రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, డిసెంబర్ 2019, మంగళవారం

897 :


        (ఆదివారపు ‘మూవీ నోట్స్’ మంగళవారపు దర్శనం) 
        రియాన్ జాన్సన్ 2005 లో తన తొలి మూవీగా ‘బ్రిక్’ అనే ప్రప్రథమ టీనేజి నోయర్ మూవీ తీసి వార్తలకెక్కాడు. 1930 లలో డెషెల్ హెమెట్, జేమ్స్ ఎం కెయిన్ లు రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలతో స్ఫూర్తి పొంది, ‘ఫిలిం నోయర్’ అనే జానర్ సినిమాలు అభివృద్ధి చెందాయి. స్టార్లు, సూపర్ స్టార్లు వీటిలో నటించే వాళ్ళు. '60 లలో కలర్ సినిమాలతో ఈ జానర్ పేరు ‘నియో నోయర్’ గా మార్చారు. వీటిలో కూడా స్టార్లు, సూపర్ స్టార్లు నటించారు. 2005 లో రియాన్ జాన్సన్ వచ్చేసి, ఇదే ఒకప్పటి హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలా సాహిత్యాన్ని టీనేజి పాత్రలకి అన్వయించి, ‘బ్రిక్’ అనే మర్డర్ కథ తీసి- ‘టీనేజీ నోయర్’ అనే కొత్త జానర్ కి అంకురార్పణ చేశాడు (‘బ్రిక్’ విశ్లేషణ ఈ బ్లాగులోనే గతంలో చేస్తూ పాఠకాదరణ లేక మధ్యలో ఆపేశాం). ఆ తర్వాత లూపర్స్, స్టార్ వార్స్ - ది లాస్ట్ జేడీ తీసింతర్వాత, ఇప్పుడు తాజాగా ‘నైవ్స్ ఔట్’ తో వచ్చాడు.

         డిటెక్టివ్ పాత్రలో జేమ్స్ బాండ్ నటుడు డేనియల్ క్రేగ్ సహా అనేకమంది స్టార్స్ తో వైభవోపేతంగా తీశాడు. దీనికి స్ఫూర్తి ఆ నాటి అగథా క్రిస్టీ రాసిన మర్డర్ మిస్టరీలే. అగథా క్రిస్టీ శైలిలోనే తీశాడు. ఇదిప్పుడు హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ తో ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కళాత్మకత ప్రశంస లందుకుంటోంది. ఈ మర్డర్ మిస్టరీని హాస్య భరితంగా తీయడం ఒక మార్కెట్ యాస్పెక్ట్ అనాలి. 2017 లో అగథా క్రిస్టీ నవల ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ఆధారంగా ఇదే టైటిల్ తో, తారాతోరణంగా మర్డర్ మిస్టరీ వచ్చిన విషయం తెలిసిందే. క్రిస్టీ మిస్టరీ కథలు ఇంగ్లాండ్ గ్రామీణ వాతావరణంలో వుంటాయి. మిస్టరీల విషయంలో ఆమె ఎన్నో మూస ఫార్ములా కథనాల్ని, ముగింపుల్నీ బ్రేక్ చేసి ఆశ్చర్య పర్చింది. అందుకే ఈమె క్వీన్ ఆఫ్ క్రైం.

        తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్స్ పేరిట తుపాకీ బదులు లపాకీ సినిమాలొస్తున్నాయి. అధ్యయనం, పరిశీలన, ఒక అభిరుచీ అంటూ లేక కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. తెలుగు సినిమాల నాణ్యత దేశంలోనే అట్టడుగు స్థాయికి ఇటీవలి కాలంలో చేరిపోయింది. అంటే మనమేదో ఉద్ధరిస్తామని కాదు. కాలం కలిసివస్తే టేనేజీ నోయర్స్ నీ, క్రిస్టీ నవలల్నీ తెలుగులో ప్రయత్నించి చూద్దాం. ఇప్పటికీ విశేషంగా ఇండియాలో అమ్ముడుబోతున్న జేమ్స్ హేడ్లీ ఛేజ్ నవలల్ని కూడా.

       ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరు ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ గా మారి రేపు 12 న విడుదలవుతోంది. ఇందులో ‘స్టార్ ఎట్రాక్షన్’ ధనుంజయ్ ప్రభునే అనే మరాఠీ. కొంత కాలం ఆటో నడిపి, ఆ తర్వాత హోటల్ నడుపుతూ వుండిన ఇతను, ఫేస్ బుక్ లో రాంగోపాల్ వర్మ దృష్టినాకర్షించి సినిమాకి అపాయింట్ అయిపోయిన సంగతి తెలిసిందే. పోలికలు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలవడమే ఈ అపాయింట్ మెంట్ కి కారణం. దర్శకత్వ శాఖలో పనిచేసిన మన పాత మరాఠీ మిత్రుడు ఘనశ్యాం సదాశివ్ ఈయనకి తెలుగు డైలాగులు తర్ఫీదు నిచ్చాడు. ప్రభునే అచ్చం చంద్రబాబు నాయుడులానే హావభావ ప్రదర్శన చేశాడు. ఈయనకి ముంబాయిలో ఆటో డ్రైవర్ల సంఘం సన్మానం చేసింది కూడా. ఈ కథకి ఒక సెంట్రల్ పాయింటు వుంది. ఇది వైరల్ అయ్యే స్థాయిలో మంచి మార్కెట్ యాస్పెక్ట్ తో వుంది. చూద్దాం ఎలా వుందో విడుదలయ్యాక.

    భాగ్యనగర వీధుల్లో, మిస్ మ్యాచ్, మథనం, వజ్రాల వేట, కలియుగ, మేరా దోస్త్, అశ్వ మేధం...ఇవన్నీ గత శుక్రవారం వేడి వేడిగా ఫ్లాపయిన ఛోటా మోటా సినిమాలు. వీటి మధ్య ‘ఆ రెక్స్ 100’ ఫేం కార్తికేయ నటించిన ‘90 ఎంఎల్’ కూడా విడుదలై ఫ్లాపయ్యింది. ఒకప్పుడు ఎ సెంటర్స్ లో విడుదలై తర్వాత బిసి సెంటర్లకి వచ్చేవి సినిమాలు. ఇప్పుడు ఛోటా మోటా సినిమాల్ని బిసి సెంటర్లలో విడుదల చేసి వూరుకుంటే ఉత్తమమేమో ఆలోచించాలి. వీలయితే సి సెంటర్లకే పరిమితం చేస్తే ఇంకా మంచిది. విడుదల, పబ్లిసిటీ ఖర్చులు తగ్గుతాయి. ఆదా అయ్యే పబ్లిసిటీ ఖర్చుని కింది సెంటర్లకే బాగా టార్గెట్ చేసి అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తిని జనరేట్ చేయవచ్చు. ఒకవేళ అదృష్టం బావుండి అక్కడ సక్సెస్ అయితే పై సెంటర్లలో విడుదల చేసుకోవచ్చు. ఎ సెంటర్స్ లో చోటా మోటా సినిమాల విడుదల ఒక దండగ వ్యవహారం. పట్టుమని పదిమంది కూడా ప్రేక్షకులు రావడం లేదు. ఇదివరకు పార్కింగ్ వాళ్ళు, కేంటీన్ల వాళ్ళు తెగతిట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఖాళీగా కూర్చుని కేంటీన్ల వాళ్ళు తిట్టుకుంటున్నారు. 

      ఇక ’90 ఎం ఎల్’ కార్తికేయ పరిస్థితి క్వార్టర్ కి చేరింది. గత ‘గుణ 369’  తోనే సబ్జెక్టు ఎంపికలో పూర్ అని తేలింది. తను కొత్తగా వచ్చి పురాతన సినిమాలు ఎందుకు చేయాల్సి వస్తోందో ఆలోచించుకోవాలి. దారుణంగా 1.5 రెంటింగ్ తో రివ్యూలొచ్చాయంటే ‘90 ఎం ఎల్’ ఎంత నకిలీ మద్యమో ముందే తెలిసిపోవాలి. ఫిట్నెస్ కి ట్రైనర్స్ ని పెట్టుకున్నట్టు, మార్కెట్ లో వున్న ట్రెండ్స్ ప్రకారం తమకే సబ్జెక్టు నప్పుతుందో, నప్పదో చెప్పే కెరీర్ ఫిట్నెస్ ట్రైనర్స్ ని హీరోలు పెట్టుకుంటే మంచిదేమో. సబ్జెక్టు ఎంపిక సబ్జెక్టివ్ గా గాక, ఆబ్జెక్టివ్ గా జరిగినప్పుడు కొంతవరకు సత్ఫలితాలుంటాయి.





     మధ్య హిందీలో వస్తున్న చరిత్ర సినిమాల వైఖరి వైకుంఠపాళిగా మారింది. అవి పామునోట్లో పడుతున్నాయి. చరిత్రని ఒక పక్షానికి పట్టం గట్టి చూపించే ఒక రొటీన్ వల్ల చరిత్ర సినిమాలు క్వాలిటీ నశించి - ఫక్తు ఎజెండాగా మారిపోయాయి. ప్రేక్షకుల ఆదరణకి దూరమైపోతున్నాయి. ఈవారం ఆశుతోష్ గోవరీ కర్ తీసిన  ‘పానిపట్’ ఇందుకు మరో ఉదాహరణ. 100 కోట్లతో తీసిన ఇంత ప్రతిష్టాత్మక చారిత్రకం, కేవలం 1.5 -2.5 రేటింగ్స్ తో బాక్సాఫీసు దగ్గర కుప్పకూలింది. మీడియాల్లో ఇండియా - పాకిస్తాన్, హిందూ - ముస్లిం వార్తలే వార్తలుగా జనాల్ని ఎక్కువ మత్తెక్కిస్తున్నాయని, చరిత్ర సినిమాలతో కూడా ఇలా మత్తెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ మహాశయుడు కూడా ‘పద్మావత్’ తో ఇదే ప్రయత్నం చేశాడు. తెలుగులో ‘జార్జి రెడ్డి’ తో కూడా ఇదే ప్రయత్నం జరిగింది. సినిమా అనే మీడియాకి పక్షపాతం వుండదు. పక్షపాతం అంటేనే నిజాల్ని దాచడం. నిజాలు ఎలా వుంటాయంటే, చరిత్రలో మతాలకోసం యుద్ధాలు జరగలేదు, అధికారాల కోసమే యుద్ధాలు జరిగాయి. హల్దీ ఘాట్ లో అక్బర్ కీ, రాణా ప్రతాప్ కీ పోరాటం జరిగినప్పుడు అక్బర్ వెళ్ళలేదు. ఆయన ముఖ్యుడు రాజా మాన్ సింగ్ వెళ్ళాడు. రాజా మాన్ సింగ్ కింద అక్బర్ సేనాపతి ముస్లిం. అటు వైపు పోరాటానికి వచ్చిన రాణా ప్రతాప్ సేనాపతి హకీమ్ ఖాన్ సూద్. ఇది మతం కోసం హిందూ ముస్లిం పోరాటమనుకోవాలా? లేక అధికారం కోసం ఇద్దరు రాజుల పోరాటమనుకోవాలా?

