకులు పొందగల్గారు.
        
కాబట్టి  దైవ భక్తి, దేశభక్తి, రాజకీయం, సామాజికం, మాఫియా, రోమాంటిక్ కామెడీ, మర్డర్ మిస్టరీ - అనే ఏడు జానర్లతో కూడిన వి. భా. వి. క ని మల్టీ జానర్ సినిమాగా తీసినప్పుడు వీటిలో ప్రధాన జానర్ ఏదో తెలుసుకోగల్గాలి. అసలు కథేమిటి? హత్యకేసులో ఇరుక్కున్న హీరోయిన్ని హీరో కాపాడ్డం కథ. అంటే రోమాంటిక్ థ్రిల్లర్ జానర్. అప్పుడు పూర్తి కథ రోమాంటిక్ థ్రిల్లర్ ఫీల్ తోనే తెగిపోకుండా సాగుతూ వుండాలి తప్ప మరోటి కాదు.
        
అప్పుడు అందులోకి దైవ భక్తి, దేశభక్తి, రాజకీయం, సామాజికం, మాఫియా, రోమాంటిక్ కామెడీ, మర్డర్ మిస్టరీ- ఇవన్నీ సబ్ జానర్లుగా ప్రధాన జానర్ కి (రోమాంటిక్ థ్రిల్లర్ కి) కథనంగా మారతాయి. అప్పుడు ఈ సబ్ జానర్ లన్నిట్లో కూడా రోమాంటిక్ థ్రిల్లర్ ఫీలే అంతర్లీనంగా వుంటుంది. అప్పుడు మొత్తం ఈ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ కథకి సబ్ జానర్లతో ఏకత్వం వస్తుంది.

3. మార్కెట్ యాస్పెక్ట్ వడపోత

అయితే ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి? ఏ ప్రేక్షకులకి దీన్ని ఉద్దేశించారు? కుటుంబాలు, వృద్ధులు, నడి వయస్కులు, యువతీ యువకులు, బాల బాలికలు, ఉయ్యాల్లో క్యారుమనే లేటెస్టు ప్రాణులూ -వంటి సకల వర్గాల సమ్మేళనం కోసం తీశారా? సినిమా చూస్తూంటే ఇలాగే వుంది. కానీ ఈ సినిమా చూసేందుకు వీళ్ళెవరూ రారు యూత్ తప్ప. చిన్న హీరోతో రోమాంటిక్ థ్రిల్లర్ యూత్ అప్పీల్ ఎక్కువుండే జానరే తప్ప మరోటి కాదు. కాబట్టి మిగతా అందరి కోసం తల పెట్టిన కాఫీగింజల సీన్లన్నిటినీ తీసేసి, బడ్జెట్ ని ఆదా చేస్తూ యూత్ కి ఊపునిచ్చే సీన్లతో సినిమా మార్కెట్ యాస్పెక్ట్ సామర్ధ్యాన్ని పెంచొచ్చు. అంటే యూత్ ఫుల్ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ మర్యాదలకి తగ్గ పాత్రచిత్రణల్ని, గతిని (పేస్ ని), స్వరాన్ని (టోన్ ని), శైలినీ (స్టయిల్ ని) క్రియేట్ చేసుకోవడం.
        
ఏ యూత్ సినిమాకైనా యువకులే కాకుండా యువతులు కూడా వచ్చేలా మార్కెట్ యాస్పెక్ట్ తో తీయాలన్న పరిజ్ఞానం కూడా వుంటే అదో పెద్ద భాగ్యం.
        
ఈ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ కథ ఉస్సూరుమన్పిస్తూ యూత్ అప్పీల్ కి దూరంగా దైవభక్తితో ప్రారంభమై, మాఫియా జానర్ ని టచ్ చేసినప్పుడు, మాఫియా జానర్ నుంచి హీరో పరోపకార గుణంతో సామాజికంలోకి, ఆతర్వాత హీరోయిన్ తో రోమాంటిక్ కామెడీలోకి- ఇలా ఓ జానర్ ఇంకో జానర్ ని క్రాస్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ విడివిడి ఖండాలు అన్నట్టుగానే వచ్చిపోతూంటాయి. ఇలా విడివిడి ఖండాలుగా జానర్లని  పేర్చుకుంటూ పోవడంతో దేని ఫీలూ కలక్కుండా పోయింది. అన్నిటినీ కలిపి అంతర్వాహినిగా కామన్ ఫీల్ లేదు.
        
