రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జూన్ 2024, శనివారం

1439 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
తారాగణం : సుధీర్ బాబు
, మాళవికా శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే, అర్జున్ గౌడ తదితరులు
సంగీతం :
చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : అరవింద్ విశ్వనాథన్  
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత:
 సుమంత్ జి నాయుడు
విడుదల :
 జూన్ 14, 202

***

        వ దళపతి (టైటిల్స్ లో ఇలాగే వేశారు) సుధీర్ బాబు ఒక పూర్తి స్థాయి మాస్ యాక్షన్ కి దిగాడు. చాలా ఇంటర్వ్యూలిచ్చి, ప్రమోట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం బాధ్యత తీసుకున్నాడు. అయితే వరస పరాజయాలతో సతమతమవుతున్న సుధీర్ బాబుకి ఈ కొత్త నేపథ్యపు మాస్ యాక్షన్ ప్రేక్షకుల్లోకి ఎంతవరకు వెళ్తుంది? ఈ సారైనా పాస్ మార్కులు పడతాయా? ఇందులో ప్లస్ మైనస్ లేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

చిత్తూరు జిల్లా  కుప్పంలో తిమ్మారెడ్డి(లక్కీ లక్ష్మణ్ ), అతడి తమ్ముడు బసవ (రవి కాలే), కుమారుడు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) అరాచకాలు చేస్తూంటారు. ప్రజల భూములు లాక్కుని చంపడం కూడా చేస్తూంటారు. ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ లాబ్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరతాడు. ఈ కాలేజీలోనే టీచర్ (మాళవికా శర్మ) ని ప్రేమిస్తాడు. ఇక్కడే సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ పళని స్వామి (సునీల్) తో స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవపడి కొట్టడంతో సస్పెండ్ అవుతాడు సుబ్రహ్మణ్యం. ఉద్యోగం పోయి, ఇంటిదగ్గర తండ్రి (జయప్రకాష్) చేసిన అప్పులు మీద పడి ఏం చేయాలా అని ఆలోచిస్తూంటే, పళని స్వామి దగ్గర ఒక పిస్తోలు కనిపిస్తుంది. దాని డిజైన్ కూడా చూపిస్తాడు పళని స్వామి. ఇక వాటి సాయంతో సుబ్రహ్మణ్యం డబ్బు సంపాదనకి నాటు పిస్తోళ్ళు తయారు చేయడం మొదలెడతాడు. వాటిని శరత్ రెడ్డికే అమ్ముతాడు. దీంతో అటు తమిళనాడు నుంచి గన్స్ సప్లై చేసే రాజ మాణిక్యంతో  గొడవలొస్తాయి. ఈ గొడవల్లో సుబ్రహ్మణ్యం తండ్రిని చంపబోయిన శరత్ రెడ్డిని సుబ్రహ్మణ్యం కొట్టడంతో అతను కోమాలోకి పోతాడు. దీంతో తిమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం మీద పగబడతాడు.
       
ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఏం చేశాడు
? తిమ్మారెడ్డినీ, అతడి తమ్ముడ్నీ ఎలా ఎదుర్కొన్నాడు? ప్రజలంతా సుబ్రహ్మణ్యంని దేవుడుగా ఎందుకు కొలిచారు? ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వూళ్ళో  అరాచక శక్తుల్ని అణిచే, ప్రజలంతా ఆ అరాచక శక్తుల్ని అణిచిన కథానాయకుడ్ని కొలిచే, వందల సార్లు వచ్చిన రొటీన్ కథకి గన్ కల్చర్ /స్మగ్లింగ్ ని జోడించి కొత్త కథగా తయారు చేశారు. ఈ అరాచక శక్తుల పాత్రల్ని కేజీఎఫ్ సినిమాల్లోంచి దిగుమతి చేసుకున్నారు. గన్ కల్చర్ నార్త్ ఇండియాకి చెందినదైనా, దీన్ని తెలుగు నేటివిటీలోకి  తీసుకురావడానికి కేజీఎఫ్, పుష్ప  సినిమాల ఛాయల్ని అద్దారు. ఫలితంగా ఇది ఈ మధ్య వచ్చి ఫ్లాపయిన రూరల్ యాక్షన్ సినిమాలకి భిన్నంగా తయారయ్యింది. రెండున్నర గంటలు సాగినా బోరుకొట్టకుండా పకడ్బందీ చిత్రీకరణతో రూపొందింది. బలమైన సన్నివేశాలు, డైలాగులూ ఆద్యంతం కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అయితే కరువయ్యిందేమిటంటే ఆ సన్నివేశాల్లో భావోద్వేగాలు. డ్రామాలో భావోద్వేగాలు, యాక్షన్ లో భావోద్వేగాలూ లోపించాయి. అలాగే సస్పెన్స్, టెన్షన్, థ్రిల్స్, కథలో మలుపులూ లేక- కేవలం ఒక నాన్ స్టాప్ యాక్షన్ సినిమాగా తయారయ్యింది. ఒక రొటీన్ ప్రతీకార కథకి గన్ కల్చర్, కేజీఎఫ్, పుష్పల హంగులు కూర్చి, భావోద్వేగాల పరమైన లోపాల్ని కవర్ చేస్తూ, అనుభవజ్ఞుడిలా తీర్చిదిద్దాడు దర్శకుడు.
       
ఫస్టాఫ్ పూర్తిగా కథని సెటప్ చేయడంతో సరిపోతుంది. పోలీస్ స్టేషన్లో సునీల్ పాత్ర చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. వూళ్ళో అరాచకాలు
, ఆ అరాచకాల మధ్య సుధీర్ బాబు పాత్ర దిగడం, పాలి టెక్నిక్ లాబ్ లో పనిచేస్తూ టీచర్ ని ప్రేమించడం, ఒకడ్ని కొట్టడం, దాంతో ఉద్యోగం పోవడం, ఇంటికెళ్ళి  పోయి అప్పులపాయిన తండ్రిని ఓదార్చి తిరిగి రావడం,  సునీల్ పాత్ర దగ్గర పిస్తోలు చూసి నాటు పిస్తోళ్ళు తయారు చేయడం వగైరా జరుగుతూ, అరాచక శక్తులతో గన్ బిజినెస్, దీంతో తమిళనాడు గన్ స్మగ్లర్ తో గొడవలు, తండ్రి మీద హత్యా ప్రయత్నం, ఆ తర్వాత విలన్ తమ్ముడ్ని కొట్టి కోమాలోకి పంపడం - ఇదంతా ఫస్టాఫ్ కథ.
       
ఈ ఫస్టాఫ్ కథలో లోపాలేమిటంటే
, గన్స్ తయారు చేసి వూళ్ళో అరాచక శక్తులకే అమ్మడం, దాంతో ఇంకింత రెచ్చిపోయి ఆ అరాచక శక్తులు అక్కడి జనాల్నే  కాల్చి చంపడం. ఇది సుధీర్ బాబు పాత్రని దెబ్బతీసే కథనం. అప్పుడైనా తప్పు తెలుసుకుని,  గన్స్ తయారీ ఆపేసి, అరాచక శక్తుల మీద పోరాటం ప్రకటించడు. డబ్బు కోసం ఇంకా భారీ యెత్తున గన్స్ తయారు చేసి ఇతరప్రాంతాలకి స్మగ్లింగ్ చేస్తూంటాడు. ఇక తమిళనాడు గన్ స్మగ్లర్ వచ్చి గొడవ పడడం దేనికో అర్ధం కాదు. సుధీర్ బాబు పాత్ర వూళ్ళోకి రాకముందు ఈ గన్ స్మగ్లర్ అరాచక శక్తులకి గన్స్ అమ్మకుండా ఏం చేస్తున్నాడు? ఇప్పుడెందుకొచ్చి గొడవ పడుతున్నాడు?
        
