రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, అక్టోబర్ 2020, మంగళవారం

984 : రివ్యూ


 

      దెయ్యాలున్నాయా లేవా? వున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని అవి స్వాధీనం చేసుకుని స్వాహా చేసేస్తాయి. తమ కథల్ని చెప్పనివ్వవు. మీడియా మేనేజ్ మెంట్. రాజకీయ నాయకుల నుంచి నేర్చుకున్నాయి. సైలెన్స్ ప్లీజ్... అని నోరూ చెవులు కూడా మూసేస్తాయి. నిశ్శబ్దం పాటించాలి. తమిళ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్స్ సృజనాత్మకతా పరంగా నిశ్శబ్దం పాటిస్తున్నాయి. అవి అదే అనాథాశ్రయంలో ఇద్దరు అనాథ బాలికల అవే పాత కథల్నుంచీ పదేపదే పేదగా పుట్టుకొస్తాయి. సమకాలీనంగా ఇంకే సమస్యలూ లేనట్టు. పదే పదే గత కాలంలోనే పేదగా జీవించే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి దెయ్యాల దర్బారు నుంచి విముక్తి లేదు. ఆ నిశ్శబ్దం కాస్తా నీరుగారి దెయ్యపు కచేరీలతో నిండిపోతుంది…  
    30 కోట్లు పెట్టి తీయాలనుకున్నప్పుడు మూడుండాలి : ఏం తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం, ఎలా తీస్తున్నామనే ప్రశ్నలు. కమర్షియల్ లాభ నష్టాలతో ముడిపెట్టి జవాబులు. పరమాద్భుత లొకేషన్స్, కళ్ళు చెదిరే తారాగణం, అదిరిపోయే ప్రొడక్షన్ విలువలు ఇవి కావు జవాబులు. ఇవి పోయే డబ్బులు వచ్చే డబ్బుల లెక్కలు కావు. పేపరు మీద రాస్తున్నప్పుడే వచ్చే డబ్బులా పోయే డబ్బులా తెలిసిపోకపోతే తీయడం మభ్యపెట్టుకోవడమే. మొదటి ప్రయత్నం తోనే మభ్యపెట్టుకున్నామని తెలుసుకోకపోతే ఆ అలసత్వానికి అంతం లేదు. దర్శకుడు హేమంత్ మధుకర్ 2010 లో హిందీలో తీసిన దెయ్యం సినిమా ఏ ఫ్లాట్ పరాజయం గురించి ఎవరేమన్నారో తెలిసీ అప్రమత్తమవక పోతే  మభ్య పెట్టుకునే నిశ్శబ్దాలు చాలానే వుంటాయి. 

    సస్పెన్స్ థ్రిల్లర్ అత్యంత సంక్లిష్ట జానర్. హిచ్ కాక్ అంతటి వాడికే పట్టుబడలేదు. తీసే ప్రతీ సస్పెన్స్ థ్రిల్లర్ అతడికి యాతనే. మూస ఫార్ములాలు చేస్తూ సరదాగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లాగిద్దామనుకుంటే సాగే పనికాదు. సస్పెన్స్ థ్రిల్లర్ ఫుల్ టైమ్ జాబ్. సస్పెన్స్ - క్రైమ్ జానర్లో తలపండిన వాడికి ఇతర జానర్లు నల్లేరు నడక. ఎందుకంటే కథలకి కావాల్సిన మనస్తత్వ చిత్రణ, భావోద్వేగాలు, సమయస్ఫూర్తి, కాలీన స్పృహ, లాజిక్, డైనమిక్స్ వంటి కథాంగాలు వొంటబట్టి వుంటాయి క్రైమ్ జానర్లో.

