రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query చిన్నప్పటి కథ. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query చిన్నప్పటి కథ. Sort by relevance Show all posts

Sunday, June 29, 2025

1382 : స్క్రీన్ ప్లే సంగతులు

 

రచన - దర్శకత్వం : శేఖర్ కమ్ముల
తారాగణం : నాగార్జున, ధనుష్, రశ్మికా  మందన్న, సునైనా, జిమ్ సెర్బ్, దలీప్ తాహిల్,  సాయాజీ షిండే తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : నికేత్ బొమ్మిరెడ్డి
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వరా సినిమాస్, అమిగోస్ క్రియెషన్స్
నిర్మాతలు : సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, అజయ్ కైకాల
విడుదల : జూన్ 20, 2025
***
            లైటర్ వీన్ రోమాంటిక్ సినిమాలకి పేరుబడ్డ దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి  ఏకంగా బిగ్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగార్జున, ధనుష్, రశ్మికా  మందన్న లాంటి ముగ్గురు అగ్ర హీరో హీరోయిన్లతో, భారీ బడ్జెట్ ని వెచ్చించి కుబేర అనే హై కాన్సెప్ట్ మూవీకి తెరతీశారు. అయితే లైటర్ వీన్ రోమాంటిక్స్ కీ, బిగ్ యాక్షన్ మూవీస్ కీ ఏ విషయంలోనూ పోలిక వుండదు. బిగ్ యాక్షన్స్, రోమాంటిక్స్  చాలా భిన్నమైన సినిమాటిక్ అనుభవాల్ని అందిస్తాయి. బిగ్ యాక్షన్స్ ఉత్కంఠరేపే కథలతో, పాత్రలమధ్య వూపిరి సలపని  సంఘర్షణలతో, యాక్షన్ దృశ్యాలతో విజువల్ కథనాలుగా వుంటే, రోమాంటిక్స్ భావోద్వేగ సంబంధాలతో, పాత్రల డెవలప్ మెంట్ తో, వర్బల్ కథనాలతో భావుకతతో వుంటాయి. రోమాంటిక్స్ సంభాషణలతో నడిచే వెర్బల్ కథనాలుగానే  గాకుండా, విజువల్ రైటింగ్స్ తో కూడా వుండొచ్చు గానీ, బిగ్ యాక్షన్స్ డైలాగులతో నడిచే వెర్బల్ కథనాలుగా వుంటే మాత్రం తప్పకుండా కుప్ప కూలిపోతాయి. మరొకటేమిటంటే, రోమాంటిక్స్ కి స్టోరీ రైటింగ్ పని చేస్తే, ఇప్పటి కాలంలో బిగ్ యాక్షన్స్ కి స్టోరీ రైటింగ్ ఏమాత్రం పని చేయని పరిస్థితి వుంది. కనుక బిగ్ యాక్షన్స్ కి స్టోరీ మేకింగే చేయాలి, స్టోరీ రైటింగ్ కాదు. ఈ తేడా గుర్తించక పోతే ఏళ్ళ తరబడీ  రోమాంటిక్స్ తీస్తూ, ఇక పానిండియా బిగ్ యాక్షన్ కి  అప్ గ్రేడ్ అవ్వాలనుకున్న దర్శకుడు -కేవలం తనకున్న బ్రాండ్ నేమ్ తో కొంత వరకూ బాక్సాఫీసుని నెట్టుకు రావచ్చేమో గానీ, ఒక మంచి  బ్లాక్ బస్టర్ ని అందించే అవకాశాన్ని మాత్రం కచ్చితంగా కోల్పోతాడు. కుబేర అనే యాక్షన్ కథతో జరగాల్సింది విజువల్ గా వుండే స్టోరీ మేకింగ్ అయితే, రోమాంటిక్స్ కి పనికొచ్చే అదే వెర్బల్ స్టోరీ రైటింగ్ చేశారు. ఇలా రోమాంటిక్స్ కీ, బిగ్ యాక్షన్స్ కీ కలిపి ఒకే జానర్ మర్యాదలుంటాయనుకున్నట్టుంది.
        
    రెండోది, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ అనేది మానవ మెదడు లోపలి ప్రపంచాల నమూనాకి లోబడి వుంటుంది. అంటే మానవ మెదడులో బలంగా వైరింగ్ అయి వున్న బ్లూ ప్రింట్ తో త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ సరిపోలుతుంది మెదడులో ఈ బ్లూ ప్రింట్ ప్రపంచాన్ని నమూనాగా తీసుకుని హేతుబద్ధీకరించడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఇది కథకులకి తెలిసో తెలియకో దాదాపు అన్ని  స్క్రీన్ ప్లేలలో తప్పనిసరి మోడల్ గా వచ్చి చేరిపోతుంది. కనుక బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే  మూడు అంకాల నిర్మాణం (త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్) లేకుండా స్క్రీన్‌ప్లే రాసినట్టయితే, ప్రేక్షకులు దాన్ని అర్ధం పర్ధం లేనిదిగా, నాన్సెన్సికల్ గా ఫీలయ్యే అవకాశముంటుంది. సినిమాల దాకా ఎందుకు- మనం చెప్పుకునే జోకులు కూడా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనే వుంటాయి.
       
దీన్ని తృణీకరించడంవల్ల స్క్రీన్ ప్లేల్లో పాసివ్ హీరో సిండ్రోమే గాకుండా
, అసలు స్క్రీన్ ప్లేనే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేగా మారిపోయే ప్రమాదం పొంచి వుంటుంది. ఇలా పైన చెప్పుకున్నట్టు క్రియేటివిటీ పరంగా జానర్ మర్యాదల పాలన లేకపోవడంతో బాటు,  స్ట్రక్చర్ పరంగా నియమాల పాలనా లేకపోవడంతో కుబేర మేకింగ్ ప్రాసెస్ కుదేలైంది.
       
దీని స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్ళేముందు రెండు మాటలు- ఈ సినిమా చూసొచ్చిన ఒక అసిస్టెంట్ ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నాడు. కానీ కథ వింటే పాసివ్ హీరో సిండ్రోమ్ లా వుంది. సినిమా చూస్తే మిడిల్ మాటషే అని తేలింది. కథ వింటే పాసివ్ హీరో సిండ్రోమ్ లా అన్పించే స్క్రీన్ ప్లే
,  సినిమా చూస్తే మిడిల్ మటాష్ గా తేలడం కొత్త మోడల్. అంటే మిడిల్ మటాషుల్లో కూడా కొత్త కొత్త మోడల్స్ ప్రారంభమయ్యాయన్న మాట.
       
ఈ స్క్రీన్ ప్లేలో కథ తాలూకు
, కథనం తాలూకు లాజిక్ లేని, కన్విన్స్ కాలేని, కంటిన్యూటీ లేని చాలా చిత్రణ లున్నాయి. వాటన్నిటి జోలికెళ్ళకుండా, ప్రధానంగా మిడిల్ మటాష్ ని దృష్టిలో పెట్టుకుని, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గురించి- అదీ సంక్షిప్తంగా తెలుసుకుని వదిలేద్దాం. ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేదే  స్ట్రక్చర్ లో లేనప్పుడు మిగతా  కథా కథనాలు పరిశుభ్రంగా వున్నాయా లేదా లెక్కలోకి రావు. ముందుగా కథలో కెళ్దాం...

కథ

ముంబాయిలో బడా బిలియనీర్ నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్). ఇతను బంగాళాఖాతంలో 15 ఏళ్ళకి సరిపడా కొన్ని ట్రిలియన్ల మెట్రిక్ టన్నుల చమురు నిక్షేపాల్ని కనుగొంటాడు. ఇది రట్టుకాకుండా, టెండర్ల తతంగం లేకుండా, తనొక్కడు కొట్టేయాలన్న దురాశతో కేంద్రమంత్రితో భేటీ అవుతాడు. ఈ రహస్య పథకంలో సహకరించే భాగస్థులకి పంచేందుకు లక్షకోట్ల రూపాయలు ఆఫర్ చేస్తాడు. ఈ మొత్తాన్ని డెలివరీ చేసేందుకు బినామీ ఎక్కౌంట్లు, విదేశాల్లో షెల్ కంపెనీలూ సృష్టించాలంటాడు.  అయితే దీన్ని ఎవరు హేండిల్ చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు దీపక్ పేరు చెప్తాడు. దీపక్ (నాగార్జున) సీబీఐ అధికారిగా తన కంపెనీలోనే 100 కోట్లు పట్టుకుంటే అతడ్ని కేసులో ఇరికించి జైలుకి పంపాడు నీరజ్. అతడ్ని బయటికి తీసి ఈ పని అప్పజెప్తానంటాడు. కానీ కేసు మాఫీకి దీపక్ ఒప్పుకోడు. తనే కేసు గెలుస్తానంటాడు. అయితే ఏడేళ్ళు శిక్ష పడేసరికి నీరజ్ తో చేతులు కలిపి బయటికొస్తాడు. కుటుంబం కోసం రాజీ పడ్డానంటాడు. నీరజ్ పథకం విని, బినామీల కోసం చూస్తూంటే ఒక బిచ్చగాడు ఎదురవుతాడు. దాంతో నల్గురు బెగ్గర్స్ ని బినామీలుగా పట్టుకొస్తాడు. ఆ నల్గుర్లో దేవా (ధనుష్) ఒక బెగ్గర్.
       
వాళ్ళ పేర్ల మీద బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బు ట్రాన్స్ ఫర్ చేశాక
, ఒక్కొక్కర్నీ చంపడం మొదలెడతాడు నీరజ్. దీంతో ఎదురు తిరుగుతాడు దీపక్. అటు దేవా తప్పించుకుని పారిపోతాడు. అతడి కోసం దీపక్, నీరజ్ గ్యాంగ్ వెంటపడతారు. ఒక రైల్వే స్టేషన్లో బాయ్ ఫ్రెండ్  చేతిలో మోసపోయి ఏడుస్తున్న సమీరా (రశ్మికా మందన్న) కనిపిస్తుంది దేవాకి. పరారీలో వున్న దేవా వల్ల ఆమెకూడా ప్రమాదంలో పడుతుంది. ఇద్దరూ పారిపోవడం మొదలెడతారు. ఈ క్రమంలో దేవా ఏం తెలుసుకున్నాడు, తెలుసుకుని ఏం చేశాడు, సమీరా అతడికెలా తోడ్పడింది, అతన్ని చంపకుండా దీపక్ కాపాడేడా అన్నది మిగతా కథ.

2. స్క్రీన్ ప్లే సంగతులు

ఓ మూడు గంటల నిడివి గల ఈ స్క్రీన్ ప్లేలో మొదటి అరగంట బిగినింగ్ సెటప్ అంతా వుంది. నీరజ్ చమురు కుట్ర పథకం దగ్గర్నుంచీ అందుకు బినామీలుగా నల్గురు బెగ్గర్స్ ని దీపక్ తీసుకురావడం వరకూ. అయితే ఈ బిగినింగ్ బిజినెస్ అంతా వర్బల్ సీన్లతో నిండి వుంది. ముఖ్యంగా దీపక్ కథ. అతను జైలు కెందుకెళ్ళాడో, ఎలా విడుదలయ్యాడో సంఘటనలతో విజువల్ ఇంపాక్ట్ తో  చూపకుండా, సీను తర్వాత సీను డైలాగులతో వర్బల్ గా పేలవంగా కానిచ్చేశారు. శ్రమ లేని దర్శకత్వమన్న మాట. అదే కేసరి 2  లో అక్షయ్ కుమార్ ని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి తీసికెళ్ళే  సీను అతడి కుటుంబం ఆందోళనతో ఒక సంఘటనగా మంచి విజువల్ ఇంపాక్ట్ తో కనిపిస్తుంది. విజువల్ ఇంపాక్ట్ కి సంఘటనలు కావాలి. సంఘటనలే యాక్షన్ మూవీ  జానర్ మర్యాద.
       
