రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, జూన్ 2015, బుధవారం

కథా? గాథా?


రచన, దర్శకత్వం: ఆర్‌. చంద్రు
తారాగణం: సుధీర్‌బాబు, నందిత, చైతన్య కృష్ణ, పోసాని కృష్ణమురళి, గిరిబాబు,
 పవిత్ర, రఘుబాబు, సప్తగిరి తదితరులు
సంగీతం: హరి, కూర్పు: రమేష్‌ కొల్లూరి, ఛాయాగ్రహణం: కె.ఎస్‌. చంద్రశేఖర్‌
బ్యానర్‌: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌, నిర్మాతలు: శిరీష-శ్రీధర్‌
విడుదల : జూన్‌ 19, 2015
*
All drama is conflict; without conflict there is no character; without character there is no action; without action there is no story. And without story there is no screenplay
 
Syd Field

ట్రెండ్ సెట్టింగ్ ప్రేమకథ లొస్తాయన్న ఆశ ప్రేక్షకుల కెలాగూ లేదు, కనీసం ట్రెండ్ లో వున్న ప్రేమకథలైనా చూడాలని ఆశపడడ్డం కూడా అత్యాశే అయిపోతే నష్టం ప్రేక్షకులకి కాదు- అలాటి తెలుగు ప్రేమ సినిమాలకే! ప్రేమ సినిమాలకి థియేటర్లు ఓపెనింగ్స్ కూడా లేక వెలవెలబోతూ,  రోమాంటిక్ థ్రిల్లర్లూ, హార్రర్ కామెడీలూ వస్తే హౌస్ ఫుల్సూ నడుస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో ఇంకా  పసలేని ప్రేమ సినిమాలు – అందునా కనీసం రోమాంటిక్ కామెడీ కూడా కాని విషాద ప్రేమకథలకి మార్కెట్ ఉంటుందా?

          ఎందుకు ప్రేమసినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి? వీటిని చూసే నేటి యువప్రేక్షకులు  ప్రేమల విషయంలో చాలా ముందున్నారు. సినిమాల్లో చూపిస్తున్న ప్రేమల్లాగా మడిగట్టుకు లేరు. వాళ్ళ దృష్టిలో సినిమాల్లో చూపిస్తున్నది తమ తరం సమస్యలతో కూడిన ప్రేమలు కావు, వెనకటి తరం మూస ఫార్ములా ప్రేమల దగ్గరే సినిమాలు ఆగిపోయాయి. స్టార్ సినిమాలు ఎంత పాత మూసగా వున్నా ఉన్మాదంతో ఊగిపోయి హిట్ చేయగలరు గానీ, అదే మూసగా ప్రేమ సినిమాలోస్తే భరించే స్థితిలో లేరు నేటి యువ ప్రేక్షకులు. ప్రేమ సినిమాల విషయానికొచ్చేసరికి వాటిని తమతో పర్సనల్ గా పోల్చి చూసుకుంటున్నారు. తమ psyche తో కనెక్ట్ కాని పాత మూస ప్రేమలన్నిటినీ తిప్పికొడుతున్నారు. ఇలా టార్గెట్ ఆడియెన్స్ తో కనెక్ట్ కోల్పోయామని కూడా తెలుసుకోకుండా దర్శకులు పనిగట్టుకుని కాలం తీరిన ప్రేమల్నే, ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో చూపించి నట్టుగా కాలం కాటేసిన విషాదంతపు ప్రేమల్ని సైతం తీసుకుంటూ పోతున్నారు. వాళ్ళ మార్కెట్ స్పృహకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ మధ్యే ‘వారధి’ అనే వొక విషాద ప్రేమ సినిమా ఫలితాలు ఎలావున్నాయో చూశాక, మళ్ళీ ఇంకో ట్రాజిక్ లవ్ స్టోరీతో  ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అంటూ వచ్చేసింది. కొసమెరుపేమిటంటే, ఇలాటి ప్రేమ కథతో ఇది కృష్ణమ్మ పరువే తీసింది! తాను ఏం చెప్తున్నాడో తనకే తెలీకుండా ఈ ప్రేమకి కృష్ణమ్మ పరువు తీసే ముగింపునే ఇచ్చాడన్నమాట ఈ దర్శకుడు! 

          ఇది దశాబ్దాలు గడుస్తున్నా కొలిక్కి రాని కృష్ణ అనే ప్రేమికుడి బాధామయ ప్రేమగాధ. ‘గాథ’ అని అనడమెందుకంటే, ఇది ‘కథ’ కాదు కాబట్టి. ‘కథ’కీ- ‘గాథ’ కీ తేడాల గురించీ, గాథలు సినిమాలకి ఎందుకు పనికిరావో మర్మం గురించీ, గత కొన్ని ఇలాటి సినిమాల రివ్యూల్లోనే  చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం ఈ గాథే మిటో చూద్దాం!

రాధాకృష్ణులు వీళ్ళు!  
       వూళ్ళో చదువుకంటే పశువులు తోలుకోవడమే బెటర్ అనుకునే కృష్ణ (సుధీర్ బాబు)  అనే పిల్లాడికి ఏడో క్లాసు తప్పినా స్ట్రెంత్ లేదని ఎనిమిదో క్లాసులో పడేస్తే కొత్తగా వచ్చి జాయి నవుతుంది రాధ ( నందిత) అనే పిల్ల. ఈమెని చూసి వెంటనే ఎట్రాక్ట్ అయిపోయి, ఈమె మెప్పుకోసం బాగా చదువుకుంటూ ప్రతిగా ఆమె ప్రేమని ఆశిస్తాడు, కానీ తానుగా  చెప్పుకోలేడు. ఆ స్కూల్లో ప్రేమ ఇంటర్మీడియేట్ కి చేరినా ఇదే పరిస్థితి. అప్పుడొక ప్రేమలేఖ రాస్తే ఆమె తల్లి ( ప్రగతి) చేతిలోపడి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంది. ప్రిన్సిపాల్ ( పోసాని) కృష్ణనీ, రాధనీ విడివిడిగా విచారిస్తాడు. రాధ తనకి చనిపోయిన తండ్రి ప్రేమ తప్ప మరో ప్రేమ తెలీదనీ, తనకు తల్లే సర్వస్వమనీ  చెప్పేస్తుంది ప్రిన్సిపాల్ కి. ఇది విన్న కృష్ణ డీలా పడిపోతాడు.

          ఎంసెట్ పాసయి ఇంజనీరింగ్ లో చేరతాడు. ఆ నగరంలోనే వేరే కాలేజీలో బీకాం చదువుతున్న రాధ మళ్ళీ తారస పడుతుంది. అతణ్ణి ఫ్రెండ్ లాగానే చూస్తుంది. ఇంజనీరింగ్ పాసయి జాబ్ లో కూడా చేరాక కృష్ణకి అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. అప్పుడు వూళ్ళో రాధని ని కలవడానికి వెళ్తే,  ఆమె తల్లి చెప్తుంది : భర్త పెన్షన్ మీద ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తను రాధ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాననీ, పెళ్లి పేరుతో ఆమెని తననుంచి విడదీస్తే చిన్నకూతురుతో బాటు ఆత్మహత్య చేసుకుంటాననీ బెదిరిస్తుంది.  చేసేది లేక అమెరికా వెళ్ళిపోతాడు కృష్ణ. 

          చాలా ఏళ్ళు గడిచిపోయాక, వూళ్ళో అప్పట్లో  కృష్ణతో కలిసి స్కూల్లో చదువుకుని మానే సిన కొందరు డ్రాపౌట్స్ తమ పూర్వ విద్యార్థుల్ని  కలుసుకోవాలని ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. అప్పుడు కృష్ణ అమెరికా నుంచి వస్తాడు. ఈ సారైనా రాధని పొందగలనా, ఎక్కడుందామె, పెళ్లయిపోయిందా-  అన్న సందేహాలతో.

          తీరా వచ్చి  ఆమెని వెతుక్కుంటూ వెళ్లి చూస్తే, కాలు పోగొట్టుకుని వికలాంగురాలిలా వుంటుంది. (
spoiler alert ఇక్కడ అప్రస్తుతం, ఈ తరహా గాథ ముగింపు వెల్లడించకుండా స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడం సాధ్యం కాదు కాబట్టి)

          ఇదీ విషయం. ఈ ఏకపక్ష ప్రేమలో ఎవరెలా చేశారో ఈ కింద  చూద్దాం. 

