రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఏప్రిల్ 2024, సోమవారం

1425 : రివ్యూ


 

దర్శకత్వం : ఆదిత్యా దత్
తారాగణం : విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహీ, అమీ జాక్సన్, అంకిత్ మోహన్ తదితరులు
రచయితలు : ఆదిత్యా దత్, రెహాన్ ఖాన్, సరీం మోమిన్, మోహిందర్ ప్రతాప్ సింగ్
సంగీతం : విక్రమ్ మాంట్రోస్, ఛాయాగ్రహణం : మార్క్ హేమిల్టన్
బ్యానర్ : యాక్షన్ హీరో ఫిలిమ్స్
నిర్మాతలు :  విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్
విడుదల : ఏప్రిల్ 26, 2024 (డిస్నీ+ హాట్‌స్టార్)   
***

        హైపర్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కమెండో సూపర్ యాక్షన్ సిరీస్ సినిమాలతో పాపులరయ్యాడు. డూప్ లేకుండా స్వయంగా ప్రమాదకర ఫైట్స్ నటించే విద్యుత్, ఈసారి డోస్ మరింత పెంచుతూ క్రాక్- జీతేగాతో జియేగా (గెలిస్తేనే బ్రతుకుతావ్) అనే స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నటించాడు. దివంగత బాలీవుడ్ గీత రచయిత ఆనంద్ బక్షీ మనవడు ఆదిత్యా దత్ దీనికి దర్శకత్వం వహించాడు. స్పోర్ట్స్ సినిమాలు చాలా వస్తూంటాయి. అయితే వీటికి భిన్నంగా స్పోర్ట్స్ కాని కాల్పనిక స్పోర్ట్స్ కి యాక్షన్ ని జోడించిన విద్యుత్ ప్రయోగం ఫలించిందో లేదో చూద్దాం...  

కథ
ముంబాయి మురికివాడల్లో నివసించే సిద్ధార్థ్ దీక్షిత్ (విద్యుత్ జమ్వాల్) కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ప్రమాదకవిన్యాసాలు చేస్తూ వీడియోలు అప్ లోడ్ చేస్తూంటాడు. కూపే డోర్లోంచి బయటికి వంగి, స్తంభాలని తాకి, పైకి ఎక్కి ఒక  కంపార్ట్ మెంట్ మీంచి  మరో కంపార్ట్ మెంటు మీదికి ఉరుకుతూ తన బ్యాచీ ఫ్రెండ్స్ కి పిచ్చెక్కిస్తూ వుంటాడు. దీంతో వీడొక క్రాక్ అనే పేరొస్తుంది. ఇలా వీడియోలు అప్ లోడ్ చేసి పోలాండ్ లో దేవ్ (అర్జున్ రామ్ పాల్) అనే అతను నిర్వహించే ప్రతిష్టాత్మక మైదాన్ అనే అండర్ వరల్డ్ స్పోర్ట్ ఈవెంట్స్ లో సెలెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తూ వుంటాడు. ప్రయత్నం ఫలించి అతడికి మైదాన్ నుంచి ఆహ్వానం వస్తుంది- ఇంకో 31 దేశాల క్రీడాకారులతో బాటు.
       
పోలండ్ లో మైదాన్ అనే క్రీడా ప్రపంచపు సామ్రాజ్యానికి అధిపతిగా వుండే దేవ్
,
మైదాన్ షోరన్నర్ గా యువతకి రేస్ లు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు బహుమానంగా పంచుతూంటాడు. ఇక్కడ మూడు రేసులుంటాయి. మొదటి రేసు గెలిచిన తర్వాత మైదాన్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఆలియా (నోరా ఫతేహీ) తో ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. మరోవైపు దేవ్ క్రీడల ముసుగులో చట్టవ్యతిరేక కలాపాలు చేస్తున్నాడని పసి గట్టిన పోలీసు అధికారి నోవాక్ (అమీ జాక్సన్) దేవ్ ని పట్టుకోవాలంటే సిద్ధార్థ్ సాయం తీసుకోవాలని భావిస్తుంది. ఈమె ద్వారా సిద్ధార్థ్ కి తన అన్న నిహాల్ దీక్షిత్ (అంకిత్ మోహన్) మరణ రహస్యం తెలుస్తుంది. నాల్గేళ్ళ క్రితం ఇక్కడ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన తన అన్న నిహాల్ మరణం వెనుక దేవ్ హస్తముందని అర్ధమవుతుంది.
       
దీంతో
సిద్ధార్థ్ లక్ష్యం మారుతుంది. ఇక అన్న హత్యకి దేవ్ మీద ప్రతీకారం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. ఇక్కడ్నుంచి దర్శకుడి ఇష్టానుసారం ఎలా పడితే అలా సాగుతుంది కథ ...

ఎలావుంది కథ
ఈ కథకి నల్గురు రచయితలు సారధ్యం వహించారు. ఈ కథని పూర్తిగా  మైదాన్ విజేతగా బాగా డబ్బు సంపాదించుకుని ధనవంతుడ్ని అవ్వాలన్న హీరో లక్ష్యం గురించి కాకహీరో అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకునే అవుట్ అండ్ అవుట్ రివెంజీ  డ్రామాగా కూడా గాక, లేదా క్రీడల పట్ల తనకున్న సహజ ప్రవృత్తిని క్యాష్ చేసుకోవడం ద్వారా ప్రసిద్ధి చెందాలన్న హీరో గోల్ గురించి కూడానూ కాక, ఏం చెప్పాలని ఈ కథ రాశారో అర్ధంగాకుండా జేశారు.
       
ఇలాటిదే ఇదే వారం విడుదలైన
రత్నం లో చూశాం. విలన్ బారీ నుంచి హీరోయిన్ని కాపాడే హీరో కథ కాస్తా, గతంలో ఆ విలన్ తన తల్లి మరణానికి కారణమయ్యాడన్న నిజం తెలిశాక  హీరో రివెంజీ కథగా మారిపోవడం. ఇలా చేస్తే -అంటే నడుస్తున్న కథలో ఇంకో పాయింటు లేవనెత్తితే- కథే మారిపోయి సినిమా ఫ్లాపవుతుందనేది చాలా సార్లు చూశాం. ఇలా జరగకుండా హాలీవుడ్ వాళ్ళు ఒక చిట్కా కనిపెట్టారు.
        
ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ (2016) లో కౌబాయ్ డెంజిల్ వాషింగ్టన్, ఓ గ్రామానికి బందిపోటు విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి తన గ్రూపుతో వెళ్ళి పోరాడుతూంటాడు. ఇలా సినిమా సాంతం పోరాడుతూనే  వుంటే, పాత్ర నమ్మశక్యంగా అన్పించదు. తనది కాని ఏదో వూరుని కాపాడే అవసరం తనకెందుకు? ఎందుకో చిట్ట చివర్లో వెల్లడిస్తాడు. ఆ బందిపోటు అయిన విలన్ని చంపుతూ, ‘నా చిన్నప్పుడు  మా అమ్మనీనా ఇద్దరు చెల్లెళ్ళనీ చంపావ్ గుర్తుందా?’ అంటాడు వాషింగ్టన్. ఎండింగ్ లో ఈ  స్టేట్ మెంటుకి మనం కూడా షాకవుతాం విలన్ తో పాటు.  విలన్ తో వాషింగ్టన్ కి పాతపగ వుందనే విషయం మనకి అప్పటివరకూ తెలియకుండా దాచారు. తెలిస్తే రొటీన్ రివెంజి కథ అని తెలిసిపోయి ఇంటరెస్టు పోయేది.
       
ఇలా చిట్ట చివర్లో వెల్లడించాక
, వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా ఎలివేటయ్యే పాత్ర చిత్రణా పరమైన హంగు చేకూరింది. అంటే తనలో ఇంత బాధని దాచుకుని గ్రామం కోసం పోరాడాడన్న మాట. హీరో అనేవాడి   మొదటి ప్రాధాన్యం లోక కళ్యాణమే తప్ప సొంత లాభం కాబోదు. అందుకని తన పగదీర్చుకోవడానికే గ్రామంకోసం పోరాడినట్టు అన్పించదు. పగ లేకపోతే వచ్చే వాడు కాదనీ కూడా అన్పించదు. పగ గురించే అయితే విలన్ ఎక్కడున్నాడో అక్కడి కెళ్ళి చంపేసి పోవచ్చు. ఇలా కాకుండా స్వకార్యం, స్వామి కార్యం రెండూ చక్కబెట్టదల్చుకున్నాడు. ఇలా కథకి ఏక సూత్రతని కాపాడ్డంతో బాటు, హీరో క్యారక్టర్ ఎలివేషన్ కీ పనికొచ్చేలా ఎండింగ్ స్టేట్ మెంటుగా చేసి తురుపు ముక్కగా ప్రయోగించారు రివెంజీ అనే రొటీన్ ఎలిమెంట్ ని. దీంతో సినిమా ఫ్లాపయ్యే ప్రమాదం తప్పింది. ఈ మూవీ ఇదే టైటిల్ తో 1966 నాటి క్లాసిక్ కి రీమేక్.
       
పోనీ
క్రాక్ లో ధనవంతుడు అవ్వాలని మైదాన్ లో పాల్గొనేందుకు వచ్చిన హీరో- అన్న హత్య గురించి తెలిశాక రివెంజీ మోడ్ లోకి వెళ్తే వెళ్ళాడు, అప్పుడైనా లక్ష్యాన్ని అప్డేట్ చేసుకుని వుంటే ఈ కథ బతికి బట్టకట్టేది. ఎలాగంటే, సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్లో సల్మాన్ ఖాన్ చనిపోయిన కొడుకు పేర బ్లడ్ బ్యాంకుకి డబ్బు కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా దిగుతాడు. ఎప్పుడో పుట్టగానే చనిపోయిన కొడుకు గురించి కథ మనకి తెలీదు. ఆ పుట్టిన శిశువుని కూడా మనకి చూపించరు. ఈ బాధాకర గతమంతా చివర్లో మ్యాచ్ గెలిచాకే మనకి తెలుస్తుంది. అప్పుడు కొడుకు పేర బ్లడ్ బ్యాంకు అనే అతడి ఉన్నతాశయం వెల్లడై క్యారక్టర్ ఎలివేట్ అవుతుంది.
        
క్రాక్ లో హీరో అన్నకి సంబంధించి ఇలాటి ఉన్నతాశయం కోసం లక్ష్యాన్ని అప్డేట్ చేసుకోకుండా, డొల్లగా సాగిపోతుంది హీరో పాత్ర. దీంతో అప్డేట్ చేసిన స్పోర్ట్స్ యాక్షన్ సీన్స్ తప్ప, ఎమోషనల్ కనెక్ట్ లేని  వీడియో గేమ్ లా తయారైంది సినిమా.

నటనలు -సాంకేతికాలు
విద్యుత్ జమ్వాల్ డేర్‌డెవిల్ సాహసకృత్యాలు, వెయ్యి వోల్టుల విద్యుత్ లాంటి  యాక్షన్ సీక్వెన్సులు, ప్రమాదకరమైన రేసింగ్ క్రీడలు చూస్తూంటే మన బీపీ పెరిగిపోతుంది.  డూప్ లేకుండా ఏ కొండ లేదా పర్వతం నుంచి మెరుపు వేగంతో ఎలా దూకుతాడో పట్టుకోవడం కష్టం. మూడు రేసులు, చివర్లో విలన్ అర్జున్ రామ్ పాల్ తో షో డౌన్- అదరగొట్టేశాడని ఒప్పుకోవాలి. కానీ ఇది సరిపోలేదు. దీనికి తగ్గ కథ, పాత్ర చిత్రణ కూడా వుండాలి.
       
