రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query మోసగాళ్ళకు మోసగాడు. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query మోసగాళ్ళకు మోసగాడు. Sort by relevance Show all posts

Saturday, January 10, 2026


 

          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో ‘పాతాళభైరవి’ తర్వాత ‘దొంగరాముడు’ పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై డెబ్భై యేళ్ళు దాటింది. ఈ డెబ్భై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. సినిమాల్లో పదేళ్ళకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. అప్పటి దేశభక్తి ముందు ఇంకా అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతోతొలివ్యాపార యుగపు (1971 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే పతనమైన విలువలు!

            యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తేఅప్పుడు ఇప్పటి మలి వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరిగిపోతూ వుంటుంది.

నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే.

ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి వ్యాపార యుగంలోనూ గత పదేళ్ళ క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోని విలువలవైపు  ప్రయాణం కడుతోంది.

అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

'దొంగరాముడు' మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, చౌకబారు విలువల ప్రస్తుత మలి వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలుతోంది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. మేరా నామ్ జోకర్లో రాజ్ కపూర్ పాడినట్టు – ‘ఈ సర్కస్ అంతా ఓ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే...’ అంటూ పాట! ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

‘రాజా సాబ్’ రాజ్ కపూర్ పాటలాగా మారేక కూడా, దర్శకుడు మారుతీ పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయని చెప్పుకుని ఆత్మవంచన చేసుకోకుండా, ఈ మలి వ్యాపార యుగపు దైన్యం గురించి సీరియస్ గా చింత  చేయాల్సిన అవసరముందని గుర్తించాలి.

-సికిందర్

 

 

Saturday, January 4, 2020

905 : రివ్యూ



దర్శకత్వం : సచిన్ రవి
తారాగణం :
: క్షిత్ శెట్టి, శాన్వీ శ్రీవాత్స, అచ్యుత్ కుమార్, బాలాజీ నోహర్, ప్రమోద్ శెట్టి, రిషబ్ శెట్టి తదితరులు
‌: క్షిత్ శెట్టి, సంగీతం: అజనీష్ లోక్నాథ్, ణ్ రాజ్;  ఛాయాగ్రహణం : కర్మ చావ్లా, కూర్పు: క్షిత్ శెట్టి, చిన్ వి
బ్యాన
ర్‌: పుష్కర్ ఫిలింస్
నిర్మాతలు: హెచ్‌.కె.ప్రకాశ్, పుష్క ల్లిఖార్జునయ్య
విడుదల : జనవరి 1, 2020
      న్నడ నిర్మాతలు పానిండియా మార్కెట్ మీద దృష్టి పెట్టి భారీ పెట్టుబడులు పెడుతున్నారు. 2018 లో ఇలా ఐదు భాషల్లో ‘కేజీఎఫ్’ తీసి భారీ విజయం సాధించాక, ఇప్పుడు ‘అవనే శ్రీమన్నారాయణ’ (అతడే శ్రీమన్నారాయణ) తో ఐదు భాషల బ్లాక్ బస్టర్ ని ఉద్దేశించారు. కొత్త దర్శకుడు సచిన్ రవి, హీరో రక్షిత్ శెట్టిలు ఈ ‘భారీ కళాత్మక కన్నడ స్వాభిమానం’ ని అఖిల భారత ప్రేక్షకులకి సగర్వంగా సమర్పించారు. పానిండియాలో నాల్గు భాషలు సౌతిండియావే వుంటున్నాయి. నార్త్ లో హిందీ ఒక్కటే. అయినా పానిండియా అంటున్నారు. సౌతిండియా నుంచి ఇలాటి పానిండియాలు ఇటీవల ‘సైరా’, ‘సాహో’ లు వచ్చాయి. వీటి ఫలితాలు చూడనే చూశాం. ఐతే 60 కోట్లతో తీసిన ‘కేజీఎఫ్’ పానిండియా - ఓవర్సీస్ బాక్సాఫీసు 250 కోట్లు దాటి అతిపెద్ద హిట్టయింది. కన్నడ నుంచే  వచ్చిన ఈ రెండో పానిండియా మాటేమిటి? ఇది చూద్దాం...

కథ
     1980 లలో అమరావతి అనే కల్పిత ప్రాంతం. అక్కడొక టూరింగ్ నాటకాలేసుకునే ట్రూప్ భారీగా దోపిడీలు చేసి సొత్తుని దాస్తూంటారు. ఈ ప్రాంతానికి దొరగా రామరామ అభీర (మధుసూదన రావు) వుంటాడు. ఓ రోజు అతను ఈ ముఠాని పట్టుకుని కొందర్ని చంపేస్తాడు. కానీ ఆ నిధి ఎక్కడ దాచారో రహస్యం తెలియదు. ఇంతలో తను కూడా చనిపోతాడు. అతడి ఇద్దరు కొడుకులు జయరాం, (బాలాజీ మనోహర్), తుకారాం (ప్రమోద్ శెట్టి) లు తండ్రి వారసత్వం కోసం పోటీ పడతారు. బలవంతుడైన జయరాం కోటలోంచి తుకారాం ని తరిమేస్తాడు. తుకారాం తర్వాతి కాలంలో అమరావతిలో రాజకీయ నాయకుడవుతాడు, జయరాం బందిపోటై నిధి వేటలో వుంటాడు. పదిహేనేళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు అమరావతికి కొత్త పోలీసు ఇన్స్ పెక్టర్ గా శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి) వస్తాడు. అతడికి రిపోర్టర్ లక్ష్మి (శాన్వి) పరిచయమవుతుంది. శ్రీమన్నారాయణ కానిస్టేబుల్ అచ్యుత్ (అచ్యుత్ కుమార్) తో కలిసి నిధి రహస్యం కనుక్కునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో జయరాం, తుకారాంల నుంచి ఎలాటి ప్రతిఘటనలు ఎదురయ్యాయనేదే మిగతా కథ.  

