రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, జులై 2024, బుధవారం

1446 : స్క్రీన్ ప్లే సంగతులు!

 

టీటీల్ని డీల్ చేయాలంటే రోమాంటిక్ కామెడీలకి చుక్కెదురవుతూండడంతో ఓటీటీలు డిమాండ్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ల జోరు పెరిగింది. దీంతో ఇటీవలి కాలంలో వారం వారం రోమాంటిక్ కామెడీల తాకిడి తగ్గి, సస్పెన్స్ థ్రిల్లర్ల ఉత్పత్తి వూపందుకుంది. అయితే ఇవి ఏ ఓటీటీల్ని టార్గెట్ గా చేసుకుని వస్తున్నాయో, ఆ ఓటీటీల లైబ్రరీల్లోకి చేరే ముందే థియేటర్లలో గల్లంతవుతున్నాయి. సస్పెన్స్ అంటే ఏమిటో తెలీదు, థ్రిల్ అంటే ఏమిటో తెలీదు, కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటో తెలీదు, లాజిక్ తో పనే లేదు. అపర హిచ్ కాకులం అనుకుని చుట్టి పారేయడమే. ఈ రకంగా మార్కెట్లోకి చాలా స్క్రాప్ డంప్ అవుతోంది. ఇలాంటప్పుడు ఒక మహారాజా అనే తమిళ క్రాఫ్ట్ విడుదలైంది. క్రాఫ్ట్ ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ కి ఆత్మ క్రాఫ్టే. క్రాఫ్ట్ అంటే శిల్పం. కథని నడిపించే తీరు. కథ వొక శిల అయితే దాన్ని ఉత్కంఠభరితంగా చెక్కడం శిల్పం లేదా క్రాఫ్ట్. అందుకని క్రాఫ్ట్ లేని సస్పెన్స్ థ్రిల్లర్ కాకి రెట్టతో సమానం. కథని దాచిపెడుతూ విప్పుతూ పోవడమే సస్పెన్స్ థ్రిల్లర్ కథనమైతే, ఇక్కడ ప్రధానపాత్ర వహించేదే క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ తోనే  మహారాజా అనే సస్పెన్స్ థ్రిల్లర్ ని నిలబెట్టేందుకు ప్రయత్నించాడు దర్శకుడు నిథిలన్ సామినాథన్.


హారాజా భారీగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో కూర్చిన స్క్రీన్ ప్లే. ఈ కూర్పులో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు ఒకే కాలానికి చెందినవి కావు. వివిధ కాలాలకి చెందినవి. అంటే మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకులు. దీన్ని స్క్రిప్టు చేయాలంటే, ముందు కథని స్ట్రెయిట్ నేరేషన్ గా కార్డుల మీద లైన్ ఆర్డర్ వేసుకుని, తర్వాత సస్పెన్సు నిమిత్తం ఏ కార్డులో సీను ఎక్కడ వుండొచ్చో అక్కడ జంబ్లింగ్ చేసుకు పోవడమే. అలా జంబ్లింగ్ చేసిన లైన్ ఆర్డర్ తోనే నాన్ లీనియర్ నేరేషన్ గా స్క్రీన్ ప్లే వస్తుంది.

అయితే ఇలాటి స్క్రీన్ ప్లేలో స్ట్రక్చర్ ని వెతుక్కోవడం పెద్ద పనే. స్ట్రక్చర్ అనేది ఫ్లాష్ బ్యాకుల్లో కాక, రియల్ టైమ్ యాక్షన్ కథతో వుంటుంది. రియల్ టైం యాక్షన్ కథలో బిగినింగ్, మిడిల్, ఎండ్ లని విభజించే ప్లాట్ పాయింట్లు వుంటే, అప్పుడు ఫ్లాష్ బ్యాకులు ఏ ప్లాట్ పాయింటు పరిధిలోకి ఏవి వచ్చాయో తెలుస్తుంది.  ఇలాగాక స్ట్రెయిట్ నేరేషన్ కథలో స్ట్రక్చర్ నేరుగా కనిపిస్తుంది. అది ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ గా వున్నప్పుడు కనిపించదు. పోస్ట్ మార్టం చేసుకోవాల్సిందే.     

స్ట్రక్చర్ ని అలా వుంచి, మహారాజా లో ఈ టైమ్ లైన్లు ఎక్కువై పోవడం వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది. ముఖ్యంగా సెకండాఫ్ లో. టైమ్ లైన్లకి డేట్ స్టాంప్ లేకపోవడంతో ఫ్లాష్ బ్యాక్స్ ని గుర్తుపట్టడం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు మొదట ఈ కథ స్ట్రెయిట్ నేరేషన్ లో ఎలా వుందో తెలుసుకుని, నాన్ లీనియర్ విశ్లేషణ చేద్దాం.