ఆద్యంతం ఒక కామన్ ఫీల్ ఒకే జానర్ తో వస్తుంది. అది ప్రధాన జానర్. ఆ ప్రధాన జానర్ ఏదో తెలుసుకుని దాంతో కథ చేసినప్పుడు, మిగిలిన జానర్లు పైన చెప్పినట్టు సబ్ జానర్లుగా ఆ కథలో సెటిలవుతాయి. దీంతో ప్రధాన జానర్ ఫీల్ ఏదైతే వుంటుందో, అదే అన్ని సబ్ జానర్లలో ప్రవహిస్తూ ఏకం చేస్తుంది. దీంతో అనేక కథలుగా కాక, ఒకే కథ చూస్తున్న ఫీల్ ఏర్పడుతుంది. ఇదీ మల్టీ జానర్ సినిమా చేసే పద్ధతి.
        
ఒక సినిమాలో కావాల్సిన చోటల్లా మసాలా దినుసులు వేసుకుంటూ పోవడం లాంటిది కాదు, మల్టీ జానర్ సినిమాల్లో జానర్ల వాడకం. స్క్రీన్‌ప్లేకి సంక్లిష్టతని, ఉత్సుకతనీ జోడించడమే జానర్లని కలపడంలో ఉద్దేశం. ఇది ఊహకందే కథాకథనాల్ని కొత్తగా, ఆకర్షణీయంగా మార్చేస్తుంది.

4. పాత్రలూ- సబ్ జానర్ల పంపకం

పై ఏడు జానర్లలో దైవ భక్తి, దేశభక్తి, సామాజికం, రాజకీయం, మాఫియా ఇవన్నీ సబ్ జానర్లుగా ప్రధాన కథయిన రోమాంటిక్ థ్రిల్లర్ కోసం పనిచేయాల్సి వుంటుంది. అంటే హీరోయిన్ హత్య చేయబోతోంది కాబట్టి దైవభక్తి, దేశభక్తులతో కూడిన సబ్ జానర్ సీన్లు పాత్రకి డైమెన్షన్ నిస్తూ హీరోయిన్ కుండాలి. హేరామ్ లో కమలహాసన్ వారణాసి వెళ్ళి గంగలో పాపప్రక్షాళన చేసుకోవడం మహాత్మా గాంధీని చంపడానికే. అలా హీరోయిన్ కి దైవ భక్తి చూపిస్తే అది స్టోరీ పాయింటుకుపయోగ పడాలి.
        
ఇక సామాజికం, రాజకీయం, మాఫియా ఇవి హీరోతో వుండాలి. హీరో హీరోయిన్ల మధ్య సబ్ జానర్ల పంపకం ఇలా జరిగాక- ప్రధాన కథకివి ఉపయోగ పడాలి. ప్రధాన కథ రెండుగా వుంది- హత్యకి ముందు రోమాంటిక్ కామెడీగా, హత్యకి తర్వాత రోమాంటిక్ థ్రిల్లర్ గా. అయితే ప్రధాన సమస్యేమిటంటే, హత్య అనే ఘటన ప్రొఫెషనల్ స్కిల్స్ తో లేదు. హత్య, దాని పరిష్కారం లాజికల్ గా వుండకపోతే సినిమా అభాసవుతుంది.

5. ప్లాట్ పాయింట్ల పల్టీ

ఇప్పుడు రెండు కథల ప్రయోగమెలా వుందో చూద్దాం. మాఫియా- ఎన్ఐఏ లకి సంబంధించి హీరోతో ఒక కథ, హత్యలో ఇరుక్కున్న హీరోయిన్ తో ఇంకో కథ. హీరోయిన్ కథతో - అంటే రోమాంటిక్ థ్రిల్లర్ తో హీరో ఇన్వాల్వ్ మెంట్ ఎలాగూ వుంది. ఈ రెండు కథలకీ రెండు ముగింపులుంటాయి. రోమాంటిక్ థ్రిల్లర్ కథ ముగిసి పోయాక, మాఫియా- ఎన్ఐఏ కథ ముగింపు సన్నాహాలు మొదలవుతాయి. ఈ కథలో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడన్న ఫ్లాష్ బ్యాక్ కూడా వస్తుంది. ప్రధాన జానర్ కథ రోమాంటిక్ థ్రిల్లర్ అయిపోయిందని ఇక లేస్తూంటే మళ్ళీ ఇదేంట్రా అనుకుంటూ ఓపిక తెచ్చుకుని చూడాల్సి వస్తుంది. ఈ రెండో కథేదో ముందు ముగిసిపోతే వేరు. సబ్ ప్లాట్ వుంటే దాన్ని ముందే ముగిస్తారు. ప్రధాన కథ ముగిసిపోయాక సబ్ ప్లాట్ చూపించరు.  
        