        ఛత్రపతి శివాజీ - అఫ్జల్ ఖాన్లు భేటీ అవాలనుకున్నప్పుడు ఇద్దరూ ఆయుధాలు వుంచుకోకూడదని నియమం పెట్టుకున్నారు. కానీ శివాజీ ముస్లిం అధికారి రుస్తుం జమాల్ అలా వెళ్ళవద్దని శివాజీని హెచ్చరించాడు. శివాజీ దర్బారులో ఎందరో ముస్లిం అధికారు లుండే వాళ్ళు. వాళ్ళల్లో ముఖ్యుడు మౌలానా హైదరాలీ. శివాజీ ముఖ్య అంగ రక్షకుడూ, ఆయన కింద అంగరక్షకులూ చాలా మంది ముస్లిములే. శివాజీ,  అఫ్జల్ ఖాన్లు కలుసుకున్నప్పుడు రుస్తుం జమాల్ హెచ్చరించినట్టే అఫ్జల్ ఖాన్ దాడి చేశాడు. అప్పుడు శివాజీ అతణ్ణి పొడిచేశాడు. అప్పుడు వెంటనే హిందువు అయిన అఫ్జల్ అధికారి శివాజీని చంపేందుకు ప్రయత్నించాడు. ఇది మతం కోసం హిందూ ముస్లిం పోరాటమను కోవాలా? లేక అధికారం కోసం ఇద్దరు రాజుల పోరాటమనుకోవాలా?  
       తన శత్రువైన అఫ్జల్ ఖాన్ సమాధిని శివాజీయే కట్టించాడు. రాయగడ్ లో శివాజీ మందిరం కట్టించి, పక్కనే మసీదు కూడా కట్టించాడు. సైన్యం దాడులకి వెళ్ళినప్పుడు బైబిల్, ఖురాన్ ల వంటి అన్యమత గ్రంథాలు దొరికితే అపవిత్రం చేయకుండా సంబంధిత బాధ్యులకి అప్పగించమని ఆదేశించే వాడు. సైన్యం సూరత్ దాడికి వెళ్ళినప్పుడు అక్కడి ఫాదర్ అంబ్రూస్ పింటో ఆశ్రమం జోలికి పోవద్దని ఆదేశించాడు. సూఫీ గురువు హజరత్ బాబాని అభిమానించి బహుమానాలు పంపేవాడు. అక్బర్ తన కోటలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిపేవాడు.   ఓ పన్ ఘట్ పే నంద్ లాల్...భక్తి గీతాలతో పరవశించేవాడు.
         త దురుపయోగం జరిగినప్పుడు చరిత్ర బాధితురాలై పోతుంది. ఈ దురుపయోగానికి సినిమాలు పాల్పడ్డమే విషాదం. కులమత సమరస్యాల ప్రకటనతో నిష్పాక్షపాతంగా వుండాల్సిన సినిమా అనే మీడియా ప్రేక్షకుల్ని ఓటర్లు గా చూడ్డం దారుణమైన విషయం. ఇందుకే కలెక్షన్లు కూడా ఆ ఓటర్ల మేరకే దారుణంగా వస్తున్నాయి.

సికిందర్


5, డిసెంబర్ 2019, గురువారం

896 : సందేహాలు - సమాధానాలు


Q : నాది ఒక ప్రశ్న. సైరా నరసింహా రెడ్డిసినిమా చూసిన వాళ్ళందరూ మేకింగ్ బావుంది, సీన్స్ బావున్నాయి కానీ 'కనెక్ట్' కాలేకపోయాం అంటున్నారు. మూవీతో, లేదా హీరో తో ఆడియన్ ఎప్పుడు కనెక్ట్ అవుతాడు? ఒక పాత్రని ఆడియన్ కి కనెక్ట్ చెయ్యాలంటే సీన్స్, క్యారెక్టరైజేషన్ ఎలా వుండాలి? ఎందుకు కొన్ని సినిమాల్లో హీరో పాత్రలకు త్వరగా కనెక్ట్ అవుతాం? వివరించగలరు.
ఎపి, AD
A:  సైరా’ ఆడియెన్స్ కనెక్ట్ గురించి ‘సైరా’ స్క్రీన్ ప్లే సంగతుల్లో చాలా వివరంగా ఇచ్చాం, మళ్ళీ ఒకసారి చూడగలరు. మీరు పాత్రతో కథ పుట్టిస్తారా, లేక కథతో పాత్ర పుట్టిస్తారా? ఏ కథా రచనకైనా ఇది మూల సూత్రం. చాలా మంది కథతో పాత్ర పుట్టిస్తారు. ఇదే అన్ని సమస్యలకీ మూలం. పాత్రని బట్టి కథ వుంటుందా, లేక కథని బట్టి పాత్ర వుంటుందా? ఎవరు కలం పట్టుకున్నా ఈ ప్రశ్న వేసుకోవడం ముఖ్యం. చాలా మంది కథనిబట్టి పాత్రని నడిపిస్తారు. ఇదే సమస్త సినిమా కష్టాలకీ మూలం. మీరు పాత్రతో ఎమోషన్ ఫీలవుతారా, లేక కథతో ఫీలవుతారా? కాగితాలు ముందేసుక్కూర్చున్న ప్రతీ కవి కుమారుడు లేదా కవి కుమారీ ఆలోచించాల్సిన విషయం. చాలా మంది కథతో పాత్రని తెగ ఫీలైపోబోతారు. ఇదే అన్నిబాక్సాఫీసు విలాపాలకీ మూలం.

        కథ ట్రాష్. రైటర్ రాసే కథ వొట్టి ట్రాష్. కథ పట్టుకుని కథ అల్లేవాడు కుక్క తోకట్టుకుని గోదారీదిన వాడితో సమానం. వాడి చేతిలో సినిమా కుక్కతో పాటే బంగాళాఖాతంలో హతం. రైటర్ రాసే కథ వొట్టి ట్రాష్. ఆ కథని నమ్ముకుంటే సృజనాత్మక ఆత్మహత్యే. కథతో పాత్ర పుట్టదు, పాత్రతోనే  కథ పుడుతుంది. పాత్ర అనుభవమే కథ పుట్టుకకి కారణం. పాత్ర లేకుండా అనుభవం ఆలోచిస్తారా? ఆలోచించలేరు కదా? అందుకని పాత్రతోనే అనుభవం, ఆ అనుభవంతోనే కథ. పాత్ర వివిధ పరిస్థితుల్లో ఏమనుభవిస్తోందో, ఆ అనుభవాల్లోంచి ఏం నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతోందో, లేక వెనకడుగేస్తోందో తెలిపేదే కథ. ఆ అనుభవాల్లోంచి అది తీసుకునే నిర్ణయాలతో పుట్టేదే ఫీల్, ఎమోషన్, ఆడియెన్స్ కనెక్ట్  ఏదనుకుంటే అది. పాత్ర ఏమనుభవిస్తోందో తెలుసుకుంటూ పోతూంటే తీసుకునే ఆయా నిర్ణయాలని బట్టి అలాగలా కథ దానికదే పుట్టేసుకుంటూ పోతుంది. పనిగట్టుకుని పుట్టించాల్సిన పనుండదు.

        పాత్రతో కథ పుడుతూ ఆ కథని పాత్ర నడిపిస్తూంటే అది యాక్టివ్ పాత్ర. కథెప్పుడూ రైటర్ ది కాదు. పాత్ర పుట్టించి పాత్ర నడిపే కథకి రైటర్ గా తన పేరు ఫ్రీగా వేసుకోవచ్చు. అంతవరకే హక్కు. అంతకి మించి కథలో చేయి పెట్టడానికి లేదు. ఒక కథ నెలలు గడుస్తూన్నా తెమలక పోవడానికి కారణ మేమిటి? పాత్ర నడపాల్సిన కథలో తాము చేయిపెట్టి అష్టవంకర్లు తిప్పడమే. తమ ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, ఫీలింగులు, ఎమోషన్లు కథలోకి తీసుకురావాలని విఫల యత్నాలు చేయడమే. అప్పుడా కథ పాత్రదవదు. రైటర్ దవుతుంది. అప్పుడా పాత్ర యాక్టివ్ పాత్రవదు. పాసివ్ పాత్రవుతుంది. యాక్టివ్ పాత్రెప్పుడూ తన నిర్ణయాలు తాను తీసుకుంటూ కొనసాగుతూ వ్యక్తిత్వ వికాసాన్ని ప్రకటిస్తుంది. పాసివ్ పాత్ర  రైటర్ ఆపాదించిన నిర్ణయాలతో వ్యక్తిత్వ వినాశాన్ని కొనితెచ్చుకుని కథని బలహీనం చేస్తుంది, లేదా విఫలం చేస్తుంది.

        కథ పట్టుకుని కథ ఆలోచించే రైటర్ లాజికల్ మైండ్ ని దూరం పెట్టేస్తాడు. ఎమోషనల్ మైండ్ తోనే రాస్తాడు. కథలో ఫీల్ కోసం తెగ ఫీలైపోతూ తనలోకంలో తానుండి పోతాడు. ప్రేక్షక లోకంలోకి రాడు. కానీ ఫీల్ అనేది రిలేటివ్ పదం. అది లాజిక్ మీద ఆధారపడకపోతే చాదస్తమైపోతుంది. లాజికల్ మైండ్ తో ఎమోషనల్ మైండ్ పనిచెయ్యక పోతే సగం బుర్ర పాత్ర, సగం బుర్ర కథా పుడతాయి. ఇది ‘రాజావారు రాణిగారు’ లో కూడా చూడొచ్చు.
 

