రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఆగస్టు 2014, శుక్రవారం

సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
పాటల ఖర్చూ పోరాటాల రిస్కూ
తగ్గించవచ్చు!
యుగంధర్ తమ్మారెడ్డి- పిక్సెలాయిడ్ స్టూడియోస్ 
ఖండాంతరాలు దాటి వెళుతున్న తెలుగు సినిమాకి ఒట్టి స్టార్ డమ్ లు, హిట్ కాంబినేషన్లు, అత్యధిక ప్రింట్ లూ అనే సౌకర్యాలొక్కటే ఇప్పుడు సరిపోవడంలేదు బాక్సాఫీసులు బద్దలు కొట్టడానికి. ఇంకేదో కావాలి. ఏమిటది? ఇంకేమిటి, గ్రాఫిక్సే!
ఖర్చురీత్యా, రిస్కు రీత్యా, సౌలభ్యం రీత్యా కూడా ఇప్పుడు సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) టెక్నాలజీ నిత్యావసర వస్తువై కూర్చుంది. గ్రాఫిక్స్ లేని సినిమా తడిసి మోపెడవుతోంది-ఇది నిజం!

అది జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లోని ఓ కాంప్లెక్స్ మూడో అంతస్తులో ‘పిక్సెలాయిడ్’ సంస్థ కార్యాలయం. ఛాంబర్ లో సంస్థ యంగ్ ఎండీ యుగంధర్ తమ్మారెడ్డి తాము గ్రాఫిక్స్ సమకూర్చిన బిగ్ కమర్షియల్ సినిమాల క్లిప్పింగ్స్ చూపిస్తూ వెళ్ళారు. ‘రాజకుమారుడు’ దగ్గర్నుంచీ నేటి ‘ఖలేజా’ వరకూ మహేష్ బాబు సినిమాలన్నీ, ’నువ్వు-నేను’ దగ్గర్నుంచీ ‘కేక’ వరకూ తేజా సినిమాలన్నీ, ’గోలీమార్’తప్పించి పూరీ జగన్నాథ్ సినిమాలన్నీ, ‘బొమ్మరిల్లు’ దగ్గర్నుంచీ దిల్ రాజు సినిమాలన్నీ, పవన్ కళ్యాణ్  ‘జల్సా’, ‘కొమరంపులి’, రాం చరణ్  ‘మగధీర’, రానున్న ‘ఆరెంజ్’ సినిమాలు రెండూ, అలాగే అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’, ‘ఆర్య- 2’ రెండూ..ఇలా ఎన్నో చిత్రాల క్లిప్పింగ్స్...

“మగధీరలో ఓ వంద మందిని వధించే మేజర్ సీనుంది చూశారా, దాని సృష్టికి వేరే స్టూడియోకి మేమే హెల్ప్ చేశాం” అని చెబుతూ,  గ్రాఫిక్స్ లో కళాత్మక కోణం, సాంకేతిక కోణం అని రెండూ ఉంటాయనీ, యాక్షన్ దృశ్యాలకి రెండోదే ఆయువు పట్టవుతుందనీ వివరించుకొచ్చారాయన. మహేష్ బాబు ‘సైనికుడు’ కి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా ‘నంది’ అవార్డు నందుకున్న ఈయన సినిమా ప్రస్థానం పద్మాలయా స్టూడియోతోనూ, సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ ముడిపడి వుంది.

1997 లో పద్మాలయాలో ఎడిటర్ గా చేరిన ఈయన నిజానికి ఫోటోగ్రఫీలో ఫైనార్ట్స్ పట్టభద్రుడు. అప్పట్లో పద్మాలయాకే ప్రత్యేకమైన సిలికాన్ గ్రాఫిక్స్ మీద యానిమేషన్ చేయడం ప్రారంభించారు. సినిమా ట్రైలర్లూ వగైరా రూపొందిస్తూ,1999నాటికి మహేష్ బాబు నటించిన ‘రాజకుమారుడు’కి గ్రాఫిక్స్ ని సమకూర్చే స్థాయికి చేరుకున్నారు.

