రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query హై కాన్సెప్ట్. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query హై కాన్సెప్ట్. Sort by relevance Show all posts

Tuesday, April 1, 2025

1372 : స్క్రీన్ ప్లే సంగతులు


  స్పెన్స్ థ్రిల్లర్లు లేదా మర్డర్ మిస్టరీలు మలయాళం నుంచే అన్ని భాషల ప్రేక్షకుల దృష్టినీ  ఎందుకాకర్షిస్తాయి? అంటే అన్ని మలయాళం సినిమాలని కాదు, కొన్నే కావచ్చు. క్వాలిటీతో ఆ కొన్నయినా ఇతర భాషల నుంచి రావడం లేదు. ఒకప్పుడు తెలుపు- నలుపు సినిమాల కాలంలో ఈ జానర్ సినిమాలంటే చవకబారు సినిమాలుగా ముద్ర వుండేది. అదే ముద్రని నేటికీ సర్టిఫై చేస్తూ ఎలా పడితే అలా ఈ జానర్ సినిమాలు తీసేస్తున్నారు. గత సంవత్సరం తెలుగులో 21 తీస్తే, ఒక్క మత్తు వదలరా -2 తప్ప మిగతా 20 అట్టర్ ఫ్లాపయ్యాయి. కారణం, ఈ  జానర్ లో కథా సృష్టి ఎలా జరుగుతుందో తెలియక పోవడం. అదే మలయాళంలో పదమూడు తీస్తే 10 హిట్టయ్యాయి. ఇవన్నీ ఈ జానర్లో అద్భుతాలు కావు. కానీ వీటిలో గత నవంబర్ లో విడుదలైన సూక్ష్మదర్శిని అద్భుతమే. తర్వాత గత జనవరిలో విడుదలైన రేఖాచిత్రం అద్భుతమే. ఈ జానర్ కథలకి ఏఏ హంగులు కూర్చి కొత్తగా మారుస్తున్నారనేదానికి ఈ రెండు సినిమాలు స్టడీ మెటీరీయల్ అనాలి. కనుక ఈ దృష్టితో స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్ళే ముందు దీని దర్శకుడు జోఫిన్ చాకో, రచయితలు జాన్ మంథ్రిక ల్, రామూ సునీల్ లని తెలుసుకుంటే చాలు...

బిగినింగ్ విభాగం 
        40  ఏళ్ళ క్రితం, 1985లో  - ఓపెనింగ్ ఇమేజి :  చీకట్లో ఓ అడవిలో నల్గురు వ్యక్తులు చాపలో చుట్టిన మృత దేహాన్ని ఒక ఇంటి నుంచి తీసికెళ్తూ కనిపిస్తారు. ఇద్దరు  పిల్లలు దూరం నుంచి ఇది చూస్తారు. మర్నాడు ఆ పిల్లల్లో ఒకడు తన మిత్రుడికి గత రాత్రి తన తండ్రి సినిమాలో నటిస్తూ కనిపించాడని, నలుగురు వ్యక్తులు మృతదేహాన్ని తీసుకెళ్ళే  దృశ్యంలో  తన తండ్రి నటించాడనీ చెప్తాడు.
        
ప్రస్తుతం -2025లో బిగినింగ్ విభాగం : రెండు సమాంతర కథనాలు కొనసాగుతాయి  సంపన్న వ్యాపారవేత్త రాజన్న (సిద్ధీఖ్) తో ఒకటి, ఇన్స్ పెక్టర్  వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) తో ఒకటి. రాజన్న తన డ్రైవర్‌తో కలిసి కారులో  బయలుదేరతాడు. తీవ్ర దుఃఖంతో మద్యం తాగుతూ,  మలక్కప్పార సమీపంలోని అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు. మలక్కప్పార కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఒక చిన్న హిల్ స్టేషన్. కేరళ-తమిళనాడు సరిహద్దులో వుంటుంది.  
        
డ్రైవర్ కారులో వెయిట్ చేస్తూంటే,  రాజన్న అడవిలో వెతుక్కుంటూ వెళ్ళి ఒక చోట కూర్చుని,  ఫేస్‌బుక్‌లో లైవ్ ప్రసారం ప్రారంభిస్తాడు.  తాను ఇప్పడు ధనికుడైనా, ఒకప్పుడు బీదవాడినని మరణ వాగ్మూలం లో వెల్లడిస్తాడు. 1985లో తాను, విన్సెంట్, ఫ్రాన్సిస్ లు కలిసి ఒక అమ్మాయి మృతదేహాన్ని ఇక్కడే పాతిపెట్టామని చెప్తాడు. ఇలా చెప్పి ఆ లైవ్ వీడియో చివర్లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.
        
ఇటు ఇన్స్ పెక్టర్ వివేక్ డ్యూటీలో వుంటూ ఆన్‌లైన్లో పేకాట ఆడినందుకు  సస్పెండ్ అయి వుంటాడు. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేసి  మలక్కప్పార పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తాడు పై అధికారి డిప్యూటీ ఎస్పీ మోహన్ దాస్ (నిశాంత్ సాగర్). అక్కడ డ్యూటీలో చేరిన మొదటి రోజే రాజన్న ఆత్మహత్య కేసు దర్యాప్తు వివేక్ కి అప్పగిస్తాడు డిప్యూటీ ఎస్పీ మోహన్  దాస్. అడవిలో రాజన్న ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని తవ్వించి ఒక  అస్థిపంజరాన్ని పైకి తీయిస్తాడు ఇన్స్ పెక్టర్ వివేక్. ఆ గొయ్యిలో ఒక కాలి పట్టీ కూడా దొరుకుతుంది. అస్థి పంజరం స్త్రీదిగా గుర్తించాక, ఈమె ఎవరో తెలియక దర్యాప్తు కొంతకాలం నిలిచిపోతుంది.
       
మరో వైపు వివేక్
, మృతుడు రాజన్న చెప్పిన సహ నిందితులైన విన్సెంట్, ఫ్రాన్సిస్ ల గురించి దర్యాప్తు ప్రారంభిస్తాడు.  బిగ్ షాట్ అయిన విన్సెంట్ (మనోజ్ కె.  జయన్) అనారోగ్యంతో వున్న భార్య అలీస్ (సలీమా) ని కనిపెట్టుకుని వుంటాడు. కొడుకు వచ్చి ఛానెల్స్ లో ప్రసారమవుతున్న రాజన్న వీడియో చూపించేసరికి విన్సెంట్ అప్రమత్తమై, తన అడ్వకేట్ జాకబ్‌(విజయ్ మీనన్) తో చర్చిస్తాడు. తర్వాత ఇన్స్ పెక్టర్ వివేక్ విచారణ కోసం పిలిచినప్పుడు, అతడితో  సహకరిస్తాడు కానీ, తన మీద  ఎటువంటి అనుమానాలు రేకెత్తించని విధంగా మాట్లాడి వెళ్ళిపోతాడు.
       
ఇక వివేక్ తప్పిపోయిన అమ్మాయిల కేసుల కోసం
1985 నాటి పోలీసు రికార్డుల్ని పరిశీలిస్తాడు. అప్పట్లో తప్పిపోయిన అమ్మాయిల కుటుంబాల్ని కలుస్తాడు. ఫలితం వుండదు. మరిన్ని ఫైల్స్ చూస్తూంటే సినిమా ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్(ఇంద్రాంశ్) దృష్టికొస్తాడు. అతన్ని కలుసుకుంటే, 1985 లో రేఖ (అనస్వరా రాజన్) అనే జ్యూనియర్ ఆర్టిస్టు గురించి చెప్తాడు. అప్పట్లో మమ్ముట్టి నటిస్తున్న కథోడు కథోరం సినిమాలో బుక్కయ్యింది. అయితే షూటింగ్ మధ్యలో ఆమె అదృశ్యమవడంతో తను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ సినిమాలోని ఒక పాటలో కనిపిస్తున్న ఒకమ్మాయిని రేఖగా గుర్తిస్తాడు చంద్రప్పన్. ఈ విజువల్ తో రేఖ ఇమేజిని సృష్టించడంతో వివేక్ దర్యాప్తు కీలక దశకి చేరుకుంటుంది...ఇదీ బిగినింగ్ విభాగపు విషయం.

2. మార్కెట్ యాస్పెక్ట్- బిగినింగ్ సంగతులు

ఇది ఆల్టర్నేట్ హిస్టరీ జానర్ లో మర్డర్ మిస్టరీ కథ కాబట్టి మర్డర్ మిస్టరీ జానర్ మర్యాదలతో వుంది. మర్డర్ మిస్టరీ అంటే ఎండ్ సస్పెన్స్ కథ అని తెలిసిందే. ఒక హత్య జరిగితే ఎవరు చేశారో కనుగొనేందుకు హీరో చేసే జర్నీ. ఈ జర్నీలో చివరిదాకా హంతకుడెవరో హీరోకి తెలియదు కాబట్టి, అప్పటివరకూ ఆ హంతకుడు ప్రేక్షకులకి కూడా తెలియడు కాబట్టీ, ఆ హంతకుడితో హీరోకి సంఘర్షణ అనేది వుండదు. అంటే కథలో ఎదుటి పాత్రా, దాంతో యాక్షనూ వుండవు. అంటే కథ ముగింపులో ఆ హంతకుడ్ని కనుగొనే వరకూ యాక్షన్ లోకి వెళ్ళదన్న మాట  కథ. అప్పుడు మాత్రమే ఎందుకు హత్య చేశాడో కారణం తెలుస్తుంది. అప్పటి వరకూ అన్నీ మూసి పెట్టి వుంటాయి ఎండ్ సస్పెన్స్ కథల్లో.
       
కనుక ఎండ్ సస్పెన్స్- మర్డర్ మిస్టరీ కథనం కేవలం ఇన్వెస్టిగేషన్ తో హీరోచేసే అవరోధాల్లేని ఏకపక్ష జర్నీగా వుంటుంది. ఇందుకే ఎండ్ సస్పెన్స్ తో కూడిన మర్డర్ మిస్టరీ సినిమాలు ఫ్లాపవుతున్నాయి ఎప్పట్నించో
. దీనికి కొన్ని దశాబ్దాల క్రితం విరుగుడు కనిపెట్టాయి హాలీవుడ్ కంపెనీలు. ఈ సెటప్ లో బిగినింగ్ ముగిశాక ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే హంతకుడెవరో హీరోకీ, ప్రేక్షకులకీ రివీల్ చేసేస్తారు. ఇక వాణ్ని పట్టుకునే యాక్షన్ కథనం చేసేస్తారు. ఇది ఆద్యంతం థ్రిల్స్ తో ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. దీన్ని సీన్ టు సీన్ సస్పెన్స్ కథనం అన్నారు. హంతకుడ్ని పట్టుకునే యాక్షన్ కథనంలో సస్పెన్స్ ని జోడించడం వల్ల. ఇలా సినిమా అనే దృశ్య మాధ్యమానికి చైతన్య రహితంగా నష్టాదాయకంగా వుంటున్న ఎండ్ సస్పెన్స్ తో కూడిన మర్డర్ మిస్టరీల కథనాలని సీన్ టు సీన్ సస్పెన్స్-యాక్షన్ కథనాలతో మార్చేసి, ఫ్లాపుల బారి నుంచి బయటపడ్డారు హాలీవుడ్డీయులు.   
       