        ఫైనల్ గా ఆడియెన్స్ కనెక్ట్ కి ఫార్ములా : ఒక యాక్టివ్ పాత్ర, అది లాజికల్ మైండ్ తో తన నిర్ణయాలు తను తీసుకుంటూ, అంచెలంచెలుగా కథ పుట్టిస్తూపోవడం, ఇంతే.

Q : ‘అర్జున్ సురవరం’ లో ఫస్టాఫ్ నిఖిల్ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో ఇరుక్కున్న తర్వాత సెకండాఫ్ లో ఆ స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథగా వుంది. కానీ సెకండాఫ్ బాగాలేదు. ఏమీ థ్రిల్ అనిపించలేదు. సెకండాఫ్ లో జరిగిన లోపాలేమిటో  వివరిస్తే మాకు హెల్ప్ అవుతుంది.
టి. రాజు, Asso
A:  ఆ సినిమా చూడలేదు. వీకీ పీడియాలో తమిళ వోరిజినల్ కథ చదివాం. రివ్యూలు కూడా చూశాం. తమిళంలోనే సెకండాఫ్ బాగాలేదని రివ్యూలిచ్చాక తెలుగులో ఎందుకు రీమేక్ చేశారో తెలీదు. స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథల్లో ఇంకా నావెల్టీ ఎక్కడుంది? అరిగిపోయిన టెంప్లెట్. ఆ మధ్య హిందీలో ‘వై చీట్ ఇండియా’ అని వచ్చింది. ఇందులో హీరో డబ్బున్న విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని, తెలివైన పేద విద్యార్ధులకి కొంత డబ్బిచ్చి ఎంసెట్ పరీక్షలు రాయించి, డబ్బున్న విద్యార్ధుల్ని పాస్ చేయిస్తూంటాడు. ఈ కథ సెకండాఫ్ లో ఏమవుతుందంటే, అదే హీరో మాస్ కాపీయింగ్ చేయించే కథగా మారిపోతుంది. రెండూ వేర్వేరు కథలు. ఫ్లాపయింది. రెండు కథల్లో కూడా చీటింగ్ మాఫియా అయిన హీరోని పట్టుకోవడమే థీమ్. హీరోని పట్టుకుంటే మనకేంటి, పట్టుకోకపోతే మనకేంటి?

        మీరనే సినిమాలో హీరోని ఇరికించిన విలన్ ని పట్టుకున్నంత మాత్రాన మనకేంటి? హీరో దోషి అయితే ఎవరిక్కావాలి, నిర్దోషి అయితే ఎవరిక్కావాలి? ఈ కథలు పాతబడి పోయాయి. వీటికి  రివర్సల్ కావాలి. ఇరుక్కున్న హీరో ఇరుక్కోలేదనీ, బుద్ధిపూర్వకంగానే నకిలీ సర్టిఫికెట్లు కొన్నాడనీ రివర్సల్ చేస్తే కొత్త కథవుతుంది. ఇలా నకిలీ సర్టి ఫికెట్లు కొంటున్న వాళ్ళు అనేకం  వుంటున్నారు. దీని విష పరిణామాలు చూపిస్తే కథ కొత్త తావులకి విస్తరిస్తుంది. కొత్త విషయాలు చెప్తుంది. కథ వెనుక కథ చెప్తుంది. అంటే నకిలీ సర్టిఫికేట్లు కొనేవాళ్ళ నైతిక, సామాజిక స్థితి ఏ గతి పడుతుందో చెప్తుంది. ప్రాక్టికల్ కథవుతుంది. గతవారమే ఉత్తరప్రదేశ్ లో వేల మంది టీచర్లు నకిలీ సర్టి ఫికేట్లతో పనిచేస్తున్నారని బయటపడింది. ఇప్పుడు వీళ్ళ గతేమిటి? డ్రమెటిక్ క్వశ్చన్ ఇక్కడ నేరం చుట్టూ వుండాలి. నేరస్థుడ్ని పట్టుకునే దొంగా పోలీసాటతో కాదు.

        అనిల్ కపూర్ నటించిన ‘మేరీ జంగ్’ (శోభన్ బాబుతో ‘విజృంభణ’) లో ఇంజెక్షన్ మార్పిడి హత్య కుట్రలో లేడీ డాక్టర్ ఇరుక్కుంటే, లాయరైన అనిల్ కపూర్ పని కుట్ర దారుడ్ని పట్టుకోవడం కాదు. ఆమె పేషంట్ కిచ్చిన ఇంజెక్షన్ విషపూరితం కాదని నిరూపించి ఆమెని కేసులోంచి బయటపడెయ్యడం. కుట్రదారుడ్ని పట్టుకోవడమే కథయితే పస వుండేది కాదు. సెకండాఫ్ కూడా అదే కథయి బోరు కొట్టేది. అందుకని విషపూరితం కాదని కోర్టులో నిరూపించడానికి ఆ విషపూరిత ఇంజెక్షన్ని తాగేస్తాడు. ఇదీ రివర్సల్. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరికి తెచ్చి కథని విరిచెయ్యడం. కొత్తదారి పట్టించడం. దీంతో ఏమవుతుందంటే సెకండాఫ్ కథ విరక్కుండా వుంటుంది. విరిచేదేదో ఫస్టాఫ్ లోనే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగేట్టు విరిచిస్తే, సెకండాఫ్ తో గొడవే వుండదు. అంటే సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి సినిమా బే ఆఫ్ బెంగాల్ అవదు.

        తర్వాత ఇదే కోర్టు కేసు తదనంతర పరిణామాల్లో కుట్రదారుడు బయట పడతాడు. వాడెవడో కాదు, అనిల్ కపూర్ పాత్ర తల్లిని దూరం చేసిన వెధవే. ఇప్పుడు వాడి అంతు చూస్తాడు. ఇది గోల్ రివర్సల్. ఒక గోల్ తో బయల్దేరిన పాత్రకి అందులోంచి ఇంకో గోల్ ఎదురవడం. సాధారణంగా మొదటి గోల్ ఫిజికల్ గోల్ గా పూర్తవుతుంది. పూర్తయిన ఈ ఫిజికల్ గోల్ లోంచి ఎమోషనల్ గోల్ పుట్టుకొస్తుంది. మొదట డాక్టరమ్మని కాపాడడం అనిల్ కపూర్ ఔటర్ (ఫిజికల్) గోల్ గా వుండింది.  తర్వాత అదే గోల్ లోంచి తెలిసిపోయిన విలన్ అంతు చూడ్డం తల్లి కథతో ఇన్నర్ (ఎమోషనల్) గోల్ అయింది. స్టార్ వార్స్, కెప్టెన్ అమెరికా వంటి వాటిలో కూడా గోల్ రివర్సల్స్ చూడొచ్చు.

సికిందర్


3, డిసెంబర్ 2019, మంగళవారం

895 : రివ్యూ!


రచన -  దర్శకత్వం : కె. రవికిరణ్
తారాగణం :
 కిరణ్ అబ్బవరం, రహస్యా గోరక్, రాజ్ కుమార్, యజుర్వేద్, స్నేహ మాధురీ శర్మ, దివ్యా నర్ని తదితరులు
సంగీతం : జై క్రిష్ , ఛాయాగ్రహణం : సి. విద్యాసాగర్
నిర్మాత
: జి. మనో వికాస్
విడుదల : నవంబర్ 29, 2019
        సినిమాల్లో కెల్లా సులువైన సినిమా ప్రేమ సినిమా. తెలుగులో ఇది తీయాలంటే ఏమీ చేయనవసరం లేదు, ఉన్నదే మరోసారి శుభ్రం చేసి చూపిస్తే చాలు. చూసిందే చూసే తెలుగింటి ప్రేక్షకులు కాచుకుని వుంటారు. కాకపోతే దాని వెనుక పేరున్న నిర్మాతో, పంపిణీ దారో వుంటే ఇంకా ఆకర్షిస్తుంది. ఈ కోవలో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న బడ్జెట్ ప్రేమ సినిమాకి ఇలాగే హైప్ వచ్చింది. బిజినెస్ జరగని చిన్న సినిమాలకి సురేష్ ప్రొడక్షన్స్ అండగా వుంటోంది. ఇది కొత్త దర్శకుడు రవి కిరణ్, కొత్త నిర్మాత మనోవికాస్ ల అదృష్టం. ఇద్దరికీ సినిమా ఎలా ఎంత సహజంగా తీయాలో మంచి టేస్టు వుంది. కావాల్సిందల్లా ఇప్పటి ప్రేక్షకుల టేస్టుకి దగ్గరగా వుండే సమకాలీన సబ్జెక్టు. ఇది లేకపోతే లాభంలేదని బయ్యర్లకి కూడా స్పృహ వచ్చేస్తోంది. అసలే మార్కెట్ కోల్పోయిన రోమాంటిక్ కామెడీలు తప్ప మరేమీ కన్పించక ఇంకేదో కావాలని వేచి చూస్తున్నారు. వీళ్ళని దాటుకుని వచ్చేసింది ‘రాజావారు రాణిగారు’. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

కథ

       2010 గోదావరి జిల్లా రామాపురం. ఇంటర్ చదివే రాజా (కిరణ్ అబ్బవరం) రాణి (రహస్యా గోరక్) ని ప్రేమిస్తూంటాడు. ఈ విషయం ఆమెకి చెప్పలేడు. ఆమె తండ్రి రేషన్ డీలర్. తల్లి వుండదు. ఆమె సున్నితంగా, నెమ్మదిగా వుంటుంది. ఎంసెట్ పాసయి పై చదువుకి అమ్మమ్మ వాళ్ళ వూరెళ్ళి పోతుంది. దీంతో రాజా డీలా పడిపోతాడు. ఇక్కడే డిగ్రీ చదువుతూ చౌదరి (రాజ్ కుమార్), నాయుడు (యజుర్వేద్) అనే ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూంటాడు. రాణి ఏ వూరెళ్ళిందో తెలుసుకునే ప్రయతంలో వుంటాడు. మూడున్నరేళ్ళు చూసి చూసి, తాము రాణిని రప్పిస్తే రాజా మనసులోని మాట ఆమెకి చెప్పాలని ఫ్రెండ్స్ మాట తీసుకుని, రాణి తండ్రికి యాక్సిడెంట్ జరిపిస్తారు. ఇక రాణి వచ్చేస్తుంది. వచ్చిన రాణికి రాజా మనసులో మాట చెప్పాడా? ఇంకేం అవరోధాలు వచ్చాయి? వీటిని అధిగమించడానికి ఫ్రెండ్స్ ఎలా సహాయపడ్డారు? ఇదీ మిగతా కథ.


