రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జూన్ 2021, మంగళవారం

1049 : రివ్యూ


 

(సారీ రీడర్స్, పూర్తి కాలం ఒక పని మీద వుండడంతో బ్లాగుకి కొంత విరామమివ్వక తప్పలేదు)

రచన – దర్శకత్వం : విజే గోపీనాథ్
తారాగణం : వెట్రి, మోనికా చిన్నకొట్ల, కరుణాకరన్, రోహిణి, మైమ్ గోపీ తదితరులు
కథ : బాబూ తమిళ, సంగీతం : కె ఎస్ సుందరమూర్తి, ఛాయాగ్రహణం : ప్రవీణ్ కుమార్
బ్యానర్ : వెట్రి వేల్ శరవణ సినిమాస్, బిగ్ ప్రింట్ ప్రొడక్షన్
నిర్మాతలు : ఎం. వేలా పాండియన్, ఎస్, వేలా పాండియన్, సుబ్రహ్మణ్యన్ వేలా పాండియన్
విడుదల : జూన్ 28, 2019,  ఆహా విడుదల : జూన్ 25, 2021

        మిళంలో 2019 లో విడుదలైన జీవి (మేధావి) తెలుగు డబ్బింగ్ ఆహా లో విడుదలయింది. వెట్రి హీరో. విజే గోపీనాథ్ కొత్త దర్శకుడు. ఇతను కొత్త తరహా కథతో సినిమా తీసుకొచ్చాడు. సారూప్యతా సిద్ధాంతమని చెప్పి దాని ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ తీశాడు. సారూప్యతా సిద్ధాంతమంటే ఏమిటి? దీన్నెలా తీశాడు? ప్రేక్షకులకి అర్ధమయ్యేట్టు తీశాడా? మేధో ప్రదర్శన చేశాడా? ఒకసారి చూద్దాం...

కథ


        ఎనిమిదో తరగతితో చదువాపేసిన శ్రీనివాస్ (వెట్రి) వూళ్ళో  ఆవారాగా వుంటాడు. దౌర్జన్యాలు చేస్తూంటాడు. తల్లి తిడుతుంది, తండ్రి వెనకేసుకొస్తాడు. ఓ చెల్లెలు వుంటుంది. అతను చదువాపేసినా, వివిధ విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో వుంటాడు. దాంతో పుస్తకాలెక్కువ చదువుతాడు. ఇంతలో తండ్రి ఆరోగ్యం పాడవడంతో ఇంట్లో వొత్తిడికి పని చేసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. హైదారాబాద్ వచ్చి జ్యూస్ షాపులో చేరతాడు. అదే షాపులో మణి (కరుణాకరన్) టీ అమ్ముతూంటాడు. ఇద్దరూ మిత్రులవుతారు ఒకే ఇంట్లో అద్దెకుంటారు. ఆ ఇంటి యజమానురాలు లక్ష్మి (రోహిణి). ఈమె భర్త మంచాన పడి వుంటాడు, కూతురు అంధురాలు.

ఇలా వుండగా, జ్యూస్ షాపు ఎదురుగా మొబైల్ షాపులో ఆనంది (మోనికా చిన్నకొట్ల) పని చేస్తూంటుంది. ఈమెతో ప్రేమలో పడతాడు. ఈమెకి వేరే పెళ్ళి నిశ్చయమవడంతో అటు మొగ్గుతుంది. సంపాదన ఏమీ లేని ఇతడికంటే ఆ సంబంధమే ఆమెకి నచ్చి వెళ్ళిపోతుంది. దీంతో తీవ్ర బాధకి లోనై, డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తాడు. ఇంటి యజమానురాలు లక్ష్మి, కూతురి పెళ్ళికి దాచిన నగలు కొట్టేయాలని మిత్రుడు మణితో కలిసి పథకమేస్తాడు. ఆ నగలు కొట్టేస్తాడు. దీంతో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. గతంలో లక్ష్మి జీవితంలో జరిగిన సంఘటనలే ఇప్పుడు తన జీవితంలో జరుగుతూంటాయి. కంగారు పడతాడు. ఎందుకిలా జరుగుతోంది? ఈమె జీ వితానికీ, తన జీవితానికీ ఏమిటి సంబంధం? ఈ రహస్యం తెలుసుకోవడానికి పూను కుంటాడు...

ఎలావుంది కథ

      మల్టీపుల్ టైమ్ లైన్ తరహాకి చెందిన సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కథ. అయితే వేర్వేరు కాలాల్లో జరిగే మల్టీపుల్ టైమ్ లైన్లో కథలు హైపర్ లింక్ కథల్లాగా ఈ ప్రక్రియలో ఎక్కడా కనెక్ట్ కావు. కానీ సంఘటనలు, భావోద్వేగాలు, అంతరార్ధాలూ ఒకేలా వుంటాయి. దీంతో ప్రేక్షకులు ఈ ప్రపంచంలో మనుషులంతా తెలియకుండానే కనెక్ట్ అయివుంటారని ఫీలవుతారు. ఐతే కర్మ సిద్ధాంతం పని చేసినప్పుడు ఆ జీవితాలూ సంఘటనలూ ఒక బిందువు దగ్గర కనెక్ట్ అయి, తెలియని రహస్యం బయటపెట్టి, పెండింగులో వున్న నిష్కృతిని కోరుతాయి. ఇది గ్రహించి నిష్కృతి చేసుకోక పోతే, సంఘటనల చట్రాన్ని ఆపెయ్యక పోతే, పరిణామాలు మరింత సంక్షోభానికి దారితీస్తాయి. దీన్ని సారూప్యతా సిద్ధాంతమన్నాడు దర్శకుడు.

        ఈ కథలో ఇంటి యజమానురాలు లక్ష్మి తో బాటు, ఆమె తమ్ముడి జీవితంలో సంఘటనల్లాంటివి శ్రీనివాస్ జీవితంలో ప్రారంభమవుతాయి. లక్ష్మి ఇంట్లో తను చేసిన దొంగతనం లాగే, గతంలో కిరణ్ చేసిన ఒక దొంగతనం వుంటుంది. ఈ గతాన్ని పూర్తిగా తెలుసుకుంటే తప్ప పరిష్కార మార్గం కన్పించేలా లేదు. ఇంకోటేమిటంటే, గతంలో లక్ష్మి జీవితంలో జరిగిన విషాద సంఘటలు, ఇప్పుడు శ్రీనివాస్ చెల్లెలికీ జరుగుతూండడంతో- దీన్నాపడానికి- చట్రాన్ని త్రుంచెయ్యడానికి - చదువు మానేసిన ఒక జీవి (జీనియస్) గా ఏం చేశాడన్నదే ఈ విధితో పోరాట కథ.

        విద్యార్హతల్లేక పోయినా బ్రతుకు పోరాటంతో బాటు, కాస్త లౌకిక జ్ఞానాన్ని పెంచుకునే పఠనాసక్తిని కలిగి వుంటే, మూఢ నమ్మకాలతో బాబాల చుట్టూ తిరగకుండా, తార్కిక శక్తితో సమస్యల్ని పరిష్కరించుకో గలరన్న సందేశం - ఈ కథ ద్వారా ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. 