సాత్విక విషాదాలు!
          హీరోగా సుధీర్ బాబు పూర్తిగా రాముడు మంచి బాలుడు లాంటి పాసివ్ పాత్ర పోషించడంతో, అందుకు తగ్గట్టుగానే సాత్వికంగానే వుంది నటన. ‘మోసగాళ్ళకు మోసగాడు’ కంటే నటనలో బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. కానీ తన ప్రతిభని బయట పెట్టుకోవాలంటే ఇలాంటి బాక్సాఫీసు వ్యతిరేక పాసివ్ పాత్రలు పోషించడం కాదు. ముందు వచ్చే ఆఫర్స్ లో పాసివ్ పాత్రలుంటే వాటిని పసిగట్టి తిప్పికొట్టే నైపుణ్యం సంపాదించుకోవాలి. ప్రేమకథల్లో నటించాలనుకుంటే అవి ట్రెండీగా ఉండేట్టు చూసుకోవాలి. కనీసం గత దశాబ్దంన్నర  కాలంగా వెండితెర మీద ఏ తెలుగు హీరో కూడా పాత్రపరంగా భోరుమని ఏడ్చే సన్నివేశాలతో ఇబ్బంది పెట్టలేదు. అలాటిది తను ఎందుకు ఏడుస్తున్నాడో తెలీకుండా ఒక సన్నివేశంలో కుళ్ళి- కుళ్ళి- కుళ్ళి- కరువుదీరా  ఏడ్వడం వల్ల ప్రయోజనమేమిటో తెలుసుకోవాలి. ఈరోజుల్లో తను శోక రసంలో కూడా మేటి అన్పించుకుంటే వొరిగేదేమిటి? 

          సుధీర్ బాబుదే పాసివ్/ సాత్విక  పాత్ర అనుకుంటే, హీరోయిన్ నందితది మరీ విషాదంతో కూడిన పాసివ్ పాత్ర!  పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూడ్డం తప్ప ఈమె చేసిందేమీ లేదు. మాటలు కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఈమె నుంచి ప్రేక్షకులాశించే రోమాంటిక్ ఎలిమెంట్ ఏ కోశానా కన్పించకుండా చాలా చాలా జాగ్రత్త తీసుకున్నాడు కన్నడ నేటివిటీ దర్శకుడు! 

          పాటలు ఎక్కువైపోయాయి. ఛాయాగ్రహణం లో పెద్దగా ప్రత్యేకత లేదు. సినిమా నిడివి కూడా ఎక్కువే.

స్క్రీన్ ప్లే సంగతులు
       రెండు లోపాలు  ఈ ప్రేమ సినిమాని బలహీన పర్చాయి- మొదటిది ట్రెండ్ లో లేని ప్రేమ, రెండోది ఆ ప్రేమని కూడా ఒక కథలా గాక గాథగా చెప్పడం!
తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు మాత్రమే శాపాలనుకున్నాం- ఇప్పుడు కథలు గాక గాథ లు చెప్పడంతో ఇంకో శాపం కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు!
          ఎప్పుడో పూర్వకాలంలో బాగా ప్రూవైన ఈ బాపతు ‘ప్రేమ త్రెడ్’ ఇప్పుడూ వర్కౌట్ అవుతుందనుకున్నారో ఏమో, ఇప్పటి ట్రెండ్ ని పట్టించుకోలేదు. ఈ  త్రెడ్ కూడా ఓ గాథ లాగా వుందని కూడా గమనించినట్టు లేదు. ‘గాథ’ అనేది ఒక స్టేట్ మెంట్ మాత్రమే. నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా ముగిసింది - అని విధికి తలవంచిన పాత్ర పరాజితుడిగా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలాకాక ‘కథ’ అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. నేనకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నాను- అని పాత్ర విజేతగా ప్రకటిస్తుంది.

          ‘కథ’ అనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ తో  పనుండదు. హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించికుని ఇంకేదో చేసి- - తానొకటి తలిస్తే దైవమొకటి తలచును -  అన్నట్టు అమాంతం పిడుగు పడి చావడంతో ముగియదు. గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో  ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో  భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది.  

          “
 స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్యపరంగా చూసేందుకు కథలు మాత్రమే  బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై,  దాంతో మొదలయ్యే సంఘర్షణ తప్పొప్పుల – లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్య వల్ల  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ ఇవతల పారేసి తన దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది”

          ఇదీ మణిరత్నం తీసిన ‘ఓకే బంగారం’  స్క్రీన్ ప్లేసంగతుల్లో చెప్పుకున్న విషయం. ఇలా సరీగ్గా ‘ఓకే బంగారం’ లాంటి గాథ చట్రంలోనే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ కూడా ఇరుక్కుంది. ఈ రివ్యూ మొట్టమొదట్లో పైన పేర్కొన్న సిడ్ ఫీల్డ్  కొటేషన్ ప్రకారం చూస్తే, దీన్నొక స్క్రీన్ ప్లే అనుకోవడం ఎలా అనేదే ప్రశ్న! గాథ తో మణిరత్నం ఆల్రెడీ చేసిన తప్పునే మళ్ళీ చేయాలా! 

         సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ తో ఈ గాథ చెప్పుకొచ్చారు. పూర్వ విద్యార్ధుల సమావేశ ప్రతిపాదన, దాంతో అమెరికా నుంచి హీరో తరలివస్తూ రాధగురించి జ్ఞాపకాల్లో వెళ్ళడమనే దృశ్యాలతో ఈ  ‘గాథ’  ని ఎత్తుకున్నారు. దాన్నక్కడ ఆపి - ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అన్ని పరిమితుల్నీఅతిక్రమించి క్లైమాక్స్ దాకా సాగింది. ఎత్తుకున్న గాథ( అమెరికానుంచి వస్తున్న హీరోకి హీరోయిన్ తో ఏం జరుగుతుందన్న ప్రధాన గాథ)  క్లయిమాక్స్ దాకా ఆగిపోయింది.  ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన గాథ అవదు.  ప్రధాన గాథకి సందర్భవశాత్తూ అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే ఫ్లాష్ బ్యాక్ అని ఇదివరకు చెప్పుకున్నాం.

          అయితే ఇంత సుదీర్ఘ మైన ఫ్లాష్ బ్యాక్ ఓ ‘కథ’ లో ఉపయోగపడినట్టుగా ఏ  ‘గాథ’లోనూ  ఉపయోగపడదు. కథల్లో  3-1-2 అనే నాన్ లీనియర్ పద్ధతిలో ఉపయోగపడుతుంది. అంటే ఎండ్- బిగినింగ్- మిడిల్ అన్న వరసలో. చిరంజీవినటించిన ‘ఖైదీ’ సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ కథనమే వుంటుంది. అది క్లైమాక్స్ తో ప్రారంభమై, అసలేం జరిగిందో చెప్పడానికి బిగినింగ్ ని ఎత్తుకుని, మిడిల్ లో ఆ బిగినింగ్ తాలూకు సంఘర్షణ సృష్టించుకుని, తిరిగి క్లయిమాక్స్ కొచ్చి,  ఆ సంఘర్షణని పరిష్కరించుకుంటుంది. ఇది ‘కథ’ కాబట్టి ఫ్లాష్ బ్యాక్ లో సమస్య- సంఘర్షణ వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ముగిశాక పరిష్కారం వుంటుంది. 

          ఇదే ఫ్లాష్ బ్యాక్ ‘గాథ’ లో వుంటే అది కేవలం సమాచారాన్ని అందించే వనరుగా మాత్రమే  పనిచేస్తుంది తప్ప, ఓ సమస్యా దానితో సంఘర్షణా ఆసక్తికర కథనం వుండదు. ఈ సినిమాలో చూపినట్టు కేవలం అనుభవాల పేర్పు మాత్రంగానే వుంటుంది. ఎన్ని అనుభవాలని చూస్తాం! 


          అందుకని ఈ సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ అంతా అసలు కొసరు ‘గాథ’ కి కేవలం ఉపోద్ఘతంలాగా ఉండిపోయింది. కనుక కథల్లో  పనికొచ్చినట్టుగా ఫ్లాష్ బ్యాక్ ( నాన్ లీనియర్ ) కథనం గాథల్లో  పనికి రాదనీ అర్ధం జేసుకోవాలి.   