పోతే
, ఏదైనా కథలో  ఒక సస్పెన్స్ అనే ఎలిమెంట్ వుంటే దానికి రెండు ముఖాలుంటాయి : ఎవరు, ఎందుకు అన్నవి. ఎండ్ సస్పెన్స్  మర్డర్ మిస్టరీల్లో ఇవి రెండూ ఎండ్ వరకూ మూసి పెట్టేయడంతో, కథేమిటో చివరివరకూ తెలియదు. అదే సీన్ టు సీన్ సస్పెన్స్ కథలో ఎవరు (హంతకుడు) అనేది ఓపెన్ చేసేసి, ఎందుకు హత్య చేశాడనేది చివరి వరకూ హోల్డ్ కోసం అట్టి పెట్టుకుంటారు కాబట్టి ఉభయ కుశలోపరిగా వుంటుంది.

3. రేఖాచిత్రంలో సంకరం
        పైన చెప్పుకున్నదంతా చాలా సార్లు చెప్పుకున్నదే, మళ్ళీ గుర్తు చేయడానికే ఈ చరిత్ర పాఠం. ఇది గుర్తు చేసుకోకపోతే ఈ స్క్రీన్ ప్లే సంగతులు అర్ధం కావు. చెప్పేదేమిటంటే ఈ రేఖాచిత్రం కథ ఇంకా ఈ రోజుల్లో వస్తున్నలాటి ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీల్లాంటి  కథ కాదు. హాలీవుడ్ మార్చేసిన మర్డర్ తో సీన్ టు సీన్ సస్పెన్స్ కథ. అయితే ఇందులో బిగినింగ్ విభాగం ప్రారంభంలోనే హంతకులెవరో చెప్పేసి కూడా సంఘర్షణతో కూడిన  యాక్షన్ కథనం చేయకుండా, ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీల్లో ఇన్వెస్టిగేషన్ తో హీరో చేసే అవరోధాల్లేని  ఏకపక్ష జర్నీగానే  చేసేశారు. అంటే హంతకులెవరో తెలిసి పోయి చక్కగా సాగాల్సిన సీన్ టు సీన్ సస్పెన్స్ కథనంలో మర్డర్ మిస్టరీల ఎండ్ సస్పెన్స్ కథనాన్ని జొప్పించేసి సంకరం చేసేశారు!

4. జానర్ సంగతులు

ఇప్పుడు జానర్ గురించి. ఈ కథని ఆల్టర్నేట్ హిస్టరీ జానర్ కథగా చెబుతూ సస్పెన్స్ థ్రిల్లర్ల మొనాటనీని బ్రేక్ చేశారు. ఒక కాల్పనిక కథని తీసికెళ్ళి చరిత్రలో జరిగిన ఏదైనా సంఘటనలో జొనిపితే అది ఆల్టర్నేట్ హిస్టరీ (ప్రత్యామ్నాయ చరిత్ర) జానర్ అవుతుంది. ఇది  హాలీవుడ్ హై కాన్సెప్ట్ కథల్లో వుండే వాట్ ఇఫ్ ( what if?) ఫ్యాక్టర్ ఆధారంగా వుంటుంది. అంటే హాలీవుడ్ హై కాన్సెప్ట్ కథల్లో ఒక గ్రహ శకలం వచ్చి భూమిని తాకితే?...మనిషికి దేవుడు తన శక్తుల్ని ఇచ్చేసి దాంతో వచ్చే సమస్యల్ని ఎదుర్కోమంటే?... ఈ తరహాలో ఇలా జరిగితే?’ అన్న ఊహా జనిత పాయింటుతో వుండే కథలు వాట్ ఇఫ్ ఫ్యాక్టర్ కథలు. ఆల్టర్నేట్ హిస్టరీ కథలు ఈ ఫ్యాక్టర్ ఆధారంగానే వుంటాయి. హాలీవుడ్ లో పదుల సంఖ్యలో వచ్చాయి. తమిళం లో కమల్ హాసన్ తో హేరామ్ అనేది మహాత్మా గాంధీని చంపడానికి గాడ్సే ప్లాన్ వేసుకు వెళ్తూంటే, అదే సమయంలో కల్పిత పాత్ర కమల్ హాసన్ కూడా మహాత్మాగాంధీని చంపే ప్లానుతో ముందుకెళ్తూ వుండే వాట్ ఇఫ్ ఫ్యాక్టర్ కథ. ఇలా ఇప్పుడు రేఖాచిత్రం  మొదటి మలయాళం ఆల్టర్నేట్ హిస్టరీ జానర్ అంటున్నారుగానీ, దీనికి చాలా పూర్వం ఈ జానర్లో కొన్ని మలయాళం సినిమాలున్నాయని సమాచారముంది.
        
రేఖాచిత్రం లో ఆల్టర్నేట్ హిస్టరీ ఏమిటంటే, 1985 లో మమ్ముట్టి నటించిన కథోడు కథోరం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక జ్యూనియర్ ఆర్టిస్టు అదృశ్యమై హత్యకి గురైతే? ...అన్న వాట్ ఇఫ్ ఫ్యాక్టర్ తో కల్పిత కథచేసి, కథోడు కథోరం షూటింగ్ కార్యక్రమాలకి జోడిస్తే, రేఖాచిత్రం’’ అనే ఆల్టర్నేట్ హిస్టరీ తయారైపోయింది.
        
దీనివల్ల ఈ మర్డర్ మిస్టరీ స్వరూపమే మారిపోయింది. మామూలుగా పీరియెడ్ సినిమాలుంటాయి పూర్వకాలంలో కల్పిత కథ చూపిస్తూ. వీటికంటే వాస్తవంగా గత చరిత్రకి ఆపాదిస్తూ కథ చేసినప్పుడు గట్టి పునాదితో సంభ్రమపర్చే పీరియడ్ మూవీ తయారవుతుంది. ఆల్టర్నేట్ హిస్టరీ జానర్ కథలు కూడా పీరియెడ్ కథలే, కాకపోతే ఆనాడు జరిగిన వాస్తవ సంఘటనలకి వూహాజనితంగా కనెక్ట్ అయి వుండడంతో ఎక్కువ థ్రిల్ చేస్తాయి.

5. whodunnit, whydunnit, howdunnit?
        సాధారణంగా హత్య చుట్టూ తిరిగే మర్డర్ మిస్టరీలు/సస్పెన్స్ థ్రిల్లర్లు -హత్య ఎవరు చేశారు (whodunit), లేదా ఎందుకు చేశారు (whydunnit), లేదా ఎలా చేశారు (howdunnit) - అన్న ఏదో ఒక ప్రశ్న కేంద్రకంగా వుంటాయి. కానీ ఎవర్ని హత్య చేశారు అన్న పాయింటు చుట్టూ చాలా అరుదుగా వుంటాయి. అలాటి అరుదైన సినిమాల్లో అరుదైనది రేఖాచిత్రం’. ఇది హత్యకి గురయిన అమ్మాయి ఎవరనే అన్వేషణ ప్రధానంగా సాగే కథ. ఈ కథలో ఎవరెవరు కలిసి హత్య చేశారో తెలుసు, ఎందుకు చేశారో తెలీదు, ఎలా చేశారో తెలియదు- అసలు ఎవర్ని హత్య చేశారో తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి. కనుక ఈ కథలు హతుడు లేదా హతురాలెవరో తెలుసుకునే కథలుగా వుంటాయి.
       
ఇంకో ప్రత్యేకత ఏమిటంటే
, ఇందులో దర్యాప్తుని పోలీస్ ప్రొసీజురల్ జానర్ ప్రకారం రియలిస్టిక్ గా జరగడం. పక్కా మార్కెట్ యాస్పెక్ట్ తో అమరిన  రేఖాచిత్రం ప్రత్యేకతలు చూస్తే- 1. ఆల్టర్నేట్ హిస్టరీ జానర్, 2. సీన్ టు సీన్ సస్పెన్స్ కథ, 3. చంపిందెవర్ని అన్న ప్రశ్నతో కథనం, 4 పోలీస్ ప్రొసీజురల్ ఇన్వెస్టిగేషన్- ఇలా నాలుగు ప్రత్యేకతలతో రేఖాచిత్రం మర్డర్ మిస్టరీ/ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్స్ లో కొత్త బాట పట్టింది.

6. క్రియేటివ్ యాస్పెక్ట్ - బిగినింగ్ కథనం

పైన పకడ్బందీ మార్కెట్ యాస్పెక్ట్ ని పరిశీలించాక, ఈ మార్కెట్ యాస్పెక్ట్ తగ్గ  క్రియేటివ్ యాస్పెక్ట్ ఎంతవరకుందో చూద్దాం. బిగినింగ్ విభాగంలో  విషయ పరిచయం, ప్రధాన పాత్ర ఇన్స్ పెక్టర్ వివేక్, ప్రత్యర్ధి పాత్ర బిగ్ షాట్ విన్సెంట్ పాత్ర సహా, మరి కొన్ని కీలక పాత్రల పరిచయం, రాజన్న ఆత్మహత్యతో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, ముగింపులో సమస్య ఏర్పాటుల సంకలనం వరకూ స్ట్రక్చర్ పరంగా బాగానే వున్నాయి.
       
అయితే వీటి కథనంలో డైనమిక్స్ లోపించడం వల్ల కొన్ని సీన్లు తేలిపోయాయి. థీమ్ మర్డర్ మిస్టరీయే అయినా సర్ప్రైజ్
, సస్పెన్స్, థ్రిల్ అనేవి  ఈ మొత్తం బిగినింగ్ విభాగంలో ఎక్కడా ఫీల్ కాం. ఇన్వెస్టిగేషన్లో సీను తర్వాత సీను డైలాగులతోనే సాగిపోతూంటాయి. అంటే స్క్రీన్ ప్లే విజువల్ గా లేదు, వెర్బల్ గా వుంది. అందువల్ల కథనం మందగమనం బారిన పడింది. పాత్రల మద్య మాటలతో కథ నడపడం సినిమాల అవసరం కాదు, స్టేజి నాటకాల అవసరం. రేఖాచిత్రం ఆడియో ఫైలు తీసుకుని డైలాగులు వింటూపోతే చాలు కథ అర్ధమైపోతుంది- రేడియో నాటికల్లాగా.
       
అయితే ఫోర్ షాడోయింగ్ సీను ఒకటి బావుంది. ప్రారంభంలో సస్పెండ్ అయి వున్న ఇన్స్ పెక్టర్ వివేక్ ఇంటిదగ్గర దినచర్య చూపిస్తున్నప్పుడు
, అతను మొక్కలు పెంచుతూ కన్పిస్తాడు. తర్వాత పోస్టింగ్ అతడికి అడవిలోనే అవుతుంది. మొక్కలు- అడవి ఈ ఫోర్ షాడోయింగ్ బావుంది.
       
