రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, డిసెంబర్ 2014, సోమవారం

కెమెరా!

అదొక యజ్ఞమే!
ఛాయాగ్రాహకుడు సి. రాం ప్రసాద్
రోసారి కెమెరామాన్ అదృశ్య దృశ్యాల దార్శనికు డవుతున్నాడు. పౌరాణిక, జానపద సినిమాల్ని ఇప్పటి  ప్రేక్షకులు మిస్సవ్వచ్చు గాక, ఆ కాలంలో అవి ప్రవేశపెట్టిన ‘ట్రిక్ ఫోటోగ్రఫీ’ అనే మాయాజాలం నుంచి మాత్రం ఇప్పటి కెమెరామాన్ తప్పించుకోలేక పోతున్నాడు. ఏదైతే మనలో అంతర్భాగంగా ఉంటుందో, అది వెన్నాడుతూంటుంది. దృశ్య రూపాలు మారినంత మాత్రాన శాస్త్రం అంతరించిపోయిందని కాదు. శాస్త్రం శాశ్వతం. దానాధారం జేసుకుని ఒకప్పుడు ట్రిక్ ఫోటోగ్రఫీ వుండొచ్చు, ఇంకోప్పుడు రూపం మార్చుకుని సీజీ గ్రాఫిక్స్ ఉండొచ్చు!
    రాత్రి వేళ రైలు ప్రయాణిస్తూ వుంటుంది. పైన చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ చంద్రుడికి మబ్బులు అడ్దొస్తూ వుంటాయి. వాటి నీడ కింద పడుతూంటుంది. రైలు కదులుతూంటే, ఆ నీడ తన వాలు చూసుకుంటూ, మబ్బు తొలగ్గానే తనూ తప్పుకుంటూ ఉంటుంది..ఈ వెన్నెల దోబూచులాటలో నాయకా నాయికలు రైలు చివర ‘ఎల్’ షేపు ట్రాలీ మీద యుగళ గీత మొకటి పాడుకుంటూ మైమరచి పోతూంటారు. ఇదంతా చూస్తూ మనమూ మనసు పారేసుకోకుండా ఉండం.
   నిజంగా జరిగిందేమిటంటే, అక్కడ అంత పొడవు రాయలసీమ వెళ్ళే రైలే లేదు. చుట్టూ ఎలాటి పరిసరాలూ లేవు. పైన చంద్రుడూ వెన్నెలా మబ్బులసలే లేవు. ఓ ట్రాలీ, దానిమీద హీరో హీరోయిన్లు, మబ్బు తాలూకు ఓ నీడా - ఇవే మాత్రమే వున్నాయి!
    ఇవి- ఈ మూడూ మాత్రమే నిజం, మిగతావన్నీ అబద్ధం! ఈ అబద్దాల్ని గ్రాఫిక్స్ ఆర్టిస్టు నిజాలుగా భ్రమింపజేసి దృశ్యాన్ని రక్తి కట్టించాడన్న మాట!
   ఓస్ ఇంతేనా, ఆ మూడూ తప్ప మిగతాదంతా గ్రాఫిక్సేనా! మరైతే కెమెరామాన్ చేసిందేమిటి, ఇక అతడికి సినిమాలతో పనేమిటి- అన్న సందేశాలూ రావచ్చు. అతణ్ణి ఆత్మరక్షణ లోనూ పడెయ్య వచ్చు. అయితే దీనికి తిరుగులేని సమాధానముంది సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ సి. రాం ప్రసాద్ దగ్గర. అనేక సూపర్ హిట్ చిత్రాల అగ్రస్థాయి ఛాయాగ్రాహకుడైన ఈయన, పైన వివరించిన సందర్భంలో, రామోజీ ఫిలిం సిటీలో సెట్లో ఓ యజ్ఞమే చేసి కృత్రిమ నీడని అంత సహజంగా సృష్టించారు.  తన లైటింగ్ పరిజ్ఞానంతో అలాటి కృత్రిమ నీడని సృష్టిస్తూ, ట్రాలీ మీద హీరో హీరో హీరోయిన్లైన సునీల్- సలోనీల నృత్య విన్యాసాలని కెమెరాలో పొదివి పట్టుకుంటూ, అక్కడలేని విశేషాల్ని క్యాలిక్యుటివ్ గా ఊహిస్తూ, ఉన్న నిజాలతో వాటిని సమన్వయం చేసుకుంటూ, ఎనిమిది రోజుల పాటూ శ్రమిస్తే గానీ, ‘మర్యాదరామన్న’ లో ఆ డ్యూయెట్ కి ఆతర్వాత జోడించాల్సిన అంతటి గ్రాఫిక్స్ ఇన్పుట్ రాలేదు!