అసలు దీపక్ ని ఇరికించిన కేసేమిటో కూడా చూపించక పోతే అతడికి జరిగిన అన్యాయం పట్ల ఎలా రియాక్ట్ అవగలరు ప్రేక్షకులు. కాబట్టి సెటప్ లోనే దీపక్ పాత్ర ఎలాటి ఎమోషనల్ డెప్త్ ని ఫీల్ కానివ్వక డొల్లగా తయారయ్యింది. ఈ డొల్లతనం స్క్రీన్ ప్లే  సాంతం కొనసాగింది. బిగినింగ్ లో స్టోరీ సెటప్పే సరిగా జరక్కపోతే ఆ తర్వాత మిడిల్
, ఎండ్ విభాగాలు స్క్రీన్ ప్లేలో దారీ తెన్నూ లేకుండా పోతాయి.
       
దీనికి తోడు జైల్లో వున్నప్పుడు నీరజ్ ప్రపోజల్ ని కాదన్న తను తర్వాత శిక్షపడగానే కాళ్ళ బేరానికి వచ్చేసినట్టు
, నీరజ్ కి లొంగిపోయి విడుదలై పోవడం పాత్ర చిత్రణకి చావు దెబ్బ కొట్టింది. అసలీ కేసులో బెయిలు మీద బయట వుండక శిక్ష పడే వరకూ జైల్లో ఎందుకున్నాడు. శిక్ష పడిందే అనుకుందాం, అప్పుడు పై కోర్టులో  అప్పీల్ చేసుకుంటూ బెయిల్ మీద బయటికి వచ్చేయ వచ్చు. నీరజ్ కి లొంగనవసరం లేదు. కానీ నీరజ్ సాయంతో విడుదలై బుద్ధిపూర్వకంగా దేశ సంపదతో అతడి భారీ కుట్రలో భాగస్తుడవడమంటే ఎంత దేశ ద్రోహనికి పాల్పడుతున్నట్టు! ఇదా నాగార్జున పాత్రకుండాల్సింది.
       
ఇక కుట్ర కోసం బినామీలని వెతికే ప్రక్రియ. నీరజ్ లాంటి బిలియనీర్స్ కి బినామీలుగా సొంత మనుషులే చాలా మంది దొరుకుతారు. పైగా వేలకోట్ల రూపాయలతో ఈ స్కామ్ చేయడానికి బ్యాంకు అధికారుల్ని కొనేస్తే సరిపోతుందా
? ఇన్ కమ్ టాక్స్, ఈడీ ల దగ్గర్నుంచీ రిజర్వ్ బ్యాంకు వరకూ సంగతి? వీళ్ళకి సమాచారం వెళ్ళకుండా అపగలరా బ్యాంకు అధికారులు?
       
దీపక్ కి బినామీలు దొరకడం కూడా విజువల్ ఇంపాక్ట్ లేకుండా పేలవంగా  కనిపిస్తుంది. ఈ బిగినింగ్ సెటప్ లో ఇంతవరకూ దీపక్ పాత్రే తప్ప దేవా పాత్ర కనిపించదు.  బిగినింగ్ ని సెటప్ చేస్తూ దీపక్కే కనిపిస్తూ వుండడంతో ఇతనే ఈ కథకి హీరో అన్పించేలా వుంటాడు. బినామీలు కావాలని నీరజ్ తో అన్నాక
, దీపక్ కారులో పోతూంటే ఒక బెగ్గర్ కారు దగ్గరికి వచ్చి అడుక్కుంటాడు- అంతే, దీపక్ కి ఐడియా వచ్చేసి వెంటనే వెళ్ళి నీరజ్ కి చెప్పేస్తాడు -బినామీలుగా బెగ్గర్స్ ని పెట్టుకోవాలని!
       
ఇక్కడ కథనంలో రూల్ ఆఫ్ త్రీస్ ని పాటించకుండా స్టోరీ బీట్స్ కి ఇంత తొందర పడ్డంతో జరిగిందేమిటంటే
, విషయం లేకుండా చప్పగా రెండు సీన్లు, అవీ వర్బల్ సీన్లు, రిపి టీషన్. నీరజ్ కి చెప్పి దీపక్ ఇలా వచ్చాడో లేదో, ఎవరో బెగ్గర్ దీపక్ ని అడుక్కోవడంతో థ్రిల్ మిస్సయి చప్పగా తయారైన సీన్లు, ఈ బెగ్గర్ తో వచ్చిన అయిడియాని అక్కడే ఫోన్లో చెప్పేస్తే పోయేదానికి మళ్ళీ నీరజ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల రిపిటీషన్. దీని చిత్రీకరణకి అయిన ఖర్చు.
       
దీపక్ బెగ్గర్స్ ని డిసైడ్ చేసుకోవడానికి తగిన స్పేస్ ఇస్తూ రూల్ ఆఫ్ త్రీస్ ని పాటిస్తే- స్టోరీ బీట్ 1- బినామీల కోసం ఆలోచనలో దీపక్ తిరుగుతున్నప్పుడు తెలిసిన క్రిమినల్స్ ని కలవడం
, ఇది కాదనుకుని, స్టోరీ బీట్ 2 -కొందరు నిరుద్యోగుల్ని కలవడం, ఇది కూడా కాదనుకున్నప్పుడు, స్టోరీ బీట్ 3 -బెగ్గర్ తారసపడ్డంగా, రూల్ ఆఫ్ త్రీస్ గా  కథనం విస్తరించి ఒప్పిస్తుంది.
       
ఇప్పుడు ఇక్కడ ఏ బెగ్గర్ అన్న ప్రశ్న వస్తుంది. దీపక్ ని ఏ బెగ్గర్ అడుక్కోవాలి
? ఎవరో తర్వాత కథలో కనిపించని అనామక బెగ్గర్ తో ఈ సీనుకి ప్రయోజనమేమిటి? కథనమంటే సీనుని ఉత్తేజపర్చే సంఘటనలు కదా? ఏ సంఘటన జరగాలి? దీపక్ కారులో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, ఇప్పుడు తన కథ మొదలెట్టుకుంటూ  సాక్షాత్తూ బెగ్గర్ దేవా వచ్చేసి- అద్ధంలో మొహం పెట్టి చూస్తూంటే అదీ సంఘటన! స్టోరీ మేకింగ్. వైబ్రేషన్ ని పెంచే విజువల్ ఇంపాక్ట్. కథని ముందుకు పరుగెత్తిస్తూ రెండు ముఖ్య పాత్రల ఎన్ కౌంటర్ (ముఖాముఖీ). ఇప్పుడు ఎవరి గోల్ ఏంటి, గేమ్ ఏంటి, గెలుపు ఏంటి- అని కాన్ఫ్లిక్ట్ కి ముఖ్యమైన డ్రమెటిక్ క్వశ్చన్  ఏర్పాటైతే, పాసివ్ పాత్రలుండవు, కథ చుక్కాని లేని నావ అవదు, స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ అవదు...

3. ఒక్క సీనుతో
స్టోరీ మేకింగ్

  పై బిగినింగ్ సెటప్ ని తమ పద్ధతిలో ఇంకా ఇలా కొనసాగించారు... దీపక్ కి ఒక బెగ్గర్ తారసపడ్డంతో వచ్చిన ఐడియాతో నీరజ్ ని ఒప్పించి బెగ్గర్స్ వేటలో పడ్డప్పుడు, తిరుపతిలో బెగ్గర్ దేవా ఓపెన్ అవుతాడు. ఇతడి తోటి బెగ్గర్ ని ఒక కారు తొక్కేసి వెళ్ళి పోవడంతో దాని వెంటపడతాడు. ఆ తోటి బెగ్గర్ చచ్చి పోతాడు. ఇక్కడ రెండు ప్రధానంగా దృష్టి నాకర్షిస్తాయి- ఒకటి, ఈ స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ వచ్చేసి బిలియనీర్ వర్సెస్ బెగ్గర్స్ కథ. అయినప్పుడు బాగా ఖరీదైన కారులో బాగా బలిసిన బాబు తొక్కేసి వెళ్ళిపోవాలి. పాత సినిమాల్లో ఇలాగే చూపిస్తారు. ఇలా జరగలేదు. మామూలు కారుతో నేలబారుగా జరిగింది. ఈ కారు తప్పించుకోవడంతో దేవా ఆగిపోయి దానికేసి రాయి విసిరినప్పుడు బలహీనంగా విసురుతాడు!

రెండు, ఎవరో అనామక బెగ్గర్ పాత్రని కారు తొక్కేసింది. దీంతో కథ తాలూకు కాన్సెప్చ్యువల్ పోరాటానికి బీజం పడలేదు సింబాలిక్ గా. ఓ రిచ్ కారు బిచ్చమెత్తుకుంటున్న దేవానే తొక్కేసి పోతే  కాన్సెప్ట్ సింబలైజ్ అవుతుంది. అంటే ఏర్పాటు చేసిన కాన్సెప్టుకి, బ్యాక్ డ్రాప్ కీ అనుగుణంగా కథనం సాగుతున్నట్టు ఉత్సాహం కలుగుతుంది. ఇలాకాక  ఇక్కడ కూడా ముఖ్య పాత్ర దేవా ఎంట్రీతో బలమైన సంఘటన, విజువల్ రైటింగ్, ఇంపాక్టూ లేకపోతే ఎలా? నాలుగు సీన్ల స్టోరీ రైటింగ్ ని ఒక్క సీనుతో స్టోరీమేకింగ్ చేయొచ్చు. సినిమా మూడుగంటలు అనవసరంగా సాగకుండా బడ్జెట్ ని కంట్రోలు చేయొచ్చు.

4. ఎంతసేపు పాసివ్?

చెప్పుకుంటే  లూజ్ రైటింగ్ చాలా వుంది. పైన చెప్పుకున్నట్టు ప్రధానంగా మిడిల్ మటాష్ ని దృష్టిలో పెట్టుకుని సంక్షిప్తంగా స్ట్రక్చర్ చూద్దాం...పైన బిగినింగ్ సెటప్ లో వివరించుకున్న ప్రకారం దీపక్ నల్గురు బెగ్గర్స్ ని తీసుకురావడంతో, 30 వ నిమిషంలో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయిట్ వన్ వస్తుంది. ఈ టైమింగ్ పర్ఫెక్టుగా వుంది. కానీ ఇది ప్లాట్ పాయింట్ వన్ కాదని ఇంటర్వెల్లో బయటపడుతుంది. అప్పుడింకేం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకూ ఇదే ప్లాట్ పాయింట్ వన్ అనుకుంటూ సినిమా చూస్తూంటాం. మిడిల్ మటాష్ తో జరిగే మాయ ఇదే!
       
ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యలో ఎవరు పడ్డారు
? తను బినామీ అవుతున్నాడని తెలీక దేవా పడ్డాడు. అంటే ఈ కథకి ఇప్పుడు హీరో పాత్ర దీపక్ కాక దేవా అయ్యాడు. అయితే దేవాకీ హీరో పాత్ర కేర్పడాల్సిన - సమస్యని ఎదుర్కొనే గోల్ ఏర్పడలేదు. ఎందుకంటే దీపక్ -నీరజ్ లు కలిసి తమ నల్గురు బెగ్గర్స్ పైన చేస్తున్న కుట్రేమిటో దేవాకి తెలీదు. బలి మేకలా వున్నాడు. కనుక ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంఛీ ఈ కథేమిటో, ఇందులో తను ఇరుక్కుంటున్న సమస్యేమిటో ప్రేక్షకులకి తెలిసి  దేవాకి తెలీక పూర్తి స్థాయి పాసివ్ క్యారక్టర్ అయిపోయాడు! ప్లాట్ పాయింట్ వన్ లో కాన్ఫ్లిక్ట్ ఇలా ఏర్పాటవుతుందా? పోనీ తర్వాత ఇంటర్వెల్లో నైనా తెలుసుకున్నాడా అంటే అదీ లేదు. ప్రేక్షకులకి తెలిసి, పాత్రకి తెలీని విషయం ఏదైనా వుంటే ఇంటర్వెల్ కైనా పాత్ర తెలుసుకోవాలి. పాసివ్ తనాన్ని భరించడానికి ఇంతకి మించి అనుమతి లేదు.
       
