రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, May 20, 2025

1379 : స్పెషల్ న్యూస్

Back Again! 



  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1నుంఛి సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తాయా, బంద్ అవుతాయా అన్న సస్పెన్స్ తరహా  కథనం నడుస్తోంది. రెంటా, పర్సెంటేజా వివాదం తేలాల్సి వుంది. పర్సెంటేజీ ప్రకారమైతేనే సినిమాల్ని ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. మల్టీప్లెక్సుల్లో పర్సెంటేజీ  విధానమే నడుస్తోంది. కానీ సింగిల్ స్క్రీన్స్ కి ఈ విధానం లేదు. అక్కడంతా రెంటల్ సిస్టమే నడుస్తోంది. దీని వల్ల నష్టపోతున్నామని ఎగ్జిబి టర్ల ఆందోళన. పర్సెంటేజీతో అయితే  తాము నష్టపోతామని నిర్మాతల అభ్యంతరం. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు పెద్ద నగరాలతో బాటు బీసీ సెంటర్లలో కూడా వున్నాయి. ఈ వివాదం ఇలా వుండగా, ఆ బీసీ సెంటర్ల పైనే కన్నేసి పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు ఇక్కడ భారీ యెత్తున మల్టీప్లెక్సులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచించుకుని ముందుకి దూసుకెళ్తోంది. అంటే ఈ విధానంలో ఎగ్జిబిటర్లు వుండరు. నగరాల్లో పీవీఆర్- ఐనాక్స్ తో అమల్లో వున్న పర్సెంటేజీ పైనే  నిర్మాతలు బీసీ సెంటర్లలో సినిమాలు విడుదల చేసుకోక తప్పదు-చిన్న సినిమా లైనా పెద్ద సినిమాలైనా!

        
ముందుగా పీవీఆర్- ఐనాక్స్ ప్రణాళికేమిటో చూద్దాం. దేశంలో అతిపెద్ద సినిమా    థియేటర్ల సంస్థ పీవీఆర్- ఐనాక్స్  మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లని దేశంలోని మారు మూలలకూ విస్తరించాలని భావిస్తోంది. విస్తరణ ప్రక్రియలో కంపెనీ సినిమా థియేటర్లలో ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ (FOCO) మోడల్‌తో లాభాల్ని ఆర్జించాలని ఆశిస్తోంది. ఈ  కొత్త మోడల్ భాగస్వాములకెలా పని చేస్తుందో, సినిమా ప్రేక్షకులకి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో కంపెనీ వివరించింది.
        
ఈ కంపెనీ మూడు సంవత్సరాలుగా ఈ మోడల్ పై పనిచేస్తోంది. ఈ మోడల్ కింద ఓ సినిమా థియేటర్ని   మధ్యప్రదేశ్  లోని గ్వాలియర్‌లో ప్రారంభించి ఏడాది దాటింది. ఈ మోడల్‌ ని ప్రకటించే ముందు దాని విజయాన్ని నిర్ధారించడానికి మొదట కొన్ని తమ సినిమా థియేటర్లని నిలిపివేయాలని కోరుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది.
       
ప్రదర్శనా రంగంలో
దేశంలో రెక్కలు విప్పాలనే కంపెనీ ఆలోచన అడ్డంకులు కూడా ఎదుర్కొంది. ఎందుకంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే దానిని సాధ్యం చేయదు. మన దేశం భారీ బాక్సాఫీసు టర్నింగ్ వున్న దేశం. ఇందులో  హాలీవుడ్ సినిమాలు ఎనిమిది శాతం మాత్రమే రాబడిని అందిస్తే, మిగిలిన 92% బాక్సాఫీసు కలెక్షన్లు ప్రాంతీయ, స్థానిక,  హైపర్ లోకల్,  బాలీవుడ్ తదితర కంటెంట్ ల నుంచి వస్తాయి. ఈ క్రమంలో కంపెనీని  బీసీ  సెంటర్లకి విస్తరిస్తే, కంటెంట్ అప్పీల్ ని మరింత పెంచడంలో సహాయపడుతుందని భావిస్తోంది.  
        
FOCO మోడల్ కింద రాబోయే కొత్త సోషల్ హబ్‌లు పట్టణ- గ్రామీణ ప్రేక్షకులకి సినిమాలతో బాటు ఆహారాన్నీ, ఆట పాటల్నీ అందిస్తాయి. పూర్తిగా సామాజిక కేంద్రాలుగా ఇవి వుంటాయన్న మాట. ప్రేక్షకులు తిన్నంత తిని, ఆటలాడుకుని వెళ్ళిపోవచ్చు, సినిమాలు చూడాలని రూలేం లేదు. లేదా సినిమాలతో పాటు ఆహారం, ఆటపాటలు కూడా వినోదించవచ్చు.ఈ విధానం సరసమైన లగ్జరీ సినిమా అనుభవాన్ని బీసీ ప్రేక్షకులకి సైతం అందింహడానికి వీలు కల్పిస్తుంది.
       
