రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 23, 2025

1365 : రివ్యూ!


  

దర్శకత్వం : ఎం.సి. జితిన్
తారాగణం : నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్, అఖిలా భార్గవన్, మెరీన్ ఫిలిప్, పూజా మోహన్రాజ్, మనోహన్ జాయ్, జననీ రామ్, సరస్వతీ మీనన్, హెజ్జా మెహెక్, దీపక్ పెరంబోల్, కొట్టాయం రమేష్, సిద్ధార్థ్ భరతన్ తదితరులు.
స్క్రీన్ ప్లే :  అతుల్ రామచంద్రన్, లిబిన్ టి.బి.
సంగీతం : క్రిస్టో జేవియర్, చాయాగ్రహణం : శరణ్ వేలాయుధన్ నాయర్, కూర్పు : చమన్ చాక్కో
బ్యానర్స్ : ఏవీఏ ప్రొడక్షన్స్, హేపీ అవర్స్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు : ఏవీ అనూప్,షైజూ ఖలీద్, సమీర్ తాహిర్
స్ట్రీమింగ్ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
***
      లయాళ దర్శకుడు ఎం. సి. జితిన్ 2018 లో నాన్సెన్స్ అనే నాన్సెన్సికల్ సినిమా తీసి మళ్ళీ అవకాశం కోసం ఆరేళ్ళూ నిరీక్షించి, 2024 లో సూక్ష్మదర్శిని తీసి వార్తల కెక్కాడు. సినిమా తీయగల క్రియేటివిటీ ఎవరి స్థాయిలో వాళ్ళకి అందరికీ వుంటుంది. క్రాఫ్ట్ ఎందరి కుంటుంది? క్రాఫ్ తో ఇంటలిజెంట్ రైటింగ్, ఇంటలిజెంట్ మేకింగ్ అన్నవి ఎందరికి తెలుసు? సినిమా తీస్తే ఎవరైనా కొత్తగా వచ్చే మేకర్లు అందులోంచి  నేర్చుకునేలా వుండాలా వద్దా? ప్రేక్షకులకి కొత్త అనుభూతినివ్వాలా వద్దా? మరెందుకు తీయడం? ఇలాటి ఆలోచనల్ని రేకెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళం నుంచి వచ్చి హిట్టయ్యింది. ఇది ఎన్ని విధాలా ప్రత్యేకమో చూస్తే, వచ్చీ రావడంతోనే డొనాల్డ్ ట్రంప్ వంద ఆర్డర్ల మీద సంతకాలు పెట్టేసి సంచలనం రేపినంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రతీ ఆర్డరు మీద ట్రంప్ సంతకంలాగే, ప్రతీ సీను మీదా బల్లగుద్ది దర్శకుడు పెట్టిన సంతకమే. సీన్లని ఆమోదిస్తూ చూసుకుంటూ పోవడమే.  పోతున్న కొద్దీ ఈ కింది కథ ద్వారా బయటపడే షాకింగ్ నిజాలెన్నో... బ్రేకింగ్ న్యూసు లెన్నో... ఈ సారి దర్శకుడి నాన్సెన్స్ మాత్రం కాకుండా!

కథ

    కేరళలోని ఓ పట్టణానికి దూరంగా సబర్బన్ ఏరియాలో ప్రియదర్శిని అలియాస్ ప్రియా (నజ్రియా నజీమ్) ఉద్యోగి అయిన భర్త ఆంథోనీ (దీపక్ పెరంబోల్) తో, కూతురు (హెజ్జా మెహక్) తో వుంటుంది. ఇంటి దగ్గర బోరు కొట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటుంది. పొరుగున స్టెఫీ (మెరీన్ ఫిలిప్) అనే ఫ్రెండ్ వుంటుంది. ప్రశాంత వాతావరణంలో జీవితం గడుస్తూంటుంది. ఇంతలో బేకరీ నడుపుతున్న మాన్యూయేల్ (బాసిల్ జోసెఫ్) అనే అతను తల్లి గ్రేస్ (మనోహరీ జాయ్ గ్రేసీ) తో వచ్చి ఎదురింట్లో దిగుతాడు. అతడి ప్రవర్తన విచిత్రంగా వుండడంతో ప్రియా కనిపెడుతూంటుంది. అతను ఉడుంని పట్టి తీసికెళ్ళి బీఫ్ అని చెప్పి ఫ్రెండ్స్ కి వండి పెడితే ప్రియాకి అతడి మీద అనుమానాలు పెరిగిపోతాయి. కిచెన్ లో కిటికీ లోంచి అతడింటి వైపు చూస్తూ అన్నీ కనిపెడుతూంటుంది.

మాన్యూయేల్ తల్లి గ్రేస్ ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడు చూసినా ఎటో చూస్తూ కూర్చుని వుంటుంది. ఒకరోజామె ఇంట్లో కనపడదు. ఎటెళ్ళిపోయిందో నని కంగారుపడి వెతికి తీసుకొస్తాడు మాన్యూయేల్. ఇతడి మామ రాయ్ (కొట్టాయం రమేష్), మరో బంధువు న్యూరో సర్జన్ డాక్టర్ జాన్‌ (సిద్ధార్థ్ భరతన్) ఇందుకు తోడ్పడతారు. ఆమెకి అల్జీమర్స్ (మతిమరుపు) వుందని నిర్ధారణ అవుతుంది. అయితే ఆమె తన రోజువారీ పనులు సమర్ధవంతంగా నిర్వర్తించడం, ఇరుగుపొరుగుతో కలిసి మెలసి వుండడం చూస్తూంటే, ఆమె అల్జీమర్స్ వ్యాధి పీడితురాలని నమ్మకం కలగదు ప్రియాకి. ఇంతలో మళ్ళీ కనిపించకుండా పోతుంది గ్రేస్.
        
ఇది తెలుసుకుని న్యూజీలాండ్ లో వుంటున్న మాన్యూయేల్ సోదరి డయానా (జననీ రామ్) వచ్చేస్తుంది. పోలీసు సెర్చింగ్ లో గ్రేస్ ఎక్కడా దొరకదు. తల్లి కనిపించడం లేదన్న ఆందోళన ఏ కోశానా లేని మాన్యూయేల్, డయానాల ప్రవర్తన ప్రియాకి మరిన్ని అనుమానాలని పెంచుతుంది. ఇంతలో వున్నట్టుండి డయానా తిరిగి న్యూజీలాండ్ కి బయల్దేరుతూంటే, ప్రియా తనని పరిచయం చేసుకుని డయానా ఫోన్ నంబర్ అడిగి తీసుకుంటుంది.
        
డయానా వెళ్ళిపోయాక పోలీసులకి గ్రేస్ దొరుకుతుంది. ప్రియా డయానాకి కాల్ చేస్తే అవుటాఫ్ రీచ్ మెసేజ్ మలయాళంలో విన్పించేసరికి ప్రియా ఆలోచనలో పడుతుంది. డయానా న్యూజీలాండ్ వెళ్ళిపోతే మెసేజ్ మలయాళంలో విన్పించడమేమిటి? మళ్ళీ తర్వాత ఎసెమ్మెస్ వస్తుంది. దీంతో డయానా సెల్ ఫోన్ డయానా దగ్గర లేదని, మాన్యూయేల్ దగ్గర వుందనీ, అతనే డయానాలాగా మెసేజులిస్తున్నాడనీ అర్ధమవుతుంది ప్రియాకి.
        