1. స్ట్రెయిట్ నేరేషన్ కథ

2009 లో మహారాజా (విజయ్ సేతుపతి) వృత్తిరీత్యా క్షౌరకుడు. అతడికి భార్య సెల్వి (దివ్యభారతి) తో బాటు రెండేళ్ళ కూతురు జ్యోతి వుంటారు. ఇంకో వైపు సెల్వం (అనురాగ్ కశ్యప్), శబరి (వినోద్ సాగర్) దోపిడీ ముఠాగా ళ్ళ మీద దాడులు చేయడం, దోచుకున్న తర్వాత ఇంట్లో ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి చంపడం చేస్తూంటారు. ఒక రోజు శబరి సెల్వంకి ఫోన్ చేసి, తమ నేరాల గురించి పేర్లు వెల్లడించకుండా దినపత్రికలో వచ్చిందని హెచ్చరిస్తాడు. అప్పుడు సెల్వం గడ్డం ట్రిమ్ కోసం మహారాజా సెలూన్‌లోనే వుంటాడు. మహారాజా ఆ ఫోన్ సంభాషణ వింటాడు. సెల్వం అనుమానంగా చూస్తాడు. గడ్డం ట్రిమ్ చేయించుకుని వెళ్తూ తన రెండేళ్ళ కూతురు అమ్ము (బేబీ షైనిక) కి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న లాకెట్ సెలూన్ లో మర్చిపోతాడు. మహారాజా ఆ లాకెట్ ని ఇచ్చేయడానికి సెల్వం ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పోలీసులు సెల్వంని, శబరిని అరెస్టు చేయడానికి వచ్చేసి వుంటారు. ఆ ఘర్షణలో పోలీసులు శబరిని కాల్చివేసి, సెల్వంని అరెస్టు చేసి తీసికెళ్తారు. సెల్వం నేరాల గురించి తెలియని భార్య కోకిల (అభిరామి) అతడ్ని అసహ్యించుకుని, తాము చచ్చిపోయినా చూడ్డానికి రావద్దని చెప్పేస్తుంది. 

తర్వాత మహారాజా భార్యని
, కూతుర్నీ తీసుకుని, ఆ లాకెట్ ఇచ్చేయడానికి కోకిల ఇంటికి వెళ్తాడు. ఆ
ఇంట్లోకి ఒక ట్రక్కు దూసుకెళ్ళడంతో భార్యతో బాటు కోకిల, ఆమె కూతురూ చనిపోతారు. మహారాజా కూతురు జ్యోతి మాత్రం ప్రమాదం లోంచి బయటపడుతుంది. పడిపోతున్న ఇంటి అటక మీంచి ఒక మెటల్ డస్ట్ బిన్ తలకిందులుగా పడడంతో అందులో ప్రాణాలు దక్కించుకుంటుంది. తర్వాత జ్యోతి పెద్దయ్యాక  (సచనా నమిదాస్)  ఆ చెత్తబుట్టకి  ప్రేమతో లక్ష్మి అని పేరు పెడతారు.

2. 2023 కి వస్తే...
ఇప్పుడు పల్లికరనైలో సొంతింట్లో నివసిస్తూంటాడు బార్బర్ మహారాజా. ఎదిగిన కూతురు జ్యోతి స్కూల్లో స్పోర్ట్స్ లో చురుగ్గా వుంటుంది. ఒక రోజు స్పోర్ట్స్ టీచర్ ఆసిఫా (మమతా మోహన్ దాస్) తో కలిసి కోయంబత్తూరులో స్పోర్ట్స్ క్యాంప్ కి బస్సులో బయల్దేరుతుంది.

తర్వాత ఒక రాత్రి తనని 14 ఏళ్ళ క్రితం జైలుకి పంపాడని అపార్ధం జేసుకున్న సెల్వం ఇప్పుడు జైలు నుంచి తిరిగివచ్చి మహారాజాని చంపడానికి అనుచరులు ధన  (మణికందన్), నల్ల శివం (సింగం పులి) లతో మహారాజా ఇంటికొస్తాడు. మహారాజా ఇంట్లో వుండడు. అప్పుడే కూతురు జ్యోతి  కోయంబత్తూరు నుంచి తిరిగి వస్తుంది.  వాళ్ళు జ్యోతి మీద శారీరకంగా దాడి చేసి కొట్టడంతో  అపస్మారక స్థితిలో కెళ్ళిపోతుంది. నల్లశివం ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేస్తాడు. ముగ్గురూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.

మహారాజా ఇంటికి చేరుకోగానే జ్యోతిని ఆ స్థితిలో చూసి, ఆసుపత్రికి తీసుకువెళతాడు. దీనికి కారణమైన వాడ్ని తనకి చూపించమని ఆమె తండ్రిని అభ్యర్థిస్తుంది. జ్యోతిని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత, మహారాజా ఇంటికి తిరిగి వస్తాడు. చాలా వేదనతో తనని తాను కొట్టుకుని పడిపోతాడు. మేల్కొన్నాక,  అక్కడపడున్న స్థానిక కౌన్సిలర్  కారు నంబర్‌తో కూడిన టోల్ ప్లాజా రసీదుని చూస్తాడు.

సెల్వం అనుచరుడు ధన కారు సర్వీసింగ్ లో పనిచేస్తూంటాడు. అక్కడికి కౌన్సిలర్ కరుణాకరన్ (కళ్యాణ్) వచ్చి  తన కారు లోంచి సన్ గ్లాసెస్ దొంగిలించాడనే ఆరోపణతో ధనని కొట్టి, గ్లాసెస్ తెచ్చివ్వాలని బెదిరిస్తాడు. తర్వాత ధన ఒక బార్‌ కెళ్ళి అక్కడున్న కరుణాకరన్ ని కొట్టి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది ఇక్కడున్న మహారాజా గమనిస్తాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతున్న ధనని అనుసరిస్తాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. తన ఇంటికొచ్చిన సహచరులు ఇంకెవరని మహారాజా అడుగుతాడు. వాళ్ళలో ఒకడు  పోలీస్ స్టేషన్‌లోనే వున్నాడని ధన చెప్పడంతో అతడ్ని చంపేస్తాడు.