ఇక సెకండాఫ్ పూర్తిగా పగబట్టిన విలన్ కథ. ఈ కథలో సుధీర్ బాబు వూరికి విలన్ పీడా తొలగించి దేవుడవుతాడు. పాత కథే కాబట్టి సెకండాఫ్ ఏం జరుగుతుందో తెలిసిపోయే కథ. కాకపోతే పక్కదోవ  పట్టకుండా కథ చెప్పిన విధానం -దీని వేగం - హై ఓల్టేజ్ యాక్షన్ కూర్చోబెడుతాయి. సుధీర్ బాబు అన్ని  రకాల ఆయుధాలు ఎలా తయారు చేశాడో లాజిక్ అడగకూడదు. మిలిటరీ ఆయుధాలు కూడా అతడి చేతిలో వుంటాయి. క్లయిమాక్స్ యాక్షన్ సీన్లో ఇంకో భారీ ఆయుధం తీస్తాడు. ముగింపు మాస్ ప్రేక్షకులకి మాంచి కిక్.

నటనలు- సాంకేతికాలు

కొత్త లుక్ తో, చిత్తూరు భాషతో సాధారణ యువకుడి పాత్రని సుధీర్ బాబు బాగానే పోషించాడు. ఆ ఉగ్ర సుబ్రహ్మణ్యం పాత్ర పోరాటానికి తగిన భావోద్వేగాలు కూడా వుంటే నటన ఆకట్టుకునేది. ఇంటర్వెల్లో విలన్ తమ్ముడ్ని కొట్టి కాన్ఫ్లిక్ట్ ప్రారంభించినప్పుడు అది డొల్లగా వుంది. అప్పటికి ఒక లక్ష్యం, దేన్నైనా పణంగా పెట్టి తీసుకున్న రిస్క్ వంటి గోల్ ఎలిమెంట్స్ కాన్ఫ్లిక్ట్ లో లేకపోవడం వల్ల భావోద్వేగాలు పుట్టకుండా పోయాయి.
        
శివ లో స్టూడెంటైన నాగార్జున మాఫియా రఘువరన్ అనుచరుడు జేడీని కొట్టి కాన్ఫ్లిక్ట్ ని ప్రారంభించినప్పుడు- అందులో ఒక సామాన్య స్టూడెంట్  గా నేరుగా ఓ పెద్ద మాఫియాతో పెట్టుకుంటూ క్రియేట్ చేసిన ఆందోళన, దీంతో అన్న కుటుంబాన్ని పణంగా పెడుతున్న రిస్కు వగైరా వర్కౌటై భావోద్వేగాలు బలంగా పుట్టుకొచ్చాయి.
        
సుధీర్ బాబు విలన్ తమ్ముడ్ని కొట్టడంవల్ల తనకెదురవబోయే ఏ అపాయాల జాడా లేదు. అందువల్ల తర్వాత కథకి ఏ భావోద్వేగాలూ పుట్టకుండా కాన్ఫ్లిక్ట్ డొల్లగా తయార
య్యింది. కష్టపడి బాగా నటించాడు. అయితే జీవంకూడా వుండాలి.
       
హీరోయిన్ మాళవికా శర్మ టెంప్లెట్ పాత్ర నటించింది. ఫస్టాఫ్ లో హీరో ప్రేమకి పనికొచ్చేట్టు
, క్లయిమాక్స్ లో విలన్ కి పనికొచ్చేట్టు కన్పించింది.  సుధీర్ నేస్తం గా సునీల్ గుంభనంగా కన్పించే పాత్ర పోషించాడు సీరియస్ గా. సుధీర్ తండ్రి పాత్రలో జయప్రకాష్ బాధిత పాత్ర హింసాత్మక దృశ్యాలతో నటించాడు.  ఇక విలన్ పాత్రధారులు ముగ్గురూ కేజీఎఫ్ తరహా క్రౌర్యాన్ని ప్రదర్శించారు.
       
సినిమాకి ప్రధాన బలం సాంకేతికాలు.
చైతన్ భరద్వాజ్ సంగీతంగానీ, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణంగానీ టాప్ క్లాస్ గా వున్నాయి. ఆంజనేయులు సమకూర్చిన యాక్షన్ సీన్స్ ఇంకో ఆకర్షణ. జ్ఞాన సాగర్ దర్శకత్వం వీటికి తీసిపోకుండా వుంది. అయితే ఓపెనింగ్స్ చూశాక సినిమాని ఇంకా బలంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం కనపడుతోంది.

—సికిందర్ 


9, జూన్ 2024, ఆదివారం

1438 : రివ్యూ!

 

రచన- దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
తారాగణం : శర్వానంద్, కృతీశెట్టి, సీరత్ కపూర్, మాస్టర్ విక్రమ్ ఆదిత్య, రాహుల్ రవీంద్రన్, శివ కందూరి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం : హెషమ్  అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : విష్ణుశర్మ, జ్ఞానశేఖర్
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు : టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
విడుదల : జూన్ 7, 2024
***
        ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ గత ఏడు సినిమాలతో హిట్లు లేక ఒక హిట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తూ మనమే అనే ఫ్యామిలీ డ్రామాతో వచ్చాడు. ఉప్పెన తో తెలుగులో పాపులరైన హీరోయిన్ కృతీ శెట్టి ఆ తర్వాత శ్యామ్ సింఘరాయ్ తప్ప  తెలుగులో నటించిన అయిదు సినిమాలూ హిట్ కాక ఒక్క తెలుగు హిట్ కోసం తిరిగి అడుగుపెట్టింది. మొదటి సినిమా భలే మంచి రోజు తర్వాత మూడు సినిమాలూ హిట్ కాక ఒక హిట్ కోసం స్ట్రగుల్ చేస్తూ తిరిగి వచ్చాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ ముగ్గురూ మనమే అంటూ తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం వచ్చారు. ఇది కూడా హిట్ కాకపోతే కారణం మనమే అని చెప్పుకోవడానికి వీలుగా అన్నట్టు టైటిల్ పెట్టారు. మరి ఈ ముగ్గురి రిపోర్టు కార్డు ఎలా వుందో చూద్దాం...