ఎలా వుంది కథ
        రోమాంటిక్ డ్రామా జానర్. గత రెండు దశాబ్దాలుగా వస్తున్న ప్రేమ సినిమాల దర్శకులకి తెలిసింది రెండే రెండు టెంప్లెట్స్. హీరో లేదా హీరోయిన్ ప్రేమ చెప్పలేకపోవడం, లేదా ఇద్దరూ అపార్ధాలతో విడిపోవడం. వందల ప్రేమ సినిమాలు ఈ రెండే అరిగిపోయిన, మూస ఫార్ములా స్టేటస్ కి చేరిపోయిన పాయింట్లతో పదేపదే వస్తున్నాయి. హిందీలో మన్మర్జియా, బరేలీ కీ బర్ఫీ, లుక్కా చుప్పీ లాంటి ప్రేమ సినిమాలు సమకాలీన ప్రేమ జీవితాలతో యువతని ఉర్రూత లూగిస్తున్నాయి. ప్రేమ సినిమాలు ఉర్రూత లూగించడం సమకాలీనంగా, కొత్త ఐడియాలతో ఫ్రెష్ గా వున్నప్పుడే జరుగుతుంది. తాజాగా ఇదే వారం విడుదలైన ‘ఏ సాలీ ఆషికీ’  కూడా ఇలాంటిదే. 

         ‘రాజావారు రాణిగారు’ కాలీన స్పృహకి సంబంధించి ఒక సమర్ధన చేశారు థీమాటికల్ గా. ఏమంటే ఈ ప్రేమ కథని ఈ కాలంలో కాకుండా, 2010 లో జరిగినట్టుగా చూపిస్తున్నట్టు సమర్ధన కనబడుతోంది. ఈమధ్య  ‘రణరంగం’ లో 1990 ల నాటి ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ ఇచ్చారు. ‘గద్దల కొండ గణేష్’ లో కూడా ఇదే ఇచ్చారు. ఇవి ఈ తరం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయా? పోనీ కిందటి తరం ప్రేక్షకులు వచ్చి చూశారా?

        క్వాక్ జీ యంగ్ తీసిన ‘ది క్లాసిక్’ కొరియన్ మూవీ పాత తరం తల్లి ప్రేమ కథతో, కొత్త తరం కూతురి ప్రేమ కథతో టూ ఇన్ వన్ గా వుంటుంది. తల్లీ కూతుళ్ళుగా ఒకే హీరోయిన్ నటించింది. దీన్ని రెండు తరాల ప్రేక్షకులూ ఉమ్మడిగా చూసి సక్సెస్ చేశారు (ఇదే బ్లాగులో సుదీర్ఘ విశ్లేషణ చేశాం). రెండు కాలాల ప్రేక్షకుల్ని ఆకర్షించడమన్నది ఇక్కడ మార్కెట్ యాస్పెక్ట్. మార్కెట్ యాస్పెక్ట్ పట్టించుకోకుండా క్రియేటివ్ యాస్పెక్ట్ తో ఏళ్ల తరబడి అదే సరుకు సరాఫరా చేయడం సినిమా వ్యాపారం అన్పించుకోదు. మార్కెట్ యాస్పెక్ట్ అంగీకరించి తీరాల్సిన పచ్చి వాస్తవం. క్రియేటివ్ యాస్పెక్ట్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వుండాల్సిన వొట్టి వూహ.    

         ప్రస్తుత ప్రేమ కథలో రాజా, పైన చెప్పకున్న రెండు పాయింట్లలో ఒక పాయింటైన ‘ప్రేమ చెప్పుకోలేక పోవడం’ అనే పాత్రచిత్రణతో, ప్రేమిస్తున్నాడని రాణీ తెలుసుకోకపోవడమనే పాత్ర చిత్రణతో - ఇద్దరి ప్రేమ కథకి ఒక ప్రతిష్టంభన ఏర్పడి, ఎటూ కదలని కథనంతో జడప్రాయంగా వుండి పోయింది. 

         కథా ప్రయోజనం విషయానికొస్తే, దశాబ్దకాలపు వెనకటి ఈ రొటీన్ రిపీట్ ఫార్ములా కథలోంచి ఈకాలం ప్రేమికులు తెలుసుకోవాల్సిందేమీ కన్పించడం లేదు. ఏళ్ల తరబడి ప్రేమని వ్యక్తం చేయలేకపోయే పాత్రతో ప్రాక్టికాలిటీ ఏముంటుంది. సినిమా అంటే ఆచరణ చూపడం. ఈ హీరోహీరోయిన్ల స్థాయి కూడా కామన్ సెన్సు లోపించి ప్రేక్షకులకంటే తక్కువ స్థాయిలో వుంది. 

       కథా ప్రయోజనమలా వుంచి వినోదాత్మక విలువ చూసినా ఫస్టాఫ్ వరకే ఎంటర్టైనర్. సెకండాఫ్ లో కెళ్తే సీరియస్ మూడ్. రోమాంటిక్ డ్రామా కాబట్టి సీరియస్ అని సరిపెట్టుకున్నా, ఆ సీరియస్ డ్రామా కూడా చలనంలో వుండక, పైన చెప్పుకున్నట్టు జడప్రాయంగా మిగిలింది. రెండుగంటలా పది నిమిషాల తక్కువ నిడివి ఒక్కటే కాస్త ఉపశమనం.  


        కాకపోతే కథకి ఎంచుకున్న నేపధ్యం ఆకర్షణీయంగా వుంది. కథ టెంప్లెట్ లో వుండిపోయి వాస్తవికత లేకపోయినా, నేపథ్య వాతావరణం రియలిస్టిక్ గా వుంది. దీనికి విరుద్ధంగా సత్యజిత్ రే తీసిన ‘నాయక్’ రియలిస్టిక్ కథ వచ్చేసి కమర్షియల్ స్ట్రక్చర్ తో వుంటుంది. ఇందుకే ఈ ఆర్ట్ సినిమా అంత బలంగా వుంది. దర్శకుడు రవికిరణ్ గోదావరి జిల్లా గ్రామీణ వాతావరణాన్ని, మనుషుల్ని, జీవితాల్ని, భాషనీ ఎలాటి కమర్షియల్ హంగులూ కృత్రిమత్వం  లేకుండా స్పటికస్వచ్ఛతతో చూపించడం వల్ల కథేమో గానీ ఈ నేపథ్యాన్ని- రూరల్ టూరిజాన్ని అనుభవిస్తూ ఎంత సేపైనా కూర్చోవచ్చు. ఈ టూరిజంలో చూపించిన ప్రతిభ రోమాంటిసిజంలో కనబర్చలేకపోయాడు. తన టేస్టు టూరిజానికే పరిమితమైంది. 

ఎవరెలా చేశారు
        హీరో హీరోయిన్లతో బాటు ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళు కొత్త వాళ్ళే. హీరోయిన్ రహస్య ప్రారంభ దృశ్యాల్లో కాసేపు కన్పించి వూరెళ్ళి పోతుంది (కథలో). ఇక సెకండాఫ్ లోనే తిరిగి వచ్చేది. ఫస్టాఫ్ లో ఈమె లేని ముప్పావు గంటా హీరో ఒక్కడే కన్పిస్తాడు. రహస్య తక్కువ మాట్లేడే, సున్నితమైన, నెమ్మదిగల పాత్రలో నటించడానికి పెద్దగా అవకాశం రాలేదు. సీన్లలోకి రావడం, వెళ్ళడం, లేవడం, కూర్చోడం లాంటి భౌతిక కదలికలే తప్ప - కథ ప్రకారం మానసిక స్పందనలు వుండని పాత్ర కావడం చేత, ఒక షో పీస్ లా వుండిపోతుంది. చిట్ట చివర్లోనే మనసువిప్పి తన కథంతా చెప్పుకున్నప్పుడు కాస్త నటించే అవకాశం లభిస్తుంది. ఈ నటించే అవకాశం లభించినప్పుడు విచిత్రంగా భౌతిక కదలికల్లేక, మనసొక్కటే మాట్లాడుతుంది. దర్శకుడి పొరపాటువల్ల ఇక్కడ పాత్ర ప్రదర్శించాల్సిన బాడీ లాంగ్వేజీ  కొరవడింది. ఇన్నాళ్ళూ ఉగ్గబట్టుకున్న ప్రేమని వెళ్ళబోసుకుంటున్నప్పుడైనా - హగ్ చేసుకోమ్మా, కాస్త కాళ్ళూ చేతులూ ఆడించి బలంగా హగ్ చేసుకుని భారమంతా దించేసుకో - ఈ సినిమాకి ఇప్పుడైనా మాంచి కిక్ తీసుకురా! - అనాలన్పిస్తుంది. చిట్ట చివరికైనా హగ్ చేసుకోని ప్రేమికులతో సగటు ప్రేక్షకుడి కంటికి ఎలాటి ప్రేమ సినిమా! అంతసేపూ వియోగంతో చేసిన సెటప్, చివరికి సంయోగంలో సరీగ్గా పే ఆఫ్ కాలేదు. తగిన డ్రామా కొరవడిన పెళుసు ముగింపుగా తేలింది. 


        హీరో కిరణ్ అబ్బవరం ఏకపక్ష ప్రేమికుడుగా మనసు పెట్టి బాగానే నటించాడు పాత్ర ప్రకారం. ప్రేమించడమే తప్ప ఆ ప్రేమని కార్య రూపంలోకి తేలేని ఇలాటి భయస్థుడి పాత్ర గతంలో చాలా ప్రేమ సినిమాల్లో వచ్చిందే. ప్రేమించానని చెప్తే కాదంటుందేమో, కాదంటే తట్టుకోలేనెమో నన్నభయం చుట్టూ చివరంటా సాగే ఈ పాత్ర విసుగులేకుండా నటించాడు, సెకండాఫ్ వచ్చేసరికి విసుగూ తెప్పించాడు. ఇంతకీ చివర్లోనైనా ప్రేమిస్తున్నట్టు చెప్పగల్గాడా అంటే లేదు. ఆమే చెప్పుకుని ఆమే దగ్గరవ్వాలి తప్ప తను కదలడు, మెదలడు. రోమాంటిక్ పాత్ర కాకుండా రోబోలా మిగిలాడు. పాటలన్నీ తనమీదే వున్నాయి, విషాద పాటలు సహా. 

        ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ కుమార్, యజుర్వేద్ లు సున్నిత హాస్యంతో సీన్లని చైతన్యవంతం చేశారు. గోదావరి జిల్లా వాళ్ళ లాగా ఆ నేటివిటీని అలాగే మెయింటెయిన్ చేశారు. మధ్యలో ట్రయాంగులర్ ఫార్ములా ప్రకారం హీరోయిన్ బావ పాత్ర రావడం, కామెడీ కుట్ర చేసి అతణ్ణి పంపడం పాత రొటీన్ వ్యవహారమే. దర్శకుడు మొహమాటం లేకుండా ఓల్డ్ స్కూల్ డ్రామాకే కట్టుబడి యూత్ లవ్ తీశాడు. 

        టెక్నికల్ గా విజువల్స్ బావున్నాయి. కెమెరా వర్క్ గోదావరి నేటివిటీకి అద్దం పట్టింది. సంగీతం కూడా బావుందిగానీ, ఈ సినిమాని మ్యూజికల్ హిట్ చేసేంత కాదు. తక్కువ పాత్రలుండడం వల్ల, ఒకే గ్రామపు లొకేషన్ కావడం వల్ల, బడ్జెట్ చాలా ఆదా అయినట్టుంది. 
 
చివరికేమిటి?
       ఈ రోమాంటిక్ డ్రామా ఇద్దరు దుండగులు ఒకడ్ని కిడ్నాప్ చేసి, వాడికి ఈ ప్రేమ కథ చెబుతున్నట్టు ప్రారంభమవుతుంది. ఈ దుండగులెవరు, కిడ్నాప్ చేసిందెవర్ని అన్నది సస్పెన్స్ గా పెట్టుకుని నడిపారు. ఈపాటి కథకి మంచి క్రియేటివిటీయే. నేరుగా ఇంటర్ క్లాస్ రూమ్ నుంచే హీరో ప్రేమని ప్రారంభించి హీరోయిన్ కి చెప్పాలనుకునే విఫల యత్నాలు చూపించారు. ఆమె పై చదువుకి వూరెళ్ళి పోగానే హీరో వూళ్లోనే దిగాలుగా గడపడాన్ని చూపడం ప్రారంభించారు. ఇక్కడ్నించీ ఫస్టాఫ్ ని హీరోయిన్ లేకుండానే లాక్కొచ్చారు. ఇలా ఆఫ్ బీట్ సినిమా ప్రయత్నం చేశారు కథనంతో. మొత్తం ప్రేమ కథతోనే  ఆఫ్ బీట్ ప్రయత్నం చేయాల్సింది చేయలేకపోయారు. ఇక మూగ ప్రేమికుడైన హీరో ఫ్లాట్ క్యారక్టరైజేషన్ లో మార్పు ఇంటర్వెల్ ముందు ఫ్రస్ట్రేషన్ తో ఇతరుల్ని కొట్టే సీన్లు పెట్టారు. కానీ హీరోయిన్ ఏ వూరెళ్ళిందో ఆ వూరెళ్ళి ప్రయత్నించేలా చేయకుండా మూడున్నరేళ్ళూ వూళ్ళోనే ఏడ్పిస్తూ వుంచేశారు. ఇలాటి పాత్ర హీరోయిన్ కుంటుంది. వెళ్ళిపోయిన నాథుడి కోసం ఎదురు చూస్తూ గడిపే పాత హీరోయిన్ పాత్ర. ఇక్కడ హీరోని ఆడదానిగా మార్చి చూపెట్టారు. 


        హీరోయిన్ పాసివ్ పాత్ర, హీరో కూడా పాసివ్ పాత్రయి పోతే ఇక కథ ఎలా నడుస్తుంది. ఇందుకే ఈ పాసివ్ పాత్రల కథని ఫ్రెండ్స్ నడపాల్సి వచ్చింది. హీరోయిన్ ని రప్పిస్తే ఆమెకి లవ్ చెప్పే దమ్ముందా అని అడిగి, దమ్ముందంటేనే, హీరోయిన్ ని రప్పిస్తారు ఫ్రెండ్స్- ఆమె తండ్రికి యాక్సిడెంట్ జరిపించి.  సెకండాఫ్ లో హీరోయిన్ వచ్చాక కూడా లవ్ చెప్పే ఆలోచన హీరో చెయ్యడు, ఫ్రెండ్స్ కూడా అడగరు. ఇంటర్వెల్ పాయింటు మర్చిపోయారు. మళ్ళీ హీరోయిన్ కి లవ్ చెప్పలేని ఫస్టాఫ్ దృశ్యాలే రిపీటవుతాయి. ఫస్టాఫ్ నుంచీ కథ ఎక్కడేసిన గొంగళే. పాత్రకి కాన్ఫ్లిక్ట్ లేక, కథలో చేసే పనిలేక, మూగగా ప్రేమిస్తూ ప్రేమిస్తూనే వుండిపోతాడు. ఈ మూగ ప్రేమని కూడా - మూడున్నరేళ్ళు వేరే వూళ్ళో వుండొచ్చిన ఆమె రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటో, ఎవర్నేనా ప్రేమించిందో ఏం పాడో -  తెలుసుకున్నాకే ప్రేమించాలో వద్దో నిర్ణయించుకోవాలన్న జ్ఞానం కూడా లేకుండా మూగ ప్రేమ - గుడ్డి ప్రేమ - చెవిటి ప్రేమగా ప్రేమిస్తూనే వుండిపోతాడు. ఇలా కథలేక సెకండాఫ్ వృధా అయింది. 

        ఇదీ ప్రేమ సినిమాల రెండు టెంప్లెట్లలో ఒక టెంప్లెట్ కథాకమామిషూ. ఇలాగే టెంప్లెట్స్ తో ప్రేమ సినిమాలు 2119 దాకా వర్ధిల్లుగాక! ఈ టెంప్లెట్ చాలా మన్నికైనది, బాంబు పెట్టి పేల్చినా చెక్కు చెదరదు.

సికిందర్
   

2, డిసెంబర్ 2019, సోమవారం

894 : రైటర్స్ కార్నర్






      స్క్రిప్ట్ డాక్టర్, స్టోరీ ఎనలిస్ట్, స్టోరీ కన్సల్టెంట్...ఇలా కొన్ని పేర్లతో సినిమా కథా నిపుణులు వుంటారు. రచయితలు రాసిన స్క్రిప్టుల్ని మూల్యాంకన చేసి లోటుపాట్లు సూచిస్తూంటారు. హాలీవుడ్ కి చెందిన అలాటి ఒక స్క్రిప్ట్ డాక్టర్ మైకేల్ రే బ్రౌన్ రచయితలు ఈ నిపుణుల్లో ఏం చూసి సంప్రదించాలో చెబుతూ, మరికొన్ని స్క్రిప్టు సంబంధ టిప్స్  ఇచ్చారు. అవేమిటో చూద్దాం....

సినిమా పరిశ్రమ గురించి రచయితలు కొత్తగా తెలుసుకోవాల్సినవి ఏమిటంటారు?
భారీ సినిమాలు నిర్మించే స్టూడియోలకీ చిన్న చిన్న సినిమాలు తీసే నిర్మాతలకీ అంతరం పెరిగిపోతోంది. రచయితలు తమ స్క్రిప్టులు అంగీకారం పొందాలంటే ఈ అంతరాన్ని గుర్తించాలి. తాము ఎటువైపు వుండాలో నిర్ణయించుకోవాలి. ఈ అంతరానికి వేయగల్గిన వారధి ఒక్కటే : చిన్న సినిమాలు కూడా పాత్ర బలంగా వుంటే పెద్ద స్టార్స్ ని ఆకర్షిస్తాయి.

నేటి మార్కెట్లో రచయితలకి కన్సల్టెంట్ ల అవసరముందంటారా?
పూర్వం కంటే ఇప్పుడు ఏంతో పోటీ వుంది. సినిమా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. నిర్మాతలు ఎక్కువ రిస్కు తీసుకోదల్చుకోవడం లేదు. వాళ్ళు స్క్రిప్టులకి నో చెప్పే మూడ్ లోనే వుంటారు. ఓ ఆరు నెలల కాలంలో వాళ్ళు చదివిన స్క్రిప్టులకి మించి వుంటే తప్ప ఎస్ అనే ఛాన్సే లేదు. కథ ఫ్రెష్ గా లేకపోయినా, కథనం లోప రహితంగా లేకపోయినా, పాత్రలు కమర్షియల్ గా లేకపోయినా, స్క్రిప్టులు ఓకే చేసే అవకాశమే లేదు. ఇది తెలుసుకోక పోతే రచయిత కెరీర్ లో పురోగతి వుండదు. కన్సల్టెంట్ అవసరం తప్పని సరేమీ కాకపోవచ్చు, కానీ అతను నిర్మాతల దగ్గరికి వెళ్ళే ముందు రచయితకి చాలా విషయాలు క్లియర్ చేస్తాడు. స్క్రిప్టులో లోపాలు సహా. లోపాలున్న స్క్రిప్టుతో కెరీర్ ఎటూ వెళ్ళదు.

స్క్రిప్టుకి వుండాల్సిన యోగ్యతలేమిటంటారు?
క్వాలిటీ స్క్రిప్టుకి చాలా యోగ్యతలుంటాయి. స్క్రిప్టు రచన క్రాఫ్టే కాకుండా కళ కూడా. స్క్రిప్టు ఎంత బావుందన్నది మొదటి ఐదూ పదీ పేజీల్లోనే తెలిసిపోతుంది. ప్రాక్టికల్ ఆయా కథలకి వుండే సహజ శోభ ప్రారంభ పేజీలలోనే తెలిసిపోతుంది. ఐడియాలకి కొదవేం వుండదు. ఆ ఐడియాలని కథలుగా చెప్పడంలోనే వుంది అంతా. రచయితకి ఒక పాషన్ వుండొచ్చు, ఒరిజినల్ వాయిస్ వుండొచ్చు. కథ చెప్పే ప్రతిభాపాటవాలు లేకపోతే ఈ రెండూ వృధాయే. నావరకూ నేను చదవగానే వదల బుద్ధిగాని స్క్రిప్టుల కోసం చూస్తూంటాను.

