రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, మే 2023, సోమవారం

1335 : రివ్యూ!


రచన- దర్శకత్వం : ఎం ఎస్ రాజు
నటీనటులు : నరేష్, పవిత్రా లోకేష్, వనితా విజయ్ కుమార్, జయసుధ, శరత్ బాబు, అన్నపూర్ణ, రవివర్మ తదితరులు
సంగీతం : సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం : అరుళ్ దేవ్, ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల రెడ్డి
నేపథ్య సంగీతం : అరుల్ దేవ్!స్వరాలు : సురేష్ బొబ్బిలి 
నిర్మాత : నరేష్  
విడుదల : మే 26, 2023
***

టుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ల రిలేషన్ షిప్ వివాదం కొన్ని సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. నరేష్, పవిత్రా లోకేష్, నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతిల మధ్య వివాదం బెంగుళూరు హోటల్ కి చేరి, రచ్చ జరిగి తాత్కాలికంగా ఓ ముగింపుకొచ్చింది. ఇంకా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన సమస్యలున్నాయి. దీన్ని నరేష్ సినిమాగా నిర్మించాలనుకుని, ప్రముఖ నిర్మాత - దర్శకుడు ఎంఎస్ రాజుతో కలిసి తెరకెక్కించారు. ఈ మధ్య అడల్ట్ సినిమాలు తీస్తున్న ఎంఎస్ రాజు ఈ మిడిలేజి రిలేషన్ షిప్ కథని నరేష్- పవిత్రల రిలేషన్ షిప్ బయోపిక్ అన్నట్టుగా తన సృజనాత్మక శక్తితో తీర్చి దిద్దారు. ఇలాటి బయోపిక్ తోనే పూర్వం యశ్ చోప్రా హిందీలో ఒక క్లాసిక్ నిచ్చారు. మరి ఎం ఎస్ రాజు ఏమిచ్చారో చూద్దాం...

కథ
ఈ కథ 5 చాప్టర్లుగా వుంటుంది. మొదటి చాప్టర్ The Flirting లో ప్రముఖ సినిమా నటుడుగా వున్న నరేంద్ర (నరేష్) షూటింగులో నటి పార్వతి (పవిత్రా లోకేష్) ని చూసి మనసు పారేసుకుంటాడు. క్రమంగా దగ్గరవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అయిష్టంగా వుంటుంది.

The Mistake అనే రెండో చాప్టర్లో నరేంద్ర కుటుంబ జీవితం వుంటుంది. నరేంద్రకి మూడో భార్య  సౌమ్యా సేతుపతి (వినితా విజయ్ కుమార్) ఓ కొడుకూ వుంటారు. సౌ మ్యని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితుల దగ్గర్నుంచి ఆమె అసలు రంగు బయటపడే ఘట్టం వరకూ ఈ చాప్టర్ వుంటుంది. కేవలం డబ్బు కోసం పెళ్ళి చేసుకున్న సౌమ్య తో నరేంద్రకి మనశ్శాంతి వుండదు. కొడుకు విషయంలో గొడవ జరిగే సరికి విడాకుల దాకా పోతుంది. 

My Story
అనే మూడో చాప్టర్లో సినిమా రచయిత ఫణీంద్ర (విజయ్ వర్మ) తో సహజీవనం చేస్తున్న పార్వతి, ఆమె ఇద్దరు పిల్లల జీవితం వుంటుంది. ఆస్తి కోసం ఫణీంద్ర ఆమెని వేధిస్తూంటాడు. ఈ వేధింపులు భౌతిక దాడికి దారితీస్తాయి.

Krishna’s Story
అనే నాల్గో చాప్టర్లో నరేంద్ర, పార్వతి ఇంటికెళ్ళి ఫణీంద్రకి బుద్ధి చెప్పి, ఇంట్లోంచి వెళ్ళ గొట్టిస్తాడు. పార్వతిని చేపడతాడు.
        
The Conflict అనే ఐదో చాప్టర్లో నరేంద్ర పార్వతితో కలిసి వుండడంతో భార్య సౌమ్య, ఫణీంద్రతో కలిసి ఓ కుట్రకి ప్లాన్ చేస్తుంది. బెంగుళూరు హోటల్లో పోలీసుల సాయంతో నరేంద్ర ఈ కుట్రని తిప్పికొట్టి, విజయగర్వంతో పార్వతిని తీసుకుని వెళ్ళిపోతాడు.
       
ఇలా అయిదు చాప్టర్లుగా చూపించిన ఈ బయోపిక్ లో
, ఇది వరకే పబ్లిక్ డొమైన్ లో వున్న నరేష్- పవిత్రల రిలేషన్ షిప్ కథని పబ్లిక్ డొమైన్ లో వున్నట్టుగానే చూపించారు-  పబ్లిక్ డొమైన్ లో లేనిది
My Story అనే మూడో చాప్టర్లో ఫణీంద్రతో పవిత్రా లోకేష్ సహజీవన కథే.

