రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, June 11, 2025

1381 : రివ్యూ!

 

దర్శకత్వం : మణిరత్నం
రచన : మణిరత్నం - కమల్ హాసన్
తారాగణం: కమల్ హాసన్, శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి తదితరులు
సంగీతం :  ఏఆర్ రెహమాన్,  ఛాయాగ్రహణం :  రవి కె. చంద్రన్
బ్యానర్స్ : రాజ్ కమల్ ఫిలింస్  ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్
నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్
విడుదల : జూన్ 5,  2025
***
ణిరత్నం -కమల్ హాసన్ ఎందుకనో కలిసి రెండో  సినిమా చేయడానికి మూడు దశాబ్దాలకి పైగానే  పట్టింది.  గడిచిపోయిన ఈ సుదీర్ఘ కాలంలో చాలా మార్పులు జరిగాయి. కాలమే మారిపోయింది. మాఫియాలూ గ్యాంగ్ స్టర్లూ కాలగర్భంలో కలిసిపోయారు. నక్సలైట్లూ టెర్రరిస్టులూ వెండి తెర మీద నుంచి తప్పుకున్నారు. మరి దుష్టులు ఎవరు మిగిలారు? గ్యాంగ్ స్టర్ లే. గ్యాంగ్ స్టర్లు వాళ్ళలో వాళ్ళు చంపుకునే కథల నుంచి బయటికొచ్చి  ప్రజా జీవితం మీద పడ్డారు (కుటుంబం మీద దాడి -జైలర్’, వ్యవస్థ మీద దాడి-విక్రమ్’, జవాన్’). ఈ ట్రెండ్ మార్కెట్ ని పట్టుకున్నాక, మళ్ళీ గ్యాంగ్ స్టర్ ముఠాల మధ్య కాలం చెల్లిన హింసతో గత నెల రెట్రో, ఈ నెల థగ్ లైఫ్ విడుదలై  దెబ్బతిన్నాయి. మణి-కమల్ కాంబోలో థగ్ లైఫ్ వాళ్ళ పేరు ప్రతిష్టల్ని పూర్తిగా దిగజార్చింది. ఈ తొలివారం రన్ లో బడ్జెట్ లో కేవలం 15 శాతం వసూలు చేసిందంటే విధ్వంసం ఏ స్థాయిలో వుందో వూహించ వచ్చు. ఇలా ఎందుకు జరిగింది? కాలం చెల్లిన గ్యాంగ్ స్టర్స్ సొంత గొడవల కథే అయినా, దీనికేం చేసివుంటే ఒక సత్య లా, ఒక కంపెనీ లా ప్రేక్షకులకి నచ్చే అవకాశముండేది? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...


కథ
1994 లో గ్యాంగ్ స్టర్ శక్తిరాజు (కమల్ హాసన్) ప్రత్యర్థి ఢిల్లీ గ్యాంగ్ లీడర్ సదానంద్ యాదవ్ (మహేష్ మంజ్రేకర్) జరిపిన కాల్పుల్లో ఓ  వ్యక్తి మరణించి అతడి ఇద్దరు పిల్లలు అమర్, చంద్ర అనాధలవుతారు. శక్తి రాజు అమర్ ని చేర దీస్తాడు. చంద్ర కనిపించకుండా పోతుంది. శక్తి రాజు, అతడి అన్న మాణిక్యం (నాజర్) కలిసి అమర్ ని సొంత బిడ్డలా పెంచుకుంటారు. 2016 లో సదానంద్ మేనల్లుడు రణవిజయ్ యాదవ్ (రోహిత్ సరాఫ్) తో మోసపోయిన మాణిక్యం కుమార్తె ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రతీకారంగా అమర్ (శింబు) రణవిజయ్‌ ని బంధిస్తే, శక్తిరాజు అతన్ని చంపేస్తాడు. ఫలితంగా శక్తిరాజు జైలు పాలవుతాడు. జైలుకి వెళ్తూ గ్యాంగ్ స్టర్ సామ్రాజ్యపు బాధ్యతల్ని అమర్ కి అప్పగిస్తాడు.
       
తర్వాత
, అమర్- మాణిక్యం లకి, సదానంద్ కీ మధ్య సయోధ్య కుదురుతుంది. దీని ప్రకారం సదానంద్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు, అతడి నేర సామ్రాజ్యాన్ని అమర్ స్వాధీనం చేసుకోవచ్చు. ఇది నచ్చనప్పటికీ శక్తిరాజూ  చివరికి ఈ సయోధ్యని ఒప్పుకుని జైలు నుంచి  విడుదలవుతాడు. విడుదలై కుమార్తె పెళ్ళి ఏర్పాట్లలో వుంటాడు. పెళ్ళి  వేడుకల్లో తన సామ్రాజ్యంలో వచ్చిన మార్పుని గమనిస్తాడు. ఇప్పుడు అందరూ అమర్ ని తమ బాస్ గా భావిస్తూంటారు.
       
ఇలావుండగా
, శక్తిరాజు  మీద అతను చంపిన రణవిజయ్ యాదవ్ అన్న హత్యాయత్నం చేస్తాడు.  దీంతో శక్తిరాజు అమర్ ని అనుమానించడం మొదలెట్టి ఎదుర్కొంటాడు. ఇది అమర్ ని  తీవ్రంగా కలవరపెడుతుంది. ఇది చూసి మాణిక్యం అమర్ కి ఒక అబద్ధాన్ని నూరిపోస్తాడు. చిన్నప్పుడు అమర్ తండ్రి మరణానికి శక్తిరాజే కారణమని చెప్పి నమ్మిస్తాడు.
       
ఇలా అమర్ కి నమ్మకాన్ని
, శక్తిరాజుకి అనుమానాన్నీ పెంచుతూ మాణిక్యం పన్నిన కుట్రలో వాళ్ళిద్దరి జీవితాలూ  ఏమయ్యాయన్నదీ మిగతా కథ.