మహారాజా ఉదయం పోలీస్ స్టేషన్ కెళ్ళి తన ఇంట్లో లక్ష్మిని దొంగలెత్తుకుపోయారని కంప్లెయింట్ ఇస్తాడు. దొంగల ముఠా తన మీద దాడి చేసి లక్ష్మిని తీసుకెళ్ళి పోయారని మొత్తం సంఘటనని వివరిస్తాడు. తన లక్ష్మిని వెతికిపెట్టమని కోరుతాడు. చెత్త బుట్టని వెతకడమేమిటని పోలీసులు తిట్టి వెళ్ళ గొడతారు. మహారాజా వూరుకోడు. ఐదు లక్షలు ఆఫర్ చేసేసరికి, ఆశ పుట్టి పోలీసులు చెత్త బుట్ట వెతకడానికి ఒప్పుకుంటారు. చెత్త బుట్టని వెతకడంలో పాత నేరస్థుడు, సెల్వం అనుచరుడు నల్లశివం (సింగం పులి) పోలీసులకి తోడవుతాడు.

ఇన్స్ పెక్టర్ వరదరాజన్ (నటరాజ సుబ్రహ్మణ్యం) అధ్వర్యంలో పోలీసులు చెత్తబుట్టని గాలించే పనిలో వుంటారు. నల్లశివం సహాయంగా వుంటాడు. గాలింపు ఫలించక లక్ష్మి ని పోలిన చెత్తబుట్టని తయారు చేయిస్తారు. దీన్ని దొంగిలించిన దొంగగా నటించమని కొందరు దొంగల్ని అడుగుతారు. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇన్స్ పెక్టర్ వరదరాజన్ ఆఫర్ చేసిన 50 వేలకి నల్లశివం దొంగలా నటించడానికి ఒప్పుకుంటాడు.

నల్లశివం తదనుగుణంగా నటించడానికి మొత్తం సంఘటననని మరోసారి వివరించమని ఇన్స్ పెక్టర్ వరదరాజన్ స్పీకర్ ఫోన్‌లో మహారాజానీ కోరతాడు. మహారాజా సంఘటనని అదే పద్ధతిలో వివరిస్తాడు. ఇది నల్లశివంకి వినిపించి, ఇన్‌స్పెక్టర్ వరదరాజన్, అతడి బృందం మర్నాడుదయం చెత్త బుట్ట తిరిగి ఇవ్వడానికి నల్లశివంతో మహారాజా ఇంటికి చేరుకుంటారు. మహారాజా ముందు నల్లశివం తానెలా చెత్తబుట్టని దొంగిలించాడో నటించి చూపిస్తాడు. ఇప్పుడు మహారాజాకి నల్లశివం ఎవరో, ఏం చేశాడో అర్ధమైపోతుంది.  

ఇక వీడికి ఏ శిక్ష వేస్తాడో వేసెయ్యమని మహారాజాకి చెప్పేసి బృందంతో బయటికెళ్ళి పోతాడు ఇన్స్ పెక్టర్ వరదరాజన్. అతను ధన మృతిపై దర్యాప్తు చేస్తూంటే నల్లశివం ధనకి ఫోన్ చేసినట్టు తెలిసింది. తర్వాత మహారాజా కూతురు జ్యోతి గురించి డాక్టర్  సమాచారమివ్వడంతో, విషయం పూర్తిగా అర్ధమైపోయి- నల్లశివం ని మహారాజా దగ్గరికి తీసికెళ్ళేలా ప్లాన్ చేశాడు ఇన్స్ పెక్టర్ వరదరాజన్.

మహారాజా నల్లశివంని చంపేస్తాడు. ఇక మూడో వాడ్ని కనిపెట్టి,మూడో వాడు సెల్వం పనిచేసే నిర్మాణ స్థలం దగ్గరికి చేరుకుంటాడు మహారాజా. ఇద్దరూ కొట్టుకుంటారు. ఇప్పుడు గాయపడి కదలలేని స్థితిలో వున్న సెల్వం దగ్గరికి జ్యోతిని తీసుకొస్తుంది ఆసిఫా. జ్యోతి సెల్వంని తనని ఇలా చేసినందుకు అనాల్సిన మాటలు అని, నువ్వొచ్చింది వీటికోసమేగా అని నగలున్న బ్యాగుని అతడి మీదికి విసిరి వెళ్ళిపోతుంది. సెల్వంకి చిన్నప్పుడు కూతురు అమ్ము పుట్టినరోజున అమ్ము కోసం కొన్న లాకెట్ ఆ నగల్లో వుండడంతో షాక్ అవుతాడు. ఈ జ్యోతి తన అమ్ము అని తెలుసుకుని బావురుమంటాడు. చేసిన పాపానికి పై నుంచి దూకి చచ్చి పోతాడు.

అసలు జరిగిందేమిటంటే, ఆ నాడు సెల్వం అరెస్టు తర్వాత, లాకెట్ ని  తిరిగి ఇవ్వడానికి మహారాజా, భార్య సెల్వి,కూతురు జ్యూతిలతో సెల్వం భార్య కోకిల కొత్త ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన ట్రక్కు ప్రమాదంలో, అమ్ము తప్ప సెల్వి, జ్యోతి, కోకిల చనిపోయారు. మహారాజా అమ్ముని  దత్తత తీసుకుని తన సొంత కూతురు జ్యోతిలా పెంచాడు. ఆ జ్యోతి మీద సెల్వం అత్యాచారానికి ఒడిగట్టాడు.

స్ట్రక్కఃర్ లో ఏది ఎక్కడ?

