రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query చిన్నప్పటి కథ. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query చిన్నప్పటి కథ. Sort by relevance Show all posts

Wednesday, January 1, 2025

1326 : మూవీ నోట్స్


 

మానసిక సంఘర్షణతో కూడిన డ్రామాలు, మాసిక సంఘర్షణతో కూడిన థ్రిల్లర్లు  రెండూ వేర్వేరు జానర్లు. వీటిలో మొదటి దానిలా రెండోది తీస్తే బెడిసి కొడుతుంది. ఒక సమస్యతో తేల్చుకోలేని మానసిక సంఘర్షణగా మొదటిది వుంటే, ఒక సమస్యతో విపరీతంగా ప్రవర్తించడంగా రెండోది వుంటుంది. ఇదీ డ్రామాకీ, థ్రిల్లర్ కీ వున్న తేడా. దర్శకురాలు డాక్టర్ గోగినేని హరిత తీసుకున్నది థ్రిల్లర్ జానర్. అంటే సైకలాజికల్ థ్రిల్లర్. ప్రమాదకరమైన ష్కీజోప్రీనియా అనే మనో వ్యాధి గురించి థ్రిల్లర్. ఈ వ్యాధితో రోగి అఘాయిత్యాలకి పాల్పడొచ్చు. దీనికి చికిత్స లేదు. ఈ జానర్ సస్పెన్సునీ, థ్రిల్స్ నీ, హార్రర్ నీ డిమాండ్ చేస్తుంది. ఈ మూడూ లేకుండా, పోనీ ఒక డ్రామాగా మానసిక సంఘర్షణ కూడా లేకుండా, ‘ఫియర్అనే మూవీ తీస్తే ఇది ఏ కోవకి చెందుతుంది? ఏ కోవకీ చెందని  వ్యర్ధ ప్రయత్నంగా తేలుతుంది. 
     
థ చూస్తే- సింధూ, ఇందూ (రెండు పాత్రలూ వేదిక పోషించింది) అనే కవల పిల్లలు. బాల్యంలో అనుభవమైన ఓ రెండు సంఘటనల కారణంగా సింధూలో ఓ మానసిక రుగ్మత పెరిగిపోతుంది. ఆ రుగ్మత కారణంగా భయభ్రాంతులకి లోనవుతూ వుంటుంది. ఎప్పుడూ ఓ అపరిచిత వ్యక్తి తనని వెంటాడుతున్నట్టు భ్రమిస్తూంటుంది. చిన్నప్పుడు  స్కూల్‌లో సంపత్ (అరవింద్ కృష్ణ) అనే తోటి విద్యార్థికి  క్లోజ్ అవుతుంది. ఇది సింధూ సోదరి ఇందూకి నచ్చదు. అతడికి దూరంగా వుంచాలని ప్రయత్నిస్తూంటుంది. ఇక సంపత్ కనపడకుండా పోయాడని తీవ్ర మానసిక రుగ్మతకి లోనవడంతో మానసిక చికిత్సాలయంలో చేర్పిస్తారు తల్లిదండ్రులు. ఆ మనోవ్యాధిని ష్కీజోప్రీనియాగా నిర్ధారిస్తాడు సైకియాట్రిస్టు (అనీష్ కురువిల్లా). అప్పట్నించీ 13 ఏళ్ళూ ఆమె ఆ చికిత్సాలయంలోనే వుండి పోతుంది. ఇదీ కథ. 
       
ఈ కథలో చిన్నప్పటి ఆ రెండు అనుభవాలేమిటంటే
, అన్నం తినకపోతే ఆమె తల్లి బూచాడు వస్తాడని భయపెడుతుంది. ఆ బూచాడి భయం ఆమెకి దెయ్యంలా పట్టుకుంటుంది. రెండో అనుభవం, సంపత్ గురించి సోదరితో తలెత్తిన టెన్షన్ కారణంగా కోపం వచ్చి ఆమెని నెట్టేస్తే కిందపడి గాయపడింది. దాంతో భయపడిపోయింది. ఈ భయం కూడా కలిసి ఆమె ష్కీజోప్రీనిక్ గా మారిందన్న మాట!
       
బూచాడొస్తాడని భయపెడితే జీవితాంతం ఆ భయంతో బ్రతకడం మనమెక్కడా చూడం.
షోలేలో గబ్బర్ సింగ్ తన గురించి ఇలా చెప్పుకుంటాడు- పిల్లలు నిద్రపోకపోతే తల్లులు నిద్రపో, లేకపోతే గబ్బర్ వస్తాడని భయపెడ్తారని. ఈ లెక్కన ఆ భయపడ్డ పిల్లలందరూ ష్కీజోప్రీనిక్కులవ్వాలి! చిన్నప్పుడు ఇలా భయపెట్టడం యుగాలుగా సాగుతోంది. ఇది ప్రమాదకరమైతే ఎప్పుడో ఆపేసే వాళ్ళు తల్లులనే జీవులు. 
       
తన వల్ల సోదరి గాయపడిన సంఘటన కూడా మనోవ్యాది పుట్టడానికి సరిపోని  కారణమే. ఇలాటి బలహీన కారణాలున్నప్పుడు సంఘర్షణ కూడా బలహీనంగానే వుంటుంది. ఆమె సంఘర్షణ తనని ఎవరో వెంటాడుతున్నాడనే. మరో వైపు సంపత్ కావాలని గొడవ చెయ్యడం. ఆ సంపత్ లేడు
, రాడు, అది నీ భ్రమ అంటూ వుంటాడు సైకియాట్రిస్టు. 
   
ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ కి  డైనమిక్ కథా ప్రపంచం వుండాలి. ఇదే ఇక్కడ మిస్సయ్యింది.  కథనంలో ఎక్కడా సస్పెన్స్, థ్రిల్, టెన్షన్, ఫియర్, పోనీ యాక్షన్ కూడా లేదు. కథ నేలబారుగా ఫ్లాట్ గా సాగుతూంటుంది. ప్లాట్ పాయింట్స్ అనేవి కనిపించవు. కథ సైకలాజికల్ థ్రిల్లర్‌ అయితే, పాత్ర సైకలాజికల్ డ్రామాలో లాగా పాసివ్ గా వుంది. ఎలా మొదలైన పాత్ర అలాగే, అదే వేదనతో కథని ముగిస్తుంది. 
       
ష్కీజోప్రీనియాతో హాలీవుడ్ నుంచి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్లున్నాయి. వాటిని గమనించి ఈ సినిమా తీసినట్టు లేదు దర్శకురాలు.  కథలో విషయం లేకపోగా
, ఈ కథని మూడు టైమ్ లైన్లలో చెప్పడం ఇంకో సమస్య. హీరోయిన్ చిన్నప్పటి టైమ్ లైను, పెద్దయ్యాక రెండు టైమ్ లైన్లు. పెద్దయ్యాక ఈ రెండు టైమ్ లైన్లలో ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది ప్రెజెంట్ అర్ధం కాని కన్ఫ్యూజన్ కూడా!
       
