రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఆగస్టు 2014, శనివారం



సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
5 డీ ని పర్సనలైజ్ చేసుకోవాలి !
 దర్శకుడు మారుతి 


 రానున్న అయిదేళ్ళలో తెలుగులో డిజిటల్ సినిమాలే ఉంటాయనీ, ముడి ఫిలిం పూర్తిగా అదృశ్యం అయిపోతుందనీ గత సంవత్సరం వ్యాఖ్యానించారు సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాలరెడ్డి. అప్పుడాయన మంచు విష్ణుతో తెలుగులో తొలి బిగ్ బడ్జెట్ డిజిటల్ సినిమా చిత్రీకరిస్తున్నారు. రెడ్ కెమెరాతో ఆయన చిత్రీకరిస్తోంటే ప్రతి నిత్యం ఆయన్ని సంప్రదించి సందేహాలు తీర్చుకునేవారు ఇతర సినిమాటోగ్రాఫర్లు. ఫలితాల్ని వెండి తెర మీద చూస్తే మీకే అర్ధమవుతుందని ఆయన ధైర్య వచనాలు పలికేవారు. సినిమా విడుదలైంది. చూసి ధైర్యం తెచ్చుకున్నారు సదరు సినిమాటోగ్రాఫర్లు.

డిజిటల్ మూవీ మేకింగ్‌ని ఒక ఉద్యమంగా దేశ విదేశాల్లో ప్రచారం చేస్తున్న డిజి క్వెస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు బసిరెడ్డి కూడా తెలుగులో వేళ్ళమీద లెక్కించదగ్గ సినిమాలవరకే డిజిటలీకరణని తీసుకు వెళ్ళగలిగారు. నిర్మాణ వ్యయం తగ్గిపోయే డిజిటల్ సినిమాలంటే చిన్న నిర్మాతలకెందుకో అంత భయం.

అప్పుడు రాంగోపాల్‌వర్మ దొంగల ముఠాఅనే సినిమాని 5డీ కానన్ కెమెరాతో అయిదు రోజుల్లో ప్రయోగాత్మకంగా తీసి సంచలనం సృష్టించారు. డిజిటల్ అంటే ఖరీదైన రెడ్ కెమెరా అనుకుంటున్న వర్గాలకి ఈ కానన్ 5డి సాధారణ కెమెరాతో వర్మ సినిమా తీసి చూపించడం కూడా ధైర్యాన్నివ్వలేదు. ఆ ధైర్యం, ఆ స్ఫూర్తి ఒక్కరికే కలిగింది.. ఇవి కలిగేందుకు ఇంకెటువంటి అనుమానాలూ అడ్డుపడలేదు. అయితే ఈ ధైర్యం, ఈ స్ఫూర్తి కలిగిన వెంటనే వర్మ పరిచయంచేసిన కేవలం మూడు లక్షల రూపాయల కెమెరా చేత బట్టుకుని పొలోమని పరుగులు తీసి ఓ సినిమాని అడ్డంగా చుట్టి పారేయ్యలేదు. ఆ కెమెరామీద కూడా తనదైన పరిశోధన చేసి పరిచయంచేసిన వర్మకే కళ్ళు తిరిగే ఫలితాలతో సినిమాని హిట్‌చేసి కూర్చున్నారు... దటీజ్ మారుతి ఆఫ్ ఈ రోజుల్లోఫేమ్ దర్శకుడు!


వర్మ కేవలం నాలుగైదు రోజుల్లో సినిమా తీయవచ్చని నిరూపించేందుకే దొంగల ముఠా తీశారు. దాన్ని అంతవరకే చూడాలి, టెక్నికల్ ఫలితాలతో కలిపి చూడకూడదనిపించింది.. అందుకే ఆ కెమెరాని మా సబ్జెక్ట్ కి అనుగుణంగా మార్చుకునేదాని మీదే దృష్టిపెట్టి విజయం సాధించాం. ఈ విజయానికి స్ఫూర్తినిచ్చిన రాంగోపాల్‌వర్మకి ఎంతైనా రుణపడి వుంటాంఅన్నారు ‘వెన్నెల’ కిచ్చిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మారుతి.