    “గ్రాఫిక్స్ అనేది ఒక సపోర్టింగ్ ఆర్టు” –అన్నారాయన, “అయితే దృశ్యంలో గ్రాఫిక్స్ హైలైట్ కానప్పుడే ఆ దృశ్యానికి రాణింపు వస్తుంది. ఈ సినిమా చివర్లో  వంతెన సీను గ్రాఫిక్స్ సృష్టి అంటే నేనే నమ్మలేకపోయా. అదీ నిజమైన గ్రాఫిక్స్ అంటే. ప్రేక్షకులు తాము చూస్తున్నది నకిలీ అని ఇట్టే కనుక్కో గలుగుతున్నారు. అయినా వాళ్ళ ఎంజాయ్ మెంటుకి అదేమీ అడ్డు రావడం లేదు., బాగా ఎంజాయ్ చేస్తున్నారు..” అని వివరించారు.
    ఇప్పుడిప్పుడే రవితేజ నటిస్తున్న ‘మిరపకాయ్’ షూటింగు జర్మనీలో ముగించుకొచ్చిన రాం ప్రసాద్,  ఈ హాస్యకథా  చిత్రానికి దానికుండే  ఫీల్ తోనే చిత్రీకరణ జరిపామన్నారు. ప్రత్యేకంగా ఎలాటి హై-ఎండ్ టెక్నాలజీనీ వాడలేదన్నారు. తెలుగు సినిమాలు స్టైలిష్ గా ఎందుకు ఉండడడం లేదని అడిగితే-  బాలీవుడ్ సినిమాల టార్గెట్ ప్రేక్షకులు వేరన్నారు. మన సినిమాలకి పారితోషికాలకి పోను మేకింగ్ కి మిగిలేది బొటాబొటీ అనీ, కాబట్టి ‘విత్తం కొద్దీ వైభవ’ మనీ కొటేషన్ చెప్పారు.
   మరి ఎవరైనా దర్శకులు హాలీవుడ్ షాట్స్ ని చూపించి, వాటిని కాపీ కొట్టమంటే కొట్టారా లేదా ఫ్రాంక్ గా చెప్పమంటే – కాపీకోసం కాదుగానీ, ఫీల్ కోసం రిఫరెన్స్ కోసం వాటిని చూపిస్తారనీ, తమ భావాల్ని తెలియజేసేందుకు టూల్స్ గా వాటి నుపయోగిస్తారనీ చెప్పుకొచ్చారు. 
    ‘అతనొక్కడే’ కి  నంది అవార్డు నందుకున్న రాం ప్రసాద్  1984 నుంచే రంగంలో వున్నారు. అప్పట్లో మద్రాసులో డిఎఫ్ టి చేస్తూ,  ప్రసిద్ధ కెమెరామాన్ వీఎస్సార్ స్వామికి సహాయకుడిగా చేరారు. 1993 లో పద్మాలయా వారి ఒక సినిమాకి ఛాయాగ్రాహకులయ్యారు. అప్పటినుంచీ ఇప్పటి దాకా 60 సినిమాలు పూర్తి చేశారు. 90శాతం దర్శకుల తొలి సినిమాలకి తనే  ఛాయాగ్రాహకుడు.
    లైటింగ్ కి అతివృష్టి అశోక్ మెహతా అయితే, అనావృష్టి సంతోష్ శివన్.  ఈ ఇద్దరూ రాం ప్రసాద్ అభిమాన సినిమాటోగ్రాఫర్లే. ఇంకా నాటి మార్కస్ బార్ట్లే, రెహ్మాన్, వీకే మూర్తీ లాంటి ప్రసిద్ధ ఛాయాగ్రహకులు నేడు లేకపోవడం బాధాకరమని అంటూ,  భగవంతుడు ఇప్పుడు తమలాంటి కెమెరా మెన్లకి ఇంత టెక్నాలజీతో ఎక్విప్ మెంట్ నిస్తున్నందుకు సంతోషంగా వుండన్నారాయన. 
    సరే, మరి మీ హాబీ లేమిటి? – అని ప్రశ్న వేయడమే తడవుగా లోపలి నుంచీ ఒక హెలికాప్టర్ ని ఎత్తుకొచ్చారు. దాన్ని ఎగరేయడం తన హాబీయని చెప్పారు గర్వంగా. ప్యూర్ మెటల్ తో తళ తళా మెరిసిపోతూ, గూఢచార గ్యాడ్జెట్ లా వుందది. ఖరీదు మూడు లక్షల రూపాయలట. మూడేళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్నారట. ఏం ప్రాక్టీసు? ఎప్పటికైనా దీనికి మినియేచర్ కెమెరా అమర్చి ఏరియల్ షాట్స్ తీయాలని! ఏం ఐ -2, హారీ పోటర్ -7 లాంటి హాలీవుడ్ సినిమాల్లో ఇలాటి షాట్సే తీశారని వివరించారు.
   ఇంకా డీటెయిల్స్? ప్రస్తుతానికింతే! ఇంకో ఇంటర్వ్యూ వరకూ సస్పెన్స్- అంటూ దాన్ని పాపాయిలా ఆప్యాయంగా ఎత్తుకుని వెళ్ళిపోయారు. అన్నట్టు హీరో కృష్ణ మేకప్ మాన్ మాధవరావు పెద్ద కుమారుడే రాం ప్రసాద్.
సికిందర్
(నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

