రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

926 : స్పెషల్ ఆర్టికల్


      సామెతలు అబద్ధంగా పుట్టలేదు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు నిజంగానే వుంటాయి బద్ధకం వదిలించుకుని కాస్త వెతికితే. ఊహకందని ఉపాయాలు కూడా బుట్టలో పడతాయి. కరోనా ఐతే ఏంటి, అది కోరల వైరస్ ఐతే ఏంటి- దాని దిమ్మదిరిగే ఐడియాలు సినిమాలు తీయడానికి తన్నుకొస్తూనే వుంటాయి. తైమూర్ బక్మంబెతోవ్ అంటే తమాషా కాదు. షూటింగు ఆపేసి స్టూడియోలోనే లైవ్ వీడియో గేమ్ లో సినిమా తీసేయగలడు. తైమూర్ ఇంకెవరో కాదు, ఎంజలీనా జోలీతో హాలీవుడ్ యాక్షన్ ‘వాంటెడ్’ తీసిన రష్యన్ దర్శకుడే. తిరిగి ఆమెతోనే  రెండో ప్రపంచ యుద్ధ యాక్షన్ ‘వీ2 -ఎస్కేప్ ఫ్రమ్ హెల్’ తీస్తూంటే కరోనా హెచ్చరికలు షూటింగుకి బ్రేకేశాయి. ప్యాకప్ చెప్పేసి వచ్చేసి స్టూడియోలో కూర్చుని తీయడం మొదలెట్టాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటి లైవ్ వీడియో గేమ్ లో తీసిన కమర్షియల్ మూవీ సీనుగా రికార్డు స్థాపించేశాడు.

       
నిజానికి ఈ సీను యుద్ధ విమానాలతో రియల్ లొకేషన్ గగనతలంలో తీయాలని ప్లాన్ చేస్తే కోరల వైరస్ కాదు పొమ్మంది. దీంతో లొకేషన్ లో సోషల్ మిక్సింగ్ ని వీలైంత తగ్గించాలని, అతి తక్కువ మంది యూనిట్ సభ్యుల్ని పిట్స్ బర్గ్ లొకేషన్లో వుంచి, ల్యాండ్ చేసిన యుద్ధ విమానం కాక్ పిట్ లో హీరో పావెల్ ప్రిలచ్నీని కూర్చోబెట్టి, తను 1200 కిమీ దూరంలోని కజాన్ స్టూడియోలో కూర్చుని, రిమోట్ డైరెక్షన్ మొదలెట్టాడు... సీను ఎలా పూర్తి చేశాడన్నది వేరే కథ. ఇంకోసారి చెప్పుకుందాం. పాయింటేమిటంటే, కరోనా కూడా సినిమాల్ని ఆపలేదని. కరోనా ఒక విషమ చారిత్రక ఘట్టం నిజమే, ఐతే దీన్నుంచి ఆర్ధికంగా పుంజుకుంటామనీ, ఇంకా బెటర్ బిజినెస్సులు అభివృద్ధి చెందుతాయనీ, రాజకీయ వ్యవస్థ కూడా రూపాంతీకరణ చెందుతుందనీ, ఇవి కాదని ఇంకేవో నెగెటివ్ వూహాగానాలు చేయడం వొట్టి బుల్ షిట్టనీ... తేల్చేస్తున్నాడు తైమూర్.

        సినిమాలు చాలా తట్టుకున్నాయి. వీడియో కేసెట్స్ ని తట్టుకున్నాయి, టీవీ సీరియల్స్ ని తట్టుకున్నాయి, పైరసీనీ తట్టుకున్నాయి. సినిమాలంటేనే తట్టుకునే క్రియేటివిటీ. అందుకే అమెరికాలో ఒకప్పుడు సీఐఏ సంస్థ దేశానికేదైనా కఠిన సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం హాలీవుడ్ రచయితల్ని సంప్రదించేది. క్రియేటివ్ పరిష్కారాలు చెప్తారని. రాజకీయ పక్షాలు కుయుక్తుల పరిష్కారాలు చెప్తాయి. ఆ రచయితల్నిసంప్రదించే సాంప్రదాయమిక లేదు. ప్రభుత్వాలే అయోమయం సృష్టిస్తాయి. సినిమాలే డీఫాల్టుగా వుండే క్రియేటివిటీతో వాటి దారి అవి చూసుకుని బయటపడాలి. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా కూడా, ఈ సంక్షోభంలోంచి ఇతర రంగాలకంటే తాము వేగంగా బయట పడతామన్నారు. సీఎన్ఎన్ పాత్రికేయుడు అడిగిన డజను కఠిన ప్రశ్నలకి సమాధానమివ్వ లేని అమెరికా అధ్యక్షుడి చేతిలో - దేశంతో బాటు హాలీవుడ్
కరోనా కాటుకి విలవిల్లాడుతున్నాయి. లాక్ డౌన్ విషయంలో ఇక్కడ అనావృస్టి అయితే, మనకి ఇండియాలో అతివృష్టి!