కానీ
, తర్వాత రాజన్న కారులో అడవిలో కెళ్ళి ఆత్మ హత్య చేసుకుంటున్నప్పుడు, కారులో వెయిట్ చేస్తున్న డ్రైవర్, రాజన్న కూర్చున్న వెనుక సీట్లో ఓ బిజినెస్ మేగజైన్ ని అందుకుని తిరగేస్తూంటాడు. ఆ మేగజైన్ కవర్ పేజీ మీద బిగ్ షాట్ విన్సెంట్ ఫోటో వుంటుంది. అటు రాజన్న ఆత్మ హత్య చేసుకుంటూ పలికే సహ నిందితుల రెండు పేర్లలో ఒకటి విన్సెంటే. అయితే ఇప్పటికింకా విన్సెంట్ ఎవరో మనకి పరిచయం కాలేదు. తర్వాత కొన్ని సీన్ల తర్వాత పరిచయమైనప్పుడు, ఈ డ్రైవర్ తిరగేస్తున్న మేగజైన్ కవర్ పేజీ ఫోటో అప్పుడు విన్సెంట్ దని మనం గుర్తిస్తాం. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఎప్పుడో ప్రారంభంలో సెటప్ చేసిన ఫోటో ఇన్ని సీన్ల తర్వాత ఇప్పుడు ఫే ఆఫ్ అయితే ఏముంటుంది ఇంపాక్ట్. అసలా మేగజైన్ ఫోటో మీద ఎందరు ప్రేక్షకుల దృష్టి పోతుంది- తర్వాత పిక్చర్ లోకి విన్సెంట్ వస్తే  గుర్తించడానికి? గుర్తించి థ్రిల్లవడానికి?
       
అసలు రాజన్న ఆత్మహత్య చేసుకోబోయే విషాదకర  పరిస్థితుల్లో ఆ మేగజైన్ ని వెంట వుంచుకున్నాడంటే
, తన మరణ వాగ్మూలంతో విన్సెంట్ ఫోటో వున్న ఆ మేగజైన్ ఎంతగా ఎమోషనల్ గా కనెక్ట్ అయివుందో తెలిసిపోతోంది. అలాటిది కారు దిగినప్పుడు దాన్ని వెంట తీసుకునే పోవాలి. ఆ తర్వాత ఆ మేగజైన్ మీద సహ నిందితుడు విన్సెంట్ ఫోటో చూపిస్తూ, రివాల్వర్ పెట్టి కాల్చుకుని  సూసైడ్ చేసుకుని వుంటే - గట్టి బ్యాంగుతో దద్దరిల్లేది ఈ సీను!
       
క్రియేటివిటీ పరంగా
, ఏ విశేషం ఏ సీనుకి ఎటాచ్ చేస్తే ఇంపాక్ట్ వుంటుందో అర్ధం జేసుకోవడానికి ఇదే ఉదాహరణ - విశేషం : విన్సెంట్ ఫోటోతో వున్న మేగజైన్ షాట్, ఎటాచ్ మెంట్ : రాజన్న రివాల్వర్ తో కాల్చుకునే సీనుతో. ఏ షాట్ ఏ సీనుకి ఎటాచ్ చేస్తే ఇంపాక్ట్ వుంటుందో స్టోరీ రైటింగ్ చేస్తే రాదు- స్టోరీ మేకింగ్ చేస్తే మెరుపులు చాలా మెరిపించ వచ్చు.
       
అయితే రాజన్న ఆత్మహత్యే చేసుకున్నాడని ఇన్స్ పెక్టర్ వివేక్ ఎలా నమ్మాడు
? డ్రైవర్ కాల్చి చంపి వుండొచ్చుగా? ఈ సందేహ నివృత్తి చేసుకోలేదు వివేక్. రివాల్వర్ ని పరీక్షకి పంపడంగానీ, డ్రైవర్ వేలిముద్రలు తీసుకోవడం గానీ చేయలేదు. తన వేలిముద్రలు పడకుండా డ్రైవర్ జాగ్రత్త పడి వుండొచ్చు. అలా వేలిముద్రలు  పడకుండా జాగ్రత్త తీసుకున్నా,  రివాల్వర్ పేల్చినప్పుడు వెలువడే గన్ పౌడర్ అవశేషాలు అతడి చేతుల మీద వుంటాయి. ఇవేవీ తెలుసుకోకుండానే  రాజన్నది ఆత్మహత్యగానే నిర్ధారించేశాడు వివేక్. నిజంగా ఈ సంఘటన ఎలా జరిగిందో సీను చూశాం కాబట్టి మనకి తెలుసు- మనం సీను చూసినట్టు ఇన్స్ పెక్టర్ వివేక్ ఆ సమయంలో వచ్చి చూడలేదుగా? అందుకని ఒక ఇన్వెస్టిగేటర్ గా ఆత్మహత్యని అతను శంకించడమూ, ఆ శంక తీర్చుకోవడమూ కథనానికవసరం. 

ఇదంతా అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఈ కథని ముందు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ ని రియలిస్టిక్ గా, పోలీస్ ప్రొసీజురల్ జానర్లో చేసుకుంటూ పోయారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అనేది, అన్ని కోణాల్లో కచ్ఛితత్వంతో లాజికల్ గా  మెప్పించక తప్పదు. ఇన్వెస్టిగేటర్ ఎంత లోతుగా ఆలోచిస్తే అంత థ్రిల్ చేసే విషయాలు బయటపడతాయి కథనంలోంచి. ఇది సినిమాకే లాభం. ఈ కథకి ఎంత పొటెన్షియల్ వుందో ఆలోచిస్తే, ఏదో 6 కోట్లు పెట్టాం 50 కోట్లు వచ్చాయని సంతృప్తి పడిపోవడానికంటే మిన్నగా, దీనికి పోలీస్ ట్రైనింగుల్లో సబ్జెక్టుగా బోధించగలిగేంత పొటెన్షియల్ తో బాటు సార్ధకతా వున్నాయని తెలుస్తుంది.

7. హత్యా రహస్యమంతా అస్థిపంజరంలోనే
ఇక అస్థిపంజరం సంగతి. 40 ఏళ్ల తర్వాత బయట పడిన అస్థిపంజరం భాగాలుగా విడిపోయి వుంటుంది. పుర్రె సహా. ఫోరెన్సిక్ లాబ్ లో అస్థిపంజరం స్త్రీదని తేలుస్తారు. ఐతే వయసు ఇప్పుడే చెప్పలేమంటారు. అస్థిపంజరంతో బాటు ఒక కాలి పట్టీ కూడా దొరుకుతుంది. ఈ అస్థిపంజరం ఏ స్త్రీదో తెలియక దర్యాప్తు ముందుకు సాగదు. తర్వాత చాలా ముందుకెళ్ళాక,  ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ రేఖ గురించి చెప్పి, సినిమా పాటలో ఆమెని గుర్తించడంతో మృతురాలి ఐడెంటిటీ తెలుస్తుంది.
       
ఇలాకాకుండా
, ఆ పుర్రె సాయంతో ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టులు ఫేషియల్ రీ కన్స్ ట్రక్ట్ చేసే  టెక్నాలజీ వుంది ప్రపంచంలో. దీంతో పుర్రె సహాయంతో రేఖ రూపం తయారై పోతుంది. దీని ఫోటోలు మీడియాలో ప్రచారం చేస్తే రేఖ బంధువులు గుర్తుపట్టి వచ్చేసే అవకాశముంది. దీన్ని పక్కనబెట్టి పాతకేసులు తిరగదోడుతూ, ఎందర్నో కలుస్తూ చంద్రప్పన్ దాకా వెళ్ళి, చాలా కాలయాపన చేశాడు ఇన్స్ పెక్టర్ వివేక్.
       
ఇంకోటేమిటంటే
,  రూల్ ఆఫ్ త్రీస్ కి న్యాయం జరిగిన విధానం... ప్రారంభంలో ఓపెనింగ్ ఇమేజిలో ఓ నల్గురు చాపలో చుట్టిన మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ మృతదేహం కాలికి వేలాడుతున్న కాలిపట్టీని బట్టి అది స్త్రీ శవమని ముందే తెలిసిపోతోంది.  తర్వాత, రాజన్న ఆత్మహత్య చేసుకుంటూ ఇక్కడ ఒకమ్మాయి మృత దేహాన్ని పాతి పెట్టామని చెప్తాడు. ఓపెనింగ్ ఇమేజి లోనే కాలిపట్టీని బట్టి అమ్మాయి శవమని తెలిసిపోతున్నప్పుడు, మళ్ళీ రెండో సీన్లో రాజన్ అమ్మాయి శవమని అదే విషయం చెప్పడమేమిటి? తర్వాత మూడో సీన్లో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా అస్థిపంజరం స్త్రీదని అదే విషయం చెప్పడమేమిటి? సీనిక్ డెవలప్ మెంట్ లేకుండా తెలిసీన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పడమేమిటి? ఇందులో సస్పెన్స్ రివీలవడం గానీ, థ్రిల్ గానీ ఏమైనా వున్నాయా? ఇది  రూల్ ఆఫ్ త్రీస్ కి వ్యతిరేకంగా వుంది. 
       
అంటే ఓపెనింగ్ ఇమేజిలో శవాన్ని మోసు కెళ్తున్నప్పుడు కాలిపట్టీని రివీల్ చేయకూడదు
, అది ఆడమనిషి శవమని అప్పుడే తెలియకూడదు. తర్వాత రాజన్న కూడా ఒక శవం అనివుంటే సరిపోతుంది. ఎవరి శవం? విన్సెంట్, ఫ్రాన్సిస్ అని ఇద్దరు సహనిందితుల పేర్లు చెప్పాడు రాజన్న. అంటే తాము ముగ్గురూ కలిసి తమ పార్ట్నర్ ఎవర్నో చంపి అక్కడ పాతి పెట్టారా? ఈ ప్రశ్న రేకెత్తించి ఫోరెన్సిక్ లాబ్  కెళ్తే, అక్కడ అప్పుడు అస్థిపంజరం స్త్రీదని తెలిస్తే కథనం ఎంత థ్రిల్లింగ్ గా వుంటుంది. కథనమంటే ముందు ప్రశ్న రేకెత్తించి  తర్వాత జవాబు చెప్పడమేగా? ఇలా జరిగి వుంటే ఈ మూడు సీన్లూ త్రివిధావస్థలతో రూల్ ఆఫ్ త్రీస్ కి న్యాయం చేసేవిగా?
       
మరొకటేమిటంటే
, ఫోరెన్సిక్ లాబ్ లో ఆ అస్థిపంజరం స్త్రీదని చెప్పినప్పుడు, వయసు ఇంకా నిర్ధారించలేదని, తర్వాత చెప్తామని అంటాడు  ఎక్స్ పర్ట్. తర్వాత ఎక్కడా చెప్పడు. కానీ పుర్రెలో దంతాల్ని పరీక్షించి వుంటే వయసు తెలిసిపోతుంది. ఈ పని చేయడు. 
       