ఏమిటీ దీనర్ధం? డయానా ఏమైంది? డయానాలాగా మాన్యూయేల్ ఎందుకు నటిస్తున్నాడు? ఆసలతను ఏం చేయబోతున్నాడు? లేదా ఈ పాటికి చేసేశాడా? ఈ వేధించే అనుమానాలతో ప్రియా కనుక్కున్న అసలు నిజాలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

    ఆనర్ కిల్లింగ్స్ బయటి ప్రపంచంలో కత్తులు కటార్లతో, నడిబజార్లో బరితెగించి భీకరంగా జరుగుతూంటాయి. నార్త్ లో ఖాఫ్ పంచాయత్ లలో నైతే  తుపాకీ గుళ్ళతో ఠపీమని జరుగుతాయి. సినిమాలో గుట్టుగా, నీటుగా జరుగుతాయి. ఇదే షాకింగ్ గా వుంటుంది.  'మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్' లో లాంటి పెద్దావిడ (మిషెల్ ఫీఫర్)  మలయాళ సినిమాలోకి దిగి వస్తే?ఆనర్ కిల్లింగ్ ప్లానింగ్ ఎంత ఇంటలిజెంట్ గా, ఇంటలెక్చువల్ గా వుంటుంది?  దీనికి ఈ 'సూక్ష్మదర్శిని' యే సమాధానం.
       
ఈ కథకి ప్రధానంగా కావాల్సింది సస్పెన్స్ థ్రిల్లర్ వాతావరణం పెల్లుబికే మార్మికమైన లొకేషన్. ఈ మార్మికమైన లొకేషన్ బాగా కుదిరి కథకి డెప్త్ ని తీసుకు వచ్చింది. లొకేషన్ లో సింక్ అవని కథ పైపైనే చప్పగా వుండిపోతుంది. లొకేషనే కాదు
, కెమెరా, బీజీఎం, ఎడిటింగ్ మొదలైన సాంకేతికాలు కూడా పరస్పరం సింక్ అయి ఒక అత్యుత్తమ క్రాఫ్ట్ ని ప్రదర్శించాయి. చాలా సినిమాల్లో కనిపించనిది ఈ క్రాఫ్టే. పట్టణానికి దూరంగా వుండే సెమీ రూరల్ పరిసరాలు, అక్కడ తక్కువ జనాభాతో, దాదాపు నిర్మానుష్యంగా వుండే వీధులు, నిశ్శబ్దంగా వుండే ఇళ్ళూ... ఇళ్ళ మధ్య ఎత్తు తక్కువ గల కాంపౌండ్ గోడలు, ఇలా వొక సన్నిహిత సమాజాన్ని తెలియజేసే లొకేషన్.  
       
కాంట్రాస్ట్ గా ఈ సన్నిహిత సమాజంలో ఒక కుటుంబం చాప కింద నీరులా పారించే కుట్ర.
ఇది తెలుసుకోవాలన్న కుతూహలంతో కొన్ని సాహసాలు చేసే హీరోయిన్ పాత్ర ప్రియా. ప్రియమణి నటించిన భామాకలాపం అనే ఓటీటీ మూవీలో ఆమెది ఇతరుల ఇళ్ళల్లో, వ్యవహారాల్లో తలదూర్చి విషయాలు తెలుసుకోనిదే నిద్రపట్టని బలహీనత. ప్రియాది ఈ వోయూరిజం కాదు గానీ, ఎదురింట్లో దిగిన మాన్యూయేల్ వింత ప్రవర్తనే ఆమెని అతడింట్లోకి తొంగి చూసే అలవాటుని కల్పించింది. ఇందుకు కిచెన్ కిటికీలోంచి కనిపెడుతున్నా, ఈ కిటికీ లోంచి కనిపెట్టడమన్నది ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ రేర్ విండో మూవీని తలపించినా,రేర్ విండో లో లాగా ఆ కిటికీయే అన్ని విషయాలకీ సాక్ష్యం కాదు. అప్పుడప్పుడు ప్రియా మాన్యూయేల్ ఇంట్లోకి జొరబడి కూడా విషయాలు తెలుసుకుంటూ వుంటుంది. చాలా సూక్ష్మ విషయాలు కనిపెడుతూ వాటి అర్ధాలు తీస్తూంటుంది. అవసరమైతే యాక్షన్లోకి సైతం దిగి రహస్యాల్ని చేదించేందుకు సాహసాలు చేస్తూంటుంది.
        
మాన్యూయేల్ ఏం చేస్తూంటాడో దొరక్కుండా చేస్తూంటాడు. ఇదంతా ఎలుకా పిల్లి చెలగాటంలా వుంటుంది. సింబాలిక్ గా, ప్రారంభంలో ఏం చేస్తున్నాడా అని ఆమె చూస్తూంటే, పిల్లిలా వచ్చి అక్కడున్న  పిల్లిని ఫెడీమని కొట్టి వెళ్ళగొడతాడు. ఆ పిల్లి ప్రియా అయితే, ఎలుక తాను అన్నమాట.
       
సస్పెన్స్ థ్రిల్లర్ల ఇంకా వదలని జాడ్యమేమిటంటే
, ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యకి వివిధ అనుమానితుల్ని చూపిస్తూ, ఎవరు హంతకుడనేది హీరో లేదా హీరోయిన్ తేల్చే ఎండ్ సస్పెన్స్  మూసలో పడే, కాలం చెల్లిన, ఫ్లాపు గ్యారంటీ కథలు. ఈ కథ ఇలా కాదు.
మాన్యూయేల్ అతడి బంధువులూ ఏదో ప్లాను మాట్లాడుకుంటూ వుంటారు. ఆ ప్లాను ప్రకారం ఏం చేస్తూంటారో మాత్రం  చూపించరు. ప్రేక్షకుల్లాగే ఏం చేస్తున్నారో తెలుసుకునే కుతూహలంతో ప్రియా ప్రవర్తన. అసలేం జరుగుతోందీ తెలుసుకోవాలన్న కుతూహలమే సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూంటుంది. అంటే నేరమే జరగినట్టు లేదు  కాబట్టి ఆ నేరం తాలూకు చివర్లో రివీల్ చేసే రొటీన్ ఎండ్ సస్పెన్స్ కథని ఏ మాత్రం ఫీల్ కాం.
       
కేవలం అసలేం జరుగుతోందీ
, ఎందుకు జరుగుతోందీ  కుతూహలం రేకెత్తించే సీన్ టు సీన్ సస్పెన్స్ మాత్రమే విజయవంతంగా ప్లే అయిందిక్కడ. చివరికి షాకింగ్ గా కుట్రదారులూ, వాళ్ళు తెలివిగా చేసిన అనర్ కిల్లింగ్ తాలూకు హత్యా షాకింగ్ గా బయటపడి పోతాయి. అంటే ఫ్లాపయ్యే ఎండ్ సస్పెన్స్ కథలకి విరుగుడు అన్న మాట ఈ సీన్ టు సీన్ సస్పెన్స్ కథనం. ఈ విధానం హాలీవుడ్ లో 1958 లోనే ప్రారంభమయ్యింది. కానీ మన సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఎండ్ సస్పెన్స్ కథలేనన్న సుడిగుండంలోనే వుంటున్నాయింకా.
       
