రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, April 24, 2025

1377 : బుక్ రివ్యూ!

 

          కొరియన్ సినిమాల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. తెలుగులో ఫ్రీమేకో, రీమేకో అయిన కొరియన్ సినిమాలు కొంత కాలం క్రితం వరకూ వచ్చేవి. ప్రస్తుతం ఓటీటీల్లో మలయాళం సినిమాల మీద  తెలుగు ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. గతంలో పిల్ల జమీందార్, గాడ్సే, ప్లే బ్యాక్, నెక్స్ట్ నువ్వే, జేమ్స్ బాండ్- నేను కాదు నా పెళ్ళాం వంటి కాపీ చేసుకునే స్వేచ్ఛ కల్పించుకుని కొరియన్ ఫ్రీమేకులు; ఓ బేబీ, శాకినీ ఢాకినీ వంటి అధికారిక రీమేకులూ చేశారు. ఇలా తెలుగునాటే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ  కొరియన్ సినిమాలు పాపులర్ అయి హాలీవుడ్ సినిమాల తర్వాతి స్థానంలో వుంటున్నాయి. ప్రేక్షకుల మనసుల్ని విపరీతంగా గెలుచుకునే తమదైన కథా కథన శైలులతో సీరియస్ థ్రిల్లర్లు, రోమాంటిక్ డ్రామాలు, రోమాంటిక్ కామెడీలు, సైకలాజికల్ జర్నీలు, హిస్టారికల్స్... ఇలా అన్ని జానర్లలోనూ వెల్లువెత్తుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే 226 సినిమాలు విడుదలయ్యాయి. ప్రతి సంవత్సరం 500 పై చిలుకు విడుదలవుతున్నాయి. గత సంవత్సరం 8 వందల 51 మిలియన్ల 4 వేల నలబై ఆరు డాలర్ల బాక్సాఫీసుతో బలమైన మార్కెట్టుగా స్థానం సంపాదించుకున్నాయి. బాంగ్ జూన్-హో (పారాసైట్), పార్క్ చాన్-వుక్ (ఓల్డ్ బాయ్), కిమ్ కీ-డుక్ (స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్... అండ్ స్ప్రింగ్) వంటి దర్శకులు సాంప్రదాయ సినిమాలకి అతీతంగా ప్రయోగాలు చేసి, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. ముఖ్యంగా 2020లో పారాసైట్ కి ఆస్కార్ అవార్డు  లభించడం కోరియన్ సినిమాలకి గ్లోబల్ వేదిక పైన భారీ గుర్తింపుని  తీసుకువచ్చింది.

కొరియన్ సినిమాలకి ఈ ప్రత్యేకతని ఇచ్చింది సామాజిక విషయాల్ని ధైర్యంగా తడిమే విధానం, సంక్లిష్ట పాత్రలు, వాటితో అనూహ్య మలుపులూ... మెమోరీస్ ఆఫ్ మర్డర్  లోని వాస్తవికతా స్పర్శ, ట్రెయిన్ టు బూసాన్ లోని భావోద్వేగ ఉథృతీ - ఇవన్నీ దేశీయ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్ని తాకుతున్నాయి.  మిగతా ప్రపంచ సినిమాలకి స్ఫూర్తిగా నిలుస్తూ, సవాళ్ళని విసురుతూ, వినోదాన్ని అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి.
        
అయితే ఇంత నేపధ్యం, ప్రశస్తి వున్న కొరియన్ సినిమాలపై  తెలుగులో పుస్తకం రాకపోవడం ఒక లోటుగానే వుంటూ వచ్చింది. ఈ లోటుని తీరుస్తున్నట్టు ఆ మధ్య సంచిక వెబ్సైట్ లో కొరియానం పేర కొరియన్ సినిమాల్ని పరిచయం చేసే శీర్షిక ప్రారంభమైంది. ఆ పరిచయకర్త సినిమా రివ్యూ రైటర్ గా రాణిస్తున్న గీతాచార్య. కొరియన్ సినిమాలపై ఈయన్ని మించిన అథారిటీ లేకపోవచ్చు తెలుగులో. ఒక థీసిస్ కి సరిపడా నాలెడ్జి సంపాదించుకుని రాసిన ఈ వ్యాసాల పరంపర తాజాగా పుస్తకరూపంలో వెలువడింది.  పుస్తకం పేరు కొరియానం’. దాదాపు 500 పేజీల సమగ్ర దర్శనం.
        
కొరియానం పుస్తకం కొరియన్ సినిమాలపై లోతైన విశ్లేషణని అందిస్తుంది. దాదాపు 60 సినిమాలు ఈ విశ్లేషణలో కన్పిస్తాయి. ఓల్డ్ బాయ్ దగ్గర్నుంచీ ది ఔట్ లాస్ వరకూ ప్రత్యేకించి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశాపరిశీలన ఇందులో వుంది. మనిషి ఆలోచనలు, కోపం, గా ప్రతీకార వాంఛలు వంటి భావోద్వేగాల ప్రయోగం ఎలా జరిగిందో వివరిస్తుంది. అంతేగాక ఆయా సినిమాల మేకింగ్ లో కొరియెన్ సాంకేతిక, సృజనాత్మక కళలు ఏ తీరానికి చేరాయో వివరణ వుంది. ఆయా దర్శకుల పని విధానం గురించి వర్ణన వుంది. మధ్య లో స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి కూడా వుంది.
       
