రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, మే 2023, సోమవారం

1325 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : సుదీప్తో సేన్
తారాగణం : అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ప్రణయ్ పచౌరీ, ప్రణవ్ మిశ్రా తదితరులుసంగీతం : వీరేష్ శ్రీవల్స, బిషఖ్ జ్యోతి; ఛాయాగ్రహణం :  
బ్యానర్: సన్‌షైన్ పిక్చర్స్
నిర్మాత: విపుల్ అమృత్ లాల్  షా

విడుదల : మే 5, 2023
***
        గుజరాత్ కి చెందిన బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు  విపుల్ అమృత్ లాల్ షా స్టార్స్ తో భారీ కమర్షియల్ సినిమాలు తీసిన వాడే. 2002 నుంచీ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్ లతో దర్శకుడుగా 6 సినిమాలు; అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, విద్యుత్ జమ్వాల్ లతో నిర్మాతగా 8 సినిమాలూ తీసి, ప్రస్తుతం జాన్ అబ్రహాంతో ఫోర్స్3 నిర్మిస్తున్నాడు. ఇంతలో తానూ గుజరాత్ లాబీలో చేరాలనుకున్నట్టుగా, కాశ్మీర్ ఫైల్స్ సరళిలో ప్రభుత్వానికి ఓట్లు, తనకి నోట్లు ప్రణాళికతో కేరళ స్టోరీ తీశాడు. ఇది హిట్టయ్యింది.

        టు కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రధాని కూడా అన్ని ఎన్నికల నియమావళులనూ, పదవీ మర్యాదనూ తుంగలో తొక్కి ఓట్ల కోసం సినిమాకి ప్రచారం చేశాడు. ఇంతలో సినిమాలో చెప్పినట్టుగా 32 వేలమంది కేరళ యువతుల అదృశ్యం నిజమని కాసేపు, కాదని కాసేపూ నిర్మాత అమృత్ లాల్ కన్ఫ్యూజన్ లో వుండగా, నిన్న గుజరాత్ స్టోరీ రిలీజ్ అయింది. గుజరాత్ నుంచి 41, 621 మంది వివాహితలు, అవివాహితలూ  అదృశమయ్యారని ప్రభుత్వానికి చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కన్ఫ్యూజన్ లేని అంకెలు విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల్లో వ్యభిచార గృహాలకి అమ్మేసి వుంటారని అధికారుల అంచనా. దీంతో కేరళ స్టోరీ కి ఏ బురఖాలో తల దాచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
        
దీనికి తోడు ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఎన్డీ టీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, చివరికి గోదీ మీడియా అయిన ఆజ్ తక్ వంటి జాతీయ మీడియా సంస్థలు ఈ సినిమాకి 0.5 నుంచి 1.5 వరకు మాత్రమే రేటింగ్స్ నిర్ణయించాయి. ఇది చాలా అన్యాయమే. మరీ అంత తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ సినిమా ద్వారా మైనారిటీ వర్గాన్ని ఎండగట్టే సృజనాత్మక స్వేచ్ఛ మాటున, విద్యావంతులైన మెజారిటీ వర్గ యువతుల తెలివిని ఎంత అపహాస్యం చేశారో అర్ధం జేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సినిమా వేరే ఎవరైనా తీసి వుంటే ఈపాటికి 100 కేసులు పడేవేమో. 
       
బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్ 10 వాస్తవిక సినిమాలు తీసి స్ట్రగుల్ చేస్తున్న దర్శకుడు. తను వెలుగులోకి రావడానికి కేరళ స్టోరీ తీయాలనుకోవడం మంచి నిర్ణయం. ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట మీద బురఖా వేసి
, బురఖాల మీద- గడ్డాల మీదా కోపాన్ని మళ్ళించే ఇలాటి తెలివైన సినిమాలే నేటి జాతీయ అవసరం. అలాగే, అదా శర్మ పూరీ జగన్నాథ్ నితిన్ తో తీసిన హార్ట్ ఎటాక్ తో తెలుగులో పరిచయమై, ఇంకో నాల్గు తెలుగు సినిమాలు, కొన్ని తమిళ హిందీ సినిమాలూ నటించిన ఛోటా నటి. ఈమె నట జీవితానికి కేరళ స్టోరీ ఓ మలుపు కాగలదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథా కమామిషేమిటో ఓసారి చూద్దాం...