ఈ కేసుని పరిష్కరించడానికి అస్థిపంజరంలోనే బోలెడు క్లూస్ వుంటాయి. ఈ ఒక్కో క్లూని పట్టుకున్నప్పుడల్లా కథనానికి పెరుగుతూ పోయే డైనమిక్స్ తోడయ్యే అవకాశముంది. కానీ ఇన్వెస్టిగేషన్లో ఇన్స్ పెక్టర్ వివేక్ బుద్ధి కుశలతని
, దాంతో కథనంలో టెన్షన్ నీ సృష్టించే అవకాశాన్ని గుర్తించ లేదు. అస్థిపంజరం దొరికితే నిర్ధారించాల్సిన అంశాలు కొన్ని వుంటాయి- అస్థి పంజరం ఎంత పురాతన మైనది? ఇది తెలుసుకుని మరణం ఎప్పుడు జరిగిందో నిర్ధారిస్తారు. అంతేగానీ 1985 లో సినిమా షూటింగ్ సమయంలో అదృశ్యమైందని సాక్షులు చెప్పిందే వేదంగా టైముని తీసుకోరు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వుండాలి. అది హత్యా, సహజ మరణమా కూడా సాక్షులు చెప్పింది కాకుండా మెడికల్ గా నిర్ధారించుకోవాలి. తర్వాత సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు, ఆమెని ఉరి బిగించి చంపినట్టు వుంటుంది.  అంటే అర్ధం మెడ ఎముక విరిగి వుండాలి. ఇలా జరిగి వుంటే ఇది కూడా ఇప్పుడు అస్థిపంజరం పరీక్షలో బయట పడుతుంది. అప్పుడా ఉరి ఎవరైనా బిగించారా, లేక తానే ఉరేసుకుందా- ఇదసలు హత్యేనా, లేక ఆత్మహత్యా... పరీక్షలు జరిపి రూఢీ చేసుకోవాలి. అంతేగానీ కేవలం ఆత్మహత్య చేసుకున్న రాజన్న మాటలే సాక్ష్యంగా తీసుకోకూడదు.

8. కాలిపట్టీ కథ

ఇక కాలిపట్టీ  సంగతి. అస్థి పంజరంతో బాటు, ఒక కాలి పట్టీ దొరికుతుంది. రెండోది ఏమైనట్టు? మట్టిలో కరిగిపోయిందా? వెండి గొలుసు ఎంతకాలమైనా మట్టిలో కరగదు. మరి రెండో కాలిపట్టీ ఏమైనట్టు? ఆసలా దొరికిన కాలిపట్టీ ఆమెదేనని ఎలా అనుకుంటారు? ఆమెదే అయితే రెండోది కూడా అక్కడే దొరకాలిగా? దొరక లేదంటే ఆమెని పాతిపెట్టిన మనిషిది కావచ్చా? అంటే ఈ సంఘటనలో ఆడమనిషి పాత్ర కూడా వుండొచ్చా? దొరికిన కాలిపట్టీ మృతురాలిదే అయితే రెండో కాలిపట్టీ  హత్య- లేక ఆత్మహత్యా స్థలంలోనే పడిపోయి వుండచ్ఛా?  ఆ స్థలం ఏది, ఎక్కడుంది?

హత్య కేసు  కోర్టులో నిలబడాలంటే నాలుగు సాక్ష్యాల్ని నిరూపించాలి- హత్యా స్థలం, హత్యా సమయం, హతుడు లేదా హతురాలెవరు, హత్యకి మోటివ్ ఏమిటి- ఈ నాల్గు నిరూపిస్తేనే  కేసుంటుంది. అందుకని ఈ నాల్గింటి ఆధారంగానే దర్యాప్తు సాగిస్తారు. కానీ పోలీస్ ప్రొసీజురల్ తో కూడిన ఈ కథలో ఇదేమీ కనిపించదు. కేసు దర్యాప్తు అధికారిగా సర్కిల్ ఇన్స్ పెక్టర్ వున్నా -కేసులో అతడ్ని ఇన్వెస్టిగేటివ్  ఆఫీసర్ (ఐఓ) అంటారు. ఇన్స్ పెక్టర్ వివేక్ కి ఈ హోదా (ఐఓ) కూడా ఇవ్వక ఇన్స్ పెక్టర్ గానే లాగించేశారు.

ఇక కేసుని తవ్వితే ఇంకా వుంది- అస్థిపంజరంతో స్త్రీగా నిర్ధారణ అయ్యాక- తట్టాల్సిన రెండో ప్రశ్న- ఆమె వివాహితా, అవివాహితా? వివాహిత అయితే ఆమె భర్త ఏమయ్యాడు? ఆమె మంగళ సూత్రాలు, గాజులు ఏమయ్యాయి? ఆమె కన్యా కాదా అనేది  అస్థిపంజరంతో తెలుసుకోలేరు, కానీ కాన్పు జరిగి వుంటే కటి భాగంలో ఎముక ద్వారా ఎంత కాలం తర్వాతైనా తెలుసు కోవచ్చు. కథకి ఉత్కంఠనీ పెంచే ఇలాటి అంశాల్ని ప్లే చేస్తే  బాక్సాఫీసుకి ఉపయోగమే తప్ప వృధా కాదు.

9. ప్లాట్ పాయింట్ వన్ వివరణ
        దీన్ని శ్రద్ధగా చదవాలి... హీరోకి సమస్యని ఏర్పాటు చేసి, దాన్ని సాధించే గోల్ నిచ్చే, ఎదుటి పాత్రతో కాన్ఫ్లిక్ట్ ని ప్రారంభించే  బిగినింగ్ మలుపు - అంటే  ప్లాట్ పాయింట్ వన్ అనేది –స్క్రీన్ ప్లేకి ప్రాణం వంటిది. బిగ్ బ్యాంగ్ తో విశ్వం ఏర్పడినట్టు, ప్లాట్ పాయింట్ వన్ లో కాన్ఫ్లిక్ట్ తో కథ పుడుతుంది. స్క్రీన్ ప్లేలో కథ పుట్టేది ప్లాట్ పాయింట్ వన్ లోనే. కథ పుట్టాలంటే కొన్ని పరిస్థితులు తోడ్పడాలి. పాత్రల పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, దీంతో సమస్య ఏర్పాటు, దీంతో ఎదుటి పాత్రతో కాన్ఫ్లిక్ట్ తో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు, దీంతో హీరో చేతికి కాన్ఫ్లిక్ట్ ని పరిష్కరించే గోల్- ఈ పరిస్థితులు తోడ్పడాలి. ఈ పరిస్థితులన్నీ బిగినింగ్ విభాగంలో ఏర్పడి వుంటాయి. బిగినింగ్ విభాగం కంటే ముందు ఏర్పడే అవకాశం లేదు. కాబట్టి బిగినింగ్ విభాగంలో పరిస్థితులే ప్లాట్ పాయింట్ వన్ లో కథని పుట్టిస్తాయి. ఇలా పుట్టడం వల్ల బిగినింగ్ విభాగంలోని పరిస్థితుల వల్ల కథలో ఆత్మ అంతా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వచ్చేస్తుంది. స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ లో ఇలా పుట్టిన కథ పూర్తయ్యేది తర్వాత ప్లాట్  పాయింట్ టూ లోనే. ఈ రెండు పాయింట్ల మధ్య వుండేది మిడిల్ విభాగమే. కాబట్టి ప్లాట్ పాయింట్ వన్ లో కథలో పుట్టిన ఆత్మ అక్కడ్నించి ప్రవహిస్తూ ప్లాట్ పాయింట్ టూ లో కొలిక్కి వస్తుంది. అంటే కథాత్మ అనేది మిడిల్ విభాగమంతా వ్యాపించి వుంటుంది. ప్లాట్ పాయింట్ టూ తర్వాత ఎండ్ విభాగం వస్తుంది. ఇందులో క్లయిమాక్స్, సమస్యకి పరిష్కారం, ముగింపూ వగైరా.
        
కాబట్టి కథాత్మని మోస్తున్న మిడిల్ ని కాపాడుకోవాలంటే నాల్గుంటాయి- హీరో కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. ఇవి గోల్ ఎలిమెంట్స్. ఇవి వుంటే కథ, అంటే మిడిల్ విభాగం, ఆత్మ సహితంగా బలంగా వుంటుంది. బిగినింగ్ విభాగంలో పరిస్థితులు, ప్లాట్ పాయింట్ వన్ లో కాన్ఫ్లిక్ట్, గోల్ ఎలిమెంట్స్ నాలుగూ కథలో ఆత్మకి కారణమవుతాయి. కనుక ఈ ఆత్మని ప్రోది చేసేందుకే బిగినింగ్ విభాగం రైటింగ్ ఎక్కువ శ్రమ, కాలం తీసుకుంటుంది. ఇందుకే స్క్రీన్ ప్లే సంగతులు రాస్తున్నప్పుడు బిగినింగ్ విభాగమే చాంతాడులా సాగుతోంది. ఇప్పటికే 3,806 పదాలతో నైలు నదిలా సాగింది. ఒకసారి బిగినింగ్ విభాగం పైన చెప్పుకున్న అన్ని టూల్స్ తో సమగ్రంగా ఏర్పాటయ్యిందంటే, ఇక మిడిల్ –ఎండ్ విభాగాలు ఎక్కువ సమయం తీసుకోవు.
        
ఇప్పుడు రేఖాచిత్రం లో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు ఎలా జరిగింది? బిగినింగ్ విభాగంలో ఇన్స్ పెక్టర్ వివేక్ తన ధోరణిలో చేసే ఇన్వెస్టిగేషన్లో  మృతుడు రాజన్న చెప్పిన సహ నిందితులైన విన్సెంట్, ఫ్రాన్సిస్ లపై కూడా దృష్టి పెట్టాడు. విన్సెంట్ ఏదో చెప్పి తప్పించుకున్నాడు. ఇక మృతురాలి ఐడెంటిటీ తెలుసుకోవడమే మిగిలింది ఈ బిగినింగ్ విభాగానికి. ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ సాయంతో ఆమె రేఖ అనే జ్యూనియర్ ఆర్టిస్టు అని ఫోటో సహా సమాచారం లభించినప్పుడు ఇదే ప్లాట్ పాయింట్ వన్ అయింది. ఇదే ఎందుకు ప్లాట్ పాయింట్ వన్ అయింది? విలన్ గా విన్సెంట్ వుండగా అతడితో ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఏర్పడకూడదు? ఇలా చేస్తే బలవంతగా కథని మార్చినట్టవుతుంది. బిగినింగ్ విభాగంలో పరిస్థితుల కనుకూలంగా కథని పుట్టనివ్వకుండా గొంతు పుచ్చుకుని, నువ్విలాగే పుట్టాలని శాసించినట్టవుతుంది.
        