ఎలావుంది కథ
      ట్రెజర్ హంట్ (నిధి వేట) జానర్ కథ. దీనికి ‘సదరన్ ఆడ్ ఫిక్షన్’ (southern odd fiction) అని పేరు పెట్టుకున్నారు ఈ మేకర్లు. ఆడ్ ఫిక్షన్ కాబట్టని కౌబాయ్, పౌరాణిక, గ్యాంగ్ స్టర్, బందిపోటు, ఫాంటసీ తదితర జానర్లన్నీ ఇష్టారాజ్యంగా కలిపేసి పాత్రల్నీ, కథనీ వండి వార్చేసి- ఏదీ ఫీల్ కాకుండా చేశారు. కళాత్మకం అనే పదానికి అర్ధం కూడా మార్చేశారు. కథాకథనాలు పక్కన బెట్టి, బ్రహ్మాండమైన మేకింగ్ తో ‘కళాత్మకం’ చేయబూనారు. కథాకథనాలతో బోలెడు కన్ఫ్యూజ్ చేశారు. రాయడానికీ తీయడానికీ మూడేళ్ళూ  శ్రమించామని చెప్పుకున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ చూస్తే ఐదు భాషల్లో పానిండియా మార్కెట్ కి సమకట్టారు. కానీ కన్నడ స్వాభిమానం ఎక్కువైపోయి కన్నడ నటీనటుల్నే మొత్తం తారాగణంగా పెట్టుకున్నారు. వీళ్ళెవరూ కర్ణాటక దాటితే ప్రేక్షకులకి తెలియరు. పైపెచ్చు కన్నడ పైత్యాన్నేదృశ్య దృశ్యాలుగా పంచిపెట్టారు. ఈ పైత్యానికి రెండు గంటల సమయం చాల్లేదు. మూడు గంటలా ఆరు నిమిషాల సమయమంతా తీసుకుని వీరంగం వేశారు. పానిండియా థియేటర్లకి కరెంటు, ఏసీ ఛార్జీల అదనపు బిల్లులు వడ్డించి ఆనందించారు. పానిండియా ప్రయత్నం పెనం మీంచి పొయ్యిలో పడింది. ఈ ‘భారీ కళాత్మక కన్నడ స్వాభిమానం’ కన్నడిగలకే ఊడిగం చేసింది.


       ఇక కన్నడ సినిమాలు ‘అవనే శ్రీమన్నారాయణ’ కి ముందూ, తర్వాతా’ అంటూ చరిత్ర రాసుకోవాలని చెప్పుకుంటున్నారు. ఒక ‘మెకన్నాస్ గోల్డ్’ లాగానో, ‘నేషనల్ ట్రెజర్’ లాగానో ఔట్ డోర్ అడ్వెంచర్ కి పూనుకోకుండా, డైలాగులే ఎక్కువ - యాక్షన్ తక్కువగా డ్రామెడీగా మార్చేశారు. నిధి వేట సినిమాలంటే పిల్లా పెద్దా అందరికీ అద్భుత రసంతో వినోదాల విందుగా, పసందుగా వుండే ఆచారాన్ని విడనాడి పెడదారి పట్టిపోయారు. ప్రేక్షక వర్గాల్ని బొటాబోటీ పిడికెడు మాత్రంగా తగ్గించుకుని ఉస్సూరన్పించారు. ఇంత భారీ బడ్జెట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించేలా, రిపీట్ ఆడియెన్స్ కి నోచుకునేలా నిర్మించక పోతే,  రిటర్న్ ఎలా వస్తాయి? ‘సైరా’ తో ఈ పాఠం నేర్చుకునే వుండాలి. 


ఎవరెలా చేశారు
       రక్షిత్ శెట్టి కన్నడలో నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ సినిమాకి హీరోతో బాటు రచయిత కూడా. పాత్ర ప్రకారం కామిక్ - ఫన్నీ నటన ఓకే. పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కొన్ని యాక్షన్ సీన్లూ ఓకే. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ ఫైట్ సీను. అయితే ఇది నామ్ కే వాస్తే కౌబాయ్ క్యారక్టర్. ఆ క్యారక్టర్ లుక్కే వుండదు. ఎంట్రీ సీనుతో ఇచ్చిన బిల్డప్ తర్వాత క్యారక్టర్ తో వుండదు. పని తక్కువ, వాగుడు ఎక్కువ క్యారెక్టర్. ఈ అతి చలాకీతనం క్యారక్టర్ వల్ల కథ వున్న చోటే వుండి పోతుంది. మాటకారి తనం, రకరకాల ట్రిక్స్ ప్రయోగించడం ఇదే క్యారక్టరైజేషన్. ఈ ఇన్స్ పెక్టర్ నారాయణ ఎన్నో మంత్రాలు వేస్తాడు. ఏదీ పేలదు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అవ్వదు. ‘భక్త ప్రహ్లాద’ సినిమా ప్రదర్శనలో ఎంట్రీ ఇస్తాడు. హిరణ్య కశిపుడు స్తంభాన్ని బద్దలు కొడితే రావాల్సిన నరసింహుడి బదులు రక్షిత్ శెట్టి వచ్చేస్తాడు. బాగానే వుంది. కానీ పోనుపోను పాత్రా నటనా మొనాటనీ బారినపడి ఫస్టాఫ్ కే తేలిపోయింది. 36 నెలలూ 3 గంటల 6 నిముషాలూ తీస్తూపోతే డైనమిక్స్ కాపాడ్డం కష్టమే. 18 నెలలు అతిగా రాసి, 18 నెలలు అతిగా తీసినప్పుడు ఇలాగే అవుతుందని అనుకోవాలేమో. 