5డీ కెమెరా మీద దృష్టిపెట్టడం గురించి ఫీల్డులో రకరకాల కథనాలు విన్పిస్తున్నాయి. ప్రయోగాలుచేసి రెండు కెమెరాలు పాడుచేసుకున్నారనీ, సాఫ్ట్ వేర్ మార్చారనీ...అయితే సాఫ్ట్ వేర్ మార్చలేదంటారు మారుతి. కేవలం తీయాలనుకుంటున్న సబ్జెక్ట్ కి అనుగుణంగా లెన్సులు మార్చామన్నారు. అదెలా? ఎలాగంటే, కానన్ కెమెరాతో వచ్చిన లెన్స్ తో తీస్తే పిక్చర్ బ్యాక్‌గ్రౌండ్ బర్న్ అవుతోంది. అంతేకాదు, మార్నింగ్ షూట్ చేస్తే ఒక రకంగా, ఈవెనింగ్ ఇంకో  రకంగా వస్తోంది.. ఈ సమస్యని అధిగమించేందుకు కెమెరామాన్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి లెన్సుల మీద పరిశోధనలు చేశామన్నారు మారుతి. చివరికి అమెరికానుంచి తప్పించిన వేరే లెన్సులు అనుకున్న రిజల్ట్స్ నిచ్చాయన్నారు.


‘‘
ఏ కెమెరాకైనా లెన్సులే ప్రధానం. ఉన్నదున్నట్టు కానన్ కెమెరాతో తీస్తే సినిమాలో మీరు చూస్తున్న క్వాలిటీ వచ్చేది కాదు. కథ ఎంత బావున్నా చిత్రీకరణ సినిమా చూస్తున్న ఫీలింగ్‌నివ్వకపోతే అది హిట్‌కాదు. మా విషయంలో హిట్ అయ్యిందంటే అది పర్సనల్‌గా మేం రూపొందించుకున్న కెమెరావల్లే సాధ్యమయింది.’’ అని ఆనందం వ్యక్తంచేశారు.

‘‘
ఈ రోజుల్లో’’ సినిమాలో చూస్తే రిచ్ లొకేషన్స్ కనిపిస్తాయి. అభివృద్ధి చెందుతున్న శివారు హైదరాబాద్ (సైబరాబాద్) కట్టడాల మధ్య, అవుటర్ రింగ్ రోడ్ మీదా, అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ, విలాసవంతమైన అపార్ట్‌మెంట్లలోనూ ఒక పెద్ద బడ్జెట్ సినిమా చూస్తున్నట్టు దృశ్య వైభవం కనిపిస్తుంది. ఇదంతా యాభయి లక్షల వ్యవహారమే అంటే నమ్మబుద్ధికాదు. అమర్చుకున్న లెన్సులు ఇచ్చిన ఎఫెక్ట్. థియేటర్‌లో హైక్వాలిటీ వచ్చింది. కలర్ కరెక్షన్ అవసరం కూడా అంతగా రాలేదు. గ్రేడింగ్ పేరుతోనో, డిఐ పేరుతోనో వేరే కలర్స్ ని కృత్రిమంగా అద్దలేదు. ఇదంతా ఒకెత్తుఐతే లైటింగ్, ఆర్ట్ డైరెక్షన్ ఒకెత్తూ. గదుల్ని ముస్తాబు చేసేందుకు వాడిన సెట్ ప్రాపర్టీస్ లైటింగ్ స్కీంతో మ్యాచ్ అయి మనోహరమైన భావాల్ని రేకెత్తిస్తాయి. స్వాభావికంగా మారుతి యానిమేటర్ అవడంవల్లే ఇది సాధ్యమైంది. సైన్సుని, సృజనాత్మకతనీ కలగలిపి అడుగడుగునా మనోనేత్రంతో చూస్తే గానీ ఓ మామూలు కానన్ కెమెరాతో ఈ తరహా మెయిన్‌స్ట్రీమ్ అవుట్‌పుట్ సాధ్యంకాదు.
మరైతే రేపు ఇదే స్ఫూర్తిఅయి మరిన్ని ఇలాంటి క్వాలిటీ సినిమాలు కానన్ కెమెరాతో తీస్తే రెండు కోట్ల ఖరీదైన రెడ్ డిజిటల్ కెమెరా పరిస్థితి ఏమవుతుంది?


