సినిమా స్క్రిప్ట్ & రివ్యూ
Saturday, November 1, 2025
Friday, October 31, 2025
1390 : స్క్రీన్ ప్లే సంగతులు
‘‘ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ '-అక్టోబర్ 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న హాలీవుడ్ మూవీ ప్రపంచ ప్రేక్షకుల నుంచి మెప్పుదలలు, మొట్టి కాయలు రెండూ ఎదుర్కొంటోంది. ఆస్కార్ అవార్డు పొందిన దర్శకురాలు కేథరీన్ బిగేలో ఇలాటి అర్ధం లేని సినిమా ఎలా తీసిందా అని, లేదు అర్ధవంతమైన సినిమానే తీసిందనీ - ప్రేక్షకులతో బాటు రివ్యూ రైటర్లూ కామెంట్లు విసురుతున్నారు. సినిమాల గురించి భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ వుంటాయి. అవి కంటెంట్, మేకింగ్ వంటి ఓవరాల్ ప్రయత్నం గురించి తప్ప మరీ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వంటి క్రియేటివ్ ప్రక్రియ గురించి ఎవరికీ పట్టింపు వుండదు. కారణం సినిమాల్ని కొంచెం అటు ఇటుగా త్రీయాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో చూస్తూ అలవాటు పడిపోవడం వల్ల. ఇందులో పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథలు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలూ, కథ గాక గాథలూ వంటి సవాలక్ష సాంకేతిక లోపాలు పెద్దగా తెలియవు. కానీ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ నే పూర్తిగా మార్చేస్తూ ప్రయోగం చేస్తే రెగ్యులర్ కథాగమనానికి, ఆ వీక్షణానుభవానికీ తీవ్ర భంగం కలిగిందనిపించి ఇది సినిమా కాదు పొమ్మని వెళ్ళిపోతారు. ఒక పాటలో చరణాలు ఎత్తేసి పల్లవులే వినిపిస్తూ వుంటే ఎలా వుంటుంది? ఇదే ఈ సినిమా కథతో కనిపిస్తుంది. అభిరుచిగల ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగంతో ఆ దర్శకుడు లేదా దర్శకురాలి కవి హృదయాన్ని అర్ధంజేసుకుని ఆనందిస్తారు. దర్శకురాలు బిగేలో, రచయిత నోవా ఒపెన్హీం కలిసి ఈ వెలుగు నీడల సయ్యాటల్నే సృష్టించారు. జగ్రత్తగా చూస్తే ఈ ఏ కీలుకా కీలుగా విరిచేసినట్టున్న స్ట్రక్చర్ లో తెలుగు సినిమాలు స్క్రీన్ ప్లేల పరంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకి సమాధానాలు కనిపిస్తాయి. ఈ సమాధానాలతో తమ సినిమాల్ని సరిదిద్దుకోవచ్చా లేదా అనేది మేకర్స్ ఇష్టాయిష్టాలకి వదిలేద్దాం. కానీ ఈ సమాధానాలు సవాలు చేస్తూ వెన్నంటే వుంటే ఏం చేయాలి? స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో ఈ కొత్త ప్రయోగం పేరేమిటి? రాంగోపాల్ వర్మ ‘శివ’ ని ఇలాగే తీస్తే ఎలా వుండేది?
ముందుగా సినిమా కథేంటో చూద్దాం - అలస్కాలోని ఫోర్ట్ గ్రీలీలో ఆ రోజు… అక్కడ మేజర్ డేనియల్ గొంజాల్వెస్ (ఆంథోనీ రామోస్) సైనిక స్థావరంలో నిఘా ఇంఛార్జిగా వుంటాడు. గగన తలంలో ప్రమాదాల్ని గుర్తించి ఇంటర్సెప్టర్ క్షిపణులతో వాటిని నాశనం చేయడం అతడి డ్యూటీ. అతను యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ కమాండ్ తో కనెక్ట్ అయి వుంటాడు.
కెప్టెన్ ఒలీవియా వాకర్ (రెబెక్కా ఫెర్గూసన్) వైట్ హౌస్ లోని వాచ్ రూమ్లో సీనియర్ ఆఫీసర్. ఉదయం తొమ్మిదిన్నరకి ఆమె రాడార్ స్క్రీన్ మీద పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దూసుకురావడాన్ని గమనిస్తుంది. మొదట్లో అదేదో ఉత్తర కొరియా జరుపుతున్న సాధారణ క్షిపణి పరీక్ష కావచ్చనుకుంటుంది. కానీ దాని ప్రయాణం కక్ష్య మార్చుకోవడంతో అది షికాగో నగరాన్ని టార్గెట్ చేసుకుని దూసుకొస్తున్నట్టు గ్రహిస్తుంది…అంటే ఇంకో 18 నిమిషాల్లో షికాగో గగన తలాన్ని తాకుతుందన్న మాట. వెంటనే వ్యవస్థల్ని అప్రమత్తం చేస్తుంది. డిఫెన్స్ సెక్రెటరీ, వివిధ వార్ కమాండ్స్ సహా అమెరికా అధ్యక్షుడు అప్రమత్తమవుతారు.
కానీ క్షిపణిని ఏ దేశం ప్రయోగించిందో తెలుసుకోలేక పోతారు. ఇక అలస్కా లోని సైనిక స్థావరానికి ఆదేశాలిస్తారు. మేజర్ డేనియల్ గొంజాలేస్ సిబ్బంది దూసుకొస్తున్న ఆ క్షిపణి మీదికి రెండు ఇంటర్ సెప్టర్స్ ని ప్రయోగిస్తారు. రెండూ క్షిపణిని తాకకుండా మిస్సవుతాయి. ఒలీవియాకి ఆందోళన పెరుగుతుంది. క్షిపణి దాడికి ఐదు నిమిషాలే మిగిలి వున్నాయి- వెంటనే భర్తకి ఫోన్ చేసి కొడుకుని తీసుకుని వీలైనంత దూరంగా వెళ్ళి పొమ్మని చెబుతుంది. కౌంట్ డౌన్ పడిపోతూండగా- ప్రతీకారంగా మనం అణ్వాయుధాల్ని ప్రయోగించాలా వద్దా అనే దానిపై సైనిక జనరల్ ఆంటోనీ బ్రాడీ (ట్రేసీ లెట్స్) అధ్యక్షుడిని అడుగుతాడు. దీంతో స్క్రీన్ బ్లాంక్ గా మారుతుంది...
ఇదీ బిగినింగ్ -1
పైన చెప్పుకున్నది రెగ్యులర్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో వచ్చే యాక్ట్ వన్ (బిగినింగ్) విభాగం. ఇక్కడ పాత్రల పరిచయం (సీనియర్ ఆఫీసర్ కెప్టెన్ ఒలీవియా, మేజర్ డేనియల్, సైనిక జనరల్ ఆంటోనీ బ్రాడీ తదితరులు), కథా వాతావరణం ఏర్పాటు (రక్షణ వ్యవస్థ కలాపాలు),సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన (రాడార్ స్క్రీన్ మీద శత్రు క్షిపణి కదలికలు), సమస్య ఏర్పాటూ (శత్రు క్షిపణిని పేల్చి వేయడంలో వైఫల్యం) అన్న నాల్గు బిగినింగ్ విభాగపు టూల్సూ ఇందులో పని చేశాయి. నిడివి 30 నిమిషాలు.అంటే శత్రు క్షిపణిని పేల్చడంలో ఎదురైన వైఫల్యంతో స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ 1 ఏర్పాటయ్యిందన్న మాట. అంటే ఇప్పుడు మిస్సైన శత్రు మిస్సైల్ తో షికాగో నగరానికి పెను ముప్పు నిమిషాల వ్యవధితో సమీపించిందన్న మాట. అది పేలితే నగరం పాతిక లక్షల మంది సహా నాశనమవుతుందన్న మాట.అంటే దీన్ని ఎట్టి పరిస్థితిలో నివారించాలన్న గోల్ రక్షణ వ్యవస్థ కేర్పడిందన్న మాట. ఈ గోల్ సాధించాలంటే శత్రు క్షిపణిని ప్రయోగించిన దేశమేదో తెలియాలి. ఇది తెలియడం లేదు. శత్రు క్షిపణిని ఆపే అవకాశం కనిపించడం లేదు. అంటే షికాగో నగరాన్ని కోల్పోక తప్పదు. ఇందుకే దీనికి ప్రతీకారంగా అనుమానిత దేశాల పైకి అణ్వాయుధాల్నిప్రయోగించాలా వద్దా అని సైనిక జనరల్, దేశాధ్యక్షుడ్ని అడిగాడు. సమాధానంగా స్క్రీన్ బ్లాంక్ అయింది- దీంతో యాక్ట్ వన్, అంటే బిగినింగ్ విభాగం ముగిసింది.
లాక్ చేసిన సస్పెన్స్
ఏమిటీ సస్పెన్స్? విషయం మీద దుప్పటి కప్పేసినట్టు స్క్రీన్ బ్లాంక్ అయింది? అంటే షికాగో నగరం నాశనమైందనుకోవాలా? ప్రతీకారంగా అధ్యక్షుడు ఆదేశాలిచ్చేశాడా? మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందా? ఇప్పుడేం జరగబోతోంది? ఎటూ కాని క్లిఫ్ హేంగర్ మూమెంట్ తో సస్పెన్స్ లో పడేస్తూ ముగిసింది బిగినింగ్ విభాగం. క్లిఫ్ హేంగర్ మూమెంట్ అంటే లోయలో జారిపడుతూ కొండ చరియని పట్టుకు వేలాడే పరిస్థితి అన్న మాట. ఇది ప్రేక్షకులకి కల్పించిన పరిస్థితి.ఈ పరిస్థితిలో స్క్రీన్ ప్లేలో యాక్ట్ టూ- అంటే కథ ముందుకెళ్తూ మిడిల్ విభాగం మొదలైతే, అసలేం జరిగివుంటుందో ఇప్పుడు తెలుస్తుంది కదాని లొట్టలేసుకుంటూ చూస్తూంటాం కదా? అంత ఆశలేం పెట్టుకోవద్దు. ఆశించినట్టు ఏం జరగదు. కోర్టు వ్యవహారాల్లో తీర్పు రిజర్వ్ చేసినట్టు, ఇక్కడ కథలో సస్పెన్సు రిజర్వ్ అయిపోయింది. కథ ముందు కెళ్ళడం లేదు. బిగినింగ్ ముగుస్తూ మిస్సైల్ మిస్సై ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడ్డాక, ఆ తర్వాతి కథతో స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం ప్రారంభం కావడం లేదు. మరేం జరుగుతోంది? కథ మొదటి కొచ్చి ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ విభాగమే రిపీటవబోతోందన్న మాట!
