రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జులై 2024, గురువారం

1444 : హాలీవుడ్ రివ్యూ!


 

దర్శకత్వం : జార్జ్ మిల్లర్
తారాగణం : అన్యా టేలర్ జాయ్, క్రిస్ హేమ్స్ వర్త్, చార్లీ ఫ్రేజర్, ఐలా బ్రౌనీ, చార్లీజ్ థెరాన్, టాం బర్క్ తదితరులు
రచనా : జార్జ్ మిల్లర్, నికో లాథౌరిస్, సంగీతం: టామ్ హోల్కెన్‌బర్గ్, ఛాయాగ్రహణం: సైమన్:
బ్యానర్స్ :  కెనెడీ మిల్లర్ మిషెల్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్
స్ట్రీమింగ్ : జులై 4, బుక్ మై షో
***

            2015లో విడుదలైన  మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్యాక్షన్ ఫ్రాంచైజీకి ప్రీక్వెల్  ఫ్యూరియోసా: మ్యాడ్ మాక్స్ సాగా’. ఆస్ట్రేలియన్ దర్శకుడు జార్జ్ మిల్లర్ గత 45 సంవత్సరాల నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తూనే వున్నాడు. 1979 లో మొదటి  మ్యాడ్ మాక్స్’(తెలుగులో చిరంజీవితో యమకింకరుడు’), 1981 లో మ్యాడ్ మాక్స్ 2 : ది రోడ్ వారియర్’, 1985 లో మ్యాడ్ మాక్స్ : బియాండ్ థండర్ డోమ్’, 2015 లో మ్యాడ్ మాక్స్ : ఫ్యూరీ రోడ్’, ఇప్పుడు 2024 లో ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మాక్స్ సాగా మొదలైనవి. మెల్ గిబ్సన్ మొదటి మూడిట్లో టైటిల్ పాత్ర పోషించాడు. నాల్గవ ఫ్రాంచైజీలో టామ్ హార్డీ టైటిల్ పాత్ర పోషిస్తే, ఇప్పుడు ఐదవ ఫాంచైజీలో అన్యా టేలర్ జాయ్ పోషించింది. ఇవి ప్రధానంగా ఇకోసైడ్ (పర్యావరణ హననం) అనంతర జీవన్మరణ పోరాట రోడ్ యాక్షన్ మూవీస్. నాల్గవ భాగానికి ముందు కథ (ప్రీక్వెల్) గా వచ్చిన ఈ  అయిదవ భాగం గత మేలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, జులై 4 నుంచి బుక్ మై షోలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదెలా వుందో చూద్దాం...

కథ   

పర్యావరణం హరించుకుపోయి, నీరూ తిండి గింజలు లభించక భూమి ఎడారిగా మారిన సుదూర భవిష్యత్తులోకి తొంగిచూసే కథ ఇది. మళ్ళీ మానవ నాగరికత జీరోనుంచి ప్రారంభమవుతూ, జీవన్మరణ పోరాటం చేస్తున్న సమూహాల మధ్య వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్న సమయం. అయితే ఆస్ట్రేలియాలో గ్రీన్ ప్లేస్ అనే ప్రాంతం మాత్రం క్షామాన్ని తట్టుకుని మంచి నీరుతో, పచ్చటి పొలాలతో మిగిలివుంది. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఆవాసాలేర్పర్చుకున్నాయి. ఇక్కడి ఫ్యూరియోసా (చైల్డ్ ఆర్టిస్టు ఐలా బ్రౌనీ), వాల్కైరీ అనే ఇద్దరు పిల్లలు అడవిలోకి వెళ్ళి  చెట్లకి కాసిన పళ్ళు కోసుకుంటున్నప్పుడు, ఫ్యూరియోసాకి దూరంగా విశ్రమించిన బైక్ రైడర్లు కనిపిస్తారు. వాళ్ళు గ్రీన్ ప్లేస్ వైపే వచ్చి కబ్జా చేస్తారని భావించిన ఫ్యూరియోసా, ధైర్యం చేసి వాళ్ళ బైకుల్లో పెట్రోలు తీసేస్తున్నప్పుడు దొరికిపోతుంది.
       
దీంతో ఫ్యూరియోసాని
తమ నాయకుడు డిమెంటస్ (క్రిస్ హేమ్స్ వర్త్) కి బహుమతిగా అందించాలని తీసికెళ్ళిపోతూంటే ఆమె తల్లి మేరీ (చార్లీ ఫ్రేజర్) వెంబడిస్తుంది. డిమెంటస్‌ స్థావరంలో ఫ్యూరియోసాని  గ్రీన్ ప్లేస్ లొకేషన్‌  చెప్పమని బాధిస్తున్నప్పుడు మేరీ ఎటాక్ చేసి తీసికెళ్ళి పోతుంది. డిమెంటస్ ఆమెని వెంబడించి దారుణంగా ఫ్యూరియోసా కళ్ళముందే చంపేస్తాడు. దీనికి ముందు ఫ్యూరియోసాకి మేరీ ఎలాటి నిస్సారవంతమైన భూమిలోనైనా మొలకెత్తే విత్తనాన్ని ఇస్తుంది.
       
