రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, April 13, 2025

1374 : రివ్యూ!

 

జాక్- కొంచెం క్రాక్
రచన- దర్శకత్వం : బొమ్మరిల్లు భాస్కర్
తారాగణం : సిద్ధూ జొన్నలగడ్డ,  వైష్ణవీ చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, సుబ్బరాజ్ తదితరులు
సంగీతం : అచ్చు రాజమణి, శ్యామ్ సీఎస్,  ఛాయాగ్రహణం :  విజయ్ కె చక్రవర్తి
బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర
నిర్మాతలు : బివిఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు
విడుదల : ఏప్రెల్ 10, 2025
***

డీజే టిల్లూ’, టిల్లూ స్క్వేర్ లతో తనదైన కల్ట్ క్యారక్టర్ ఒకటి క్రియేట్ చేసుకున్న సిద్దూ జొన్నలగడ్డ, సారి స్పై కామెడీని ప్రయత్నిస్తూ అభిమానుల ముందుకొచ్చాడు. 20 ఏళ్ళ క్రితం బొమ్మరిల్లు తీసిన దర్శకుడు భాస్కర్ తో కలిసి, ఇద్దరికీ కొత్త అయిన స్పై కామెడీ జానర్ ని శాంపిల్ గా ప్రయత్నించి చూశాడు. మరి శాంపిల్ తాను యాక్షన్ సినిమాలకి అప్ గ్రేడ్ అవడానికి  అనుమతించే ఫలితాలతో వుందా, లేక వద్దు -ఈ జోన్ లోకి రావొద్దు అనే విధంగా వార్నింగ్ ఇస్తోందా తెలుసుకుందాం...

కథ
పాబ్లో నెరూడా అలియాస్ జాక్ {సిద్ధూ జొన్నలగడ్డ) ఇంటి దగ్గర తండ్రి (నరేష్) ని విసిగిస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటాడు. చేసే పనిలో ఫన్ లేకపోతే నరకంలా వుంటుందని భావిస్తాడు. జాబ్ ఇంటర్వ్యూల్లో అలాటి ఫన్లు చేసి గెటవుట్ అనిపించుకుంటూ వుంటాడు. ఇతనేమిటో అర్ధంగాక  డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే ఖజామియా చేత నిఘా పెట్టిస్తాడు తండ్రి. అలా ఖాజామియా (బ్రహ్మాజీ) కూతురు డిటెక్టివ్ అఫ్సానా (వైష్ణవీ చైతన్య) జాక్ మీద నిఘా పెడుతుంది. చివరికి జాక్ రా (గూఢచార సంస్థ రీసెర్చి అండ్ ఎనాలిసి వింగ్’) ఇంటర్వ్యూ కెళ్ళి వస్తాడు. ఆ ఇంటర్వ్యూ రిజల్టు ఇంకా రాకముందే- ఆపరేషన్ బటర్ ఫ్లై పేరుతో టెర్రరిస్టుల్ని పట్టుకునే పని మొదలు పెట్టేస్తాడు. ఈ టెర్రరిస్టులు దేశంలో ప్రధాన నగరాల్లో పేలుళ్ళు జరిపేందుకు కుట్ర చేస్తూంటారు.
        
ఈ కుట్రని జాక్ ఎలా భగ్నం చేశాడు
? రా లో ఉద్యోగం రాకుండానే ఆపరేషన్ చేపట్టిన ఇతడికి రా అధికారి (ప్రకాష్ రాజ్) తో ఎలాటి సమస్య లెదురయ్యాయి, జాక్ చేస్తున్న పని తెలుసుకున్న అఫ్సానా ఏం చేసింది, ఆఖరికిరా సంస్థ జాక్ కి ఉద్యోగమిచ్చి సత్కరించిందా లేదా అనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఒకప్పుడు ఎన్నోసార్లు వచ్చేసిన టెర్రరిస్టుల్ని పట్టుకునే రొటీన్ కథే. టెర్రరిజం, నక్సలిజం, కమ్యూనిజం, ముంబాయి మాఫియాయిజం సినిమాలు గత  చరిత్ర అయ్యాక  తీరుబడిగా వచ్చింది. అయితే అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, ఇది ఏ జానర్ కథో నటించిన  హీరోకీ, దర్శకుడికీ తెలిసినట్టు లేదు. తెలుసుకుని వుంటే ఇద్దరూ కే ట్రాకు మీద వుంటూ ఎంతో కొంత సినిమాని కాపాడే వాళ్ళు. ఇద్దరూ ఇది స్పై కామెడీ కథ అని తెలుసుకోకపోవడంవల్ల చెరోవైపు పట్టుకు లాగారు. తీరా సినిమా అట్టర్ ఫ్లాప్ అన్పించుకున్నాక హీరో ఇన్వాల్మెంటే ఫ్లాప్ కి కారణమంటూ ఆరోపణలు మొదలెట్టుకున్నారు. కానీ హీరోకి దీని జానర్ గురించి నాలెడ్జి లేకపోయినా, అతను ఏం చేయడానికి ప్రయత్నించాడో అది కరెక్టే. జానర్ నాలెడ్జి లేకపోవడంతో దర్శకుడు చేసింది తప్పు! ఇదెలాగో కింద చూద్దాం...
        