ఎలావుంది కథ

1987 లో నాయకన్ అనే గ్యాంగ్ స్టర్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యాక 38 ఏళ్ళకి, ఇప్పుడు కమల్ హాసన్ తో మణిరత్నం తీసిన రెండో సినిమా ఇది. 1991 లో రజనీకాంత్ - మమ్ముట్టి లతో దళపతి మణిరత్నం తీసిన ఇంకో బ్లాక్ బస్టర్ గ్యాంగ్ స్టర్ మూవీ. ఈ రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇప్పుడు కమల్ తో థగ్ లైఫ్ అనే గ్యాంగ్ స్టర్ మరో ఇరువర్ (ఇద్దరు) అయింది. సినిమా చూసే ప్రేక్షకులతో సంబంధం లేకుండా సినిమా తీస్తే ఇంతే అవచ్చు.
       
పైన చెప్పుకున్నట్టు
,
గ్యాంగ్ స్టర్లు వాళ్ళలో వాళ్ళు చంపుకునే కథల నుంచి బయటికొచ్చి ప్రజా జీవితం మీద పడే కథలుగా మారేక హిట్టవసాగారు. అయితే అప్పుడైనా ఇప్పుడైనా ఒక  కామన్ పాయింటుంది - సామాన్యుడి పాత్ర. నాయకన్ లో కమల్ ది గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన సామాన్యుడి పాత్రే. అప్పట్లో గ్యాంగ్ స్టర్ సామాన్యుల పక్షాన పోరాడేవాడు. సామాన్యుల పక్షాన పోరాడక పోయినా సత్య లో బాధితుడుగా సామాన్యుడే జేడీ చక్రవర్తి రూపంలో వుండేవాడు, అలాగే కంపెనీ లో వివేక్ ఒబెరాయ్ పాత్ర. ఈ రెండూ ఎంత హిట్టయ్యాయో తెలిసిందే.
     
'థగ్ లైఫ్ లో అసలు సమస్యేమిటంటే ఈ సామాన్యుడు మిస్సవడం. సమాజంలో మన లోంచి నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రాతినిధ్య పాత్రగా ఓ సామాన్యుడు వున్నప్పుడే గ్యాంగ్ స్టర్ మూవీస్ కనెక్ట్ అవుతున్నాయి. ఇలా ప్రాతినిధ్య పాత్ర లేకపోతే ప్రేక్షకులు ఎవరితో కనెక్ట్ అవ్వాలి? ఎవర్ని ఫీలై సినిమా చూడాలి? ఎవరి భావోద్వేగాల్ని తమవిగా చేసుకోవాలి? కమల్ పాత్రకి ఈ నేపథ్యం లేదు. దీంతో మనం ఫాలో కాదగ్గ ప్రతినిధ్య పాత్ర కాలేదు. శింబు పాత్రకి తండ్రి హత్య తర్వాత బాల్యం నుంచీ సామాన్యుడైన బాధితుడి  బ్యాక్ డ్రాప్ వున్నా దాంతో ప్రాతినిధ్య పాత్రగా మార్చలేదు. ఈ గ్యాంగ్ స్టర్ పాత్రల్లో ఒక్కటి కూడా  సామాన్యుల పక్షాన వున్నట్టు గానీ,  సమాజం కోసం నిలబడ్డట్టు గానీ కనపడవు. వాళ్ళ సొంత కుటుంబ గొడవలతో వాళ్ళు కొట్టుకోవడమే. ఇదీ సమస్య. ఇలా ఏ పాత్రకీ ఆడియెన్స్ కెనెక్ట్ లేకపోవడంతో గ్యాంగ్ స్టర్ పాత్రలు మనకు సంబంధం లేని, మనం ఫీల్ కాలేని  వాళ్ళ గొడవేదో వాళ్ళు పడుతున్నట్టు తయారయ్యింది కథ.
       
పైన చెప్పుకున్న విధంగా ఫస్టావ్ సాగుతూ వున్నాక
, శక్తి రాజు మీద అమర్ మనసులో మాణిక్యం అనుమాన బీజాలు వేశాక- అందరూ కలిసి టిబెట్ వెళ్తారు. అక్కడ శక్తిరాజుని అమర్ కొండ మీద నుంచి తోసెయ్యడంతో ఇంటర్వెల్  వస్తుంది. అంటే ఇంటర్వెల్ కి ముందు అమర్ మనసులో మాణిక్యం అనుమాన బీజాలు నాటడం ఫస్ట్ యాక్ట్ లో వచ్చే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అయితే, శక్తి రాజుని అమర్  కొండమీద నుంచి తోసెయ్యడం ఇంటర్వెల్లో వచ్చే ప్లాట్ పాయింట్ వన్. ఇంతసేపూ సొంత గొడవల పాత్రలతో ఏకపక్షంగా ఫ్లాట్ గా వెళ్తున్న కథ ఇంటర్వెల్లో కూడా భావోద్వేగాల్ని పుట్టించదు. కారణం, శక్తి రాజు- అమర్ ల మధ్య తగిన బాండింగ్ చూపించక పోవడం. శక్తిరాజుని చూసి అయ్యో పాపం అనుకోవడానికి- చిన్నప్పత్ముంచీ అమర్ ని పెంచిన శక్తిరాజు చేసిన త్యాగాలు, పడ్డ కష్టం ఏమీ చూపించకపోవడం. సొంతగొడవలు చూపించడానికైనా పాత్రల మద్య ఎమోషనల్ బాండింగ్ లేకపోతే ఎలా.
        
ఇక సెకండాఫ్ ప్రారంభంలోనే బ్రతికి వచ్చేసే శక్తిరాజు ఇక సొంత గ్యాంగ్ లో ద్రోహులు ఒక్కొక్కర్నీ వరసబెట్టి చంపుకుంటూ వెళ్ళడమే సెకండాఫ్ కథ. చాలా సహనపరీక్ష పెట్టే చవకబారు కథ. ఫస్టాఫ్ నుంచీ చూసుకుంటే ఎక్కడా కథలో సస్పెన్స్ గానీ థ్రిల్ గానీ వుండవు. అందుకని యాక్షన్ సీన్లు కూడా ఫ్లాట్ గానే వెళ్ళి పోతూంటాయి. చివరికి అమర్ తో అపార్ధాలు తొలగి సుఖాంతమవుతుంది కథ.
       