ఓల్డ్ బాయ్ తీసిన పార్క్ చాన్ -వూక్ గురించి ఎక్కువ పేజీలు ఇందులో కనిపిస్తాయి.
పార్క్ చాన్-వూక్, కిమ్ కి-డుక్, లీ చాంగ్ డాంగ్ వంటి కొరియన్ బ్రాండ్‌ డైరెక్టర్ల గురించి ఎంత రాసినా తక్కువే. ది క్లాసిక్ తీసిన క్వాక్ జే యంగ్ కూడా తీసిపోడు.  అయితే పార్క్ చాన్ -వూక్ ప్రధాన స్రవంతి సినిమాలు ఎక్కువగా ఆందోళన, నిరాశ, అసూయ, అశాంతి, ఆగ్రహం వంటి భావోద్వేగాల కూడికగా వుంటాయని ఈ పుస్తకం చదివితే తేటతెల్లమవుతుంది.
       
దక్షిణ కొరి
యా సమాజపు కోరికలు, దుఃఖం, అణచివేత- వీటికి బాధితులో బానిసలో అయ్యే  కార్మికులు, సెక్స్ వర్కర్లు, నిరుద్యోగులు, మాదకద్రవ్యాల బానిసలు, గ్యాంగ్‌స్టర్లు, అప్పుల్లో వున్న వ్యక్తులందరూ ఈ పుస్తకంలోని అధ్యాయాల్లో కనిపించి  దక్షిణ కొరియా సమాజం పట్ల ఒక అవగాహనని ఏర్పరుస్తారు. వీళ్ళందరూ పోరాటం చేసే వ్యక్తులే.
       
ఈ పుస్తకం వెనుక గీతాచార్య చేసిన చాలా కృషీ
, పడ్డ శ్రమా కనిస్తాయి. అయితే పుస్తకాన్ని సీరియస్ గా రాయకుండా కామెడీలు చేస్తూ రాయడంతో, మధ్యమధ్యలో తెలుగు, హిందీ సినిమాలూ, వాటి నటులూ ఈ కామెడీలకి మినహాయింపు  కాకపోవడంతో, ప్రింట్ మీడియాలో ఇదొక అరుదైన ఇన్ఫోటైన్మెంట్ ప్రయోగంగా ప్రూవ్ చేసుకుంటుంది.
—సికిందర్

వెల : రూ. 500
కాపీలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ :
80081 60011 


Monday, April 21, 2025

1376 : రివ్యూ!

 

కేసరి -2                                            
దర్శకత్వం : కరణ్ సింగ్ త్యాగి
తారాగణం : అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే, రేజీనా కాసాండ్రా
రచన : కరణ్ సింగ్ త్యాగి, అమృతపాల్ సింగ్ బింద్రా, మాటలు : సుమిత్ సక్సేనా
సంగీతం : శాశ్వత్ సచ్‌దేవ్, కవితా సేథ్ - కనిష్క్ సేథ్, ఛాయాగ్రహణం : దేబోజిత్ రే, సైమన్ పైస్లే డే, అమిత్ సైయల్ తదితరులు.
బ్యానర్స్ : ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు : హీరూ యష్ జోహార్, అరుణా భాటియా, కరణ్ జోహార్, అదర్ పూనావల్ల
అపూర్వా  మెహతా, అమృత్ పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ
విడుదల : ఏప్రిల్ 18, 2025
***

      వసబెట్టి 14 మంది ఎలాన్ మస్క్ కన్నసంతానంలా జోరుగా 14 పరాజయాలు చవిచూశాక, తిరిగి కంటెంట్ కింగ్ అన్పించుకుంటూ అక్షయ్ కుమార్ బాక్సాఫీసు ఢంకా మోగిస్తున్నాడు. హిందీ సినిమాల కంటెంట్ అనేది హిందీ ప్రేక్షకులకి అంటరానిదై పోయి, సొంతంగా ఏ కంటెంట్ ని ఎలా క్రియేట్ చేసి పూర్వ వైభవం తెచ్చుకోవాలో తెలియని గందరగోళ వాతావరణ పరిస్థితుల్లో, రెండే ఆదుకుంటున్నాయి : హిస్టారికల్స్ లేదా ప్రాపగాండా సినిమాలు. వీటికి సొంతంగా కథలు ఆలోచించనవసరం లేదు,  సొంతంగా ఆలోచిస్తే కొంపలు మునుగుతున్నాయి ఆలోచించడం రాక. అందుకని హిస్టారికల్స్ లేదా ప్రాపగాండా వంటి సర్క్యులేషన్ లో వున్న రెడీ మేడ్ కంటెంట్ నే మంచి లాభసాటి బేరంగా ఎంచడం మొదలెట్టారు. ఇది బాక్సాఫీసులో రుజువు కావడంతో ఎక్కడెక్కడ ఇలాటి కంటెంట్ వుందో వెతకడం మొదలెట్టి వుంటారు- అప్పుడు దొరికిందే అయివుంటుంది 'కేసరి 2' కి అనువైన ఈ హిస్టారికల్ కంటెంట్. ఇది హిస్టారికలే గానీ హిస్టరీతో ముడిపడి వున్న ఒక ప్రముఖుడి బయోపిక్ కూడా. ఎవరా ప్రముఖుడు, ఏమిటా హిస్టరీ ఈ కింద తెలుసుకుంటూ వెళ్దాం...

కథ

1914 మొదటి ప్రపంచ యుద్ధ కాలం. యుద్ధంలో పాల్గొనడానికి బ్రిటిష్ సైనికుల కొరత ఏర్పడింది. బ్రిటిష్ పాలకులు ఒక వాగ్దానం చేశారు- మీ యువకుల్ని మా సైన్యంలో చేర్పిస్తే, యుద్ధం ముగిశాక మీకు స్వాతంత్ర్యం ఇచ్చేస్తామని. దీంతో వేలమంది యువకులు బ్రిటిష్ సైన్యంలో చేరిపోతారు. కానీ యుద్ధం ముగిశాక బ్రిటిష్ పాలకులు మాట తప్పుతారు.  అసలు పంజాబ్ నుంచి ఎక్కువమంది యువకులు వెళ్ళి యుద్ధంలో మరణించారు. దీంతో పంజాబ్ లో వ్యతిరేకత మొదలవుతుంది. ప్రొఫెసర్ కిర్పాల్ సింగ్ నేతృత్వంలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళన మొదలవుతుంది.
        