హీరోకి ఇది కామెడీ కథలా అనిపిస్తే, దర్శకుడికి యాక్షన్ కథలా అన్పించి పోరాడుకున్నట్టు సీన్లు చూస్తే అర్ధమైపోతుంది. కొన్ని సీన్లు హీరో దర్శకుడి నుంచి బలవంతంగా లాక్కుని తన మార్కు టిల్లూ కామెడీలు చేస్తే, మరికొన్ని సీన్లు దర్శకుడు హీరోని కట్టేసి బలవంతంగా సీరియస్ యాక్షన్ సీన్లు చేయించినట్టు వుంటుంది. టాస్ వేస్తే ఇటు కామెడీ పడక, అటు యాక్షనూ పడక, బాక్సాఫీసులో పడకేసింది సినిమా!
          
ఈ కథ స్పై కామెడీ జానర్ కథ అని తెలుసుకోవాలనిపించలేదు. సినిమా కథకి అవన్నీ తెలుసుకుంటూ ఎవరు కూర్చుంటారు. అంత అవసరం ఏమొచ్చింది? ఓ గూఢచార కథ కన్నామా, మూసలో తీశామా, సీసాలో పోసుకుని సక్సెస్ కలగన్నామా- ఇంతే అవసరం. ఇదే సినిమా నాలెడ్జి. మిగతా జానరూ జాగ్రత్తలూ వంటివన్నీ సినిమా నాలెడ్జి లేని వాళ్ళు చేసే పిచ్చి పనులు.
       
స్పై కామెడీలు అలా వుంచి
, ఒక గూఢచార సంస్థ రా కథ అనుకున్నప్పుడు, కనీసం ఎలా తీస్తే స్పై సినిమా అనిపించుకుంటుందో ఒకటైనా స్పై సినిమా చూసి తెలుసుకున్నట్టు కూడా లేదు. అసలు   రా కథ అనుకోవడమే చాలా ఆషామాషీగా, సిల్లీగా అనుకున్నట్టుంది- వాస్తవాల వైపు అస్సలు చూడదల్చుకోలేదు.  రా అనేది విదేశాల్లో మాత్రమే రహస్య కార్యకలపాలు సాగించే హైపర్ ఇంటలిజెన్స్ సంస్థ. దేశం లోపల దానికి సంబంధం లేదు. దేశం  లోపల కేసులు చూసుకోవడానికి ఎన్ఐఏ వుంది.
          
అలాగే రా లో నియామకాలు శత్రు గూఢచారులకి తెలిసిపోయేలా బహిరంగంగా జరగవు. చాలా గుట్టుగా జరుగుతాయి. అలాగే రా లో ఎవరో అప్లయి చేసుకుంటే ఇంటర్వ్యూలు తీసుకుని జాబ్స్ ఇచ్చేయరు. పారా SF, NSG, MARCOS, ఇంకా ఇతర ప్రత్యేక సైనిక విభాగాల్లోని అత్యంత ఉన్నత శ్రేణి సైనికుల్ని నియామకాలాల్లో ఎంపిక చేస్తారు. అంతేగానీ ఆవారాగా తిరిగే జాక్ లాంటి  కొంచెం క్రాక్ యూత్ కి అక్కడ ఇంటర్వ్యూ కాదుకదా, చాక్లెట్ ముక్క కూడా దక్కదు.
       
ఇంకలాగే
, విదేశాల్లో రహస్య సమాచారం సేకరించి, విదేశాంగ విధానం రూపొందించేందుకు ప్రభుత్వానికి తోడ్పడమే ముఖ్యోద్దేశంగా పని చేసే రా లో- ఇంకో వింగ్ వుంటుంది. దీన్ని SG (స్పెషల్ గ్రూప్) అని పిలుస్తారు. ఈ స్పెషల్ గ్రూప్ బలమైన టైర్ 1 కమాండో సైన్యంలో భాగంగా వుంటారు. దీన్ని స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు. శత్రు దేశాల్లో రహస్య కార్యకలాపాలు, విధ్వంసక చర్యలు, విద్రోహుల హత్యలు, రాజకీయ హత్యలూ వంటివి చేపడతారు.
        