        ప్రణాళిక లేకుండా నాల్గు గంటల గడువిచ్చి రాత్రికి రాత్రి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించేస్తే, తెల్లారేకల్లా తిండి లేక రోడ్డున పడ్డారు జనాలు. జనజీవితం అస్తవ్యస్తమై పోయింది. దీనికి ముందు ఆదివారం ఒక రోజు లాక్ డౌన్ కి రెండు రోజులు గడువు. మూడువారాల దేశవ్యాప్త లాక్ డౌన్ కి మాత్రం నాల్గే నాలుగు గంటలు గడువు! దీని ప్రభావం మామూలుగా లేదు. ఒక అంతర్జాతీయ రిపోర్టు ప్రకారం దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఆర్ధిక పతనం చెందుతారు. మధ్య తరగతి కింది మధ్యతరగతికి, కింది మధ్యతరగతి పేద తరగతికి, పేద తరగతి దారిద్ర్య రేఖ దిగువకీ జారిపోతారు. ఈ రిపోర్టే నిజమైతే రేపు లాక్ డౌన్ ఎత్తేశాక థియేటర్లు తెరిస్తే, ప్రేక్షకులెవరుంటారో చూడాలి. మాస్ ప్రేక్షకుల శాతంలో ఎంత కోత పడుతుందో చూడాలి. ఈ నలభై కోట్ల మందికి కాస్తో కూస్తో డబ్బు చేతిలో పడితే ముందు బతకడానికి కావాలి.

        ఇంతకాలం తిరిగి ప్రేక్షకులు సినిమాలకి రావడానికి కరోనా ఫోబియా కొంత కాలం వెన్నాడుతుందనుకున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా, సినిమాలకెళ్ళి రోగం తెచ్చుకోవాలని ఎవరు కోరుకుంటారన్నారు. పీవీఆర్ గ్రూపు చైర్మన్ తమ మల్టీ ప్లెక్సుల్లో సీటు విడిచి సీటు బుకింగ్ ఇస్తామన్నారు. కానీ షో ప్రారంభమై పోయాక వచ్చే
ఆగంతకుడు, చీకట్లో మన పక్క ఖాళీ సీట్లో ధడాలున కూలబడితేనో? అప్పుడేంటి? ఇలా ఫోబియా బహు కోణాల్లో భయపెడుతోంటే, దీనికి ఆర్ధిక లేమి కూడా తోడైతే, సినిమాలకి రావడానికి ప్రేక్షకులు ఇంకెన్నాళ్ళు పడుతుంది? ప్రస్తుతానికి లాక్ డౌన్ పొడిగింపే వుంటుంది. మరో రెండు వారాలకో ఎప్పుడో లాక్ డౌన్ దశల వారీగా ఎత్తేసినా, సినిమా థియేటర్ల వంతు చివరి దశలో వస్తుంది. ఆర్ధిక లేమి కాసేపు పక్కన బెడితే, అప్పుడైనా  ఫోబియా వుండదా? అసలు అప్పటికైనా థియేటర్లు తెరచుకుంటాయా? అప్పటికి అసలు లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితి వుంటుందా?

