Saturday, April 26, 2025
Thursday, April 24, 2025
1377 : బుక్ రివ్యూ!
అయితే ఇంత నేపధ్యం, ప్రశస్తి వున్న కొరియన్ సినిమాలపై తెలుగులో పుస్తకం రాకపోవడం ఒక లోటుగానే వుంటూ వచ్చింది. ఈ లోటుని తీరుస్తున్నట్టు ఆ మధ్య ‘సంచిక’ వెబ్సైట్ లో ‘కొరియానం’ పేర కొరియన్ సినిమాల్ని పరిచయం చేసే శీర్షిక ప్రారంభమైంది. ఆ పరిచయకర్త సినిమా రివ్యూ రైటర్ గా రాణిస్తున్న గీతాచార్య. కొరియన్ సినిమాలపై ఈయన్ని మించిన అథారిటీ లేకపోవచ్చు తెలుగులో. ఒక థీసిస్ కి సరిపడా నాలెడ్జి సంపాదించుకుని రాసిన ఈ వ్యాసాల పరంపర తాజాగా పుస్తకరూపంలో వెలువడింది. పుస్తకం పేరు ‘కొరియానం’. దాదాపు 500 పేజీల సమగ్ర దర్శనం.
ఓల్డ్ బాయ్ తీసిన పార్క్ చాన్ -వూక్ గురించి ఎక్కువ పేజీలు ఇందులో కనిపిస్తాయి. పార్క్ చాన్-వూక్, కిమ్ కి-డుక్, లీ చాంగ్ డాంగ్ వంటి కొరియన్ బ్రాండ్ డైరెక్టర్ల గురించి ఎంత రాసినా తక్కువే. ది క్లాసిక్ తీసిన క్వాక్ జే యంగ్ కూడా తీసిపోడు. అయితే పార్క్ చాన్ -వూక్ ప్రధాన స్రవంతి సినిమాలు ఎక్కువగా ఆందోళన, నిరాశ, అసూయ, అశాంతి, ఆగ్రహం వంటి భావోద్వేగాల కూడికగా వుంటాయని ఈ పుస్తకం చదివితే తేటతెల్లమవుతుంది.
దక్షిణ కొరియా సమాజపు కోరికలు, దుఃఖం, అణచివేత- వీటికి బాధితులో బానిసలో అయ్యే కార్మికులు, సెక్స్ వర్కర్లు, నిరుద్యోగులు, మాదకద్రవ్యాల బానిసలు, గ్యాంగ్స్టర్లు, అప్పుల్లో వున్న వ్యక్తులందరూ ఈ పుస్తకంలోని అధ్యాయాల్లో కనిపించి దక్షిణ కొరియా సమాజం పట్ల ఒక అవగాహనని ఏర్పరుస్తారు. వీళ్ళందరూ పోరాటం చేసే వ్యక్తులే.
ఈ పుస్తకం వెనుక గీతాచార్య చేసిన చాలా కృషీ, పడ్డ శ్రమా కనిస్తాయి. అయితే పుస్తకాన్ని సీరియస్ గా రాయకుండా కామెడీలు చేస్తూ రాయడంతో, మధ్యమధ్యలో తెలుగు, హిందీ సినిమాలూ, వాటి నటులూ ఈ కామెడీలకి మినహాయింపు కాకపోవడంతో, ప్రింట్ మీడియాలో ఇదొక అరుదైన ఇన్ఫోటైన్మెంట్ ప్రయోగంగా ప్రూవ్ చేసుకుంటుంది.
80081 60011
Monday, April 21, 2025
1376 : రివ్యూ!
కేసరి
-2
దర్శకత్వం : కరణ్ సింగ్ త్యాగి
తారాగణం
: అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే, రేజీనా కాసాండ్రా
రచన
: కరణ్ సింగ్ త్యాగి, అమృతపాల్ సింగ్ బింద్రా, మాటలు : సుమిత్ సక్సేనా
సంగీతం : శాశ్వత్ సచ్దేవ్, కవితా సేథ్ -
కనిష్క్ సేథ్, ఛాయాగ్రహణం : దేబోజిత్
రే, సైమన్ పైస్లే డే, అమిత్ సైయల్
తదితరులు.
