రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, మార్చి 2016, సోమవారం

షార్ట్ రివ్యూ!

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రకాష్ ఝా

తారాగణం : ప్రియాంకా చోప్రా, ప్రకాష్ ఝా, మానవ్ కౌల్,        

నినద్ కామత్, కిరణ్ కర్మాకర్, మురళీ శర్మ తదితరులు 

సంగీతం : సలీం మర్చంట్- సులేమాన్ మర్చంట్ఛా, 

ఛాయాగ్రహణం : సచిన్ కృష్ణ్
బ్యానర్ : ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్ – ప్లే ఎంటర్ టిన్ మెంట్ని

నిర్మాత : ప్రకాష్ ఝా

విడుదల : 4 మర్చి, 2016

ప్పుడూ సామాజిక సమస్యల మీద దృష్టి పెట్టే బీహారీ బాబు ప్రకాష్ ఝా, వెట్టి చాకిరీ మీద  ‘దాముల్’ తీసి, లింగవివక్ష మీద ‘మృత్యుదండ్’ తీసి, ‘దిల్ క్యా కరే’  అనే బోరు ప్రేమ కథ తీసి, ‘రాహుల్’ అనే బెటర్ సెంటిమెంటల్ తీసి, ‘గంగాజల్’ తో కాన్వాస్ పెంచి, సామాజిక దురాగతాల తీవ్రత ఎంత పెరిగిపోయిందో చూపించుకొస్తున్నాడు...అందులో భాగంగా 1980 లో బీహార్ లోని భాగల్పూర్ లో ముప్ఫై ఒక్కమంది క్రిమినల్స్ కళ్ళల్లో యాసిడ్ పోసి తీవ్ర సంచలనం సృష్టించిన పోలీసుల  దురాగాతంపై 2003 లో ‘గంగాజల్’ ( అంటే ఇక్కడ యాసిడ్ అని వ్యంగం)  అనే సంచలనాత్మకం తీసి దర్శకుడుగా ఇంకో మెట్టు పైకెక్కాడు. మళ్ళీ బీహార్ కిడ్నాప్ మాఫియాలమీద ‘అపహరణ్’, దేశరాజకీయాల మీద ‘రాజనీతి’, రిజర్వేషన్ సమస్య మీద ‘ఆరక్షణ్’, మావోయిస్టు సమస్య మీద ‘చక్రవ్యూహ్’, స్కాముల మీద ‘సత్యాగ్రహ’ మొదలైనవి తీస్తూ తీస్తూ ఇలాటి సోషియో – పొలిటికల్  థ్రిల్లర్స్ జోన్ లో తనది ఏక ఛత్రాధిపత్యమని అనిపించుకుంటున్నాడు. ప్రకాష్ ఝా సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేలా చేస్తున్నాడు 64 ఏళ్ల ఈ మాస్టర్ మైండ్.

చేస్తున్నాడు 64 ఏళ్ల ఈ మాస్టర్ మైండ్.

 

          యితే ఈ క్రమంలో ఓ మూడు సినిమాలతో భయపెట్టకా పోలేదు. ‘రాజనీతి’ ని మహాభారతంతో పోలిక పెట్టి డజన్ల సంఖ్యలో క్యారక్టర్లతో  ఏం చెప్పాడో  మనకి అర్ధంగాక పోతే,  మళ్ళీ  ‘ఆరక్షణ్’లో ఎత్తుకున్న రిజర్వేషన్ల సమస్య ఇంటర్వెల్ తర్వాత వదిలేసి, విద్యా సంస్థల కార్పొరేటీకరణ అంటూ ప్లేటు ఫిరాయించడంతో మనకి మతులుపోయాక,  ‘సత్యాగ్రహ’ లో బోలెడు స్కాములు మాత్రమే చూపించి, ఒక్క పరిష్కారమూ  చెప్పలేక విరక్తి కల్గించిన ఝా-  ఈసారి మళ్ళీ ఏ భయానకం చూపిస్తాడోనన్న భయాందోళనలకి గురికావడం సహజం.
          అయితే మాస్టర్ మైండ్ మాస్టర్ మైండే - ఒకటీ అరాసార్లు గతి తప్పుతాడంతే!


ఉరితాళ్ళ ఉద్యమం

   వ్యంగంగా ‘గంగాజల్’ ని యాసిడ్ అనుకున్నట్టే, ‘జై గంగాజల్’ అంటే ఉరితాళ్ళు అనుకోవాలి. ‘గంగాజల్’ లో  పోలీసుల దురాగతమైతే, ‘జై గంగాజల్’ లో ప్రజలతో కుమ్మక్కయిన పోలీసుల ప్రాయశ్చిత్తం. కాస్సేపు ప్రజాస్వామ్య మూలస్థంభాలలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ అనే రెండు మూలస్థంభాలు చూసీ చూడనట్టు ఉండిపోతే - ఈ రెండిటినీ చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని సర్వ నాశనం చేస్తున్న, కుళ్ళిపోయిన  రాజకీయవ్యవస్థ అనే మూడో మూలస్థంభాన్ని, ప్రక్షాళన చేసేస్తారు పోలీసులూ ప్రజలూ కలిసి! 


          అయితే ఇందుకు ప్రజలు  సిద్ధమే, మరి ఎందరు పోలీసులు ముందుకొస్తారు?
          ఇక్కడే స్పీడ్ బ్రేకులు ఆ సీఐ కి...


          ఆ వూళ్ళో సీఐ గా ఉంటున్న బీఎన్ సింగ్ ( ప్రకాష్ ఝా) కి ఆ ప్రమోషన్ ఎమ్మెల్యే బబ్లూ పాండే తమ్ముడు డబ్లూ పాండే  పెట్టిన భిక్షే. డబ్లూ పాండే (నినద్ కామత్) ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద టెర్రర్. అతడి టెర్రర్ తనాన్ని చూసీ చూడనట్టు వుంటూ, అవసరమైతే తొత్తుగా పనిచేస్తూ బంగళాలూ బంగారాలూ కొనుక్కుని సుఖపడతాడు సర్కిల్ ఇన్స్ పెక్టర్  సింగ్. లఖీసరాయి అనే గ్రామం శివారులో వున్న భూముల మీద ఓ పవర్ ప్లాంట్ కంపెనీ  కన్ను పడుతుంది. దీంతో డబ్లూ పాండే రంగంలోకి దిగిపోయి రైతుల నుంచి భూములు లాక్కోవడం మొదలెడతాడు. రైతులు ప్రతిఘటిస్తారు. ఒక ఐఐటీ టాపర్ -కమ్- పీహెచ్ డీ స్కాలర్ పవన్ (రాహుల్ భట్) అమెరికాలో లక్షల డాలర్లు వచ్చే ఉద్యోగం వదులుకుని సామాజిక కార్యకర్తగా ఇక్కడ ఉంటాడు. ఈ భూదోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనలు  చేస్తూంటాడు. సీఐ సింగ్ తనకి ప్రజల్లో చెడ్డ పేరు రాకుండా, అటు డబ్లూ తోనూ చెడకుండా డబుల్ యాక్షన్ చేస్తూ పరిస్థితిని డీల్  చేస్తూంటాడు. 


బబ్లూ పాండే 
      అది ఎన్నికలు దగ్గర పడ్డ కాలం.  ఈ లఖీసరాయి గ్రామం వున్న బంకిపూర్ జిల్లా కొత్త ఎస్పీగా ఆభా మాథుర్ ( ప్రియాంకా చోప్రా ) ని నియమిస్తూ ఉత్తర్వులిస్తాడు హోంమంత్రి చౌదరి (కిరణ్ కర్మాకర్). హోంమంత్రి చౌదరితో అధికార పార్టీ ఎమ్మెల్యే బబ్లూ పాండే (మానవ్ కౌల్) సన్నిహితంగా ఉంటూ పోలీసుల్ని తన గుప్పెట్లో వుంచుకుంటాడు. కొత్త ఎస్పీ ఆభా మాథుర్ చార్జి తీసుకున్న వెంటనే సీఐ  సింగ్ మొహం చూసే వీడొక కేడీ అని కనిపెట్టేస్తుంది. ఇది తెలిసికూడా సింగ్ అలాగే డబుల్ యాక్షన్ చేస్తూంటాడు ఈమెతో కూడా. డబ్లూ గ్యాంగ్ లో ఒక టక్కరి అయిన నపుంసకుడు మున్నా మర్దానీ (మురళీ శర్మ) ఉంటాడు. వీడు కొరియర్ లాగా పనిచేస్తూంటాడు డబ్లూబాబుకి.

          లఖీసరాయి వూళ్ళో డబ్లూబాబు  గ్యాంగ్ ఓ అమ్మాయి మీద కన్నేసి లాక్కుపోతూంటే పోలీసులు నిస్సహాయంగా చూస్తూంటారు. ఎస్పీ ఆభా వచ్చేసి గ్యాంగ్ ని తన్ని అమ్మాయిని కాపాడుకోవడంతో ఈ విషయం అటు డబ్లూబాబు అన్న ఎమ్మెల్యే బబ్లూకీ,  అట్నుంచి  హోంమంత్రికీ తెలిసి ఆమెని మందలిస్తారు. ఎస్పీ ఆభా అహం దెబ్బ తింటుంది. ఇది వాళ్ళిద్దరితో  ప్రచ్ఛన్న యుద్ధానికి బీజం వేస్తుంది. 

డబ్లూ పాండే 
       అటు వూళ్ళో డబ్లూ రైతులకి పంట రుణాలు కూడా అందకుండా  చేస్తూండడంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకొందరు రైతులు భయంతో వచ్చిన కాడికి భూములు అమ్మేసుకుంటారు. బెదిరింపుల్ని తట్టుకోలేక ఇంకో రైతు కూడా అమ్ముకోవడానికి సిద్ధ పడుతూంటే, అతడి  పంతొమ్మిదేళ్ళ కూతురు సునీత ( వేగా తమోటియా) అడ్డుకుంటుంది. రైతులందరూ అమ్మేసుకున్నారు- మధ్యలో వున్న తమ  రెండెకరాల పొలాన్ని  చచ్చినా అమ్ముకునేది లేదని చెప్పేస్తుంది సునీత.  ఆమె తండ్రిని బ్యాంకు ఋణం కేసులో ఇరికించి వేధిస్తారు. అతను  పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన  సీఐ సింగ్ కి  నిద్ర పట్టకుండా చేస్తుంది. విపరీతమైన అపరాధ భావంతో అంతరాత్మ మేల్కొంటుంది. ఇప్పుడు అతడికి డబ్లూబాబు అనేవాడు నీచాతి నీచుడుగా కన్పిస్తాడు. 

         అటు ఎస్పీ అభాకి పైనుంచి చెడితే, ఇటు సింగ్ కి డబ్లూతో చెడుతుంది. అయినా ఎస్పీ ఆభా సీఐ సింగ్ ని నమ్మక పోవడంతో వాళ్ళిద్దరికీ ఎడం పెరుగుతుంది.

       ఇక పొలం అమ్మని సునీతని డబ్లూ ఎత్తుకుపోయి రేప్ చేసి చంపి వాళ్ళ  పొలంలోనే  చెట్టుకి వేలాడదీస్తాడు. సునీత పదేళ్ళ తమ్ముడు ఈ దృశ్యం చూసి చలిస్తాడు. సీఐ సింగ్ వాణ్ణి చేరదీస్తాడు. వూళ్ళో కొచ్చిన డబ్లూని సింగ్ ఎడాపెడా తన్ని అరెస్ట్ చేయబోతూంటే ఘర్షణ జరిగి, కింద పడ్డ డబ్లూ మెడకి బెల్టు తీసి బిగించేస్తాడు సునీత తమ్ముడు. కసిగా డబ్లూని నేలమీద అలా ఈడ్చుకుపోతాడు. ఊపిరాడక ఛస్తాడు డబ్లూబాబు. వెంటనే పోలీసులూ జనం కలిసి డబ్లూబాబు  అనుచరుల్ని కూడా ఉరితీసేసి, సెంటర్లో చెట్టుకి వేలాడదీసేస్తారు డబ్లూబాబు  శవం సహా. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని రిపోర్టు చేస్తారు. 