ఇదీ స్ట్రెయిట్ నేరేషన్ కథ. ఇందులో జ్యోతి మీద అత్యాచారం జరిగే వరకూ బిగినింగ్ విభాగం, అదే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. తర్వాత లక్ష్మిని వెతికి పెట్టమని మహారాజా పోలీస్ స్టేషన్ కెళ్ళడంతో మిడిల్ 1 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మహారాజా ధన ని చంపడంతో మిడిల్ 1 ముగిసి ఇంటర్వెల్ వస్తుంది. తర్వాత ఇన్స్ పెక్టర్ వరదరాజన్ కేసు తాలూకు సంఘటనని మహారాజా చేత  చెప్పించి స్పీకర్ ఫోనులో నల్లశివంకి వినిపించడం దగ్గర మిడిల్ 2 ముగిసి, ప్లాట్ పాయింట్ 2 వస్తుంది. ఆ తర్వాత జరిగేదంతా ఎండ్ విభాగం.

అయితే ఈ స్ట్రెయిట్ నేరేషన్ స్క్రీన్ ప్లేని, నాన్ లీనియర్ మల్టీపుల్ టైమ్ లైన్ స్క్రీన్ ప్లేగా మార్చడంలో జరిగినవి తెలియక చేసిన పొరపాట్లా, లేక ఉద్దేశపూర్వకంగా చేసిన కన్వీనియెంట్ రైటింగా? అయినా గందరగోళం ఎందుకైంది? ఇవీ అసలు తెలుసుకోవాల్సిన విషయాలు.

(రేపు మూడవ భాగం)
—సికిందర్


9, జులై 2024, మంగళవారం

1445 : స్క్రీన్ ప్లే సంగతులు!

 

 

  టిఫానీ యేట్స్ మార్టిన్ అనే రచయిత్రి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల గురించి ఇచ్చిన వివరణలో కొత్త దృక్కోణం వెలుగులో కొస్తోంది. అదేమిటంటే, కథనమంటే రియల్ టైమ్ యాక్షన్ గా నడిచే కథకి సంబంధించిందై వుండాలి గానీ, ఆ రియల్ టైమ్ యాక్షన్ కథకి దారితీసే కథనంగా వుండకూడదు (రియల్ టైమ్ యాక్షన్ కథకి దారితీసే కథనమంటే అది ఫ్లాష్ బ్యాకుగా వచ్చే కథనమే. ఫ్లాష్ బ్యాకుని డ్రీమ్ టైమ్ అని కూడా అంటారు). రియల్ టైమ్ యాక్షన్ కథనాన్ని చెప్పడానికి ఫ్లాష్‌బ్యాకులపై ఎక్కువగా ఆధారపడితే అది ప్రేక్షకుల్ని గందరగోళానికి గురిచేసే, లేదా మొత్తం రియల్ టైమ్ యాక్షన్ కథపై దృష్టిని పలుచన చేసే ప్రమాదంగా కూడా పరిణమిస్తుంది.


        యినా సరే మనకు ఓకే. ఎందుకు ఓకే అంటే ఫ్లాష్ బ్యాకులు లేకుండా మనం ఇండియన్లం జీవించలేని పరిస్థితుల్లో వున్నాం. సినిమాని ఎంజాయ్ చేయడానికి ఇడ్లీలో సాంబారులాగా ఫ్లాష్ బ్యాకులు పడాల్సిందే. సినిమా కళ అసలేం చెప్తోందనేది మనకనవసరం. ఇంకా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు వేసినా ఓకే. అయితే మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులేసినప్పుడు అత్యుత్సాహానికి పోయి ఇంకేం చేస్తే ఇడ్లీ సాంబారు కాస్తా నీళ్ళ చారు అవుతుందో - రచయిత్రి చెప్తోంది. అదేమిటంటే, రియల్ టైమ్ యాక్షన్ కథ చెప్పడానికి వేసే మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో, మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకులు వున్నాయేమో తెలుసుకోవడమే. వుంటే ఆ రియల్ టైమ్ యాక్షన్ కథ కాస్తా ఇంకా గందరగోళమై పోతుంది!
       
మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకులంటే ఒక కాలానికి సంబంధించినవి కాకుండా
, వివిధ కాలాలకి సంబంధించినవి. అంటే, ఆదివారం జరుగుతున్న రియల్ టైమ్ యాక్షన్ కథ చూపిస్తూ, మధ్యమధ్యలో వెనక్కి వెళ్ళి దాని తాలూకు శుక్రవారం జరిగిన ఫ్లాష్ బ్యాకొకటి, తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి మంగళవారం  జరిగిన ఫ్లాష్ బ్యాకొకటి, ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్ళి శనివారం జరిగిన ఫ్లాష్ బ్యాకొకటి, మళ్ళీ తర్వాత వెనక్కొచ్చి బుధవారం జరిగిన... ఇలా ఒక వరుస క్రమం లేకుండా ముందుకీ వెనక్కీ ఉయ్యాలలూపుతూ, వివిధ కాలాల ఫ్లాష్ బ్యాకులేస్తూ పోతే రియల్ టైమ్ యాక్షన్ కథ గందరగోళం కాక ఏమౌతుంది.
       
అప్పుడు ప్రేక్షకులు ముందు మంగళవారం జరిగిన ఫ్లాష్ బ్యాకుకి కంటిన్యూటీగా బుధవారం జరిగిన  ఫ్లాష్ బ్యాకు ఏరుకుని
, దీనికి కంటిన్యూటీగా శుక్రవారం జరిగిన ఫ్లాష్ బ్యాకు జోడించుకుని, మళ్ళీ దీనికి కంటిన్యూటీగా శనివారం జరిగిన ఫ్లాష్ బ్యాకూ... ఇలా ఒక వరస క్రమంలో పేర్చుకుని, అప్పుడు ఆదివారం జరుగుతున్న రియల్ టైమ్ యాక్షన్ కథకి కనెక్ట్ చేస్తేగానీ అసలు కథ పూర్తిగా అర్ధం గాదన్న మాట!
       
