రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జనవరి 2022, బుధవారం

1123 : స్పెషల్ ఆర్టికల్

    జట్కా బండి వాడు ముస్లిం వ్యక్తిని జట్కా బండిలో తీసికెళ్ళి దింపి, నాల్గు రెట్లు డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తాడు. అడిగిన డబ్బు ఇవ్వక పోతే పాకిస్తాన్  వెళ్ళిపొమ్మంటాడు. అందుకా ముస్లిం వ్యక్తి  - ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకోవడానికే స్వాతంత్ర్యం వచ్చినట్టుంది అంటాడు. తర్వాత్తర్వాత పరిస్థితులు దుర్భరమై పాకిస్తాన్ వెళ్ళిపోవడానికే ప్రయాణం కడతాడు.

        క ముస్లిం యువకుడు దేశ విభజన జరిగినప్పుడు నువ్వు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళిపోలేదని తండ్రిని అడుగుతాడు. అందుకా తండ్రి - ఆగ్రా లో మనింటి బయట నువ్వు చెట్టుని చూడలేదా? నేనూ మీ అమ్మ ఆ చెట్టుని అమితంగా ప్రేమించాం అంటాడు.

        ఒకటి 1947 దేశ విభజన జరిగిన సందర్భం. ఇంకొకటి 1992 బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన సందర్భం. ఎం ఎస్ సత్యూ 1973 లో గరం హవా తీసినప్పుడు ముస్లిం చారిత్రికాలతో, నవాబీ సంస్కృతితో, ముస్లిం సోషల్స్ తో, సంగీత విందు వినోదాల కులాసా సినిమాలుగా వున్న ముస్లిం సినిమాల గతిని మార్చేశాడు. నిత్య జీవితంలో సామాన్య ముస్లిముల నిస్సహాయ జీవితాల్ని చిత్రించే వాస్తవిక - న్యూవేవ్ సినిమాల వైపు ముస్లిం సినిమాల్ని మలుపు తిప్పాడు. దీంతో శ్యామ్ బెనెగల్, సయీద్ అఖ్తర్ మీర్జా, ముజఫర్ అలీ వంటి దర్శకులు ముస్లిం న్యూవేవ్ సినిమాలతో తెరపై కొచ్చారు.

         తర్వాత 1995 లో సయీద్ అఖ్తర్ మీర్జా బాబ్రీ కూల్చివేత నేపథ్యంలో నసీమ్ తీసినప్పుడు, అప్పుడున్న ముస్లిం నిస్సహాయ జీవితాల వాస్తవిక సామాజికాల్ని, తిరుగుబాటు టెర్రరిజం సినిమాల దిశగా ప్రయాణం కట్టించాడు. అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, హన్సల్ మెహతా, అపూర్వ లఖియా వంటి దర్శకులు ఇలాటి టెర్రరిజం సినిమాలకి బీజం వేశారు.

       ఇలా ముస్లిం సినిమాలు ఆవిర్భవించిన ఈ 82 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కాలాల్నిబట్టి కథా వస్తువుల్ని మార్చుకుంటూ వచ్చాయి. ముస్లిం సినిమాలేమీ ఇతర భాషల సినిమాల్లాగా 1910, 1920 దశాబ్దాల మూకీల కాలంలో పుట్టుకు రాలేదు. టాకీల కాలంలో 1939 లోనే షోరాబ్ మోడీ దర్శకత్వంలో పుకార్ అంటూ తొలి ముస్లిం సినిమా పుట్టింది. ఇప్పుడు నరేంద్ర మోడీ కాలంలో బేకార్ అంటూ గిట్టింది. పుట్టినప్పుడు కాల్పనిక కథతో పుట్టలేదు. దేశంలో ఏ భాషా చలన చిత్రాలైనా మూకీల కాలంలో పౌరాణికాలతోనే ప్రాణం పోసుకున్నాయి. అప్పట్లో సినిమాల కోసం కథలు రాసేంత నేర్పు లేదు. అందుకని పురాణ కథల్ని, అవి కూడా చిత్రానువాదం చేసినట్టు దృశ్యాలు తీయడానికి అనుకూలంగా వుండే పౌరాణిక నాటకాల్ని వున్నదున్నట్టు తెర కెక్కించే వాళ్ళు. సినిమా పితామహులు దాదా సాహేబ్ ఫాల్కే అయినా, రఘుపతి వెంకయ్య నాయుడైనా మూకీల కాలంలో ఈ పద్ధతినే అనుసరించారు.