          బబ్లూ వచ్చి చూసుకుని తన తమ్ముణ్ణి చంపిన సునీత తమ్ముణ్ణి  పట్టుకుని, ఈ సెంటర్లో ఈ చెట్టుకే వురి తీస్తానని శపధం చేస్తాడు. డబ్లూబాబు  అండ్ గ్యాంగ్ ‘ఆత్మహత్యల’ కేసులో ఎస్పీ ఆభా కి ప్రజలెవరూ సహకరించరు. చివరికి ఈ ‘ఆత్మహత్యల’ బాధ్యత సీఐ సింగ్ తనే తీసుకుని- ఇదే న్యాయమంటాడు. ఇంకా ప్రజల సహకారంతో ఇలాటివి జరగాలంటాడు. ఎస్పీకి మండిపోతుంది. ఇద్దరికీ ఇంకా చెడుతుంది. ఇలా వుంటే శత్రువు టార్గెట్ గా సునీత తమ్ముడు ప్రమాదంలో ఉంటాడు...      


          ఇదీ సమస్య.  ఇక ఇక్కడ్నించీ  చట్టం కోసం ఎస్పీ- సీఐలకి మధ్య, అటు సునీత తమ్ముడి కోసం  సీఐ – బబ్లూలకి మధ్యా  సంఘర్షణ ఎలా కొనసాగిందన్న మిగతా కథ కోసం వెండితెరని ఆశ్రయించాల్సిందే.  


ఎలావుంది కథ 

     లోచనాత్మకంగా వుంది. ఆచరణలో సాధ్యంగాక పోయినా ప్రజల మనోభావాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా  వుంది. ఇది చాలా ముఖ్య లక్షణం కథకి : ప్రజల / ప్రేక్షకుల మనోభావాలకి ప్రాతినిధ్యం వహించడం. ఇలా జరగడమే న్యాయమన్పించే  పరిస్థితి  రాజకీయ వ్యవస్థ కల్పిస్తున్నదే. పోలీసులతో మమేకమైన మూకస్వామ్యమే ప్రజల బాధలన్నిటికీ పరిష్కారమనే స్పష్టతతో హెచ్చరిక పంపేలా వుంది. పవర్ ప్లాంటూ, ల్యాండ్ మాఫియా, వీటికి  వ్యతిరేకంగా పోరాటాలూ పాత కథే. చాలా సినిమాల్లో చూసి వున్నదే. ఇక్కడ పాయింటు ఇది కాదు, పాయింటు కుళ్ళిన రాజకీయ వ్యవస్థకి మరమ్మత్తు. ఈ వ్యవస్థతో విసిగిన పోలీసులూ ప్రజలూ కలిసి తీసుకునే చర్యకి నేపధ్యం కోసం మాత్రమే భూదోపిడీ అనే రొటీన్ కథ తీసుకున్నారు. ఈ రొటీన్ కథల్లో ఉంటున్న ఎవరూ పట్టించుకోని  చికిత్సకి  ఏర్పాటు చేసిన పాయింటే  కొత్తగా వుంది. ఇందువల్ల ఈ కథ మొత్తం కొత్తగా  మారిపోయింది.  కథలో ‘వురేసుకుని’ మరికొన్ని ‘ఆత్మహత్యలు’ జరుతాయి రాజకీయ నాయకులు బెంబేలెత్తేలా. కాకపోతే ఇక్కడ కొత్త నినాదం- రైతుల ఆత్మహత్యలకి కారకులైన వాళ్ళు కూడా ‘ఆత్మహత్యలు’ చేసుకోవాలన్నదే-  ‘జో జనతా కో లూటేగా ఉస్కా సూసైడ్!’ అని.  ఈ మొత్తం కథ ఒక  పవర్ఫుల్ సోషల్ కామెంట్.


ఎవరెలా చేశారు 


        ఇది ప్రియాంకా చోప్రాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటారందరూ. కానీ ఒక విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది- ఇందులో ప్రియాంకా చోప్రా ఎస్పీ పాత్రని, ప్రకాష్ ఝా సీఐ పాత్ర మింగేస్తుంది. ప్రత్యర్ధులతో ప్రత్యక్ష పోరాటం చేస్తూ నానా హింస పడేది, చావుదాకా వెళ్లి వచ్చేదీ   ప్రకాష్ ఝా పాత్రే. ప్రియాంకా చోప్రా పాసివ్- రియాక్టివ్ పాత్రగా వుంటుంది. శాంతి భద్రతల పరిస్థితి తలెత్తినప్పుడే ఆమె రియాక్టివ్ గా చక్కదిద్దడానికి ప్రయత్నించేది, ఈ క్రమంలో పై నాయకులతో పాసివ్ గా ప్రచ్ఛన్న యుద్ధం, ఇంతవరకే. ఆమెకో లక్ష్యమంటూ లేదు. తనకి వ్యతిరేకంగా వున్న ప్రకాష్ ఝా పాత్ర కూడా తనకి లక్ష్యం కాలేదు. అతడి ఉరితాళ్ళ ఆశయంతో తన చట్ట బద్ధమైన సంఘర్షణ అంతలోనే సునీత తమ్ముణ్ణి కాపాడే అతడి సంఘర్షణలో భాగమైపోతుంది.  


          కథలో ప్రకాష్ ఝా కారణంగా  ఓ మేజర్ సంఘటన జరిగినప్పుడల్లా సమాచారమందుకుని రావడమనే రొటీన్ సీన్లు  ఆమెకున్నాయి. ఒక సంఘటన జరుగుతూంటే ఇప్పుడామెకి సమాచారం అందుతుందని, కుయ్ కుయ్ మంటూ కారులో వచ్చేస్తుందని మనం అనుకోగానే ఆమె వచ్చేస్తుంది. ఇలా సెకండరీ క్యారక్టర్ గా ఉండిపోయింది. మరొకటేమిటంటే, ఓవర్ గా మేకప్ చేసుకోవడం. ఒక ఎస్పీగా హుందాతనం ఉట్టిపడే ముఖవర్ఛస్సుతో వుండాల్సింది పోయి  రోమాంటిక్ హీరోయిన్ లా వుంటుంది. ఈ సినిమాలో రోమాన్సు  కూడా లేదు.


          నటనని పాత్రచిత్రణతో కలిపి చూడకుండా సర్టిఫికేట్ ఇచ్చేస్తే పాత్రనే అవమానించిన వాళ్లవుతాం. ఈ దృష్ట్యా ప్రియాంకా చోప్రా తన తిరుగు లేని టాలెంట్ తో ఎంత గొప్పగా నటించినా,  అది తామరాకు మీద నీటి బొట్టల్లే  వుండిపోయింది.


         ఈ సినిమా దర్శకుడు, నిర్మాత, కథకుడు, స్క్రీన్ ప్లే కారకుడు, మాటల రచయితా ప్రకాష్ ఝా తొలిసారిగా నటించాడు. నటింపజేసే దర్శకుడికి రాయడం రాకపోయినా ఫర్వాలేదుగానీ, నటనే రాకపోతే నవ్విపోతారు కాబట్టి, ఝా ఇందులోనూ ఒక ‘డర్టీ హేరీ’ క్లింట్ ఈస్ట్ వుడ్ అన్పించుకున్నాడు. పోలీస్ పాత్రని పరమోన్నత స్థాయికి చేర్చిన  ఈస్ట్ వుడ్ లాగే,  సీఐ సింగ్ నీ దేశంలో అందరు సీఐలకీ ఆదర్శం అన్నట్టుగా నటించి పెట్టాడు. లంచగొండిగా  ఎలా సుఖపడి, అంతరాత్మ మేల్కొని ఎలా సంఘర్షించి, ఎలా పరిణతి చెందాడో క్యారక్టర్ బయోగ్రఫీ అంతా ఒక ట్రాకులో తనకే వుంది. చాలా విచిత్రమైన పాత్ర ఇది. పై అధికారి ఎస్పీ ఆభాతో డిసిప్లిన్డ్ గా వుంటాడు. ఆమె పీకే క్లాసులన్నీ వింటాడు. కానీ ఒక్క మాటా ఎదురు మాటాడడు. సెల్యూట్ కొడతాడు. బయట చేసేది చేస్తూంటాడు. ఆమె సస్పెండ్ చేస్తే సస్పెండ్ అవుతాడు. కస్టడీలోకి  తీసుకుంటే కస్టడీలో వుంటాడు. కానీ ఆమె ఇంటరాగేట్ చేస్తే నోరు విప్పడు. ఆమె మటాడుతూంటే తను నోరు విప్పకూడదన్నది తన డిసిప్లిన్! ఆమెకి పిచ్చెక్కుతుంది. 


          రైతు కూతురు సునీత మరణంతో కథలో లక్ష్యం ఝా పాత్రకే ఏర్పడింది. అక్కడ్నించీ ప్రధాన సంఘర్షణంతా  సునీత తమ్ముణ్ణి కాపాడడం గురించే. ఈ యాక్టివ్ పాత్రలో ఝా ఆద్యంతం తనెవరో తెలియని ప్రేక్షకులని కూడా రెండు గంటలా 38 నిమిషాలూ కట్టిపడేస్తాడు- యాక్షన్ సీన్స్ సహా! 


          ఇక్కడ ప్రశ్న – ప్రియాంకా చోప్రా పాత్రని తగ్గిస్తూ, కొత్తగా నటిస్తున్న  ప్రకాష్ ఝా ఎందుకు తన పాత్రని ప్రధానం చేసుకున్నాడన్నదే. ఈ పాత్రలో ఏ అజయ్ దేవగణ్  నో తీసుకుని వుంటే అదివేరు. అప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ లుక్ సినిమాలో లేకపోయినా, పెద్ద స్టార్ గా అజయ్ ఉంటాడు కాబట్టి ఈ సినిమా అతడిదే అనుకుని తృప్తి చెందవచ్చు. ఇలా కాకుండా ఝా పెద్ద రిస్కు తీసుకున్నాడు. హీరోయిన్ ఓరియెంటెడ్ జానర్ కి కొత్త నిర్వచనం చెప్పాడు. ఇంతవరకూ ఇలాటిది భారతీయ సినిమాల్లో జరగలేదు- సహాయ పాత్రే ప్రధాన పాత్ర కావడం, దాంతో సినిమా విజయవంతం కావడం. రూల్స్ ని బ్రేక్ చేయడమంటే ఇదేనేమో. కానీ రూల్స్ ని బ్రేక్ చేయాలంటే కూడా అసలంటూ రూల్స్ తెలిసి వుండాలి. ఇది తెలుసేమో  ఝాకి.



చివరికేమిటి 





       ఒక కొత్త కమర్షియల్ ప్యాకేజీగా పవర్ఫుల్  మెసేజితో ఈ సినిమా వచ్చింది. కొత్త కమర్షియల్ ప్యాకేజీ అనడమేమిటంటే, ఇందులో లవ్- రోమాన్సుల్లేవు, పాటల్లేవు, కామెడీ ఆర్టిస్టుల్లేరు, చీప్ డైలాగుల్లేవు, నీచమైన తాగుడు సీన్లు లేవు, సిక్స్ ప్యాక్- హైపర్ యాక్షన్ సీన్స్ లేవు. జీవితం ఎలా వుంటుందో, అందులో ఉద్రిక్తత లెలా వుంటాయో అవే సహజత్వంతో వున్నాయి. కొట్టుకున్నా, కాల్చుకున్నా అంతా రియలిస్టిక్కే- ఒక్క చివర్లో ప్రియాంకా  వైర్ వర్క్ యాక్షన్ సీన్ తప్ప. ఇందులో హైలైట్ అనదగ్గ సీన్లన్నీ యాక్షన్ తో కూడుకున్నవే కావడం గమనార్హం. వీటిలో ఎమోషన్స్ వర్ణనాతీతం. సునీత తమ్ముడు డబ్లూ మెడకి బెల్టు బిగించి లాగే సీను, సీఐ సింగ్ ని మురిక్కాల్వలో పడేసి బబ్లూ చావదన్నే సీను, డబ్లూ అండ్ గ్యాంగ్ శవాల్ని చెట్టుకి వేలాడదీసే సీను, డబ్లూని సింగ్ బజార్లో ఈడ్చి ఈడ్చి తన్నేసీను,  ఎస్పీ ఆభా లాఠీచార్జి జరిపి అమ్మాయిని కాపాడే సీను, సునీతని లారీలో తిప్పుతూ దొరక్కుండా డబ్లూ రేప్ చేస్తూంటే ఆ లారీని పట్టుకోవడం కోసం ఆభా, సింగ్ లు వేదన పడే సీను, సునీత తమ్ముణ్ణి  బబ్లూ పట్టుకుని ఉరి తీయబోయే సీను... ఇలా లాండ్ మార్క్ సీన్స్ ఎన్నో. ఇక ఏ స్థాయి పోలీసుల్ని కూడా యూనిఫామ్స్ లేకుండా జీన్సు షర్టు లేసి ఫ్యాషన్ షో బొమ్మల్లాగా చూపించలేదు. పక్కా ప్రొఫెషనలిజం ఇక్కడ!