ఈ అనర్ కిల్లింగ్ కథలో హింస కూడా కనపడదు.
గ్రాఫిక్ హింస లేదా రక్తపాతం మీద ఆధారపడకుండా సస్పెన్స్ ని, ఎమోషనల్ టెన్షన్ నీ ప్రధానాంశంగా చేసుకుని తెరకెక్కించారీ కథ. క్రూరత్వం కంటే. మాన్యుయేల్ వింత ప్రవర్తన ద్వారా, అతడి మైండ్ గేముల ద్వారా ప్రేక్షకులు  టెన్షన్ నీ, భయాన్నీ అనుభవించాలన్న ప్రణాళికతో చేసిన మైక్రో లెవెల్ మేకింగ్ ఇది. మైక్రో లెవెల్ మేకింగ్ ఎప్పుడూ హిట్టే.

దర్శకుడు జితిన్, రచయితలు అతుల్ రామచంద్రన్, లిబిన్ లు  సస్పెన్స్ థ్రిల్లర్ లంటే లో- బడ్జెట్ చవకబారు సినిమాలు కాదనీ, ఉత్తమ చిత్రాల ప్రమాణాలతో 14 కోట్లు వెచ్చించి, 50 కోట్లు ఆర్జించే కళా రూపాలుగానూ తీర్చి దిద్దవచ్చనీ దీంతో నిరూపించారు. 

నటనలు- సాంకేతికాలు

    ప్రియదర్శిని పాత్రలో నజ్రియాకి పూర్తి  క్రెడిట్ ఇవ్వాలి. ఆమెది పొరలు పొరలుగా బయల్పడే క్యారెక్టర్. సగటు యువతి జిజ్ఞాస, నిజాన్ని వెలికి తీయాలన్న ప్రబల కాంక్ష ఆమె పాత్రకి చోదక శక్తులు. ఇలాటి పాత్రని అర్ధం జేసుకుని, అందులో ఒదిగి కనబర్చిన నటనకి ఆమెకి టాప్ మార్కులు పడతాయి. మాన్యూయేల్ గా నటించిన బాసిల్ విషయానికొస్తే, హాస్య పాత్రలేస్తూ వుండిన ఇతను సీరియస్ కిల్లర్ పాత్ర నీటుగా నటించి ప్రధానాకర్షణగా నిలబడ్డాడు. ఇతడి తల్లిగా నటించిన మనోహరీ జాయ్ గ్రేసీ పాత్రకున్న షేడ్స్ తో గుబులు పుట్టిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అఖిలా భార్గవన్, మెరీన్ ఫిలిప్, పూజా మోహన్రాజ్, మనోహన్ జాయ్, జననీ రామ్, సరస్వతీ మీనన్, హెజ్జా మెహెక్ లు నటించిన ఆడ పాత్రలే ఎక్కువ. ఒక విధంగా ఇది లేడీస్ స్పెషల్ థ్రిల్లర్. ఈ యూఎస్పీతో మన దేశంలో ఇంకే సినిమా రాలేదు.

పాటలు లేని ఈ సినిమాకి  క్రిస్టో జేవియర్ బిజీఎం బలం చెప్పుకోదగ్గది. అలాగే తక్కువ లైటింగ్ తో శరణ్ వేలాయుధన్ నాయర్ ఛాయాగ్రహణం, కథని చెక్కడంలో (క్రాఫ్ట్) పూర్తిగా తోడ్పడిన చమన్ చాక్కో కూర్పు, ఇతర ప్రొడక్షన్ విలువలూ మూవీని ఎన్ని సార్లైనా చూసేలా పనితనం చూపించాయి.

—సికిందర్

 

Friday, January 17, 2025

1364 : బుక్ రివ్యూ!


  ప్రపంచ సినిమా చరిత్రలో సస్పెన్స్ బ్రహ్మ సర్ ఆల్ఫ్రెడ్ జోసెఫ్ హిచ్ కాక్ (1899-1980) మీద వెలువడినన్ని పుస్తకాలు ఇంకే సినిమా కళాకారుల గురింఛీ వెలువడలేదేమో. వందలాది పుస్తకాలు హిచ్ కాక్ గురించి రాశారు. ఈ పుస్తకాలు విద్యార్ధుల, విమర్శకుల, చరిత్రకారుల నిశిత విశ్లేషణలకి వనరులుగా కొనసాగుతున్నాయి. హిచ్ కాక్ పుస్తకాల రచయిత కాకపోయినా, ఆయన గురించి లెక్కలేనన్ని విశ్లేషణలు, జీవిత చరిత్రలు, ఆయన కళాత్మక శైలుల పరిశీలనలూ మొదలైనవి అధ్యయన గ్రంధాలుగా కోకొల్లలుగా వెలువడ్డాయి. ఆల్ఫ్రెడ్  హిచ్ కాక్ పేరు చెబితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వెంటనే గుర్తుకు వస్తాయి. ప్రపంచ సినిమా చరిత్రలో మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ గా ప్రఖ్యాతుడైన ఆయన సినిమాలు కేవలం  వినోద సాధనలగానే గాక, ఆలోచనలకి గట్టి ఆహారం అందిస్తాయి. మన దేశంలో కూడా హిచ్ కాక్ సినిమాల్ని విరగబడి చూశారు, చూస్తున్నారు, ఇంకా  చూస్తారు. అయితే విచిత్రమేమిటంటే, మన దేశంలో ఇంత  ప్రఖ్యాతుడైన హిచ్ కాక్ మీద ఒక్క పుస్తకమూ వెలువడక పోవడం. 1925 నుంచి సినిమాలు తీయడం మొదలెట్టిన హిచ్ కాక్ మీద విదేశాల్లో 2015 లో కూడా పుస్తకాలు రాసి హిచ్ కాక్ ని స్మరించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మన దేశంలో తొలిసారిగా -ముఖ్యంగా తెలుగు ప్రచురణా రంగం నుంచి హిచ్ కాక్ కెరియర్ కి శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్నట్టు, 2024 డిసెంబరులో ఒక పుస్తకం వెలువడింది- అదే మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్ అనే వివిధ తెలుగు సినిమా ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనం.

        సీనియర్ జర్నలిస్టు, రచయిత పులగం చిన్నారాయణ, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి కలిసి ఈ సంకలనాన్ని ముందుకు తెచ్చారు. దీని వెనుక ఎంత కృషి జరిగిందన్నది వీరి మాటల్లోనో పుస్తకంలో చదవొచ్చు. 45 మంది దర్శకులు, 7 గురు రచయితలు, 10 మంది జర్నలిస్టుల నుంచి అడిగి రాయించుకుని శ్రమ కోర్చి సేకరించిన 62 వ్యాసాలు ఈ హార్డ్ కవర్ ఎడిషన్లో కొలువుదీరాయి. ఇది మన దేశంలో ల్యాండ్ మార్క్ పుస్తకమవుతుందని చెప్పొచ్చు.
       
528 పేజీలున్న ఈ పుస్తకంలో విఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు
, వంశీ గార్ల దగ్గర్నుంచీ, సుధీర్ వర్మ, సాగర్ చంద్ర గార్ల వరకూ45 మంది దర్శకులు, సత్యానంద్ గారి నుంచీ గోపీమోహన్ గారి వరకూ 7 గురు రచయితలూ, ప్రభు గారి దగ్గర్నుంచీ చల్లా భాగ్యలక్ష్మి గారి వరకూ 10 మంది జర్నలిస్టులూ రాసిన విశిష్ట ఆర్టికల్స్ ని ఇందులో పొందుపర్చారు.
       