నిజానికి ఇలాటి అనుమానాలు
, శతృత్వాలు, అంతమొందించడాలతో కూడిన పాత ఫార్ములాని కాలానుగుణంగా కొత్త మార్చే వీలుందేమో చూడాలి. కాన్ఫ్లిక్ట్ ని రివర్స్ చేస్తే కొత్తగా మారుతుంది. శక్తిరాజు గ్యాంగ్ బాధ్యతలు అమర్ కి అప్పగించినప్పుడు, కుట్రలు చేసే అవకాశం మాణిక్యం కివ్వకుండా శక్తిరాజు తనమీద తనే అనుమానాలు సృష్టించు చుకుంటే - మూడు జరగొచ్చు -  తనని పెంచి పెద్ద చేసిన శక్తిరాజు తన తండ్రిని చంపే అవకాశం లేదని అమర్ గట్టిగా నమ్మడం, వినకుండా మాణిక్యం తీవ్రంగా ఎగదోయడం, మణిక్యాన్ని శిక్షించేందుకు శక్తిరాజు తన మీద చేసుకున్న ప్రయోగాన్ని ఏ స్థాయి కైనా తీసికెళ్ళడం. రీళ్ళు పోయి డిజిటల్ వచ్చాక, ఇంకా రీళ్ళే చూసుకుంటూ కీబోర్డు మీద కథ టైపు కొడితే ఆ కథకి తగ్గ లైఫే మిగులుతుంది బాక్సాఫీసులో.

నటనలు –సాంకేతికాలు

కమల్ హాసన్ అద్భుతంగా నటించ వచ్చు. కానీ విషయం లేకపోతే సినిమాని నిలబెట్టలేడు. ఓ ఓటీటీ షోకి ఓ బాలీవుడ్ రచయిత రాస్తున్న స్క్రిప్టులో కేవలం డైలాగులు పలికి ఓ నటుడు సూపర్ హిట్ చేస్తూంటే- జ్ఞానోదయమైంది రచయితకి- రాస్తున్న తనకి కేవలం 45 వేలు ఇస్తూంటే, అది చూసి పలుకుతున్న నటుడికి 45 లక్షలు ఇస్తున్నారని! స్క్రిప్టు ని ఎక్కడికో తీసికెళ్ళి పోయే పవర్ నటుడికుంటుంది. కానీ థర్డ్ రేట్ స్క్రిప్టుని ఎంత ఫస్ట్ రేట్ నటుడైనా కమల్ హాసన్ థర్డ్ రేటుని దాటించలేడు.
       
ఇందులో త్రిష ఎందుకు నటించిందో అర్ధంగాదు
, అర్ధం లేని పాత్ర. శింబుది కూడా స్పార్క్ లేని పాత్ర, నటన. నాజర్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, జోజు జార్జి, మహేష్ మంజ్రేకర్  - ఇంకా చాలామంది తారాగణంతో కుంభ మేళా వెళ్తున్న ట్రైనులా కిటకిట లాడుతూ వుంటుంది సినిమా- బాక్సాఫీసు కటకట!

అతి కష్టం మీద రెహ్మాన్ రెండు పాటలు బావున్నాయి. సినిమాలో విషయం లేకపోవడంతో బీజీఎం మీద దృష్టి పోదు. ఎడిటింగ్ నిడివిని తగ్గించిన జాడ లేదు. యాక్షన్
, కెమెరా ఈ రెండే సాంకేతికంగా హైలైట్.

మణిరత్నం దర్శకత్వ విలువలేమైనా వుంటే అవి కూడా మాసిన కథ కింద నలిగిపోయాయి. 

—సికిందర్ 

 

Wednesday, June 4, 2025

1380 : స్క్రీన్ ప్లే అప్ డేట్


        సినిమా స్క్రిప్టులు ఎలా రాస్తారు? స్క్రిప్టు ఎక్కడెక్కడ ఏ వైబ్రేషన్ తో వుందో  దృష్టిలో పెట్టుకోకుండా రాస్తారు. వైబ్రేషన్ ని పుట్టించే ప్రతీ పదార్థం దాని ఫ్రీక్వెన్సీని బట్టి విశ్వం తో కనెక్ట్ అవ్వాలో వద్దో నిర్ణయించుకుంటుంది. వైబ్రేషన్ హై ఫ్రీక్వెన్సీతో వుంటే విశ్వంతో కనెక్ట్ అవుతుంది. లేకపోతేలేదు. విశ్వం తో కనెక్ట్ అవడమంటే ప్రజా సమూహంతో కనెక్ట్ అవడమే. ప్రజాసమూహంతో కనెక్ట్ అవడమంటే బాక్సాఫీసు విజయం సాధించడమే. అందుకని స్క్రిప్టుల వైబ్రేషన్ హెచ్చు స్థాయిలో వుండాలి. స్క్రిప్టుల్లో ఎన్ని బోరు సన్నివేశాలు రాస్తారు, అవి విశ్వంతో కనెక్ట్ అవుతాయా? అలాగే బోరుగా వుండే డైలాగులు, పాటలు, పోరాటాలు మొదలైనవి కూడా విశ్వంతో ఎట్టి పరిస్థితిలో కనెక్ట్ కాలే వు. ఇక పాసివ్ హీరో పాత్రలతో సినిమాలు విశ్వంతో కనెక్ట్ అయ్యే ప్రశ్నే లేదు. అందుకనే ఫ్లాపవుతున్నాయి. ఈ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో ఎక్కడా స్క్రిప్టులు రాయడం లేదని రీసెర్చి చేస్తే తెలిసిపోయే విషయం. కానీ భావోద్వేగాల హెచ్చుతగ్గుల్ని నియంత్రిస్తూ స్క్రిప్టులు రాస్తే వాటి చైతన్యం వేరే వుంటుందని అర్ధమై ప్రయోగాత్మకంగా ఈ వ్యాసాన్ని ముందుకు తెస్తున్నాం.