కథ

శాలినీ ఉన్ని కృష్ణన్ (అదా శర్మ), గీతాంజలి (సిద్ధీ ఇద్నానీ) అనే ఇద్దరు హిందూ విద్యార్థినిలు, నిమా (యోగితా బీహానీ) అనే క్రిస్టియన్ విద్యార్థిని, ఆసిఫా (సోనియా బలానీ) అనే ముస్లిం విద్యార్థిని నల్గురూ కేరళలోని కాసర్ గోడ్ లో నర్సింగ్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో వుంటారు. ఆసిఫా సిరియా ఉగ్రవాద సంస్థ ఐసిస్  స్లీపర్ సెల్ ఏజెంట్ గా వుంటుంది. ఈ స్లీపర్ సెల్ స్థానిక నాయకుడి ఆదేశాల ప్రకారం, ఇతర మతాల అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి మతంలోకి మార్చి, ముస్లిం యువకులతో ప్రేమలోకి దింపితే, ఆ ముస్లిం యువకులు పెళ్ళిళ్ళు చేసుకుని సిరియా తీసికెళ్ళి పోయి పవిత్ర యుద్ధంలో పాల్గొనాలని ప్లాను.
        
ఆసిఫాతో ఈ ప్లాను ఆలస్యమవుతూంటే, వాళ్ళని గర్భతుల్ని చేసి పెళ్ళికి దారి క్లియర్ చేయమని ఆదేశిస్తాడు నాయకుడు. ముస్లిం యువకుడు రమీజ్ తో ప్రేమలో పడ్డ శాలిని గర్భవతవుతుంది. ఇంకో ముస్లిం తో గీతాంజలి కూడా గర్భవతై ఆత్మహత్య చేసుకుంటుంది. నిమా సురక్షితంగా వుంటుంది. ఇక గర్భవతైన శాలిని పెళ్ళి చేసుకోమని అడిగితే, మతం మారితే చేసుకుంటా నంటాడు రమీజ్. విధిలేక ఆమె మతం మారితే,  పెళ్ళి జరిగే సమయంలో పరారవుతాడు. ఇక దిక్కుతోచని శాలిని వేరే ఒకడ్ని పెళ్ళి చేసుకోక తప్పదనీ, పెళ్ళి చేసుకుని సిరియా వెళ్తే అల్లా స్వర్గాన్ని అనుగ్రహిస్తాడనీ నూరిపోస్తాడు నాయకుడు. దీంతో శాలినీ ముక్కూ మొహం తెలీని వాణ్ని చేసుకుని సిరియా వెళ్ళాక, అక్కడ అసలు మోసం గ్రహిస్తుంది.

ఎలావుంది కథ

ఇది కేరళలో జరుగుతున్న లవ్ జిహాద్ ని పురస్కరించుకుని చేసిన కల్పిత కథ అన్నారు దర్శకుడు, నిర్మాత. టీజర్ లో 32000 అమ్మాయిలన్నారు, సినిమా విడుదలకి ముందు సుప్రీం కోర్టులో కాదు ముగ్గురు అమ్మాయిలే అన్నారు, సినిమాలో ఒకమ్మాయి కథే చూపించారు. ఇలా వుంది విశ్వసనీయత. అసలు లవ్ జిహాద్ పదాన్నే కేంద్రప్రభుత్వం గుర్తించడం లేదనీ, అలాటి కేసులు ప్రభుత్వ దృష్టికి రాలేదనీ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్ సభలో ప్రకటించాక, మత మార్పిడి చట్టం తేవాలన్న ఆలోచనే కేంద్ర ప్రభుత్వానికి లేనప్పుడు, కొన్ని  బీజేపీ రాష్ట్రాలే చట్టం చేస్తూ, దాన్ని లవ్ జిహాద్ చట్టమని అననప్పుడు, కేరళలో లవ్ జిహాద్ అంటూ దుమారం రేపిన కేసుని సుప్రీం కోర్టు కొట్టేసి, మతాంతర ప్రేమ జంటని ఏకం చేసినప్పుడు- ఇవన్నీ సాక్ష్యాలే. వీటిని కాదని బడాయికి పోయి అభూతకల్పనల, నమ్మదగని  సినిమా తీశారు.
        