మొదటి సినిమా అనేది ఎన్నో ఏళ్ళు ప్రయత్నాలు చేస్తే నిర్మాతలతో దక్కే ఒక ఛాన్సు. చాలా రిస్కుతో కూడిన ఛాన్సు. దాంతో అన్నీతామే చేయగలమనుకుని అప్పుడే కథ- మాటలు- స్క్రీన్ ప్లేలు అన్నీ రాసేసే మేధావులమనుకుంటే- ఫలితం కూడా ఎలా వుంటుందంటే- మళ్ళీ ఇంకో ఛాన్సు కోసం జీవితాంతం ప్రయత్నిస్తూనే వుండాలి! మొదటి ఛాన్సు మేధావితనాన్ని కోరుకోదు
, అనుభవజ్ఞుల తోడ్పాటుని కోరుకుంటుంది.
—సికిందర్


Thursday, November 28, 2024

1359 : స్క్రీన్ ప్లే సంగతులు

        స్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్ని మాస్ సినిమాల్లాగా మాస్ సినిమా టైటిలే పెట్టి, టెంప్లెట్ లో మెకానికల్ గా తీసేస్తే ముందుగా బలయ్యేది అందులో సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లర్ కథే. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ప్రేక్షకులు సంఘర్షణ, ఉద్రిక్తత, ఉత్కంఠ, ఊహించని మలుపులు, పాత్రకి అధిక రిస్కుతో కూడిన వేగంగా పరుగెత్తే కథనాల కోసం చూస్తారు. ఈ జానర్ బేసిక్స్ కి తోడయ్యే మేకింగ్ టెక్నిక్స్ కోసం, ఇవిచ్చే  ప్రత్యేకానుభవం కోసం కూడా చూస్తారు.  కెమెరా మూవ్ మెంట్స్, సౌండ్ ట్రాక్, ఎడిటింగ్, సెట్స్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ వగైరాలన్నీ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదల ప్రకారం ప్రత్యేకంగా వుంటూ సస్పెన్స్ నాణ్యతని ప్రభావితం చేస్తాయి. వీటన్నిటినీ మూస ఫార్ములా మాస్ జానర్ సినిమా వాషింగ్ మెషీన్ లో వేసి తీశారంటే, ఇక వీటి రూపు రేఖలు మటాష్ అయిపోయి మరేంటోగా తయారవుతాయి సస్పెన్స్ థ్రిల్లరనే సినిమాలు!
        
    విశ్వక్ సేన్ పాపులర్ మాస్ హీరో. మెకానిక్ రాకీ కి ముందు నటించిన 11 సినిమాల్లో ఒకే సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ - ది ఫస్ట్ కేస్ వుంది. మిగిలినవన్నీ మాస్ సినిమాలే. ఇప్పుడు రెండో సస్పెన్స్ థ్రిల్లర్ గా మెకానిక్ రాకీ పోస్ట్ మార్టం కి మన టేబుల్ పైకొచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి విడుదలైన వెంటనే స్క్రీన్ ప్లే సంగతులు రాసేస్తే సస్పెన్స్ అంతా పోతుంది. ఎక్కడికక్కడ సస్పెన్స్ విప్పకుండా భావి రచయితల పరిశీలనార్ధం స్క్రీన్ ప్లే సంగతులు రాయలేం. ఈ కారణంగానే  కాస్త హిట్టయి ఆడుతున్న అనే సస్పెన్స్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే సంగతులు రాయలేదు. ఇలాగాకుండా మెకానిక్ రాకీ విడుదలైన వెంటనే పరాజయ పాలవడంతో స్క్రీన్ ప్లే సంగతులకి అడ్డంకులు తొలగిపోయీ- ఎందుకు విశ్వక్ సేన్ సినిమా పరాజయం పాలైందో తెలుసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తోంది. హిట్ -ది ఫస్ట్ కేస్ లో మాస్ ఎలిమెంట్ల జోలికి పోకుండా సస్పెన్స్ థ్రిల్లర్ (పోలీస్ ప్రొసీజురల్) జానర్ మర్యాదల్ని చాలా వరకూ పాటించినా, అందులో ఫోరెన్సిక్ లాబ్ గురించి ప్రేక్షకులకి బోలెడు చెప్పేయ్యాలన్నట్టు చీటికీ మాటికీ ఓవరాక్షన్ వుంది. మళ్ళీ కథ వచ్చేసి ఎండ్ సస్పెన్స్ కథే. ఇదలా వుంచితే, ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ పేరుతో వచ్చిన ఈ రెండో సినిమా మాస్ మూసలో పడి విజయావకాశాల్ని మరీ ప్రశ్నార్ధకం చేసుకుంది. విశ్వక్ సేన్ ఇక తాను జడ్జి చేయలేని సస్పెన్స్ థ్రిల్లర్స్ జోలికెళ్ళకుండా, మాస్ సినిమాలు చేసుకోవడం మేలేమో అన్పించేలా తయారైంది.

1. ఫస్టాఫ్ స్ట్రక్చరేనా ఇది?

    ఇదో చిత్ర విచిత్ర స్క్రీన్ ప్లే. సెకండాఫ్ లో వచ్చే సస్పెన్స్ కథ నిడివి చాలక అన్నట్టు ఫస్టాఫ్ లో మాస్ కథని అల్లి సెకండాఫ్ కి జోడించినట్టుంది. సినిమా రెండున్నర గంటల నిడివి. ఇందులో ఫస్టాఫ్ లో సర్దుబాటు చేసిన మాస్ కథలోంచి- అక్కడక్కడా ఎదురయ్యే  సెకండాఫ్ సస్పెన్స్ కథకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ని తీసుకుని -సెకండాఫ్ కి కలిపితే రెండుగంటల లోపు కల్తీ లేని సస్పెన్స్ థ్రిల్లర్ తయారైపోయే పరిస్థితి.
       
ఈ మొత్తం కథకి బిగినింగ్ విభాగం ముగిసి
, ప్లాట్ పాయింట్ 1 ఎప్పుడో ఇంటర్వెల్లో గంటా 20 నిమిషాలకి గానీ తీరిగ్గా రాదు. షార్ట్స్ ని/ రీల్స్ ని స్క్రోలింగ్ చేసే నేటి మైక్రో కంటెంట్ ప్రపంచంలో ఇంత తీరిక ఎవరికుంది? మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రీన్ ప్లే రాశారా? కథ కోసం ఇంటర్వెల్ వరకూ ఓపిక పట్టాలా? ప్లాట్ పాయింట్ 1 ఇంటర్వెల్ వరకూ రాక పోవడంతో ఫస్టాఫ్ అంతా విషయం లేనట్టుగా తయారైంది. ఇలా ఫస్టాఫ్ లో చూపించిందంతా కథే అవుతుందా, లేక ప్లాట్ పాయింట్ 1 దగ్గర (ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర) ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతమవుతుందా అన్నది ఆలోచించాలి. ఇలా కథ చెప్పడానికి ఫస్టాఫ్ అంతా ఉపోద్ఘాతమే (బిగినింగ్) సాగదీస్తే ఎంత బడ్జెట్ దుబారా అవుతుంది? స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ స్ట్రక్చర్ కి లోబడి లేకపోవడంతో అసలుకే ఎసరొచ్చింది. కథని ఎంత క్రియేటివ్ గా ఆలోచించినా అది స్ట్రక్చర్లో లేకపోతే 300 కోట్ల రూపాయల కంగువా కూడా బాక్సాఫీసులో కంగు తినాల్సిందే!

 2. టెంప్లెట్ తో థ్రిల్?

    ఈ గంటా 20 నిమిషాలూ రాకీ (విశ్వక్ సేన్) కార్ల మెకానిక్ గా- డ్రైవింగ్ స్కూలు ట్రైనర్ గా  ఇద్దరు హీరోయిన్లతో కొలిక్కిరాని మాస్ ఉపోద్ఘాతమే సాగుతుంది. ఇలా మాస్ అప్పీల్ కోసం కార్ల మెకానిక్ గా చూపించినప్పుడు, ఆ సీన్లు అవే వందలసార్లు చూసేసిన పాత సినిమాల్లో సీన్లలాగే వుండనవసరం లేదు. ఈ పోటీ ప్రపంచంలో అమ్మకపు సరుకులన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెకానిక్ క్యారక్టర్ని ఎందుకు అప్డేట్ చేసి వెండి తెరకి ఇంకా బాగా అమ్మకూడదు? మెకానిక్కుల్ని ఇన్స్పైర్ చేసేలా ఈ రంగంలో కూడా మిలియనీర్లుగా ఎదగ వచ్చని -హై-ఎండ్ లగ్జరీ కార్ల రిపేర్లు, కస్టమ్ మోడిఫికేషన్‌లు, క్లాసిక్ కార్ల రీస్టోరేషన్ లేదా స్పెషలైజ్డ్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్‌ మొదలైన వాటిపై దృష్టి పెట్టి కోట్లు గడిస్తున్న మెకానిక్కుల ఉదాహరణలు కోకొల్లలు. ఇలాటి ఒక మిలియనీర్ మెకానిక్ గా, స్ట్రగుల్ చేస్తున్న మెకానిక్కుల్ని మోటివేట్ చేసేదిగా, విశ్వక్ సేన్ మాస్ పాత్రని ఎందుకు రీబూట్ చేసి రిచ్ గా చూపించకూడదు? ఇలా చేస్తే విజువల్ ప్రెజెంటేషన్స్ పూర్తిగా మార్పు చెంది మాస్ సినిమా కంటికి కొత్తగా అన్పించ వచ్చేమో?
       