ఏప్రిల్ 13, 1919న రౌలట్ చట్టానికి (పోలీసులు కారణం లేకుండా ఎవర్నైనా అరెస్ట్ చేసే  అధికారాన్నికల్పించిన చట్టం) వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అమృత్సర్‌లోని జలియావాలా బాగ్‌లో నిరసనకారుల బృందం శాంతియుతంగా సమావేశమవుతుంది. ఇంతలో జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హేరీ డయ్యర్ సాయుధ దళాలతో స్థలానికి చేరుకుని, ఎలాటి హెచ్చరిక లేకుండా నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపమని ఆదేశిస్తాడు. చిన్న పిల్లలూ స్త్రీలు సహా మొత్తం 1650 మంది ఆ కాల్పుల్లో మరణిస్తారు.
        
ఈ ఘోరం గురించి పత్రికలు ఏమీ రాయకుండా తెల్లదొరలు అడ్డుకుంటారు. ఆ నిరసనకారులు సాయుధ ఉగ్రవాదులనీ చెప్తూ, వాళ్ళు దాడి చేస్తూంటే కాల్పులు జరపాల్సి వచ్చిందనీ తప్పుడు వార్త అందిస్తారు.  దీంతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఉద్రిక్తత పెరిగిపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొని- మృతుల కుటుంబాలకి 25 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తూనే, ఈ విషయంపై దర్యాప్తుకి  ఆదేశిస్తుంది. అది లోపాయికారిగా బోగస్ దర్యాప్తు. ఇప్పుడు ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి  నైట్‌హుడ్ అవార్డు పొందిన సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) అనే బారిష్టర్, జనరల్  డయ్యర్ ని కాపాడే బోగస్ దర్యాప్తు చేపడతాడు.
       
ఈ దర్యాప్తు
 కమిషన్‌లో బ్రిటిష్ న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం వున్న ఏకైక భారతీయుడు సర్ సి శంకరన్ నాయర్. పెద్ద దొర  ఇప్పటికే అతను తమ కీలుబొమ్మగా వ్యవహరిస్తాడని భావిస్తాడు. దర్యాప్తు సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలని  అణిచివేస్తుంది. ఈ సమయంలో, నాయర్ దృష్టి 13 ఏళ్ళ  విప్లవ బాలుడు పర్గత్ సింగ్ (కృష్ణారావు) పైన పడుతుంది. ఆ విప్లవ బాలుడితో నాయర్ కి  పాత సంబంధమేదో వుంటుంది. కాల్పుల్లో కాపాడమని నాయర్ నే పిలుస్తూ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇది నాయర్ ని కదిలిస్తుంది. దీంతో కమిషన్ కి వ్యతిరేక రిపోర్టు ఇచ్చి, జనరల్ డయ్యర్ ని శిక్షించేందుకు న్యాయ పోరాటానికి దిగుతాడు.
       
ఈ న్యాయ పోరాటంలో తవ్వి తీసిన నిజాలేమిటి
? కేవలం రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు గుమికూడారన్న కారణంతో జనరల్ డయ్యర్ ప్రజల్ని కాల్చి చంపాడా? లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కారణముందా? ఆ పెద్ద కారణంతో తనే పథకం ప్రకారం ప్రజల్ని జలియావాలా బాగ్ కి వచ్చేలా చేసి, ఆ ప్రజల మీద కక్ష తీర్చుకున్నాడా? ఏమిటీ ఘోర కృత్యం వెనుకవున్న అసలు కారణం? దీన్ని నాయర్ ఎలా బయటికి తీసి డయ్యర్ మీద నేరాన్ని నిరూపించాడు? ఇందులో జూనియర్
దిల్రీత్ గిల్ (అనన్య పాండే) ఎలా తోడ్పడింది? బ్రిటిష్ ప్రభుత్వం తరపున రంగంలోకి దిగిన భారతీయ సంతతికి చెందిన న్యాయవాది నెవిల్ మెకిన్లే (ఆర్ మాధవన్) జనరల్ డయ్యర్ ని కాపాడుతూ, బారిష్టర్ నాయర్ ని ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? ఇతడి కుట్రల ఫలితంగా న్యాయవాద వృత్తిలో పూర్తిగా పతనమై దోషిగా నిలబడ్డ నాయర్ తిరిగి ఎలా విజయం సాధించాడు? ...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

బ్రిటిష్ పాలనా వ్యవస్థలో భాగంగా వుంటూనే దాని పునాదుల్ని కదిలించిన వ్యక్తి కథ ఇది. ఒకప్పుడు బ్రిటిషర్లకి విధేయుడిగా వున్నఈ వ్యక్తి తిరుగుబాటుదారుడిగా మారి, ఆ తర్వాత  తిరుగులేని పోరాటాన్ని ప్రారంభించాడు. జలియావాలా మృతుల న్యాయం కోసం న్యాయస్థానంలోనే బ్రిటిష్ పాలకుల్ని ఓడించాడు. ఇది కేరళకి చెందిన బారిష్టర్ సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ జీవిత కథ. రఘు పలాట్- పుష్ప పలాట్ లు కలిసి రాసిన 'ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్: వన్ మ్యాన్స్ ఫైట్ ఫర్ ది ట్రూత్ ఎబౌట్ ది జలియావాలా బాగ్ మాసకర్' అనే 2019 లో వెలువడిన పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.