సరే
, దేవా పాత్రని చదువురాని, లోక జ్ఞానంలేని, అడుక్కునే అమాయక బిచ్చగాడి పాత్రగానే రూపకల్పన చేశామని కథకుడు చెప్పొచ్చు. దీన్నొప్పుకోవచ్చు. అయితే ఈ అమాయక హీరో పాసివ్ పాత్ర ని ఎంతసేపు తట్టుకుంటుంది కథ? మహా అయితే ఇంటర్వెల్ వరకూ. ఆ పైన తట్టుకోలేదు గాక తట్టుకోలేదు. కుప్పకూలుతుంది. ఇది ఆర్ట్ సినిమానో, వరల్డ్ సినిమానో అయితే పాసివ్ పాత్రే వుంటుంది. తెలుగులో ఆర్ట్ సినిమాలూ వరల్డ్ సినిమాలూ ఆడతాయా? ఇంత బడ్జెట్ వెచ్చించి తీస్తారా? ప్రేమ సినిమాల్లో పాసివ్ హీరో చెల్లిపోవచ్చు. యాక్షన్ సినిమాల్లో జాడించి యాక్టివ్ హీరో పాత్ర వుండాల్సిందే!
       
దీపక్ బెగ్గర్స్ ని పట్టుకొచ్చే ఈ ప్లాట్ పాయింట్ వన్ లో ఎందుకు ఎక్కడ సంతకాలు పెడుతున్నాడో తెలియని దేవా పాత్రతో ఉస్సూరనిపించే పాసివ్ కథనం మొదలైపోతుంది. కాస్సేపటికే నీరజ్ గ్యాంగ్ బెగ్గర్స్ లో ఒకడ్ని చంపేస్తారు. ఇది తెలుసుకున్న దేవా తనకూ చావుతప్పదని పారిపోవడం మొదలెడతాడు. బెగ్గర్ ని చంపిన నీరజ్ నిజరూపం ఇప్పుడు తెలుసుకుని దీపక్ నిలదీసి ఫలితముండదు. నోరెత్తితే ఇరుక్కుంటావని నీరజ్ బెదిరిస్తాడు. దీపక్ మోసపోయానని గ్రహిస్తాడు. ఒకసారి కేసులో ఇరికించిన శత్రువు శత్రువే
, నమ్మి అతడితో చేతులు కలిపితే పరిణామాలెలా వుంటాయో మాజీ సీబీఐ అధికారి దీపక్ కి తెలీనట్టుంది. ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇలా దీపక్ పాత్రచిత్రణ దెబ్బతిని పోతూ వుంటుంది.
       
ఇప్పుడు దీపక్ బాధ్యతేమిటంటే
, ఎక్కౌంట్ లో డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాల్సిన పని మిగిలి వుండగా, పారిపోయిన దేవాని పట్టుకోవడమే. దేవాకి  తను ఏ స్కామ్ లో పనిముట్టుగా ఉపయోగపడ్డాడో తెలియదు, తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాదు. ఎన్టీఆర్ అశోక్ లో ఎన్టీఆర్ పాత్రకి  విలన్ తన మీద ఎందుకు దాడులు చేస్తున్నాడో తెలియదు, తెలుసుకోదు. పారిపోతూ ఆ దాడుల్ని తిప్పికొట్టే యాక్షన్ సీన్సు ని క్రియేట్ చేస్తూ పోవడమే. ఇది పూర్తిగా పాసివ్ క్యారక్టర్ కాదు, ధైర్యంగా దాడుల్ని తిప్పి కొడుతున్నాడు కాబట్టి పాసివ్ -రియాక్టివ్ క్యారక్టర్. ఇది ఫ్లాపయ్యింది.

5. ఫ్లాష్ బ్యాక్స్ సంగతులు
   
దేవా దాడుల్ని తిప్పికొట్టే పని కూడా చేయడు. భయంతో పారిపోతూ వుంటాడు. ఇప్పుడు మధ్యమధ్యలో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ వుంటాయి. ఇవి సెకండాఫ్ లో కూడా కంటిన్యూ అవుతూంటాయి- అనాధగా చిన్నప్పటి కథ పూర్తి చేయడానికి. కానీ చిన్నప్పటి కథలు ఈ రోజుల్లో ఎవరికవసరం. పాపులర్ హీరోని చూద్దామని వచ్చిన ప్రేక్షకులు ఎవరో చైల్డ్ ఆర్టిస్టుని నిమిషాల తరబడీ చూస్తూ కూర్చోవాలనుకుంటారా? ఇక్కడ మనం తెలుసుకోవాలని ఆశించేది బెగ్గర్ అయిన దేవా ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడన్న క్యారక్టర్ డీటైల్స్ గురించి. పాత్ర సమగ్ర పరిచయం గురించి. డబ్బున్న ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడు? బిలియనీర్ నీరజ్ ని చూశాక ఏర్పడిన అభిప్రాయమేమిటి? ఇలా ఒక దృక్పథం (పాయింటాఫ్ వ్యూ) అంటూ కూడా లేకపోవడంతో పాత్ర అర్ధం కాదు. దీని గురించి రెండు ఫ్లాష్ బ్యాకులేసి వుంటే గ్యాప్ వుండేది కాదు.
        
షోలే తీసిన రమేష్ సిప్పీ 1980 లో అమితాబ్ బచ్చన్- శశి కపూర్- శత్రుఘ్న సిన్హా లతో షాన్ తీశాడు. ఇందులో అవిటి బెగ్గర్ పాత్ర కీలకంగా వుంటుంది. నగరంలో దొర ఎవరో, దొంగ ఎవరో, వాళ్ళ గుట్టు మట్లేమిటో డేటా అంతా తన దగ్గర వుంటుందన్న అర్ధంలో పాట ఎత్తుకుని ఎంట్రీ ఇస్తాడు. ఇది యాక్టివ్ బెగ్గర్ పాత్ర. దేవా పాత్రేనా?

6. ఇంటర్వెల్లో బయటపడే నిజం
పారిపోతున్న దేవా నైతికంగా కూడా విఫలుడు. తనకి తన ప్రాణాలే తప్ప ఇంకా తోటి బెగ్గర్స్ ప్రాణాలూ ముఖ్యమని ఫీలవ్వడు. దీనికి కారణం ఈ నల్గురు బెగ్గర్స్ మధ్య బాంధవ్యాన్ని చూపకపోవడం. ఈ బాంధవ్యంతో దేవాని మిగిలిన ముగ్గురి నాయకుడుగా ఎస్టాబ్లిష్ చేసి హైలైట్ చేయకపోవడం. ఎక్కడ ఏ స్టోరీ బీట్ పడితే కథాకథనాలు, పాత్రలూ ప్రకాశిస్తాయో తెలుసుకోక పోవడం.
        
అలా పారిపోతున్న దేవా దీపక్ ని కాంటాక్టు చేయడానికి ప్రయత్నిస్తూంటాడు. తనని దీపక్కే కాపాడాలి. అప్పుడు రైల్వే స్టేషన్లో సూసైడ్ చేసుకోబోతూ సమీరా కనిపిస్తుంది. ఈమెదో కథ. ఇక ఈమెతో ట్రావెల్ అవుతాడు. ఇప్పటికీ అరగంట బిగినింగ్ సెటప్ తర్వాత, ఈ పారిపోవడాలతో మిడిల్ -1 ఇంకో గంట గడిస్తే గానీ గంటన్నరకి ఇంటర్వెల్ రాదు! అంటే ఈ గంట సేపూ దేవా పారిపోతూ వుండడమే, అతడ్ని దీపక్ వెతకడమే కథ. మధ్యలో దేవాని చంపేందుకు నీరజ్ గ్యాంగ్. ఇంటర్వెల్లో ఈ గ్యాంగ్ కి చిక్కుతాడు. ఎలాగో ప్రాణాలతో బయటపడి సమీరా ఇంటికి చేరుకోవడంతో ఇంటర్వెల్.
        
ఇప్పుడు గానీ ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ కాబోతోందని మనకి తెలీదు. ఎందుకంటే దేవాకీ ఇంటర్వెల్లో కూడా కథ ఏమిటో తెలీదు, తన సమస్యకి మూలమేంటో తెలీదు, చేయాల్సిన అసలు పోరాటమేంటో తెలీదు, గోల్ తెలీదు!
        
కాబట్టి వెనుక చూపించిన బిగినింగ్ సెటప్ లో అది ప్లాట్ పాయింట్ వన్ కాదని ఇప్పుడు తెలుస్తుంది. అంటే మొదట్నుంచీ ఇంటర్వెల్ దాకా సాగింది బిగినింగ్ సెటప్పే. మిడిల్ 1 లో ఇంకా పడలేదు కథ. అంతేగాక, ఇప్పుడు ఇంటర్వెల్లోనైనా గోల్ ఏర్పడలేదంటే ఇంటర్వెల్లో కూడా ప్లాట్ పాయింట్ వన్ రాలేదు! అంటే ఇంకా బిగినింగ్ సెటప్పే సెకండాఫ్ లో కూడా సాగుతుంది! అంటే ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ కింద జమ అవబోతోంది! మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు ఇంటర్వెల్ వరకూ ఇలా మనల్ని మభ్యపెడతాయి!

7. సెకండాఫ్ సంగతులు

    సెకండాఫ్ ప్రారంభిస్తే దేవాకోసం అదే వెతుకులాట, దేవా పారిపోవడం, మధ్యమధ్య చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకులు. ఇలా 20 నిమిషాలు సాగిసాగి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పు కుంటే, ఆ ఎస్సై వివరాలు అడిగి తెలుసుకుని దేవా బినామీ అని చెప్తాడు. ఇలా ఎస్సై చెప్తే తప్ప నీరజ్ చేస్తున్న స్కామ్ గురించి, అందులో తన పాత్ర గురించీ దేవాకీ తెలియలేదంటే ఇంకా పక్కా ఏమీ చేతకాని పాసివ్ క్యారెక్టరే నన్న మాట. ఇప్పుడైనా స్వయంగా కూపీ లాగి తెలుసుకుని వుంటే యాక్టివ్  క్యారక్టర్  అయ్యేవాడు.
        
ఇక మళ్ళీ ఛేజ్, పారిపోవడాలూ. పారిపోయి పారిపోయి మొత్తానికి దీపక్ ని కాంటాక్టు చేయగల్గుతాడు. ఇప్పటికీ ఇంకో 25 నిమిషాలు వృధాగా గడిచిపోతాయి. తాను బినామీ అని ఎస్సై ద్వారా తెలుసుకున్నాక ఇప్పుడు యాక్షన్ లోకి దిగి దీపక్ ని కాంటాక్టు చేస్తాడు.
        
ఫోనులో దీపక్ కి డిమాండ్ పెడుతూంటే, అది నీరజ్ కూడా విని ఫైర్ అవడంతో దేవాకి- నీరజ్ తో కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు మొదలవుతుంది!  అంటే ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ అన్న మాట! ప్లాట్ పాయింట్ వన్ ఇప్పుడొచ్చిందన్న మాట! సినిమా ప్రారంభమయ్యాక ఫస్టాఫ్ గంటన్నరా గడిచిపోయి- సెకండాఫ్ లో ఇంకో 50 నిమిషాలూ గడిస్తే గానీ ప్లాట్ పాయింట్ వన్ రాలేదన్న మాట. ఈ మొత్తం రెండు గంటల 20 నిమిషాల వరకూ మనం చూసిందంతా బిగినింగ్ సెటప్పే నన్న మాట! ఎప్పుడో ఫస్టాఫ్ లోనే అరగంట లోపు ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేయాల్సిన బిగినింగ్ సెటప్ ఇంటర్వెల్ కూడా దాటుకుని రెండు గంటల 20 నిమిషాల వరకూ అన్యాయంగా, అక్రమంగా  సాగిందన్నమాట!
        
అంటే ఈ రెండు గంటల 20 నిమిషాలూ కథ ప్రారంభంగాక, కేవలం ఉపోద్ఘాతమే సాగిందన్న మాట. ఇప్పుడు ఇక్కడ్నుంచీ దేవా గోల్ తో కథ ప్రారంభమై మిడిల్ 1 మొదలవుతుందన్న మాట! సినిమా మొదటి అరగంటలో దేవా గోల్ తో మొదలవ్వాల్సిన మిడిల్ 1,  చివరి అరగంటలో మొదలైందన్న మాట! మరి మిడిల్ 2, ఎండ్ విభాగాల పరిస్థితేంటి?