ఈ పని చేయగలరా ప్రేక్షకులు
? సినిమా కొచ్చింది ఎంజాయ్ చేయడానికా, పరీక్ష రాయడానికా? ఇదే జరిగింది హిట్టయిన మహారాజా స్క్రీన్ ప్లేతో. మరి ఇంత గందరగోళంగా వున్నా ఎలా హిట్టయ్యింది? దీనికి ఒకే కారణముంది, అది చివర్లో చెప్పుకుందాం.

(రేపు రెండవ భాగం)

—సికిందర్ 

4, జులై 2024, గురువారం

1444 : హాలీవుడ్ రివ్యూ!


 

దర్శకత్వం : జార్జ్ మిల్లర్
తారాగణం : అన్యా టేలర్ జాయ్, క్రిస్ హేమ్స్ వర్త్, చార్లీ ఫ్రేజర్, ఐలా బ్రౌనీ, చార్లీజ్ థెరాన్, టాం బర్క్ తదితరులు
రచనా : జార్జ్ మిల్లర్, నికో లాథౌరిస్, సంగీతం: టామ్ హోల్కెన్‌బర్గ్, ఛాయాగ్రహణం: సైమన్:
బ్యానర్స్ :  కెనెడీ మిల్లర్ మిషెల్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్
స్ట్రీమింగ్ : జులై 4, బుక్ మై షో
***

            2015లో విడుదలైన  మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్యాక్షన్ ఫ్రాంచైజీకి ప్రీక్వెల్  ఫ్యూరియోసా: మ్యాడ్ మాక్స్ సాగా’. ఆస్ట్రేలియన్ దర్శకుడు జార్జ్ మిల్లర్ గత 45 సంవత్సరాల నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తూనే వున్నాడు. 1979 లో మొదటి  మ్యాడ్ మాక్స్’(తెలుగులో చిరంజీవితో యమకింకరుడు’), 1981 లో మ్యాడ్ మాక్స్ 2 : ది రోడ్ వారియర్’, 1985 లో మ్యాడ్ మాక్స్ : బియాండ్ థండర్ డోమ్’, 2015 లో మ్యాడ్ మాక్స్ : ఫ్యూరీ రోడ్’, ఇప్పుడు 2024 లో ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మాక్స్ సాగా మొదలైనవి. మెల్ గిబ్సన్ మొదటి మూడిట్లో టైటిల్ పాత్ర పోషించాడు. నాల్గవ ఫ్రాంచైజీలో టామ్ హార్డీ టైటిల్ పాత్ర పోషిస్తే, ఇప్పుడు ఐదవ ఫాంచైజీలో అన్యా టేలర్ జాయ్ పోషించింది. ఇవి ప్రధానంగా ఇకోసైడ్ (పర్యావరణ హననం) అనంతర జీవన్మరణ పోరాట రోడ్ యాక్షన్ మూవీస్. నాల్గవ భాగానికి ముందు కథ (ప్రీక్వెల్) గా వచ్చిన ఈ  అయిదవ భాగం గత మేలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, జులై 4 నుంచి బుక్ మై షోలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదెలా వుందో చూద్దాం...

కథ   

పర్యావరణం హరించుకుపోయి, నీరూ తిండి గింజలు లభించక భూమి ఎడారిగా మారిన సుదూర భవిష్యత్తులోకి తొంగిచూసే కథ ఇది. మళ్ళీ మానవ నాగరికత జీరోనుంచి ప్రారంభమవుతూ, జీవన్మరణ పోరాటం చేస్తున్న సమూహాల మధ్య వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్న సమయం. అయితే ఆస్ట్రేలియాలో గ్రీన్ ప్లేస్ అనే ప్రాంతం మాత్రం క్షామాన్ని తట్టుకుని మంచి నీరుతో, పచ్చటి పొలాలతో మిగిలివుంది. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఆవాసాలేర్పర్చుకున్నాయి. ఇక్కడి ఫ్యూరియోసా (చైల్డ్ ఆర్టిస్టు ఐలా బ్రౌనీ), వాల్కైరీ అనే ఇద్దరు పిల్లలు అడవిలోకి వెళ్ళి  చెట్లకి కాసిన పళ్ళు కోసుకుంటున్నప్పుడు, ఫ్యూరియోసాకి దూరంగా విశ్రమించిన బైక్ రైడర్లు కనిపిస్తారు. వాళ్ళు గ్రీన్ ప్లేస్ వైపే వచ్చి కబ్జా చేస్తారని భావించిన ఫ్యూరియోసా, ధైర్యం చేసి వాళ్ళ బైకుల్లో పెట్రోలు తీసేస్తున్నప్పుడు దొరికిపోతుంది.
       
దీంతో ఫ్యూరియోసాని
తమ నాయకుడు డిమెంటస్ (క్రిస్ హేమ్స్ వర్త్) కి బహుమతిగా అందించాలని తీసికెళ్ళిపోతూంటే ఆమె తల్లి మేరీ (చార్లీ ఫ్రేజర్) వెంబడిస్తుంది. డిమెంటస్‌ స్థావరంలో ఫ్యూరియోసాని  గ్రీన్ ప్లేస్ లొకేషన్‌  చెప్పమని బాధిస్తున్నప్పుడు మేరీ ఎటాక్ చేసి తీసికెళ్ళి పోతుంది. డిమెంటస్ ఆమెని వెంబడించి దారుణంగా ఫ్యూరియోసా కళ్ళముందే చంపేస్తాడు. దీనికి ముందు ఫ్యూరియోసాకి మేరీ ఎలాటి నిస్సారవంతమైన భూమిలోనైనా మొలకెత్తే విత్తనాన్ని ఇస్తుంది.
       