ఈ కథ గొప్ప భావోద్వేగాల వెల్లువలా ప్రత్యక్షమవుతుంది. ప్రతి సన్నివేశంలోనూ బాధ, కన్నీళ్ళూ, ఆక్రందనలు, ఆత్మీయుల్ని కోల్పోవడం వల్ల కలిగే దుఖామూ అనే మానవ దుస్థితిని కళ్ళకి కడుతుందీ కథ. ఊచకోత జరిగే మొదటి సన్నివేశం నుంచే కళ్ళని తడి చేయడం ప్రారంభించే ఈ కథ, సస్పెన్స్ ని జోడించుకున్న కథనంతో వేగంగా పరుగులెత్తి, కేవలం రెండు గంటల్లో ముగిసిపోతుంది. ప్రారంభం అత్యున్నత స్థాయిలో వుంటే, ముగింపు కూడా  తక్కువేమీ కాదు. ముగింపుకి చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం ప్రేక్షకులనుంచి వచ్చే సహజ ప్రతిస్పందనే.

మామూలుగా చూస్తే ఇదొక హీరో విలన్‌తో పోరాడే సాధారణ కథలా అనిపించవచ్చు, కానీ దీని డెప్త్ లో అంచెలంచెలుగా మొత్తం ఈ దేశపు పోరాట కథ బయటపడుతూంటుంది. ఒకటొకటే  నిజాలు బయటపడుతున్న కొద్దీ కదలకుండా కట్టి పడేస్తుంది.
        
ఈ కథకి గుండె కాయ- డయ్యర్ ఎందుకు కక్ష గట్టాడన్న ప్రశ్నే. రామ నవమికి హిందూ ముస్లిములు ఏకమై సంబరాలు జరుపుకోవడం అతడి కెందుకు కంటగింపు కావాలి? 1857 లో జరిగిన మొదటి స్వాతంత్ర్య  పోరాటం- తిరుగుబాటు చూశాక అప్రమత్తమైన బ్రిటిష్ పాలకులు- అందులోంచి ఒక కుటిల నీతిని కనుగొన్నారు. చిట్టచివరి మొఘల్ బహదూర్ షా జాఫర్ ని  తమ నాయకుడిగా ఎన్నుకుని, ఝాన్సీ లక్ష్మీ బాయి సహా రాజులందరూ జరిపిన తిరుగుబాటు చూశాక- ఇలా హిందూ ముస్లిములు ఒకటైతే తమ పప్పులు ఉడకవని, విభజించి పాలించు అనే కుటిల నీతికి తెర తీశారు బ్రిటిష్ పాలకులు.

 జనరల్ డయ్యర్ కి ఆ రామనవమి సంబరాల్లో ఈ కుటిల నీతి పారడం లేదని అర్ధమై - వీళ్ళకి బుద్ధి చెప్పాలని- మానసిక సంతులనం కోల్పోయిన ఒక సైకోలా- జాలియావాలా బాగ్ ఊచకోతకి పాల్పడ్డాడు. అయితే ప్రజల్ని మభ్యపెట్టి ఆ ప్రదేశానికి రప్పించడానికి ఎంత తెలివైన పథకం వేశాడనేది- ఏ పోలిటికల్ థ్రిల్లర్ సినిమాకి/నవలకీ తీసిపోదు. ఇది చూసి తీరాల్సిందే. ఈ కుట్ర మొత్తాన్నీ బారిష్టర్ నాయర్ ఎలా విప్పి, డయ్యర్ మొహానే వేసి కొట్టాడనేదీ కూడా తెర మీద చూడాల్సిందే. తన కుట్ర కోసం డయ్యర్ మిషనరీ స్కూల్లో ఒక ఉత్తుత్తి రేప్ ని క్రియేట్ చేసే ఎపిసోడ్ మతి పోగొడుతుంది.
        
ఫస్టాఫ్ ఊచకోత, కోర్టు విచారణ, విచారణలో నాయర్ ప్రభుత్వ వాదనని ముక్కచెక్కలు చేయడం, దీంతో బ్రిటిష్ తరపున నెవెల్ మేకిన్లే దిగడం తో ఇంటర్వెల్ వస్తుంది. ఇక సెకండాఫ్ లో నాయర్, మెకిన్లేల మధ్య సంఘర్షణాత్మక కోర్టు రూమ్ డ్రామా ఇద్దరికీ ఎదురు దెబ్బలు తగిలే మలుపులు తిరుగుతూ - చివరి అరగంట నాయర్ పతనావస్థతో ఈ కథ ఎలా ముగుస్తుందా అన్న అంతుపట్టని మిస్టరీ క్రియేటవుతుంది. ఈ దశలోనే ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన విప్లవ బాలుడితో నాయర్ సంబంధం వెల్లడవుతుంది. ఇక ముగింపు విజయం వైపుగా నాయర్ దూకుడుతో థ్రిల్ చేస్తుంది.

నటనలు సాంకేతికాలు 

అక్షయ్ కుమార్ కేరళకి చెందిన బారిస్టర్ నాయర్ గా కాకుండా పూర్తిగా నార్త్ క్యారక్టర్ గానే కనిపిస్తాడు. అంటే బయోపిక్ పాత్రని ఫిక్షనల్ పాత్రలా నటించేశాడు. సౌతిండియన్ నాయర్ గానే కనిపించివుంటే, హిందీ స్లాంగ్ మారి భాషాపరమైన అందం చేకూరేది. పంజాబీ పాత్రలు పంజాబీ యాసలో హిందీ మాట్లాడుతున్నప్పుడు, మలయాళీ పాత్ర నాయర్ మలయాళం యాసలో  హిందీ మాట్లాడి వుంటే, మేకప్ కూడా మలయాళీలా వుండుంటే సహజత్వం ఉట్టి పడేది.
       