          ఒక ఎమోషనల్ ట్రావెల్ ఈ సినిమా  - కరుడుగట్టిన మాస్టర్ మైండ్ ప్రకాష్ ఝా చేతిలో.

 

 

-సికిందర్ 

5, మార్చి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!







కథ, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం : బి.వి. నందినీ రెడ్డి

తారాగణం : నాగశౌర్య, మాళవికా నాయర్‌, పర్ల్‌ మానే, రాశి,  ఆనంద్‌,  ఐశ్వర్య,  రాజ్‌ మదిరాజు, తాగుబోతు రమేష్‌, మిర్చి హేమంత్‌, జెమిని సురేష్‌, ప్రగతి తదితరులు
మాటలు, పాటలు : లక్ష్మీభూపాల్‌, సంగీతం : కళ్యాణ్‌ కోడూరి, ఛాయాగ్రహణం : జి.వి.ఎస్‌. రాజు, కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ
బ్యానర్‌ :
 శ్రీ రంజిత్‌ మూవీస్‌, నిర్మాత : కె.ఎల్‌. దామోదరప్రసాద్‌
విడుదల :  4 మార్చి,  2016
***
       2011 లో బివి నందినీ రెడ్డి  ‘కొత్త దర్శకురాలి ఉత్తమ తెలుగు చిత్రం’ కేటగిరీ కింద ‘అలా మొదలైంది’ కి నంది అవార్డు, దీనికే ఉత్తమ దర్శకురాలిగా ఫిలింఫేర్ నామినేషనూ పొంది ఒక స్థానం సంపాదించుకున్నాక, ‘జబర్దస్త్’  అనే ఫ్లాప్ తీసి, దాన్ని ‘బ్యాండ్ బాజా బరాత్’ నుంచి కాపీకోట్టారని యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి లీగల్ నోటీసు కూడా అందుకుని ప్రతిష్ట కోల్పోయాక- చాలా కాలంపాటు  ఇంకో సినిమా కోసం విఫలయత్నాలు చేసి, ఇప్పుడు ‘కళ్యాణ వైభోగమే’ అంటూ ముందుకొచ్చారు. 

       ధునిక దృక్పథం గల ఫిమేల్ డైరెక్టర్ గా తను ‘జబర్దస్త్’  లాంటి మెల్ డైరెక్టర్ ల ఆటస్థలమైన మాస్ మసాలా జోలికి వెళ్ళాల్సింది కాదు. ఓ యాభై మాస్ మసాలాలు కూడా తీసిపారేసి విజయాలు సాధించిన ఫిమేల్ డైరెక్టర్ విజయనిర్మల దరిదాపులకి తెలుగులో ఇంకో ఫిమేల్ డైరెక్టర్ రాలేకపోయారు ఇంతవరకూ. ఒక విషయాన్ని లేదా సమస్యని మేల్ డైరెక్టర్లు వాళ్ళ పురుష దృక్కోణం లోంచి చూసే పధ్ధతి వేరు, ఫిమేల్ డైరెక్టర్లు వాళ్ళ సహజాతం (ఇన్ స్టింక్ట్) తో చూసే పరిస్థితి వేరు. కమర్షియల్ సినిమాల పేరుతో వెలువడుతున్న కాలుష్యం బారినుంచి  ప్రేక్షకుల్ని పక్కకు తీసి, వాస్తవ జీవితాన్ని దగ్గరగా చూసే క్లోజప్ కథలతో తమదైన స్త్రీ వాయిస్ ని విన్పించే ప్రయత్నం చేసినపుడే ఫిమేల్ డైరెక్టర్లంటే ఏమిటో తేడా తెలుస్తుంది. 

        గతవారం చునియా అనే దర్శకురాలు ‘పడేసావే’ అనే మేల్ డైరెక్టర్లు వాడేసిన విషయాన్ని తీసుకుని తనుకూడా  మేల్ వాయిస్ నే విన్పిస్తూ తన జెండర్ ఐడెంటిటీని ప్రదర్శించుకునే బంగారు అవకాశాన్ని కోల్పోవడం పరిస్థిని తెలియజేస్తోంది.


        కానీ ఇప్పుడు నందినీ రెడ్డి ఈ లోటు తీర్చడానికా అన్నట్టు ‘కళ్యాణ వైభోగమే’ అన్న కొత్తతరం ప్రేమకథని తన జెండర్ ఐడెంటిటీతో డిఫరెంట్ గా చూపిస్తూ ముందుకొచ్చారు. అయితే ...అయితే... అయితే...అన్ని నదులూ వెళ్లి సముద్రంలోనే కలుస్తాయన్నట్టు, అంతలోనే  వెళ్లి వెళ్లి తనూ మేల్ డైరెక్టర్ల మెగలోమేనియాలో పడిపోయారు! 

        దర్శకురాలు దర్శకుడు అన్పించుకోవాలన్న మోజు ఎందుకో!

        అనేక ఫ్లాపులతో సతమతమవడమే తప్ప తెరిపిన పడ్డం తెలియకుండా పోతున్న హీరో నాగశౌర్య ఎట్టకేలకు ఈ సినిమాతో విజయతీరాలకి చేరుకున్నట్టే  కొలంబస్ లా. ఇక్కడ్నించీ ఈ పయనం ఇంకే తీరాలకో ఇక ముందు గానీ తెలీదు. నటించగల టాలెంట్ వుండీ  తీరాలు వెతుక్కునే తంటాలు ఇకనైనా తప్పుతాయా? చాలా మంది కొత్త హీరోలు మాస్ అనుకుంటూ మునకలేస్తున్నారు, తనొక్కడైనా  ఈ ‘కవైభో’ లాంటి యూత్ ఐడెంటిఫై చేసుకోగల  జనరేషన్- జెడ్ తరహా ఫ్రెష్ క్యారక్టర్లని  తన స్పెషాలిటీగా  గుప్పెట పట్టుకుని బ్రాండ్ అంబాసిడర్ అవగలడా? 

        ‘కవైభో’ ఇలాటి దానికి కావలసినంత పునాది వేస్తోంది మరి...

పెళ్లి పెటాకుల ప్యాకేజీ 
        శౌర్య (నాగ శౌర్య) యుక్త వయస్సుని సంపూర్ణంగా, స్వేచ్చగా అనుభవించే ఏకైక లక్ష్యంతో జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాడు. అందులోభాగంగా అమెరికాలో సెటిలయ్యేందుకు  ప్రణాళిక వేసుకుంటాడు. కానీ ఇంట్లో పెళ్లిగోల. 

        ఇంకో చోట దివ్య (మాళవికా నాయర్‌) డాక్టరుగా పనిచేస్తూ ఏ బాదరబందీ లేని జీవితాన్ని హాయిగా గడిపెయ్యాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఇంట్లో పెళ్లిగోల. 

        అటు శౌర్యకీ ఇటు దివ్యకీ పెళ్ళంటే వైముఖ్యం లేదు, కానీ ఇంకా పాతిక కూడా  నిండని జీవితాలకి ఆ గుదిబండ తగిలించుకోవడం ఇష్టం లేదు. 

        ఇలాటి అపరిచయస్థులైన  ఇద్దరూ పెద్దవాళ్ళ బలవంతంతో పెళ్లి చూపులకి సిద్ధమవుతారు. అక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పరస్పరం ఇష్టపడలేదని ప్రకటించేసి బయట పడతారు. ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్లి పోయి ఎంజాయ్ చేస్తూంటారు.

       కానీ  పెద్ద వాళ్ళు వదలరు. ఇంకా సంబంధాలు తెస్తూ పెళ్లి చూపులకి చంపేస్తూంటారు.  ఈ వరస పెళ్ళిచూపులతో అలసిపోయి ఇద్దరూ ఒక ఆలోచన చేస్తారు. ఈ గోల తప్పాలంటే తామిద్దరూ పెళ్లి చేసుకుని పెద్ద వాళ్ళ కోరిక తీర్చి, ఆర్నెల్లయ్యాక విడాకులతో విడిపోయి తమ కోరిక తీర్చుకుందామని మరో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు.

        అలా పెళ్ళవుతుంది. వెంటనే రహస్యంగా విడాకులకి అప్లై చేసుకుని ఫ్రెండ్స్ తో ఆటా పాటలతో డివోర్స్ సెలెబ్రేషన్ కూడా జరుపుకుంటారు. శౌర్యతో ఎక్కడో నగరంలో కాపురం పెట్టిన దివ్య ఇక కలిసివుండడంలో అర్ధం లేదని సామాన్లు సర్దుకుంటుంది. ఫ్రెండ్స్ సహాయంతో ఆమెని ఆపి,  ఎప్పుడైనా వచ్చే పేరెంట్స్ కోసమైనా ఫ్రెండ్స్ గా ఒకే ఫ్లాట్ లో కలిసి ఉందామని ఒప్పిస్తాడు శౌర్య. 

        ఇక హోటల్ రూమ్ లా ఫ్లాట్ ని వాడుకుంటూ, వచ్చిపోతూ, ఎవరిదారిన వాళ్ళు తిని పడుకుంటూ వుంటారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి జీవితాలు ఏఏ మలుపులు తిరిగాయన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ?
        నేటి యువసమాజం ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా వుంది. వెంటనే యూత్ కి కనెక్ట్ అయ్యే జీవన శైలితో వుంది. ఇప్పడు ప్రపంచం ఒక కుగ్రామమైతే, జీవితం  విశ్వమంత విస్తరించి కూర్చుంది. దీని అంతు చూడకుండా మడిగట్టుకు కూర్చోవాలని ఏ ఉడుకు రక్తమూ అనుకోదు. ఇలాటి యూత్ ఐడెంటిఫై చేసుకోగల రెండు పాత్రలతో ఒక ఫ్రెష్ నెస్ ని మోసుకొస్తూ, ఇప్పటి మూవీ మార్కెట్ లో జోరుగా అమ్ముడయ్యే నవీన ఉత్పత్తిలా వుంది. కానీ చివరి కొచ్చేటప్పటికి  యూటర్న్ తీసుకుని, ఈ జోరుకి కళ్ళేలు వేయాలన్న ఆందోళనతో, లేకపోతే  ‘కన్హయ్యా కుమార్’  లా  ‘స్వేచ్ఛ ఎక్కువైపోయి’  సోకాల్డ్ సమాజానికి తీవ్ర హానికలుగుతుందన్న మోరల్ పోలీసింగ్ కి పాల్పడింది! ఓ రచయిత కథలో మోరల్ పోలీసింగ్ వుంటే పోనీలే మగ దురహంకారం అనుకోవచ్చు. రచయిత్రుల కథలు కూడా మగ దురహంకారంతో  వుంటాయా?