అర్జున్
రామ్ పాల్ విలన్ గా స్ట్రాంగ్ గా వున్నాడు. అతడి కథకి, పాత్ర చిత్రణకి లోపాల్లేవు. యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. అమీ జాక్సన్ పోలీసాఫీసర్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ని కమాండ్ చేసింది. నోరా ఫతేహీ కేవలం విద్యుత్ తో రోమాన్స్ కోసమన్నట్టు వుంది.
       
అయితే స్పోర్ట్స్ యాక్షన్ సీన్స్ ని ఎడిటింగ్ చేసిన విధానం అడ్డదిడ్డంగా వుంది. కొన్ని షాట్స్ తీయడం మర్చిపోవడం వల్లనో
, తీసిన షాట్స్ పొరపాటున డిలీట్ అయిపోవడం వల్లనో అన్నట్టు- పది పదాలున్న వాక్యంలో మూడు పదాలు మిస్సయినట్టు ఎడిటింగ్ వుంది. కానీ యాక్షన్ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యాక్షన్ నే స్పీడుగా పరుగులేట్టించేలా వుంది. కెమెరా వర్క్, పోలండ్ ని చీట్ చేసిన అజర్ బైజాన్ ఫారిన్ లొకేషన్ మంచి విజువల్ క్వాలిటీ నిచ్చాయి. విద్యుత్ జమ్వాల్ ఫ్యాన్స్ కి మాత్రం మాంచి కిక్కు నిచ్చే ఈ మూవీ డిస్నీ +హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ లో మాత్రమే వుంది.

—సికిందర్

16, ఏప్రిల్ 2024, మంగళవారం

1424 : రివ్యూ



రచన-దర్శకత్వం : కేవీఆర్ మహేంద్ర
తారాగణం : సూర్య తేజ ఏలే, మీనాక్షీ గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం :  వెంకట్ ఆర్ శాఖమూరి
నిర్మాత: పాయల్ సరాఫ్
విడుదల : ఏప్రిల్ 5, 2024
***
        తెలంగాణ పీరియడ్ సినిమా దొరసాని (2019) దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, ప్రముఖ చిత్రకారుడు ఏలే ధని  కుమారుడు సూర్యతేజని పరిచయం చేస్తూ భరతనాట్యం అనే తెలంగాణ క్రైమ్ కామెడీ తీశాడు. పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ తీసిన కీడాకోలా అనే తెలంగాణ క్రైమ్ కామెడీకి ఒక ప్రత్యేక శైలి వుంది. లాజిక్ ని కామెడీ చేసే మెంటల్ పాత్రలతో కొత్తదనం సంతరించుకుని ఓవర్సీస్ లో కూడా హిట్టయ్యింది. మరి ఈ క్రైమ్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వుంది? దీన్ని ఒకసారి చూడొచ్చా?  చాలా కాలం తర్వాత దర్శకుడి రెండో సినిమా ఏ స్థాయిలో వుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

రాజు సుందరం (సూర్యతేజ) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూంటాడు. రొటీన్ గానే ఇంట్లో కష్టాలకి, గర్ల్ ఫ్రెండ్ (మీనాక్షి గోస్వామి) ని ఒప్పించడానికీ డబ్బులుండవు. డైరెక్టర్ అయిపోదామని కథలు చెప్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తూంటాడు. కథల కోసం మైక్రోఫోన్లు ఏర్పాటు చేసి మనుషుల మాటలు రహస్యంగా వింటూ వాటిని కథలుగా రాస్తూంటాడు. మరోపక్క దివాకర్ (హర్షవర్ధన్) అనే పెద్ద క్రిమినల్ డ్రగ్స్ దందా చేస్తూంటాడు. ఓ రోజు రెండు కోట్ల దందా గురించి మైక్రోఫోన్లో విని, డబ్బు సంపాదనకి ఇదే మార్గమని వాళ్ళ అడ్డాకి వెళ్తాడు రాజు సుందరం. అక్కడ భగతనాట్యం అనే కోడ్ నేమ్ తో డ్రగ్స్ డీల్ జరుగుతూంటే బ్యాగు లాక్కుని పారిపోతాడు. ఆ బ్యాగులో డబ్బులుండవు, డ్రగ్స్ వుంటాయి. ఈ క్రమంలో శకుని (అజయ్ ఘోష్) అనే పోలీసు అధికారికి చిక్కుతాడు. ఇక్కడ్నుంచి బయటపడి డ్రగ్స్ తో ఏం చేశాడు, వాటిని తానే అమ్మి డబ్బు సంపాదించాడా, లేక ఇంకేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

తెలంగాణ ఫీల్ ఏం లేదు గానీ క్రైమ్ కామెడీకి పనికొచ్చే కథే. అయితే చేతిలో వున్నది కథలా భావించి తీయలేదు. ఏదో కాకరకాయ, ఎలా తీసినా క్రైమ్ కామెడీ అయిపోతుంద
నుకుని తీసినట్టుంది. ఇందుకే క్లయిమాక్స్ సహా విషయం ఆషామాషీగా వుంది. డ్రగ్స్ కి పెట్టిన పేరు భరతనాట్యం సెన్సారింగ్ లో భగత నాట్యం అని పలకడంగా మారిపోవడం ఈ కంటెంట్ కి తగిన న్యాయమే. ఫస్టాఫ్ అసలు కథేంటో ఎవరైనా చెప్పగలిగితే  ఈ సినిమా బడ్జెట్ వాళ్ళకి ఇచ్చేయవచ్చు.
       

ఫస్ట్ హాఫ్ అంతా హీరో సినిమా కథలు వినిపిస్తూ చేసే కొత్తదనం లేని కామెడీలు
, విలన్ దివాకర్, అతడి గ్యాంగ్ తో ఇబ్బంది పెట్టే కామెడీలూ సాగుతూ గంటపాటు ఓపికని పరీక్షిస్తూ- ఇంటర్వెల్ కి హీరో చేతికి డ్రగ్స్ రావడంతో ఆసక్తికర మలుపే వస్తుంది.
        