        వైబ్రేషన్ అంటే ఏమిటి? ప్రతీ పదార్ధం, ప్రతీ ప్రాణి పరమాణు స్థాయిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ లని కలిగి వుంటాయి (తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చేసి ఎలక్ట్రాన్లు లేవని, శక్తి తరంగాలే వున్నాయనీ తేల్చింది అది వేరే విషయం). ఇలా పరమాణు స్థాయిలో ఇవి అలుపు లేకుండా కంపిస్తాయి. ఈ కంపనాలే శక్తిని సృష్టిస్తాయి. ఈ శక్తియే వైబ్రేట్ అవుతూ  బయటికి ప్రసారమవుతుంది. ఈ వైబ్రేషన్ స్థాయినే  ఫ్రీక్వెన్సీ  అంటారు. మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి భావోద్వేగాలతో కూడి వుంటుంది (ఎమోషనల్ ఎనర్జీ). ఇలా వెలువడిన భావోద్వేగాలు వైబ్రేట్ అవుతూ  విశ్వంలోకి విడుదలవుతాయి. అలా ఇవి మనల్ని మాత్రమే కాకుండా మన చుట్టూ వున్న వాళ్ళని కూడా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి వుంటాయి.

క్వాంటం ఫిజిక్స్ ప్రకారం కూడా విశ్వంలోని అన్ని వస్తువులూ శక్తితో తయారయ్యాయి. ఈ శక్తి తరంగాలు లేదా కంపనాలలో ప్రయాణిస్తుంది. ఈ అధ్యయనం నుంచే లా ఆఫ్ ఎట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఉనికిలో కొచ్చింది. అంటే మనం ఎలా ఫీలైతే అలాటి ఫీలింగ్ నే ఆకర్షిస్తాం. మనం కోపంతో వుంటే కోపాన్నే ఆకర్షిస్తాం. సంతోషంతో వుంటే సంతోషాన్నే ఆకర్షిస్తాం. విజయాన్ని కోరుకుంటే విజయాన్నే ఆకర్షిస్తాం. అయితే విజయం కోసం ఆఫర్మేషన్లు చేసి తర్వాత రోజంతా వాడ్ని తిడుతూ వీడ్ని కొడుతూ గడిపితే లా ఆఫ్ ఎట్రాక్షన్ పనిచేయదు. ఎలాటి నెగెటివిటీకి లోను కాకుండా పాజిటివ్ భావాలతో వుంటేనే పనిచేస్తుంది. మనం ఏమిస్తే విశ్వం తిరిగి అదే ఇస్తుంది. నేను పాజిటివ్ గానే వుంటున్నాను, ఎవరికీ ఏ హనీ చేయడం లేదు, అయినా లా ఆఫ్ ఎట్రాక్షన్ పనిచేయడం లేదంటే దానర్ధం- నువ్వు బయట అందరితో బాగానే వుండొచ్చు, లోలోపల నీ ఫీలింగ్స్ ఏమిటి- భయం, నిరాశ, పని జరుగుతుందో లేదోనన్న అపనమ్మకమూ  లాటి నెగెటివ్ భావాలతో నిండి వుంటే ఖచ్చితంగా లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఆకర్షణ సిద్ధాంతం) పని చేయదు. ఇదంతా చాలా పెద్ద సైన్సు, పక్కన పెడదాం.

వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ  ఛార్ట్


        వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ కి సంబంధించి డాక్టర్ డేవిడ్ ఆర్. హాకిన్స్ అనే మానసిక శాస్త్రజ్ఞుడు ఇనిస్టి ట్యూట్ ఆఫ్ నోయెటిక్ సైన్సెస్ తో కలిసి చేసిన ఒక సంచలనాత్మక అధ్యయనం -వివిధ భావోద్వేగాల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి క్షేత్రం ఉనికిని ప్రదర్శించింది. అత్యంత స్వల్ప ఫ్రీక్వెన్సీ అయిన సిగ్గు (20) నుంచి అత్యున్నత ఫ్రీక్వెన్సీ అయిన జ్ఞానోదయం (700+) వరకూ, వివిధ భావోద్వేగాలకి విభిన్న ఫ్రీక్వెన్సీల విలువల్ని  కేటాయించే స్కేల్‌ ని  అభివృద్ధి చేశారు. భయం, కోపం వంటి భావోద్వేగాలు తక్కువ ఫ్రీక్వెన్సీలని  కలిగి వుంటే, ప్రేమ - ఆనందం వంటి భావోద్వేగాలు అధిక ఫ్రీక్వెన్సీలని కలిగి వున్నట్టు కనుగొన్నారు.
        
వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ చార్ట్  ప్రకారం- 1. సిగ్గు (20 Hz) : అత్యల్ప ఫ్రీక్వెన్సీ. సిగ్గు అనేది అనర్హతకి సంకేతం కాబట్టి; 2. అపరాధ భావం (30- 60 Hz) : స్వయం ఘాతుకం, పశ్చాత్తాపానికి దారితీస్తుంది; 3. ఉదాసీనత (50 Hz) : నిరాశావాద స్థితి, సంకల్ప శక్తి లేకపోవడం; 4. శోకం (75 Hz) : బాధతో, దుఃఖంతో గడపడం; 5. భయం (100 Hz) : సమీప భవిష్యత్తు గురించి ఆందోళన, చింత; 6. కోరిక (125 Hz) : అసంతృప్తికి దారితీసే ఫీలింగ్; 7. కోపం (150 Hz) : విధ్వంసానికి దారితీసే శక్తి; 8. అహంకారం (175 Hz) : ఇగో మంచిదే కానీ, ఇందులో పవర్ వుండదు, నెగెటివ్ గా ఫోర్స్ వుంటుంది; 9. ధైర్యం (200 Hz) : శక్తికి కేంద్రం; ఒకరు తమ జీవితానికి బాధ్యత తీసుకోవడం ప్రారంభించే క్షణం; 10. సంపూర్ణ తటస్థత (250 Hz) : జడ్జిమెంటల్ కాని స్థితి; 11. సంకల్పం (310 Hz) : నేర్చుకోవడానికి, విస్తరించడానికి, పెరగడానికి, సర్దుబాటు చేసుకోవడానికి సంసిద్ధత; 12. అంగీకారం (350 Hz) : ప్రతిఘటన లేకుండా జీవితాన్ని దాని అన్ని రూపాల్లో స్వీకరించడం.
       