బాల్యంలో ఈ అనుభవంతో ఫ్యూరియోసా తన తల్లిని చంపిన డిమెంటస్ మీద ప్రతీకారంతో పెరుగుతుంది. రాజ్యాలు మారుతూ మగపిల్లవాడి వేషంలో ఎదిగి
, 15 సంవత్సరాల తర్వాత ధైర్యసాహసాలున్న యువతి (అన్యా టేలర్ జాయ్) గా డిమెంటస్ మీద ప్రతీకారం తీర్చుకోవడం మొదలెడుతుంది.

రెండున్నర గంటల ఇన్నోవేటివ్ యాక్షన్!

సూటిగా చెప్పుకుంటే ఇది తల్లిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకునే కథ. దీని బ్యాక్ డ్రాప్ భవిష్యత్తులోకి తీసికెళ్ళి చూపించే, మృతప్రాయంగా మిగిలిన పర్యావరణంతో  ఏడారులుగా మారిన భూభాగాలపై తిండి కోసం, నీటి కోసం జరిగే యుద్ధాలతో విస్తృత కథ. డిమెంటస్ రాజ్యం ఒకటి, సిటాడెల్ రాజ్యం ఒకటి, వీళ్ళకి గ్రీన్ ప్లేస్ ఎక్కడుందో లొకేషన్ కావాలి. అది చెప్పదు ఫ్యూరోసియా. ఆమె తల్లి ఎలాటి ఎడారిలోనైనా మొలకెత్తే విత్తనం ఒకటి ఇస్తుంది. డిమెంటస్ ని చంపి పగ దీర్చుకున్నాక, ఆ విత్తనంతో  ముగింపు సీను పోయెటిక్ గా వుంటుంది...
        
ఇందులో దాదాపు ఫస్టాఫ్ ఫ్యూరియోసా  బాల్యం గురించే వుంటుంది. ఇంటర్వెల్ కి ముందు ఎదిగిన ఫ్యూరియోసా పాత్రలో అన్యా టేలర్ జాయ్ వస్తుంది. అక్కడ్నుంచి పగదీర్చుకునే ఆమె కథ మొదలవుతుంది. ఇలా దాదాపు ఫస్టాఫ్ వరకూ ప్రధాన పాత్ర బాల్యాన్నే చూపడం ఈ సినిమాలోనే చూస్తాం. ఇదొక కొత్త ప్రయోగమేమో.
       
ఈ కథ ఐదు చాప్టర్లుగా వుంటుంది.
ప్రతి ఒక్కటి మునుపటి దానికన్నా దిట్టంగా వుంటుంది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్, సౌండ్ అన్నీ వినూత్నంగా వుంటాయి. యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవల్లో వుంటాయి. వార్ రిగ్ చేజ్ సీను, మోటరైజ్డ్ పారాషూట్‌లతో దాడి చేసేవారిని తప్పించుకునే థ్రిల్లింగ్ రైడర్ సీన్లు జలదరింపజేస్తాయి. యాక్షన్ ఆర్టిస్టులు గాలిలో  డ్యాన్స్ చేస్తూ, ఉత్కంఠరేపే ఖచ్చితత్వంతో, టైమింగ్ తో దూసుకుపోతున్న ట్రక్కుని క్రాస్ చేస్తున్నప్పుడు కలిగే థ్రిల్ మాటల్లో చెప్పలేం. అధ్యంతం  ఎడారి రోడ్ల మీద చిత్ర విచిత్ర విడిభాగాలు కూడేసి నిర్మించుకున్న వాహనాల ఛేజింగులే ఈ సినిమా. మొదట్నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలంటే వాహనాల ఛేజింగులే. ఈ ఛేజింగుల్ని  సినిమా సినిమాకీ కొత్త అయిడియాలతో సృష్టించడం జార్జ్ మిల్లర్ మేధకి అద్దం పడతుంది. 
       
హీరోయిన్ ఫ్యూరియోసా పాత్రలో అన్యా టేలర్
, జాయ్, విలన్ డిమెంటస్ పాత్రలో  క్రిస్ హెమ్స్ వర్త్ గుర్తుండిపోయే కొన్ని దృశ్యాలకి నటననంతా ధారబోశారు.  ఇతర పాత్రల్లో ప్రతిఒక్కరూ, సైన్యాల పాత్రల్లో జూనియర్ ఆర్టిస్టులూ ఈ మంటలు చిమ్మే మెగా యాక్షన్ సాగా లో ప్రాణాలకి తెగించి చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయి.
       
దూసుకెళ్తున్న వార్ రిగ్ మీద దాడి చేసే యాక్షన్ సీనుని 200 మంది ఫైటర్లతో 78 రోజులు షూట్ చేసినట్టు దర్శకుడు జార్జ్ మిల్లర్ చెప్పాడు. ఇలాటి షూటింగ్ విశేషాలెన్నో వున్నాయి. ఇది రెండున్నర గంటల ఇన్నోవేట్ (నూతన కల్పన) చేసిన హైపర్ యాక్షన్ మూవీ.
45 ఏళ్ళుగా మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తున్న ఆస్ట్రేలియన్ జార్జి మిల్లర్ దర్శకుడిగా ఔట్ డేటెడ్ అయిపోకుండా, ఇప్పుడొస్తున్న హాలీవుడ్ సినిమాలకి తీసిపోకుండా తీశాడు. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మాక్స్ సాగా తప్పక చూడాల్సిన ఫ్యూచరిస్టిక్ సినిమాల్లో ఒకటి.

