రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

రివ్యూ..


ఫార్ములా వాస్తవికతల కిచిడీ!




**  రాజా గౌతమ్, ఆలీషా బేగ్, తనికెళ్ళ భరణి, షాయాజీ షిండే, రణధీర్, ధన్ రాజ్, నవీనా జాక్సన్, భాను కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగెతం ; మణిశర్మ,  ఛాయాగ్రహణం : అనిల్ బండారీ,  మాటలు : శ్రీకాంత్ విస్సా,  పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి,  నృత్యాలు : రఘు,  కళ :  రఘు కులకర్ణి,  యాక్షన్ :  డ్రాగన్ ప్రకాష్,  ఎడిటింగ్ : మార్తాండ్ వెంకటేష్, బ్యానర్ : స్టార్ట్ పిక్చర్,
నిర్మాణం-రచన- దర్శకత్వం : చైతన్య దంతలూరి
విడుదల : ఫిబ్రవరి 28, 2014,  సెన్సార్ : U/A
***

దర్శకుడు చైతన్య దంతలూరి ‘బాణం’ (2009) అనే ఆఫ్ బీట్ సినిమాతో విజయవంతంగా రంగప్రవేశం చేసి మళ్ళీ ఇన్నాళ్ళకి రెండో సినిమాతో ముందుకొచ్చాడు. ఈ సినిమాకి తనే నిర్మాత కూడా అయ్యాడు. ...తనూ కొత్త వాడై కొత్త హీరోలని ప్రోత్సహిస్తూ మొదటి సినిమాలో నారా రోహిత్ ని పరిచయం చేసినట్టే, ఇప్పుడు దాదాపు కనుమరుగైన బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ కి అవకాశమిస్తూ ‘బసంతి’ తీశాడు. మొదటి సినిమాని నక్సలిజం మీద తీస్తే ఈ రెండో సినిమా టెర్రరిజం మీద తీశాడు. ఇందులో ముస్లిం హీరోయిన్ పాత్ర పెట్టడంతో విడుదలకి ముందు ఈ సినిమా ఎంతో ఆసక్తి రేపింది. ఇంకా ఫీల్డులో స్టార్లూ సూపర్ స్టార్లూ స్వఛ్ఛందంగా ముందుకొచ్చి ఇతోధికంగా ప్రమోటింగ్ కి తోడ్పడ్డారు. బ్రహ్మానందం కుమారుడి సినిమా అవడంతో ఈ లో- బడ్జెట్ సినిమాకి ఎక్కడలేని హేమాహేమీల దీవె నలన్నీ పోగుపడ్డాయి. మరి ఇంతటి ప్రచారమూ ఆశీర్వచనాలూ సార్ధకమయ్యే స్థాయిలో సినిమా వుందా?

ఈ సినిమా చూస్తూంటే యాదృచ్చికంగా 1990 నాటి రాజ శేఖర్ నటించిన టెక్నికల్ వండర్ ‘మగాడు’గుర్తుకొస్తుంది..’ఆఫ్ బీట్’ దర్శకుడు చైతన్య దంతలూరి ‘బసంతి’ ని కూడా ఈ మలయాళం రీమేక్ లా తీసివుంటే ఎంత బావుణ్ణు అన్పిస్తుంది. ‘మూణ్ణం మురా’ అనే మోహన్ లాల్ నటిచిన మలయాళం హిట్ దర్శకుడు కె. మధు - తెలుగు రిమేక్ ని కూడా అంతే భక్తిశ్రద్ధలతో రూపొందించి హీరో రాజ శేఖర్ కి మరో పెద్ద హిట్టిచ్చిన చరిత్ర ఉండనే వుంది. బ్రహ్మానందం తనయుడికి ఈ స్థాయి కమర్షియల్ గా వర్కౌటయ్యే రియలిస్టిక్ సినిమా దక్కి వుండాల్సింది...’మగాడు’ కథతో దగ్గరి పోలికలున్నఈ ‘బసంతి’ లో అసలేముందంటే...