బ్యానర్స్
: ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్
ఫిల్మ్స్
నిర్మాతలు
: హీరూ యష్ జోహార్, అరుణా భాటియా, కరణ్ జోహార్, అదర్ పూనావల్ల
అపూర్వా మెహతా, అమృత్ పాల్ సింగ్
బింద్రా, ఆనంద్ తివారీ
విడుదల :
ఏప్రిల్ 18, 2025
***
ఏప్రిల్ 13, 1919న రౌలట్ చట్టానికి (పోలీసులు కారణం లేకుండా ఎవర్నైనా అరెస్ట్ చేసే అధికారాన్నికల్పించిన చట్టం) వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అమృత్సర్లోని జలియావాలా బాగ్లో నిరసనకారుల బృందం శాంతియుతంగా సమావేశమవుతుంది. ఇంతలో జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హేరీ డయ్యర్ సాయుధ దళాలతో ఆ స్థలానికి చేరుకుని, ఎలాటి హెచ్చరిక లేకుండా నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపమని ఆదేశిస్తాడు. చిన్న పిల్లలూ స్త్రీలు సహా మొత్తం 1650 మంది ఆ కాల్పుల్లో మరణిస్తారు.
ఈ ఘోరం గురించి పత్రికలు ఏమీ రాయకుండా తెల్లదొరలు అడ్డుకుంటారు. ఆ నిరసనకారులు సాయుధ ఉగ్రవాదులనీ చెప్తూ, వాళ్ళు దాడి చేస్తూంటే కాల్పులు జరపాల్సి వచ్చిందనీ తప్పుడు వార్త అందిస్తారు. దీంతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఉద్రిక్తత పెరిగిపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొని- మృతుల కుటుంబాలకి 25 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తూనే, ఈ విషయంపై దర్యాప్తుకి ఆదేశిస్తుంది. అది లోపాయికారిగా బోగస్ దర్యాప్తు. ఇప్పుడు ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి నైట్హుడ్ అవార్డు పొందిన సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) అనే బారిష్టర్, జనరల్ డయ్యర్ ని కాపాడే ఈ బోగస్ దర్యాప్తు చేపడతాడు.
ఈ దర్యాప్తు కమిషన్లో బ్రిటిష్ న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం వున్న ఏకైక భారతీయుడు సర్ సి శంకరన్ నాయర్. పెద్ద దొర ఇప్పటికే అతను తమ కీలుబొమ్మగా వ్యవహరిస్తాడని భావిస్తాడు. దర్యాప్తు సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలని అణిచివేస్తుంది. ఈ సమయంలో, నాయర్ దృష్టి 13 ఏళ్ళ విప్లవ బాలుడు పర్గత్ సింగ్ (కృష్ణారావు) పైన పడుతుంది. ఆ విప్లవ బాలుడితో నాయర్ కి పాత సంబంధమేదో వుంటుంది. కాల్పుల్లో కాపాడమని నాయర్ నే పిలుస్తూ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇది నాయర్ ని కదిలిస్తుంది. దీంతో కమిషన్ కి వ్యతిరేక రిపోర్టు ఇచ్చి, జనరల్ డయ్యర్ ని శిక్షించేందుకు న్యాయ పోరాటానికి దిగుతాడు.