అసలే సబ్ జానర్లతో సినిమా బరువెక్కి వుంటే రెండు కథల భారమొకటి. క్రియేటివిటీకి రూల్స్ వుండవని చేసుకుపోతే ఇలాగే వుంటుంది. శుభ్రంగా హీరోయిన్ తో రోమాంటిక్ థ్రిల్లర్ కథ వుండగా ఈ రెండో కథ అవసరమే లేదు. ఇలాకూడా అసలు కథతో వుండాల్సిన ఫీల్ ముక్కలైంది.
        
ఎన్ఐఏ వెతుకుతున్న డ్రగ్ మాఫియాకి హీరోయిన్ తో హీరో తన రోమాంటిక్  థ్రిల్లర్ కథ చెప్తూంటాడు. అంటే ప్రధాన జానర్ కథ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందన్న మాట. ఇదొక అదనపు మడత క్రియేటివిటీ. ఇన్ని క్రియేటీలతో మడతలు విప్పుకుంటూ సినిమా చూడాలన్న మాట. ఇదంతా మంకీ బిజినెస్.
        
ఫస్ట్ యాక్ట్ రోమాంటిక్ థ్రిల్లర్ కథని రోమాంటిక్ కామెడీగా  ఇంటర్వెల్ వరకూ సాగదీసి, అక్కడ ప్లాట్ పాయింట్ వన్ లో హీరోయిన్ వల్ల జరిగే హత్య చూపించారు. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఒకటే అంటాడు- There is no terror in the bang, only in the anticipation of it.- అని. అంటే ముందస్తు హెచ్చరిక లేకుండా బ్యాంగ్ ఇస్తే అందులో టెర్రర్ ఫీల్ ఏమీ వుండదని, ముందు నుంచే హెచ్చరికలు చేస్తూ బ్యాంగిస్తే ఆ సీను బలంగా  టెర్రరైజ్ చేస్తుందనీ.  
        
హీరోయిన్ కి ఫ్రాంక్ వీడియోలు చేయాలని వుంటుంది. మురళీ శర్మని రాజకీయ వర్గం చంపే ప్లాను విఫలమవడంతో అది ఫ్రాంక్ వీడియో తీసే ప్రయత్నమని చెప్పి తప్పించుకుంటారు. ఇది నమ్మిన హీరోయిన్ మురళీశర్మతో ఇలాటిదే ఫ్రాంక్ వీడియో చేసి హీరోని సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. హీరో రాగానే మురళీశర్మ మీద పిస్తోలుతో ఫైర్ చేస్తుంది. నిజంగానే ఫైర్ అయిన తూటాతో మురళీ శర్మ చనిపోవడంతో ఇంటర్వెల్.
        
ఈ బ్యాంగ్ లో టెర్రర్ ఫీల్ ఏముంది? ప్రశ్నలే వున్నాయి. ప్రశ్నలకి జవాబులు ఆలోచిస్తూ ఉలిక్కిపడే టెర్రర్ ఏమీ ఫీలవ్వం. నిజ పిస్తోలు ఎవరు పెట్టారు? ఎవరు ఈమెని ఇరికించారు? ఇప్పుడెలా బయటపడుతుంది? లాంటి రొటీన్ ప్రశ్నలు. అంటే జాలిగొల్పే బాధితురాలి ముద్ర పడింది. ఎప్పుడైతే ఈ ప్రశ్నలు తలెత్తాయో, ఆమె పట్ల జాలి ఏర్పడిందో  అప్పుడా ఇంటర్వెల్ సీనుకంత ఇంపాక్ట్ వుండదు.
        
ఇలా ఎందుకు జరిగింది? ముందు నుంచీ హీరోయిన్ తో ఈమె సీరియస్ గా ఏదో చేయబోతోందన్న ముందస్తు హెచ్చరికగా (ఫోర్ షాడోయింగ్) తగిన సీన్లు వేయక పోవడం వల్లే. క్యారక్టర్ కి డెప్త్ నివ్వకపోవడం వల్లే. ఇంటర్వెల్లో టెర్రిఫిగ్గా ఆమె ఇంకో షేడ్ బయటపడాలేగానీ బేలతనం కాదు. మురళీ శర్మతో ఫ్రాంక్ వీడియో చేయాలనుకోవడం ఆమె పైకి కన్పిస్తున్న క్యారక్టర్. లోపల గుంభనంగా ఇంకేదో చేయబోతున్నట్టు ఇన్నర్ క్యారక్టర్ వుండాలి.
        