నటనలు- సాంకేతికాలు

         వెట్రి (అంటే విజయమని అర్ధం) ఈ మేధావి పాత్రని మేధావిలా ఫోజు కొట్టకుండా, ఓవరాక్షన్ లేకుండా, సామాన్య ప్రేక్షకులకి దగ్గరయ్యేలా అణిగిమణిగి పాత్రలో లీనమై నటించాడు. సారూప్యతా సిద్ధాంతాన్ని కూడా సామాన్య భాషలో సులభంగా అర్ధమయ్యేలా - ఒకే రకమైన సంఘటనలు వేర్వేరు కుటుంబాల్లో వేర్వేరు కాలాల్లో జరుగుతూంటాయి. అవెన్ని తరాలపాటు కొనసాగుతాయో ఎవరూ చెప్పలేరు. అవి కొనసాగకుండా ఆపడానికి ఏదో వొక పాయింటులో ఆ చైన్ ని బ్రేక్ చేయాలి అని వివరిస్తాడు.

        విద్యార్హతలు లేకపోయినా వివిధ విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలమనే డైనమిక్స్, దాంతో పుస్తక పఠనం, రొటీన్ ఆవారా పాత్ర టెంప్లెట్ ని విరిచేసి, ఈ పాత్రని విజిబుల్ గా మార్చాయి. పుస్తకాలు చదివే అలవాటుంటే సమూహంలో విలువ పెరుగుతుంది -గ్రాడ్యుయేషన్ చేశారా, నిరక్షర కుక్షిగా రిక్షా తోలుతున్నారా నిమిత్తం లేకుండా. వెట్రి పుస్తక జ్ఞానంతోనే పోలీసులకి దొరక్కుండా దొంగతనమెలా చేయాలో పకడ్బందీగా చేస్తాడు. చేశాక పోలీసు విచారణని తప్పుదోవ పట్టించే చిట్కాలు కూడా ప్రయోగిస్తాడు. ఒక పెద్ద మనిషిలా కన్పించే పోలీసు ఇన్ఫార్మర్  దగ్గర గుట్టుగా కూపీ లాగుతూ.

        ఐతే వూళ్ళో వున్నపుడు విద్యాభ్యాసం గురించి చులకనగా మాట్లాడి, కొత్త పరికరాలు కనుగొనడానికి చదువక్కర్లేదంటాడు. కానీ నగరానికి వచ్చి జీవితంలో పైకి రావడానికి కొత్త పరికరమేదో కనిపెట్టకుండా దొంగతనానికి దిగజారతాడు. అంత పుస్తక జ్ఞానమున్న వాడు ప్రేమించే అమ్మాయిని పోగొట్టుకుని డిస్టర్బ్ అయిపోతాడు. జ్ఞానాన్ని సమస్యలు ఓడిస్తాయా? ఇలా కథనం కోసం పాత్ర చిత్రణని బలి చేశారు. పుస్తకాభిలాషి నేరాలెందుకు చేస్తాడనేదీ ప్రశ్నే. క్రైమ్ ఫిక్షన్ చదివే వాడైతే అర్ధం జేసుకోవచ్చు. ఆర్గానిక్ గా వున్న ఈ ఇంటలిజెంట్ కథకి ఇంటలిజెంట్ రైటింగ్ వుంటే బావుంటుంది. సింథటిక్ రైటింగ్ మూస ఫార్ములాకి చెల్లిపోవచ్చు-ఏదోలే పోనీ అని మనం సర్దుకుని చూడ్డానికి.  

        వెట్రి నటించిన అతి టెర్రిఫిక్ సీను, పట్టపగలు లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి బీరువాలో నగలు దొంగిలించే సీను. ముత్యాల ముగ్గు లో నూతన్ ప్రసాద్ సంగీత గదిలోకి దూరి కుట్రకి పునాది వేసే టెర్రిఫిక్ సీనుని గుర్తుకి తెస్తుంది. ఒక విషయం గమనిస్తే, మాస్టర్ ప్లానుతో క్రైమ్ ఎలిమెంటు వున్న కుటుంబ కథలు నిలబడ్డాయి. ఈ విషయం బ్లాగులో ఒకటి రెండు సార్లు చెప్పుకున్నాం.

        ఆనంది జస్ట్ కరివేపాకు పాత్ర పోషించింది. ఈ పాత్ర వెట్రి డబ్బు సంపాదన పైపు, తద్వారా దొంగతనం వైపూ మళ్ళేందుకు కారణమయ్యే ఉత్ప్రేరక పాత్రగా పనిచేసి కథలోంచి తప్పుకుంది. మణిగా నటించిన కరుణాకరన్, ప్రేక్షకులకొచ్చే సందేహాలడిగే ఎక్స్ ప్లోరర్ పాత్రగా యాక్టివ్ గా వుంటాడు. ఇంటి యజమానురాలు లక్ష్మిగా రోహిణికి మంచి పాత్ర లభించింది. అద్దెకున్నవాళ్ళని బంధువులుగా నమ్మి ఆదరించే హూందా పాత్ర, కీలక పాత్ర.           

     మూడు మాంటేజ్ సాంగ్స్ వున్నాయి. ఒకటి రోమాంటిక్, రెండు థీమ్ సాంగ్స్. ఇవి మామూలుగా వున్నాయి. బిజీఎమ్ కూడా సాధారణమే. కెమెరావర్క్ తో లోబడ్జెట్ అన్పించకుండా కవరైంది. అయితే హీరో అద్దెకున్న ఫ్లాట్, లక్ష్మి ఫ్లాట్ అపార్ట్ మెంట్ కి తగ్గట్టు ఇంటీరియర్స్ వుండవు. ఈ ఇంటీరియర్స్ ని వేరే ఎక్కడో పాత ఇంట్లో చీట్ చేసినట్టు వుంటాయి. ఇక తమిళ ఒరిజినల్లోని చెన్నై డబ్బింగు వెర్షన్లో హైదారాబాద్ అయింది. ఆటోవాలా మణికొండ అని అరవడం బాగానే వుంది. కానీ ఇంకో ఆటోవాడు అలకాపురి అని అరవడం నవ్వు తెప్పిస్తుంది. హైదారాబాద్ లో మణికొండ ఏ మూలవుంది, అలాకాపురి ఏ మూల వుంది? 30 కిలో మీటర్ల దూరం!

చివరికేమిటి


     ఫస్టాఫ్ హీరో హైదారాబాద్ లో గతాన్ని తల్చుకుంటూ వుంటే వూళ్ళో జీవితం ఫ్లాష్ బ్యాక్స్ లో వస్తూంటుంది. తర్వాత హైదారాబాద్ లో జ్యూస్ షాపులో పని, హీరోయిన్ తో ప్రేమ, బ్రేకప్, దొంగతనం ప్లాను, దొంగతనం, లక్ష్మి గతంతో పోలికా తెలిసి సమస్యలో పడ్డంతో గంట సమయంలో ఇంటర్వెల్ వస్తుంది. వూళ్ళో జీవితం, హీరోయిన్ తో ప్రేమా ఇవన్నీ రిపీట్ చేసిన మూస ఫార్ములా సీన్లుగా వుంటాయి. ఈ ఫస్టాఫ్ లో దొంగతనానికి దిగడం ప్లాట్ పాయింట్ వన్ గా వస్తుంది.