విషయం ఇలా వుండగా, ఈ కథలో టెర్రరిస్టుల్ని పట్టుకోవడానికి దేశం లోపల హైదరాబాద్ లో రా భారీ యెత్తున ఆపరేషన్స్ చేపట్టడం చూపించారు. ఇది ఎన్ ఐ ఏ చేయాల్సిన పని. ఐతే ఏమిటి, సినిమాకి ఆ మాత్రం స్వేచ్ఛ వుండదా అన్పించవచ్చు. ఇంకా ఈ ఓటీటీ వెరైటీల రోజుల్లో వ్యవస్థల గురించి ప్రేక్షకులకి తప్పుడు సమాచారమిస్తూ సిల్లీ కథలు చూపించడం ఓకే అనిపిస్తే ఓకే. ఆవారా జాక్ కిరా ఇంటర్వ్యూకి పిలవడం ఓకే అనిపిస్తే ఓకే- మూస ఫార్ములా ఎప్పుడూ రైటే!
        
ఈ కథలో టెర్రరిస్టుల్ని పట్టుకోవడానికి
రా బృందం విదేశం నేపాల్ కి వెళ్ళే ఆ ఒక్క వాస్తవికత తప్ప,  రా ప్రతిష్టని నిలబెట్టే ఒక్క చిత్రణా లేదీ కథలో. ఇక టెర్రరిజం యాంగిల్ గురించి. ఇది చూస్తే మార్కెట్ యాస్పెక్ట్  ఎంత లాభదాయకంగా వూహించారో తెలిసిపోతుంది- టెర్రరిజం సినిమాలు మార్కెట్ ని కోల్పోయి దశాబ్దం పైనే అయింది. 2013 తర్వాత నుంచీ టెర్రరిజం లేదు దేశంలో. కాశ్మీర్లోనే చెదురుమదురు ఘటనలకి పరిమితమైంది. సిరియాకి చెందిన ఐఎస్ వచ్చాక కాశ్మీర్ ని వాళ్ళ ఇస్లామిక్ స్టేట్ లో కలుపుకునే విఫలమైన వ్యూహంలో భాగంగా కాశ్మీర్ కే పరిమితమయ్యారు.
        


అలాటిది ఈ కథలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బోలెడు టెర్రరిజం కథ చూపించేస్తూంటే ఎక్కడిదో పాత సినిమా చూస్తున్నట్టుంది. ఇలా వుంది మార్కెట్ యాస్పెక్ట్ ముచ్చట. ఇక కథలో టెర్రరిస్టులు పేలుళ్ళు  జరపడానికి చెప్పే కారణం కూడా కాన్ఫ్లిక్ట్ ని ప్రశ్నార్ధకం చేసింది. 2016 లో ఇండియా సర్జికల్ స్ట్రైక్ జరిపి తమ మిలిటెంట్లు 300 మందిని చంపినందుకు ప్రతీకారంగా పేలుళ్ళు  ప్లాన్ చేశామంటాడు టెర్రరిస్టుల నాయకుడు. అప్పట్లో 300 అంటూ జరిగిన మీడియా ప్రచారాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు కాన్ఫ్లిక్ట్ కి!
       
ఆ సర్జికల్ దాడిలో ఎంత మంది మిలిటెంట్లు చనిపోయారనేది అధికారికంగా నిర్ధారణ కాలేదు
. దీనిపై మనం గ్రోక్ ని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది-
భారతదేశం జరిపిన సర్జికల్ స్ట్రైక్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య విస్తృతంగా మారుతూ వుంటుంది, ఎందుకంటే ఖచ్చితమైన సంఖ్య నిర్ధారించబడలేదు. భారత వర్గాలు 35 నుంచి 50 మంది ఉగ్రవాదులు మరణించారని నివేదించాయి. కొన్ని నివేదికలు 70 వరకు సూచించాయి. భారత సైన్యం DGMO లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, సంఖ్యను పేర్కొనకుండా మరణాలు జరిగాయన్నది యదార్థం అన్నారు. స్వతంత్ర విశ్లేషకులు అతిశయోక్తి వాదనలను గమనిస్తూ, 10-15 మంది కంటే తక్కువ సంఖ్యను సూచించారు. పాకిస్తాన్ ఎటువంటి ఉగ్రవాద మరణాలనూ ఖండించింది. ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారని,  తొమ్మిది మంది గాయపడ్డారని అంగీకరిస్తోంది. మృతదేహాలు లేదా అధికారిక రికార్డులు వంటి ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఖచ్చితమైన సంఖ్య అనిశ్చితంగా వుంది

కనుక
300 అంటూ మరొక తప్పుడు సమాచారమిస్తూ మభ్యపెట్టారు. ఇది కాన్ఫ్లిక్ట్ ని బలహీనం చేసి సినిమాకే నష్టం చేసింది. ఒకవేళ మూస ఫార్ములా విన్యాసంగా దీన్ని ఒప్పుకోవాలన్నా, ఎప్పుడో పదేళ్ళ నాటి సర్జికల్ స్ట్రైక్ అయిపోయిన కథ. తీరుబడిగా ఇప్పుడు ప్రతీకారానికి దిగడం కథలో కాన్ఫ్లిక్ట్ ని బలహీనం చేసింది. అప్పట్లో  సర్జికల్ స్ట్రైక్  మీద వచ్చిన రెండు మూడు హిందీ సినిమాలు పరిస్థితి  తాజాగా వున్నప్పుడే, 2019 లోగా వచ్చేసి  సొమ్ము చేసుకున్నాయి.  