ఇదేంటి? ఇదింతే! ఇది సహజమైన - సార్వజనీన త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు. అసహజ స్ట్రక్చర్. ఇప్పుడు చూడబోతోంది బిగినింగ్ తర్వాత మిడిల్ కాదు, మళ్ళీ బిగినింగే! కథ వెనక్కే. ఫ్లాష్ బ్యాకులతోనే కాదు, నాన్ లీనియర్ కథనం ఇలా కూడా వుంటుందన్న మాట ఫస్ట్ యాక్ట్ రిపీటవుతూ. మొదట ప్రారంభమైన బిగినింగ్ కెప్టెన్ ఒలీవియా దృక్కోణం లో సాగింది. ఇప్పుడు ఈ రెండో బిగినింగ్ సైనికాధికారుల, సీనియర్ వైట్ హౌస్ అధికారుల దృక్కోణాల నుంచీ …
బిగినింగ్ -2 చూద్దాం
మళ్ళీ పాత్రల పరిచయం, అదే కథా వాతావరణం ఏర్పాటు, అదే సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన- దాన్ని నివారించేందుకు హడావిడీ, సమస్య ఏర్పాటూ- ఈ నాల్గు బిగినింగ్ విభాగపు టూల్సూ మళ్ళీ రిపీటవుతాయి.ఈ బిగినింగ్ టూ నిడివి కూడా 30 నిమిషాలు. ప్రాథమికంగా, క్షిపణిని ఎవరు ప్రయోగించారో స్పష్టంగా తెలియకపోయినా, అమెరికా అణ్వాయుధాలతో శత్రువులపై దాడి చేయడం ప్రారంభించాలని మిలిటరీ జనరల్ బ్రాడీ విశ్వసిస్తాడు. అదే సమయంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం వుందని డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ (గాబ్రియేల్ బాసో) విశ్వసిస్తాడు. అమెరికా అణ్వాయుధాలని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నందున ప్రత్యర్థులు కూడా అదే విధంగా చేయమని ప్రేరేపించి నట్టవుతుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధానికి దారితీస్తుందనీ హెచ్చరిస్తాడు.ఉత్తర కొరియా నిపుణురాలు అన్నా పార్క్ (గ్రేటా లీ)తో సంప్రదించడానికి జేక్ సమయం కావాలని వేడుకుంటాడు. ఆమెకి పరిస్థితిపై మరింత అవగాహన వుంటుందని అతడి నమ్మకం. ఈ క్షిపణి ప్రయోగం వెనుక ఉత్తర కొరియా లేదా రష్యా వుండే అవకాశం వుందని ఆమె జేక్తో చెబుతుంది. జేక్ మరింత సమాచారం సేకరించాలనుకుంటే సమయం మించిపోతోంది. క్షిపణి షికాగో మీదికి దూసుకొచ్చేస్తోంది…
అమెరికా తన సొంత దళాల్ని సమీకరించడం ద్వారా ప్రతిస్పందిస్తున్న ప్రత్యర్థులపై ముందస్తుగా దూకుడుగా దాడి చేయాలని జనరల్ బ్రాడీ అధ్యక్షుడిని ఒత్తిడి చేస్తాడు. ఈ క్షిపణి వెనుక ఎవరైతే వున్నాడో ఆ వ్యక్తి ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించాలనుకుంటున్నాడని అనుకోవాలని వాదిస్తాడు.
మరోవైపు, షికాగోకి క్షిపణితో ఏం జరుగుతుందో చూసే వరకు ఏ దేశంపైనా దాడి చేయ వద్దని జేక్ అధ్యక్షుడిని కోరతాడు. ఆ క్షిపణి పని చేయక పోవచ్చని, పేలకుండా నేల కూలిపోయే అవకాశం కూడా వుందని అంటాడు. అధ్యక్షుడు ఆలోచించడానికి ఒక నిమిషం సమయం అడుగుతాడు. అణు దళాలు సిద్ధంగా వుండడంతో - అధ్యక్షుడు తన అధికార కోడ్ని అందిస్తాడు. జనరల్ బ్రాడీ అధ్యక్షుడి ఆదేశాల్ని అడుగుతాడు. అధ్యక్షుడు సమాధానం చెప్పే ముందు, స్క్రీన్ బ్లాంక్ గా మారుతుంది…
మళ్ళీ అక్కడే, అలాగే…
మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది కథ. మళ్ళీ దుప్పటి కప్పేశాడు రైటర్. ఇప్పుడు సస్పెన్స్, ఉత్కంఠ రెట్టింపయ్యాయా? ఈ బిగినింగ్ 2 దాటి ఈసారి కథ మిడిల్ తో ముందు కెళ్తుందేమో చూద్దామనుకుంటే ఇంటర్వెల్ కూడా పడింది. మళ్ళీ అదే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కొచ్చి ఆగింది. ఇంతకీ ఏం జరుగుతోంది కథ వెనకాల కథ? అధ్యక్షుడు ఆదేశాలిచ్చేశాడా? క్షిపణి షికాగో మీద పడిందా? లేక ఫెయిలై పోయిందా? విషయాన్నిఒకసారి కాదు రెండు సార్లు దాచి పెట్టి ఇంకెప్పుడు రివీల్ చేస్తారు ప్రేక్షకులకి?ఇంటర్వెల్ లో కొత్త మలుపు కూడా రాలేదు. బిగినింగ్ 1 ప్లాట్ పాయింట్ వన్నే తిరిగి బిగినింగ్ 2 కి కూడా ఏర్పడింది. ఇలా ఎన్నిసార్లు అదే క్లిఫ్ హేంగర్ మూమెంట్ లో వేలాడదీసి వదిలేస్తారు ప్రేక్షకుల్ని? కథ రెండోసారి కూడా బిగినింగ్ దాటి ముందు కెళ్ళడం లేదని అసంతృప్తి చెందరా ప్రేక్షకులు? ఒకసారి పంక్చరైందని పంక్చరేసి స్టార్ట్ చేస్తే, మళ్ళీ పంక్చరవడం తూట్లు పడ్డ కథని మామీద రుద్ది రిపేర్లు చేస్తున్నారని తిరగబడరా ప్రేక్షకులు? ఎందుకు నార్మల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని కాదని ఇంత రిస్కు తీసుకోవడం?
‘శివ’ లో నాగార్జున జేడీ మీద సైకిలు చైనుతో తిరగబడే ప్లాట్ పాయింట్ వన్ సీను తర్వాత కథ ముందు కెళ్ళకుండా స్క్రీన్ ని బ్లాంక్ చేసి- ఇది నాగార్జున పాయింటాఫ్ వ్యూ అని చెప్పి- మళ్ళీ ఇదే కథ మొదలెట్టి, ఇలాగే నాగార్జున జేడీ మీద సైకిలు చైనుతో తిరగబడే ప్లాట్ పాయింట్ వన్ సీను తర్వాత -మళ్ళీ స్క్రీన్ ని బ్లాంక్ చేసి- ఇది జేడీ పాయింటాఫ్ వ్యూ అని చెప్పి ఇంటర్వెల్ వేస్తే ఎలా వుంటుంది?
బిగినింగ్ -3 కూడా ఇంతే!
ఇప్పుడు సెకండాఫ్ ప్రారంభిస్తే- ఈసారి అధ్యక్షుడి పాయింటాఫ్ వ్యూలో స్టోరీ- మళ్ళీ ఫస్టాఫ్ లో చూపించిన బిగినింగ్ నుంచీ మూడోసారి రిపీట్.మళ్ళీ పాత్రల పరిచయం, అదే కథా వాతావరణం ఏర్పాటు, అదే సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన- దాన్ని నివారించేందుకు హడావిడీ, సమస్య ఏర్పాటూ- ఈ నాల్గు బిగినింగ్ విభాగపు టూల్సే మూడోసారీ రిపీటవుతాయి.ఇప్పుడు దేశాధ్యక్షుడు (ఇడ్రిస్ ఎల్బా) ప్రత్యక్షమవుతాడు. ఫస్టాఫ్ లో రెండు బిగినింగ్స్ లో ఇతను కనిపించడు. ఫోన్లో వాయిస్ వినిపిస్తూంటుంది. ఈ మూడో బిగినింగ్ లో ఒక టీనేజీ బాస్కెట్ బాల్ ఈవెంట్ కి హాజరై కన్పిస్తాడు. వెంట రెడీగా బ్రీఫ్ కేసు పట్టుకుని లెఫ్టినెంట్ కమాండర్ రాబర్ట్ రీవ్స్ (జోనా కింగ్)వుంటాడు. ఆ బ్రీఫ్ కేసుని ‘న్యూక్లియర్ ఫుట్ బాల్’ అంటారు. అది పట్టుకుని డిఫెన్స్ సెక్రెటరీ రీవ్స్ ఎల్లప్పుడూ అధ్యక్షుడి వెంట వుంటాడు. ఏ అత్యవసర క్షణంలో అణు దాడికి అదేశాలివ్వాల్సిన అవసరమొస్తుందో తెలీదు- ఆ క్షణం అధ్యక్షుడు బ్రీఫ్ కేసులో వున్నన్యూక్లియర్ ఫుట్ బాల్ తెరిచి మీట నొక్కి అదేశాలిచ్చేసేందుకు వీలుగా, ఈ 24 x 7 అందుబాటులో వుండే ఏర్పాటు.
అటు డిఫెన్స్ సెక్రెటరీ రీడ్ బేకర్ (జేర్డ్ హేరిస్) భయాందోళలకి గురై, షికాగోలో వున్న కుమార్తెని తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. అది అసాధ్యమవడంతో, భద్రతా సమావేశాల్ని ఎగ్గొట్టి కుమార్తెకి వీడ్కోలు చెప్పడానికి కాల్ చేస్తాడు. క్షిపణి దాడితో కుమార్తె ఇక బ్రతకదని, కుమార్తె లేని జీవితాన్ని ఊహించలేననీ ఆమెకి వీడ్కోలు చెప్పి, భవనం మీంచి దూకేస్తాడు.
విమానంలో అధ్యక్షుడు మిసైల్ దాడి గురించి తెలుసుకుని, లెఫ్టినెంట్ కమాండర్ రాబర్ట్ రీవ్స్ ని అడుగుతాడు. రీవ్స్ న్యూక్లియర్ ఫుట్బాల్ లోని ఆప్షన్స్ గురించి చెప్తాడు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి ఆప్షన్స్ సాంకేతికాల్ని వివరించమంటాడు అధ్యక్షుడు. రీవ్స్ వివరించడం మొదలెడతాడు.
జనరల్ బ్రాడీ కాల్ చేసి అధ్యక్షుడి నిర్ణయం అడుగుతాడు. అధ్యక్షుడు తన భార్యకి ఫోన్ చేసి, అణు ముప్పు గురించి, తాను తీసుకోవలసిన నిర్ణయం గురించీ చెబుతూంటే, కాల్ కనెక్షన్ తెగిపోతుంది.
అధ్యక్షుడు తిరిగి జనరల్ బ్రాడీకి కాల్ చేసి, తన అధికార కోడ్ని బిగ్గరగా చదువుతాడు. రీవ్స్ నుంచి న్యూక్లియర్ ఫుట్బాల్ని తీసుకుంటాడు. దాన్ని తెరిచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటోండగా- బ్లాంక్ అయిపోతుంది స్క్రీన్!
ప్చ్, ఇదంతా ట్రిప్టిచ్చే!