ఇక్కడొక ప్రశ్న వస్తుంది. కథ ప్రకారం అతను ఆర్ధికంగా స్ట్రగుల్ చేస్తున్న మెకానిక్ అయివుండాలి. అప్పుడే ఆ గ్యారేజీ వున్న ల్యాండ్ ని కబ్జా చేస్తున్న శక్తులతో పోరాడలేక డబ్బు చెల్లించేందుకు సిద్ధపడగలడు. అప్పుడు దీన్ని మిలియనీర్ మెకానిక్ సెటప్ కి మార్చేస్తే
, మార్కెట్ లో టాప్ పొజిషన్లో వున్న ఈ గ్యారేజీని టేకోవర్ చేయాలని చూస్తున్న ఇంకో కంపెనీ కుట్రగా వుండొచ్చు. ఐటీ, ఈడీ దాడుల ద్వారా అతడ్ని బెదిరించి టేకోవర్ చేసుకునే కుట్ర. దీంతో ల్యాండ్ కబ్జా అనే పాత వాసన, టెంప్లెట్ కథనం వదిలిపోతుంది. పాత వాసనతో, టెంప్లెట్ తో కథనంలో థ్రిల్లేమీ వుండదు!

3. మాస్ ఉపోద్ఘాతం ఇలా!

        ఈ గ్యారేజీలో రాకీ తో బాటు అతడి ఫ్రెండ్ హర్ష (వైవా హర్ష) మెకానిక్ గా వుంటాడు. ఈ గ్యారేజీని పూర్వమెప్పుడో రాకీ తాత ప్రారంభించాడు. ఈ తాత రెడ్డప్ప (విశ్వక్ సేనే!) రాయలసీమ ఫ్యాక్షనిస్టు అనే మరో పాత వాసన. దీంతో మళ్ళీ అవే పాత ఫ్యాక్షన్ సినిమా సీన్లు. ఈ తాత కొడుకైన రామకృష్ణ (నరేష్) కి గ్యారేజీ అప్పగించి పరమపదించాడు. ఈ రామకృష్ణ కాలేజీ నుంచి సస్పెండ్ అయిన కొడుకు రాకీని దద్దమ్మగా పరిగణించి గ్యారేజీ పనిలో పెట్టాడు. ఈ రాకీ కాలేజీలో ప్రియా (మీనాక్షీ చౌదరి) ని ప్రేమిస్తే, కాలేజీ నుంచి సస్పెండ్ అయిన రాకీని ప్రియ దూరం పెట్టింది. ఈ ప్రియ తండ్రి గుండె జబ్బుతో చనిపోతే, ఇంటి బాధ్యత తీసుకోవడానికి ఈమె అన్న శేఖర్ (విశ్వదేవ్ రాచకొండ) నిరాకరించాడు. ఈ శేఖర్  క్రికెట్ కలలతో వుంటూ, ఒక రోజు నగలు అమ్ముకున్నాడని ప్రియ మందలిస్తే, ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంత ట్రాజడీతో వున్న ప్రియా ఓ బిల్డర్ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ తల్లిని
, చెల్లెల్నీ  పోషించుకుంటూ, డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆ గ్యారేజీ రాకీదని తెలియక వస్తే, రాకీకి మళ్ళీ ఈమెతో లైను కలిసింది. అయితే రాకీ దీనికి ముందే మాయా (శ్రద్ధా శ్రీనాథ్) అనే ఇన్సూరెన్స్ ఏజెంటుకి డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు.
       
ఇలావుంటే మరోవైపు
, రంకిరెడ్డి (సునీల్) అనే గ్యాంగ్ స్టర్, రాకీ గ్యారేజీ వున్న స్థలం మీద కన్నేసి వేధిస్తున్నాడు. రాకీ తండ్రి రామకృష్ణకి తీర్ధయాత్రలకి వెళ్ళాలని కోరిక వుంది. ఈ  కోరిక తీర్చేస్తూ తీర్ధయాత్ర ప్లాన్ చేశాడు రాకీ. అయితే రామకృష్ణ ఇక్కడే చనిపోయాడు. ఈ విషయం మాయాకి చెప్పాడు  రాకీ. రంకి రెడ్డికి కట్టాల్సిన 50 లక్షల గురించి కూడా చెప్పా డు. మాయా ఇన్సూరెన్స్ పాలసీలు చెక్ చేసి, రాకీ తండ్రికి రెండు కోట్ల మేరకు పాలసీ వున్న సంగతి చెప్పింది. రాకీకి ఆశ్చర్యమేసింది. అయితే నామినీగా తన పేరుగాక రాజేష్ అనే వేరే  పేరుందని ఆమె చెప్పేసరికి షాకయ్యాడు...

    ఇదీ ఇంటర్వెల్ కి 10 నిమిషాల ముందు వరకూ సాగే ఉప్పోద్ఘాతం టూకీగా. ప్రారంభంలో రెండు సీన్లు తీసుకునే 10 నిమిషాలు తీసేస్తే ఉపోద్ఘాతం నిడివి గంట. ఇంటర్వెల్ కి ముందు పాలసీ ప్రస్తావనకి ముందు వరకూ వచ్చే ఈ ఉపోద్ఘాతమంతా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లోనే వుంటుంది. ఇదంతా ముగిసి పాలసీలో నామినీ గా వేరే పేరు  గురించి వచ్చేసరికీ మొత్తం కలిపి గంటా 20 నిమిషాలూ ఫస్టాఫ్ సాగుతుంది. అంటే గంటా 20 నిమిషాలకి ప్లాట్ పాయింట్ 1 వచ్చి అప్పుడు ఇంటర్వెల్లో కథ ప్రారంభమవుతుందన్న మాట- ఆలస్యం అమృతం విషం లాగ!

4. రెండు మంచి క్రియేషన్లు
    అనేక ఫ్లాష్ బ్యాకులుగా ఈ ఉపోద్ఘాతం ఎలా ఎందుకు ఎవరికోసం మొదలైంది? ఎలా ఎందుకనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో వుంచి, ఎవరికోసం ఉపోద్ఘాతాన్ని ఎవరు చెప్తున్నదీ చూస్తే- డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన మాయాకి రాకీ చెప్తున్నాడు. ఈ ఉపోద్ఘాతం తన పుట్టుక నుంచీ ఇప్పటి వరకూ తన జీవితం గురించే. ఈ ఉపోద్ఘాతానికి (ఉపోద్ఘాతమంటే బ్యాక్ స్టోరీయే) ముందు ఓ రెండు సీన్లు వుంటాయి. ఒకటి- ఒక వర్షపు రాత్రి ఒకింట్లో ఉరేసుకుని ఎవరో ఆత్మహత్య చేసుకునే సీను. ఈ ఓపెనింగ్ సీను లేదా సంఘటన సెకండాఫ్ లో మొదలయ్యే కథకి కేంద్ర బిందువు లాంటిదని తర్వాత తెలుస్తుంది. దీని పర్యవసానంగానే రాకీకి ఓ గోల్ ఏర్పాటయ్యిందని కూడా సెకండాఫ్ లోనే తెలుస్తుంది. కాబట్టి ఈ ఓపెనింగ్ సీను సస్పెన్సుతో కూడిన ఒక మంచి హుక్ గా చెప్పుకోవచ్చు.
       