 ఎవరెలా చేశారు 
        ప్రతీ ఒక్కరూ ఈ రోమాంటిక్ కామెడీలో ప్రేక్షకులు ప్రేమించే పాత్రలుగానే తారసపడతారు. ఎవర్నీ తీసెయ్యడానికి లేదు. ఇంత మంచి పాత్రల సంకలనం రెండేళ్ళ క్రితం ‘మనం’ తర్వాత ఇదే. ఫ్యామిలీ స్టోరీస్ అంటూ సాంతం నరుక్కునే రాక్షసుల కుటుంబాల కథలే చూపించే దౌర్భాగ్యంతో తెలుగు సినిమాలుంటున్న కాలంలో, ఈ సినిమా ఒక చెంప పెట్టు. నరుక్కునే రాక్షాసుల్ని మన జీవితాల్లో చూడం. ఎక్కడో వున్నట్టు వింటూంటాం. తెల్లారి లేస్తే మన చుట్టూ కన్పించేది  సాత్విక ప్రపంచమే, సామాన్య మనుషులే, మనిషితనంతో వుండే  మామూలు కుటుంబాలే. ఇవే ఈ సినిమాలోనూ కన్పిస్తాయి. ఒక్కటి కూడా నెగెటివ్ పాత్ర లేకుండా తమతమ పాజిటివ్ దృక్పథాలతో ఒక డ్రీమ్ వరల్డ్ ని సృష్టిస్తాయి. సున్నిత హాస్యాన్ని ఒలకబోస్తాయి. హీరో హీరోయిన్ల దగ్గర్నుంచీ వాళ్ళ ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళ వరకూ, హీరో హీరోయిన్ల పేరెంట్స్ గా నటించిన వాళ్ళ దగ్గర్నుంచీ సిక్కు కుటుంబమూ వాళ్ళ పిల్లల వరకూ, ప్రతీ ఒక్కరూ జనరంజకం చేశారు దృశ్యాల్ని. 

        నాగశౌర్య తల్లిగా నటించిన ఐశ్వర్య ఒక అయోమయపు క్యారక్టర్ అయితే, తండ్రిగా నటించిన రాజ్ మాదిరాజు ‘గొప్ప’ ఆలోచనా పరుడు. హీరోయిన్ మాళవికా నాయర్ తల్లి దండ్రులుగా నటించిన రాశి, ఆనంద్ డీసెంట్ జంటే- కానీ పైకి కనపడని దూరాలతో సతమతమవుతున్న జీవులు వాళ్ళు. మాళవికా నాయర్ పెద్ద అందగత్తె  కాకపోయినా సరీగ్గా ఆ  పాత్ర స్వభావానికి సరిపోయే ఫీచర్స్ తో, నటించగల స్తోమతతో కన్పిస్తుంది. పెళ్ళికి ముందు రాత్రి తల్లీ కూతుళ్ళుగా మాళవికా- రాశీల మధ్య వైవాహిక జీవితం గురించిన సింపుల్, మెచ్యూర్డ్  సంభాషణతో కూడిన దృశ్యం- దాని ఫీల్ కి తగ్గట్టు మెస్మరైజింగ్ లైటింగ్ తో చిత్రీకరణా ఒక గొప్ప ఎచీవ్ మెంట్ అనొచ్చు.  గర్ల్ ఫ్రెండ్ గా వైదేహి అనే విచిత్ర పాత్రలో వచ్చిపోయే పెర్ల్ మానే కూడా ఎక్సెలెంట్. 

        ఇక మ్యారేజ్ బ్రోకర్ గా సూటు బూటు వేసుకుని,  బాబ్డ్ హెయిర్ తో విగ్గు పెట్టుకుని గుర్తుపట్టకుండా వుండే ప్రగతి,  తనది కార్పొరేట్ లుక్ అనడం రాక  కార్పోరేషన్ గెటప్ అనే అమాయకత్వంతో చేసే కామెడీ తన టాలెంట్ ఏ ఏ రకాలుగా విస్తరించగలదో మరొక్క సారి గా నిరూపించుకునే అవకాశాన్ని దక్కించుకుంది- మొన్నే ‘మలుపు’ లో గమ్మత్తయిన తల్లి పాత్ర వేసి తన స్పెషాలిటీని చాటుకున్నాక.

        ఇలా ప్రతీ చిన్నా పెద్దా పాత్రా ఏదీ వృధాగా లేదు సినిమాలో. చివర్లో వస్తారు తాగుబోతు రమేష్, ఆశీష్ విద్యార్ధి లు. ఇక హీరో నాగశౌర్య కళాపోషణ గురించి ముందే చెప్పుకున్నాం. 

        టెక్నికల్ గా చూస్తే  ఈ కథ మొత్తాన్నీ- ఇది ప్రతిపాదిస్తున్న భావజాలపు నీడల్నీ కెమెరా జీర్ణించుకుని  తెరమీద దృశ్యమానం చేస్తున్నట్టుంది కెమెరా పనితనం. ఛాయాగ్రాహకుడు జివీఎస్ రాజు దీని కర్త. ఒక వండర్ఫుల్ రంగుల ప్రపంచాన్ని సృష్టించాడు. ఇదొక ‘క్లోజప్ కథ’ అనుకుంటే, అంతే క్లోజ్ గా అది హృదయాలకి హత్తుకుపోయే ఎజెండా పెట్టుకున్నట్టు దృశ్యాల చిత్రీకరణ జరిపాడు. కేవలం సినిమాలో ‘విషయం’ మాత్రమే మార్కెట్ ఫ్రెండ్లీగా వుంటే చాలదు, దాని ప్రెజెంటేషన్ లోనూ ఆ మార్కెట్ స్పృహ కనపడాలనేది ఇక్కడ ఇలా షూట్ చేసి చూపించారు.

        కళ్యాణ్‌ కోడూరి  సంగీతం, పాటలు కూడా ఈ క్లోజప్ కథా మర్యాదని దాటి విశృంఖల విహారం చేయలేదు. చాలా మెలోడియస్ గా, స్మూత్ గా స్వరాలు కూర్చి సమన్వయం సాధించాడు. పబ్ లో మొదటి పాట ‘జైబోలో జవానీ మళ్ళీ రాదనీ...’ ఇందుకొక ఉదాహరణ. మాటలు రాసిన లక్ష్మీ భూపాలే అన్ని పాటలకీ మంచి సాహిత్యాన్ని అందించాడు. సున్నిత హాస్యంతో మాటలు చాలా ఉన్నతంగా వున్నాయి. మాటలు రాయడం వెనుక చాలా ఆలోచన జరిగినట్టు కన్పిస్తోంది. క్వాలిటీ రైటింగ్ మాత్రమే కాదు, ఇంటలిజెంట్ రైటింగ్ కి కూడా ముందూ వెనుకా చూడకుండా పట్టం గట్టారు.

        నందినీ రెడ్డి దర్శకత్వ విలువలూ చాలా డీప్ స్టడీ తో కూడుకుని కన్పిస్తాయి. ప్రతి ఫ్రేములోనూ ఆవిడ మేధస్సు కన్పిస్తుంది. స్క్రిప్టు దగ్గర్నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ఈ మాధ్యమం పై తనకి గల కమాండ్ మామూలుదేం కాదని ఇట్టే తెలిసిపోతుంది సినిమా చూస్తూంటే. అయితే తన కమాండ్ ని ఈ ఫ్రేములోనే వుంచి –జీవితాలకి దగ్గరగా వుండే ఇలాటి ఫోటో ఫ్రేమ్- క్లోజప్ కథలు తీస్తూంటే తనకో బ్రాండ్ నేమ్ వస్తుందనేది మాత్రం ఖాయం.


చివరికేమిటి? 

        పెళ్లి గురించి నేటి అర్బన్ యూత్ ఆలోచనలెలా ఉంటాయో వాళ్లెలాటి సాహసాలకి ఒడిగడతారో చాలా ఫన్నీగా, ఫ్రెష్ గా చూపించుకొచ్చారు. ఎంతవరకూ? ఇక ఈ అడ్వెంచర్ ని ఎలా కొలిక్కి తేవాలన్నంత వరకే. ఇంతవరకూ మ్యాచ్ ఫిక్సింగ్ తో పెళ్లి చేసుకున్న ఇద్దరూ వెంటనే విడాకులకి పెట్టుకోవడం సంచలనాత్మక ఆవిష్కరణ. విడాకులు మంజూరవడానికి ఆర్నెల్లు పడుతుంది. అంతకాలం సహజీవనం కాని సహజీవనం చేస్తున్నారు. అయితే పక్కలో బల్లెంలా ఈ ప్లాట్ డివైస్ గా పెట్టుకున్న విడాకుల అంశం పే ఆఫ్ అయ్యే సంగతి కూడా కథకురాలు దృష్టిలో పెట్టుకోవాలి. దాన్నే  ప్లే చేసి వాళ్ళ ఆటకట్టించే ప్రయత్నం చేయాలి. కానీ ఇంత  బలమైన ప్లాట్ డివైస్ ని డైల్యూట్ చేసేసి కథంతా అయిపోయాక ముందుకు తెచ్చారు. అక్కడ కథని ఇంకా పొడిగిస్తూ పొడిగిస్తూ పోవడానికే అది  ఉపయోగపడింది.

        ఓ యాభై నిమిషాల్లో విడాకులకి అప్లయి చేయడంతో ఇంటర్వెల్ వేసేసినప్పుడు, సెకండాఫ్ ఇంకో గంటకి మించదు అనుకుంటాం. కానీ గంటదాటిపోయి  గంటా నలభై ఏడు నిమిషాల వరకూ సాగుతుంది! మొత్తం ఈ సింపుల్ సినిమా స్టోరీ నిడివి రెండు గంటలా 37 నిమిషాలుంది!! 

        సెకండాఫ్ లో గంట గడుస్తోందనగా ఒకటొకటే వ్యాధి లక్షణాలు బయట పడుతూ వస్తాయీ కథలో. అది గర్ల్ ఫ్రెండ్ వైదేహి రాకతో దివ్యకి జెలసీ పుట్టడం ద్వారామొదలై, దివ్య ఊరెళ్ళి నప్పుడు శౌర్య ఆమె లేని లోటుని ఫీలవ్వడం దగ్గరికొచ్చినప్పుడు- ఓహో ఇంతా చేసి ఈ కథ వీళ్ళని కలపడానికి రొటీన్ ఫార్ములా బారిన పడుతోందన్న మాట అని భయపడతాం. ఇలా ఒక దశ కొచ్చేటప్పటికి ఫీలింగ్స్ తో బరువైన సన్నివేశాలు వచ్చి, హీరో హీరోయిన్లు కలిసిపోవడమే కదా రొటీన్ మూస ప్రేమకథల బాట? ఇదే ఇక్కడా జరుగుతోంది. 

        ఇక్కడితో ఆగకుండా ఇది మరింత నాటు వ్యవహారంలోకి తిరగబెట్టింది. అది విడాకుల విషయం పెద్దలకి తెలిసిపోవడంతో! ఇక ఇక్కడ్నించీ మొదలు కథంతా రచ్చ అవడం! పెళ్ళీ గిళ్ళీ సాంప్రదాయమూ  గొప్ప గొప్ప విలువలంటూ ఆ పెద్దల రొటీన్  లెక్చర్లు! వీళ్ళు తలలు వంచుకోవడం! మామ అల్లుడ్ని ఫెడీ మని బాదడం! విడాకులు మంజూరైపోతే, కూతురికి  మరో పెళ్లి చేసేయబోవడం!...హీరోగారు వెళ్లి ఓ ఆత్మహత్యా ప్రయత్నంలో ఇరుక్కోవడం! హీరోయిన్ పెళ్లి మానుకుని వచ్చేసి కాపాడుకోవడం...అంతా రచ్చరచ్చ! ఇదంతా దాదాపు యాభై నిమిషాలు టార్చర్! ఇదిగో... ఇక్కడ అయిపోతుందనుకుంటే,  ఇంకా ఇంకా సాగడం, సహనానికి పెద్ద పరీక్ష పెట్టడం. 