8. తెలుగులోనే ఈ చరిత్ర

కిక్ 2, సాహో, ఊపిరి, భాగమతి, డియర్ కామ్రేడ్, బుల్లెట్, కవచం,, లవర్, రంగులరాట్నం, ముఖచిత్రం...ఇవీ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలతో వచ్చి ఫ్లాపయిన ఎన్నో సినిమాల్లో కొన్ని. కుబేరా 100 కోట్లు గ్రాస్ దాటినట్టు తెలుస్తోంది. మంచిదే. ముందుగా చెప్పుకున్నట్టు ఇది శేఖర్ కమ్ముల బ్రాండ్ నేమ్ ప్రభావం. శేఖర్ కమ్ముల సినిమా అంటే క్లాస్ కూడా బాగా వెళ్ళి చూస్తారు. ఇది ప్లస్ అయివుంటుంది. అయినంత మాత్రాన లోపాలు చెల్లిపోయినట్టా? చెల్లిపోయాయి  కాబట్టి ఇవి లోపాలే కావని ఇలాగే మళ్ళీ సినిమాలు తీయవచ్చా? తీయవచ్చు, ఎవరు కాదంటారు? శుభ్రంగా ఇలాగే మిడిల్ మటాషులు తీసుకోవచ్చు.
       
విషయానికొస్తే
, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ నమూనా పై  పటంలో లా వుంటుంది. 25 శాతం బిగినింగ్, 50 శాతం మిడిల్ 1, మిడిల్ 2, ఇంకో 25 శాతం ఎండ్. అంటే 1:2:1 అన్నమాట. బిగినింగ్ 25శాతం దగ్గర ప్లాట్ పాయింట్ వన్, మిడిల్ 1, మిడిల్ 2 మధ్య ఇంటర్వెల్, సెకండాఫ్ లో మిడిల్ 2 పూర్తయిన 50 శాతం దగ్గర ప్లాట్ పాయింట్ టూ, తర్వాత ఎండ్.

మిడిల్ మటాష్ లో ఏం జరుగుతుందో పక్క పటం చూడండి. 25 శాతం వుండాల్సిన బిగినింగ్, ఫస్టాఫ్ ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ ని దురాక్రమించి, మిడిల్ 1, మిడిల్ 2 లని మింగేస్తూ సాగుతుంది. అంటే సుమారు 75 శాతం బిగినింగే వుంటుంది. ఈ సినిమా 180 నిమిషాల్లో (3 గంటలు) 140 నిమిషాలూ బిగినింగే సాగింది! ఈ 75 శాతం పోగా మిగిలిన 25 శాతంలో మిడిల్ 1, మిడిల్ 2, ఎండ్ ఇరుకిరుకుగా సర్దుకుంటాయి! అంటే ఈ 25 శాతంలోనే ప్లాట్ పాయింట్ వన్ తో మిడిల్ 1, మిడిల్ 2 ఏర్పడి, తర్వాత ఇందులోనే ప్లాట్ పాయింట్ 2 వచ్చి, ఎండ్ కెళ్తుందన్న మాట! ఈ 25 శాతంలోనే కాన్ఫ్లిక్టు కథ క్లైమాక్స్ అన్నీ మనం చూసుకోవాలన్న మాట. పూర్తి టికెట్ డబ్బులు తీసుకుని 25 శాతం మాత్రమే సినిమా చూపిస్తున్నారన్న మాట! బడ్జెట్ అంతా 75 శాతం డొల్ల మీదే వెచ్చిస్తున్నారన్న మాట!
        
ఇలా స్క్రీన్ ప్లేల్లో  మొత్తం మిడిల్ అంతా మటాష్ అవుతోంది కాబట్టి మిడిల్ మటాష్ అని పేరు పెట్టాల్సి వచ్చింది. దీనికి ఇంగ్లీషులో పేరు లేదు. ఎందుకంటే హాలీవుడ్ లో సినిమాలు ఇలా తీయరు. తెలుగులోనే ఈ తెగులు. ప్రతీ మిడిల్ మటాష్ సినిమాతో ఇదే జరుగుతోంది. అయినా తెలుసుకోవడం లేదు. బిగినింగ్ సెటప్పే కథ అనుకుంటూ 75 శాతం అశ్వమేధ యాగం చేస్తున్నారు.

9. మరేం చేయాలి ?

సెకండాఫ్ లో రెండు గంటల 20 నిమిషాలకొచ్చిన ప్లాట్ పాయింట్ వన్ ని వెనక్కి తెచ్చి ఇంటర్వెల్లో ఏర్పాటు చేయాలి. అప్పుడు కనీసం ఇంటర్వెల్లో నైనా కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెకండాఫ్ ప్రారంభిస్తే  మిడిల్ 1, మిడిల్ 2, ఎండ్ లకి కాస్త ఊపిరి పీల్చుకోదగ్గ స్పేస్ ఏర్పడి కథ బ్రతికే అవకాశముంటుంది. సినిమాలో రెండు గంటల 20 నిమిషాల కొచ్చిన ప్లాట్ పాయింట్ వన్ తో దేవా ఫోన్ చేసి డిమాండ్ చేస్తాడు. బెగ్గర్స్ కి పంచడానికి 10 వేల కోట్లు కావాలని అలజడి సృష్టిస్తాడు. దీన్నే ఇంటర్వెల్ కి జరిపి ఎస్టాబ్లిష్ చేస్తే 1. ఇంటర్వెల్లో దేవా యాక్టివ్ క్యారక్టర్ అవుతాడు, 2. విలన్ నీరజ్ తో ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది, 3. దేవాకీ 10 వేల కోట్లు వసూలు చేయాలన్న గోల్ ఏర్పడుతుంది, 4. ఇంటర్వెల్లో కథేమిటో ప్రేక్షకులకి అర్ధమవుతుంది.
        
కానీ యాక్షన్ మూవీకి ఇంత లైటర్ వీన్ కాన్ఫ్లిక్ట్ పని చేయదు. 10 వేల కోట్లు డిమాండ్ చేయడం  స్ట్రాంగ్ పాయింటు కాదు. ఈ పాయింటుకి క్యారక్టర్ లోంచి ఎదురు చూడని పర్సనల్ సీక్రేట్ ఏదో రివీలైతే ఇంటర్వెల్ కి కాన్ఫ్లిక్ట్ తో వచ్చే బ్యాంగ్ వేరే వుంటుంది.
       
ముంబాయిలో ఓ బెగ్గర్ విషయం బయట పడింది. అతను ప్రపంచంలోనే రిచెస్ట్ బెగ్గర్! అతడికి ముంబాయిలో రెండు ఫ్లాట్లున్నాయి. అతడి నెట్ వర్త్ 7. 5 కోట్లు. బెగ్గింగ్ ద్వారా నెలకి 75 వేలు సంపాదిస్తాడు. ఇప్పటికీ బెగ్గింగ్ చేస్తున్నాడు. ప్రపంచం మారిపోయింది... ఫిలిం రీళ్ళ కాలం  నాటి కథలు
, పాత్రలు ఈ డిజిటల్ యుగంలో అంతగా రాణించవు.

10. జానర్ మర్యాదలు

త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో అంకాల నిష్పత్తుల వారీ స్పష్టమైన విభజన కథని ప్రేక్షకులు సులభంగా జీర్ణించుకోవడానికి, అర్థం చేసుకోవడానికీ వీలు కల్పిస్తుంది. పాత్రల్ని ఫాలో అయ్యేలా చేస్తూ, ప్రేక్షకుల్ని ఒక భావోద్వేగ ప్రయాణంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కథలు ప్రేక్షకుల్లో ఆక్సీటోసిన్, డోపమైన్, ఎండార్ఫిన్లు వంటి హార్మోన్ల విడుదలని ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ల విడుదల ప్రేక్షకుల్ని ఉత్తేజపర్చడానికీ, సానుభూతిని రేకెత్తించదానికీ, బలమైన భావోద్వేగాల్ని సృష్టించడానికీ తోడ్పడతాయి.

యాక్షన్ మూవీ జానర్ మర్యాదల విషయానికొస్తే, హీరోయిజం, దాంతో ధైర్యసాహసాలు, దాంతో హై-ఆక్టేన్ ఉర్రూతలూగించే బలమైన సంఘటనలు, పోరాటాలు, పేలుళ్ళు, హింస, పాత్రల్లో కథలో అడుగడుగునా సస్పెన్స్, థ్రిల్స్, మలుపులు, ఉత్కంఠ, కథనంలో వేగం, సంభ్రమపర్చే సన్నివేశాలు, పాత్రలు కలర్ఫుల్ గా వుండడానికి హాస్యం మొదలైన ఎలిమెంట్స్ తో కూడి వుంటాయి.
—సికిందర్


Wednesday, January 1, 2025

1326 : మూవీ నోట్స్


 

మానసిక సంఘర్షణతో కూడిన డ్రామాలు, మాసిక సంఘర్షణతో కూడిన థ్రిల్లర్లు  రెండూ వేర్వేరు జానర్లు. వీటిలో మొదటి దానిలా రెండోది తీస్తే బెడిసి కొడుతుంది. ఒక సమస్యతో తేల్చుకోలేని మానసిక సంఘర్షణగా మొదటిది వుంటే, ఒక సమస్యతో విపరీతంగా ప్రవర్తించడంగా రెండోది వుంటుంది. ఇదీ డ్రామాకీ, థ్రిల్లర్ కీ వున్న తేడా. దర్శకురాలు డాక్టర్ గోగినేని హరిత తీసుకున్నది థ్రిల్లర్ జానర్. అంటే సైకలాజికల్ థ్రిల్లర్. ప్రమాదకరమైన ష్కీజోప్రీనియా అనే మనో వ్యాధి గురించి థ్రిల్లర్. ఈ వ్యాధితో రోగి అఘాయిత్యాలకి పాల్పడొచ్చు. దీనికి చికిత్స లేదు. ఈ జానర్ సస్పెన్సునీ, థ్రిల్స్ నీ, హార్రర్ నీ డిమాండ్ చేస్తుంది. ఈ మూడూ లేకుండా, పోనీ ఒక డ్రామాగా మానసిక సంఘర్షణ కూడా లేకుండా, ‘ఫియర్అనే మూవీ తీస్తే ఇది ఏ కోవకి చెందుతుంది? ఏ కోవకీ చెందని  వ్యర్ధ ప్రయత్నంగా తేలుతుంది. 
     
థ చూస్తే- సింధూ, ఇందూ (రెండు పాత్రలూ వేదిక పోషించింది) అనే కవల పిల్లలు. బాల్యంలో అనుభవమైన ఓ రెండు సంఘటనల కారణంగా సింధూలో ఓ మానసిక రుగ్మత పెరిగిపోతుంది. ఆ రుగ్మత కారణంగా భయభ్రాంతులకి లోనవుతూ వుంటుంది. ఎప్పుడూ ఓ అపరిచిత వ్యక్తి తనని వెంటాడుతున్నట్టు భ్రమిస్తూంటుంది. చిన్నప్పుడు  స్కూల్‌లో సంపత్ (అరవింద్ కృష్ణ) అనే తోటి విద్యార్థికి  క్లోజ్ అవుతుంది. ఇది సింధూ సోదరి ఇందూకి నచ్చదు. అతడికి దూరంగా వుంచాలని ప్రయత్నిస్తూంటుంది. ఇక సంపత్ కనపడకుండా పోయాడని తీవ్ర మానసిక రుగ్మతకి లోనవడంతో మానసిక చికిత్సాలయంలో చేర్పిస్తారు తల్లిదండ్రులు. ఆ మనోవ్యాధిని ష్కీజోప్రీనియాగా నిర్ధారిస్తాడు సైకియాట్రిస్టు (అనీష్ కురువిల్లా). అప్పట్నించీ 13 ఏళ్ళూ ఆమె ఆ చికిత్సాలయంలోనే వుండి పోతుంది. ఇదీ కథ. 
       
ఈ కథలో చిన్నప్పటి ఆ రెండు అనుభవాలేమిటంటే
, అన్నం తినకపోతే ఆమె తల్లి బూచాడు వస్తాడని భయపెడుతుంది. ఆ బూచాడి భయం ఆమెకి దెయ్యంలా పట్టుకుంటుంది. రెండో అనుభవం, సంపత్ గురించి సోదరితో తలెత్తిన టెన్షన్ కారణంగా కోపం వచ్చి ఆమెని నెట్టేస్తే కిందపడి గాయపడింది. దాంతో భయపడిపోయింది. ఈ భయం కూడా కలిసి ఆమె ష్కీజోప్రీనిక్ గా మారిందన్న మాట!
       