13.
కారణం (400 Hz) : మేధోపరమైన, విశ్లేషణాత్మక అవగాహన, హేతుబద్ధత తర్కం;  14. ప్రేమ (500 Hz) : సామరస్యాన్ని, శాంతిని  తీసుకురాగల పరివర్తనాత్మక ఎమోషన్; 15. ఆనందం (540 Hz) : కృతజ్ఞతతో, కరుణలతో కూడిన భావోద్వేగ స్థితి; 16. శాంతి (600 Hz) : సంతృప్తిని కలిగించే  లోతైన అనుభూతి; 17. జ్ఞానోదయం (700-1000 1000 Hz) : ఏవేర్నెస్ పతాక స్థాయి. ఆధ్యాత్మిక, దైవిక సంబంధ భావోద్వేగం.
       
ఇలా అధిక ఫ్రీక్వెన్సీ గల
ప్రేమ, ఆనందం ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తాయి. తక్కువ ఫ్రీక్వెన్సీ గల ఆందోళన, ఒత్తిడి అనేవి అనారోగ్యాలతో ముడిపడి వుంటాయి. ఇంకా ఫ్రీక్వెన్సీలు చూద్దాం : 475 - సృజనాత్మకత; 505 - అందం. 510 - శక్తి, చొరవ;  530 - అంతర్ దృష్టి, ప్రశంస; 540 - హాస్యం, ఆనందం; 550 - బేషరతు ప్రేమ; 570 పారవశ్యం.

ఎలా ఉపయోగించాలి

ఇప్పుడు స్క్రిప్టు రాసేప్పుడు ఏం చేయాలి? సింపుల్. లో ఫ్రీక్వెన్సీతో వుండే ఎమోషన్స్ ని ఇంకా కిందికి దించాలి, హై ఫ్రీక్వెన్సీతో వుండే ఎమోషన్స్ ని ఇంకా పైకి పెంచాలి. ఉదాహరణకి- భయం, కోపం, ద్వేషం, పగ, హత్య వంటి 30 Hz వుండే ఫ్రీక్వెన్సీలని తగ్గించి చూపించాలి. ఎలా తగ్గించాలి? ఎంత నీచంగా చూపిస్తే అంత ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది.
       
శాంతి, సంకల్పం, అంగీకారం వంటి హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ ని వాటి స్థాయిని పెంచి చూపించాలి. ప్రేమకి ఆనందం ఫ్రీక్వెన్సీ కలిపితే ప్రేమ ఫ్రీక్వెన్సీ అమాంతం పెరుగుతుంది. ఇలా సన్నివేశాన్ని బట్టి ఫ్రీక్వెన్సీలని కలుపుకోవాలి. ప్రేమలో అంగీకారం కుదిరినప్పుడు సన్నివేశాన్ని బట్టి ఆనందం, లేదా శాంతి ఫ్రీక్వెన్సీని కలిపినప్పుడు హైలైట్ అవుతుంది అంగీకార సన్నివేశం. ఈ ఫ్రీక్వెన్సీ మాటల్లో, చేతల్లో కూడా కనపడాలి.
       
ఇక స్క్రిప్టు లో ఏ సన్నివేశం ఏ భావోద్వేగంతో ఏ ఫ్రీక్వెన్సీ తో వుందో గ్రాఫ్ గా వేసుకుంటే కథ ఎక్కడెక్కడ డౌనైందో
, ఎక్కడెక్కడ హై అయిందో తెలుస్తుంది. కథ ప్రకారం కొన్ని లో -ఫ్రీక్వెన్సీలు తప్పవు. అయితే ఈ డౌన్లు ఎక్కువైతే  కథ బలహీనపై పోతుంది. దేని ఆధారంగా ఈ హై, డౌన్లు ఏర్పడతాయో తెలుసుకుంటే ఫ్రీక్వెన్సీల ప్లే అలవాటవుతుంది. జానర్స్ ఫ్రీక్వెన్సీలని నిర్ణయిస్తాయి. రోమాంటిక్ కామేడీ  జానరైతే కామెడీ ఫ్రీక్వెన్సీ 550 తో సన్నివేశాలన్నీ హైలోనే వుంటాయి. ఇందులో లో -ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ కి స్థానం లేదు. అంటే ఆద్యంతం స్క్రిప్టు హై ఫ్రీక్వెన్సీ తో ఫెళఫెళ లాడుతూ వుంటుందన్నమాట. అదే రోమాంటిక్  డ్రామా అయితే ఆనంద విషాదలతో కూడిన హై అండ్ డౌన్ గ్రాఫుతో వుంటుంది. ఈ డౌన్లు ఎక్కువ కాకుండా చూసుకోవాలి.

ఇలాగే ఇతర జానర్లు డిమాండ్ చేసే ఎమోషన్లు తీసుకుని వాటి ఫ్రీక్వెన్సీ లని ప్లే చేయాలి. ఈ ఫ్రీక్వెన్సీలు సంభాషణాల్లో, యాక్షన్ లో కూడా కనపడాలి. జేబులోంచి నోటు కింద పడిపోవడం లో- ఫ్రీక్వెన్సీ, అదే గాలి కెగిరిపోవడం హై ఫ్రీక్వెన్సీ. ఐ లవ్ యూ అనడం ఒక భావాన్ని ప్రకటించడం మాత్రమే. అదే ఐ లివ్ విత్ యూ అంటే అందులో కన్ఫర్మేషన్ వుంది, యాక్షన్ వుంది...అంటే థ్రిల్ వుంది. థ్రిల్ హై ఫ్రీక్వెన్సీ. కలియుగం యాక్షన్ లో వుండగా భావాలతో పని జరగదు, చేతల్లో చూపించాలి. ఇంతకంటే విడమర్చి చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు.
—సికిందర్


Tuesday, May 20, 2025

1379 : స్పెషల్ న్యూస్

Back Again! 