ఇక దీని తర్వాత వచ్చే రెండో సీను డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయా రాకీ గ్యారేజీకి వచ్చే సీను. ఈ సీను కూడా ఓ మంచి క్రియేషనే. ఎందుకంటే ఈ సీనులో నాలుగు విషయాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి- 1. మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం వెనుక ఆమె పన్నిన ఒక కుట్ర వుంది. ఇది సెకండాఫ్ లో రివీలవుతుంది
, 2. అప్పుడే గ్యారేజీకి ఒకతను వచ్చి గ్యారేజీ మూసేస్తారటగా అంటాడు. శుభమా అని గ్యారేజీ సీనుతో ప్రారంభిస్తూ అప్పుడే గ్యారేజీ మూసేసే మాటేమిటి? ఆలోచింపజేసే సీను. ఈ మాట అప్పటికే రంకిరెడ్డితో నలుగుతున్న సమస్యని దృష్టిలో పెట్టుకుని అన్నది. ఇది కూడా తర్వాత రివీలవుతుంది. అయితే ఈ మాట అనడంతో ఈ గ్యారేజీకి ఏదో ప్రాబ్లం వుందని ప్రేక్షకులకి ఆసక్తి పుడుతుంది, 

3. మాయా తను ఇన్సూరెన్స్ ఏజెంటునని చెప్తుంది. అంటే ఈ రెండో సీనులోనే ఆమె పరిచయం కూడా జరిగిపోయింది. ఇన్సూరెన్స్ ఏజెంటే ఎందుకు? ఎందుకంటే రాకీని ఇన్సూరెన్స్ ఏజెంటుగానే ట్రాప్ చేయబోతోంది, 4. మాయా ఇన్సూరెన్స్ ఏజెంటునని చెప్పడంతో రాకీ ఇంట్రెస్టు చూపక, మనకి బ్యాంకుతో పని అంటాడు. ఇక్కడ మెలిక ఏమిటంటే ఆమె ఇన్సూరెన్స్ ఏజెంట్ అని రాకీకి ముందే తెలుసు. తెలియనట్టు నటించాడు. మనకి బ్యాంకుతో పని అని అనడంలో కూడా అమెకోసం అతను పన్నుతున్న ట్రాప్ వుంది. ఇది కూడా సెకండాఫ్ కథలో వరకూ మనకి తెలీదు.
       
అసలు మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం ఆమె పన్నిన కుట్రలో భాగంగానే జరిగినప్పటికీ
, అసలామెని ఇక్కడికి తన స్కెచ్ ప్రకారమే వచ్చేటట్టు చేశాడు రాకీ. అంటే రాకీని ట్రాప్ చేసే పనిపెట్టుకుని వచ్చిన మాయాకి, రాకీ వేసిన స్కెచ్ ప్రకారమే వచ్చి తనే ఇరుక్కుందని తెలీదన్న మాట1
       
మరొకటేమిటంటే
, మొదటి సీనులో చూపించిన ఆత్మహత్యకి కారకురాలు ఈ మాయే. ఇది కూడా సెకెండాఫ్ లో బయటపడుతుంది. అంటే మాయా ఆల్రెడీ ఒక బకరాని బలితీసుకుని, రెండో బకరాగా బలి చేద్దామని రాకీ దగ్గరికి వచ్చిందన్న మాట. ఒక దాని తర్వాత ఒకటి ఆమెకి కనెక్ట్ అవుతున్న ఈ రెండు సీన్లూ కథనానికి మంచి డైనమిక్స్ ని క్రియేట్ చేశాయి. ఇలా సెకండాఫ్ లో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథకి పనికొచ్చే ఈ ఇద్దరి గేములూ నిగూఢంగా ఇలా ఈ రెండు సీన్లలో ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. ఇందుకే ఇది మంచి క్రియేషన్ అన్నాం.

5. నిల్వ మాస్ మసాలా!

    ఇప్పుడు పై మొదటి రెండు ఇంటలిజెంట్ సీన్ల తర్వాత ఇక మొదలయ్యేదే ఉపోద్ఘాతమనే ప్రేక్షకుల పాలిట శరాఘాతం. ఫ్రిజ్ లోంచి తీసి వేడి చేసిన నిల్వ మాస్ మసాలా. దీని ప్రారంభమే తేడా కొడుతుంది. ఎలాగంటే, డ్రైవింగ్ నేర్చుకోవడానికొచ్చిన  ఆమెకి కారులో తన కథ చెప్పుకుంటూ కూర్చుంటే డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటుంది? డ్రైవింగ్ ఇలాగే నేర్పిస్తారా? ఈ అసహజ సెటప్ తేడా కొట్టింది. ఇలా తన కథ చెప్పుకోవడానికి లీడ్ ఏమిటి? బ్యాంకు పని గురించి అతను ఆందోళనగా వుంటే ఆమె అడిగితే తన కథంతా చెప్పుకొస్తాడు. ఇదీ కల్పించిన లీడ్. కారు పోతూనే వుంటుంది. ఆమె నడుపుతూనే వుంటుంది. అతను ఫ్లాష్ బ్యాకుల మీద బ్యాకులు చెప్తూనే వుంటాడు. ఇలా కారులోనే గంట స్క్రీన్ టైము గడిచాక ఫ్లాష్ బ్యాకులు చెప్పడం పూర్తయి ప్రెజెంట్ టైమ్ లోకొస్తారు.
        
మాది రాయలసీమ, మా తాత కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు... అంటూ చెప్పుకొస్తాడు. ఆ తాత కామెడీగా ఫ్యాక్షన్ దాడిలో గాయపడి హైదరాబాద్ వచ్చేయడం, ఇక్కడ గ్యారేజీ తెరిచి బ్రతికెయ్యడం, చనిపోతూ కొడుకు రామకృష్ణకి గ్యారేజీ అప్పగించడం పూర్తయ్యాక, రామకృష్ణకి రాకీ పుట్టడం దగ్గర్నుంచీ చిన్నప్పటి విశేషాలూ మొదలుకొని కాలేజీ చదువు వరకూ చెప్పుకుంటూ వస్తాడు. ఈ కాలేజీలోనే ప్రియాతో ప్రేమ, ఆమె అన్నతో బాండింగ్ వుంటాయి. ఈ అన్న శేఖర్ తో రాకీ స్నేహం ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది.

    ఇక్కడ ప్రశ్నేమిటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎవరికి చెప్తున్నాడు? తాను స్కెచ్ వేసి ట్రాప్ చేయబోతున్న మాయా అనే ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కి చెప్తున్నాడు. అలాంటప్పుడు ఆమెకి తన తాత ముత్తాతల దగ్గర్నుంచీ చెప్పుకురావాల్సిన అవసరమేమిటి? ఆమె బ్యాంకు పని గురించి దేనికి వర్రీ అవుతున్నావో చెప్పమంది, అప్పుడు రంకిరెడ్డి అనేవాడు గ్యారేజీని కబ్జా చేస్తానని బెదిరిస్తూంటే ఆ డబ్బుకోసం బ్యాంకు లోను ప్రయత్నిస్తున్నానని చెప్తే సరిపోతుందిగా? ఆ రంకిరెడ్డితో ప్రాబ్లంకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ మాత్రమే చెప్పాలిగా? ఇది ఆమెకి కనెక్ట్ అవుతుందిగా? ఆమె చేయబోయే ఫ్రాడ్ ని పసిగట్టే బ్యాంకు పని గురించి మాట్లాడుతున్నాడుగా? సెకండాఫ్ కథలోకెళ్తే అక్కడ ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఆమె రంకిరెడ్డితో అతడి ప్రాబ్లం సహా బ్యాంకు లోను కోసం అతను ప్రయత్నించడం సీక్రెట్ గా ఆమె కనిపెడుతూనే వుందిగా?
       