బాల్యంలో ఈ అనుభవంతో ఫ్యూరియోసా తన తల్లిని చంపిన డిమెంటస్ మీద ప్రతీకారంతో పెరుగుతుంది. రాజ్యాలు మారుతూ మగపిల్లవాడి వేషంలో ఎదిగి
, 15 సంవత్సరాల తర్వాత ధైర్యసాహసాలున్న యువతి (అన్యా టేలర్ జాయ్) గా డిమెంటస్ మీద ప్రతీకారం తీర్చుకోవడం మొదలెడుతుంది.

రెండున్నర గంటల ఇన్నోవేటివ్ యాక్షన్!

సూటిగా చెప్పుకుంటే ఇది తల్లిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకునే కథ. దీని బ్యాక్ డ్రాప్ భవిష్యత్తులోకి తీసికెళ్ళి చూపించే, మృతప్రాయంగా మిగిలిన పర్యావరణంతో  ఏడారులుగా మారిన భూభాగాలపై తిండి కోసం, నీటి కోసం జరిగే యుద్ధాలతో విస్తృత కథ. డిమెంటస్ రాజ్యం ఒకటి, సిటాడెల్ రాజ్యం ఒకటి, వీళ్ళకి గ్రీన్ ప్లేస్ ఎక్కడుందో లొకేషన్ కావాలి. అది చెప్పదు ఫ్యూరోసియా. ఆమె తల్లి ఎలాటి ఎడారిలోనైనా మొలకెత్తే విత్తనం ఒకటి ఇస్తుంది. డిమెంటస్ ని చంపి పగ దీర్చుకున్నాక, ఆ విత్తనంతో  ముగింపు సీను పోయెటిక్ గా వుంటుంది...
        
ఇందులో దాదాపు ఫస్టాఫ్ ఫ్యూరియోసా  బాల్యం గురించే వుంటుంది. ఇంటర్వెల్ కి ముందు ఎదిగిన ఫ్యూరియోసా పాత్రలో అన్యా టేలర్ జాయ్ వస్తుంది. అక్కడ్నుంచి పగదీర్చుకునే ఆమె కథ మొదలవుతుంది. ఇలా దాదాపు ఫస్టాఫ్ వరకూ ప్రధాన పాత్ర బాల్యాన్నే చూపడం ఈ సినిమాలోనే చూస్తాం. ఇదొక కొత్త ప్రయోగమేమో.
       
ఈ కథ ఐదు చాప్టర్లుగా వుంటుంది.
ప్రతి ఒక్కటి మునుపటి దానికన్నా దిట్టంగా వుంటుంది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్, సౌండ్ అన్నీ వినూత్నంగా వుంటాయి. యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవల్లో వుంటాయి. వార్ రిగ్ చేజ్ సీను, మోటరైజ్డ్ పారాషూట్‌లతో దాడి చేసేవారిని తప్పించుకునే థ్రిల్లింగ్ రైడర్ సీన్లు జలదరింపజేస్తాయి. యాక్షన్ ఆర్టిస్టులు గాలిలో  డ్యాన్స్ చేస్తూ, ఉత్కంఠరేపే ఖచ్చితత్వంతో, టైమింగ్ తో దూసుకుపోతున్న ట్రక్కుని క్రాస్ చేస్తున్నప్పుడు కలిగే థ్రిల్ మాటల్లో చెప్పలేం. అధ్యంతం  ఎడారి రోడ్ల మీద చిత్ర విచిత్ర విడిభాగాలు కూడేసి నిర్మించుకున్న వాహనాల ఛేజింగులే ఈ సినిమా. మొదట్నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలంటే వాహనాల ఛేజింగులే. ఈ ఛేజింగుల్ని  సినిమా సినిమాకీ కొత్త అయిడియాలతో సృష్టించడం జార్జ్ మిల్లర్ మేధకి అద్దం పడతుంది. 
       
హీరోయిన్ ఫ్యూరియోసా పాత్రలో అన్యా టేలర్
, జాయ్, విలన్ డిమెంటస్ పాత్రలో  క్రిస్ హెమ్స్ వర్త్ గుర్తుండిపోయే కొన్ని దృశ్యాలకి నటననంతా ధారబోశారు.  ఇతర పాత్రల్లో ప్రతిఒక్కరూ, సైన్యాల పాత్రల్లో జూనియర్ ఆర్టిస్టులూ ఈ మంటలు చిమ్మే మెగా యాక్షన్ సాగా లో ప్రాణాలకి తెగించి చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయి.
       
దూసుకెళ్తున్న వార్ రిగ్ మీద దాడి చేసే యాక్షన్ సీనుని 200 మంది ఫైటర్లతో 78 రోజులు షూట్ చేసినట్టు దర్శకుడు జార్జ్ మిల్లర్ చెప్పాడు. ఇలాటి షూటింగ్ విశేషాలెన్నో వున్నాయి. ఇది రెండున్నర గంటల ఇన్నోవేట్ (నూతన కల్పన) చేసిన హైపర్ యాక్షన్ మూవీ.
45 ఏళ్ళుగా మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తున్న ఆస్ట్రేలియన్ జార్జి మిల్లర్ దర్శకుడిగా ఔట్ డేటెడ్ అయిపోకుండా, ఇప్పుడొస్తున్న హాలీవుడ్ సినిమాలకి తీసిపోకుండా తీశాడు. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మాక్స్ సాగా తప్పక చూడాల్సిన ఫ్యూచరిస్టిక్ సినిమాల్లో ఒకటి.