        హీరోయిన్ హీరోయిన్ లా లేదు. ఆమె కంటికే అనడం లేదు. సహాయ నటిలా వుంది. ఇక ఇద్దరు విలన్ల పాత్రల్లో కన్నడ నటులు వాళ్ళ ప్రతిభ చాటుకున్నారు. సంగీతం మైనస్సే గానీ, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం ఈ మిక్స్డ్ జానర్ కి ఒకే లుక్ తో వున్నాయి - చారిత్రకం అన్నట్టు. ఈ తరహా సెట్టింగులు చారిత్రక సినిమాల్లోనే వుంటాయి. బార్ సెట్ మాత్రం డిజైనర్ కౌబాయ్ లుక్ తో చేశారు. యాక్షన్ సీన్స్ కౌబాయ్ తో సంబంధం లేదు. ఇక దర్శకుడే ఎడిటర్ అయినందు వల్ల 3 గంటల 6 నిమిషాలు తృప్తిగా నిడివి పెట్టుకున్నాడు. 
3 గంటల 6 నిమిషాల సినిమాకి 4 నిమిషాల 15 సెకన్ల ట్రైలర్ కూడా కట్ చేసి ఔరా అన్పించుకున్నాడు అఖిల భారతీయంగా. 

చివరికేమిటి
        ఈ సినిమా చూస్తూంటే ‘గబ్బర్ సింగ్’ గుర్తుకురాక మానదు. 2012 లో విడుదలైన పవన్  కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రివ్యూలో కొంత భాగాన్ని ఒకసారి చూద్దాం...

        స్టార్ సినిమాలంటే అవే ఫ్యాక్షన్, మాఫియా, యాక్షన్ కామెడీలనే నమ్మి ఏ వైవిధ్యం లేకుండా వాటినే ఉత్పత్తి చేస్తూ, ముందుకు పోలేని ఒక ప్రతిష్టంభన నెదుర్కొంటున్న పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ -  హరీష్ శంకర్ ల ‘గబ్బర్ సింగ్’ ఆగమనం ఓ ఆశా రేఖ. మనం గతంలో చాలా వెస్టర్న్ కౌబాయ్ సినిమాలు చూసే వుంటాం. అవి మన ఫ్యాక్షన్, మాఫియా సినిమాల్లాగా డార్క్ మూడ్ ని క్రియేట్ చేసేవి కావు. కౌబాయ్ పాత్రలు మన జానపద పాత్రల్లాంటివే. వినోదాన్ని అందించడానికే అవి పుట్టాయి. పైగా కౌబాయ్ పాత్రలు అమెరికన్లకి మిథికల్ (పౌరాణిక) పాత్రల్లాంటివి. అవి వాళ్ళ ఆత్మిక దాహాన్ని తీరుస్తాయి. రానురాను వీటికి కాలం చెల్లిపోవడంతో, సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్ లాంటి మానవాతీత శక్తుల మిథికల్ పాత్రల్ని ప్రవేశపెట్టి అలరించ సాగారు. అయినా కౌబాయ్ చచ్చి పోలేదు. ముఖ్యంగా  భారతీయ ప్రేక్షకుల స్మృతి పథంలో నిలిచే వున్నాడు. మరీ తెలుగు ప్రేక్షకులనైతే ‘మోసగాళ్ళకు మోసగాడు’ నుంచీ ‘టక్కరి దొంగ’ వరకూ అడపా దడపా పలకరించి పోతూనే వున్నాడు. అయితే ఓ మారు వేషంలో రావడం మాత్రం ఇదే ప్రథమం. అసలు మొత్తం భారతీయ వెస్టర్న్ సినిమాల మీద రాజేంద్ర ప్రసాద్ తో తీసిన పేరడీ ‘క్విక్ గన్ మురుగన్’ అనే ఓ హాస్య ప్రహసనం వుండగా, ఒక పోలీసు వేషంలో పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ గా కౌబాయ్ రావడం పైన చెప్పుకున్న ప్రతిష్టంభనని బద్దలు చేసే ఒక అపూర్వ క్రియేటివిటీయే అయింది.


        హిందీ ‘దబంగ్’ లో సల్మాన్ ఖాన్ ది సాదా పోలీసు పాత్ర. అతడి వ్యవహార సరళి ప్రేక్షకులకి అలవాటయిన అతడి తీరులోనే వుంటుంది. దీని రీమేకైన ‘గబ్బర్ సింగ్’ లో పాత్ర భారీ రూపాంతరం చెందింది. ఒక ఏరియాని ఇష్టారాజ్యంగా ఏలుకునే వెస్టర్న్ సినిమాల్లోని కౌబాయ్ క్యారక్టర్ లా అతను ప్రవర్తిస్తాడు. ఇష్టం వచ్చినట్టు తుపాకులు పేలుస్తాడు. సిబ్బందిని గ్యాంగ్ లా వెంటేసుకు తిరుగుతాడు. వాళ్ళతో ‘గబ్బర్ సింగ్’ డైలాగులు కొడతాడు. ఫన్నీ డైలాగులతో ప్రత్యర్ధి ముఠాతో ఆడుకుంటాడు. వెస్టర్న్ సినిమాలని తలపించే ప్రదేశాల్లో గుర్రమెక్కి, బైకెక్కి, జీపెక్కి సంచరిస్తాడు. అలాంటి వొక ఎడారి మైదానంలో పోలీస్ స్టేషన్ కూడా వుంటుంది. దాని బోర్డుని గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ మార్చేస్తాడు. కౌబాయ్ లా ఈ తన అడ్డా తనిష్టం. పోలీస్ స్టేషన్ లో ఎప్పుడెక్కడ కూర్చుంటాడో తెలీదు. ఏ భంగిమలో కూర్చుంటాడో తెలీదు. తన వెంట వుండే సాంబా అనే ‘షోలే’ క్యారక్టర్ తో తను పలికే ఆణిముత్యాలని నోట్ చేసుకొమ్మని ఆర్డరేస్తూ, గిరీశంలా లిటరరీ టచ్ కూడా ఇస్తాడు. ‘దబంగ్’ మహారాష్ట్ర లోని రియల్ లొకేషన్ లో షూటింగ్ జరుపుకుంటే, ‘గబ్బర్ సింగ్’ కోసం గ్రామం సహా, అన్ని లొకేషన్సూ సెట్సే వేశారు. దీంతో తెలుగు నేటివిటీకి భిన్నంగా ఒక డిజైనర్ లుక్ తో మోడరన్ వెస్టర్న్ వాతావరణ నేపధ్యం సమకూరినట్టయింది...