బూచాడొస్తాడని భయపెడితే జీవితాంతం ఆ భయంతో బ్రతకడం మనమెక్కడా చూడం.
షోలేలో గబ్బర్ సింగ్ తన గురించి ఇలా చెప్పుకుంటాడు- పిల్లలు నిద్రపోకపోతే తల్లులు నిద్రపో, లేకపోతే గబ్బర్ వస్తాడని భయపెడ్తారని. ఈ లెక్కన ఆ భయపడ్డ పిల్లలందరూ ష్కీజోప్రీనిక్కులవ్వాలి! చిన్నప్పుడు ఇలా భయపెట్టడం యుగాలుగా సాగుతోంది. ఇది ప్రమాదకరమైతే ఎప్పుడో ఆపేసే వాళ్ళు తల్లులనే జీవులు. 
       
తన వల్ల సోదరి గాయపడిన సంఘటన కూడా మనోవ్యాది పుట్టడానికి సరిపోని  కారణమే. ఇలాటి బలహీన కారణాలున్నప్పుడు సంఘర్షణ కూడా బలహీనంగానే వుంటుంది. ఆమె సంఘర్షణ తనని ఎవరో వెంటాడుతున్నాడనే. మరో వైపు సంపత్ కావాలని గొడవ చెయ్యడం. ఆ సంపత్ లేడు
, రాడు, అది నీ భ్రమ అంటూ వుంటాడు సైకియాట్రిస్టు. 
   
ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ కి  డైనమిక్ కథా ప్రపంచం వుండాలి. ఇదే ఇక్కడ మిస్సయ్యింది.  కథనంలో ఎక్కడా సస్పెన్స్, థ్రిల్, టెన్షన్, ఫియర్, పోనీ యాక్షన్ కూడా లేదు. కథ నేలబారుగా ఫ్లాట్ గా సాగుతూంటుంది. ప్లాట్ పాయింట్స్ అనేవి కనిపించవు. కథ సైకలాజికల్ థ్రిల్లర్‌ అయితే, పాత్ర సైకలాజికల్ డ్రామాలో లాగా పాసివ్ గా వుంది. ఎలా మొదలైన పాత్ర అలాగే, అదే వేదనతో కథని ముగిస్తుంది. 
       
ష్కీజోప్రీనియాతో హాలీవుడ్ నుంచి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్లున్నాయి. వాటిని గమనించి ఈ సినిమా తీసినట్టు లేదు దర్శకురాలు.  కథలో విషయం లేకపోగా
, ఈ కథని మూడు టైమ్ లైన్లలో చెప్పడం ఇంకో సమస్య. హీరోయిన్ చిన్నప్పటి టైమ్ లైను, పెద్దయ్యాక రెండు టైమ్ లైన్లు. పెద్దయ్యాక ఈ రెండు టైమ్ లైన్లలో ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది ప్రెజెంట్ అర్ధం కాని కన్ఫ్యూజన్ కూడా!
       
మొదటి సినిమా అనేది ఎన్నో ఏళ్ళు ప్రయత్నాలు చేస్తే నిర్మాతలతో దక్కే ఒక ఛాన్సు. చాలా రిస్కుతో కూడిన ఛాన్సు. దాంతో అన్నీతామే చేయగలమనుకుని అప్పుడే కథ- మాటలు- స్క్రీన్ ప్లేలు అన్నీ రాసేసే మేధావులమనుకుంటే- ఫలితం కూడా ఎలా వుంటుందంటే- మళ్ళీ ఇంకో ఛాన్సు కోసం జీవితాంతం ప్రయత్నిస్తూనే వుండాలి! మొదటి ఛాన్సు మేధావితనాన్ని కోరుకోదు
, అనుభవజ్ఞుల తోడ్పాటుని కోరుకుంటుంది.
—సికిందర్


Thursday, November 28, 2024

1359 : స్క్రీన్ ప్లే సంగతులు

        స్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్ని మాస్ సినిమాల్లాగా మాస్ సినిమా టైటిలే పెట్టి, టెంప్లెట్ లో మెకానికల్ గా తీసేస్తే ముందుగా బలయ్యేది అందులో సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లర్ కథే. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ప్రేక్షకులు సంఘర్షణ, ఉద్రిక్తత, ఉత్కంఠ, ఊహించని మలుపులు, పాత్రకి అధిక రిస్కుతో కూడిన వేగంగా పరుగెత్తే కథనాల కోసం చూస్తారు. ఈ జానర్ బేసిక్స్ కి తోడయ్యే మేకింగ్ టెక్నిక్స్ కోసం, ఇవిచ్చే  ప్రత్యేకానుభవం కోసం కూడా చూస్తారు.  కెమెరా మూవ్ మెంట్స్, సౌండ్ ట్రాక్, ఎడిటింగ్, సెట్స్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ వగైరాలన్నీ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదల ప్రకారం ప్రత్యేకంగా వుంటూ సస్పెన్స్ నాణ్యతని ప్రభావితం చేస్తాయి. వీటన్నిటినీ మూస ఫార్ములా మాస్ జానర్ సినిమా వాషింగ్ మెషీన్ లో వేసి తీశారంటే, ఇక వీటి రూపు రేఖలు మటాష్ అయిపోయి మరేంటోగా తయారవుతాయి సస్పెన్స్ థ్రిల్లరనే సినిమాలు!
        
    విశ్వక్ సేన్ పాపులర్ మాస్ హీరో. మెకానిక్ రాకీ కి ముందు నటించిన 11 సినిమాల్లో ఒకే సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ - ది ఫస్ట్ కేస్ వుంది. మిగిలినవన్నీ మాస్ సినిమాలే. ఇప్పుడు రెండో సస్పెన్స్ థ్రిల్లర్ గా మెకానిక్ రాకీ పోస్ట్ మార్టం కి మన టేబుల్ పైకొచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి విడుదలైన వెంటనే స్క్రీన్ ప్లే సంగతులు రాసేస్తే సస్పెన్స్ అంతా పోతుంది. ఎక్కడికక్కడ సస్పెన్స్ విప్పకుండా భావి రచయితల పరిశీలనార్ధం స్క్రీన్ ప్లే సంగతులు రాయలేం. ఈ కారణంగానే  కాస్త హిట్టయి ఆడుతున్న అనే సస్పెన్స్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే సంగతులు రాయలేదు. ఇలాగాకుండా మెకానిక్ రాకీ విడుదలైన వెంటనే పరాజయ పాలవడంతో స్క్రీన్ ప్లే సంగతులకి అడ్డంకులు తొలగిపోయీ- ఎందుకు విశ్వక్ సేన్ సినిమా పరాజయం పాలైందో తెలుసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తోంది. హిట్ -ది ఫస్ట్ కేస్ లో మాస్ ఎలిమెంట్ల జోలికి పోకుండా సస్పెన్స్ థ్రిల్లర్ (పోలీస్ ప్రొసీజురల్) జానర్ మర్యాదల్ని చాలా వరకూ పాటించినా, అందులో ఫోరెన్సిక్ లాబ్ గురించి ప్రేక్షకులకి బోలెడు చెప్పేయ్యాలన్నట్టు చీటికీ మాటికీ ఓవరాక్షన్ వుంది. మళ్ళీ కథ వచ్చేసి ఎండ్ సస్పెన్స్ కథే. ఇదలా వుంచితే, ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ పేరుతో వచ్చిన ఈ రెండో సినిమా మాస్ మూసలో పడి విజయావకాశాల్ని మరీ ప్రశ్నార్ధకం చేసుకుంది. విశ్వక్ సేన్ ఇక తాను జడ్జి చేయలేని సస్పెన్స్ థ్రిల్లర్స్ జోలికెళ్ళకుండా, మాస్ సినిమాలు చేసుకోవడం మేలేమో అన్పించేలా తయారైంది.

1. ఫస్టాఫ్ స్ట్రక్చరేనా ఇది?

    ఇదో చిత్ర విచిత్ర స్క్రీన్ ప్లే. సెకండాఫ్ లో వచ్చే సస్పెన్స్ కథ నిడివి చాలక అన్నట్టు ఫస్టాఫ్ లో మాస్ కథని అల్లి సెకండాఫ్ కి జోడించినట్టుంది. సినిమా రెండున్నర గంటల నిడివి. ఇందులో ఫస్టాఫ్ లో సర్దుబాటు చేసిన మాస్ కథలోంచి- అక్కడక్కడా ఎదురయ్యే  సెకండాఫ్ సస్పెన్స్ కథకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ని తీసుకుని -సెకండాఫ్ కి కలిపితే రెండుగంటల లోపు కల్తీ లేని సస్పెన్స్ థ్రిల్లర్ తయారైపోయే పరిస్థితి.
       
ఈ మొత్తం కథకి బిగినింగ్ విభాగం ముగిసి
, ప్లాట్ పాయింట్ 1 ఎప్పుడో ఇంటర్వెల్లో గంటా 20 నిమిషాలకి గానీ తీరిగ్గా రాదు. షార్ట్స్ ని/ రీల్స్ ని స్క్రోలింగ్ చేసే నేటి మైక్రో కంటెంట్ ప్రపంచంలో ఇంత తీరిక ఎవరికుంది? మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రీన్ ప్లే రాశారా? కథ కోసం ఇంటర్వెల్ వరకూ ఓపిక పట్టాలా? ప్లాట్ పాయింట్ 1 ఇంటర్వెల్ వరకూ రాక పోవడంతో ఫస్టాఫ్ అంతా విషయం లేనట్టుగా తయారైంది. ఇలా ఫస్టాఫ్ లో చూపించిందంతా కథే అవుతుందా, లేక ప్లాట్ పాయింట్ 1 దగ్గర (ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర) ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతమవుతుందా అన్నది ఆలోచించాలి. ఇలా కథ చెప్పడానికి ఫస్టాఫ్ అంతా ఉపోద్ఘాతమే (బిగినింగ్) సాగదీస్తే ఎంత బడ్జెట్ దుబారా అవుతుంది? స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ స్ట్రక్చర్ కి లోబడి లేకపోవడంతో అసలుకే ఎసరొచ్చింది. కథని ఎంత క్రియేటివ్ గా ఆలోచించినా అది స్ట్రక్చర్లో లేకపోతే 300 కోట్ల రూపాయల కంగువా కూడా బాక్సాఫీసులో కంగు తినాల్సిందే!

 2. టెంప్లెట్ తో థ్రిల్?

    ఈ గంటా 20 నిమిషాలూ రాకీ (విశ్వక్ సేన్) కార్ల మెకానిక్ గా- డ్రైవింగ్ స్కూలు ట్రైనర్ గా  ఇద్దరు హీరోయిన్లతో కొలిక్కిరాని మాస్ ఉపోద్ఘాతమే సాగుతుంది. ఇలా మాస్ అప్పీల్ కోసం కార్ల మెకానిక్ గా చూపించినప్పుడు, ఆ సీన్లు అవే వందలసార్లు చూసేసిన పాత సినిమాల్లో సీన్లలాగే వుండనవసరం లేదు. ఈ పోటీ ప్రపంచంలో అమ్మకపు సరుకులన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెకానిక్ క్యారక్టర్ని ఎందుకు అప్డేట్ చేసి వెండి తెరకి ఇంకా బాగా అమ్మకూడదు? మెకానిక్కుల్ని ఇన్స్పైర్ చేసేలా ఈ రంగంలో కూడా మిలియనీర్లుగా ఎదగ వచ్చని -హై-ఎండ్ లగ్జరీ కార్ల రిపేర్లు, కస్టమ్ మోడిఫికేషన్‌లు, క్లాసిక్ కార్ల రీస్టోరేషన్ లేదా స్పెషలైజ్డ్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్‌ మొదలైన వాటిపై దృష్టి పెట్టి కోట్లు గడిస్తున్న మెకానిక్కుల ఉదాహరణలు కోకొల్లలు. ఇలాటి ఒక మిలియనీర్ మెకానిక్ గా, స్ట్రగుల్ చేస్తున్న మెకానిక్కుల్ని మోటివేట్ చేసేదిగా, విశ్వక్ సేన్ మాస్ పాత్రని ఎందుకు రీబూట్ చేసి రిచ్ గా చూపించకూడదు? ఇలా చేస్తే విజువల్ ప్రెజెంటేషన్స్ పూర్తిగా మార్పు చెంది మాస్ సినిమా కంటికి కొత్తగా అన్పించ వచ్చేమో?
       
