రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 22, 2025

1403 : డీప్ రివ్యూ!

                                                          కథ, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్ తారాగణం: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి, సముద్రకని, రవీంద్ర విజయ్, నిళల్ గళ్ రవి, భగవతీ పెరుమాళ్, బిజేష్ నగేష్ తదతరులు స్క్రీన్ ప్లే: సెల్వమణి సెల్వరాజ్ -తమిళ్ ప్రభ, సంగీతం: ఝాను చందర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం : డానీ సాంచెజ్-లోపెజ్, కూర్పు : లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వెజ్ బ్యానర్స్ : స్పిరిట్ మీడియా,  వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మాతలు : రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి,జోం వర్ఘీస్ విడుదల : నవంబర్ 14, 2025 ***         ర్ధమాన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మలయాళ- తెలుగు- తమిళ-హిందీ భాషల్లో  వైవిధ్యభరిత సినిమాలు నటిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్, చుప్ -ది రివెంజ్ ఆఫ్ ది  ఆర్టిస్ట్, లోకా వంటి వైవిధ్యంతో కూడిన సినిమాల తర్వాత, మరిన్ని ప్రత్యేకతలతో తాజాగా తమిళంలో ‘కాంత’ నటించాడు. ఇది ఆసక్తి రేపుతూ తెలుగులో విడుదలైంది.  సల్మాన్ తో చేతులు కలిపి బహు భాషా  నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి ఈ మూవీలో నటించడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఇంకా తమిళ నటుడు సముద్రకని ఒక ముఖ్య పాత్రలో, తెలుగులో మిస్టర్ బచ్చన్, కింగ్డం సినిమాల హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంకో ముఖ్యపాత్రా నటించిన ఈ మూవీకి  దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. ఇతను క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ 'ది హంట్ ఫర్ వీరప్పన్' తో పెద్ద పేరు సంపాదించుకున్నాడు. అలాగే నీలా (2016), లైఫ్ ఆఫ్ పై (2012) వంటి విభిన్న సినిమాలతో తనకంటూ ఒక విజువల్ శైలిని ఖరారు చేసుకున్నాడు. ఇప్పుడు ‘కాంత’అనే పీరియెడ్ డ్రామా థ్రిల్లర్ తో ఇంకో విజయం సాధించేందుకు ప్రేక్షక లోకం ముందుకొచ్చాడు. పోర్ట్ ఫోలియో చూస్తే  ఇంత ఆకర్షణీయంగా వున్న ఈ మూవీలో వున్నదేమిటి, అదెంతవరకూ మెప్పిస్తుందీ ఈ కింద డీప్ రివ్యూలో చూద్దాం…

కథేమిటి?

    ఈ కథ 1950ల నాటి మద్రాసులోని  మోడరన్ స్టూడియోస్ లో ప్రారంభమవుతుంది. ఈ స్టూడియోలో లోపలేం జరుగుతోందో  బయటికి సమాచారం రాదు. అంత నిగూఢంగా సినిమా నిర్మాణ కార్యకలాపాలు జరుగుతూంటాయి. అయితే ఈ స్టూడియో నష్టాల్లో వుంటుంది. దీంతో స్టూడియో అధినేత, నిర్మాత మార్టిన్ (రవీంద్ర విజయ్) దర్శకుడు అయ్యా (సముద్రకని) ని పిలిఛి, చాలా కాలం క్రితం ఆగిపోయిన ‘శాంత’ అనే సినిమాని పూర్తి  చేయమంటాడు.ఈ ఆగిపోయిన సినిమాలో హీరో టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) నటించాడు. ఇతను అప్పట్లో అయ్యా (తమిళంలో అయ్యా అంటే సర్ అని అర్ధం) శిష్యుడు. 


వీధి నాటకాలేస్తున్న మహదేవన్ ని ప్రోత్సహించి సినిమా హీరో చేశాడు అయ్యా. ఇప్పుడు అదే మహదేవన్ స్టార్ గా ఎదిగాడు. ఎదగడంతో బాటు తనంత మొనగాడు లేడని ఇగో  పెంచుకున్నాడు. పేరుకి ముందు నట చక్రవర్తి  తగిలించారు అభిమానులు. ఇప్పుడు గురువుగారు దర్శకుడు అయ్యా ఆగిపోయిన  ‘శాంత’ ని పూర్తి చేసేందుకు అడగడంతో మహదేవన్ కొన్ని కండిషన్లు పెడతాడు. సినిమా టైటిల్ ‘కాంత’ గా మార్చాలనీ, తను చనిపోయే క్లయిమాక్స్ కూడా మార్చాలనీ వగైరా. అసలు అయ్యా ఈ సినిమాని తన తల్లి జీవితం ఆధారంగా నివాళిగా తీసేందుకు సంకల్పించాడు. శిష్యుడు ఇలా షరతులు పెట్టడంతో అతడికి  వొళ్ళు మండిపోతుంది. ఇక్కడనుంచీ ఇద్దరి మధ్యా ఇగోల సంఘర్షణ మొదలవుతుంది. షూటింగ్ చేస్తున్నారన్న మాటేగానీ ఇద్దరి మధ్య మాటలుండవు. అసలు అయ్యాని పక్కనబెట్టి, తన ఫ్యాన్స్ కి నచ్చే విధంగా కలుషితం చేసి తనే షూట్ చేస్తూంటాడు మహదేవన్.

ఈ సినిమాలోకి హీరోయిన్ గా కుమారి (భాగ్యశ్రీ బోర్సే) వస్తుంది తల్లి పాత్ర నటించడానికి. ఆమె భర్తగా మహదేవన్. సెట్ లో ఆమె మహదేవన్ ధోరణి చూసి అయ్యాని సపోర్టు చేస్తుంది. ఈమెని బర్మా శరణార్ధుల శిబిరంలో చూసి సినిమా నటిని చేశాడు అయ్యా. ఇక మహదేవన్ పత్రికాధిపతి కుమార్తె దేవి (గాయత్రీ శంకర్) ని వివాహం చేసుకుని వున్నాడు. ఇప్పుడు కుమారి పట్ల ప్రేమని పెంచుకుంటాడు. ఈ ప్రేమాయణం చూసి అయ్యా రగిలిపోతాడు. తన సినిమాని, తను తెచ్చిన హీరోయిన్ నీ లాగేసుకుంటున్న మహదేవన్ కి ఇక బుద్ధి చెప్పక తప్పదని భావిస్తాడు. ఇలా ఉద్రిక్తతల మధ్య షూటింగ్ జరుగుతూండగా- క్లయిమాక్స్ తీస్తున్నప్పుడు మర్డర్ జరుగుతుంది. క్లయిమాక్స్ లో వాడిన రివాల్వర్ తోనే మర్డర్ జరుగుతుంది…

ఎవరు చేశారీ మర్డర్? ఎందుకు  చేశారు? ఇందులో ఎవరెవరు ఇరుక్కున్నారు? ఇంకా ఎవరెవరు సాక్షులుగా, అనుమానితులుగా వున్నారు? కేసు చేపట్టిన పోలీసు అధికారి ఫీనిక్స్ (రానా దగ్గుబాటి) దర్యాప్తు ఎలా సాగింది? హంతకుడుగా ఎవర్ని పట్టుకున్నాడు? హత్య చేయడం వెనుక హంతకుడి ఉద్దేశమేమిటి? …ఇదీ మిగతా కథ .

ఎవరెలా చేశారు?

    దుల్కర్ సల్మాన్ ఈ పీరియెడ్ కథలోని మహదేవన్ పాత్రని 75 ఏళ్ళ నాటి మనుషుల బాడీ లాంగ్వేజ్, మాట తీరు, హావ భావాలు మొదలైనవి అచ్చంగా గుర్తు చేస్తూ సినిమాకి డెప్త్ తెచ్చాడు. సినిమాలో రెండు పాత్రలు పోషించాడు-నిజ జీవితంలో టాప్ స్టార్ మహదేవన్ గా, టాప్ స్టార్ గా సినిమాలో నటిస్తున్న మోహన్ పాత్రగా. కెమెరా ముందు మోహన్ పాత్ర నటిస్తున్నప్పుడు నాటి సినిమాల్లోని అతి నాటకీయతని అద్భుతంగా పోషించాడు. ఏకకాలంలో ఈ రియల్ లైఫ్ / రీల్ లైఫ్ పాత్రలు రెండిటి పార్శ్వాల్నీ మార్చి మార్చి ప్రదర్శించే బొమ్మా బొరుసు ఆటాడుకున్నాడు. 

సాధారణంగా నటులు సన్నివేశం నటిస్తున్నప్పుడు రియల్ లైఫ్ ని మర్చిపోయి పాత్రలో లీనమైపోతారు. కట్ చెప్పాకే పాత్రలోంచి రియల్ లైఫ్ కొస్తారు. ఈ ప్రొఫెషనలిజం వుంటుంది. హీరోయిన్ తో నటిస్తున్నప్పుడు ఎక్కడో కాస్త వశం తప్పి షాట్ చెడగొట్టే సందర్భాలు చాలా అరుదు. అయితే దుల్కర్ హీరోయిన్ తో మోహన్ గా నటిస్తున్నప్పుడు పాత్ర ప్రకారం, ఆమె ఆడతనపు అభినయం చూసి ఏకాగ్రత చెదిరి రియల్ లైఫ్ లో కొచ్చేసి మహదేవన్ లా రియాక్షనిచ్చే సందర్భాలెన్నో వుంటాయి. తీస్తున్న సినిమా షాట్స్ ని చిత్రీకరిస్తున్నప్పుడు దృశ్యం బ్లాక్ అండ్ వైట్ లోకి వస్తుంది. ఎందుకంటే ఆ షాట్స్  కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి- కెమెరాలో రీలు నాటి సినిమాలకి తగ్గట్టే బ్లాక్ అండ్ వైటే కాబట్టీ.

హీరోయిన్ తో మోహన్ గా నటిస్తున్న తెలుపు నలుపు షాట్స్ లో, మహదేవన్ గా రియా క్షనిచ్చినప్పుడు అతడి క్లోజప్ కలర్ లో కొచ్చేస్తుంది. తేరుకుని మళ్ళీ హీరోయిన్ని చూసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ లోకి మారుతుంది. ఈ రీల్ లైఫ్ /రియల్ లైఫ్ ల జుగల్బందీ చాలా సార్లు ఫ్లాష్ అవుతూంటుంది ఫస్టాఫ్ అంతా. ఇదంతా దర్శకుడి సృజనాత్మకతే. దుల్కర్ ఈ రెండు పాత్రల వేర్వేరు క్షణ కాలపు రియాక్షన్స్ ని బొమ్మా బొరుసు చేసి ఆడుకున్నాడు.

హైలైట్ అనదగిన ఇంకో సీనులో నటన వుంటుంది- దర్శకుడు అయ్యా పాత్రలో సముద్రకని, ఒక షాట్ లో అడ్డు తగిలి- ఈ 4 స్టెప్స్ చేసి చూపించమని ఛాలెంజి విసురుతాడు. ఆ  షాట్లో 4 స్టెప్స్ వేస్తూ మిర్రర్ దగ్గరికెళ్ళి- మిర్రర్ కేసి తల కొట్టుకోవాలి. ఒక్కో డైలాగుతో ప్రతీ స్టెప్ లో బాడీ లాంగ్వేజీ ఎలా వుండాలో, ఎక్స్ ప్రెషన్స్ ఏమివ్వాలో, తెర మీద మారిపోయే ఏఏ ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలో వివరిస్తాడు సముద్రకని. ప్రతీ స్టెప్ లో మారిపోయే ‘కంటెంట్’ తో దుల్కర్ అవలీలగా ఛేంజోవర్స్ చూపిస్తూ వెళ్ళి రక్తం చిందేలా తల మిర్రర్ కేసి కొట్టుకుంటాడు!

ఇలా ఫస్టాఫ్ లో చాలా టెక్నిక్కు లున్నాయి. సాధారణంగా ఇంత మైక్రోలెవెల్ పాత్రచిత్రణ, చిత్రీకరణలో సృజనాత్మకతా కమర్షియల్ సినిమాల్లో వుండవు. దర్శకుడు ఆర్ట్ హౌస్ సినిమా స్కూలుకి చెందిన వాడు కాబట్టి కమర్షియల్ సినిమా అయినా చుట్టేయకుండా, ప్రేక్షకులకి చిరకాలపు చుట్టరికాన్ని చుట్టబెట్టాడు. దుల్కర్ పాత్రకి ఇంకో వెర్షన్ వుంది : ఫ్లాష్ బ్యాక్ ఈవెంట్స్ లో పాతికేళ్ళ కుర్రాడిగా వీధి నాటకా లేస్తున్నప్పటి శరీరం, సొగసూ. 

అయితే ఈ మహదేవన్ పాత్రతో ఒకటే ఇబ్బంది- ఆ రోజుల్లో స్టార్లు ఇలా పొగరుతో వుండే వాళ్ళా? దర్శకుల మాట జవదాటే వాళ్ళా? తమని నటుల్ని చేసిన గురువులంటే గౌరవ భావంతో వుండేవాళ్ళు. 1950 - 1970 ల మధ్య తమిళంలో అయినా తెలుగులోనైనా సినిమాలకది మలి స్వర్ణయుగం. ఇంకా వ్యాపార యుగం ప్రారంభం కాలేదు. 1970 ల నుంచి వ్యాపార యుగంతో స్టార్లు శాసించే రోజులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చూస్తే మహదేవన్ పాత్ర చిత్రణ అసహజంగా అన్పిస్తుంది. ఈ ప్రశ్న వేధిస్తూంటే  సమాధానం సెకండాఫ్ లో లభించినట్టు అన్పిస్తుంది-  ఆ ఫ్లాష్ బ్యాక్ పార్టులో ఇదే సినిమాలో నటిస్తూ అప్పుడూ గురువు మాట వినలేదు మహదేవన్. అప్పుడు కోపంతో కుర్చీ ఎత్తి అతడి మీదికి విసిరాడు అయ్యా. దాంతో ఆగకుండా తప్పుడు కేసులో అరెస్టు చేయించి తనే బెయిలు మీద విడిపించాడు అయ్యా. దీంతో కహదేవన్ తెగతెంపులు చేసుకుని అయ్యా మీద ప్రతీకారం పెంచుకున్నాడు. ఆ ప్రతీకారమే ఇప్పుడు తీర్చుకుంటున్నాడని జస్టిఫై చేశాడు దర్శకుడు. అయినా మళ్ళీ ఇదే ప్రశ్న- ఇంకా స్టార్ గా ఎదగని గతంలో అయినా మహదేవన్ గురువైన అయ్యా మాట ఎందుకు ఖాతరు చేయలేదు? ఇదే ఈ పాత్రతో వచ్చిన ఇబ్బంది!