                  ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో ఇన్స్ పెక్టర్ విచారణ, వేధింపులు, దొరక్కుండా హీరో ఎత్తుగడలూ వచ్చి, లక్ష్మి జోక్యంతో పోలీసు విచారణ ఆగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభంలోనే లక్ష్మి తమ్ముడు కిరణ్ వచ్చి, హీరోని అనుమానించే దృశ్యాలూ వస్తాయి. అతడి మాటల్లో హీరోకేదో క్లూ దొరికి, నిడదవోలులో అతడి గత జీవితం తెలుసుకోవడంతో ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఇలా సంఘటనల మర్మం తెలుసుకున్నాక తన జీవితంలో సంఘటల్ని ఆపడానికి ఉపక్రమించడంతో క్లయిమాక్స్ వస్తుంది.

        ఇందులో హీరోకి ప్రత్యర్ధి ఎవరూ లేరు, లక్ష్మి ప్రత్యర్ది కాదు, ప్రత్యర్ధిగా కన్పించే ఇన్స్ పెక్టర్ పాత్ర సమాప్త మవుతుంది. విధియే హీరో ప్రత్యర్ధి. అందుకే క్లయిమాక్స్ పరిస్థితిని చక్కదిద్దే చర్యల కారణంగా సంఘర్షణ లేక, థ్రిల్లింగ్ గా వుండక, హీరో పక్షంగా సాదాగా ముగిసిపోతుంది. ఈ ముగింపు కథా పరంగా సందేహాలు మిగలకుండా రౌండప్ అయిపోతుంది.

        ఫస్టాఫ్ లో దొంగతనాన్ని ప్లాను చేసే దగ్గర్నుంచి, కథ ముగింపు వరకూ కథనం బిగి సడలకుండా నిర్వహించాడు దర్శకుడు. కథా సౌలభ్యంకోసం ఇంటలిజెంట్ రైటింగ్ ని అక్కడక్కడా వదిలేశాడు. తెచ్చి పెట్టుకున్న కాకతాళీయాలు కల్పించాడు. హీరో దొంగతనం చేయాలనుకున్నాక అతడికి తాళం చెవి దొరికే దృశ్యాలు ఈజీగా కల్పించేశాడు. ఆమె బైక్ మీంచి పడి తాళం చెవి పోగొట్టుకోవడం, అక్కడికి నడుచుకుంటూ వస్తున్న హీరోకి ఆ తాళం చెవి దొరకడం లాంటివి.

        మూస ఆవారా పాత్ర హీరో పుస్తకాలు చదివే అలవాటుతో ఇంటలిజెంట్ గానే వున్నాడు. దర్శకుడు, రచయిత ఈ రియలిస్టిక్ జానర్ తో కుదరదనుకున్న చోటల్లా రాజీ పడి, ఫార్ములా సీన్లు- రియలిస్టిక్ సీన్లుగా ఈ స్క్రీన్ ప్లే తయారు చేశారు. సగటు ప్రేక్షకుడికి కూడా అర్ధమయ్యేలా సంఘటనలతో కాన్సెప్ట్ ని వివరించడమే కథని నిలబెట్టింది.
సికిందర్

19, జూన్ 2021, శనివారం

1048 : స్పెషల్ ఆర్టికల్


     ఐడియాలు రెండు రకాలు : నిజ కథల ఐడియాలు, కల్పిత కథల ఐడియాలు. రీసెర్చి అన్నప్పుడు ఐడియాలకి రీసెర్చి అవసరం, కథలకి కాదు. కథలు క్రియేటివ్ కలాపం మాత్రమే. ఇది ఐడియాని బట్టి చేసుకోవచ్చు. ఐడియాలనేవి కథలకి క్రియేటివ్ కథనాన్నిచ్చే ఇంటలిజెన్స్ -మదర్ బోర్డ్ - కంట్రోల్ రూమ్ - ఏదైనా అవచ్చు-  అలా ఐడియాలు కథల్ని కంట్రోలు చేస్తాయి. కథ చేస్తున్నప్పుడు అనుకున్న ఐడియాని ఎక్కడో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కూడా జరుగుతూంటుంది. లైన్ ఆర్డర్ తర్వాత ట్రీట్ మెంట్ మారవచ్చు, ట్రీట్ మెంట్ తర్వాత డైలాగ్ వెర్షనూ మారవచ్చు. కానీ మొదట అన్నివిధాలా విశ్లేషించుకుని నమ్మి నిర్మించుకున్న ఐడియా మాత్రం ఏ దశలోనూ మారకూడదు. కథ- అంటే లైనార్డర్ ట్రీట్మెంట్ డైలాగ్వెర్షన్ వీటన్నిటినీ కలుపుకుని కంట్రోల్ చేసేదే ఐడియా. ఐడియా అంటే కథకి గోల్. అందుకని ఐడియా పాలనలో క్రియేటివ్ కల్పన వుండేట్టు చూసుకోవడం ముఖ్యం.

      కనుక ఐడియాలకే రీసెర్చి అవసరం. తర్వాత పాత్రలకి కథనానికి రీసెర్చి అవసరముంటే చేసుకోవడం అది వేరే అనుబంధ ప్రక్రియ. ఐడియా రీసెర్చి వుంటేనే ఈ ప్రక్రియ. ఇది సమస్య కాదు. ఐడియాల విషయానికొస్తే, ఈ వ్యాసం మొదటి భాగం 1045 లో ఐడియా రీసెర్చికి ముందుగా ఐడియా పూర్తి స్థాయి మార్కెట్ యాస్పెక్ట్ విశ్లేషణ, స్ట్రక్చర్ చూసుకున్న తర్వాతే, ఇవి కుదిరినప్పుడే, రీసెర్చికి పూనుకోవాలని చెప్పుకున్నాం. ఐడియాని  రీసెర్చి చేయడమంటే ఐడియాకి సంబంధించిన విషయకరణ చేయడం. విషయ సేకరణ కష్టమేం కాదు. దీనికి అందుబాటులో చాలా వనరులుంటాయి. ముందుగా ఐడియాని అది కోరుకుంటున్న గరిష్ట స్థాయి వినియోగ శక్తిని గుర్తించడమే కష్టం. దీన్ని సులభతరం చేయడానికే ఈ వ్యాసం.
        
    ఐడియా రబ్బరు బ్యాండు లాంటిది. ఎంత లాగితే అంత సాగుతుంది. తక్కువ లాగితే తక్కువలో వుండిపోతుంది. అందుకని దాని సాగే గుణాన్ని (స్థితి స్థాపక శక్తిని) గుర్తించడం అవసరం. లేకపోతే గత వ్యాసంలో చెప్పుకున్నట్టు నాంది’, మోసగాళ్ళు’, ఒన్ లాంటి పానిండియా వైరల్ అవాల్సిన ఐడియాలు లూజ్ రబ్బర్ బ్యాండులై పోతాయి.
         