తర్వాత ముంబాయిలో ఓ బహుళ జాతీయ సంస్థలో అవకాశం వస్తే వెళ్ళారు. కానీ అప్పట్లో మనదేశానికి అవుట్ సోర్సింగ్ గా విదేశీ కంపెనీలు ‘లోఎండ్ వర్క్’ (మిగులు పని) ని మాత్రమే అప్పగించేవి. సృజనాత్మకతకి ఏమాత్రం వీలు లేని ఈ పనితో అసంతృప్తి చెంది, మహేష్ బాబు పిలుపు మేరకు తిరిగి హైదరాబాద్ వచ్చేశారు యుగంధర్. అప్పుడు మహేష్ బాబు నటించిన ‘నిజం’ కి గ్రాఫిక్స్ సమకూర్చి మెప్పు పొందారు. అప్పట్నించీ ప్రతీ అడుగులో మహేష్ బాబు అండదండలు ఈయనకు లభించాయి.

మహేష్ బాబే కాకుండా ఎస్.గోపాల రెడ్డి, రసూల్, తేజ, దిల్ రాజు, పూరీ జగన్నాథ్, కృష్ణ వంశీ మొదలైన వారి ప్రోత్సాహంతో చకచకా ఎదుగుతూపోయారు.


“తేజ తీసిన ‘నువ్వు-నేను’ తో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ హోదా వచ్చింది నాకు”-అని చెప్తూ, అప్పట్లో ‘పద్మాలయా విజువల్స్ స్ప్లెండర్’ లో తనతో పాటు పనిచేసిన వీఎఫెక్స్ ఎక్స్ పర్ట్ సయ్యద్ జునైదుల్లాతో కలిసి 2005 లో ఇప్పుడున్న ‘పిక్సెలాయిడ్’ ని స్థాపించానని వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా వర్ని పట్టణానికి చెందిన యుగంధర్ తమ్మారెడ్డి అంతటితో ఆగిపోలేదు. వైజాగ్ లోనూ బ్రాంచి ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పాతికమంది వరకూ సిబ్బంది పని చేస్తున్నారు. సినిమాలకి గ్రాఫిక్స్, యానిమేషన్స్ రూపొందించడం తో బాటు, వీడియో గేమ్స్ రూపొందించడం, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ కంపెనీల వారి డిజైన్లకి ప్రీ విజువలైజేషన్ వర్క్ చేయడం మొదలైనవి కూడా చేపడుతున్నారు.

ఇప్పటివరకూ తన గ్రాఫిక్స్ తో 50 వరకూ తెలుగు సినిమాలని మనోరంజకం చేసిన ఈయన ఒకటే చెప్తారు : గ్రాఫిక్స్ తో ఖర్చుకి ఖర్చూ, వృధాకి వృధా, రిస్కుకి రిస్కూ తగ్గించవచ్చు. అదెలాగంటే, పాటల చిత్రీకరణే తీసుకుంటే, లొకేషన్స్ కి వెళ్ళనవసరం లేకుండానే గ్రాఫిక్స్ తో కోరుకున్న నేపధ్యాన్నేకాదు, ఇంకా ఊహకందని అద్భుతాల్ని కూడా సృష్టించ వచ్చు. సెట్స్ విషయాని కొస్తే, నటుల మధ్య ఇంటరాక్షన్ మేరకే సెట్స్ వేసుకుంటే చాలు, మిగతా సెట్ పోర్షన్ అంతా గ్రాఫిక్స్ తో సృష్టించ వచ్చు. ఇక ఫైట్స్ లో వాహనాల పేల్చివేతలు, ఛేజింగ్స్ వగైరా రిస్కీ షాట్స్ ని కూడా గ్రాఫిక్స్ తో సృష్టించ వచ్చు. ఇందువల్ల షూటింగుల్లో ప్రమాదాలూ తగ్గుతాయి.

మరి ఇలాగైతే ఆర్ట్ డైరెక్టర్లూ, యాక్షన్ డైరెక్టర్లూ ఉపాధి లేకుండా పోతారేమోనని అడిగితే, అదేం కాదంటారు యుగంధర్. వాళ్ళ ప్రయాస ప్లస్ రిస్కూ మాత్రమే తగ్గుతాయంటారు.

ప్రస్తుతం ‘డాన్ శీను’ గ్రాఫిక్స్ వర్క్ పూర్తయి విడుదల కూడా అయ్యింది. ఇప్పుడు ఖలేజా, బృందావనం, గగనం, కొమరం పులి, ఆరెంజ్, మనసారా మొదలైన సినిమాలతో బిజీగా వున్న యుగంధర్ తమ్మారెడ్డి, ఏకకాలంలో ఎన్ని సినిమాలకైనా పనిచేయగలనని ధైర్యంగా చెప్పారు.

-సికిందర్
(ఆగస్టు -2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)