కన్సల్టెంట్ ని సంప్రదించే ముందు రచయిత లేదా రచయిత్రి విధులేమిటో చెప్పండి.
రచయిత లేదా రచయిత్రి వీలయినంత సమర్ధవంతంగా స్క్రిప్టు రాసుకోవాలి. పైపైన రాసేసి కన్సల్టెంట్ చూసుకుంటాడులే అనుకుంటే కుదరదు. కన్సల్టెంట్ స్క్రిప్టులు రాసి పెడతాడని ఆశించ వద్దు. కన్సల్టెంట్ ఎంపిక చేసుకునే ముందు ఎనాలిసిస్ కి వాళ్ళ అప్రోచ్ ఏమిటో అడిగి తెలుసుకోవాలి. ఏవైనా శాంపిల్స్ వుంటే చూపించ మనాలి. వాళ్ళకి వెబ్ సైట్ వుంటే దాన్ని పరిశీలించాలి. ఎవరైనా స్క్రిప్టు కన్సల్టెంట్ అని చెప్పుకోవచ్చు. అసమర్ధులైన  స్క్రిప్ట్ కన్సల్టెంట్స్ కి కొదవ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి డబ్బు లాగేస్తారు. అసలు తమ స్క్రిప్టు విషయంలో తామేం కోరుకుంటున్నారో రచయిత / రచయిత్రి స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడు దాని మీద ఫోకస్ చేసి కన్సల్టెంట్ ఎనాలిసిస్ చేసుకోగల్గుతాడు. ప్రశ్నావళి తయారు చేసుకుని వెళ్తే ఇంకా మంచిది.

రైటర్స్ తిరస్కారానికి గురవడానికి ఓ మూడు ప్రధాన కారణాలు చెప్పండి.
ప్రధాన కారణం పకడ్బందీ కథనం లోపించడం. అంటే కాన్ఫ్లిక్ట్ లో స్పష్టత లేకపోవడం లేదా బలహీనంగా వుండడం. ప్రధాన పాత్రకి తగిన డైలమా లేకపోవడం. ప్రేక్షకుల్నికట్టి పడేసే ఒక బలమైన, ఏకీకృత పాయింటాఫ్ వ్యూ ప్రధాన పాత్రకి లేకపోవడం. ఏ పాత్రని కూడా మనం ఐడెంటిఫై చేసుకోలేకపోవడం. ఐడెంటిఫై చేసుకోలేకపోతే ఆ పాత్రలకి ఏం జరిగినా మనకి ఆసక్తి వుండదు. కాన్ఫ్లిక్ట్ చాలా  కీలకం. రెండు పాత్రల్ని ఎదురెదురు పెట్టేసి కాన్ఫ్లిక్ట్ అంటే ప్రయోజనం వుండదు. ప్రధాన పాత్రకి దాని లక్ష్యం చుట్టూ వుండే కాన్ఫ్లిక్ట్ పైన రచయిత దృష్టి పెట్టకపోతే అప్పుడా కథ వీగిపోతుంది. నిర్మాతలకి ఆసక్తి నశించి రిజెక్ట్ అవుతుంది. నిర్మాతలు స్క్రీన్ ప్లే నాలెడ్జి తో వుంటారని మర్చి పోవద్దు...నేనెప్పుడూ రచయితల్ని వెనక్కి పంపను. వాళ్ళ స్క్రిప్టుల్ని ఎలా బాగు చేసి వాళ్ళకి తోడ్పడాలా అనే చూస్తాను. ఏ కథకి ఏ మందు వేస్తే ఆరోగ్యంగా వుంటుందో నాకు తెలుసు.

కన్సల్టెంట్ కుండాల్సిన మూడు గుణాలు చెప్పండి.
ఒకటి ఎక్స్ పీరియెన్స్ : ప్రొఫెషనల్ స్టోరీ ఎనలిస్టు అన్పించుకోవాలంటే అతడికి రియల్ వరల్డ్ అనుభవముండాలి. రెండు, ఇంటెగ్రిటీ : రైటర్స్ తో ఓపెన్ గా, నిజాయితీగా వుండాలి. వాళ్లకి బాధ కలిగినా సరే ఈ రెండో గుణం వదులుకోకూడదు. మూడు, క్రియేటివిటీ : రైటర్స్ తో కలిసి మేధో మధనం చేసే క్రియేటివ్ పవర్స్ వుండాలి. స్క్రిప్టుని శక్తివంతం చేయడానికి వలసిన క్రియేటివిటీ అంతా కలిగి వుండాలి.

అసమర్ధ కన్సల్టెంట్స్ ని గుర్తించడమెలా?
కొందరు కన్సల్టెంట్స్ ప్రొఫెసర్స్ లా బిహేవ్ చేస్తారు. వాళ్ళ పాండిత్య ప్రకర్షకి రచయితలు ఉత్తేజితు లవకపోగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏదో లెక్చర్ ఇస్తున్నట్టు వుంటుంది. వాళ్ళు చేసే స్క్రిప్టు మూల్యాంకన శాంపిల్స్ చదివితే సినిమాలు తీయడానికి పనికి రాని  థియరీలు రాసి వుంటాయి. రచయితలకి సినిమాలకి వర్తింపజేసుకునే ప్రాక్టికల్ సలహాలు కావాలి. అలాటి సలహాలిచ్చే వాళ్ళని ఎంపిక చేసుకోవాలి.

సినిమా రచయిత అవడం రాను రాను కష్టమైపోతున్న పరిస్థితులు తయారవుతున్నాయంటారా?
టాలెంట్ కి గుర్తింపు లభించాలంటే ఏడాది కేడాది కఠినతరమై పోతోంది. మునుపటికంటే ఇప్పుడు చాలా స్క్రిప్టు పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలు గెలిచిన స్క్రిప్టుల్లో ఒకటీ అరా కూడా నిర్మాతలు పట్టించుకోవడం లేదు. నిర్మాతల చేత ఒక స్క్రిప్టు చదివించాలంటే తలప్రాణం తోక కోస్తోంది. ఏజెంట్లు కూడా చదవడం లేదు. అయినా మార్కెట్ మునుపటికన్నా పెరిగింది. ముఖ్యంగా టీవీ రంగం. ఒక సిరీస్ కి సింగిల్ స్క్రిప్ట్ పని పొందిన రచయిత ఆ ఆదాయంతోనూ జీవనం కొనసాగించ లేడు. అయినా ఆ అవకాశం ఒక విజయం కిందే లెక్క.

విజయవంతమైన సినిమాలు ఒకేలా వుంటాయని మనకి తెలిసిందే. అంటే విజయవంతమైన ఒక సినిమా చూసి దానిలాగే స్క్రిప్టు రాసుకోవడం మంచిదంటారా? కొత్త ట్విస్టు పెట్టి, లేదా లుక్ నే మార్చేసి?
స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు మొత్తంగా ఒక సరికొత్త కథ కోసం చూస్తున్నామంటారు. నిజానికి వాళ్ళు చూసేది కొత్త సీసాలో పాత సారా కోసమే. పూర్తి కొత్త కాన్సెప్ట్ వాళ్ళ మార్కెటింగ్ శాఖకి ప్రగతి నిరోధకంగా కన్పిస్తుంది. ఆ కాన్సెప్ట్ ని ఏ పాత ఉదాహరణతో పోల్చుకోలేక ఇది అమ్ముడు పోదని తేల్చేస్తారు. అమ్ముడు పోతుందని నమ్మాలంటే దానితో పోలింది ఇంకోటి కన్పించాలి. రోమాంటిక్ కామెడీలనే తీసుకుందాం. ఈ రోజుల్లో రోమాంటిక్ కామెడీలు రాయాలంటే చాలా కష్టమై పోతోంది. ఎందుకంటే ఈ రోజుల్లో రిలేషన్ షిప్స్ కి బహిర్గతంగా అవరోధాలు తగ్గిపోతున్నాయి. అందుకని తెలివైన రచయిత రోమాంటిక్ కామెడీల పాత ఫార్ములాకే కొత్త ట్విస్టు పెడతాడు. సాంప్రదాయంగా వుంటున్న హీరోయిన్ ని హీరో స్థానంలో పెట్టి, ఆమె చేత ఆమె ఏడ్చిన పాత సాంప్రదాయ ఏడ్పుల్ని అతడి చేత ఏడ్పిస్తాడు. రోల్ రివర్సల్ అన్నమాట. ఇప్పుడు ఆమె పీడకురాలు, అతను పీడనకి గురయ్యేవాడు.

మీరు ఏడు మేజర్ స్టూడియోల్లో స్టోరీ డిపార్ట్ మెంట్స్ లో పని చేశారు. ఇప్పుడు స్టోరీ కన్సల్టెంట్ గా ఏం తేడా గమనిస్తున్నారు?
ప్రొఫెషనల్ గా మారాను. స్టూడియోల్లో పని చేయడం వల్ల స్క్రిప్టుల్లో నిర్మాతలేం చూస్తారో ఎగ్జిక్యూటివ్ లేం చూస్తారో తెలుసుకోగలిగాను. కాబట్టి రైటర్స్ తో కన్సల్ట్ అవుతున్నప్పుడు ఏది వర్కౌట్ అవుతుందో, ఏది కాదో చెప్పగల్గుతున్నాను.