కళ!

పాత్రలకి కూడా జీవంపోసే వాతావరణ సృష్టి!
కళా దర్శకుడు ఎస్. రవిందర్ రెడ్డి 
మొత్తానికి తెలుగు సినిమా కళా దర్శకత్వానికి మహర్దశ పట్టింది. ఒక బిగ్ స్టార్ తో సినిమా అనుకోగానే తక్షణం కళా దర్శకత్వానికి పెద్ద పీట వేసేసి భారీ బడ్జెట్ల తో  మెగా సెట్స్ నిర్మించడం  పరిపాటైంది. ఏమంటే మన సినిమాలెవరికీ తీసిపోవని ఇతరులకి చూపించడమే  దీని ముఖ్యోద్దేశమని కొందరంటున్నారు. ఇది కరెక్టేనా? తెలుగు సినిమాల్ని తెలుగేతరులే చూడనప్పుడు ఇలా మీసాలు మెలెయ్యడం సబబేనా? కనీసం ఇంకో భాషలో అనువాదాలకైనా నోచుకకోని మన సినిమాల్ని చూసి ‘శభాష్ టెల్గూమాన్’ అని ఎవరనాలి?

‘మగధీర’ ఫేమ్ కళాదర్శకుడు ఎస్.రవిందర్( రవీందర్ కాదు) రెడ్డి అభిప్రాయంలో కళా దర్శకత్వానికి ఇప్పుడింత మంచి రోజులు రావడానికి స్టార్ల మధ్య పోటీయే కారణం. వాళ్లకి ఇతర భాషల మీద కూడా ఆసక్తి వుండదు. అంటే ఆ మెగా సెట్స్ ని స్థానికంగానే ప్రదర్శించుకుని సంతృ ప్తిపడుతున్నారని అనుకోవాలి. ఏమైనా ఈ పరిణామాలతో కళా దర్శకులు, వాళ్ళ టీములు, కార్మికులూ అంతా హ్యాపీ. హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి, మెగా సెట్స్ లేస్తున్నాయి జోరుగా.. ఇదే రాజధాని అభివృద్ధి: ఏకంగా ఒక వర్చువల్ ప్రపంచాన్నే సృష్టించుకోవడం!