        తాజా రిపోర్టు ప్రకారం-
     అమెరికాలో కరోనా మే ఒకటవ తేదీకి పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇండియాలో జూన్ ఒకటిన పతాక స్థాయికి చేరుకుంటుంది. పతాక సన్నివేశం చూడకుండా అది వదిలి పెట్టదని అంటున్నారు. 1918 లో కోట్ల మందిని పొట్టన బెట్టుకున్న స్పానిష్ ఫ్లూతో అనుభవాల్నిబట్టి, ఇప్పటి పతాక సన్నివేశాన్ని వూహిస్తున్నారు. అప్పట్లో ఫిలడెల్ఫియాలో మొదటి ఫ్లూ కేసు ఇలా బయటపడిందో లేదో, అలా శరవేగంగా వ్యాపించి పదిరోజుల్లో నగరంలో 20 వేల మందిని ఆస్పత్రుల పాల్జేసింది. దీంతో న్యూయార్క్ నగరంలో తక్షణ చర్యలు తీసుకుని, లాక్ డౌన్ చేస్తే స్వల్ప మరణాలతో బయటపడ్డారు. అప్పటి ఫ్లూ హెచ్చుతగ్గుల ప్రవర్తనని అధ్యయనం చేసిన మెకిన్సే సంస్థ రిపోర్టు ఇచ్చింది. దీని ప్రకారం, ఒక వ్యాధి గ్రస్తుడి నుంచి ఒకరికి లేదా ఇద్దరికీ, ఆ ఇద్దరి నుంచి నల్గురికి, ఆ నల్గురి నుంచి ఎనమండుగురికీ ...ఇలా వ్యాప్తిస్తూ పోయిందంటే, ఇక విజృంభించి పతాక స్థాయికి వెళ్ళిపోతుంది. వెళ్ళాక అక్కడ్నించీ తగ్గు ముఖం పట్టడం ప్రారంభిస్తుంది. ఎలాగంటే, ప్రజల రోగనిరోధక శక్తి పెరగడమో, లేదా అసంఖ్యాక మరణాలు జరగడమో సంభవించి, కబళించడానికి కరోనాకి ఇక మనుషులు కరువైపోతారు. ఇందుకే దానికి మనుషులు దొరక్కుండా భౌతిక దూరం పాటించాలనేది. బలాదూర్లు తిరక్కుండా ఇంట్లో కూర్చోవాలనేది. ఇలా చేస్తే తక్కువ పాజిటివ్ కేసులతో ఇండియా జూన్ ఒకటికల్లా పీక్కెళ్ళి ఆ తర్వాత వైరస్ పీడా విరగడైపోతుంది. దానికి దొరక్కుండా దాక్కోవడమే మార్గం. వూళ్ళో సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడంటే చప్పున వెళ్లి దాక్కుంటాంగా?

        ఇలాంటప్పుడు జూన్లో కూడా లాక్ డౌన్ తప్పదేమో? ఇప్పుడు కేంద్రం లాక్ డౌన్  ఎగ్జిట్ ప్లాన్ కోసం రాజకీయ పక్షాలతో, ముఖ్యమంత్రులతో, పాత్రికేయులతో సమావేశాలు జరుపుతానంటోంది. రాజకీయ పక్షాలతో పూర్తయింది. ముఖ్యమంత్రులతో ఆన్ లైన్ సమావేశం రేపు 11 న వుంది. లాక్ డౌన్ ప్రకటించే ముందు కూడా ఇలాటి సమావేశాలు జరిపి వుంటే ఒక సమగ్ర ప్రణాళిక ప్రకారం జరిగేది అల్లకల్లోలం లేకుండా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ పొడిగింపుతో బాటు ఒక సవివరమైన ఆర్ధిక ప్రణాళిక మాట్లాడుకుని, ఎలా చక్కదిద్దుతారో యాక్షన్ ప్లాన్ తో ప్రజలకి పూర్తి భరోసా కల్పిస్తే మంచిది. పాత్రికేయుల నుంచి కూడా సలహాలు తీసుకుంటామంటున్నారు కాబట్టి - సీనియర్ పాత్రికేయుడు పుణ్య ప్రసూన్ బాజ్ పేయీ - అన్నిరంగాలూ శరవేగంగా పుంజుకోవడానికి గణాంకాలు సహా-  తెలంగాణా సహా అన్ని రాష్ట్రాల ఎగ్జిట్ ప్లాన్ చెబుతూ మొన్న రాత్రి  యూట్యూబ్ లో ఆలోచనాత్మక వీడియో పోస్ట్ చేశాడు. దీన్ని కూడా పరిశీలించ వచ్చు. 

        భావనా మాలి బాలీవుడ్ లో-
   యంగ్ డాన్సర్. ఎడ్యుకేటెడ్. ఆమె తన లాక్ డౌన్ కష్టాలు ఎబిపి ఛానెల్ కి తేలికగానే చెప్పుకుంది : ఫ్లాట్ అద్దె పదిహేడున్నర వేలు కట్టాలి, ఖర్చులకి ఇంకా చాలా కావాలి. దినభత్యంతో పనిచేసే తను ఏ నెలకా నెల గడుపుకొ స్తోంది. వచ్చేనెల అద్దె ఎలా కట్టాలో తెలీదు. యూనియన్ నుంచి మాటామంతీ లేదు. అసలు షూటింగులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీదు. ప్రారంభమైతే కరోనా ఎఫెక్ట్ తో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుల భవితేమిటో తెలీదు. భౌతిక దూరం అంటున్నారు. క్రౌడ్ సీన్లు వుండక పోవచ్చంటున్నారు...