    ఒక వేళ ఐడియా గరిష్ట సామర్ధ్యాన్ని గుర్తించినా, ఇదంతా మన తెలుగు సినిమాల కెందుకులే అని రిస్కు తీసుకోకుండా, ప్రేక్షకులకి అలవాటైందని భావించుకుంటున్న ఫార్ములా చట్రంలో బిగించేద్దామనుకుంటే- ఆ ఐడియాలు పై మూడిటి ఐడియాల్లాగే కాలం చెల్లిన రొటీన్ ఫార్ములా కథలై పోతాయి. ప్రేక్షకులే రిస్కు అనుకోకుండా, మెయిన్ స్ట్రీమ్ కాదనుకోకుండా, వివిధ రియలిస్టిక్, ఆల్టర్నేట్, ఇండీఫిలిం వెరైటీలు చూస్తున్నప్పుడు, వాళ్ళ స్థితి స్థాపక శక్తి ని కూడా ఆదరించనట్టే అవుతుంది. ఇలా చేయాలనుకున్నప్పుడు రీసెర్చి అవసరమే లేదు.

వ్యతిరేకంగా ఆలోచించాలి
     మండేలా’, బర్ఫీ’, మనం’, హాలాహల్ లాంటి ఐడియాలు వైరల్ అవడానికి కారణం ఇవి ఇన్నోవేట్ చేసిన ఐడియాలు. పాత ఐడియాల్నే మరికొంత లాగి చూస్తే రబ్బర్ బ్యాండులా సాగిన ఐడియాలివి. అపార్ధాలతో విడిపోయి చివరికి కలిసిపోవడం ప్రేమ సినిమాల రెగ్యులర్ టెంప్లెట్. ఇంతవరకే లాగిన ఈ రబ్బర్ బ్యాండుతో వున్న ఐడియాని, మరింత సాగలాగితే, అపార్థాలతో విడిపోవడం గాకుండా, కొట్టుకుని చివరికి విడిపోయే రాడికల్ ఐడియా అవచ్చు. ఐడియాలని what if? ఫ్యాక్టర్ తో ఆలోచించడం అవసరం. అంత వరకూ వచ్చిన, అమల్లో వున్న ఐడియాలనే 'ఇలా జరిగితే?' అని ప్రశ్నించుకుని, వ్యతిరేకంగా ఆలోచిస్తే వైరల్ ఐడియాలవుతాయి.

    ఓటు హక్కు అనే పాత ఐడియా 'మండేలా' గా కొత్త రూపం సంతరించుకుంది. ట్రాజిక్ గా చూపిస్తూ వస్తున్న అంగవైకల్యపు ఐడియాని కామిక్ గా, క్రైమ్ తో కలిపితే 'బర్ఫీ' వైరల్ అయింది. వికలాంగుణ్ణి నేరగాడుగా, కామెడీగా చూపడమేమిటని ధైర్యం చేయకపోతే 'బర్ఫీ' లేదు. 'మనం' లో మూడుతరాల ఐడియానే రీబూట్ చేస్తే, పాత వాసనలు వదిలి ట్రెండీ ఫ్యామిలీ డ్రామా అయింది. హాలాహల్ లో ఒక మెడికల్ స్కామ్ ని తీసుకుని జీవితంలో జరిగే యాంటీ క్లయిమాక్స్ చేశారు. ఇలా హీరో విలన్ చేతిలో చావకూడదనేం లేదు. 'మిస్ ఇండియా' లో అమెరికాలో ఎప్పుడో పరిచయమున్న ఇండియన్ టీని పరిచయం చేసే ఐడియా, వాస్తవ విరుద్ధంగా వుండి బెడిసికొట్టింది. ఇది రీసెర్చి చేయని, వాస్తవాలు తెలుసుకోని విఫల ఐడియా. 
        
    ఐడియాకి రబ్బరు బ్యాండు గుణం కల్పించడానికి చేసే రీసెర్చిలో పత్రికలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, టీవీ, యూట్యూబ్ వంటి ప్రాప్తి స్థానాలు చాలా వుంటాయి. Weird news వెబ్సైట్లు వుంటాయి. చాలా విచిత్ర, నమ్మశక్యం గాని వార్తలు వీటిలో వుంటాయి. ఐడియాకి రబ్బర్ బ్యాండ్ గుణాన్ని కల్పిస్తాయి. ట్రెండింగ్ న్యూస్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సంఘటనలు ఐడియాని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళడానికి పనికొస్తాయి.

ఒక ఉదాహరణ
     రబ్బర్ బ్యాండ్ లా సాగే గుణం గురించి ఒక ఉదాహరణ చూస్తే - మమ్ముట్టి నటించిన మలయాళం ‘ఒన్’ ని తీసుకోవచ్చు. దేశంలో  అనేక సమస్యలుంటాయి. సినిమాల్లో   సమస్యలకి సినిమాటిక్ గా పరిష్కారాలు చూపించడం దగ్గరే ఆగి పోతే సరిపోదు. సమస్యల పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించే కొత్త ఆలోచనకి తెర తీసినప్పుడే రబ్బరు బ్యాండులా సాగుతుంది ఐడియా. కళ్ళ ముందున్న సమస్యని కాక, దాంతో రేపటి కలని చూడగల్గినప్పుడు నెక్స్ట్ లెవెల్ కథల్ని అందించే అవకాశం వుంటుంది.

    ‘'ఒన్ లో రైట్ టూ రీకాల్ చట్టం గురించి ఐడియా. ప్రజలు తామెన్నుకున్న  ప్రజా ప్రతినిధి పనితీరు నచ్చకపోతే, వెనక్కి పిలిచే 'రైట్ టూ రీకాల్'‌ చట్టం ఇంకా పార్లమెంటులో ఆమోదం పొందకుండానే వుంది. పొందదు కూడా. ఈ ఐడియా తీసుకుని రైట్ టూ రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడం లక్ష్యంగా కథ చేశారు. చివరికి పార్లమెంటులో పాస్ అయినట్టు కల్పన చేసి చూపించారు. అసెంబ్లీలో కాలేదని ముగించారు. ఇంతే. ఇలా ఈ కథ రైట్ టూ రీకాల్ ఐడియాతో  కథ పూర్తి వికాసం చెందకుండా అర్ధోక్తిలో ఆగిపోయింది. రైట్ టూ రీకాల్ చట్టం ఆపరేటివ్ పార్టు చూపించకపోవవడంతో, ఉపోద్ఘాతంలా వుందే తప్ప, అసలు కథ చెలామణిలోకి రాకుండా వుండి పోయింది.