కాస్త ఆలోచించి, విన్సెంట్ ని కిల్లర్ గా పట్టుకునే పాయింటుతో కథ వుండాలా, లేక అతను హత్య చేసిందెవర్నో తెలుసుకునే పాయింటుతో కథ సాగాలా అనుకున్నప్పుడు- పైన చెప్పుకున్న టూల్స్ పరంగానే కాదు, మార్కెట్ యాస్పెక్ట్ కి దోహదం చేసిన నాలుగు ప్రత్యేకతల ప్రకారం కూడా, రెండో పాయింటే కథ కోసం నిలబడుతుంది. మార్కెట్ యాస్పెక్ట్ కి whodunit, whydunnit, howdunnit లకి భిన్నంగా ఎవర్ని చంపారు- అనే అనే నాల్గో ముఖాన్ని తీసుకున్నారు గనుక దీనికి లోబడే - బిగినింగ్ విభాగంలో పరిస్థితుల ప్రకారం పేరు, ఫోటో సహా హతురాలి క్లూ దొరకడం, దాంతో ఆమె బంధువుల్ని (పుట్టుపూర్వోత్తరాల్ని) అన్వేషించే పాయింటుతో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటవడమూ జరిగిపోయాయి.
        
ఆమె పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడమే ఇన్స్ పెక్టర్ వివేక్ గోల్. ఈ గోల్ ఎలిమెంట్స్ లో కోరిక- పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం, పణం- తన ప్రాణాలు కావచ్చు, పరిణామాల హెచ్చరిక- సాక్షుల చావులు కావొచ్చు, ఇక ఎమోషన్- మొదటి మూడు ఎలిమెంట్స్ లో పుట్టే భావావేశాల కూడిక. దీంతో బిగినింగ్ విభాగం సమాప్తం.

10.  మిడిల్ విభాగం విషయం

ఇన్స్ పెక్టర్ వివేక్ రేఖ స్కెచ్ సంపాదించాడని తెలుసుకున్న విన్సెంట్, కలవరపడతాడు. వివేక్  దర్యాప్తుని అణిచివేయడానికి, ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ ని చంపించేస్తాడు విన్సెంట్.  తన పలుకుబడి నుపయోగించి, వివేక్‌ ని  కేసు నుంచి తొలగించి ట్రాఫిక్ డ్యూటీకి పంపేస్తాడు. విన్సెంట్ కి లొంగి అతడికి వ్యతిరేకంగా వున్న ఆధారాల్ని తొలగిస్తుంది క్రైమ్ బ్రాంచ్. 

ఈ ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, న్యాయం కోసం అన్వేషణ కొనసాగిస్తాడు వివేక్. నిందితుల్లో రెండో వాడయిన ఫ్రాన్సిస్ గురించి ఆరా తీస్తే, అతడి వివరాలు చర్చి బిషప్ కి తెలుసని ఒకరు చెప్పడంతో- వివేక్ ఆ బిషప్ ని కలవడానికి వెళ్ళేసరికి అతను చనిపోయి వుంటాడు. ఇతడ్ని కూడా విన్సెంట్ చంపించేశాడన్న మాట. ఇక వివేక్  ఒకప్పుడు సినిమా షూటింగ్ ప్రదేశాలని విస్తృతంగా కవర్ చేసిన మాజీ టాబ్లాయిడ్ జర్నలిస్ట్, నేటి  వ్లాగర్ అయిన పల్లాస్సేరీ (టిజి రవి) ని ట్రాక్ చేస్తాడు. ఇతడి దగ్గర్నుంచి పాత స్టిల్స్ ని జల్లెడ పట్టి, ఒకప్పుడు రేఖని  కలిసి ఆమెతో చాలా స్నేహంగా మెలిగిన స్టెఫీ (మేఘా థామస్) అనే నన్ ని గురించి తెలుసుకుంటాడు.
       
నన్ స్టెఫీని వివేక్ ట్రేస్ చేసి వెళ్ళి కలుసుకుంటే
,  కథోడు కథోరం షూటింగ్ సమయంలో రేఖతో తనకి  ఎదురైన అనుభవాల్ని  వివరిస్తుందామె. తను పనిచేసిన కాన్వెంట్ షూటింగ్ ప్రదేశానికి దగ్గర్లోనే అడవిలో వుంది. హీరో మమ్ముట్టికి అంటే రేఖాకి పిచ్చి అభిమానం. సినిమాల్లో హీరోయిన్ కావాలని బలంగా కోరిక వుండేది. ఆ ప్రాంతంలో కథోడు కథోరం షూటింగు జరుగుతోందని తెలుసుకుని మమ్ముట్టిని కలుసుకుందామని వచ్చింది. కలిసే అవకాశం లేకపోవడంతో ఒక పాటలో నటించే అవకాశం సంపాదించుకుని ఆ విధంగా మమ్ముట్టికి దగ్గరై తన గురించి చెప్పుకోవాలనుకుంది. అలా ఒక రాత్రిపూట బస చేయమని రేఖని కాన్వెంటుకి ఆహ్వానించింది నన్ స్టెఫీ. తెల్లారి చూస్తే గదిలో లేదు- కాన్వెంట్ సేఫ్ లో వున్న పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు రేఖ కనిపించకుండా పోయింది.
        
కాన్వెంట్ ప్రతిష్టని కాపాడేందుకు నన్స్ అందరూ కలిసి  ఈ సంఘటన గురించి  రిపోర్టు చేయకూడదని  నిర్ణయించుకున్నారు.  రేఖ లేకపోవడంతో షూటింగుకి  అంతరాయమేర్పడి నిర్మాతలు ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ ని నిలదీయడంతో అతను వెళ్ళి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. కానీ పోలీసులు ఆమె జాడ తెలుసుకోలేకపోయారు.
       
పై ఫ్లాష్ బ్యాక్ తో విషయ సేకరణ చేసుకున్న వివేక్
, కొత్త సమాచారంతో బినూ, సజీవన్ అనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు. రాజన్న ఆత్మహత్యకి ముందు ఫోన్లో వీళ్ళిద్దరు మాట్లాడారు. ఇప్పుడు  వీళ్ళని పట్టుకుంటే, బినూ చిన్నతనంలో తన తండ్రి -  ఇతర వ్యక్తులు ఓ మృతదేహాన్ని మోసుకెళ్లడం తాను చూశానని ఒప్పుకుంటాడు. అయితే తండ్రి అప్పట్లో దాన్ని 'కాథోడు కాథోరం' లోని దృశ్యంగా చెప్పాడని  వివరిస్తాడు. అంటే శవాన్ని మోసిన రాజన్న, విన్సెంట్, ఫ్రాసిస్ లతోబాటున్న నాల్గో వ్యక్తి బినూ తండ్రి అన్నమాట. ఇతను చనిపోయాడు. 
       
ఇది అబద్ధమని తర్వాత తను గ్రహించాడు - ఇది నిజ హత్య అనీ
, రాజన్నతో సంబంధం వుందనీ తెలుసుకుని, సజీవన్ తో కలిసి డబ్బుకోసం రాజన్నని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఇప్పుడు వివేక్ పట్టుకున్నాక, కేసులో సాక్షులుగా వుండేందుకు ఒప్పుకుంటారు. అయితే విన్సెంట్ వీళ్ళని కూడా చంపించేస్తాడు.
       
ఇక సినిమా సెట్స్ లోని పాత  స్టిల్స్ ఆధారంగా ఫ్రాన్సిస్ ని పట్టుకుంటాడు వివేక్.  ఫ్రాన్సిస్ ఇక తప్పించుకోలేక 
1985లో ఆ రాత్రి జరిగిన భయంకర సంఘటనని వెల్లడిస్తాడు. అప్పట్లో కాన్వెంట్‌లో బిషప్ సహాయకుడిగా వున్న విన్సెంట్, పుష్పం అనే పనిమనిషి సాయంతో  చిన్నచిన్న దొంగ తనాలకి పాల్పడేవాడు.
        
ఓ రాత్రి, పుష్పం కాన్వెంట్‌లోని సేఫ్‌ని దోచుకోవడానికి పథకం వేసింది. ఆ  రాత్రి రేఖా అక్కడ బస చేయడంతో దొంగతనం ఆమె మీదికి పోయేలా విన్సెంట్ సాయంతో ప్లానేసింది. గదిలో రేఖాని దుప్పటితో ఊరి బిగించి చంపేసింది. సేఫ్ లో దోచుకున్న డబ్బులోంచి కొంత విన్సెంట్, ఫ్రాన్సిస్ లకిచ్చి రేఖ డెడ్ బాడీని మాయం చేయమని చెప్పేసింది. అలా రేఖ మృతదేహాన్ని తీసికెళ్ళి అడవిలో పాతిపెట్టారు...

ఇలా ఫ్రాన్సిస్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్న వివేక్ అతడ్ని అరెస్టు చేయడంతో మిడిల్ విభాగం ముగిసి, ప్లాట్ పాయింట్ టూ ఏర్పాటవుతుంది.

11. ఎలావుంది మిడిల్
        మిడిల్ విభాగంలో బిజినెస్ ఏమిటి? కేవలం ఒక్క యాక్షన్- రియాక్షన్ల ఇంటర్ ప్లే మాత్రమే, ఇంతకీ మించి ఏం లేదు. ప్లాట్ పాయింట్ వన్ నుంచి ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్ విభాగంలో ఇదే తంతు వుంటుంది ఏ జానర్ సినిమాలోనైనా. ప్లాట్ పాయింట్ వన్ లో  గోల్ ని చేపట్టిన హీరో యాక్షన్ ని అడ్డుకుంటూ విలన్ రియాక్షన్ ఇవ్వడం, విలన్ రియాక్షన్ ని తిప్పికొడుతూ హీరో ఇంకో యాక్షన్ ఇవ్వడం, ఈ యాక్షన్ కి విలన్ మళ్ళీ ఇంకో రియాక్షన్ ఇవ్వడం...ఇలా ఇద్దరి మధ్య యాక్షన్ రియాక్షన్లతో కాన్ఫ్లిక్ట్ వేడెక్కుతూ, ప్లాట్ పాయింట్ టూలో - కథని బట్టి ఎవరిదో ఒకరిది పైచేయి అవుతుంది. ఇంతే. ఇక్కడ్నుంచీ ఎండ్ విభాగం మొదలై క్లయిమాక్స్ బాట  పడుతుంది.
        
రేఖాచిత్రంలో హీరో పాత్ర ఇన్స్ పెక్టర్ వివేక్- ప్లాట్ పాయింట్ వన్ లో మృతురాలి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న గోల్ చేపట్టాడు. అయితే ముందుగానే పైన చెప్పుకున్నట్టు - ఈ గోల్ సాధన ఏ అవరోధాలూ లేకుండా ఏకపక్ష జర్నీగా సాగుతుంది.  విలన్ గా విన్సెంట్ వున్నా, అతను ఎక్కడికక్కడ గోల్ ని అడ్డుకుంటున్నా, వరసగా సాక్షుల్ని చంపుకకు పోతున్నా, రియాక్ట్ అవడు వివేక్. దీన్నసలు పట్టించుకోకుండా, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే వుంటాడు.  చివరికి లారీతో గుద్దించి తనని చంపాలని చూసినా పట్టనట్టు వుంటాడు. దీనివల్ల కథలో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే పూర్తిగా లోపించి- సీను తర్వాత సీను డైలాగులతోనే సాగిపోతూంటాయి. విజువల్ గా కాకుండా స్క్రీన్ ప్లే  వెర్బల్ గా తయారైంది. అందువల్ల కథనం మందగమనం బారిన పడి, భారంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.
       