—సికిందర్

1, జులై 2024, సోమవారం

1443 : మలయాళం రివ్యూ!

 

దర్శకత్వం : విపిన్ దాస్
తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనస్వర రాజన్
రచనా : దీపూ ప్రదీప్, సంగీతం : అంకిత్ మీనన్, ఛాయాగ్రహణం : నీరజ్ రేవీ
బ్యానర్: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్,4 ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు :  సుప్రియా మీనన్, ముఖేష్ మెహతా, సీవీ పార్థసారథి
విడుదల : జూన్ 28, 2024 (అమెజాన్ ప్రైమ్)
***

        టీవల పెద్ద హిట్టయిన ఆడుజీవితం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మూడు హిట్టయిన సినిమాల దర్శకుడు, నటుడు  బేసిల్ జోసెఫ్ జోడీగా నటించిన గురువాయూరంబాల నడాయిల్ (గురువాయూర్ ఆలయం) మలయాళ మూవీ, 2024 మేలో విడుదలై ఈ సంవత్సరం హిట్టయిన 8 మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు వెర్షన్ సహా. దీని దర్శకుడు విపిన్ దాస్ మూడు హిట్లు తీసి, నాల్గవ హిట్ తో ముందుకొచ్చాడు. పెళ్ళి చుట్టూ ఓ కామెడీ తీసి హిట్ చేసిన ఈ దర్శకుడి కళ ఏమిటో తెలుసుకుందాం...

కథ
గురువాయూర్ కి చెందిన వినూ రామచంద్రన్ (బాసిల్ జోసెఫ్) దుబాయిలో ఉద్యోగం చేస్తూంటాడు. అతడికి అంజలి (అనస్వర రాజన్) తో నిశ్చితార్థం జరుగుతుంది. జంషద్ పూర్ లో అంజలి అన్న ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఉద్యోగం చేస్తూంటాడు. అతడితో వినూకి సన్నిహిత పరిచయమేర్పడుతుంది. వినూ పూర్వం పార్వతి (నిఖిలా విమల్) ని ప్రేమించి విఫలమయ్యాడు. ఆమె మోసం చేసిందని కోపం పెంచుకుని ముందుకు సాగలేక పోతూంటాడు. గతాన్ని మర్చిపొమ్మని వినూకి ఆనంద్ నచ్చజెప్తాడు. ఆనంద్ కి కూడా ఓ సమస్య వుంటుంది. భార్య పార్వతికి ఒక ప్రేమలేఖ రావడంతో గొడవపడి పుట్టింటికి పంపేశాడు. ఇది తెలుసుకుని వినూ ఆనంద్ కి నచ్చజెప్పి పార్వతిని తెచ్చుకునేలా చేస్తాడు.
       
ఇలా పరస్పరం ఇద్దరి సమస్యలు తీర్చుకున్నాక
, వినూ పెళ్ళికి బయల్దేరి వచ్చి ఆనంద్ ని కలుస్తాడు. కలిస్తే అతడి భార్య మరెవరో కాదు, తనని మోసం చేసిన పార్వతే. ఈ మోసగత్తె కుటుంబంతో పెళ్ళి వద్దనుకుని ఫ్రెండ్స్ సహాయంతో తన పెళ్ళి చెడగొట్టుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో అంజలికి దొరికిపోయి విషయం చెప్పేస్తాడు. అంజలి అతడ్ని పెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్తుంది. రాజీ పడతాడు.

ఇంతలో పెళ్ళి చెడగొట్టడానికి ముందు ఒప్పుకోని వినూ ఫ్రెండ్ ఒకడు, ఇప్పుడు ఆనంద్ దగ్గరికెళ్ళి- మీ ఆవిడకి వినూ మాజీ ప్రియుడని చెప్పేస్తాడు. దీంతో అసలే కోపిష్టి అయిన ఆనంద్ అతడ్నీ, వినూనీ పట్టుకుని చిత్తుగా తన్ని పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు.
       
వినూ ఎదురు తిరిగి అనుకున్న ముహూర్తానికి గురువాయూర్ ఆలయంలో నీ చెల్లెలికి తాళి కట్టేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఎలా కడ్తావో చూస్తానని ఆనంద్ ఎదురు ఛాలెంజీ చేస్తాడు. ఇప్పుడేం జరిగింది
? ఇప్పుడు తన చెల్లెలితో వినూ పెళ్ళిని చెడగొట్టడానికి ఆనంద్ ఏఏ విఫల యత్నాలు చేశాడు? ఇంకా వినూ పాత విరోధులు ఒకరొకరే ముందుకొచ్చి పెళ్ళిని చెడగొట్టడానికి ఏఏ పథకాలేశారు? ఎప్పుడో గతంలో ఫ్రెండ్ శరవణన్ (యూగిబాబు) శోభనం రాత్రి పాల గ్లాసులో గొడ్డు కారం వేసి పెళ్ళి చెడగొట్టిన వినూ జీవితంలోకి ఆ శరవణన్ కక్ష గట్టుకుని పెళ్ళికి వచ్చి ఏం చేశాడు? గురువాయూర్ ఆలయంలో రసాభాస ఎలా జరిగింది? డ్రోన్ వచ్చి తాళినెలా ఎగరేసుకుపోయింది? అప్పుడేం జరిగింది? ఆనంద్ భార్యకి ప్రేమ లేఖ రాసిందెవరు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