అంటే ఇక్కడ రాకీ ఆమెకి ఏ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలో అది చెప్పకుండా తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడంటే
, ఇవి  అతను చెప్తున్న ఫ్లాష్ బ్యాక్స్ కావు. తన స్కెచ్ లో భాగంగా ఆమెకి చెప్పేది వుంటే రంకిరెడ్డి ఎపిసోడ్ మాత్రమే చెప్పేవాడు రాకీ. కానీ తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడు. అంటే కథకుడు జోక్యం చేసుకుని, రాకీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం ప్రేక్షకుల కవసరమని ఇలా రాకీ చేత ప్రేక్షకులకి చెప్పిస్తున్నాడు, మాయాకి కాదు. పాత్రల మధ్య కథకుడు జోక్యం చేసుకుంటే ఇంతే- కథ చెడిపోవడమే! ఇందుకే గంట పాటు ఆమెకి అవసరం లేని ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించాడు రాకీ చేత. ఇదెంత రాంగ్ కథనం! దీని వల్ల ఎంత బడ్జెట్ వృధా అయింది?

6. ఇంకా పెద్ద డ్యామేజీ!

    కథకుడు మాయాకి కాక ప్ర్క్షకులకి రాకీ ఫ్లాష్  బ్యాక్స్ చెప్పడంతో ఒక పెద్ద డ్యామేజీ కూడా జరిగిపోయింది కథకి. కాలేజీలో రాకీ సస్పెండ్ అవడంతో ప్రియా బ్రేకప్ చెప్పేసినట్టు పైన తెలుసుకున్నాం. రాకీ తండ్రి రామకృష్ణ తిట్టి, చదువు మాన్పించేసి,  గ్యారేజీ పనిలో పెట్టాడు. అలా మెకానిక్ గా మారిన రాకీ మెకానిక్స్ తో మాస్ గ్రూప్ సాంగ్ వేసుకున్నాడు. సాంగ్ తర్వాత రంకిరెడ్డి నుంచి ప్రాబ్లం మొదలయింది. తర్వాత గ్యారేజీకి అదనంగా డ్రైవింగ్ స్కూల్ ప్రారంచించాడు. రంకిరెడ్డి గ్యాంగ్ మళ్ళీ వచ్చి పడడంతో ఓ ఫైట్ సీను వేసుకున్నాడు. ఇక రాకీ నేరుగా రంకిరెడ్డి దగ్గరికెళ్ళి పోయి మళ్ళీ గ్యారేజీ జోలికొస్తే బావుండదని వార్నింగ్ ఇచ్చాడు.

ఇంతవరకూ రాకీ ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పాక- ప్రియా ఏమైందని మాయా అడుగుతుంది. ఇక్కడే రాకీచేత మహా తప్పులో కాలేయిస్తాడు కథకుడు! ఈ ఫ్లాష్ బ్యాక్స్ ప్రేక్షకులకి చెప్పాలన్న అత్యుత్సాహంతో మళ్ళీ పాత్రల మధ్య జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నాడు కథకుడు! ప్రియా గురించి కూడా ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించేశాడు కథకుడు!!
       
ప్రియా జీవితం
, కుటుంబం, బిల్డర్ దగ్గర ఆమె జాబ్ చేయడం జరిగి డ్రైవింగ్ నేర్చుకోవడానికి తన గ్యారేజీకే రావడంతో తిరిగి కనెక్ట్ అయినట్టు, ప్రేమ కుదిరినట్టు, ఓ డ్యూయెట్ కూడా వేసుకున్నట్టూ చెప్పించేశాడు!
       
ఈ ఉపోద్ఘాతంలో ప్రియా గురించి రాకీ మాయాకి ఇలా చెప్పేస్తూంటే కథ వుండాలా
, కర్సై పోవాలా? ప్రియా తండ్రి మరణించాక, ఆమె అన్న శేఖర్ తో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేసి అతడి ఆత్మహత్యకి కారకురాలైన మాయకే ఇది చెప్పేస్తాడా?
       
కథకుడి అత్యుత్సాహం ఇక్కడితో ఆగలేదు- ఒక రోజు ప్రియా అన్న గురించి అడగాలని ఆమె ఇంటికెళ్ళాడు రాకీ. ఆమె లేదు. ఆమె చెల్లెల్ని అడిగితే ఆమె ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళింది. ఆమె తండ్రి గుండెపోటుతో మరణించాడు. అన్న శేఖర్ కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో
, ప్రియా చిన్న ఉద్యోగంలో జాయినైంది. పని చేయకుండా తిరుగుతున్న శేఖర్ ఆమె డబ్బులు దొంగిలించాడు. తర్వాత నగలు దొంగిలించాడు. ఆమె నిలదీసి కొట్టేందుకు చెయ్యెత్తితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఈ సినిమాకి హుక్ గా వాడుకున్న ఓపెనింగ్ సీను.
       
ఇలా శేఖర్ చావుకి కారకురాలై
, ఇంకో ఎజెండాతో రాకీని ట్రాప్ చేయడానికి వచ్చిన తన ప్రత్యర్ధి- కిల్లర్ మాయకే శేఖర్ ఆత్మహత్యగురించి చెప్పేశాడు రాకీ! ప్రేక్షకులకి కథ తెలియాలని మధ్యలో జోక్యం చేసుకుని కథని పూర్తిగా డ్యామేజీ చేసేసిన కథకుడి అత్యుత్సాహం ఈ నిర్వాకంతో గానీ తీరలేదు!

ఇలా ఇక్కడే పై ఫ్లాష్ బ్యాకులో ప్రియా చెల్లెలి ద్వారా తన మిత్రుడు శేఖర్ మరణం గురించి తెలుసుకున్న రాకీకి గోల్ ఏర్పడింది. దోషిగా మయాని పట్టుకునే గోల్. ఇది రహస్యంగా వుంచి సెకండాఫ్ లో రివీల్ చేశాడు.
       
ఫ్లాష్ బ్యాక్ కొనసాగిస్తూ
, తండ్రిని తీర్ధయాత్రలకి పంపినట్టు కూడా చెప్పిన రాకీ, ఫ్లాష్ బ్యాక్స్ ముగించి - ఆ తండ్రి చనిపోయాడని చెప్తాడు. ఇలా ఉపోద్ఘాతం పూర్తవుతుంది.
       
ఇప్పుడు ప్రెజెంట్ లో కొస్తే
, ఇది స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమే. ఇప్పుడు రాకీ తండ్రి చనిపోయాడని తెలుసుకున్న మాయా ఎలర్ట్ అవుతుంది. ఆమెకి కావాల్సిందిదే. అతడితో ఇన్సూరెన్స్ గేమ్ ఆడుకోవడానికి. ఇలా ఆమెని తన ట్రాప్ లో బిగించాడు రాకీ.
       
ఇప్పుడు గ్యారేజీ గొడవలు పెరిగిపోయి రంకిరెడ్డికి 50 లక్షలిస్తానని రాకీ చెప్పడంతో
, ఆ 50 లక్షలు ఎక్కడ్నించి తెస్తాడో తెలియని రాకీకి- తండ్రి చేసిన రెండు కోట్ల పాలసీ గురించి చెప్తుంది మాయ. కానీ నామినీగా రాకీ పేరు గాక ఎవరో రాజేష్ అని వుందని చెప్తుంది మాయా. దీంతో గంటా 20 నిమిషాల ఫస్టాఫ్ ముగిసి ఇంటర్వెల్ పడుతుంది.

7. ఫస్టాఫ్ తో ప్రాక్టికల్స్?

    ఇంత గజిబిజిగా బారెడు సాగుతూ వున్న పైన వివరించిన ఫస్టాఫ్ ని, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, చప్పున గంటలో ముగిసే స్క్రీన్ ప్లే చేస్తే ఎలా వుంటుందన్న ప్రాక్టికల్స్ కి ఇప్పుడొద్దాం. ఈ ప్రాక్టికల్స్ స్వయంగా ఎవరైనా చేసుకుని, కథనాన్ని ఇంకెలాగైనా మార్చుకుని, ఆల్టర్నేట్ వెర్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు- స్ట్రక్చర్ కి లోబడి.
       