గోల్ ఎలిమెంట్స్ లో పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న కోరికతో వున్నాడు
, దీని కోసం పణంగా పెట్టిన తన ప్రాణాల మీద జరగాల్సిన దాడి కూడా జరిగింది, సాక్షులకి ప్రమాదం పొంచి వుందన్న పరిణామాల హెచ్చరికా వాళ్ళని విన్సెంట్ చంపుకుంటూ పోవడంలో వుంది, ఈ మూడు గోల్ ఎలిమెంట్స్ కథలో సోల్ కోసం పనిచేస్తూనే వున్నాయి- కానీ వివేక్ వీటిని ఫీలవక  పోవడంవల్ల భావావేశాలనేవీ పుట్టక- కథకి సోల్ నిల్ అయిపోయింది! ఇలా మిడిల్ విభాగంలో కూడా క్రియేటివ్ యాస్పెక్ట్ ఫెయిలైంది.  కథనానికి వాడిన పోలీస్ ప్రొసీజూరల్ జానర్ మర్యాదల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి. మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గట్టు లేని క్రియేటివ్ యాస్పెక్ట్ ఇది.
       
ఎప్పుడో బిగినింగ్ విభాగంలోనే పుర్రె సాయంతో మృతురాలి రూపం తయారు చేయవచ్చని చెప్పాం. ఆ రూపాన్ని మీడియాలో ప్రచారం చేస్తే ఆమె బంధువులెవరైనా వుంటే గుర్తు పట్టి వచ్చే అవకాశముందన్నాం. అయితే బిగినింగ్ విభాగంలో వేరే విజివల్స్ నుంచి ఆమె స్కెచ్ తయారు చేసినప్పుడైనా మీడియాకి రిలీజ్ చేయాలని అనుకోలేదు. మళ్ళీ ఆ స్కెచ్ పట్టుకుని మిడిల్ లో ఆమె కోసం వేట!  కానీ బిగినింగ్ విభాగంలో చూస్తే
,  రాజన్న ఆత్మహత్య తాలూకు వీడియోని వెంటనే మీడియాలో ప్రసారం చేయించాడు మరి!
       
ఇప్పుడు పై మిడిల్ విభాగంలో రేఖ తాలూకు పూర్తి కథ
, నిందితుల స్వరూపాలూ అన్నీ వెల్లడయ్యాక- నిందితుడు ఫ్రాన్సిస్ అరెస్టుతో మిడిల్ విభాగం ముగిసింది. ఇక్కడ హుక్ ఏమిటంటే రేఖని  చంపిన పుష్పం ఎక్కడుందనేది.

12. ఎండ్ ఏమిటి

రేఖని చంపిన పుష్పం ఇక్కడే వుంది- హాస్పిటల్లో అనారోగ్యంతో బెడ్ మీద- విన్సెంట్ భార్య అలీస్ గా... ఇలా బిగినింగ్ విభాగంలోనే ఈమెని చూశాం కానీ రేఖని చంపిన హంతకురాలని అప్పుడు మనకి తెలీదు. ఇప్పుడు వివేక్ వచ్చేసి విన్సెంట్ కొడుకుని పట్టుకుని- అతడి తల్లిదండ్రులు చేసిన దురాగతం చెప్పేస్తాడు. కొడుకు వెళ్ళి తండ్రి విన్సెంట్ ని నిలదీస్తాడు.  ఇక తప్పించుకోలేని పరిస్థితుల్లో విన్సెంట్ చేసిన నేరం ఒప్పుకుంటాడు- ఒప్పుకుని, అనారోగ్యంతో వున్న భార్య పుష్పం అలియాస్ అలీస్ ని, చట్టపరమైన పరిణామాల్ని ఎదుర్కోకుండా వుండడానికి చంపేసి లొంగి పోతాడు!
       
ఇలా చాలా డ్యామేజీ ఎండ్ విభాగానికి! ఈ ఎండ్ లో కూడా క్రియేటివ్ యాస్పెక్ట్ లోపించింది- పూర్తిగా ముగింపుని దెబ్బకొట్టింది! వివేక్ నేరుగా వెళ్ళి విన్సెంట్ ని ఎదుర్కొని అరెస్ట్ చేసి వుంటే
, రేఖని  చంపిన హంతకురాలు పుష్పం సజీవంగా చట్టానికి దొరికేది. ఆమె సజీవంగా దొరకడం కేసుకి ముఖ్యం! వివేక్ తెలివి తక్కువతనం వల్ల విన్సెంట్ కి చంపేసే అవకాశం దొరికింది. ఆమె చట్టపరమైన పరిణామాల్ని ఎదుర్కోకుండా వుండడానికి చంపేసి తాను భార్యని చంపిన హంతకుడు కూడా పోతాడా? ఇదెక్కడి లాజిక్?
        
వివేక్ విన్సెంట్ కొడుకు ద్వారా విన్సెంట్ కి చెప్పించాలనుకోవడం పూర్తిగా తెలివితక్కువ తనం. మొదట్నుంచీ ఒక విధంగా వివేక్ పాసివ్ క్యారక్టరే. నలబై ఏళ్ళ తర్వాత దొరికిన హంతకురాల్ని చంపేసేలా చేసుకుని కేసుని బలహీన పర్చుకున్నాడు!! రేఖని అంత క్రూరంగా చంపిన పుష్పం ఇప్పుడు చట్టానికి దొరికి కఠిన శిక్ష అనుభవిస్తే ఎలా వుంటుందో ఆమె మొహం చూడాలని మనకే వుంది!
       
ఇంతకీ రేఖ బంధువుల్ని కనుక్కున్నాడా వివేక్ అంటే
, ఎండ్ విభాగం మొదట్లోనే కన్యాకుమారి వెళ్ళి ఆమె అక్కని కలుసుకుంటాడు. ఆ అక్కకి ఇప్పుడు రేఖ అస్థిపంజరం అప్పగించి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఇదీ ముగింపు.
—సికిందర్


Wednesday, December 18, 2024

1360 : స్క్రీన్ ప్లే సంగతులు

    సాధారణంగా సీక్వెల్స్ సక్సెస్ కావు. కానీ పుష్ప సీక్వెల్ అన్ని రికార్డులూ  బ్రేక్ చేస్తూ తెలుగు, హిందీ భాషల్లో సూపర్ హిట్టయిన సీక్వెల్. అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ క్యారక్టర్. పుష్ప-1 తో ఈ క్యారక్టర్, దాంతో అల్లు అర్జున్ నటనా ఎంత సంచలనం సృష్టించాయంటే పాకిస్తాన్ లో సైతం పుష్ప క్యారక్టర్ నటిస్తూ వీడియోలు వైరల్ చేశారు. పుష్పతో అల్లు అర్జున్ ఏం చేశాడంటే, ఒక గబ్బర్ సింగ్ - ఒక పుష్ప మధ్యలో ఇంకెవరూ లేరన్నట్టుగా చరిత్రలో నిలబెట్టేశాడు. కథాకథనాలతో దర్శకుడు సుకుమార్ స్కిల్స్ కి మించి పాత్ర నటించిన అల్లు అర్జున్ స్కిల్సే ఈ రెండు భాగాలుగా వచ్చిన పుష్ప  ఊర సక్సెస్ కి కారణమయ్యాయని చెప్పుకోవాలి.

        'పుష్ప 1 లాగే పుష్ప 2 కథనం కూడా వివిధ పాయింట్లతో వివిధ ఎపిసోడ్ల మయంగా సాగుతుంది. ఎప్పుడైతే వివిధ ఎపిసోడ్లుగా కథనం సాగుతుందో అప్పుడు ఎమోషన్లు ఖతమై  పోతాయి. ఎమోషన్లనేవి ఒకే కథతో, అందులో వుండే ఒకే సమస్యతో, ఆ సమస్యతో వుండే ఒకే పోరాటంతో, ఆ పోరాటంతో వుండే ఒకే పరిష్కారంగా వున్నప్పుడు మాత్రమే బలంగా వుంటాయి. ఈ నిర్మాణంలో వుండేదే కథ. ఇలాగాక వివిధ సమస్యలతో వివిధ పోరాటాలుగా, వివిధ పరిష్కారాలుగా వుంటే అది కథ అన్పించుకోదు, అందులో భావోద్వేగాలు నిలబడవు. ఈ ఎపిసోడిక్ కథనాల్ని కథకాదు కాబట్టి డాక్యుమెంటరీలకి వాడతారు, సినిమాలకి కాదు. అయినా  ఆటోనగర్ సూర్య’, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’, సిటిజన్ వంటి అనేక సినిమాలు ఇలా వచ్చి ఫ్లాపయ్యాయి. డాక్యుమెంటరీలకి వాడే ఈ కథనాన్ని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటారనేది తెలిసిందే. దీని గురించి బ్లాగులో చాలాసార్లు చెప్పుకున్నాం,హెచ్చరించుకున్నాం.

ఎపిసోడిక్ కథనం ఎలా  వుంటుందో పక్కన పటం చూడండి. ఉదాహరణకి- ఆటోనగర్ సూర్య లో డీజిల్ కారు తయారు చేస్తేదాంతో ప్రత్యర్ధుల సంఘర్షణదానికో ముగింపుతర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తేదాంతో ప్రత్యర్ధుల సంఘర్షణదానికో ముగింపుమళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితేఅక్కడ సంఘర్షణదానికో ముగింపూ,  ఇంకాతర్వాతయూనియన్ లో సభ్యత్వ సమస్యతో ఇంకో  సంఘర్షణా దానికో ముగింపూ. మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్యదాంతో సంఘర్షణాదానికో ముగింపూ...ఇలా ఎపిసోడ్లమయంగా సాగే కథనం  స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అయింది. ఇదే పుష్ప 2 లో ప్రత్యక్షమైంది.

సబ్ ఫ్లాట్స్ వేరు, ఎపిసోడిక్ కథనాలు వేరు. సబ్ ఫ్లాట్స్ (ఉప కథలు) వాటి వాటి విడివిడి సమస్య
లతో ప్రధాన కథని డిస్టర్బ్ చేయకుండా సమాంతరంగా సాగుతాయి. ఎపిసోడ్లు అలా కాదు, ఇవి ప్రధాన కథలేకుండా వివిధ ఎపిసోడ్లుగా పైన చెప్పిన విధంగా కథనాలతో వచ్చిపోతూంటాయి.

ఆయితే
పుష్ప2 లో కొత్త విధానం అమలైనట్టుంది- అదేమిటంటే, ఇందులో ప్రధాన కథ వుంది. ఆ ప్రధాన కథని మధ్య మధ్యలో ఆపేస్తూ వేరే సమస్యలతో ఎపిసోడ్లు ప్రారంభమై ముగుస్తూంటాయి. కొన్ని ఎపిసోడ్లకి ఎలివేషన్లు. దీంతో ప్రధాన కథనీ ఫీలవలేక, ఎపిసోడ్లనీ ఫీలవలేక, కేవలం అల్లు అర్జున్ యాక్టింగ్ స్కిల్స్ కోసం ఈ సినిమా చూడాలన్నట్టు తయారయ్యింది. అత్యంత మతిపోయే విషయమేమిటంటే,
ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఈ ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001 లో వార్ హార్స్ఫ్లాపయ్యింది!