45 మంది దర్శకులు రాసిన వ్యాసాల్లో హిచ్ కాక్ సినిమాల్లో వారు గమనించిన హిచ్ కాక్ ట్రీట్ మెంట్ నీ
,  టెక్నిక్ నీ, టెక్నాలజీనీ పాఠకుల దృష్టికి తేవడమన్నది  ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్కో దర్శకుడు ఒక్కో హిచ్ కాక్ సినిమా తీసుకుని విశ్లేషించారు. ఇతర దర్శకుల్లా కాకుండా హిచ్ కాక్ కేవలం ఒక్క సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కే కట్టుబడి వరుసగా 53 సస్పెన్స్ థ్రిల్లర్లు తీస్తూ పోవడం వల్లే కళలో ఆయన్ని నిష్ణాతుడిగా గుర్తించి మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అని కీర్తించడం మొదలెట్టారు. ఇంకే దర్శకుడికీ ఈ బ్రాండింగ్ ఏర్పడలేదు. అటు సాహిత్యంలో చూస్తే అప్పట్లో సర్ అర్ధర్ కానన్ డాయల్,  అగథా క్రిస్టీ, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్, జేమ్స్ హేడ్లీ ఛేజ్ మొదలైన ప్రఖ్యాత రచయితలు వారు క్రైమ్- సస్పెన్స్ థ్రిల్లర్ నవలలు రాసే మాస్టర్స్ ఆఫ్ క్రైమ్ -సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్పించుకున్నారు. ఇంకో జానర్ లో కూడా వేలు పెట్టి వుంటే ఈ గుర్తింపు వచ్చేది కాదు. అయితే హిచ్ కాక్ వరసగా సస్పెన్స్ థ్రిల్లర్లే తీసినా దేనికది ప్రత్యేకంగా వుండేలా చూస్తాడు. ఒకే మూసలో చుట్టేయకుండా, ఏ కథకా ట్రీట్ మెంట్ నీ, టెక్నిక్ నీ, టెక్నాలజీని కొత్తగా మధించి మన కందిస్తాడు.
       
అందుకే 45 మంది దర్శకులు విశ్లేషించిన సినిమాల్లో ఏ సినిమాని హిచ్ కాక్ ఏ ట్రీట్ మెంట్ తో
, టెక్నిక్ తో, టెక్నాలజీతో ప్రత్యేకం చేశాడో చెప్పారు. కథా కథనాలు, పాత్రచిత్రణలూ వివరిస్తూనే, మేకింగ్ లో హిచ్ కాక్ తీసుకున్న నిర్ణయాల్ని వివరించారు. ఉదాహరణకి-సింగీతం శ్రీనివాసరావు అమావాస్య చంద్రుడు’,‘మయూరి’, పుష్పక విమానం’, అపూర్వ సహోదరులు’,  ఆదిత్య 369’, మేడమ్ వంటి ప్రయోగాత్మకాలు కూడా తీసి హిట్ చేశారు. ఈ ప్రయోగాలు చేసే తత్వం తనకి హిచ్ కాక్ తత్వం నుంచే అబ్బిందని, హిచ్ కాక్ రియర్ విండో ని విశ్లేషిస్తూ పేర్కొన్నారు.
       
ఈ సినిమాలో హిచ్ కాక్ ఒక సన్నివేశానికిచ్చిన బ్యూటీఫుల్ ట్రీట్ మెంట్ ని వివరిస్తూనే
, ఒక అపార్ట్ మెంట్ లో జరుగుతున్న సంఘటనలని హీరో తన అపార్ట్ మెంట్లోంచి బైనాక్యులర్ తో చూస్తూ తెలుసుకునే విషయాలే ప్రేక్షకులకి తెలియాలి తప్ప, కెమెరా ఆ ఎదుటి అపార్ట్ మెంట్లోకి వెళ్ళి వేరే చూపించకూడదన్న శిల్పానికి ఎలా కట్టుబడ్డాడన్నది వివరంగా చెప్పారు. కథ హీరో చూసే బైనాక్యులర్ నుంచి మాత్రమే ప్రేక్షకులకి తెలియాలన్న ఛాలెంజీని స్వీకరించడం హిచ్ కాక్ మెథడ్ అన్నారు. హిచ్ కాక్ తీసిన ఇంకా చాలా అనితర సాధ్యమైన షాట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ విలువైన వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.
       
దర్శకుడు వంశీ
సైకో తీసుకుని కథ చెప్పారు. చివర్లో ఈ కథ సినిమాగా తయారవడానికి తెరవెనుక జరిగిన ఆసక్తికర కథ చెప్పారు. రేలంగి నరసింహారావు మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ చిన్న కథా వస్తువు తీసుకుని బాగా స్క్రీన్ ప్లే చేసి, మంచి డైలాగ్స్ తో, మంచి ఫోటోగ్రఫీతో హిచ్ కాక్ తెరకెక్కించారని చెప్పారు. ముఖ్యంగా మొదటిరెండు సీన్లు చిత్రించిన విధానం గురించి, తర్వాత హీరో పట్ల  హీరోయిన్ ప్రదర్శించే రెండు షేడ్స్ గురించి తెలిపారు. పూరీ జగన్నాథ్ వచ్చేసి టు క్యాచ్ ఏ థీఫ్ సినిమా విశేషాలు చెప్పారు. 1955 లో ఎలాటి డ్రోన్ గానీ, నేటి సదుపాయాలు గానీ లేని కాలంలో హిచ్ కాక్ ఛేజింగ్ దృశ్యాల తీయడం, తక్కువ లైటింగ్ తో గొప్ప విజువల్ లగ్జరీ ప్రదర్శించడం గొప్పగా వున్నాయన్నారు. నిజానికి నాడు హిచ్ కాక్ చేసిన టెక్నికల్, టెక్నాలాజికల్ ప్రయోగాలు నేటి సినిమాలకి బడ్జెట్ ఆదా చేసే మార్గాలే. కానీ ఎంత మంది పాటిస్తారు.
       
హరీష్ శంకర్
డయల్ ఎమ్ ఫర్ మర్డర్ గురించి రాస్తూ, ఇందులో కథ చెబుతూ హిచ్ కాక్ అంచెలంచెలుగా సస్పెన్స్ ని రివీల్ చేస్తూ వెళ్ళిన విధానాన్ని హైలైట్ చేశారు. ఇంద్రగంటి మోహన కృష్ణ వెర్టిగో ని విశ్లేషించారు.  ఇందులో ప్రధానాకర్షణగా వున్న ఎడిటింగ్ గురించి వివరించారు. మన విమర్శకులు సినిమాల్లో ల్యాగ్ వుందనీ, స్లోగా వుందనీ చెబుతారనీ చెబుతూ, వీళ్ళలో చాలా మందికి గతికీ, వేగానికీ తేడా తెలియదని చురక వేశారు. వెర్టిగో లో హిచ్ కాక్  గతి (pace) ని ఎంత బాగా మేనేజ్ చేశాడో చెప్పుకొస్తూ, అతి వేగం ఎక్కడా వుండదనీ, అలాగని నెమ్మదిగా వుండదనీ, కెమెరా గానీ, ఎడిటింగ్ గానీ అస్సలు కంగారు పడవనీ, గతి గురించి అర్ధమయ్యేట్టు చెప్పారు. ఇక ఎంఎల్ నరసింహం హిచ్ కాక్ మూకీల కాలంలో 1925- 1929 మధ్య తీసిన 9 మూకీ సినిమాలని నవరత్నాలుగా పేర్కొంటూ జనరల్ నాలెడ్జిగా   అందించారు.