మూడోసారీ ఆ ఘట్టం దగ్గరే స్క్రీన్ బ్లాంక్. మాటిమాటికీ కరెంట్ పోతూంటే ఎలా వుంటుందో అలాటి పరిస్థితే ప్రేక్షకులకి. మూడో సారీ అక్కడికే వచ్చి ఆగింది కథ! అదే బిగినింగ్- అదే ప్లాట్ పాయింట్ వన్- అదే బ్లాంక్ స్క్రీన్! ఈ చెలగాటం ఆత్మహత్యా సదృశమే. అయినా వదిలిపెట్టడం లేదు రైటర్, డైరెక్టర్. పైన చెప్పుకున్నట్టు ‘శివ’ లో ప్లాట్ పాయింట్ వన్ ని రెండు రౌండ్లు తిప్పి ఇంటర్వెల్లో పడేశాక- సెకండాఫ్ లో ఇప్పుడు విలన్ రఘువరన్ పాయింటాఫ్ వ్యూ అంటూ ప్రారంభించి -మళ్ళీ అదే బిగినింగ్ ఇంకో రౌండేసి, మళ్ళీ అదే సైకిలు చైను కొట్టుడు సీనుతో ప్లాట్ పాయింట్ వన్ ని ఇంకో రౌండు తిప్పి - స్క్రీన్ బ్లాంక్ చేస్తే ఎలా వుంటుందో -ఆ ప్రేక్షకుల అల్లరి, సైకిలు చైన్లు పిడికిళ్ళకి చుట్టుకుని తిరగబడడమూ, విరగబాదడమూ లాంటి రియల్ ఫైట్ తో థియేటర్లు శివశివా అనుకుంటూ దద్దరిల్లడమూ వంటి దృశ్యాలు ఇక్కడా వూహించుకోవచ్చు! ఇంత రిస్కు చేసిన చెలగాట మన్నమాట.మూడొంతులు సినిమా అయిపోతున్నా కథ బిగినింగ్ దాటి ముందుకెళ్ళదా? మూడొంతులు సినిమా అయిపోతున్నా కథ బిగినింగ్ దాటి ముందుకెళ్ళక పోతే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది. ఇంతవరకూ తెలిసిందే. కానీ ఇక్కడ బిగినింగ్ దాటి ముందు కెళ్ళక పోవడమే కాదు, అదే బిగినింగ్ అదే ప్లాట్ పాయింట్ వన్ తో మూడు సార్లు రిపీటవడం. ఈ కొత్త క్రియేటివిటీని ఏమంటారని వెతికితే, ట్రిప్టిచ్ (triptych) అంటారని తెలిసింది. ఇది సినిమా కళలో కనపళ్ళేదు, చిత్రకళలో తప్ప.
సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో ట్రిప్టిచ్ ప్రయోగ ఫలితం ఇదన్న మాట. ఇందులో ఒకే బిగినింగ్ మూడు సార్లు రిపీటవడం చూశాం. దీని ప్రయోజనమేమిటి? ఇదెలా ఉపయోగపడింది సినిమాకి? అభిరుచిగల ప్రేక్షకులు ఈ ట్రిప్టిచ్ ని ఫాలోయితే ఒక హుక్ కి ఎటాచ్ అయిపోతారు. అదేమిటంటే, మూడు సార్లూ అదే ప్లాట్ పాయింటుతో అదే సస్పెన్స్ ని అనుభవించడం. షికాగో మీద క్షిపణి పడిందా లేదా, అధ్యక్షుడు ఏ ఆప్షన్ ని నొక్కాడు? దాంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలై పోయిందా లేదా? అన్న సస్పెన్స్. ఈ సస్పెన్స్ మూడు సార్లూ కవ్విస్తూ వచ్చిపోతోంది. రిపీటవుతున్న మూడు బిగినింగ్స్ నీ కలిపి వుంచుతున్న లింకు ఈ సస్పెన్సే.
ఈ మూడు వేర్వేరు పాయింటాఫ్ వ్యూలతో కథ ఎపిసోడిక్ కథనం కాలేదు. ఎపిసోడిక్ కథనంలో ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ ఒక్కో సమస్య తీసుకుని దాన్ని పరిష్కరిస్తూ పోవడం వుంటుంది. ఇది డాక్యుమెంటరీలకి పనికొచ్చే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్. సినిమాలకి పనికిరాదు. సినిమా కథకి ఒకే సమస్యతో వుండే ఒకే పెద్ద కథ అవసరం. ఇందుకే తెలుగులో ఆటోనగర్ సూర్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ వంటి ఎపిసోడిక్ కథనాలతో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి.
పోతే, ఈ హాలీవుడ్ కథని చాప్టర్లుగా నడిచే కథ అనికూడా అనలేం. ఎందుకంటే చాప్టర్స్ తో కథ ముందు కెళ్తూ వుంటుంది. ట్రిప్టిచ్ లో బిగినింగ్ ఆగిపోతూ రిపీటవుతూ వుంటుంది. ప్రతీసారీ అదే సస్పెన్స్ ని లాక్ చేసి బిగినింగ్ రిపీటవుతూ వుంటుంది. దీనివల్ల అభిరుఛి గల ప్రేక్షకులకి ఏమిటి గేమ్? ప్రతీసారీ లాక్ అవుతున్న అదే సస్పెన్సు తో మైండ్ గేమే. గెస్సింగ్ గేమే.
బిగినింగ్ త్వరగా అంటే అరగంటలోపు ముగించి మిడిల్ ప్రారంభిస్తే అక్కడ్నించీ ఆ మిడిల్ సెకండాఫ్ లో సగానికి పైగా ఆక్రమిస్తూ బారుగా వుంటుంది. బిగినింగ్ ప్లాట్ పాయింట్ వన్ లో సస్పెన్స్ క్రియేట్ చేసి వుంటే ఆ సస్పెన్స్ ని సెకండాఫ్ కల్లా మర్చిపోతారు ప్రేక్షకులు. పైగా అంత సేపు మిడిల్ కథ నడపడం కూడా ఈ రోజుల్లో మేకర్స్ కి కష్టమైపోతోంది. ఫస్టాఫ్ అరగంట కల్లా కాకుండా, ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ ని సృష్టించిన ఎన్నో సినిమాలకి కూడా సెకండాఫ్ ఆ కొంచెం మిడిల్ కథ నడపలేక ఫ్లాప్ చేసుకుంటున్న సందర్భాలు ఈ మధ్య పెరిగిపోయాయి. అలాంటిది ఇంకా ముందుగా ప్లాట్ పాయింట్ వన్ లో సస్పెన్స్ ని క్రియేట్ చేసిన కథలు ఏమవుతాయి?
అందుకని, ప్రేక్షకులు కథకి కీలకమైన సస్పెన్స్ అనే ఎలిమెంటుని బారెడు కథాక్రమంలో మర్చిపోకుండా, అదే బిగినింగ్ ని సస్పెన్స్ ఏర్పాటయిన ప్లాట్ పాయింట్ వన్ తో రిపీట్ చేస్తూ, పదేపదే గుర్తు చేస్తూ వుంటే, ఆ సస్పెన్స్ రీఫ్రెష్ అవుతూ- దాన్ని అనుభవించే అవకాశం ఎక్కువ వుంటుంది ప్రేక్షకులు. ట్రిప్చిట్ తో ఒనగూడే ప్రయోజనమిదే. అయితే ఇది ‘శివ’ లాంటి యాక్షన్ కథలకి పనిచేయక పోవచ్చు. సస్పెన్స్ కేంద్ర బిందువుగా నడిచే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి ఇది కొత్తాలోచన. మరి ముప్పావు వంతు సినిమా మూడు సార్లు బిగినింగే ఆక్రమిస్తే మిడిల్ ఏమవుతుంది? ఇది కూడా తెలుసుకుందాం…
అంటే ముగింపుని కూడా సస్పెన్స్ లో పెట్టేశారు. అదలా వుంచితే మిడిల్ లో పెద్దగా కథ లేదు. కానీ ఈ సెకండాఫ్ లోనే బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో కూడిన సమగ్ర త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ వుంది. ఇందులో మూడోసారి రిపీటైన బిగినింగ్ వుంది, ఆ తర్వాత కథని ముందుకి నడిపిస్తూ మిడిల్, ఎండ్ లున్నాయి. అయితే ఎండ్ ఓపెన్ ఎండ్ గా వుంది. ప్రేక్షకులు ఎలాగైనా ఊహించుకో వచ్చు. ఈ వూహ సస్పెన్సుని ఇంకా పెంచుతుంది. ముగింపు చూపించేస్తే చప్పగా వుంటుంది. ఏముంది- షికాగో మీద దాడి చేసినందుకు అధ్యక్షుడు అనుమానిత దేశాల మీద అణు దాడికి ఆదేశాలిచ్చేశాడని చూపిస్తే, ఇది ప్రేక్షకులు ఊహించేదే. షికాగో మీద దాడి విఫలమైంది, అధ్యక్షుడు ఆప్షన్స్ తీసుకోకుండా ఆగిపోయాడు -అని చూపిస్తే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. అందుకని ఎటూ తేల్చకుండా వదిలేస్తే తర్జభర్జన పడుతూంటారు ప్రేక్షకులు. అందుకని బాగా ప్రభావశీలంగా వుండే ఓపెన్ ఎండెడ్ గా వదిలేశారు ముగింపుని.
మిడిల్ ఎంత వుండాలి? ఎందుకుండాలి? ఆంటన్ ఫక్వా తీసిన ‘ఈక్వలైజర్ 2’ లో మిడిల్ కథ 10 నిమిషాలకన్నా ఎక్కువుండదు. బిగినింగ్ ఫస్టాఫ్ అంతా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత మిడిల్ 10 నిమిషాలే వుంటుంది. అక్కడ్నించీ 45 నిమిషాలూ ఏకబిగిన క్లయిమాక్సే! ఈ మాఫియాల కథకి మిడిల్ కొత్తగా ఏమీ అనిపించదు. అది టెంప్లెట్ లో రొటీన్ గానే వస్తుంది. అందుకని 10 నిమిషాల్లో పాయింటు చెప్పేసి క్లయిమాక్స్ ప్రారంభించేశారు. ఇదీ కొత్త ప్రయోగమే!
-సికిందర్
Thursday, October 23, 2025
1397 : స్పెషల్ ఆర్టికల్
దర్శకత్వ అవకాశాల కోసం ఎల్ ఓ ఏలో భాగంగా యోగ్యత (క్వాలిఫికేషన్) గురించి తెలుసుకున్నాం. ఈవారం లక్ష్యం ఏర్పాటు (గోల్ సెట్టింగ్), విశ్వాసం (బిలీఫ్), ప్రతిజ్ఞ (అఫర్మేషన్స్), దృశ్యీకరణ (విజువలైజేషన్), కార్యాచరణ (యాక్షన్) ల గురింఛి వరుసగా తెలుసుకుందాం… దర్శకుడవ్వాలనేది గోల్ అనుకుంటే ఆ గోల్ కల కాకూడదు. గోల్ కి యాక్షన్ వుంటుంది, డెడ్ లైన్ వుంటుంది. కలకి ఈ రెండూ వుండవు. కలలు గంటూ కూర్చుంటే ఏమీ జరగదు. కలల్ని గోల్ గా మార్చుకుంటేనే ఏదైనా సాధించ గల్గేది.దర్శకుడవ్వాలని గోల్ పెట్టుకోవడమంటే దానికి డిసెంబర్ 2025 అనో, ఇంకోటనో ఒక డెడ్ లైన్ పెట్టుకోవడమన్న మాట. డెడ్ లైన్ తో బాటు మరికొన్ని స్పష్టతల్నివ్వాలి. ఎంత బడ్జెట్ సినిమా కావాలి- రెండు కోట్లా, మూడు కోట్లా, అయిదు కోట్లా…పది, ఇరవై, యాభై…ఎన్ని కోట్లు అన్నది స్పష్టంగా పేర్కొనాలి. బాగా డబ్బు కావాలన్నా ఎంత డబ్బు కావాలి, ఎప్పటిలోగా కావాలి తెలియాలన్నట్టు ఇది కూడా ఇంతే. గోల్ ని మనసులో అనుకోవడం కాకుండా రాయాలి. డిజిటల్ గా టైపు చేసుకోవడం గాక, ఎల్లో పేజీలున్న నోట్ బుక్ లో పెద్ద పెద్ద అక్షరాలతో గ్రీన్ పెన్నుతో స్వయంగా రాయాలి. ఇదంతా మన సబ్ కాన్షస్ మైండ్ గ్రహించడానికి. గోల్ ఎంత స్పష్టంగా, రంగులతో ఆకర్షణీయంగా వుంటే అంత ఇంప్రెస్ అయి వేగంగా కదిలి విశ్వానికి వైబ్రేషన్స్ పంపిస్తుంది.
