రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, అక్టోబర్ 2015, గురువారం

సాంకేతికం- ఎడిటింగ్

జి.జి. కృష్ణారావు

 శ్రీ రామరాజ్యంతో బాపూ రమణల రామాయణ అబ్సెషన్ తిరిగి వెండితెర మీద జ్వాజల్యమాన 
మవుతున్నప్పుడు మొట్ట మొదటిసారిగా 
ఆ క్యాంపులోకి  అడుగుపెడుతున్న కె. విశ్వనాథ్ స్కూలు ఎడిటర్ జి.జి. కృష్ణారావు...


                                    
                                 తానిప్పుడు శివాలయం నుంచి రామాలయంలోకి బదిలీ అయ్యారు. తన కెరీర్ లో కూడా ఇదే తొలి పౌరాణికమయ్యింది. ఆనాడు ఆదుర్తి సుబ్బారావుతో మొదలై,  దాసరి నారాయణరావుతో కొనసాగి, విశ్వనాథ్  దగ్గర  సెటిలైన తను నూరు సినిమాల ఓల్డ్ మాస్టర్. మూడు నందుల గ్రహీత. ప్రతిష్టాత్మక ‘శంకరాభరణం’ ఎడిటర్ కూడా.

                              ‘షాట్స్ స్పీక్స్..’ అని విశ్వనాథ్ గురించి చెప్పడం ప్రారంభించారు. ‘ఆయన షాట్సే కథ చెప్తాయి. ఎడిటింగ్ లో ఆయన స్మూత్ నెస్ ని కోరుకుంటారు. ‘శంకరాభరణం’ ఎడిటింగ్ విషయంలో ప్రత్యేకంగా నేను కష్ట పడిందేమీ లేదు. అన్ని సినిమాలకి లాగే దానికీ చేశాను. అప్పట్లో ఎడిటింగ్ కి నంది అవార్డు లేదు గానీ వుంటే తప్పకుండా నాకొచ్చేది ‘శంకరాభరణం’ కి..’ అని  చెప్పుకొచ్చారు. 


                              తర్వాత ‘సాగర సంగమం’, ‘శృతిలయలు’, ‘శుభసంకల్పం’ అనే మూడు విశ్వనాథ్ సినిమాలతోనే ఆలోటు కూడా తీరిపోయింది మూడు నందు లందు కోవడంతో!

                              స్మూత్ ఎడిటింగ్ ని పదేపదే ప్రస్తావించారాయన. కానీ ఇప్పుడు అలాంటి ఎడిటింగ్ కి కాలం తీరిందని మనకి తెలుసు. అలాంటప్పుడు ఈ రోజుల్లో ఒక ‘సింహా’ లాంటి భారీ యాక్షన్ సినిమాకి ఎడిటింగ్ చేయాల్సి వస్తే తన పరిస్థితేంటి?-  అనడిగితే- 

                               ‘ఆ ఏముందిలెద్దూ..ఆ రోజుల్లో దాసరి తీసిన చాలా సినిమాల్లో యాక్షన్ సీన్స్ కి ఏ ఆప్టికల్సూ వాడకుండా, అయినా ఎఫెక్టు తగ్గకుండా ఎడిటింగ్ చేశానుగా..’ అని  తేలిగ్గా నవ్వేశారు. 

                              ఈ నవ్వు తర్వాత  నిస్పృహ ...ఇవ్వాళ ఎడిటర్లు మనసు చంపుకుని పని చేస్తున్నారనేది ఒక వాస్తవం. దీన్ని ప్రస్తావిస్తే, ఆయన ఏకీభవిస్తూ- ‘వాట్ డైరెక్టర్స్ వాంట్ ఈజ్ అవర్ అట్ మోస్ట్ ప్రయారిటీ’ అన్నారు. ‘దర్శకులు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రకరకాల పద్ధతులు అవలంబిస్తారు విజువల్ గా..ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ తీరుతెన్నుల్ని గమనిస్తున్నారు. జెర్కీ కట్స్ తో, వీలైనన్ని ఎక్కువ ఎఫెక్ట్సు వేస్తే ఎడిటింగ్ ఫస్టుగా చేశాడ్రోయ్ అనుకుంటున్నారు..పైకి మేం దర్శకుల, ప్రేక్షకుల టేస్టుకి ఓటేసినా, లోలోప బాధపడుతూనే వుంటాం.. అదసలు ఎడిటింగే కాదనుకుంటాం- ఏం చేస్తాం?’ అన్నారు నిస్పృహగా. 