కథ

విక్రమ్(శర్వానంద్) లండన్ లో అమ్మాయిల్ని అల్లరి పెడుతూ ప్లే బాయ్ లా గడిపేస్తూంటాడు. అతడికో ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్) వుంటాడు. అనురాగ్ అతడి భార్య శాంతి  (మౌనిక) ఇండియాకి వెళ్ళి ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో వాళ్ళ కొడుకు ఖుషీ (విక్రమ్ ఆదిత్య) అనాథ అవుతాడు. శాంతి  లవ్ మ్యారేజీ చేసుకుందని దూరం పెట్టిన ఆమె పేరెంట్స్ ఖుషీని పెంచుకోవడానికి నిరాకరిస్తారు. దీంతో శాంతి  ఫ్రెండ్ సుభద్ర (కృతీ శెట్టి) ఖుషీని పెంచుకోడానికి ముందుకొస్తుంది. అయితే ఇంగ్లాండ్ లో పుట్టిన ఖుషీకి అక్కడి చట్టాలు వరిస్తాయి.  ఆ చట్ట ప్రకారం కనీసం నాలుగు నెలలు ఎవరైనా కేర్ టేకర్స్ ఖుషీని పేరెంట్స్ లా చూసుకోవాలి, లేదా ఇంగ్లాండ్ ప్రభుత్వం అనాధాశ్రమానికి అప్పజెప్తుంది.
       
దీంతో
విక్రమ్, సుభద్రతో కలిసి లండన్ లో ఖుషీని  చూసుకోడానికి సిద్ధమవుతాడు. ఇటు సుభద్రకి కార్తీక్ తో(శివ కందుకూరి) నిశ్చితార్థం జరిగి వుంటుంది. ఈ నేపథ్యంలో విక్రమ్, సుభద్ర ఖుషీని ఎలా చూసుకున్నారు? ఈ క్రమంలో తలెత్తిన సమస్యలేమిటి? ఖుషీ వల్ల విక్రమ్ జీవితంలో ఎలాటి మార్పు వచ్చింది? సుభద్ర విక్రమ్ తో వుండడానికి కార్తీక్ ఒప్పుకున్నాడా? చనిపోయిన విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్ బిజినెస్ పార్ట్నర్ తో వచ్చిన కష్టాలేమిటి? విక్రమ్, సుభద్రమధ్య ప్రేమ ఎలా పుట్టింది, పుడితే ఆ ప్రేమ ఏమయ్యింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ కథ మార్పు చేర్పులతో హాలీవుడ్ లైఫ్ యాజ్ వి నో ఇట్ (2010) కథలా వుంది. అయితే హాలీవుడ్ కథ పెళ్ళికాని ఇద్దరు యువతీ యువకుల మధ్య పెంపకానికి ఆడపిల్ల (తెలుగులో పిల్లాడు) వస్తే ఏం జరుగుతుందనే పాయింటుతో వుంటుంది. ఈ పాయింటుని డ్రైవ్ చేస్తూ దాని పరిణామాల్ని, పర్యవసానాల్నీ చిత్రించే సన్నివేశాలతో కూడుకుని ఒక ట్రాకులో రెండు గంటల కామెడీ కథ వుంటుంది. కానీ తెలుగులో రెండున్నర గంటలు సాగదీసినా ఏ పాయింటుతో కథ నడుస్తోందో చెప్పలేకపోయాడు దర్శకుడు. సెకండాఫ్ వచ్చేసరికి ఎందుకిలా కన్ఫ్యూజై పోతారు దర్శకులు? ఇది హిట్టవ్వాలంటే మనమే అని ఫ్లాపుల్లో వున్న హీరో హీరోయిన్లు, దర్శకుడు ఇప్పుడైనా కలిసి కూర్చుని పద్ధతిగా ఆలోచించలేదా? లండన్లో శర్వానంద్ పాత్ర ఎలా అవారాగా వుందో అలా అవారాగా, అనాధగా మారిపోయింది కథ!
       
పాయింటు మీద నిలబడితే ఈ పాయింటు లోంచి పుడుతూ వుండే భావోద్వేగాలతో కథకి బలం వస్తుంది. పాయింటునే గుర్తించకపోవడంతో భావోద్వేగాలే లేకుండా చప్పగా మారింది కథ. దర్శకుడు చేసిన ఇంకో పొరపాటు ఏమిటంటే
, మొదటి ఇరవై నిమిషాల్లో పిల్లాడిని చేపట్టాల్సిన పాయింటుకి వచ్చేయడం. ఇంత త్వరగా పాయింటుని ఏర్పాటు చేసిన సినిమాల్ని రెండున్నర గంటల కథ చేయలేక చేతులెత్తేసిన సినిమాలు చాలా వున్నాయి. అందుకని 45 నిమిషాలకో, లేదా ఇంటర్వెల్లోనో పాయింటుని ఎస్టాబ్లిష్ చేసి, కథ చెప్పే సమయాన్ని తగ్గించుకుని సేఫ్ అవుతున్నారు  కొంత మంది.
       
దర్శకుడు ఇది కూడా గుర్తించకుండా హాలీవుడ్ స్ట్రక్చర్ ప్రకారం మొదటి అరగంట లోపు పాయింటుని ఎస్టాబ్లిష్ చేయడంతో
, అసలా ఎస్టాబ్లిష్ చేసిన పాయింటుతోనే కథ నడపాలని గుర్తించకపోవడంతో, ఆ తర్వాత పావుగంటకే ఫస్టాఫ్ లో కథ కుప్పకూలడం ప్రారంభమైంది.
       
పిల్లాడి పెంపకం గురించి శర్వానంద్ ఎన్ని కామెడీలు చేసినా అది పైపైనే వుండిపోయింది తప్ప
, ఎక్కడా ఒక ఫీల్ గుడ్ మూవీలా హృదయపూర్వకంగా నవ్వించలేదు. సినిమా దారి సినిమాదే, ప్రేక్షకుల దారి ప్రేక్షకులదే. ఎక్కడా కనెక్షన్ లేదు, విలన్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ కామెడీలు సహా. కృతీశెట్టికి వేరే నిశ్చితార్ధం పెట్టడం వల్ల కూడా ఉపయోగమేమీ లేదు. చివరికి శర్వానంద్, కృతీ ఒకటవుతారని వూహించేదే. పై హాలీవుడ్ సినిమా మూస ఫార్ములా కథే. అయితే అందులో పాయింటు చుట్టూ కథ వుంటుంది. చివరికి ముగింపుకూడా 2010,  దానికి ముందూ  వచ్చిన సినిమాల్లో లాంటి మూస ముగింపే. ఈ ముగింపైనా తెలుగులో మార్చలేదు. ఇంకా అరిగిపోయిన ముగింపే వర్కౌట్ అవుతుందనుకున్నారు.
       
సెకండాఫ్ పూర్తిగా దారి తప్పింది. ఏవో సన్నివేశాలు వస్తూంటాయి
, పోతూంటాయి. ఏం జరుగుతోందో అర్ధంగాక సహన పరీక్షగా మారుతుంది. మధ్యమధ్యలో వెన్నెల కిషోర్ వచ్చి నవ్వించి పోవడమే బావుంది. రెండున్నర గంటలు చక్కర్లు కొట్టిన కథ చివరికి పిల్లాడి విషయంలో శర్వానంద్, కృతీ తీసుకునే నిర్ణయంతో ఓ ఫార్ములా మలుపు తీసుకుని ముగుస్తుంది.