  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1నుంఛి సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తాయా, బంద్ అవుతాయా అన్న సస్పెన్స్ తరహా  కథనం నడుస్తోంది. రెంటా, పర్సెంటేజా వివాదం తేలాల్సి వుంది. పర్సెంటేజీ ప్రకారమైతేనే సినిమాల్ని ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. మల్టీప్లెక్సుల్లో పర్సెంటేజీ  విధానమే నడుస్తోంది. కానీ సింగిల్ స్క్రీన్స్ కి ఈ విధానం లేదు. అక్కడంతా రెంటల్ సిస్టమే నడుస్తోంది. దీని వల్ల నష్టపోతున్నామని ఎగ్జిబి టర్ల ఆందోళన. పర్సెంటేజీతో అయితే  తాము నష్టపోతామని నిర్మాతల అభ్యంతరం. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు పెద్ద నగరాలతో బాటు బీసీ సెంటర్లలో కూడా వున్నాయి. ఈ వివాదం ఇలా వుండగా, ఆ బీసీ సెంటర్ల పైనే కన్నేసి పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు ఇక్కడ భారీ యెత్తున మల్టీప్లెక్సులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచించుకుని ముందుకి దూసుకెళ్తోంది. అంటే ఈ విధానంలో ఎగ్జిబిటర్లు వుండరు. నగరాల్లో పీవీఆర్- ఐనాక్స్ తో అమల్లో వున్న పర్సెంటేజీ పైనే  నిర్మాతలు బీసీ సెంటర్లలో సినిమాలు విడుదల చేసుకోక తప్పదు-చిన్న సినిమా లైనా పెద్ద సినిమాలైనా!

        
ముందుగా పీవీఆర్- ఐనాక్స్ ప్రణాళికేమిటో చూద్దాం. దేశంలో అతిపెద్ద సినిమా    థియేటర్ల సంస్థ పీవీఆర్- ఐనాక్స్  మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లని దేశంలోని మారు మూలలకూ విస్తరించాలని భావిస్తోంది. విస్తరణ ప్రక్రియలో కంపెనీ సినిమా థియేటర్లలో ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ (FOCO) మోడల్‌తో లాభాల్ని ఆర్జించాలని ఆశిస్తోంది. ఈ  కొత్త మోడల్ భాగస్వాములకెలా పని చేస్తుందో, సినిమా ప్రేక్షకులకి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో కంపెనీ వివరించింది.
        
ఈ కంపెనీ మూడు సంవత్సరాలుగా ఈ మోడల్ పై పనిచేస్తోంది. ఈ మోడల్ కింద ఓ సినిమా థియేటర్ని   మధ్యప్రదేశ్  లోని గ్వాలియర్‌లో ప్రారంభించి ఏడాది దాటింది. ఈ మోడల్‌ ని ప్రకటించే ముందు దాని విజయాన్ని నిర్ధారించడానికి మొదట కొన్ని తమ సినిమా థియేటర్లని నిలిపివేయాలని కోరుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది.
       
ప్రదర్శనా రంగంలో
దేశంలో రెక్కలు విప్పాలనే కంపెనీ ఆలోచన అడ్డంకులు కూడా ఎదుర్కొంది. ఎందుకంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే దానిని సాధ్యం చేయదు. మన దేశం భారీ బాక్సాఫీసు టర్నింగ్ వున్న దేశం. ఇందులో  హాలీవుడ్ సినిమాలు ఎనిమిది శాతం మాత్రమే రాబడిని అందిస్తే, మిగిలిన 92% బాక్సాఫీసు కలెక్షన్లు ప్రాంతీయ, స్థానిక,  హైపర్ లోకల్,  బాలీవుడ్ తదితర కంటెంట్ ల నుంచి వస్తాయి. ఈ క్రమంలో కంపెనీని  బీసీ  సెంటర్లకి విస్తరిస్తే, కంటెంట్ అప్పీల్ ని మరింత పెంచడంలో సహాయపడుతుందని భావిస్తోంది.  
        
FOCO మోడల్ కింద రాబోయే కొత్త సోషల్ హబ్‌లు పట్టణ- గ్రామీణ ప్రేక్షకులకి సినిమాలతో బాటు ఆహారాన్నీ, ఆట పాటల్నీ అందిస్తాయి. పూర్తిగా సామాజిక కేంద్రాలుగా ఇవి వుంటాయన్న మాట. ప్రేక్షకులు తిన్నంత తిని, ఆటలాడుకుని వెళ్ళిపోవచ్చు, సినిమాలు చూడాలని రూలేం లేదు. లేదా సినిమాలతో పాటు ఆహారం, ఆటపాటలు కూడా వినోదించవచ్చు.ఈ విధానం సరసమైన లగ్జరీ సినిమా అనుభవాన్ని బీసీ ప్రేక్షకులకి సైతం అందింహడానికి వీలు కల్పిస్తుంది.
       
దేశవ్యాప్తంగా సినిమా మౌలిక సదుపాయా
ల్ని  అభివృద్ధి చేయడం ద్వారా,  బాక్సాఫీసు ఆదాయం ద్వారానూ స్థానిక నిర్మాతలకి, కళాకారులకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, తద్వారా నిరంతర కంటెంట్ సృష్టిని ప్రోత్సహించాలని కంపెనీ నిర్ణయించుకుంది.  ఈ ఆర్ధిక సంవత్సరం మొదట్లో FOCO మోడల్‌ ని ఉపయోగించి రాయ్‌పూర్‌లో 5-స్క్రీన్ల  మల్టీప్లెక్సుని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దీని విస్తరణని వేగవంతం చేయడానికి ఇదొక కీలక వ్యూహంగా భావిస్తోంది. బీసీ సెంటర్లు ప్రీమియం సినిమా అనుభవాల కోసం గణనీవృద్ధి సామర్థ్యాన్ని కలిగి వున్నాయని తెలిపింది.  ఈ మోడల్‌ ని  మెరుగుపరచడానికి కంపెనీ గత మూడున్నర సంవత్సరాలుగా పెట్టుబడులు వెచ్చించిందని, దీని ఫలితంగా అమలు సమయంలో 50% ఆదా అయిందనీ  పేర్కొంది.
       
