రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

1307 : రివ్యూ!


రచన - దర్శకత్వం : వెంకీ అట్లూరి
తారాగణం : ధనుష్, సంయుక్తా మీనన్, సుమంత్, సముద్రని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : జె యువరాజ్
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్
నిర్మాతలు : నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య
విడుదల : ఫిబ్రవరి 17, 2023
***
        వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ తో సార్ తెలుగు- తమిళ ద్విభాషా చలన చిత్రంగా మన ముందుకొచ్చింది. తమిళ టైటిల్ వాతి (వాది).  తెలుగులో ధనుష్ కిది మొదటి సినిమా. ధనుష్ కి హిందీలో మార్కెట్ వున్నా హిందీలో విడుదల చేయలేదు. వెంకీ అట్లూరి 2021 లో నితిన్ తో రంగ్ దే తీశాడు గానీ అది హిట్ కి చాల్లేదు. 2019 లో అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్నూ తీసినా అంతే. 2018 లో తొలి సినిమాగా  వరుణ్ తేజ్ తో తొలిప్రేమ మాత్రమే హిట్టు. ఇప్పుడు ధనుష్ తో ఇంకో ప్రేమకథ కాకుండా సామాజిక సినిమా తీశాడు. దీంతో ఒక సందేశమివ్వదలిచాడు. ఈ సందేశమేమిటి, ఇది ఏ కాలానికి సంబంధించింది, దీనికి మార్కెట్ యాస్పెక్ట్ ఎంతవరకుందీ... మొదలైనవిషయాల్ని విపులంగా పరిశీలిద్దాం...

కథ 
1991 లో ఆర్ధిక సరళీకరణ చేపట్టి 32 ఏళ్ళు దాటాయి. ఈ సరళీకరణలో భాగంగా వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్ని ప్రైవటీకరణ చేయడంతో ఇంటర్ ప్రైవేటు కాలేజీలు జోరుగా పుట్టుకొచ్చి ర్యాంకుల పరుగులో ప్రభుత్వ జ్యూనియర్ కాలేజీలు మూతబడే స్థితికొచ్చాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకి ఇంటర్ విద్య దూరమైంది. దీంతో 1999 లో ఒక కార్పొరేట్ కాలేజీ అధిపతి త్రిపాఠీ (సముద్రకని) ప్రభుత్వ జ్యూనియర్ కాలేజీల్ని చేపట్టి బాధిత వర్గాల్ని చదివిస్తానని ప్రతిపాదన చేస్తాడు. దీనికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో మూతబడ్డ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్ని తెరిచి, తన కాలేజీల్లో ప్రతిభలేని లెక్చరర్లని అక్కడికి పంపిస్తాడు. ఆ లెక్చరర్లతో ఆ విద్యార్థులు ఫెయిలవుతూంటే, కాలేజీల్ని మూయించేసి పేద, మధ్య తరగతి విద్యార్ధులు ఇక విధిలేక అప్పులు చేసి తన కార్పొరేట్ కాలేజీల్లో చేరేలా పన్నాగం పన్నుతాడు.
        
ఈ పన్నాగం తెలియని బాలు అలియాస్ బాలగంగాధర తిలక్ (ధనుష్) మ్యాథ్స్ లెక్చరర్ గా ఆ పల్లెటూరికొస్తాడు. ఆ కాలేజీలో బయాలజీ లెక్చరర్ మీనాక్షీ (సంయుక్తా మీనన్) తప్ప విద్యార్దులెవరూ వుండరు. వాళ్ళంతా రకరకాల పనులు చేస్తూ కుటుంబాలకి తోడ్పడుతూంటారు. బాలు వాళ్ళందర్నీ కూడగట్టి చదివించి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేట్టు చేయడంతో త్రిపాఠీ  దిమ్మతిరుగుతుంది. వచ్చేసి అసలు విషయం చెప్తాడు. అతడి పన్నాగానికి బాలు ఎదురు తిరగడంతో ఉద్యోగంలోంచి తీసేస్తాడు.
        
ఇప్పుడు బాలు ప్రతీ విద్యార్థికీ ఉన్నత విద్య అందాలన్న పట్టుదలతో వాళ్ళని  ఎంసెట్ కి ఎలా సిద్ధం చేశాడు, ఈ ప్రయత్నంలో త్రిపాఠీ ఎన్ని ఆటంకాలు సృష్టించాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

కాన్సెప్ట్ వచ్చేసి -విద్య గుడిలో ప్రసాదం లాంటిదని, దాన్ని పంచాలే గానీ ఫైవ్ స్టార్ హోటల్లో వంటకంలా కాదనీ చెప్పడం గురించి. సింపుల్ గా చెప్పుకుంటే విద్యని వ్యాపారం చేయరాదనడం. ఇది 1990 లలో ఓకే. అప్పుడప్పుడే విద్య కార్పొరేట్ వ్యాపారమవుతూండడంతో. అది గడిచి 30 ఏళ్ళు ముందుకొచ్చేశాక - మూడు తరాల ఇంటర్ విద్యార్ధులు ఈ కొత్త విధానంలోకి మారిపోయాక -ఈ కాన్సెప్ట్ కి ఇప్పుడు కాలం చెల్లినట్టే. అంటే కాన్సెప్ట్ కి యూత్ అప్పీల్ కొరవడింది.
        