        మూకీల నుంచి టాకీలుగా మారేక కూడా సినిమాలకి పౌరాణిక నాటకాలే ఆధారమయ్యాయి, సినిమాల కోసం ప్రత్యేకంగా కథలు సృష్టించి  కాల్పనికాలు తీయడం మొదలు పెట్టింది 1930 తర్వాత నుంచే. ముస్లిం సినిమాలు తీయడానికి పౌరాణికాలు లేవు కాబట్టి - ప్రత్యేకంగా కాల్పనిక కథలు రాసే వాళ్ళూ ఇంకా లేరు కాబట్టి, 1939 లో నిర్మించిన తొలి ముస్లిం సినిమా పుకార్ ని షోరాబ్ మోడీ చారిత్రక కథతో తీశాడు. ఇది మొఘల్ చక్రవర్తి జహాంగీర్ కథ. ఇందులో షోరాబ్ మోడీతో బాటు చంద్రమోహన్, నసీమ్ బాను నటించారు.


     స్వాతంత్ర్య పూర్వం ఈ ప్రారంభం స్వాతంత్ర్య పోరాట కథల్నేమీ ముట్టుకోలేదు.  పుకార్ చారిత్రాత్మకం తర్వాత వెంటనే 1940 లో ఖైదీ విడుదలైంది. ఇది ప్రేమ కథల ముస్లిం కాల్పనిక సోషల్స్ కి ప్రారంభం. దీని దర్శకుడు ఎస్ ఎఫ్ హస్నైన్. మెహతాబ్, మాధురి నటీనటులు. 1943 లోనే మహెబూబ్ ఖాన్ ప్రేమ కథతో కూడిన ముస్లిం సోషల్ నజ్మా ని సామాజిక స్పృహతో తీసి- ఇంకో నాలుగు  దశాబ్దాల పాటు ఇటువంటి సినిమాలు రావడానికి బాట వేశారు. ఇందులో ప్రేమ కథ చుట్టూ ముస్లిముల సమాజంలో విద్య ప్రాధాన్యం గురించీ, వివాహ వ్యవస్థ పరిరక్షణ గురించీ అంశాల్ని జోడించి కథ చెప్పారు. అశోక్ కుమార్, వీణా హీరో హీరోయిన్లు. ఇది యూట్యూబ్ లో వుంది.

        ఇక చౌద్వీ కా చాంద్, మేరే మహెబూబ్, దిల్ హీతో హై, బేనజీర్, బహూ బేగమ్, మేరే హుజూర్, మహేబూబ్ కీ మెహందీ, నిఖా, నూరీ...ఇలా 1980 ల వరకూ పదుల సంఖ్యలో వీటికొక స్వర్ణ యుగం అయింది. గురుదత్, రాజ్ కపూర్, అశోక్ కుమార్, రాజేంద్ర కుమార్, జీతేంద్ర, రాజేష్ ఖన్నా, మీనా కుమారి, వహీదా రెహమాన్, నూతన్, సాధన, లీనా చందా వర్కర్, ప్రాణ్ మొదలైన ప్రసిద్ధ నటీ నటులెందరితోనో ఇవి మెయిన్ స్ట్రీమ్ మ్యూజికల్ కమర్షియల్ హిట్ క్లాసిక్ సినిమాలుగా వుండేవి. ప్రేక్షకుల్లో మత వివక్ష వుండేది కాదు. ఈ సినిమాలతో జాతీయ సమైక్యతలో భాగంగా వుండే వాళ్ళు. ఇప్పటి ప్రేక్షకుల్లా కాకుండా, అప్పటి ప్రేక్షకులకి ఈ సినిమాలతో ముస్లిములంటే ఏమిటో తెలిసేది. వర్గీకరిస్తే ఇవి ముస్లిం సినిమాలు గానీ, లేకపోతే హిందీ సినిమాలే.