          ఉంటే ప్రేక్షకుల ఆసక్తి ప్రధాన గాథ మీదే ఉండొచ్చు తప్ప ఫ్లాష్ బ్యాక్ మీద కాదు. ప్రధాన గాథ ని ఎంత ఎక్కువ సేపు ఆపితే అంత ఆసక్తి ఆవిరైపోతుంది. 

     ఇలావుండగా, ఇది గాథ అవడంతో దీనికో స్ట్రక్చర్ కూడా లేకుండా పోయింది. స్ట్రక్చర్ సమస్య వున్నప్పుడు, దాంతో సంఘర్షణ వున్నప్పుడూ మాత్రమే  వుంటుంది. పైన చెప్పుకున్నట్టు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ప్రధాన గాథ కి  అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే  కావడం వల్ల, సహజంగానే ఇందులో  సంఘర్షణ అనేది కూడా లేకుండా పోయింది. గాథల్లో  ఫ్లాష్ బ్యాక్ పెడితే  దాంట్లో ఎప్పుడూ సంఘర్షణ అనేది వుండదు, ఇది గుర్తు పెట్టుకోవాలి. ‘సమస్య ( బిగినింగ్) – సంఘర్షణ (మిడిల్) – పరిష్కారం (ఎండ్)’  అనే త్రిలోకాలు కథలకి  మాత్రమే దఖలు పడిన కథాంగాలు. గాథల్లో, వాటి ఫ్లాష్ బ్యాకుల్లో సెర్చి లైట్ వేసి గాలించినా ఇవి కన్పించవు. 

          కనుక ఈ విధంగానే కేవలం హీరో వివిధ దశల ప్రేమ సమాచారాన్ని మాత్రమే  ఇస్తూ క్లయిమాక్స్ దాకా సాగింది ఫ్లాష్ బ్యాక్! ఒక గాథని  చెప్పడానికి ఇన్నేసి గంటల సమాచారం అవసరమా! సమాచారమే ( ఫ్లాష్ బ్యాకే) ఇంత తినేస్తే  ఇక మొదట్లో ఎత్తుకున్న ప్రధాన గాథ కి ఏం సమయం మిగులుతుంది? 

          ఈ సినిమాలో ప్రధాన  గాథ ఎలా మిగిలిందంటే, రాథని చూడ్డానికి అమెరికానుంచి వచ్చిన వాడు, చివర్లో ఎప్పుడో  చూశాడు- కలుసుకుని సుఖాంతం - పోనీ దుఃఖాంతం చేసుకున్నాడు! అమెరికానుంచి రావడానికీ, చివర్లో ఎప్పుడో  కలుసుకోవడానికీ మధ్య అంతా తన ఫ్లాష్ బ్యాక్ వేసుకుని కాలక్షేపం చేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో దమ్ములేదు, పిసరంత మిగిలిన ప్రథాన గాథ లోనూ దమ్ములేనట్టే. 

          ఈ గాథలో కూడా సమస్య పుట్టడానికి తావిచ్చిన ఘట్టాలు లేకపోలేదు, అవి రెండున్నాయి- ఫస్టాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో ఇంకోటి. ఫస్టాఫ్ లో హీరో ప్రేమ లేఖతో ప్రిన్సిపాల్  సీన్లో హీరోయిన్ తనకి హీరో మీద ప్రేమ లేదన్నట్టు పరోక్షంగా చెప్పినప్పుడు హీరోకి సమస్య పుట్టినట్టే.  అయితే ఇది గాథ గాబట్టి,  సరేలెమ్మని ఈ సమస్య తాలూకు బాధని దిగమింగుకుని వెళ్ళిపోయాడు. ఇదే కథ అయ్యుంటే ఈ సమస్యని సాధించడానికి పాటుపడేవాడు. సంఘర్షణ మొదలయ్యేది. 

          దీనితర్వాత సెకండాఫ్ లో- హీరోయిన్ తల్లి- నా కూతురితో పెళ్ళన్నావంటే ఉరేసుకు చస్తానని బెదిరించినప్పుడూ హీరో చక్కగా ‘గాథ’ లక్షణాలకి న్యాయం చేస్తూ సరేలెమ్మని ఈ సారి అమెరికాకే వెళ్ళిపోయాడు. ఇదే కథ అయ్యుంటే, ఆ తల్లికీ ఆమె చిన్న కూతురి భవిష్యత్తుకీ తగిన హామీ ఇచ్చి ఒప్పించుకునే వాడు!

          పలాయనం చిత్తగించేదే గాథ ల్లో కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగా, పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి ఊరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలు లభిస్తూంటాయి.

          దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదు, అది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు.

పాత్రోచితానుచితాలు 
       ఇలాటి గాథల్లో పాత్రచిత్రణల గురించి చెప్పుకోవడానికి ఏమీ వుండదు. ఎందుకంటే, ఇవి గాథల్లో వుండే లక్షణాలతోనే  తుచా తప్పకుండా ప్రవర్తిస్తాయి. కథల్లో ఇలాటి పాసివ్ పాత్రలుంటే చెప్పుకోవడానికి చాలావుంటుంది. కనుక ఈ గాథలో గాథ లక్షణాల్ని ప్రస్ఫుటం జేస్తూ,  హీరో ఎప్పుడూ పాసివ్ గానే, కార్య విహీనుడిగానే ఉంటాడు. ప్రేమకోసం కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు గానీ, కాలుకదిపి ఓ చిన్న ప్రయత్నం చెయ్యడు. తను చదువుకుని, పెద్ద ఉద్యోగంలో చేరడానికి కాసేపు ఉపాధ్యాయులు కారణమనీ, మరికాసేపు అబ్దుల్ కలాం ఆజాద్ అనీ, ఇంకాస్సేపు హీరోయిన్ స్ఫూర్తి నిచ్చిందనీ, ఆ పూర్వ విద్యార్థుల మీటింగ్ లో ఒకే ఉపన్యాసంలో పరస్పర విరుద్ధంగా కూడా మాట్లాడతాడు.

          హీరోయిన్ కీ తుచా తప్పకుండా ఓ దృక్పథం లేదు. కాసేపు సీఏ చదువుతానని చెప్పి, బీకాం లో చేరుతుంది, మళ్ళీ సీఏ చేస్తున్నానని అంటుంది. పైగా వయసుకి మించిన హూందా తనంతో వుంటుంది. ఆత్మరక్షణ కోసం ప్రకృతి స్త్రీకి ఓ సహజాతాన్ని ( ఇన్ స్టింక్ట్) ఏర్పాటుచేసింది. దాంతో తనతో మెలుగుతున్న ఓ మగాడు ఏంటో ఇట్టే పసిగట్టేయగలదు. అప్పడా  మగాణ్ణి బట్టి జాగ్రత్తపడాలో, ప్రొసీడవచ్చో చర్య తీసుకోగలదు. కానీ ఇక్కడ ఏళ్ల తరబడీ తనతోపాటు చదువుతూ సన్నిహితంగా మెలుగుతున్న, ప్రేమని వెల్లడించలేని అర్భకుణ్ణి  చదవలేని ఆడతనం-  పోనీ జడత్వం ఈమెది! పెద్దపెద్ద కళ్ళేసుకుని చూడ్డం తప్ప ఆ కళ్ళయినా చెప్పే భాషేమీ వుండదు. తండ్రి ప్రేమ తప్ప మరో ప్రేమే  తెలియదట, తల్లే సర్వస్వ మట. మరి ఈ సినిమాలో ఎందుకున్నట్టు. సినిమాల్లో హీరోయిన్ వుండేది ఇందుకేనా? 

          చివరికి తల్లి యాక్సిడెంట్ లో చనిపోయి, అదే యాక్సిడెంట్లో  తను కాలూ పోగొట్టుకుని ( దర్శకుడి ఈజీ సొల్యూషన్ –ఈ దైవిక ఘటన! ) కడు దయనీయంగా దర్శన మిచ్చింది వచ్చిన హీరోకి! 

          అక్కడి కృష్ణా నదిలో బండ రాయిమీద ఏది రాస్తే అదే జరుగుతుందని అక్కడి వాళ్ళ నమ్మకమని ముందెప్పుడో చెప్పిస్తాడు దర్శకుడు. అప్పుడు ఆ బండ రాయిమీద ఆమెకి తెలియకుండా ఐ లవ్యూ అని రాస్తాడు హీరో. చిట్టచివర్లో ఆ వూరొచ్చినప్పుడు ఆమెకూడా రాసిన అక్షరాలూ చూస్తాడు హీరో. ఇంకేముంది...లవ్ సక్సెస్, అక్కడ ఏం రాస్తే అది నిజమౌతుందన్న మాట నిజమవుతోందని మనం సంతోషిస్తూండగానే- అవిటిదానిగా హీరోయిన్ దర్శనం! 