ఇక్కడొక ప్రశ్న వస్తుంది. కథ ప్రకారం అతను ఆర్ధికంగా స్ట్రగుల్ చేస్తున్న మెకానిక్ అయివుండాలి. అప్పుడే ఆ గ్యారేజీ వున్న ల్యాండ్ ని కబ్జా చేస్తున్న శక్తులతో పోరాడలేక డబ్బు చెల్లించేందుకు సిద్ధపడగలడు. అప్పుడు దీన్ని మిలియనీర్ మెకానిక్ సెటప్ కి మార్చేస్తే
, మార్కెట్ లో టాప్ పొజిషన్లో వున్న ఈ గ్యారేజీని టేకోవర్ చేయాలని చూస్తున్న ఇంకో కంపెనీ కుట్రగా వుండొచ్చు. ఐటీ, ఈడీ దాడుల ద్వారా అతడ్ని బెదిరించి టేకోవర్ చేసుకునే కుట్ర. దీంతో ల్యాండ్ కబ్జా అనే పాత వాసన, టెంప్లెట్ కథనం వదిలిపోతుంది. పాత వాసనతో, టెంప్లెట్ తో కథనంలో థ్రిల్లేమీ వుండదు!

3. మాస్ ఉపోద్ఘాతం ఇలా!

        ఈ గ్యారేజీలో రాకీ తో బాటు అతడి ఫ్రెండ్ హర్ష (వైవా హర్ష) మెకానిక్ గా వుంటాడు. ఈ గ్యారేజీని పూర్వమెప్పుడో రాకీ తాత ప్రారంభించాడు. ఈ తాత రెడ్డప్ప (విశ్వక్ సేనే!) రాయలసీమ ఫ్యాక్షనిస్టు అనే మరో పాత వాసన. దీంతో మళ్ళీ అవే పాత ఫ్యాక్షన్ సినిమా సీన్లు. ఈ తాత కొడుకైన రామకృష్ణ (నరేష్) కి గ్యారేజీ అప్పగించి పరమపదించాడు. ఈ రామకృష్ణ కాలేజీ నుంచి సస్పెండ్ అయిన కొడుకు రాకీని దద్దమ్మగా పరిగణించి గ్యారేజీ పనిలో పెట్టాడు. ఈ రాకీ కాలేజీలో ప్రియా (మీనాక్షీ చౌదరి) ని ప్రేమిస్తే, కాలేజీ నుంచి సస్పెండ్ అయిన రాకీని ప్రియ దూరం పెట్టింది. ఈ ప్రియ తండ్రి గుండె జబ్బుతో చనిపోతే, ఇంటి బాధ్యత తీసుకోవడానికి ఈమె అన్న శేఖర్ (విశ్వదేవ్ రాచకొండ) నిరాకరించాడు. ఈ శేఖర్  క్రికెట్ కలలతో వుంటూ, ఒక రోజు నగలు అమ్ముకున్నాడని ప్రియ మందలిస్తే, ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంత ట్రాజడీతో వున్న ప్రియా ఓ బిల్డర్ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ తల్లిని
, చెల్లెల్నీ  పోషించుకుంటూ, డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆ గ్యారేజీ రాకీదని తెలియక వస్తే, రాకీకి మళ్ళీ ఈమెతో లైను కలిసింది. అయితే రాకీ దీనికి ముందే మాయా (శ్రద్ధా శ్రీనాథ్) అనే ఇన్సూరెన్స్ ఏజెంటుకి డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు.
       
ఇలావుంటే మరోవైపు
, రంకిరెడ్డి (సునీల్) అనే గ్యాంగ్ స్టర్, రాకీ గ్యారేజీ వున్న స్థలం మీద కన్నేసి వేధిస్తున్నాడు. రాకీ తండ్రి రామకృష్ణకి తీర్ధయాత్రలకి వెళ్ళాలని కోరిక వుంది. ఈ  కోరిక తీర్చేస్తూ తీర్ధయాత్ర ప్లాన్ చేశాడు రాకీ. అయితే రామకృష్ణ ఇక్కడే చనిపోయాడు. ఈ విషయం మాయాకి చెప్పాడు  రాకీ. రంకి రెడ్డికి కట్టాల్సిన 50 లక్షల గురించి కూడా చెప్పా డు. మాయా ఇన్సూరెన్స్ పాలసీలు చెక్ చేసి, రాకీ తండ్రికి రెండు కోట్ల మేరకు పాలసీ వున్న సంగతి చెప్పింది. రాకీకి ఆశ్చర్యమేసింది. అయితే నామినీగా తన పేరుగాక రాజేష్ అనే వేరే  పేరుందని ఆమె చెప్పేసరికి షాకయ్యాడు...

    ఇదీ ఇంటర్వెల్ కి 10 నిమిషాల ముందు వరకూ సాగే ఉప్పోద్ఘాతం టూకీగా. ప్రారంభంలో రెండు సీన్లు తీసుకునే 10 నిమిషాలు తీసేస్తే ఉపోద్ఘాతం నిడివి గంట. ఇంటర్వెల్ కి ముందు పాలసీ ప్రస్తావనకి ముందు వరకూ వచ్చే ఈ ఉపోద్ఘాతమంతా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లోనే వుంటుంది. ఇదంతా ముగిసి పాలసీలో నామినీ గా వేరే పేరు  గురించి వచ్చేసరికీ మొత్తం కలిపి గంటా 20 నిమిషాలూ ఫస్టాఫ్ సాగుతుంది. అంటే గంటా 20 నిమిషాలకి ప్లాట్ పాయింట్ 1 వచ్చి అప్పుడు ఇంటర్వెల్లో కథ ప్రారంభమవుతుందన్న మాట- ఆలస్యం అమృతం విషం లాగ!

4. రెండు మంచి క్రియేషన్లు
    అనేక ఫ్లాష్ బ్యాకులుగా ఈ ఉపోద్ఘాతం ఎలా ఎందుకు ఎవరికోసం మొదలైంది? ఎలా ఎందుకనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో వుంచి, ఎవరికోసం ఉపోద్ఘాతాన్ని ఎవరు చెప్తున్నదీ చూస్తే- డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన మాయాకి రాకీ చెప్తున్నాడు. ఈ ఉపోద్ఘాతం తన పుట్టుక నుంచీ ఇప్పటి వరకూ తన జీవితం గురించే. ఈ ఉపోద్ఘాతానికి (ఉపోద్ఘాతమంటే బ్యాక్ స్టోరీయే) ముందు ఓ రెండు సీన్లు వుంటాయి. ఒకటి- ఒక వర్షపు రాత్రి ఒకింట్లో ఉరేసుకుని ఎవరో ఆత్మహత్య చేసుకునే సీను. ఈ ఓపెనింగ్ సీను లేదా సంఘటన సెకండాఫ్ లో మొదలయ్యే కథకి కేంద్ర బిందువు లాంటిదని తర్వాత తెలుస్తుంది. దీని పర్యవసానంగానే రాకీకి ఓ గోల్ ఏర్పాటయ్యిందని కూడా సెకండాఫ్ లోనే తెలుస్తుంది. కాబట్టి ఈ ఓపెనింగ్ సీను సస్పెన్సుతో కూడిన ఒక మంచి హుక్ గా చెప్పుకోవచ్చు.
       
ఇక దీని తర్వాత వచ్చే రెండో సీను డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయా రాకీ గ్యారేజీకి వచ్చే సీను. ఈ సీను కూడా ఓ మంచి క్రియేషనే. ఎందుకంటే ఈ సీనులో నాలుగు విషయాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి- 1. మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం వెనుక ఆమె పన్నిన ఒక కుట్ర వుంది. ఇది సెకండాఫ్ లో రివీలవుతుంది
, 2. అప్పుడే గ్యారేజీకి ఒకతను వచ్చి గ్యారేజీ మూసేస్తారటగా అంటాడు. శుభమా అని గ్యారేజీ సీనుతో ప్రారంభిస్తూ అప్పుడే గ్యారేజీ మూసేసే మాటేమిటి? ఆలోచింపజేసే సీను. ఈ మాట అప్పటికే రంకిరెడ్డితో నలుగుతున్న సమస్యని దృష్టిలో పెట్టుకుని అన్నది. ఇది కూడా తర్వాత రివీలవుతుంది. అయితే ఈ మాట అనడంతో ఈ గ్యారేజీకి ఏదో ప్రాబ్లం వుందని ప్రేక్షకులకి ఆసక్తి పుడుతుంది, 

3. మాయా తను ఇన్సూరెన్స్ ఏజెంటునని చెప్తుంది. అంటే ఈ రెండో సీనులోనే ఆమె పరిచయం కూడా జరిగిపోయింది. ఇన్సూరెన్స్ ఏజెంటే ఎందుకు? ఎందుకంటే రాకీని ఇన్సూరెన్స్ ఏజెంటుగానే ట్రాప్ చేయబోతోంది, 4. మాయా ఇన్సూరెన్స్ ఏజెంటునని చెప్పడంతో రాకీ ఇంట్రెస్టు చూపక, మనకి బ్యాంకుతో పని అంటాడు. ఇక్కడ మెలిక ఏమిటంటే ఆమె ఇన్సూరెన్స్ ఏజెంట్ అని రాకీకి ముందే తెలుసు. తెలియనట్టు నటించాడు. మనకి బ్యాంకుతో పని అని అనడంలో కూడా అమెకోసం అతను పన్నుతున్న ట్రాప్ వుంది. ఇది కూడా సెకండాఫ్ కథలో వరకూ మనకి తెలీదు.
       
అసలు మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం ఆమె పన్నిన కుట్రలో భాగంగానే జరిగినప్పటికీ
, అసలామెని ఇక్కడికి తన స్కెచ్ ప్రకారమే వచ్చేటట్టు చేశాడు రాకీ. అంటే రాకీని ట్రాప్ చేసే పనిపెట్టుకుని వచ్చిన మాయాకి, రాకీ వేసిన స్కెచ్ ప్రకారమే వచ్చి తనే ఇరుక్కుందని తెలీదన్న మాట1
       
మరొకటేమిటంటే
, మొదటి సీనులో చూపించిన ఆత్మహత్యకి కారకురాలు ఈ మాయే. ఇది కూడా సెకెండాఫ్ లో బయటపడుతుంది. అంటే మాయా ఆల్రెడీ ఒక బకరాని బలితీసుకుని, రెండో బకరాగా బలి చేద్దామని రాకీ దగ్గరికి వచ్చిందన్న మాట. ఒక దాని తర్వాత ఒకటి ఆమెకి కనెక్ట్ అవుతున్న ఈ రెండు సీన్లూ కథనానికి మంచి డైనమిక్స్ ని క్రియేట్ చేశాయి. ఇలా సెకండాఫ్ లో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథకి పనికొచ్చే ఈ ఇద్దరి గేములూ నిగూఢంగా ఇలా ఈ రెండు సీన్లలో ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. ఇందుకే ఇది మంచి క్రియేషన్ అన్నాం.

5. నిల్వ మాస్ మసాలా!

    ఇప్పుడు పై మొదటి రెండు ఇంటలిజెంట్ సీన్ల తర్వాత ఇక మొదలయ్యేదే ఉపోద్ఘాతమనే ప్రేక్షకుల పాలిట శరాఘాతం. ఫ్రిజ్ లోంచి తీసి వేడి చేసిన నిల్వ మాస్ మసాలా. దీని ప్రారంభమే తేడా కొడుతుంది. ఎలాగంటే, డ్రైవింగ్ నేర్చుకోవడానికొచ్చిన  ఆమెకి కారులో తన కథ చెప్పుకుంటూ కూర్చుంటే డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటుంది? డ్రైవింగ్ ఇలాగే నేర్పిస్తారా? ఈ అసహజ సెటప్ తేడా కొట్టింది. ఇలా తన కథ చెప్పుకోవడానికి లీడ్ ఏమిటి? బ్యాంకు పని గురించి అతను ఆందోళనగా వుంటే ఆమె అడిగితే తన కథంతా చెప్పుకొస్తాడు. ఇదీ కల్పించిన లీడ్. కారు పోతూనే వుంటుంది. ఆమె నడుపుతూనే వుంటుంది. అతను ఫ్లాష్ బ్యాకుల మీద బ్యాకులు చెప్తూనే వుంటాడు. ఇలా కారులోనే గంట స్క్రీన్ టైము గడిచాక ఫ్లాష్ బ్యాకులు చెప్పడం పూర్తయి ప్రెజెంట్ టైమ్ లోకొస్తారు.
        