కేరళలో మతశక్తులు లేవని కాదు. ఇరు వర్గాల మత శక్తులూ చక్కగా వున్నాయి. వీటి మధ్య సిరియా కనెక్షన్ తో కొట్లాటలు జరుగలేదు. ఇండియా నుంచి సిరియా కెళ్ళిన ముస్లింలు 100 మంది వరకూ వుంటారని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇందులో లవ్ జిహాద్ బాధితులైన హిందూ అమ్మాయిల లెక్క చెప్పలేదు. అయితే సినిమాలో చూపించిన ముగ్గురమ్మాయిల అనుభవాలూ నిజమని సినిమా కర్తలు చెప్తున్నారు. నిజమే కావచ్చు. అయితే మొత్తం ఒక రాష్ట్రాన్నీ, మతాన్నీ చెడుగా చూపిస్తూ సినిమా తీయడం సృజనాత్మక స్వేచ్ఛ అన్పించుకోదు, రాజకీయ ఎజెండా అన్పించుకుంటుంది. టెర్రరిజం మీద చాలా సినిమాలు తీశారు. ఇలా చూపించలేదు. ఒక వర్గం స్మగ్లర్లతో, మాఫియాలతో తీసిన సినిమాల్లో కూడా వీళ్ళని వ్యతిరేకించే అదే వర్గంలో మంచి వాళ్ళని కూడా చూపించారు. కానీ కేరళ స్టోరీ లో మొత్తం ఆ వర్గాన్ని బ్యాడ్ గా చూపించారు మంచిదే, రాజకీయ ఎజెండా కాబట్టి. కానీ మెజారిటీ వర్గాన్ని అసమర్ధులుగా చూపిస్తున్నామని తెలుసుకో లేదు అభూతకల్పిస్టులు.
        
ఇక కేరళ దృశ్యాలకి సిరియా వికృత దృశ్యాలు కలిపి చూపించడంతో రెచ్చగొట్టే కావాల్సినంత మసాలా దొరికినట్టయ్యింది. అయితే ఈ సిరియా దుర్మార్గాలు కొత్తగా చూస్తున్నవేం కావు. మీడియాలో తెలిసినవే. కేరళలో స్లీపర్ సెల్ నాయకుడంటాడు- ఔరంగజేబు ప్రారంభించిన పని మనం పూర్తి చేయాలని. ఇదొక వక్రీకరణ. ఔరంగజేబు తల్చుకుని వుంటే - వాళ్ళు పాలిస్తున్న ఈ దేశానికి హిందూస్థాన్ అని పేరు పెట్టుకునే వాళ్ళే కాదు.
        
పోతే, 2020 లో నెట్ ఫ్లిక్స్ సిరీస్ కాలిఫేట్ లో కూడా ఇలాగే స్వీడెన్ కి చెందిన ముగ్గురమ్మాయిల కథ. మోసపోయి సిరియా పవిత్ర యుద్ధం లో ఇరుక్కునే కథ చూడొచ్చు. 

నటనలు - సాంకేతికాలు 

అదా శర్మ నటించిన ఈ పాత్ర వేరే కమర్షియల్ సినిమాల్లోనైతే, విషయం తో కూడి వుండి - ఇంకెవరైనా సమర్ధురాలైన నటితో తీసి వుండేవాళ్ళు. తన మీద ఆధారపడ్డ ఈ కథలో కదిలించే, సానుభూతిని పొందే సన్నివేశాలన్నిటినీ చెడగొట్టింది. ఇందుకు కూడా నేషనల్ మీడియా అలాటి రేటింగ్స్ ఇచ్చి వుంటుంది. ఆమె నటన గురించి చెప్పుకునేందుకు ఏమీలేదు.
        
దర్శకుడు చిత్రించిన పాత్ర గురించి చెప్పుకోవాలి. నర్సింగ్ చదువుతున్న తను సేఫ్ సెక్స్ తెలియనట్టు గర్భం తెచ్చుకోవడం, పెళ్ళి కోసం మతం మార్చుకోవడం, పెళ్లి కొడుకు పారిపోతే ఇంకొకడ్నిపెళ్ళి చేసుకోవడం, వాడితో అల్లా ఆనుగ్రహించే స్వర్గం కోసం సిరియా వెళ్ళడం లాంటివి‌ చేసేస్తూంటుంది.
        
ఆసిఫా ప్లాను ప్రకారం పబ్లిక్ గా నల్గురు కుర్రాళ్ళ చేత ఈవ్ టీజ్ చేయించి  బట్టలు చించేస్తే, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి లోపలేయించకుండా ఆసిఫా మాటల్ని నమ్ముతుంది. బురఖా వేసుకుంటే రేపులు జరగవని ఆసిఫా చెప్పింది నమ్మేసి బురఖాలు వేసుకోవడం మొదలెడతారు. అల్లా గురించి ఏవో మాటలు ఆసిఫా చెప్తే, నమ్మేసి ముస్లిం కుర్రాళ్ళని ప్రేమిస్తారు. గర్భవతులవుతారు. మోసపోయానని తెలిసీ గీతాంజలి కంప్లెయింట్ ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకుంటుంది.  కూతురు (అదాశర్మ) పెళ్ళవుతూంటే వచ్చేసిన ఆమె తల్లి, ఏడ్చి వెళ్ళి పోతుంది. ఆమె కంప్లెయింట్ ఇచ్చి వుంటే  స్లీపర్ సెల్ ముఠా అప్పుడే కటకటాల్లో వుండేది. కూతురు దక్కేది.
        