     నిశ్శబ్దం  తమిళంలో  సైలెన్స్  మొదట మాటలు లేకుండా మూకీగానే తీయాలనుకున్న ఆలోచన. మనసు మార్చుకుని మాటలు జోడించిన ప్రయత్నం. ఈ మాటలు జోడించడం మామూలుగా లేదు. మూకీ అనే మాటల అనావృష్టి నుంచీ అతి వృష్టి కురిపించే క్రియేటివిటీ. నటులకున్న మాటలు చాలనట్టు వాయిసోవర్ల కుండపోత. ఎవరి వాయిసోవర్ ఎందుకో అర్ధం కాకుండా సాంతం స్వగతాల జడివాన. డాక్యుమెంటరీ చూస్తున్నట్టు డైజెటిక్ సౌండ్. డైజెటిక్ సౌండ్, ఇంట్రా డైజెటిక్ సౌండ్ ఎప్పుడు ఎలా ఎందుకు వాడాలో తెలుసుకోకుండా శబ్ద గందరగోళం. కథలో ఏం జరుగుతోందో వంతులేసుకుని వ్యాఖ్యాతలు వివరిస్తే గానీ అర్ధంగాని పరిస్థితి వుంటే కథని శానిటైజ్ చేయాలి. దాని విజువల్ స్టోరీ టెల్లింగ్ నేచర్ కి వైరస్ సోకి వుంటుంది. సినిమా తీస్తే ఇతరులు నేర్చుకునేట్టు వుండాలి గానీ నేర్చుకున్నది పోయేట్టు వుండకూడదు.

    మరి నిశ్శబ్దం కర్ధమేమిటి? ఈ అర్ధమే పట్టుకోగలిగి వుంటే సినిమా ఎక్కడో వుండేది గ్లోబల్ చార్ట్ లో అనూష్కాని తళతళ మెరిపిస్తూ. ఇది జానర్ రీసెర్చి చేసుకుని ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో (1955) టెక్నిక్ తో తీయాల్సిన 41 మిలియన్ డాలర్ల స్టార్ మూవీ. జానర్ రీసెర్చా? అదేమిటి? అదేమిటో తెలియాలంటే వీధి బడి దశ నుంచీ సినిమా నేర్చుకుంటూ రావాల్సి వుంటుంది.

కథ 

        సాక్షి (అనూష్కా) మూగ చెవిటి పెయింటర్. తల్లిదండ్రులెవరో తెలీదు. యూఎస్ లో అనాథాశ్రయంలో పెరిగింది సోనాలీ (శాలినీ పాండే) తో బాటు. ఆమెకి సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీ నుంచి పిలుపు వస్తుంది. అక్కడ పెయింటింగ్ వేసి విజిటింగ్ కి వచ్చిన సెల్లో ప్లేయర్ ఆంథోనీ గోన్సాల్వేస్ (మాధవన్) ని ఇంప్రెస్ చేస్తుంది. తన కన్సర్ట్ కి అతనా హ్వానిస్తే వెళ్తుంది. అలా పరిచయం పెరిగి అతడికి పెయింటింగ్ నేర్పుతుంది, అతను మ్యూజిక్ నేర్పుతాడు. ఇక ప్రేమ పుడుతుంది. ఎంగేజిమెంట్ చేసుకుని అతణ్ణి తీసుకుని ఒక శిథిల విల్లాలో జోసెఫైన్ వుడ్స్ అనే ఆమె పెయింటింగ్ అన్వేషణలో బయల్దేరుతుంది. ఆ విల్లాలో 47 ఏళ్ల నుంచీ దాని ఓనర్ దెయ్యం వుంటుంది. అది వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపేస్తూంటుంది. ఇప్పుడు ఆంథోనీని కూడా చంపేస్తుంది. సాక్షి పారిపోతుంది. 

    సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) కేసు టేకప్ చేస్తుంది. ఆమెకి తోడుగా కెప్టెన్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) దిగుతాడు. అయితే విల్లాలో కేసుకి సంబంధించి ఆధారాలేవీ దొరకవు. మరోవైపు చూస్తే కొందరు యువతుల మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. సోనాలీ కూడా అదృశ్యమవుతుంది. సోనాలీని ఆంథోనీ హత్య కేసులో అనుమానిస్తుంది మహాలక్ష్మి. సొనాలీని వెతకడం మొదలుపెడుతుంది.

    ఇప్పుడు సోనాలీని ఎందుకనుమానించింది మహాలక్ష్మి? సోనాలీకున్న మానసిక సమస్యేమిటి? ఆంథోనీకి కూడా వున్న మానసిక రుగ్మతేమిటి? ఈ ఇద్దరి మధ్యా సాక్షి స్థానమేమిటి? విల్లాలో ఆమె చూసింది ఎంత వరకు నిజం? ఈ మొత్తం కేసులో కెప్టెన్ రిచర్డ్ పొందాలని చూసిన ప్రయోజనా లేమిటి? ఇదంతా మహాలక్ష్మి ఎలా పరిష్కరించి దోషిని తేల్చింది? ఇదీ మిగతా కథ.  
నటనలు- సాంకేతికాలు

         నటనల గురించి చెప్పుకోవాలంటే పాత్రల గురించి చెప్పుకోవాలి. పాత్ర చిత్రణల్లో లోపాలుంటే ఎంతటి నటనలూ మెప్పించలేవు. అనూష్కా సాక్షి పాత్ర అలాటి లోపాలున్న ఈ సినిమా పాత్రల్లో ప్రధానమైనది. దీంతో ఆమె నటన ఉపరితలంలోనే వుండి పోతోందే తప్ప ఇన్నర్ ఎమోషన్లు పలికే పరిస్థితి లేదు. అసలు ఇన్నర్ ఎమోషన్లు లేనట్టే వుంటాయి పాత్ర చిత్రణ, నటనా. సైన్ లాంగ్వేజీ, అప్పుడప్పుడు ఫోన్లో టైపు చేసి వాయిస్ ఇన్ఫర్మేషన్ వంటి ఉపకరణాల ద్వారా సాధారణ సమాచారాన్ని తెలుపుతుంది తప్ప, డ్రామాకి ముఖ్యమైన తన ఇన్నర్ ఎమోషన్స్ ని అర్ధమయ్యేలా చెప్పడంలో వుండే స్ట్రగుల్ తో కూడిన ఉద్విగ్నభరిత సన్నివేశాలుండవు. పోనీ బొమ్మవేసి చూపే ప్రయత్నం చేసే ఆడియెన్స్ ఫ్రెండ్లీ మెలోడ్రామా వుండదు. ఇన్నర్ ఎమోషన్సే లేనప్పుడు ఇక  అయ్యోపాపం అన్పించే స్ట్రగుల్ ఏ రూపంలోనైనా ఎందుకుంటుంది. అసలొక మూగజీవి అయిన సాక్షి లాంటి పెయింటర్ కి పెయింటింగ్సే తన భాష, మాధ్యమం కాకుండా పోతాయా? తనని కుదిపేస్తున్న భావోద్వేగాల్ని కుంచె ద్వారా ప్రకటించకుండా ఏ చిత్రకారుడుండ గలడు? లేనప్పుడు అలాటి పాత్ర ఎందుకు? సాక్షి మూగజీవి పాత్రకి లాగే ఆమె పెయింటరన్న వృత్తిపరమైన పాత్ర చిత్రణ కూడా లేదు. టెంప్లెట్ సినిమాల్లో టెంప్లెట్ పాత్రలాగే రెండు పెయింటింగు లేయించి గొప్ప పెయింటరని చెప్పి, పది మిలియన్ డాలర్లతో బ్రహ్మాండమైన బిల్డప్పిచ్చి వదిలేశారు. మళ్ళీ ఈ పాత్ర చిత్రణ తాలూకు కొనసాగింపే వుండదు. ఒకసారి బర్ఫీ లో రణబీర్ కపూర్ ని చూస్తే తెలుస్తుంది మూగజీవి సమగ్ర పాత్రంటే ఏమిటో.