నటనలు- సాంకేతికాలు

శర్వానంద్ యాక్టివ్ నటన, జోకులు, పాత్ర తీరు, కాస్ట్యూమ్స్ ఇవిమాత్రం బాగా వర్కౌటయ్యాయి. అయితే వీటితో ఎంతసేపు రంజింప జేయగలడు. కృతీ శెట్టి పాత్ర, నటన, శర్వానంద్ తో రోమాన్స్ ఈసారి బాగా కుదిరాయి. కానీ సెకండ్ హీరోయిన్ గా సీరత్ కపూర్ పాత్ర వృధా. అలాగే రాహుల్ రవీంద్రన్ విలన్ పాత్రలో, నటనలో బలం లేదు. వెన్నెల కిషోర్, రామకృష్ణలు కామెడీ పాత్రల్లో నవ్వించే పని మాత్రం లోటులేకుండా చూసుకున్నారు.
       
సందర్భానుసారం వచ్చిపోయే పాటలు 16 వున్నాయి. సినిమాలో విషయం లేనప్పుడు ఇన్ని పాటలెందుకో. హేషమ్ సంగీతంలో రెండు పాటలు మాత్రం బావున్నాయి.  విష్ణుశర్మ
, జ్ఞానశేఖర్ ల ఛాయాగ్రహణం విదేశీ లొకేషన్స్ వల్ల రిచ్ గా వుంది. విజువాల్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఈ భారీ తనంతో సినిమాలో విషయం కూడా సరితూగి వుండాల్సింది. మొత్తానికి ముగ్గురూ మనమే అంటూ ఇలాటి ఉపయోగం లేని ప్రయత్నం చేశారు.

—సికిందర్


6, జూన్ 2024, గురువారం

1437 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : ఉదయ్ శెట్టి
తారాగణం :  ఆనంద్ దేవరకొండ, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ఇమ్మాన్యుయేల్  తదితరులు.
సంగీతం : చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : ఆదిత్య జె.
బ్యానర్ : హై-లైఫ్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
***
          2023 లో బేబీ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించడానికి సమ్మర్ సినిమాతో వచ్చాడు. ఇటీవల వచ్చిన క్రైమ్ కామెడీ లేవీ నిలబడ లేదు. సస్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీలు నిలబడేందుకు మొరాయించి మొండి చెయ్యి చూపిస్తున్నాయి. అలాటిది మరో కొత్త దర్శకుడు క్రైమ్ కామెడీతో తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మరి దీంతో ఎంత నవ్వించాడు, ఎంత నిలబెట్టాడు అన్నవి ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతుకుతూ ముందుగా కథ లోకి వెళ్దాం...

కథ

గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ), శంకర్(ఇమ్మాన్యుయేల్‌) దొంగతనాలు చేసి జీవిస్తూంటారు. గణేష్‌కి శృతి (నయన్ సారిక) తో ప్రేమ వ్యవహారముంటుంది. ఆమె తాను పనిచేసే షాప్ ఓనర్ తో పెళ్ళికి సిద్ధమవడంతో, గణేష్ హర్ట్ అవుతాడు. ఆమె డబ్బుకోసం పెళ్ళికి సిద్ధపడితే ఈలోగా తానూ డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతానని సవాలు విసురుతాడు. ఓ నగల షాపులో 7 కోట్ల విలువైన వజ్రాన్ని కొట్టేసే ఆఫర్ రావడంతో ఆ వజ్రాన్ని కొట్టేసి అమ్ముకుందామని దాంతో పారిపోతాడు.
        
చెన్నై వెళ్తూండగా పోలీసులు చెకింగ్ చేస్తూండడంతో భయపడి వజ్రాన్ని అటుగా తీసికెళ్తున్న వినాయకుడి విగ్రహం తొండంలో పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న కిషోర్ రెడ్డి ఆ విగ్రహాన్ని ముంబాయిలో తయారు చేయించి తీసుకొస్తూంటాడు. అయితే కిషోర్ రెడ్డి వూరికి వెళ్ళాల్సిన విగ్రహం ప్రత్యర్ధి వూరికి వెళ్తుంది. దీంతో ఆ విగ్రహం కోసం ప్రయత్నాలు మొదలవుతాయి.
       
విగ్రహం కిషోర్ రెడ్డికి ఎందుకు విలువైనది
? అందులో ఏం దాచి పెట్టి ముంబాయి నుంచి రప్పిస్తున్నాడు? విగ్రహం తొండంలో వజ్రాన్ని పడేసిన గణేష్ కది దక్కిందా లేదా? దాంతో కోటీశ్వరుడై శృతిని పెళ్ళి చేసుకున్నాడా లేదా?  ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇదే వారం విడుదలైన భజే వాయు వేగం లో తండ్రి ఆపరేషన్ కోసం హీరో కారు కొట్టేసి పారిపోతాడు. ప్రస్తుత సినిమాలో కోటీశ్వరుడవడం కోసం హీరో వజ్రాన్ని కొట్టేసి పారిపోతాడు. రెండూ ఒకే లాంటి కథలు. అయితే మొదటిది బరువైన సెంటిమెంటల్ డ్రామా, రెండోది క్రైమ్ కామెడీ. ఏదో విలువైనది ఎక్కడో మిస్ అవడం, దాని కోసం వివిధ గ్యాంగులు వేటలో పడ్డం కూడా కొత్త కథేమీ కాదు. అనగనగా ఒక రోజు’, స్వామి రారా వంటి హిట్స్ గతంలో వచ్చాయి. ప్రస్తుత సినిమాని కూడా అలాటి హిట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిల్లీ కథ వల్ల పాక్షికంగానే సఫలమయ్యారు.
          
ఫస్టాఫ్ పాయింటుకి రావడానికి లవ్ ట్రాకుతో చాలా సేపు సాగదీశారు. హీరోయిన్ తో సుదీర్ఘ లవ్ ట్రాకు పెట్టి, హీరో ఆమెకి సవాలు  చేసిన తర్వాత వజ్రాన్నిదొంగిలించి పారిపోవడం, దాన్ని వినాయకుడి విగ్రహంలో వేయడం, అది విలన్ ప్రత్యర్ధి వూరికి చేరడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇప్పుడా విగ్రహం ఇటు విలన్ కి, అటు హీరోకీ ఇద్దరికీ అవసరం.
        
ఇప్పుడు సెకండాఫ్ లో ఆ విగ్రహంకోసం ప్రయత్నాల్ని కామెడీగా మార్చి నడిపించారు. ఈ ప్రయత్నాలు సిల్లీగా వున్నా కామెడీ కాబట్టి సీరియస్ గా తీసుకోవద్దన్నట్టు నడిపించారు. కానీ హీరో విలన్ల మధ్య బలమైన ఎత్తుగడలు వుండుంటే ఆ కామెడీ లాజికల్ గా వర్కవుటై క్రియేటివిటీతో ఇంకా బావుండేది. ఈ కామెడీకి సారధి డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్ గా నటించిన వెన్నెల కిషోర్. సెకండాఫ్ పూర్తిగా వెన్నెల కిషోర్ చేసే సిల్లీ కామెడీ మీద ఆధారపడింది. తన స్కిల్స్ తో అంతలా నవ్వించకపోతే సెకండాఫ్ ప్రమాదంలో పడేది.
       