బారిష్టర్ గా పాత్రని నీటుగా పోషించాడు. బ్రిటిషర్ల మీద తిరగబడి బ్రిటిష్ కోర్టులో బ్రిటిషర్లని దోషులుగా నిరూపించే ముళ్ళదారి వంటి జర్నీని
, పోరాటాన్నీ సమర్ధవంతంగా పోషించాడు. అప్పుడప్పుడు రగిలిపోయి పేల్చిన డైలాగులూ హైలైటయ్యాయి-
Get The F#&k Out My Country!’ అన్నది బాగా వైరల్ అవుతున్న డైలాగు.
        
డైలాగ్ డెలివరీ పట్ల అక్షయ్ తరచుగా ఎదుర్కొనే ఆరోపణ- అతను టెలిప్రాంప్టర్ చూసి డైలాగులు చెప్పడం వల్ల ఫ్లో బ్రేక్ అవుతోందని. ఈసారి బయోపిక్ పాత్రతో అలా జరగలేదు. డైలాగుల్ని అభినయంలో భాగం చేసుకుంటూ చెప్పడం వల్ల తేడా కనిపిస్తోంది. ప్రత్యర్ధి పాత్రలో మాధవన్ తో అంత హోరాహోరీ ఎమోషనల్ సంఘర్షణ వుండదుగానీ, ఉన్నంత వరకు కోర్టు సీన్లు నిలబెట్టాడు అక్షయ్.

భార్య పార్వతిగా రెజీనాది ఐదారు సీన్లలో కన్పించే చిన్నపాత్ర. బారిష్టర్ అసిస్టెంట్ దిల్రీత్ గిల్ గా అనన్య పాండే నీటుగా నటించింది. మార్తా స్టీవెన్స్ ఉత్తుత్తి రేప్ కేసు విచారణని ఆమె కోర్టులో నిర్వహించిన తీరు రాబోయే కాలంలో ఆమె ఉత్తమ నటిగా ఎదిగే సూచనలని అందిస్తోంది.
       
ఇక
ఆర్ మాధవన్ విషయానికి వస్తే, అతడి  ఎంట్రీ ఇంటర్వెల్ ముందు మాత్రమే, కానీ అతడి నిజమైన మూడ్ ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తుంది. నాయర్ కి ప్రత్యర్ధిగా మాధవన్ మరీ రెచ్చిపోకుండా, కూల్ గా పుల్లలు పెట్టే మ్యానిపులేటివ్ నేచర్ ని బిగి సడలకుండా నటించాడు. జనరల్ డయ్యర్ గా సైమన్ డే కోపంతో పిచ్చి అరుపులు అరిచినప్పుడల్లా హిట్లర్ ని తలపిస్తాడు. .
        
ఇక కరణ్ సింగ్ దర్శకత్వం సింపుల్ గా, స్పష్టంగా, కథని  దాని ఉద్దేశ్యం నుంచి  ఎక్కడా దారి మళ్ళకుండా రెండే రెండు రస పోషణలతో బలంగా వుంటుంది- నేపధ్యంలో విషాదంతో కూడిన కరుణ రసం, కథనంలో అద్భుత  రసంతో కూడిన సస్పెన్స్. నటనలు, చిత్రీకరణలు రియలిస్టిక్ సినిమా ధోరణి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల చాలా పవర్‌ఫుల్‌. సందర్భానుసారంగా మూడు పాటలు. కెమెరా వర్క్ కొన్ని చోట్ల జూమ్, ఎక్స్ ట్రీమ్ జూమ్ షాట్లతో మెస్మరైజ్ చేస్తుంది. ప్రారంభంలో సుదీర్ఘ మారణహోమం దృశ్యాలు చెప్పుకోదగ్గవి. మిగతా సాంకేతిక హంగులు లిమిటెడ్ బడ్జెట్ కి ఉన్నంతలో వున్నాయి. సంభాషణలు అవసరమైన చోట్ల పవర్ఫుల్ గా వున్నాయి. అయితే డైలాగుల్లో మీడియా అనే పదం వాడారు. ఈ పదం ఈనాటిది- ఆనాడు కేవలం పత్రికలే వుండేవి  కాబట్టి ప్రెస్ అని వాడుకలో వుండేది.

2019 లో విడుదలైన - హిట్టయిన కేసరి కి ఇది సీక్వెల్ కాదుగానీ, చాప్టర్ 2 అన్నారు. విషయపరంగా రెండిటికీ ఎలాటి సంబంధం లేదు. 1897 లో హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలో 21 మందితో కూడిన సిక్కు రెజిమెంట్, ఆఫ్ఘన్ దురాక్రమణాన్ని ఎదుర్కొన్న చారిత్రక కథతో అక్షయ్ కుమార్ కేసరి లో కనిపించాడు. అయితే అది జింగోయిజంగా, కల్పితం చేసిన రాజకీయ కేసరీయంగా వుంది. కేసరి -చాప్టర్ 2 కి ఈ అతి అంటలేదు.
        
ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. నిజం, న్యాయం, బాధల కథని సిన్సియర్ గా తెరకెక్కించారు. చరిత్రలో చెప్పని దిగ్భ్రాంతికర అధ్యాయాన్ని వివరించే ఈ కథని , ఖచ్చితంగా ఒక సారి చూడాల్సిందే!

—సికిందర్
(రివ్యూలో  'జలియన్ వాలా బాగ్' అనకుండా 'జలియావాలా బాగ్' అనడమేంటని అన్పించవచ్చు. దశాబ్దాలుగా తెలుగులో 'జలియన్ వాలా బాగ్' అనే రాసేస్తున్నారు పుస్తకాల్లో, పత్రికల్లో. కానీ హిందీలో जलियांवाला (జలియావాలా) అనే వుంటుంది. ఇంగ్లీషులో రాసినప్పుడు Jalliyanwala అని మధ్యలో n వస్తుంది. పలికేటప్పుడు ఈ n సైలెంట్ అవుతుంది- Kahaaniyaan - కహానీయా లో చివర n లాగా. జలియావాలా బాగ్ అంటే జలియావాలా తోట అని అర్ధం)


Tuesday, April 15, 2025

1375 : రివ్యూ!