ముందుగా బిగినింగ్ లో
, ఓపెనింగ్ ఆత్మహత్య సీను అలాగే వుంటుంది. తర్వాత గ్యారేజీలో మాయా ఎంట్రీ సీను, కంటెంట్ అలాగే వుంటాయి. తర్వాత మారుతుంది- మాయాకి డ్రైవింగ్ నేర్పుతూ, బ్యాంకు పని గురించి ఆమె అడిగితే, రంకిరెడ్డితో గొడవ గురించి మాత్రమే చెప్తాడు. ఆ పూట ఆమెకి నేర్పడం ముగిస్తాడు. డైనమిక్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రియా పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో వుంటాడు. డ్రైవింగ్ నేర్పుతూ వుంటాడు. ఇక గ్యారేజీలో తండ్రి రామకృష్ణ పరిచయమవుతాడు. రాకీ ఎలా మెకానిక్ అయ్యాడో క్లుప్తంగా సంభాషణ. రంకిరెడ్డితో గొడవ గురించి సీన్లు. రాకీ డ్రైవింగ్ నేర్పుతూ మాయాతో కూడా రోమాన్స్ ప్రారంభిస్తాడు. దీంతో ప్రియాతో గొడవ. ఈ గొడవ, రంకిరెడ్డితో గొడవ ముదిరి పోతాయి- ఇంతలో రాకీ తండ్రి చనిపోతాడు. ఇప్పుడు గ్యారేజీని కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితిలో రంకిరెడ్డికి 50 లక్షలు కట్టాల్సి వచ్చేసరికి- ప్రేమలో పై చేయి కోసం - రాకీ కి హెల్ప్ చేస్తూ అతడి తండ్రి తీసుకున్న రెండు కోట్ల పాలసీ విషయం బయట పెడుతుంది మాయా. అయితే నామినీగా అతడి పేరు లేదంటుంది. దీంతో ఓ 30 నిమిషాల్లో బిగినింగ్ విభాగం (యాక్ట్ 1) ముగుస్తూ ప్లాట్ పాయింట్ 1 వస్తుందన్న మాట.
       
పైన బిగినింగ్ విభాగం బిజినెస్ నియమాల ప్రకారం చూస్తే -1. కథా నేపథ్యం ఏర్పాటు - ఇది సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యపు కథ అని తెలుస్తూనే వుంది
, 2. పాత్రల పరిచయం- ముఖ్య పాత్రలు రాకీ, అతడి తండ్రి, ప్రియా, మాయా, రంకిరెడ్డి పాత్రలు పరిచయమయ్యాయి, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన- గ్యారేజీ స్థలం కోసం రంకిరెడ్డితో గొడవలు, రాకీ తండ్రి మరణం, 4. సమస్య ఏర్పాటు - గొడవలు పరాకాష్టకి కి చేరి 50 లక్షలు కట్టాల్సి వస్తే, రెండు కోట్ల పాలసీ బయటపెట్టి మాయా హెల్ప్ చేయడం. కానీ అందులో నామినీ రాకీ కాకపోవడం.

       
ప్లాట్ పాయింట్ 1 దగ్గర పై సమస్యా ఏర్పాటులో ఆటోమేటిగ్గా రాకీకి గోల్ ఏర్పాటయ్యింది. ఎలాగైనా ఈ రెండు కోట్ల పాలసీ మొత్తాన్ని సాధించి
, రంకిరెడ్డి పీడా విరగడ చేసుకునే గోల్. ఇలా ఇక్కడే ఫస్టాఫ్ అరగంటలో బిగినింగ్ విభాగం ముగిసిపోయి, ప్రేక్షకులు ఎదురు చూసే కథ ప్రారంభమై పోయిందన్న మాట.

8. మిడిల్ -1 సంగతి?

    ఇప్పుడు కథతో ఫస్టాఫ్ మిడిల్- 1 (యాక్ట్ 2 /ఏ) లోకి ఎంటరైతే, పాలసీ డబ్బుల కోసం రాకీ సంఘర్షణ. దీనికి కావాల్సిన కథ ఈ సినిమా సెకెండాఫ్ ప్రారంభం నుంచే వుంది. దాన్ని యథాతథంగా ఇక్కడ వాడుకోవచ్చు : ఇప్పుడు పాలసీలో నామినీగా రాజేష్ పేరుని రాకేష్ గా మార్చే ఉపాయం చెప్తుంది ఇన్సూరెన్స్ ఏజెంట్ మాయా. దీని ప్రకారం మాయా, రాకీ, హర్షవర్ధన్ ని కలుస్తారు. అతను 5 లక్షలు డిమాండ్ చేస్తాడు. రాకీ ఆ 5 లక్షల కోసం ప్రయత్నిస్తూంటే, ప్రియా ఆ డబ్బు ఇచ్చి హెల్ప్ చేస్తుంది. ఆ డబ్బు తీసుకుని పేరు మార్చేస్తాడు హర్షవర్ధన్. ఇప్పుడు పోలీస్ ఇన్స్ పెక్టర్ రోడీస్ రఘు వచ్చేసి హర్షవర్ధన్ ని పట్టేసుకుంటాడు. హర్షవర్ధన్ రాకీనీ, మాయానీ పిలుస్తాడు. రోడీస్ రఘు ముగ్గుర్నీ కలిపి బ్లాక్ మెయిల్ చేస్తాడు. పాలసీ మొత్తంలో 20 శాతం, అంటే 40 లక్షలు తనకివ్వకపోతే ఫ్రాడ్ కేసులో ముగ్గుర్నీ లోపలేస్తానంటాడు. బేరసారాలాడి వారంలో ఈ డబ్బు చెల్లిస్తానంటాడు రాకీ.
       
అతను వెళ్ళిపోయాక
, మాయా- హర్షవర్ధన్-రోడీస్ రఘూ ముగ్గురూ ఇన్సూరెన్స్ స్కామ్ ముఠా అని రివీలవుతుంది. ఇదీ ఇంటర్వెల్. అంటే సినిమాలో సెకండాఫ్ లో 20 నిమిషాలకి వచ్చే ఈ ట్విస్టు వెనక్కి జరిపి ఇంటర్వెల్లో ఇచ్చామన్న మాట.

       
ఇప్పుడు రాకీ ప్రేమిస్తున్న మాయా ఒక మాయలాడి అని ప్రేక్షకులకి తెలిసింది
, రాకీకి తెలీదు. రాకీ ఎప్పుడు తెలుసుకుంటాడా అన్న ఉత్కంఠ ఏర్పడుతోంది. ఇంకా పై కథనంలో ప్రియా, మాయాలతో రోమాంటిక్ టెన్షన్ కూడా రాకీకి పెంచితే అతడికి రోమాన్స్ తో ఎమోషనల్ స్ట్రగుల్, పాలసీ డబ్బులతో ఫిజికల్ స్ట్రగుల్ కూడా ఏర్పడి పాత్రకి ఒక సమగ్రత వస్తుంది.

9. మిడిల్ -2 (యాక్ట్-2/బి)

    ఇప్పుడు సెకండాఫ్ ప్రారంభిస్తే సినిమాలో వున్నట్టుగానే మాంటేజెస్ తో మాయా-హర్షవర్ధన్-రోడీస్ రఘు త్రయం కుట్ర ఎలా పన్నారో రివీలవుతుంది. పబ్ లో ఎంజాయ్ చేయడం, కొత్త బకరా ఎవరని మాట్లాడుకోవడం, మెకానిక్ రాకీ దృష్టిలో పడడం, అతడి కోసం మయా రెక్కీ నిర్వహించడం, డ్రైవింగ్ నేర్చుకోవడానికి రాకీ దగ్గరికి వెళ్ళడం వగైరా.
        
ఈ మాంటేజెస్ తర్వాత కథలోకి వస్తే
, సినిమాలో వున్నట్టుగానే  రోడీస్ రఘు డబ్బు కోసం వొత్తిడి పెంచడం, ఈ నకిలీ ఇన్స్ పెక్టర్ని ఇంకో ఇన్స్ పెక్టర్ అనుమానించడం జరిగి, ఎందుకైనా మంచిది మ్యాటర్ క్లోజ్ చేద్దామని దుష్టత్రయం అనుకోవడం జరుగుతాయి. దీనికి రాకీ ప్రియాని పూర్తిగా మర్చిపోయి, మాయాకి కమిటై పోవడమనే రోమాంటిక్ స్టోరీ ని కలపవచ్చు.
        