వైభవం- వాస్తవికం
        ఇది కేవలం ముస్లిం సోషల్స్ యుగమని చెప్పలేం. ఒక్కో తరహా ముస్లిం సినిమాలకి ఒక్కో కాలమంటూ లేదు. ఈ యుగంలోనే చారిత్రికాలూ, నవాబీ సంస్కృతులూ, తవాయీఫ్ నృత్య గానాల సినిమాలూ అన్నీ కలిసి వచ్చాయి. మొఘలే ఆజమ్, తాజ్ మహల్, అనార్కలీ, జహనారా వంటి చారిత్రికాలు; చౌద్వీ కా చాంద్, షత్రంజ్ కే ఖిలాడీ, పాల్కీ వంటి నవాబుల సంస్కృతి సినిమాలు; పాకీజా, ఉమ్రావ్ జాన్, తవాయిఫ్ వంటి నవాబుల ఖోటాల్లో ఉర్దూ కవిత్వం, ఖవ్వాలీ, గజళ్ళూ, వేశ్య (తవాయిఫ్) ల గానా బజానాలతో కూడిన తవాయిఫ్ సినిమాలూ వచ్చాయి. వీటిలో మీనాకుమారీ, రేఖా వంటి ప్రసిద్ధ నటీమణులు ప్రధాన పాత్రలు పోషించారు.

        ఈ మొత్తం చారిత్రక, సోషల్, నవాబీ, తవాయిఫ్ సినిమాలు సామాన్య ముస్లిముల మనస్సుల్ని కమ్మేసి ఒకలాటి మత్తులో వుంచాయి. ఒక కార్యక్రమంలో జావేద్ అఖ్తర్ ఈ సినిమాల గురించి జోకేశారు - ఈ సినిమాలు చూసి పంక్చర్లు వేసేవాడు మా తాతలు చాలా గొప్పోళ్ళని ఫీలవుతూ హీరోలా తిరిగే వాడని. ఈ జోకుని పొడిగిస్తే ఇప్పుడు తాతలు పోయి రక్తపు మరకలతో తను మిగులుతున్నాడు. గాజులమ్మినా రక్తపు మరకలు.


            ఆ మత్తు లోంచి బయటికి వచ్చేట్టు ఎంఎస్ సత్యూ గరం హవా తీసి - మత్తు నిచ్చే స్వర్ణ యుగాన్ని సమాప్తం చేశాడు. ఇందులో ప్రసిద్ధ నటుడు బాలరాజ్ సహానీ, సలీం మీర్జా అనే బాధిత ముస్లిం వ్యక్తి పాత్ర పోషించాడు. ఇక సయీద్ మీర్జా దర్శకత్వంలో ఆర్ధిక ఇబ్బందులు పడే – సలీం లంగ్డే పే మత్ రో (కుంటి సలీం గురించి ఏడ్వమాక), ముజఫర్ అలీ దర్శకత్వంలో అంజుమన్ (సభ), సాగర్ సర్హదీ దర్శకత్వంలో వేశ్యా వాటిక కథతో బజార్’, శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో మండీ’, సర్దారీ బేగమ్’, మమ్మో... వంటివి వరసబెట్టి వస్తూ, ముస్లిం సినిమాలు వాస్తవిక- రియలిస్టిక్-న్యూవేవ్ -ఆర్ట్ సినిమాల రూపంలోకి మారిపోయాయి.