అసమర్ధ కన్సల్టెంట్ కంటే ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఎలా గొప్పవాడో చెబుతారా?
కొందరు కన్సల్టెంట్లు ఏ కథయినా ఒకే ఫార్ములా చట్రంలో పెట్టి చూస్తారు. వాళ్ళ ఎనాలిసిస్ లు చదివితే, ఫలానా ఫార్ములాలో ఆ కథ పడిందా లేదా అనే విశ్లేషణే వుంటుంది. ఈ విశ్లేషణకి కన్సల్టెంటే అయివుండనవసరం లేదు. నా అప్రోచ్ ఎక్కువ సానుకూలంగా వుంటుంది. నా గైడింగ్ రూలు స్క్రిప్టు నా కాసక్తిగా వుండాలి. ప్రతీ కథా దానిదైన యూనిక్ డైనమిక్స్ తో వుంటుంది. నేను ప్రయత్నించే దేమిటంటే, థీమ్ ఐడెంటిఫై చేసి, కథా కథనాలు ఆ థీమ్ కి ఎంతవరకూ న్యాయం చేస్తున్నాయో విశ్లేషించడమే. దాన్ని బట్టి ఆ థీమ్ ని ఇంకెంత డ్రమెటిక్ గా చెప్పవచ్చో రచయితకి తెలియజేయడమే. నేను మెంటర్నీ, కొలాబరేటర్నీ అని భావిస్తాను. నా కన్సల్టేషన్ తో నా క్లయంట్స్ అనేక కొత్త, ప్రాక్టికల్ అయిడియాలతో తిరిగి వెళ్తారు. వాళ్ళు సక్సెస్ అయ్యారంటే నేనూ సక్సెస్ అయినట్టే.
*

28, నవంబర్ 2019, గురువారం

893 : స్క్రీన్ ప్లే సంగతులు - 3



     ఇంటర్వెల్ సీన్లో  కూడా ప్లాట్ పాయింట్ వన్ రాలేదు. అంటే కథ ప్రారంభించడం కోసం సమస్య ఏర్పాటు కాలేదు. అంటే జార్జి రెడ్డి గోల్ ప్రారంభం కాలేదు. ఇంటర్వెల్ ప్రసంగంలో విద్యార్ధులు అన్యాయాలపై తిరగబడాలని మాత్రమే ప్రసంగించి వూరుకున్నాడు. ఒక సమస్యంటూ ఏర్పడితే దానిమీద తిరగబడ్డం కథవుతుంది. ‘సైరా’ లో బ్రిటిషర్ల బలవంతపు పన్ను వసూలు సమస్య వచ్చింది కాబట్టి దాని మీద తిరగబడి పోరాటం ప్రారంభించాడు సైరా. కథా ప్రారంభానికి అది మూలం. ‘అల్లూరి సీతా రామ రాజు’ లో మన్యంలో బ్రిటిషర్లు ప్రకృతి వనరులు దోచుకుంటున్నారు కాబట్టి దాని మీద తిరగబడ్డాడు అల్లూరి సీతా రామరాజు. కథా ప్రారంభానికి, ఆ మాట కొస్తే చరిత్ర ప్రారంభం కావడానికి ఇది మూలం. ‘జార్జి రెడ్డి’ లో  ఇలాటి ఒక ప్రధాన సమస్యంటూ రైట్ వింగ్ తో  ఏర్పడకపోతే కథెక్కడిది, చరిత్రెక్కడిది?

          ఇంటర్వెల్లో కూడా కథ ప్రారంభం కాని తెలుగు సినిమాలెన్నోఇప్పటికీ చూస్తూంటాం. ఇవి ఇంటర్వెల్ తర్వాత కథలేక సెకండాఫ్ సిండ్రోంలో పడ్డమో, ఇంకేదో కథ అతికించుకుని స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చరవడమో, లేదా సినిమా చివర్లో ఎక్కడో పిసరంత కథ ప్రారంభమై మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవడమో అయి, అట్టర్ ఫ్లాపవడం చూస్తూంటాం. జార్జిరెడ్డి లో కథా ప్రారంభానికి సెకండాఫ్ లో పెట్టుకున్న సమస్య ఏమిటంటే ఎన్నికలు! ఇది ప్లాట్ పాయింట్ వన్ అయ్యే అవకాశం లేదు. అంటే ఎన్నికలతో కూడా కథ ప్రారంభం కానట్టే. అంటే ఇంకా బిగినింగ్ విభాగం ముగియనట్టే. అంటే ప్రారంభం కాని కథకి ఇంకా ఉపోద్ఘాతమే!

          అతడి భావజాలాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండానే ఎన్నికలు పెట్టేశారు. రైట్ వింగ్ తో భావజాలాల సంఘర్షణ చూపకుండానే, సమస్య ఏర్పాటు చేయకుండానే ఎన్నికలు. ఎన్నికలనేవి పాత్రకి ఏర్పాటైన సమస్యని తేల్చుకునే యాక్షన్ తో కూడిన ఒక అవకాశమే అవుతాయి తప్ప, వాటికవి కథకి సాధించాల్సిన సమస్య కాలేవు.1977 లో జనతా పార్టీ గాలిలో పుట్టుకొచ్చి ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఓడించలేదు.1975 లో ఆమె విధించిన  ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ పార్టీ పెట్టి ఎన్నికలు గెలిచారు. ఇలాగే కథా క్రమంలో కూడా ఎదుర్కొంటున్న ఒక సమస్యని పరిష్కరించుకునే సాధనంగా ఎన్నికలనే ఎలిమెంట్ ఎంటరవుతుంది తప్ప ఎన్నికలే సమస్యగా (ప్లాట్ పాయింట్ వన్ గా) ఏర్పాటు కావు.

          రెండోది, ఇంటర్వెల్ ప్రసంగానికి జార్జి రెడ్డి విద్యార్ధుల్ని సమీకరించి మీటింగ్ పెట్టడానికి తగిన కారణమేమీ కన్పించదు. ఢిల్లీ జే ఎన్ యూ లో ఫీజుల పెంపుకి వ్యతిరేకంగా విద్యార్ధులు రోడ్ల  మీది కొచ్చినట్టు - అలాటి వొక బలమైన కారణం గానీ సమస్య గానీ లేదు. ఇంకా జార్జి రెడ్డి జీవితంలో ఒక కీలక చారిత్రక ఉద్యమాన్ని ఈ సినిమాలో పక్కన పెట్టారు.1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం. అప్పుడు ఓయూ లోనే వున్నాడు. ఆ ఉద్యమం పట్ల ఆసక్తి లేదు. కానీ ఆ ఉద్యమంలో కదిలిన విద్యార్ధి లోకాన్ని చూసి, తన ఎజెండాకి కూడా విద్యార్ధుల్ని కదిలించ వచ్చని గుర్తించాడు. తెలంగాణా ఉద్యమం తర్వాత మూడేళ్ళే జీవించాడు. ఈ మూడేళ్ళ కాలంలో లెఫ్ట్ భావజాలంతో ‘పిడియూ’ స్థాపించి, చేగువేరా మోటార్ సైకిల్ డైరీస్ స్టయిల్లో సైకిల్ యాత్ర చేశాడు వరంగల్ కి. అక్కడ కాకతీయ మెడికల్ కాలేజీలో, కాకతీయ యూనివర్సిటీలో ప్రచారం చేశాడు. అతడి జెండా గుర్తు రక్తపు పిడికిలి ముద్ర. నినాదం  ‘జీనా హైతో మర్నా సీఖో, కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో’. 1972 లో ఓయూ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘర్షణలో హత్యకి గురయ్యాడు.


        సినిమాలో తారుమారు చేశారు. ఎన్నికల ప్రకటన తర్వాతే  పైన చెప్పుకున్న నినాదం, జెండా చూపించారు. దీంతో ఎన్నికలు వచ్చే వరకూ జార్జి రెడ్డికి కథకి ఏర్పడాల్సిన గోల్ లేనట్టే  తేలింది. సెకండాఫ్ లో ఎన్నికలు ప్రకటించింతర్వాత అతను హడావిడిగా జెండా తయారు చేయడం చూస్తే, అతను పాసివ్ క్యారక్టర్. ఎన్నికల్లేక పోతే జెండా, ఎజెండా, నినాదం ఏమీ వుండేవి కావా? వూరికే కాలక్షేపం చేస్తూ పాసివ్ గా వుండే వాడా?
              ఇంటర్వెల్ కి ముందు కూడా ఒక సీను జార్జిరెడ్డిని పాసివ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ముంబాయి నుంచి మంచి ఆఫర్ వస్తే, ఆ ఎగ్జిక్యూటివ్ కి ఏమీ సమాధానం చెప్పకుండా వచ్చేస్తాడు. ఆ ఆఫర్ స్వీకరించవద్దని, ఇక్కడే విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలనీ ఫ్రెండ్ అంటే ఏమీ అనకుండా కారు దిగిపోతాడు (జార్జి రెడ్డి కార్లు ఎక్కేవాడు కాదు, రబ్బర్ చెప్పులేసుకుని స్పీడుగా నడిచేవాడు). ఏమిటీ క్యారక్టర్ మనసులో ఏముందో చెప్పకుండా టూమచ్ ఇంటర్నల్ గా వుంటోంది? ఇలాగైతే ఆడియెన్స్ కి క్యారెక్టరెలా అర్ధమవుతుంది? ఆ తర్వాత విద్యార్ధులతో ఇంటర్వెల్ మీటింగ్. అంటే ఫ్రెండ్ చెప్పడం వల్ల - నిజమే తను విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడే వుండి కృషి చేయాలనీ అనుకుని ఈ మీటింగ్ పెట్టాడా? ఇది పాసివ్ క్యారక్టర్ లక్షణమే. యాక్టివ్ క్యారక్టరే  అయితే, ఆ ఎగ్జిక్యూటివ్ కి తనే స్పష్టం చేసేయాలి - తన అవసరం ఇక్కడ స్టూడెంట్స్ కి చాలా వుందని. యాక్టివ్ క్యారెక్టర్ ఇలా ఎసర్టివ్ గా వుంటుంది. అప్పుడా తర్వాత ఫ్రెండ్ తో చెప్పించుకున్న ఫలితంగా ఇలా మీటింగ్ పెట్టుకున్నాడని చులకనయ్యే అవకాశమే వుండదు. ఫ్రెండ్ తో తీసిన ఆ సీనూ లేక, ఆ సీను తీయడానికైన డబ్బులూ మిగులుతాయి. యాక్టివ్ క్యారెక్టర్ చెప్పించుకోడు, తనుగా ఆలోచించి చేస్తాడు, జరిపిస్తాడు. ఎందుకంటే అతను కథా నాయకుడు. కథ తను నడుపుతాడు, ఎవరో చెప్పినట్టు నడపడు. యాక్టివ్ క్యారక్టరైజేషన్లు ఎవరో స్క్రీన్ ప్లే పండితుల స్వకపోల కల్పితాలు కావు తిరస్కరించడానికి. నిజజీవితంలో వ్యక్తిత్వ వికాసం. యాక్టివ్ క్యారక్టరైజేషన్ అనేది వ్యక్తిత్వ వికాసపు  అభివ్యక్తి. పాసివ్ క్యారక్టరైజేషన్ వ్యక్తిత్వ వికాసం లేని అల్పత్వం.