       
ఇంకా శివనాగేశ్వరరావు
, చంద్ర సిద్ధార్థ, వి ఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, వర ముళ్ళపూడి, వీర శంకర్. జనార్ధన మహర్షి, దేవీ ప్రసాద్, సాగర్ చంద్ర మొదలైన దర్శకులు హిచ్ కాక్  సినిమాల్లో తాము గమనించిన విశేషాల్ని రికార్డు చేశారు. ఇవన్నీ ఉపయోగపడేవే. ప్రతి ఒక్కరూ సినిమాల గురించి ఏకరువు పెడుతూ, వాటి తెర వెనుక విశేషాలు కూడా అందించారు. దీంతో పుస్తకానికి ఒక సమగ్రత వచ్చింది. ఈ తెర వెనుక విశేషాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.
       
రచయితలు  సత్యానంద్
, గోపీ మోహన్, దశరధ్, వి ఐ ఆనంద్ తదితరులు హిచ్ కాక్ సినిమాల్లో భయం, మనస్తత్వాలు, భావోద్వేగ తీవ్రత, సంగీతం, వస్త్రాలంకరణ, సాంకేతిక అంశాలు, రైటింగ్, మేకింగ్, అప్ గ్రేడింగ్ ల గురించి వివరంగా చర్చించారు. జర్నలిస్టు ప్రభు హిచ్ కాక్ ఇచ్చిన ఇంటర్వ్యూల భాగాల్ని ఒక చోట కూర్చారు. ఇంకా జలపతి, వడ్డి ఓం ప్రకాష్, చల్లా భాగ్యలక్ష్మి, జోస్యుల సూర్య ప్రకాష్ వంటి ప్రముఖ  జర్నలిస్టులు  హిచ్ కాక్ కి సంబంధించి ఇతర అంశాలపై దృష్టి సారించారు.  పోతే, ఈ పుస్తకానికి మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ముందు మాట ఆయన శైలిలో ఒక నాస్టాల్జియా! 
       
ప్రతి వొక్కరూ చదవాల్సిన పుస్తకం.  ఓటీటీల్లో విభిన్న సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు వాటిని థీమాటికల్ గా అర్ధం జేసుకోవాలంటే
, హిచ్ కాక్ ఆవిష్కరించిన సినిమా కళనీ తెలుసుకోవాల్సిందే. హిచ్ కాక్ తెలిస్తే అన్నీ తెలిసినట్టే. ఈ పుస్తకం మొదటి ముద్రణ  అమ్ముడైపోయి రెండో ముద్రణకి సిద్ధమైంది. వెంటనే మీ కాపీలు బుక్ చేసుకోండి.

—సికిందర్
మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్
పేజీలు : 528, వెల : రు. 650/-
లభించు చోట్లు :
అక్షౌహిణి మీడియా, హైదరాబాద్    
889 779 8080
నవోదయ బుక్ హౌజ్, హైదరాబాద్
9000 413413
సాహితి ప్రచురణలు, విజయవాడ
81210 98500
అమెజాన్ లో కూడా అందుబాటులో వుంది. 
ఈ క్రింది లింకు ద్వారా పొందవచ్చు: 

Sunday, January 12, 2025

1327 : రివ్యూ!



 దర్శకత్వం : ఎస్. శంకర్ 

తారాగణం :  రామ్ చరణ్కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, జైరాం, శ్రీకాంత్, సముద్రకని, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు
కథ : కార్తీక్ సుబ్బరాజ్, స్క్రీన్ ప్లే : వివేక్ వేల్మురుగమ్, మాటలు : సాయినాథ్ బుర్రా తమన్ ఎస్, ఛాయాగ్రహణం : తిరు, కూర్పు : షమీర్ మహమ్మద్ రూబెన్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియెషన్స్, నిర్మాత : దిల్ రాజు
విడుదల : జనవరి 10, 2025



***
        నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ ముగ్గురూ కలిసి ఈ సంక్రాంతి వినోదంగా గేమ్ ఛేంజర్ అందించారు. కొన్నేళ్ళుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పానిండియా మూవీ ఇది. అటు ఇండియన్ 2’, ఇటు గేమ్ ఛేంజర్ పానిండియా బిగ్ బడ్జెట్లు రెండిటినీ ఏకకాలంలో భుజానేసుకుని శంకర్ పడ్డ శ్రమ ఫలితంగా మొదటిది పరాజయంపాలవగా, ఈ రెండోది పండక్కి బాక్సాఫీసు పరీక్షకి నిలబడింది. శంకర్ తీసిన మొదటి తెలుగు సినిమా అని ప్రచారం జరిగి, శంకర్ గతంలో అందించిన తెలుగు డబ్బింగులకి అఖండ విజయాలు సమకూర్చి పెట్టిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూ, ఎలాటి తెలుగు ఒరిజినల్ అందించాడన్నది ఈ కింద చూద్దాం... 

కథ 

రామ్ నందన్ (రామ్ చరణ్) కొత్తగా వైజాగ్ కలెక్టర్ గా అపాయింటై అవినీతి పరుల అంతు చూస్తూంటాడు. ఈ క్రమంలో రాజకీయ వ్యవస్థని ఢీ కొంటాడు. ముఖ్య మంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) చిన్న కొడుకు మోపిదేవి (ఎస్ జె సూర్య) చేస్తున్న అక్రమాల్ని ఎదుర్కొంటూ వుంటాడు. మోపిదేవి పోషిస్తున్న ఇసుక మాఫియాని పట్టుకోవడం, రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం, నిబంధనలు పాటించని మాల్స్ ని కూల్చేయడం వగైరా రామ్ నందన్ ప్రక్షాళనా కార్యక్రమంలో వుంటాయి. తను సీఎం కావాలనే కోరికతో వున్న మోపిదేవి కిదంతా ఇబ్బందిగా వుంటుంది. రామ్ నందన్ తో సంఘర్షించడం మొదలెడతాడు.  
       
మొదట రామ్ నందన్ ఐపీఎస్ కావాలనుకున్నాడు. అయితే కాలేజీలో అతడి కోపాన్నీ
, దాంతో అతను సృష్టిస్తున్న అశాంతినీ గమనించి దీపిక (కియారా అద్వానీ), ఇంత కోపంతో ఐపీఎస్ అయితే ఇంకేం చేస్తాడోనని భయపడి, అతను ఐఏఎస్ అయితేనే ప్రేమిస్తానని చెప్పేస్తుంది. రామ్ నందన్ కోపాన్ని తగ్గించుకుని, ఐఏఎస్ పూర్తి చేసి  ఇలా కలెక్టర్ గా వచ్చాడు. ఆమె డాక్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్ నందన్  మోపిదేవి మనుషుల్ని మాస్ అరెస్టులు చేయడంతో గొడవ ముదురుతుంది. ఒక సభలో సీఎం సత్యమూర్తి ప్రసంగిస్తూండగా మోపిదేవి, రామ్ నందన్ లు ఘర్షణ పడతారు. ఇద్దరి మీదా చర్యలు తీసుకుంటాడు సత్యమూర్తి, ఆ తర్వాత చనిపోతూ తన వారసుడిగా రామ్ నందన్ ని ప్రకటిస్తాడు.
       