మాది రాయలసీమ, మా తాత కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు... అంటూ చెప్పుకొస్తాడు. ఆ తాత కామెడీగా ఫ్యాక్షన్ దాడిలో గాయపడి హైదరాబాద్ వచ్చేయడం, ఇక్కడ గ్యారేజీ తెరిచి బ్రతికెయ్యడం, చనిపోతూ కొడుకు రామకృష్ణకి గ్యారేజీ అప్పగించడం పూర్తయ్యాక, రామకృష్ణకి రాకీ పుట్టడం దగ్గర్నుంచీ చిన్నప్పటి విశేషాలూ మొదలుకొని కాలేజీ చదువు వరకూ చెప్పుకుంటూ వస్తాడు. ఈ కాలేజీలోనే ప్రియాతో ప్రేమ, ఆమె అన్నతో బాండింగ్ వుంటాయి. ఈ అన్న శేఖర్ తో రాకీ స్నేహం ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది.

    ఇక్కడ ప్రశ్నేమిటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎవరికి చెప్తున్నాడు? తాను స్కెచ్ వేసి ట్రాప్ చేయబోతున్న మాయా అనే ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కి చెప్తున్నాడు. అలాంటప్పుడు ఆమెకి తన తాత ముత్తాతల దగ్గర్నుంచీ చెప్పుకురావాల్సిన అవసరమేమిటి? ఆమె బ్యాంకు పని గురించి దేనికి వర్రీ అవుతున్నావో చెప్పమంది, అప్పుడు రంకిరెడ్డి అనేవాడు గ్యారేజీని కబ్జా చేస్తానని బెదిరిస్తూంటే ఆ డబ్బుకోసం బ్యాంకు లోను ప్రయత్నిస్తున్నానని చెప్తే సరిపోతుందిగా? ఆ రంకిరెడ్డితో ప్రాబ్లంకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ మాత్రమే చెప్పాలిగా? ఇది ఆమెకి కనెక్ట్ అవుతుందిగా? ఆమె చేయబోయే ఫ్రాడ్ ని పసిగట్టే బ్యాంకు పని గురించి మాట్లాడుతున్నాడుగా? సెకండాఫ్ కథలోకెళ్తే అక్కడ ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఆమె రంకిరెడ్డితో అతడి ప్రాబ్లం సహా బ్యాంకు లోను కోసం అతను ప్రయత్నించడం సీక్రెట్ గా ఆమె కనిపెడుతూనే వుందిగా?
       
అంటే ఇక్కడ రాకీ ఆమెకి ఏ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలో అది చెప్పకుండా తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడంటే
, ఇవి  అతను చెప్తున్న ఫ్లాష్ బ్యాక్స్ కావు. తన స్కెచ్ లో భాగంగా ఆమెకి చెప్పేది వుంటే రంకిరెడ్డి ఎపిసోడ్ మాత్రమే చెప్పేవాడు రాకీ. కానీ తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడు. అంటే కథకుడు జోక్యం చేసుకుని, రాకీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం ప్రేక్షకుల కవసరమని ఇలా రాకీ చేత ప్రేక్షకులకి చెప్పిస్తున్నాడు, మాయాకి కాదు. పాత్రల మధ్య కథకుడు జోక్యం చేసుకుంటే ఇంతే- కథ చెడిపోవడమే! ఇందుకే గంట పాటు ఆమెకి అవసరం లేని ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించాడు రాకీ చేత. ఇదెంత రాంగ్ కథనం! దీని వల్ల ఎంత బడ్జెట్ వృధా అయింది?

6. ఇంకా పెద్ద డ్యామేజీ!

    కథకుడు మాయాకి కాక ప్ర్క్షకులకి రాకీ ఫ్లాష్  బ్యాక్స్ చెప్పడంతో ఒక పెద్ద డ్యామేజీ కూడా జరిగిపోయింది కథకి. కాలేజీలో రాకీ సస్పెండ్ అవడంతో ప్రియా బ్రేకప్ చెప్పేసినట్టు పైన తెలుసుకున్నాం. రాకీ తండ్రి రామకృష్ణ తిట్టి, చదువు మాన్పించేసి,  గ్యారేజీ పనిలో పెట్టాడు. అలా మెకానిక్ గా మారిన రాకీ మెకానిక్స్ తో మాస్ గ్రూప్ సాంగ్ వేసుకున్నాడు. సాంగ్ తర్వాత రంకిరెడ్డి నుంచి ప్రాబ్లం మొదలయింది. తర్వాత గ్యారేజీకి అదనంగా డ్రైవింగ్ స్కూల్ ప్రారంచించాడు. రంకిరెడ్డి గ్యాంగ్ మళ్ళీ వచ్చి పడడంతో ఓ ఫైట్ సీను వేసుకున్నాడు. ఇక రాకీ నేరుగా రంకిరెడ్డి దగ్గరికెళ్ళి పోయి మళ్ళీ గ్యారేజీ జోలికొస్తే బావుండదని వార్నింగ్ ఇచ్చాడు.

ఇంతవరకూ రాకీ ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పాక- ప్రియా ఏమైందని మాయా అడుగుతుంది. ఇక్కడే రాకీచేత మహా తప్పులో కాలేయిస్తాడు కథకుడు! ఈ ఫ్లాష్ బ్యాక్స్ ప్రేక్షకులకి చెప్పాలన్న అత్యుత్సాహంతో మళ్ళీ పాత్రల మధ్య జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నాడు కథకుడు! ప్రియా గురించి కూడా ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించేశాడు కథకుడు!!
       
ప్రియా జీవితం
, కుటుంబం, బిల్డర్ దగ్గర ఆమె జాబ్ చేయడం జరిగి డ్రైవింగ్ నేర్చుకోవడానికి తన గ్యారేజీకే రావడంతో తిరిగి కనెక్ట్ అయినట్టు, ప్రేమ కుదిరినట్టు, ఓ డ్యూయెట్ కూడా వేసుకున్నట్టూ చెప్పించేశాడు!
       
ఈ ఉపోద్ఘాతంలో ప్రియా గురించి రాకీ మాయాకి ఇలా చెప్పేస్తూంటే కథ వుండాలా
, కర్సై పోవాలా? ప్రియా తండ్రి మరణించాక, ఆమె అన్న శేఖర్ తో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేసి అతడి ఆత్మహత్యకి కారకురాలైన మాయకే ఇది చెప్పేస్తాడా?
       
కథకుడి అత్యుత్సాహం ఇక్కడితో ఆగలేదు- ఒక రోజు ప్రియా అన్న గురించి అడగాలని ఆమె ఇంటికెళ్ళాడు రాకీ. ఆమె లేదు. ఆమె చెల్లెల్ని అడిగితే ఆమె ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళింది. ఆమె తండ్రి గుండెపోటుతో మరణించాడు. అన్న శేఖర్ కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో
, ప్రియా చిన్న ఉద్యోగంలో జాయినైంది. పని చేయకుండా తిరుగుతున్న శేఖర్ ఆమె డబ్బులు దొంగిలించాడు. తర్వాత నగలు దొంగిలించాడు. ఆమె నిలదీసి కొట్టేందుకు చెయ్యెత్తితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఈ సినిమాకి హుక్ గా వాడుకున్న ఓపెనింగ్ సీను.
       
ఇలా శేఖర్ చావుకి కారకురాలై
, ఇంకో ఎజెండాతో రాకీని ట్రాప్ చేయడానికి వచ్చిన తన ప్రత్యర్ధి- కిల్లర్ మాయకే శేఖర్ ఆత్మహత్యగురించి చెప్పేశాడు రాకీ! ప్రేక్షకులకి కథ తెలియాలని మధ్యలో జోక్యం చేసుకుని కథని పూర్తిగా డ్యామేజీ చేసేసిన కథకుడి అత్యుత్సాహం ఈ నిర్వాకంతో గానీ తీరలేదు!

ఇలా ఇక్కడే పై ఫ్లాష్ బ్యాకులో ప్రియా చెల్లెలి ద్వారా తన మిత్రుడు శేఖర్ మరణం గురించి తెలుసుకున్న రాకీకి గోల్ ఏర్పడింది. దోషిగా మయాని పట్టుకునే గోల్. ఇది రహస్యంగా వుంచి సెకండాఫ్ లో రివీల్ చేశాడు.
       
ఫ్లాష్ బ్యాక్ కొనసాగిస్తూ
, తండ్రిని తీర్ధయాత్రలకి పంపినట్టు కూడా చెప్పిన రాకీ, ఫ్లాష్ బ్యాక్స్ ముగించి - ఆ తండ్రి చనిపోయాడని చెప్తాడు. ఇలా ఉపోద్ఘాతం పూర్తవుతుంది.
       
ఇప్పుడు ప్రెజెంట్ లో కొస్తే
, ఇది స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమే. ఇప్పుడు రాకీ తండ్రి చనిపోయాడని తెలుసుకున్న మాయా ఎలర్ట్ అవుతుంది. ఆమెకి కావాల్సిందిదే. అతడితో ఇన్సూరెన్స్ గేమ్ ఆడుకోవడానికి. ఇలా ఆమెని తన ట్రాప్ లో బిగించాడు రాకీ.
       
ఇప్పుడు గ్యారేజీ గొడవలు పెరిగిపోయి రంకిరెడ్డికి 50 లక్షలిస్తానని రాకీ చెప్పడంతో
, ఆ 50 లక్షలు ఎక్కడ్నించి తెస్తాడో తెలియని రాకీకి- తండ్రి చేసిన రెండు కోట్ల పాలసీ గురించి చెప్తుంది మాయ. కానీ నామినీగా రాకీ పేరు గాక ఎవరో రాజేష్ అని వుందని చెప్తుంది మాయా. దీంతో గంటా 20 నిమిషాల ఫస్టాఫ్ ముగిసి ఇంటర్వెల్ పడుతుంది.

7. ఫస్టాఫ్ తో ప్రాక్టికల్స్?

    ఇంత గజిబిజిగా బారెడు సాగుతూ వున్న పైన వివరించిన ఫస్టాఫ్ ని, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, చప్పున గంటలో ముగిసే స్క్రీన్ ప్లే చేస్తే ఎలా వుంటుందన్న ప్రాక్టికల్స్ కి ఇప్పుడొద్దాం. ఈ ప్రాక్టికల్స్ స్వయంగా ఎవరైనా చేసుకుని, కథనాన్ని ఇంకెలాగైనా మార్చుకుని, ఆల్టర్నేట్ వెర్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు- స్ట్రక్చర్ కి లోబడి.
       
ముందుగా బిగినింగ్ లో
, ఓపెనింగ్ ఆత్మహత్య సీను అలాగే వుంటుంది. తర్వాత గ్యారేజీలో మాయా ఎంట్రీ సీను, కంటెంట్ అలాగే వుంటాయి. తర్వాత మారుతుంది- మాయాకి డ్రైవింగ్ నేర్పుతూ, బ్యాంకు పని గురించి ఆమె అడిగితే, రంకిరెడ్డితో గొడవ గురించి మాత్రమే చెప్తాడు. ఆ పూట ఆమెకి నేర్పడం ముగిస్తాడు. డైనమిక్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రియా పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో వుంటాడు. డ్రైవింగ్ నేర్పుతూ వుంటాడు. ఇక గ్యారేజీలో తండ్రి రామకృష్ణ పరిచయమవుతాడు. రాకీ ఎలా మెకానిక్ అయ్యాడో క్లుప్తంగా సంభాషణ. రంకిరెడ్డితో గొడవ గురించి సీన్లు. రాకీ డ్రైవింగ్ నేర్పుతూ మాయాతో కూడా రోమాన్స్ ప్రారంభిస్తాడు. దీంతో ప్రియాతో గొడవ. ఈ గొడవ, రంకిరెడ్డితో గొడవ ముదిరి పోతాయి- ఇంతలో రాకీ తండ్రి చనిపోతాడు. ఇప్పుడు గ్యారేజీని కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితిలో రంకిరెడ్డికి 50 లక్షలు కట్టాల్సి వచ్చేసరికి- ప్రేమలో పై చేయి కోసం - రాకీ కి హెల్ప్ చేస్తూ అతడి తండ్రి తీసుకున్న రెండు కోట్ల పాలసీ విషయం బయట పెడుతుంది మాయా. అయితే నామినీగా అతడి పేరు లేదంటుంది. దీంతో ఓ 30 నిమిషాల్లో బిగినింగ్ విభాగం (యాక్ట్ 1) ముగుస్తూ ప్లాట్ పాయింట్ 1 వస్తుందన్న మాట.
       