ఇప్పుడు సినిమాలో ఉన్నట్టుగానే తీర్ధ యాత్రలకెళ్ళి చచ్చిపోయాడనుకున్న రాకీ తండ్రి బ్రతికి రావడమనే  ట్విస్టు వుంటుంది. పాలసీ డబ్బుల కోసం తనని చంపేసిన రాకీ మీద అతను ఫైర్ అవడం
, ఒక స్కెచ్ కోసమే ఇదంతా చేశానని రాకీ చెప్పడం వగైరా డ్రామా అంతా సినిమాలో ఉన్నట్టుగానే వుంటుంది. ఏమిటా స్కెచ్ అంటే, సినిమాలో వున్నట్టుగానే రాకీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం-
       
ఇందులో తన ప్రాణమిత్రుడు శేఖర్ ని మాయా ఎలా ట్రాప్ చేసిందీ వుంది. శేఖర్ తండ్రి చనిపోయాక  కుటుంబాన్ని పట్టించుకోకుండా శేఖర్ తిరుగుతూంటే
, ప్రియా ఉద్యోగం చేయడం, తండ్రి చనిపోయిన శేఖర్ ని ఇన్సూరెన్స్ పేరుతో మాయా ట్రాప్ చేయడం, తండ్రి తీసుకున్న పాలసీలో నామినీగా అతడి తల్లి బదులు వేరొక ఆవిడ పేరుందని చెప్పడం, పేరు మార్చేందుకు డబ్బులు డిమాండ్ చేయడం, శేఖర్ ప్రియా దాచుకున్న డబ్బు పట్టుకెళ్ళి ఇవ్వడం, ఇప్పుడు ఇన్స్ పెక్టర్ గా రోడీస్ రఘు ఎంట్రీ ఇచ్చి ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేస్తున్నందుకు బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం,శేఖర్ ప్రియా నగలు కూడా పట్టుకెళ్ళి ఇవ్వడం, నగల గురించి ప్రియా మందలించేసరికి శేఖర్ ఆత్మ హత్య చేసుకోవడం వగైరా వున్నాయి.
       
ఇలా ఇప్పుడు ఓపెనింగ్ హుక్ సీనుకి అర్ధం తెలిసింది. అంటే మాయా గురించి రాకీకి ఎప్పుడో తెలుసనీ
, వాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం కోసమే స్కెచ్ వేసి మాయాని తన మీదికి తనే ప్రయోగించుకున్నాడనీ, ఇంటర్వెల్లో చెప్పిన అర్ధానికి వ్యతిరేకంగా రాకీ ఇలా అన్నీ ముందే తెలిసిన వాడిలా రివీలై ఇంకో ట్విస్ట్ ఇస్తే  క్యారక్టర్ ఎలివేట్ అవుతుంది.
        
అంటే బిగినింగ్ ప్లాట్ పాయింట్ -1 లో అతడికేర్పడిన గోల్  నిజమైన గోల్ కాదన్న మాట. అదసలు నిజమైన కథ కూడా కాదన్న మాట. అదంతా - ఇంకా ఇంటర్వెల్ వరకూ కూడా- మాయాని ట్రాప్ చేయడం కోసం అతను అల్లిన కల్పిత కథే అన్న మాట. గ్రేట్ క్యారక్టర్! అసలు నిజ కథ శేఖర్ గురించిన ఈ ఫ్లాష్ బ్యాక్ తోనే. ప్రాణమిత్రుడు శేఖర్ ఆత్మహత్యకి కారణమైన మాయాని పట్టుకోవడమే అసలు గోల్! మాయాతో ప్రేమ కూడా నిజం కాదు. ఆమెని నమ్మించే ఎత్తుగడలో భాగమే అది.
        
ఇలా దీంతో స్క్రీన్ ప్లేకి సంబంధించిన అన్ని  సమస్యలూ సాల్వ్ అయి, ప్లాట్ పాయింట్ 2 కి చేరుకుని, మిడిల్ -2 ముగుస్తుంది.  

10. ఎండ్ విభాగం

    ఎండ్ విభాగం అంటే క్లయిమాక్స్ ని సినిమాలో ఉన్నదున్నట్టు తీసుకోవచ్చు. ఇందులో కథ కోసం తీసుకున్న కాన్సెప్ట్ వెల్లడవుతుంది. పెరిగిపోతున్న వివిధ సైబర్ నేరాల గురించి. వీటికి బలి అవుతున్న ప్రజల గురించి. దొరక్కుండా తప్పించుకుంటున్న మాయా అండ్ కో లాంటి సైబర్ క్రిమినల్స్ గురించి. అయితే ఈ క్లయిమాక్స్ ని సీరియస్ యాక్షన్ తో చూపించకుండా రాకీ తండ్రితో ఫన్నీ – యాక్షన్ కామెడీ చేయడం దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసుకున్న మంచి నిర్ణయం.

సినిమా కథ రాయడం చాలా సులభం. ఎందుకింత గందరగోళం చేసుకుంటారో గానీ, సినిమా కథ స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్. అందుకనే ఈజీ. ఇది గుర్తిస్తే మెకానిక్ రాకీ లాంటి ఆశాభంగాలు కలగవు. ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో ఎవరికైనా సందేహాలుంటే, లేదా సూచనలు చేయదలిస్తే, ఈ క్రింద కామెంట్ బాక్స్ వుంది, వినియోగించుకోగలరు.

—సికిందర్

Tuesday, April 16, 2024

1423 : రివ్యూ

 

రచన -దర్శకత్వం: చిదంబరం
తారాగణం : సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్ జూనియర్, ఖాలిద్ రెహమాన్ తదితరులు
సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం :             షైజూ ఖాలీద్
నిర్మాతలు : సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ
బ్యానర్ : పరవ ఫిలిమ్స్
తెలుగు పంపిణీ : మైత్రీ మూవీ మేకర్స్
విడుదల : ఏప్రిల్ 6, 2024
***
        టీవల రెండు మలయాళం సినిమాలు వసూళ్ళలోనూ సంచలనం సృష్టించాయి.  వాటిలో ఒకటి ప్రేమలు’. ఇది 135 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్ కూడా బాగానే వసూలు చేసింది. అలాగే మంజుమ్మల్ బాయ్స్  230 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్  ఈ రోజు విడుదలైంది. దీని గొప్పదనమేమిటో ఓసారి చూద్దాం...

కథ
కేరళలోని కొచ్చి సమీపంలో మంజుమ్మల్ అనే చిన్న పట్టణానికి చెందిన రెండు స్నేహితుల సమూహాలుంటాయి. వీళ్ళెప్పుడూ తగాదాలు పడి కొట్టుకుంటూ వుంటారు. ఒకర్నిమించిన పనులు మరొకరు చేయాలని పోటీలు పడుతూంటారు. 2006 లో వీళ్ళల్లో ఆర్ట్స్ క్లబ్ గ్రూపు కొడైకెనాల్ విహార యాత్ర ప్లాన్ చేస్తారు. కొడైకెనాల్‌ అంతా తిరిగి ఎంజాయ్ చేశాక, గుణ గుహలు చూడాలని ఉత్సాహ పడతారు. కమలహాసన్ నటించిన గుణ షూటింగ్ ఇక్కడే జరగడంతో గుహల కీ పేరొచ్చింది. ప్రమాదకరమైన ఈ గుహాల్లోకి ప్రవేశాన్ని నిషేధించి  ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ దూకి సాహసం ఛేస్తారు మంజుమ్మల్ బాయ్స్. అలా గుహలు చూస్తూ తిరుగుతూంటే బాయ్స్ లో ఒకడైన సుభాష్ (శ్రీనాథ్ భాసి) మనిషి వెడల్పుగల లోతైన రంధ్రం లో పడిపోతాడు. ఇది ప్రాణాంతక బిలం. ఇందులోకి ఇంతవరకూ 16 మంది పడిపోతే శవాల్ని కూడా బైటికి తీయలేక పోయారు.
       