కథలో క్లయిమాక్స్ ట్విస్టు ఒక్కటే ఉత్కంఠ రేపుతుంది. ఇక ముగింపుగా తుపాకులతో కాల్చుకోవడమన్నది
స్వామిరారా లాంటిదే. అయితే మధ్యలో హీరోకి సెకెండ్ హీరోయిన్ ప్రగతీ శ్రీవాస్తవతో ఇంకో లవ్ ట్రాక్ పెట్టడం వర్కౌట్ కాలేదు. అది కథని పక్కదోవ పట్టించింది. మొత్తానికి సిల్లీ కామెడీతో ఈ సాధారణ కథని గట్టెక్కించే ప్రయత్నం చేశారు.

నటనలు – సాంకేతికాలు

ఆనంద్ దేవరకొండ ఈసారి కామెడీ నటించడంలో కృషి చేశాడు. పరిమిత భావాలు పలికే మొహంలో కామెడీకి కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ శూన్యమైనా ప్రేక్షకుల్ని గతంలోలా ఇబ్బంది పెట్టకుండా కామెడీ నటించడం కోసం ఫర్వాలేదన్పించే స్థాయిలో కష్టపడ్డాడు. ఇక మిగతా రోమాన్స్, యాక్షన్ మామూలే. అయితే హీరోయిన్లిద్దరికీ పెద్దగా పాత్రల్లేవు. విలన్లుగా  రాజన్, కృష్ణ చైతన్య క్రూరత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయేల్ కామెడీలు మాత్రమే ఈ సినిమాకి హైలైట్.
        
చేతన్ భరద్వాజ్ సంగీతం, ఆదిత్య ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక హంగులు ఫర్వాలేదనిపించేలా వున్నాయి. కొత్త దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి కొత్తదనం కోసం ప్రయత్నించకుండా, రొటీన్ ఫార్ములా సేఫ్ జోన్ లోనే వుండిపోయాడు.

—సికిందర్


1436 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : ప్రశాంత్ రెడ్డి
తారాగణం : కార్తికేయ, ఐశ్వర్యా మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ళ భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు. 
సంగీతం : రథన్ (పాటలు), కపిల్ కుమార్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), ఛాయాగ్రహణం : ఆర్.డి రాజశేఖర్
నిర్మాణం : యూవీ కాన్సెప్ట్స్
విడుదల : మే 31, 2024
***

        రెక్స్ 100 తర్వాత సరైన విజయాలు లేని కార్తికేయ ఇప్పుడు మరో యాక్షన్ మూవీతో సక్సెస్ కోసం ప్రయత్నం చేశాడు. రెండు సినిమాల్లో విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నా మళ్ళీ విలన్ గా నటించకుండా హీరోగానే నటిస్తూ ఇటీవల బెదుర్లంక తో మెప్పించే ప్రయత్నం చేశాడు. దీనితర్వాత ఇప్పుడు భజే వాయువేగం అనే యాక్షన్ మూవీని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో నటించాడు. ఇంతకీ ఈ మూవీ అయినా కార్తికేయని గట్టెక్కిస్తుందా? తెలుసుకుందాం...

కథ

వెంకట్‌(కార్తికేయ), రాజు ( రాహుల్ టైసన్) అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి లక్ష్మయ్య (తనికెళ్ళ) వీళ్ళ ఆసక్తులు గమనించి కొంత పొలం అమ్మేసి హైదరాబాద్ పంపిస్తాడు. వెంకట్ క్రికెట్ లో, రాజు సాఫ్ట్ వేర్ లో చేరడానికి వస్తారు. కానీ వెంకట్‌ క్రికెట్‌లో సెలక్ట్ వాలంటే పది లక్షలు కట్టాలి. మరోవైపు రాజు జాబ్ లో చేరాలంటే అయిదు లక్షలు కట్టాలి. దీంతో రాజు స్టార్ హోటల్‌లో సర్వెంట్‌గా చేరతాడు. ఇంతలో వూళ్ళో తండ్రి ఆరోగ్యం చెడి పది లక్షలు అవసరపడతాయి. ఈ డబ్బు కోసం వెంకట్ క్రికెట్ బెట్టింగ్స్ కి పాల్పడతాడు. అందులో 40 లక్షలు గెలిచినా బెట్టింగ్ మాఫియా మోసం చేసి 40 లక్షలు ఎదురు కట్టాలంటాడు. ఆ డబ్బు కోసం రాజు డేవిడ్ ని కలుస్తాడు. హోటల్ ఓనర్ డేవిడ్ (రవిశంకర్‌) మేయర్‌ తమ్ముడు.  డేవిడ్  బెట్టింగ్ మాఫియానే సపోర్టు చేయడంతో వెంకట్, రాజు అతడి కారు తీసుకుని పారిపోతారు అమ్ముకుందామని.
        ఆ కారులో శవముంటుంది, డబ్బు వుంటుంది, వేరే వేల కోట్ల హవాలా డబ్బుకి సంబంధించి పాస్ కోడ్ గా 500 రూపాయల నోటు వుంటుంది.  ఇప్పుడేం జరిగింది? ఇంత క్రైమ్ లో ఇరుక్కున్న అన్నదమ్ములు హాస్పిటల్లో వున్న తండ్రిని కాపాడుకోవడం కోసం ఏం చేశారు? కారుకొసం వెంటబడ్డ ముఠాలు కారుని దక్కించుకున్నాయా? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

సాధారణ ఫార్ములా కథే. 2022 లో హాలీవుడ్ మూవీ అంబులెన్స్ ఇలాటిదే కథ. భార్య సర్జరీకి డబ్బు కావాల్సి వచ్చి, తమ్ముడితో కలిసి బ్యాంకుని దోచుకుని అంబులెన్స్ లో పారిపోయే కథ.  ఇది పూర్తి స్థాయి యాక్షన్ జానర్లో కొచ్చే కథ.  భార్య సర్జరీ కోసం డబ్బులు అనే నిస్సహాయులైన అన్నదమ్ముల భావోద్వేగాల్ని కేంద్రంగా చేసుకుని అల్లిన యాక్షన్ కథ. కానీ తెలుగులో యాక్షన్ తక్కువ, సెంటిమెంటల్ డ్రామాలు ఎక్కువ. తండ్రితో అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్టాఫ్ అంతా ఒకటే సీన్లు, డైలాగులు, కన్నీళ్లు, కష్టాలు. హైదరాబాద్ లో అన్నదమ్ముల బాధలు, వూళ్ళో తండ్రి శోకాలు. ఇలా ఫస్టాఫ్ కథ ముందుకు కదలక, ఎంతో ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప ఎమోషనల్ డ్రైవ్ సాధ్యం కాదన్నట్టు నడిపాడు దర్శకుడు. దీని వల్ల యాక్షన్ సినిమా ఫీల్ చెడింది.  యాక్షన్ తో వుండే యూత్ అప్పీల్, మార్కెట్ యాస్పెక్ట్ ఆ మేరకు సన్నగిల్లాయి.
       
