రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, జనవరి 2019, సోమవారం

726 : రివ్యూ



రచన – దర్శకత్వం : సౌమిక్ సేన్
తారాగణం : ఇమ్రాన్ హాష్మీ, శ్రేయా ధన్వంతరీ, స్నిగ్ధదీప్ ఛటర్జీ,
నిర్మాతలు : భూషణ్ కుమార్, తనుజ్ గార్గ్, పర్వీన్ హాష్మీ, మనూజ్ శర్మ తదితరులు  
సంగీతం : రోచక్ కోహ్లీ, గురు రణధావా తదితరులు, ఛాయాగ్రహణం : అల్ఫోన్స్ రాయ్
బ్యానర్స్ : టీ సిరీస్ ఫిలిమ్స్, ఎలిప్సిస్ ఎంటర్ టైన్మెంట్, ఇమ్రాన్ హాష్మీ ఫిలిమ్ ప్రొడక్షన్
విడుదల : జనవరి 18, 2019
***
        ర్డర్, గ్యాంగ్ స్టర్, జన్నత్ మొదలైన హిట్స్ తో ఓ వెలుగు వెలిగిన ఇమ్రాన్ హష్మీ, ఆ తర్వాత ఫ్లాప్స్ తో దాదాపు కనుమరుగయ్యే స్థితి కొచ్చాడు. మళ్ళీ మర్డర్- 4 లో నటిస్తే తప్ప వెలుగులోకి రాలేననుకున్నాడేమో ఆ ప్రయత్నంలో వున్నాడు. ఈ లోగా ‘వై చీట్ ఇండియా’ లో నటించి దీన్ని కూడా ఫ్లాప్ చేసుకున్నాడు. దీని గురించి చాలా గొప్పగా ఇంటర్వ్యూలిచ్చాడు. ఇంటర్వ్యూకి తగ్గట్టు ఓపెనింగ్స్ కూడా లేవు. స్టూడెంట్స్ గురించి తను చెప్పింది స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ ఎవరూ పట్టించుకోలేదు. ఇంతకీ ఏమిటి ఈ ‘వై చీట్ ఇండియా’? స్టూడెంట్స్ తో ఏం సంబంధం? స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు చూడాలి? ఎందుకు చూడకూడదు?...ఇది తెలుసుకుందాం. 

