రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జనవరి 2018, శనివారం

592 : రివ్యూ!



రచన - ర్శత్వం: జి. అశోక్
తారాగణం: అనూష్కా, ఉన్నీ ముకుందన్, అశా త్, విద్యుల్లేఖా రామన్, యరాం, మురళీ ర్మరాజ్, ప్రభాస్ శీను తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.న్, ఛాయాగ్రణం: మాధి
బ్యానర్
: యు.వి.క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
విడుదల : జనవరి 26, 2018

***
(సమయాభావంవల్ల పూర్తి స్థాయి రివ్యూ ఇవ్వడం లేదు, రేపుదయం మిగతా భాగం చూడగలరు)
కథ
     
చంచల (అనూష్కా ఒక ఐఏఎస్ ఆఫీసర్. వంశధార అనే ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకి న్యాయం చేయాలని కృషి చేస్తూంటుంది. శక్తి (ఉన్నీముకుందన్) అనే అతను రైతులకి న్యాయం కోసం పోరాడే కార్యకర్త. సీబీఐ అధికారి సంపత్ (మురళీ శర్మ) తమ్ముడు. ఇతను చంచలని మొదట అపార్ధం చేసుకున్నా, తర్వాత సహకరించడం మొదలెడతాడు. ఈ క్రమంలో ఇతడితో ప్రేమలో పడుతుందామె. కొన్ని పరిణామాల్లో ఇతణ్ణి హత్య చేసిన కేసులో జైలు కెళ్తుంది. 

          ఈశ్వర ప్రసాద్ (జయరాం) కేంద్రంలో ఇరిగేషన్  మంత్రి. ఇతను తన మీద కుట్ర చేస్తున్నాడని సీఎంకి అనుమానమొచ్చి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడంతో కేంద్రమంత్రి ఈశ్వర ప్రసాద్ మీద సీబీఐ ఎంక్వైరీ వేయిస్తాడు. విగ్రహాల దొంగతనాలతో అతడికి సంబంధ ముందని అనుమానించి ఆధారాలతో నిరూపించడానికి  వేసిన ఎంక్వైరీకి వైష్ణవీ నటరాజన్ ( ఆశా శరత్) సారధ్యం వహిస్తుంది. గతంలో ఈశ్వర ప్రసాద్ కి పియ్యేగా  పనిచేసిన చంచల నుంచి సమాచారం రాబట్టాలని నిర్ణయిస్తుంది. ఇది రహస్యంగా చేస్తున్న దర్యాప్తు కాబట్టి, జైల్లో వున్న చంచలని రహస్య ప్రదేశానికి తరలించి ప్రశ్నించాలనుకుంటుంది. దీంతో ఊరిబయట పోలీసులు వాడుకుంటున్న రహస్య ప్రదేశం భాగమతి బంగళాకి చంచలని తరలిస్తాడు సీబీఐ అధికారి సంపత్. 

          ఈ బంగళాలో రాణీ భాగమతీ దేవి దెయ్యమై తిరుగుతోందని చుట్టుపక్కల భయపడు
తూంటారు. ఇందులోనే  చంచలని బందీ చేసి ప్రశించడం మొదలెడుతుంది వైష్ణవి. చంచలకి బంగాళాలో దెయ్యంతో భయానక అనుభవాలు ఎదురవుతూంటాయి. ఆమె చెప్పేది నమ్మని వైష్ణవి, ఆమె బృందం అలాగే నిర్బంధించి వేధిస్తూంటారు. 

          ఇలా చంచల నుంచి సమాచారం రాబట్టారా? చంచలకి పూనిన భాగమతి ఆత్మతో  
అధికారులకి ఎలాటి అనుభవాలెదురయ్యాయి? అసలు భాగమతి ఎవరు? చంచల ఇదంతా ఎలా ఎదుర్కొంది? ఆమె మీద హత్య కేసు సంగతేమిటి? ఈశ్వర ప్రసాద్ తో ఆమెకున్న సంబంధమేమిటి? ఈశ్వర ప్రసాద్ చేసిన స్కామ్ కథ, చంచల చేసిన హత్యకథ, భాగమతి కథ – ఈ మూడిటికీ వున్న సంబంధమేమిటి?... ఇవి తెలియాలంటే వెండితెర మీద పూర్తి చలనచిత్రం చూడాల్సిందే.