ఇప్పుడు రామ్ నందన్ సీఎం అవకుండా మోపిదేవి ఎలా అడ్డుకున్నాడు
, రామ్ నందన్ అతన్నెలా ఎదుర్కొన్నాడూ అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ 

శంకర్ ఇలా తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాడనుకోలేదు. కసి తీర్చుకోవడమే ఇది. తెలుగోళ్ళ లెవలింతే అన్నట్టు వుంది వరస. అసలు పానిండియాకి ఇలాటి కథ గేమ్ ఛేంజర్ అవుతుందని ఎలా అనుకున్నాడో తెలియదు. గేమ్ ఛేంజర్ అవ్వాలంటే ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించ గలగాలి. ఆ ట్రెండ్లో మరిన్ని అలాటి సినిమాలు వస్తూండాలి. రాజకీయ సినిమాలకి సంబంధించి 1989 లో కోడి రామకృష్ణ  తీసిన అంకుశం అలా గేమ్ ఛేంజర్ అయింది, ట్రెండ్ సెట్టర్ అయింది. ఆ తర్వాత 1991 లో ఆయనే తీసిన భారత్ బంద్ కూడా గేమ్ ఛేంజరే, ట్రెండ్ సెట్టరే. ఈ రెండిటినీ జనం విరగబడి చూశారు. ఈ రెండు సినిమాలతోనే సీఎం ని వెన్నుపోటు పొడిచి దింపే కథలు మొదలయ్యాయి. కోడి రామకృష్ణకి ఇన్స్ పిరేషన్ అప్పట్లో సీఎం గా వున్న ఎన్టీ రామారావుని గద్దె దింపి సీఎం అయిన నాదెండ్ల భాస్కరరావు ఉదంతమే. ఇలా రాజకీయ స్పృహతో తీసి ప్రేక్షకుల్ని వెర్రెత్తించారు.
       
కానీ కొత్త కొత్త రాజకీయ రంగుల్ని స్మార్ట్ ఫోన్లలో చూస్తూ తిరుగుతున్న నేటి జనాలకి
, ఏ రాజకీయ స్పృహ లేకుండా పురాతన, అరిగిపోయిన అదే పాత మూస ఫార్ములాని తీసి, గేమ్ ఛేంజర్ అనుకోవడానికి శంకర్ కెలా ధైర్యం వచ్చిందో...ఈ కథ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ ఎంత ధైర్యాన్ని నూరిపోశాడో. ఆ ధైర్యం అలా అలా దిల్ రాజు, రామ్ చరణ్ ల వరకూ ప్రాకిపోయింది. పానిండియాప్రాణాల మీదికొచ్చింది. 
       
స్ట్రిక్టు ఐఏఎస్ అధికారులు- స్వార్ధ రాజకీయనాయకులు ఈ ఇద్దరి మధ్య సంఘర్షణ ఎప్పుడూ వుండేదే. అయితే కొత్తగా ఈ రంగంలో ఏం జరుగుతోందీ చూపించగలిగితే అది రాజకీయ స్పృహతో కూడిన కొత్త కథవుతుంది. నార్త్ లో ఒక స్ట్రిక్టు ఐఏఎస్ ఆఫీసర్ 50 సార్లు ట్రాన్స్ ఫర్ అయ్యాడంటే ఇందులో ఎంత కథ వుందో తెలిసిపోతోంది. నార్త్ లోనే ఇంకో ఐఏఎస్ 29 సార్లు బదిలీ అయ్యాడు. సింపుల్ గా ఇలాటి ట్రాన్స్ ఫర్ల బాధితుడైన ఐఏఎస్ హీరో
, చూసి చూసి ఆ రాజకీయనాయకులందరి రాజకీయ జీవితమే లేకుండా చేసే ప్రణాళికని ఎన్నికల ఆధారంగా రచించి ఫినిష్ చేస్తే అదొక సమకాలీన మెసేజ్ లా వెళ్తుంది. సినిమా పరంగా ఎంతో కొంత గేమ్ ఛేంజర్ అన్పించుకునే అవకాశముంటుంది. కానీ ఛేంజోవర్ లేకుండా అదే పాత మూసగా సీఎం పదవి కోసం  ఇద్దరూ పోరాడుకునే కథ చేస్తే  ఎవరిక్కావాలి? ఇకనైనా సినిమా కథలు పాత సినిమాల్లోంచి దిగి వచ్చి, చుట్టూ లోకంలో జరుగుతున్నవాటిలో స్నానించి కొత్తబట్ట కట్టకపోతే ఇంతే సంగతులు. 

2. కలెక్టరా
, సీబీఐ ఆఫీసరా?
        కానీ ఐఏఎస్ రామ్ నందన్ ఇలా చేయలేదు. చూసి చూసి వున్న పాత రొటీన్ మూస ఫార్ములా టెంప్లెట్ పాత్రగానే కొనసాగాడు. సినిమా ప్రారంభమే కలెక్టర్ గా జాయినవడానికి వస్తూ కాలేజీలో తన క్లాస్ మేట్స్ గ్యాంగుతో ఫైట్ చేసి, ఓ పాటేసుకుని వచ్చి జాయినవుతాడు. రావడం రావడం అవినీతి పరులమీద పోరాటం ప్రకటిస్తాడు. కొత్తగా తొలి పోస్టింగుగా జాయినయ్యే ఏ కలెక్టరూ ఇలా చేయడు. ముందు తానొక జిల్లా కలెక్టరుగా ప్రజా జీవితాన్నీ, ప్రభుత్వ అభివృద్ది పథకాలనీ సమీక్షించకుండా, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చకుండా కలెక్టరుగా రావడం రావడం, ఎప్పుడు చూసినా పదే పదే అవినీతి పరుల్ని పిలిచి అవే దర్బార్లు నిర్వహించడం, వాళ్ళతో బాహాబాహీకి దిగి అరెస్టులు చేయడం వంటివి పాత్ర చిత్రణని చీలికలు పేలికలు చేసేసింది. ఎలా వున్నాడంటే అవినీతి కేసుల్ని విచారించడానికొచ్చిన సీబీఐ అధికారిలా వున్నాడు. 
       
ఫస్టాఫ్ ఈ బిగినింగ్ విభాగంలో అతడి పాత్ర పరిచయం సమగ్రంగా చేయకుండా
, ప్రజలతో అతడి మానవీయ కోణం ఎస్టాబ్లిష్ చేయకుండా, ఏకోన్ముఖంగా విద్రోహులతో కొట్లాటలే పెట్టడం వల్ల- పూర్తిగా ఫస్టాఫ్ విషయపరంగా భావోద్వేగాల్లేని డొల్ల కథనంగా తయారయ్యింది. తాను ప్రేమిస్తున్న దీపికాకి కోపాన్ని తగ్గించుకుని ఐఏఎస్ గా తిరిగి వస్తానని చెప్పినవాడు- తిరిగి వచ్చి అదే కోపంతో దాడులు మొదలెట్టాడంటే ఎలాటి పాత్ర చిత్రణ అనుకోవాలి. 
       