   తమ్మారెడ్డి భరద్వాజ కూడా క్రౌడ్ సీన్లే కాదు, ఫైటింగ్ సీన్లూ, ఫారిన్ షూట్లూ ఇంకా చాలా కాలం పాటు మర్చిపోవాలన్నారు. సినిమా కథలు కూడా మారిపోతాయన్నారు. తమిళ సినిమాలకి ఫారిన్ షూట్లు ఏర్పాటు చేసే రాంజీ కూడా, ఇప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అసాధ్యమై పోయాయని అంటున్నారు. ఎవ్వరూ విమానాల్లో ప్రయాణించడాని కిష్టపడ్డం లేదనీ, బడ్జెట్లు కూడా అదుపు తప్పుతున్నాయనీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నిన్న రాత్రి ఇది టైపు కొడుతున్న సమయానికి ఒక దర్శకుడు ఫోన్ చేసి, మాటల సందర్భంగా, రచయితలకీ దర్శకులకీ ఢోకా వుండదన్నారు. ప్రజలు ఇంట్లో కూర్చుని సినిమాలు చూసే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో డిమాండ్ వుంటుందన్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి భావనా లాంటి వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఏ నటిగానో వృత్తి మార్చుకోవాలి. మార్చుకుంటానంటోంది. మార్పిళ్లు సర్దుబాట్లు చాలా జరుగుతాయి. ఒక న్యూ నార్మల్ పుట్టు కొస్తుంది. పనిలోపనిగా లిప్ లాకులు కూడా నిన్నటి చరిత్రే ఐపోవచ్చు. 

        స్ట్రగుల్ నిర్మాణ రంగంలోనే కాదు, ప్రదర్శనా రంగంలోనూ వుంది హాలీవుడ్ సహా. కాకపోతే అమెరికాలో ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నట్టు మన దగ్గర జరగడం లేదు. ఇంతే తేడా. అమెరికాలో జాతీయ థియేటర్ యాజమాన్యాల సంఘం, తమ లక్షా 50 వేల సిబ్బందికి బెయిల్ అవుట్ ప్రకటించండి మొర్రో అంటోంది. ఢిల్లీలో థియేటర్లు మూత బడ్డా ఖర్చులు తప్పడం లేదు. విద్యుత్ చార్జీలతో, సిబ్బంది జీతనాతాలతో నెలకి రెండు లక్షలు చేతి చమురు వదిలిస్తున్నాయి మూతబడ్డ థియేటర్లు. తమిళనాడులో తమ ఆదాయాలపై టీడీ ఎస్ ఎత్తేసి, రూరల్ సెంటర్స్ లో వినోదపు పన్ను రద్దు చేయాలంటున్నారు ఎగ్జిబిటర్లు. 

        ఐతే హాలీ వుడ్ రచయితల సంఘం, నటుల సమాఖ్యలతో బాటు; టీవీ, రేడియో ఆర్టిస్టుల సంఘాలు అన్ని స్టోరీ - ఇతర కంటెంట్ సమావేశాలన్నీ రద్దు చేశాయి. టాలీవుడ్ లో కూడా ఇదే జరిగితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కూడా రచయితలూ దర్శకులూ ఇప్పుడప్పుడే బిజీ కాలేకపోవచ్చు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సిఎన్ఎన్ - ఐబిఎన్ ఛానెల్లో రాజీవ్ మసంద్ కిచ్చిన ఇంటర్వ్యూలో, అసలు డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా భౌతిక దూరం సమస్య వుండనే వుందిగా అన్నారు. షూటింగు లెలా చేస్తారు? ఇప్పుడు ఇంట్లో బందీలైన ప్రేక్షకులు డిజిటల్ కి అలవాటు పడుతున్నారనేది నిజమే, కానీ కొత్త కంటెంట్ ఎక్కడ్నించి వస్తుందిప్పుడు?  

        చెన్నైలో కూడా నిత్యం జరిగే 50 టీవీ సీరియల్స్ షూటింగులు ఆగిపోయాయి. ఇక వెబ్ సిరీస్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అమెరికా, చైనాలు అతి పెద్ద సినిమా పరిశ్రమలు. లక్షల మంది ప్రజలు ఇళ్ళకి పరిమితమైపోయాక, అక్కడి నిర్మాతలు తమ కొత్త సినిమాలు ఎలా విడుదల చేయాలా అని తల బద్దలు కొట్టుకుంటున్నారు. అయిష్టంగానే స్ట్రీమింగ్ (డిజిటల్) వైపు చూస్తున్నారు. చైనాలో జనవరి నుంచి 70 వేల థియేటర్లు మూతబడ్డాయి. అక్కడ ఆన్ లైన్లో ఒక బిగ్ బడ్జెట్ సినిమా ‘లాస్ట్ ఇన్ రష్యా’ ని విడుదల చేస్తే 6 కోట్ల మంది చూశారు. అమెరికాలో కరోనా ఎఫెక్ట్ తో టీవీకి 6 శాతం, స్ట్రీమింగ్ కి 13 శాతం ప్రేక్షకులు పెరిగారని నీల్సన్ రిపోర్టు చెబుతోంది. అయితే హాలీవుడ్ కొత్త సినిమాలని స్ట్రీమింగ్ కివ్వడానికి ముందుకు రావడం లేదు. చిన్నచిన్న సినిమాలు వర్కౌటవుతా యేమో గానీ, పెద్ద సినిమాలు కావని భావిస్తున్నారు. విడుదల కావాల్సిన జేమ్స్ బాండ్ కొత్త సినిమా ‘నో టైం టు డై’ ని కూడా నవంబర్ కి వాయిదా వేశారు. చిన్న సినిమాల గ్లోబల్ రీచ్ కి ఈ గ్యాప్ లో స్ట్రీమింగ్ తో మంచి అవకాశాలుంటాయని అంటున్నారు. చిన్న సినిమాల డిజిటల్ రిలీజులు పెట్టుబడుల్ని వెనక్కి తెస్తాయని చెప్తున్నారు. 