బసంతి కాలేజ్ ఆఫ్ లవ్/టెర్రర్
అతను అర్జున్ (రాజా గౌతమ్ ) అనే డిగ్రీ స్టూడెంట్. బసంతీ కాలేజీలో బియ్యే చదువుతూంటాడు. చదువంటే లక్ష్యం లేదు, జీవితం పట్ల ఏ ధ్యేయమూ లేదు, అసలు క్లారిటీ కూడా లేదంటాడు. సున్నా మార్కులొస్తున్నా తేలిగ్గా తీసుకునే మధ్యతరగతి తండ్రీ (తనికెళ్ళభరణి), తగువుపెట్టుకునే తల్లీ వుంటారు. కాలేజీలో మల్లి (ధన్ రాజ్), స్వాతి( నవీనా జాక్సన్), అబ్బాస్( రణధీర్) అనే ఫ్రెండ్స్ వుంటారు. వీళ్ళు చదువులు  తక్కువ తిరుగుళ్ళు  ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నప్పుడు, అబ్బాస్ చెల్లెలి పెళ్లి సందర్భం వస్తుంది. ఈ పెళ్ళిలో రోషిని (ఆలీషా బేగ్)  అనే పోలీస్ కమీషన్ అలీ ఖాన్ (షాయాజీ షిండే) కూతుర్ని చూసి  అక్కడే మనసు పారేసుకుంటాడు అర్జున్.

ఇంకో వైపు పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్టు లీడర్ దిగి నగరంలో జరిగే అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు  మీద దాడి  చేసేందుకు సన్నాహాలు చేస్తూంటాడు. ఇటు అర్జున్ తన ప్రేమాయణం ముందుకు  తీసికెళ్ళడానికి జంకుతూంటాడు. వేరే కాలేజీలో చదివే రోషినీ కోసం అక్కడ కాపేస్తూంటాడు. ఇంతలో ఎవరికో అర్జంటుగా రక్తం అవసరముంటే వెళ్లి రక్తదానం చేస్తాడు. ఆ  రోగి మరెవరో కాదనీ, రోషినీ నానమ్మే అని తెలిసి – దాంతో తన సేవా భావానికి రోషిని మెచ్చికోలే కాకుండా, ఆమె తండ్రి దృష్టిలో మంచివాడుగా కూడా మన్నన లందుకుంటాడు. ఆ ఇంట్లో అందరికీ మాలిమి అవుతాడు.
ఇక మనం ఫ్రెండ్స్ లా వుందామని రోషిని అనేసరికి సరేనంటాడు. ఇలా సాగుతోంటే, సడెన్ గా రోషిని తనకు లండన్లో పై చదువులకి సీటొచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ఇక ఆగలేక ఎలాగైనా తన ప్రేమని వెల్లడించు కోవడానికి ఏర్ పోర్టు కెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో ఇటు టెర్రరిస్టులు జీవ వైవిధ్య సదస్సు మీద దాడికి  బయల్దేరుతున్నప్పుడు కమీషనర్ అలీ ఖాన్ కళ్ళబడి తప్పించుకుంటారు. వాళ్ళని వెంటాడుతోంటే- వాళ్ళు బసంతీ కాలేజీ లోకి జొరబడి- ఫేర్ వెల్ పార్టీ జరుపుకుంటున్న ఎనభై మంది విద్యార్థుల్ని బందీలుగా పట్టుకుని, జైల్లో వున్న తమ నాయకుడు బాబర్ ఖాన్ విడుదల కోసం కమీషనర్ కి బేరం పెడతారు.
ఈ బందీల్లో అర్జున్ ఫ్రెండ్స్ తోబాటు రోషిని కూడా వుంటుంది. రోషిని ఇక్కడికెలా వచ్చింది? కాలేజీకి తిరిగొచ్చిన అర్జున్ ఏం చేశాడు? పోలీసులు బందీల్ని విడిపించుకోవడానికి ఏం చేశారు? టెర్రరిస్టుల్తో ఈ పోరాటంలో ఎవరు చనిపోయారు, ఎవరు బతికారు- ఈ హైడ్రామా ముగింపే మిటీ అన్నవి ఇక్కడ్నించీ కొనసాగే ద్వితీయార్ధంలో తెలుసుకోవచ్చు.

ఇది ప్రధానంగా హీరో గౌతంని విజయవంతంగా ఎస్టాబ్లిష్ చేసేందుకు చేసిన బృహత్ ప్రయత్నం. అయితే ఈ పాత్రలో అతడి నటన -  మొదట లవర్ బాయ్ గా, తర్వాత యాక్షన్ హీరోగా ఏమాత్రం చాల్లేదు. కొన్ని కోణాల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా పోలికలు కన్పించే తను-  ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనని తానూ నటనలో మెరుగుపర్చుకున్న దాఖలాలు పాత్ర సరైన తీరులో వుండి వుంటే బయల్పడేవేమో...కానీ దర్శకుడు ఈ పాత్రే నటనకి పెద్దగా అవకాశం లేని తీరుతెన్నుల్తో ‘తీర్చిదిద్దడం’తో,  గౌతమ్ నిజంగా ఇంప్రూవ్ అయినా అది బయట పడే అవకాశాలు పూర్తిగా మృగ్యమైపోయాయి! ఇదెలా జరిగిందో తర్వాత  ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో చూద్దాం.