ఇక్కడొక ప్రశ్నవస్తుంది- దర్శకత్వ అవకాశాల కోసం గోల్ ని సెట్ చేసుకోవడం ఓకే, కానీ అసలు దేని ఆదారంగా గోల్ ని సెట్ చేయడం? ఒక బడ్జెట్, ఒక డేట్ వుంటే సరిపోతుందా? ఆ బడ్జెట్ దేని ఆధారంగా తయారయింది? ఆ స్క్రిప్టు రెడీగా వుందా? ఇదీ ప్రశ్న. ఈ ప్రశ్న దగ్గరే చాలా మంది చేతులెత్తేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్క్రిప్టు వుండదు, కథ తాలూకు ఏవో నాల్గు పేజీలు జేబులో పెట్టుకుని ప్రయత్నిస్తూంటారు. ఇది గోల్ పట్ల బద్ధకమే గానీ నిబద్ధత కాదు. ఇలా పని జరుగదా అంటే జరగవచ్చు, అదెప్పుడు జరుగుతుందో తెలీదు. డెడ్ లైన్లు పనిచెయ్యవు. ఎల్ ఓ ఏ తో ఒక డెడ్ లైన్ లోగా సాధించాలంటే మాత్రం ఆకర్షణ నియమాల్ని పూర్తిగా పాటించాల్సిందే. దీనికి కూడా కొన్ని ఆటంకాలేర్పడొచ్చు. అయితే ఎల్ ఓ ఏ వల్ల పూర్తిగా విశ్వాన్ని నమ్మే మైండ్ సెట్ వచ్చేస్తుంది కాబట్టి, ఆ విశ్వానికి సరెండరై పోతాం కాబట్టి- అవి ఆటంకాలన్పించవు. విశ్వం ఇంకేదో మంచి అవకాశం అందిద్దామని ప్రయత్నిస్తున్నట్టు ఆత్మ విశ్వాసమేర్పడుతుంది.
విశ్వాన్ని నమ్మాక అదెవరికీ అన్యాయం చేయదు- ఇతడికి కులం వుందా, మతం వుందా, ప్రాంతం వుందా, కనెక్షన్స్ వున్నాయా. పేదోడా ఉన్నోడా, ఆడా మగా ఏదీ చూడదు. ఈ ఎవేర్ నెస్ చాలా ధైర్యాన్నిస్తోంది కదూ? విశ్వం దృష్టిలో అందరూ సమానమే. విశ్వం అందర్నీ సమానంగా చూసే మనుషులతో మనం కక్షలూ వివక్షలూ పెంచుకుని ఏం చేస్తున్నాం? ఆ విశ్వానికి దూరమవుతున్నాం. ఇవేవీ కాకుండా విశ్వం గోల్ క్వాలిటీని బట్టి ఫలితాల క్వాలిటీని నిర్ణయిస్తుంది. గోల్ ఎలిమెంట్స్ చవకబారుగా వున్నాయా ఈసురోమంటూ చవకబారు అవకాశాలు, ఉత్తమంగా వున్నాయా హుషారుగా ఉత్తమావకాశాలూ అందేలా చూస్తుంది. ప్రకృతిని సాంఖ్య శాస్త్రం ఇలా వివరిస్తుంది : ప్ర -అంటే విశ్వంలో ఆల్రెడీ పదార్థం వుంది. దానికి కృతి చేసే చేతులు కావాలి. అంటే ఏం సాధించాలన్నా ప్రకృతిలో కొదవ లేకుండా వుంది-జస్ట్ దానికి కృతి చేసే చేతులే కావాలి. రారా నాయనా, నా దగ్గర సినిమా అనే ముడి పదార్థముంది, దానికి దర్శకత్నం చేసే చేతుల కోసం చూస్తున్నా, రా- నువ్వొచ్చి చేసుకుని నా వైభవం ప్రపంచానికి చూపించూ- అని ఎదురు తెన్నులు కాస్తోంది విశ్వం! ఇంతకంటే వివరించి చెప్పాలా ఆకర్షణ నియమం?
క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇదే విషయం చెప్తోంది డబుల్ స్లిట్ ఎక్స్ పెరిమెంటుతో. గత వారం ఫిజిక్స్ లో నోబెల్ సాధించిన ముగ్గురు శాస్త్రవేత్తలైతే ఇంకో విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు- అది క్వాంటమ్ టన్నెలింగ్ అనేది. దీన్ని మనమిక్కడ వర్తింప జేసుకుంటే దర్శకత్వ అవకాశాల గోల్ మరింత సూటిగా, స్పీడుగా పూర్తయి పోతుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. దీని అవసరం ఇప్పుడు లేదు. ప్రస్తుతం దీని గురించి ఎన్ ఎల్పీ ఎక్స్ పర్ట్ రామ్ వర్మ చెబుతున్నది అర్ధంజేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం.
గోల్ ఎలిమెంట్స్ అంటే?
మనకి ఈ అడ్వాన్సుడు ఎల్ ఓ ఏ సరిపోతుంది. గోల్ ఎలిమెంట్స్ ఏమిటి? ఓ కథ తాలూకు స్క్రీన్ ప్లే లో వచ్చే కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, భావోద్వేగాలూ అనే నాలుగు గోల్ ఎలిమెంట్స్ కాదు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వేరు, దర్శకత్వ అవకాశాల కోసం అరచేతిలో ఎల్ ఓ ఏ స్ట్రక్చర్ వేరు. ఇక్కడ గోల్ ఎలిమెంట్స్ అంటే- పైన చెప్పుకున్నట్టు ఓ డెడ్ లైన్, దాంతో బాటు బడ్జెట్టే గాకుండా ఇంకా స్క్రిప్టు, మల్టిపుల్ స్క్రిప్టులు, బిజినెస్, టార్గెట్ రిటర్న్స్, నిబద్ధత, తీవ్రత వగైరా కూడా!
కాబట్టి ఒక డెడ్ లైన్ తో బాటు బడ్జెట్ నిర్ణయించుకున్నాక, సబ్జెక్టు విషయానికొస్తే కథ తాలూకు నాల్గు పేజీల చిత్తు ప్రతి పనికి రాదు. 30 పేజీల సినాప్సిస్ కూడా పనికిరాదు. సబ్జెక్టు తాలూకు మొత్తం ట్రీట్ మెంట్ (స్క్రీన్ ప్లే) కాపీ వరకూ తయారు చేసుకోవాల్సిందే. డైలాగు వెర్షన్ లేకపోయినా ఫర్వాలేదు. టేబుల్ మీద నీటుగా పేర్చి ఇలాటి ట్రీట్ మెంట్ బైండింగులు విశ్వానికి (మొదట మన సబ్ కాన్షస్ మైండ్ కి) కనిపించాల్సిందే. విశ్వానికెలా తెలుస్తుంది? ఎవ్విరీ థింగ్ ఈజ్ ఎనర్జీ కాబట్టి. ఆ ఎనర్జీ వైబ్రేట్ అవుతూ వుంటుంది కాబట్టి. ఈ బైండింగులు ప్రసారం చేసే వైబ్రేషన్స్ వాతావరణంలో కలిసి విశ్వానికి చేరుతూంటాయి కాబట్టి.
ఈ ట్రీట్ మెంట్ ఎలా తయారు చేసుకుంటారో, ఎందరి సాయం తీసుకుంటారో, ఎంత ఖర్చు పెడతారో విశ్వానికి అనవసరం. మెటీరియల్ లేకుండా గాలిలో గోల్స్ కుదరవు. ఒక వస్తువు అమ్మాలంటే ఆ వస్తువు తయారై వుండాల్సిందే. ట్రీట్ మెంట్ తయారు చేసుకున్నాక బడ్జెట్ అంచనా వేసుకోవాలి. ట్రీట్ మెంట్ తో పక్కా బడ్జెట్ రాదు. ఫైనల్ గా డైలాగు వెర్షన్ తో వస్తుంది. ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు. తర్వాత దాని బిజినెస్. బిజినెస్ మార్గాలు రాయాలి. టార్గెట్ రిటర్న్స్- గ్రాస్ కలెక్షన్స్ ఎంత రావాలని ఆశిస్తున్నారు? బడ్జెట్ మీద నికరాదాయం ఎంత శాతముండాలి? ఈ అంకెలు రాసుకుంటే అన్ని కోణాల్లో మేకింగ్ క్వాలిటీ రీచ్ అయ్యేలా క్రమశిక్షణ అలవడుతుంది. ఐదు బడ్జెట్ కి ఆరు వచ్చే పనైతే ఆ మేకింగ్ ఉత్సాహం వేరే వుంటుంది. ఏం సాదిస్తున్నామో తెలియకుండా సినిమాలుతీస్తే గుడ్డెద్దు చేలో పడ్డ చందమే, గత పాతికేళ్ళుగా నూటికి 92 శాతం ఫాపులకి కారణమిదే. ఈ బడ్జెట్ కి ఇంత వస్తుంది సార్ అని నిర్మాతకి లెక్కలు చెప్పే ఆత్మవిశ్వాసం లేకపోవడం గోల్ ని బలహీనపరుస్తుంది.
ఇక టైటిల్స్. ముందే టైటిల్స్ పెట్టుకోవడానికి సిగ్గు పడుతూంటారు. పెళ్ళి చూపులు ఇలా కుదరవు. గోల్ సర్వాంగ సుందరంగా, టైటిల్స్ తో వెంటనే కట్నం మాట్లాడుకునేలా బైండింగుల మీద ఊరిస్తూ కనపడాల్సిందే! తర్వాత, ఒకే సబ్జెక్టుతో గోల్ పెట్టకుంటే అవకాశాలు వచ్చినా అది నిర్మాతలకి నచ్చకపోవచ్చు. అందుకని రెండు మూడు సబ్జెక్టులు వుంచుకోవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ కాదా, దీంతో గోల్ రెండు మూడు పాయలుగా విడిపోతుంది కదా అన్పించవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ కాదు. ఒక వైపు ప్లాన్ ఏ అని దర్శకత్వ ప్రయత్నాలు, మరో వైపు ఇది కుదరకపోతే కాఫీ షాప్ ని ప్లాన్ బీ అని పెట్టుకుంటే, గోల్ రెండు పాయలుగా విడిపోయి ఏం జరుగుతుందంటే -ప్లాన్ బీ గురించిన ఆలోచనలు ముందే తిష్టవేసి ప్లాన్ ఏ ని దెబ్బ తీస్తూంటాయి. ఇలా ఈ పని,కాకపోతే ఆ పని చేద్దామని రెండు గోల్స్ పెట్టుకుని దిగితే ఏదీ జరగదు. ఒక వృత్తిని నిర్ణయించుకుని, దానికి సంబంధించిన కార్యక్రమాలు మల్టీ టాస్కింగ్ చేస్తే గోల్ ఒకటే కాబట్టి దెబ్బ తినదు. కనుక రెండు మూడు సబ్జెక్టుల్ని పిచింగ్ చేస్తూ ముందుకి సాగవచ్చు.