ఇక సముద్రకనితో ఇగో క్లాషెస్ సీన్లు, స్టూడియో బయట హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో పాత స్టయిల్ రోమాంటిక్ సీన్లూ, ఇంటర్వెల్ ముందు సృష్టించే అల్లకల్లోలపు సీనూ దుల్కర్ టాలెంట్ కి నిదర్శనాలు. ఇంతే, దీన్తర్వాత సెకండాఫ్ కొస్తే మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఐపొతాడు. ఇక్కడ్నుంచీ 50 నిమిషాలూ ఓ నాల్గు సీన్లలో తప్ప కనిపించడు. ఈ నాల్గు సీన్లలో కూడా ఏమీ చేయడు. హత్య కేసులో అనుమానితుడి పాత్రగా లొంగి వుంటాడు- సెకండాఫ్ కథ రానా దగ్గుబాటి చేతుల్లోకి వెళ్ళిపోవడంతో. క్లయిమాక్స్ లోనే తిరిగి యాక్షన్ లోకొస్తాడు. ఇలా ఫస్టాఫ్ ని బలంగా నిలబెట్టగల్గిన దుల్కర్, సెకండాఫ్ లో కథ మర్డర్ మిస్టరీగా జానర్ మారిపోవడంతో సినిమాని కాపాడలేక పోయాడు.

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సినిమాకి పెద్ద ఎట్రాక్షనే. ఆమె క్లోజప్స్ లో ఇచ్చిన వివిధ షాట్స్ ని మర్చిపోలేం. 1950 లనాటి సౌకుమార్యం, సహజత్వం, ఆడతనం, నేటివిటీ నటనలోకి తీసుకొచ్చింది. ఆడతనపు హీరోయిన్ పాత్రల్ని చూసి కాలమైంది. పాత సినిమాలు చూసుకోవాల్సిందే. అలాటి పాత సినిమా హీరోయిన్ ని చూపించాడు దర్శకుడు. ఆమె నటించిన కుమారి పాత్ర గ్లామర్ కోసం లేదు, ఒకవైపు అయ్యాతో గురుభక్తి, మరోవైపు తనని ప్రేమించే పెళ్ళయిన మహదేవన్ తో ఎటూ తేల్చుకోలేని స్థితి- ఈ రెండిటి మధ్య గుంభనంగా సేఫ్ గేమ్ ఆడుకునే ఆరిందా. 

సముద్రకని విషయానికొస్తే- గురువుగా సముద్రకని శిష్యుడి అవిశ్వాసానికి అనుభవించే మానసిక సంఘర్షణతోనే నలిగి పోతూంటాడు. షూటింగ్ మధ్యలో శిష్యుడ్ని పీకి పారేసే ధైర్యం లేదు. కానీ పరిస్థితి పీక్ కి వెళ్ళాక డిక్లేర్ చేసేస్తాడు- షూటింగులో ఉన్నట్టుండి పైనుంచి షాండ్లియర్ విరిగిపడడంతో కొద్దిలో తప్పించుకున్న శిష్యుడ్ని ఉద్దేశింఛి- ‘నీ కళ్ళల్లో చావు భయం కన్పించింది- నాకు సంతృప్తిగా వుంది. అందుకే నిన్ను చంపబోతున్నాను’ అని తెగించి చెప్పేస్తాడు. శిష్యుడు చావడానికి రాలేదు. అందుకే తీస్తున్న సినిమా క్లయిమాక్స్ లో కుమారి చేతిలో చచ్చే సీనుని మార్చి పారేశాడు. అంటే గురూ గారు తన సొంత తల్లి శాంత జీవిత కథతో నివాళిగా తీస్తున్న సినిమా కథనే మార్చేశాడు. గురువుగారి తల్లి శాంత వ్యసనపరుడైన భర్తని కాల్చి చంపేసే కథ అది…శాంత పేరు కూడా కాంతగా మార్చేశాడు శిష్యుడు. ఇలా ప్రొఫెషనల్ గా ఇగోల సంఘర్షణే కాదు, పర్సనల్ గా కూడా తన జీవితంలోకి చొరబడ్డ విశ్వాస ఘాతకుడైన శిష్యుడి మీద ప్రతీకారంతో రగిలిపోయే పాత్రని బలంగా, అర్ధవంతంగా  ప్రెజెంట్ చేశాడు సముద్రకని.

ఇక పోలీసు అధికారి ఫీనిక్స్ గా ఇంటర్వెల్ తర్వాత ఎంటరయ్యే రానా దగ్గుబాటి కామిక్ సెన్స్ తో నవ్వించే ప్రయత్నం చేస్తాడు. అది అరుపులతో లౌడ్ గా వుంటుందే తప్ప నవ్వించదు. 50 నిమిషాల సేపూ సాగే అతడి దర్యాప్తు పార్టు చాలా మైనస్ సినిమాకి. ఎందుకో చివర చూద్దాం. ఐదేళ్ళ క్రితం ఈ కథ పట్టుకుని తన దగ్గరి కొచ్చిన దర్శకుడ్ని హీరోగా దుల్కర్ అయితే బావుంటుందని దుల్కర్ ని బలవంతంగా ఒప్పించాడు రానా. కానీ తన పాత్ర ఎలా వుందో దాని మీద వర్క్ చేసుకోలేదు. ఇదే సెకండాఫ్ బాక్సాఫీసు అప్పీల్ని దెబ్బతీసింది. 

అల్లుడు మహదేవన్ ప్రేమ వ్యవహారాల్ని కనిపెట్టే పత్రికాధిపతిగా నిళల్ గళ్ రవి గుర్తుండి పోయే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. కూతురు దేవి పాత్రలో గాయత్రీ శంకర్ కూడా గుర్తుంటుంది. ఈమెకీ భాగ్యశ్రీకీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూంటుంది. క్లయిమాక్స్ చూసేందుకు ఈమె సెట్స్ కొచ్చినప్పుడు, చూడకుండానే కుర్చీ లోంచి లేచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడా కుర్చీలో భాగ్యశ్రీ కూర్చునే విధానం గొప్ప అర్ధాన్నిస్తుంది- సబ్ టెక్స్ట్ గా. ఇది కూడా గుర్తుండి పోయే గొప్ప సీను. 

ఇతర మైనర్ పాత్రలు చాలా వున్నాయి. కానీ ఒక్క తెలుగు పాత్రా లేదు. తెలుగు సినిమా పరిశ్రమ కూడా మద్రాసు సినిమా పరిశ్రమలో అంతర్భాగం అప్పట్లో. కానీ ఆ నటులుగానీ, సాంకేతికులుగానీ, దర్శకుడు అయ్యా అసిస్టెంట్లుగా గానీ తెలుగు పాత్ర ఒక్కటీ కథలో భాగంగా తెర మీద కన్పించకపోవడం విచిత్రం- రానా కూడా తమిళ పాత్రే. ఈ సినిమాని మాత్రం తెలుగు- తమిళ భాషల్లో తీసి విడుదల చేశారు. 1950లలో జరిగే కథంటే చరిత్రని రికార్డు చేయడమే. అలాటిది ఆ మద్రాసు ఉమ్మడి సినిమా చరిత్రలో తెలుగు కళాకారుల ఉనికినే విస్మరించారు. 

సాంకేతికాల సంగతి?

    ఝాను చందర్ సంగీతంలో మూడు పాటలూ తీసి పక్కన పెట్టేయాలి. పీరియెడ్ కథలో నేటి కాలపు  స్లో పాటలు నాన్ సింక్. జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రం పీరియెడ్ సినిమాల స్వరాలు పలికింది సింపుల్ గా. ఇది పాత సినిమాల బిజిఎం కి దగ్గరగా వుంది. ఇలాగే ఝాను చందర్ పాటలు కూడా వుండాల్సింది.  డానీ సాంచెజ్-లోపెజ్ కెమెరా వర్క్ లైటింగ్ ఎఫెక్ట్స్ ప్రధానంగా  పీరియెడ్ వాతావరణ సృష్టి కళాత్మకంగా వుంది. కలర్ లో వచ్చే భాగాలు బ్లూ-బ్రౌన్ టింట్స్ తో కూల్ గా వుంటాయి. కంటికి చలవ చేశాయంటారు అలా. రామలింగం కళాదర్శకత్వం కూడా. కానీ  లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వెజ్ ఎడిటింగ్ నిర్దాక్షిణ్యంగా సెకండాఫ్ నిడివిని తగ్గించేసి వుండాల్సింది! ఫస్టాఫ్ లో కలర్ / బ్లాక్ అండ్ వైట్ జుగల్బందీ షాట్స్ కి ఫాస్ట్ కటింగ్స్, అలాగే సినిమా సాంతం అంచెలంచెలుగా వచ్చే జరిగిన కథ తాలూకు మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల ఎడిటింగ్, ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవకుండా కూర్పు చేశాడు. సినిమా ఎక్కువ భాగం స్టూడియోలోనే సాగుతుంది. అవుట్ డోర్ లొకేషన్స్ తక్కువ.

ఇంతకీ కథెలా వుంది?

    జానర్ బెండర్ అంటూ రెండు విజాతీ జానర్లు కలిపి చేసిన కథే కొంప ముంచింది. కమర్షియల్ సినిమా ప్రయోగాలకి పరిమితులుంటాయి. పైగా జానర్ బెండర్ గా ఇది ఇండీ ఫిలిం అని ఇంకో మాటన్నాడు రానా. ఇండీ ఫిలిమ్స్ ఎంత మంది ప్రేక్షకులు చూస్తారు, వాటి మార్కెట్ ఎంత. సాధారణంగా లో- బడ్జెట్ సినిమాలుగా ఇవి వుంటాయి. ఫస్టాఫ్ కళ్ళప్పగించి చూసి, సెకండాఫ్ కళ్ళుమూసుకుని కునుకు తీసేలా చేసేది జానర్ బెండర్ కాదేమో. ముందు మార్కెట్ యాస్పెక్ట్ పట్ల స్పష్టతో వుంటే, దాంతో క్రియేటివ్ యాస్పెక్ట్ స్పష్టంగా వస్తుంది. 

ఐతే ఏమాటకామాటే చెప్పుకుంటే, దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ మనుషుల్లోని అహం, ఆశ, ద్రోహం వంటి థీమ్స్ చుట్టూ ఈ కథ తీయాలనుకున్నాడు. నాటి తమిళ నటుడు, గాయకుడు ఎంకె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా ఈ కథ వుంటుందని ప్రచారం కూడా జరిగింది. భాగవతార్ ని తమిళ సినిమాలకి మొదటి సూపర్ స్టార్ గా పేర్కొంటారు. అయితే దుల్కర్ సల్మాన్ పాత్ర టీకే మహదేవన్ పేరు సహా కథ పూర్తిగా కల్పితమని స్పష్టం చేశాడు తర్వాత దర్శకుడు. అయినా సినిమా విడుదలయ్యాక దుల్కర్ మీదే కేసేసేశారు భాగవతార్ వారసులు. భాగవతార్ జీవితాన్ని తప్పుగా చిత్రీకరించారని ఆరోపణ. 

భాగవతార్ తమిళ సినిమాల్లో ఉచ్ఛస్థితిలో వున్నప్పుడు మర్డర్ చేశాడు. అప్పట్లోనే హీరో హీరోయిన్ల ఎవైర్స్ మీద కథనాలు రాసే ఎల్లో జర్నలిస్టు లక్ష్మీ కాంతన్ తన వారపత్రిక ‘సినిమా తూటు’ లో, భాగవతార్ పరువుని అదే పనిగా తూట్లు పొడుస్తూంటే, 1944 లో నటుడు ఎంఎస్ కృష్ణన్, స్టూడియో యజమాని శ్రీరాములు నాయుడులతో కలిసి లక్ష్మీకాంతన్ ని కత్తిపోటుతో కైలాసానికి పంపేసి, శ్రీకృష్ణ జన్మ స్థానానికెళ్ళి పోయాడు భాగవతార్. కోర్టులో శిక్ష పడింది. 1947 లో పై కోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా విడుదలై పోయాడు. కానీ అప్పుడు మళ్ళీ నటించిన సినిమాలు ఆడలేదు. ఇక జీవితం మీద వైరాగ్యం పెంచుకుని, గాయకుడుగా మారి, గుళ్ళూ గోపురాల్లో కచేరీలు చేసుకుంటూ తిరుగుతూ, 1959 లో ఓ కచేరీలో అనారోగ్యం పాలైతే, ఎవరో ఇచ్చిన ఆయుర్వేద టానిక్ సేవించి- అది వికటించడంతో మరణించాడు. ఇది పోయెటిక్ జస్టిసేమో చేసిన హత్యకి. 

ఇలా దుల్కర్ పాత్ర పేరు, హీరోయిన్ తో ఎఫైర్, హత్యకేసులో ఇరుక్కోవడం వంటి మూడు సారూప్యాలు తప్ప భాగవతార్ జీవితంతో ఇంకే సంబంధం కనపడదు కథలో. 