     ఏమిటా తవ్వి తీయాల్సిన అసలు కథ? చట్టం పాసయిందా కాలేదా అని కాకుండా, పాసైతే ఎలాటి కొత్త రాజకీయ వాతావరణాన్ని కళ్ళ జూస్తామా అని ప్రజలు ఎదురు చూస్తూంటారు. ఈ తృష్ణ తీర్చాలి. ఇందుకు రైట్ టు రీకాల్ చట్టం గురించి డేటా ఏమేముందో సేకరించాలి. ఇదీ రీసెర్చి.  రైట్ టు రీకాల్ చట్టం పాసై అమల్లోకి వస్తే ఎలాటి పరిణామాలుంటాయో వివరిస్తూ ఇప్సితా మిశ్రా రాసిన ఆర్టికల్ వుంది. ఇందులో చట్టం అమలైతే ఎలా వుంటుందో సినిమా తీయడానికి పనికొచ్చే పాయింట్లన్నీ వున్నాయి. ఈ పాయింట్లు తీసుకుని ‘ఒన్’ ని మించిన హిలేరియస్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తీయవచ్చు. చెప్పాల్సిన కథ ఇందులో వుంది.  అంతేగానీ కేవలం చట్టాన్ని పాస్ చేయించడమనే డ్రామాగా సరిపెట్టడంలో లేదు.

ఉపోద్ఘాతం కూడా...

       పార్లమెంటులో మహిళా బిల్లు కూడా పాస్ కాకుండా వుంది. ఈ ఐడియాని పాస్ చేయించే ఐడియాగా చేసి కథ చేస్తే ఏమిటి ఉపయోగం. పాసైతే ఎన్నికల్లో పాల్గొనడానికి మహిళలు 33 శాతం రిజర్వేషన్ తో రాజకీయాల్లో ఎలాటి మార్పు తేవచ్చో చూపించడంలో థ్రిల్లింగ్ వైరల్ ఐడియా పాయింటు వుంది. ఇదీ పట్టుకోవాల్సిన సరైన మార్కెట్ యాస్పెక్ట్.         

    సూర్య నటించిన తమిళ డబ్బింగ్ ఆకాశమే నీ హద్దురా ఐడియాకూడా దాని గరిష్ట సామర్ధ్యాన్ని అందుకోలేక పోయింది. చూపించాల్సిన కథ అది కాకుండా పోయింది. ప్రేక్షకులు చూడాల్సిన కథ సినిమాలో చూపించిన కథ కాదు. అది కథ కూడా కాదు. కేవలం ఉపోద్ఘాతం. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ విభాగాల బిజినెస్ దృష్ట్యా చూస్తే, అది కేవలం బిగినింగ్ విభాగం. బిగినింగ్ లో వుండే బిజినెస్సే, అంటే కథకి ముందుండే ఉపోద్ఘాతమే సినిమా అంతా.

    ఐడియాలో కథ వుందా గాథ వుందా ముందుగా సరి చూసుకోవాలని గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఒన్’, ఆకాశమే నీ హద్దురా లాంటివి చూస్తే- ఐడియాలో కథ వుందా, గాథ వుందా అని మాత్రమే గాకుండా, కొంపదీసి ఉపోద్ఘాతముందేమోనని కూడా అదనపు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కన్పిస్తోంది.      

      ఆకాశమే నా హద్దురా  కెప్టెన్ గోపీనాథ్ నిజ కథ. చవకలో సామాన్యుల విమానయాన కోరిక నెరవేర్చిన ఘన చరిత్ర అతడి జీవితం. విజయవంతంగా అలాటి విమానయాన సంస్థని కొంత కాలం నడిపి అమ్మేశాడు. ఇది గరిష్ట స్థాయి స్టోరీ ఐడియా. కానీ సినిమాలో చూపించింది మాత్రం అతనా సంస్థని ప్రారంభించడానికి పడిన కష్టాలే. అప్పుడిది పాక్షిక ఐడియా మాత్రమే కాదు, ఉపోద్ఘాతం కూడా అయింది. మెక్ డోనాల్డ్స్ వ్యాపార చరిత్ర ఐడియాతో ది ఫౌండర్ తీశారు. అప్పటికి కేవలం ఒక సెంటర్ నడుపుతున్నమెక్డొనాల్డ్స్ సోదరులతో ఒప్పందం కుదుర్చుకుని, విస్తృతంగా ఫ్రాంచైజీలు ప్రారంభించిన రే క్రాక్, ఏకంగా టేకోవర్ పథకమేసి సంక్షోభం సృష్టిస్తాడు. దీన్ని ఆ సోదరులెలా ఎదుర్కొన్నారన్నది పూర్తి స్థాయి ఐడియా. ఇదీ రీసెర్చి చేయాలి. సంస్థని ప్రారంభించడం కథకాదు, ప్రారంభించాక ఏం జరిగిందన్నది కథవుతుంది. ప్రేమలో పడడం కథ అవదు,డు, పడ్డాక ఏం జరిగిందన్నది కథవుతుంది. హత్య జరగడం కథవదు. జరిగాక ఏం జరిగిందన్నది కథవుతుంది. ఐడియాని ఇలా విశ్లేషించుకున్నప్పుడు గరిష్టంగా దాని సామర్ధ్యం కనపడుతుంది.

సికిందర్


14, జూన్ 2021, సోమవారం

1047 : సందేహాలు - సమాధానాలు


Q : మాములుగా ఎలాంటి థ్రిల్లర్ సినిమాలలో అయినా హీరో పోలీసుగా, లేదా బాగా తెలివి గల వాడుగా ఉంటాడు. సో హీరో తన తెలివితో కేసు సాల్వ్ చేస్తాడు. ఇక మరొక వైపు విలన్ కూడా సైకో కిల్లర్ లేదా బాగా కన్నింగ్. పూర్తి విలన్ లక్షణాలతో ఉంటాడు. అలాగే చాలాసార్లు విలన్ ఒక మానసిక రుగ్మతతో కూడా క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అసలు ఇలా కాకుండా హీరో ఒక మాములు తెలివి తేటలున్న సాధారణ యువకుడై, అలాగే క్రైం చేసిన విలన్ కూడా తెలివి తేటల్లేని సాధారణ యువకుడై వుంటే, వీళ్ళ ఇద్దరి పాత్రలతో క్రైం థ్రిల్లర్స్ చేయలేమా?  అసలు థ్రిల్లర్స్ లేదా ఇన్వెస్టిగేషన్ కథలకి కచ్చితంగా హై పాయింట్ కథలే ఉండాలా? స్లో బర్నింగ్ లాంటి కథలు చేసుకోలేమా? వివరంగా చెప్పండి.

కె. రాజేష్, అసోసియేట్

A : చేసుకోవచ్చు. ఇప్పుడున్న ట్రెండ్ లో ఏమైనా చేసుకోవచ్చు. బెంగాలీలు మలయాళీలూ ఎప్పట్నించో చేస్తున్నారు. ఇప్పుడైనా వాళ్ళ బాట పట్టడం నేర్చుకోవాలి. వీటితో బాటు ఫిలిం నోయర్ సినిమాలున్నాయి. మన దేశంలో క్రైం సినిమాలతో బెంగాలీలు ఎక్కువ ముందున్నారు. అది ఇంటింటా సత్యజిత్ రే వేసిన బాట. మనం మలయాళం తప్ప బెంగాలీ సినిమాలసలే చూడంగా. మమతా బెనర్జీ తొడపాశం పెట్టినా చూడం. ఇలా ఒకలాటి మూసలో బతుకుతూ మూస కాని సినిమాలెలా తీస్తాం. జానర్ స్టడీ లేకుండా సరైన కథలు ఆలోచించలేరు. అపర మేధావి హీరో, అపార తెలివున్న విలన్ - లాంటి పాత్రలతో సినిమా చరిత్ర సమస్తం నిండిపోయింది. ఇవి కృత్రిమ ఫార్ముల్లా కథలు. వాస్తవంలో జరగని పలాయనవాద మూస కథలు. చూసి చూసి విసుగెత్తి వుంటుంది ప్రేక్షకులకి.