దేశవ్యాప్తంగా సినిమా మౌలిక సదుపాయా
ల్ని  అభివృద్ధి చేయడం ద్వారా,  బాక్సాఫీసు ఆదాయం ద్వారానూ స్థానిక నిర్మాతలకి, కళాకారులకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, తద్వారా నిరంతర కంటెంట్ సృష్టిని ప్రోత్సహించాలని కంపెనీ నిర్ణయించుకుంది.  ఈ ఆర్ధిక సంవత్సరం మొదట్లో FOCO మోడల్‌ ని ఉపయోగించి రాయ్‌పూర్‌లో 5-స్క్రీన్ల  మల్టీప్లెక్సుని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దీని విస్తరణని వేగవంతం చేయడానికి ఇదొక కీలక వ్యూహంగా భావిస్తోంది. బీసీ సెంటర్లు ప్రీమియం సినిమా అనుభవాల కోసం గణనీవృద్ధి సామర్థ్యాన్ని కలిగి వున్నాయని తెలిపింది.  ఈ మోడల్‌ ని  మెరుగుపరచడానికి కంపెనీ గత మూడున్నర సంవత్సరాలుగా పెట్టుబడులు వెచ్చించిందని, దీని ఫలితంగా అమలు సమయంలో 50% ఆదా అయిందనీ  పేర్కొంది.
       
వినోద అవకాశాలు పరిమితం
గా వున్న ఈశాన్య ప్రాంతాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, దేశమంతటా సినిమా యాక్సెస్‌ ని విస్తృతం చేయవలసిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది.  మూడవ త్రైమాసిక నివేదికలో, 22 సినిమాహాళ్ళ లో 100 స్క్రీన్‌ల కోసం ఒప్పందాలపై సంతకం చేసినట్లు వెల్లడించింది. వీటిలో 8 FOCO సినిమాహాళ్ళలో 31 స్క్రీన్‌లు, 14 అసెట్-లైట్ సెటప్‌లలో 69 స్క్రీన్‌లూ సరసమైన లగ్జరీ సుఖాన్ని అందిస్తాయని, కొత్త అనుభవాల కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ ని ఇవి తీరుస్తాయనీ కంపెనీ తెలియజేసింది.
       
మరి ఇది తెలుగు రాష్ట్రాల్లో నిర్మాతల్ని
, ఎగ్జిబిటర్లని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడంటే ఇప్పుడు కాకపోవచ్చుగానీ, రాబోయే మూడు  నుంచి ఐదేళ్ళ కాలంలో బీసీ సెంటర్లలో ఈ మోడల్ విస్తరణ పూర్తయితే, నిర్మాతలూ ఎగ్జిబిటర్లూ ఇరుకున పడొచ్చు. పీవీఆర్ - ఐనాక్స్ దేశంలో ఎక్కడా పర్సెంటేజీ తప్ప మరో విధానాన్ని అనుమతించదు. ఇలాంటప్పుడు సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజీ డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్ల పంట బీసీ సెంటర్లలో పండొచ్చు. నిర్మాతలు బీసీ సెంటర్లలోని పీవీఆర్ -ఐనాక్స్ మల్టీప్లేక్సులతో బాటు, మొత్తం ఏబీసీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్స్ అన్నిటికీ పర్సెంటేజీకి అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడొచ్చు. ఇక పీవీఆర్- ఐనాక్స్ పుణ్యమాని బీసీ సెంటర్లలో పర్సెంటీజీ లభించినా, అక్కడ పీవీఆర్ -ఐనాక్స్ ధాటికి తట్టుకోలేక, సింగిల్ స్క్రీన్ థియేటర్లు  మూతబడి, ఎగ్జిబిటర్ల వ్యవస్థ తుడిచిపెట్టుకు పోవచ్చు.
       
ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ని నడపాలంటే నెలసరి 5 లక్షలు ఖర్చవుతోందన్న ఎగిబిటర్లు- సింగిల్ స్క్రీన్స్ ని ఇంకా అదే కాలం చెల్లిన థియేటర్లలో నిర్వహించడం విచిత్రం. నగరాల్లో సింగిల్ స్క్రీన్స్ ని ఆధునికంగా మార్చి నిర్వహిస్తున్న మల్టీప్లెక్స్ కంపెనీల విజ్ఞత ఎగ్జిబిటర్లకి కూడా కలిగితే
, బీసీ సెంటర్ల స్క్రీన్స్ ని ఆధునీకరించడానికి పెట్టుబడులు పెట్టక తప్పదు.
       