          
అసలు సర్జికల్ స్ట్రైక్ చేపట్టిందే కాశ్మీర్లోని యూరీ లో, బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ మీద టెర్రరిస్టులు దాడి జరిపి నిద్రలో వున్న 19 మంది సైనికుల్ని చంపేశారనే. ఇప్పుడు ఈ  కథలో టెర్రరిస్టు వచ్చేసి మా 300 మందిని చంపినందుకు ప్రతీకారంగా అంటున్నప్పుడు- అసలు ముందు మా 19 మంది సైనికుల్ని చంపింది మీరూరా- నీ ప్రతీకారం తగిలెయ్య- అని కొంచెం క్రాక్ అయిన జాక్ నాల్గు పీకితే సరిపోయేది. కానీ దర్శకుడూ- హీరో, క్రియేటివ్ వార్ లో వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ని హైలైట్ చేసుకోవడం వల్ల సినిమా ఎందుకు తీశారో అర్ధంగాకుండా పోయింది!
       
జానర్ ఏమిటో తెలుసుకోకుండా క్రియేటివ్ వార్ లు. స్పై కామెడీలు హాలీవుడ్ లో ఎన్నో వచ్చాయి. వాటిలో కనీసం ఒకటైనా చూసి వుంటే ఈ స్పై కామెడీ ఎలా తీయాలో తెలిసేది. ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.
స్పై కామెడీ స్క్రీన్‌ప్లేకి కావాల్సింది ఎక్కడా సీరియస్ చేయకుండా, స్పై థ్రిల్లర్స్ లో వుండే సీరియస్ సన్నివేశాల్ని పేరడీ చేయడమే. సిట్యూయేషనల్, స్లాప్ స్టిక్ కామెడీలు చేస్తూ, ఫన్నీ డైలాగులతో, బాగా నవ్వించే యాక్షన్ సీన్స్ తో, హీరోని మర్చిపోలేని క్యారక్టర్ గా క్రియేట్ చేయడమే.
       
స్పై కామెడీలు ఎక్కువగా
కారు ఛేజింగులు, గన్ ఫైట్లు, హేండ్ టూ హేండ్ ఫైట్లూ కలగలిసిన కామిక్ యాక్షన్ సీన్లతో కూడి వుంటాయి. స్పై కామెడీ లక్ష్యం ఏమిటంటే, స్పైకి వుండే ధైర్యసాహసాల్ని హాస్యంతో మిళితం చేసి, ఉత్కంఠ రేపే ఉల్లాసకర జర్నీతో ప్రేక్షకుల్ని కట్టి పడేయడమే. కథలో హాస్య రసం- అద్భుత రసం తప్ప మరొకటి పలక్కూడదు.
       
ఈ కథ ఫస్టాఫ్ పాబ్లో నెరూడా అలియాస్ జాక్ పనిలో ఫన్ వుండే ఉద్యోగం వెతుక్కుంటూ
రా ఇంటర్వ్యూ కెళ్ళి, ఆ తర్వాత తానే సొంతంగా టెర్రరిస్టుల్ని పట్టుకునే ఆపరేషన్ మొదలెట్టడం, అతడ్ని ఫాలో అవుతూ డిటెక్టివ్ అఫ్సానా అతడి తండ్రికి రిపోర్టు చేయడం, ఈ క్రమంలో తనకి అడ్డొస్తున్న రా అధికారిని జాక్ పట్టుకుని బంధించడం, ఓ టెర్రరిస్టుని కూడా బంధించడం, ఆ టెర్రరిస్టు తప్పించుకోవడం, రా అధికారి తననే బంధించిన జాక్ ని తిట్టి వెళ్ళగొట్టడంతో జాక్ ఆపరేషన్, కెరియర్  ప్రశ్నార్ధకంలో పడడమూ జరుగుతాయి.
       
సెకండాఫ్ లో జాక్ వూరుకోకుండా టెర్రరిస్టులు నేపాల్లో వున్నారన్న సమాచారంతో అక్కడి కెళ్ళి మళ్ళీ
రా అధికారికి పడడం, అక్కడికే వచ్చిన అఫ్సానాతో ప్రేమాయణం సాగించడం, చివరికి టెర్రరిస్టుల్ని పట్టుకుని రా మెప్పు పొంది, ఉద్యోగం సంపాదించుకోవడమూ జరుగుతాయి. ఫస్టాఫ్ లో వున్నంత కథ కూడా సెకండాఫ్ లో లేదు. ఈ మొత్తం కథని ఫన్ చేయాలా లేక యాక్షన్ తో రన్ చేయాలా తేలక రెంటికి  చెడ్డ రేవడి అయింది.