        మూసకీ వాస్తవికతకీ తేడా పసిగట్టక పోతే చిన్న సినిమాకిప్పుడు బ్రతుకు లేదు. చిన్న సినిమాలకిక మూస కథల మోజు మనసులోంచి తీసేయాలి. మూసకీ వాస్తవికతకీ జానర్ తేడాలు స్పష్టంగా తెలుసుకున్న నాడే చిన్న సినిమాలకి కొత్త జీవితం లభిస్తుంది. అంతవరకూ ఇంకా చావుబ్రతుకుల సమస్యే. ఆలోచనల్లో ఈ మార్పు నిర్మాతల్లో కూడా రావాలి, నాల్గు డబ్బులు కళ్ళ జూడాలనుకుంటే. నిర్మాతలు పాత కాలంలోనే వుండడంతో ఈ సంవత్సర కాలంగా కనీసం మనకు తెలిసి ఇలాటి పది స్క్రిప్టులు అలా పడి వున్నాయి. వాటిని మూసలోకి మార్చమంటారు. మార్చడానికి యంగ్ మేకర్లు సిద్ధంగా లేరు. ఒక యంగ్ మేకర్ అవకాశాల కోసం దారుణ మసాలా కథగా మార్చేస్తే, మందలించి మాన్పించాం.  

        కనుక వాస్తవిక, రియలిస్టిక్ కథలతో  ప్రేక్షకులతో ఏ పేచీ లేదు, నిర్మాతల అభిరుచులతోనే పేచీ. సినిమా అనేది నిర్మాతల కోసమా ప్రేక్షకుల మార్కెట్ కోసమా  తేల్చుకుంటే గానీ ఈ చిక్కు విడిపోదుప్రేక్షకులు పగటి వేషగాళ్ళు కాదు.

        పగలంతా పడ్డ కష్టం మర్చిపోవడానికి ప్రేక్షకులు పలాయన వాద ఫార్ములా సినిమాలు చూశారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ప్రస్తుత మహమ్మారి సృష్టించిన ఆర్ధికారోగ్య విలయంతో ప్రజలు అంతర్ముఖీనంగా మారుతున్నారు. జీవితం ఏమిటీ అని ప్రశ్నించుకుంటున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా. న్యూయార్క్ టైమ్స్ లో ఎనిమిదేళ్ళ బాలిక తన వేదన రాసుకొచ్చింది. కేరళ నుంచి పదేళ్ళ బాలిక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ప్రతీ వొక్కళ్ళూ అంతర్ముఖీనులవుతున్నారు. ఇంత కాలం బాహ్యంగా జీవించారు. ఇప్పుడు అంతరంగంలోకి చూసుకుంటున్నారు. సబ్ కాన్షస్ మైండ్ తో కనెక్ట్ అయి ఆలోచనాత్మకంగా మారుతున్నారు. త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో మిడిల్ అంటే సబ్ కాన్షస్ మైండే. ఇంతకాలం మిడిల్ తో పలాయనవాద సినిమాలు ఎంజాయ్ చేశాం. ఇప్పుడు దాని మౌలిక స్వరూపం ఆలోచనాత్మక సినిమాలతో ప్రజల తృష్ణ తీర్చడం అవసరం.

        చుట్టూ జీవితంలో కన్పించే మనుషుల్ని తెర మీద చూడాలనుకుంటున్నారు సహజ చిత్రీకరణలతో. తెలివి లేని హీరో, అంతే తెలివిలేని విలన్ నిజ జీవితపు పాత్రలు. పోలీసులు, గూఢచారులు వంటి వాళ్ళకున్న తెలివి తేటలు సామాన్యులకుండవు. అలాటి ఒక తెలివి లేని సామాన్య హీరో, అసలు తెలివంటూ లేని విలన్ లాంటి ఐడియాలతో కచ్ఛితంగా చిన్న సినిమా కథలు చేసుకోవచ్చు. కాకపోతే రియలిస్టిక్ అని అడ్డగోలుగా చేసుకోకుండా స్ట్రక్చర్లో చేసుకోవాలి. రియలిస్టిక్ కి సహజ కథ ఎంత ముఖ్యమో, సహజ పాత్ర చిత్రణలు అంతే ముఖ్యం. ముందు జానర్ స్టడీ, రీసెర్చి  చాలా అవసరం.

Q : సాధారణంగా లవ్ స్టొరీ లలో హీరో హీరోయిన్ పాత్రలకు పెద్దగా గోల్స్ ఉండవు. కేవలం ఎదుటి వారి ప్రేమను గెలుచు కోవడమే వాళ్ళ గోల్ గా ఉంటుంది. అలా కాకుండా ఈ ఫార్మాట్ ను బ్రేక్ చేస్తూ లవ్ లను కొత్తగా ఎలా చేసుకోవాలి?
ఎస్. వినుకొండ, అసోసియేట్

A :  యువతీ యువకుల మనస్తత్వాల్ని తెలుసుకోవాలి. ఒకరు ప్రేమంటే ఆర్ధిక
సమానత్వమంటే, ఇంకొకరు అవసరాలంటారు. ఇలా చాలా నిర్వచనాలుంటాయి. రాడికల్ ప్రేమలు చాలా వున్నాయి బయట.  వాటిని ప్రతిబింబింప జేసే కథలే నమ్మదగ్గ నిజమైన ప్రేమ కథలవుతాయి. యువతరం కనెక్ట్ అయ్యే కథలవుతాయి. కానీ ఏం జరుగుతోంది- అయితే అపార్ధాలతో విడిపోయే, కాకపోతే ప్రేమని వెల్లడించలేక పోయే - ఈ రెండే టెంప్లెట్స్ లో పెట్టి గత రెండు దశాబ్దాలుగా ప్రేమ సినిమాల పేరుతో కాకమ్మ కథలు అమ్మ జూస్తున్నారు. ఇప్పుడు మారాలంటే మారుతారా. మారరుగాక మారారు. ఫెయిల్డ్ ఫార్ములాగా తమకు తెలిసిన ఈ లొట్టపీసు చాక్ పీస్ ప్రేమలే తీస్తూంటారు.  