పాత్రకి కథతోనే సమస్య 

        సమస్య ఎక్కడొచ్చిందంటే, అసలీ సస్పెన్స్ థ్రిల్లర్ కథ అనూష్కా పాత్ర కథ అని తెలుసుకోక పోవడం దగ్గర వచ్చింది. స్టార్ హీరోయిన్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ హంగామా తీస్తున్నప్పుడు ఆమె మీదే కథ వుండాలని కలం పుచ్చుకుని రాస్తాడు రచయిత. అంతేగానీ ఆమెని అవతలికి లాగేసి, ఇతర పాత్రలతో కథ గిల్లుకుంటూ కూర్చోడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అసలు కథే౦టో అర్ధం గాకపోతేనే. అందుకే ఇన్ని ఇతర పాత్రలతో ఇన్ని ఫ్లాష్ బ్యాకులు, వాళ్ళ వాయిసోవర్లు. కథతో అయోమయం వుంటేనే అర్ధం లేని ఫ్లాష్ బ్యాకులతో హడావుడి చేస్తారంటాడు సిడ్ ఫీల్డ్. 

    సెంట్రల్ క్యారక్టర్ గా అనూష్కా మీద కథా, పాత్రచిత్రణా ఎలా వుండి వుంటే అమెరికాలో తీసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్లో గ్లోబల్ ఎట్రాక్షన్ అయివుండేదో తర్వాత కథా కథనాలు విభాగంలో చూద్దాం.  

డిటో మాధవన్ 

      ఇక మాధవన్ గురించి. భారతీ రాజా దర్శకత్వంలో ఎర్రగులాబీ లు (సిగప్పు రోజాక్కల్ -  1980) లో కమలహాసన్ క్లాసిక్ సీరియల్ కిల్లర్ పాత్రని గుంజి నిశబ్దం లో గుంజీళ్ళు తీయించాడు. పుంజాలు తెంపుకుని పారిపోయింది పాత్ర. విశేషమేమిటంటే, ఇదే సీరియల్ కిల్లర్ కథని భారతీ రాజాయే రాజేష్ ఖన్నాతో హిందీలో రెడ్ రోజ్ గా తీస్తే అదీ సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఇంత కాలం తర్వాత ఐఎండీబీ లో ఇప్పటి ప్రేక్షకులు రెడ్ రోజ్ ని చూసి ఆహా ఓహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాటి థ్రిల్లర్ ని చూడలేదంటున్నారు అప్పటి రాజేష్ ఖన్నాని పొగుడుతూ. 

    నిశ్శబ్దం లోనే కెప్టెన్ రిచర్డ్ పోలీసు పాత్ర ఎక్కడిదనుకున్నారు? భారతీ రాజా థ్రిల్లర్ లోనే కమలహాసన్ / రాజేష్ ఖన్నా అమ్మాయిల్ని చంపుతూంటే చూసి ఎంజాయ్ చేసే సైకో పెంపుడు తండ్రి పాత్ర. మాధవన్ అమ్మాయిల్ని చంపుతూంటే రిచర్డ్ సహకరించడం డబ్బు కోసమన్నట్టుగా వుండదు. భారతీ రాజా థ్రిల్లర్లో తండ్రి పాత్రలాగా అతను సైకో అని మనమర్ధం చేసుకోవాలి. భారతీ రాజా థ్రిల్లర్ లోని కమల్ పాత్రని అదే కథతో మాధవన్ కథగా ముక్క అతికించి, అదే గొప్ప ఒరిజినల్ క్రియేషన్ అన్నట్టుగా చివర్లో సస్పెన్స్ రివీల్ చేశారు. 