         ఇదీ జానర్ ని పది జానర్లతో కలిపి కషాయంలా చేయకపోవడంతో వున్న ప్రయోజనం. కౌబాయీకరణలో ‘గబ్బర్ సింగ్’ ఏకసూత్రత హీరోని దృష్టినాకర్షించే ఫోకస్ తో ప్రస్ఫుటంగా నిలబెట్టింది. రక్షిత్ శెట్టి కౌబాయ్ తనం, నేపథ్యవాతావరణం ఈ జల్లెడ పట్టలేక కథనీ, పాత్రనీ కలగాపులగం చేశాయి వివిధ జానర్ల తాపడంతో.

        ఇలావుంటే కథకి స్ట్రక్చర్ అనేది లేదు. పైగా కథనుంచి వెళ్ళిపోయి విన్యాసాలు. గంటన్నర ఫస్టాఫ్ అంతా కథలోకే వెళ్ళదు. ఒక పేలవమైన డైలాగుతో ఇంటర్వెల్ కూడా బలైంది. సెకండాఫ్ మొదలెడితే ఇంకా అవే డైలాగ్ కామెడీలు, వున్న చోటే డ్రామాలు. నిధికోసం వేటలో వుండాల్సిన పాత్రలు రాజకీయాలు చేసుకుంటూ ఎక్కడేసిన గొంగళిలా వుంటాయి. ఇక క్లయిమాక్స్ అత్యంత పేలవం. ట్రెజర్ హంట్ జానర్ కథ అడ్వెంచర్ ప్రధానంగా వుంటుందనేది ప్రాథమిక జ్ఞానం. ఇది కూడా లేకపోతే ఎలా?

        సూపర్ స్టార్స్ తో ‘మెకన్నాస్ గోల్డ్’ (1969) అనే బృహత్తర సినిమా సాంతం ఔట్ డోర్ కౌబాయ్ అడ్వెంచరే. ఇందులో నిధి వున్న పర్వతాల్లో భూకంపం వచ్చే దృశ్యాల్లో ముఠాలు ఇరుక్కునే క్లయిమాక్స్ సినిమాకే తలమానికం. ఈ దృశ్యాలతోనే ఈ సినిమా ప్రసిద్ధి. ‘అతడే శ్రీమన్నారాయణ’ దేనికి ప్రసిద్ధి? భారీ పెట్టుబడులతో ఇలాటి బిగ్ కాన్వాస్ సినిమాలు తీసేప్పుడు హాలీవుడ్ లో ఇలాటి సినిమాల గురించి వచ్చిన రైటింగ్, మేకింగ్ సంబంధ పుస్తకాలు, దర్శకుల ఇంటర్వ్యూలూ చదవాల్సిన అవసరముంది. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ ల మీద పుస్తకాలు అద్భుత ద్వారాలు తెరుస్తాయి. పానిండియా అనుకునే ముందు పఠనం లేకపోతే పతనం పొంచి వుంటుంది. 

        నికొలస్ కేజ్ నటించిన ‘నేషనల్ ట్రెజర్’ (2004) మోడరన్ అడ్వెంచర్ కి ప్రతీక. ఇందులో కథ ఓ పది నిమిషాలకే ప్రారంభమైపోతుంది. గోల్ వచ్చేసి 1776 నాటి ‘డిక్లరేషన్ ఆఫ్ ఇండెపెండెన్స్’ కళాకృతుల్ని చేజిక్కించుకోవడం. చరిత్రకారుడి పాత్రలో హీరోగా నికోలస్ కేజ్ కి ప్రత్యర్ధులుగా కిరాయి ముఠాలు. కేజ్ కి ఒక నైతికపరమైన సందిగ్ధత కూడా వుంటుంది. అతను ముందు కెళ్తే ఎఫ్బీఐ అతణ్ణి ప్రజాశత్రువు నెంబర్ -1 గా ప్రకటించే ప్రమాదముంది. దీనికి ఆస్కార్ నామినేషన్ వరకే దక్కవచ్చు. కానీ ఔట్ డోర్ అడ్వెంచర్ గా దీని వినోదాత్మక విలువ తీసివేయలేనిది.

        ‘అతడే శ్రీమన్నారాయణ’ మేకింగ్ లోనే తప్ప రైటింగ్ లో సత్తా చాటుకోలేక పోయిన పాక్షిక ప్రయత్నం. ఐతే 23 కోట్లే బడ్జెట్ అంటున్నప్పుడు ఓపెనింగ్స్ తో బయటపడే అదృష్టముంది.

సికిందర్



Sunday, October 6, 2019

879 :


        వారం బాక్సాఫీసుకి ఇంకో స్టార్ మూవీ బలైంది. బాక్సాఫీసు లౌక్యం  లేక 'చాణక్య' బాక్సాఫీస్ రేసు మొదటి పావు గంకే ఓటమి గంట మోగించింది. కొన్ని సినిమాల జాతకం మొదటి పావు గంట సీన్లలోనే తెలిసిపోతుంది. అంటే స్క్రిప్టులో మొదటి పదిహేను పేజీల్లోనే దాని వెండితెర మర్యాద తెలిసి పోతుందన్నమాట. అలాటిది గంటో గంటన్నరో వింటున్నా కూడా గోపీచంద్ కి ఇంకేవో అద్భుతాలు కన్పించాయంటే అది యాక్షన్ సీన్లతో వలపు వల. హైటెక్ యాక్షన్ సీన్లు మెప్పిస్తే ఇంకే ‘విషయ’ మయినా ఓకే అన్పించడమే. కానీ ‘విషయం’ బాక్సాఫీసు ఫ్రెండ్లీగా, మార్కెట్ ఓరియెంటెడ్ గా లేక, కేవలం యాక్షన్ సీన్లే పెట్టుబడి అనుకుంటే, స్టార్ ఇమేజి పూర్ గా మారుతుంది, మార్కెటింగ్ రేటింగ్ పడిపోతుంది.