ఒకే  ఒక్క సీక్వెన్స్
            సెకండాఫ్ అంతా ఒకే  సీక్వెన్స్ తో వుంటుంది. మొదట రిసెర్చర్ ముస్కాన్ తో ఒక ప్రెజంట్ టైం సీను. తర్వాత జార్జిరెడ్డి పెట్టిన ఇంటర్వెల్ మీటింగ్ కి ఎబిసిడి వాళ్ళ వ్యతిరేక మీటింగ్. కౌషిక్ ఎమ్మెల్యే సలహా అడిగితే సానుభూతి ప్లే చేసి జార్జి రెడ్డిని కొట్టాలని ఎమ్మెల్యే సలహా ఇవ్వడం. ఎన్నికలు ప్రకటించడంతో, ఒక జెండా అవసరమని జార్జి రెడ్డి జెండా తయారీ, పిడియూ పార్టీ ఏర్పాటు. ఎన్నికల ప్రచారం. మూడు పక్షాల హోరా హోరీ ప్రచారం. కొట్లాట, విజయంతో పాట. ఒక బస్తీలో ఎవరో దౌర్జన్యం చేస్తున్నారని జార్జి రెడ్డికి ఫిర్యాదు. జార్జిరెడ్డి వెళ్లి అడ్డుకోవడం. మాయ ప్రేమ ప్రకటన. జార్జి రెడ్డి ఏదీ తేల్చి చెప్పకపోవడం. జార్జి రెడ్డి మీద గ్యాంగ్ ఎటాక్. బ్లేడ్ ఫైటింగ్. గాయపడిన జార్జిరెడ్డి కోలుకునే ప్రయత్నం. మదర్ సెంటి మెంట్. చిన్నప్పటి దృశ్యాలతో పాట. కోలుకున్న జార్జిరెడ్డి క్యాంపస్ కి రావడం. ఇంకో కొట్లాట. గొడవలు. ఊరేగింపులు. పోలీస్ లాఠీ ఛార్జి. దేశమంతటా సంచలనం. జార్జిరెడ్డి ఉపన్యాసం. 144 సెక్షన్ విధింపు. రాళ్ల దాడులు. లాఠీ ఛార్జి. ఉద్యమాన్ని ఉధృతం చేయాలనీ పిలుపు. పోలీస్ పికెట్... దీని తర్వాత జార్జి రెడ్డి హత్య, కుటుంబ విషాదం, ముస్కాన్ గన్ ని హుస్సేన్ సాగర్ లో విసిరేయడం.

          సెకండాఫ్ గంటంపావంతా ఒకే సీక్వెన్స్ అనేది చాలా విచిత్రమైన కథనం. ఇదే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో కూడా చూస్తాం. ఇందులోనైతే ఇంకా ఫస్టాఫ్ కూడా ఒకే సీక్వెన్స్ వుంటుంది. ఏ సినిమా అయినా ఎనిమిది సీక్వెన్సుల మీద నిలబడుతుంది : ఫస్టాఫ్ లోనాల్గు, సెకండాఫ్ లో నాల్గు. అప్పుడే ఓ సినిమా చూస్తున్నట్టు వుంటుంది.
ఏ సినిమా కథకైనా- అదెంత సిగ్రేడ్ సినిమా అయినా సరే, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ లనే విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేలో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి!

       
ఈ ఎనిమిది సీక్వెన్సులు  బిగినింగ్ లో రెండుమిడిల్ లో నాల్గుఎండ్ లో రెండు వుంటాయి. ఈ సీక్వెన్సుల్ని విశ్లేషించి చూస్తే, ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే. ఒక్కో సీక్వెన్సు ఒక్కో పాయింటుతో రన్ అవుతుంది. అలా ఒక సినిమా కథలోని ఎనిమిది పాయింట్ల మీద రన్ అవుతుంది. ఒక పాయింటు ముగింపు ఇంకో పాయింటు ప్రారంభంగా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభంగా వుంటుంది.
           పైన చెప్పుకున్న కథనం చూస్తే, సెకండాఫ్ లో ప్రారంభమైన కథనం కూడా ఓ కథ కాక పోగా, ఒకే ఎన్నికలనే పాయింటుతో ఒకే సీక్వెన్సుగా  నడిపి ముగించేశారు. దీంతో సెకండాఫ్ ఏం చూశామంటే ఒకే టైం స్పాన్ లో అదే ఎన్నికల ప్రచారాలూ కొట్లాటలూ పోలీసుల చర్యలూ చూశాం. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినట్టు చిత్రణ. కానీ జార్జి రెడ్డి దేశవ్యాప్తంగా తెలిసింది ఇంతకి చాలా పూర్వం భావజాల ప్రచారం చేస్తున్నప్పుడే. ఈ సెకండాఫ్ లో కూడా కథలేక ఏం చూశామంటే ఏమో అన్నట్టుగా తయారయ్యింది. కథే లేని సినిమా అయింది. పైన చెప్పుకున్నట్టు- సెకండాఫ్ సిండ్రోం, ఫ్రాక్చర్డ్ స్క్రీన్ ప్లే, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే ఇవే చూస్తూ వచ్చాం ఇంతకాలం. ఇప్పుడు కొత్తగా అసలు కథేలేని ‘స్క్రీన్ ప్లే’ చూస్తున్నాం. దీనికి కొత్తగా ఏం పేరు పెట్టాలి?         

        రైట్ వింగ్ విరోధంతో ప్రారంభమైన అతడి పోరాటంలోంచి గోల్ - క్యాంపస్ రాజకీయాల కావల నక్సల్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆశయంగా పెరిగింది. సైకిల్ యాత్ర వరంగల్ వెళ్ళినప్పుడు, అక్కడ అజ్ఞాతంలో వున్న నక్సల్స్ ని కలుసుకున్నది ఇందుకే. ఇదేమీ చూపించలేదు ‘బయోపిక్’ లో. ఇంకోటేమిటంటే అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఖాయంగా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి. ఇది కూడా చూపించలేదు. ఈ కోరికలు తీరకుండానే అతడి మరణం సంభవించింది. ముగింపులో ఈ ఆశయాల ఊసెక్కడా లేకపోతే అదెలాటి ‘బయోపిక్’?  బయోపిక్ పాత్ర ఏవో కాలేజీల దొమ్మీల ఫలితంగా చనిపోయాడని చూపిస్తే అది మామూలు రౌడీ పాత్ర. ఓ ఫార్ములా కథ. జార్జి రెడ్డి అనే ఓ భిన్నమైన పర్సనాలిటీ ఆశయాలు తీరకుండానే అర్ధాంతరంగా చనిపోవడం బాధాకర ముగింపు. అది  ఆలోచింప జేస్తుంది.  ఈ ముగింపుని కొనసాగిస్తే, అతడి ఆశయాలకి ప్రతిరూపంగా, అతన్నుంచి స్ఫూర్తిగా  ఎందరెందరు ప్రముఖ నక్సల్ నాయకులు ఉద్భవించారో తెలుస్తుంది. అది సమగ్ర ముగింపు అవుతుంది. 


            
           ఎన్నికల ప్రచారం ఉద్రిక్తల మధ్య పోలీస్ పికెట్ ఏర్పడ్డ తర్వాత అకస్మాత్తుగా ఈ సీను వస్తుంది - రాత్రి పూట జార్జి రెడ్డి ఇంట్లోంచి గన్ తీసుకుని వెళ్తూంటాడు. భోంచేసి వెళ్ళమని తల్లి అంటుంది. మెస్ లో చేస్తానని వెళ్ళిపోతాడు. హాస్టల్లోకి వెళ్తూంటే ఆ చీకట్లో ఎటాక్ చేస్తారు. అతను చేతులతో, బ్లేడుతో ఎదుర్కొంటాడు. గన్ మాత్రం తియ్యడు. అలాగే వాళ్ళ చేతిలో గాయపడి చచ్చిపోతాడు. గన్ తీసుకుని బయల్దేరిందే ఆత్మరక్షణ కోసం అయినప్పుడు దాన్ని తీసి కాల్చి పడెయ్యక పోవడమేమిటి?


          ఈ గన్ ఏదో పోయెటిక్ ముగింపు కోసం అనుకుని ఇలా చేసినట్టున్నారు. ఆ గన్  ముగింపులో ముస్కాన్ హుస్సేన్ సాగర్ లో ఏదో సందేశంతో విసిరేయాలి కాబట్టి దాన్నిలా ‘ఎస్టాబ్లిష్’ చేయడం కోసం జార్జిరెడ్డి కిచ్చి పంపినట్టుంది. ఇది సిల్లీగా వుంది. జార్జి రెడ్డి కిచ్చి పంపిస్తే జార్జి రెడ్డి దర్శకుడు చెప్పినట్టు చేస్తాడా? వాళ్ళందర్నీ కాల్చి పడేసి ముగింపు మార్చేస్తాడు. ముస్కాన్ లేదు, గిస్కాన్ లేదు.


          అసలు జార్జి రెడ్డి దగ్గర ఎప్పుడూ గన్ లేదు. అయినా అతణ్ణి చంపాలంటే చాలా కష్టం. అతను జిమ్ లో వ్యాయామం చేసి బలిష్టంగా వుండేవాడు. సినిమాలో చూపించినట్టు కర్రసాము, కత్తి సాము లేవు. బాక్సింగ్ ఒకటే ఇంటరెస్టు. ఇంకా సినిమాలంటే ఇంటరెస్టు. పోయెట్రీ రాసేవాడు. మద్యం, సిగరెట్లు ముట్టుకునే వాడు కాదు. విద్యార్ధులకి కూడా వీటికి దూరంగా వుండాలని చెప్పేవాడు. 
ఒకసారి అతడి మీద హత్యా ప్రయత్నం చేసిన తర్వాత ఇంకోసారి ఎటాక్ చేయడం అంత సులువనుకోలేదు. అయితే అతను తానుగా వెళ్లి ట్రాప్ లో పడ్డాడు. ఎన్నికలప్పుడు ఆ సాయంకాలం ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ కి వొంటరిగా వెళ్ళి, పోటీ చేస్తున్న అభ్యర్ది మీద ఎటాక్ చేశాడు. దీంతో మూకుమ్మడిగా ఎటాక్ చేసి అతణ్ణి చంపడం సులువైపోయింది...
సికిందర్