    ఆంథోనీ పాత్రలో మాధవన్ కూడా డిటో అనూష్కా. కథ కుపయోగపడని అతడి సంగీతం. ఆ సంగీతంలో తనలో దాగున్న సీరియల్ కిల్లర్ భావోద్వేగాలున్నాయా అంటే లేదు. అమీర్ ఖాన్ సర్ఫరోష్ లో గజల్ గాయకుడి రూపంలో వున్న టెర్రరిస్టుగా నసీరుద్దీ న్ షా, పాడే పాటలో అంతరార్ధం పాత్ర నిజస్వరూపాన్ని తెలిసీ తెలీనట్టు ప్రకటిస్తుంది. ఇది కథ కాదు లో వెంట్రిలాక్విజం కళాకారుడైన కమల్ కూడా తన భావోద్వేగాల్ని వెంట్రిలాక్విజం ద్వారా ప్రకటిస్తాడుగా?

    మాధవన్ పాత్రకి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు యాదృఛ్ఛికంగా పెట్టేశారా లేక ఉద్దేశపూర్వకంగానా? ఆంథోనీ గోన్సాల్వెజ్ గోవాకి చెందిన సుప్రసిద్ధ సంగీత కారుడు. లక్ష్మీ కాంత్ - ప్యారేలాల్ లకి సంగీతం నేర్పిన గురువు. వాళ్ళ ఎన్నో పాటలకి ఆయనే స్ఫూర్తి. ఏకంగా ఆయన పేరే ప్రయోగించి అమర్ అక్బర్ ఆంథోనీ లో అమితాబ్ బచ్చన్ మీద మై నేమ్ ఈజ్ ఆంథోనీ గోన్సాల్వెజ్ అనే ఆల్ టైమ్ హిట్ పాట సృషించేశారు. అలాటి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు మ్యూజిషియన్ అయిన సీరియల్ సైకో కిల్లర్ కి వాడడం ఏమీ బాగాలేదు. ప్యారేలాల్ శర్మ ఇప్పటికీ ఆంథోనీని స్మరిస్తాడు. 

పొడిపొడి ప్రణయ బాంధవ్యం 

       ఇక మాధవన్ - అనూష్కాలు పరస్పరం తమ కళల్ని నేర్పుకునే  క్రమంలో కూడా రసపోషణ వుండదు. ఆకలిరాజ్యం లో కమల్ -శ్రీదేవిల మధ్య వున్నట్టు. శ్రీదేవి తాళం పాడితే కమల్ స్వరాలు కూర్చే పోటాపోటీ - ఆమె సంగీతమైతే అతను సాహిత్యంగా - కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే పాట లాగా. మాధవన్ సంగీతానికి అనూష్కా చిత్ర లేఖనం పోటీయో, లేదా అనూష్కా చిత్ర లేఖనానికి మాధవన్ సంగీతం పోటీయో లేకుండా కళాకారుల పాత్రలెందుకు? వీళ్ళు ప్రేమికులైనప్పుడు కళల సమాగం లేని అంటీముట్టని చిత్రణ లెందుకు? ప్రియుడే సంగీతము - ప్రియురాలే నాట్యము - అని  ఇది కథ కాదు లో కళాకారులైన కమల్, జయసుధ పాడుకున్నారుగా? మాధవన్ సంగీతం అనూష్కాకి వినపడని లోపంలోంచి మాధవన్ పడే వేదనాభరిత డ్రామా ఏది?

    ఇలా అనూష్కా, మాధవన్ - ఇద్దరు స్టార్స్ మీద ప్రణయంలో యూత్ అప్పీల్ ప్రవహించే కనీస ఎమోషనల్ బాండింగ్ కూడా లేకపోవడం కొట్టొచ్చే లోపం. ఇన్ని లోపాలతో తెరమీద ఈ స్టార్స్ ని చూసి ఎందుకు ఎంజాయ్ చేయాలి?