—సికిందర్

1, జులై 2024, సోమవారం

1443 : మలయాళం రివ్యూ!

 

దర్శకత్వం : విపిన్ దాస్
తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనస్వర రాజన్
రచనా : దీపూ ప్రదీప్, సంగీతం : అంకిత్ మీనన్, ఛాయాగ్రహణం : నీరజ్ రేవీ
బ్యానర్: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్,4 ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు :  సుప్రియా మీనన్, ముఖేష్ మెహతా, సీవీ పార్థసారథి
విడుదల : జూన్ 28, 2024 (అమెజాన్ ప్రైమ్)
***

        టీవల పెద్ద హిట్టయిన ఆడుజీవితం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మూడు హిట్టయిన సినిమాల దర్శకుడు, నటుడు  బేసిల్ జోసెఫ్ జోడీగా నటించిన గురువాయూరంబాల నడాయిల్ (గురువాయూర్ ఆలయం) మలయాళ మూవీ, 2024 మేలో విడుదలై ఈ సంవత్సరం హిట్టయిన 8 మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు వెర్షన్ సహా. దీని దర్శకుడు విపిన్ దాస్ మూడు హిట్లు తీసి, నాల్గవ హిట్ తో ముందుకొచ్చాడు. పెళ్ళి చుట్టూ ఓ కామెడీ తీసి హిట్ చేసిన ఈ దర్శకుడి కళ ఏమిటో తెలుసుకుందాం...

కథ
గురువాయూర్ కి చెందిన వినూ రామచంద్రన్ (బాసిల్ జోసెఫ్) దుబాయిలో ఉద్యోగం చేస్తూంటాడు. అతడికి అంజలి (అనస్వర రాజన్) తో నిశ్చితార్థం జరుగుతుంది. జంషద్ పూర్ లో అంజలి అన్న ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఉద్యోగం చేస్తూంటాడు. అతడితో వినూకి సన్నిహిత పరిచయమేర్పడుతుంది. వినూ పూర్వం పార్వతి (నిఖిలా విమల్) ని ప్రేమించి విఫలమయ్యాడు. ఆమె మోసం చేసిందని కోపం పెంచుకుని ముందుకు సాగలేక పోతూంటాడు. గతాన్ని మర్చిపొమ్మని వినూకి ఆనంద్ నచ్చజెప్తాడు. ఆనంద్ కి కూడా ఓ సమస్య వుంటుంది. భార్య పార్వతికి ఒక ప్రేమలేఖ రావడంతో గొడవపడి పుట్టింటికి పంపేశాడు. ఇది తెలుసుకుని వినూ ఆనంద్ కి నచ్చజెప్పి పార్వతిని తెచ్చుకునేలా చేస్తాడు.
       
ఇలా పరస్పరం ఇద్దరి సమస్యలు తీర్చుకున్నాక
, వినూ పెళ్ళికి బయల్దేరి వచ్చి ఆనంద్ ని కలుస్తాడు. కలిస్తే అతడి భార్య మరెవరో కాదు, తనని మోసం చేసిన పార్వతే. ఈ మోసగత్తె కుటుంబంతో పెళ్ళి వద్దనుకుని ఫ్రెండ్స్ సహాయంతో తన పెళ్ళి చెడగొట్టుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో అంజలికి దొరికిపోయి విషయం చెప్పేస్తాడు. అంజలి అతడ్ని పెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్తుంది. రాజీ పడతాడు.

ఇంతలో పెళ్ళి చెడగొట్టడానికి ముందు ఒప్పుకోని వినూ ఫ్రెండ్ ఒకడు, ఇప్పుడు ఆనంద్ దగ్గరికెళ్ళి- మీ ఆవిడకి వినూ మాజీ ప్రియుడని చెప్పేస్తాడు. దీంతో అసలే కోపిష్టి అయిన ఆనంద్ అతడ్నీ, వినూనీ పట్టుకుని చిత్తుగా తన్ని పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు.
       
వినూ ఎదురు తిరిగి అనుకున్న ముహూర్తానికి గురువాయూర్ ఆలయంలో నీ చెల్లెలికి తాళి కట్టేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఎలా కడ్తావో చూస్తానని ఆనంద్ ఎదురు ఛాలెంజీ చేస్తాడు. ఇప్పుడేం జరిగింది
? ఇప్పుడు తన చెల్లెలితో వినూ పెళ్ళిని చెడగొట్టడానికి ఆనంద్ ఏఏ విఫల యత్నాలు చేశాడు? ఇంకా వినూ పాత విరోధులు ఒకరొకరే ముందుకొచ్చి పెళ్ళిని చెడగొట్టడానికి ఏఏ పథకాలేశారు? ఎప్పుడో గతంలో ఫ్రెండ్ శరవణన్ (యూగిబాబు) శోభనం రాత్రి పాల గ్లాసులో గొడ్డు కారం వేసి పెళ్ళి చెడగొట్టిన వినూ జీవితంలోకి ఆ శరవణన్ కక్ష గట్టుకుని పెళ్ళికి వచ్చి ఏం చేశాడు? గురువాయూర్ ఆలయంలో రసాభాస ఎలా జరిగింది? డ్రోన్ వచ్చి తాళినెలా ఎగరేసుకుపోయింది? అప్పుడేం జరిగింది? ఆనంద్ భార్యకి ప్రేమ లేఖ రాసిందెవరు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