రెండోది, ఈ కథలో మద్రాసులో మోడరన్ స్టూడియో అనేది అప్పట్లో సేలంలో కొనసాగిన మోడరన్ థియేటర్స్ లిమిటెడ్ వారి స్టూడియోని గుర్తుకు తెస్తుంది. మోడరన్  థియేటర్స్ స్టూడియోని 1935 లో టీఆర్ సుందరం ముదలియార్ ప్రారంభించాడు. అప్పట్లోనే సూటు బూటు హేట్ వేసుకుని కార్పొరేట్ స్టయిల్లో నడిపేవాడు స్టూడియోని. తర్వాత అతడి వారసులు 1982 వరకూ సూటు బూటు హేట్ వేసుకునే అదే కార్పొరేట్ స్టయిల్లో నడిపారు. మొత్తం 5 భాషల్లో 150 కి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్ -కృష్ణకుమారి -జమున లతో ‘వీరకంకణం’, ఎస్వీ రంగారావుతో ‘మొనగాళ్ళకు మొనగాడు’, కృష్ణ- కాంచన- గుమ్మడి లతో ‘నేనూ మనిషినే’  మొదలైన 15 సినిమాలూ  తీశారు. కళాకారులుగా అన్నాదురై, కరుణానిధి, ఎమ్జీఆర్ లాంటి ఎందరికో తొలి అవకాశాల్నిచ్చి ప్రముఖుల్ని చేసింది ఈ స్టూడియో.

ఇదంతా కథలో మోడరన్ స్టూడియో రూపంలో కనిపిస్తుంది. ఓనర్ కూడా సూటు బూటు వేసుకునే వుంటాడు హేట్ తప్ప. ఫస్టాఫ్ కథనం ఓపెనింగ్ ఇమేజితో ఇలా వుంటుంది … బ్లాక్ అండ్ వైట్ లో ఆ  రోజుల్లో హాలీవుడ్ ఫిలిం నోయర్ క్రైం జానర్ సినిమాల్లో కన్పించే లాంటి సీను…రాత్రి పూట మూసి వున్న ఎత్తైన మోడరన్ స్టూడియో గేటు. ఆకాశంలో ఉరుములు, మెరుపులు…హోరున వర్షం. ఆ  వర్షంలో మెల్లిగా నల్ల కారొచ్చి ఆగడం. తర్వాత మొహం కన్పించని హేట్ పెట్టుకున్న మనిషి బూటు కాళ్ళు మెట్లెక్కడం…మెట్లెక్కి గది ముందు ఆగితే,  వెనుక ఫ్లోర్ మీద పొడుగ్గా అతడి నీడ. ఈ నీడ కథ చెప్పే ఫిలిం నోయర్ 9 సింబాలిజమ్స్ లో ఒకటి…అంటే ఆ పాత్ర అంతర్గత మానసిక సంక్షోభాన్ని,  నైతిక సంశయాన్నీ, దాచి పెట్టిన ఉద్దేశాల్నీ ఈ నీడ సూచిస్తూ, మరో పక్క వెంటాడే గతాన్నీ, లేదా అనుభవించక తప్పని విధి విలాసాన్నీ స్పష్టం చేస్తుంది. అప్పుడు  అకస్మాత్తుగా రెండు గన్ షాట్లు…. దీంతో స్క్రీను బ్లాంక్ అయి టైటిల్స్ పడతాయి. 

ఈ ఓపెనింగ్ ఇమేజి కథ సారాంశాన్ని చెప్తోంది. ఎవరిదో హత్య జరిగింది, ఎవరో హత్య చేశాడు… ఈ సస్పెన్సు హుక్ గా పనిచేస్తూంటే, మొత్తం కథ తెలుసుకోవడానికి ఉత్కంఠతో ఉపక్రమిస్తాం. టైటిల్స్ తర్వాత దర్శకుడు క్లుప్తత పాటిస్తూ నాలుగే నాలుగు సీన్లతో నేరుగా కథ ప్రారంభించేశాడు- ఈ క్లుప్తతకి/ క్రియేటివిటీకి దర్శకులు/రచయితలు ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. 

మొదటి సిను : స్టూడియో ఓనర్, నిర్మాత మార్టిన్ ప్రభాకరన్  దర్శకుడు అయ్యాని పిలిచి ఆగిపోయిన సినిమా ప్రారంభించమని చెప్పడం, అయ్యా అయిష్టంగా వుంటే, నష్టాల్లో వున్న స్టూడియో కోసం తప్పదని మార్టిన్ ఒప్పించడం; రెండో సీను :  షూటింగ్ ఏర్పాట్ల హడావిడి;  మూడో సీను :  హీరోయిన్ కుమారి ఎంట్రీ, అయ్యా ఆమెతో -  మా అమ్మ కథలో అమ్మవి నీవే, అన్నీ నీవే నని చెప్పేయడం; నాలుగో సీను : ఆర్భాటంగా టాప్ స్టార్ మహదేవన్ ఎంట్రీ. అయిష్టంగా వున్న అయ్యాని చూసి- టైటిల్ మార్చేయ్, క్లయిమాక్స్ కూడా మార్చేసేయ్ అని అయ్యా ఆశల  మీద దుమ్ము పోయడం, ఇద్దరి మధ్యా ఇగోల పోరాటం మొదలై పోవడం… నాలుగే చిన్న చిన్న సీన్లు! 

నస లేకుండా ఇలా వెంటనే ప్రారంభమయ్యే కథ,  చకాచకా  మహదేవన్- అయ్యాలతో ఇగోల సంఘర్షణ, కుమారితో మహదేవన్ ప్రేమాయణం, మధ్య మధ్య మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో అయ్యా- మహదేవన్ ల గతం- ఇవి  చూపిస్తూ పాయింటు కొస్తుంది. అంటే కుమారితో మహదేవన్ ప్రేమాయణానికి అయ్యా ఇక మహదేవన్ ని చంపాలన్నంత కసి పెంచుకోవడం చూపించి- సినిమా ప్రారంభంలో హుక్ గా వేసిన ఓపెనింగ్ ఇమేజి దగ్గరికొస్తుంది కథ. ఇప్పుడు కూడా ఓపెనింగ్ ఇమెజిఒ హత్య చేసిన ఆగంతకుడ్ని రివీల్ చేయకుండా- హుక్ ని కొనసాగిస్తూ హత్యతో ఇంటర్వెల్ కొస్తుంది ఫస్టాఫ్.

అయితే ఓపెనింగ్ ఇమేజిలో హుక్ గా వాడిన రహస్యాన్ని ఇంటర్వెల్లో విప్పడం అమల్లో వున్న సాంప్రదాయం ప్రకారం కరెక్టే గానీ, పూర్తిగా విప్పకపోవడం కాదు. ఓపెనింగ్ ఇమేజికి ఇంటర్వెల్లో ఏమీ మిగలకూడదు- అంటే ఇక్కడ హత్య చేసిన ఆగంతకుడెవరో స్పష్టంగా చూపించె య్యాల్సిందే! అప్పుడే ఇంటర్వెల్ బ్యాంగ్ నిస్తుంది. లేకపోతే  ఇంటర్వెల్ పేలవంగా వుంటుంది. ఇంటర్వెల్లో ఇంకా ఆగంతకుడ్ని దాచిపెడితే కథ ఎండ్ సస్పెన్స్ లో పడుతుంది. ఎండ్ సస్పెన్స్ లో పడిందంటే కథ ఆత్మహత్య చేసుకున్నట్టే!  ఓపెనింగ్ ఇమేజికి పే ఆఫ్ పాయింట్ ఇంతర్వెల్లే.  ఇంటర్వెల్ దాటిందంటే ఓపెనింగ్ ఇమేజికి లైఫ్ వుండదు. ఈ పొరపాటువల్ల సెకండాఫ్ సెకండాఫ్ సినిమా మోయలేని భారమైపోయింది! 

మిస్టరీ  చుట్టూ  సెకండాఫ్

    సినిమా క్రైం కథలకి సంబంధించి మర్డర్ మిస్టరీ అన్న మాటే ఎప్పుడూ వాడొద్దు. ఆలోచన చేయొద్దు. మర్డర్ మిస్టరీ అంటే ఏమిటి? హత్య చేసిందెవరో చివరి వరకూ తెలియక పోవడం. చివరి వరకూ తెలియకపోతే ఏమవుతుంది? చివరి వరకూ విలన్ అనేవాడు కనిపించడు.  చివరి వరకూ విలన్ అనేవాడు కన్పించక పోతే ఏమవుతుంది ? ఊహించండి- యాక్షన్ సినిమాల్లో హీరో సంఘర్షించడానికి విలనే లేకపోతే ఎలా వుంటుంది? అలాగే మర్డర్ మిస్టరీతో వుంటుంది. అంతవరకూ హీరో హంతకుడు (విలన్) ఎవరో తెలుసుకునేందుకు  అనుమానితుల్ని ప్రశ్నిస్తూ  కాలం గడపాల్సిందే. అలా గడిపితే ఏమవుతుంది? తాడూ బొంగరం లేని వాడిలా వుంటాడు హీరో. తాడూ బొంగరం లేకపోతే ఏమవుతుంది? కథ ఉరి తాడులా వుంటుంది ప్రేక్షకులకి. ఎంతసేపూ డైలాగులతో కథ నడవడమే తప్ప యాక్షన్ వుండదు. అప్పుడెప్పుడో చిట్టచివరికి హంతకుడు (విలన్) ఎవరో కనిపెడతాడు హీరో. అప్పుడు ఉలిక్కిపడి- వార్నీ, వీడా హంతకుడు/విలన్ అని ప్రేక్షకులు బోలెడు ఆశ్చర్య పడిపోతారని సదరు దర్శకుడికి నమ్మకం. 

మర్డర్ మిస్టరీలనేవి నవలల్లో చదవడానికి బావుంటాయి. సినిమాగా చూడ్డానికి బావుండవు.  కానీ దాదాపు 1970 ల వరకూ మర్డర్ మిస్టరీ సినిమాలు ఆడేవి. అప్పటి కాలానికి అప్పటి ప్రేక్షకులు. కానీ తర్వాత ఫ్లాప్ కావడం మొదలెట్టాయి. అప్పుడు కారణం తెలుసుకున్నారు హాలీవుడ్ దర్శకులు. చదవడానికి బావుండే  మర్డర్ మిస్టరీలు సినిమాగా చూడలేక పోవడానికి కారణం-  సినిమా అనేది విజువల్ మీడియా. విజువల్ మీడియా డైనమిక్స్ వేరు, ప్రింట్ మీడియా డైనమిక్స్ వేరు. విజువల్ మీడియాలో కంటికి యాక్షన్ కనపడాలి. ఇలా తరం మారిన ప్రేక్షకుల అభిరుచి తెలిశాక మర్డర్ మిస్టరీలతో సినిమాలు తీయడం మానేశారు. మరేం చేశారు? మర్డర్ మిస్టరీల్లో హంతకుడెవరో  చివరి వరకూ సస్పెన్స్ లో పెడుతున్నారు. ఇందుకే ఇవి ఎండ్ సస్పెన్స్ కథలయ్యాయి. ఇవి విజువల్ మీడియా అయిన సినిమాల్లో యాక్షన్ లేకుండా చేస్తున్నాయి. కథ యాక్షన్ లో వుండాలంటే ఏం చేయాలి? హంతకుడెవరో హత్య చేస్తున్నప్పుడే చూపించెయ్యాలి. చూపించేశాక అతనెలా పట్టుబడతాడదన్నది సస్పెన్స్ లో పెట్టి, పట్టుకునే కథగా  సీన్లు నడపాలి. అప్పుడు యాక్షన్ లో వుంటుంది కథ.. అందుకని దీన్ని సీన్ టు సీన్ సస్పెన్స్ కథలన్నారు. హాలీవుడ్ ఈ పనే చేస్తోంది అప్పట్నుంచీ.

ఈ విషయం  ఈ బ్లాగులో వందల సార్లు చెప్పి వుంటాం- ఏదో గొప్ప అనుకుని మర్డర్ మిస్టరీ లంటూ  ఎండ్ సస్పెన్స్ లో పడేయ్యొద్దు  కథల్ని మొర్రో- సీన్ టు సీన్ సస్పెన్స్ చేసుకోవాలని ! ఎవరైనా  వినిపించుకుంటేగా? ఇంకా మర్డర్ మిస్టరీలే తీస్తూ ప్రతీ సినిమానీ ఫ్లాప్ చేసుకుంటున్నారు!

‘కాంత’ తో ఇదే జరిగింది ఇంటర్వెల్ సీనులో. హత్య చేస్తున్న హంతకుడెవరో ఇంకా సస్పెన్స్ లో పెట్టేసి కాలం చెల్లిన ఎండ్ సస్పెన్స్ కథల డంప్ లో పడేశారు సినిమాని.