నిబద్ధత, తీవ్రత లేమిటి? నాల్గు రోజులు గోల్ మీద పని చేసి, నాల్గు రోజులు మానేస్తే నిబద్ధత అనిపించుకోదు. సాధించే వరకూ పట్టు విడవకుండా గోల్ మీద పని చేయాల్సిందే. అలాగే దాని బలం లేదా తీవ్రత కూడా అదే స్థాయిలో వుండాల్సిందే. ఇవి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి. అంటే ఉత్సాహం వుంటే ఫ్రీక్వెన్సీ, లేదంటే నో వెకెన్సీ. డెడ్ లైన్ పెట్టుకున్నాక ఏదీ వాయిదా వేయకూడదు. గోల్ బలహీన పడకుండా వుండాలంటే ఇంకేం చేయాలో చివర్లో వచ్చే కార్యాచరణ విభాగంలో తెలుసుకుందాం.
ఇంత వరకూ గోల్ సెట్టింగ్ కి దృష్టిలో పెట్టుకోవాల్సిన ఎలిమెంట్స్ 1. డెడ్ లైన్, 2. బడ్జెట్, 3. స్క్రిప్ట్, 4. బిజినెస్, 5. టార్గెట్ రిటర్న్స్, 6. నిబద్ధత, 7. తీవ్రత. వీటిలో చివరి రెండూ తప్పితే మిగిలిన వాటిని ఆకు పచ్చ ఇంకుతో పసుపు పచ్చ నోటు పుస్తకంలో రాసుకోవాలి. ఈ పుస్తకం రోజూ చదువుతూ వుండాలి. స్క్రిప్టు బైండింగులు కనపడేలా టేబుల్ మీద వుంచి, దుమ్ముపట్టిపోకుండా చూసుకోవాలి. దుమ్ము నెగెటివ్ ఎనర్జీ. గోల్ సాధన కోసం ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో వుండాలి. ఏ మూడ్ లేదా ఎమోషన్స్ తో వుంటే, హై ఫ్రీక్వెన్సీ వుంటుందో పై చిత్రపటం చూడండి. (ఇంకా వుంది) -సికిందర్
Monday, October 13, 2025
1396 : రివ్యూ!
రచన- దర్శకత్వం : ఉన్ని శివలింగం
తారాగణం : షేన్ నిగమ్, శాంతనూ భాగ్యరాజ్, ప్రీతీ అస్రానీ, పూర్ణిమా ఇంద్రజిత్, ఆల్ఫాన్స్ పుదిరేన్, సెల్వరాఘవన్ తదితరులు
సంగీతం: సాయి అభ్యంకర్, చాయాగ్రహణం : అలెక్స్ పులిక్కల్
బ్యానర్స్ : ఎస్టీకే ఫిలిమ్స్, బినూ జార్జి అలెగ్జాండర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు : సంతోష్ కురువిల్లా, బినూ జార్జి అలెగ్జాండర్
***
గత నెల మలయాళ తమిళ భాషల్లో విడుదలైన 'బాల్టీ' ఈవారం తెలుగులోనూ విడుదలైంది. దీన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ప్రచారం చేశారు. దీనికి ఉన్ని శివలింగం కొత్త దర్శకుడు. హీరో షేన్ నిగమ్ నటించిన 25 వ సినిమా ఇది. అలాగే తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ గా నటించాడు. కబడ్డీని లోకల్ మాఫియా కథతో కలిపి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా సిద్ధం చేశామని చెప్పిన కొత్త దర్శకుడి ప్రయత్నం ఏ మేరకు ఫలించిందో చూద్దాం...
కథేమిటి?
తమిళనాడు- కేరళ సరిహద్దులో వేలం పాళయం పట్టణంలో ముగ్గురు లోన్ మాఫియాలు చీడ పురుగుల్లా వుంటారు. చక్రవడ్డీలకి చక్రవడ్డీలువేసి ప్రజల్ని చిత్ర హింసలు పెట్టి వసూలు చేస్తూంటారు. ఇక్కడే ఉదయన్, కుమార్, సురేష్, మణి అనే చురుకైన కబడ్డీ ఆటగాళ్ళు ఎదురు లేకుండా వుంటారు. కబడ్డీలో వీళ్ళ మెరుపు వేగానానికి ఇంకే జట్టూ గెలవలేని పరిస్థితిలో వుంటుంది. లోన్ మాఫియా భైరవన్ జట్టు వీళ్ళతో ఎప్పుడూ గెలవదు. సోడా బాబు, గౌరీ అనే మరో ఇద్దరు లోన్ మఫియాలతో భైరవన్ కి వైరం వుంటుంది. సోడాబాబు సోడా ఫ్యాక్టరీ ముసుగులో స్మగ్లింగ్ కూడా చేస్తూంటాడు. ఒకప్పుడు వేశ్య అయిన గౌరీ వడ్డీలతో పేద స్త్రీలని దోపిడీ చేస్తూంటుంది. ఈ ముగ్గురు మాఫియాల ఆగడాలతో పట్టణం ఎప్పుడూ అల్లకల్లోలంగా వుంటుంది.
ఇలా వుండగా, ఉదయన్ టీం ఒక వీధి పోరాటంలో కనబరిచిన తెగువ, పోరాటంలో వాడిన నైపుణ్యమూ గమనించిన భైరవన్, ఉదయన్ టీం ని డబ్బుతో లోబర్చుకుని, లోన్ రికవరీ ఏజెంట్లుగా నియమించుకుంటాడు. ఇప్పుడు ఈ టీం లోన్లు రికవరీ చేస్తూ దౌర్జన్యాలు మొదలెడతారు.
భైరవన్ ప్రదీప్ అనే వాడికి లక్ష రూపాయలు అప్పు ఇచ్చి వుంటాడు. దీనికి జంబో వడ్డీ పేరుతో 10 లక్షలు కలిపి మొత్తం 11 లక్షలు ఇవ్వాలని కట్టేసి హింసిస్తూంటాడు. తను ప్రేమిస్తున్న కావేరీకి ఈ ప్రదీప్ అన్న అవుతాడని తెలుసుకున్న ఉదయన్, హింసని అడ్డుకునేప్పుడు చేయి వెళ్ళి భైరవన్ కి తగలడంతో, నన్నే కొడతావాని ఉదయన్ మీద పగబడతాడు. దీంతో భైరవన్ కీ ఉదయాన్ టీం కీ శత్రుత్వం మొదలైపోతుంది. ఈ శత్రుత్వం ఏ పరిణామాలకి దారి తీసిందన్నది మిగతా కథ
ఎలా వుంది కథ?
ప్రచారం చేసినట్టుగా ఇది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కాదు. స్పోర్ట్స్ కథగా మొదలై మాఫియా యాక్షన్ డ్రామాగా మారిపోయే కథ. దీంతో అటు కబడ్డీకీ, ఇటు వడ్డీల దోపిడీలకీ న్యాయం చేయలేకపోయింది. పెద్ద నగరంలో గాక చిన్న పట్టణంలో ఈ ఎత్తున లోన్ మాఫియాలు వుండడం విడ్డూరమే. దీనికి ఉదయన్ మిత్రుడు కూడా బాధితుడే. అయితే ఈ వడ్డీ కబడ్డీల కథ ఒక కథగా గాక రెండు కథలుగా విడిపోవడంతో సమస్యలో పడింది.
ఉదయన్ టీం ని భైరవన్ లోన్ రికవరీ ఏజెంట్లుగా వాడుకోవాలనుకోవడం దగ్గరే కథ దారి తప్పింది. తిరుగులేని క్రీడా కారులు కూడా తమ క్రీడాసక్తిని బలిపెడుతూ మాఫియాతో చేతులు కలపడమేమిటి? భైరవన్ చేస్తే క్రీడాకారుల్ని ఉపయోగించుకుని పెద్ద క్రీడా వ్యాపారం చేసుకోవచ్చు. తనకెలాగూ రికవరీ ఏజెంట్లు వున్నారు. లోన్లు తీసుకుంటున్నది పెద్ద నగరాల్లో ఘరానా వ్యక్తులు కూడా కారు. అదే చిన్న పట్టణంలో బడుగు జీవులు. వీళ్ళని పీడించి వసూళ్ళు బాగానే చేస్తున్నారు. ఇలా క్రీడలతో కబడ్డీ టీంకి ఎదగాలన్న ఆశయం, కబడ్డీతో భైరవన్ కి వ్యాపార లక్ష్యమూ లేని అసహజ పాత్ర చిత్రణల వల్ల ఈ కథ ఏమిటోగా మారిపోయింది కొత్త దర్శకుడితో. చేస్తే కబడ్డీ ఆటగాళ్ళు పట్టణానికి మాఫియాల పీడా వదిలిలించాలేమో గానీ, తమని కబడ్డీ వీరులుగా అభిమానిస్తున్న ప్రజలనే లోన్ రికవరీ ఏజెంట్లుగా మారిపోయి పీడించడం దగ్గర బ్యాడ్ టేస్ట్ గా మారిపోయింది కథనం.
అయితే ఉదయన్, భైరవన్ మీద చేసుకున్నాడన్న కాన్ఫ్లిక్ట్ ఫస్టాఫ్ లో రాదు, ఇంటర్వెల్లో కూడా వుండదు. ఇంటర్వెల్ వరకూ కబడ్డీ కథ, లోన్ మాఫియాల ఆగడాలు, ఉదయన్ టీం రికవరీ ఏజెంట్లుగా చేసే హంగామా, ఇంటర్వెల్లో ఓ యాక్షన్ సీను -వీటితో గడిచిపోతుంది ఫస్టాఫ్ కథ ఎస్టాబ్లిష్ కాకుండా.
సెకండాఫ్ లో ఉదయన్ చేయి చేసుకోవడంతో అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడి, భైరవన్ ప్రతీకార కథగా మారిపోతుంది. ఫస్టాఫ్ కబడ్డీ కథతో సెకండాఫ్ తెగిపోయి- మాఫియాల కథ వచ్చి అతకడంతో సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడింది సినిమా! ఇక ఇక్కడ్నుంచీ భైరవన్ తో బాటు మరో ఇద్దరు మాఫియలతో చీటికీ మాటికీ విసుగు పుట్టేలా యాక్షన్ సీన్స్ వచ్చేస్తూంటాయి. చివరికి పూర్తి శత్రు సంహారం జరిగి దయతలిచి ముగుస్తుంది రెండున్నర గంటల సినిమా! ఇంతకీ బాల్టీ అంటే మెరుపు వేగం. కబడ్డీలో ఉపయోగపడే నైపుణ్యం. దీన్ని కథకి కూడా ఉపయోగించుకుని వుంటే బావుండేది.
ప్రజల్ని పీడిస్తున్న లోన్ మాఫియాల్ని కబడ్డీ నుపయోగించుకుని అంతమొందించే కథగా ఇది వుండి వుంటే- ప్రచారం చేసినట్టుగా ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అన్పించుకునేది!
ఎవరెలా చేశారు?
హీరో ఉదయన్ గా షేన్ నిగం వృత్తి కబడ్డీ క్రీడాకారుడుగా మాత్రం పాత్రలో లీనమైపోతూ నటించాడు. మాఫియాలతో పోరాటాలు కూడా కబడ్డీ ట్రిక్స్ తోనే మెరుపు వేగంతో చేయడం పాత్రని హైలైట్ చేసింది. మిగతా బృందం కూడా ఇదే యాక్షన్ కొరియోగ్రఫీలో భాగమయ్యారు. యాక్షన్ సీన్లు వదిలేస్తే కథా పరంగా పొసగని పాత్రలు ఇవి. ఇంకో పొసగని పాత్ర హీరోయిన్ ప్రీతీ అస్రానీ. ఈమె ఎప్పుడూ మూతి ముడుచుకుని వుంటుంది.