పైన బిగినింగ్ విభాగం బిజినెస్ నియమాల ప్రకారం చూస్తే -1. కథా నేపథ్యం ఏర్పాటు - ఇది సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యపు కథ అని తెలుస్తూనే వుంది
, 2. పాత్రల పరిచయం- ముఖ్య పాత్రలు రాకీ, అతడి తండ్రి, ప్రియా, మాయా, రంకిరెడ్డి పాత్రలు పరిచయమయ్యాయి, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన- గ్యారేజీ స్థలం కోసం రంకిరెడ్డితో గొడవలు, రాకీ తండ్రి మరణం, 4. సమస్య ఏర్పాటు - గొడవలు పరాకాష్టకి కి చేరి 50 లక్షలు కట్టాల్సి వస్తే, రెండు కోట్ల పాలసీ బయటపెట్టి మాయా హెల్ప్ చేయడం. కానీ అందులో నామినీ రాకీ కాకపోవడం.

       
ప్లాట్ పాయింట్ 1 దగ్గర పై సమస్యా ఏర్పాటులో ఆటోమేటిగ్గా రాకీకి గోల్ ఏర్పాటయ్యింది. ఎలాగైనా ఈ రెండు కోట్ల పాలసీ మొత్తాన్ని సాధించి
, రంకిరెడ్డి పీడా విరగడ చేసుకునే గోల్. ఇలా ఇక్కడే ఫస్టాఫ్ అరగంటలో బిగినింగ్ విభాగం ముగిసిపోయి, ప్రేక్షకులు ఎదురు చూసే కథ ప్రారంభమై పోయిందన్న మాట.

8. మిడిల్ -1 సంగతి?

    ఇప్పుడు కథతో ఫస్టాఫ్ మిడిల్- 1 (యాక్ట్ 2 /ఏ) లోకి ఎంటరైతే, పాలసీ డబ్బుల కోసం రాకీ సంఘర్షణ. దీనికి కావాల్సిన కథ ఈ సినిమా సెకెండాఫ్ ప్రారంభం నుంచే వుంది. దాన్ని యథాతథంగా ఇక్కడ వాడుకోవచ్చు : ఇప్పుడు పాలసీలో నామినీగా రాజేష్ పేరుని రాకేష్ గా మార్చే ఉపాయం చెప్తుంది ఇన్సూరెన్స్ ఏజెంట్ మాయా. దీని ప్రకారం మాయా, రాకీ, హర్షవర్ధన్ ని కలుస్తారు. అతను 5 లక్షలు డిమాండ్ చేస్తాడు. రాకీ ఆ 5 లక్షల కోసం ప్రయత్నిస్తూంటే, ప్రియా ఆ డబ్బు ఇచ్చి హెల్ప్ చేస్తుంది. ఆ డబ్బు తీసుకుని పేరు మార్చేస్తాడు హర్షవర్ధన్. ఇప్పుడు పోలీస్ ఇన్స్ పెక్టర్ రోడీస్ రఘు వచ్చేసి హర్షవర్ధన్ ని పట్టేసుకుంటాడు. హర్షవర్ధన్ రాకీనీ, మాయానీ పిలుస్తాడు. రోడీస్ రఘు ముగ్గుర్నీ కలిపి బ్లాక్ మెయిల్ చేస్తాడు. పాలసీ మొత్తంలో 20 శాతం, అంటే 40 లక్షలు తనకివ్వకపోతే ఫ్రాడ్ కేసులో ముగ్గుర్నీ లోపలేస్తానంటాడు. బేరసారాలాడి వారంలో ఈ డబ్బు చెల్లిస్తానంటాడు రాకీ.
       
అతను వెళ్ళిపోయాక
, మాయా- హర్షవర్ధన్-రోడీస్ రఘూ ముగ్గురూ ఇన్సూరెన్స్ స్కామ్ ముఠా అని రివీలవుతుంది. ఇదీ ఇంటర్వెల్. అంటే సినిమాలో సెకండాఫ్ లో 20 నిమిషాలకి వచ్చే ఈ ట్విస్టు వెనక్కి జరిపి ఇంటర్వెల్లో ఇచ్చామన్న మాట.

       
ఇప్పుడు రాకీ ప్రేమిస్తున్న మాయా ఒక మాయలాడి అని ప్రేక్షకులకి తెలిసింది
, రాకీకి తెలీదు. రాకీ ఎప్పుడు తెలుసుకుంటాడా అన్న ఉత్కంఠ ఏర్పడుతోంది. ఇంకా పై కథనంలో ప్రియా, మాయాలతో రోమాంటిక్ టెన్షన్ కూడా రాకీకి పెంచితే అతడికి రోమాన్స్ తో ఎమోషనల్ స్ట్రగుల్, పాలసీ డబ్బులతో ఫిజికల్ స్ట్రగుల్ కూడా ఏర్పడి పాత్రకి ఒక సమగ్రత వస్తుంది.

9. మిడిల్ -2 (యాక్ట్-2/బి)

    ఇప్పుడు సెకండాఫ్ ప్రారంభిస్తే సినిమాలో వున్నట్టుగానే మాంటేజెస్ తో మాయా-హర్షవర్ధన్-రోడీస్ రఘు త్రయం కుట్ర ఎలా పన్నారో రివీలవుతుంది. పబ్ లో ఎంజాయ్ చేయడం, కొత్త బకరా ఎవరని మాట్లాడుకోవడం, మెకానిక్ రాకీ దృష్టిలో పడడం, అతడి కోసం మయా రెక్కీ నిర్వహించడం, డ్రైవింగ్ నేర్చుకోవడానికి రాకీ దగ్గరికి వెళ్ళడం వగైరా.
        
ఈ మాంటేజెస్ తర్వాత కథలోకి వస్తే
, సినిమాలో వున్నట్టుగానే  రోడీస్ రఘు డబ్బు కోసం వొత్తిడి పెంచడం, ఈ నకిలీ ఇన్స్ పెక్టర్ని ఇంకో ఇన్స్ పెక్టర్ అనుమానించడం జరిగి, ఎందుకైనా మంచిది మ్యాటర్ క్లోజ్ చేద్దామని దుష్టత్రయం అనుకోవడం జరుగుతాయి. దీనికి రాకీ ప్రియాని పూర్తిగా మర్చిపోయి, మాయాకి కమిటై పోవడమనే రోమాంటిక్ స్టోరీ ని కలపవచ్చు.
        
ఇప్పుడు సినిమాలో ఉన్నట్టుగానే తీర్ధ యాత్రలకెళ్ళి చచ్చిపోయాడనుకున్న రాకీ తండ్రి బ్రతికి రావడమనే  ట్విస్టు వుంటుంది. పాలసీ డబ్బుల కోసం తనని చంపేసిన రాకీ మీద అతను ఫైర్ అవడం
, ఒక స్కెచ్ కోసమే ఇదంతా చేశానని రాకీ చెప్పడం వగైరా డ్రామా అంతా సినిమాలో ఉన్నట్టుగానే వుంటుంది. ఏమిటా స్కెచ్ అంటే, సినిమాలో వున్నట్టుగానే రాకీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం-
       
ఇందులో తన ప్రాణమిత్రుడు శేఖర్ ని మాయా ఎలా ట్రాప్ చేసిందీ వుంది. శేఖర్ తండ్రి చనిపోయాక  కుటుంబాన్ని పట్టించుకోకుండా శేఖర్ తిరుగుతూంటే
, ప్రియా ఉద్యోగం చేయడం, తండ్రి చనిపోయిన శేఖర్ ని ఇన్సూరెన్స్ పేరుతో మాయా ట్రాప్ చేయడం, తండ్రి తీసుకున్న పాలసీలో నామినీగా అతడి తల్లి బదులు వేరొక ఆవిడ పేరుందని చెప్పడం, పేరు మార్చేందుకు డబ్బులు డిమాండ్ చేయడం, శేఖర్ ప్రియా దాచుకున్న డబ్బు పట్టుకెళ్ళి ఇవ్వడం, ఇప్పుడు ఇన్స్ పెక్టర్ గా రోడీస్ రఘు ఎంట్రీ ఇచ్చి ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేస్తున్నందుకు బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం,శేఖర్ ప్రియా నగలు కూడా పట్టుకెళ్ళి ఇవ్వడం, నగల గురించి ప్రియా మందలించేసరికి శేఖర్ ఆత్మ హత్య చేసుకోవడం వగైరా వున్నాయి.
       
ఇలా ఇప్పుడు ఓపెనింగ్ హుక్ సీనుకి అర్ధం తెలిసింది. అంటే మాయా గురించి రాకీకి ఎప్పుడో తెలుసనీ
, వాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం కోసమే స్కెచ్ వేసి మాయాని తన మీదికి తనే ప్రయోగించుకున్నాడనీ, ఇంటర్వెల్లో చెప్పిన అర్ధానికి వ్యతిరేకంగా రాకీ ఇలా అన్నీ ముందే తెలిసిన వాడిలా రివీలై ఇంకో ట్విస్ట్ ఇస్తే  క్యారక్టర్ ఎలివేట్ అవుతుంది.
        
అంటే బిగినింగ్ ప్లాట్ పాయింట్ -1 లో అతడికేర్పడిన గోల్  నిజమైన గోల్ కాదన్న మాట. అదసలు నిజమైన కథ కూడా కాదన్న మాట. అదంతా - ఇంకా ఇంటర్వెల్ వరకూ కూడా- మాయాని ట్రాప్ చేయడం కోసం అతను అల్లిన కల్పిత కథే అన్న మాట. గ్రేట్ క్యారక్టర్! అసలు నిజ కథ శేఖర్ గురించిన ఈ ఫ్లాష్ బ్యాక్ తోనే. ప్రాణమిత్రుడు శేఖర్ ఆత్మహత్యకి కారణమైన మాయాని పట్టుకోవడమే అసలు గోల్! మాయాతో ప్రేమ కూడా నిజం కాదు. ఆమెని నమ్మించే ఎత్తుగడలో భాగమే అది.
        
ఇలా దీంతో స్క్రీన్ ప్లేకి సంబంధించిన అన్ని  సమస్యలూ సాల్వ్ అయి, ప్లాట్ పాయింట్ 2 కి చేరుకుని, మిడిల్ -2 ముగుస్తుంది.  

10. ఎండ్ విభాగం

    ఎండ్ విభాగం అంటే క్లయిమాక్స్ ని సినిమాలో ఉన్నదున్నట్టు తీసుకోవచ్చు. ఇందులో కథ కోసం తీసుకున్న కాన్సెప్ట్ వెల్లడవుతుంది. పెరిగిపోతున్న వివిధ సైబర్ నేరాల గురించి. వీటికి బలి అవుతున్న ప్రజల గురించి. దొరక్కుండా తప్పించుకుంటున్న మాయా అండ్ కో లాంటి సైబర్ క్రిమినల్స్ గురించి. అయితే ఈ క్లయిమాక్స్ ని సీరియస్ యాక్షన్ తో చూపించకుండా రాకీ తండ్రితో ఫన్నీ – యాక్షన్ కామెడీ చేయడం దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసుకున్న మంచి నిర్ణయం.

సినిమా కథ రాయడం చాలా సులభం. ఎందుకింత గందరగోళం చేసుకుంటారో గానీ, సినిమా కథ స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్. అందుకనే ఈజీ. ఇది గుర్తిస్తే మెకానిక్ రాకీ లాంటి ఆశాభంగాలు కలగవు. ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో ఎవరికైనా సందేహాలుంటే, లేదా సూచనలు చేయదలిస్తే, ఈ క్రింద కామెంట్ బాక్స్ వుంది, వినియోగించుకోగలరు.

—సికిందర్