          వావ్, కృష్ణమ్మ ఇంత ఘోరంగా కలిపిందా!

సికిందర్ 



15, జూన్ 2015, సోమవారం

నాటి రహస్యం!


          జానపద వీరుణ్ణి కౌబాయ్ హీరోగా మార్చేసి, మొత్తం భారతీయ సినిమానే కొత్త జానర్ లోకి కదం తొక్కించిన యాక్షన్ సినిమాల డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్. కె ఎస్ ఆర్  దాస్ - కృష్ణ- ఓ కౌబాయ్ పాత్రా కలిస్తే అదొక ‘మోసగాళ్ళకు మోసగాడు’ అయి తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తే, మళ్ళీ భాష మార్చుకుని నూట పాతిక దేశాల్లో ‘ట్రెజర్ హంట్’ గా డబ్బింగై రికార్డులు కూడా  సృష్టించింది!  
          ఇవ్వాళ్ళ నాలుగైదు దేశాల్లో ఓవర్సీస్ వ్యాపారం చేసుకోగల్గుతోంది తెలుగు సినిమా. దీన్నే ‘ప్రపంచవ్యాప్తంగా విడుదల’ అంటున్నారు. కానీ నాలుగు దశాబ్దాల క్రితమే ‘మోసగాళ్ళకు మోసగాడు’ సాధించిన యూనివర్శల్ సక్సెస్ స్టోరీ ముందు ఇదెంత! ఎల్లెలెరుగని సక్సెస్ కొత్త కొత్తగా చేసే సాహసాల వల్లే వస్తుంది!


ఇది హీరో కృష్ణ సాహసం. కానీ దీనికంటే ముందు కె ఎస్ ఆర్ దాస్ చేసిన సాహసం వుంది. 1970 లోనే విజయలలిత తో ‘రౌడీ రాణి’ తీసి, ఆలిండియా లోనే మొట్టమొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాగా ఆయన నిలబెట్టాడు. తనూ మొట్ట మొదటి యాక్షన్ సినిమా డైరెక్టర్ అయ్యాడు. అలాగే 1971 లో కృష్ణ నటిస్తూ నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ తో దేశానికి మొట్ట మొదటి కౌబాయ్ సినిమాని అందిస్తూ, చరిత్రని సృష్టించాడు కె ఎస్ ఆర్ దాస్.   ప్రతీ ట్రెండ్ సెట్టర్ ఒక చారిత్రక అవసరం కోసం పుడతాడు. 1970 ల నాటికి ఆదరణ కోల్పోతున్న  జానపద సినిమాల స్లాట్ ని కె ఎస్ ఆర్ దాస్ తన కౌబాయ్- యాక్షన్ చిత్రాల పరంపరతో భర్తీ చేస్తూ, సగటు ప్రేక్షకుల్నితండోపతండాలుగా కొత్త ఉత్సాహంతో థియేటర్లకి రప్పించిన ఘనత సాధించాడు. కానీ ఏదైతే ఫారిన్ అన్పిస్తుందో దానికి సినిమా పండితుల ఆదరణ లభించదు. కాబట్టి యాక్షన్ దాదా దాస్ ఎలాటి అవార్డులకీ అర్హుడు కాలేకపోయారు. ఇది చూడముచ్చటగా సినిమా పండితులు చేసిన చారిత్రక తప్పిదం (ఈ వ్యాసం చదివి బెంగళూరు నుంచి కె ఎస్ ఆర్ దాస్ ఫోన్ చేసి బాధని పంచుకున్నారు).


      ‘మోసగాళ్ళకు మోసగాడు’ దాస్ కి 
దర్శకత్వంలో గోల్డ్ మెడల్ లాంటి సినిమా. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’ లాంటి హాలీవుడ్ సినిమాలు ఈ తెలుగు కౌబాయ్ కి స్ఫూర్తే గానీ నకలు కాదు. నేడు దృశ్యాలే యదేచ్ఛగా కాపీఅవుతున్న నేపధ్యంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో ప్రతీ దృశ్యం  సొంత సృష్టే కావడం గర్వకారణం. లేకపోతే  125 దేశాల్లో విడుదలైన దీని డబ్బింగ్ వెర్షన్ ని తిప్పికొట్టేసే  వాళ్ళు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గర్వ పడాల్సిన ఓ అద్భుత కౌబాయ్ సృష్టి ఈ సినిమాతో  చేశారు మహా కవి ఆరుద్ర. కవులేంటి, కౌబాయ్ లు రాయడమేంటని జుట్లు పీక్కోనక్కర్లేదు. ఆ రోజుల్లో కొందరు కవులూ రచయితలు కూడా నన్న విషయం మరువకూడదు. ఆరుద్ర అలాంటి సృష్టి చేస్తే, హాలీవుడ్ ప్రభావం పడనీ దర్శకుడు దాస్, ఛాయాగ్రాహకుడు వీఎస్సార్ స్వామి దీన్ని తెరకెక్కించారు. అప్పటివరకూ తెలుగు ప్రేక్షకులకి ఏమాత్రం పరిచయం లేని పరాయి పాత్రలో కలర్ కౌబాయ్ గా హీరో కృష్ణ సూటిగా వాళ్ళ హృదయాల్లోకి దూసుకు పోయారు. అంతే, ప్రాణాంతకమైన ఇంత రిస్కుతీసుకుని ఎక్కడో హాలీవుడ్ కౌబాయ్ పాత్రని తెలుగుకి నమ్మించి, టోకున అమ్మించేయడం మామూలు విజయం కాదు, విజయంన్నర విజయమది!

ఇంకా ఈ సినిమాతో ముందు కాలంలో ఎదురవబోయే ఓ సమస్య ని అప్పుడే ఊహించేసినట్టు, దానికో పరిష్కారాన్ని కూడా సూచించేశారు. ఇప్పుడు మారిపోయిన జీవన విధానంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఓ సినిమా దృశ్యం పై ధ్యాస పట్టే అటెన్షన్ స్పాన్  అనేది పది సెకన్లకి పడిపోయిందని హాలీవుడ్ ఆందోళన చెందుతోంది. దీంతో  తెలుగులో కూడా ఎంటీవీ తరహా హడావిడి మెరుపు షాట్స్ కట్ చేస్తున్నారు. దీనివల్ల పసలేని వాక్యాల్లా దృశ్యాలు తే లిపోతున్నాయి. దీనికో పరిష్కారంగా అన్నట్టు ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో దృశ్యాత్మక వైభవాన్ని సంతరించిపెట్టారు. ఆ దృశ్యాత్మక వైభవాన్ని  హీరో పాత్ర ఆలంబనగా సృష్టించారు. వాణిజ్య సినిమాకి హీరో పాత్ర తప్ప మరేదీ ప్రధానాకర్షణ అవదు కాబట్టి,  దృశ్య దృశ్యానికీ మారిపోయే కొత్త కొత్త కౌబాయ్ డ్రెస్సులతో హీరో కృష్ణ కలర్ఫుల్ గా కనువిందు  చేస్తూంటే, ప్రేక్షకుల కళ్ళు తెరకి అతుక్కుపోక ఏమౌతాయి? అప్పుడు అటెన్షన్ స్పాన్ అనే వేధించే సమస్య కి స్థానం ఎక్కడుంటుంది? జీవన వేగంతో పరుగులెత్తే హడావిడీ బిజీ ప్రేక్షకుల పరధ్యానాన్ని దృశ్యం జయించాలంటే, ఎప్పటికప్పుడు అలరించే కంటెంటే ముఖ్యం తప్ప, ఎలాంటి ఫ్లాష్ కట్స్ లతో సారం లేని టెక్నాలజీ కాదని ఆనాడే తేటతెల్లం చేసింది ‘మోసగాళ్ళకు మోసగాడు’! 