సెకండాఫ్ మొదలవగానే పోలీసు అధికారి ఫీనిక్స్ (రానా దగ్గుబాటి) వస్తాడు స్టూడియోకి. శవాన్ని చూస్తాడు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. హత్య రివాల్వర్ తో జరిగింది. రెండు షాట్లు పేలాయి. హంతకుడు చంపి రివాల్వర్ అక్కడే పడేసి పోయాడు. అది 35 ఎం ఎం కోల్ట్ రివాల్వర్. దీన్ని క్లయిమాక్స్ సీనులో వాడారు. షూటింగులో డమ్మీ రివాల్వర్ కాకుండా రియల్ గన్ ఎందుకు వాడారని నిలదీస్తాడు. దాని మీద హంతకుడి వేలి ముద్రలు పడొచ్చని సీజ్ చేస్తాడు. ఆ రివాల్వర్ స్టూడియో ఓనర్ మార్టిన్ ది.  మార్టిన్ దాన్ని ఎవరు తీశారో తెలియదంటాడు. ఫీనిక్స్ మొత్తం అందర్నీ ప్రశ్నించడం మొదలెడతాడు.  షూటింగులో ఆ రివాల్వర్ అయ్యా ఇచ్చినట్టు మేకప్ మాన్ చెప్తాడు. అప్పుడు అందులో బుల్లెట్లు లేవంటాడు. ఇప్పుడు బుల్లెట్లు ఎవరు పెట్టారని అడగడం మొదలెడతాడు ఫీనిక్స్. ఇలా మొదట అయ్యాని అనుమానిస్తాడు. తర్వాత మహదేవన్ ని బలంగా అనుమానిస్తాడు. మార్టిన్ ని కూడా అనుమానితుల జాబితాలో వేస్తాడు. ఇలా కథ అక్కడక్కడే ఈ ప్రశించడాలతో తిరుగుతూ వుంటుంది. రివాల్వర్ హంతకుడి చేతికెలా వచ్చింది, అందులో బుల్లెట్లు ఎలా వచ్చాయన్న ప్రశ్నల చుట్టే స్టూడియోలోనే 50 నిమిషాల సేపూ  సెకండాఫ్ గడిచిపోతుంది… చిట్ట చివరికి క్లయిమాక్స్ లో హంతకుడ్ని ఫీనిక్స్ పట్టుకోడు- హంతకుడే ఫీలయ్యి చెప్పేస్తాడు. ఎందుకు చంపాడో కూడా చెప్తాడు. 

స్టోరీ రైటింగ్ ఇలా
    ఇదన్న మాట ఎండ్ సస్పెన్స్ మిస్టరీ కథనం. ఇన్వెస్టిగేషన్, అందులో లాజిక్కులు తీయడం, ఊహాగానాలు చేయడం, అనుమానం వున్న వాళ్ళని కొట్టడం ఇవన్నీ సహనపరీక్ష పెట్టేస్తూ సెకండాఫ్ ని కుప్పకూల్చుతాయి. అయ్యా, మహదేవన్ ఇద్దర్లో ఒకరు హంతకుడని మనకి తెలిసిపోతున్న సిట్యుయేషన్ లో, ఇద్దరికీ కారణాలున్నాయని, ఎవరు చంపితే ఏంటని తేలికభావం ఏర్పడుతుంది మిస్టరీ పట్ల. చివర్లో ఇద్దర్లో ఒకడు హంతకుడ్నని చెప్పుకుని, ఎందుకు చంపాడో తెలిసిన కారణమే చెప్పేసరికి ముగింపు కూడా తేలిపోయి మొత్తం సినిమాకే ఎసరొచ్చింది.

అదే ఇంటర్వెల్లో చంపుతున్నప్పుడు చూపించేస్తే షాక్ వేల్యూతో ఆ  హంతకుడ్ని ఫాలో అవుతూ, ఎలా పట్టుబడతాడో, ముగింపు ఎలా వుంటుందో నని,  సీన్ టు సీన్ సస్పెన్స్ తో పరుగెట్టే కథని థ్రిల్లింగ్ గా చూసేవాళ్ళం. ఇదీ ఎండ్ సస్పెన్స్ కీ, సీన్ టు సీన్ సస్పెన్స్ కీ వున్న క్వాలిటేటివ్ తేడా. ఇందుకే ఇంటర్వెల్లో రివీల్ చేయకుండా అలాగే సెకండాఫ్ నడపడంతో ఫస్టాఫ్ ఇగోల కథకి సెకండాఫ్ మర్డర్ మిస్టరీతో జానర్ బెండర్ చేసినట్టు చెప్పుకున్నారు. దీని ఫలితం ఎలా వుందో చూశాం. అదే హంతకుడ్ని ఇంటర్వెల్లో రివీల్ చేసేస్తే, ఇగోల కథే మర్డర్ కి దారి తీసి యాక్షన్ తో కంటిన్యూ అవుతున్న ఒకే జానర్ కథగా  సెకండాఫ్ సేఫ్ గా వుండేది.

ఇంకోటేమిటంటే, సినిమా షూటింగులో నిజ రివాల్వర్ అనేది కథ కోసం కాంప్రమైజ్ అయ్యిందే తప్ప లాజిక్ లేదు. సినిమా షూటింగ్స్ లో డమ్మీ రివాల్వర్సే వాడతారు. ఒకవేళ నిజ రివాల్వర్ వాడాల్సి వస్తే బుల్లెట్లు పెట్టకుండా దాని ఛాంబర్ ని బ్లాంక్ చేస్తారు. అలా చేస్తే నిజ రివాల్వర్ డ్యామేజి అవుతుంది. అలా ఎవ్వరూ చెయ్యరు. డమ్మీ రివాల్వరే వాడతారు. ఇది తెలిసికూడా నిజ రివాల్వర్ పెట్టి  కథ చేశారంటే కథ కోసం లాజిక్ ని బలి చేశారు.

రెండోది, రివాల్వర్ మీద వేలిముద్రలు ఎవరివో తెలుసుకుంటే దొరికిపోతాడు హంతకుడు. ఇది పక్కనబెట్టి, హంతకుడెవరు హంతకుడెవరని స్తూడియోనే పట్టుకు వేలాడుతూంటాడు  ఫీనిక్స్.ఇలా ఇన్వెస్టిగేషన్ పార్టు కూడా విఫల కథనంగా తయారైంది. 

హిచ్ కాక్ ఐడియా

        ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన ;సైకో; కథతో ఒక సమస్య వచ్చింది. ప్రధాన పాత్ర తో మొదలైన కథ, ఆ ప్రధాన పాత్ర హత్యకి గురవడంతో దాని కథ అర్దాంతరంగా ముగిసి, ఇంకో ప్రధాన పాత్ర తో వేరే కథ మొదలవుతుంది. ఇది అప్పట్లో రాబర్ట్ బ్లాచ్ అనే రచయిత రాసిన నవల. ఈ కథ తనకి నచ్చడం లేదని హిచ్ కాక్ తో అన్నాడు స్క్రీన్ ప్లే రచయిత జోసెఫ్ స్టెఫానో.  ప్రధాన పాత్ర చనిపోయాక దాంతో ప్రారంభమైన కథే అర్ధాంతరంగా ముగిసిపోవడం ఒకటైతే, అక్కడ్నించీ ఇంకో ప్రధాన పాత్రని తెచ్చి వేరే కథ ప్రారంభమవడం తనకి మింగుడు పడ్డం లేదన్నాడు. 

అప్పుడు హిచ్ కాక్, ‘ఈ రెండో పాత్ర ఆంథోనీ పెర్కిన్స్ నటిస్తే?’ అన్నాడు. స్టెఫానో స్టన్నయ్యాడు. సమస్య తీరిపోయింది. ఆంథోనీ పెర్కిన్స్ స్టార్ డమ్ వున్న నటుడు. అతను నటిస్తే కథలో ఏర్పడ్డ గండి పూడిపోతుంది. మొదటి ప్రధాన పాత్ర హీరోయిన్ జానెట్ లే తో ఆమె కథగా ప్రారంభమైన సినిమా, ప్లాట్ పాయింట్ వన్ లో హీరో ఆంథోనీ పెర్కిన్స్ కొత్తగా ప్రధాన పాత్రగా వచ్చి, ఆమెని హత్య చేస్తే, ఆమె కథని మర్చిపోయి అతడి సైకో కథలో లీనమైపోతారు ప్రేక్షకులు. ఇలా స్టార్స్ వల్ల కథతో కొన్ని అక్రమాలు సక్రమమై పోతాయన్నమాట. 


జానెట్ పాత్రలో అనూష్కా వుందనుకుందాం. సినిమా ప్రారంభమై ఓ ఇరవై నిమిషాలు ఆమె పాత్ర పరిచయం, జీవితం, ఆశయం చూస్తూ వున్నాం. ఇంతలో ఎక్కడ్నించో నాగార్జున వచ్చి ఆమెని కసక్ మన్పించి తన కథ మొదలెట్టుకుంటే, ఈ సర్ప్రయిజ్ ఎంట్రీకి అనూష్కా కథని మర్చిపోయి, నాగార్జున కొత్త కథని ఫాలో అవుతామా లేదా? ఇదీ స్టార్ చేసే మ్యాజిక్ అంటే! 


నవల చదువుతున్నప్పుడు పాత్రల రూపాలు అందులో కన్పించవు. అప్పుడు బాగా లేని కథతో నవల మింగుడు పడదు. స్టెఫానో సమస్య ఇదే. ఐతే బాగా లేదన్పించిన ‘సైకో’ నవల్లో ఆంథోనీ పెర్కిన్స్ ని వూహించుకోమని హిచ్ కాక్ ఎప్పుడైతే అన్నాడో, అప్పుడు స్టెఫానో సెట్ రైట్ అయిపోయాడు. 

‘కాంత’ లో బాగా పాపులరైన, ప్రేక్షకులు విపరీత క్రేజ్ పెంచుకున్న రశ్మికా మందన్న వుందనుకుందాం, ఆమెని దుల్కర్ సల్మాన్ కస్సక్ మన్పిస్తే థియేటర్ దాదాపు ఏడ్పులతో, శాపనార్ధాలతో దద్దరిల్లుతుంది. దుర్మార్గుడు  దుల్కర్ ఎంత పని చేశాడు, వీణ్ణి పట్టుకోండ్రా-  పట్టుకుని కసకసమని…

ఇదీ స్టోరీ మేకింగ్ అంటే! స్టోరీ రైటింగ్ చేస్తూ కూర్చుంటే పంచ్ లేని చప్పిడి పదార్ధమే వస్తుంది. ‘కాంత ఒక చప్పిడి పదార్ధమనేది యదార్ధం. ఒక కళాత్మక విషాదం!

-సికిందర్ 

                                                                               

Sunday, November 16, 2025

1402 : స్పెషల్ ఆర్టికల్

వకాశాల స్ట్రక్చర్ అరచేతిలోనే’ ఆర్టికల్స్ పరంపరకి బ్లాగులో స్పందన బాగానే లభిస్తోంది. అందరికీ ధన్యవాదాలు. ఒక బాగా తెలిసిన దర్శకుడు ఈ ఆర్టికల్స్ చదువుతూ తన పరిస్థితి చూసుకుని చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయనకి ఎంత ప్రయత్నించినా అవకాశాలు రావడం లేదు. దీంతో ఆందోళన పెరిగిపోయి -ఈ ఆర్టికల్స్ ని స్టడీ చేసి ఎలాగైనా సాధించాలన్నఆదుర్దాతో ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే అసలుకే ఎసరొచ్చే పని జరిగిపోతోంది. ఆందోళన ఆదుర్దా వంటి నెగెటివ్ ఫీలింగ్స్ కి అవకాశాల స్ట్రక్చర్ నిఘంటువులో చోటు లేదు. అనుకున్నది వెంటనే  జరిగిపోవాలని తొందరపెడితే అసలుకే పని చేయదు ఎల్ ఓ ఏ. పై పైన రాసేసి పైపైన సినిమాలు తీసేస్తున్నట్టు చేస్తే ఎల్ ఓ ఏ కూడా ఫ్లాపవుతుంది.  


సైన్స్ పనిచేయాలంటే దీంట్లో రక్తమాంసాల్ని తెలుసుకోవాలి. ఈ సైన్స్ పని చేయాలంటే  మానసికంగా సిద్ధమైతే చాలదు, శరీరం కూడా సిద్ధం కావాలి. మానసికంగా సిద్ధమయ్యాం కదా, ఇక త్వరగా జరిగిపోవాలని ఆందోళనా ఆదుర్దాలు పెంచుకుంటే - ఈ ఆందోళన, ఆదుర్దా అనే నెగెటివ్ ఫీలింగ్స్ శరీరంలో అణువణువునా చేరిపోయి - థర్డ్ బ్రెయిన్ అయిన గుండె మొరాయించేలా చేస్తాయి. గుండె అనుమతించని ఫీలింగ్స్ విద్యుదయస్కాంత క్షేత్రాన్నిసృష్టించవు. విశ్వంలో కలవవు. కేవలం మనసులోంచి వెలువడే విద్యుత్ క్షేత్రంతో నేలబారు వైబ్రేషన్స్ గా వుండి పోతా యి నెగెటివ్ ఫీలింగ్స్. అలా వుండి పోయి వూరుకోవు- నెగెటివ్ పరిస్థితుల్నే ఆకర్షిస్తాయి. ఇది కూడా లా ఆఫ్ ఎట్రాక్షనే. నెగెటివ్ కి నెగెటివ్, పాజిటివ్ కి పాజిటివ్ ఆకర్షించడం లా ఆఫ్ ఎట్రాక్షన్ పనే. కాబట్టి నెగెటివ్ ఫీలింగ్స్ తో జాగ్రత్తగా వుండాలి.

ఒక అసిస్టెంట్ కి నిర్మాత అప్పాయింట్ మెంట్ లభిస్తే వెళ్ళాడు కథ చెప్పడానికి. కథంతా విన్న నిర్మాత తలూపాడు. ఇక ఆ ప్రాసెస్ దాదాపు ఓకే అవుతున్నప్పుడు నిర్మాత ఆగిపోయి- కాస్త టైం  తీసుకుంటానన్నాడు. అంతే, మళ్ళీ ఆయన్నుంచి కాల్ రాలేదు. కాల్స్ చేస్తే రెస్పాన్స్ లేదు. అవుతున్న పని కాకుండా పోయిందే అని బెంగ పెట్టుకున్నాడు అసిస్టెంట్. అసలు జరిగిందేమిటంటే, ఆ నిర్మాత దగ్గరికి వెళ్ళే ముందు బయట ఒకరితో కొట్లాట పెట్టుకుని ఆ కోపంతో వెళ్ళాడు. శరీరంలో నెగెటివ్ ఫీలింగ్స్ నింపుకుని, కార్టిసాల్ హార్మోను విడుదల చేసుకుంటూ వెళ్తే గుండె ఎందుకు సహకరిస్తుంది? ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ నిర్మాత బ్రెయిన్ ని నెగెటివ్ గానే ఫీలయ్యేట్టు చేసి వుంటాయి- అసిస్టెంట్ అవకాశం కాస్తా చేజారిపోయింది. అదన్న మాట సంగతి, ఇంత సంక్లిష్టంగా వుంటుంది వెధవ జీవితం!