ఓటీటీల కాలంలో వందల కోట్లు వెచ్చించి బీసీ సెంటర్లలో పీవీఆర్- ఐనాక్స్ కంపెనీ చేపట్టిన విస్తరణ కార్యక్రమం తెలివితక్కువ తనమనుకోవాలా
? ఎగ్జిబిటర్లు మిగలాలంటే సింగిల్ స్క్రీన్ల నవీకరణకి పెట్టుబడులు పెట్టి, టికెట్ల రేట్ల దగ్గర మల్టీప్లెక్సులకి గట్టి పోటీ నివ్వొచ్చు- వాళ్ళ పర్సెంటేజీ విధానంతోనే. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏనాటికైనా తీపిగుర్తులు.  వీటిని పరిరక్షించుకోవడం ఎగ్జిబిటర్లదే కాదు నిర్మాతల బాధ్యత కూడా!

***

Thursday, April 24, 2025

1377 : బుక్ రివ్యూ!

 

          కొరియన్ సినిమాల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. తెలుగులో ఫ్రీమేకో, రీమేకో అయిన కొరియన్ సినిమాలు కొంత కాలం క్రితం వరకూ వచ్చేవి. ప్రస్తుతం ఓటీటీల్లో మలయాళం సినిమాల మీద  తెలుగు ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. గతంలో పిల్ల జమీందార్, గాడ్సే, ప్లే బ్యాక్, నెక్స్ట్ నువ్వే, జేమ్స్ బాండ్- నేను కాదు నా పెళ్ళాం వంటి కాపీ చేసుకునే స్వేచ్ఛ కల్పించుకుని కొరియన్ ఫ్రీమేకులు; ఓ బేబీ, శాకినీ ఢాకినీ వంటి అధికారిక రీమేకులూ చేశారు. ఇలా తెలుగునాటే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ  కొరియన్ సినిమాలు పాపులర్ అయి హాలీవుడ్ సినిమాల తర్వాతి స్థానంలో వుంటున్నాయి. ప్రేక్షకుల మనసుల్ని విపరీతంగా గెలుచుకునే తమదైన కథా కథన శైలులతో సీరియస్ థ్రిల్లర్లు, రోమాంటిక్ డ్రామాలు, రోమాంటిక్ కామెడీలు, సైకలాజికల్ జర్నీలు, హిస్టారికల్స్... ఇలా అన్ని జానర్లలోనూ వెల్లువెత్తుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే 226 సినిమాలు విడుదలయ్యాయి. ప్రతి సంవత్సరం 500 పై చిలుకు విడుదలవుతున్నాయి. గత సంవత్సరం 8 వందల 51 మిలియన్ల 4 వేల నలబై ఆరు డాలర్ల బాక్సాఫీసుతో బలమైన మార్కెట్టుగా స్థానం సంపాదించుకున్నాయి. బాంగ్ జూన్-హో (పారాసైట్), పార్క్ చాన్-వుక్ (ఓల్డ్ బాయ్), కిమ్ కీ-డుక్ (స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్... అండ్ స్ప్రింగ్) వంటి దర్శకులు సాంప్రదాయ సినిమాలకి అతీతంగా ప్రయోగాలు చేసి, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. ముఖ్యంగా 2020లో పారాసైట్ కి ఆస్కార్ అవార్డు  లభించడం కోరియన్ సినిమాలకి గ్లోబల్ వేదిక పైన భారీ గుర్తింపుని  తీసుకువచ్చింది.

కొరియన్ సినిమాలకి ఈ ప్రత్యేకతని ఇచ్చింది సామాజిక విషయాల్ని ధైర్యంగా తడిమే విధానం, సంక్లిష్ట పాత్రలు, వాటితో అనూహ్య మలుపులూ... మెమోరీస్ ఆఫ్ మర్డర్  లోని వాస్తవికతా స్పర్శ, ట్రెయిన్ టు బూసాన్ లోని భావోద్వేగ ఉథృతీ - ఇవన్నీ దేశీయ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్ని తాకుతున్నాయి.  మిగతా ప్రపంచ సినిమాలకి స్ఫూర్తిగా నిలుస్తూ, సవాళ్ళని విసురుతూ, వినోదాన్ని అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి.
        
అయితే ఇంత నేపధ్యం, ప్రశస్తి వున్న కొరియన్ సినిమాలపై  తెలుగులో పుస్తకం రాకపోవడం ఒక లోటుగానే వుంటూ వచ్చింది. ఈ లోటుని తీరుస్తున్నట్టు ఆ మధ్య సంచిక వెబ్సైట్ లో కొరియానం పేర కొరియన్ సినిమాల్ని పరిచయం చేసే శీర్షిక ప్రారంభమైంది. ఆ పరిచయకర్త సినిమా రివ్యూ రైటర్ గా రాణిస్తున్న గీతాచార్య. కొరియన్ సినిమాలపై ఈయన్ని మించిన అథారిటీ లేకపోవచ్చు తెలుగులో. ఒక థీసిస్ కి సరిపడా నాలెడ్జి సంపాదించుకుని రాసిన ఈ వ్యాసాల పరంపర తాజాగా పుస్తకరూపంలో వెలువడింది.  పుస్తకం పేరు కొరియానం’. దాదాపు 500 పేజీల సమగ్ర దర్శనం.
        