ఆర్ధిక సరళీకరణ, ప్రపంచీకరణ -వీటితో ఉద్యోగావకాశాలు, జీతనాతాలూ అపారంగా పెరిగిపోయాక అలాటి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యని చవకలో అందించే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం వల్లకాక ప్రయివేటీకరణ చేశాక- ఉధృతి పెరిగిన ఉద్యోగావకాశాల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు అభ్యంతరం చెప్తున్నారు? పేద, మధ్యతరగతి వర్గాలు సైతం ఈ మార్గంలోకి వచ్చేస్తున్నారు. ఎల్ కేజీ నుంచే ఇంగ్లీషు మీడియంకి పిల్లల్ని రెడీ చేస్తూ. గుడిసెలో కూలీ ఇంగ్లీషు మీడియంకే పంపుతున్న దృశ్యాలున్నాయి. ప్రపంచీకరణలో ఎవరూ వెనుకబడి లేరు. సన్నివేశం ఇదైతే ఇచ్చిన సందేశం సంధికాలపు నాటిది.
       
ఇక విదేశీ యూనివర్శిటీలకే ప్రభుత్వం ద్వారాలు తెరుస్తున్నప్పుడు దేశంలో యూనివర్శిటీల పరిస్థితేమిటి
? ఇవి కూడా ప్రభుత్వ కాలేజీల్లా శిథిల మవాల్సిందేగా. కాబట్టి సమస్య ప్రభుత్వంతో వుంది. ప్రభుత్వం - కార్పొరేట్లు ఒక నెట్వర్క్. దీన్ని బ్రేక్ చేయడం సాధ్యంకాదు. 
        
కాబట్టి విద్య గుడిలో ప్రసాదం లాంటిదని ప్రభుత్వానికి నచ్చజెప్పి ప్రభుత్వంలో మార్పు తేవడానికి సందేశమివ్వచ్చు. ఇది కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అంటే ఈ కాన్సెప్టుకి బాక్సాఫీసు అప్పీల్ లేదు. పైగా ఈ కథలో ప్రభుత్వానికి కాక కార్పొరేట్ త్రిపాఠీకే సందేశమిచ్చారు విచిత్రంగా. అతనెందుకు విద్యని ప్రసాదంలా పంచుతాడు. తను చదివించిన ఇంజనీరు ఉచితంగా ఉద్యోగం ఏమైనా చేస్తాడా.
        
ఇది చాలనట్టు ముగింపులో త్రిపాఠీ కిచ్చిన సందేశంతో హీరోయే కాన్సెప్టుకి వ్యతిరేకంగా పోతాడు- త్రిపాఠీ వ్యాపారానికే సహకరించే ట్విస్టుతో!
       
చాలా గందరగోళంగా వుంది కాన్సెప్ట్. కమర్షియల్ ఫార్ములా ట్రిక్కుతో ముగింపు నిజ జీవితంలో సాధ్యం కాదు. ఈ సినిమా కాలక్షేపానికి తీస్తే అదివేరు. ఎత్తుకున్నది సామాజిక సమస్య. దీన్ని ఫార్ములా కథగా చెప్పాలా
, వాస్తవికంగా చెప్పాలా స్పష్టతలేక రెండిటి గజిబిజి కన్పిస్తుంది.
       
ముందు ప్రభుత్వ కాలేజీలు కాదు
, అసలు విద్యార్ధుల్ని కాలేజీలకి చేరవేసే ప్రభుత్వ బడులే సరిగ్గా లేవు. ఈ స్థితి గురించి తీసిన సినిమాలు వాస్తవికంగానే తీశారు- తమిళంలోనే 2019 లో జ్యోతిక ప్రభుత్వ టీచరుగా 'రాట్చసి', 2012 లో సముద్రకని ప్రభుత్వ టీచర్ గా 'సట్టై' వచ్చాయి రియలిస్టిక్ గా. 2018 లో 'కాంతారా' హీరో రిషభ్ శెట్టి దర్శకత్వంలో కన్నడలో తీసిన
సర్కారీ. హి. ప్రా. శాలేకాసరగోడుకొడుగే -రామన్న రాయ్’ అనే ప్రభుత్వ బడి పిల్లలతో ఫన్నీ రియలిస్టిక్ హిట్ చెప్పుకోదగ్గది.