        ప్రేమల గుట్టుని ఎప్పుడో 1952 లో ప్రసిద్ధ హిందీ రచయిత, ధరమ్ వీర్ భారతి విప్పి చెప్పాడు. శరత్ దేవదాసు కథ డొల్ల తనాన్ని కూడా స్పష్టం చేసే విధంగా నవల రాశాడు. దేవదాసు కథ సామాజికార్ధిక మూలాల్లోంచి ఉద్భవించకపోవడం వల్ల ఆ కాలానికి అది సరి తూగలేదని తేలుస్తాడు. దేవదాసులాగా పునాదిలేని ఉత్త ప్రేమలని గాక, సామాజికార్ధిక కారణాలు కలగలిసిన ప్రేమల్ని ఆయన స్థాపిస్తాడు. సాహసం, పరిపక్వత లేని ప్రేమలు విఫలమవుతాయని చెప్తాడు. ప్రేమలు కావాలన్నా, పోవాలన్నా సామాజికార్ధిక శక్తుల పైనే ఆధారపడి వుంటుందని విశ్లేషణ చేస్తాడు.

    ఆ నవల పేరు  సూరజ్ కా సాత్వా ఘోడా (సూర్యుడి సప్తాశ్వాల్లో ఏడో గుర్రం). దీన్ని 1992 లో శ్యామ్ బెనెగల్ ఇదే పేరుతో అద్భుతంగా తెరకెక్కించారు. 46 ప్రచురణలు పొంది ఇప్పటికీ విపరీతంగా అమ్ముడుపోతున్న నవల. 1999 లో ఇంగ్లీషు అనువాదం విడుదలైంది. యూట్యూబ్ లో నవలా పరిచయం ఇంకా పెడుతున్నారు. లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వుంటున్నాయి యువతరం ప్రేక్షకులతో. సినిమా తప్పక చూసి, వీలైతే నవల కూడా చదివి ప్రేమల వాస్తవ రూపం పట్ల అవగాహన పెంచుకుంటే మంచి కథలు చేసుకోవచ్చు.

Q : క్యారక్టర్ ఆర్క్ అంటారు. అంటే ఏమిటి? దాన్నెలా చూడాలి?
పవన్, అసోసియేట్

A :  తెలుగులో చెప్పాలంటే పాత్రోచిత చాపం. అంటే కథలో పాత్ర ప్రయాణంలో ఏర్పడే ఉత్థాన పతనాల గ్రాఫ్. పాత్ర ప్రయాణమంటే విలన్ని పిడి గుద్దులు నాల్గు సిక్స్ ప్యాక్ తో గుద్ది భౌతికంగా ఎదగడం కాదు. మానసిక ఎదుగుదల జరిగే ప్రయాణం. కథా ప్రయాణంలో మానసికంగా ఏం తెలుసుకున్నాడు, ఏం అనుభవించాడు, ఏం సంఘర్షించాడు వంటి ఎలిమెంట్స్ తో కూడిన జర్నీ. చివరికొచ్చేసి ఏం పొందాడు, లేదా కోల్పోయాడనేది ముగింపు. క్యారక్టర్ ఆర్క్స్ మూడు రకాలుగా వుంటాయి కథని బట్టి. మానసిక పరివర్తన, ఎదుగుదల, పతనం.  

సికిందర్

 

13, జూన్ 2021, ఆదివారం

1046 : సందేహాలు- సమాధానాలు)

 Q : కరోనా విలయాన్ని చూస్తూనే ఉన్నాం కద. ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలు వందల్లో ఉంటే, ప్రాణాలు దక్కినా లక్షల అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. ఇక ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన కుటుంబాలయితే లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా బాధ్యత ఏమిటి? ఎలాంటి కథలు ఇప్పుడు సమాజానికి కావాలి? పరిష్కారాన్ని చూపించేవా, లేకుంటే సమస్యను మరిపించేవా(అమెరికాలో రిసెషన్ టైంలో, హాలీవుడ్ ఎక్కువగా వినోద ప్రదాన సినిమాలను నిర్మించిందని గతంలో మీరే ఓ సారి చెప్పారు)? ఇవి రెండూ కాకపోతే అసలు ఈ పాండమిక్ ని ఓ పీడకలగా భావించి పూర్తిగా ఇగ్నోర్ చేసే కథలా? వీలైనంత వివరంగా చెప్పగలరు.

పి. అశోక్, అసోసియేట్

 A : మీ భాష బావుంది. పాండమిక్ ని పూర్తిగా ఇగ్నోర్ చేయడం ఏ కళా ప్రక్రియైనా -సినిమా, టీవీ, నాటకం వగైరా- చేయాల్సిన మొట్టమొదటి పని.  మనమొక చారిత్రక సందర్భంలో వున్నాం. వందేళ్ల తర్వాత స్పానిష్ ఫ్లూ లాంటి మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తరాలు, చరిత్రకారులు మనవైపు చూస్తారు. మహమ్మారితో మనమేం అనుభవించాం, నష్టపోయాం, ఎలా జయించాం ఇవన్నీ వార్తల రూపంలో, శాస్త్రవేత్తల నివేదికల రూపంలో లభ్యమవుతాయి. నేటి కళలు ఏం బాధ్యత నిర్వర్తించాయన్నది భవిష్యత్తరాలు చూస్తే తెలియాలి. ఇందుకు రిఫరెన్స్ మాత్రం లేదు. 1918- 20 మధ్య 5 కోట్ల మందిని (మనదేశంలో కోటిన్నర మందిని) రాల్చేసిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి తర్వాత, హాలీవుడ్ లో సినిమాలు ఎప్పటి కథలతోనే తీస్తూ పోయారు. కారణం 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం. 1918 లో మొదటి ప్రపంచయుద్ధం ముగియగానే స్పానిష్ ఫ్లూ మొదలైంది. దీంతో యుద్ధ ప్రభావంతో వున్న హాలీవుడ్ స్పానిష్ ఫ్లూ తో కథలు మార్చుకోవాలని ఆలోచించలేదు. అప్పట్లో సినిమాలు తీయడమే గొప్ప. అవీ మూకీలు. ఇక యుద్ధ ప్రభావంతో యుద్ధ సినిమాలూ తీయలేదు. విషాదాన్ని సొమ్ము చేసుకునే ఆలోచన సినిమా రంగం చేయలేదు.

    1945 లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా యుద్ధ సినిమాలు తీయలేదు. తీసినవి ఆడలేదు. బిల్లీ వైల్డర్ రోమాంటిక్ కామెడీ, హిచ్ కాక్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇంకా ఇతర కామెడీలూ, కౌబాయ్ లూ, ఫిలిం నోయర్లూ, డ్రామాలూ, ఫాంటసీలూ విరివిగా తీశారు. ఈ సినిమాల్లో ఎక్కడా యుద్ధ ప్రస్తావనే తీసుకురాలేదు, గుర్తు చేయలేదు (తాజాగా ఒకరు పంపిన రోమాంటిక్ థిల్లర్ స్క్రిప్టులో హాస్పిటల్లో సీను, అక్కడ ఆక్సిజన్ తో కుట్రా వుంటే తీసేయాల్సిందిగా కోరాం). 9/11 అమెరికా జంట హార్మ్యాల మీద దాడి విషాదాన్ని కూడా హాలీవుడ్ సొమ్ము చేసుకోవాలనుకోలేదు. తర్వాత సినిమాల్లో ఎక్కడైనా ఆ ప్రస్తావన వుంటే తీసేశారు. దాడికి పూర్వం తీస్తున్న ఒక సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో జంట హార్మ్యాలు కన్పిస్తూంటే ఆ షాట్ తొలగించారు.