మోపి దేవి అనేవాడు సీఎం రెండో కొడుకు. సీఎం కొడుకు చేస్తున్న అక్రమాల్ని సీఎం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చెయ్యడు కలెక్టర్ రామ్ నందన్. ఈ కథని రెగ్యులర్ రాజకీయ సినిమాగా పూర్వంలా తీసే వీలు ఇప్పుడుందా
? తెలంగాణా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ తక్షణ అవసరాలేమిటి? కనీసం రాజధానిని సవ్యంగా నిర్మించుకునే రాష్ట్రభక్తి కూడా లేకుండా, దోపిడీలు సాగించే దుర్బుద్ధి ఏమిటని పోరాడితే  ఒక ఎమోషనల్ పాయింటైనా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ ఎమోషనూ లేకుండా రాజకీయ సినిమా ఎలా తీస్తారు. తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాని ఖర్మానికి వదిలేసినట్టుంది. తెలుగులో ఈ కథ తీస్తున్నప్పుడు తెలుగు సంస్కృతిని దృష్టిలో పెట్టుకున్నామని చెప్పాడు శంకర్. సంస్కృతి ఒకటే సరిపోతుందా?
       
ఇలా ఫస్టాఫ్ గంటా 20 నిమిషాలూ బిగినింగే ముగియకుండా
, ఇంటర్వెల్ వరకూ సాగదీస్తూ సాగదీస్తూ కలెక్టర్ -మోపిదేవిల సంఘర్షణలే చూపిస్తూ పోవడంతో, విషయం లేని వ్యవహారంగా, బడ్జెట్ వృధాగా తయారయ్యింది మేకింగ్. చివరికి ఇంటర్వెల్లో సీఎం చనిపోతూ వారసుడిగా రామ్ నందన్ ని ప్రకటించడంతో –ఇక సీఎం పదవి కోసం రామ్ నందన్, మోపిదేవిల పోరాటం మొదలవుతుందనే అర్ధంలో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇదే ఇంతాలస్యంగా వచ్చిన ప్లాట్ పాయింట్ వన్! 

3. ఫ్లాష్ బ్యాక్ అందచందాలు
        సెకండాఫ్ ప్రారంభంలో రామ్ నందన్ తండ్రి అప్పన్న ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అప్పన్న స్నేహితుడు (సముద్ర కని)  రామ్ నందన్ చిన్నప్పుడు అతడికి తెలియకుండా జరిగిన విషయంతో ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అప్పన్న (రామ్ చరణ్) భార్య పార్వతి (అంజలి) తో, కొడుకు రామ్ నందన్ తో పల్లెటూర్లో జీవిస్తూంటాడు. మైనింగ్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టి రాజకీయ పార్టీ పెడతాడు. అయితే అప్పన్నకి నత్తి కారణంగా ఎన్నికల సభలు జరపలేడని, తన ప్రతినిధిగా సత్యమూర్తి (శ్రీకాంత్ ) ని నియమిస్తే, ఆ సత్యమూర్తి అప్పన్నని చంపి ఎన్నికలు గెలిచి తాను సీఎం అయిపోతాడు. ఇదంతా రామ్ నందన్ కి చిన్నప్పుడు తెలియదు. ఇప్పుడు తండ్రి మిత్రుడు చెప్తూంటే కళ్ళు తెరుస్తాడు. తెరిచి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. చేసే అవకాశాన్ని దర్శకుడు లాగేశాడు. 
       
ఇక్కడ దర్శకుడు చాలా గజిబిజి చేశాడు. అసలు ఇంటర్వెల్లో సీఎం సత్యమూర్తి హాస్పిటల్లో చనిపోలేదు
, పదవి కోసం కొడుకు మోపిదేవియే చంపేశాడు. చనిపోతూ సత్యమూర్తి తన వారసుడిగా రామ్ నందన్ ని ప్రకటించి మోపిదేవికి దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అప్పన్న ఫ్లాష్ బ్యాక్ పూర్వ రంగంలో ఈ ఇంటర్వెల్ దృశ్యాన్ని చూస్తే, తను అప్పన్నని చంపి సీఎం అయినందుకు ప్రాయశ్చిత్తంగా రామ్ నందన్ ని ఆ సీఎం పదవిని అప్పజెప్పినట్టు అన్పిస్తుంది. కానీ ఈ ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలిగింది? కొడుకు తన ప్రాణాలు తీస్తేనా? తీయకపోతే రామ్ నందన్ ని వారసుడిగా ప్రకటించే వాడా? కాబట్టి కొడుకు మీద కక్షతోనే తప్ప, తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంతో కాదని తెలిసిపోవడం లేదూ?
       
రెండోది
, రామ్ నందన్ కి తన తండ్రి మరణానికి కారకుడు సీఎం  సత్యమూర్తి అని అతను చనిపోయిన తర్వాత గానీ తెలియక పోవడం పాత్ర చిత్రణ పరంగా ఎంత తెలివి తక్కువ తనం? ఈ విషయం తెలియకుండా సత్యమూర్తికి రామ్ నందన్ తనే తల కొరివి పెట్టడం ఎంత ఫూలిష్ కథనం? తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నాక, తండ్రి హంతకుడికి తాను తలకొరివి పెట్టాడని తెలుసుకుని కూడా కిమ్మనకుండా వుంటాడు. 
       
మూడోది
, తండ్రి హత్యకి ప్రతీకారం తీసుకోవాల్సిన వాడు హీరో వుండగా, ఇంకెవరో (ఇక్కడ మోపిదేవి) ఆ హంతకుణ్ణి చంపేసి పోతే హీరోగారి కథ ఏమైపోవాలి? నాల్గోది, అసలు తన తండ్రి హంతకుడ్ని(సీఎం సత్యమూర్తి) ఇంటర్వెల్లో అతడి కొడుకు మోపిదేవియే చంపాడని రామ్ నందన్ కి ఎక్కడా తెలియకుండానే ఈ సెకండాఫ్ కథ కూడా ముగిసి పోతుంది! పాపం పూర్ పాసివ్ రామ్ నందన్... 
       
దీంతో అయిపోలేదు. తన భర్త అప్పన్నని సీఎం సత్యమూర్తియే చంపాడని భార్య పార్వతికి కూడా తెలీదు. తెలిస్తే కొడుకు రామ్ నందన్ ని సత్యమూర్తిని శిక్షించడానికి ప్రేరేపించేది. పాపం అమాయకురాలు ఇంటర్వెల్ సీన్లో సీఎం సత్యమూర్తి సభలో ప్రసంగిస్తూంటే వచ్చేసి
, పాలలో కల్తీ జరుగుతున్న విషయం లేవనెత్తి పోరాట వనితగా నిలుస్తుంది. ఈ పోరాటం కాదమ్మా, అసలు నీ భర్తని చంపిన వాడు ఈ సత్యమూర్తియే, ఇందుకు నువ్వు బరిసె సత్యమూర్తిని  తీసుకుని ఒక్క పోటు  పొడవాలని ఎవరు చెప్పాలి? దర్శకుడు చెప్పలేడు. ఎందుకంటే దర్శకుడికి తన కథ తనకే అర్ధంగానంత కన్ఫ్యూజింగ్ గా వుంది. 
       
దీంతో కూడా అయిపోలేదు- రామ్ నందన్ తండ్రి ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక
, నిజాలు తెలుసుకున్నాక, సత్య మూర్తి ప్రకటన ప్రకారం సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతాడు!! ఇంతకంటే పాత్రని కిల్ చేయడం వుండదు. తండ్రిని చంపిన వాడు సీఎం పదవిని తనకి దానంగా ఇవ్వడమేమిటని- ఆ సత్యమూర్తి కొంపా గోడూ ధ్వంసం చేసి, అతడి ఇద్దరు కొడుకుల్ని ఖతం చేసి కథ ముగించకుండా - ఆ సీఎం గద్దె నెక్కి కూర్చోవాలనుకోవడమేమిటి? పోనీ తండ్రి చనిపోతూ, ఎప్పటికైనా నా కొడుకు సీఎం అయి నీ సంగతి చూస్తాడని సత్యమూర్తికి  ఛాలెంజి విసిరాడా, తను ఆ గద్దె నెక్కి కూర్చోడానికి?
       