        అసలు గ్లోబల్ బాక్సాఫీసుకి -
       చైనాలో జనవరి నుంచి థియేటర్ల మూతతో గట్టి దెబ్బ పడింది. 200 కోట్ల డాలర్ల థియేటర్ వసూళ్లు చైనాలో గాలిలో కలిసిపోయాయి. హాలీవుడ్ అంటే గ్లోబల్ మార్కెట్. ఉత్తర దక్షిణ కొరియాలు, జపాన్, యూరప్ లతో బాటు చైనా బిగ్ మార్కెట్. చైనా నుంచే అధిక రాబడి. అయినా సరే, ఇన్ని మార్కెట్లు మూతబడుతున్నాయి కదాని, పెద్ద సినిమాలని స్ట్రీమింగ్ కిచ్చేసే ఆలోచన చేయడం లేదు. ఇవ్వాళా ఒక పెద్ద సినిమాని ఇంట్లో కూర్చుని చూసిన ప్రేక్షకుడు, ఇంకో పెద్ద సినిమా కోసం ఇంట్లోనే కూర్చుని ఎదురు చూస్తాడు. థియేటర్ కి ఎంత మంది కుటుంబ సభ్యులు వెళ్తే అంత మందికి టికెట్లు కొంటారు. ఇంట్లో ఇలా కుదరదు. స్ట్రీమింగ్ లో 20 డాలర్లు ఒక సినిమాకి ఫీజు పెడితే, ఆ 20 డాలర్లే ఇంట్లోంచి వస్తాయి. వంద మంది చూసి పారేస్తారు...ఇలా లెక్క లేసుకుని వెనుకాడుతున్నారు హాలీవుడ్ నిర్మాతలు.

        డిస్నీసంస్థ మార్చి 27న విడుదలకి సిద్ధం చేసిన చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ములన్’ ని జులై 24 కి వాయిదా వేసింది. ఎట్టి పరిస్థితిలో స్ట్రీమింగ్ కి వెళ్ళల్చుకోలేదు. దీన్ని గనుక తమ డిస్నీ ప్లస్ లోనే విడుదల చేస్తే, ఈ యాక్షన్ వండర్ ని ఇంట్లో కూర్చుని చూసిన ప్రేక్షకులు, ఇలాటివి ఇక స్ట్రీమింగ్ లోనే వస్తాయిలే అనుకునే నెగెటివ్ రిజల్టు వచ్చే ప్రమాదముందని డిస్నీ అధికారులంటున్నారు.

        ఇంకా బ్లాక్ విడో, వండర్ వుమన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9, ఏ క్వయిట్ ప్లేస్ 2 సహా 34 పెద్ద సినిమాల విడుదలల్నీ, ఇంకో 24 చిన్న సినిమాల విడుదలల్నీ జులై తర్వాత నుంచి వచ్చే సంవత్సరం దాకా వాయిదా వేసేశారు. పరిస్థితి చక్కబడి థియేటర్లు ప్రారంభమైనా, వెంటనే కొత్త సినిమాలు విడుదల చేయాలనుకోవడం లేదు. ముందుగా కొంతకాలం ప్రేక్షకుల స్పందనని పరీక్షించేందుకు, విడుదల కాని పాత సినిమాల్ని దుమ్ము దులిపి వేద్దామనుకుంటున్నారు. చైనాలో మార్చి చివరి వారంలో ప్రయోగాత్మకంగా 500 థియేటర్లు తెరిచి, ఇలాటి ఫార్ములానే అమలు చేస్తే ప్రేక్షకులు లేరు. ఒక థియేటర్ కి ఇద్దరు మాత్రమే వచ్చి మొహమొహాలు చూసుకున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పాత సినిమాలెవడు చూస్తాడని ఒకడు పోస్టు పెట్టాడు.