తండ్రికి ఆపరేషన్ డబ్బుల కోసం మాఫియా కారులో పారిపోయే సెకండాఫ్ కథతో యాక్షన్లో కొస్తుంది మూవీ. వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఫాదర్ సెంటిమెంట్లోకే తిరగబెడుతుంది. ఇది చాలదన్నట్టు తమ్ముడి పాత్ర ఎప్పుడు చూసినా ఏడుస్తూనే వుండడం. ముందుకెళ్ళే అన్నకి బ్రేకులు వేసే ఏడ్పులు. ఇలా అన్నదమ్ముల అనుబంధం
, తండ్రితో అన్నదమ్ముల అను బంధం ఇవే ప్రధానమై సెకండాఫ్ లో కూడా యాక్షన్ తగ్గింది. టైటిల్ ప్రకారం వుండాల్సిన వాయువేగం దొరక్కుండా పారిపోయే కారు ఛేజింగ్స్ తో వుండాల్సిన కథ, కథకుడి అభద్రతా భావం వల్ల భారీ సెంటిమెంటల్ డ్రామాగా మారింది. దీనివల్ల హీరో హీఓయిన్ల మధ్య యూత్ అప్పీల్ తో వుండాల్సిన లవ్ ట్రాక్ కూడా బలైంది.
       
కారులో శవం
, నగదు, హవాలా నోటు- దీంతో విలనీ కూడా పాత స్టయిల్లోనే వుంది ముగింపు సహా. 1993 లో మహా దర్శకుడు రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ థెల్మా అండ్ లూయిస్ లో ఇద్దరు యువతులు రేప్ చేయబోయిన వాణ్ని చంపి కారులో పారిపోయే కథ -వెంటాడే పోలీసులతో యాక్షన్ కథే. ఈ యాక్షన్ కథలో బాధని ఎక్కడా చూపించకుండా సేవ్ చేసి, ముగింపులో ఆ ఇద్దరు యువతులు తీసుకునే నిర్ణయంతో  ఒకేసారి గుండె పగిలేలా చేస్తాడు దర్శకుడు. ఇదీ స్టోరీ డైనమిక్స్ అంటే. ఇందుకే ఈ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. ఇలాటి సినిమాలు చూసి తెలుగు సినిమాల గ్రాఫు పెంచాలి, కథంటే ఏమిటో తెలుసుకుని.

నటనలు –సాంకేతికాలు

కథని బట్టి కార్తికేయ హీరోయిజం తక్కువ, పాసివ్ నెస్ ఎక్కువ. ఇక హీరోయిన్ తో రోమాన్సే లేదు. తండ్రి రుణం తీర్చుకునే సెంటిమెంట్ల భారం ఎక్కువై పోయి- యాక్షన్ తగ్గి యూత్ ని నిరాశపర్చే ప్రమాదం తెచ్చుకున్నాడు.  తమ్ముడుగా రాహుల్ టైసన్ అయితే వీపింగ్ డాల్ లా ఆద్యంతం ఏడ్పిస్తాడు ఏడ్పు ఇష్టపడే ప్రేక్షకులకి. డిటో తనికెళ్ళ భరణి. హీరోయిన్ ఐశ్వర్యాది ఫార్ములా టర్నింగ్ ఇచ్చే రోటీన్ పాత్ర. ఇక విలన్ వేషధారులు వాళ్ళ డైలాగులతో వాళ్ళు మహానుభావులు.

కెమెరా, సంగీతం, లొకేషన్లు, యాక్షన్ సీన్లు ప్రత్యేకంగా ఏమీ వుండవు. ఓపికగా కూర్చుని పాత్రల బాధలు, గాథలు బాధపడకుండా చూడాల్సిన సినిమా.

—సికిందర్


1435 :స్పెషల్ ఆర్టికల్


కవైపు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు ఈ వేసవిలో శూన్య ప్రదర్శన చేస్తూండగా, మరో వైపు మలయాళ సినిమాలు స్లంప్ లేకుండా సమ్మర్ లో బాక్సాఫీసు విజయాలు సాధిస్తున్న వైనం కళ్ళముందుంది. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో తెలుగు తమిళ కన్నడ భాషల్లో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఎండలు, క్రికెట్, ఎన్నికలు కారణంగా చూపి నిర్మాతలు పెద్ద సినిమాల విడుదలల్ని వాయిదా వేశారు. దీంతో ధియేటర్లు నడపలేక మూసివేసే పరిస్థితి ఎదురైంది ఎగ్జిబిటర్లకి. థియేటర్ చైన్ 'జికె  సినిమాస్' యజమాని రూబన్ మతివానన్ 2024 సవత్సరం తమిళ, తెలుగు సినిమాలకు ఆందోళనకర సంవత్సరమని కామెంట్ చేశారు. ఈ దశాబ్దంలోనే  2024 ని అత్యంత చెత్త సంవత్సరంగా పేర్కొన్నారు.

        చాలా మంది లోక్‌సభ ఎన్నికలు, పరీక్షలు, ఎండలు, ఐపీఎల్ వంటివి పెద్ద సినిమాలు లేకపోవడానికి కారణాలుగా చెబుతూ వచ్చారు. కానీ, ఇవి కుంటి సాకులు మాత్రమే. వేసవి అనేది సాధారణంగా పెద్ద సినిమాలకు ఉత్తమ సీజన్ గా వుంటూ వస్తోంది. 2023 వేసవిలోనే తెలుగులో రావణాసుర’, ఏజెంట్’, విరూపాక్ష’, శాకుంతలం’, ఉగ్రం’, కస్టడీ వంటి పెద్ద సినిమాలు 6 విడుదలయ్యాయి. 2024 వేసవిలో మాత్రం ఫ్యామిలీ స్టార్’, ఆ ఒక్కటీ అడక్కు’, ‘’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూడే పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడూ ఫ్లాపయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. ఇవి ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్, పరీక్షలు వల్ల ఫ్లాపయ్యాయా?
        
లోక్ సభ ఎన్నికలు వేసవిలోనే జరుగుతున్నాయి, ఐపీఎల్ వేసవిలోనే వస్తోంది, ఎండలు వేసవిలోనే మండి పోతున్నాయి, పరీక్షలూ వేసవిలోనే వస్తున్నాయి, జనం వేసవిలోనే టూర్లు వేస్తున్నారు, కూల్ డ్రింకులు, కూలర్లు వేసవిలోనే అమ్ముడుబోతున్నాయిఅలాగే చల్లటి ఏసీ పట్టున కమ్మగా కూర్చుని వేసవిలో సినిమాలు కూడా చూస్తూ వచ్చారు జనాలు. మరి ఇప్పుడెందుకు చూడడం లేదు? చూసేందుకు లోక్‌సభ ఎన్నికలు, పరీక్షలు, ఎండలు, ఐపీఎల్ వగైరా ఇప్పుడెందుకు అడ్డొస్తున్నాయి?
       