ఈ న్యాయ పోరాటంలో తవ్వి తీసిన నిజాలేమిటి? కేవలం రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు గుమికూడారన్న కారణంతో జనరల్ డయ్యర్ ప్రజల్ని కాల్చి చంపాడా? లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కారణముందా? ఆ పెద్ద కారణంతో తనే పథకం ప్రకారం ప్రజల్ని జలియావాలా బాగ్ కి వచ్చేలా చేసి, ఆ ప్రజల మీద కక్ష తీర్చుకున్నాడా? ఏమిటీ ఘోర కృత్యం వెనుకవున్న అసలు కారణం? దీన్ని నాయర్ ఎలా బయటికి తీసి డయ్యర్ మీద నేరాన్ని నిరూపించాడు? ఇందులో జూనియర్ దిల్రీత్ గిల్ (అనన్య పాండే) ఎలా తోడ్పడింది? బ్రిటిష్ ప్రభుత్వం తరపున రంగంలోకి దిగిన భారతీయ సంతతికి చెందిన న్యాయవాది నెవిల్ మెకిన్లే (ఆర్ మాధవన్) జనరల్ డయ్యర్ ని కాపాడుతూ, బారిష్టర్ నాయర్ ని ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? ఇతడి కుట్రల ఫలితంగా న్యాయవాద వృత్తిలో పూర్తిగా పతనమై దోషిగా నిలబడ్డ నాయర్ తిరిగి ఎలా విజయం సాధించాడు? ...ఇదీ మిగతా కథ.
బారిష్టర్ గా పాత్రని నీటుగా పోషించాడు. బ్రిటిషర్ల మీద తిరగబడి బ్రిటిష్ కోర్టులో బ్రిటిషర్లని దోషులుగా నిరూపించే ముళ్ళదారి వంటి జర్నీని, పోరాటాన్నీ సమర్ధవంతంగా పోషించాడు. అప్పుడప్పుడు రగిలిపోయి పేల్చిన డైలాగులూ హైలైటయ్యాయి- ‘Get The F#&k Out My Country!’ అన్నది బాగా వైరల్ అవుతున్న డైలాగు.
డైలాగ్ డెలివరీ పట్ల అక్షయ్ తరచుగా ఎదుర్కొనే ఆరోపణ- అతను టెలిప్రాంప్టర్ చూసి డైలాగులు చెప్పడం వల్ల ఫ్లో బ్రేక్ అవుతోందని. ఈసారి బయోపిక్ పాత్రతో అలా జరగలేదు. డైలాగుల్ని అభినయంలో భాగం చేసుకుంటూ చెప్పడం వల్ల తేడా కనిపిస్తోంది. ప్రత్యర్ధి పాత్రలో మాధవన్ తో అంత హోరాహోరీ ఎమోషనల్ సంఘర్షణ వుండదుగానీ, ఉన్నంత వరకు కోర్టు సీన్లు నిలబెట్టాడు అక్షయ్.
ఇక ఆర్ మాధవన్ విషయానికి వస్తే, అతడి ఎంట్రీ ఇంటర్వెల్ ముందు మాత్రమే, కానీ అతడి నిజమైన మూడ్ ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తుంది. నాయర్ కి ప్రత్యర్ధిగా మాధవన్ మరీ రెచ్చిపోకుండా, కూల్ గా పుల్లలు పెట్టే మ్యానిపులేటివ్ నేచర్ ని బిగి సడలకుండా నటించాడు. జనరల్ డయ్యర్ గా సైమన్ డే కోపంతో పిచ్చి అరుపులు అరిచినప్పుడల్లా హిట్లర్ ని తలపిస్తాడు. .