ఇలా అడుగడుగునా పాత్రలు అసమర్ధంగా ప్రవర్తిస్తే ఈ కథకి వేరే అర్ధాలొస్తాయని దర్శకుడు గ్రహించ లేదు. తమతోనే వుంటూ ఆసిఫా కుట్రలు చేస్తోందని తెలిసిపోతున్నప్పుడు- రెండు పీకుళ్ళు పీకితే సరిపోయేదానికి ప్రాణాల మీదికి  తెచ్చుకున్న సిల్లీ పాత్రలివి.
        
సాంకేతికంగా అరాచకంగా వుంది. కేరళ దృశ్యాలు గానీ, సిరియా దృశ్యాలు గానీ పూర్ గా వున్నాయి. యాక్షన్ సీన్స్ కి అవకాశం లేదు. అదాశర్మ చివర్లో పారిపోయే రెండు మూడు దృశ్యాలు కూడా క్లయిమాక్స్ ని నీరుగార్చేస్తాయి. మనీషా కోయిరాలాతో తీసిన కాబూల్ ఎక్స్ ప్రెస్ లో గానీ, ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్ లో గానీ టెర్రిఫిక్ గా దృశ్యాలుంటాయి. ఇక కేరళ సంగీతం, పాటలు ఒరిజినల్ హిందీ వెర్షన్లో తమాషాగా వున్నాయి.

చివరికేమిటి

సిరియా వదిలి పారిపోతూ అంతర్జాతీయ దళాలకి చిక్కిన అదా శర్మ తన కథ చెప్పుకోవడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇక్కడికి రావడానికి ముందు కేరళలో జరిగిన కథంతా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తూంటుంది. దీంతో పాటు సిరియాలో ఎదుర్కొన్న అనుభవాలూ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా సెకండాఫ్ పై వరకూ సాగుతూనే వుంటాయి. ఆమె భద్రతా దళాలకి దొరికిన ప్రధాన కథ అక్కడే వుంటుంది ఏమీ జరక్కుండా. దీంతో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు చూసీ చూసీ విసుగొచ్చేస్తుంది. ముందుకూ వెనక్కీ కదిలే ఈ నాన్ లీనియర్ నేరేషన్ వల్ల ఏదైనా బలం వుంటే అది కథ కోల్పోయింది. ఆమె మొత్తం చెప్పడం ముగించాక భద్రతా దళాల క్యాంపులోనే సినిమా ముగుస్తుంది.
        
ఇలాటి విశ్వసనీయత, సృజనాత్మకత, నటనలు, డ్రామా వున్న కథకి ఉపసంహారంగా ఇద్దరు బాధితుల స్టేట్మెంట్లు జత చేశారు. ఇక్కడ 32000 మంది ప్రస్తావన లేదుగానీ, సెకండాఫ్ లో క్రిస్టియన్ అమ్మాయి పాత్ర- పోలీసు అధికారులకి చెప్తుంది-  చాలా డేటా అందిస్తుంది. ఇంత డేటా తెలిసి వుంటే ఎలా మోసపోయిందో పక్కన పెడితే, మొత్తం 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ చెప్పారనీ తప్పుడుగా చెప్తుంది. సుప్రీం కోర్టుకి టీజర్ నుంచి 32000 అంకె తొలగిస్తామని చెప్పిన నిర్మాత సినిమాలోంచి తొలగించలేదు. 2006-12 మధ్యకాలంలో 2667 మంది యువతులు స్వచ్ఛందంగా ఇస్లాంలోకి మారారని మాత్రమే చాండీ అసెంబ్లీలో ప్రకటించారు. దీన్ని 3000 చొప్పున తానే లెక్కకట్టి, ఆ తర్వాత పదేళ్ళలో-ఇప్పటికి 30 వేలు అని చెప్పేసినట్టుంది ఆమె!
        
ఈ అంకెల సంక్షోభమేమిటో నిన్న గుజరాత్ స్టోరీ ప్రకటించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరేయే చెప్పాలి! కానీ అంకెలు ఇప్పుడెంత సరిదిద్దినా వెళ్ళాల్సిన 32000 సంఖ్య  ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయాక దాంతో అనుకున్న ఎజెండా హిట్టయినట్టే! హేట్సాఫ్ టు రెండో వివేక్ అగ్నిహోత్రీ...

—సికిందర్