నటనలు- సాంకేతికాలు

స్వయం ప్రకటిత స్పై గా సిద్ధూ జొన్నలగడ్డ పాత్ర కామెడీకీ, సీరియస్ యాక్షన్ కీ మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక విషయం స్పష్టం చేసేసింది- యాక్షన్ సినిమాలు అతడి జోన్ కాదని. యాక్షన్ సినిమాల్ని పూర్తి స్థాయి కామిక్ యాక్షన్లుగా మార్చుకుంటే సరే. అంతేగానీ తను మాస్ యాక్షన్ హీరోగా బిగ్ స్టార్ గా అవ్వాలనుకుంటే కుదరదు.
       
పాత్రకి కామిక్
షేడ్ ని పెంచే అంశాలు పాత్ర పేరులోనే, ఫిలాసఫీలోనే వున్నాయి. వీటిని  పాత్రచిత్రణకి వాడుకుని వుంటే- ఈ సినిమాలో డొల్లగా వున్న స్పై కథకీ, ప్రేమ ట్రాకుకీ డెప్త్ తో కూడిన కథనం వచ్చేది. కానీ పైపైన రాసేసి పైపైన తీసేసే అలవాటు గనుక ఇది ఒప్పుకోరు. ప్రేక్షకులకి ఎంత డొల్ల సినిమా ఇస్తే అంత గొప్పగా వుంటుంది.
       
పాత్రకి పాబ్లో నెరూడా పేరెందుకు పెట్టినట్టు. చిలీకి చెందిన నోబెల్ గ్రహీత
, ప్రజా కవి పాబ్లో నెరూడా పేరు హీరో చెప్పుకుంటున్నాడంటే, నెరూడా షేడ్స్ కొంతయినా కలిగి వుంటాడని ఆశిస్తాం- ఆటలాడుకోని పిల్లవాడు పిల్లాడే కాదు- కానీ ఆడుతూ పాడుతూ జీవించడం మర్చి పోయిన మనిషి తనలోని పిల్లాడ్ని శాశ్వతంగా కోల్పోయినట్టే- ఆ పిల్లాడ్ని చాలా మిస్సయినట్టే - అంటూ  నెరూడా రాసిన కవిత్వ పంక్తులు జాక్ కే వర్తిస్తాయి!
        
చేసే పనిలో ఫన్ లేకపోతే నరకంలా వుంటుందని జాక్ అంటూంటాడు. ఆ ఫన్నే అతడిలోని బాలుడు- బాల్యం. దీన్ని సజీవంగా వుంచుకుంటున్నాడు. అతడిలో నెరూడా షేడ్ వుంది. కానీ ఈ షేడ్ ప్రకారం పాత్రని నడిపించలేదు- అంటే క్యారక్టర్ ఆర్క్ ని సృష్టించలేదు. ఆ ఫన్ పెరిగి పెరిగి పతాక స్థాయికెళ్ళి దెబ్బతిని - జీవితం అన్నిటా ఫన్ కాదురా - అనే చిన్న పాఠం కూడా తెలుసుకుని వుంటే పాత్ర ఆకర్షణీయంగా వుండేది.
       
అలాగే నెరూడా ప్రేమ గురించి రాసిన కవిత్వం చాలా వుంది-
నాకు తిండిని గాలిని  తిరస్కరించు, వెలుగునీ వసంతాన్నీ తిరస్కరించు- కానీ  నీ నవ్వుని కాదు, ఎందుకంటే నేను చనిపోతాను’… నువ్వు పుట్టిన పువ్వునల్లా త్రెంచి పారెయ్యొచ్చు, కానీ  వసంతాన్ని రాకుండా ఆపలేవు’ … ఇలాటి కోట్స్ హీరోయిన్ మీదికి విసురుతూ ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. లేకపోతే తను నెరూడా అని చెప్పుకోవడమెందుకు?
        
'బేబీఫేమ్ హీరోయిన్ వైష్ణవీ చైతన్య వృధా అయింది. అర్ధం లేని పాత్ర
, పరమార్ధం లేని నటన. హీరోకీ తనకీ మధ్య బాండింగే లేదు. పొడిపొడి ప్రేమలతో సరిపెట్టేశారు. రాఅధికారిగా ప్రకాష్ రాజ్ పాత్రని సీరియస్ గా తీసుకుని నటించాడు. నరేష్, బ్రహ్మాజీలు స్వల్ప పాత్రలు నటించారు.
       