         
తెలుగు మార్కు కంటెంట్ ని నాలుగు భాషల్లో తీసి పాన్ ఇండియా మూవీ అనేకన్నా, పాన్ ఇండియా కంటెంట్ ని రెండు భాషల్లో తీసినప్పుడే తెలుగు మీసం తిప్పాలి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లతో యాక్షన్ సీన్లు తీసి ఇంటర్నేషనల్ రేంజి ఇచ్చామని చెప్పుకునే కన్నా, ఇండియన్ స్టంట్ మాస్టర్లతో ఆ ప్రయత్నం చేసి హాలీవుడ్ రేంజి ఇచ్చామని చెప్పుకోవాలి. బయటివాడే వచ్చి చేసిపోతే అది మన అంతర్జాతీయ స్థాయి ఎలా అవుతుంది.

          పాత రోజులెలా వుండేవో ఈ ఆదివారం సాయంత్రం హోరున దంచుతున్నవర్షానికి వెచ్చ వెచ్చగా తల్చుకుందాం...ఆయన హీరో కృష్ణ, ఇంకో ఆయన కవి / రచయిత ఆరుద్ర, మరింకో ఆయన యాక్షన్ సినిమాల దర్శకుడు కెఎస్ఆర్ దాస్. ఈ ముగ్గురూ కలిస్తే 1971 లో  పంచ రంగుల కౌబాయ్ ‘'మోసగాళ్ళకు మోసగాడు’ ట్రెండ్ సెట్టర్ అయింది - టెక్నికల్ గా, కంటెంట్ పరంగా. టెక్నికల్ గా కెమరామాన్ వీఎస్సార్ స్వామి లెజెండ్. ఆఫ్ కోర్స్, కంటెంట్ హాలీవుడ్ స్ఫూర్తే.  ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’, ‘మెకన్నాస్ గోల్డ్’ ల వంటి హాలీవుడ్స్ స్ఫూర్తేగానీ, ఒక్క కాపీ సీను లేదు. ఒక్క కాపీ యాక్షన్ సీను - షాటు లేవు. బయటి నటీనటులు లేరు, సాంకేతిక నిపుణులూ లేరు. అంతా తిప్పరా మీసం తెలుగుదనమంటూ అప్పుడే గ్లోబల్ మూవీ ఇచ్చేశారు కృష్ణ -  ఆరుద్ర - దాస్ త్రయం. ఇక తెలుగులో సూపర్ డూపర్ టాపర్ హిట్టయి, పాన్ ఇండియా కాదు- ఏకంగా ఇండియా దాటి 125 దేశాల్లో ఇంగ్లీష్ డబ్బింగ్ మోత మోగించింది. ఎవ్వడూ ఇది మా నుంచి కాపీ అనలేదు. తెలుగు మీసానికి వందనం చేశారు. ఇప్పుడు తెలుగో కాదో అర్ధంగాని వేషం తప్ప మీసం లేదు.    

         
రాయడం మానేయడం కూడా రైటింగ్ ప్రణాళికలో భాగమవుతుందా? అంటే కొంత కాలం రాయడానికి ప్రయత్నించి, ఇక రాయలేమని అన్పిస్తే మానెయ్యాలని ముందే అనుకుని రాసే పనిలోకి దిగాలా? రాయడానికి ఆత్మ స్థైర్యం అత్యవసరం. ఇంకొకరిలా రాయాలని ప్రయత్నిస్తే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి ‘ఇంకొకరిలా’ అనే ఆలోచన వుండకూడదు. అందుకని ‘రాయడం మానేయడం’ అనే క్లాజు ఈ సందర్భంలో రైటింగ్ ప్రణాళికలో వుండకూడదు. కాలం మారితే, మారిన  కాలానికి తగ్గట్టుగా రాయలేకపోతే అప్పుడు కొంత తగ్గ వచ్చు. ఈ క్లాజు మాత్రం రైటింగ్ ప్రణాళికలో పెట్టుకోవచ్చు. ఐతే ఈ క్లాజుని కూడా వర్కౌట్ చేస్తూండాలి. ఒకసారి రాయడం వచ్చేశాక, ఇక మనకి ఫర్వాలేదని అనుకోకుండా అప్డేట్ అవుతూంటేనే ఉనికిలో వుంటారు. అయినా ముఖం పాతబడి కొత్త ముఖాల్ని కోరుకునే తర్వాతి తరం ప్రేక్షకులతోనో / పాఠకులతోనో గ్యాప్ వస్తుంది. అయినా రాయడానికి మాధ్యమాలు విస్తరించాయి. విస్తరిస్తున్నకొద్దీ రాసే వాళ్ళ కొరత పెరుగుతోంది. కాబట్టి రాయడం నుంచి రిటైర్మెంటు లేదు. రైటర్ అన్నాక ఏ సమయంలోనూ బ్రేక్ వుండదు. విహార యాత్ర కెళ్ళినా రాసే ఆలోచనలే సుళ్ళు తిరుగుతూంటాయి.
సికిందర్

Thursday, April 25, 2019

808 : ఫ్లాష్ బ్యాక్




ప్రతి ఏడాదీ సగటున యాభై 
మంది కొత్త దర్శకులు తెలుగులో పరిచయ మవుతున్నారు.  మొత్తం తెలుగు సినిమాల్లో సగం సినిమాలు వీళ్ళే తీస్తున్నారు. ఆ సగానికి సగమూ అపజయాల పాల్జేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంకో యాభై మంది కొత్తగా వస్తున్నారు. వాళ్ళూ ఓ యాభై ఫ్లాపులిచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్లి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఓ రెండు శాతమే వుంటుంది. అలా వచ్చి రెండో సినిమా కూడా ఫ్లాపే ఇస్తున్నారు. 2014 లో 70 మంది కొత్త దర్శకులు వచ్చారు. 64 ఫ్లాపులిచ్చారు. 2015 లో కొత్త దర్శకుల సంఖ్య 48 కి తగ్గింది.  వీళ్ళు 39 ఫ్లాపులిచ్చారు. అసలు ఎవరు వీళ్ళంతా,  వీళ్ళతో సినిమాలు తీస్తున్న నిర్మాత లెవరనీ చూస్తే,  నిర్మాతలు కొత్త వాళ్ళు, దర్శకులు కొత్త వాళ్ళే.  ఎన్నాళ్ళ నుంచో స్ట్రగుల్ చేస్తూ ఓ అవకాశం పొందిన వాళ్ళు. కొందరైతే సినిమాలు  తీయడంలో ఏ అనుభవమూ లేకుండానే కొత్త నిర్మాతల్ని పట్టేస్తున్న వాళ్ళు.