పురాతనంగా ఒక అసోసియేట్ అనుభవం- కొన్నేళ్ళ క్రితమే ఎల్ ఓ ఏ పాటిస్తున్నాడు. విదేశం నుంచి ఒక అవకాశం రానే వచ్చింది. అది కాస్తా ఎందుకో తెలియకుండా- ఆకాశ వీధిలో అందాల జాబిలీ అని పాడుకుంటూ మబ్బుల చాటు కెళ్ళిపోయి మళ్ళీ కనిపించలేదు. పైపైన పాటించే ఎల్ ఓ ఏ నిలబడదు. రక్త మంసాల్ని కూడా ఎలా ట్రీట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. ఇదలా వుంచితే, ఎట్టి పరిస్థితిలో విశ్వం పట్ల అపార విశ్వాసం అవసరం. విశ్వాన్ని నమ్మి ఎల్ ఓ ఏ పాటిస్తే ఇంకెలాటి ఆందోళనా ఆదుర్దా వుండవు, తొందరపాటు తనం వుండదు. కొండంత విశ్వాసంతో ఎల్ ఓ ఏ పాటిస్తూ నింపాదిగా, నిలకడగా, ప్రశాంత జీవనం గడుపుతూంటే అన్నీ జరిగిపోతాయి. ఇంకోటేమిటంటే విశ్వం కోరుకున్నది ఇవ్వదు. ఆ మాట కొస్తే దేవుడు కూడా కోరుకున్నది ఇవ్వడు. ఫీలయ్యింది ఇస్తుంది విశ్వం. దర్శకుడు అవాలంటే ఆల్రెడీ దర్శకుడైనట్టు ఫీలవ్వాలి, దర్శకుడు అవ్వాలని కోరుకోవడం కాదు. కోరుకోవడం కొరతని సూచిస్తుంది. అంటే ఎల్ ఓ ఏ ప్రకారం కొరతనే తెచ్చి పెడుతూంటుంది. అదే దర్శకుడు అయిపోయినట్టు ఫీలయితే -ఈ ఫీలింగునే నరనరాన నింపుకుని జీవిస్తే- ఇతను దర్శకుడని ఫీలవుతున్నాడని, మరిన్ని మరిన్ని అవకాశాల్ని వెతికి అందిస్తుంది విశ్వం!

దర్శకత్వ అవకాశాల కోసం ఎల్ ఓ ఏలో  భాగంగా యోగ్యత (క్వాలిఫికేషన్) గురించి, లక్ష్యం ఏర్పాటు (గోల్ సెట్టింగ్) గురించీ గత వ్యాసాల్లో తెలుసుకున్నాక, ఇప్పుడు విశ్వాసం ఎలా పని  చేస్తుందో, ప్రతిజ్ఞ (అఫర్మేషన్స్), దృశ్యీకరణ (విజువలైజేషన్),  కార్యాచరణ (యాక్షన్) లేమిటో  తెలుసుకుందాం.

విశ్వాసం  ఎలా పని చేస్తుంది? 

    మొత్తం ఎల్ ఏ ఓ కాన్సెప్ట్ కి ఆధారం విశ్వాసం. దేని గురించయితే గోల్ ని ఏర్పాటు చే సుకున్నామో అది జరుగుతుందని కాదు, జరిగిపోయినట్టే  ఫీలవకపోతే పని చేయదు. జరుగుతుంది అనుకోవడం భవిష్యత్కాలానికి సంబంధించిన సంగతి. భవిష్యత్తులో జరుగుతుంది లేదా జరగాలని కోరుకోవడంగా ఇది వుంటుంది. అప్పుడు మన సబ్ కాన్షస్  మైండ్ భవిష్యత్తులో జరగాలట, ఇప్పుడు కాదట అని మిన్నకుంటుంది. కాలాలు మనం ఫీలవుతున్నాం  సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల. సూర్యుడి చుట్టూ తిరుగుతూ సమయాల్ని  గడియారాలు అమ్ముకోవడానికి గడియారాల కంపెనీలు కనిపెట్టాయని కార్ల్ మార్క్స్ చెప్పాడు. కానీ విశ్వానికి నిన్న (భూత కాలం), రేపు (భవిష్యత్ కాలం)  లేవు. నేడు (వర్తమానం) మాత్రమే వుంది. ఆ నేడు స్తంభించి వుంటుంది ఎటూ కదలకుండా. కాబట్టి ఇది జరుగుతుంది, జరగాలి అన్న విన్నపాలు విశ్వం తీసుకోదు. జరిగిపోయినట్టు -జరిగిపోయిందని ఫీలవుతున్నట్టు తెలపాలి. నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని అన్న ఫీలింగ్స్ పంపాలి. 

ఇక్కడొక పేచీ వస్తుంది- మన కాన్షస్ మైండ్ దాంతో వుండే ఇగో, లాజికల్ గా వుంటాయి. సబ్ కాన్షస్ మైండ్ లాజిక్కులు పట్టించుకోకుండా ఎమోషనల్ గా వుంటుంది. పంచేంద్రియాలతో బయటి సమాచారాన్ని సేకరించే కాన్షస్ మైండ్, ఇగో- ఇవి ఏం చేస్తాయంటే- నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని అని ఫీలయితే - నువ్వు దర్శకుడివా, ఆల్రెడీ దర్శకుడివై పోయావా, ఏదీ ఎప్పుడయ్యావ్ -నువ్వింకా అసిస్టెంటు మాత్రుడివే, వాస్తవం తెలుసుకో - అని పకపకా నవ్వి,  ఈ సజెషన్  సబ్ కాన్షస్ మైండ్ తీసుకోకుండా అడ్డు పడతాయి.

కాన్షస్ మైండ్, ఇగో రెండూ సబ్ కాన్షస్ మైండ్ కి ద్వారపాలకులు. వీటి అనుమతి లేనిది ఏ విషయమూ సబ్ కాన్షస్ లోకి వెళ్ళదు. అప్పుడు రెండే వుంటాయి- భాష మార్చాలి- నేను దర్శకుడ్ని అవుతున్నాను అనాలి. దీన్ని లాజికల్ గానే తీసుకుంటాయి ద్వారపాలకులు. దర్శకుడు అవుతున్నాడట, ప్రయత్నాలు చేసుకుంటున్నాడు వదిలేయ్- అని లాజిక్ ఫీలై ద్వారాలు తెరిచేస్తాయి. దర్శకుడ్ని అవుతున్నాను అనేది వర్తమాన కాలపు సజేషనే కాబట్టి విశ్వం కూడా అభ్యంతరం చెప్పదు. 

లేదా రాత్రి నిద్రపోయేముందు పంచేంద్రియాలతో పాటే ద్వారపాలకులు అలసిపోయి పడుకుంటాయి- అప్పుడు సబ్ కాన్షస్ మైండ్ ఒక్కటే అవిరామంగా జీవితాంతం మేల్కొని వుంటుంది కాబట్టి - .నిద్రపోతూ నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని అనుకుంటే ఈజీగా సబ్ కాన్షస్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే తెల్లారి కళ్ళు తెరవగానే మళ్ళీ అనుకోవాలి. అప్పటికింకా ద్వారపాలకులు డ్యూటీ ఎక్కవు. పంచేంద్రియాలు  నిద్రమత్తు వదిలించుకుంటే తప్ప ఇవి డ్యూటీ ఎక్కవు. 

ఈ ద్వారపాలకులు ఎప్పుడైనా అడ్డుపడకుండా వుండే రోజు కూడా వస్తుంది. మనం ఇచ్చే సజెషన్స్ సబ్ కాన్షస్ లో సింక్ అవ్వాలంటే 21 రోజులు సజెషన్స్ ఇవ్వాలి. పైన చెప్పుకున్నట్టు పగటి పూట -’నేను దర్శకుడ్ని అవుతున్నాను’ అనో, లేదా రాత్రి నిద్రపోతూ, మళ్ళీ తెల్లారి నిద్ర లేవగానే- ‘నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని’ అనో ద్వార పాలకులకి చిక్కకుండా  21  రోజులు సబ్ కాన్షస్ కి సజెషన్ ఇస్తే- అది సింక్ అయి- దాని మీద సబ్ కాన్షస్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇంకా తర్వాత ‘నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని’ అని ఏ వేళప్పుడు ఎన్ని సార్లు అనుకున్నా ద్వార పాలకులు ఏం పీకలేవు!

అనుకున్న గోల్ ఎల్ ఓ ఏ ద్వారా నిజమవుతుందన్న నమ్మకం సడలి, మొత్తానికే విరమించుకోవడానికి కారణం - సజెషన్స్ ఇచ్చినప్పుడు కాన్షస్, ఇగో అనే ద్వారపాలకుల దగ్గర ఆగిపోవడం వల్లే. వీటిని దాటాలని తెలియక పోవడం వల్లే. దాటితే తప్ప గోల్ పట్ల విశ్వాసం కలగదు. కనుక పై ప్రాసెస్ ని ముందు విధిగా ఫాలో అవ్వాలి.

అనుమానం, అవిశ్వాసం అన్నవి నెగెటివ్ ఫీలింగులు. అంటే లో- ఫ్రీక్వెన్సీ ని కలిగివుంటాయి. ఎల్ ఓ ఏ పని చేయాలంటే హై-ఫ్రీక్వెన్సీ పాజిటివ్ ఫీలింగ్స్ అందించాలి. ఎల్ ఓ ఏ ఈజీగా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే- ఏదైతే గోల్ వుందో, ఆ గోల్ ఏ ఫ్రీక్వెన్సీతో నైతే వుంటుందో, ఆ ఫ్రీక్వెన్సీతో పాజిటివ్ ఫీలింగుల ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఫలితం అరచేతి కొచ్చేస్తుంది. ఫ్రీక్వెన్సీ ల మ్యాచింగే, ఇంకేమీ లేదు. దర్శకత్వం అన్నది ఎంత హై -ఫ్రీక్వెన్సీయో చెప్పనవసరం లేదు. దాన్నందుకోవాలంటే ఆ రేంజిలో ఫీలవ్వకపోతే దర్శకత్వం మీద ఆశలెందుకు? 

విశ్వాసానికి అడ్డంకుల్ని క్లియర్ చేసుకున్నాక, గోల్ కోసం సాగించే ప్రయత్నాల్లో అవరోధాలొస్తే మళ్ళీ కృంగి పోకూడదు. ఒకటి రెండు అవరోధాల కంటే రావు. ఈ అవరోధాలు ఎందుకొస్తాయంటే, మనవాడు ఎంత బలంగా కమిటై వున్నాడని విశ్వం పరీక్షించడానికి. దీనికి విశ్వానికి థాంక్స్ చెప్పి ముందుకు సాగాలే తప్ప ఆగిపోకూడదు. విశ్వాన్ని నమ్మి భారమంతా విశ్వం మీద వేసేయాలి. ఎలాజరుగుతుంది, అవకాశాలు ఎలా వస్తాయి అన్నవి మన పని కాదు. అది విశ్వం చూసుకుంటుంది. అవుతుందా లేదా అన్న ఆందోళనా త్వరగా అవ్వాలన్న ఆదుర్దా పనికి రావు. 

నేలలో బీజం నాటాక మొలకెత్తడానికి దాని సమయం అది తీసుకుంటుంది. మాటి మాటికీ తవ్వి చూస్తూంటే మొలకెత్తుతుందా?  మొలకెత్తుతుందన్ననమ్మకంతో  నీరు పోస్తూంటే అదే మొలకెత్తుతుంది. ఆ నీరు పోయడమే  ప్రతిజ్ఞ (అఫర్మేషన్స్), దృశ్యీకరణ (విజువలైజేషన్),  కార్యాచరణ (యాక్షన్) వంటి మూడు కార్యకలాపాలు ఎల్ ఓ ఏ లో. వీటి గురించి రేపు!

-సికిందర్ 




Monday, November 10, 2025

1401 : పాత్రోచితానుచితాలు

    భూమాదేవి (రశ్మికా మందన్న) పీజీ కోర్సులో చేరుతుంది. అదే కాలేజీలో విక్రం (దీక్షిత్ శెట్టి) వేరే పీజీ చేస్తూంటాడు. ఇద్దరూ వేర్వేరు హాస్టల్స్ లో వుంటారు. గర్ల్స్ హాస్టల్లో బాయ్స్, బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తూంటారు. మేనేజిమెంట్ డోంట్  కేర్ అన్నట్టు వుంటుంది. ప్రొఫెసర్ పాత్ర వేసిన దర్శకుడు కూడా మీటూ డోంట్ కేర్ భయ్యా అన్నట్టే వుంటాడు. ఇలాటి లాజిక్ లేని సీన్లు ఎందుకు వేశారనేది తర్వాత అర్ధమౌతుంది. ఎందుకంటే భూమా  తండ్రి హాస్టల్ కొచ్చినప్పుడు ఆమె గదిలో విక్రం తో పట్టుబడాలి కాబట్టి, కథా సౌలభ్యం కోసం హాస్టల్స్ లో ఆ లాజిక్ లేని సీన్లు చూపిస్తూ వచ్చారు. ఇక బయట ఒక సంఘటనలో భూమా, విక్రం ఎదురెదురు పడతారు. విక్రం వెంటనే ప్రేమలో పడతాడు. భూమా బెరుకు బెరుకుగా, పిరికిగా వుంటుంది. ఆమెకి తల్లిలేదు, వున్న తండ్రి (రావురమేష్) క్రూరత్వంతో వుంటాడు. తను మంచి పేరు తెచ్చుకుంటే తనతో తండ్రి ప్రవర్తన మారవచ్చన్న ఆశతో ఆమె వుంటుంది.