కొరియానం పుస్తకం కొరియన్ సినిమాలపై లోతైన విశ్లేషణని అందిస్తుంది. దాదాపు 60 సినిమాలు ఈ విశ్లేషణలో కన్పిస్తాయి. ఓల్డ్ బాయ్ దగ్గర్నుంచీ ది ఔట్ లాస్ వరకూ ప్రత్యేకించి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశాపరిశీలన ఇందులో వుంది. మనిషి ఆలోచనలు, కోపం, గా ప్రతీకార వాంఛలు వంటి భావోద్వేగాల ప్రయోగం ఎలా జరిగిందో వివరిస్తుంది. అంతేగాక ఆయా సినిమాల మేకింగ్ లో కొరియెన్ సాంకేతిక, సృజనాత్మక కళలు ఏ తీరానికి చేరాయో వివరణ వుంది. ఆయా దర్శకుల పని విధానం గురించి వర్ణన వుంది. మధ్య లో స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి కూడా వుంది.
       
ఓల్డ్ బాయ్ తీసిన పార్క్ చాన్ -వూక్ గురించి ఎక్కువ పేజీలు ఇందులో కనిపిస్తాయి.
పార్క్ చాన్-వూక్, కిమ్ కి-డుక్, లీ చాంగ్ డాంగ్ వంటి కొరియన్ బ్రాండ్‌ డైరెక్టర్ల గురించి ఎంత రాసినా తక్కువే. ది క్లాసిక్ తీసిన క్వాక్ జే యంగ్ కూడా తీసిపోడు.  అయితే పార్క్ చాన్ -వూక్ ప్రధాన స్రవంతి సినిమాలు ఎక్కువగా ఆందోళన, నిరాశ, అసూయ, అశాంతి, ఆగ్రహం వంటి భావోద్వేగాల కూడికగా వుంటాయని ఈ పుస్తకం చదివితే తేటతెల్లమవుతుంది.
       
దక్షిణ కొరి
యా సమాజపు కోరికలు, దుఃఖం, అణచివేత- వీటికి బాధితులో బానిసలో అయ్యే  కార్మికులు, సెక్స్ వర్కర్లు, నిరుద్యోగులు, మాదకద్రవ్యాల బానిసలు, గ్యాంగ్‌స్టర్లు, అప్పుల్లో వున్న వ్యక్తులందరూ ఈ పుస్తకంలోని అధ్యాయాల్లో కనిపించి  దక్షిణ కొరియా సమాజం పట్ల ఒక అవగాహనని ఏర్పరుస్తారు. వీళ్ళందరూ పోరాటం చేసే వ్యక్తులే.
       
ఈ పుస్తకం వెనుక గీతాచార్య చేసిన చాలా కృషీ
, పడ్డ శ్రమా కనిస్తాయి. అయితే పుస్తకాన్ని సీరియస్ గా రాయకుండా కామెడీలు చేస్తూ రాయడంతో, మధ్యమధ్యలో తెలుగు, హిందీ సినిమాలూ, వాటి నటులూ ఈ కామెడీలకి మినహాయింపు  కాకపోవడంతో, ప్రింట్ మీడియాలో ఇదొక అరుదైన ఇన్ఫోటైన్మెంట్ ప్రయోగంగా ప్రూవ్ చేసుకుంటుంది.
—సికిందర్

వెల : రూ. 500
కాపీలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ :
80081 60011 


Monday, April 21, 2025

1376 : రివ్యూ!

 

కేసరి -2                                            
దర్శకత్వం : కరణ్ సింగ్ త్యాగి
తారాగణం : అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే, రేజీనా కాసాండ్రా
రచన : కరణ్ సింగ్ త్యాగి, అమృతపాల్ సింగ్ బింద్రా, మాటలు : సుమిత్ సక్సేనా
సంగీతం : శాశ్వత్ సచ్‌దేవ్, కవితా సేథ్ - కనిష్క్ సేథ్, ఛాయాగ్రహణం : దేబోజిత్ రే, సైమన్ పైస్లే డే, అమిత్ సైయల్ తదితరులు.
బ్యానర్స్ : ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు : హీరూ యష్ జోహార్, అరుణా భాటియా, కరణ్ జోహార్, అదర్ పూనావల్ల
అపూర్వా  మెహతా, అమృత్ పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ
విడుదల : ఏప్రిల్ 18, 2025
***