ఇప్పుడు సుభాష్ పడిపోవడంతో మిత్రబృందం భయంతో కేకలు వేస్తారు. పోలీస్ స్టేషన్ కి పరిగెడతారు. గ్రామస్థులకి చెప్పుకుంటారు. పోలీసులు ఉల్టా కేసు బనాయిస్తారు. కాళ్ళావేళ్ళా పడ్డాక పోలీసు
,లు, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులూ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తారు. తాడు సాయంతో లోపలికి వెళ్ళి బాధితుడ్ని పైకి తీసుకు రావడానికి సిబ్బంది ముందుకు రారు. మంజుమ్మల్ బాయ్స్ లో ఒకడైన కుట్టన్ (
సౌబిన్ షాహిర్) ముందుకొస్తాడు.
       
కుట్టన్ ఈ సాహసం చేయడానికి కారణముంది. ప్రాణాలు పణంగా పెట్టి  స్నేహితుడ్ని కాపాడేందుకు అతను పూనుకోవడానికి ప్రేరేపించిన ఆ కారణమేంటి
? అలా స్నేహితుడ్ని ప్రాణాలతో కాపాడుకోగలిగాడా? ఇందుకు అధికార్లు అందించిన సహాయక చర్యలేమిటి? అసలు వందల అడుగుల లోతులో పడిపోయింది గాక, భారీగా కురిసిన వర్షం నీళ్ళల్లో సుభాష్ బతికున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ. 

యదార్థంతో ప్రయోగం
ఇది యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సర్వైవల్ డ్రామా.  యదార్థ సంఘటనలతో మలయాళంలో వరుసగా మూడు సర్వైవల్ డ్రామాలు హిట్టయ్యాయి. కేరళ వరద బీభత్సం మీద ’2018’ (2023), గుణ గుహల మీద మంజుమ్మల్ బాయ్స్ (2024), సౌదీ వలస కార్మికుడి మీద ఆడు జీవితం (2024).  గుణ గుహలు  అనేవి తమిళనాడులోని కొడైకెనాల్ లో వున్న ఒక గుహల సముదాయం. ఈ సముదాయంలో మనిషి పట్టే వెడల్పుతో లోతైన బిలాన్ని 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి రికార్డు చేశాడు. దీనికి అతను డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. 1991 లో ఇక్కడ కమలహాసన్ సినిమా గుణ షూటింగ్ జరిగినప్పట్నుంచీ ఇది పర్యాటక కేంద్రంగా ఆకర్షించ సాగింది. 2016 వరకూ ఈ బిలంలో పడిపోయిన వ్యక్తుల కేసులు 16 నమోదయ్యాయి. కేవలం మంజుమ్మల్ బాయ్స్ ఘటనలో ఒక్కడే బతికి బయట పడ్డాడు.
       
ఈ సినిమా చూస్తూంటే ఒక సందేహం వెంటాడుతూ వుంటుంది. అంత మంది ఆ రంధ్రం లో పడిపోతున్నప్పుడు ఇనుప మెష్ తో ఆ రంధ్రాన్ని ఎందుకు మూసేయలేదు
? కేవలం అక్కడికి చేరుకోకుండా ఎక్కడో ఫెన్సింగులు మాత్రమే వేసి ఎందుకు వదిలేశారు? ఈ విషయం తట్టే కాబోలు-

సినిమా చివర్లో ఇదే చూపించాడు దర్శకుడు- ఆ రంధ్రం మీద ధడేలుమని ఇనుప మెష్ పడేసి! కానీ క్రోనాలజీ ప్రకారం చూస్తే ఇది కరెక్ట్ కాదు. మంజుమ్మల్ బాయ్స్ ఉదంతం 2006 లోనే జరిగింది. అప్పుడు ధడేలుమని ఇనుప మెష్ పడేస్తే
, 2016 వరకూ ఇంకొన్ని మరణాలు ఎలా జరిగినట్టు? ఇంతకీ ఇప్పుడైనా మూసి వుందా లేదా? ఎవరైనా గూగుల్ చేసి కనుక్కోవాలి.

       
ఈ సర్వైవల్ డ్రామా 2 గంటల పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్. హ్యూమన్ డ్రామా.  అడ్వెంచర్స్ లో ఒక లెసన్. పర్యాటకులు నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతారు
? ఈ గుహల్లో తేళ్ళు పాములైనా వుంటే? నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ ఈ సర్వైవల్ డ్రామా.
        
అందుకే దీన్ని హార్రర్ కామెడీలా తీసి ఎంటర్ టైన్ చేయాలనుకోలేదు. తెలుగు చేతులైతే ఈ పనే చేసి సినిమా తీస్తాయి. వాడు రంధ్రంలో పడిపోయి ఆర్తనాదాలు చేస్తూంటే అక్కడ దెయ్యాల్ని కూడా జొప్పించి కామెడీ చేస్తారు. చివరికి ఏ వేపమండల అమ్మవారి ముందో కాంతారా డాన్సులు చేసి బిలంలో దెయ్యాల్ని చంపి అర్భకుడ్ని కాపాడతారు.

1. క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ (స్టీవెన్ స్పీల్ బెర్గ్ -1977),
2.
 ‘మంజుమ్మల్ బాయ్స్’ (మలయాళం- 2024)
 
బిలం అంతర్భాగాన్ని సెట్ వేసి షూటింగు జరిపారు. ఈ కథని కేవలం బిలంలో పడిపోయిన మిత్రుడి రెస్క్యూ ఆపరేషన్ గా చూపిస్తే ఇది సినిమా అయ్యేది కాదు. డాక్యుమెంటరీ అయ్యేది. ఈ ప్రమాదానికి సమానాంతరంగా  చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ బాయ్సే అప్పటి పిల్ల మూక. వాళ్ళల్లో ఒకడు (సుభాష్) తన మీద ప్రాంక్స్ ప్లే చేసుకుంటూ వుంటాడు. ఆవిప్పుడు బిలంలో పడిపోవానికి సింబాలిక్ గా వుంటాయి. ఇలాటి ఫోర్ షాడోయింగ్ సీన్స్ తో సందర్భానుసారంగా ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఒకసారి అంతా నదిలో దూకేసి ఈత కొడుతూంటారు. సుభాష్ నీ దూకెయ్యమంటారు. భయపడుతూ దూకేసిన సుభాష్ ఏమయ్యాడు? అప్పుడు వాడ్నిఎవరు కాపాడారు. ఇది ఇప్పటి  ప్రమాదంతో ఎలా లింకప్ అయింది? ఇప్పుడు కుట్టన్ రంధ్రంలోంచి సుభాష్ ని కాపాడ్డానికి ప్రేరణ ఏమిటి? లోనైన ఎమోషన్స్ ఏమిటి?

కదిలించే ఎమోషనల్ డ్రామా కూడా ఇది.  ఫ్రెండ్ షిప్ స్టోరీ కూడా. యువనటులతో యూత్ ఆడియెన్స్ పల్స్ ని పట్టుకున్న ప్రయోజనాత్మక సినిమా. నిడివి కేవలం రెండు గంటలు. తారాగణ బలం లేని సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ప్రొడక్షన్ మీద పెట్టారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో వచ్చేదాకా ఆగకుండా బిగ్ స్క్రీన్ మీద చూస్తే దీని బలం పదింతలు తెలుస్తుంది. ఆడు జీవితం తర్వాత బలమైన సినిమా చూడాలనుకుంటే ఇదే.

2024 లో సందర్శకుల్ని ఆకర్షించడానికి గుహకు వెళ్ళే రహదారిని  తిరిగి తెరిచారు. అయితే పర్యాటకుల భద్రత కోసం గుహ ప్రవేశ ద్వారం ఇప్పటికీ మూసివేసే వుంచారు. ఈ సినిమా ప్రారంభ ముగింపుల్లో గుణ లో కమల హాసన్ వెంటాడే పాట ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఇళయరాజా స్వరకల్పనలో వస్తూంటుంది. గుహ బాధితుల్ని పరామర్శిస్తున్నట్టు.

—సికిందర్