 కథ
 
     రాకీ (ఇమ్రాన్ హాష్మీ) ఇంజనీరింగ్ ప్యాసవలేక, తన అన్న డాక్టర్ అవడం చూసి, తనని ఫెయిల్ చేసిన విద్యావ్యవస్థ మీద కక్షగట్టి ఎంట్రెన్స్ మాఫియాగా మారతాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకి ఎంట్రెన్స్ రాసే విద్యార్థుల్ని టార్గెట్ చేస్తాడు. డబ్బున్న కుటుంబాల్లో  తెలివిలేని స్టూడెంట్స్ కి ఎరవేసి, వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుని, ఎంట్రెన్స్ లో ర్యాంకులు  సంపాదించిన డబ్బులేని తెలివైన స్టూడెంట్స్ చేత ఎంట్రెన్సులు రాయిస్తాడు. ప్యాసవలేని రిచ్ స్టూడెంట్స్ స్థానంలో ప్యాసైన పూర్ స్టూడెంట్స్ చేత ఎంట్రెన్సులు రాయించడానికి విద్యాశాఖాధికారులు కూడా కుమ్మక్కవుతారు. ఇలా రాకీకి చిక్కి ఎంట్రెన్సులు రాస్తున్న పేద విద్యార్థి సత్తు (స్నిగ్ధదీప్ ఛటర్జీ). ఇతడికి జబ్బుతో వున్న తల్లి, అప్పుల్లో వున్న తండ్రి, పెళ్లికున్న అక్క (శ్రేయా ధన్వంతరీ) వుంటారు. ఈ భారమంతా తనే మోయాలి. కాబట్టి రాకీ అందించే భారీ మొత్తాలు తీసుకుని పరీక్షలు రాస్తూంటాడు. ఇతడి అక్కతో రాకీ ప్రేమలో పడతాడు. సత్తు ఒక రెయిడింగ్ లో దొరికిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. రాకీ ఎంబీఏ పేపర్ లీక్ చేసిన కేసులో దొరికి పోతాడు. ఇప్పుడు రాకీ ఎలా సమర్ధించుకున్నాడు? ఇతడికి శిక్షపడిందా, విడుదలైపోయాడా?...ఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ
       కథలో విషయముంది, కథనం చేతగాలేదు. 2011 లో సీనియర్ దర్శకుడు ప్రకాష్ ఝా రిజర్వేషన్ల సమస్య మీద ‘ఆరక్షణ్’ తీశాడు. అమితాబ్ బచ్చన్ ప్రొఫెసర్ గా, సైఫలీ ఖాన్ దళిత విద్యార్ధిగా, దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించారు బాగానే వుంది. ఈ కథ ఫస్టాఫ్ వరకూ రిజర్వేషన్ల సమస్యతో సాగి, దీన్నేం చేయాలో అర్ధం గానట్టు, సెకండాఫ్ మొదలు కాగానే కాలేజీల్లో ఆర్ధిక అక్రమాల కథగా మారిపోయింది. ప్రేక్షకులందరూ నవ్వుకున్నారు. ఇలాగే ‘వై చీట్ ఇండియా’ కథతో కూడా ప్రేక్షకుల్ని  చీట్ చేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ ఎంట్రెన్స్ మాఫియాగా ఎత్తుకున్న కథని, సెకండాఫ్ మొదలుకాగానే ఎంబీఏ పేపర్ లీక్ స్కాముగా మార్చేశాడు. విద్యావ్యవస్థలో ఒక సమస్యతో ఒకే  కథ చేయలేక దైన్యంగా నిలబడ్డాడు.

ఎవరెలా చేశాడు
      ప్రతీ ఒక్కరూ 1980 లనాటి సినిమా అన్నట్టే చేశారు. ఒక్క ఇమ్రాన్ హాష్మీ తప్ప అందరూ కొత్త వాళ్ళే. ఇమ్రాన్ హాష్మీ హీరో స్టయిల్ @ 1980 లాగా వున్నాడు. పైగా ఒక మాఫియా అన్నట్టు గాక ఒక టీచర్ లాగా కన్పిస్తాడు. పాత్ర ఒకటైతే గెటప్ వేరు, నటన వేరు, డైలాగులు వేరు. ఒక చోట తనే అంటాడు, “నాకు హీరో అవ్వాలన్న కోరిక లేదు, విలన్ నయ్యే టైంలేదు” అని! మరెందుకు ఈ సినిమాలో వున్నట్టు? ఇంకో చోట, “నేను కిలాడీని, ఆటాడుకుంటున్నా, నమస్తే!” అంటాడు. ఏం ఆటాడుకున్నాడో అర్ధమేగాదు! ఇంకో చోట, “నాకు పై వాడి ఆశీస్సులున్నాయి, ఓన్లీ క్యాష్ తీసుకుంటా” అంటాడు. సహనిర్మాతగా దీనికి కలెక్షన్స్ వచ్చే ఆశీస్సులైతే లేవు ( తొలిరోజు ఆలిండియా బాక్సాఫీసు : కోటీ 70 లక్షలు). 

          సామాన్య యువతిగా కొత్త హీరోయిన్ శ్రేయ పాత్ర పాత సినిమా తరహా పాత్రయినా,  నటన బావుంది. రియలిస్టిక్ సినిమాలకి పనికొస్తుంది. ఆమె తమ్ముడి పాత్రలో కొత్త నటుడు స్నిగ్ధదీప్ ఫర్వాలేదు. పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో కొత్తనటుడు అమర్ తల్వాలా దృష్టినాకర్షిస్తాడు. ఐతే సమస్య ఎక్కడొచ్చిందంటే, అందరూ పాత సినిమా పాత్రలు నటిస్తున్నట్టు వుంటారు. కోర్టులో ప్రాసిక్యూటర్, జడ్జి పాత్రలేసిన నటులైతే నవ్వొచ్చేలా వున్నారు.   