అడ్డు రావడం లేదు.
కేరళలో యధావిధిగా సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. చూసి హిట్ కూడా చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో విడుదలైన పెద్ద సినిమా ఆవేశం కి రూ. 155 కోట్ల బాక్సాఫీసు నిచ్చారు. ఏప్రిల్లోనే విడుదలైన చిన్న సినిమా వర్షం గక్కుశేషం కి రూ. 80 కోట్లు ఇచ్చారు. ఏప్రిల్లోనే విడుదలైన చిన్న సినిమా జై గణేష్ కి రూ. 83 కోట్లు ఇచ్చారు. మే లో విడుదలైన చిన్న సినిమా మలయాళీ ఫ్రమ్ ఇండియాకి రూ. 18 కోట్లు ఇచ్చారు. మరో చిన్న సినిమా గురువాయూర్ అంబలనాదయిల్ కి రూ. 85 కోట్లు ఇచ్చారు. పెద్ద సినిమా  టర్బో కి రూ. 70 కోట్లు ఇచ్చారు. ఇంకో చిన్న సినిమా తలవన్ కి 10 వ రోజు కల్లా రూ. 15 కోట్లూ కలెక్షన్లిచ్చారు.
       
అంతే కాదు
, తమిళంలో కూడా స్లంప్ అంటున్న మే నెలలోనే విడుదలైన  
అరణ్మనై 4’ అనే హార్రర్ రూ.100 కోట్ల మార్కుని దాటేసింది. తమన్నా భాటియా, రాశీ ఖన్నా, దర్శకుడు సుందర్ సి నటించిన ఇదే మూవీ తెలుగులో బాక్ గా విడుదలై ఫ్లాపయ్యింది. ఈ వేసవిలో తమిళంలో పెద్ద సినిమాల కొరతని భర్తీ చేసేందుకు ఒక మార్గం కనిపెట్టారు. పాత హిట్స్ ని రీ రిలీజ్ చేయడం మొదలెట్టారు. దళపతి విజయ్ 'గిల్లి', ధనుష్ '3', సూర్య 'వారణం ఆయిరం'  పాత సినిమాల్ని రీ రిలీజ్ చేస్తే మళ్ళీ హిట్టయ్యాయి. ఎందుకు హిట్టయ్యాయి? ఎండలు, ఎన్నికలు, పరీక్షలు, ఐపీఎల్ వుంటే ఎలా వచ్చారు ప్రేక్షకులు?
       
కాబట్టి నాణ్యత ప్రధాన పాత్ర వహిస్తోంది ఎలాటి పరిస్థితుల్లోనైనా హిట్టవడానికి. ఈ నాణ్యత మలయాళంలో ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు (చెన్నై)  లో వున్నప్పుడు అక్కడ అన్ని భాషల దర్శకులతో
, టెక్నీషియన్లతో పనిచేసిన తెలుగు అసిస్టెంట్లకి మంచి నైపుణ్యం అబ్బేది. పరిశ్రమ హైదరాబాద్ వచ్చేశాక అసిస్టెంట్లకి ఆ ఇంటరాక్షన్ లేక ఒంటరి వాళ్ళై పోయి నేర్చుకోవడం వదిలేసి దర్శకులై పోతున్నారు. అందుకే సినిమాలిలా తయారవుతున్నాయి. ఇది పాత దర్శకులు చెప్పే మాటే. కాబట్టి ఇప్పుడు అసిస్టెంట్లు  ఇక్కడే అసిస్టెంట్లుగా చేరడం మాని, కొన్నాళ్ళు మాలీవుడ్ వెళ్ళి  ఎన్నికల్లో, ఎండల్లో, ఐపీఎల్లో, పరీక్షల్లో కూడా సినిమాలు తీసి హిట్ చేస్తున్న మలయాళ దర్శకుల మంత్రమేమిటో వాళ్ళ దగ్గర పనిలో చేరి నేర్చుకుంటే మంచిది. అప్పుడు ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్, పరీక్షలూ అంటూ కుంటి సాకులు చెప్పే అవసరం రాదు.

***

 

31, మే 2024, శుక్రవారం

1434 : రెవ్యూ!

 

రచన : దర్శకత్వం : కృష్ణ చైతన్య
తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్, గోపరాజు రమణ, హైపర్ ఆది తదితరులు  
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : అనిత్ మాదాడి
బ్యానర్స్: సితార ఎంటర్టయిన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల : మే 31, 2024
***

        టీవల గామి సక్సెస్ తర్వాత విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సమ్మర్ లో ఎండలకి, క్రికెట్ కి, ఎన్నికలకీ భయపడి పెద్ద సినిమాలని వాయిదా వేశాక, మే చివర్లో సమ్మర్ కి సెలవు చెబుతూ ఈ మూవీ విడుదలైంది. దీనికి కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ప్రకటించినప్పట్నుంచీ ఆసక్తి రేపుతూ వచ్చింది.  హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాగా టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే బలహీనంగా వుంది. ఈ సినిమాలో చాలా గ్యాంగ్‌లు వున్నాయి, కానీ ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదని, దీన్ని గ్యాంగ్‌స్టర్ మూవీగా పరిగణించవద్దనీ ప్రేక్షకుల్ని అభ్యర్థిస్తున్నానని ప్రకటించాడు దర్శకుడు. అంటే ఏమిటి? ఏమో! సినిమా చూస్తేగానీ తెలీదు. సినిమా చూసి తెలుసుకుందాం...

కథ

ఈ కథ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని ఓ లంక గ్రామంలో పాతికేళ్ళ క్రితం జరుగుతుంది.  అక్కడ పేకాట, తాగుడు, వేశ్యతో సంబంధం, డబ్బులు కొట్టేయడం వంటి పనులతో గడుపుతున్న రత్న(విశ్వక్ సేన్) కి గొదావరిలో ఇసుక అక్రమ రవాణా కంటబడుతుంది. దాని వెనుక ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ) వుంటాడు. ఇతడి రాజకీయ ప్రత్యర్ధిగా నానాజీ (నాజర్)వుంటాడు. రత్న తెలివిగా దొరస్వామి రాజు దగ్గర చేరిపోయి ఇసుక వ్యాపారం చూస్తూంటాడు. నానాజీకో కూతురు బుజ్జి (నేహాశెట్టి) వుంటుంది. ఈమెని ప్రేమించి నానాజీకి శత్రువు అవుతాడు. అయితే ఎన్నికల్లో దొరస్వామి రాజుని ఓడిస్తానని నానాజీ ని ఒప్పిస్తాడు. ఎన్నికల్లో దొరస్వామి రాజుమీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. దీంతో తలెత్తిన పరిణామాల్లో ఇద్దరికీ శత్రువు అవుతాడు.
       
ఇప్పుడేం చేశాడు రత్న
? ఇద్దరు విరోధుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? బుజ్జిని పెళ్ళి చేసుకున్నాడా? ప్రేమించిన వేశ్య రత్నమాల (అంజలి) ఏమైంది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

గోదావరిలొ కొట్టుకు పోయిన నాటు పడవలా వుంది. పడవలో దర్శకుడు, హీరో, నిర్మాతలూ అందరూ వున్నారు. రెస్క్యూ ఆపరేషన్ తో కూడా ఈ కథతో  సినిమాని నిలబెట్టలేరు. రాయలసీమ, తెలంగాణాల్లో మాదిరిగానే ఆంధ్రా ప్రాంతంలోనూ హత్యలు, ఘర్షణలు జరుగుతున్నాయని, ప్రతిసారీ గోదావరి జిల్లాల్ని సుందరంగా చూపించడం చాలా అసహజంగా అన్పించిందనీ, గోదావరి జిల్లాల్లో కనువిందు చేయాల్సిన దానికంటే ఎక్కువే వుందనీ, ఆ విధంగా ఈ సినిమా ద్వారా చక్కని ఎమోషన్స్ తో కూడిన మంచి కథని చెప్పే అవకాశం లభించిందనీ చెప్పాడు దర్శకుడు.
       