           
చైనాలో మార్చి చివరి వారంలో థియేటర్లు తెరవడానికి అనుమతిచ్చిన చైనా ఫిలిం అడ్మినిస్ట్రేషన్, అంతలోనే మూసేయాలని ఆదేశాలిచ్చింది. ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడమే కారణం. థియేటర్ల యాజమాన్యాలు కూడా థియేటర్లు తెరవడానికి సందిగ్ధంలో వున్నారు. ఎవరైనా ప్రేక్షకులు థియేటర్లో కరోనా బారిన పడి కేసువేస్తే నష్టపరిహారం చెల్లించడానికి ఇన్సూరెన్సు కవర్ కూడా లేదంటున్నారు. పైగా ప్రతివొక్క ప్రేక్షకుడికీ మాస్కు, చేతి గ్లవ్స్ ఉచితంగా అందించాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనలకి బెంబేలెత్తు తున్నారు. మన దేశంలో కూడా రేపు ఇదే నిబంధన పెడితే థియేటర్లకి కష్టమే. ఇప్పటికే బయట తిరిగే ప్రతివొక్కరూ మాస్కు ధరించాలని ఉత్తర్వు లిచ్చింది ప్రభుత్వం.         

        ఇండియాలో ప్రస్తుతానికి స్ట్రీమింగ్ ఆలోచన చేయడం లేదు. చిన్న సినిమాలకి స్ట్రీమింగ్ కి పెద్దగా అవకాశాల్లేవు. యూట్యూబ్ ఛానెళ్లని ఆశ్రయించాల్సిందే. తెలుగులో తెలుగుకే ప్రత్యేకమైన ‘ఆహా’ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీస్ లో విడుదల చేసుకోవచ్చు. హిందీలో, కరణ్ జోహార్ విడుదల ఆగిపోయిన ‘సూర్య వంశీ’ ని తిరిగి థియేటర్లలో ఎలా విడుదల చేయాలా అని ఆలోచిస్తున్నారే తప్ప, స్ట్రీమింగ్ ఆలోచన చేయడం లేదు. తమిళంలో విడుదలైన సినిమాల్ని రెండు నుంచి నాల్గు వారాల్లోనే స్ట్రీమింగ్ కిచ్చేయడం పైన ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాల ఆందోళన రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇక కొత్త సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ లోనే విడుదల చేసేస్తే తామేం కావాలని ప్రశ్నిస్తున్నారు. చిన్న సినిమాలైనా, స్టార్ సినిమాలైనా విడుదలయ్యాక ఎనిమిది వారాల గడువు పెడితే ఓటీటీ విండోకి ఒప్పుకుంటామంటున్నారు. దక్షిణాదిన నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ‘ఆహా’ ఓటీటీతో బాటు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, జీ5, సన్ ఎన్ ఎక్స్ టీలు పనిచేస్తున్నాయి.      

        స్ట్రీమింగ్ బిజినెస్ కూడా-
      ప్రజలు ఎంత కాలం గృహలకి పరిమితమై వుంటారనే దాని మీద,  అలాగే వాళ్ళ వ్యక్తిగత ఆర్ధిక పరిస్థితి మీద కూడా ఆధారపడి వుంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి అమెరికాలో చాలా మంది వర్కర్ల ఆదాయాలు ప్రశ్నార్ధక మవుతున్న సమయంలో, కుటుంబ సమేతంగా ఒక సినిమాకెళ్ళి టికెట్లకి, పాప్ కార్న్ కీ, సోడాకీ 100 డాలర్లు వెచ్చించే కన్నా, 119 డాలర్లు రుసుము చెల్లించి ఏడాది పొడవునా ఇంట్లో సినిమాలు చూసుకోవడం లాభసాటి అన్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ లెక్కలు కూడా మారిపోతాయంటున్నారు. మొన్న మంగళవారం న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో, నగరంలో వైరస్ మే ఒకటిన పతాక స్థాయికి చేరుతుందని చెప్పారనీ, అయితే ఇతర రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ సమయం తీసుకోవచ్చనీ, దాంతో హాలీవుడ్ సహా ప్రతీ పరిశ్రమా డైలమాలో పడతాయనీ, అప్పుడేం జరగబోతుందో ఎవరూ చెప్పలేరనీ విశ్లేషిస్తున్నారు. ట్రెండ్స్ ని అంచనా వేసి రికార్డు చేయడంలో దిట్ట అయిన నీల్సన్ కి చెందిన కట్ సింగ్రిస్ కూడా, ఈ విషయంలో చేతులెత్తేశారు. మీడియా పరిశ్రమకి దారులు మూసేసింది వైరస్ - అని మాత్రం చెప్పగల్గుతున్నారు. 