 వెడ్డింగ్ కామెడీ కథ ఇది. ఇందులో ప్రేమలు, డ్యూయెట్లు, ప్రేమలో సమస్యలు వగైరా వుండవు. అందుకని ఇది రోమాంటిక్ కామెడీ గానీ, రోమాంటిక్ డ్రామా గానీ కాదు. నేరుగా పెళ్ళి కథ మాత్రమే చెప్పదలిచాడు. కాబట్టి ఇందులో రోమాంటిక్ కామెడీ లేదా రోమాంటిక్ డ్రామా తాలూకు సీన్లని జొరబడనీయలేదు. వాటిని ఫిల్టర్ చేసి స్పష్టంగా వెడ్డింగ్ కామెడీ జా నర్ మర్యాదకి ఏం ఎలిమెంట్స్ కావాలో అవి మాత్రమే ప్రయోగించాడు. ఇది ప్రధానంగా పెళ్ళికి అటూ ఇటూ జట్టు కట్టిన శక్తులు సృష్టించే కాన్ఫ్లిక్ట్ చుట్టూ తిరిగే కథ. అందుకని ఈ కాన్ఫ్లిక్టే హైలైట్ అయ్యేలా రెండు మూడు వేర్వేరు సీన్లని కలిపి ఇంటర్  కట్స్ లో చూపిస్తూ థ్రిల్ నీ, స్పీడునీ, కామెడీనీ పెంచుతూ పోయాడు. దీంతో పాటు కథనంలో డైనమిక్స్ ని ప్రయోగించాడు. ఒక సీన్లో అనుకూలంగా జరిగితే వెంటనే తర్వాతి సీన్లో వ్యతిరేకంగా జరిగే డైనమిక్స్. ఈ ఇంటర్ కట్స్ తో బాటు డైనమిక్స్ వల్ల కథనంనిత్యం చలనంలో వుంటూ, ఫైర్ అవుతూ వుంటుంది. దీంతో ఈ రెండుంపావు గంటల వెడ్డింగ్ కామెడీ మంచి వినోద కాలక్షేపంలా తయారయ్యింది.
       
ఫస్టాఫ్ వినూ పాత్ర ఇష్టం లేని తన పెళ్ళిని చెడగొట్టుకునే కథ
, సెకెండాఫ్ పెళ్ళికి సిద్ధ పడితే ఇతరులు ఆ పెళ్ళిని చెడగొట్టే కథ. ఈ రెండిటి మధ్య నలిగే వినూ కామెడీ పాట్లు. మధ్యలో తనతో విశసంగా లేదని భావిస్తున్న భార్య పార్వతితో ఆనంద్ పాట్లు. ఈ పాయింటుతో ఆనంద్- వినూల మధ్య శతృత్వం. ఈ గొడవల్లో వినూతో లేచిపోతనని పెళ్లికూతురు అంజలి బ్లాక్ మెయిల్. ఈ ప్రధాన పాత్రల చుట్టూ చేరి  రసాభాస చేసే ఇతర  పాత్రలు. ఈ పాత్రల్లో ఒక ఆడ పాత్ర కూడా వుంటే కాన్ఫ్లిక్ట్ కి యూత్ అప్పీల్ వచ్చేది.
       
క్లయిమాక్స్ గురువాయూర్ టెంపుల్ లో యాక్షన్ సీన్లు
, డ్రోన్ ఎంట్రీ, తాళి గల్లంతు వగైరా. ఆద్యంతం నవ్వించడమే పనిగా పెట్టుకున్న ఈ వెడ్డింగ్ కామెడీ ప్రియదర్శన్ కామెడీ సినిమాల్ని గుర్తుకు తెస్తుంది.

నటనలు –సాంకేతికాలు

పృథ్వీరాజ్ సుకుమారన్ ఎప్పటిలాగే హుషారుగా పాత్ర పోషించాడు. కోపిష్టి పాత్ర కావడంతో బల ప్రయోగం కూడా చేస్తాడు. ఎత్తుగడలు వేసినప్పుడు యాక్షన్ లోకొచ్చి కథని మలుపులు తిప్పుతూంటాడు. ఈ కథకి హీరో బేసిల్ జోసెఫ్. పృథ్వీరాజ్ వ్యతిరేక పాత్ర. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణతో నడుస్తూంతుంది కథ. పృత్వ్హీరాజ్ సీరియస్ పత్రాయితే జోసెఫ్ కామెడీ పాత్ర. ఈ డైనమిక్స్ కూడా బాగా పనికొచ్చాయి. జోసెఫ్ కామెడీ పాట్లు సున్నిత హాస్యంతో తెలివిగా నటించాడు.
       
పృథ్వీరాజ్ భార్యగా ఆకాశరామన్న ప్రేమ లేఖతో అపార్ధానికి గురయిన పాత్రలో నిఖిల జరుగుతున్న తతంగం సీరియస్ గా గమనిస్తూ వుంటుంది. ఎక్కువ మాట్లాడదు. జోసెఫ్ పెళ్ళి చేసుకునే అంజలి పాత్రలో అనస్వర  కేర్ ఫ్రీగా వుంటుంది. ఇక అటూ ఇటూ కుటుంబ పాత్రలు
,  వూళ్ళో మేకవన్నె పులుల్లాంటి పాత్రలూ చాలా వున్నాయి.
       
ఇక పాటలు
, లొకేషన్లు, కెమెరా వర్క్ సున్నిత కామెడీకి తగ్గట్టు సాఫ్ట్ గా కనిపిస్తాయి.       కథనానికి దర్శకుడు విపిన్ దాస్ వాడిన క్రియేటివిటీయే ఈ వెడ్డింగ్ కామెడీకి బాక్సాఫీసు బలాన్నిచ్చింది.

—సికిందర్