 వెడ్డింగ్ కామెడీ కథ ఇది. ఇందులో ప్రేమలు, డ్యూయెట్లు, ప్రేమలో సమస్యలు వగైరా వుండవు. అందుకని ఇది రోమాంటిక్ కామెడీ గానీ, రోమాంటిక్ డ్రామా గానీ కాదు. నేరుగా పెళ్ళి కథ మాత్రమే చెప్పదలిచాడు. కాబట్టి ఇందులో రోమాంటిక్ కామెడీ లేదా రోమాంటిక్ డ్రామా తాలూకు సీన్లని జొరబడనీయలేదు. వాటిని ఫిల్టర్ చేసి స్పష్టంగా వెడ్డింగ్ కామెడీ జా నర్ మర్యాదకి ఏం ఎలిమెంట్స్ కావాలో అవి మాత్రమే ప్రయోగించాడు. ఇది ప్రధానంగా పెళ్ళికి అటూ ఇటూ జట్టు కట్టిన శక్తులు సృష్టించే కాన్ఫ్లిక్ట్ చుట్టూ తిరిగే కథ. అందుకని ఈ కాన్ఫ్లిక్టే హైలైట్ అయ్యేలా రెండు మూడు వేర్వేరు సీన్లని కలిపి ఇంటర్  కట్స్ లో చూపిస్తూ థ్రిల్ నీ, స్పీడునీ, కామెడీనీ పెంచుతూ పోయాడు. దీంతో పాటు కథనంలో డైనమిక్స్ ని ప్రయోగించాడు. ఒక సీన్లో అనుకూలంగా జరిగితే వెంటనే తర్వాతి సీన్లో వ్యతిరేకంగా జరిగే డైనమిక్స్. ఈ ఇంటర్ కట్స్ తో బాటు డైనమిక్స్ వల్ల కథనంనిత్యం చలనంలో వుంటూ, ఫైర్ అవుతూ వుంటుంది. దీంతో ఈ రెండుంపావు గంటల వెడ్డింగ్ కామెడీ మంచి వినోద కాలక్షేపంలా తయారయ్యింది.
       
ఫస్టాఫ్ వినూ పాత్ర ఇష్టం లేని తన పెళ్ళిని చెడగొట్టుకునే కథ
, సెకెండాఫ్ పెళ్ళికి సిద్ధ పడితే ఇతరులు ఆ పెళ్ళిని చెడగొట్టే కథ. ఈ రెండిటి మధ్య నలిగే వినూ కామెడీ పాట్లు. మధ్యలో తనతో విశసంగా లేదని భావిస్తున్న భార్య పార్వతితో ఆనంద్ పాట్లు. ఈ పాయింటుతో ఆనంద్- వినూల మధ్య శతృత్వం. ఈ గొడవల్లో వినూతో లేచిపోతనని పెళ్లికూతురు అంజలి బ్లాక్ మెయిల్. ఈ ప్రధాన పాత్రల చుట్టూ చేరి  రసాభాస చేసే ఇతర  పాత్రలు. ఈ పాత్రల్లో ఒక ఆడ పాత్ర కూడా వుంటే కాన్ఫ్లిక్ట్ కి యూత్ అప్పీల్ వచ్చేది.
       
క్లయిమాక్స్ గురువాయూర్ టెంపుల్ లో యాక్షన్ సీన్లు
, డ్రోన్ ఎంట్రీ, తాళి గల్లంతు వగైరా. ఆద్యంతం నవ్వించడమే పనిగా పెట్టుకున్న ఈ వెడ్డింగ్ కామెడీ ప్రియదర్శన్ కామెడీ సినిమాల్ని గుర్తుకు తెస్తుంది.

నటనలు –సాంకేతికాలు

పృథ్వీరాజ్ సుకుమారన్ ఎప్పటిలాగే హుషారుగా పాత్ర పోషించాడు. కోపిష్టి పాత్ర కావడంతో బల ప్రయోగం కూడా చేస్తాడు. ఎత్తుగడలు వేసినప్పుడు యాక్షన్ లోకొచ్చి కథని మలుపులు తిప్పుతూంటాడు. ఈ కథకి హీరో బేసిల్ జోసెఫ్. పృథ్వీరాజ్ వ్యతిరేక పాత్ర. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణతో నడుస్తూంతుంది కథ. పృత్వ్హీరాజ్ సీరియస్ పత్రాయితే జోసెఫ్ కామెడీ పాత్ర. ఈ డైనమిక్స్ కూడా బాగా పనికొచ్చాయి. జోసెఫ్ కామెడీ పాట్లు సున్నిత హాస్యంతో తెలివిగా నటించాడు.
       