ఎలావుంది కథ

1981 లో యశ్ చోప్రా సిల్సిలా కథ తయారు చేసుకున్నప్పుడు అది కల్పిత కథ. అయితే అప్పట్లో జయా బచ్చన్‌ ని  వివాహం చేసుకున్న అమితాబ్ బచ్చన్ కి రేఖ తో  సంబంధం గురించి ఊహాగానాలు పత్రికల్లో మోతెక్కేవి. ఇది తన కథ లాగే వుందనుకున్న చోప్రా, వాళ్ళు ముగ్గుర్నీ నటించడానికి ఒప్పించాడు. దీంతో ఈ సినిమా వాళ్ళు ముగ్గిరి కథే అన్నట్టుగా ప్రచారం జరిగి సూపర్ హిట్టయ్యింది.
       
అయితే పత్రికల్లో వస్తూ వున్న చెత్త గాసిప్స్ కి ఇన్స్పైర్ అవకుండా
, చోప్రా ఈ ట్రయాంగులర్ రిలేషన్ షిప్ కథని మనో విశ్లేషణతో, సున్నిత కథగా మంచి విలువలతో ఆవిష్కరించాడు. కానీ స్వయంగా పబ్లిక్ డోమైన్లో వున్న నరేష్ కి డీసెన్సీ ని ప్రదర్శించడం సినిమాలో సాధ్యం కాలేదు. మూడో భార్యని వెనుక నుంచి తన్నే సీను దగ్గర్నుంచీ, బెంగుళూరు హోటల్ సంఘటనలో చీప్ టేస్టు ప్రదర్శించడం వరకూ దూకుడుగా చిత్రీకరించుకున్నాడు. మొత్తం ఈ బయోపిక్ ని తన వైపు నుంచే చెప్పాడు తప్పితే అవతలి మూడో భార్య వైపు నుంచి విషయమేమిటో మనకి తెలీదు. కాబట్టి ఇది ఏకపక్షంగా చూపించిన బయోపిక్ అయింది. ఈ బయోపిక్ లో నరేష్ పోషించిన నరేంద్ర పాత్ర దక్షత కలిగిన పరిష్కర్తగా వుండాల్సింది వుండదు.
       
ఈ కథని ఎంఎస్ రాజు తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుని
, స్టేక్ హోల్డర్స్ ముగ్గుర్నీ సమన్వయం చేసి సమగ్ర కథ చెప్పాల్సింది. సిల్సిలా లోనైతే స్టేక్ హోల్డర్స్ ముగ్గురూ ప్రత్యక్ష్యంగా పాల్గొనడంతో ప్రేక్షకులకి సందేహాలు మిగల్లేదు.

నటనలు- సాంకేతికాలు

తమ బయోపిక్ లో తామే నటించిన నరేష్, పవిత్రలకి నటించే అవసరం రాలేదు, నిజజీవితంలో తమ అనుభవాల్ని తాము జీవించ గలరు కాబట్టి. అయితే ఈ పాత్రల్ని మిడిలేజి రిలేషన్ షిప్ మర్యాదలకి దూరం పోకుండా, సినిమాటిక్ రోమాన్సులు చేయకుండా, సంయమనం పాటించడంతో పాత్రలు నీటుగా కన్పిస్తాయి. నరేష్ పాత్ర మాత్రం తప్పంతా మూడో భార్యదే అన్నట్టు సానుభూతిని సృష్టించుకుని, పవిత్రతో రిలేషన్ షిప్ ని జస్టిఫై చేసినట్టు, లైసెన్సు పొందినట్టు వుంది.

పవిత్ర కూడా తానెంతో మంచి మనసుగల మనిషి అన్నట్టు లుక్కిస్తూ పాత్రకి తగ్గట్టు హూందాగా నటించింది. ఇక మూడో భార్యకి పెట్టాల్సిన అవలక్షణాలన్నీ పెట్టేశారు. పూర్తిగా సినిమాటిక్ విలనే. చివరి చాప్టర్లో వనితా విజయ్ కుమార్ ఈ పాత్రలో చాలా హంగామా చేస్తుంది. హీరో కృష్ణగా శరత్ బాబు
, విజయనిర్మలగా జయసుధ నటించారు.

సాంకేతికంగా నరేష్ మంచి పెట్టుబడి పెట్టారు. చాలా రిచ్ లుక్ వచ్చింది. సంగీతమే ఈ రిచ్ లుక్ తో అంతగా  పోటీ పడలేదు. దర్శకత్వంలో ఈ సారి ఎం ఎస్ రాజు ఓ మెట్టు పైకెక్కారు- అయితే చాప్టర్ల వారీ కథాకథనాల్లో అంతగా బలం లేదు. న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నట్టు వుంది.
—సికిందర్