వినోద అవకాశాలు పరిమితం
గా వున్న ఈశాన్య ప్రాంతాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, దేశమంతటా సినిమా యాక్సెస్‌ ని విస్తృతం చేయవలసిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది.  మూడవ త్రైమాసిక నివేదికలో, 22 సినిమాహాళ్ళ లో 100 స్క్రీన్‌ల కోసం ఒప్పందాలపై సంతకం చేసినట్లు వెల్లడించింది. వీటిలో 8 FOCO సినిమాహాళ్ళలో 31 స్క్రీన్‌లు, 14 అసెట్-లైట్ సెటప్‌లలో 69 స్క్రీన్‌లూ సరసమైన లగ్జరీ సుఖాన్ని అందిస్తాయని, కొత్త అనుభవాల కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ ని ఇవి తీరుస్తాయనీ కంపెనీ తెలియజేసింది.
       
మరి ఇది తెలుగు రాష్ట్రాల్లో నిర్మాతల్ని
, ఎగ్జిబిటర్లని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడంటే ఇప్పుడు కాకపోవచ్చుగానీ, రాబోయే మూడు  నుంచి ఐదేళ్ళ కాలంలో బీసీ సెంటర్లలో ఈ మోడల్ విస్తరణ పూర్తయితే, నిర్మాతలూ ఎగ్జిబిటర్లూ ఇరుకున పడొచ్చు. పీవీఆర్ - ఐనాక్స్ దేశంలో ఎక్కడా పర్సెంటేజీ తప్ప మరో విధానాన్ని అనుమతించదు. ఇలాంటప్పుడు సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజీ డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్ల పంట బీసీ సెంటర్లలో పండొచ్చు. నిర్మాతలు బీసీ సెంటర్లలోని పీవీఆర్ -ఐనాక్స్ మల్టీప్లేక్సులతో బాటు, మొత్తం ఏబీసీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్స్ అన్నిటికీ పర్సెంటేజీకి అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడొచ్చు. ఇక పీవీఆర్- ఐనాక్స్ పుణ్యమాని బీసీ సెంటర్లలో పర్సెంటీజీ లభించినా, అక్కడ పీవీఆర్ -ఐనాక్స్ ధాటికి తట్టుకోలేక, సింగిల్ స్క్రీన్ థియేటర్లు  మూతబడి, ఎగ్జిబిటర్ల వ్యవస్థ తుడిచిపెట్టుకు పోవచ్చు.
       
ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ని నడపాలంటే నెలసరి 5 లక్షలు ఖర్చవుతోందన్న ఎగిబిటర్లు- సింగిల్ స్క్రీన్స్ ని ఇంకా అదే కాలం చెల్లిన థియేటర్లలో నిర్వహించడం విచిత్రం. నగరాల్లో సింగిల్ స్క్రీన్స్ ని ఆధునికంగా మార్చి నిర్వహిస్తున్న మల్టీప్లెక్స్ కంపెనీల విజ్ఞత ఎగ్జిబిటర్లకి కూడా కలిగితే
, బీసీ సెంటర్ల స్క్రీన్స్ ని ఆధునీకరించడానికి పెట్టుబడులు పెట్టక తప్పదు.
       
ఓటీటీల కాలంలో వందల కోట్లు వెచ్చించి బీసీ సెంటర్లలో పీవీఆర్- ఐనాక్స్ కంపెనీ చేపట్టిన విస్తరణ కార్యక్రమం తెలివితక్కువ తనమనుకోవాలా
? ఎగ్జిబిటర్లు మిగలాలంటే సింగిల్ స్క్రీన్ల నవీకరణకి పెట్టుబడులు పెట్టి, టికెట్ల రేట్ల దగ్గర మల్టీప్లెక్సులకి గట్టి పోటీ నివ్వొచ్చు- వాళ్ళ పర్సెంటేజీ విధానంతోనే. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏనాటికైనా తీపిగుర్తులు.  వీటిని పరిరక్షించుకోవడం ఎగ్జిబిటర్లదే కాదు నిర్మాతల బాధ్యత కూడా!

***

Thursday, April 24, 2025

1377 : బుక్ రివ్యూ!

 

          కొరియన్ సినిమాల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. తెలుగులో ఫ్రీమేకో, రీమేకో అయిన కొరియన్ సినిమాలు కొంత కాలం క్రితం వరకూ వచ్చేవి. ప్రస్తుతం ఓటీటీల్లో మలయాళం సినిమాల మీద  తెలుగు ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. గతంలో పిల్ల జమీందార్, గాడ్సే, ప్లే బ్యాక్, నెక్స్ట్ నువ్వే, జేమ్స్ బాండ్- నేను కాదు నా పెళ్ళాం వంటి కాపీ చేసుకునే స్వేచ్ఛ కల్పించుకుని కొరియన్ ఫ్రీమేకులు; ఓ బేబీ, శాకినీ ఢాకినీ వంటి అధికారిక రీమేకులూ చేశారు. ఇలా తెలుగునాటే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ  కొరియన్ సినిమాలు పాపులర్ అయి హాలీవుడ్ సినిమాల తర్వాతి స్థానంలో వుంటున్నాయి. ప్రేక్షకుల మనసుల్ని విపరీతంగా గెలుచుకునే తమదైన కథా కథన శైలులతో సీరియస్ థ్రిల్లర్లు, రోమాంటిక్ డ్రామాలు, రోమాంటిక్ కామెడీలు, సైకలాజికల్ జర్నీలు, హిస్టారికల్స్... ఇలా అన్ని జానర్లలోనూ వెల్లువెత్తుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే 226 సినిమాలు విడుదలయ్యాయి. ప్రతి సంవత్సరం 500 పై చిలుకు విడుదలవుతున్నాయి. గత సంవత్సరం 8 వందల 51 మిలియన్ల 4 వేల నలబై ఆరు డాలర్ల బాక్సాఫీసుతో బలమైన మార్కెట్టుగా స్థానం సంపాదించుకున్నాయి. బాంగ్ జూన్-హో (పారాసైట్), పార్క్ చాన్-వుక్ (ఓల్డ్ బాయ్), కిమ్ కీ-డుక్ (స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్... అండ్ స్ప్రింగ్) వంటి దర్శకులు సాంప్రదాయ సినిమాలకి అతీతంగా ప్రయోగాలు చేసి, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. ముఖ్యంగా 2020లో పారాసైట్ కి ఆస్కార్ అవార్డు  లభించడం కోరియన్ సినిమాలకి గ్లోబల్ వేదిక పైన భారీ గుర్తింపుని  తీసుకువచ్చింది.