పృథ్వీరాజ్ భార్యగా ఆకాశరామన్న ప్రేమ లేఖతో అపార్ధానికి గురయిన పాత్రలో నిఖిల జరుగుతున్న తతంగం సీరియస్ గా గమనిస్తూ వుంటుంది. ఎక్కువ మాట్లాడదు. జోసెఫ్ పెళ్ళి చేసుకునే అంజలి పాత్రలో అనస్వర  కేర్ ఫ్రీగా వుంటుంది. ఇక అటూ ఇటూ కుటుంబ పాత్రలు
,  వూళ్ళో మేకవన్నె పులుల్లాంటి పాత్రలూ చాలా వున్నాయి.
       
ఇక పాటలు
, లొకేషన్లు, కెమెరా వర్క్ సున్నిత కామెడీకి తగ్గట్టు సాఫ్ట్ గా కనిపిస్తాయి.       కథనానికి దర్శకుడు విపిన్ దాస్ వాడిన క్రియేటివిటీయే ఈ వెడ్డింగ్ కామెడీకి బాక్సాఫీసు బలాన్నిచ్చింది.

—సికిందర్


27, జూన్ 2024, గురువారం

1442 : రివ్యూ!


రచన- దర్శకత్వం : నాగ్ అశ్విన్
తారాగణం : ప్రభాస్, దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, దిశా పటానీ, శోభన, అన్నాబెన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శాశ్వత చటర్జీ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణన్, ఛాయాగ్రహణం : జోర్డీ స్టోజిలికోవిచ్, కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ : వైజయంతీ మూవీస్
నిర్మాతలు : అశ్వనీ దత్, ప్రియాంకా దత్, స్వప్నా దత్
విడుదల : 27 జూన్, 2024

కథ

ఈ కథ మహాభారత కాలంలో  కురుక్షేత్ర యుద్ధంతో ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో అర్జునుడు (విజయ్ దేవరకొండ) విజయవంతంగా ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటే, అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) అలా చేయలేకపోతాడు. పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అతను పాండవ స్త్రీల గర్భాల మీదకి  దారి మళ్ళిస్తాడు. అది గర్భంతో వున్న అర్జునుడి  కోడలు ఉత్తర కడుపుని ఛేదిస్తుంది.  దాంతో శ్రీకృష్ణుడు ఆమె గర్భంలోని మృత శిశువుని బతికించి, అశ్వత్థామని మరణం లేకుండా నరకం అనుభవించమని శపిస్తాడు. భవిష్యత్తులో ఆరువేల సంవత్సరాల నాడు పుట్టబోయే విష్ణువవతారం కల్కిని కాపాడాల్సిన బాధ్యత అతడి మీదేస్తాడు. దాంతోనే అతడికి శాప విముక్తి లభిస్తుందంటాడు.

ఇప్పుడు ఆరువేల సంవత్సరాల తర్వాత 2898 లో కాశీలోని అరాచక (డిస్టోపియన్) రాజ్యంలో పాలకుడు సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే స్థావరాన్ని ఏర్పర్చుకుని వుంటాడు. అతనొక కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు సంతానోత్పత్తి లాబ్ ని సృష్టించుకుంటాడు. ఆ లాబ్ లో గర్భవతుల్ని బందీల్ని చేసి సీరం తీసి ప్రయోగాలు చేస్తూంటాడు. ఈ ప్రయోగాలకి సు - మేటి అలియాస్ సుమతి (దీపికా పదుకొనే) చిక్కుతుంది. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు కల్కి.
         
ఇది గ్రహించిన అశ్వత్థామ ఆమెని కాపాడుకునేందుకు పోరాటం ప్రారంభిస్తాడు. ఇదే సమయంలో నేరస్థుల్ని పట్టుకుని  కాంప్లెక్స్ కి అప్పగించి పారితోషికాలు పొందే బౌంటీ హంటర్ భైరవ (ప్రభాస్) అనే షోకిల్లా రాయుడు
, సుమతీ గురించి తెలుసుకుని, ఆమెని పట్టుకుని కాంప్లెక్స్ కి అప్పగించే ప్రయత్నాలు మొదలెడతాడు.
         
దీంతో అశ్వత్థామకీ
, భైరవకీ మధ్య భీకర  ఘర్షణ ప్రారంభమవుతుంది. ఇప్పుడు సుమతీ కోసం వీళ్ళిద్దరి పోరాటంలో ఎవరు గెలిచారు?
అశ్వత్థామ, భైరవల మధ్య వున్న గత సంబంధమేమిటి? ఈ సంఘర్షణలో యాస్కిన్ తీసుకున్న కఠిన చర్యలేమిటి? అసలు సుమతీ ఎవరు? ఇవీ మిగతా భాగంలో తెలిసే విషయాలు.