ఎలావుంది కథ 
     పెద్దగా ఆలోచించకుండా చూస్తే కొత్తకొత్తగా అన్పిస్తుంది. ఆలోచిస్తూ చూస్తే కుప్పకూలుతుంది. అయినా ఆలోచించకుండా చూసినా సగటు ప్రేక్షకుడికి ఓ కీలక మలుపు దగ్గర రసభంగ మవుతుంది. ఈ రసభంగమే  జయాపజ యాలకి గీటురాయి అయింది. దీన్ని నివారించగల్గి వుంటే ఫర్వాలేదనే స్థాయి నుంచి ఘనవిజయానికి చేరువయ్యేది. 

          ముందు మార్కెట్ యాస్పెక్ట్ నుంచి మొదలెడదాం. మేకర్లు ఈ కథతో వుందనుకున్న ఒకేఒక్క మార్కెట్ యాస్పెక్ట్  ‘అరుంధతి’ ఫేమ్ అనూష్కాతో ‘అరుంధతి’ లాటి  ‘భాగమతి’ ని తీస్తున్నామనుకోవడం. దీంతో అశేష మహిళా ప్రేక్షకుల అండదండలు కూడా కలిసి వస్తాయను 
కోవడం. బాలీవుడ్ లో ఒక కొటేషన్ వుంది –‘షోలే’ కా ‘షాన్’ మత్ బనావో (‘షోలే’ లాంటి ‘షాన్’ తీయకు) అని. ‘షోలే’ తీసి అజరామరం చేసిన సిప్పీ, తర్వాత అలాటిదే ‘షాన్’ తీయాలనుకుని చేతులు కాల్చుకున్న చారిత్రక సందర్భం లోంచి పుట్టిన కొటేషన్ అది. ఒకటేదో  బ్లాక్ బస్టర్ అయ్యిందని మళ్ళీ అలాటిదే ఇంకోటి తీసి బ్లాక్ బస్టర్ చేయాలనుకోవడం ఆరోగ్యకర లక్షణం కాదని, ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనీ  ఇప్పుడు రోహిత్ శెట్టి కూడా మొరపెట్టుకుంటున్నాడు. 

          మార్కెట్ యాస్పెక్ట్ అనేది అప్పుడున్న మార్కెట్ లోంచి పుడుతుందే  తప్ప ఎప్పుడో  గతంలో వచ్చిన ఇంకో సినిమాలోంచి కాదు. గతంగతః గా మర్చిపోవాలి. ఐనప్పటికీ... ఐనప్పటికీ... ఐనప్పటికీ – అరుంధతి, దేవసేన లాంటి జానపద ఫాంటసీ పాత్రలతో మరింత  పైకెదిగి విజయ వంత 
మైన ఫ్రెష్ ఇమేజిని ఎస్టాబ్లిష్  చేసుకోగల్గిన అనూష్కా శెట్టి మార్కెట్ ని నిజంగా క్యాష్ చేసుకోవాలనే  అనుకుంటే, అలాటి పీరియడ్ – ఫాంటసీ స్టోరీలే ఆమెకి వాడుకోవాలి తప్ప, సమకాలీన కాలక్షేప బఠానీ థ్రిల్లర్స్ కాదు. ఆమె ఇప్పటి ఇమేజికి ఇవి సరిపోయేవి కావు. సింపుల్ గా హాలీవుడ్ భాషలో చెప్పుకుంటే,  హై కాన్సెప్ట్ కథలు కావాలి. 