అంజలి పాత్రా గల్లంతు 

      ఇక అంజలి. దర్శకుడు ముందుగా అనుకున్న కథలో అంజలి పాత్ర లేదు. ఆమె స్థానంలో మగ పాత్ర వుంటే, కథ మేల్ డామినేషన్ తో వుందనిపించి మగ పాత్ర తీసేసి,  పోలీస్ డిటెక్టివ్ ని స్త్రీ పాత్రగా మార్చానన్నాడు దర్శకుడు. అయినా అనూష్కాతో బాటు అంజలి పాత్రనీ నీరుగార్చే చిత్రణలు చేశాడు. అంజలి పాత్రకి మహాలక్ష్మి పేరుకి అర్ధం పర్ధం, ప్రయోజనం లేవు. తెలుగు ప్రేమ సినిమాల్లో పెడుతున్న ఇంకో టెంప్లెట్ పేరుగానే మూలన పడింది. ఆంథోనీ పేరుతో అలా చేశారు. మహాలక్ష్మి పేరుతో ఏమీ చేయలేదు అమెరికా బ్యాక్ డ్రాప్ లో. తను పోలీస్ డిపార్ట్ మెంట్ కే గర్వకారణమైన విజయలక్ష్మిలా వుండదు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ మిథికల్ క్యారక్టర్ ని ప్లేచేసి విశ్వ గురు అంటున్నఇండియా ఖ్యాతిని పెంచాలను కోలేదు. పేరు గొప్ప పని దిబ్బ అన్నట్టు వుంది. 

    తగ్గట్టే స్టయిలిస్ట్ యాక్టింగ్ తో అసహజ ఇన్వెస్టిగేషన్. 47 ఏళ్లుగా దెయ్యం చంపుతూంటే ఆంథోనీని దెయ్యం చంపలేదని మొదటే ఎలా నిర్ధారించింది? సాక్షి ఫ్రెండ్ సోనాలీ కనిపించకపోతే ఆమె చంపినట్టా? ఇది వరకు దెయ్యం చేసిన హత్యలతో ఈ హత్యకున్న తేడా ఏమిటో కేసు పాత రికార్డుల్లో సైంటిఫిక్ ఎవిడెన్సు లతో నిగ్గు తేల్చిందా? దీని జోలికే పోలేదే. కథా సౌలభ్యం కోసం వూరికే సోనాలీని టార్గెట్ చేయడం వల్ల అసలు దెయ్యమనే మూల కథే ప్రశ్నార్ధకమైంది.

    సరే, చివరికి దెయ్యం చంపలేదనే తేలింది. మరి చంపుడు కార్యక్రమం పెట్టుకున్న దెయ్యం ఏమైంది? తన ముందు తను చంపాల్సిన ఆంథోనీని ఇంకెవరో చంపుతూంటే చూస్తూ వుందా? ఆంథోనీతో బాటు చంపడానికొచ్చిన వాణ్ణీ బోనస్ గా చంపుకుని దెయ్యం నెక్స్ట్ శాల్తీ కోసం కూర్చోవాలిగా? అసలు వచ్చిన మహాలక్ష్మితో బాటు పోలీసు టీమునీ సఫా చేసేయాలిగా? మహాలక్ష్మి లో గజలక్ష్మిని చూసి జడుసుకుందా అమెరికన్ దెయ్యం? ఇదే చూపించి వుంటే మోతెక్కి పోయేది అమెరికా!!