      వసబెట్టి 14 మంది ఎలాన్ మస్క్ కన్నసంతానంలా జోరుగా 14 పరాజయాలు చవిచూశాక, తిరిగి కంటెంట్ కింగ్ అన్పించుకుంటూ అక్షయ్ కుమార్ బాక్సాఫీసు ఢంకా మోగిస్తున్నాడు. హిందీ సినిమాల కంటెంట్ అనేది హిందీ ప్రేక్షకులకి అంటరానిదై పోయి, సొంతంగా ఏ కంటెంట్ ని ఎలా క్రియేట్ చేసి పూర్వ వైభవం తెచ్చుకోవాలో తెలియని గందరగోళ వాతావరణ పరిస్థితుల్లో, రెండే ఆదుకుంటున్నాయి : హిస్టారికల్స్ లేదా ప్రాపగాండా సినిమాలు. వీటికి సొంతంగా కథలు ఆలోచించనవసరం లేదు,  సొంతంగా ఆలోచిస్తే కొంపలు మునుగుతున్నాయి ఆలోచించడం రాక. అందుకని హిస్టారికల్స్ లేదా ప్రాపగాండా వంటి సర్క్యులేషన్ లో వున్న రెడీ మేడ్ కంటెంట్ నే మంచి లాభసాటి బేరంగా ఎంచడం మొదలెట్టారు. ఇది బాక్సాఫీసులో రుజువు కావడంతో ఎక్కడెక్కడ ఇలాటి కంటెంట్ వుందో వెతకడం మొదలెట్టి వుంటారు- అప్పుడు దొరికిందే అయివుంటుంది 'కేసరి 2' కి అనువైన ఈ హిస్టారికల్ కంటెంట్. ఇది హిస్టారికలే గానీ హిస్టరీతో ముడిపడి వున్న ఒక ప్రముఖుడి బయోపిక్ కూడా. ఎవరా ప్రముఖుడు, ఏమిటా హిస్టరీ ఈ కింద తెలుసుకుంటూ వెళ్దాం...

కథ

1914 మొదటి ప్రపంచ యుద్ధ కాలం. యుద్ధంలో పాల్గొనడానికి బ్రిటిష్ సైనికుల కొరత ఏర్పడింది. బ్రిటిష్ పాలకులు ఒక వాగ్దానం చేశారు- మీ యువకుల్ని మా సైన్యంలో చేర్పిస్తే, యుద్ధం ముగిశాక మీకు స్వాతంత్ర్యం ఇచ్చేస్తామని. దీంతో వేలమంది యువకులు బ్రిటిష్ సైన్యంలో చేరిపోతారు. కానీ యుద్ధం ముగిశాక బ్రిటిష్ పాలకులు మాట తప్పుతారు.  అసలు పంజాబ్ నుంచి ఎక్కువమంది యువకులు వెళ్ళి యుద్ధంలో మరణించారు. దీంతో పంజాబ్ లో వ్యతిరేకత మొదలవుతుంది. ప్రొఫెసర్ కిర్పాల్ సింగ్ నేతృత్వంలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళన మొదలవుతుంది.
        
ఏప్రిల్ 13, 1919న రౌలట్ చట్టానికి (పోలీసులు కారణం లేకుండా ఎవర్నైనా అరెస్ట్ చేసే  అధికారాన్నికల్పించిన చట్టం) వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అమృత్సర్‌లోని జలియావాలా బాగ్‌లో నిరసనకారుల బృందం శాంతియుతంగా సమావేశమవుతుంది. ఇంతలో జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హేరీ డయ్యర్ సాయుధ దళాలతో స్థలానికి చేరుకుని, ఎలాటి హెచ్చరిక లేకుండా నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపమని ఆదేశిస్తాడు. చిన్న పిల్లలూ స్త్రీలు సహా మొత్తం 1650 మంది ఆ కాల్పుల్లో మరణిస్తారు.
        
ఈ ఘోరం గురించి పత్రికలు ఏమీ రాయకుండా తెల్లదొరలు అడ్డుకుంటారు. ఆ నిరసనకారులు సాయుధ ఉగ్రవాదులనీ చెప్తూ, వాళ్ళు దాడి చేస్తూంటే కాల్పులు జరపాల్సి వచ్చిందనీ తప్పుడు వార్త అందిస్తారు.  దీంతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఉద్రిక్తత పెరిగిపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొని- మృతుల కుటుంబాలకి 25 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తూనే, ఈ విషయంపై దర్యాప్తుకి  ఆదేశిస్తుంది. అది లోపాయికారిగా బోగస్ దర్యాప్తు. ఇప్పుడు ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి  నైట్‌హుడ్ అవార్డు పొందిన సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) అనే బారిష్టర్, జనరల్  డయ్యర్ ని కాపాడే బోగస్ దర్యాప్తు చేపడతాడు.
       
ఈ దర్యాప్తు
 కమిషన్‌లో బ్రిటిష్ న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం వున్న ఏకైక భారతీయుడు సర్ సి శంకరన్ నాయర్. పెద్ద దొర  ఇప్పటికే అతను తమ కీలుబొమ్మగా వ్యవహరిస్తాడని భావిస్తాడు. దర్యాప్తు సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలని  అణిచివేస్తుంది. ఈ సమయంలో, నాయర్ దృష్టి 13 ఏళ్ళ  విప్లవ బాలుడు పర్గత్ సింగ్ (కృష్ణారావు) పైన పడుతుంది. ఆ విప్లవ బాలుడితో నాయర్ కి  పాత సంబంధమేదో వుంటుంది. కాల్పుల్లో కాపాడమని నాయర్ నే పిలుస్తూ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇది నాయర్ ని కదిలిస్తుంది. దీంతో కమిషన్ కి వ్యతిరేక రిపోర్టు ఇచ్చి, జనరల్ డయ్యర్ ని శిక్షించేందుకు న్యాయ పోరాటానికి దిగుతాడు.
       