          రస్టిక్ ‘షోలే’,  మేజెస్టిక్ ‘షాన్’ కలిపి ‘బ్యాన్’ అని ఒకటి తీస్తే ఎలావుంటుంది? ‘షోలే’ లోని గబ్బర్ సింగ్ పాత్ర పేరు మాత్రమే వాడుకుని, ‘షాన్’ లోని  షాకాల్  కథ చూపిస్తే ఎలా వుంటుందో  అలాగే వుంది ‘భాగమతి’ కూడా. ఫాంటసీ లుక్కిస్తూ భాగమతి పేరు మాత్రమే వాడుకుని, ఈకాలపు సాదా చంచల హత్య కేసు కథ చూపించారు. ‘పద్మావత్’ టైటిల్ పెట్టి ఖిల్జీ గారి కథతో చూపించింది కూడా ఇలాగే.  రెండు మతులూ – ఇద్దరు శ్రీమతులూ ఒకేసారి వచ్చారు : పద్మావతి – భాగమతి. కాకపోతే పద్మావతి పెద్దక్క కాబట్టి ముందు రోజు వచ్చింది. 

          మహిళా ప్రేక్షకులు – టీనేజి గర్ల్స్ తో  కలుపుకుని  - మార్నింగ్ షో నుంచే ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వున్నాయి కిటకిటలాడుతూ. కానీ ఎంతవరకూ ఈ మార్కెట్ యాస్పెక్ట్ తో వాళ్ళని సంతృప్తి పర్చగల్గారు? ఫ్యామిలీ అప్పీల్ తో ఆకర్షిస్తున్న ‘భాగమతి’ టైటిల్, దానికి అనూష్కా అప్పీల్, తీరా ఎందుకు  రివర్స్ అయ్యాయి?  ఇంటర్వెల్ సీన్లో భాగమతి ఆహార్యంలో, అరుంధతి అప్పీల్ తో పీరియడ్ భాగమతిగా అనూష్కాని చూపించి ఒక నమ్మకం కల్గించాక - సెకండాఫ్ లో ఆ భాగమతి కథకి  కాక,  ఓ సాధారణ చంచల కథకి చేసిన పబ్లిసిటీ స్టంట్ గా తేల్చేశారు. ఐనప్పటికీ – పోనీలే  చంచలకి పూనినప్పటికీ అది  భాగమతి ఆత్మే కదా  అనుకుని సెకండాఫ్ కి సిద్ధమైనప్ప
టికీ, తీరా ఇది కూడా కాదని తేల్చేశారు. ఇక్కడే రసభంగమైంది. ఇక్కడ్నించే లేడీస్ ని ఆకర్షించని  రొటీన్ రాజకీయ సస్పన్స్ థ్రిల్లర్ మసాలా ఐపోయింది.

          నిజానికి ఈ కథ ప్రొసీడింగ్స్ ఓపిగ్గా చూస్తూ కూర్చున్న ఈ వ్యాసకర్తకి, క్లయిమాక్స్ కి ముందు  ఈ కీలక ఘట్టం దగ్గర ఉత్సాహం వచ్చింది. అంతవరకూ భాగమతి కథతో చంచల కథ ఎక్కడ కనెక్ట్ అవుతుందా అని ఎదురు చూడాల్సి వచ్చింది. కనెక్ట్ కాకపోతే రెండు మూడు కథలుండకూడదు. ఒకే కథ వుండాలి. ఇలా ఈ ఘట్టంలో మెంటలాసుపత్రిలో చేరిన  చంచలని మంత్రి ఈశ్వర ప్రసాద్ వచ్చి కలిసినప్పుడు - అతడి మాటలకి ఆమె కొత్తగా వాంపిష్ గా చూసి నవ్వినప్పుడు - ఆమెకి పూనిన భాగమతి ఆత్మే  ఇలా మంత్రిని రావించి పట్టేసుకుందనీ, ఇతనే తను పగదీర్చుకోవాలనుకుంటున్న గత జన్మలో చంద్ర సేనుడనీ - ఇదే సమయంలో ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ గా ఇతనే చంచలకి అన్యాయం చేసిన విలన్ అనీ,  ఇలా భాగమతి -  చంచలల టూ ఇన్ వన్ కాంబినేషన్, చంద్ర సేన - ఈశ్వర ప్రసాద్ ల టూ ఇన్ వన్ కాంబినేషన్ కి ఒకేసారి చెక్ పెట్టేస్తున్నారనీ ఎంతో థ్రిల్లయ్యాడు ఈ వ్యాసకర్త!