దీనికి సూటిగా సమాధానం చెప్పకుండా ‘‘సినిమాని ఏ కెమెరాతో తీశారని ప్రేక్షకులు చూడరు. బాగా వచ్చిందా లేదా అనే చూస్తారు. ఎంత ఖరీదయిన కెమెరా అన్న ప్రశ్నే రాదు.’’ అనేశారు.

 ఈరోజుల్లోఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు 5డి కెమెరా - ఫఫ్టీలాక్స్ బడ్జెట్ స్కీము తో అనేకమంది అరంగేట్రం చేస్తున్నారు. వాళ్ళందరికీ మారుతి ఇటీవల డైరక్టర్స్ అసోసియేషన్ ఇంటరాక్షన్ క్లాసులో చేసిన హెచ్చరికే మరోసారి చేశారు. తీస్తున్న సబ్జెక్ట్ ఎలాంటి చిత్రీకరణని డిమాండ్ చేస్తోందో 5డి కెమెరాని అలా మార్చుకోవాలి. ముఖ్యంగా సినిమా బ్లాకులు పెట్టడం నేర్చుకోవాలి. సినిమాకి, టీవీకి, షార్ట్ ఫిలిమ్స్ కీ వేర్వేరు షాట్ కంపోజిషన్‌లుంటాయి. ఈ కెమెరాని సినిమాకి వాడుతున్నందువల్ల ఈ తేడా గమనించి బ్లాకులు పెట్టుకోవాలి. ఇండోర్లో ఎలా వస్తోంది, అవుట్‌డోర్లో ఎలా వస్తోందీ ఒకటికి రెండుసార్లు టెస్ట్ షూట్‌లు చేసుకుని చూసుకోవాలి. ఏదీ లేకుండా బ్లయిండ్‌గా వెళ్తే దెబ్బతినిపోతారు. ఎవరికి  వారు దీన్ని ప్రత్యేక కేసుగా తీసుకుని ఆ ప్రకారం తగిన మార్పుచేర్పులు చేసుకోకపోతే, ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, డిజిటల్ సినిమాలంటేనే ప్రేక్షకులకి అసహ్యమేసి దీని కథ అంతటితో ముగిసిపోతుంది.

మరిప్పుడు మారుతి కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నారు? హిట్ చేసిన ప్రతీ  కొత్త దర్శకుడికి లాగే తనూ పై మెట్టు ఎక్కేశారు. టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ నుంచి ఆఫర్ వచ్చింది... కానీ అది డిజిటల్ సినిమా కాదు, సాంప్రదాయ ముడి ఫిల్మే. ఇక తను ఇన్నోవేట్ చేసిన డిజిటల్‌ని వదిలేస్తారా? –అంటే, అలాంటిదేం లేదనీ .. శిష్యుడికి బస్టాప్అనే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు ఇచ్చి ఇదే ఈరోజుల్లోస్కీముతో డిజిటల్‌లో తీయించబోతున్నాననీ చెప్పుకొచ్చారు.  కాకపోతే ఈసారి ఇంకాస్త ప్రయోజనకరంగా వుండే  టీనేజర్స్ - వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ప్రస్తుత కాలంలో నలుగుతున్న సమస్యల గురించీ!

-సికిందర్
(అక్టోబర్ 2013 ‘ఆంధ్రభూమి వెన్నెల’ కోసం)