 

 

 శారీ
దర్శకత్వం : గిరి కృష్ణ కమల్
తారాగణం : ఆరాధ్యా దేవి, సత్య యదు, కల్పలత, సాహిల్ సంభయాల్, అప్పాజీ అంబరీష్
రచన :  రామ్ గోపాల్ వర్మ, సంగీతం : ఆనంద్ రాగ్, ఛాయాగ్రహణం : శబరి
నిర్మాత : రవిశంకర్ వర్మ

***

            రాంగోపాల్ వర్మ నిరుపమాన కలం నుంచి జాలువారిన సందేశాత్మక చలన చిత్రం శారీలో కొత్త నటి పరిచయమైంది. ఆమె ఆరాధ్యా దేవి. అలాగే నార్త్ నుంచి నటుడు సత్యా యదు హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడుగా గిరి కృష్ణ కమల్ పరిచయమయ్యాడు. ఈ కొత్తగా పరిచయమైన వారిని తగినంత విశాల హృదయంతో తెలుగు ప్రేక్షకులు ఆహ్వానించారు. అయితే ఈ కొత్త ముఖాలతో సోషల్ మీడియా సేఫ్టీ గురించి వర్మ కొత్తగా చెప్పిందేమిటనేదే ప్రశ్న. లో బడ్జెట్ లో రెండు లొకేషన్స్ లో, ముగ్గురు నల్గురు నటులతో సినిమాని చుట్టేసే అలవాటున్న వర్మ-ఈ సారి శారీని తీసుకుని సినిమాకి చుట్టేసినట్టా, లేక చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదీ అని సుందరంగా కట్టబెట్టినట్టా? మొదటి సీన్లోనే చీరల్ని కుప్పగా పోసి తగలబెట్టడంలో అర్ధమేమిటి? బ్రాని తగలెట్టిన ఫెమినిజం చూశాం గానీ, చీరల్ని తగులబెట్టే తరుణీమణుల్ని చూడలేదు. ఈ చీరల్ని తగులబెట్టే అగత్యం ఎందుకేర్పడిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఈ పాటికి ఏర్పడే వుంటుంది. కాబట్టి చప్పున కథలోకి వెళ్ళిపోదాం...

కథ
ఇంట్లో వున్న చీరల్ని తెచ్చి వీధిలో పడేసి నిప్పంటించేస్తుంది ఆరాధ్యాదేవి (శ్రీలక్ష్మీ సతీష్ అలియాస్ ఆరాధ్యా దేవి). ఎందుకు? ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది- ఆరాధ్యకి అన్న (సాహిల్ సంభయాల్), అమ్మ (కల్పలత), నాన్న(అప్పాజీ అంబరీష్). ఆరాధ్యకి చీరలు కట్టుకోవడమంటే చాలా ఇష్టం. కొత్త కొత్త చీరలు కట్టి సోషల్ మీడియాలో గంగ వెర్రులెత్తిస్తూంటే, అందులో ఆకతాయిలు నీచంగా కామెంట్లు పెట్టడం, వాళ్ళని ఆరాధ్య అన్న కొట్టడం రోజువారీ కార్యక్రమంగా జరుగుతూంటాయి. ఈమెని కిట్టూ (సత్య యదు) అనే ఫోటోగ్రాఫర్ చూసి మనసు పారేసుకుని వెంటపడతాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ఫోటోషూట్ చేస్తానని చెప్తాడు. ఫోటోలు, రీల్స్ తీసి వైరల్ చేస్తున్న ఆమెకి అతడి మాటలు నచ్చుతాయి. దాంతో అతడి ఫోటో షూట్స్ తో తన చీరల క్రేజ్ ని సోషల్ మీడియాలో మరింత పెంచుకుంటుంది. ఇంతలో అతను ప్రేమిస్తున్నానంటాడు. దాంతో దూరం పెడుతుంది. అతను సైకోగా మరి ఆమెని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి ప్రేమించమని హింసిస్తూ వుంటాడు. ఆ తర్వాత ఏమైంది? సైకో నుంచి ఆమె ఎలా తప్పించుకుంది? ఆమెని కాపాడబోయిన అన్న ఏమయ్యాడు? సైకోకి ఆరాధ్య ప్రేమ దక్కిందా?...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

సోషల్ మీడియాలో ఎవరినైనా గుడ్డిగా నమ్మడం లేదా స్నేహం చేయడం ప్రమాదకరమైన పరిణామాలకి దారితీస్తుందన్న వర్మ హెచ్చరికతో ఈ కథ మొదలవుతుంది. ఇదేం కొత్త ఆలోచన కాదు. సోషల్ మీడియా సేఫ్టీ గురించి ఒకప్పుడు బాగా ప్రచారం జరిగేది. ఇప్పుడు ఎవేర్నెస్ బాగా వచ్చేసింది. ఇంకా కొత్తగా ఇప్పుడు పాఠాలు చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి ప్రమాదం వుంటున్న పరిస్థితి నుంచి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ నుంచే ఫాలోవర్స్ కి ప్రమాదముంటున్న కొత్త పరిస్థితి ఇప్పుడు దాపురించింది. ఇన్ఫ్లూయెన్సర్లతో ఈ కొత్త బెడద గురించి రీసెర్చి నివేదికలతో ఇంటర్నెట్ నిండిపోతోంది. చాప కింద నీరులా ఇది కనిపించని ఉపద్రవం.
       