    కాబట్టి బిల్డప్ కోసం ఏదో దెయ్యం కలరిచ్చారు తప్ప, అసలు దెయ్యాముందా లేదా స్పష్టత లేదు కథకుడికి. కన్పిస్తున్న దెయ్యాలుగా పాత్రలే వున్నప్పుడు వేరే దెయ్యం అక్కర్లేదేమో. మహాలక్ష్మిగా అంజలి ఈ కేసులో తేల్చిందేమీ లేదు. చివరికి సుబ్బరాజే తన కథ చెప్పుకుని ఆంథోనీ హత్యా రహస్యం విప్పుతాడు ప్రేక్షకులకి. మహాలక్ష్మికి కాదు. కనీసం ఇంకో పనైనా చేయలేదు మహాలక్ష్మి - కెప్టెన్ రిచర్డ్ పోలీసుని చంపి కిందికి తోసేస్తాడు. ఆ శవం దగ్గర రిచర్డ్ వేసుకున్న బ్లేజర్ బటన్ దొరుకుతుంది మహాలక్ష్మికి. దాంతో ఆంథోనీ హత్యతో రిచర్డ్ కి సంబంధముందన్న విషయం తర్వాత, ముందు ఈ పోలీసు హత్యలో రిచర్డ్ రెడ్ హేండెడ్ గా దొరికిపోతే కిమ్మనదు. ధైర్య లక్ష్మి కూడా కాలేదు. రిచర్డ్ చేసిన ఈ పోలీసు హత్యని ప్రమాద వశాత్తూ మరణంగా నమోదు చేసిందేమో చూపించలేదు. అసలు అర్ధం కాని కథలో అనూష్కా లాగే తనూ గల్లంతైన పాత్రే. ఎవరెవరో ఫ్లాష్ బ్యాకులేసుకుని ప్రేక్షకుల నుద్దేశించి వాయిసోవర్లు చెప్తూంటే, వీటితో సంబంధం లేనట్టు హైఫై పోలీస్ డిటెక్టివ్ మాహాలక్ష్మి ఎక్కడుంటుందో తెలీదు. చివరికి ఆంథోనీ మిస్టరీ వెల్లడవడం కూడా తన మూలంగా జరగదు. తనుండదు. పూర్తిగా పాసివ్ క్యారెక్టర్.  
    *హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లక్ష్మీదేవిని పూజిస్తుందట!

        విదేశీయులు, ఇతర మతస్థులు కూడా హిందూ దేవుళ్లను ఆరాధిస్తుంటారు. అలాంటి వాళ్లలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఎన్నో హాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన సల్మా హయెక్ లక్ష్మీదేవిని పూజిస్తుందట. ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపైనే దృష్టి పెడుతుందట. ఈ విషయాన్ని సల్మా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. లక్ష్మీదేవి ఫొటోను కూడా పోస్ట్ చేసింది.  
       
`నేను నా అంత:సౌందర్యంతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు దేవత లక్ష్మీదేవిపై దృష్టి పెట్టి ధ్యానం చేస్తాను. హిందూ మతస్థులు ఆమెను సంపదకు, అదృష్టానికి, ప్రేమకు, అందానికి ప్రతినిధిగా భావిస్తారు. ఆమె చిత్రం నాకు చాలా సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. సంతోషం, ప్రశాంతత మన అంత:సౌందర్యానికి బాటలు వేస్తాయ`ని సల్మా పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు `అద్భుతం` అంటూ కామెంట్ చేసింది. 
ఆంధ్రజ్యోతి
, 9.10.20
అనాధల బ్యాచి 

     సాక్షి ఫ్రెండ్ సోనాలీగా శాలినీ పాండే అనాధాశ్రయంలో పదేపదే ఇలాటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో రిపీటవుతున్న పాత మూస పాత్ర. స్టార్ సినిమాల్లో హీరో ఎప్పుడూ బస్తీలో వుండే అనాథే- పేరు శీను గాడే అన్నట్టు - సస్పెన్స్ థ్రిల్లర్స్ లో హీరోయిన్, ఆమె నేస్తం అనాథాశ్రయంలో పడుండే అనాధలు! తెలుగు రాష్ట్రాల్లో యువతీ యువకులు దిక్కులేని అనాధలన్న మాట. ఇప్పుడు అమెరికా తీసికెళ్ళీ ఇదే పరాభవం. 