చాలా గొప్పగా చెప్పాడు. కానీ కథ అనేది ప్రధానంగా  
పాత్ర-సమస్య-పరిష్కారం అనే చట్రంలో వుంటే కథవుతుందని మరిచాడు. దీంతో కథంతా గందరగోళంగా తయారైంది. ఈ కథలో హీరోకి సినిమాని నిలబెట్టే ప్రధాన సమస్యా (పాయింటు), ఆ సమస్యని సాధించాలన్న భావోద్వేగాలతో కూడిన లక్ష్యమూ లేకపోవడంతో, ఇది సినిమా కథే కాకుండా పోయింది.
       
సినిమా సాంతం ఒక సమస్య వస్తే
, దాన్నెదుర్కొన్నాక ఇంకో సమస్య వస్తే, దీన్నెదు ర్కొన్నాక ఇంకో సమస్య వస్తే ... ఎలా ఎన్నో సమస్యలు, వాటిని ఎన్నోసార్లు ఎదుర్కోవడాలే తప్ప, ఒకచోట ఆగి ప్రధాన సమస్యతో పాయిటుకి రాదు. ఇది ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ గా సాగే డాక్యుమెంటరీల కోసం వాడే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కింది కొస్తుంది. ఇలా వచ్చిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆటోనగర్ సూర్య వంటి వెన్నో అట్టర్ ఫ్లాపయ్యాయి. డాక్యుమెంటరీ కథనాలతో కమర్షియల్ సినిమాలు తీయలేరు.
       
కాబట్టి ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధం గాదు. ఇంటర్వెల్ తర్వాత అస్సలు అర్ధంగాదు. విలన్లతో ఏవేవో సమస్యలు
, హీరో పోరాటాలూ వచ్చిపోతూంటాయి. ఇన్ని సమస్యలు, పోరాటాలు అర్ధంగాకుండానే, మరిన్ని సమస్యలూ పోరాటాలూ వచ్చేస్తూంటాయి. హీరోతో కుదురుగా కథే లేకపోయాక, మరోవైపు ఎన్నో పాత్రల ఉపకథలు కూడా వచ్చేస్తూ ఇంకా గందరగోళమై పోతుంది. ఇలా హీరో సహా ఏ పాత్రా నిలబడక- తన్నుకుని చావడమే వుంటుంది.
       
గోదావరి జిల్లాలో యాక్షన్ కథ చెప్పడానికి పూర్వమున్న
కత్తి కట్టడం అనే సాంప్రదాయాన్ని కేంద్ర బిందువుగా తీసుకున్నాడు. అక్కడ పగదీర్చుకునే కార్యక్రమాన్ని కత్తి కట్టడం అంటారు. దీన్ని రూపుమాపడం హీరో లక్ష్యం. దీని మీదే నిలబడి కథ చెయ్యక, ఈ పాయింటుని మరుగున పడేసి ఏమేమో చేశాడు. టైటిల్ కూడా ఈ కథకి కుదర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే క్రిమినల్, మాఫియా కథల్ని సూచించే టైటిల్ లాగా వుంది. కానీ చూస్తే ఇది రెండు రాజకీయ గ్రూపుల రొటీన్ కథ. రాజకీయ నాయకులు పోషించుకునే కార్యకర్తల్ని గ్యాంగ్స్ అనరు. పూర్వం 1970, 80 లలో గోదావరి జిల్లాల్లో గ్రామ కక్షలతో కూడిన సినిమాలెన్నో వచ్చేవి. వాటిలో జమీందారో, సర్పంచో విలన్ గా వుండేవాడు. ఆ బాపతు కథే ఇదీనూ.     
       
దర్శకుడన్నట్టు
,
ప్రతిసారీ గోదావరి జిల్లాల్ని కనువిందుగా చూపించలేదు. అప్పుడు కూడా గ్రామ కక్షలతో కొట్టుకోవడం చూపించారు. కాబట్టి తానేదో మొదటి సారిగా చూపించడం లేదు. 2023 లో శ్రీకాంత్ అడ్డాల తీసిన పెదకాపు కూడా ఇలాటి గోదావరి జిల్లా యాక్షన్ కథనే గజిబిజి గందరగోళంగా తీసి అట్టర్ ఫ్లాప్ చేశాడు.  

నటనలు –సాంకేతికాలు

విశ్వక్ సేన్ వూర మాస్ పాత్ర వేశాడు. మధ్యలో ఎమ్మెల్యేగా మారినా తేడా లేకుండా అదే వూర మాస్ గా నటించుకుపోయాడు. క్యారక్టర్ ఆర్క్ అనేది లేకుండా పదిహేనేళ్ళ పాత్ర జర్నీని ఎత్తు పల్లాల్లేకుండా, భావోద్వేగాల్లేకుండా ఫ్లాట్ గా, రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయాడు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆ పదవిలోనే కొనసాగక, మధ్యలో పదవి పోగొట్టుకుని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, కొట్లాడుకుని ఓ పది సార్లు జైలు కెళ్ళడం, అయిదారుసార్లు ఆస్పత్రికెళ్ళడం, ఒకర్ని కన్నాక మళ్ళీ ఇంకోసారి ఇంకో పిల్లని కనడం, ఇలా చేసిందే చేస్తూ అక్కడక్కడే తిరుగుతూంటాడు తప్ప ముందు కెళ్ళే  కథా నాయకత్వమే లేదు. ఓ సమస్య, దాని పరిష్కారం కోసం ఓ లక్ష్యం వుంటేగా?  పాటలు, ఫైట్లు బాగా చేశాడు, ఫస్టాఫ్ లో లారీ మీద యాక్షన్ సీను ఎక్సైటింగ్ గా వుంది.
       
హీరోయిన్లు నేహాశెట్టి
, అంజలి ఇద్దరికీ పాత్రలు అంతంత మాత్రం. ప్రభావం చూపరు. విలన్లుగా నాజర్, గోపరాజు రమణలవి ఫార్ములా పాత్రలు, నటనలు. హీరో వెంట వుండే హైపర్ ఆది రెండు మూడు చోట్ల కామెడీ డైలాగులు విసురుతాడు.
       
సాంకేతికంగా ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో మూడు పాటల్లో మొదటి రోమాంటిక్ పాట
, దాని చిత్రీకరణా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ అనొచ్చు. అలాగే అనిల్ మాదాడి ఛాయాగ్రహణం టాప్ రేంజిలో వుంది. ఇందులో పచ్చటి పంట పొలాలు కనపడవు, ఎర్రటి రక్తాలు కనపడతాయి. యాక్షన్ సీన్స్, కళాదర్శకత్వం చెప్పుకోదగ్గవి. కానీ దర్శకుడి చేతిలో విషయపరంగా సినిమా చెప్పుకో దగ్గది కాదు.

—సికిందర్