 ‘సరయూ ది డిజైన్’  స్టూడియో అధినేత రవిందర్  ‘ఐతే’ తో మొదలై,  ‘మగధీర’ చెయ్యి పట్టుకుని ‘గోల్కొండ హైస్కూల్’ కొచ్చారు. మధ్యలో మరో 14 ప్రసిద్ధ సినిమాలున్నాయి. ముడి ఫిలిం కి డిజిటల్ ప్రత్యాన్మాయం వచ్చేసి నిర్మాణ వ్యయం తగ్గిపోతున్నట్టే, సెట్స్ పరంగా కూడా అలాటి ఖర్చు తగ్గించే ఆవిష్కరణ లేమైనా  జరుగుతున్నాయా అని అంటే, లేదన్నారు. సెట్స్ కయ్యే వ్యయం దర్శకుడు, నిర్మాతల నిర్ణయాలపై ఆధారపడుతుందన్నారు.  కొంత భాగం సెట్ వేసి, మిగతా భాగాన్ని  గ్రాఫిక్స్ తో సృష్టించుకునే విధానంలో కూడా ఖర్చేం తగ్గదనీ, పైగా ఆ రెండిటికి నిర్దుష్టమైన మ్యాచింగ్ కూడా కష్టమనీ చెప్పారు రవిందర్. ‘మగధీర’ లో కొంతవరకూ ఇలాటి మ్యాచింగ్ ని సాధించామన్నారు. 

    డీఐ విషయానికొస్తే, దీనిపట్ల అవగాహన వున్న కెమెరామాన్ కి సెట్ కి వేసిన ఒక రంగు, డీఐ తర్వాత ఫలానా ఈ విధంగా కన్పిస్తుందని ముందు జాగ్రత్తలు చెప్పడం వల్ల, డీఐ తో కళా దర్శకుడి కళ వన్నె తగ్గే ప్రసక్తి లేదన్నారు. సెట్స్ మీద లైటింగ్ ని తను దగ్గరుండి చూసుకుంటా నన్నారు. అలాగే సౌండ్ గురించి కూడా పట్టించుకుంటా నన్నారు. అదెలా అనడిగితే-

    “హీరోయిన్ పరిగెడుతున్నప్పుడు కాలికి డబ్బా తగిలి పడిపోవచ్చు, చేతికి గ్లాసు తగిలి పగలొచ్చు, బయట పావురాల గుంపు ఒక్క పెట్టున ఎగిరిపోవచ్చు...సీన్ ని నేనిలా ఊహించి,  ఆ డబ్బా, ఆ గ్లాసు, ఆ పావురాల గుంపు నీ ఏర్పాటు చేశాననుకోండి, సంగీత దర్శకుడికి ఆయా శబ్దాలు వేసి జీవం పోసే అవకాశం వుంటుంది. దృశ్యం బాగా రక్తి కడుతుంది..” అని వివరించు కొచ్చారు. 