పాటలు పూర్తిగా మైనస్ ఈ సినిమాకి. ఛాయాగ్రహణం
, ఇతర ప్రొడక్షన్ విలువలు అగ్ర నిర్మాత బ్యానర్ ప్రతిష్ట పెంచేలా వున్నాయి- సినిమాలో విషయమే బాక్సాఫీసుకి సమస్య!

—సికిందర్ 

Monday, April 7, 2025

1373 : స్పెషల్ ఆర్టికల్


 

     1985 లో దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా విజయం సాధించింది. 2025 లో బాక్సాఫీసులో రాబిన్ (నితిన్), రాజు (సల్మాన్) ఇద్దరూ పడ్డారు. 1969 లో జగత్ కిలాడీలు అనే సినిమాలో రంగా అలియాస్ రౌడీ రంగడు (ఎస్వీ రంగారావు), భయంకర్ (రావు గోపాలరావు) అనే ఇద్దరు క్రిమినల్స్ ఒకేసారి బ్యాంకులో పడ్డారు. దాంతో గొడవకి దిగారు. రంగా! ఎలా వఛ్చావిక్కడికి?’ అని భయంకర్ నిలదీస్తే, ‘నువ్వొచ్చిన గేటు గుమ్మంలొంచే అని రంగా సమాధానం. ఎందుకొచ్చావ్?’ అని భయంకర్ రెట్టిస్తే, ‘నువ్వెందుకొచ్చావ్?’ అని రంగా ఎదురు ప్రశ్న. 'నిన్ను తినడానికి' అని ఆకలిగా చూశాడు భయంకర్. రంగా లేచి పచార్లు చేస్తూ, 'జీర్ణం కాదులే. తెలుగు గడ్డ పంటరా ఇది. పండు మిరప కొరికిన శరీరం. ప్రతి అంగుళం కారంగా ఘాటుగా వుంటుంది. చపాతీలు తిన్న చచ్చు శరీరాంరా నీది. ఈ  కారం దెబ్బకు కళ్ళు పచ్చబడతాయిరా గూట్లే!' అని క్లాసు పీకాడు. భయంకర్ రెచ్చిపోతూ, 'జూటే!' అనరిచాడు.

        ఇలా మాటామాటా పెరిగి,  'రంగా! అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. కోపం వస్తే నేను మనిషిని కాను. వెళ్తావా లేదా?’ అని గర్జించాడు భయంకర్. రంగా నిర్లక్ష్యంగా చూసి, ‘వచ్చిన పని పూర్తి కాకుండానే?’ అన్నాడు. ఏం పని?’ భయంకర్ ప్రశ్న. ఈ అర్ధరాత్రి పూట ఏం పని మీద వస్తారు మనలాంటి వాళ్ళు గూట్లే?’ అని ఇంకింత రెచ్చగొట్టాడు రంగా.

        'వీల్లేదు! ఇది నా పథకం. నేనే దోచుకోవాలి. అనుకున్నది సాధించక పోవడం భయంకర్ చరిత్రలోనే లేదు!' భయంకర్ గర్జన. 'మాటలతో వృధా పుచ్చడం పిరికిపందల లక్షణంరా గూట్లే!' గట్టిగా నవ్వాడు రంగా. 'జూటే!' అని ఇంకా గట్టిగా నవ్వాడు భయంకర్.  ఇలా పరిస్థితి మరింత వేడెక్కడంతో ఎందుకైనా మంచిదని దారికొచ్చాడు భయంకర్, ‘సరే, మనిద్దరం సమానమైన శక్తి పరులం. ఇలా వృధాగా కాలయాపన చేయడం మంచిది కాదు. రంగా! శక్తిలో యుక్తిలో భుజబలంలో మనకు మనమే సాటి. నెయ్యమైనా కయ్యమైనా సరిసమానుల మధ్యే రాణిస్తుంది...ఇక నుంచి మనం స్నేహితులం. మన స్నేహానికెప్పుడూ భంగం కలగదు! అనేశాడు భయంకర్.

        రంగా కూడా శాంతించి, ‘ఒక్క షరతు. ఇక నుంచి మనమిద్దరం ఎవరెంత సంపాదించినా ఫిఫ్టీ ఫిఫ్టీఅని ప్రతిపాదించాడు. ఫిఫ్టీ ఫిఫ్టీ, నీ షరతు ఆమోదిస్తున్నాను చెప్పాడు భయంకర్. అయితే మన స్నేహాన్ని అంగీకరిస్తున్నాను’  అంటూ చర్చ ముగించాడు రంగా. ఇక నుంచి ఏ దోపిడీ అయినా ఫిఫ్టీ -ఫిఫ్టీ పార్ట్నర్ షిప్ తో కలిసే చేసుకుందామని చేతులు కలిపారు.