విలన్ గా నటించిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, ప్రేమగా మాట్లాడి కడుపులో తన్నే విలనిజాన్ని తనదైన శైలిలో నటించుకుపోయాడు. సోడా బాబుగా నటించిన మరో దర్శకుడు ఆల్ఫోన్స్ పుదిరేన్, గౌరీగా పూర్ణిమా ఇంద్రజిత్ మాఫియా పాత్రలకి రూరల్ టచ్ ఇచ్చేప్రయత్నం చేశారు.
మాఫియా పాత్రలకి న్, దర్శకుడు, అతని స్క్రీన్ ప్ప్రెజెన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పాటలు, బిజిఎం ఫర్వాలేదన్పించేలా వున్నాయి. సినిమాటోగ్రాఫర్ అలెక్స్ పులిక్కర్ కబడ్డీ సహా మిగతా యాక్షన్ కోరియోగ్రఫీని మల్టిపుల్ యాంగిల్స్ లో కవర్ చేస్తూ షాట్స్ తీశాడు. దీనికి ఎడిటర్ శివకుమార్ ఎడిటింగ్, సందోష్ -విక్కీల యాక్షన్ కోరియోగ్రఫీ విజువల్ గ్రామర్ ని అద్భుతంగా పోషించాయి.
పైన చెప్పుకున్నట్టు స్క్రీన్ ప్లే మధ్యకి ముక్కలవడంతో, రెండు కథల విడివిడి కథనాలు కావడంతో బలి అయింది ఎమోషనల్ డ్రైవ్. భావోద్వేగ రహితంగా ఫ్లాట్ గా కథనం మారడంతో ఫైట్లు, కబడ్డీ పట్లు కూడా ఈ సినిమాని నిలబెట్టడం సమస్య అయికూర్చుంది.
-సికిందర్
Sunday, October 5, 2025
1395 : స్పెషల్ ఆర్టికల్
2019 లో పశ్చిమ బెంగాల్లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్లో హృదయాల్ని మీటే ఒక స్వరం పలుకుతోంది. జనం చుట్టూ చేరి సమ్మోహితులవుతున్నారు. ఆ జనంలో ఒక టెక్కీ దాన్ని వీడియో తీసి వైరల్ చేశాడు. 1972 లో నటుడు, రచయితా నిర్మాతా దర్శకుడూ అయిన మనోజ్ కుమార్ తీసిన - 'షోర్' లోని లతా మంగేష్కర్ పాడిన 'ఏక్ ప్యార్ కా నగ్మా హై' హిట్ సాంగ్ పాడుతున్న ఆ తియ్యటి గళం - వెళ్ళి వెళ్ళి బాలీవుడ్ లో సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా చెవిన పడింది. వెంటనే ఆమెని పిలిపించుకుని ఒక రియాలిటీ షోలో పరిచయం చేశాడు. ఆ షోతో ఆమె మరింత హిట్టయ్యింది. ఇక ఆమెకి తన కొత్త సినిమాలో పాడే అవకాశమిచ్చాడు. ఆ పాట 'తేరీ మేరీ కహానీ' వైరల్ హిట్టయ్యి ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టింది. 20 పాటలు పాడేసి రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపొయింది. అప్పుడు ... ఎంత వేగంగా సెలబ్రిటీ సోపానాలెగ బ్రాకిందో అంత వేగంగానూ వచ్చి ఠపీ మని కింద పడింది!
రానూ మండల్ ఉత్థాన పతనాల విషాద గాథ షార్ట్ కట్ కళాకారులకి పాఠాలు నేర్పుతుంది. లోతు పాతుల్లేకుండా రాత్రికి రాత్రేం జరగదు. జరిగినా ఎంతో కాలం నిలబడదు. ఆరు నెలల్లో ఆమె ఎక్కడ్నించి బయల్దేరి బాలీవుడ్ లో సంచలన గాయిక అయిందో, అక్కడ్నుంచి అదే కోల్ కత సమీపంలోని తన పాడుబడ్డ ఇంట్లో అదే నిరుపేద జీవితంలోకి జారుకుంది. గతవారం నీషూ తివారీ అనే యూట్యూబర్ మతిస్థిమితం కోల్పోయిన ఆమెని వెతుక్కుంటూ వెళ్ళి, అన్నం పెట్టి, ఓదార్చి, వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో కోటి వ్యూస్ కి చేరుకుంది...
ఈ పతనానికి కారణం అహంకారం, దుష్ప్రవర్తన. తన సెల్ఫ్ ఇమేజీని అంతా నేనే, అన్నీ నాకే - అన్న పొగరు బోతుతనంగా క్రియేట్ చేసుకుని విర్రవీగడం. అభిమానుల మీద చేయి చేసుకోవడం. ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకురాలు కేథరిన్ బిగేలో కూడా పేదరికంలో మగ్గింది. కానీ ఆమె తనలో వున్న కళని గుర్తించి అభివృద్ధి చేసుకుంది. కొలంబియా యూనివర్సిటీ నుంచి థియరీ అండ్ క్రిటిసిజం లో మాస్టర్స్ చేసింది. హాలీవుడ్ లో అడుగుపెట్టి నానా ఢక్కా మొక్కీలు తింటూ, 1981-2007 మధ్య ఎనిమిది సినిమాలకి దర్శకత్వం వహించింది. 2008 లో ‘హర్ట్ లాకర్' తీసి ఆస్కార్ ఉత్తమ దర్శకురాలి అవార్డు నందుకుంది. అంతవరకూ ఈ అవార్డు తీసుకున్న దర్శకురాళ్ళు లేరు. తర్వాత 'జీరో డార్క్ థర్టీ' అన్న మరో ప్రసిద్ధ సినిమా తీసింది. ఈ సంవత్సరం పదమూడో సినిమా 'ది హౌజ్ ఆఫ్ డైనమైట్' తీసి, 45 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ తో పాఠ్య పుస్తకంలా నిల్చింది.
రానూ మండల్ తనలోని కళతో సమున్నత స్థానానికి చేరుకోవచ్చని తెలుసుకోలేదు. పూర్వం పని వెతుక్కుంటూ భర్తతో ముంబాయి వెళ్ళి కూలీనాలీ చేసుకుంటూ కష్టాలు పడలేక తిరిగి వచ్చేసిందే తప్ప- తన గానకళతో జీవితంలో ఎదగ వచ్చనుకోలేదు. ఆమెకి చెప్పే వాళ్ళు కూడా లేరు. వీధుల్లో పాడుకుంటోంటే వినోదించడం తప్ప. ఒక టెక్కీ ఆమె గానాన్ని వైరల్ చేసి బాలీవుడ్ చేర్చినా, ఆ కెరీర్ లో ఎలా మెలగాలో, మల్చుకోవాలో చెప్పే సలహాదారుల్ని కూడా ఆమె నియమించుకోలేదు. రాత్రికి రాత్రి వచ్చి పడిన ఖ్యాతితో అంతా నేనే, అన్నీ నాకే అన్న దురహంకారమే పెరిగి పతనమైపోయింది.
దర్శకత్వ శాఖలో ఇలాటి షార్ట్ కట్ స్వాములు చాలామందే వుంటారు. రెండు సినిమాలకి అసిస్టెంట్లుగా చేసి నిర్మాతల వేటలో పడి దర్శకులైపోవడం. ఆ రెండు సినిమాలకి కూడా షూటింగుల వరకే పనిచేయడం. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో పనుండదు. పోస్ట్ ప్రొడక్షన్లో ఏ శాఖ ఏమిటో తెలియాలంటే అసోసియేట్ గా కొన్నేళ్ళు పనిచేయాలి. అప్పుడే సినిమా తీయడం మీద పూర్తీ అవగాహనా ఏర్పడుతుంది. రెండు సినిమాల అసిస్టెంట్ గా జంప్ చేసి రాత్రికి రాత్రి డైరెక్టర్ లైపోతే రానూ మండల్లే అవుతారు. నిర్మాతకి ఒక బడ్జెట్ చెప్పి సినిమా ప్రారంభించి, సగం సినిమాకే బడ్జెట్ అయిపోయి మళ్ళీ కనపడకుండా జంపై పోవడం ఇందుకే జరుగుతుంది.
దర్శకత్వ అవకాశాల కోసం ఎల్ ఏ ఓ ప్రయత్నిస్తే, దీనికి కూడా చాలా కమిటై వుండాలని ముందే చెప్పుకున్నాం. ఇందులో భాగంగా గత వారం సెల్ఫ్ ఇమేజీని ఎలా సృష్టించుకోవాలో చెప్పుకున్నాం. ఈ వారం యోగ్యత (క్వాలిఫికేషన్), లక్ష్యం ఏర్పాటు (గోల్ సెట్టింగ్), విశ్వాసం (బిలీఫ్), ప్రతిజ్ఞ (అఫర్మేషన్స్), దృశ్యీకరణ (విజువలైజేషన్), కార్యాచరణ (యాక్షన్) ల గురించి తెలుసుకుందాం...
2. యోగ్యత :
దర్శకుడవ్వాలని గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ కి తగ్గ యోగ్యత ఎంత వరకుందన్న ఆత్మ పరిశీలన చాలా ముఖ్యం. ఈ యోగ్యత గురించి మొదట్నుంచీ మొదలుపెడితే, ముందుగా పని చేయాలనుకుంటున్న రంగం పుట్టు పూర్వోత్తరాల గురించి ఎంత పరిజ్ఞా నముంది? అంటే, సినిమా చరిత్ర గురించి ఏం తెలుసు? సినిమా ఎప్పుడు ఎక్కడ పుట్టింది? తెలుగులో మొట్ట మొదటి సినిమా ఎప్పుడు ఎవరు నిర్మించారు? ఏ కథల ఆధారంగా నిర్మించారు? ఆ కథలు కాలక్రమంలో ఎలా మారుతూ వచ్చాయి? తొలి స్వర్ణ యుగంగంలో, మలి స్వర్ణ యుగంలో సినిమాల తీరుతెన్నులేమిటి? తర్వాత వ్యాపార యుగంలో పోకడలేమిటి? అప్పటి పదిమంది ప్రముఖ దర్శకులెవరు? అప్పట్లో వాళ్ళు బాటలు వేసుకుంటూ వస్తేనే ఇప్పుడు అంతా ముందుకు సాగుతున్నారు. వాళ్ళకి కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నారా? ఐన్ స్టీన్ ప్రతి రోజూ పూర్వ శాస్త్రజ్ఞులకి కృతజ్ఞతలు చెప్పుకున్నాకే పని మొదలెట్టేవాడు. కృతజ్ఞతల పవరేమిటో అతడికి తెలుసు.తెల్లారి నిద్రలేవగానే తమని పోషిస్తున్న తెలుగు సినిమా పరిశ్రమకి కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటే తెలుస్తుంది అదెలా మ్యాజిక్ లా పని చేస్తుందో. ఒక్కోసారి మంచి జరిగినా, చెడు జరిగినా అన్నిటి పట్లా, అందరి పట్లా బేషరతుగా కృతజ్ఞతా భావంతో వుంటే, ఇంకే ఎల్ ఓ ఏ అక్కర్లేదు. కృతజ్ఞత హై ఫ్రీక్వెన్సీ ఫీలింగ్. ఎంత కృ తజ్ఞులై వుంటే అన్ని వరాలు కురిపిస్తుంది విశ్వం. ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో వుంటే నెగెటివ్ ఫీలింగ్స్ కి చోటుండదు. దాంతో పాజిటివ్ పరిణామాలు ఎదురవుతాయి- ఇక్కడ భౌతిక శాస్త్ర నియమం పని చేస్తుంది- ఒక సమయంలో ఒక స్థలంలో రెండు వస్తువులు వుండలేవన్నది ఆ నియమం. అలా మెదడులో నెగెటివ్ ఫీలింగ్స్ వున్నంత కాలం పాజిటీవిటీకి చోటుండదు- సింపుల్ సైన్స్. అందుకని తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తూంటే దాని చరిత్ర తెలుకుని, ప్రతిరోజూ కృతఙ్ఞతలు చెప్పుకుంటూ వుంటే ఫలితాలు త్వరగా వస్తాయి. విశ్వం గమనించే యోగ్యతల్లో ఇదొకటి.