        ప్రాణనష్టం జరిగిన విషాద ఘట్టాలతో హాలీవుడ్ ఇలాటి మర్యాద పాటిస్తే, ఆర్ధిక నష్టాలప్పుడేం చేసిందో చూద్దాం : 1929- 33 ఆర్ధిక మహా మాంద్యంలో గ్యాంగ్ స్టర్ సినిమాలు, కామెడీలూ తీస్తూపోయారు. అప్పటికి టాకీల శకం ప్రారంభమైంది. ఆర్ధికమాంద్యంలో ఈ సినిమాలతో హాలీవుడ్ కి స్వర్ణయుగం అంటారు. డబ్బులు బాగా గడించారు. నిరుద్యోగంతో, ఇతర ఆర్ధిక నష్టాలతో దిక్కుతోచని ప్రజలు ఈ సినిమాలకి ఎగబడ్డారు. దోపిడీలు చేసే గ్యాంగ్ స్టర్ల సినిమాలు!

      తర్వాత 2008 ఆర్ధిక మాంద్యంలో రోమాంటిక్ కామెడీలతో ఆర్ధిక సమస్యల్ని మరిపించాలని ప్రయత్నించింది హాలీడ్ వుడ్. ఇప్పుడీ మహమ్మారి. ఇప్పుడు మనకేం సినిమాలవసరం? అవసరమా? మన దారే వేరు. తెలుగు ప్రజలెలాలాటి పరిస్థితుల్లో వున్నా సినిమాలవే వుంటాయి. తీస్తున్నవే వుంటాయి. ఎప్పుడు ప్రజల పక్షాన వున్నాయి గనుక. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, తీసే వాళ్ళూ చూసే వాళ్ళూ ఒకే మునిగే నావలో వున్నారు. మహమ్మారి తెచ్చిన వ్యాధి బారిన అందరూ పడలేదు, ఆర్ధిక సంకటంలో మాత్రం అందరూ పడ్డారు. వ్యాధి బారిని పడినా పడక పోయినా, పడి ప్రాణాలు కోల్పోయినా నిలబెట్టుకున్నా, ఎదర బ్రతుకంతా చిందర వందరై కన్పిస్తోంది. ఉపాధులు పోయాయి, మూడున్నర కోట్ల ఉద్యోగాలు పోయాయి, 23 కోట్ల మధ్య తరగతి పేద తరగతికి పతనమయ్యారు. ప్రభుత్వాలు ఆరోగ్యం వరకూ చేస్తాయేమో గానీ, ఆర్ధికంగా ఆదుకోవు. ఎవరి పోరాటం వాళ్ళు చేసుకోవాల్సిందే. చిన్న కుండలమ్ముకునే ముసలమ్మ కాడ్నించీ, పెద్ద సినిమాలు తీసే నిర్మాతల వరకూ.

        ఈ పరిస్థితుల్లో సినిమా కథలెలా మారబోతున్నాయని హాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా ఈ మధ్య గమనిస్తూంటే, అందరిదీ ఒకే మాట- సహృదయతతో, మానవతతో కూడిన ఆశావహ దృక్పథపు సినిమా కథలు. అంటే ఓదార్చే కథలు. ఓదార్చడం నాన్సెన్స్. ఓదార్చడమంటే తిరిగి విషాదాన్ని కెలకడమే. సమస్యకి రెండో వైపు చూడడం లేదు : ఆర్ధిక సంక్షోభం. కావాల్సింది ఆర్ధిక విజయాల గురించి చెప్పే కథలు.  

      70 ల్లో, 80 ల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వున్నప్పుడు అంతులేని కథ’, ఆకలిరాజ్యం లాంటి బాలచందర్ సినిమాలు, టి. కృష్ణ సినిమాలు, వేజెళ్ళ సత్యనారాయణ  సినిమాలూ ఆకర్షించేవి. ఇప్పుడా నిరుద్యోగ సమస్యతో బాటు ప్రపంచం ఆర్ధికంగా తలకిందులైన తీవ్ర సమస్య కళ్ళ ముందుంది. 70 ల్లో, 80 ల్లో హిందీలో మన్మోహన్ సింగ్ తీసిన మాస్ ఎంటర్ టైనర్స్ లో తిండి గురించే వుండేది. ఆయన తీసిన మల్టీ స్టారర్స్ లో చిన్నప్పుడు హీరోలు దొంగతనాలు చేయడం వుండేది. 'రోటీ' లో రొట్టె కోసం రాజేష్ ఖన్నా ఫైటర్ శెట్టితో పోరాడే పాపులర్ సీను వుంది.   

        ఇప్పుడా రొట్టెనే జనం వెతుక్కుంటూ వుంటే రొమాంటిక్ కామెడీలు కావాలా? బ్యాంకులో పది రూపాయల్లేక పేమెంట్ యాపులు దీనంగా వుంటే, గర్ల్ ఫ్రెండ్ తో ఏం వెలగ బెడతాడు. ఏం ప్రేమ సినిమాలు ఎంజాయ్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ కి బర్గర్ కాకపోయినా డబల్ రొట్టె ముక్క అయినా కొనాలా?

     రొట్టె గురించే విక్టర్ హ్యూగో 'లే మిజరబుల్' నవల రాశాడు. ఇప్పుడు కోవిడ్ అయితే అప్పట్లో కలరా. 1832 లో ఫ్రాన్స్ లో కలరా చుట్టూ ముట్టింది. పారిస్ లో ఇరవై వేల మంది చనిపోయారు. ఆరోగ్య శాఖ చేతులెత్తేసింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉపాధులు పోయాయి. తినడానికి తిండి లేదు. అశాంతి రేగింది. జైళ్ళు నిండిపోయాయి. ఇలాంటప్పుడు సోదరి కొడుకు కోసం ఒకడు రొట్టె దొంగిలించే కథతో విక్టర్ హ్యూగో రాశాడా సుప్రసిద్ధ నవల. ఈ దృశ్యాన్ని కళ్ళారా చూశాడు హ్యూగో. రొట్టె దొంగిలించిన కథా నాయకుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది! ఇది నిజంగా జరిగింది. ఈ మహోజ్వలనవల ఆధారంగా వందల సినిమాలు, టీవీ సీరియల్స్, నాటకాలూ వచ్చాయి. తెలుగులో'బీదల పాట్లు' అని రెండు సార్సు వచ్చింది.

     1832 నాటి ఫ్రాన్స్ ఎండమిక్, నేటి పాండమిక్ ఒకటే. ఆర్ధిక విపత్తు. ఇలాంటప్పుడు ప్రజలకేం మార్గం చూపుతూ  సినిమాలు తీయాలన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఓదార్పులొద్దు.

(మిగిలిన ప్రశ్నలు రేపు)
సికిందర్