ఎలావుంది కథ

పురాణాన్ని ఆధునిక సైన్స్ ఫిక్షన్ తో మిక్స్ చేసి ఒక యాక్షన్ థ్రిల్లర్ ప్రయోగం చేసి నప్పుడు అందులో భావోద్వేగ బంధాన్ని మరిచారు. గర్భస్థ శిశువు కల్కి ప్రమాధంలో వుందన్న భక్తి భావం పాయింటు చుట్టూ తిరగాల్సిన ఈ మెగా బడ్జెట్ కమర్షియల్ కథని, చదును చేసి ఫీల్ లేకుండా చేశారు. ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే ఇలాటి పురాణ కథ భక్తిభావం ప్రవహిస్తూ స్పిరిచ్యువల్ థ్రిల్లర్ గా వుండాల్సింది- పురాణాన్ని వేరుగా, సైన్స్ ఫిక్షన్ ని వేరుగా చేసి చూపించారు. 
       
దీని మీద హాలీవుడ్ మార్వెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాల ప్రభావం వుందనేది తెలిసిపోతూనే వుంది. అయితే మార్వెల్ యాక్షన్ థ్రిల్లర్లు స్పిరిచ్యువాలిటీతో సంబంధం లేనివి. వీటికి పూర్వం స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన
రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అనే యాక్షన్ మూవీ ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే స్పిరిచ్యువల్ థ్రిల్లర్ గా అంత హిట్టయింది. ఇందులో బైబిల్ కాలపు పురాతన వస్తువు (ఆర్క్) కోసం జర్మన్ నాజీలతో ఆర్కియాలజిస్టు హీరో పోరాటం వుంటుంది. చివరికి ఆ ఆర్క్ ని చేజిక్కించుకున్న నాజీలు మాడి మసై పోతారు.
       
ఆర్క్ ఎంత పవిత్రమైనదో
, గర్భస్థ శిశువు కల్కి కూడా అంతే పవిత్రమైనది. దీన్ని హైలైట్ చేస్తూ, దీని చుట్టూ భక్తి భావం వర్సెస్ ప్రమాదం అనే ద్వంద్వాలతో కూడిన సంఘర్షణగా చూపించి వుంటే -ఇది ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే బలమైన భావోద్వేగ బంధంతో వుండేది. దీన్ని వదిలేసి ఇతర పాత్రల కథలతో, పోరాటాలతో అధిక సమయం గడిపేయడంతో ప్రధాన కథకి, పాత్రలకీ స్పేస్ లేకుండా పోయింది. ఫస్టాఫ్ ప్రభాస్ నాల్గు సీన్లలో, సెకండాఫ్ ఏడు సీన్లలో మాత్రమే కనిపిస్తాడు! దీంతో కథకి  ఎమోషనల్ కనెక్ట్, స్పిరిచ్యువాలిటీ, ఆత్మిక దాహం వగైరా అంశాలు ఆవిరై పోయాయి.
       
గంటన్నర ఫస్టాఫ్
, గంటన్నర సెకండాఫ్ కథలో ఫస్టాఫ్ పెద్దగా ఏమీ జరగదు. కథ ప్రారంభం కాకుండా ఉపోద్ఘాతమే వస్తూంటుంది. సెకండాఫ్ దాదాపు గంట గడిచాక- అమితాబ్, ప్రభాస్ ల ఘర్షణకి బీజం పడ్డాకే కథ ప్రారంభమవుతుంది. అంటే సామాన్య భాషలో చెప్పుకుంటే ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. ఇలాటి భారీ కథలు కథగా వుండనవసరంలేదు, గాథగా వుండొచ్చు. అందుకే ఇలా వుంది. ఆ తర్వాత అరగంట సుమతి కోసం జరిగే పోరాటంతో వూపందుకుంటుంది గాథ.  క్లయిమాక్స్ యాక్షన్, గాథ ముగిస్తూ సీక్వెల్ కోసం ఇచ్చే ట్విస్టూ బావుంటాయి. ఒకలాంటి సంతృప్తితో బయటికి పోవచ్చు ప్రేక్షకులు.

నటనలు – సాంకేతికాలు

ప్రభాస్ బౌంటీ హంటర్ గా సరదా పాత్ర పోషించాడు. పూరీ జగన్నాథ్ తీసిన ఏక్ నిరంజన్ లోకూడా బౌంటీ హంటర్ పాత్ర నటించాడు. ఈసారి పాత్రకి బుజ్జి అనే రోబో తోడయ్యింది. ఈ రోబోతోనే కామెడీలు చేశాడు. సినిమా ప్రారంభమయిన అరగంటకి ఎంట్రీ ఇచ్చే ప్రభాస్ ఫస్టాఫ్ లో కథతో స్పర్శ లేకుండా ఇంకో మూడు సీన్లు నటించి, వీటిలో రెండు సీన్లు దిశాపటానీ తో రోమాన్సు  చేసి వెళ్ళిపోతాడు. సెకండాఫ్ లో కూడా ఇతర పాత్రల కథలు అడ్డు రావడంతో అప్పుడప్పుడు మాత్రమే కనిపించి, చివరి అరగంట పూర్తిగా యాక్షన్ లో వుంటాడు. ప్రభాస్ ఇలా పొదుపుగా కనిపించడం ఫ్యాన్స్ కి ఇబ్బందే.
       