        లైట్ షెడ్ కి చెందిన మీడియా ఎనలిస్టు రిచర్డ్ గ్రీన్ ఫీల్డ్ కూడా, సాధారణ పరిస్థితు లెప్పుడు నెలకొంటాయో ఎవ్వరికీ తెలీదంటున్నారు. ఒకవేళ పరిస్థితులన్నీ చక్కబడి థియేటర్లు తెర్చుకున్నప్పుడు, కిటకిట లాడితే అదికూడా నమ్మరాదంటున్నారు. ఇళ్ళల్లో కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్యా వుండీ వుండీ వూపిరాడక బయటపడి సినిమాలకొస్తే, అది పొంగు మాత్రమేనని, అది ఇట్టే చల్లారిపోయి - వాళ్ళు తిరిగి సినిమాలు చూసుకుంటూ ఇళ్ళ దగ్గరా, వాళ్ళు లేక హాళ్ళు తిరిగి వెలవెల బోతూ భయానకంగా వుండక తప్పదనీ  గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు.

        ఇండియాలో ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకి రప్పించాలంటే ఒకటే మార్గమంటున్నారు కొందరు బాలీవుడ్ వ్యక్తులు. అది బిగ్ స్టార్ సినిమాలు తీసి విడుదల చేయడం. అయితే హిందీకైనా, తెలుగుకైనా, తమిళానికైనా ఓవర్సీస్ మార్కెట్ కూడా వుంటుంది. అక్కడ పరిస్థితి అసలే బాగా లేదు. అక్కడ ఆపుకుని ఇండియాలోనే విడుదలలు చేసుకోవాలి. లేదా గ్రీన్ ఫీల్డ్ థియరీని ఎదుర్కోవడానికి తెగించాలి.

        ఇదంతా సరే, అసలు 1918 లో-
      ఏం జరిగింది? అప్పటి స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా మహమ్మారిని సినిమాలెలా ఎదుర్కొన్నాయి? నూరేళ్ళ క్రితం తీసుకున్న చర్యలు ఇప్పుడేమైనా పనికొస్తాయా? ఈ ప్రశ్న మెదిలి వీకీపీడియా చూస్తే అందులో మహమ్మారి గురించి వుంది తప్ప, సినిమాల గురించి లేదు. సర్ఫింగ్ చేస్తూంటే రెండే రెండు చోట్ల సమాచారం. అది కూడా గతవారమే ఇచ్చిన తాజా సమాచారం. టైమ్ మేగజైన్లో ఒకటి, బిబిసి వెబ్సైట్లో ఒకటి. 

    ఈ తాజా కథనాల ప్రకారం, 1918 లో స్పానిష్ ఫ్లూ విజృంభణకి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది రాలిపోయారు. అందులో అమెరికన్లు ఆరులక్షల 75 వేలు. అన్ని దేశాల కంటే అత్యధికంగా మన దేశంలో కోటీ 20 లక్షల మంది చనిపోయారు. ఇది మొదట బొంబాయిని సోకింది. అందువల్ల బాంబే ఫ్లూ అన్నారు. 1918 -20 మధ్య రెండేళ్ళ పాటు గడగడ లాడిం చింది. అమెరికాలో ప్రభుత్వం వెంటనే అన్ని థియేటర్లనీ, పబ్లిక్ స్థలాలనీ మూసేయించింది. హాలీవుడ్ స్టూడియోల యాజమానులు మూడు వారాలపాటు షూటింగులాపుకుని, స్టూడియోలు మూసేశారు. పరిస్థితి చక్కబడ్డాక అతి తక్కువ థియేటర్లు మాత్రమే తెరవగల్గారు. పారమౌంట్ పిక్చర్స్ అధినేత ఆర్ధిక సమస్యలతో మూతబడే వున్న థియేటర్లని కొనేశాడు. అమ్మకపోతే నీ థియేటర్ ముందు థియేటర్ కడతామని అతడి మనుషులు బెదిరించి మరీ లొంగదీసుకున్నారు. స్టూడియోలే థియేటర్లని గుప్పెట్లో వుంచుకునే వ్యవస్థ అప్పట్నుంచీ ప్రారంభమైంది. 1948 లో థియేటర్లపై స్టూడియోల ఈ గుత్తాధిపత్యాన్ని సుప్రీం కోర్టు బద్దలు కొట్టింది.