అయితే సెకండాఫ్ లో ఆ డ్రగ్స్ తో హీరో ఏం గేమ్ ఆడుకోవాలో ప్లానింగ్ లేకపోవడంతో తిరిగి సహన పరీక్షగా మారిపోయి ఆశ వదులుకునేలా చేస్తుంది. ఇందులో విలనీలు కూడా పాత సినిమాల్లో సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి విలనీల్లా తీరుబడి డైలాగులతో వుంటాయి. పాత హిందీ సినిమాల్లో విలన్ అజిత్ అనుచరులు మోనా డార్లింగ్, రాబర్ట్ లతో వుండే కామెడీ చాలా పాపులరైంది. ఏ సినిమాలోనైనా విలన్ అజిత్ కి మోనా డార్లింగ్, రాబర్ట్ లు వుండాలల్సిందే. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అజిత్- మోనా డార్లింగ్- రాబర్ట్ లతో కొత్త కొత్త జోకులు పుట్టిస్తున్నారు. వాళ్ళని సజీవంగా వుంచుతున్నారు.
       
ఇలాటి క్రియేటివిటీని ఈ క్రైమ్ కామెడీలో మిస్సయ్యారు.
ముత్యాలముగ్గు లో రావు గోపాలరావుని, జస్టిస్ చౌదరి లో సత్యనారాయణనీ తీసుకుని వాళ్ళ స్టయిల్ విలనీతో ఎంటర్ టైన్ చేసివుంటే ఈ కథ లేని సినిమాకి ఇదే పెద్ద ఆకర్షణ అయ్యేది.  కథ లేని సినిమాగా తీయాలనుకుని వుంటే, కథ లేకుండా  కేవలం క్యారక్టర్లతో ఎలా నడిపారో ఎల్ డొరాడో (1966) అనే కౌబాయ్ క్లాసిక్ చూసి తెలుసుకుని వుండొచ్చు.
        
ఇక షరా మామూలుగా సెకండ్ హాఫ్ ఆ డ్రగ్స్ కోసం, డబ్బుల కోసం అందరూ వెంటబడడం చూసి చూసి వున్నఅరిగిపోయిన  సీన్లే. ఇంతకంటే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ హీరో పాత్రకి క్రియేటివిటీ తెలియకుండా పోయింది. క్వెంటిన్ టరాంటినో తీసిన పల్ప్ ఫిక్షన్ లో ఒక బ్రీఫ్ కేసు కోసం వేట వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో పాత్రలకి తప్ప ప్రేక్షకులకి తెలీదు. చివరికా బ్రీఫ్ కేసు చేజిక్కుంచుకున్న పాత్ర మూత తెరిచి చూస్తే, బ్రీఫ్ కేసులోంచి అతడి మొహం మీద వెలుగు పడుతూంటుంది. తృప్తిగా చూస్తూంటాడు. ఆ ముగింపులో కూడా బ్రీఫ్ కేసులో ఏముందో ఆడియెన్స్ కి చూపించరు. చూపిస్తే డబ్బులో. డ్రగ్సో, వజ్రాలో వుంటే సర్ప్రైజ్ ఏముంటుంది? అందుకే ఇంకేదో గొప్పది వున్నట్టు ప్రేక్షకుల వూహకే వదిలేస్తారు. ఇది కథనంలో ఉపయోగపడే ఒక ప్లాట్ డివైస్ అనీ, దీన్ని మెక్ గఫిన్ అనాలనీ, సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టి చెప్పాడు.

మొత్తానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన కథ ఇలా నడిపిస్తే, ఇక సినిమాలేం తీస్తాడో వూహించాల్సిందే. కొసమెరుపేమిటంటే,  దీనికి పార్ట్ 2 వుంటుందని సూచించారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరోగా సూర్యతేజ యాక్టింగ్ ఫర్వాలేదు, స్పీడుంది. స్పీడుతో ఓవరాక్షన్ చేయకుండా నిగ్రహింఛుకున్నాడు. హీఓయిన్ మీనాక్షి గోస్వామి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ హిందీ, తెలుగు కాలిపి మాట్లాడుతూంటుంది. షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ లా వుంది. సినిమా హీరో అవ్వాలనే పాత్రలో వైవా హర్ష తన అనుభవంతో కామెడీని బాగా హేండిల్ చేశాడు. పోలీసాఫీసర్ గా అజయ్ ఘోష్, విలన్ గా హర్షవర్ధన్ లది పాత కాలపు విలనీ.
        
చాలా పరిమిత బడ్జెట్ తో తీసినట్టున్నారు. ప్రొడక్షన్ క్వాలిటీ గురించి చూడకూడదు. పాటలు ఒక్కటి కూడా కనెక్ట్ కావు. డ్రగ్స్ తీసుకుంటే ఆ మత్తు భరతనాట్యం చేయిస్తుందని చెప్పడం కవి హృదయమేమో.  దీన్ని సెన్సార్ ఖండించి, భగతనాట్యం గా పాత్రల చేత పలికించింది.
—సికిందర్

1423 : రివ్యూ

 

రచన -దర్శకత్వం: చిదంబరం
తారాగణం : సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్ జూనియర్, ఖాలిద్ రెహమాన్ తదితరులు
సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం :             షైజూ ఖాలీద్
నిర్మాతలు : సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ
బ్యానర్ : పరవ ఫిలిమ్స్
తెలుగు పంపిణీ : మైత్రీ మూవీ మేకర్స్
విడుదల : ఏప్రిల్ 6, 2024
***
        టీవల రెండు మలయాళం సినిమాలు వసూళ్ళలోనూ సంచలనం సృష్టించాయి.  వాటిలో ఒకటి ప్రేమలు’. ఇది 135 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్ కూడా బాగానే వసూలు చేసింది. అలాగే మంజుమ్మల్ బాయ్స్  230 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్  ఈ రోజు విడుదలైంది. దీని గొప్పదనమేమిటో ఓసారి చూద్దాం...