కొరియన్ సినిమాలకి ఈ ప్రత్యేకతని ఇచ్చింది సామాజిక విషయాల్ని ధైర్యంగా తడిమే విధానం, సంక్లిష్ట పాత్రలు, వాటితో అనూహ్య మలుపులూ... మెమోరీస్ ఆఫ్ మర్డర్  లోని వాస్తవికతా స్పర్శ, ట్రెయిన్ టు బూసాన్ లోని భావోద్వేగ ఉథృతీ - ఇవన్నీ దేశీయ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్ని తాకుతున్నాయి.  మిగతా ప్రపంచ సినిమాలకి స్ఫూర్తిగా నిలుస్తూ, సవాళ్ళని విసురుతూ, వినోదాన్ని అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి.
        
అయితే ఇంత నేపధ్యం, ప్రశస్తి వున్న కొరియన్ సినిమాలపై  తెలుగులో పుస్తకం రాకపోవడం ఒక లోటుగానే వుంటూ వచ్చింది. ఈ లోటుని తీరుస్తున్నట్టు ఆ మధ్య సంచిక వెబ్సైట్ లో కొరియానం పేర కొరియన్ సినిమాల్ని పరిచయం చేసే శీర్షిక ప్రారంభమైంది. ఆ పరిచయకర్త సినిమా రివ్యూ రైటర్ గా రాణిస్తున్న గీతాచార్య. కొరియన్ సినిమాలపై ఈయన్ని మించిన అథారిటీ లేకపోవచ్చు తెలుగులో. ఒక థీసిస్ కి సరిపడా నాలెడ్జి సంపాదించుకుని రాసిన ఈ వ్యాసాల పరంపర తాజాగా పుస్తకరూపంలో వెలువడింది.  పుస్తకం పేరు కొరియానం’. దాదాపు 500 పేజీల సమగ్ర దర్శనం.
        
కొరియానం పుస్తకం కొరియన్ సినిమాలపై లోతైన విశ్లేషణని అందిస్తుంది. దాదాపు 60 సినిమాలు ఈ విశ్లేషణలో కన్పిస్తాయి. ఓల్డ్ బాయ్ దగ్గర్నుంచీ ది ఔట్ లాస్ వరకూ ప్రత్యేకించి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశాపరిశీలన ఇందులో వుంది. మనిషి ఆలోచనలు, కోపం, గా ప్రతీకార వాంఛలు వంటి భావోద్వేగాల ప్రయోగం ఎలా జరిగిందో వివరిస్తుంది. అంతేగాక ఆయా సినిమాల మేకింగ్ లో కొరియెన్ సాంకేతిక, సృజనాత్మక కళలు ఏ తీరానికి చేరాయో వివరణ వుంది. ఆయా దర్శకుల పని విధానం గురించి వర్ణన వుంది. మధ్య లో స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి కూడా వుంది.
       
ఓల్డ్ బాయ్ తీసిన పార్క్ చాన్ -వూక్ గురించి ఎక్కువ పేజీలు ఇందులో కనిపిస్తాయి.
పార్క్ చాన్-వూక్, కిమ్ కి-డుక్, లీ చాంగ్ డాంగ్ వంటి కొరియన్ బ్రాండ్‌ డైరెక్టర్ల గురించి ఎంత రాసినా తక్కువే. ది క్లాసిక్ తీసిన క్వాక్ జే యంగ్ కూడా తీసిపోడు.  అయితే పార్క్ చాన్ -వూక్ ప్రధాన స్రవంతి సినిమాలు ఎక్కువగా ఆందోళన, నిరాశ, అసూయ, అశాంతి, ఆగ్రహం వంటి భావోద్వేగాల కూడికగా వుంటాయని ఈ పుస్తకం చదివితే తేటతెల్లమవుతుంది.
       
దక్షిణ కొరి
యా సమాజపు కోరికలు, దుఃఖం, అణచివేత- వీటికి బాధితులో బానిసలో అయ్యే  కార్మికులు, సెక్స్ వర్కర్లు, నిరుద్యోగులు, మాదకద్రవ్యాల బానిసలు, గ్యాంగ్‌స్టర్లు, అప్పుల్లో వున్న వ్యక్తులందరూ ఈ పుస్తకంలోని అధ్యాయాల్లో కనిపించి  దక్షిణ కొరియా సమాజం పట్ల ఒక అవగాహనని ఏర్పరుస్తారు. వీళ్ళందరూ పోరాటం చేసే వ్యక్తులే.
       
ఈ పుస్తకం వెనుక గీతాచార్య చేసిన చాలా కృషీ
, పడ్డ శ్రమా కనిస్తాయి. అయితే పుస్తకాన్ని సీరియస్ గా రాయకుండా కామెడీలు చేస్తూ రాయడంతో, మధ్యమధ్యలో తెలుగు, హిందీ సినిమాలూ, వాటి నటులూ ఈ కామెడీలకి మినహాయింపు  కాకపోవడంతో, ప్రింట్ మీడియాలో ఇదొక అరుదైన ఇన్ఫోటైన్మెంట్ ప్రయోగంగా ప్రూవ్ చేసుకుంటుంది.
—సికిందర్

వెల : రూ. 500
కాపీలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ :
80081 60011