ప్రేమలోనే గాక పడకలోనూ పడుతుంది భూమా. ఆమె వేరే అబ్బాయితో మాట్లాడడం అతను సహించడు. అతడ్ని వేరే స్టూడెంట్ దుర్గ (అనూ ఇమ్మాన్యుయేల్) ప్రేమిస్తూ వుంటుంది. తనకి అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలని, ఆ లక్షణాలు భూమాలో వున్నాయనీ చెప్పేస్తాడతను. దుర్గ డ్రాప్ అయిపోతుంది. ఇది విన్న భూమా అమ్మలాగే అతడికి సేవలు చేస్తూంటుంది. ఇది గమనించిన దుర్గ - నువ్వు విక్రంతో హేపీగా వున్నవాని అడుగుతుంది. భూమా దగ్గర సమాధానముండదు. విక్రంతో ఆమె లైఫ్ విక్రంతోనే ఎండ్ అయిపోతుందనీ, ఆమెలో  స్పార్క్ వుందనీ, అది పూర్తిగా చచ్చి పోతుందనీ హెచ్చరిస్తుంది దుర్గ.  భూమా ఆలోచనలో పడుతుంది. తండ్రి లాగే విక్రం కూడా తనకి స్వేచ్ఛనివ్వకుండా కంట్రోల్లో వుంచుతున్నాడని అర్ధం జేసుకుంటుంది.


ఒక రోజు ఇంటికి తీసికెళ్ళి కాబోయే కోడలిగా తల్లికి పరిచయం చేస్తాడు.  ఆ తల్లి (రోహిణి) మాటలు రాని మూగదానిలా, మానసిక రోగిలా వుంటుంది. ఇంట్లో ఈసురోమని వాతావరణ ముంటుంది. తర్వాత అతడి మాటల్లో తండ్రి ఎలాటి వాడో, అతడి వల్ల తల్లి ఎలా అయిందో గ్రహిస్తుంది. తను జాబ్ చేయవచ్చా అంటే వద్దంటాడు. తనని ఎంతో బాగా చూసుకునే అమ్మకి అమ్మలా వుండాలి కదా అంటాడు. తనతో ముగ్గురు పిల్లల్ని కనాలంటాడు. భూమాకి ఇక్కడ బ్రేకప్ కి బీజం పడిపోతుంది.


ఆమె బ్రేకప్ చెప్పడంతో ఆమెకోసం పిచ్చెత్తి పోతాడు. హింసాత్మకంగా మారతాడు. ఆమె లొంగదు. ఇతడితో వ్యవహారం అటు ఆమె తండ్రికీ తెలిసిపోయి హాస్టల్లో నానా రచ్చ చేస్తాడు. ఇక లాభం లేదని విక్రంని వదిలించుకోవడానికి తిరగబడుతుంది. అతడికి బుద్ధి చెప్పి బయట పడుతుంది. ఇదీ కథ.



ఏది టాక్సిక్ రిలేషన్ షిప్? 

    దీన్ని టాక్సిక్ (విషపూరిత)  రిలేషన్ షిప్ కథ అన్నారు. ఇందులో టాక్సిక్ ఏముంది. ఆమె బ్రేకప్ చెప్తే అతను ఉన్మాదిలా మారడమా. ఆమె బ్రేకప్ చెప్పాక  రిలేషన్ షిప్పే లేనప్పుడు టాక్సిక్ రిలేషన్ షిప్ ఎలా అయింది. అతను అల్ఫా మేల్ కూడా ఎలా అయ్యాడు. అతడితో రిలేషన్ షిప్ లో వున్నప్పుడు ప్రేమతోనే వున్నాడుగా. తన బందీగా చేసి బానిసగా మార్చుకోలేదుగా. బలవంతంగా పడక మీదికి లాగ లేదుగా. ఆమె ఇష్టంతోనే పడక పంచుకుంది. ఆమెలో అమ్మలా చూసుకునే అమ్మాయిని చూస్తున్నప్పుడు అతనెక్కడ హద్దు మీరి ప్రవర్తించాడు. ఏ విషయంలో ఆమె స్వేచ్చని హరించాడు. 


అతడి గురించి దుర్గ అలా చెప్తే ఎలా నమ్ముతుంది. అతను అలాటి వాడైతే దుర్గ అతడ్ని ఎందుకు ప్రేమించింది. అతను కాదన్నాక వచ్చి అతడి గురించి అలా చెప్తోందంటే భూమాకీ అతడికీ మధ్య పుల్లలు పెట్టడానికా. అతడితో వుంటే తనలో వున్న స్పార్క్ చచ్చిపోతుందా. వ్యక్తిత్వం లేకుండా దుర్గ ప్రకారం తన నమ్మకాల్ని మార్చుకుని ఏ రిలేషన్ షిప్ లో వుంటుంది. ఇది తెలుసుకోకుండా, విక్రం పట్ల వ్యతిరేకతని  పెంచుకుని- దుర్గని శ్రేయోభిలాషిగా మార్చుకుని, వెంటేసుకు తిరుగుతోంటే అతడ్ని రెచ్చగొట్టినట్టు కాదా. అయినా అతనేమీ అనలేదే. 


అతను ఇంటికి తీసికెళ్ళి తల్లికి పరిచయం చేయడంతోనే వచ్చింది  సమస్య. ఆమెకి లాగే అతడికీ మెచ్యూరిటీ లేదు అంత వయస్సొచ్చి పీజీ చేస్తున్నాక. కామన్ సెన్స్ లేదు. అతడి తల్లిని తండ్రి ఆ స్థితికి నెట్టేస్తే తీసికెళ్ళి మానసిక వైద్యం చేయించక, తనని ప్రేమగా చూసుకుంటోందని, సేవలు చేస్తోందని మురిసిపోయి, ఇలాటి అమ్మలాటి అమ్మాయే కావాలని కోరికలు పెట్టుకున్నాడు. ఆమె భర్తతో పంచుకో లేకపోయిన ప్రేమ కొడుకుతో పంచుకుంటోంది. అప్పుడా కొడుకు బాధ్యత ఏమిటి. ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయడమా, ఆమెని అలాగే వుంచి ఆమె లాంటి పెళ్ళాం కావాలనుకోవడమా. మానసిక రోగిని చూసి ఏ  అమ్మాయి వస్తుందని నమ్ముతున్నాడు. 


అతను ఆమెని ఇంటికి తీసుకు వెళ్ళినప్పుడు అతడి తల్లి కటకటాల తలుపు మూస్తుంది. జైలు కుండే కటకటాల తలుపులాంటిది. ఇది సింబాలిజం.ఈ సింబాలిజం ఎలా వుందంటే -రామ్మా రా, నువ్వు కూడా రా, నా మొగుడు నన్నిలా చేశాడు, ఇక నాకొడుకు నిన్నూ నన్నులా చేస్తాడు ఈ జైల్లోనే, రా- అన్నట్టే వుంది సీను. 


సినిమా ప్రారంభంలో ఇంకో సింబాలిజం వుంది. భూమా బాగా బరువున్న పెద్ద సూట్ కేసుని హాస్టల్లో చేరుతూ మెట్లపైకి లాగలేక లాక్కొస్తూ వుంటుంది. అంటే ఆమెకి ఎదురవబోయే రిలేషన్ షిప్ కథ ఈ సూట్ కేసులా, గుదిబండ కాబోతోందన్న మాట. కానీ ఆ సూట్ కేసులో ఆల్రెడీ ఆమె క్రూరుడైన తండ్రి వున్నాడు, తర్వాత వికారంగా విక్రం తల్లి రాబోతోంది,  మధ్యలో అక్రమంగా దుర్గ డార్లింగ్ జాయినయ్యేది వుంది. 


అతను జాబ్ వద్దనీ, అమ్మ వయసైపోయింది కాబట్టి ఇంటి పట్టున వుండాలనీ, తనకి ముగ్గురు పిల్లల్ని కనాలనీ చాదస్తం చెప్పినప్పుడు ఆమె బ్రేకప్ చెప్పేస్తే అతను ఆలోచించుకోకుండా  ఉన్మాది అయ్యాడు. ఆమెని పొందడం కోసం సైకోలా మారాడు. దీంతో ఆమె తట్టుకోలేక తప్పించునే మార్గాలు వెతికింది. ఈ పరిస్థితి ఆమె కల్పించుకున్నదే. ఇప్పుడు ఇక్కడ్నుంచీ ఇది టాక్సిక్ రిలేషన్ షిప్ కథ అవుతుందా. మధ్యలో తలెత్తిన పరిణామాల పర్యవసానంగా కాకుండా, స్వాభావికంగా అతను మొదట్నుంచీ సైకోలా వుంటే అప్పుడు టాక్సిక్ రిలేషన్ షిప్ అవచ్చేమో. ఇప్పుడు పేరు మార్చి కొత్తగా అన్పించేలా టాక్సిక్ రిలేషన్ షిప్ అంటున్నది ఒకప్పుడు వచ్చిన సైకో కథలే. చిరంజీవి- జయప్రదలతో కె. బాలచందర్ తీసిన ‘47 రోజులు’, చిరంజీవి- జయసుధ- కమల్ హాసన్ లతో బాలచందరే తీసిన ‘ఇది కథ కాదు’ ప్రేమలో, సంసారంలో సైకో కథలే. కానీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ వచ్చేసి టాక్సిక్ కాలేదు, సైకో కాలేదు. 


ఆమె చేసే మంచి పనులు:

 మంచి పనులు చేసి తండ్రిని మార్చుకోవాలనుకున్న తను, చిటికెలో సర్వస్వం విక్రంకి అర్పించేసింది. ఇది మంచి పనా. తనలో అమ్మలా చూసుకునే అమ్మాయుందని అతననగానే కరిగిపోయి సేవలు చేసింది. అంతేగానీ, వీడేంటి అమ్మకూచిలా వున్నాడని, అమ్మ కొంగు చాటు చంటాడిలా వున్నాడని అప్పుడే బ్రేకప్ చెప్పేయలేదు. కానీ ఇప్పుడతను తల్లికి పరిచయం చేశాక అతడి షరతులు వినగానే- చిటికెలో బ్రేకప్ చెప్పేసి దులుపేసుకుని వెళ్ళిపోవడం తన క్యారక్టర్ ఏమిటో బైట పెట్టుకున్నట్టుంది. కాస్త ఆగి- నీకు మీ  ఇంట్లో మదర్ ప్రాబ్లం, నాకు మా ఇంట్లో ఫాదర్ ప్రాబ్లమ్ కదా, ముందు వీటిని సాల్వ్ చేసుకుందాం - అని వుంటే అతను ఆలోచించేవాడేమో. అప్పుడు ఇది వేరే కథవుతుంది. తప్పక అవుతుంది. ప్రేమకథలోకి  పేరెంట్స్ కథ లాగితే  ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే పాత్ర తన కథ తను నడపాలి కాబట్టి. ఇలాగాక పాత్ర కోసం  కథకుడు కథ నడిపితే ఇలాటి అర్ధం లేని పాసివ్ పాత్రలు, టాక్సిక్ కథా వస్తాయి. 


అసలీ కథలో ఆమెకి తండ్రితో సమస్య, అతడికి తల్లి సమస్యా వుండకూడదు. వున్నందు వల్ల రిలేషన్ షిప్ లో చెప్పాలనుకున్న పాయింటు చెదిరిపోయింది. ఎందుకంటే ఈ రెండు  సమస్యల వల్ల మూడు కాన్ఫ్లిక్టులు ఏర్పడ్డాయి- రిలేషన్ షిప్ లో కాన్ఫ్లిక్ట్ సహా. ఎంత కన్ఫ్యూజన్. వుండాల్సింది ఒక్క రిలేషన్ షిప్ లో కాన్ఫ్లిక్టు మాత్రమే. ఒక కథలో ఒక కాన్ఫ్లిక్టు కి మాత్రమే అనుమతి వుంటుంది, ఆమెకి తండ్రితో ప్రాబ్లం, అతడికి తల్లి ప్రాబ్లం పెడితే వీటి బై ప్రొడక్టే రిలేషన్ షిప్ కథ అన్నట్టు ప్రాధాన్యం కోల్పోయింది ప్రధాన కథ.


కథంటే తప్పొప్పుల ఆర్గ్యుమెంట్- దానికో జడ్జిమెంటూ. ఈ జడ్జిమెంటు ప్రధాన పాత్ర గెలవాలి. ప్రధాన పాత్ర గెలవాలంటే ప్రత్యర్ధి పాత్రకి జస్టిఫికేషన్ వుండకూడదు. కానీ విక్రం క్యారక్టర్ని  జస్టిఫై చేశాడు దర్శకుడు అతడింట్లో పరిస్థితి  చూపించి. తండ్రి బాదితురాలు తల్లే కాదు, తండ్రి వల్ల తనూ బాధితుడయ్యాడు- మానసికంగా ఎదగక అన్నట్టు. ఇట్లా ప్రత్యర్ధి పాత్ర పట్ల సానుభూతి ఏర్పడితే, ప్రధాన పాత్ర అతడ్ని వదిలించుకోవడానికి తిట్టి దండించి గెలిచానని చప్పట్లు కొట్టించుకుని చెక్కేయడం ఆటవికం అన్పిస్తుంది. 


మంచి కథంటే ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చి ముగిసేది. సినిమా కథల మీద ఇరవై ఏళ్ళు అజ్ఞాతంలో కెళ్ళి పరిశోధన చేసి ల్యాండ్ మార్క్ బుక్ రాసిన జేస్ బానెట్ చెప్పే మాట!