కథ
కేరళలోని కొచ్చి సమీపంలో మంజుమ్మల్ అనే చిన్న పట్టణానికి చెందిన రెండు స్నేహితుల సమూహాలుంటాయి. వీళ్ళెప్పుడూ తగాదాలు పడి కొట్టుకుంటూ వుంటారు. ఒకర్నిమించిన పనులు మరొకరు చేయాలని పోటీలు పడుతూంటారు. 2006 లో వీళ్ళల్లో ఆర్ట్స్ క్లబ్ గ్రూపు కొడైకెనాల్ విహార యాత్ర ప్లాన్ చేస్తారు. కొడైకెనాల్‌ అంతా తిరిగి ఎంజాయ్ చేశాక, గుణ గుహలు చూడాలని ఉత్సాహ పడతారు. కమలహాసన్ నటించిన గుణ షూటింగ్ ఇక్కడే జరగడంతో గుహల కీ పేరొచ్చింది. ప్రమాదకరమైన ఈ గుహాల్లోకి ప్రవేశాన్ని నిషేధించి  ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ దూకి సాహసం ఛేస్తారు మంజుమ్మల్ బాయ్స్. అలా గుహలు చూస్తూ తిరుగుతూంటే బాయ్స్ లో ఒకడైన సుభాష్ (శ్రీనాథ్ భాసి) మనిషి వెడల్పుగల లోతైన రంధ్రం లో పడిపోతాడు. ఇది ప్రాణాంతక బిలం. ఇందులోకి ఇంతవరకూ 16 మంది పడిపోతే శవాల్ని కూడా బైటికి తీయలేక పోయారు.
       
ఇప్పుడు సుభాష్ పడిపోవడంతో మిత్రబృందం భయంతో కేకలు వేస్తారు. పోలీస్ స్టేషన్ కి పరిగెడతారు. గ్రామస్థులకి చెప్పుకుంటారు. పోలీసులు ఉల్టా కేసు బనాయిస్తారు. కాళ్ళావేళ్ళా పడ్డాక పోలీసు
,లు, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులూ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తారు. తాడు సాయంతో లోపలికి వెళ్ళి బాధితుడ్ని పైకి తీసుకు రావడానికి సిబ్బంది ముందుకు రారు. మంజుమ్మల్ బాయ్స్ లో ఒకడైన కుట్టన్ (
సౌబిన్ షాహిర్) ముందుకొస్తాడు.
       
కుట్టన్ ఈ సాహసం చేయడానికి కారణముంది. ప్రాణాలు పణంగా పెట్టి  స్నేహితుడ్ని కాపాడేందుకు అతను పూనుకోవడానికి ప్రేరేపించిన ఆ కారణమేంటి
? అలా స్నేహితుడ్ని ప్రాణాలతో కాపాడుకోగలిగాడా? ఇందుకు అధికార్లు అందించిన సహాయక చర్యలేమిటి? అసలు వందల అడుగుల లోతులో పడిపోయింది గాక, భారీగా కురిసిన వర్షం నీళ్ళల్లో సుభాష్ బతికున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ. 

యదార్థంతో ప్రయోగం
ఇది యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సర్వైవల్ డ్రామా.  యదార్థ సంఘటనలతో మలయాళంలో వరుసగా మూడు సర్వైవల్ డ్రామాలు హిట్టయ్యాయి. కేరళ వరద బీభత్సం మీద ’2018’ (2023), గుణ గుహల మీద మంజుమ్మల్ బాయ్స్ (2024), సౌదీ వలస కార్మికుడి మీద ఆడు జీవితం (2024).  గుణ గుహలు  అనేవి తమిళనాడులోని కొడైకెనాల్ లో వున్న ఒక గుహల సముదాయం. ఈ సముదాయంలో మనిషి పట్టే వెడల్పుతో లోతైన బిలాన్ని 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి రికార్డు చేశాడు. దీనికి అతను డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. 1991 లో ఇక్కడ కమలహాసన్ సినిమా గుణ షూటింగ్ జరిగినప్పట్నుంచీ ఇది పర్యాటక కేంద్రంగా ఆకర్షించ సాగింది. 2016 వరకూ ఈ బిలంలో పడిపోయిన వ్యక్తుల కేసులు 16 నమోదయ్యాయి. కేవలం మంజుమ్మల్ బాయ్స్ ఘటనలో ఒక్కడే బతికి బయట పడ్డాడు.
       
ఈ సినిమా చూస్తూంటే ఒక సందేహం వెంటాడుతూ వుంటుంది. అంత మంది ఆ రంధ్రం లో పడిపోతున్నప్పుడు ఇనుప మెష్ తో ఆ రంధ్రాన్ని ఎందుకు మూసేయలేదు
? కేవలం అక్కడికి చేరుకోకుండా ఎక్కడో ఫెన్సింగులు మాత్రమే వేసి ఎందుకు వదిలేశారు? ఈ విషయం తట్టే కాబోలు-

సినిమా చివర్లో ఇదే చూపించాడు దర్శకుడు- ఆ రంధ్రం మీద ధడేలుమని ఇనుప మెష్ పడేసి! కానీ క్రోనాలజీ ప్రకారం చూస్తే ఇది కరెక్ట్ కాదు. మంజుమ్మల్ బాయ్స్ ఉదంతం 2006 లోనే జరిగింది. అప్పుడు ధడేలుమని ఇనుప మెష్ పడేస్తే
, 2016 వరకూ ఇంకొన్ని మరణాలు ఎలా జరిగినట్టు? ఇంతకీ ఇప్పుడైనా మూసి వుందా లేదా? ఎవరైనా గూగుల్ చేసి కనుక్కోవాలి.

       
ఈ సర్వైవల్ డ్రామా 2 గంటల పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్. హ్యూమన్ డ్రామా.  అడ్వెంచర్స్ లో ఒక లెసన్. పర్యాటకులు నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతారు
? ఈ గుహల్లో తేళ్ళు పాములైనా వుంటే? నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ ఈ సర్వైవల్ డ్రామా.
        