        దర్శకురాలు తన ఫిమేల్ వాయిస్ ని నొక్కేసుకుంటూ మేల్ డైరెక్టర్ గా యూటర్న్ తీసుకోవడం వల్ల ఈ సమస్య. ఇలాటి పాత చింతకాయ మూస ప్రేమ కథలు మేల్ డైరెక్టర్లే తీస్తారు. అంతవరకూ సమస్యకి ఫిమేల్ డైరెక్టర్ వెర్షన్ గా ఫ్రెష్ గా, పాత మూస ధోరణులకి దూరంగా, న్యూవ్ వేవ్ సబ్జెక్టుతో ట్రెండీ గా ఉంటూ వచ్చిన విషయం, తీరా పరిష్కరించే దగ్గర జానర్ మర్యాద తప్పి –మేల్ డైరెక్టర్ ని ఆవాహన చేసుకుని చివరికి ఆ సముద్రంలోనే కలిసిపోయింది! యూ టూ మేడమ్ నందినీ రెడ్డీ? అన్న షేక్స్ పియరిన్ షాక్ లో మనం! 

        యూత్ తమ సమస్యలకి తామే పరిష్కారాన్ని కనుక్కోలేరా? ఎంత క్యాజువల్ గా కామెడీగా పెళ్ళీ, ఆ తర్వాత విడాకుల పథకమేసుకున్నారో- అంతే క్యాజువల్ గా కలిసిపోయే చిలిపి ఆలోచన ఒకటి చేయలేరా? శౌర్య అన్న ఒక్కమాటతో అతడి అంతరంగం తెలుసుకుని గర్ల్ ఫ్రెండ్  వైదేహి అంత సింపుల్ గా బై చెప్పేసి వెళ్లి పోయిందే - అంత సింపుల్ గానూ  శౌర్యా దివ్యలు విడాకులతో వేసుకున్న తమ పథకం బెడిసికొట్టే పరిస్థితి వచ్చి- దీనికంటే మొగుడూ పెళ్ళాలు గా శోభనం చేసుకోవడమే  బెటర్రా బాబో అని మొత్తుకుని,పథకమేసినంత క్యాజువల్ గానూ, కామెడీగానూ  కలిసిపోయి ఆడియెన్స్ కి కిక్కివ్వలేరా? అలాటి క్రేజీ టర్నింగ్ పాయింటుని క్రియేట్ చేయకూడదా ఇంత చేసుకొచ్చిన దర్శకురాలు, ఇది పెద్దవాళ్ళతో  సంబంధం లేని రోమాంటిక్ కామెడీ అయినప్పుడు? 

        ఈ పెద్దలెవరు ఇంకా పాత లెక్చర్లిచ్చి సినిమాని నాశనం చేయడానికి. రొమాంటిక్ కామెడీలో వీళ్ళకేం పని మోరల్  పోలీసింగ్ చేయడానికి.  యూత్ వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ విలువలేవో వాళ్ళు కనుగొంటారు. ఆ విలువలతో ఇబ్బందులుంటే తప్పకుండా మార్చుకుంటారు. సినిమాగా కథలో చూపించాల్సింది స్వయంగా వాళ్ళు పరిణతి చెందిన విజయాన్నే. పెద్దలెవరో క్లాసు తీసుకుంటే తలలూపి లొంగిన  అపజయాలు కాదు. అప్పుడు ఏమీ నేర్చుకున్నట్టు కాదు. బేసిగ్గా సినిమా కథంటేనే ఇగోని స్వయం ప్రతిపత్తితో మెచ్యూర్డ్ ఇగోగా మార్చే దిశగా పాత్రని ప్రయాణింపజేయడం కాదా?


        ఈ సినిమా రచ్చ అవడానికి ముందు కొత్తదనంతో నీటుగా సాగుతున్న విషయాన్ని- పాత్రధారులూ, వాళ్ళ ప్రవర్తనలూ మాటలతో సహా- తల్లి పాత్రలతో కూడా కలిపి- పై తరగతి నుంచీ కింది తరగతుల వరకూ ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేశారో, రచ్చ రచ్చ అవడం మొదలవగానే అంత సైలెంట్ అయిపోయారు.




-సికిందర్ 
http://cinemabazaar.in

         

        

       





       




4, మార్చి 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!






కథ – దర్శకత్వం :  దశరథ్
మనోజ్ మంచు, రెజినా, ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, నాగినీడు, సుబ్బరాజు, బ్రహ్మానందం 
స్క్రీన్  ప్లే : గోపీ మోహన్, హరి, కిషోర్ గోపు,  మాటలు :  దశరథ్ - కిషోర్ గోపు, సంగీతం : కె, వేదా, ఛాయాగ్రహణం : మల్హర్ భట్ జోషి 
బ్యానర్ : సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ , నిర్మాత : మల్కాపురం శివకుమార్ 
విడుదల : 4  మార్చి,  2016

           ***

     దర్శకుడు కె.  దశరథ్ ఈ సారి ఓ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతవారం విడుదలైన రెండు థ్రిల్లర్స్ ‘క్షణం’, ‘టెర్రర్’ లు చూసివున్న ప్రేక్షకులకి వెంటనే మరో థ్రిల్లర్ చూసే భాగ్యం కలుగుతోంది. కనీసం తెలుగు సినిమాలు రొటీన్ అయిపోయిన ప్రేమ కథలు, హార్రర్ కామెడీలకి దూరంగా కాస్త మార్పు తో ఇలా థ్రిల్లర్స్ తో ఉపశమనం కల్గించడం అమంచిదే. అయితే తెలుగు దర్శకులు  ఎంత వరకూ థ్రిల్లర్స్ అందించడంలో సక్సెస్ అవుతున్నదీ ప్రేక్షకులు గమనిస్తున్నదే. ఈ నేపధ్యంలో మంచు మనోజ్ –రెజీనా కాసాండ్రాలు హీరో హీరోయిన్లుగా దశరథ్ తీసిన ‘శౌర్య’ అనే థ్రిల్లర్ ఏ  మేరకు మార్కెట్ ధోరణులకి తగ్గట్టుగా వుందో  పరిశీలిద్దాం.


కథ
         
హార్వార్డ్  యూనివర్సిటీ విద్యార్థి అయిన శౌర్య (మంచు మనోజ్) ఆంధ్రా వచ్చి ఎంపీ సత్యమూర్తి ( నాగినీడు) కూతురు నేత్ర(రెజీనా కాసాండ్రా) తో ప్రేమలో పడతాడు. నేత్ర ఈ విషయం తండ్రికి సత్యమూర్తికి చెప్పక పోవడంతో సత్యమూర్తి ఆమెకి వేరే సంబంధం ఖాయం చేస్తాడు. తర్వాత కూతురు శౌర్యని  ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద కూతురు కూడా ఇలాగే ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. నేత్ర కూడా ఇదే పరిస్థితి తేవడంతో సత్యమూర్తి తమ్ముడు కృష్ణ మూర్తి (సుబ్బరాజు) కోపం పట్టలేక పోతాడు. కానీ సత్యమూర్తి  కూతురి సుఖమే ముఖ్యమని ఖాయం చేసుకున్న సంబంధాన్ని మెల్లిగా వాళ్లకి నచ్చజెప్పి రద్దు  చేయిస్తానని,  అప్పటివరకూ శౌర్యని కలవకుండా వుండాలనీ షరతు పెడతాడు నేత్రకి. 

          కానీ నేత్ర శివరాత్రి నాడు జాగారం చేద్దామని శౌర్య తో గుడికి వెళ్తుంది. అక్కడ నిద్రపోతున్న ఆమెని గొంతు కోసి పారిపోతరెవరో. ఈ హత్యాయత్నం కేసులో శౌర్య  అరెస్ట్ అవుతాడు. ఇదీ విషయం. నేత్ర గొంతు కోసిందెవరు? తర్వాత నేత్ర చనిపోతే శౌర్య మీద కేసు ఎంతమేరకు బలపడింది?  ఈ కేసులోంచి ఎలా బయటపడ్డాడు? ఈ సంగతులు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
         
థ, అది చెప్పిన విధానం ఇప్పటి మార్కెట్ ని ఆకర్షించే విధంగా లేదు. ఇవాళ్ళ సినిమా కథల్ని యూత్ ని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నామని అనుకుంటున్నారు గానీ, వాస్తవానికి ఆ యువ ప్రేక్షకుల్లో అబ్బాయిలకి తప్ప అమ్మాయిలు వుండడం లేదు ఇలాటి కథలకి. ఈ అబ్బాయిల కోసం కూడా రాస్తున్న కథలు ప్రేమ పేరుతో  అవే కాలం చెల్లిన, ఫార్ములా కథలు. ఈ కథలకంటే అబ్బాయిలు చాలా ముందున్నారు. కథల్లో చూపిస్తున్న  ప్రేమలకి అప్పుడే పెళ్లి అనే సంకెళ్ళు వేయడం, సెంటి మెంట్లతో బంధించడం నేటి జెనెక్స్  ప్రేక్షకులైన అబ్బాయికి  అస్సలు జీర్ణం కావడం లేదు. ప్రేమ కథల్లో ప్రేమలు  కాకుండా, ప్రేమల పేరుతో  పాల్పడే రకరకాల క్రేజీ చేష్టల్నే ఎంజాయ్ చేసే పరిణామక్రమంలో వున్నారు. ఈ మార్కెట్ అవసరాన్ని ఇలాటి కథలు తీర్చడం లేదు. పైగా ఈ కథ థ్రిల్లర్ అన్నారు. కానీ థ్రిల్లర్ జానర్ లక్షణాలు ఎక్కడా లేవు. జానర్ మర్యాద కాపాడని సినిమాలు గత సంవత్సరం ఏ బాట పట్టాయో అదే  బాటన పడిందీ కథ!

ఎవరెలా చేశారు
        మంచుమనోజ్ పూర్తి పాసివ్ పాత్ర పోషించాడు. రాముడు మంచి బాలుడన్నట్టు ఏమీ చేయకుండా, ఎక్కడా ఎదురు తిరగకుండా, పైపెచ్చు ఏడ్చే అతి బలహీన పాత్ర పోషించాడు. తెలుగు సినిమాల్లో పాసివ్  పాత్రలకి పరాకాష్ట అన్నట్టు వున్నాడు. ఆర్టు సినిమాల్లో కన్పించే బాధితులైన బడుగు రైతు పాత్రకీ  దీనికీ తేడా ఏమీలేదు. ఇది పూర్తిగా బాక్సాఫీసు వ్యతిరేక పాత్ర చిత్రణ. పైగా బాగా లావెక్కి పోయి యూత్ అపీల్ ని కోల్పోయే విధంగా వున్నాడు. అర్జెంటుగా అనవసర బరువు తగ్గించుకుంటేనే యూత్ లో తనకి ఇదివరకున్న క్రేజ్ వుంటుంది.

          హీరోయిన్  రెజీనా నటించడానికి పాత్ర పడే   సంఘర్షణ ఏమే లేదు. నేటి యూత్ కి హుషారు కలిగించే క్రేజీ సీన్లు కూడా లేవు ఆమెకి.

          ప్రకాష్ రాజ్ సీఐడీ అధికారిగా అయితే వున్నాడు గానీ,  అతడి పనితీరుకి  ఎక్కడా లాజిక్ కనపడదు. ఎంట్రీ సీనులో ఒక ఉరేసుకున్న మనిషి ఎంత సేపటికి చనిపోతాడో తనమీదే ప్రయోగించుకుని చూపిస్తాడు. తను 57 సెకన్ల వరకు మెడ చుట్టూ ఉరి తాడుని తట్టుకున్నాడు గాబట్టి, ఆ సమయాన్నే అసలు వురేసుకున్న ఆడమనిషికి వర్తింపజేసి ఆమె భర్తని  అరెస్ట్ చేస్తాడు. కానీ మెడకి వురి వేసుకుని కాళ్ళ కింద స్టూలు తన్నేయగానే జరిగే మొదటి చర్య మెడ ఎముక విరగడం. అంతే  గాకుండా మనిషి మనిషికీ ప్రాణం పోయే సమయం వేర్వేరుగా వుంటుంది. ప్రకాష్ రాజ్ ఇలా ఎలా నిర్ణయిస్తాడు?