        నవాబీ వైభవాల తవాయిఫ్ సినిమాలకి ప్రతిగానూ ఒక మలుపు తిప్పే ముస్లిం వాస్తవిక సినిమా వచ్చింది... 1970 లో రాజీందర్ సింగ్ బేడీ దర్శకత్వంలో - సమకాలీన కథతో దస్తక్. ఇందులో సంజీవ్ కుమార్, రెహానా సుల్తాన్ నటించారు. యూ సర్టిఫికేట్ తవాయిఫ్ సినిమాలకి భిన్నంగా ఇది ఏ సర్టిఫికేట్ పెద్దలకి మాత్రమే సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది. ఇందులో సల్మా అనే కాల్ గర్ల్ పాత్రలో రెహానా నటిస్తే, ప్రేమికుడు హమీద్ పాత్రలో సంజీవ్ కుమార్ నటించాడు. వేశ్య కథతో ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో రెహానా నటనకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు లభించింది. పూనా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని అయిన తను తర్వాత ఇలాటి పాత్రలకే ముద్రపడి పోయింది. 

        ఇలా ముస్లిం వాస్తవిక సినిమాల ఒరవడిలో నసీరుద్దీన్ షా, ఫరూఖ్ షేక్, మకరంద్ దేశ్ పాండే, షబానా అజ్మీ, స్మితా పాటిల్, సుప్రియా పాఠక్, రోహిణీ హట్టంగడి లాంటి సమాంతర సినిమా కళాకారులూ పరిచయమవడం మొదలెట్టారు.  

ఇక విభజన రేఖ    
        ఐతే పైవాటితో సమాంతరంగా ఇంకోటి జరుగుతూ వచ్చింది. హిందీ కమర్షియల్ సినిమాల్లో హీరో కోసం ప్రాణాలిచ్చే విశ్వాసపాత్రుడైన స్నేహితుడుగా ముస్లిం పాత్ర వుండేది. ఉదాహరణకి జంజీర్ లో అమితాబ్ బచ్చన్ కి షేర్ ఖాన్ ప్రాణ్ లాగా, దీని రీమేక్ నిప్పులాంటి మనిషి లో ఎన్టీఆర్ కి షేర్ ఖాన్ సత్యనారాయణ లాగా. పోను పోనూ ఈ పాజిటివ్ పాత్రల స్థానంలో నేరస్థులుగా, విలన్లుగా ముస్లిం పాత్రల్ని చూపించడం మొదలెట్టారు. బహుశా ఇది స్మగ్లర్ హాజీ మస్తాన్ వల్ల కావొచ్చు. ఇక్కడ్నుంచీ మొదలయ్యింది హిందూముస్లిమ్ భాయ్ భాయ్ కాస్తా హిందూ ముస్లిం నైనై గా విభజన రేఖ గీయడం. ఇది కాస్తా మాఫియా దావూద్ ఇబ్రహీం టైపు పాత్రలతో పరాకాష్ఠకి చేరింది. ఒకవైపు సమాంతర వాస్తవిక సినిమాల్లో నిస్సహాయ బాధిత ముస్లిం పాత్రలుంటే, అశేష ప్రజానీకం చూసే ప్రధాన స్రవంతి కమర్షియల్ సినిమాల్లో విభజిస్తూ రౌడీ ముస్లిం పాత్రలు. ఇక బాబ్రీ మసీదు కూల్చివేతతో వాస్తవిక సినిమాల్లోని నిస్సహాయ బాధిత ముస్లిం పాత్రలు మత హింస నెదుర్కొనే తిరుగుబాటు టెర్రరిస్టు పాత్రలుగా మారిపోయాయి...


        1973 లో ఎంఎస్ సత్యూ దేశ విభజన నేపథ్య కథగా ముస్లిం అస్తిత్వ గరం హవా తీసి ముస్లిం సినిమాల్ని ఒక మలుపు తిప్పితే, 1995 లో సయీద్ అఖ్తర్ మీర్జా బాబ్రీ మసీదు కూల్చివేత హింసతో ఇంకో మలుపు తిప్పాడు. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన మత మారణ కాండతో నసీమ్ తీశాడు. టీవీలో హిందువులు ముస్లిములు చంపుకోవడాల్ని చూసి బెదిరిపోతున్న మనవరాలిని - స్వాతంత్ర్య పూర్వం ఆగ్రాలో తను చూసిన చల్లని హిందూ ముస్లిం సహజీవనం గురించి చెబుతూ ఊరడించే తాత కథ. 