ఇక కరణ్ సింగ్ దర్శకత్వం సింపుల్ గా, స్పష్టంగా, కథని దాని ఉద్దేశ్యం నుంచి ఎక్కడా దారి మళ్ళకుండా రెండే రెండు రస పోషణలతో బలంగా వుంటుంది- నేపధ్యంలో విషాదంతో కూడిన కరుణ రసం, కథనంలో అద్భుత రసంతో కూడిన సస్పెన్స్. నటనలు, చిత్రీకరణలు రియలిస్టిక్ సినిమా ధోరణి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల చాలా పవర్ఫుల్. సందర్భానుసారంగా మూడు పాటలు. కెమెరా వర్క్ కొన్ని చోట్ల జూమ్, ఎక్స్ ట్రీమ్ జూమ్ షాట్లతో మెస్మరైజ్ చేస్తుంది. ప్రారంభంలో సుదీర్ఘ మారణహోమం దృశ్యాలు చెప్పుకోదగ్గవి. మిగతా సాంకేతిక హంగులు లిమిటెడ్ బడ్జెట్ కి ఉన్నంతలో వున్నాయి. సంభాషణలు అవసరమైన చోట్ల పవర్ఫుల్ గా వున్నాయి. అయితే డైలాగుల్లో మీడియా అనే పదం వాడారు. ఈ పదం ఈనాటిది- ఆనాడు కేవలం పత్రికలే వుండేవి కాబట్టి ప్రెస్ అని వాడుకలో వుండేది.
Tuesday, April 15, 2025
1375 : రివ్యూ!
దర్శకత్వం : గిరి కృష్ణ కమల్
తారాగణం : ఆరాధ్యా దేవి, సత్య యదు, కల్పలత, సాహిల్
సంభయాల్, అప్పాజీ అంబరీష్
రచన :
రామ్ గోపాల్ వర్మ, సంగీతం : ఆనంద్ రాగ్, ఛాయాగ్రహణం : శబరి
నిర్మాత : రవిశంకర్ వర్మ
రాంగోపాల్ వర్మ నిరుపమాన కలం నుంచి జాలువారిన సందేశాత్మక చలన చిత్రం ‘శారీ’ లో కొత్త నటి పరిచయమైంది. ఆమె ఆరాధ్యా దేవి. అలాగే
నార్త్ నుంచి నటుడు సత్యా యదు హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడుగా గిరి కృష్ణ కమల్
పరిచయమయ్యాడు. ఈ కొత్తగా పరిచయమైన వారిని తగినంత విశాల హృదయంతో తెలుగు ప్రేక్షకులు
ఆహ్వానించారు. అయితే ఈ కొత్త ముఖాలతో సోషల్ మీడియా సేఫ్టీ గురించి వర్మ కొత్తగా
చెప్పిందేమిటనేదే ప్రశ్న. లో బడ్జెట్ లో రెండు లొకేషన్స్ లో, ముగ్గురు నల్గురు నటులతో సినిమాని చుట్టేసే
అలవాటున్న వర్మ-ఈ సారి శారీని తీసుకుని సినిమాకి చుట్టేసినట్టా, లేక చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదీ అని సుందరంగా
కట్టబెట్టినట్టా? మొదటి సీన్లోనే చీరల్ని కుప్పగా
పోసి తగలబెట్టడంలో అర్ధమేమిటి? బ్రాని తగలెట్టిన ఫెమినిజం చూశాం
గానీ, చీరల్ని తగులబెట్టే తరుణీమణుల్ని చూడలేదు. ఈ చీరల్ని
తగులబెట్టే అగత్యం ఎందుకేర్పడిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఈ పాటికి ఏర్పడే
వుంటుంది. కాబట్టి చప్పున కథలోకి వెళ్ళిపోదాం...
ఇదలా వుంచితే, వర్మ పరిచయం చేస్తున్న హీరోయిన్ ఆరాధ్యా దేవి సోషల్ మీడియా ద్వారానే ఆయన్ని ఆకర్షించింది. ఈమె అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఈ పేరుతో ఈమె కేరళలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా యెల్లో శారీలో అద్భుతంగా కనిపించడంతో, వర్మ వెంటనే ఈ సినిమాకి బుక్ చేసుకుని ఆరాధ్యా దేవిగా పేరు మార్చేసి, హడావిడిగా ఈ కథ రాసేసుకున్నారు. ఆరాధ్య మొదట ఇన్స్టాగ్రామ్లో కేరళలో జరిగిన ఒక వైరల్ ఫోటో షూట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమెకి భారీగా ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఆమె శారీ ప్రదర్శనలతో ఫాలోవర్స్ ని భారీ యెత్తున పెంచుకుని ప్రభావితం చేసింది.