    సోనాలీకి సాక్షి మరెవరితో వుండకూడదనీ, తనతోనే వుండాలని పొసెసివ్ నెస్ చిన్నప్పట్నుంచీ. దీంతో పెద్దయ్యాక సాక్షితో క్లోజ్ గా వుంటున్నాడని అనుమానించి ఒకడి మీద  హత్యా యత్నం చేసి  జైలుకి కూడా వెళ్ళి వచ్చిన చరిత్ర. అమెరికన్ ప్రభుత్వం ఆమెకి మానసిక చికిత్స చేయకుండా మళ్ళీ దేశం మీదికి వదిలేసి నట్టుంది. ఈ పాత మూస టెంప్లెట్ పాత్ర నేటి కాలం పోకడలకి లెస్బియన్ అయి వుంటుందని ప్రేక్షకులు భావిస్తారన్న స్పృహలేదు కథకుడికి. పొసెసివ్ నెస్ వికటించి పొటెన్షియల్ కిల్లర్ గా మారిన సోనాలీతో ఇంకా ఫ్రెండ్ షిప్ ఏమిటో సాక్షికి. ఇది మరిన్ని హత్యలకి దారి తీసేందుకు తానే కారణమైందన్న పొరపాటు, సాక్షి పాత్ర సమూలంగా నెగెటివ్ అయిందన్నసంగతీ గ్రహించాడో లేదో కథకుడు. 

సుబ్బరాజు, మాడ్సెన్ సూపర్ స్టార్స్

        వీళ్ళిద్దరూ తమ పాత్రల్ని ఎంజాయ్ చేశారు, ఎలాటి బంధనాలు, సంకెళ్ళు లేవు. కానీ క్యారక్టర్ గ్రోత్ తో, వాళ్ళ సీక్రెట్స్ తో బ్యాంగు లిచ్చుకుంటూ పోయారు. సోనాలీని ప్రేమించిన వివేక్ గా సుబ్బరాజు తన గోడు సరీగ్గానే వెళ్లబోసుకున్నాడు. రివెంజ్ క్యారక్టర్ గా మారి కథ ముగించాడు. నీటు పాత్ర, క్లాస్ నటన. పోలీసు కెప్టెన్ గా మైకేల్ మాడ్సెన్ ది విలక్షణ నటన. రిజర్వాయర్ డాగ్స్’, కిల్ బిల్’, ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ వంటి 113 సినిమాల సీనియర్ నటుడు. భారతీరాజా థ్రిల్లర్ లోని పెంపుడు తండ్రి పాసివ్ పాత్రని, కెప్టెన్ గా యాక్టివ్ పాత్రగా పోషించి సైకో విలనిజాన్ని డీసెంట్ గా పోషించాడు. అనూష్కా, అంజలి పాత్రల్లా కాకుండా వీళ్ళిద్దరివీ సస్పెన్సుతో కూడిన పాత్రలు.

సాంకేతిక వైభవం
       
కథా వైభవం లేకపోయినా సాంకేతిక వైభవానికి కొదవ లేదు. కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే విత్తం కొద్దీ వైభవం. తెర నిండా డాలర్లు అతికించి నట్టుంది. రెండు డాలర్లు మనకిస్తే మందు బాటిల్ పక్కనుంచుకుని చూసేవాళ్లం. మందే కథని మరిపించ గలదు, స్నాక్స్ పని చెయ్యవు. 

    గోపీ సుందర్ సంగీతం, షానీల్ దేవ్ కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, చాడ్ బఫెట్ ఆర్ట్, నీరజా కోన కాస్ట్యూమ్స్, అమెరికన్ యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుత క్వాలిటీతో  పోటీపడుతూ వున్నాయి. దర్శకుడి కథా నిర్వహణే సక్సెస్ కి వేటు వేసింది.

సికిందర్  

(కథా కథనాల సంగతులు రేపు)