ఈ న్యాయ పోరాటంలో తవ్వి తీసిన నిజాలేమిటి
? కేవలం రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు గుమికూడారన్న కారణంతో జనరల్ డయ్యర్ ప్రజల్ని కాల్చి చంపాడా? లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కారణముందా? ఆ పెద్ద కారణంతో తనే పథకం ప్రకారం ప్రజల్ని జలియావాలా బాగ్ కి వచ్చేలా చేసి, ఆ ప్రజల మీద కక్ష తీర్చుకున్నాడా? ఏమిటీ ఘోర కృత్యం వెనుకవున్న అసలు కారణం? దీన్ని నాయర్ ఎలా బయటికి తీసి డయ్యర్ మీద నేరాన్ని నిరూపించాడు? ఇందులో జూనియర్
దిల్రీత్ గిల్ (అనన్య పాండే) ఎలా తోడ్పడింది? బ్రిటిష్ ప్రభుత్వం తరపున రంగంలోకి దిగిన భారతీయ సంతతికి చెందిన న్యాయవాది నెవిల్ మెకిన్లే (ఆర్ మాధవన్) జనరల్ డయ్యర్ ని కాపాడుతూ, బారిష్టర్ నాయర్ ని ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? ఇతడి కుట్రల ఫలితంగా న్యాయవాద వృత్తిలో పూర్తిగా పతనమై దోషిగా నిలబడ్డ నాయర్ తిరిగి ఎలా విజయం సాధించాడు? ...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

బ్రిటిష్ పాలనా వ్యవస్థలో భాగంగా వుంటూనే దాని పునాదుల్ని కదిలించిన వ్యక్తి కథ ఇది. ఒకప్పుడు బ్రిటిషర్లకి విధేయుడిగా వున్నఈ వ్యక్తి తిరుగుబాటుదారుడిగా మారి, ఆ తర్వాత  తిరుగులేని పోరాటాన్ని ప్రారంభించాడు. జలియావాలా మృతుల న్యాయం కోసం న్యాయస్థానంలోనే బ్రిటిష్ పాలకుల్ని ఓడించాడు. ఇది కేరళకి చెందిన బారిష్టర్ సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ జీవిత కథ. రఘు పలాట్- పుష్ప పలాట్ లు కలిసి రాసిన 'ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్: వన్ మ్యాన్స్ ఫైట్ ఫర్ ది ట్రూత్ ఎబౌట్ ది జలియావాలా బాగ్ మాసకర్' అనే 2019 లో వెలువడిన పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.

ఈ కథ గొప్ప భావోద్వేగాల వెల్లువలా ప్రత్యక్షమవుతుంది. ప్రతి సన్నివేశంలోనూ బాధ, కన్నీళ్ళూ, ఆక్రందనలు, ఆత్మీయుల్ని కోల్పోవడం వల్ల కలిగే దుఖామూ అనే మానవ దుస్థితిని కళ్ళకి కడుతుందీ కథ. ఊచకోత జరిగే మొదటి సన్నివేశం నుంచే కళ్ళని తడి చేయడం ప్రారంభించే ఈ కథ, సస్పెన్స్ ని జోడించుకున్న కథనంతో వేగంగా పరుగులెత్తి, కేవలం రెండు గంటల్లో ముగిసిపోతుంది. ప్రారంభం అత్యున్నత స్థాయిలో వుంటే, ముగింపు కూడా  తక్కువేమీ కాదు. ముగింపుకి చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం ప్రేక్షకులనుంచి వచ్చే సహజ ప్రతిస్పందనే.

మామూలుగా చూస్తే ఇదొక హీరో విలన్‌తో పోరాడే సాధారణ కథలా అనిపించవచ్చు, కానీ దీని డెప్త్ లో అంచెలంచెలుగా మొత్తం ఈ దేశపు పోరాట కథ బయటపడుతూంటుంది. ఒకటొకటే  నిజాలు బయటపడుతున్న కొద్దీ కదలకుండా కట్టి పడేస్తుంది.
        
ఈ కథకి గుండె కాయ- డయ్యర్ ఎందుకు కక్ష గట్టాడన్న ప్రశ్నే. రామ నవమికి హిందూ ముస్లిములు ఏకమై సంబరాలు జరుపుకోవడం అతడి కెందుకు కంటగింపు కావాలి? 1857 లో జరిగిన మొదటి స్వాతంత్ర్య  పోరాటం- తిరుగుబాటు చూశాక అప్రమత్తమైన బ్రిటిష్ పాలకులు- అందులోంచి ఒక కుటిల నీతిని కనుగొన్నారు. చిట్టచివరి మొఘల్ బహదూర్ షా జాఫర్ ని  తమ నాయకుడిగా ఎన్నుకుని, ఝాన్సీ లక్ష్మీ బాయి సహా రాజులందరూ జరిపిన తిరుగుబాటు చూశాక- ఇలా హిందూ ముస్లిములు ఒకటైతే తమ పప్పులు ఉడకవని, విభజించి పాలించు అనే కుటిల నీతికి తెర తీశారు బ్రిటిష్ పాలకులు.