          వేరీవెల్, పోతే పోరాట దృశ్యాలకి ఆయుధాలు మీ కళా దర్శకులే తయారు చేస్తున్నప్పుడు, అది ఫైట్ మాస్టర్ల సృష్టిగా మా బోటి వాళ్ళం అనుకుంటున్నాం కదా..అంటే, ఫైట్ మాస్టర్లు ఏదీ సృష్టించరన్నారు. వాళ్లదంతా విధ్వంసమే నని జోకేస్తూ, ఇప్పుడు తాజాగా ‘రాజన్న’ కి తయారుచేసిన వేట కత్తు ల్లోంచి ఒకదాన్ని తీసి చూడమని చేతిలో పెట్టారు. మెత్తటి మెటీరియల్ తో తయారు చేసిన ఆ కత్తితో గాయలయ్యే ప్రసక్తే లేదు. ఇదే ఫైట్ మాస్టర్ తయారు చేస్తే కసిక్కున  దిగబడుతుందేమో...
     ఇక ఫైట్ మాస్టర్ల గురించి ఇంకో విషయం చెబుతూ, హీరో పిడికిలితో కొడితే అమాంతం గోడ పడిపోయేట్టు కట్టివ్వాలంటారు ఫైట్ మాస్టర్లు. అలా కాకుండా ముందు గోడ పగుళ్లిచ్చి, కొన్ని పెచ్చు లూడుతూంటే, అది ఫియర్ సైకోసిస్ ని సృష్టించి ప్రేక్షకులకి గాభార పెడుతుందని సైన్స్ వివరించారు రవీందర్.
    స్వేచ్ఛ విషయానికొస్తే, తనవరకూ పూర్తి స్వేచ్చతో పనిచేసే అవకాశం లభిస్తోందన్నారు. సినిమాకి వెన్నెముక లాంటిది కళా దర్శకత్వమని, అది పాత్రల మనస్తత్వాల్ని,  వ్యక్తిత్వాల్ని, స్థితిగతుల్నీ వెల్లడి చేసే ఒక వాతావరణ సృష్టి అనంటూ, ఒక ఆపిల్ పండు పెట్టాలన్నా ప్రొడక్షన్ బాయ్ పరుగెత్తి మార్కెట్లో దొరికిందల్లా పట్టు కొచ్చేస్తే కుదరదున్నారు. ముందు బ్యాక్ స్టోరీ ని వర్కౌట్ చేసి ప్రాపర్టీస్ ని సూచిస్తానన్నారు. కళా దర్శకత్వం కథని డామినేట్ చేయకూడదనీ, కథ వింటున్నప్పుడే దర్శకుడి ఊహా లోకపు ఫీల్ ని పసిగడతాననీ చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఇద్దరు దర్శకులు కథ చెప్పననడంతో ఆ సినిమాల్ని వదులుకున్నా నన్నారు.

       ప్రేక్షకులు సినిమా బాగా లేదనడానికి కళాదర్శకత్వం కూడా కారణ మౌతుందన్నారు. కొన్ని రకాల రంగులు, వస్తు సంచయం అన్ కాన్షష్ గా వాళ్ళని చీకాకు పెట్టి ఉండొచ్చు. కనుక వస్తువుల ఎంపికలో, వాటి అమరికల, రంగుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
    “కాలేజీ నుంచి వచ్చిన హీరోయిన్ ఇంట్లో అటో చెప్పూ ఇటో చెప్పూ విసిరేసుకుంటూ వస్తే అవి ఎక్కడెక్కడ పడాలి, బ్యాగు కూడా విసిరేస్తే అది పడేందుకు ఓ సోఫా ఉంటే, అదెక్కడ వుండాలి...వాచీ తీసేస్తే దాన్ని టేబుల్ మీద ఎక్కడ పడెయ్యాలీ...” అని తన ధోరణిలో చెప్పుకు పోతూంటే- 
    “చూస్తూంటే మీరే దర్శకత్వం వహించేసేట్టున్నారు, ఇక దర్శకులేం చెయ్యాలి?” అని  అడ్డు తగిలితే- “టాలెంట్ వుంది కదా అని డామినేట్ చెయ్యను. అన్ని శాఖల వారితో ట్యూన్ అవుతాను. కొందరికి తక్కువ టాలెంట్ ఉండొచ్చు. అలాంటప్పుడు అంతకు నన్ను తగ్గించుకుని పని చేస్తాను” –అన్నారు. 

   నెల్లూరుకి చెందిన రవిందర్ 1993 లో హైదరాబాద్ జేఎన్టీయూ లో ఫైనార్ట్స్ చేసి,  న్యూఢిల్లీ  ఐఐటీ లో మాస్టర్స్ ఇన్ డిజైన్ పూర్తి చేశారు. కొంతకాలం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసి, ‘అమృతం’  సీరియల్ కొచ్చారు. 2003 లో గుణ్ణం గంగరాజు తీసిన ‘ఐతే’ కి కళా దర్శకులయ్యారు. 
     “ ‘ఐతే’ లో అపోలో హాస్పిటల్ వెనుక మీరు వేసిన టీ స్టాల్ సెట్ మిస్టీరియస్ నేచర్ ని ఇప్పటికీ మరువ లేకున్నాం,  అంత రియలిస్టిక్ గా ఎలా క్రియేట్ చేయగలిగారు?” అనడిగితే, బహుశా పారితోషికం లేని పరిస్థితుల్లో పని చయడం వల్ల ఆ సహజత్వం వచ్చిందని చమత్కరించారు (సినిమా విడుదలయ్యాక పాతిక వేలు లభించాయట!)