అందుకే దీన్ని హార్రర్ కామెడీలా తీసి ఎంటర్ టైన్ చేయాలనుకోలేదు. తెలుగు చేతులైతే ఈ పనే చేసి సినిమా తీస్తాయి. వాడు రంధ్రంలో పడిపోయి ఆర్తనాదాలు చేస్తూంటే అక్కడ దెయ్యాల్ని కూడా జొప్పించి కామెడీ చేస్తారు. చివరికి ఏ వేపమండల అమ్మవారి ముందో కాంతారా డాన్సులు చేసి బిలంలో దెయ్యాల్ని చంపి అర్భకుడ్ని కాపాడతారు.

1. క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ (స్టీవెన్ స్పీల్ బెర్గ్ -1977),
2.
 ‘మంజుమ్మల్ బాయ్స్’ (మలయాళం- 2024)
 
బిలం అంతర్భాగాన్ని సెట్ వేసి షూటింగు జరిపారు. ఈ కథని కేవలం బిలంలో పడిపోయిన మిత్రుడి రెస్క్యూ ఆపరేషన్ గా చూపిస్తే ఇది సినిమా అయ్యేది కాదు. డాక్యుమెంటరీ అయ్యేది. ఈ ప్రమాదానికి సమానాంతరంగా  చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ బాయ్సే అప్పటి పిల్ల మూక. వాళ్ళల్లో ఒకడు (సుభాష్) తన మీద ప్రాంక్స్ ప్లే చేసుకుంటూ వుంటాడు. ఆవిప్పుడు బిలంలో పడిపోవానికి సింబాలిక్ గా వుంటాయి. ఇలాటి ఫోర్ షాడోయింగ్ సీన్స్ తో సందర్భానుసారంగా ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఒకసారి అంతా నదిలో దూకేసి ఈత కొడుతూంటారు. సుభాష్ నీ దూకెయ్యమంటారు. భయపడుతూ దూకేసిన సుభాష్ ఏమయ్యాడు? అప్పుడు వాడ్నిఎవరు కాపాడారు. ఇది ఇప్పటి  ప్రమాదంతో ఎలా లింకప్ అయింది? ఇప్పుడు కుట్టన్ రంధ్రంలోంచి సుభాష్ ని కాపాడ్డానికి ప్రేరణ ఏమిటి? లోనైన ఎమోషన్స్ ఏమిటి?

కదిలించే ఎమోషనల్ డ్రామా కూడా ఇది.  ఫ్రెండ్ షిప్ స్టోరీ కూడా. యువనటులతో యూత్ ఆడియెన్స్ పల్స్ ని పట్టుకున్న ప్రయోజనాత్మక సినిమా. నిడివి కేవలం రెండు గంటలు. తారాగణ బలం లేని సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ప్రొడక్షన్ మీద పెట్టారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో వచ్చేదాకా ఆగకుండా బిగ్ స్క్రీన్ మీద చూస్తే దీని బలం పదింతలు తెలుస్తుంది. ఆడు జీవితం తర్వాత బలమైన సినిమా చూడాలనుకుంటే ఇదే.

2024 లో సందర్శకుల్ని ఆకర్షించడానికి గుహకు వెళ్ళే రహదారిని  తిరిగి తెరిచారు. అయితే పర్యాటకుల భద్రత కోసం గుహ ప్రవేశ ద్వారం ఇప్పటికీ మూసివేసే వుంచారు. ఈ సినిమా ప్రారంభ ముగింపుల్లో గుణ లో కమల హాసన్ వెంటాడే పాట ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఇళయరాజా స్వరకల్పనలో వస్తూంటుంది. గుహ బాధితుల్ని పరామర్శిస్తున్నట్టు.

—సికిందర్

14, ఏప్రిల్ 2024, ఆదివారం

1422 : రివ్యూ!

 

ర్శకత్వం : ఫిలిప్ మార్టిన్
తారాగణం : రూఫస్ సెవెల్, గిలియన్ ఆండర్సన్, కీలీ హవేస్, బిల్లీ పైపర్ తదితరులు
రచన : పీటర్ మోఫాట్, జియోఫ్ బుస్సేటిల్
సంగీతం : అన్నే నికితిన్, హన్నా పీల్; ఛాయాగ్రహణం : నానూ సెగల్
బ్యానర్స్ : ది లైట్‌హౌస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, వోల్టేజ్ టీవీ
నిర్మాతలు : రాడ్‌ఫోర్డ్ నెవిల్లే, హిల్లరీ సాల్మన్
విడుదల : నెట్‌ఫ్లిక్స్
***
        2019 నాటి ఒక బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని విడుదలైన నెట్ ఫ్లిక్స్ మూవీ స్కూప్ ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది. ఈ నెల 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తెలుగులో కూడా వుంది. బిబిసి జర్నలిజం నోయిడాలో కొలువుదీరిన మన గోదీ భజన మీడియా జర్నలిజానికి అందనంత సుదూరంగా, అందుకోలేని ఎత్తులో జర్నలిజం విలువలతో వుంటుంది. అందుకే ఎంత భారీ కూపీ లాగినా టీఆర్పీల కోసమని సొంత బాకా వూదుకుంటూ హంగామా చేయదు. వార్తల్లో ఆ దోషి వుంటాడు, తనుండదు. అందుకే బ్రిటన్ యువరాజు భాగోతాన్నిబట్టబయలు చేసి, అతడ్ని పదవీచ్యుతుడ్ని చేసిన విస్ఫోటక టెలివిజన్ ఇంటర్వ్యూని ప్రసారం చేస్తూ- ఇది విమానంవచ్చి ఆయిల్ ట్యాంకర్ని ఢీకొన్న పేలుడు కాదు, సునామీ ఉత్పాతం కాదు, అణుబాంబు విస్ఫోటం అంతకన్నా కాదు- ఇది కేవలం కారు ప్రమాదం కంటే తక్కువ రకం మామూలు ప్రసారం అని నిరాడంబరంగా చెప్పుకుంది. ఈ కొటేషన్ బాగా పాపులరైంది.
        ఇంతకీ ఎవరా బ్రిటన్ యువరాజు? అతనేం చేశాడు? తర్వాత ఏమయ్యాడు? ఏమా కథ? ఈ వివరాల్లోకి వెళ్దాం...