          ప్రకాష్ రాజ్ భర్తని అరెస్టు చేయాలంటే  సింపుల్ విషయం  ఏమిటంటే, స్వయం గా వురేసుకుంటే తాడు మెడ చుట్టూ తిరిగే  కోణం,  ఇంకెవరో వురి తీసి వేలాడదీస్తే వుండే కోణం పరస్పర విరుద్ధంగా వుంటాయి. ఒక  సీఐడీ ఆఫీసర్ కిది జనరల్ నాలెడ్జి. అలాంటిది తన మీదే ఉరి ప్రయోగించి చూసుకుంటూ వేలాడ్డ మేమిటి సిల్లీగా. 

          అలాగే, హీరోయిన్ గొంతు  కోసిన కత్తికి అంటిన రక్తం గురించిన వివరణకీ  లాజిక్ లేదు. ఏ ఫోరెన్సిక్ లాబ్ లోనైనా పరీక్షల్లో మొట్ట మొదట చూసేది కత్తికి ఆ రక్తం హతురాలిదో కాదో అనే. ఈ కథలో అది హీరోయిన్ రక్తమే కానప్పుడు ఆమె మీద హత్యాయత్నం జరిగి వుండే అవకాశమే  లేదు. రెండోది, కత్తికి చర్మపు  పోగులు, ఎముకల పొడీ అంటుకునే అవకాశమే లేదు. ఇది ఈ సినిమా లోనే కొత్తగా వింటున్నాం. శరీరంలోకి దిగిన రక్తమే అంటుకుంటుంది తప్ప ఇంకమీ అంటుకోవు. అది హీరోయిన్ రక్తమే కాదని పరీక్షలో తేలడం ఖాయం. అలాంటప్పుడు హీరోమీద కేసుకి ఛాన్సే లేదు.

          ఇలా ప్రకాష్ రాజ్ పాత్ర చిత్రణ అవకతవకగా తయారయ్యిది. ఇతర పాత్రల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మానందం చేసే విఫల కామెడీ సహా. ఇక పాటలు, కెమెరా వర్క్, ఇతర సాంకేతిక విలువలూ చెప్పుకోదగ్గవిగా లేకపోవడం మనోజ్ సినిమాకి ఆశ్చర్యకరం. 

చివరికేమిటి
        ఈ సినిమాలో మంచు మనోజ్ ఎందుకు నటించాడా అన్నాది లాజిక్ కి అందని చిక్కు ప్రశ్న. పాత్ర ఎంటర్ టైన్ న్ చెయ్యదు, ఫైట్లూ  చెయ్యదు. మార్కెట్ డిమాండ్ చేసే అన్ని విలువలకీ దూరంగా మనోజ్ ఇలా కన్పించి సాధించేమిటో  తనకే తెలియాలి. దర్శకుడు దశరథ్ థ్రిల్లర్ జానర్ ర్ కొత్త.  ఓవరాల్ గా ఈ కథ కి మార్కెట్ స్పృహ ఎలా లేదో, అలాగే దీనికి చేసిన స్క్రీన్ ప్లేకి ఏ  స్క్రీన్ ప్లే లక్షణాలూ లేవు. దశరథ్ సహా ఈ సినిమాకి ఐదుగురు రచయితలూ పనిచేశారు మరి. ఐదారు సినిమాలు తీసిన దశరథ్ కే ఈ పరిస్థితి వుండడం విచారకరం. పైగా తికమక పెట్టే, అర్ధంలేని ఫ్లాష్ బ్యాక్స్ చివరంటా చికాకు పెడతాయి. ఈ కథలో ఏ ట్రాకుని  థ్రిల్లర్ కుండాల్సిన ప్రత్యేక డైనమిక్స్ దృష్ట్యా ఫ్లాష్ బ్యాక్ గా చూపాలి, ఏ ట్రాకుని  ప్రత్యక్ష కథగా చూపితే  బోరెత్తకుండా వుంటుందో తెలుసుకోలేదు. దీనికి సమాధానం గతవారం  విడుదలైన  ‘క్షణం’ లోనే దొరుకుతుంది. సీన్ల కంపోజిషన్, పాత్రల తీరు, చిత్రీకరణ వగైరా ఇప్పటి మార్కెట్ విలువలకి అందనంత దూరంలో  వున్నాయి. థ్రిల్లర్ జానర్ పక్కా ప్రొఫెషనలిజాన్ని డిమాండ్ చేస్తుందని  గుర్తిచలేదు.


-సికిందర్    
http://www.cinemabazaar.in  

2, మార్చి 2016, బుధవారం

స్క్రీన్ ప్లే సంగతులు!

సాధారణంగాబిగినింగ్ విభాగం చప్పున ( ఓ పది నిమిషాల్లో ) ముగిసిపోయి  ప్లాట్ పాయింట్ - 1 ఏర్పడే మన సినిమాలు చూడ్డానికి హాయిగా వుంటాయనుకుంటాం. ఎందుకంటే బిగినింగ్ విభాగం ఎంత చప్పున ముగిసిపోతే  అంత త్వరగా ఉపోద్ఘాతం  తప్పి కథ ప్రారంభమవుతుంది కాబట్టి. ఐతే ఇలాటి సినిమాలు ఎప్పుడో గానీ రావు. వచ్చాయంటే తిరుగులేకుండా ఫ్లాప్ అవడమే జరుగుతోంది. పది నిమిషాల్లో కథ ప్రారంభించేస్తే ఫ్లాపవడమేమిటని అన్పించవచ్చు. గత సంవత్సరం ఇలాటి సినిమాలు రెండు వచ్చాయి. సుమంత్ అశ్విన్- రెహానాలు నటించిన వేమారెడ్డి అనే కొత్తదర్శకుడి  ‘చక్కిలిగింత’ ఒకటైతే, మంచు లక్ష్మి- అడివి శేష్ లు నటించిన వంశీ కృష్ణ అనే మరో  కొత్త  దర్శకుడి  ‘దొంగాట’  అని రెండోది.  వీటిలో ‘దొంగాట’ ఆ కాస్తయినా ఆడిందంటే సెకండాఫ్ లో నేర్పు చూపెట్టడం వల్లే. మొదటిదైతే ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికే కథ అయిపోయింది! అంటే తెలుగు దర్శకుడు త్వరగా కథ ప్రారంభిస్తే త్వరగా సరుకు అయిపోతుందన్నమాట. ఇందుకని ప్లాపులు. 

       ఈ ఇద్దరు దర్శకులూ 2002  లో అడ్రేయిన్ లైన్ తీసిన అన్ ఫెయిత్ ఫుల్  స్ట్రక్చర్ ని పరిశీలించి ఆ ప్రకారం చేసుకుని  వుంటే చాలా బావుండేది.  ఈ ఇద్దరు దర్శకులూ చేసిన ఘోరమైన పొరపాట్లని ఎలా దిద్దుకుని ఉండొచ్చో  అన్ ఫెయిత్ ఫుల్ ని చూపెడుతూ, గతంలో వీళ్ళిద్దరి సినిమాల స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకున్న నేపధ్యంలో,  సరీగ్గా ఆలాటి  పొరపాట్లే మళ్ళీ చేయకుండా  రవికాంత్ అనే కొత్త దర్శకుడు ‘క్షణం’ తీసి సూపర్ సక్సెస్ అయ్యాడు. 

        ‘క్షణం’ లో ఈ పొరపాట్ల సవరణతో బాటు, ఇలాటి కథ– అంటే పది  నిమిషాల్లో సెటప్ చేసేసే కథని - అక్కడ్నించీ ఆ  ఒకే పాయింటు ఆధారంగా చివరంటా రెండు గంటలపాటు సాగదీయాల్సి వస్తున్నప్పుడు, మధ్యలో అది చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయవచ్చో కూడా  ‘క్షణం’  హింట్ ఇస్తోంది. 

        ఉదాహరణకి హైదరాబాద్ నుంచి బయల్దేరి వైజాగ్ వెళ్ళే బస్సుకి మధ్యలో డ్రైవర్ మారతాడు. మారకపోతే  ఆ 700 కిలోమీటర్ల సుదీర్ఘ  డ్రైవింగ్ ఒకే  డ్రైవర్ వల్ల కాదు. యాక్సిడెంట్ జరగవచ్చు. ఆ డ్రైవర్ రెస్టు తీసుకుని, రెస్టు లో వున్న ఇంకో డ్రైవర్ స్టీరింగ్ తీసుకుంటే క్షేమంగా బస్సు గమ్యం చేరుతుంది. 

        అలాగే సినిమా ప్రారంభమే ఒక పాయింటు అనుకుని దాంతో  కథ ప్రారంభించాక, దాంతోనే ముగింపు దాకా రెండు గంటల పాటు సుదీర్ఘ కథనం ( డ్రైవింగ్ ) చేయాలంటే మధ్యలో ఎక్కడో బోరుకొట్టి బోల్తా పడొచ్చు. అక్కడే కథ సమాప్తమై కూర్చోవచ్చు  (‘చక్కిలిగింత’).  అందువల్ల ఎత్తుకున్న ఆ డ్రైవింగ్ పాయింటుని మధ్యలో విశ్రాంతి కి పంపుతూ,  అందులోంచే  ఇంకో పాయింటుని లాగి స్టీరింగ్ ని అందిస్తే, ఆ అనుబంధ పాయింటుతో చివరిదాకా కథనం ( డ్రైవింగ్) సాఫీగా జరిగిపోతుందని  ‘క్షణం’ తెలియజెప్తోంది. 

        ఇక ‘దొంగాట’ లో జరిగిన పొరపాటేమిటంటే, ఓ పది నిమిషాల్లో బిగినింగ్ విభాగాన్ని ముగించి ప్లాట్ పాయింట్ -1 ని ఏర్పాటు చేశాక, వెళ్ళాల్సిన మిడిల్ విభాగంలోకి వెళ్ళకుండా, తిరిగి బిగినింగ్ విభాగం లోకే వచ్చి అక్కడే గిరికీలు కొట్టడం. ఇందుకే మొదట్లోనే కథ ప్రారంభించినా ఇంటర్వెల్ దాకా విషయం లేదనే రివ్యూ లొచ్చాయి. మనం ఒక ఆఫీసు కెళ్ళి పనిచూసుకుని ‘వస్తా సార్’  అని బయటికి వచ్చి, మళ్ళీ ఆ ఆఫీసులోకే  వెళ్లి ఆ ఆఫీసరు మొహం చూస్తూ కూర్చోము కదా? ఇంత సంస్కారం లేకుండా ఉంటున్నాయి సినిమా కథలు. ఆ మాటకొస్తే కమర్షియల్ సినిమా కథలకి సిగ్గులజ్జ లుండవు. 

        ఇలా ‘దొంగాట’ లో బిగినింగ్ ప్రాబ్లం, ‘చక్కిలిగింత’ లో డ్రైవింగ్ పాయింటు ప్రాబ్లం రెండూ   ‘క్షణం’లో ఎలా సాల్వ్ అయ్యాయో ఇక చూద్దాం. 

          ఈ రెండిటి తో బాటు- ఈ సస్పెన్స్ జాతి కథ చెప్పడానికి- ఎండ్ సస్పెన్స్ అనేసుడిగుండం లో కూడా పడకుండా పనికొచ్చిన టెక్నిక్ ఏమిటో చూద్దాం. 

ముందుగా మొత్తం కథ..
    ఈ
కథలో మధ్యలో డ్రైవింగ్ పాయింటు మారడం వల్ల ఇంటర్వెల్ ని కూడా రివీల్ చేయలేని లాక్ పడిపోయింది. సాధారణంగా మనం చూసిన ఓ సినిమా కథ ఒకరికి చెప్తున్నప్పుడు  ఇంటర్వెల్ విషయాన్ని దాచిపెట్టకుండా చెప్పేస్తాం. సినిమా ముగింపుని మాత్రమే చెప్పకుండా అపుతాం. దీని వల్ల ఆ సినిమా చూడాలనుకునే వ్యక్తికి ఎలాటి ఇబ్బందీ వుండదు. కానీ  ‘క్షణం’ లో ముగింపుతో బాటు, ఇంటర్వెల్ ని కూడా రివీల్ చేయలేని పరిస్థితితో కథనముంది. ఈ ఇంటర్వెల్ ని రివీల్ చేసినా ఈ  కథ సస్పెన్స్ వేల్యూ మొత్తం పోతుంది.