     ఎర్రటి రాజస్థాన్ ఎడారులు, బికనీర్ కోట లు, ఆకుపచ్చ- నీలి వర్ణపు ప్రవాహంతో సట్లెజ్ నదీ తీరం, తెల్లటి సిమ్లా మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాక్- చైనా సరిహద్దూ..ఇలా ఎన్నెన్నో అంతర్జాతీయ స్థాయి దృశ్యాల చిత్రీకరణలతో, ఉత్తర భారతాన్ని ప్రపంచానికి చూపెట్టిన దక్షిణ సినిమా ఇది!  మద్రాసు నుంచి ప్రత్యేక రైల్లో రాజస్థాన్ కి యూనిట్ అంతా తరలి వెళ్తోంటే సినిమా వర్గాల్లో ఆందోళన. ఇంత బరితెగించిన హంగామాతో పద్మాలయా బ్యానర్ ఉండేనా పోయేనా అని దిగులు. తీరా బాక్సాఫీసు వైపు చూశాక కళ్ళు చేదిరేట్టు  కనకవర్షం!

         కృష్ణ, విజయనిర్మల, నాగభూషణం, రావుగోపాలరావు, గుమ్మడి, కాంతారావు, ధూళిపాళ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, సాక్షి రంగారావు, త్యాగరాజు, ఆనందమోహన్, కాకరాల, గోకిన రామారావు, సి హెచ్ కృష్ణమూర్తి ...ఇంకా జ్యోతిలక్ష్మి, రాజసులోచన, శాంతకుమారి, ఎస్ వరలక్ష్మి, తదితర హేమాహేమీలతో  కూడిన భారీ తారాగణం!

          పాటలూ హిట్టే! స్వరకల్పన ఆదినారాయణరావు. గీతరచన ఆరుద్ర, అప్పలాచార్య. ‘కోరినది నెరవేరినది’, ‘గురిని సూటిగా చూసేవాడా’, ‘ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా’..పాటలు మాంఛి కిక్కు. అప్పట్లోనే ఫిరోజ్ ఖాన్ తీసిన ‘అపరాథ్’ లోని ‘తుమ్ మిలే జో ముజే’ ( కిషోర్-ఆశా) పాట బాణీకి దగ్గరగా వుండే పాట ‘కోరినది నెరవేరినది’..

        నాగభూషణం తో  ఆరుద్ర యదేచ్ఛగా పలికించేసిన  ‘తల్లి ముండమొయ్య’ ఊతపదం, ‘నమ్మించి పుట్టి ముంచుతావురో కొడుకో! నీ కాష్ఠం వానొచ్చి ఆరిపోతుందిరో కొడుకో! నిన్ను నక్కలు పీక్కు తింటాయిరా కొడుకో- కొడుకో!!’ అనే తిట్లూ సెన్సార్ కి చిక్కకపోవడం అదో అద్భుతం!
     కృష్ణని కొత్తావతారంతో మొట్టమొదటి ఇండియన్ కౌబాయ్ గా ప్రెజెంట్ చేసిన నిపుణుల్లో ఇంకా కాస్ట్యూమర్స్ బాబూరావ్- వెంకట్రావులు, మేకప్ మాన్ మాధవరావు, ఫైట్ మాస్టర్స్ రాఘవులు- మాధవ్ ప్రభృతులు వున్నారు.

ఆరుద్రామృతం!
  ‘వెండి పలకల గ్లాసు’ వంటి డిటెక్టివ్ కథలు రాసిన ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)  కి కౌబాయ్ యాక్షన్ రాయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే దాంతో తెలుగు ప్రేక్షకుల్ని ఒప్పించడం దగ్గరే వస్తుంది సమస్య. తెలుగు ప్రేక్షకుడు అసలే కొరకరాని కొయ్య. వాడికేం నచ్చుతుందో వాణ్ణి పుట్టించిన బ్రహ్మ కూడా కనుక్కోలేడు. మూసని వడ్డిస్తే ఎంతైనా ఆవురావురని ఆరగించేస్తాడని మాత్రం తెలుసు. కానీ ఆ  మూసలో నైనా ముక్కూ  మొహం తెలీని, విచిత్ర వేషధారి  కౌబాయ్ పాత్రని దించడమెలా?

         ‘ఏక్  నిరంజన్ ‘ లో పూరీ జగన్నాథ్ విదేశాల్లో కనిపించే బౌంటీ హంటర్ అనే పాత్రలో ప్రభాస్ ని చూపించాడు. అది నేటివిటీ లేక ప్రేక్షకులకి ఎక్కలేదు. ఆరుద్ర ఈ నేటివిటీ గురించే ఆలోచించి వుంటారు. తన కౌబాయ్ హీరో పాత్ర కూడా విదేశీ బౌంటీ హంటరే! అంటే నేరస్థుల్ని చట్టానికి పట్టించి తృణమో పణమో సంపాదించుకునేవాడు. అందుకని ఆరుద్ర కథని సమకాలీనం చేయకుండా తెలివిగా ఇండియాని ఏలిన బ్రిటిష్- ఫ్రెంచి ల కాలంలో స్థాపించారు. అనగనగా బొబ్బిలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అమరవీడు సంస్థానం మీద దాడి చేస్తారు. అక్కడ్నించీ మొదలెడితే గద్వాల, కర్నూలు సంస్థానాల వరకూ ఓ నిధికోసం వేట కొనసాగుతుంది. అప్పటి నేపధ్యవాతావరణం, ఆ నట్ట నడి తెలుగు ప్రాంతంలో విదేశీ సంస్కృతీ, నిధి వేటా అనేవి  ఆరుద్ర సృష్టించిన కృష్ణ ప్రసాద్ (కృష్ణ) పాత్రకి సరిపోయి- క్రిమినల్ పాత్రలో నాగభూషణాన్ని పదే పదే  పట్టిచ్చే బౌంటీ హంటర్ లాగా చూపించినా చెల్లిపోయింది. పైగా విలన్స్ కి బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య..అంటూ మాస్ పేర్లు కూడా తగిలించడంతో అప్పటి నేలక్లాసు ప్రేక్షకులు పేచీ పెట్టకుండా ఆ పాత్రల్ని ఆనందంగా ‘ఓన్’ చేసేసుకున్నారు. 

            ఇక ఆరుద్ర ఈ యాక్షన్ కథ అల్లిన తీరు ఒక అద్భుత విన్యాసమనే చెప్పాలి. కథకి మెయిన్ లైన్ ఒకటి, లూప్ లైన్ ఒకటి పెట్టుకున్నారు. ఇక సరైన సమయంలో సరయిన నిర్ణయం అన్నట్టు కథేమిటో అప్పుడప్పుడే  చెప్పకుండా ప్రేక్షకుల్ని ఊరిస్తూ, ఓ చోట మెయిన్ లైన్లో లూప్ లైన్ ని కలిపేస్తూ పాయింటాఫ్ ఎటాక్ ని సృష్టించారు!

          ఇందువల్ల ఆలశ్యంగా వచ్చిన కథలో ఈ మొదటి మలుపు- టైమింగ్ ని కోల్పోయిందని అన్పించదు. మెయిన్ లైన్ లో సత్యనారాయణ  గ్యాంగ్ తో నిధికి సంబంధించిన కుట్రలు చూపిస్తూ, దీని బ్యాక్ డ్రాప్ లో దీనితో సంబంధంలేని లూప్ లైన్ లో కృష్ణ – నాగభూషణం ళ పరస్పరం దెబ్బ దీసుకునే ఎత్తుగడలతో వినోదాత్మక కథనం నడిపారు. ఫైనల్ గా కృష్ణని  నాగభూషణం అమాంతం పట్టేసుకుని కాళ్ళూ చేతులు కట్టేసి ఎడారిలో పడేసి పగదీర్చుకుని వెళ్ళిపోయాక, ఒంటెల బండిలో కొన ప్రాణాలతో వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి  కృష్ణ చెవిలో నిధి గురించి రహస్యం చెప్పిపోయే ఘట్టం ( పాయింటాఫ్ ఎటాక్) తో,  ఈ లూప్ లైన్ కాస్తా మెయిన్ లైన్ తో స్పర్శిస్తుందన్నమాట  మాట! 

          ఇలా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలూ అన్నీ ఆరుద్రే రాసుకుని వెళ్ళాక, ఒక ఎదురు చూడని అనుభవం ఎదురయ్యిందాయనకి. అదేమిటో సినీ విజ్ఞాన  విశారద ఎస్వీ రామారావు ఇలా చెప్పారు- ఆరుద్ర ఇంత అద్భుతంగా స్క్రిప్టు రాసి చూపించాక, ఆయన్నే దర్శకత్వం వహించమని పట్టుబట్టారు పద్మాలయా నిర్మాతలు జి. ఆది శేషగిరిరావు, జి. హనుమంతరావులు. అయితే ఆరుద్ర అసలు ఒప్పుకోలేదు!