 జనరల్ డయ్యర్ కి ఆ రామనవమి సంబరాల్లో ఈ కుటిల నీతి పారడం లేదని అర్ధమై - వీళ్ళకి బుద్ధి చెప్పాలని- మానసిక సంతులనం కోల్పోయిన ఒక సైకోలా- జాలియావాలా బాగ్ ఊచకోతకి పాల్పడ్డాడు. అయితే ప్రజల్ని మభ్యపెట్టి ఆ ప్రదేశానికి రప్పించడానికి ఎంత తెలివైన పథకం వేశాడనేది- ఏ పోలిటికల్ థ్రిల్లర్ సినిమాకి/నవలకీ తీసిపోదు. ఇది చూసి తీరాల్సిందే. ఈ కుట్ర మొత్తాన్నీ బారిష్టర్ నాయర్ ఎలా విప్పి, డయ్యర్ మొహానే వేసి కొట్టాడనేదీ కూడా తెర మీద చూడాల్సిందే. తన కుట్ర కోసం డయ్యర్ మిషనరీ స్కూల్లో ఒక ఉత్తుత్తి రేప్ ని క్రియేట్ చేసే ఎపిసోడ్ మతి పోగొడుతుంది.
        
ఫస్టాఫ్ ఊచకోత, కోర్టు విచారణ, విచారణలో నాయర్ ప్రభుత్వ వాదనని ముక్కచెక్కలు చేయడం, దీంతో బ్రిటిష్ తరపున నెవెల్ మేకిన్లే దిగడం తో ఇంటర్వెల్ వస్తుంది. ఇక సెకండాఫ్ లో నాయర్, మెకిన్లేల మధ్య సంఘర్షణాత్మక కోర్టు రూమ్ డ్రామా ఇద్దరికీ ఎదురు దెబ్బలు తగిలే మలుపులు తిరుగుతూ - చివరి అరగంట నాయర్ పతనావస్థతో ఈ కథ ఎలా ముగుస్తుందా అన్న అంతుపట్టని మిస్టరీ క్రియేటవుతుంది. ఈ దశలోనే ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన విప్లవ బాలుడితో నాయర్ సంబంధం వెల్లడవుతుంది. ఇక ముగింపు విజయం వైపుగా నాయర్ దూకుడుతో థ్రిల్ చేస్తుంది.

నటనలు సాంకేతికాలు 

అక్షయ్ కుమార్ కేరళకి చెందిన బారిస్టర్ నాయర్ గా కాకుండా పూర్తిగా నార్త్ క్యారక్టర్ గానే కనిపిస్తాడు. అంటే బయోపిక్ పాత్రని ఫిక్షనల్ పాత్రలా నటించేశాడు. సౌతిండియన్ నాయర్ గానే కనిపించివుంటే, హిందీ స్లాంగ్ మారి భాషాపరమైన అందం చేకూరేది. పంజాబీ పాత్రలు పంజాబీ యాసలో హిందీ మాట్లాడుతున్నప్పుడు, మలయాళీ పాత్ర నాయర్ మలయాళం యాసలో  హిందీ మాట్లాడి వుంటే, మేకప్ కూడా మలయాళీలా వుండుంటే సహజత్వం ఉట్టి పడేది.
       
బారిష్టర్ గా పాత్రని నీటుగా పోషించాడు. బ్రిటిషర్ల మీద తిరగబడి బ్రిటిష్ కోర్టులో బ్రిటిషర్లని దోషులుగా నిరూపించే ముళ్ళదారి వంటి జర్నీని
, పోరాటాన్నీ సమర్ధవంతంగా పోషించాడు. అప్పుడప్పుడు రగిలిపోయి పేల్చిన డైలాగులూ హైలైటయ్యాయి-
Get The F#&k Out My Country!’ అన్నది బాగా వైరల్ అవుతున్న డైలాగు.
        
డైలాగ్ డెలివరీ పట్ల అక్షయ్ తరచుగా ఎదుర్కొనే ఆరోపణ- అతను టెలిప్రాంప్టర్ చూసి డైలాగులు చెప్పడం వల్ల ఫ్లో బ్రేక్ అవుతోందని. ఈసారి బయోపిక్ పాత్రతో అలా జరగలేదు. డైలాగుల్ని అభినయంలో భాగం చేసుకుంటూ చెప్పడం వల్ల తేడా కనిపిస్తోంది. ప్రత్యర్ధి పాత్రలో మాధవన్ తో అంత హోరాహోరీ ఎమోషనల్ సంఘర్షణ వుండదుగానీ, ఉన్నంత వరకు కోర్టు సీన్లు నిలబెట్టాడు అక్షయ్.