ఇలాటి రియల్ లైఫ్ ఇన్ఫ్లూయెన్సర్ వర్మ కథలో సాధారణ సోషల్ మీడియా యూజర్ గా మారిపోయింది. దీంతో మార్కెట్ యాస్పెక్ట్ లేని, కాలం చెల్లిన పాత పాయింటుతో పాత కథే తెరకెక్కింది. అంటే ఫాలోవర్స్ నుంచి సాధారణ యూజర్లకి ఎదురయ్యే ప్రమాదాల గురించిన రొటీన్ కథ. కానీ దీనికి విరుద్ధంగా, ఇన్ఫ్లూయెన్సర్లుగా మారుతున్న కొందరు యూజర్సే ఫాలోవర్స్ కి ప్రమాదకరంగా పరిణమిస్తున్న పాయింటు ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే కొత్త కథ అవుతుందని గుర్తించలేదు వర్మ.
ఇన్ఫ్లూయెన్సర్ల జగత్తు చాలా ఖతర్నాక్ జగత్తు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రపంచాన్ని తుఫానులా ముంచెత్తుతున్న తాజా సెలబ్రిటీ క్రేజ్. తమకు తాము రోల్ మోడల్స్ గా ఇమేజీని సృష్టించుకుని, ఏవేవో ఖరీదైన ఉత్పత్తుల్ని ప్రచారం చేస్తూ, యువతీ యువకుల, పిల్లల శ్రేయస్సుకి హాని కలిగిస్తున్నారు. అందువల్ల, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అవుట్పుట్ని జాగ్రత్తగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇంస్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో ఫాలోవర్స్ విపరీతంగా వీరి కంటెంట్ని అనుసరిస్తూండడంతో, ఈ ఇన్ఫ్లూయెన్సర్లు వివిధ బ్రాండ్స్ కి, వ్యాపారాలకీ శక్తివంతమైన మార్కెటింగ్ సాధనంగా మారారు. వీళ్ళ ప్రచారాలు గుడ్డిగా నమ్ముతున్న యువత, పిల్లలూ జేబులూ వొళ్ళూ గుల్ల చేసుకుంటున్నారు. అంతేగాక మానసిక సమస్యలూ తెచ్చుకుంటున్నారు.
మోడరన్ సినిమా ఇన్ఫ్లూయెన్సర్ వర్మ విశిష్ట పాళీ నుంచి జాలువారిన ఈ కథామృత ధార క్రియేటివ్ యాస్పెక్ట్ కైనా న్యాయం చేయలేదు. విషయం ప్రతిధ్వనించని వీలైనంత ఫ్లాట్ కథనంతో సీన్లు పేర్చుకుంటూ పోయి సైనాఫ్ చేసేశారు. శారీలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎడ్యుకేటెడ్ హీరోయిన్ పాత్ర, ఒక ఫాలోవర్ ట్రాప్ లో పడిపోవడం, ఇక ఏం చేయాలో తెలీక ఆర్తనాదాలు చేయడం, చావుకి దగ్గరగా వెళ్ళిపోవడం లాంటి పాత్ర చిత్రణ సైతం ఈ పాత బలహీన కథని పడుకోబెట్టేసింది.