సెకండాఫ్ లో వచ్చే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా అధిక యాక్షన్ లో వుంటాడు. ఈ యాక్షన్లో వీరత్వంతో బాటు నిస్సహాయత
, పట్టుదల, త్యాగం మొదలైనవి తన స్కిల్స్ తో నటించి కట్టి పడేస్తాడు. అలాగే విలంగా రెండు సీన్లలో కన్పించే కమల్ హాసం కూడా. గర్భంలో కల్కిని మోస్తున్న కీలక పాత్రలో దీపికా పదుకొనే తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాత్రచిత్రణ వడం పెద్ద లోపం.
       
ఇక అతిధి పాత్రల్లో దుల్కర్ సల్మాన్
, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం క్లుప్తంగా కనిపిస్తారు. టెక్నికల్ గా విజువల్  వండర్ అని చెప్పుకోవచ్చు. యుద్ధాలు జరిగి ధ్వంసమైన భూమ్మీద ఏర్పాటయిన కొత్త జీవితాలు, ఆవాసాలు, వాహనాలు, ఆయుధాలు, ఇంగ్లీషు కలిసిన తెలుగు భాష- ఇలా ఒక భవిష్యద్దర్శనం చేస్తుంది సినిమా దృశ్య వైభవంతో.
        
సంతోష్ నారాయణన్ సంగీతం పెద్ద హైలైట్. జోర్డీ స్టోజిలికోవిచ్ ఛాయాగ్రహణం అంతర్జాతీయ ప్రమాణాలు గలది. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు కూర్పు పదునుగా వుంది. దర్శకుడు నాగ్ అశ్విన్,  నిర్మాతలు అశ్వనీ దత్, కుమార్తెలు ప్రియాంకా దత్, స్వప్నా దత్ లు ఒక వెంటాడే డ్రామా తో కూడిన క్రియేషన్ ని అందించకపోయినా, పాన్ ఇండియాకి తెలుగు నుంచి ఒక గర్వకారణాన్ని మాత్రం అందించగలిగారు.
—సికిందర్


24, జూన్ 2024, సోమవారం

1441 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : రాజేష్ జగన్నాధం
తారాగణం : రుణ్ సందేశ్, ఎనీ, శ్రియా రాణిరెడ్డి, తనికెళ్ల భరణి, అన్నీ, భద్రమ్, చత్రపతి శేఖర్, మైమ్ మధు తదితరులు
సంగీతం : సంతు ఓంకార్, ఛాయాగ్రహణం : రమీజ్ నవీత్  నిర్మాత: రాజేష్ జగన్నాధం
విడుదల : జూన్ 21, 2024

***

        తెరమరుగైన హేపీడేస్ హీరో వరుణ్ సందేశ్ చాలాకాలం తర్వాత తెరపైకొచ్చాడు. ఈసారి తనకి అలవాటయిన రోమాంటిక్ సినిమా కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ ప్రయత్నించాడు. దీనికి రాకేష్ జగన్నాథం కొత్త దర్శకుడు, నిర్మాత.  అయితే వారం వారం ఇంకో మార్గం లేనట్టు అర్షకత్వం వచ్చిపడుతున్న సస్పెన్స్ థ్రిల్లర్స్ సూచిస్తోంది. నిడివి కూడా రెండు గంటలే వుంది. నిండా టైటిల్ బావుంది. బరువైన కథని సూచిస్తోంది. మరి ఇదెంత బలంగా ఆకట్టుకునే అవకాశముంది? చూద్దాం...

కథ

వివేక్ (వరుణ్ సందేశ్)  మానవ హక్కుల సంఘంలో పని చేస్తూంటాడు. అతడి తండ్రి (తనికెళ్ళ భరణి) జడ్జి. ఇతను మంజు అనే అమ్మాయి హత్య కేసులో బాలరాజు (ఛత్రపతి శేఖర్) కి మరణ శిక్ష విధిస్తాడు. అయితే బాలరాజుని తప్పుడుగా శిక్షించానని బాధపడుతూ మరణిస్తాడు. తండ్రి మాటలు నమ్మిన వివేక్, అమాయకుడైన బాలరాజుని కేసు నుంచి విడిపించడానికి రంగంలోకి దిగుతాడు. సాక్ష్యాధారాల్ని తారుమారు చేసిన ఒక ఎస్సైని, డాక్టర్ ని, లాయర్ని, కానిస్టేబుల్ ని, ఇద్దరు సాక్షుల్నీ కిడ్నాప్ చేసి గదిలో బంధించి నిజం కక్కించే పని చేపడతాడు. ఏమిటా నిజం? మంజునెవరు ఎందుకు చంపారు? బాలరాజునెలా ఇరికించారు? అసలు దోషిని పట్టుకుని ఉరిశిక్ష నుంచి బాలరాజుని వివేక్ ఎలా కాపాడాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఒక బలహీన రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథే. సస్పెన్స్, థ్రిల్ లేకుండా వారం వారం వస్తున్న అమెచ్యూర్ కథే. అయితే ఇది ఇంకో అడుగు ముందుకెసి సస్పెన్స్, థ్రిల్లే గాకుండా యాక్షన్ కూడా లేకుండా గదిలో డైలాగులతో నడిచే కథగా ముందుకొచ్చింది. కళ్ళు మూసుకుని డైలాగులు వింటూంటే కథ అర్ధమైపోతుంది. అంటే విజువల్ మీడియా లక్షణం కూడా లేని రేడియో నాటిక లాంటి కథ అన్నమాట. దీన్ని సినిమాగా తీయకుండా డైలాగులు రికార్డు చేసి ఆడియో విడుదల చేసినా సరిపోయేది.
       