తర్వాత, సినిమాలకి పని చేయడం సరే- కూలీ వాడు కూడా పనిచేస్తాడు. ఆ కూలి పని సరిపోతుందా? రానూ మండల్ అవ్వాలనుకుంటే సరిపోతుంది. కేథరిన్ బిగేలో అవ్వాలంటే మాత్రం సరిపోదు. దాంతో బాటు స్టడీస్ వుండాలి. ఫిలిం స్కూల్లోనే చదవనవసరం లేదు, దర్శకత్వం మీద పుస్తకాలు, సినిమా రచన మీద పుస్తకాలు, టెక్నాలజీ మీద పుస్తకాలూ చదవాల్సి వుంటుంది. వీటికి ఆర్ధిక స్థోమత లేకపోతే వెబ్ సైట్లు వున్నాయి- నిత్యం కొత్త సమాచారమిస్తూంటాయి. బాలీవుడ్ సీనియర్ రచయిత కమలేష్ పాండే తెల్లారి లేవగానే స్క్రీన్ ప్లే వెబ్సైట్స్ లో అప్డేట్స్ ఏమున్నాయా చూస్తాడు. సీనియరైనా అప్డేట్ అవుతూ వుండకపోతే శూన్యమైపోవాల్సిందే. అంత సంపాదించినా బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బెర్గ్ ప్రభృత బిలియనీర్లు ప్రతీ రోజూ కొంత సేపు పుస్తకాలు చదువుతారు. జుకర్ బెర్క్ వారానికొక పుస్తకం చదివేస్తాడు. అన్ని బిలియన్ల డాలర్లు కూడ బెట్టిన వారెన్ బఫెట్ ఇంకా ఏడాదికి 50 పుస్తకాలూ చదవాల్సిన వ అవసరమేమిటి? నాలెడ్జి- నాలెడ్జి పెంచుకుంటున్న కొద్దీ పెరుగుతుంది.
విశ్వమంతా మనకు తెలియని అపార నాలెడ్జితో నిండి వుంది. ఏ నాలెడ్జి అయినా మనకు విశ్వం నుంచి అందుతుంది. మన మెదడులో మెరిసే ఐడియాలు, ఆలోచనలు విశ్వం నుంచే అందుతాయి. బిగ్ బ్యాంగ్ తో విశ్వం వయస్సు అంచనా వేస్తే సుమారుగా 13.8 బిలియన్ల సంవత్సరాలు. దానికున్న ఇన్ని బిలియన్ల సంవత్సరాల అనంతమైన నాలెడ్జితో అద్భుత ఇంజనీరింగు చేసి విశ్వాన్నంతా ఏర్పాటు చేసింది. ఇన్ని బిలియన్ల సంవత్సరాల దాని నాలెడ్జి నుంచే మనకి నాలెడ్జి అందుతోంది. కాబట్టి ఎవరికందిన నాలెడ్జి ఏమిటో తెలుసుకోవడానికి బిలియనీర్లు పుస్తకాలు చదువుతారు.
అందుకని సినిమాలకి సంబంధించిన వివిధ పుస్తకాలూ చదవాలి. ఆ పుస్తకాలూ షెల్ఫ్ లో కనపడాలి. ఇక సినిమాలు చూడడం నోట్సు రాసుకోవడం మామూలే. యోగ్యతా కోసం ఇంకా ఎన్ని వీలయితే అన్ని అభ్యాసాలు చేయాలి. ఇక దర్శకుడుగా ప్రమోటవడం గురించి రెండు వాదాలున్నాయి- ఒకటి, అసిస్టెంట్ గా చేసివుంటే సరిపోతుందని, రెండు- అసోసియేట్ గా కూడా అనుభవం పొందాలని. అసిస్టెంట్ గా చేస్తే షూటింగ్ వరకే పరిమితమవుతారు. పోస్ట్ ప్రొడక్షన్ అనుభవముండదు. అసిస్టెంట్ తర్వాత అసోసియేట్ గా కొనసాగితే పోస్ట్ ప్రొడక్షన్ లో 24 కాదు, ఇప్పుడు 34 క్రాఫ్ట్స్ తో అనుభవం సంపాదించ వచ్చు. ఇది దర్శకత్వానికి గట్టి పునాది వేస్తుంది. షార్ట్ కట్లు అలోచించి అసిస్టెంట్ నుంచి నేరుగా డైరెక్టర్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ నాలెడ్జి వుండదు. టెక్నీషియన్ల మీద ఆధారపడి వాళ్ళు చెప్పినట్టు వినాలి. చులకనైపోవాలి కూడా. ఈ రెండో కేటగిరీని మనం ప్రమోట్ చేయడం లేదు. అసోసియేట్ గా దర్శకత్వ అవకాశాల కోసం కృషి చేస్తున్న వాళ్ళెందరో వున్నారు. వాళ్ళు ఉపోయోగించుకుంటే ఎల్ ఓ ఏ బాగా పనిచేస్తుంది. విశ్వం చూసే యోగ్యతల్లో ఇదొకటి.
(ఇంకా వుంది)
-సికిందర్
Friday, October 3, 2025
1394 : స్క్రీన్ ప్లే సంగతులు
‘ఓజీ’ లోనైతే అసలు కథకి కాన్ఫ్లిక్టే వుండదన్నట్టు ప్రవర్తించాడు దర్శకుడు ‘సాహో’ ఫేమ్ సుజీత్. రెండు మూడు కాన్న్ఫ్లిక్టు లు జోడిస్తూ పోయి వాటితో తనే కాన్ఫ్లిక్ట్ కి లోనయ్యాడు. ఈ కాన్ఫ్లిక్టులతో కన్ఫ్యూజై సెకండాఫ్ అంతటా రకరకాల పాత్రల సబ్ ప్లాట్స్ తో నింపేసి, పవన్ కళ్యాణ్ కి ప్రధాన కథంటూ లేకుండా చేసి కిల్ చేశాడు. ‘సాహోలో కూడా ఇంటర్వెల్లో ప్రభాస్ తో పుట్టిన కాన్ఫ్లిక్ట్ ని వదిలేసి, సెకండాఫ్ అంతా బోలెడు మంది విలన్స్ తో ట్విస్టుల మీద ట్విస్టు లిచ్చుకుంటూ, ప్రభాస్ తో వుండాల్సిన ప్రధాన కథని ఖూనీ చేశాడు. పైగా క్లయిమాక్స్ దగ్గర్లో ఇంకో కాన్ఫ్లిక్ట్ ఇచ్చి, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నట్టు తయారు చేశాడు. ప్రేక్షకులు సినిమా అర్ధం కాలేదని గగ్గోలు పెడితే, ఇంకోసారి చూస్తే అర్ధమవుతుందని సమర్ధించుకున్నాడు !
పునాది తవ్వేసిన కథ!
'ఓజీ’ లో రెండు మూదు కాన్ఫ్లిక్ట్స్ తో బాటు ఇంకో ప్రయోగం చేశాడు. అది ఫస్ట్ యాక్ట్ (బిగినింగ్) లో ప్లాట్ పాయింట్ వన్ ని ఎత్తేసి, సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ రూపంలో దాన్ని రివీల్ చేయడం! ఇదెంత ఘోరమంటే దీన్ని చూస్తే బాక్సాఫీసు గిరగితా కళ్ళు తిరిగి ధడాల్న మూర్చపోతుంది! బిగినింగ్ లో ప్లాట్ పాయింట్ వన్ ని ఎత్తేస్తే ఆ కథ ఏం కావాలి? ఇంటికి పునాది తవ్వేస్తే ఆ ఇల్ల్లేం కావాలి? మొత్తం స్క్రీన్ ప్లే అనే సౌధానికి ప్లాట్ పాయింట్ వన్ అనేది కథని నిలబెట్టే మూలస్థంభం లాంటిది. దీన్ని ఎత్తేస్తే అసలు కథే వుండదు! ఎందుకంటే ఇక్కడ పుట్టాల్సిన ప్రాథమిక కాన్ఫ్లిక్ట్ మిస్సయి కథ నడిపించే ప్రధాన పాత్ర పుట్టదు. ప్రధాన పాత్ర పుట్టాలంటే ఇక్కడ ప్రాథమిక ఎమోషన్లు పుట్టాలి. ప్రాథమిక ఎమోషన్స్ ని పుట్టించే ప్లాట్ పాయింట్ వన్నే లేనప్పుడు కథ పుట్టే సమస్యే లేదు. (All drama is conflict. Without conflict you have no action; without action, you have no character; without character, you have no story; and without story, you have no screenplay - Syd Field)
ఫస్టాఫ్ బిగినింగ్ లో చిన్నప్పుడు జపాన్ లో సమురాయ్ వర్గాల ఘర్షణల్లో సత్యదాదా (ప్రకాష్ రాజ్) తనని కాపాడి బొంబాయికి తీసుకొచ్చాడని ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) అలియాస్ ఓజీ అతడికి అంగ రక్షకుడుగా వుంటాడు. సత్య దాదా ఇక్కడ పోర్టు నెలకొల్పుతాడు. పెరిగి పెద్దయ్యాక ఓజీ సత్యదాదాని వదిలేసి వెళ్ళిపోతాడు. మదురై లో డాక్టర్ కన్మణి (ప్రియాంకా మోహన్) ని ప్రేమించి పెళ్ళి చేసుకుని సెటిలవుతాడు. ఇక్కడ బొంబాయిలో సత్యదాదాకి ఓమి భావు ( ఇమ్రాన్ హాష్మి) తో శత్రుత్వమేర్పడుతుంది. దుబాయి నుంచి మాఫియా ఓమికి పంపిన కంటెయినర్ లో ఆర్డీ ఎక్స్ ప్రేలుడు పదార్ధ ముంటుంది. దాంతో బొంబాయిలో ప్రేలుళ్ళు జరపాలని ప్లానేస్తాడు ఓమి. దీన్ని అడ్డుకుని కంటెయినర్ ని దాచేస్తాడు సత్య్హదాదా. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణలు మొదలవుతాయి. సత్యదాదా ప్రాణాలకి ప్రమాదమొస్తుంది. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత సత్యదాదాని, బొంబాయిని కాపాడుకునేందుకు తిరిగొస్తాడు ఓజీ. వచ్చాక ఓమి గ్యాంగ్ తో ఘర్షణలు మొదలవుతాయి. ఈ ఘర్షణల్లో ఓమి గ్యాంగ్ ఓజీ భార్య డాక్టర్ కన్మణిని చంపేయడంతో ఇంటర్వెల్.