2010-2019 రెండే ఆధారాలు
2010 లో న్యూయార్క్ లో సిటీలో డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ ఆండ్రూ (రూఫస్ సెవెల్), జెఫ్రీ ఎప్‌స్టీన్ (కొలిన్ వెల్స్) అనే అతడితో కలిసి నడుచుకుంటూ పోతూంటే, ఒక ఫోటోగ్రాఫర్ వెంబడించి ఫోటోలు  తీస్తాడు. డ్యూక్ ఆఫ్ యార్క్ బ్రిటన్లో ప్రభువుల బిరుదు. దీన్ని పాలిస్తున్న చక్రవర్తి రెండవ కుమారుడికి ఇస్తారు. తొమ్మిదేళ్ళ తర్వాత, 2019 లో లండన్లో బిబిసి న్యూస్ నైట్ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్‌అలిస్టర్ (బిల్లీ పైపర్), పత్రికలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రిన్స్ ఆండ్రూ స్పాన్సర్ చేసిన యువ వ్యాపారవేత్తల ఈవెంట్‌లోని ఫోటోల పక్కన ఫోటోని చూస్తుంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ తో ప్రిన్స్ ఆండ్రూ కలిసి వెళ్ళడం. న్యూయార్క్ లో ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికర్. అతడిమీద మైనర్ బాలికలతో పాల్పడిన లైంగిక నేరాల ఆరోపణలున్నాయి. సెక్స్ ట్రాఫికింగ్ కోసం అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూంటాడు. ఎందరో అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. అతను పలుకుబడిగల ధనిక అమెరికన్ ఫైనాన్షియర్.
       
ప్రిన్స్
ఆండ్రూ, ఎప్‌స్టీన్ లు చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా వున్నారు. 2006లో లైంగిక నేరాలకి పాల్పడిన తర్వాత కూడా ఎప్‌స్టీన్ తో యువరాజు స్నేహాన్ని కొనసాగించినట్టు ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది సామ్ కి. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ ని కాంటాక్టు చేసి ఎప్‌స్టీన్ వివరాలు మరిన్ని రాబడుతుంది. ఎప్‌స్టీన్ ఇంటికి వస్తూ పోతున్న చాలా మంది మైనర్ బాలికల ఫోటోలు ఆమె చేతికొస్తాయి.

   
రియల్ సీన్ 
ఇక ప్రిన్స్ ఆండ్రూని ఈ విషయంపై ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయిస్తుంది సామ్.
న్యూస్‌నైట్ ప్రోగ్రాం ప్రెజెంటర్ ఎమిలీ మైట్లిస్ (గిలియన్ ఆండర్సన్) ఇంటర్వ్యూల్ని ఎరేంజ్ చేస్తూంటుంది. ఆమె యువరాజు పర్సనల్ సెక్రెటరీ అమండా థిర్స్క్(కీలీ హవేస్) ని కలిసి ఇంటర్వ్యూని పిచింగ్ చేస్తుంది. ప్రిన్స్ ఆండ్రూ తేలిగ్గా తీసి పారేస్తాడు. సామ్ పట్టుదల వదలదు. కానీ ఆమె టీం ఇక దీనిపై ఆసక్తి చూపదు. సామ్ నిరాశగా గడుపుతూంటే, న్యూయార్క్ లో ఎప్‌స్టీన్ అరెస్టవడం, జైల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోతాయి.
       
ఇదే
సమయంలో, వర్జీనియా గుఫ్రే అనే ఎప్‌స్టీన్ బాధితురాలు యువరాజు తనతో మూడుసార్లు గడిపాడని బయట పెడుతుంది. దీంతో యువరాజు ఆండ్రూ, సామ్ కి ఇంటర్వ్యూ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
       
ఆ ఇంటర్వ్యూలో అతనేం చెప్పాడు
? 2010 లో ఆ
రోజు ఎప్‌స్టీన్ ని ఎందుకు కలిశాడు? వర్జీనియా చేసిన ఆరోపణలకి ఏం సమాధానం చెప్పాడు? ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఇంటర్వ్యూ బాగా వచ్చింది కదూ అని ఎందుకు సంతృప్తి చెందాడు? అసలు తన మీద ఆరోపణల్ని ఖండించి ఇంటర్వూని నిరాకరించకుండా ఎందుకు మొత్తం తన చిట్టా విప్పాడు? ఈ ఇంటర్వ్యూ ప్రసారమయ్యాక అతడి పరిస్థితి ఏమిటి? అతడిపై బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఏం నిర్ణయం తీసుకుంది? ఇవన్నీ ఈ 103 నిమిషాల పాటు సాగే ఈ మూవీ చూస్తే తెలుస్తాయి.

జర్నలిజపు ఝలక్
2022 లో బిబిసి మాజీ ‘న్యూస్‌ నైట్’ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్అలిస్టర్ రాసిన స్కూప్స్ : బిహైండ్ ది సీన్స్ ఆఫ్ ది బిబిసీస్ మోస్ట్ షాకింగ్ ఇంటర్వ్యూ  అన్న పుస్తకం ఆధారంగా ఈ మూవీ నిర్మించారు. ప్రిన్స్ ఆండ్రూ పతనానికి కారణమయిన స్కూప్ కోసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌ సిబ్బందితో చర్చలు జరిపిన ముగ్గురు బిబిసి మహిళా జర్నలిస్టుల తెర వెనుక కథ ఇది.  మూవీ కోసం కథని బిబిసి న్యూస్‌నైట్ బృందం స్కూప్ ని ఎలా లాగింది, ఆండ్రూ అసలు  ఇంటర్వ్యూకి ఎందుకు అంగీకరించాడన్న రెండు అంశాల చుట్టూ కేంద్రీకరించా మని రచయితల్లో ఒకడైన పీటర్ మఫాట్ చెప్పాడు.
        