దీనికి మోపిదేవి అడ్డుపడి తనే సీఎం అవుతాడు. వెంటనే రామ్ నందన్ ఎన్నికల అధికారిగా అవతారమెత్తి అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటించేస్తాడు! ఇదేమంటే
, తనకి ఈ అధికారముందంటాడు. మోపిదేవి ఎమ్మెల్యే కాకుండా సీఎం అయితే ఆరు నెలల్లోగా ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికవాల్సుంటుంది. అప్పుడు ఆరునెలల్లోగా ఎప్పుడు ఉప ఎన్నిక జరపాలన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇష్టం. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ లోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అసెంబ్లీనే రద్ధు చేసి మొత్తం రాష్ట్రమంతటా మధ్యంతర ఎన్నికలు ప్రకటించలేడు. మోపిదేవి అప్పటికే మంత్రి కాబట్టి ఉప ఎన్నిక కూడా అవసరం లేదు. కానీ రామ్ నందన్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా మాత్రమే వచ్చేసి అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటించేస్తాడు!
        
ఈ స్క్రిప్టులో చట్టాలు కూడా ఇష్టమొచ్చినట్టు రాసుకున్నారు. ఇక ఇక్కడ్నుంచి మొదలవుతుంది సెకండాఫ్ చివరి వరకూ ఎన్నికల రభస. అసలు ఎన్నికల రభసే ప్రధానంగా చేసి చూపించిన సినిమాలేవీ హిట్ కాలేదు. సుమారు గంట సేపు సాగే ఈ రభస చివరికి రామ్ నందన్ సీఎం అవడంతో ముగిసి శుభం పడుతుంది. ఇంతకంటే సెకండాఫ్ లో ఇంకేం లేదు. మధ్యలో రామ్ నందన్ తల్లితో ఒక లాజిక్ లేని ట్రాజడీ వుంటుంది. ఈ మొత్తం కథకి వుండాల్సిన భావోద్వేగాలనే ప్రధాన ఎలిమెంట్ లేకుండానే రోడ్డు రోలర్ తో చదును చేసినట్టు ఫ్లాట్ గా సాగిపోతుంది కథనం. 

నటనలు- సాంకేతికాలు
 రామ్ చరణ్ విభిన్న పాత్రలు పోషించిన పానిండియా ప్రొడక్టు ఇది. కాలేజీ స్టూడెంట్ గా, కలెక్టర్ గా, ఎన్నికల అధికారిగా, సీఎం గా, తండ్రిగా అన్నీ తానై తన టాలెంట్ ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒక క్యారక్టర్ మీద కథ నిలబడక పోవడంతో – ఎపిసోడ్లు గా కథ కూడా మారిపోయింది. ఒక క్యారక్టర్ తో ఒక ఎపిసోడ్, ఇంకో క్యారక్టర్ తో ఇంకో ఎపిసోడ్ ... ఇలా క్యారక్టర్ వారీ ఎపిసోడ్లుగా కథ మారిపోవడంతో డాక్యుమెంటరీలా తయారయ్యింది. నటించడం సిన్సియర్ గానే నటించాడు, కానీ పాత్రలో భావోద్వేగాలు, బలం, సరైన కథా లేకపోవడంతో తన కష్టమంతా వృధా అయింది. పాటల్లో రక్తి కట్టించాడు. అది వేరే విషయం. హీరోయిన్ తో రోమాన్స్ ఫస్టాఫ్ లో కాసేపే, సెకండాఫ్ లో హీరోయిన్ తో ఒక సీను, ఒక సాంగ్ అంతే. ఇక యాక్షన్ సీన్లు ఫస్టాఫ్ లో అడపాదడపా వచ్చినా, సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వల్ల, ఎన్నికల రభస వల్లా  చాలా సేపు మర్చిపోయినట్టున్నాడు దర్శకుడు. 
       
హీరోయిన్ కియారా అద్వానీ డాక్టర్ పాత్ర. డాక్టర్ గా చేసేదేమీ వుండదు. రామ్ చరణ్ తో సాంగ్స్ కోసం వచ్చిపోతూంటుంది. అంజలి సీరియస్ పాత్ర బాగానే  నటించింది గానీ పాత్ర చిత్రణ సహకరించలేదు. విలన్ గా ఎస్ జే సూర్యది నాటు పాత్ర
, ఘాటు నటన. ఇక శ్రీకాంత్, సముద్ర కని, రాజీవ్ కనకాల తదితరులు, కమెడియన్ సునీల్ ప్యాడింగ్ కోసమన్నట్టు వున్నారు.  
       
తమన్ పాటలు ఏమోగానీ
, శంకర్ మాత్రం వాటి చిత్రీకరణ ఆర్భాటంగా చేశాడు. సాంకేతికంగా ఎంత హంగామా చేయాలో అంతా చేశాడు. సాయినాధ్ బుర్రా మాటలు యావరేజి. దిల్ రాజు ప్రొడక్షన్ విలువలు అమోఘం. సినిమాలో విషయం మాత్రం అన్యాయం. 

చివరి కేమిటి
       సమస్య ఎక్కడొచ్చిందంటే రామ్ చరణ్ కలెక్టర్ గా వచ్చినప్పుడు పాత్రకి సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేదు. దీంతో పాత్ర, కథ ఏమాత్రం ఆసక్తి కల్గించక, ఫ్లాట్ గా మారింది. ఇదే అంకుశం లో రాజశేఖర్ పోలీసు పాత్రకి తనని కని కుప్ప తొట్లో పారేసిన గతం తాలూకు మానసిక గాయంతో బలమైన సర్కిల్ ఆఫ్ బీయింగ్ వుంటుంది. దీంతో ఆ పాత్ర బలంగా మనసుల్లో నాటుకుపోయింది. రామ్ చరణ్ కి ఎప్పుడో సెకండాఫ్ లోతండ్రి తాలూకు ఫ్లాష్ బ్యాక్ వున్నా ఆ ఫ్లాష్ బ్యాక్ నిరర్ధకం. ఆ ఫ్లాష్ బ్యాక్, తండ్రి పాత్ర లేక పోయినా వచ్చే నష్ట మేం లేదు. దాని బదులు ఫస్టాఫ్ లో స్టూడెంట్ గా హీరోయిన్ తో ఫ్లాష్ బ్యాక్ ఎత్తి పారేసి, రామ్ చరణ్ పాత్రకి వేరే బాధాకర సర్కిల్ ఆఫ్ బీయింగ్ ని క్రియేట్ చేసి వుండొచ్చు. ఇది లేకపోవడం వల్లే పాత్ర సమగ్ర పరిచయం లేదని చెప్పుకున్నాం పైన. 
        
రామ్ చరణ్ పాత్రకి ఫస్టాఫ్ లో ఒక్క సర్కిల్ ఆఫ్ బీయింగ్ ని క్రియేట్ చేసి వుంటే
, ఈ కథతో వున్న అన్ని సమస్యలూ తీరిపోయేవి- నేటి ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితిని ఎత్తి  చూపే కథగా కాకపోయినా, ఓ మాదిరి ఫర్వాలేదనిపించుకునే నిర్మాణ మన్పించుకునేది.

—సికిందర్