        2025 మార్చి : రాబిన్ బాక్సాఫీసులో దేవులాడుకుంటూ వుండగా రాజూని కూడా బాక్సాఫీసులో వేసి తాళం వేసుకెళ్ళి పోయారు ప్రేక్షకులు. రాబిన్ ని చూసి, ‘నువ్వెప్పుడొచ్చావ్ రాబిన్?’ అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు, ‘ఉగాదికి వచ్చాను, వర్కౌట్ కాలేదు అన్నాడు రాబిన్, ‘రంజాన్ కొచ్చాను, నాకూ వర్కౌట్ కాలేదుఅన్నాడు రాజు. మనిద్దరం ఫ్లాప్ అన్న మాట? ఇక పండగలు జీవితంలో మనల్ని క్షమించవ్!అన్నాడు రాబిన్, ‘సరేగానీ, నువ్వు రాబిన్ హుడ్ వి కదా, సినిమాలో రాజుల్ని కొట్టి పేదల కేశావ్, ఇప్పుడు ప్రేక్షకుల్ని కొట్టి ఈ రాజు కెయ్య రాదా! రిక్వెస్ట్ చేశాడు రాజు.

        ఎవర్నో కొట్టి నీకేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? నువ్వు రాజా సాబ్ వి కదా?’ అన్నాడు రాబిన్. ఏం చెయ్యను, గజినీ తీశాడు కదా అని మురగదాస్ ని నమ్మితే ముంచాడు. ఇంత ఔట్ డెటెడ్ అనుకోలేదు బాధపడ్డాడు రాజు. నేను కూడా భీష్మ తీశాడు కదా అని వెంకీని నమ్మితే టెంప్లెట్ అయింది అన్నాడు రాబిన్. ఈ డైరెక్టర్లు ఔట్ డెటెడ్ కాకపోతే టెంప్లెట్ తప్ప ఇంకోటి తీయరా?’ రాజు ధర్మ సందేహం వెలిబుచ్చాడు.

     ఐతే నీ ఔట్ డెటెడ్ మేకింగ్ ఎక్కడ తేడా కొట్టింది రాజా సాబ్?’ రాబిన్ అడిగాడు. ముంబాయిలో ఫేమస్ థియేటర్ ఓనర్ ప్రొడ్యూసర్ కి కాల్ చేసి క్లాసు పీకాడు. ముంబాయిలో చాలా థియేటర్స్ లో నా సినిమా ఎత్తేసి వేరే సినిమాలు ఆడించుకుంటున్నారు. ఎందుకు? హీరోయిన్ ని చంపేసినందుకు. హీరోయిన్ ని ఎక్కడైనా చంపేస్తారా రాబిన్ భాయ్? ఫస్టాఫ్ లోనే అంత కాస్ట్లీ హీరోయిన్ ని చంపేశాడు మురుగ దాస్. ఎవర్ని? రశ్మికా మందన్న లాంటి మాస్ బేస్ వున్న స్టార్ ని! ఆమెని చంపేశాక ఇక సినిమా ఏముంటుంది- నేను కూడా ఏడుస్తూనే నటించాను ఏడుపు మొహంతోనే బాధపడ్డాడు రాజు.

        చూశాను, నువ్వు హీరోయిన్ చావక ముందూ తర్వాతా ఎప్పుడూ నవ్వలేదు. కనీసం నవ్వు ముఖంతో కూడా లేవు. ఫ్యాన్స్ ని చావగొట్టావ్ కదా వాళ్ళకివ్వాల్సిన కమర్షియల్ యాక్టింగ్ ఇవ్వక. ఆ ఫైట్స్ ఏమిటి రాజా సాబ్, అవి ఫైట్లేనా? ఫైట్స్ లో కూడా నీరసంగా వుండమన్నాడా మురుగ దాస్? తప్పు చేశాడు రాజా సాబ్. అంతగా చంపాల్సి వస్తే నీ భార్యగా ఓ సెకండ్ హీరోయిన్ ని చూపిస్తే సరిపోయేది. ఆమె చనిపోయాక  మెయిన్ హీరోయిన్ గా రశ్మిక ఎంట్రీ ఇచ్చి, నీతో రోమాన్స్ చేస్తూంటే నువ్విక్కడ ఇలా వుండే వాడివి కావు, సారీ! సానుభూతి వ్యక్తం చేశాడు రాబిన్.