 సికిందర్
ఫిబ్రవరి 2010 ‘సాక్షి’  



14, జూన్ 2015, ఆదివారం

ఇదే కథ?

కథ : మల్లాది వెంకటకృష్ణమూర్తి
తారాగణం :  ఛార్మీ,  సత్యదేవ్, బ్రహ్మానందం, టార్జాన్‌, సాక్షి రాంరెడ్డి తదితరులు
సంగీతం :  
సునీల్‌ కశ్యప్‌ ;   ఛాయాగ్రహణం :  పి.జి. విందా ;
బ్యానర్ : 
సి కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. ; శ్రీ శుభస్వేత ; సమర్పణ: ఛార్మి కౌర్‌ ;
నిర్మాతలు: శ్వేతాలానా, వరుణ్‌, తేజ ;  సహ నిర్మాత: బి.ఏ. రాజు
రచన – దర్శకత్వం :  పూరీ జగన్నాథ్
విడుదల :  జూన్  12, 2015     సెన్సార్ :  U/A
*

టాప్ డైరెక్టర్ చిన్న బడ్జెట్ సినిమాకి దర్శకత్వం వహిస్తే అదెలాటి రూపం ధరిస్తుంది?  అది కూడా బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాల బిల్డప్స్ తోనే  కృత్రిమంగా వుండి తీరుతుంది. టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్  తన ప్రారంభదినాల్లో తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లాంటి సున్నిత కథా చిత్రం ఇంకెప్పుడైనా తీయగలరా? అనుమానమే! ఆయన ‘జ్యోతిలక్ష్మి’ అనే ‘మిసెస్ పరాంకుశం’ నవలాధారంగా చిన్న కథతో కూడిన స్మాల్ మూవీని కూడా ‘టెంపర్’ లాంటి వయొలెంట్ మూవీ హంగామా తోనే చాతనయినంత  గజిబిజి చేయగలరు.  టాప్ హీరోలతో బిగ్ యాక్షన్ మూవీస్ తీసీ తీసీ  అక్కడే ఘనీభవించిన క్రియేటివిటీ తాలూకు ప్రభావమేమో ఇది!

          దాదాపు నలభై ఏళ్ల క్రితం  ప్రసిద్ధ నవలారచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ‘మిసెస్ పరాంకుశం’ ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు. మూలకథ తీసుకుని మిగతా నేపధ్య వాతావరణాన్ని తప్పకుండా ఈ కాలానికి తగ్గట్టు అప్ డేట్ చేయాల్సిందే సినిమాకోసం. ఐతే ఇలా జరిగిందా? చూద్దాం..

రెండు కథల రంగేళి!
       సత్య ( సత్యదేవ్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి ఓ వేశ్యని ప్రేమించి పెళ్ళాడాలని వుంటుంది. అలాటి ఓ వేశ్య జ్యోతి లక్ష్మి( ఛార్మీ) ఓ చోట కంటపడి మిస్సవుతుంది. ఆమె కోసం వెతుకులాట అతణ్ణి ఓ వ్యభిచార గృహానికి చేరవేస్తుంది. అక్కడే ఆమెని కలుస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. ఇతణ్ణి పిచ్చి వాడి కింద జమకడుతుంది. పెళ్ళికూడా చేసుకుంటానంటాడు. ఇంకా పిచ్చివాడి కింద లెక్కేస్తుంది. ఎలాగో ఒప్పించి ఆమెని తీసుకుని పారిపోతాడు. పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్ళికి అతడి అక్క కూడా వుంటుంది. కాపురం పెడతారు. మొదటి రాత్రే కండోమ్ గురించి గొడవపడి తాళిని తెంపేస్తుంది. మళ్ళీ రాజీ పడుతుంది. ఈమెని పట్టుకోవడం కోసం బ్రోతల్ హౌస్ ఓనర్ ప్రయత్నిస్తూంటాడు. సత్యని గాయపరుస్తాడు. 

          ఇలా వుండగా అటు వేశ్యా గృహంలో ఓ అమ్మాయిని పోలీస్ కేసులో ఇరికించి ఆమె కుటుంబం పరువు తీస్తాడు బ్రోతల్ హౌస్ ఓనర్. ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో జ్యోతి లక్ష్మి ‘నేను వెళ్ళనా అంటుంది?’ వెళ్ళ మంటాడు సత్య. ఇక జ్యోతిలక్ష్మి చెలరేగి ఆ వ్యభిచార కొంపని మూయించడం కోసం, వ్యభిచారిణులకి వాళ్ళ విటుల చేత తగిన న్యాయం జరిపించడం కోసం పోరాటం మొదలెడుతుంది..

          ఇలా తయారయింది కథ! ఫస్టాఫ్ సత్య కథ, సెకండాఫ్ వ్యభిచారిణుల కథ!

స్క్రీన్ ప్లే సంగతులు 
             ఒక నవలని సినిమాగా మార్చారు. మార్చినప్పుడు సగం నవల్లో వున్న కథ, మిగతా సగం పూరీ మార్కు అతికించిన కట్ అండ్ పేస్ట్ కథతో సినిమా తీశారు. దీంతో ఇది ఫస్టాఫ్ ఒక కథ- సెకండాఫ్ దాంతో సంబంధం లేని ఇంకో వ్యవహారంగా  తయారయ్యింది. ఇలాటి వింత సినిమాలు గతంలో తెలుగులోనూ, హిందీలోనూ  కొన్ని వచ్చాయి. తెలుగులో రవితేజ ‘దొంగోడు’, జగపతిబాబు ‘ధమ్’, హిందీలో సల్మాన్ ఖాన్ ‘తెరేనామ్’, టబూ ‘హవా’ లాంటివి ఈ కోవకే చెందుతాయి.

          ‘దొంగోడు’ కథా ప్రారంభంలో హీరో చిన్నప్పటి విషాదకర జీవితంతో అదొక కథాత్మగా ఏర్పడ్డ ‘సర్కిల్ ఆఫ్ బీయింగ్’ అనే స్క్రిప్టింగ్ టూల్ ని అందిపుచ్చుకుని అటుపైన కొనసాగాల్సి వుండగా, హీరో పెద్దయ్యాక దీని ఊసే లేక ఆ కథాత్మ తెగిపోతుంది!

          ‘థమ్’ లో నల్గురు యువకుల ప్రేమల్ని చక్కబర్చే హీరో కథగా నడుస్తున్న కథనం కాస్తా, పాత ప్రియురాలు కన్పించగానే హఠాత్తుగా వీళ్ళని వదిలి పారేసి, ఆమెతో ఆ హీరో ప్రేమాయణంగా కథ ప్లేటు ఫిరాయించి ధ్వంసమై పోతుంది!

          ‘తెరేనామ్’ లో కొనసాగుతున్న హీరో హీరోయిన్ల  ప్రేమలతో అస్సలు సంబంధంలేని ఇంకో కథతో అతుకు పడుతుంది!

           ‘హవా’లో- తల్లి కథగా నడుస్తున్న కథనం కాస్తా- ఆమె కూతురి కథగా కథనం మార్చుకుని అలాగే ముగుస్తుంది!

          అలాగే ‘జ్యోతి లక్ష్మి’ లోనూ వేశ్యని  ప్రేమించి పెళ్ళాడిన కథగా నడుస్తున్న పెళ్లి కథ కాస్తా, దాన్ని వదిలేసి పక్కా వేశ్యాగృహపు యాక్షన్ కథలోకి దిగిపోయింది!


        ఈ వ్యాధిని సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు. ఫస్టాఫ్ వరకూ కథ నడుపుకుంటూ వచ్చాక- ఇక ఆ ఇంటర్వెల్ ఘట్టం అనే చౌరాస్తా నుంచి ఎటు వెళ్ళాలో అర్ధంగాక, రాంగ్ రూటులో వెళ్తున్నామని కూడా తెలుసుకోకుండా, సెకండాఫ్  అనే చిట్టడవి లోకి స్టయిలుగా అడుగు పెట్టేయడం ఈ వ్యాధి లక్షణం.  