నిజ సమస్యతో కూడిన ఈ వాస్తవిక కథా చిత్రానికి కేంద్ర జాతీయ అవార్డుతో బాటుకర్ణాటక రాష్ట్ర అవార్డు లభించాయి. అంతేగాక, చాలా వినోద భరితంగా ఈ వాస్తవిక సినిమాని రెండు కోట్ల బడ్జెట్ తో తీస్తే, 20 కోట్లు బాక్సాఫీసు వచ్చింది కన్నడలో! ఏమిటిది? గురిపెట్టిన మార్కెట్ యాస్పెక్టేనా? కానీ ఏ కాలం మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటన్న  స్పృహ టాలీవుడ్ లో ఏం అవసరం - కష్టపడకుండా సినిమాలు చుట్టేసే సులభోపాయముండగా?
        
2003 లో నిజంగా జరిగిన పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశాడు రిషభ్. ‘సర్కారీ. హి. ప్రా. శాలేకాసరగోడుకొడుగే -రామన్న రాయ్’ అనేది  కర్ణాటక - కేరళ సరిహద్దులో కేరళకి చెందిన కన్నడ మీడియం పాఠశాల పోస్టల్ చిరునామా. సర్కారీ. హి. ప్రా. శాలే- లేదా సర్కారీ హిరియా ప్రాథమిక శాలే అంటేప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఈ వూళ్ళో కన్నడ మాట్లాడే ప్రజలెక్కువ. కన్నడ - కేరళ మిశ్రమ సంస్కృతితోసరదాగా మాట్లాడే స్నేహభావంతోదేనికీ ఇబ్బంది పడని సుఖమయ జీవితాలతో ఆనందంగా వుంటారు.
        
స్కూలు ఇలా వుండదు. చదువుకోవడానికి పుస్తకాలుండవుతొడుక్కోవడానికి యూనీఫారాలుండవుఆడుకోవడానికి ఆటలుండవుటీచర్లకి జీతాలుండవుబిల్డింగుకి మరమ్మత్తు లుండవు. అత్యంత నీచాతి నీచంగా వుంటుంది. కారణం 60 మంది కూడా లేని కన్నడ పిల్లల కోసం స్కూలు నడపడం శుద్ధ దండగని కేరళ విద్యాశాఖాధికారి అనుకోవడమే.
        
అందుకని ఈ స్కూలుని మూసేసి మలయాళ మీడియం స్కూలు తెరిచే ఆలోచనతో వుంటాడు. దీంతో ఈ స్కూలు కూలే స్థితిలో వుందనీ, అందుకని దీన్ని కూల్చేయాలనీ సిఫార్సు చేస్తూ రాసిన ఉత్తరం మీద బలవంతంగా హెడ్ మాస్టారుతో సంతకం పెట్టించుకుంటాడు. పేద పిల్లలకి ఆధారమైన ఈ స్కూలు కూల్చేస్తారనే సరికి బడి పిల్లలు ఆందోళన మొదలెడతారు. ఎట్టి పరిస్థితిలో స్కూలుని కాపాడుకోవాలనే సంకల్పంతో న్యాయ పోరాటానికి దిగుతారు. పట్నం వెళ్ళి లాయర్ని మాట్లాడుకుని న్యాయపోరాటం మొదలెడతారు.
        
ఈ బడి పిల్లలతో చిల్డ్రన్ మూవీని చిల్డ్రన్ మూవీగానే తీశాడు జానర్ మర్యాదలతో. మొత్తం రకరకాల పిల్లకాయల కామెడీయే. తెలిసీ తెలీని పిల్లల జ్ఞానంతో ఇదొక బాల హాస్యలోకం. ప్రశ్నించే బాల హాస్యలోకం. దర్శకుడికి మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. చదువుల మీద వేసిన సెటైర్లు మెత్తగా చురక అంటిస్తాయి. ఈ హాస్యలోకంలో అప్పుడే బాల ప్రేమ లోకం కూడా వుంది. పిల్ల కాయల కౌమార ప్రేమాయణం. సినిమా వేషాలు. వూరెలా వుందో పిల్లలూ అలా ఆనందంగా వుంటారు. స్కూలు సమస్యతో హాస్యంగానే పోరాడతారు. హాస్యం కూడా సమస్యల్ని సాధిస్తుందని నిరూపిస్తారు. ఇదొక కొత్త కోణం యాంత్రిక సినిమా కథలకి. ఒక వాస్తవిక సినిమాని వినోదంగా కూడా తీయవచ్చని చేసి చూపించాడు దర్శకుడు రిషభ్ శెట్టి. భాషా వివక్షభాషాధిక్య భావం సామాజిక అల్లికకి చెరుపు చేస్తాయని సున్నితంగా హెచ్చరించాడు.
        