-సికిందర్ 



Friday, November 7, 2025

1400 : ప్రొడక్షన్ న్యూస్

    సినిమా బడ్జెట్ ఎలా లెక్కించాలి? ఈ ప్రశ్న కొత్త దర్శకులకు కఠినమైనదే,  హాలీవుడ్‌లో ఎవరూ దర్శకుడిని బడ్జెట్ గురించి అడగరు. కానీ మన దగ్గర అదే మొదటి ప్రశ్నే అవుతుంది. అందువల్ల మీకు నచ్చక పోయినా కొంత లాజిక్ ఆధారంగా సమాధానం సిద్ధంగా ఉంచుకోవాలి. సినిమా బడ్జెట్ అంచనా వేయడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. మొదటగా, దర్శకుడు షూట్‌ డేస్‌ అంచనా వేయాలి. కానీ ఎలా? ముందుగా, మీ స్క్రిప్ట్‌లో ఉన్న ప్రతి లొకేషన్‌ రాయండి. తర్వాత, ప్రతీ లొకేషన్‌లో షూట్‌ చేయాల్సిన సీన్లను రాయండి. తరువాత, ఆ లొకేషన్‌లోని అన్ని సీన్లను కవర్‌ చేయడానికి రఫ్ గా ఎన్ని రోజులు పడుతుందో అంచనా వేయండి. ఇలా ప్రతి లొకేషన్‌ కోసం చేయండి. సాంగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటే వాటినీ చేర్చండి...

మొత్తం కలిపితే షూట్‌ డేస్‌ వస్తుంది. కావాలంటే కొన్ని బఫర్‌ డేస్‌లు కూడా చేర్చవచ్చు, ఒక వేళ మీకు ఇండస్ట్రీ లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా ఆధారంగా అంచనా వేయవచ్చు.  తెలిసిన వాళ్ళు లేక పోయినా మీరే అంచనా వేయొచ్చు.  అది పెర్ఫెక్ట్ గా ఉండక పోయినా పర్వాలేదు.

బడ్జెట్‌లో ఉండే ప్రధాన విభాగాలు ఏమిటి?

ప్రొడక్షన్‌ cost: షూట్‌ జరుగుతున్న ప్రతి రోజూ అయ్యే ఖర్చులు — కెమెరా ఎక్విప్‌మెంట్‌, సెట్స్‌/లొకేషన్‌ కాస్ట్‌, ఆర్ట్‌ వర్క్‌, కారవాన్స్‌, కాస్ట్యూమ్స్‌, ట్రావెల్‌, ఫుడ్‌, మేకప్‌, రోజువారీ బేటాలు మొదలైనవి — షూట్‌కు కావాల్సిన ప్రతిదీ.

ప్రీ-ప్రొడక్షన్‌ cost: ఆఫీస్‌ రెంట్స్‌, స్టాఫ్‌ జీతాలు, ఫుడ్‌, లొకేషన్‌ స్కౌటింగ్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌ మరియు అతని టీమ్‌ జీతాలు, డైరెక్షన్‌ టీమ్‌ (డైరెక్టర్‌ తప్ప) జీతాలు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ cost: సౌండ్‌ ఎఫెక్ట్స్‌, సౌండ్‌ మిక్సింగ్‌, DI, డబ్బింగ్‌, ఎడిటింగ్‌ రెంటల్స్‌ మొదలైనవి — ఫస్ట్‌ కాపీ వరకు. గమనిక: మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఎడిటర్‌ రేమ్యూనరేషన్‌ ఇందులో ఉండవు; అవి సాంకేతిక సిబ్బంది ఖర్చులోకి వస్తాయి. మీ సినిమాలో ఎక్కువ VFX ఉంటే, ఆ ఖర్చు ఇక్కడ చేర్చాలి.

Cast (నటీ నటుల) cost: హీరో సహా అందరు నటీనటుల రేమ్యూనరేషన్‌.

Crew (సాంకేతిక నిపుణుల) cost:  డైరెక్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, DOP, ఆర్ట్‌ డైరెక్టర్‌, ఎడిటర్‌, మేకప్‌ మాన్‌, యాక్షన్‌ డైరెక్టర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, డాన్స్‌ డైరెక్టర్‌ మొదలైనవారి ఫీజు.

సాధారణంగా, cast & crew ఖర్చులను మన బడ్జెట్‌లో చేర్చకపోవడం మంచిది, ఎందుకంటే అవి ప్రొడ్యూసర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి మారుతాయి.

అందువల్ల, మన బడ్జెట్‌ ఫార్ములా:

BUDGET = Production Cost + Pre-Production Cost + Post Production Cost

Production Cost = Shoot Days × Average Cost Per Day

ఒక రోజుకు అయ్యే ఖర్చు సాధారణంగా ₹2 లక్షల నుండి ₹15 లక్షల వరకు ఉంటుంది. మీ లొకేషన్స్‌, సెట్స్‌, ఇతర పరిస్థితులను బట్టి మీరు ఒక అంచనా వెయవచ్చు. కొన్ని రోజులు 2 లక్షలు, మరికొన్ని రోజులు 6 లక్షలు లేదా 15 లక్షలు కూడా కావచ్చు. ప్రతి రోజుకీ ఒక అంచనా వేసి ఆ తరువాత యావరేజ్ తీసుకోవచ్చు లేదా మీ gut feeling‌ ఆధారంగా ఓవరాల్ గా ఒక యావరేజ్ figure‌ నిర్ణయించవచ్చు.

ఉదాహరణ: సగటు ప్రొడక్షన్‌ ఖర్చు రోజుకి ₹5 లక్షలు, షూట్‌ డేస్‌ = 50 అయితే,

Production Cost = 50 × 5L = ₹2.5 కోట్లు.

Pre-Production Cost: సాధారణంగా ₹40L నుండి ₹70L మధ్య ఉంటుంది — ఇక్కడ ₹50L తీసుకుందాం.

Post Production Cost ₹50L నుండి ₹1 కోటి వరకు ఉంటుంది — ఇక్కడ ₹1 కోటి తీసుకుందాం.

అంటే, Cast & Crew తప్పించి, Budget = ₹2.5Cr + ₹50L + ₹1Cr = ₹4Cr

ఇది ఒక సుమారుగా చేసిన అంచనా మాత్రమే. ఈ బడ్జెట్‌...షూట్‌ డేస్‌, ప్రతీ రోజూ ఏం కావాలి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. షూట్‌ డేస్‌ మీ స్క్రిప్ట్‌ మీద ఆధారపడి ఉంటే, రోజువారీ ఖర్చు అనేక ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

ప్రొడ్యూసర్ కు మీరు బడ్జెట్ చెప్పక తప్పదు. ఏదో ఒక ఫిగర్ చెప్పే కన్నా, ఇలా లాజిక్ తో చెప్తే బెటర్ (అదీ కూడా ఎందుకు అని అడిగితేనే).

ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

— శ్రీనివాసరెడ్డి చిలుకల, రచయిత & దర్శకుడు


Thursday, November 6, 2025

1399 : స్క్రీన్ ప్లే ట్రబుల్స్

 

    1970 లలో ప్రారంభమై చరిత్రని మార్చేసిన  ఇండియన్ కమర్షియల్  మసాలా సినిమాలు 2025 వచ్చేసరికల్లా ముసలి సినిమాలైపోయాయి. మసాలా సినిమాలు యాక్షన్, కామెడీ, రోమాన్స్, డ్రామా లేదా మెలోడ్రామాలతో వుంటూ, మ్యూజికల్ గానూ ఉర్రూతలూగించేవి. సప్తవర్ణాలతో కలర్ఫుల్ గానూ వుండడమూ వీటి ప్రధాన లక్షణం. ఈ సినిమాల్ని ఈస్ట్ మన్ కలర్ సినిమా లనేవాళ్ళు. కానీ టెక్నాలజీ మారేక గ్రేడింగ్ పేరుతో రంగులన్నీ ఎగ్గొట్టి రెండు మూడు డార్క్ కలర్స్ తో నింపేస్తున్నారు- వయోలెంట్ గా వుండేలా. ఇలా మసాలా తగ్గించేశారు.


    నవరసాలు మసాలా సినిమాల ముడి పదార్ధాలే-  అయితే కలర్స్ తగ్గించేసినట్టే నవరసాలు కూడా తగ్గించేసి ఒక్క వయోలెన్స్ నే ముడి పదార్ధంగా మార్చేశారు. మిగిలిన ఎనిమిది రసాలలో రోమాన్స్ వుంటుంది- తర్వాత ఆ ప్రేమ ఏమవుతుందో, హీరోయిన్ అడ్రసు లేకుండా ఎటెళ్ళి పోతుందో తెలీదు, స్టార్ వెళ్ళి విలన్ తో వయోలెన్స్ చేస్తూ  బిజీ అయిపోతాడు. కామెడీ వుంటుంది- ఆ కామెడీ కమెడియన్లతో గాక స్టార్ తోనే వుంటుంది. ఇదికూడా ఏమైపోతుందో తెలీదు- స్టార్ వయోలెన్స్ తో బాక్సాఫీసు భక్తిని ప్రదర్శించడంలో బిజీ అయిపోతాడు. ఇలా వినోదాత్మక విలువల్ని వదిలేసి ఖడ్గం పట్టి శత్రువుల్ని  నరుక్కుంటూ పోయి రక్తాలు పారిస్తాడు. ఆ తెగి పడేవి శత్రువుల తలలు కాదు- బాక్సాఫీసుని బ్రతికించే నవరసాల అమృత భాండాలే. పోనీ వయోలెన్స్ తోనైనా కథ తాలూకు భావోద్వేగాలుంటాయా అంటే- నరికేటప్పుడు మోహమంతా ఉగ్రరూపమే కదా అంటాడు. 


    ఈ నేపథ్యంలో విడుదలైన  ‘మాస్ జాతర’ ఎంత కమర్షియల్ బాధ్యతగా వుందో చూద్దాం. రచయిత భాను భోగవరపు దర్శకుడుగా మారి మాస్ మహారాజా రవితేజ - డాన్సింగ్ డాల్ శ్రీలీల లతో తలపెట్టిన ఈ 90 కోట్ల బడ్జెట్ మూవీ కథ - ఒక రైల్వే పోలీస్ ఎస్సై,  రైళ్ళ ద్వారా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ ని ఎలా అంతం చేశాడనేది. కథ వరంగల్ లో ప్రారంభమవుతుంది. అక్కడ లక్ష్మణ్ భేరి (రవితేజ) వరంగల్ లో రైల్వే ఎస్సై. చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో తాత హనుమాన్ భేరి (రాజేంద్ర ప్రసాద్) పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీసుగా తన పరిధిలోకి రాని అన్యాయాల్ని ఎదుర్కొనే సామాజిక స్పృహతో వుంటాడు. తను పెళ్ళి ప్రయత్నాలు చేస్తూంటే తాత చెడగొడుతూంటాడు. ఎందుకంటే ఈ మనవడు  పెళ్ళి చేసుకుంటే తనని ఓల్డ్ ఏజి హోంలో పడేస్తాడని అనుమానం. 


ఇలా వుండగా, లక్ష్మణ్ భేరి ఓ రాజకీయ నాయకుడి కొడుకుని కొట్టడంతో అక్కడ్నుంచి ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతం అడవివరం స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ అవుతాడు. ఇలాగైనా తాతని వదిలించుకుంటే అడవివరంలో పెళ్ళికి అడ్డు వుండడని తాతని ఓల్డ్ ఏజి హోంలో పడేసి వెళ్ళిపోతాడు. అడవి వరంలో శివుడు (నవీన్ చంద్ర) అనే స్మగ్లర్ జనాల చేత గంజాయి పండిస్తూ కోల్ కతా కి స్మగ్లింగ్ చేస్తూంటాడు. అతడికి రాజకీయ వర్గాల, పోలీసు వర్గాల అండ దండిగా వుంటుంది. ఇతడి వ్యవహారాల్ని గమనించిన లక్ష్మణ్ భేరి అడ్డుకోవడం మొదలెడతాడు. పరిధి దాటి ఇన్వాల్వ్ అవుతున్న అతడికి పోలీసులు అడ్డుపడతారు. 


ఇంకోవైపు లక్ష్మణ్ భేరి తులసి (శ్రీలీల) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా వుంటుంది. ఈ క్రమంలోశివుడి ముఠా పోలీసు అధికారిని చంపేయడంతో, లక్ష్మణ్ భేరి శివుడు రైల్లో స్మగ్లింగ్ చేస్తున్న గంజాయిని ఎత్తుకుపోయి దాచేస్తాడు. ఈ ఇంటర్వెల్ తర్వాత, లక్ష్మణ్ దాచేసిన  గంజాయి కోసం శివుడు చేసే ప్రయత్నాల్ని లక్ష్మణ్ భేరీ ఎలా అడ్డుకున్నాడనేది సెకండాఫ్ కథ.


స్క్రీన్ ప్లే ట్రబుల్స్ 

    ముందు కాన్ఫ్లిక్ట్ చూద్దాం…లక్ష్మణ్ భేరి శివుడు స్మగ్లింగ్ చేస్తున్న గంజాయిని ఎత్తుకుపోయి దాచేస్తే, ఆ గంజాయి కోసం శివుడు చేసే ప్రయత్నాల్ని లక్ష్మణ్ భేరీ  అడ్డుకోవడమన్నది కాన్ఫ్లిక్ట్. పవన్ కళ్యాణ్  ‘ఓజీ’ లో కూడా విలన్ దిగుమతి చేసుకున్నఆర్డీ ఎక్స్ ని ప్రకాష్ రాజ్ దాచేస్తే ఆ ఆర్డీ ఎక్స్ గురించి పోరాటమే. రెండూ ఒకటే. జీవం లేని కాన్ఫ్లిక్ట్ కాని కాన్ఫ్లిక్టులు. రెండూ ఫ్లాపయ్యాయి. 