        కానీ స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవాలంటే ఎలాటి సస్పెన్సుల్నీ, ముగింపుల్నీ గుప్పెట్లో పెట్టుకోలేం. ఓపెన్ చేస్తేనే విశ్లేషణ అర్ధమవుతుంది. కాబట్టి ఇక్కడ స్పాయిలర్ ఎలర్ట్ ని తీసి పక్కన పెడదాం. 

        ఈ కథలో
అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఉంటున్న రిషి ( హీరో) కి ఇండియానుంచి మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ( హీరోయిన్) కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. నాల్గేళ్ళ క్రితం వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన శ్వేత ఇలా పిలవడంతో బయల్దేరి వస్తాడు రిషి. హైదరాబాద్ లో వుంటున్న శ్వేత తన నాల్గేళ్ళ  కూతురు రెండు నెలల నుంచీ  కన్పించకుండా పోయిందనీ, ఎవరూ- ఆఖరికి పోలీసులు కూడా కనుక్కోలేక పోతున్నారనీ వాపోతుంది. కారులో పోతూండగా దుండగులు తన మీద దాడి చేసి కూతుర్ని ఎత్తుకు పోయారని వివరాలు చెబుతుంది. 

        రిషి రంగం లోకి దిగుతాడు. అంతటా తికమక పెట్టే సమాచారమే వస్తూంటుంది అతడికి. ఎవర్నడిగినా, పోలీసులు సహా, లేని కూతుర్ని ఎలా వెతికి పెట్టమంటారని ప్రశ్నిస్తారు. పోలీసులు కేసు క్లోజ్  చేశామంటారు. రిషి కి శ్వేత మానసిక స్థితి మీద అనుమానం వేస్తుంది. అయినా పేపర్లలో అమ్మాయి ఫోటోతో ప్రకటన వేయిస్తాడు. ఆ ప్రకటన చూసి ఎవరో వ్యక్తి ఆ అమ్మాయి ఫోటోలూ సర్టిఫికెట్లతో వచ్చి ఆ అమ్మాయి తప్పిపోయిన తనమ్మాయేనని క్లెయిమ్ చేస్తాడు. రిషి ఇంకింత గందరగోళంలో పడతాడు.

        రిషి శ్వేత భర్తని కలుస్తానంటే ఆమె కలవనీయదు. వాళ్ళిద్దరి కాపురం సజావుగా లేదని అర్ధమవుతుంది.  
రిషి కి డ్రగ్స్ బానిసైన శ్వేత మరిది బాబీ మీద అనుమానం వస్తుంది.  ఆఫ్రికన్లతో కుమ్మక్కయి వున్న అతడి డ్రగ్ రాకెట్ ని చూసి  శ్వేత కూతుర్ని ఇతనే  కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తాడు. పిక్చర్లోకి ఈ డ్రగ్ రింగ్ తో సంబంధమున్న బాబూఖాన్ వస్తాడు. రిషి రహస్యాన్ని ఛేదిస్తున్న క్రమంలోనే కళ్ళ ముందే శ్వేత అపార్ట్ మెంట్ మీంచి  దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

        దీంతో రిషి చిక్కుల్లో పడతాడు. ఈ కొత్త కేసులో అనుమానితుడిగా పోలీసుల వేధింపులకి గురవుతాడు. ఇది ఆత్మహత్య అంటే నమ్మని పోలీసులు దర్యాప్తుని విస్తరిస్తారు. శ్వేత భర్త, బాబీ  తెరపైకొస్తారు. ఒక ఇంటరాగేషన్ సమయంలో బాబీని ఆత్మరక్షణ కోసం కాల్చేస్తుంది ఎసిపి జయ. ఈ జయతో రిషి కొనసాగుతాడు. మెడికల్ గా శ్వేత భర్త బయట పెట్టని నిజమొకటుంది. అది శ్వేతకి పుట్టిన కూతురు తనది కాదని. ఇది మనసులోనే వుంచుకుని శ్వేతని వేధించాడు.

        రిషికి బాబూఖాన్ ద్వారా మరికొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు, దీంతో జరిగే సంఘటనలు, డ్రగ్ స్మగ్లర్లతో ఘర్షణలూ వీటితో- అమ్మాయి కిడ్నాప్ రహస్యం వెల్లడవుతుంది. ఆనాడు శ్వేత మీద దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్ళింది ఈ ఆఫ్రికన్లే. ఇంకో ఇద్దరు కిరాయి కిల్లర్స్ ఈ ఆఫ్రికన్లని చంపాలని చూస్తూంటారు. వీళ్ళ చేతిలోనే బాబూఖాన్ మరణిస్తాడు. ఈ కిరాయి కిల్లర్స్, ఆఫ్రికన్లు, బాబీ మొత్తం కలిపి ఎసిపి జయ నెట్వర్క్ అని తెలుస్తుంది. ఫాం హౌస్ లో ఆమెని పట్టుకుంటే అక్కడే వుంటుంది అమ్మాయి. 

        ఎసిపి జయ ఒక సైకోపాత్. తనకో కూతురుండాలని  ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయించింది - ఈ అమ్మాయి తన కూతురు - ఇకంతే. ఈ కూతుర్ని సొంతం చేసుకోవడానికి  ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. శ్వేతకి కూతురే లేదని డబ్బులు గుమ్మరించి సాక్ష్యాలు  సృష్టించింది. ఫోటోలతో వచ్చిన వాడూ తన మనిషే. అపార్ట్ మంట్ లో, స్కూల్లో. పోలీస్ స్టేషన్లో అన్ని చోట్లా అందర్నీ కొనేసింది. అందుకే రిషి ఎక్కి కెళ్ళినా అలాటి సమాధానాలే  వచ్చాయి. బాబీని చంపింది కూడా ఆత్మరక్షణ కోసం కాదు. వాడు నిజం కక్కకుండా  వుండేందుకే అలా కాల్చేసింది. ఇంకా చాలా చేసింది, చేయబోతుంది కూడా..

        జయ విశ్వరూపం చూసి  షాకులో వున్న రిషికి అప్పుడు ఆ అమ్మాయి తన కూతురేనన్న పచ్చి నిజం తెలుస్తుంది. శ్వేతతో ప్రేమలో జరిగిన తొందరపాటు ఫలితమిది... ఇక జయ రిషిని షూట్ చేసేస్తుంది. ఇన్స్ పెక్టర్ సైకోపాత్ జయని  కాల్చేస్తాడు. రిషి బతికి తన కూతుర్ని చూసుకుంటాడు...

పెద్ద బ్లాకు- చిన్న పాయింటు 
      అంశాల వారీగా ఈ కథని పేర్చుకు రావడానికి సీన్ల వరస అయిదు  రకాలుగా వుంది. కథ ఎలా ప్రారంభించి ఎలా చెప్పుకొచ్చినా,  అసలంటూ మూలంలో కథ మొదలయ్యింది  రిషి- శ్వేతల ప్రేమ దగ్గరే కాబట్టి,  ఈ ప్రేమ లేకపోతే కథే లేదు కాబట్టి-  ఇక్కడ్నించి మొదలెడదాం. 1) ప్రేమ ప్రారంభం - దీని వైఫల్యం  తాలూకు సీన్ల వరస, 2) శ్వేత మీద దుండగులు  దాడిచేసి, కూతుర్నిఎత్తుకెళ్ళే సీన్లతో బాటు, ఆ కూతురు ఎలా ఎలా ఎక్కడికి చేరిందో ఆ సీన్ల వరస, 3) యూఎస్ లో వున్న రిషి జీవితం, శ్వేత అతణ్ణి అర్జెంటుగా రమ్మని అమ్మాయి అన్వేషణ బాధ్యత అప్పగించడం దగ్గర్నుంచీ,  ఆ అన్వేషణ తాలూకు సుదీర్ఘమైన సీన్ల వరస, 4) క్లయిమాక్స్ లో ఎసిపి జయ క్యారక్టర్ రివీల్ అయి ఆమె  పాల్పడ్డ ఈ కుట్ర తాలూకు మొత్తం అన్ని సీన్ల వరస, 5) ముక్తాయింపు. 

        ఇలా అయిదు బ్లాకులుగా సీన్ల వరసలున్నాయి. వీటి సర్దుబాటు ఎలా అర్ధవంతంగా జరిగిందో చూద్దాం. వీటిలో 2 వ బ్లాకులో కారులో అమ్మాయిని చూపించకుండా శ్వేత మీద జరిగిన దాడిని చూపిస్తూ కథనాన్ని ప్రారంభించారు. ఈ దాడి వరకే చూపించి 3వ బ్లాకు సీన్ల వరస ఎత్తుకున్నారు. రిషి ఇండియా బయల్దేరి వస్తున్నప్పుడు 1వ బ్లాక్ ఓపెన్ చేశారు. నాల్గేళ్ళ క్రితం రిషీ శ్వేతల ప్రేమ ఎలా ప్రారంభమయ్యిందీ చూపించి కట్ చేసి, 3వ బ్లాకుని కొనసాగించారు. 

        ఈ మూడవ బ్లాకే చాలా రిస్కీ బ్లాకు. ఎందుకంటే సినిమా ప్రారంభంలో ఓ పది నిమిషాల్లోనే ఇది  ప్రారంభమై, సుదీర్ఘంగా క్లయిమాక్స్ దాకా సాగుతుంది కాబట్టి. అమ్మాయి తప్పిపోయిందన్న చిన్న పాయింటు పట్టుకుని అంత సేపు కథనం చేయాలి కాబట్టి. ఈ బారెడు బ్లాకులో సందర్భాన్ని బట్టి అక్కడక్కడా మొదటి బ్లాకులో వున్న ప్రేమ కథని మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుగా వేసుకుంటూ పోయారు. ఇది ఎంత అర్ధవంతంగా వున్నా ప్రధాన కథ ఇదికాదు, అమ్మాయి కథే కాబట్టి ఎంత సేపని ఆమెని వెతుక్కుంటూ ఉంటాడు హీరో? విషయం లేక కథనం కొల్లాప్స్ అయ్యే ప్రమాదముంది. కాబట్టి ఇంటర్వెల్లో ఒక ట్విస్టు ఇచ్చి దృష్టి మరల్చేశారు. ఇంటర్వెల్లో ఆ ట్విస్టు హీరోయిన్ ఆత్మహత్య. 

        మధ్యలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకునే కథనం ఎవరైనా చేస్తారా? హీరోయినే లేకపోయాక ఇంకా సినిమా ఏమిటి...అనేది ఒట్టి మూఢ నమ్మకమని ప్రేక్షకులు అర్ధం జేసుకునే స్థితికి చేరుకోకపోతే ఎప్పటికీ బాగుపడరు. సినిమా ముగింపుని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆమె రిషి కూతురికి తల్లి, పైగా పెళ్ళయిపోయింది. ఇంకామెకి కథలో పనిలేదు. ముగింపులో కూడా ఆమె వుండిపోతే  కంగాళీ అయిపోతుంది ఆమె పాత్ర.  

        పుట్టింది భర్త  కూతురు కాదని తెలిసి కూడా భర్తకి చెప్పకుండా కాపురం చేయడంలోని అనైతికత ఎప్పుడూ హీరోయిన్ పాత్రకి తగనిదే. దీన్ని ప్రశ్నించవచ్చు ప్రేక్షకులు, ఇంతవరకే. 