ఇక హీరోయిన్ ఆలీషా బేగ్ అయితే చైల్డ్ ఆర్టిస్టులా వుంది. ఈమె ఎలావుందో ఈమెకి తగ్గట్టే పాత్రకూడా వుండీ లేనట్టే ఆషామాషీగా వుంది. హీరోతోబాటే ఈమెకూడా ప్రేమకథని సాధ్యమైనంత పేలవంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా  కృషిచేసినట్టుంది. ఈమెకంటే స్వాతి పాత్ర నటించిన నవీనా జాక్సన్ మెరుగన్పించు కుంది. ధన్ రాజ్ కామెడీకి పెద్దగా స్కోపు లేదు. రణధీర్, తనికెళ్ళ, షాయాజీ తదితరులు ఎంతబాగా నటించినా అవి అసమగ్ర పాత్రలై పోయాయి.

సినిమాకి మణిశర్మ సంగీతంలోని పాటలేం కిక్కునివ్వలేదు. సన్నివేశ బలం లేని దృశ్యాలకి బిజిఎం మాత్రం బలంగా వుంది. ఇక శ్రీకాంత్ విస్సా సంభాషణలు అతితక్కువ చోట్ల పేలాయి. అనిల్ కెమెరా పనితనం తక్కువ లైటింగ్ వల్ల కావొ చ్చు విజువల్ అప్పీల్ ని కల్గించలేకపోయింది.

దర్శకుడే నిర్మాత కావడం వల్లేమో ప్రొడక్షన్ విలువలు అంతంత మాత్రంగా వున్నాయి.


స్క్రీన్ ప్లే సంగతులు 
ఇది ఫస్టాఫ్-సెకండాఫ్ స్క్రీన్ ప్లే. అంటే  కథ ప్రారంభ మవడానికి ఫస్టాఫంతా అపసోపాలుపడుతూ సమయమంతా తినేసి, అప్పుడు ఇంటర్వల్ దగ్గర మాత్రమే హమ్మయ్యా అనుకుంటూ అసలు పాయింటుకి రావడమన్నమాట. అంటే  ముప్పయి-నలభై నిమిషాల్లో ముగియాల్సిన మొదటి అంకం, పరిధి దాటి ఇంటర్వెల్ వరకూ గంటకు పైగా సుదీర్ఘంగా సాగడమన్న మాట. దీంతో జరిగే ఉపద్రవాలు-1) ఫస్టాఫ్ లో అసలేమీ జరక్కుండా కథ పలచబారిపోవడం, 2) టైం అండ్ టెన్షన్ గ్రాఫు ఐపులేకుండా పోవడం, 3) పాత్రలు బోరుకొట్టడం, 4) ప్రధాన పాత్రకి ఎంతకీ క్యారక్టర్ ఆర్క్ ఏర్పడకపోవడం, 5) విషయం లేక జరిగిన విషయాలే ఒకపాత్ర ఇంకోపాత్రకి పోస్టు చేయడానికే సీన్లు పనికిరావడం, 6) వీటన్నిటితో ప్రేక్షకులకి సహన పరీక్ష పెట్టడం!

ఈ స్కీములోనే పూర్వం సినిమాలు ఉండేవి, కాకపోతే వాటిలో పెద్ద స్టార్లు నటించడంతో విజువల్ అప్పీల్ వల్ల, వాళ్ళఫ్యాన్  ఫాలోయింగ్స్ వల్లా చెల్లిపోయేవి. గ్రామీణ ప్రేక్షకులుకూడా ఫస్టాఫ్ కామెడీ –సెకండాఫ్ స్టోరీ అని  పధ్ధతి పసిగట్టేసి  వాటికి సెటిలై పోయేవాళ్ళు. అయినప్పటికీ  రాంగోపాల్ వర్మ కొంచెం తేడాగా 1989 లో అప్పటికే స్టార్ గా ఎదిగిన అక్కినేని నాగార్జున తో- ఈ స్థానిక ఫస్టాఫ్- సెకండాఫ్ మూస ఫార్ములా ధోరణికి పోకుండా- సార్వజనీన మూడంకాల ( త్రీ యాక్ట్) స్క్రీన్ ప్లేనే అనుసరిస్తూ ‘శివ’ తీశారు

contd..