గంజాయి కోసం పోరాటం ఎవరికవసరం. ఇందులో ఏం ఎమోషన్ వుందని - ఎవరికి ఎమోషన్ వుందని  -విలన్ శివుడికి తప్ప. అతడి ఎమోషన్ ప్రేక్షకుల ఎమోషన్ అవుతుందా? గంజాయిని దాచేయడంతో లక్ష్మణ్  కోల్పోయేదేమీ లేనప్పుడు, అతడితో ఎమోషనే లేనప్పుడు, సెకండాఫ్ కథని ఎవరు కేర్ చేస్తారు? మరేం చేయాలి? లక్ష్మణ్ భేరీ తాతని ముందుకు తేవచ్చు. లక్ష్మణ్  గంజాయి దోచుకోగానే, శివుడు లక్ష్మణ్  తాతని కిడ్నాప్ చేసి ఇరకాటంలో పెట్టొచ్చు. ఇలా ఇంటర్వెల్ ని లాక్ చేయొచ్చు. అప్పుడు జీవమున్నకాన్ఫ్లిక్ట్ లా వుంటుంది. ఇది రొటీనే అయినా తాత  ప్రాణాలు బేరానికి పెడితే పుట్టే ఎమోషన్ నుంచి లక్ష్మణ్ తప్పించుకోలేడు.  ప్రేక్షకులూ తప్పించుకోలేరు.


ఈ కాన్ఫ్లిక్ట్ లో తాతే ఎందుకు? లక్ష్మణ్ ప్రేమిస్తున్న తులసి ఎందుక్కాకూడదు? ఎందుకంటే శివుడు తులసిని బందీగా పెట్టుకుంటే కథలో ఎంటర్ టైన్మెంట్ పుట్టదు. ఈ సినిమా టైటిల్ ‘మాస్ జాతర’ అయినప్పుడు ఫక్తు ఎంటర్ టైన్మెంట్ కథే అవుతుంది  తప్ప- మసాలా యాక్షన్ అవచ్చు తప్ప, విలన్ తో వయోలెంట్ యాక్షన్ కథ అవబోదు. 


కామెడీగా వుండే తాతతో లక్ష్మణ్ కి పెళ్ళి విషయంగా ముందే కాన్ఫ్లిక్ట్ వుంది. ఆ  కాన్ఫ్లిక్ట్ వుండగా శివుడు కిడ్నాప్  చేస్తే ఇంటర్వెల్లో ఊహించని ట్విస్టు పుడుతుంది. వరంగల్లో పెళ్ళికి అడ్డున్నాడని లక్ష్మణ్ తాతని ఓల్డ్ ఏజీ హోం లో పడేసి వస్తే, ఆ తాత తప్పకుండా పగబట్టే వుంటాడు. అలాటి తాతని శివుడు ఖర్మకాలి కిడ్నాప్ చేస్తే, లక్ష్మణ్ మోరల్ డైలమాలో పడతాడు. తాతని విడిపించుకుంటే అసలే పగబట్టి వున్న అతను ఇక ఎట్టి పరిస్థితిలో తన పెళ్ళి జరగనివ్వడు. విడిపించుకోక పోతే ఆ శివుడు తాతని చంపేస్తాడు - ఏం చేయాలి? తాత ప్రాణాలా, తన పెళ్ళి పెటాకులా? బందుత్వానికీ, స్వార్ధానికీ మధ్య అంతర్గతంగా మానసిక సంఘర్షణ. శివుడితో బహిర్గతంగా భౌతిక సంఘర్షణ. ఇలా పాత్రచిత్రణ సమగ్రంగా వుంటుంది. 


ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి సెకండాఫ్ కవసరమైన కామెడీ సిట్యుయేషన్స్ అన్నీ ఏర్పడతాయి. గంజాయి కోసం శివుడి విలనీని లక్ష్మణ్ పెళ్ళి సమస్యకి ముడిపెట్టి -మధ్యలో తాతని బలి మేకని చేస్తే కావలసిన హాస్య ప్రహసనాలన్నీ పుడతాయి. ఆ కాన్ఫ్లిక్ట్ లో లక్ష్మణ్, శివుడు, తాత, తులసి చెరో వైపు లాగే శక్తులుగా గందరగోళం సృష్టిస్తే మాస్ మసాలా అంతా కుదిరి - ఇది బాక్సాఫీసుకి పనికిరాని గంజాయి గురించి జీవం లేని కథ కాకుండా, లక్ష్మణ్ పెళ్ళి గురించిన రోమాంటిక్ అప్పీలున్న ఆడియెన్స్ ఫ్రెండ్లీ కథయ్యే అవకాశ ముంటుంది. 


ఇందుకే ఐడియాతో మొదలెట్టాలని…

    ఈ కథ అనుకున్నప్పుడు ముందుగా ఐడియాని నిర్మించుకున్నట్టు లేదు. ముందు ఐడియాని  వర్కౌట్ చేసి వుంటే కథ కథలా వచ్చేది. ఒక ఐడియా అనుకున్నప్పుడు దాంట్లో  ప్లాట్ పాయింట్ వన్, ఇంటర్వెల్, ప్లాట్ పాయింట్ టూ -ఈ మూడు మలుపులూ వున్నాయా సరి చూసుకుంటే సమస్య వుండదు. మలుపులు కుదరక పొతే కుదిరేవరకూ దిద్దు బాట్లు చేసుకోవాల్సిందే. ఆ తర్వాతే వన్ లైన్ ఆర్డర్ కి వెళ్ళాలి. లేకపోతే  తప్పుల తడిక స్క్రీన్ ప్లే వస్తుంది. 


ఐడియాగా ఈ కథని చూసినప్పుడు- లక్ష్మణ్ వరంగల్లో తాతని ఓల్డ్ ఏజీ హోం లో పడేసి వెళ్ళిపోయే సన్నివేశాన్ని తగిన సంఘర్షణతో హైలైట్ అయ్యేట్టు బలంగా సృష్టిస్తే -అది ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది. తర్వాత ఇంటర్వెల్లో లక్ష్మణ్ శివుడి గంజాయిని పట్టుకుని దాచేస్తే, దీనికి కౌంటర్ గా శివుడు వరంగల్ నుంచి తాతని ఈడ్చుకొస్తే, ఎత్తుకు పైయెత్తుతో కాన్ఫ్లిక్ట్ కి డెప్త్, ఊహించని ట్విస్టు, లక్ష్మణ్ కి మోరల్ డైలమాలతో బలమైన ఎమోషనూ ఇంటర్వెల్లో పుడతాయి. దీంతో సెకండాఫ్ కి కథనం సులువవుతుంది- అది వున్న  కథని వ్యూహాత్మకంగా ముదుకు నడిపిస్తుంది. కథకంటే ముందు దాని  ఐడియాని  నిర్మించుకోవడమంటే స్క్రీన్ ప్లేకి పక్కా బ్లూ ప్రింట్ వేసుకోవడమే.కానీ దురదృష్టమేమిటంటే, స్క్రీన్ ప్లేలు స్ట్రక్చర్ స్కూల్లో గాక ఇంకా స్ట్రక్చర్ లేని క్రియేటివ్ స్కూల్లో తయారవుతున్నాయి. స్ట్రక్చరాశ్యులు టెలిస్కోపు కాదు కదా మైక్రోస్కోపు పెట్టి వెతికినా కనిపించడం లేదు…


మరి సెకండాఫ్ ఎలా సాగింది?

    సెకండాఫ్ లో గంజాయి పోగొట్టుకున్న శివుడికి మాత్రమే గోల్ వుంది దాన్ని చేజిక్కించుకోవాలని. ఎక్కడ దాచాడో లక్ష్మన్ తో కక్కించేందుకు తులసి చేత చేపల పులుసులో మందు కలిపించి తినిపించే లాంటి సిల్లీ కామెడీలు చేస్తాడు. ఇక పదే  పదే అతడి ముఠా లక్ష్మణ్ మీద ఎటాక్స్ చేస్తూంటారు. చివరికి ప్లాట్ పాయింట్ టూ  సన్నివేశంలో గంజాయి దాచిన స్థావరాన్ని కనుక్కుని  ఎటాక్ చేస్తారు ముఠా. అక్కడ తాత వుంటాడు తుపాకులు పెట్టుకుని. ఈ తాత వరంగల్ నుంచి ముందే వచ్చేసి కామెడీలు  చేస్తూంటాడు లక్ష్మణ్ తో. ఇప్పుడు గంజాయికి కాపలా వున్న అతడి  గతం రివీలవుతుంది మాజీ సైనికుడుగా. ఈ తాతని ముఠా చంపేసి గంజాయి దోచుకునేసరికి- క్లయిమాక్స్ మొదలవుతుంది. ఈ క్లయిమాక్స్ జాతరలో లక్ష్మణ్ శివుడిని చంపేసి సినిమాని ముగిస్తాడు. 


ఈ సెకండాఫ్ లో లక్ష్మణ్ ఏమీ చేయడు. ఎందుకంటే పట్టుకున్న గంజాయితో ఏం చేయబోతున్నాడో గోల్ లేదు. వూరికే దాచిపెట్టాడు. ప్రభుత్వానికి అప్పజెప్పి శివుడిని అరెస్ట్ చేసే కామన్ సెన్స్ వుండదు. రవితేజ లాటి పెద్ద స్టార్ కి గోల్ లేని పాత్ర కచ్చా ఇచ్చారంటే రచనా సామర్ధ్యం ఏ స్థాయిలో వుందో గమనించ వచ్చు. శివుడి ముఠా ఎటాక్స్ చేస్తూంటే తిప్పికొట్టడమే పనిగా పెట్టుకున్న - సినిమా విజయానికి ఏ మాత్రం పనికిరాని పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ అన్నమాట! 


ఇక తులసికి శివుడిని సహకరిస్తున్న కథ వుంటుంది.అదేమిటంటే  ఆమె అక్కని తనకిచ్చి పెళ్ళి  చేయలేదని శివుడు బంధించాడు. అక్క క్షేమం కోసం తులసి శివుడు చెప్పినట్టు చేస్తోంది. ఇది కనిపెట్టిన లక్ష్మణ్ ఆ అక్కని విడిపిస్తాడు. తర్వాత గంజాయికి కాపలా వున్న తాతని చంపేస్తే జాతరలో శివుడిని చంపేస్తాడు, ఇంతే. 


సెకండాఫ్ ప్రారంభంలో గంజాయి స్మగ్లింగ్ వెనుక రాజకీయనాయకులు ఎవరున్నారో కనుక్కోవాలంటాడు లక్ష్మణ్. ఈ విషయమే మర్చిపోతాడు. అయినా శివుడితో ముఠా కట్టిన రాజకీయ నాయకులెవరూ కన్పించరు కథలో. అసలు గంజాయిని దాచి పెట్టి ఏం చేయాలనుకుంటున్నాడో తనకే తెలీదు. ఈ తెలియని తనంతో తాతని కాపలా పెట్టి బలి తీసుకున్నట్టే అయింది పాత్రచిత్రణ!


ఫస్టాఫ్ డిటో 

    ఫస్టాఫ్ వరంగల్ రాజకీయాలతో బోరుగా సాగే రెండు యాక్షన్ ఎపిసోడ్లతో వృధాగా గడుస్తుంది టైము. తర్వాత పెళ్ళి ప్రయత్నాలు, వాటిని తాత చెడ గొట్టడాలు, రాజకీయ నాయకుడి కొడుకుని కొట్టాడని ట్రాన్స్ ఫర్ అవడం వగైరా జరిగి అడివి వరం వస్తాడు. 


స్క్రీన్ ప్లే చేయడంలో అనుభవరాహిత్యం వల్ల మొదటి 25 నిముషాల సీన్లూ వృధాగా అనిపిస్తాయి. ఇంతవరకూ సీన్లు ఎత్తేసి లక్ష్మణ్ అడవివరంలో ఎంటరయ్యే సీనుతో ప్రారంభించివుంటే, అక్కడున్న వాతావరణం తో లక్షణ్ పాత్ర పట్ల సస్పెన్స్ పుట్టి ఇంటరెస్టింగ్ గా సాగేది కథ. తర్వాత ఫ్లాష్ బ్యాక్ వేసి వరంగల్లో అతడి  జీవితం, తాతతో జరిగిన కథా  చూపించ వచ్చు. కానీ అనుభవ రాహిత్యం వల్ల ఫస్టాఫ్ ని కూడా నీరు గార్చేశారు.


సినిమా సాంతం కథనం బోరుగా సాగడానికి కారణం డైనమిక్స్ లేకపోవడం. సీను- దానికి యాంటీ సీనూ అనే డైనమిక్స్ వుంటే అడుగడుగునా థ్రిల్ చేస్తూ సాగే అవకాశముంటుంది. పొతే సినిమాలో మాసే లేదు, ఇక జాతరే అన్పించదు. పాత్రల బలాబలాల సమీకరణ వుండుంటే ఈ పరిస్థితి వుండదు. కానీ హీరో సీరియస్ గా వుంటాడు, విలనూ సీరియస్ గానే వుంటాడు, మధ్యలో జోకర్లలాంటి అతడి ముఠా వుంటుంది. ఇందుకే మాస్ జాతర సాధ్యం కాలేదు. మాస్ జాతర హీరో చేతిలో వుండాలి. అంటే హీరో, అతడి అనుచరులూ కామెడీ క్యారక్టర్లుగా వుంటూ- విలన్ అతడి ముతా సీరియస్ క్యారక్టర్లుగా వుంటే - కామెడీ వర్సెస్ సీరియస్ అనే విభజనతో స్పష్టంగా బలాబలాల సమీకరణ జరిగి విజువల్ అప్పీల్ వుంటుంది. 


ఇంతకీ మాస్ జాతర సీన్లు ఎలా వుంటాయి? అక్టోబర్ లో విడుదలైన తమిళ ‘డ్యూడ్’ లో ప్రారంభంలో ప్రియురాలి పెళ్ళికి వెళ్ళే హీరో ప్రదీప్ రంగనాథన్ అక్కడ సృష్టించే రచ్చ, నానా అల్లరీ, ప్రియురాలి తాళి తెంపిసి తన్నులు తినబోయే కామెడీ ఎక్స్ ప్రస్ స్పీడుతో ఎలా వుంటుందో అదేమాస్ జాతర సీనంటే. మాస్ జాతరలో లేనిది ఇలాటి సీన్లే! 


-సికిందర్