        ఇక్కడ్నుంచి తిరుగుబాటు టెర్రరిస్టు సినిమాలు మొదలయ్యాయి. 2000 లో ఖాలిద్ మహ్మద్ తీసిన ఫిజా’, 2004 లో అనురాగ్ కశ్యప్ తీసిన బ్లాక్ ఫ్రైడే’, 2008 లో రాజ్ కుమార్ గుప్తా తీసిన అమీర్’, 2012 లో హన్సల్ మెహతా తీసిన షాహిద్’, 2014 లో విశాల్ భరద్వాజ్ తీసిన హైదర్ ఈ కోవలో కొన్ని. 2002 గుజరాత్ ఊచకోతతో నందితా దాస్ తీసిన ఫిరాఖ్’, అపర్ణా సేన్ తీసిన మిస్ట ర్ అండ్ మిసెస్ అయ్యర్ కూడా ప్రసిద్ధి చెందాయి. టెర్రరిజంతో ముస్లిం వాస్తవిక సినిమాలు ఆలోచనాత్మకంగా వుంటే, కమర్షియల్ సినిమాలు ముస్లిములని నెగెటివ్ గా చూపించడం మొదలెట్టాయి. ముస్లిం మాఫియా విలన్ కాస్తా టెర్రరిస్టుగా మారిపోయాడు. బాలీవుడ్ లో ఒక వర్గం గత ఆరేడేళ్ళుగా తీస్తున్న హిందీ సినిమాలైతే బాహాటంగా దేశభక్తి ముసుగులో మతభక్తితో విభజన రేఖ కాదు, గట్టి అడ్డుగోడ కట్టేస్తున్నాయి.

           తాజాగా విడుదలైన సూర్యవంశీ అనే టెర్రరిజం సినిమాలో పొడుగు గడ్డం, చిన్న గడ్డం, గడ్డం లేని వాళ్ళుగా ముస్లిములని వర్గీకరిస్తూ వీళ్ళు ఏఏ మనస్తత్వాలతో వుంటారో వర్ణించారు! గుడ్ ముస్లిం-బ్యాడ్ ముస్లిం అంటూ తేడాలు చెప్పారు. పచ్చి టెర్రరిస్టులుగా చూపించారు. గుడ్ హిందూ- బ్యాడ్ హిందూ ఎలా వుంటారో కూడా చెప్పకుండా. పాక్ ని టార్గెట్ చేసే కథా వస్తువులో ఇండియన్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేసేశారు.

        ఇంకో సత్యమేవ జయతే అనే అతి దేశభక్తి సినిమాలో మతభక్తి లేకుండా సామాజిక భక్తితో వీరంగం వేశారు రాజకీయ నాయకుల మీద.  ప్రభుత్వాఫీసు ముందు ఖురానుజానీమాజ్ పట్టుకుని నిలబడ్డ ముస్లిం స్త్రీని ప్రశ్నించిన అధికారికి జాన్ అబ్రహాం రాజ్యాంగం గురించి క్లాసు పీకి నోర్మూయిస్తాడు. ముస్లిములని వెనకేసు కొస్తూ ఇంకో చోట-  సిగ్నల్ దగ్గర పోలీసుకి వంద రూపాయల మీద ఆశ. నీ పేరు ఖాన్ అయితే నీ ఖాందాన్ (వంశం) మొత్తం టెర్రరిస్టులే. రైతు వాడింట్లో వాడే ఫ్యానుకి వేలాడే నా దేశం మహాన్ హై! అని గర్జిస్తాడు.     