మాస్కు వేసుకున్న వరుణ్ సందేశ్ ఆరుగుర్ని కిడ్నాప్ చేసి గదిలో బంధించడంతో మొదలవుతుంది. వాళ్ళకి మంజు హత్య కేసు వివరించి
, దీన్ని మీరెలా తప్పుదోవ పట్టించారో చెప్పమంటూ హింసిస్తాడు. అప్పుడు ఒకొక్కరూ చెప్పే ఫ్లాష్ బ్యాక్స్ తో కథ వస్తూంటుంది. ఫస్టాఫ్ గదిలో ఈ సంభాషణే, సెకండాఫ్ లోనూ గదిలో టేబుల్ చుట్టూ కూర్చుని ఈ సంభాషణే. గదిదాటి బయటి కెళ్ళదు కథ. ఫ్లాష్ బ్యాక్స్ లోనే బయట పల్లెటూళ్ళో సీన్లు వస్తాయి. ఇలా అడిగి అడిగి అడుగుతూ పోతూంటే, వాళ్ళు చెప్పీ చెప్పీ చెప్తూ పోవడమే కథనం.
       
ఇంతా చేసి ఆ ఆరుగురు తప్పు ఒప్పుకుంటారే తప్ప
, హత్య ఎవరు చేశారో వాళ్ళకీ తెలీదు. ఆ హత్యలో బాలరాజుని మాత్రం ఇరికించారు. ఇక్కడ్నుంచి క్లయిమాక్స్ లో నైనా అసలు దోషిని కనుక్కునేందుకు యాక్షన్ లో కొచ్చి బయట అడ్వెంచర్స్ చేస్తాడనుకుంటే అదీ జరగదు. జైల్లో వున్న బాలరాజునే అడిగితే బాలరాజు చెప్పేస్తాడు మంజుని చంపిందెవరో!
       
ఇలా డైలాగులతో నడిచే కథకి ఫ్లాష్ బ్యాక్స్ లో పల్లెటూళ్ళో వచ్చే సీన్లూ పేలవమే. పల్లెటూళ్ళో రోమాన్స్ చెప్పక్కర్లేదు. ఏ సీన్లో కూడా డ్రామా
, భావోద్వేగాలుండవు. చిత్రీకరణలో దర్శకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తుంది. పొలంలో హత్యకి గురై పడున్న అమ్మాయి శవమైతే – మేకప్ చెదరని గ్లామరస్ ఫేసుతో కళకళ లాడుతూ వుంటుంది. నిర్మాణంలో అన్ని  శాఖల్లోనూ అత్యంత బలహీనం ఈ సస్పెన్స్ థ్రిల్లర్.

నటనలు - సాంకేతికాలు

వరుణ్ సందేశ్ పాత్ర మానవ హక్కుల సంఘం ఉద్యోగి కాకపోయినా వచ్చే నష్టమేం లేదు. పాత్ర ఆ నేపథ్యం లోంచి వచ్చినట్టు కూడా వుండదు. పైగా 40 నిమిషాల పాటు వరుణ్ సందేశ్ మాస్క్ వేసుకుని ప్రేక్షకులకి మొహం చూపించడు. ప్రేక్షకులకి హీరో మొహం కనిపించకపోతే సినిమా ఎలా ఎంజాయ్ చేస్తారు. విలన్ ఆఖరి వరకూ మొహం చూపించకున్నా ఫర్వాలేదు. దీన్ని హీరోకి అప్లై చేస్తే ఎలా? ఆ ఆరుగురి ముందు మాస్కు వేసుకుని, ప్రేక్షకుల ముందు మాస్కు తీసేసి వుండాల్సింది. 40వ నిమిషంలో మాస్కు తీసేసి స్లోమోలో నడుచుకుంటూ పోతే అది బ్యాంగ్ అవుతుందా? అది వరుణ్ సందేశ్ అని ప్రేక్షకులకి ముందే తెలుసు. కాకపోతే మొహం చూడాలని వుంటుంది.
        
డైలాగ్ డెలివరీలో ఇంప్రూవ్ అయ్యాడు. కానీ నటించడానికి ఈ సినిమాలో విషయం లేదు. మిగిలిన పాత్ర ధారులందరూ కూడా బలహీన పాత్రల్ని బరువు మోస్తున్నట్టు నటించారు. సాంకేతికంగా చెప్పుకోవడానికేమీ లేదు. గదిలో బంధించిన కథకి సాంకేతికాలతో అవసరమే వుండదు. మొత్తానికి వరుణ్ సందేశ్ రూటు మార్చి సస్పెన్స్  థ్రిల్లర్ నటించినా కలిసిరాలేదు.
—సికిందర్