          ఇంటర్వెల్ దగ్గర నించుని సెకండాఫ్ లోకి చూస్తే అదొక దారీ తెన్నూ తెలీని చిట్టడవి లాగా ఎందుకు కన్పిస్తుందంటే, కథకి ఓ స్ట్రక్చర్ అనేది ఉంటుందని తెలియక పోవడం వల్ల.  ఆ స్ట్రక్చర్ ని కచ్చితంగా పాటించి తీరాలని తెలియక పోవడం వల్ల. లేదా తెలిసీ ప్రయోగాలు చేద్దామని అనుకోవడం వల్ల. ఐతే ప్రయోగం దేంతో చేస్తున్నారనేది ప్రశ్న. స్ట్రక్చర్ తోనా? ట్రీట్ ఏమంట్ తోనా? 

          తెలియక స్ట్రక్చర్ తోనే ప్రయోగాలు చేసేస్తున్నారు! ప్రయోగాలు చేయడంగానీ, ఉన్న రూల్స్ ని బ్రేక్ చేయడంగానీ  ఎక్కడ జరగవచ్చంటే- ట్రీట్ మెంట్ తోనే ! స్ట్రక్చర్ ర్ తో ప్రయోగాలు చేయబోతే ఇలాటి ‘జ్యోతిలక్ష్మి’ లాంటి సినిమాలే వస్తాయి!

          స్ట్రక్చర్ అనేది ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ అనుకుంటే, దాని మీద కథకి ఇచ్చే ట్రీట్ మెంట్ అనేది క్రియేటివ్ ప్రక్రియ. స్ట్రక్చర్ ఒక మారని సైన్స్ అయితే, ట్రీట్ మెంట్ ఎలాగైనా మార్చుకునే వీలున్న క్రియేటివ్ అభివ్యక్తి. అందరిలాగా ఒక యాక్షన్ సీనుతో నేనెందుకు సినిమా ప్రారంభిస్తాను, నేను కామెడీతో మొదలెడతాను- అనుకోవడమే  క్రియేటివిటీ పరంగా రూల్స్ ని బ్రేక్ చేయడం, అంతేగానీ స్ట్రక్చర్ పరంగా కాదు. బిగినింగ్, మిడిల్, ఎండ్ నియమనిబంధనలతో స్ట్రక్చర్ శాశ్వతం. దీన్ని బ్రేక్ చేస్తే అర్ధంపర్ధం లేని కథలే వస్తాయి. 

          ‘A general conventional story telling structure is necessary. If you want to violate those rules, those beginning, middle and end rules, and be truly avant garde, then I am not sure that you are going to be helped by anybody’s advice on screen writing. 

          The only advice you can get is somewhat conventional, but those kinds of stories have worked for thousands of years and will continue to work. The thing is to find new ways to tell them and surprise along the way…
—Lawrence Conner 

          (వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమా టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ ఉండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే ( అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు. ఇలా చెప్పే వాళ్ళు తెలుగు ఫీల్డులో లేరు! )

          ఇంతకీ ఏమిటా యుగాలుగా పాటిస్తూ వస్తున్న సాంప్రదాయబద్ధమైన నియమ నిబంధనలు? ఈ బ్లాగులో పదేపదే చెప్పుకోవడం బోరుగానే ఉండొచ్చు. బిగినింగ్ రూల్ ఏమిటంటే దాని చివర్న సాధించాల్సిన సమస్యని ఏర్పాటు చేయడం. మిడిల్ రూల్ ఏమిటంటే ఆ సమస్య ని సాధించడానికి సంఘర్షించడం, ఎండ్ రూల్ ఏమిటంటే ఆ సమస్యకి సముచితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనడం.

          ఒక నిర్ణీత సమస్య, ఆ నిర్ణీత సమస్యతో మాత్రమే సంఘర్షణ, ఆ నిర్ణీత సమస్యకి మాత్రమే పరిష్కారం- ఇవి పరస్పరాధారభూతాలు. వీటిని ఒకదాన్నుంచి ఇంకోటి విడగొట్టలేం. ఏర్పాటు చేసిన నిర్ణీత సమస్యని వదిలిపెట్టి, ఇంకో సమస్య ఎత్తుకుని ఆ సమస్యని పరిష్కరించడం కథ కాదు. రోగి ఒక రోగం పేరు చెప్పాక, వైద్యుడు దానికి మందులు రాస్తూంటే, మళ్ళీ రోగి రోగం అది కాదనీ, ఫలానా ఇదీ అని ప్లేటు ఫిరాయిస్తే, వైద్యుడు ఈ చీటీ చించి పారేసి, ఇంకో చీటీ మీద వేరే మందులు రాస్తాడనుకోం - నాల్గు పీకవచ్చు రోగిని పట్టుకుని!

          పైన పేర్కొన్నట్టు అవాంట్ గార్డ్- యూరోపియన్ సినిమాలకీ - మన ఆర్ట్ సినిమాలకీ, ఇప్పుడొస్తున్న ఇండీ ఫిలిమ్స్ కీ -  స్ట్రక్చర్ వుండదు. అందుకే ఇవి ఆబాలగోపాలాన్ని ఆకట్టుకోవు, ఫిలిం ఫెస్టివల్స్ లో మేధావుల్ని సంతృప్తి పరుస్తాయి. ఇప్పుడు ‘జ్యోతి లక్ష్మి’ స్ట్రక్చర్ ఎలా  వుందో చూద్దాం.

          సమయం వృధా చేయకుండా బిగినింగ్ ని సరీగ్గా అరగంటలో ముగిస్తూ,  హీరో చేత జ్యోతిలక్ష్మికి తను ప్రేమిస్తున్నట్టు చెప్పించారు. ఈ టర్నింగ్ పాయింటుతో కథలోకి ఎంటర్ అయ్యారు. ఈ టర్నింగ్ పాయింట్- స్టోరీ పాయింట్ – లేదా సమస్య ని ఏర్పాటు చేస్తూ  బిగినింగ్ అధ్యాయాన్ని బాగానే ముగించారు. 

          ఇక్కడ్నించీ మిడిల్ అధ్యాయాన్ని ప్రారంభించారు. జ్యోతిలక్ష్మితో ప్రేమకోసం హీరోకి స్ట్రగుల్  పెట్టి  మిడిల్ నియమాలకి న్యాయం చేశారు. అప్పుడు ఇంటర్వెల్ కి లీడ్ చేసేందుకు సీన్ ని క్రియేట్ చేస్తూ- (పించ్ -1, లేదా ఉత్ప్రేరకం- 1) హీరో చేత జ్యోతిలక్ష్మికి పెళ్లిని ప్రతిపాదించారు. పెళ్లి జరిపించారు. ఇంటర్వెల్లో మొదటి రాత్రి తగాదా పెట్టించి జ్యోతి లక్ష్మి చేత తాళిని తెంపించేశారు. ఇలా మిడిల్ అధ్యాయంలో మిడ్ పాయింట్ కి చేరింది కథ. 

          ఏ కథ? మొదలెట్టిన సత్య కథ. ఇది సత్య కథెందుకయ్యింది? బిగినింగ్ లో, మిడిల్ లో జ్యోతిలక్ష్మిని పొందేందుకు ప్రయత్నించింది అతనే కాబట్టి.  అతడికోసం ఆమె ప్రయత్నించ లేదు కాబట్టి. ఆమెని జీవితంలోకి తెచ్చుకుని తీరా ఇంటర్వెల్లో ఆమె తాళిని తెంపేస్తే బాధతో అలమటించింది అతను కాబట్టి. 

          కనుక యీ మిడిల్ లో మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) దగ్గర్నుంచీ ఇతడి కథే ఆమెతో సంఘర్షణతో కొనసాగాలి. ఇలా జరగలేదు. బ్రోతల్ హౌస్ ఓనర్ జ్యోతిలక్ష్మి కోసం సృష్టించే హింసతో మొదలేట్టేశారు. బిగినింగ్ లో జ్యోతిలక్ష్మి అనే కొరకరాని కొయ్యతో హీరోకి ఏర్పాటు చేసిన ఆసక్తి గొలిపే సమస్యని వదిలేసి, వ్యక్తిత్వాల వైరుధ్యాలతో అదెలా పరిష్కార మయ్యిందో చూపించడం మానేసి, జ్యోతిలక్ష్మీకి  – ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ కీ మధ్య సమస్యగా కొత్త కథ ఎత్తుకుని యాక్షన్ సీన్లతో నింపేశారు!  
   
          ఒక నిర్ణీత సమస్య, ఆ నిర్ణీత సమస్యతో మాత్రమే సంఘర్షణ, ఆ నిర్ణీత సమస్యకి మాత్రమే పరిష్కారం- అన్న ఏక సూత్రతని, కామన్స్ సెన్స్ నీ గాలికి వదిలిపారేశారు! 