          ఈ ఫాంటసీ రియాల్టీల కనెక్షన్ తో రెండు కథలూ ఏకత్రాటిపై కొచ్చి, అన్ని అప్పీల్స్ నీ, మార్కెట్ యాస్పెక్ట్ నీ గురిచూసి కొట్టాయని  సంతోషించాడు ఈ మానవుడు. కానీ ఇలా జరగలేదు. ఈ రాస్తున్న మానవుడు విగత జీవి స్థాయికి చేరిపోయాడు. ఆ మంత్రిలో గతకాలపు చంద్ర సేన అంశా లేదు, చంచలలో కూడా గతకాలపు భాగమతి మెటీరియల్లూ లేదు- అంతా  ఉత్తదే, మంత్రిని పట్టుకోవడానికి చంచల ఉత్తుత్తి  నాటకమే అని ఎప్పుడైతే ఈ ఘట్టంలో ఎంత  బ్యాడ్ గా చెప్పి చేతులేత్తేశారో- ఆ క్షణం నుంచీ  అన్ని రకాల అప్పీల్సూ,  మార్కెట్ యాస్పెక్టూ కుదేలైపోయాయి.
***
    కథ క్రియేటివ్ యాస్పెక్ట్ చూద్దాం : క్రియేటివిటీకి ప్రమాణాల్లేవు  -  కనుక కథ ఇలా వుండకూడదు, అలా వుండాలని నువ్వెలా చెప్తావ్? అన్న ప్రశ్న కరెక్టే. ఎప్పుడూ? ఆ  క్రియేటివిటీ చక్కగా స్ట్రక్చర్ అనే చట్రం ఆధారంగా వున్నప్పుడు. లేనప్పుడు నీ క్రియేటివిటీకి మార్కెట్ యాస్పెక్ట్  ఏమాత్రం లేదని ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పవచ్చు. స్ట్రక్చర్ తో కలిసున్నప్పుడే క్రియేటివిటీకి మార్కెట్ యాస్పెక్ట్ వుంటుంది. 

         ‘భాగమతి’ ఫాంటసీ -  పొలిటికల్ థ్రిల్లర్ రెండు జానర్ల మిక్స్ కరెక్టేనా? భాగమతి కథే లేనప్పుడు ఫాంటసీ జానర్ ఎక్కడిది? కనుక వున్నది పొలిటికల్ థ్రిల్లర్ జానర్ ఒక్కటే. కాబట్టి ఇదొక పొలిటికల్ థ్రిల్లర్, అంతే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఎలా వుంది? మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలో వుంది. మిడిల్ మటాష్ లో ఎందుకు పడింది? ఎండ్ సస్పన్స్ రూల్స్ ని పాటించకపోవడం వల్ల  మిడిల్ మటాష్ లో పడింది. ఇదే దర్శకుడు గత సంవత్సరం తీసిన ‘చిత్రాంగద’ అనే ఫ్లాపయిన సైకలాజికల్ థ్రిల్లర్ సమస్య కూడా ఇదే కదా? 

          ఇక క్రియేటివిటీకి, దాంతో మార్కెట్ యాస్పెక్ట్ కీ ఉత్తుత్తి భాగమతి ఫాంటసీ చాలనుకున్నట్టుంది. ఉత్తుత్తి భాగమతి ఫాంటసీ అని తెలీని ప్రేక్షకులు, భాగమతి కథ చంచల కథతో ఎక్కడ కనెక్ట్ అవుతుందాని చూస్తూంటారు. రెండు కథలు కనెక్ట్ అవడం స్ట్రక్చరల్ ప్రక్రియ. కనెక్ట్ చేయకపోవడం అనాలోచిత క్రియేటివ్ వ్యాపకం. పైగా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడం. భాగమతిది నిజకథగా చేసి,  పై అధ్యాయంలో చెప్పుకున్నట్టు,  క్లయిమాక్స్ లో చంచలతో టూ ఇన్ వన్ కాంబినేషన్ తో కనెక్ట్ చేయడం స్ట్రక్చర్ కోరే విధి. స్ట్రక్చరున్న క్రియేటివిటీయే బాక్సాఫీసు ఫ్రెండ్లీ క్రియేటివిటీ.
ఎవరెలా చేశారు

(మిగతా రేపు )
సికిందర్