ఆశావహ కాలం
        టెర్రరిజం సినిమాల మధ్య బాలీవుడ్ లో, అటు కేరళలో మళ్ళీ ముస్లిం సోషల్స్ వచ్చాయి. బాలీవుడ్ నుంచి 2020 లో బాబా అజ్మీ దర్శకత్వంలో  ‘మీ రఖ్సమ్’ (I Dance) ఒకటి. నాట్యానికి మతం లేదనిమత మౌఢ్యమే సంకెళ్ళనీ ముస్లిములలో మౌఢ్యం గురించి చెప్పాడు.  ‘నీకు (ముస్లిం) సమాజం ఉపాధి నిచ్చిందినువ్వు (ముస్లిం) సమాజానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే (ముస్లిం) సమాజం నీ ఉపాధిని తీసేసుకుంటుంది’ అని ఈ సినిమాలో మత పెద్ద టైలర్ ని హెచ్చరిస్తాడు. స్వార్ధపు మాటలిలాగే వుంటాయి. సమాజం కలిసి వుండడానికి మతమా  ఆధారంవిత్తమావిత్తమే సమాజపుదేశపు మూలాధారంభాండాగారం. పెత్తందార్లు కులమతాలుగా సమాజాన్ని విడగొట్టిఆర్ధిక రంగం నడ్డి విరిచేస్తారు. మత పిచ్చితో ధనలక్ష్మితో రుద్ర తాండవమాడతారు. ఇదే చెప్పదల్చాడు దర్శకుడు.

        ఉపాధినిచ్చే సమాజం ఆత్మహత్యా సదృశంగా ఉపాధిని తీసేసుకోదుతీసేసుకునేలా మత మౌఢ్యం చేస్తుంది. కానీ కడుపాకలి తెలిసిన సమాజం విత్తం కోసం మౌఢ్యం నుంచి భావ స్వాతంత్రాన్ని కోరుకుంటుంది. ఇది పవర్ఫుల్ ఆయుధం. మౌఢ్యం ఉపాధిని తీసేస్తేభావ స్వాతంత్ర్యం ఉపాధిని కల్పిస్తుంది. ఒక ముస్లిం బాలిక భరత నాట్యం నేర్చుకోవాలనుకోవడం ఆమె భావస్వాతంత్ర్యం. మతంతో సంబంధం లేదు. కళలనేవి సాంస్కృతిక వ్యక్తీకరణలు. చివరికి ఆ ముస్లిం బాలిక భరత నాట్యం చేస్తూంటే అవతలి మతం లోంచి కూడా అడ్డుకునే ప్రయత్నం. దీంతో దమ్ అలీ అలీ దమ్ - ఝనక్ ఝనక్ నాచే నటరాజ్ రే’  అనే సూఫీ భక్తి ఫ్యూజన్ పాట సెల్ ఫోన్లో మోగించి నాట్యం చేసేస్తుంది. అంటే మతాల చేతిలోంచి నాట్యం వెళ్ళిపోయి టీనేజర్ల చేతిలో వాళ్ళ దృక్పథంతో ఇలా వైరల్ అయ్యే కాలం వచ్చిందన్న మాట.

            కేరళ నుంచి రెండు మలయాళ ముస్లిం సినిమాలు వచ్చాయి 2020 లో. షానవాజ్ దర్శకత్వంలో  ‘సూఫీయుమ్ సుజాతాయుమ్, జకారియా మహ్మద్ దర్శకత్వంలో హలాల్ లవ్ స్టోరీ. మొదటి దాన్లో మతం ఎక్కువైపోయి సామాజికం తగ్గింది. రెండో దాన్లో సామాజిక దృష్టి వుంది. ఇందులో కేరళలోని మలబార్ ప్రాంతపు సాంప్రదాయ ముస్లిం సమాజం వచ్చేసి సామాజికంగా చొరవ చూపాలకునే కథఅల్లా చుట్టూ తిరిగే సాంప్రదాయ ముస్లింసామాజికంగా బతకడానికి మెయిన్ స్ట్రీమ్ లోకొచ్చిన ఉదారవాద ముస్లిం మధ్య విలువల సున్నితసంయమనంతో కూడినఎడ్యుకేటెడ్ సంఘర్షణ. ఇది కథలో కథ కూడా. అంటే సినిమాలో సినిమా. సాంప్రదాయానికి మత సంస్థనిఅభ్యుదయానికి సినిమా నిర్మాణాన్నీ ముఖాముఖీ చేసిఅభ్యుదయ అభ్యంతరాలకి సాంప్రదాయ ఊరడింపులతోసాంప్రదాయ అభ్యంతరాలకి అభ్యుదయ చిట్కాలతో కార్యం పూర్తి చేసుకునే ప్రణాళిక. ఇందులో దర్శకుడు ఎటువైపు వున్నాడంటేఏ వాదమూ తీసుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో వుంటాడు.