          టాప్ డైరక్టర్ అంటే అన్ని సెన్సిబిలిటీస్ నీ బుల్ డోజ్ చేసుకుపోయే ఇల్లాజికల్ తస్మాత్ జాగ్రత్త మూసఫార్ములా మాంత్రికుడేమో! ఒక స్మాల్ మూవీని జాతీయ స్థాయికి చేర్చడానికి మనస్కరించని వెల్త్ క్రియేటరేమో!!

          స్ట్రక్చర్ ప్రకారం బిగినింగ్ లో హీరోకి సమస్య ఏర్పాటు చేశాక, పించ్ వన్ దగ్గర అతడి పెళ్లి ప్రయత్నం మొదలెట్టాక, పెళ్లి చేశాక ఇంటర్వెల్లో అతడిని పెద్ద రిస్కులో పడేశాకా- సెకండాఫ్ లో ఈ మిడిల్ ని ముగించడానికి  లీడ్ గా వేసిన  పించ్-2  దగ్గర,  అతడిసమస్య ఊసే లేకుండా, కథా లేకుండా, వేరే బ్రోతల్ అమ్మాయి ఆత్మహత్యని సృష్టించారు! ఇక దీన్ని పట్టుకుని జ్యోతిలక్ష్మిని వేశ్యల సమస్యమీద యుద్ధానికి పంపేశారు! ఓహ్ గాడ్!!

          ఈ కింది రెండు పటాల్లో ఎలా ఉండాల్సిన కథ ( స్ట్రక్చర్) ఎలా మారిపోయిందో గమనించవచ్చు..
ఉండాల్సిన కథ (స్ట్రక్చర్)

ఉన్న కథ (స్ట్రక్చర్)  

 దీంతో ఏం సినిమా చూశామో అర్ధం కాని పరిస్థితి. మల్లాది రాసిన నవలలో హీరో ఓ వేశ్యని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మర్చాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతను ఎదుర్కొనే కష్టాలూ అవమానాలతో కూడిన కథ అది. సినిమాలో ఈ కథ మొదలెట్టి సగం వరకూ చెప్పి వదిలేసి మరో కథ ఎత్తుకోవడం అన్యాయం. ఈ మరో కథ ఎత్తుకోవడం వల్ల, మొదలెట్టిన సెకను నుంచే చివరి సెకను వరకూ ఒకటే వ్యభిచార కొంప గోలగా – ఓ డార్క్ మూవీలాగా తయారయ్యింది మొత్తం వ్యవహారం!


పాత్రోచితానుచితాలు
           మొదలెట్టిన కథ ప్రకారం చూస్తే,  టైటిల్ రోల్లో జ్యోతిలక్ష్మి పాత్ర యాంటీ హీరోయిన్ పాత్ర అవుతుంది. అంతేగానీ  ఎట్టి పరిస్థితిలోనూ ఆమె సెకండాఫ్ లో చూపిన విధంగా వీర హరోయిన్ అయ్యే అవకాశం లేదు. ఈ సినిమాలో పాత్ర చిత్రణలు పూర్తిగా విఫలమయ్యాయి. పాపం జ్యోతి లక్ష్మిని ఉద్ధరించాలనుకున్న హీరో ఏమైపోయాడో, జ్యోతి లక్ష్మి ఎవరో వేశ్యల్ని ఉద్ధరించడానికి బయల్దేరింది! హీరోని అర్ధం జేసుకుని తను మారదు గాని, ఎవర్నో మార్చడానికి వెళ్తుందట!

          హీరో ఆమెని బయట ఎక్కడో చూసి ప్రేమించానంటాడు. ఆమె ఎక్కడుంటుందో  తెలుసుకోవడం కోసం ఓ బ్రోకర్ ని పట్టుకుని నానా ప్రయత్నాలూ చేస్తాడు. ఆమె పట్టపగలు నడి  రోడ్డుమీద ఒక విటుడి దగ్గర డబ్బులు తీసుకుంటూంటే, హీరో చూసి ఆమే కావాలని డిసైడ్ అయిపోయాడు. అలా ఆమె ఒక సందులో అనాధ పిల్లలకి డబ్బిచ్చి పోతూంటే కూడా హీరో చూశాడు. ఆ తర్వాత ఆమె మిస్సయ్యింది.  హీరో ఆ అనాధ పిల్లల దగ్గరి కెళ్ళి ఆమె గురించి అడిగితే, ఆమె ప్రతిరోజూ వచ్చి డబ్బిచ్చి పోతూంటుందని ఆ పిల్లలు చెప్తారు. అలాంటప్పుడు ఆ మర్నాడు హీరో అక్కడే కాపలా కాస్తే ఆమె దొరికిపోతుంది కదా? బ్రోకర్ని పెట్టుకుని ఊరంతా వెతకడమేంటి!! సినిమా ప్రారంభంనుంచీ ఓ పదినిమిషాల చిత్రీకరణ అంతా డబ్బు వృధా కదా?

          జ్యోతిలక్ష్మే కాదు, ఆ బ్రోతల్ హౌస్ లోంచి ఇంకే వేశ్యా బయటికి వెళ్లేందుకు వీల్లేనంత గృహ నిర్బంధంలో వుంటారు. అలాంటప్పుడు జ్యోతి లక్ష్మి రోజూ బయటికి వస్తున్నట్టు హీరో పాయింటాఫ్ వ్యూలో ఎలా చెప్పించారు / చూపించారు?

          ఆమెకి బయట తిరిగే స్వేచ్చే గనుక వుంటే,  హీరో బయటే ఆమెని కలుసుకోవచ్చుగా- పనిగట్టుకుని బ్రోతల్ హౌస్ కి వెళ్లి కలవాల్సిన  అవసరమేమిటి?

          ఆమెని బయటే ప్రేమించి, బయటే పెళ్ళి ప్రతిపాదనతో తీసికెళ్ళి పోవచ్చుగా- బ్రోతల్ హౌస్ లోంచి సాహసం చేసి- గూండాలని తప్పించుకుని తీసుకు పారిపోవాల్సిన అవసరమేమిటి?

          ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన హీరోకి టెక్నాలజీ గురించి బ్రోకర్ అన్ని క్లాసులు తీసుకోవడమేమిటి? 

          హీరో జ్యోతిలక్ష్మి  పెళ్లి చేసుకున్నాక హీరో అక్కని బస్సెక్కిస్తూంటే, అక్కడే ఒకడ్ని చావదన్నుతున్న బ్రోతల్ హౌస్ ఓనర్, జ్యోతిలక్ష్మిని చూసి అప్పుడే పట్టుకోకుండా- బ్రోతల్ హౌస్ కి వెళ్ళిపోయి- తబలావాయిస్తూ అనుచరుల్ని తన్నించదమేమిటి?
 
          హీరోని తీవ్రంగా గాయపరచిన సంఘటనలో హీరోకి సహకరిస్తున్న పోలీసు అధికారి మైపోయాడు? హీరో ఫ్రెండ్ కూడా ఏమై పోయాడు? సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన హీరోకి ట్రీట్ మెంట్ కోసం అతడి ఎక్కౌంట్ లో డబ్బే ఉండదా? మెడిక్లెయిమే ఉండదా? ఇన్స్యూరెన్సే లేదా?జ్యోతిలక్ష్మి అంత యాతన పడాలా?

          పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత తనతో పోలీసుల ప్రవర్తన చూశాకే జ్యోతిలక్ష్మికి ఇల్లాలిగా వుండడంలోని గౌరవమేమిటో  తెలిసివచ్చిందా? ఆమె ఉన్నతి కోసం హీరో చేస్తున్న ప్రయత్నాలకి విలువేలేదా?

          ఇలా ఫేక్ క్యారక్టరైజేషన్స్ తో, ఫేక్ ఎమోషన్స్ తో, ఫేక్ విలువలతో సూడో మేధావితనానికి పోయిన కథనం గురించి ఇంత చాలు. సెకండాఫ్ లో బ్రోతల్ హౌస్- వేశ్యలూ వాళ్ళ ఉద్ధరణా- మేసేజ్ లతో కూడిన మూస యాక్షన్ స్టోరీ విశ్లేషణ జోలికి వెళ్ళడం లేదు –అది స్టోరీ కాదు కాబట్టి!



సికిందర్