1. ఎపిసోడ్లతో విజయవంతమైన ప్రయోగం

    ఇలా వుంటే,  పుష్ప2 తో చెన్నైలో ఇంకో ప్రయోగం చేశారు. సినిమా విడుదలైన మూడోరోజు మల్టీప్లెక్స్ లో షో నడుస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠతో చూస్తున్నారు. గంటన్నర తర్వాత బొమ్మ ఆగి లైట్లు పడ్డాయి. అది ఇంటర్వెల్ అనుకున్నారు. కానీ కాదు, అది ది ఎండ్. తాము చూసింది ఫస్టాఫ్ కాదు సెకండాఫ్ అని అర్ధమై గోల గోలచేశారు. మల్టీప్లెక్స్ నిర్వాహకులు జరిగిన పొరపాటు గ్రహించి ఆందర్నీ కూర్చోబెట్టి ఫస్టాఫ్ వేశారు. ఇది ప్రపంచంలో ఎవరికీ ఎదురుకాని అరుదైన అనుభవం. సెకండాఫ్ చూశాక ఫస్టాఫ్ చూడడం.     ప్రేక్షకులకి తాము చూస్తున్నది ఫస్టాఫ్ కాదని ఎందుకు అర్ధం కాలేదు? ఎందుకంటే ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ గా ముగిసిపోతూంటే ఎందుకొస్తుంది డౌటు. ఇంకేవైనా సందేహాలుంటే సెకండాఫ్ లో తీరుతాయని చూస్తూ కూర్చున్నారు. నాన్ లీనియర్ కథల కాలం కదా? ఇలా ఎపిసోడిక్ కథనం కూడా సక్సెస్ అయిందన్న మాట. అసలు పుష్పా2 లో ఎలా చూపించినా, ఏది చూపించినా, అసలేమీ చూపించకపోయినా అది సక్సెస్సే!

సినిమా అందరూ చూసే వుంటారు కాబట్టి పూర్తి కథ ఇక్కడ ఇవ్వడం లేదు. ఇందులో ప్రధాన కథ, ఎపిసోడ్లు ఎలా సెట్ అయ్యాయో మాత్రమే చూద్దాం.

2. ఎలివేషన్ కి రాంగ్ అడ్రసు

    ఓపెనింగ్ లో జపాన్ కి ఎర్ర చందనం సరఫరా చేసిన పుష్పతో యాక్షన్ సీన్ వస్తుంది. దీంట్లో భాగంగా ఒక మాంటేజ్ : పుష్ప చిన్నప్పుడు తండ్రి నుంచి సంక్రమించాల్సిన ఇంటి పేరు పెట్టుకోలేని బాధ తో కూడిన ఒక ఫ్లాష్ బ్యాక్ (ఈ సమస్య మొదటి భాగంనుంచి క్యారీ  అయింది). నిజానికి ఓపెనింగ్లో దాదాపు 15 నిమిషాలు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ తీసేసినా నష్టమేం లేదు. పైగా సినిమా నిడివి తగ్గుతుంది. నిజానికిది ఓపెనింగ్ లో కాకుండా తర్వాత వచ్చి వుంటే అభ్యంతరముండేదీ కాదేమో. ఎందుకంటే ఓపెనింగ్ లో ఈ ఎపిసోడ్ ని నిజానికి పుష్ప క్యారక్టర్ ఎలివేషన్ సీనుగా అర్ధం జేసుకోవాలి. ఇలాటి ఎలివేషన్ సీన్లు ఫస్టాఫ్ లో ఇంకో రెండున్నాయి. అవి కథనంలో భాగంగా వచ్చాయి కాబట్టి తెలియలేదు. ఇవి ప్రధాన కథ ఫ్లోని దెబ్బ తీశాయన్నది వేరే విషయం. ఇలాగే ఈ ఓపెనింగ్ లో జపాన్ ఎపిసోడ్ కూడా కథనంలో భాగంగా తర్వాత వచ్చి వుంటే సెట్ అయ్యేది. కథనమే ప్రారంభం కాకుండా రావడంతో అది ఎలివేషన్ సీన్ అని అర్ధంగాక విమర్శలొచ్చాయి.

3. విలన్లు కాని విలన్లు


    ఇప్పుడు ప్రధాన కథకి బిగినింగ్ విభాగం (ఉపోద్ఘాతం) వస్తుంది- శ్రీవల్లి (రశ్మికా మందన్న) ని పెళ్ళిచేసుకున్న పుష్ప సంసారం
, భార్య మాటే మంత్రమని భావించే అతడి వ్యక్తిగత క్యారక్టరైజేషన్ వగైరా. పుష్ప మొదటి భాగంలో కూలీగా వున్న పుష్ప ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ బాస్ గా వుండడం చూస్తాం. సిండికేట్ సభ్యులు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకి పట్టుబడితే పుష్ప వెళ్ళి విడిపించడం. అనుచరులని టార్చర్ చేసిన ఎస్పీ భవర్ (భన్వర్ కాదు- Bhanwar అని ఇంగ్లీషు స్పెల్లింగ్ వుంటుంది గానీ హిందీలో పలికేది భవర్ అనే. భవర్ అంటే సుడిగుండం) సింగ్ షేకావత్ కి సవాలు విసురుతూ మొత్తం పోలీస్ స్టేషన్ స్టాఫ్ ని కొనేయడం. తర్వాత సీఎం నరసింహారెడ్డి (ఆడుకాలం నరేన్) దగ్గరికి వెళ్తూ వుంటే ఆయనతో ఫోటో దిగి రమ్మని  భార్య చెప్పడంతో ఆమె మాట కాదనలేని  పుష్ప సీఎం తో ఫోటో దిగాలని కోరితే సీఎం కాదనడం. దీంతో పుష్ప పట్టుదలకి పోయి సీఎం నే పదవిలోంచి దింపేస్తానని ప్రతిన బూనడం వగైరా.

ఇక్కడితో స్క్రీన్ టైమ్ 45 నిమిషాలు గడిచి బిగినింగ్ విభాగం ముగిసి- సీఎం ని దింపేసే పుష్ప గోల్ తో ప్లాట్ పాయింట్ 1 వస్తుంది. ఇలా పుష్ప గోల్ ఏర్పాటయ్యాక దీన్ని అడ్డుకునే ప్రయత్నాలతో సీఎం యాక్టివ్ గా వుండాల్సింది
, కనపడకుండా పోతాడు. అంటే పాసివ్ అయిపోయాడు. పాసివ్ ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షణ ఏం వుంటుంది? సంఘర్షణ లేకపోతే కథేం వుంటుంది? కథ లేకపోతే స్క్రీన్ ప్లే ఏం వుంటుంది? (ఇవి సిడ్ ఫీల్డ్ మాటలు). ఇక్కడ్నించే ప్రారంభమయ్యే మిడిల్ 1 విభాగంతో  పుష్ప వర్సెస్ సీఎం సంఘర్షణగా కథ వేడెక్కి టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ పెంచుకుంటూ పోవాల్సింది అలా జరగలేదు.

పుష్పకి ప్రత్యర్ధి ఎస్పీ భవర్ సింగ్ వున్నాడుగా అన్పించవచ్చు. అతడి గోల వేరే. మొదటి భాగంలో పుష్ప తీవ్రంగా అవమానించాడన్న కోపంతో వ్యక్తిగత కక్ష పెంచుకుని అతను వున్నాడు. అంతేగానీ ఇప్పుడు ప్రధాన కథలో పుట్టిన సంఘర్షణతో అతను మమేకం కాలేదు. అసలు సీఎం మీద పుష్ప కుట్ర చేస్తున్నాడన్న స్పృహ కూడా తనకి లేనట్టే వుంటాడు. ఎంతసేపూ వ్యక్తిగత కక్షే. సీఎం కూడా ఇతడ్ని పిలిచి పుష్ప కుట్రని అడ్డుకోవాలని చెప్పడు. 

    ఇంకా ఈ కథలో ముందు ముందు తెరపైకొచ్చే ప్రత్యర్ధులు వున్నారు. కేంద్రమంత్రి వీరప్రతాప రెడ్డి( జగపతి బాబు), పుష్ప అన్న మొల్లేటి మోహన్రాజ్ (అజయ్), ఇంటర్నేషనల్ స్మగ్లర్ హమీద్( సౌరభ్ సచ్ దేవా), కేంద్రమంతి తమ్ముడి కొడుకు బుగ్గారెడ్డి (తారక్ పొన్నప్ప) మొదలైన వారు. వీళ్ళెవరూ కూడా సీఎం ని గద్దె దింపాలన్న పుష్ప ప్రధాన కథతో కనెక్ట్ అయి వుండరు. ఎవరి కారణాలు వాళ్ళ కుంటాయి.


ఇలా ఒకే ప్రధాన కథ గొడుగు కిందికి రావాల్సిన ప్రత్యర్ధులు చెదిరిపోవడంతో ప్రధాన కథ- దాంతో ఏకధాటిగా ప్రవహించాల్సిన పుష్ప భావోద్వేగాలూ తెగిపోయాయి. అంటే ప్రధాన కథకలో సీఎంని దింపాలన్న ఒక సమస్య ఏర్పాటయ్యాక, సంఘర్షణకి బలాబలాల సమీకరణ జరగలేదు. 'అంధా కానూన్' (చట్టానికి కళ్ళు లేవు) లో ఒక సాంగ్ వుంటుంది: రజనీకాంత్- మాధవిల మీద- 'ఏక్ తరఫ్ హమ్ తుమ్- ఏక్ తరఫ్ సారే'  అని. అంటే ఒక వైపు నువ్వూ నేనూ -ఇంకో వైపు వాళ్ళందరూ అని.  ఇలాగే 'పుష్ప2' లో  -ఒకవైపు నువ్వూ నేనూ(పుష్ప- శ్రీవల్లీ) - ఇంకోవైపు సీఎం, భవర్ సింగ్, మోహన్రాజ్, వీర ప్రతాప రెడ్డి, బుగ్గారెడ్డి తదితర ప్రత్యర్ధులూ అన్న స్పష్టమైన గీత గీసి, ఆటకి రంగాన్ని సిద్ధం చేసే బలాబలాల సమీకరణ జరగలేదు ప్రధాన కథకి.