అగ్ర నిర్మాతలు తీసే భారీ సినిమాలూ,  పది కోట్ల లోపు సినిమాలు తీసే ఇతర నిర్మాతలూ  మొత్తం  కలిపి తీసేవి ప్రతీ సంవత్సరం ఇరవైకి మించవు. మిగతా లో- బడ్జెట్ చిన్నాచితకా సినిమాలే భారీ సంఖ్యలో  వుంటాయి. ఒక విధంగా ఇవి తీసే కొత్త నిర్మాతలు అంతా పోగొట్టుకుని టెక్నీషియన్లనీ, కార్మికుల్నీ  పోషిస్తున్నట్టే. కానీ థియేటర్లలో క్యాంటీన్ వాళ్ళనీ, పార్కింగ్ వాళ్ళనీ కలెక్షన్లు  లేక తెగ ఏడ్పిస్తూంటారు. ప్రొడక్షన్ రంగంలో అందరికీ కామెడీగా వుంటే, ప్రదర్శనా  రంగంలో అందరికీ ఈ సినిమాలతో ట్రాజెడీయే. పల్లీలమ్ముకునే వాడుకూడా బతకలేడు. ఇదంతా  ఛోటా నిర్మాతల గ్రేట్ టాలీవుడ్ షో గా ప్రతీ సంవత్సరమూ రన్  అవుతూంటుంది సగర్వంగా. ఈ ఛోటా నిర్మాతలకి కావలసినంత  ‘కీ’ ఇచ్చి వదిలేది కొత్త కొత్త దర్శకులు. దీని తర్వాత ఈ నిర్మాతలూ వుండరు, కొత్త దర్శకులూ వుండరు. ఈ వెళ్ళిపోయినా యాభై మంది కొత్త దర్శకుల, కొత్త నిర్మాతల స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇంకో యాభై మంది కొత్త నిర్మాతలూ దర్శకులూ వచ్చేసి, ఆ ఏడాదికి ఫ్లాపుల కాష్టాన్ని ఆరకుండా మండించడం మొదలెడతారు. ది షో మస్ట్ గో ఆన్- అన్నట్టు రావణ కాష్టం మండుతూనే వుంటుంది. ఎప్పటికపుడు ఓ యాభై – అరవై చెత్త చెత్త సినిమాలు భస్మీపటలం అవుతూనే  వుంటాయి.



 వీళ్ళు తీస్తున్న  సినిమా లేమిటీ  అని చూస్తే మాత్రం,  నూటికి తొంభై శాతం చెత్త ప్రేమ సినిమాలే. ఒకటీ అరా హార్రరో మరోటో వుంటాయి. ఇవన్నీ  మళ్ళీ ముక్కూ మొహం తెలీని ఆ ఒక్క సినిమాతో ఖతం అయిపోయే కొత్త కొత్త హీరో హీరోయిన్లతోనే  తీస్తారు. ఆ కథలూ బావుండవు, హీరో హీరోయిన్లూ నటించలేరు, దర్శకుడూ సరీగ్గా తీయలేడు.  అర్ధం పర్ధం లేని ప్రేమలు, వాటికి చాలా ఇమ్మెచ్యూర్డ్ కథనాలు, ఇంకా మాటాడితే అవే  మూస ఫార్ములా షోకులూ... ఇవే ఈ నయా దర్శకుల పాలిట యమ పాశా లైపోతున్నాయి.    

        ‘నువ్వు నేను ఒకటవుదాం’ అని ఒక కొత్త దర్శకుడు తీస్తాడు. ఇంకో కొత్త దర్శకుడు ‘గాయకుడు’ అని తీస్తాడు. మరొకతను వచ్చేసి  ‘ భం భోలే నాథ్’ అంటూ ఏదో తీస్తాడు. వీళ్ళ ఉద్దేశంలో ఇలాటి సినిమాలన్నీ చూడాల్సింది యువ ప్రేక్షకులే. కానీ ముక్కూ మొహం తెలీని కొత్త కొత్త  హీరో హీరోయిన్లని యువ ప్రేక్షకులు అసలే కేర్ చెయ్యరని వీళ్ళకి తెలీదు. థియేటర్ వైపు కూడా తొంగి చూడరని తెలుసుకోరు. ఇక ఇవి తీసే కొత్త దర్శకుణ్ణి  ఏ యువ ప్రేక్షకులూ అసలే పట్టించుకోరనీ గ్రహించరు. ఇక తయారైన ఇలాటి సినిమాల్ని ఏ బయ్యరూ కొనడు. మళ్ళీ నిర్మాతలే డబ్బులు పెట్టుకుని విడుదల చేసుకోవాలి. విడుదల చేస్తే ఓపెనింగ్సే వుండవు. డబ్బుల్లేక పోతే విడుదలే కావు. 

        ఇక్కడ కొత్త దర్శకులకి అర్ధం కాని ఇంకో సంగతేమిటంటే, కొత్త కొత్త హీరో హీరోయిన్లని ఏ అగ్ర దర్శకుడో లేదా ఏ ప్రముఖ బ్యానరో  పరిచయం చేస్తే తప్ప యువ ప్రేక్షకుల్లో సినిమాకి గ్లామర్ రాదనేది. ఒకప్పుడు యువప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజా,  ఎవర్ని పెట్టి సినిమా తీసినా యువ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఇప్పుడు తేజ క్రేజ్ తగ్గిపోయాక, ఆయన కొత్త వాళ్ళని పెట్టి ఎంత గట్టిగా సినిమా తీసినా ఆయన్నీ, ఆయన ప్రెజెంట్ చేస్తున్న కొత్త హీరో హీరోయిన్లనీ కనీసం కన్నెత్తి చూడడం లేదు యువ ప్రేక్షకులు.  ఇదే కొత్త దర్శకుల విషయంలోనూ జరుగుతోంది. నువ్వే  కొత్తయి నప్పుడు నువ్వు పెట్టే కొత్త మొహాలెవరికి అవసరం? రెండోది
 యువ ప్రేక్షకులు గ్లామరస్ గా వుండే బిగ్ ఈవెంట్ నే కోరుకుంటారు. ఫీల్డులో పేరున్న కుటుంబాల నుంచి ఏ  కొత్త హీరో వస్తున్నా ఒక గ్లామర్ తో, ఒక సెలెబ్రేషన్ తో మొదట్నించీ దృష్టి పెడతారు యువ ప్రేక్షకులు. వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్స్ ఇస్తారు. బావుంటే హిట్ కూడా చేస్తారు.