        ఇంటర్వెల్ లో ఈ ట్విస్టు వల్ల కథనం సహజంగానే ఈ ఆత్మహత్యా కేసు మీదికి మళ్ళిపోయింది. ఇక్కడ కొత్తగా ఇంకో కథ తెచ్చి అతికించ లేదు. ఇది సెకండాఫ్ సిండ్రోమ్ కాదు, స్క్రీన్ ప్లే కూడా నిట్టనిలువునా ఫ్రాక్చర్ ఆవలేదు. ఉన్న కథలోంచే, పాత్రలోంచే ఆత్మహత్య అనే అత్యవసరమైన, అన్ని విధాలా సమంసమైన, కథ సమగ్రతకి సంతుష్టకరమైన పాయింటుని లాగి ఈ  సుదీర్ఘ బ్లాకులో ప్రయాణానికి ప్రమాదం లేకుండా చూసుకున్నారు.

        అమ్మాయి అదృశ్యమైన కథ బోరు కొట్టే ప్రమాదం తప్పి కాస్సేపు బ్రేకు పడింది. ప్రారంభం హైదరాబాద్ అనుకుంటే, ఇంటర్వెల్లో బస్సు డ్రైవర్ మరాడన్నమాట - శ్వేత ఆత్మహత్య కేసు రూపంలో. అమ్మాయి అదృశం కేసు రూపంలో వున్న మొదటి డ్రైవర్ రెస్టు తీసుకుంటున్న డన్నమాట. ఈ రెండో డ్రైవ్ క్లయిమాక్స్ దాకా సాగుతుంది, అక్కడ మళ్ళీ రెస్టులో వున్న మొదటి డ్రైవ్- డ్రైవర్  అందుకోవడంతో,  ఈ బస్సు అనే మొత్తం కథా వైజాగ్ అనే ముగింపుకి సల్లక్షణంగా చేరుకుందన్న మాట. 

        ‘చక్కిలిగింత’ లో లాంటి డ్రైవింగ్ పాయింటు ప్రాబ్లం ఇలా సాల్వ్ అయిందన్నమాట. 

బిగినింగ్ కి బ్రేకే!
       యిదు బ్లాకుల కథని స్ట్రక్చర్ పరంగా చూస్తే, 1) ప్రేమ ప్రారంభం - దీని వైఫల్యం  తాలూకు సీన్ల వరస, 2) శ్వేత మీద దుండగులు  దాడిచేసి, కూతుర్నిఎత్తుకెళ్ళే సీన్లతో బాటు, ఆ కూతురు ఎలా ఎలా ఎక్కడికి చేరిందో ఆ సీన్ల వరస, 3) యూఎస్ లో వున్న రిషి జీవితం, శ్వేత అతణ్ణి అర్జెంటుగా రమ్మని అమ్మాయి అన్వేషణ బాధ్యత అప్పగించడం దగ్గర్నుంచీ,  ఆ అన్వేషణ తాలూకు సుదీర్ఘమైన సీన్ల వరస, 4) క్లయిమాక్స్ లో ఎసిపి జయ క్యారక్టర్ రివీల్ అయి ఆమె  పాల్పడ్డ ఈ కుట్ర తాలూకు మొత్తం అన్ని సీన్ల వరస, 5) ముక్తాయింపు. 

          ఇందులో 1, 2 బ్లాకులు పూర్తిగానూ, 3 వ బ్లాకులో రిషి అన్వేషనని చేబట్టడం వరకూ సీన్లు బిగినింగ్ విభాగంలో కొస్తాయి.

        3వ బ్లాకులో అన్వేషణ చేపట్టిన దగ్గర్నుంచీ క్లయిమాక్స్ లో జయని అనుమానించి ఫాం హౌస్ కి బయల్దేరే వరకూ మిడిల్ విభాగం లోకి వస్తాయి.

        4, 5 బ్లాకులు ఎండ్ విభాగంలోకి వస్తాయి.

        ఇలా  త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో వున్న కథని కథనం చేసేప్పుడు ఆసక్తికరంగా ఉండేందుకు బిగినింగ్ విభాగాన్ని మాత్రమే నాన్ లీనియర్ చేశారు. బిగినింగ్ విభాగంలోని 1, 2 బ్లాకులుతో పాటు, 3 వ బ్లాకులో రిషి అన్వేషనని చేబట్టడం వరకూ వున్న సీన్లని నాన్ లీనియర్ చేశారు. మిగిలిన మిడిల్, ఎండ్  విభాగాల్ని లీనియర్ గానే ఉంచారు.     అంటే ‘ఖైదీ’ లోలాగా ఇది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మిడిల్- బిగినింగ్- ఎండ్ ( 2 – 1 3) నేపధ్యంలో లేదని గుర్తించడం అవసరం. 

        బిగినింగ్ లో వున్న సీన్ల వరసలో  ఒక్క ప్రేమ కథని మాత్రమే ఫ్లాష్ బ్యాక్ చేశారు. ఇలా చూసినప్పుడు ఇది బిగినింగ్ విభాగానికి మాత్రమె వర్తించే   2-1-3 ( ఖైదీ)  నేపధ్యంగా వుంది. ప్రధాన కథ ఫ్లాష్ బ్యాక్ లో లేదు,  ప్రేమకథ మాత్రమే మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుగా బిగినింగ్- మిడిల్ -ఎండ్ విభాగాలవరకూ విస్తరించి వుంది.

        దీనివల్ల సాధించిన ప్రయోజన మేమిటి? మరో దొంగాట’ గాడిలో పడకుండా తప్పించుకోగలిగారు. 

        బిగినింగ్ విభాగం ముగింపులో రిషి అన్వేషణ చేపట్టే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం దాకా వున్న సీన్లలో ప్రేమకి సంబంధించినవి ఆ ప్రేమెలా ప్రారంభమయ్యిందో అంతవరకూ మాత్రమే చూపించి ఆపేశారు. ప్లాట్ పాయింట్ -1 నుంచీ కథ మిడిల్లో పడింది. ఇక్కడ్నించీ మిడిల్ బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని రిషి కిచ్చిన గోల్ తో 3 వ బ్లాకు పూర్వార్ధం దగ్గర్నుంచీ, ఆ మిడిల్ ముగిసే ప్లాట్ పాయింట్ – 2 దాకా క్లయిమాక్స్ వరకూ, ఆ మిడిల్ బిజినెస్ నే తుచ తప్పకుండా కొనసాగించారు. 

        అంతే గానీ, ప్లాట్ పాయింట్ -1 దగ్గర బిగినింగ్ ముగిసిపోయాక మళ్ళీ బిగినింగ్ బిజినెస్ నే ఎత్తుకుంటూ బాకీ వున్న ప్రేమ కథని చెప్పుకురాలేదు!

         ఆ మిగిలిన్ ప్రేమకథని మిడిల్- ఎండ్ విభాగాల్లో మల్తీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వేస్తూ అడ్డం రాకుండా చూసుకున్నారు. ఈ తేడా బాగా గమనించాలి. 

        ‘దొంగాట’ లో పదినిమిషాల్లో కిడ్నాప్ తో ప్లాట్ పాయింట్ - 1 ఏర్పడ్డాక దాని పరిణామాలతో కూడిన మిడిల్ బిజినెస్ ని ప్రారంభించకుండా, మళ్ళీ బిగినింగ్ బిజినెస్ తో కూడిన టైం పాస్ సీన్లు వేస్తూపోయారు ఇంటర్వెల్ వరకూ!

        ఇలా ‘క్షణం’లో ‘అన్ఫెయిత్ ఫుల్’ కి సరిపోలింది. ‘దొంగాట’ లో లాంటి బిగినింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది.

యాంటీ ప్లాట్ కథనం

క నేరం  జరిగితే హీరో ఆ నేరస్థుణ్ణి ( విలన్ ని) పట్టుకునేందుకు అన్వేషణ సాగించడం ఒక రకం కథ- సస్పెన్స్ థ్రిల్లర్ జాతి. ఒక నేరం హీరోయే చేశాడని నేరస్థుడు ( విలన్) రుజువులతో సహా హీరోకి సాలెగూడు కడితే అందులోంచి హీరో బయట పడ్డం ఇంకో రకం కథ- మిస్టరీ జాతి. 2014 లో బెన్ అఫ్లెక్, రోసమండ్ పైక్ హీరో హీరోయిన్లుగా డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన ‘గాన్ గర్ల్’ (Gone Girl) లో ఇదే వుంది. గిట్టని భర్త ( హీరో) ని తన మర్డర్ కేసులోనే ఇరికిస్తూ ఆధారాలు సృష్టించి దాక్కుంటుంది హీరోయిన్. ఆ భర్త అమాయకంగా భార్య కన్పించడంలేదని పోలీసుల్ని ఆశ్రయిస్తాడు. మిస్సింగ్ కేసుగా ప్రారంభమయ్యే ఈ కథ భర్తే భార్యని చంపి  నటిస్తున్నాడన్న ఆధారాలు లభించి మలుపు తిరుగుతుంది...

         
ఒక నేరం చేసిన నేరస్థుణ్ణి పట్టుకోవడానికి వలపన్ని ప్రేక్షకులకి కూడా అనుమానం రాని విధంగా వివిధ పాత్రల్ని సీఐడీ లుగా దింపి హీరో ఆడే గేమ్ ఇంకో రకం కథ- కోవర్ట్ జాతి. 1955 నాటి ‘టు ఛేజ్ ఎ క్రూకెడ్ షాడో’ , దీని అనుసరణగా 1982 లో హిందీలో వచ్చిన ‘ధువా’  ఈ జాతికింద వస్తాయి. 

        నేరం చేసిన నేరస్థుడు (విలన్) ఆ నేరాన్ని కప్పి పుచ్చుతూ రివర్స్ లో తనే తప్పుదోవ పట్టించే అనేక పాత్రల్నీ, ఆధారాల్నీ దింపడం మరింకో రకం కథ- ఇంట్రీగ్ (
intrigue – కుట్ర) జాతి. దీన్ని రివర్స్ సస్పెన్స్ అనికూడా అంటారు. ‘క్షణం’ ఈ జాతి కిందికొస్తుంది. 

        విలన్ తన గుట్టు కాపాడుకోవడానికి అబద్ధాలు, అబద్ధపు రుజువులు, అసలా నేరం జరగనే లేదనడానికి అబద్ధపు కథలూ సృష్టించడం ఇంట్రీగ్ జాతి కథా లక్షణాలు. అసలు తనొక విలన్ గానే కన్పించడు. ఒక కుట్ర  చుట్టూ నడిచే ఇలాటి కథల్లో అసలా కుట్ర ఏ మిటి? ఆ కుట్ర బయట పడకుండా ఎవరు కాపాడుతున్నారు? ఇందులో ఎవరెవరు చేరి వున్నారు? ఎందుకు ఆ కుట్రని కాపాడాల్సి వస్తోంది? కుట్ర బయట పడితే ఏం జరుగుతుంది? ఎవరెవరు నష్టపోతారు? ఆ కుట్రని బయటికి తీయాలని ఎవరు తవ్వుతున్నారు? ఎందుకు తవ్వుతున్నారు? కుట్ర తెలిస్తే దాన్ని కాపాడే ఉద్దేశం ఉందా? కుట్ర దారుణ్ణి బ్లాక్ మెయిల్ చేయడానికా? ఇందులో వున్న రిస్కేమిటి? లాభాలేమిటి? అబద్ధాలెలా వున్నాయి? ఎవరు చెబుతున్నారు?...ఇలాటి సందేహాలెన్నో రేకెత్తిస్తూ కథనం నడపగల్గినప్పుడు అది ఈ జాతి కథ వుతుంది. జాతి మర్యాదని కాపాడుతుంది. 

        ‘క్షణం’ ఇలాటి జాతి మర్యాదని కాపాడిన  క్వాలిటీ రైటింగ్ మాత్రమే కాదు, ఇంటలిజెంట్  రైటింగ్ కూడా!  ఎవరంటారు క్వాలిటీ రైటింగ్, ఇంటలిజెంట్ రైటింగ్ తెలుగుకి పనికిరావని ఈ సినిమా ఘనవిజయాన్ని చూశాక కూడా?

-సికిందర్