ఫోటోగ్రాఫర్ మొదట తను ఆమెని ఫాలో అవుతూ (స్టాకింగ్ చేస్తూ), చాటుమాటుగా ఫోటోలు వీడియోలు తీయడం మొదలెడతాడు. అవి వేసుకుని చూస్తూ డ్రీమ్ సాంగ్స్ లోకి వెళ్ళిపోయి ఆనందిస్తూ వుంటాడు. అంటే అతను ఫోటోగ్రాఫర్ కాదన్న మాట. అతడి లోపల మేనియక్ దాగున్నాడు. తర్వాత ఆమెని కలవాలంటూ మెసేజీలు పెడుతూంటాడు. ఆమె కలుస్తుంది. ఫోటో షూట్స్ చేస్తానంటే ఒప్పేసుకుంటుంది. ఫోటో షూట్స్ చేస్తూంటే అన్న వచ్చి విరగదీస్తాడు వాణ్ని. వాడు తిరగబడి సైకోగా మారిపోతాడు. ఎలాగైనా ఆమెని సొంతం చేసుకోవాలన్న పంతానికి పోయి- ప్రేమిస్తున్నానంటాడు. ఆమె కాదనడంతో అన్నని చంపి పారేస్తానంటాడు.
ఈ ఫస్టాఫ్ కథ తర్వాత అన్నతో ఘర్షణ మొదలవుతుంది. ఇక సైకో ఆమెని కిడ్నాప్ చేసి టార్చర్ చేయడం మొదలెడతాడు. ఈ సెకండాఫ్ ఆమెని బంధించి ప్రేమించమంటూ టార్చర్ చేయడంతోనే సరిపోతుంది. ఒక బీభత్సం తో ఎండ్.
పూర్తిగా సైకోపరంగా ఏకపక్ష బలహీన కథ ఇది. అదే ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేసి, అగ్రిమెంట్ ని సృష్టించి వుంటే- నువ్వు వర్సెస్ నేను అనే రెండు పక్షాలు ఏర్పడతాయి. దీంతో ఏం జరుగుతుందన్న ప్రేక్షకుల ఆలోచనకి తావిచ్చి, సస్పెన్స్ క్రియేట్ అవుతూ కథ పుడుతుంది. అతను అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే, ఆమె అక్కడ్నించే తిరగబడుతూ కాన్ఫ్లిక్ట్ ని సృష్టించే అవకాశముంటుంది. అంటే తనకేం జరుగుతోందన్న ఎరుక తో యాక్టివ్ క్యారక్టర్ గా ప్రవర్తించే అవకాశముంటుంది. అప్పుడు హీరోయిన్ని మైనస్ చేస్తూ సైకో పరంగా ఏకపక్ష, విషయం ప్రతిధ్వనించని ఫ్లాట్ కథనానికి తావుండదు.
కనుక ఆమెకి నటించే అవకాశం లభించ లేదు. నటిగా నిరూపించుకునే స్కోపుకి స్పేస్ లేదు. నా సినిమా ఇదా అన్నట్టు, చివరికి కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ చీరలు ఎత్తుకొచ్చి వీధిలో నిప్పు పెట్టడంలో కనబర్చిన కసి ఒక్కటే బాగా నటించింది. ఐతే చీరలేం చేశాయి పాపం- తెలివితేటల్ని కూడా విప్పి అవతల పారేసి మోసపోవడం పూర్తిగా తన తప్పే- దాన్ని చీరల మీదికి తోసేసి భస్మీపటలం చేస్తే తను ఒప్పు అయిపోతుందా? సానుభూతి పొందుతుందా?
ఇక సైకోగా నటించిన సత్య యదు- ఇతను మాత్రం పూర్తి స్థాయిలో పాత్రని ఎంజాయ్ చేయడమే కాదు- పాత్రలో జీవించి తరించాడు. ఎందుకంటే హీరోయిన్ని ఈ యెత్తున టార్చర్ చేసే అవకాశం ఇలా లభించింది కాబట్టి. ఇతడి డ్రీమ్ సాంగ్స్ కోసం పాటలేవో వచ్చిపోతూంటాయి. కెమెరా వర్క్ లో ఇక్కడే క్రియేటివిటీ కనిపిస్తుంది. కానీ వర్మ సినిమాలో దర్శకుడికి పనేముంటుంది- ఇందులో గిరి కృష్ణ కమల్ వర్క్ ఎంత?
—సికిందర్