          ప్రొడక్షన్ విలువలు చాలా సాధారణంగా వున్నాయి. లొకేషన్స్ ఆకర్షణీయంగా లేవు. ఆర్ట్ సినిమా పేద వాతావరణం కన్పిస్తూంటుంది. కమర్షియల్ విలువలు ఏ కోశానా కన్పించవు. దర్శకత్వం చాలా బలహీనం. స్టూడెంట్స్ సినిమా తీస్తున్నప్పుడు ఆ స్టూడెంట్స్ ని ఆకట్టుకునే యూత్ అప్పీల్ ఏ మాత్రం లేదు.

చివరికేమిటి 
     ఈ సినిమా దేశంలో పెద్ద చర్చ లేవదీస్తుందన్నాడు ఇమ్రాన్. పదహారేళ్ళుగా నటిస్తున్నా, ఏ సినిమా చర్చలేవదీసి రచ్చ చేస్తుందో కూడా తెలుసుకోనట్టుంది. మొదలెట్టిన కథ మధ్యలో వదిలేసి, ఇంకో కథకి శ్రీకారం చుట్టి - కళ్ళల్లో కారం కొట్టిన సంగతి కూడా తెలీడం లేదు. దర్శకుడు సౌమిక్ సేన్, బాలీవుడ్ కథల స్థాయి పెంచిన ఇటీవలి బెంగాలీ దర్శకుల ముందు తీసికట్టుగా తయారయ్యాడు. కథ, కథనం, దర్శకత్వం ఇంత హాస్యాస్పదంగా వుండడం – అదీ ఒక బర్నింగ్ టాపిక్ విషయంలో- చాలా విచారకరం. మరింకో దర్శకుడైతే ఈ విద్యార్ధి లోకం కథని విద్యార్ధులు క్యూ కట్టేలా తీసేవాడు. ఈ సినిమా ఎవరికోసమన్న సృహ కూడా దర్శకుడికి లేదు. 

          ఫస్టాఫ్ లో ఎంట్రెన్స్ స్కాము కథలో ఏకపక్షంగా ఇమ్రాన్ కార్యకలాపాలే (ఇవి అప్పుడప్పుడు తోచినప్పుడు చేస్తూంటాడు) తప్ప- అవతల తను టార్గెట్ చేసిన పేద, ధనిక వర్గాల విద్యార్ధుల వైపు నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచీ కథ చెప్పడు – ఒక్క సత్తు  అనే పేద విద్యార్టి తల్లిదండ్రులతో తప్ప.  ఎంట్రెన్స్ రాయడానికి తమ పిల్లలతో కోలాహలంగా వచ్చే తల్లిదండ్రుల్ని చూపించడం వరకే చేస్తాడు. చదువులంటే ఇంజనీరింగ్, మెడిసిన్లే అన్న ధోరణిలో తల్లిదండ్రుల ప్రవర్తన చూపించే జోలికిపోడు. పేద విద్యార్ధి సత్తు తల్లిదండ్రులు డబ్బుల కోసం మాఫియాకి లొంగడం కూడా పొసగదు. ఇంట్లో చదివించే పరిస్థితులు లేకపోయినా కష్టపడి చదివి, 276 వ ర్యాంకు సంపాదించిన కొడుకుచేత దొంగ పరీక్షలు రాయించి చెడగొట్టడమేమిటో, నేరస్థుడై ఆత్మహత్య చేసుకునేలా చేయడమేమిటో అర్ధం గాదు. దీనివల్ల పిల్లలతో తల్లిదండ్రుల అమెరికా కలలు అన్న పాయింటే ఎగిరిపోయింది! ఈ పాయింటు సినిమా ప్రారంభంలోనే చెప్తాడు. 