అంతే  గానీ ఒక కొత్త నిర్మాత ఎవరో వచ్చేసి,  నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తానని అంటే,  నీ కొడుకెవరు? మెగా స్టార్ వారసుడా? రామానాయుడు మనవడా? అసలు నువ్వెవరు? నీ కొడుకుతో సినిమా తీస్తే ఎవరు విడుదల చేస్తారు? ఎవరు చూస్తారు? ..అనే ఈ ప్రశ్న లేవీ వీళ్ళ మీద పనిచెయ్యవు. ఇలాటి బాపతు వ్యక్తులు కూడా ఈ  మధ్య ఎక్కువైపోయారు. వీళ్ళని చూసి స్వాభిమానం వున్న కొత్త దర్శకులు పారిపోవడమో, వచ్చిన  అవకాశమే గొప్పనుకున్న వాళ్ళు అలాగే పెట్టి ఆ సినిమా చుట్టి పారేసి తప్పించుకోవడమో  చేస్తున్నారు.

ఈ సంవత్సరం  కొత్తగా వచ్చిన దర్శకుల్లో  కిషోర్ కుమార్ ( గోపాల గోపాల), అనిల్ రావిపూడి ( పటాస్), క్రాంతి మాధవ్ ( మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), నాగ్ అశ్విన్ ( ఎవడే సుబ్రహ్మణ్యం), రాధాకృష్ణ కుమార్ (జిల్).. ఈ ఆరుగురు మాత్రమే సక్సెస్ అవగల్గారు. ( డిసెంబర్ 25 న విడుదల కానున్న ‘భలే మంచి రోజు’ తో మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య రిజల్ట్  ఇంకా తేలాల్సి వుంది). ఈ కొత్త దర్శకులందరూ స్టార్స్ తో తీసి సక్సెస్ అయిన వాళ్ళే. అలాగే బాలకృష్ణ తో ‘లయన్’ తీసినప్పటికీ సత్య దేవ్ అనే కొత్త దర్శకుడు రాణించలేక పోయాడు. సుధీర్ తో ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసిన ఏఎన్ బోస్, నారా రోహిత్ తో ‘అసుర’ తీసిన కృష్ణ విజయ్, సుమంత్ అశ్విన్ తో ‘కొలంబస్’ తీసిన సామల ఆర్, కోనవెంకట్ నీడన నిఖిల్ తో ‘ శంకరాభరణం’ తీసిన ఉదయ్ లాంటి కొత్త దర్శకులు ఫ్లాప్ అయితే, సుకుమార్ పంచన ‘కుమారి 21 ఎఫ్’  తీసిన సూర్య ప్రతాప్ హిట్టయ్యాడు. 

ఇక గతంలో కొత్త దర్శకుడుగా ‘రిషి’ అనే ఫ్లాప్ తీసిన రాజ్ మాదిరాజు, మళ్ళీ తిరిగి వచ్చి ఈ సంవత్సరం ‘ఆంధ్రాపోరి’ తీసి రెండో సారి కూడా చతికిలబడ్డాడు. కొత్త దర్శకుడుగా ‘స్వామీరారా ’ అనే న్యూవేవ్ సూపర్ హిట్ తీసి ప్రామిజింగ్ గా కన్పించిన సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘ దోచేయ్’ అనే పాత మూసకి పాల్పడి మోసపోయాడు. ఇంకో కొత్త దర్శకుడు రాజ్  కిరణ్ తిరిగి రెండో సినిమాతో వచ్చాడు. ఈయన ‘గీతాంజలి’ తో సక్సెస్ అయి, రెండో సినిమా ‘త్రిపుర’ తో ఫ్లాపయ్యాడు. 



కొత్త దర్శకులందరికీ పెద్ద అవకాశాలు రావు. ఓ చిన్న బడ్జెట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ఫోన్ కాల్స్ రావచ్చు. కానీ ఈ ప్రూవ్ చేసుకునే ఆలోచన ఎంతమంది కొత్త దర్శకులు చేస్తున్నారు. అలాటి ఉన్నతమైన ఆలోచనలు చేస్తే ఏటా యాభై అరవై చిన్న సినిమాల్ని గంగలో ఎందుకు కలుపుతున్నారు. వాటి మొత్తం విలువ ఎన్ని వందల కోట్లు వుంటుంది? వందలాది  కోట్లతో ఏం చూసుకుని ఆటలాడుతున్నారు? పోనీ ఓ ‘కంచె’ లాంటి  భిన్న ప్రయోగం చేసీ చేయరాక, హిందీ లో ఓ ‘తిత్లీ’ లాంటి రియలిస్టిక్ ఫిక్షన్ లాంటిది ప్రయత్నించీ చేతులెత్తేసి, ఈ వందలాది  కోట్ల రూపాయల్నీ  ముంచేస్తున్నారా?  ఇలా చేస్తే ఆ మునిగినా కొత్త దర్శకుడికీ, కొత్త నిర్మాతకీ మంచి పేరైనా వస్తుంది- సోదిలోకి రాని చెత్త ప్రేమకథలే  తీస్తూ కూర్చుంటే  పేరూ డబ్బులూ రెండూ పోతాయి. 