        నా క్యారక్టర్ కిచ్చిన హైప్ చూసి పడిపోయా రాబిన్ భాయ్. రాజవంశలో నేను చివరి రాజు అన్నాడు. నా పేరు రాజా సాబ్ అన్నాడు. అద్భుత బంగాళా, అదిరిపోయే లైఫ్ స్టయిల్. నా భార్య రాణీ సాహెబా రశ్మికా మందన్న అన్నాడు. ఆమె చనిపోతూ అవయవ దానాలు చేస్తుందన్నాడు. కళ్ళు ఒకరికి, ఊపిరితిత్తులు ఒకరికి, గుండె ఒకరికీ దానమిచ్చేస్తుందన్నాడు. నా మీద పగబట్టిన విలన్ ఆ ముగ్గుర్నీ చంపేసేందుకు ప్లాన్ వేస్తాడన్నాడు. ఇంతవరకూ బాగానే వుంది. కానీ ఇంటర్వెల్లో ఆ చంపుతానన్న వాడు సెకండాఫ్ లో ఎంతకీ రాకపోతే నేనేం చేసేది. ఫస్టాఫ్ లో రాణీ సాహెబాని చంపి, సెకండాఫ్ లో ఎంతకీ విలన్ ని నా మీదికి పంపించకపోతే సినిమా రంజాన్ కి కుర్బానీ కాక మెహర్బానీ అవుతుందా?' అంటూ తనదైన విశ్లేషణ చేసుకున్నాడు రాజవంశానికి చెందిన చివరి రాజు.

  రాబిన్ ఆలోచనలో పడ్డాడు. 'ఏమిటాలోచిస్తున్నావ్?' అన్నాడు రాజు. 'ఏం లేదు, రాజా సాబ్...' అంటూ తనదైన సినిమా విశ్లేషణ మొదలెట్టాడు రాబిన్, 'ఏదో రాబిన్ హుడ్ గా ఉన్నోళ్ళని కొట్టి అనాధలకి వేస్తున్న నన్ను హీరోయిన్ శ్రీలీలకి బాడీగార్డుని చేశాడు. నాకోసం గంజాయి మాఫియాని బలవంతంగా ఇరికించాడు. గంజాయికి క్యాన్సర్ మందు తయారీతో ఇంకో బలవంతపు లింకు పెట్టాడు. ఇది సరిపోనట్టు కామెడీ పేరుతో విలన్ ముందు నన్ను వీక్ క్యారక్టర్ చేశాడు. అతుకులేసిన కథ, టెంప్లెట్ కథనం ఇంకా ఈ రోజుల్లో చూస్తారంటావా రాజా సాబ్?’

        సారీ రాబిన్. మన పండగ కలలు కల్లలయ్యాయి...అయినా ఇంకేం చేద్దామని బాక్సాఫీసు వైపొచ్చావ్?’ అడిగాడు రాజు. నువ్వెందుకొచ్చావ్” అన్నాడు రాబిన్. ‘నీ కలెక్షన్లు తిందామనిఅన్నాడు రాజు. 'జీర్ణం కాదులే. తెలుగు గడ్డ పవర్ ఇది. పానిండియా పవరు మరిగిన శరీరం. ప్రతి అంగుళం ఊర మాస్ గా, వీర కారంగా వుంటుంది. చపాతీ సినిమాలు తీసి చచ్చుబడి పోయిన మీకు అర్ధం గాదులే!అనేశాడు రాబిన్. రాబిన్!’  కోపంగా అరిచాడు రాజు, ‘ఆరేళ్ళ నుంచీ నేనూ వరస ఫ్లాపుల్లో వున్నాను, నువ్వూ వరస ఫ్లాపుల్లో వున్నావ్. ఈ ఔట్ డేటెడ్ డైరెక్టర్స్ ని, టెంప్లేట్ డైరెక్టర్స్ నీ పక్కన బెడితే - మనిద్దరం సమానమైన శక్తి పరులం. ఇలా వృధాగా కాలయాపన చేయడం మంచిది కాదు. రాబిన్!  శక్తిలో యుక్తిలో భుజబలంలో మనకు మనమే సాటి. నెయ్యమైనా కయ్యమైనా సరిసమానుల మధ్యే రాణిస్తుంది...ఇక నుంచి మనం స్నేహితులం. మన స్నేహానికెప్పుడూ భంగం కలగదు!

      రాబిన్ అనుమానంగా చూసి, ‘ఒక్క షరతు. ఇక నుంచి మనమిద్దరం ఎవరెంత సంపాదించినా ఫిఫ్టీ ఫిఫ్టీఅని ప్రతిపాదించాడు. ఫిఫ్టీ ఫిఫ్టీ, నీ షరతు ఆమోదిస్తున్నాను చెప్పాడు రాజు. అయితే మన స్నేహాన్ని అంగీకరిస్తున్నానుఅంటూ చర్చ ముగించాడు రాబిన్.   ఇక నుంచి ఏ పానిండియా మూవీ చేసినా ఫిఫ్టీ -ఫిఫ్టీ పార్ట్నర్ షిప్ తో కలిసే చేసుకుందామని చేతులు కలిపారు.
        టైటిల్ ఫిఫ్టీ ఫిఫ్టీఅన్నాడు రాజు.
        ట్యాగ్ లైన్ సేఫ్టీ బెల్ట్అన్నాడు రాబిన్.

—సికిందర్