    తర్వాత ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘సై’, ‘ఒక్క మగాడు’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘అమ్మ చెప్పింది’, ‘అష్టాచెమ్మ’, ‘మార్నింగ్ రాగ’, ‘నేను మీకు తెలుసా’, ‘మగధీర’...ఇలా ఆయన ఖాతాలో సినిమాలు జమ పడ్డాయి.
    ‘మగధీర’ ఒక చరిత్ర. అందులో రాజభవనాలు, రథం, ఊబి, హెలీకాప్టర్, కాస్ట్యూమ్స్ వంటి అద్భుత సృష్టులు రవీందర్ చేతుల మీదుగా జరిగాక, చెప్పుకోవాల్సిన మరో విశిష్టత ‘మర్యాదరామన్న’ లోని రైల్ కంపార్ట్ మెంట్, ట్రాలీసెట్లు, నది మీద కలప వంతెన యదార్థ నిర్మాణం (గత ఇంటర్వ్యూల్లో ‘మర్యాదరామన్న’ గ్రాఫిక్స్ నిపుణులు కణల్ కణ్ణన్, కెమెరా మాన్ సి. రాం ప్రసద్ లు ఆ వంతెనని పూర్తిగా గ్రాఫిక్స్ సృష్టిగా పేర్కొనడాన్ని రవీందర్ దృష్టికి తెస్తే, దీనికి ఆయన ఫీలై,  అది తను వేసిన సెట్ -నిజ కట్టడం- అని ఫోటోలు చూపించారు).

    పోతే, ‘మర్యాదరామన్న’ కోసం వేసిన ఇంటి సెట్ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది...ఇప్పటికీ ఇందులో వివిధ సినిమాల షూటింగులు జరిగిపోతున్నాయి. పూర్తిగా ప్లై వుడ్ తో నిర్మించిన ఈ సెట్ కి నాల్గేళ్ళ గ్యారంటీ వుంది. దీని పటిష్టత కోసం ప్లైవుడ్ మీద వేసిన కోటింగ్ లో రసాయనాల మిశ్రమం రవిందర్ సొంత డిస్కవరీయే. ఇప్పుడు దీనికే ఆయన పేటెంట్ హక్కులు పొందారు. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నవారమే స్విట్జర్లాండ్ నుంచి పత్రాలందాయని వాటిని చూపించారు. ఈ విషయం ముందుగా  ఇలా ‘ఆంధ్రజ్యోతి’ కే వెల్లడిస్తున్నాననీ, తర్వాత నిర్మాతల సమక్షంలో ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటిస్తామనీ చెప్పారు. కాబట్టి ఈ కెమికల్ కాంబినేషన్ ని ప్రపంచంలో ఎవరు వాడాలన్నా ముందుగా రవీందర్ కి రాయల్టీ చెల్లించాల్సి వుంటుంది. ఇలా ఒక కళా దర్శకుడికి పేటెంట్ హక్కులు దక్కడం దేశంలోనే మొదటిసారి!
      ప్రస్తుతం ‘శ్రీ రామరాజ్యం’ కి రామోజీ ఫిలిం సిటీలో రాజప్రాసాదాల సెట్, అల్వాల్ లో అడవి సెట్, ‘రాజన్న’ కి జూబ్లీహిల్స్ లో 1946 నాటి తెలంగాణా గ్రామం సెట్ వేసి, ఇంకా ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘ఈగ’ సినిమాలకి పనిచేస్తున్న రవిందర్ ఎలాటి అవార్డులకీ సన్మానాలకీ  దూరం!

సికిందర్  
(ఫిబ్రవరి 2011 ,ఆంధ్రజ్యోతి’ కోసం)