నిజ జీవితంలో ఇంటర్వ్యూ యువరాజు ఆండ్రూ పబ్లిక్ ఇమేజ్‌ని తుడిచిపెట్టేసింది.  ఇంటర్వ్యూలో 59 ఏళ్ళ ఆండ్రూతో అతడి ఇగోని ముక్కలు చేసే ఒక మాట అంటుంది సామ్- ఇది మీ బ్రాండ్ కి దెబ్బ కాదు, ఇది మాత్రమే మీ బ్రాండ్- అని! మనకేదో బ్రాండ్ వుందని మనసు లోపల అనుకుంటాం. బయటినుంచి చూసేవాళ్ళకి ట్రోలింగ్ మెటీరియల్ లా కనపడతాం. నా బ్రాండే నాకు రక్ష అని ఆండ్రూ చేయరాని పనులు చేశాడు. బహుశా ఈ కారణంగానే ఇవ్వరాని ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంతో ట్రోలింగ్ మెటీరీయల్ గా మారాడు.

     
మూవీ సీన్ 
2010 లో ఓ ఫోటో
, 2019 లో ఆ ఫోటో ఆధారంగా ఇంటర్వ్యూ ఈ రెండే అతడ్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు దారితీశాయి. అసలు రాజవంశంలో ఎంతో ప్రముఖుడైన అతను
అటువంటి ఇంటర్వ్యూకి ఆసలెందుకు అంగీకరించాడన్న ప్రశ్నకి ఈ మూవీ సమాధానమిస్తుంది. స్కూప్’ కథ రెండు పార్శ్వాల్ని అందిస్తుంది: బిబిసి మహిళా జర్నలిస్టులు ముగ్గురు ఒకవైపు, రాజ కుటుంబంలో ఆండ్రూ, అతడి కూతురు, సెక్రెటరీ మరోవైపు. అలాగని ఇదేమీ పెద్ద హై టెన్షన్ డ్రామాగా ఏమీ వుండదు. నాటకీయత వుండదు. అసలు రెండు పార్శ్వాల మధ్య సంఘర్షణే వుండదు. అన్ని సినిమా నియమాలకూ  విరుద్ధంగా డాక్యుమెంటరీలా కూడా వుండదు. రియలిస్టిక్ సినిమా అనడానికి కూడా లేదు. ఇదో వింత రూపం.
       
జర్నలిస్టుల వైపు నుంచి కథ సాగుతుంది. వాళ్ళలో టెన్షన్ ఏమీ వుండదు. పరుగులుండవు. బ్యాంకు ఉద్యోగులు తలవంచుకుని పని చేసుకుంటున్నట్టు డెస్కుల్లో కూర్చుని ప్రశాంతంగా పని చేసుకుంటూ వుంటారు. ఆండ్రూ మొదట ఇంటర్వ్యూకి ఒప్పుకోకపోతే భారీగా ఇంటర్వెల్ బ్యాంగేమీ పడదు. తెలుగు దర్శకుడు ఈ ఛాయాల్లో కనిపించడు. ఇంకెలా ఇంటర్వ్యూ సంపాదించాలన్న గోల్ కూడా వుండదు. విధివశాత్తూ జైల్లో
ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకుంటే, వర్జీనియా అనే బాధితురాలు ఆండ్రూ మీద ఆరోపణలు చేస్తే అలా కలిసి వస్తుంది.
       
ఇంటర్వ్యూ లో సామ్ ఆండ్రూని ప్రశ్నలతో అదరగొట్టదు.
మీరు మామిడిపండు ఎలా తీసుకుంటారు? చీకుతారా? లేక కోసుకు తింటారా? అని అభిమానంతో అడిగినట్టు, మీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది? ఏం డ్రింక్ తీసుకుంటారు? అని ప్రేమగా అడిగినట్టు, ప్రశ్నలు అడుగుతుంది.

కుతూహలమే బలం
గొప్ప తారాగణం లేకపోతే ఈ రకమైన మూవీ పని చేయదు. కల్పిత కథయితే ఎంత గొప్ప తారాగణ బలమున్నా పనిచేయదు. ఇది నిజ కథ. అందుకని ఏం జరిగి వుంటుందన్న సహజ ఆసక్తి, కుతూహలమే తారాగణానికి కలిసి వచ్చాయి. ప్రతి ఒక్కరికి బిబిసి గురించి తెలుసు. ప్రజల సొమ్ముతో నడిచే దానికో గౌరవముంది. అది ఇతర వార్తా సంస్థల్లాగా, సోషల్ మీడియాలాగా లాభార్జన దృష్టితో పోటీపడదు. సమగ్రతతో కూడిన బ్రాండ్‌ నేమ్ ని కాపాడుకునే ఔచిత్యం దానికవసరం- స్కూప్’ లోని పాత్రల్ని ఈ సూత్రమే నడిపిస్తుంది. అందుకే ఈ శతాబ్దంలో మీడియా స్వేచ్ఛ గురించి, విలువ గురించి, దాని ఆవశ్యకత గురించీ చాలా నిరాడంబరంగా, అంతర్లీనంగా మెసేజీనిచ్చే ఈ కథని రెగ్యులర్ జర్నలిజం థ్రిల్లర్ లా తీయలేదు దర్శకుడు ఫిలిప్ మార్టిన్.
        
ఇంటర్వ్యూ తర్వాత పరిణామాల్ని కొన్ని చిన్న చిన్న  సన్నివేశాలతో, టైటిల్ కార్డ్స్ తో, అలాగే సోషల్ మీడియా రియాక్షన్స్ తో కలిపి, ప్రిన్స్ ఆండ్రూ స్కాండల్ కి ముగింపు నిచ్చాడు. రాణి ఎలిజబెత్ తీసుకున్న నిర్ణయం కూడా ఇందులోనే వచ్చేస్తునది. ఆఖర్న వర్జినియా విషయంలో ఆండ్రూ లో వచ్చిన మార్పు కూడా. ఇది జర్నలిస్టులు తప్పక చూడదగ్గ మూవీ.
—సికిందర్