పైన చెప్పుకున్నట్టు ఆమె దైవభక్తి గానీ, దేశభక్తి గానీ లోపలి ఉద్దేశానికి ఫోర్ షాడోయింగ్ గా అనుమానాస్పదంగా అన్పించాలి. ఇలా క్యారక్టర్ ని తెలిసిన ఔటర్ గోల్ తో బాటు -  తెలియని ఇన్నర్ గోల్ తో కూడా సిద్ధం చేసినప్పుడు, ఇంటర్వెల్లో మురళీశర్మని షూట్ చేయడంతో అప్పుడు హిచ్ కాక్ చెప్పే బ్యాంగ్ ఎఫెక్ట్ వుంటుంది. స్పష్టంగా ఫ్రాంక్ వీడియో వంకన ప్లానింగ్ గా చంపినట్టు వుండాలి. వామ్మో లోపలింకేదో కథుందిరో, యేసి పడేసింది- అని సూటిగా సర్ప్రైజ్ చేయాలే గానీ, ప్రేక్షకులు ఇంకేవో ప్రశ్నల దుకాణం పెట్టుకుని కూర్చోవడం కాదు. క్యారక్టర్ ప్రశ్నార్ధకమై ఆ కథేదో తెలుసుకోవాలన్న ఉత్కంఠ ఏర్పడాలి. క్యారక్టర్ కి ఇంకో షేడ్ ఏదో వున్నట్టు బయటపడాలి. అమాయకురాలు ఇరుక్కుందని చూపించేసి అమాయకురాల్ని రక్షించడంలో ఏం కథ, ఏం డైనమిక్స్ వుంటాయి. హంతకురాలిగా చూపించి నిర్దోషిగా ఎలా బయట పడుతుందనడంలో కథా, కథనంలో డైనమిక్సూ వుంటాయి. క్యారక్టర్ కి డెప్త్ వుంటే, కథకి డెప్త్ వస్తుంది. లేకపోతే ఇంటర్వెల్ సహా అన్నీ ఫ్లాట్ గా వుంటాయి.
        
ఇది కాదు సమస్య. అసలు సమస్య హత్యతో వుంది. హత్య చుట్టూ అల్లిన కథ ఆషామాషీగా వుంది. హత్యకి గురైన మురళీ శర్మ ఇంకేదో దేశంలో బతికివుంటే హీరో పట్టుకుంటాడు. అప్పుడు తన చావుని వేరే శవంతో ఎలా ఫేక్ చేసిందీ చెప్పుకొస్తాడు. ఇది సిల్లీగా, హాస్యాస్పదంగా వుంటుంది. ఇది పూర్తిగా అన్ ప్రొఫెషనల్ రైటింగ్. ప్రధాన జానర్ రోమాంటిక్ థ్రిల్లరైనా థ్రిల్లింగ్ గా అన్పించకపోతే ఎలా? హత్యతో ప్లాట్ పాయింట్ వన్, పరిష్కారంతో ప్లాట్ పాయింట్ టూ రెండూ అర్ధరహితంగా వున్నాయి.
        
సిల్లీగానే మురళీ శర్మ చెప్తున్నది చూస్తే అతను హీరోలా అన్పించి, అతడి ముందు హీరో వెలవెలబోతాడు. అతడి కిలాడీతనం, ఆడుకున్న గేమ్ చూస్తే, అతడి స్థానంలో హీరో వుండాల్సిన కథ అన్పిస్తే, అది ఈ వ్యాసకర్త తప్పు కాదు.

ఇక ప్రతీదానికీ ఎన్ఐఏ ని చూపించడం ఫ్యాషనై పోయింది. ఎన్ఐఏ ని ఏర్పాటు చేసింది టెర్రరిజం కేసుల కోసం. డ్రగ్ మాఫియా కేసులకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని ప్రత్యేకంగా వుంది. 
ఇలా ఎన్నో లోపాలుంటేనే ఆ గజిబిజితో సినిమా ఎంతో బిజీగా వున్నట్టన్పిస్తూ ప్రేక్షకులకి యమ కిక్ ఇస్తుందేమో. జోహార్లు. నిజానికి  ఇలా విశ్లేషణ రాయకూడదు, సినిమాల్ని తీస్తున్న విధంగానే తీస్తూ పోవాలి.
—సికిందర్