గడ్డి పోచ దొరకనట్టు ప్రవాహంలో కొట్టుకు పోవడం కాదు, గడ్డి పోచని కనిపెట్టడం తెలుసుకోవాలి. దాన్ని పట్టుకుని విజయవంతంగా ఒడ్డున పడడం నేర్చుకోవాలి. కొరియన్ సినిమాల కట్ అండ్ పేస్ట్ కృత్రిమ పనులు పనికి రావు, సమాజాన్ని తెలుసుకోవాలి. సమాజంలోకి చూపు సారించినప్పుడు, యూత్ అసలేం కోరుకుంటున్నారో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే యూత్ తో కనెక్ట్ అవగల్గి, బలమైన కథాకథనాల్ని సృష్టించగల్గుతారు. కోటి రూపాయలతో తీసిన సిన్మా సొంత క్రియేటివిటీ తో కళకళ లాడితే థియేటర్లు కిటకిట లాడతాయి. ఈ పనికి మనస్కరించని మందబుద్ధులైన కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలూ రంగం నుంచి తప్పుకోవాలి. ఏటేటా ఇంత ట్రాష్ తో టాలీవుడ్ ఏం సుగంధాల్ని వెదజల్లుతుందని.  

-సికిందర్




Wednesday, October 3, 2018

692 : స్క్రీన్ ప్లే సంగతులు


          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో పాతాళభైరవి తర్వాత దొంగరాముడు పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై అరవై యేళ్ళు దాటింది. ఈ అరవై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. పదేళ్లకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. దేశభక్తి ముందు అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో,  తొలివ్యాపార యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి (కల్తీ) వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే లపాకీ విలువలు. 

          యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తే?  అప్పుడు మలి (కల్తీ) వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరుగుతుంది. 

          నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే. ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

        మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి (కల్తీ) వ్యాపార యుగంలోనూ గత నాల్గైదు ఏళ్ల క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోకి ప్రయాణం కడుతోంది. అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం – మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

          దొంగరాముడు మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, లపాకీ విలువల మలి (కల్తీ) వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలింది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు - ఈ సర్కస్ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే... లాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

***
       దొంగ రాముడులో డైనమిక్స్ ఎక్కువ. కథ నిదానంగా దాని సమయం తీసుకుంటూ సాగినా, దృశ్యాల్లో కన్పించే డైనమిక్స్ ఎక్కువ. హీరో చిన్నప్పటి కథ పూర్తవడానికి 25 నిమిషాలు పడుతుంది. అప్పుడు మాత్రమే ఎదిగిన హీరోగా దొంగరాముడు (అక్కినేని నా గేశ్వర రావు) కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలకి గానీ హీరోయిన్ సీత (సావిత్రి) కన్పించదు. ఆ తర్వాత 5 నిమిషాలకి గానీ ఇంకో ముఖ్యపాత్ర దొంగరాముడి చెల్లెలు లక్ష్మి (జమున) తెరపైకి రాదు. అంటే నాగేశ్వరరావు, సావిత్రి, జమునలు వంటి ప్రముఖ తారలు ప్రేక్షకులకి తెరమీద కన్పించడానికి అరగంట నుంచీ ముప్పావు గంట సమయమూ  తీసుకుంటారన్న మాట. అప్పటికి ఆక్కినేని –సావిత్రిల సూపర్ హిట్ దేవదాసు విడుదలై రెండేళ్ళయింది. అయినప్పటికీ కూడా అంతటి పాపులర్ తారల ఇమేజిని, ఫాలోయింగ్ నీ దృష్టిలో పెట్టుకుని దొంగరాముడు కథ చేయలేదు. అప్పట్లో ఇంకా హీరోయిజాలు ప్రారంభం కాలేదు కాబట్టి, తారలు కాకుండా కథ, అది తీసుకునే సమయమే ప్రధానమైంది. తర్వాత వ్యాపార యుగం నుంచీ ప్రారంభమైన తారల గ్లామర్ హంగూ ఆర్భాటాలతో పోలిస్తే, మలిస్వర్ణ యుగంలో కన్పించేది గ్లామర్ లేని పాత్రలే. ఏవైతే 1970 లలో ఆర్టు సినిమాలంటూ రావడం ప్రారంభించాయో, వాటిలో వుండే బీదాబిక్కీ తరహా గ్లామర్ లేని సామాన్య పాత్రల్నే మలిస్వర్ణ యుగంలో సహజత్వానికి ధర్మాసనం వేస్తూ ప్రేక్షకులకి అందించారు. 

          దొంగరాముడులో ఇంకో ముఖ్య పాత్ర కన్పించదు. అది విలన్ పాత్ర. విలన్ లేకుండానే దొంగరాముడికి కష్టాలుంటాయి. అతడి చేష్టలు చాలు తనకి తానే విలన్ అవడానికి. 

          దొంగరాముడు నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు; దర్శకుడు – స్క్రీన్ ప్లే రచయిత కెవి రెడ్డి, కథ కెవి రెడ్డి, డివి నరసరాజు, దుక్కిపాటి మధుసూదన రావు; మాటలు డివి నరసరాజు, సంగీతం పెండ్యాల, ఛాయాగ్రహణం ఆడి ఎం ఇరానీ, ఇతర తారాగణం జగ్గయ్య, రేలంగి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం తదితరులు. 

          దొంగరాముడు కథ అరగంటకోసారి రిపీటవుతూ వుంటుంది. దీంతో మూడు క్లయిమాక్సులు వున్నట్టుగా అన్పిస్తుంది. భవిష్యత్తులో 1998 లో రన్ లోలా రన్ లాంటి మూడు క్లయిమాక్సుల మూవీ వస్తుందని అప్పుడే వూహించారేమో. కొన్ని అలా జరిగిపోతాయి. 

          దొంగరాముడు చిన్నప్పుడు అలా చేసి వుండకపోతే జైలుకి వెళ్ళేవాడు కాదు. విడుదలై  పెద్దోడుగా అలా చేసి వుండక పోతే మరోసారి జైలుకి వెళ్ళే వాడు కాదు. మళ్ళీ విడుదలయ్యాక అలా కూడా చేసి వుండక పోతే ఇంకోసారీ జైలుకి వెళ్ళే వాడే కాదు. మరి ఏంచేసి వుండాలి దొంగరాముడనే వాడు?



 రేపు!

సికిందర్