        సూఫీయుమ్ సుజాతాయుమ్లో బ్రాహ్మణ యువతీకీ, ముస్లిం సూఫీ సన్యాసికీ మధ్య నిషిద్ధ -విషాద ప్రేమ కథ. ఇందులో ప్రేమ కంటే మతం ఎక్కువైపోయి భక్తి సినిమాలా వుంటుంది. ఇందులో సంగీత స్వరాలూ ఆలాపనలూ సూఫీ సాంప్రదాయంలో వుండవు. సూఫీ సంగీతమంటే ప్రధానంగా ఖవ్వాలీలు. అయితే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో ఖురాన్ ఉల్లేఖనాల ఆలాపనలు, వాటికి తగిన స్వరాలే తప్ప, ఖవ్వాలీల జాడే వుండదు. చిట్ట చివర్లో ఒక్క ఖవ్వాలీ వస్తుంది. అది కూడా బిట్ సాంగ్.

        ఇక సినిమా సాంతం ప్రేమ కాకుండా ఏకధాటిగా మతమే కన్పించడంతో, మత శ్లోకాలే విన్పించడంతో, ఆ ఆచార వ్యవహారాలే చూపించడంతో, ప్రేమ సినిమా కాక భక్తి సినిమాలా తయారయ్యింది. 2017 లో ఇదే షానవాజ్ తీసిన ‘కిస్మత్’ లవ్ జిహాద్ మీద బలమైన వాస్తవిక కథగా వచ్చిందని రివ్యూలు వచ్చాయి. ఇది ముస్లిం అబ్బాయి - దళిత అమ్మాయి ప్రేమ కథ. 

        2020 లోనే కన్నడలో ఫ్రెంచి బిర్యానీ అనే యాక్షన్ కామెడీ వచ్చింది. దర్శకుడు పన్నాగాభరణ బెంగళూరు స్టాండప్ కమెడియన్లు డానిష్ సేట్, సాల్ యూసుఫ్ లతో తీశాడు. ఇందులో ఆటో డ్రైవర్ అస్ఘర్ అలీగా డానిష్ సేట్ కన్నడ యాసలో ఉర్దూయే మాట్లాడతాడు. అతడింట్లో సీన్లు ఉర్దూలోనే వుంటాయి. ఇలాటి ఉర్దూ సినిమాలు హైదారాబాద్ లో కూడా తీశారు. వీటిని డెక్కనీ కామెడీ లంటారు. ది అంగ్రేజ్, హైదారాబాద్ నవాబ్స్, హంగామా ఇన్ దుబాయ్ లాంటివి. ఇవి హైదరాబాదీ ఉర్దూలో హిట్టయిన కామెడీలు.

        ఎటొచ్చీ ఆ రెండు సినిమాలే చేదు నిజం చెబుతూ కళ్ళు తెరిపిస్తాయి- దేశ విభజన జరిగిన తాజా పరిణామాలతో ఎంఎస్ సత్యూ తీసిన  గరం హవా’ లో - ఓ జట్కా బండి వాడు ముస్లిం వ్యక్తిని జట్కా బండిలో తీసికెళ్ళి దింపినాల్గు రెట్లు డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తాడు. అడిగిన డబ్బు ఇవ్వక పోతే పాకిస్తాన్ వెళ్ళిపొమ్మంటాడు. అందుకా ముస్లిం వ్యక్తి సలీం మీర్జా- ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకోవడానికే స్వాతంత్ర్యం వచ్చినట్టుంది అంటాడు. తర్వాత్తర్వాత పరిస్థితులు దుర్భరమై పాకిస్తాన్ వెళ్ళిపోవడానికే ప్రయాణం కడతాడు.        