                          ‘ఒకప్పుడు హీరో కొడితే కింద పడిపోయే వాడు విలన్..అది బావుందనుకున్నారు. తర్వాత గాల్లోకి లేచి కాస్సేపు అలా నిల్చిపోవడం మొదలెట్టాడు. ఇదీ బావుందనుకున్నారు. దీని తర్వాతేంటి? ఒక ‘రోబో’ ని  వదిలి  ప్రేక్షకుల్ని ఆకలి గొన్న పులుల్ని చేశారు. దీని తర్వాతేంటి? ఇలా ఎక్కడిదాకా పోతారు? ఎక్కడో ఒక చోట కుప్పకూలాల్సిందే. ప్రేక్షకులకి ఎంత ఎక్కువగా టెక్నాలజీ అలవాటు చేస్తే అంత ఎక్కువ కోరుకుంటారు. అందుకని సినిమాల్ని మంచి కథావస్తువుతో, మనస్సుకి హత్తుకునేలా విలువల్ని పెంపొందించేలా తీస్తే ఏ గొడవా వుండదు ’ అని వివరించారు.

                              ఒకప్పుడు ఫీల్ తో చేసిన ఎడిటింగ్ ఇప్పుడు మెకానికల్ గా మారిందన్నారు.
మూవీయోలా రోజుల్లో ఆ యంత్రంలో రీలు రన్ అవుతూంటే, సరైన షాటు కన్పించిందా- ‘ఇదిరా షాటూ!’ అని చేతులు చాచి ఉద్వేగంగా పట్టుకునే వాళ్ళమన్నారు. ఇప్పుడు ఎవిడ్ లో యాంత్రికంగా క్లిక్ చేసి సరిపుచ్చు కుంటు న్నామన్నారు.

                              దర్శకుడు ఎంతయినా ఫిలింని  ఎక్స్ పోజ్ చేయవచ్చు, కానీ ఒక దృశ్యంలో ఫీల్ ఎంత ఉండాలో తెలిసి ఎడిట్ చేసిన వాడే గొప్ప ఎడిటరని అన్నారాయన. ఒక్కో కథకీ ఒక్కో వేగంతో నడక (పేస్) ఉంటుందనీ, ఆ నడకని  కూడా దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ చేయాల్సి ఉంటుందనీ అన్నారు. 


                              ఇప్పుడు సమ్మె కారణంగా ‘శ్రీరామ రాజ్యం’ ఎడిటింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. తగు మోతాదులో సీజీ వర్క్స్ ని కూడా కలిగివుండే ఈ సినిమా విషయంలో తనకి కంగారేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన కృష్ణా రావు, మిలటరీలో చేరబోయి ఎలాగో పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ఎడిటింగ్ కోర్సులో పడ్డారు. 1961-62 లలో అప్పుడప్పుడే ఆ ఇనిస్టిట్యూట్ ప్రారంభమయింది. అప్పుడు అక్కడికి వచ్చిన  సుప్రసిద్ధ దర్శకుడు ఆదుర్తి  సుబ్బారావు కృష్ణారావుని చూసి- ‘యూ కమ్ అండ్ మీట్ మీ ఇన్ మెడ్రాస్’  అన్నారు.

                            అప్పుడు ‘మూగమనసులు’ ఎడిటింగ్ పనులు పూర్తి కావచ్చి,  ‘గౌరమ్మా  నీ మొగుడెవరమ్మా’ పాట దగ్గరుంది.. ఎడిటర్ టి. కృష్ణ కి అసిస్టెంట్ గా ఆ సినిమాకి పని చేసి, తర్వాత  ఆదుర్తే తీసిన ‘తేనేమనసులు’ కీ అసిస్టెంట్ గానే చేశారు. ఆతర్వాత ఆదుర్తి బాంబే  తీసికెళ్ళి తను తీస్తున్న ‘జ్వార్ భాటా’ (దాగుడుమూతలు) ఎడిటింగ్ బాధ్యతలప్పగించారు. అదే ఎడిటర్ గా కృష్ణారావు తొలి సినిమా. వడ్డే శోభానాద్రీశ్వర రావు తీసిన ‘పాడవోయి భారతీయుడా’ ఎడిటర్ గా తెలుగులో తన మొదటి సినిమా. 

                        మిలిటరీలో చేరిపోయే అవకాశం ఎలాగో తప్పినా, ఆ తర్వాత ఎడిటర్ గా ఢిల్లీ వెళ్లినప్పుడు అప్పుడున్న టీవీ కేంద్రంలో చేరిపోయారు. కానీ ఇలా నెలనెలా జీతం తీసుకుంటూ కాంప్రమైజ్ అయిపోవడమేనా, ఏమైనా రిస్కు చేసి నీ టాలెంటుని ఇంకా సువిశాలం చేసుకునేదేమైనా ఉందా? - అన్న టాక్ వచ్చి, అదృష్టంకొద్దీ ఆదుర్తి, దాసరి, విశ్వనాథ్ ల తర్వాత..ఇప్పుడు బాపూకి దక్కారాయన!


-సికిందర్ 
(జనవరి 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమాటెక్’ శీర్షిక)