భార్య పార్వతిగా రెజీనాది ఐదారు సీన్లలో కన్పించే చిన్నపాత్ర. బారిష్టర్ అసిస్టెంట్ దిల్రీత్ గిల్ గా అనన్య పాండే నీటుగా నటించింది. మార్తా స్టీవెన్స్ ఉత్తుత్తి రేప్ కేసు విచారణని ఆమె కోర్టులో నిర్వహించిన తీరు రాబోయే కాలంలో ఆమె ఉత్తమ నటిగా ఎదిగే సూచనలని అందిస్తోంది.
       
ఇక
ఆర్ మాధవన్ విషయానికి వస్తే, అతడి  ఎంట్రీ ఇంటర్వెల్ ముందు మాత్రమే, కానీ అతడి నిజమైన మూడ్ ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తుంది. నాయర్ కి ప్రత్యర్ధిగా మాధవన్ మరీ రెచ్చిపోకుండా, కూల్ గా పుల్లలు పెట్టే మ్యానిపులేటివ్ నేచర్ ని బిగి సడలకుండా నటించాడు. జనరల్ డయ్యర్ గా సైమన్ డే కోపంతో పిచ్చి అరుపులు అరిచినప్పుడల్లా హిట్లర్ ని తలపిస్తాడు. .
        
ఇక కరణ్ సింగ్ దర్శకత్వం సింపుల్ గా, స్పష్టంగా, కథని  దాని ఉద్దేశ్యం నుంచి  ఎక్కడా దారి మళ్ళకుండా రెండే రెండు రస పోషణలతో బలంగా వుంటుంది- నేపధ్యంలో విషాదంతో కూడిన కరుణ రసం, కథనంలో అద్భుత  రసంతో కూడిన సస్పెన్స్. నటనలు, చిత్రీకరణలు రియలిస్టిక్ సినిమా ధోరణి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల చాలా పవర్‌ఫుల్‌. సందర్భానుసారంగా మూడు పాటలు. కెమెరా వర్క్ కొన్ని చోట్ల జూమ్, ఎక్స్ ట్రీమ్ జూమ్ షాట్లతో మెస్మరైజ్ చేస్తుంది. ప్రారంభంలో సుదీర్ఘ మారణహోమం దృశ్యాలు చెప్పుకోదగ్గవి. మిగతా సాంకేతిక హంగులు లిమిటెడ్ బడ్జెట్ కి ఉన్నంతలో వున్నాయి. సంభాషణలు అవసరమైన చోట్ల పవర్ఫుల్ గా వున్నాయి. అయితే డైలాగుల్లో మీడియా అనే పదం వాడారు. ఈ పదం ఈనాటిది- ఆనాడు కేవలం పత్రికలే వుండేవి  కాబట్టి ప్రెస్ అని వాడుకలో వుండేది.

2019 లో విడుదలైన - హిట్టయిన కేసరి కి ఇది సీక్వెల్ కాదుగానీ, చాప్టర్ 2 అన్నారు. విషయపరంగా రెండిటికీ ఎలాటి సంబంధం లేదు. 1897 లో హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలో 21 మందితో కూడిన సిక్కు రెజిమెంట్, ఆఫ్ఘన్ దురాక్రమణాన్ని ఎదుర్కొన్న చారిత్రక కథతో అక్షయ్ కుమార్ కేసరి లో కనిపించాడు. అయితే అది జింగోయిజంగా, కల్పితం చేసిన రాజకీయ కేసరీయంగా వుంది. కేసరి -చాప్టర్ 2 కి ఈ అతి అంటలేదు.
        
ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. నిజం, న్యాయం, బాధల కథని సిన్సియర్ గా తెరకెక్కించారు. చరిత్రలో చెప్పని దిగ్భ్రాంతికర అధ్యాయాన్ని వివరించే ఈ కథని , ఖచ్చితంగా ఒక సారి చూడాల్సిందే!

—సికిందర్
(రివ్యూలో  'జలియన్ వాలా బాగ్' అనకుండా 'జలియావాలా బాగ్' అనడమేంటని అన్పించవచ్చు. దశాబ్దాలుగా తెలుగులో 'జలియన్ వాలా బాగ్' అనే రాసేస్తున్నారు పుస్తకాల్లో, పత్రికల్లో. కానీ హిందీలో जलियांवाला (జలియావాలా) అనే వుంటుంది. ఇంగ్లీషులో రాసినప్పుడు Jalliyanwala అని మధ్యలో n వస్తుంది. పలికేటప్పుడు ఈ n సైలెంట్ అవుతుంది- Kahaaniyaan - కహానీయా లో చివర n లాగా. జలియావాలా బాగ్ అంటే జలియావాలా తోట అని అర్ధం)