సెకండాఫ్ కొస్తే, ఇన్స్ పెక్టర్ తావడే (అభిమన్యూ సింగ్) సత్య దాదా పోర్టుకి చెందిన మనుషుల్ని పోలీస్ స్టేషన్లో బంధిస్తే, ఓజీ వచ్చి పోరాడి విడిపించుకుంటాడు.తర్వాత ఓమి తమ్ముడ్ని చంపేస్తాడు. చంపేసి ‘వదిలేయ్, ఆర్డీ ఎక్స్ గీర్డీ ఎక్స్ అన్నీ వదిలేయ్- ఇది నా వార్నింగ్ కాదు, ఫైసలా’ అనేసి ఓమికి చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక పొలిటీషియన్ వచ్చి సత్యదాదాని ఆర్డీ ఎక్స్ ఎక్కడుందో చెప్పమంటాడు. ఇంతలో ఓజీ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ లో తను అతడికి బుద్ధి చెప్పిన విషయం గుర్తు చేసి వెళ్ళగొడతాడు. ఇంకా తర్వాత సత్యదాదా మనవడు - పెద్ద కోడలు గీతా (శ్రియా రెడ్డి) కొడుకు అర్జున్ (అర్జున్ దాస్) ఒజీ మీద ప్రతీకారం తీర్చుకునే క్రమం మొదలవుతుంది. ఇందులో భాగంగా అతడి కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ కూతుర్ని ఇన్స్ పెక్టర్ తావడే కిడ్నాప్ చే సుకు పోతాడు. ఇన్స్ పెక్టర్ తావడే దగ్గర్నుంచి ఓమి గ్యాంగ్ కిడ్నాప్ చేసుకుపోతారు. ఇదంతా చూసి గీతా అర్జున్ ని తిడుతుంది. ఓజీ ని అపార్ధం జేసుకున్నావని మందలిస్తుంది.
ఇప్పుడు 15 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో గీతాకి భర్తతో గొడవ జరుగుతుంది. అతడ్ని బయటికి నెట్టేసి ఓజీకి కాల్ చేస్తుంది. ఆ భర్త వెంటిలేటర్ నుంచి చిన్న పిల్లాడుగా వున్న అర్జున్ కి సైగలు చేసి సొరుగులో రివాల్వర్ తెప్పించుకుంటాడు. స్టూలు ఎక్కి ఆ రివాల్వర్ అందిస్తూంటే, అది పేలి అతను (గీతా భర్త) చనిపోతాడు. అదే సమయంలో ఓజీ రావడంతో అతడే చంపాడని నింద వేస్తారు. ఓజీ చేసేది లేక సత్యదాదాని విడిచి పెట్టి వెళ్ళి పోతాడు. మదురైలో డాక్టర్ కన్మణిని ప్రేమించి పెళ్ళి చేసుకుని సెటిలైపోతాడు.
ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని పగబట్టిన అర్జున్ శాంతిస్తాడు, ఇక ఓజీ కూతుర్ని కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఓమి బొంబాయిని పేల్చేసే కుట్ర మొదలెడతాడు. ఇంతలో జపాన్ నుంచి సమురాయ్ వస్తాడు. వచ్చి ఓజీ ఎవరో తెలుసా అని ఓమి గ్యాంగ్ కి బిల్డప్ ఇస్తాడు. దీంతో యాక్షన్ సీను, ఆతర్వాత కథ ముగిస్తూ క్లయిమాక్స్.
దీని స్క్రీన్ ప్లే సంగతులేమిటి?
.jpg)
పై కథ ప్రారంభం నుంచీ చూసుకుంటూ వస్తే, సత్యదాదాకి అంగ రక్షకుడుగా వున్న ఓ జీ అతడ్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళి పోయాడు చెప్పలేదు. వెళ్ళిపోయి తెర వెనుక ప్రత్యర్థుల మీద పథకం రచిస్తున్నాడా తెలీదు. వెళ్ళిపోవడానికి ముందు పరిస్థితులు కూడా మామూలుగా వున్నాయి. మరెందుకు వెళ్ళిపోయాడు. సత్య దాదాకి మాత్రం ఓమి గ్యాంగ్ తో ఘర్షణలు, మరణాలు పెరుగుతాయి. ఇప్పుడు చూస్తే ఓజీ మదురైలో డాక్టర్ కన్మణి తో ప్రేమలో వుంటాడు. పెళ్ళి చేసుకుంటాడు. కూతురు పుడుతుంది. తర్వాత సత్యదాదాకి ప్రమాద తీవ్రత పెరిగి, బొంబాయికి ప్రమాదం తలెత్తాక ఇప్పుడు తిరిగి వస్తాడు.
ఇప్పుడు సెకండాఫ్ లో చూద్దాం- ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో గీతా భర్తతో గొడవ పడడం, కొడుకు అతడికి రివాల్వర్ అందించబోతూంటే అది పేలి ఆ భర్త మరణించడం, అప్పుడే వచ్చిన ఓజీ మీద ఆ నేరం మోపడంతో అతను వెళ్ళిపోవడం వగైరా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో తెలుసుకుంటాం. అంటే ఫస్టాఫ్ లో అతనెందుకు వెళ్ళిపోయాడో కారణం ఇప్పుడు తెలుస్తోందన్న మాట. ఇప్పుడు తెలియడం వల్ల కథకి జరిగిన మంచి ఏమిటి? ఇది థ్రిల్ చేస్తోందా? లేదు. సస్పెన్సు వీడి రిలీఫ్ నిస్తోందా? లేదు. సెకండాఫ్ కి బలాన్ని చేకూర్చిందా? లేదు. ఓజీ పట్ల సానుభూతిని కల్గించిందా? లేదు. కేవలం అర్జున్ అపార్ధాన్ని తీర్చడానికే పనికొచ్చింది. అర్జున్ అపార్దానికీ, ఓజీ మీద పగకీ అర్ధముందా? ఓజీ భార్య హత్య జరిగినప్పుడే అర్జున్ అపార్ధం, పగ చల్లారి పోవాలి. ఓజీకి ఇంత కంటే శిక్ష ఏముంటుంది? అసలు సెకండాఫ్ కి ఓజి ప్రధాన ఎజెండా భార్య హత్యకి పగ దీర్చుకోవడమైతే, ఈ ప్రధాన కథని వదిలేసి అర్జున్ తో సబ్ ప్లాట్ తీసుకురా వడమేమిటి?
అంటే ఈ ఫ్లాష్ బ్యాక్ సీను ప్రధాన కథ ననుసరించి సీను ఫస్టాఫ్ లో ప్రెజెంట్ స్టోరీగా వుండాల్సిందన్నమాట. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాకుగా కాదు. ఈ సీను ఫస్టాఫ్ లో వుంటే అది ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది. ఈ సీనులో ఘర్షణ వుంది, గీతా భర్త మరణం వుంది, ఆ హత్యా నేరం ఓజీ మీదేసుకుని వెళ్ళిపోయే ఎమోషనల్ కంటెంట్ వుంది. ఈ ఎమోషనల్ కంటెంట్ కి ఆడియెన్స్ కి పీలింగ్స్ పుట్టే అవకాశముంది. దాంతో ఓజీ పట్ల సానుభూతి ఏర్పడుతుంది. కథ అర్ధమై, ఇప్పుడేం జరుగుతుందా అన్న ఉత్కంఠ, సస్పెన్సూ ఏర్పడతాయి. ఇది బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ సీను కావడంతో, స్క్రీన్ ప్లే కూడా స్ట్రక్చర్ లో వుంటుంది. ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో సమస్య పుట్టి పాత్ర ఇరుకున పడింది కాబట్టి పాత్ర గోల్ ఏమిటా అన్న ప్రశ్న వస్తుంది. గీతా భర్తని అంటే సత్యదాదా కొడుకుని తను చంపలేదని నిరూపించుకుంటాడా?
అలా చేయలేదు. మదురై వెళ్ళిపోయి డాక్టర్ తో ప్రేమా, పెళ్ళీ, జీవితం పెట్టుకున్నాడు. ఇది ప్రశ్నార్ధకం చేస్తుంది. పాత్ర అర్ధం కాదు. పాత్రకి మరింత సస్పెన్స్ ఏర్పడుతుంది. ఇది ఆడియెన్స్ ని పట్టి ముందుకు తీసికెళ్తుంది. కథనం ఆసక్తికరంగా మారుతుంది. అప్పుడు ఊహిస్తున్న గోల్ కి విరుద్ధంగా పెద్ద మనసు చేసుకుని, సత్యదాదా ప్రమాదంలో వుంటే తిరిగి వచ్చేశాడు- తన మీద నేరం మోపినా పెద్ద మనసు చేసుకుని రావడం పాత్ర పట్ల గౌరవాన్ని పెంచుతుంది. అలా తిరిగి వచ్చినప్పుడు ఆ యాక్షన్ సీనుకి - ఎలివేషన్ కి విపరీతమైన అప్లాజ్ వస్తుంది!
ఎందుకంటే అతడికేం జరిగిందో తెలుసు కాబట్టి ఆ సానుభూతితో వున్నారు ప్రేక్షకులు. అతడికేం జరిగిందో చూపించకుండా ఆ ముక్క కత్తిరించి సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాకుగా వేసుకుంటే అర్ధవంతమైన పై ఎలివేషన్ వస్తుందా? దాన్ని బలపర్చే కథా నేపథ్యం లేక - ఎమోషన్ లేని తాటాకు చప్పుళ్ళు చేస్తుందా?
అతను తిరిగి వచ్చి ప్రత్యర్దులనుంచి సత్య దాదాని కాపాడేసి, ఆ తర్వాత బొంబా యిని కాపాడే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రారంభించవచ్చు పై కథ ప్రకారం. అంటే దీని అర్ధం ప్లాట్ పాయింట్ లో అతడికి పుట్టింది ప్రాథమిక ఎమోషన్ అయితే సత్య దాదాని కాపాడడం, బొంబాయిని కాపాడడం వంటివి దాని అనుబంధ ఎమోషన్స్ అవుతాయి. అంటే పాత్ర ఎమోషనల్ ఆర్క్ పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలో- ఈ ఘర్షణలో ఓమి గ్యాంగ్ ఓజీ భార్యని చంపడం తో ఎమోషనల్ ఆర్క్ మరింత పెరిగి- ఇంటర్వెల్ కి భావోద్వేగాలు మరింత ప్రజ్వరిల్లుతాయి. ఇలా జరగలేదు. ఇందుకే ఎమోషనల్ కంటెంట్ ఈ కథలో లేదు.
సరే, అయితే ఒకటుంది- అప్పటి బొంబాయి- ముంబాయి మాఫియాలు ఒక నీతిని పాటించేవాళ్ళు. మనం మనం కొట్టుకు చద్దాం, కుటుంబాల జోలికి పోవద్దని. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో హిందీ సినిమాలు కూడా ఇలాగే వచ్చేవి- రాం గోపాల్ వర్మ తీసిన 'సత్య', 'కంపెనీ' సహా. పరస్పరం మాఫియాలు కుటుంబాల్ని ఇబ్బంది పెట్టుకునే చిత్రణలు లేకుండా. 'ఓజీ' కథలో ఈ నీతిని పాటించలేదు. ఓజీ కూతుర్ని కూడా వదిలిపెట్టలేదు. కథ కోసం రీసెర్చి చేసి వుండరు.
ఎప్పుడైతే భార్య హత్యకి అతను ఫీల్ కావడం లేదో, ఇక ఎన్ని యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు చూపించినా బాక్సాఫీసు కూడా ఫీల్ కాదు. ఇంకెన్ని సబ్ ప్లాట్స్ తో నింపినా బాక్సాఫీసు వేసే ప్రశ్న ఒకటే- నీ ప్రధాన కథ ఏది మిస్టర్ ఓజీ?
-సికిందర్
.png)

.jpg)
.jpg)
.jpg)

.jpg)
.jpg)
.jpg)
.png)


.jpg)
.jpg)
.png)

%20(1).jpg)