    ప్రయాణం కడుతూంటే నిరుద్యోగానికీ
అణిచి వేతకీ వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ గుంపు ఎదురవుతుంది. సలీం మీర్జాని ఓ వ్యక్తి ఆపిదేశం విడిచి వెళ్ళిపోకూడదనీదేశం బాగు కోసం దేశం లోనే వుండి అందరం పోరాడాలనీ అనడంతోఆగిపోయి ఆందోళనలో చేరిపోతాడు. ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి రాసిన కథకి కైఫీ అజ్మీషమా జైదీ చిత్రానువాదం చేశారు. దీనికి సెన్సార్ బోర్డు అనుమతి నివ్వలేదు. ప్రధాని ఇందిరాగాంధీ జోక్యంతో విడుదలైంది. దీనికి జాతీయ అవార్డు లభించింది.        

        సయీద్ అఖ్తర్ మీర్జా బాబ్రీ మసీదు కూల్చివేత  హింసతో  తీసిన ‘నసీమ్’ లో- దేశ విభజన జరిగినప్పుడు నువ్వు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళిపోలేదని తండ్రిని కొడుకు అడుగుతాడు. అందుకా తండ్రి పాత్రలో సుప్రసిద్ధ కవి కైఫీ అజ్మీ తుది శ్వాస విడుస్తూ - ‘ఆగ్రా లో మనింటి బయట నువ్వు చెట్టుని చూడలేదానేనూ మీ అమ్మ ఆ చెట్టుని అమితంగా ప్రేమించాం’ అంటాడు. చెట్టుని కూకటి వేళ్ళతో పెకిలించి వేయడంలోని బాధని ఆ మాటల్లో వ్యక్తం చేస్తాడు. సయీద్ అఖ్తర్ మీర్జాఅశోక్ మిశ్రా కలిసి ఈ కథ రాశారు. దీంతో సయీద్ అఖ్తర్ మీర్జాకి ఉత్తమ దర్శకుడుగా జాతీయ అవార్డు లభించింది. ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఇంకో జాతీయ అవార్డు లభించింది. మాట్లాడితే పాకిస్తాన్ వెళ్ళిపొమ్మనే శక్తులకి ఈ రెండు సినిమాలు సమాధానం.

        ఈ శక్తుల కళ్ళు తెరిపించే ఇంకో సినిమా కూడా వుంది - 1961 లో ప్రసిద్ధ దర్శకుడు యశ్ చోప్రా తీసిన ‘ధరమ్ పుత్ర’ అనే ముస్లిం సినిమా. ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి రాసిన నవలకి అఖ్తరుల్ ఇమాన్ చిత్రాను వాదం. శశి కపూర్మాలా సిన్హా నటించారు. ఇందులో 1947 లో హిందూ జాతీయవాది (శశి కపూర్) ముస్లిముల పట్ల విద్వేషంతో రగిలి పోతూ వుంటాడు. ముస్లిములని దేశం నుంచి వెళ్ళ గొట్టాలని దళంలో చేరతాడు. గృహ దహనాలు చేసి ముస్లిములని చంపుతాడు. చివరికి తను ముస్లిముగా పుట్టానని తెలుసుకుని షాకు తింటాడు. ‘మత మేమైనా మనిషి కన్నాగొప్పదా?’ అంటుంది ముస్లింకి పుట్టిన అతడ్ని దత్తత తీసుకున్న హిందువు తల్లి.   

 —సికిందర్
చమన్ పత్రిక (జనవరి)