అలాగే ఇంటర్ విద్యార్ధులతో సార్ ని టీనేజర్లకి వర్తించే కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీగా తీయాల్సింది పోయి- మామూలు ఫార్ములా కమర్షియల్ గా కాసేపు, రియలిస్టిక్ గా కాసేపూ చేసి చుట్టేశారు. ఒక ఐడియాని ఎవరికోసం ఏ జానర్ లో తీయాలన్న క్రియేటివ్ సంస్కారం లోపించడంతో అసభ్యంగా తయారయ్యింది వ్యవహారం.
        
80 లలో, 90 లలో వచ్చిన హీరోల సినిమాల సన్నివేశాలు చూస్తున్నట్టు వుంటుంది నేటి కాలానికి. గతించిన కాలపు కథలతో/సమస్యలతో సినిమాలు నేటి యూత్ కి దేనికి, వర్తమానంలో విద్యార్ధులెదుర్కొంటున్న సమస్యలుండగా? ఇలా సందేశం, కథా ప్రయోజనం ఆశించకుండా కేవలం ధనుష్ కోసం చూడాలీ సినిమా.

నటనలు- సాంకేతికాలు

నటనా పరంగా ధనుష్ సినిమాకి చేయాల్సిన న్యాయమంతా చేశాడు. అవమానం, ఉద్వేగం, ఆందోళన, విజయం వంటి సన్నివేశాల్లో సానుభూతిని రాబట్టుకుంటూ పాత్ర పోషణ చేశాడు. శృతిమించిన మెలోడ్రామా - గ్రామ బహిష్కార సన్నివేశం, తన మీద దాడితో గాయపడ్డ సన్నివేశం మొదలైనవాటితో ఓల్డ్ స్కూల్ సినిమాని తలపించాడు. అలాగే తెలుగు ప్రేక్షకులు గుర్తించని తమిళ సుబ్రహ్మణ్య భారతి గెటప్ లో కథకి అతకని ఓవరాక్షన్ కూడా చేశాడు. హీరోయిన్ తో ప్రేమ, విలన్ తో వైరం కమర్షియల్ పంథాలో నటించాడు. వీలైనన్ని మాస్ సన్నివేశాలు, ఫైట్లు చేశాడు. తన పాత్ర కమర్షియలా, రియలిస్టిక్కా పట్టించుకోకుండా ఎప్పుడేది కోరాడో దర్శకుడు అది చేసుకుంటూ పోయాడు.  
        
హీరోయిన్ సంయుక్త సైడ్ అయిపోకుండా సెకండాఫ్ లో కూడా ధనుష్ కి తోడ్పడే పాత్ర నటించింది. సముద్రకని విలనీ, ఎత్తుగడలు తెలిసిన ఫార్ములా ప్రకారం నటించాడు. కెమెరా వర్క్ అంతంత మాత్రంగా వుంటే, సంగీతం- పాటలు ఏమాత్రం కుదరలేదు. దర్శకత్వం ఓల్డ్ స్కూలుకి చెందింది. విజువల్ అప్పీల్ కోసం పల్లెటూరిని డిజైనర్ పల్లె దృశ్యాలతో చూపించ వచ్చు. అది జరగలేదు. కథ ఎత్తుగడ బావుంది. విద్యార్ధులు ఒక వీడియో కేసెట్ చూడడం, అందులో పాఠాలు చెప్తున్న లెక్చరర్ ఎవరా అని వెళ్ళి కలెక్టర్ ని కలుసుకోవడం, ఆ కలెక్టర్ సార్ గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకు రావడం.
        
వీడియో దొరకడం, దాంతో అన్వేషణ ప్రారంభించదమన్నది ఫౌండ్ ఫుటేజ్ సినిమా జానర్ టెక్నిక్ కింది కొస్తుంది. దీంతో ఈ పాత కథని నేటి తరానికి బోలెడు సస్పెన్సుతో, థ్రిల్స్ తో ఆకట్టుకునేలా తీయొచ్చు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పరంగా ఎంత బలహీనంగా వుందో, వూహకందే టెంప్లెట్ సీన్లతో అంత తీసికట్టుగానూ వుంది. మధ్యలో కథకవసరం లేని సీన్లు కూడా. ఇది పేద, మధ్యతరగతి ప్రజలు ఒక యూనిట్ గా ఖరీదైన చదువులతో పోరాడే కథైనప్పుడు, మధ్యలో అనవసరంగా కులసమస్య తెచ్చి సీన్లు సృష్టించడం కథకి మూల బిందువైన యూనిట్ ని భంగపర్చడమే. రస భంగం కల్గించడమే.
—సికిందర్