తెలుగు సినిమా
మలిస్వర్ణ యుగంలో ‘పాతాళభైరవి’ తర్వాత ‘దొంగరాముడు’ పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో
బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై డెబ్భై యేళ్ళు దాటింది. ఈ డెబ్భై
ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. సినిమాల్లో పదేళ్ళకో ధోరణి
(ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ
యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు.
దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి
తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. అప్పటి
దేశభక్తి ముందు ఇంకా అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత
జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది.
అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో, తొలివ్యాపార
యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం
లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి వ్యాపార యుగం గురించి చెప్పనవసరం
లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే పతనమైన విలువలు!
అయితే విలువలు
ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా
విలువలు తీసేస్తే? అప్పుడు ఇప్పటి మలి వ్యాపార యుగమైనా వ్యాపారంలా
వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరిగిపోతూ వుంటుంది.
నాటి మలిస్వర్ణ యుగం
సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా
సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో,
దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం.
పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి,
మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే;
మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి
గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా
అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక,
చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ
జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య,
ప్రేమ, వాస్తవిక, గూఢచారి,
కౌబాయ్, హార్రర్, క్రైం
థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు,
సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది
కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు,
తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ
కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే.
ఊత పదాలు సహా ఐటెం
సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక
పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’,
దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్
గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’ లాంటివి.
పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’ అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని
మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల
ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి,
సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక
ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే
చివరి అంకంలో.
'దొంగరాముడు' మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, చౌకబారు విలువల ప్రస్తుత మలి వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో - సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలుతోంది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు – ‘ఈ సర్కస్ అంతా ఓ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే...’ అంటూ పాట! ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.
‘రాజా సాబ్’ రాజ్ కపూర్ పాటలాగా మారేక కూడా, దర్శకుడు మారుతీ పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయని చెప్పుకుని ఆత్మవంచన చేసుకోకుండా, ఈ మలి వ్యాపార యుగపు దైన్యం గురించి సీరియస్ గా చింత చేయాల్సిన అవసరముందని గుర్తించాలి.
-సికిందర్