ఇదలా వుంచితే
, వర్మ పరిచయం చేస్తున్న హీరోయిన్ ఆరాధ్యా దేవి సోషల్ మీడియా ద్వారానే ఆయన్ని ఆకర్షించింది. ఈమె అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఈ పేరుతో ఈ
మె కేరళలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా యెల్లో శారీలో అద్భుతంగా కనిపించడంతో, వర్మ వెంటనే ఈ సినిమాకి బుక్ చేసుకుని ఆరాధ్యా దేవిగా పేరు మార్చేసి, హడావిడిగా ఈ కథ రాసేసుకున్నారు. ఆరాధ్య మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో కేరళలో జరిగిన ఒక వైరల్ ఫోటో షూట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమెకి భారీగా ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఆమె శారీ ప్రదర్శనలతో ఫాలోవర్స్ ని భారీ యెత్తున పెంచుకుని ప్రభావితం చేసింది.
       
ఇలాటి రియల్ లైఫ్ ఇన్ఫ్లూయెన్సర్ వర్మ కథలో సాధారణ సోషల్ మీడియా యూజర్ గా మారిపోయింది. దీంతో మార్కెట్ యాస్పెక్ట్ లేని
,  కాలం చెల్లిన పాత పాయింటుతో పాత కథే తెరకెక్కింది. అంటే ఫాలోవర్స్ నుంచి సాధారణ యూజర్లకి ఎదురయ్యే ప్రమాదాల గురించిన రొటీన్ కథ. కానీ దీనికి విరుద్ధంగా, ఇన్ఫ్లూయెన్సర్లుగా మారుతున్న కొందరు యూజర్సే ఫాలోవర్స్ కి ప్రమాదకరంగా పరిణమిస్తున్న పాయింటు ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే కొత్త కథ అవుతుందని గుర్తించలేదు వర్మ.
       
ఇన్ఫ్లూయెన్సర్ల జగత్తు చాలా ఖతర్నాక్ జగత్తు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రపంచాన్ని తుఫానులా ముంచెత్తుతున్న తాజా సెలబ్రిటీ క్రేజ్. తమకు తాము రోల్ మోడల్స్ గా ఇమేజీని సృష్టించుకుని, ఏవేవో ఖరీదైన ఉత్పత్తుల్ని ప్రచారం చేస్తూ, యువతీ యువకుల, పిల్లల శ్రేయస్సుకి హాని కలిగిస్తున్నారు. అందువల్ల, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అవుట్‌పుట్‌ని జాగ్రత్తగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇంస్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో ఫాలోవర్స్ విపరీతంగా వీరి కంటెంట్‌ని అనుసరిస్తూండడంతో, ఇన్ఫ్లూయెన్సర్లు వివిధ బ్రాండ్స్ కి, వ్యాపారాలకీ శక్తివంతమైన మార్కెటింగ్ సాధనంగా మారారు. వీళ్ళ ప్రచారాలు గుడ్డిగా నమ్ముతున్న యువత, పిల్లలూ జేబులూ వొళ్ళూ గుల్ల చేసుకుంటున్నారు. అంతేగాక మానసిక సమస్యలూ తెచ్చుకుంటున్నారు.
       
మోడరన్ సినిమా ఇన్ఫ్లూయెన్సర్ వర్మ విశిష్ట పాళీ నుంచి జాలువారిన ఈ కథామృత ధార క్రియేటివ్ యాస్పెక్ట్ కైనా న్యాయం చేయలేదు. విషయం ప్రతిధ్వనించని వీలైనంత ఫ్లాట్ కథనంతో సీన్లు పేర్చుకుంటూ పోయి సైనాఫ్ చేసేశారు. శారీలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎడ్యుకేటెడ్ హీరోయిన్ పాత్ర
, ఒక ఫాలోవర్ ట్రాప్ లో పడిపోవడం, ఇక ఏం చేయాలో తెలీక ఆర్తనాదాలు చేయడం, చావుకి దగ్గరగా వెళ్ళిపోవడం లాంటి పాత్ర చిత్రణ సైతం ఈ పాత బలహీన కథని పడుకోబెట్టేసింది.       

అతను ఫోటో గ్రాఫర్ అయితే, ఫోటో షూట్ చేస్తానని వస్తే, ఆమె అన్న చేత బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయించాలి. ఎందుకంటే ఆకతాయిల్ని కనిపెట్టి బుద్ధి చెప్పే కార్యక్రమం అతను పెట్టుకున్నాడు. అన్న క్లీన్ చిట్ ఇస్తే, తన స్థాయిలో ఒక సెలెబ్రిటీ అయిన ఆమె అన్న సమక్షంలో అగ్రిమెంట్ రాయించుకోవాలి. దాంతో తన వరకూ రక్షణ చర్యలు తీసుకున్నట్టవుతుంది. ఇలాటి కథలకి ప్లాట్ పాయింట్ వన్ లో అగ్రిమెంట్ అనే ప్లాట్ డివైస్ లేకపోతే సరైన కాన్ఫ్లిక్ట్ వుండదు. వుంటే ఏకపక్షం గా వుంటుంది. ఇదే జరిగిందీ కథలో.      

ఆమె అన్నతో కూడా చెప్పకుండా ఓ ఫోటోగ్రాఫర్ మాటలకి పడిపోయి అగ్రిమెంట్ లేకుండా ఫోటో షూట్లకి తిరగడం మొదలెడుతుంది. ఇదీ ఆమె సెలబ్రిటీ ప్రొఫెషనలిజం. ఈమె సోషల్ మీడియాలో ఎవరినైనా గుడ్డిగా నమ్మడం లేదా స్నేహం చేయడం ఎలా చేస్తుంది? ఒక సోషల్ మీడియా సెలబ్రిటీని చూపిస్తూ- సోషల్ మీడియాలో ఎవరినైనా గుడ్డిగా నమ్మడం లేదా స్నేహం చేయడం ప్రమాదకరమైన పరిణామాలకి దారితీస్తుందన్న హెచ్చరికతో కథ ఎలా ప్రారంభిస్తారు? టెన్త్ చదివే సగటు అమాయక అమ్మాయితో చెప్పొచ్చు  ఇలాటి కథ.
       