          ఈ మధ్య చదువుల మీద వచ్చిన ఒక తెలుగు సినిమాలో చూపించినట్టు, ఇంట్లో కూతురున్నా ఆమె చదువు ముఖ్యం కానట్టు, కొడుక్కే ముద్దు చేస్తూ, అన్నీ సమకూరుస్తూ చదివించే తల్లిదండ్రుల్లాగా, ఇక్కడా సత్తు తల్లిదండ్రులుంటారు. బేటీ బచావో లేదు, బేటీ పడావో లేదు అనాగరిక సినిమాలకి. తల్లిదండ్రులు వివక్ష చూపిస్తున్నారని తమ్ముడి మీద ఆ అక్క ఈర్ష్యాసూయలు పెంచుకోవాలి నిజానికి. అదేం జరగదు. దొంగ పరీక్షలు రాయించక ముందు బావున్నప్పుడు, ఆ తల్లిదండ్రులు సత్తుని తెల్లారక ముందే నిద్ర లేపి హడావిడీ చేస్తూ చదువుకోవడానికి పుస్తకాలు సర్దడం, పాలల్లో హార్లిక్స్ కలిపి ప్రత్యేకంగా తాగించడం ( బాగా కలిపావా? అడుగున పౌడర్ వుంటుంది – అని తల్లితో తండ్రి ప్రత్యేకమైన డైలాగు
), ఇంట్లో ఆడపిల్ల చూస్తోందన్న స్పృహే లేకపోవడం... పౌష్టికాహారం, మంచి చదువు, బట్టలు మగ పిల్లలకే అన్నట్టు వుంటుంది.

          ఇలా చూసుకుని ప్రయోజకుడైన కొడుకుతో దొంగ పరీక్షలు రాయించడమేమిటో అర్ధంగాదు. తమ్ముడితో ఇలా చేయిస్తున్న మాఫియాతో అక్క ప్రేమలో ఎలా పడుతుందో అర్ధం గాదు. తమ్ముడు ఆత్మ హత్య చేసుకోగానే పగబట్టి, వేరే ఎంబీఏ పేపరు లీకు కేసులో పట్టిస్తుంది. ఆ మాఫియా ఇంట్లో డబ్బులిస్తూ, తమ్ముడితో దొంగ పరీక్షలు రాయిస్తున్నప్పుడు ఏమీ అనదు. 

          ఫస్టాఫ్ ఈ ఎంట్రెన్స్ కథ ఆగిపోయి, సెకండాఫ్ మాఫియాగారు ఎంబీఏ పేపరు లీక్ చేసే వేరే కథకి  వెళ్ళిపోతారు. ఇంటర్ స్థాయి టీనేజీ ఎంట్రెన్స్ కథ కాస్తా డిగ్రీ స్థాయి ఎంబీఏ కథగా మారిపోతుంది. మాఫియా దొరికిపోయి సమర్ధించుకునే మాటలు కూడా గొప్పగా వుంటాయి. సంపన్న విద్యార్దుల నుంచి డబ్బు తీసుకుని, పేద విద్యార్ధుల కిచ్చి పరీక్షలు రాయంచడం తప్పెలా అవుతుందంటాడు. ఈ వాదన నిలబడకపోయినా, ఇంత విశాల హృదయంతో రాలేదు తను. తనని ఇంజనీరింగ్ ఫెయిల్ చేసిన వ్యవస్థ మీద కక్షతో వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చుండాలి తన గతం ప్రకారం. దీనికి కూడా అర్ధం లేదు. ఇలా అన్ని కోణాల్లో బలహీన సినిమా తీసి మేధావి అన్పించుకోవాలను కున్నాడు. ముగింపులో వివిధ పత్రికల గణాంకాలతో కూడిన కటింగ్స్ అర్ధం లేకుండా. డబ్బున్న దద్దమ్మ స్టూడెంట్స్ దగ్గర డబ్బుతీసుకుని,  మాస్ కాపెయింగ్ తో పాస్ చేయించి, ఆ డబ్బుతో పేద విద్యార్ధుల్ని చదివిస్తే, కొత్త బ్రాండ్ రాబిన్ హుడ్ అయ్యేవాడేమో!

సికిందర్
https://telugurajyam.com/