        ఫ్లూతో ఇంత బీభత్సం జరుగుతున్నా అనేక దేశాల్లో థియేటర్లని మూసివేయనే లేదు. అవి ప్రజలకి పాపులర్ అడ్డాలుగా మారాయి. థియేటర్లలో పడి సినిమాలు చూడడం, ఫ్లూ అంటించుకుని చావడం. సినిమాలు పుట్టిందే అప్పుడప్పుడే. తెరమీద కదిలే బొమ్మలంటేనే మైండ్ బ్లోయింగ్ మేటర్. చూడకుండా ఏ శక్తీ ఆపలేదు. చూపించే వాళ్ళకీ అదే పిచ్చి ఆనందం. బ్రిటిష్ ప్రభుత్వానిది మరీ చోద్యం. ప్రజారోగ్యానికి సినిమా అనేది నిత్యావసర వస్తువు అని తేల్చింది. ప్రజల్ని ఇది బిజీగా, ప్రశాంతంగా వుంచుతుందనీ, ముఖ్యంగా తాగుడికి దూరం చేస్తుందని సిద్ధాంతాలు చేసింది. ఫ్లూ వీరవిహరంలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా ఒకచోట కాకపోతే ఇంకో చోట సినిమాలు ఆడుతూనే వుండేవి. లండన్ హాళ్ళలో ప్రతీ మూడు గంటల కోసారి, అరగంట పాటు కిటికీలూ తలుపులూ తెరిచి, హాళ్ళని రీఫ్రెష్ చేసేవాళ్ళు. పిల్లల్ని తీసుకుని రానిచ్చే వాళ్ళు కాదు. ఫ్లూ కారణం చూపించి థియేటర్లు మూసేయడం నాన్సెన్స్ అని, సినిమా ట్రేడ్ వ్యక్తులు థియేటర్ ఓనర్లకి ఉత్తరాలు రాసేవాళ్ళు. 

        అమెరికాలో థియేటర్ల మూసివేత రాష్ట్రాలని బట్టి జరిగింది. స్టూడియోలున్న లాస్ ఏంజిలిస్ లో వ్యాధి తీవ్రత అధికంగా వుండడంతో థియేటర్లు పూర్తిగా మూసేశారు. కాలిఫోర్నియాలో కూడా ఏడు వారాల పాటు మూసేశారు. సినిమా నిర్మాణాలు సహా, కొత్త సినిమాల విడుదలలు ఆపేశారు. ఈ పరిణామాల్లో చిన్న నిర్మాణ సంస్థలు తుడిచి పెట్టుకు పోయాయి. పెద్ద సంస్థలు మరింత బలమైన పెద్ద సంస్థలుగా ఎదిగాయి. నిర్మాణ- పంపిణీ – ప్రదర్శనా రంగాలు వాటి చేతిలో కెళ్ళి పోయాయి. అక్కడినుంచీ హాలీవుడ్ మెగా హాలీవుడ్ గా అవతరించి, ప్రపంచాన్ని ఏలుకోవడం మొదలెట్టింది సూపర్ మెగా సినిమాల పరంగా. 

        1918 లో అంత బీభత్సంలోనే నామరూపాల్లేకుండా పోలేదు అప్పుడప్పుడే పుట్టిన సినిమా - అలాంటిది ఇప్పుడేదో అయిపోతుందనుకోవడం భ్రమంటున్నారు. వీడియో కేసెట్ నే ఎదుర్కొని ముందుకు సాగింది, ఇప్పుడు స్ట్రీమింగ్ ఓ లెక్క కాదంటున్నారు. టీవీల్లో, కంప్యూటర్స్ లో సినిమాలు చూసి చూసి విసుగెత్తి, థియేటర్లలో వైడ్ స్క్రీన్ మీదే చూసేందుకు కదులుతారనీ, థియేటర్లో తెరమీద పడే బొమ్మ టెక్నికల్ నాణ్యత, హోం స్క్రీన్ మీద ఎప్పుడూ వుండదనీ, వివరిస్తున్నారు. థియేటర్లో ప్రేక్షక సమూహంలో కూర్చుని సినిమా చూసే కలెక్టివ్ అనుభవానికి, థ్రిల్ కీ మరేదీ సాటి రాదని అంటున్నారు. స్పానిష్ ఫ్లూనే కాదు, దాంతో బాటు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రాపంచ యుద్ధం కూడా చప్పరించి అవతల పారేసింది సినిమా అనీ గుర్తు చేస్తున్నారు.

        ఇప్పుడొక్కటి : తెలుగు సినిమాల విడుదలలు ప్రారంభమైతే, రివ్యూ రైటర్లు పండగ చేసుకోకుండా, వెబ్సైట్ల హిట్ల కోసం తెల్లారే పోటా పోటీగా పరుగులు తీయకుండా, రేటింగుల ప్రతాపం చూపించకుండా, కొన్నాళ్ళు సినిమాలని అలా బతకనియ్యాలి. సినిమాలు ఇప్పుడు బతికితే సినిమా రంగం తిరిగి బతుకుతుంది. ప్రకృతి ఎందుకో న్యూ నార్మల్ ని స్థాపించే దిశగా నెట్టేసింది మనల్ని...ఇది నోట్ చేసుకోవాలి.

సికిందర్