ఫోటోగ్రాఫర్
మొదట తను ఆమెని ఫాలో అవుతూ (స్టాకింగ్ చేస్తూ), చాటుమాటుగా ఫోటోలు వీడియోలు తీయడం మొదలెడతాడు. అవి వేసుకుని చూస్తూ డ్రీమ్ సాంగ్స్ లోకి వెళ్ళిపోయి ఆనందిస్తూ వుంటాడు. అంటే అతను ఫోటోగ్రాఫర్ కాదన్న మాట. అతడి లోపల మేనియక్ దాగున్నాడు. తర్వాత ఆమెని కలవాలంటూ మెసేజీలు పెడుతూంటాడు. ఆమె కలుస్తుంది. ఫోటో షూట్స్ చేస్తానంటే ఒప్పేసుకుంటుంది. ఫోటో షూట్స్ చేస్తూంటే అన్న వచ్చి విరగదీస్తాడు వాణ్ని. వాడు తిరగబడి సైకోగా మారిపోతాడు. ఎలాగైనా ఆమెని సొంతం చేసుకోవాలన్న పంతానికి పోయి- ప్రేమిస్తున్నానంటాడు. ఆమె కాదనడంతో అన్నని చంపి పారేస్తానంటాడు.
        
ఈ ఫస్టాఫ్ కథ తర్వాత అన్నతో ఘర్షణ మొదలవుతుంది. ఇక సైకో ఆమెని కిడ్నాప్ చేసి టార్చర్ చేయడం మొదలెడతాడు. ఈ సెకండాఫ్ ఆమెని బంధించి ప్రేమించమంటూ టార్చర్ చేయడంతోనే సరిపోతుంది. ఒక బీభత్సం తో ఎండ్.
       
పూర్తిగా సైకోపరంగా ఏకపక్ష బలహీన కథ ఇది. అదే ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేసి
, అగ్రిమెంట్ ని సృష్టించి వుంటే- నువ్వు వర్సెస్ నేను అనే రెండు పక్షాలు ఏర్పడతాయి. దీంతో ఏం జరుగుతుందన్న ప్రేక్షకుల ఆలోచనకి తావిచ్చి, సస్పెన్స్ క్రియేట్ అవుతూ కథ పుడుతుంది. అతను అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే, ఆమె అక్కడ్నించే తిరగబడుతూ కాన్ఫ్లిక్ట్ ని సృష్టించే అవకాశముంటుంది. అంటే తనకేం జరుగుతోందన్న ఎరుక తో యాక్టివ్ క్యారక్టర్ గా ప్రవర్తించే అవకాశముంటుంది. అప్పుడు హీరోయిన్ని మైనస్ చేస్తూ సైకో పరంగా ఏకపక్ష, విషయం ప్రతిధ్వనించని ఫ్లాట్ కథనానికి తావుండదు.

నటనలు- సాంకేతికాలు

యెల్లో శారీ ఈ తెలుగు సినిమాలో తనకి ఎంట్రీ ఇప్పిస్తే, శారీలతో ఇచ్చిన సందేశం ఆరాధ్యా దేవికైనా అర్ధమైందో లేదో-  అసలిందులో సందేశమే లేదని. తన అంగాంగ ప్రదర్శనలతో, సైకో రాక్షసత్వంతో చెప్పాలనుకున్న కథ ఎప్పుడో గల్లంతయ్యింది. ఉన్నది తన ఎక్స్ పోజింగ్, సైకో టార్చర్. ఎక్స్ పోజింగ్ కోసం పాటలు వచ్చి పోతూ వుంటాయి. ఆరాధ్య పాత్ర డిగ్నిటీని కాపాడాలన్న ఆలోచన రచయితకే లేకపోతే సైకో కేముంటుంది. అంతా విప్పి చూపించేస్తూ హీరోయిన్ పాత్రని రచయితే బజార్న పడేస్తూంటే ఇంకేం హెచ్చరిక, ఇంకే సందేశం.
       
కనుక  ఆమెకి నటించే అవకాశం లభించ లేదు. నటిగా నిరూపించుకునే స్కోపుకి స్పేస్ లేదు. నా సినిమా ఇదా అన్నట్టు
, చివరికి కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ చీరలు ఎత్తుకొచ్చి వీధిలో నిప్పు పెట్టడంలో కనబర్చిన కసి ఒక్కటే బాగా నటించింది. ఐతే చీరలేం చేశాయి పాపం- తెలివితేటల్ని కూడా విప్పి అవతల పారేసి మోసపోవడం పూర్తిగా తన తప్పే- దాన్ని చీరల మీదికి తోసేసి భస్మీపటలం చేస్తే తను ఒప్పు అయిపోతుందా? సానుభూతి పొందుతుందా?
       
ఇక సైకోగా నటించిన సత్య యదు- ఇతను మాత్రం పూర్తి స్థాయిలో పాత్రని ఎంజాయ్ చేయడమే కాదు- పాత్రలో జీవించి తరించాడు. ఎందుకంటే హీరోయిన్ని ఈ యెత్తున టార్చర్ చేసే అవకాశం ఇలా లభించింది కాబట్టి. ఇతడి డ్రీమ్ సాంగ్స్ కోసం పాటలేవో వచ్చిపోతూంటాయి. కెమెరా వర్క్ లో  ఇక్కడే క్రియేటివిటీ కనిపిస్తుంది. కానీ వర్మ సినిమాలో  దర్శకుడికి పనేముంటుంది- ఇందులో గిరి కృష్ణ కమల్ వర్క్ ఎంత
?

—సికిందర్