ఆటకి రంగాన్ని సిద్ధం చేసే ప్లాట్ పాయింట్ వన్ అనేది మొత్తం సినిమా స్క్రీన్ ప్లే అనే మహాసౌధానికి మూలస్థంభం లాంటిదన్నమాట. ఈ మూలస్థంభం బలహీనంగా వుంటే మొత్తం కథ బలహీనమైపోతుంది. సీఎం ని దింపాలన్న లక్ష్యంతో పుష్ప, దీన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతో ప్రత్యర్ధులందరూ నిలబడితే ఎలా వుంటుంది. ఎంత బాగా అర్ధమవుతుంది కథ. భార్యకిచ్చిన మాట కోసం పుష్ప ఈ లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్న డ్రమెటిక్ క్వశ్చన్ ఎంత బలమైన భావోద్వేగంతో కథనానికి తోడ్పడేది? ఇదీ పాయింటు. ప్రత్యర్ధులందరూ కట్టకట్టుకుని ప్లాట్ పాయింట్ 1  దగ్గరే పుష్పకి వ్యతిరేకంగా నిలబడనవసరం లేదు. ముందు సీఎం, భవర్ సింగ్, ఆ తర్వాత మిగతా ప్రత్యర్థులూ సినిమాలో చూపించిన పేసింగ్ తో ఈ పోరాటంలో కలుస్తూంటే చాలు. వెళ్తున్న కొద్దీ ప్రత్యర్ధులు పెరుగుతూంటే పుష్పకి చాలెంజీ ఆరోహణ క్రమంలో పెరుగుతూ పతాక స్థాయికి చేరుకునే క్రమం ఒకటి వుంటుంది.

ఎవరైనా అనుసరించే త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ 



    'పుష్ప' లాంటి హై కాన్సెప్ట్ సినిమాల్ని హాలీవుడ్ లో ఇంతే సింపుల్ స్టోరీ లైను తో తీస్తారు. పాత్ర- లక్ష్యం- సంఘర్షణ- పరిష్కారమనే సింపుల్ స్టోరీలైను మీద అటూ ఇటూ పాత్రల్ని పోగేసి- దాని మీద హెవీ యాక్షన్ ని మౌంట్ చేస్తారు. దీంతో సినిమా వీక్షణ మెదడుకి భారమైపోదు. అదే ఏదేదో కలిపేసి హెవీ కథ తయారు చేసి, దాని మీద మళ్ళీ హెవీ యాక్షన్ ని మౌంట్ చేస్తే రెండూ కలిసి మెదడు తట్టుకోలేనంత భారమై పోతాయి. అదే రోమాంటిక్ కామెడీల్లాంటి చిన్న సినిమాలు యాక్షన్ లేకుండా కథ మీదే ఆధారపడాలి కాబట్టి ఆ కథని సింపుల్ గా వుంచరు- వీలైనంత సంక్లిష్టం చేస్తారు. దీంతో కథలో ఇన్వాల్వ్  అయిపోయి యాక్షన్ లేని లోటు ఫీలవరు ప్రేక్షకులు. ఇదీ హాలీవుడ్ అనుసరించే మూవీ మేకింగ్ సైకాలజీ.

సరే, ఈ సినిమా స్క్రీన్ ప్లేకి  సూత్రాలన్నీ పక్కనబెట్టి సొంత మార్గాన్ని అనుసరించినట్టున్నారు. దీన్ని ఎపిసోడ్లు, ఎలివేషన్లు, ఎక్స్ టెన్షన్లు అని మనం చెప్పుకోవాలి కొత్తగా. ఇలాటి ప్రతిష్టాత్మక భారీ సినిమాలు తీసినప్పుడు పేరున్న ఆ దర్శకుడు మార్గదర్శకుడవుతాడు. ఎవరైనా అతన్ననుసరించి ఇలాగే సినిమాలు తీయొచ్చు. అప్పుడవి నిలబడతాయా? కాబట్టి మార్గదర్శకుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మించాల్సి వుంటుంది. 

4. మిడిల్ 1 ఎపిసోడ్లు
    ప్లాట్ పాయింట్ 1 దగ్గర సీఎం ని దింపాలన్న లక్ష్యంతో వున్న పుష్ప  గోల్ ఏర్పాటయ్యాక- ఇప్పుడు ముందుకెళ్తే మిడిల్ 1 లో కథ ఎలా  వుందో చూద్దాం. సీఎం నరసింహారెడ్డిని దింపి తనతో క్లోజ్ గా వుండే సిద్ధప్ప నాయుడు (రావు రమేష్) ని సీఎం ని చేయాలి. ఇప్పుడు ప్రధాన కథతో సంబంధం లేని మరొక ఎలివేషన్ తో ఒక ఎపిసోడ్ వస్తుంది.  కేంద్రమంత్రి వీరప్రతాప రెడ్డి ని 5 కోట్లు చెల్లించాలని పుష్ప బెదిరించే ఎలివేషన్.  దీని తర్వాత వెంటనే ఇంకో యాక్షన్ ఎలివేషన్. ఇంటర్నేషనల్ స్మగ్లర్ హమీద్ తో  ఎపిసోడ్. ఈ రెండూ పూర్తయ్యాక- ఎస్పీ భవర్ సింగ్ పుష్ప తలపెట్టబోతున్న భారీ స్మగ్లింగ్ ని అడ్డుకునే, ప్రధాన కథతో భవర్ కి సంబంధం లేని ఒక యాక్షన్ ఎపిసోడ్ కాదుగానీ, భవర్ పాత కక్ష కథే. ఈ యాక్షన్ లో సిండికేట్ అనుచరుడ్ని ఇతను చంపడంతో పుష్ప తిరగబడతాడు. దీంతో  ఇద్దరి మధ్యా గొడవలు రూపుమాపడానికి సిద్ధప్పనాయుడు పూనుకుంటాడు. పుష్ప చేత సారీ చెప్పిస్తాడు. సారీ చెప్పిన పుష్ప మళ్ళీ వచ్చి భవర్ బట్టలు విప్పించి ఘోరంగా అవమానిస్తాడు. ఇది ఇంటర్వెల్ సీను. గంటా 40 నిమిషాలకి ఇది వస్తుంది.
       
ఇప్పుడు కూడా నువ్వు  సీఎం ని ఎలా దింపుతావో చూస్తాననడు భవర్. పుష్ప భార్య మాట కోసం సీఎం ని దింపాలన్న లక్ష్యం పెట్టుకున్నాడని అతడికి తెలియనే తెలియదు. మరొకటేమిటంటే
, పుష్పతో సారీ చెప్పించేందుకు వచ్చిన సిద్దప్ప నాయుడే పుష్ప నియమించబోయే సీఎం అని కూడా భవర్ కి తెలియదు. దీనికోసం 100 మంది ఎమ్మెల్యేలని కొనడానికి కావల్సిన 500 కోట్ల రూపాయల కోసమే పుష్ప భారీ ఎత్తున స్మగ్లింగ్ కి తెగబడ్డాడని కూడా భవర్ కి తెలీదు. అతడికి ఈ కథలో ఏం జరుగుతోందో ఏమీ తెలీదు. అయినా కథలో  ప్రధాన విలన్ గా వున్నాడు. అతడికి వున్నదల్లా పాత వ్యక్తిగత కక్ష్ణ తీర్చుకోవాలనే. ఇలా ప్రధాన కథ వదిలేసి ప్రత్యర్ధులందరూ వేర్వేరు లక్ష్యాలు పెట్టుకుంటే ప్రధాన కథేమై పోవాలి. పైగా భవర్ సింగ్ ఈ పాసివ్ నెస్ కి తోడు ఒక జోకర్ లాంటి క్యారక్టర్! ఇలా ప్రధాన కథకి ఒక విలన్ అంటూ లేకుండా పోయిన పుష్ప కి ఇక భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టి పడేసే అవకాశ మెక్కడిది?

5. సెకండాఫ్ - మిడిల్ 2

    భవర్ ని అలా అవమానించిన పుష్ప తిరిగి స్మగ్లింగ్ చేస్తూంటే, దాన్ని విఫలం చేసే యాక్షన్ సీక్వెన్స్ మొదలవుతుంది. అయితే భవర్ పట్టుకున్నది ఎర్రచందనం గాక ఉత్త దుంగలని తెలిసి మళ్ళీ దెబ్బతింటాడు. దీంతర్వాత పుష్ప భార్య గర్భవతి అవడం, ఆడపిల్ల కావాలని కోరుకుంటూ ఆడవేషం వేసుకుని పుష్ప  జాతరలో డాన్సు చేయడం వగైరా వుంటాయి. దీని తర్వాత అన్న మోహన్రాజ్ ఎపిసోడ్. ఇక్కడ పుష్ప ఇంటిపేరు  ప్రస్తావన వచ్చి అతుకుపడుతుంది.  దీని తర్వాత సీఎం నరసింహారెడ్డి దిగిపోవడం, కొత్త సీఎం గా సిద్ధప్ప నాయుడు ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోతాయి. ఇదెలా జరిగిందనేందుకు స్మగ్లింగ్ ఎపిసోడ్ మొదలవుతుంది. భవర్  ని తప్పించుకుంటూ పుష్ప సరుకుని రామేశ్వరానికి తరలించడం, అక్కడ్నించి శ్రీలక బోర్డర్ దాటించడం వగైరా. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలని కొనేసి సీఎం ని దింపేసి సిద్దప్ప నాయుడ్ని సీఎం చేశాడన్న మాట. తర్వాత విందులో కొత్త సీఎం తో ఫోటో దిగి భార్యకి చూపించడం- ఇలా ప్లాట్ పాయింట్ 1 లో
ఒక సీనుతో, ఇప్పుడు రెండు మూడు సీన్లతో ఆషామాషీగా ముగిసిపోయింది ప్రధాన కథ.  తర్వాత భవర్ సింగ్ ఎర్ర చందనాన్ని తగులబెట్టి అందులో భస్మమైపోతాడు. ఈ ప్లాట్ పాయింట్ త 2 తో మిడిల్ ముగిసి ఎండ్ విభాగానికి చేరుకుంటుంది- కథ కాదు- స్క్రీన్ ప్లే. ఇది లీడ్ ఎపిసోడ్.

6. ఎండ్ విభాగానికి లీడ్ ఎపిసోడ్

    ఇప్పుడు పుష్ప అన్న మోహన్రాజ్ కూతురు కావేరీ (కరణం పావని) కిడ్నాప్ తో ప్రధాన కథతో సంబంధం లేని ఇంకో ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఈ కిడ్నాప్ కేంద్రమంత్రి తమ్ముడి కొడుకు బుగ్గారెడ్డి చేస్తాడు. పుష్ప ఈ  అన్నకూతుర్ని కాపాడేక పుష్పని  అతడి అన్న కుటుంబంలో కలుపుకుంటాడు. ఈ అన్నకూతురి పెళ్ళి జరుగుతూంటే ఒక ప్రేలుడు జరిగి పుష్ప మూడో భాగాన్ని సూచిస్తుంది ముగింపు. అంటే ఈ 15 నిమిషాల సుదీర్ఘ ఎపిసోడ్ ని రాబోయే 'పుష్ప3' కోసం లీడ్ గా వేశారన్న మాట!

        ఈ రకమైన స్క్రీన్ ప్లేతో ఎవరైనా ప్రయోగాలు చేస్తే చేసుకోవచ్చు. అయితే దానికి పుష్ప లాటి పాత్రని క్రియేట్ చేయాలి. అల్లు అర్జున్ లాంటి స్టార్ ని నమ్ముకోవాలి. ఇలాటి స్క్రీన్ ప్లేకి ఇదే క్రైటేరియా అన్పిస్తే అనుసరించాల్సిందేతప్పక ! సుకుమార్ కా గ్యారంటీ!

—సికిందర్