రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, నవంబర్ 2016, మంగళవారం

రివ్యూ!



రచన- దర్శకత్వం : కరణ్ జోహార్
తారాగణం : రణబీర్ కపూర్, అనూష్కా శర్మ, ఐశ్వర్యారాయ్, లీసా హెడెన్, ఇమ్రాన్ అబ్బాస్, ఫవాద్ ఖాన్ తదితరులు
మాటలు : నిరంజన్ అయ్యంగార్, సంగీతం: ప్రీతమ్
బ్యానర్ : ధర్మా ప్రొడక్షన్స్
నిర్మాతలు : అపూర్వా మెహతా, హీరూ యాష్ జోహార్, కరణ్ జోహార్
విడుదల : అక్టోబర్ 28, 2016
***
2012 నాటి కరణ్ జోహార్ కీ, ఇప్పటి కరణ్ జోహార్ కీ తేడా -ఏమీ లేదు టేకింగ్ లో అభివృద్ధి తప్ప.  2012  లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కి దర్శకత్వం వహించినప్పుడు, అది ’80 ల నాటి అమ్మమ్మల  సినిమాలా కాలం చెల్లిన వ్యవహారంతో  నవ్వులాటగా వుంది. పాత చాదస్తాలు మరీ ఎక్కువ వుండే కరణ్ జోహార్,  ఆ సినిమాలో స్టూడెంట్స్ చేత పాత పాటలే ధారాళంగా పాడించేశాడు. ఈ కాలంలో స్టూడెంట్స్ ‘ధూమ్ మచాలే ధూమ్’ అంటూ గంతు లేస్తారేమో గానీ, ఏనాటివో తమకి తెలీని  ’70 లనాటి,  ‘లే జాయేంగే లే జాయేంగే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ అని విర్రవీగి పాడుకోరు. ఆ నాటి గాయనీ గాయకులే తెలియరు. ఎల్లారీశ్వరి ఎవరో తెలీని యంగ్ కళాకారులు టాలీ వుడ్ లోనే  బస చేసి వున్నారు. 2012 లో కరణ్ జోహార్ తన పాత అభిరుచుల్ని ఈనాటి పాత్రలకి అంటగట్టి, ఈనాటి ప్రేక్షకుల మీద రుద్ది తృప్తి తీర్చుకున్నట్టు, తిరిగి ఇప్పుడూ అదే పని చేశాడు. పాత సినిమాల రిఫరెన్సుల్నీ, డైలాగుల్నీ, పాటల్నీ యధేచ్చగా  వాడేసి, ఇప్పటి అల్ట్రా మోడరన్ ‘జనరేషన్- వై’ క్యారక్టర్స్ ని చాలా అతి చేసి, అసహజంగా  చూపించాడు. అసలు కథనే చాదస్తంగా ముగించాడు. యూత్ సినిమాలంటే బహుశా- ఇప్పటి యూత్ ని భవిష్యత్తులో మంచి ముసలాళ్ళుగా తయారు చేసేవై వుండాలేమో గానీ,  ముసలి కథలతో వాళ్ళని ఇప్పుడే ముసలి వాళ్ళుగా తయారు చేసేవిగా కాదేమో!

        ‘యే దిల్ హై ముష్కిల్’ కరణ్ జోహార్ అందించిన కొత్త సీసాలో పాత సారా. పాతో కొత్తో, ఏదో ఒక దానికి కట్టుబడి వుంటే ఏ చిక్కూ వుండేది కాదు, రెండూ కలిపేయడంతో కషాయంలా తయారైంది. ‘బాయ్ ఫ్రెండ్స్ సినిమాల లాంటి వాళ్ళు- కొందరు టైంపాస్, కొందరు బ్లాక్ బస్టర్స్’ అని అనూష్కా శర్మ చేత అంత ఫన్నీగా- ట్రెండీగా పలికించగల్గినప్పుడు, అంతే ఫన్ గా- ట్రెండీగా  కరణ్ పనితనమూ వుండాలిగా...

కథ 
      లండన్ లో అయాన్ సంగర్ (రణబీర్ కపూర్) బాగా డబ్బున్నవాడి కొడుకు. గొప్ప సింగర్ నవ్వాలన్న కోరిక పెట్టుకుని తిరుగుతూంటాడు. ఓ బార్లో అలీజే ఖాన్( అనూష్కా శర్మ) పరిచయమై వెంటనే ఒకటైపోతారు ఫ్రెండ్స్ గా. అలీజేకి డాక్టర్ ఫైసల్ (ఇమ్రాన్ అబ్బాస్) అనే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అయాన్ కీ లీసా (లీసా డిసౌజా) అనే గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. అయాన్, అలీజే ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని పబ్స్ కీ, టూరిస్ట్ స్పాట్స్ కీ ఎడాపెడా తిరిగేస్తూ పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తూ వుంటారు. ఓ రోజు ఓ పార్టీలో అలీజే బాయ్ ఫ్రెండ్ డాక్టర్ ఫైసల్, అయాన్ గర్ల్ ఫ్రెండ్ లీసా సెక్స్ చేస్తూ దొరికిపోతారు. దీంతో అలీజే ఫైసల్ తో వెంటనే కట్ చేసుకుంటుంది గానీ, అయాన్ మాత్రం గోలగోల చేస్తాడు లీసా చేసిన పనికి. రోడ్డు మీద పడి పొర్లాడుతాడు. గోడుగోడున ఏడ్చేస్తాడు. అప్పుడు ఇతడిది చిన్న పిల్లాడి మనస్తత్వమని గ్రహిస్తుంది అలీజే. 

        అయాన్ ఇక అలీజే ప్రేమలో రిలీఫ్ పొందాలని చూస్తూంటాడు. అలీజేకి  ఫైసల్ తోనే కాదు, అంతకి ముందు డీజే అలీ (ఫవాద్ ఖాన్) అనే బాయ్ ఫ్రెండ్ తో కూడా బ్రేకప్ అయింది. బాయ్ ఫ్రెండ్స్ తో ఈ అనుభవాల దృష్ట్యా  అయాన్ కూడా తనలాగే ప్రేమలో ఎక్కడ దెబ్బ తింటాడోనని, అతణ్ణి  ప్రేమించకుండా  ప్రేమకి దూరంగా వుంటూ ఫ్రెండ్ షిప్ మాత్రమే చేస్తానంటుంది- ‘ప్యార్ మే జునూన్ హై, పర్ దోస్తీమేఁ సుకూన్ హై’  (ప్రేమలో ఉన్మా దముంది, స్నేహంలో సుఖముంది)  అని చెబుతూ  ఫ్రెండ్ షిప్ ఎంజాయ్ చేస్తూంటుంది. 

        చేసేది  లేక అలాగే ఆమెతో తిరుగుతూంటాడు- ప్రేమలో పడ్డం మన చేతుల్లో లేదు, కానీ ప్రేమకి దూరంగా వెళ్ళిపోవడం మన చేతుల్లోనే వుందని తనని తాను  మోటివేట్ చేసుకుంటూ. ఎప్పుడైతే అలీజే పాత బాయ్ ఫ్రెండ్  డీజే అలీ తిరిగి ప్రత్యక్షమై, తనకింకో ఛాన్సిచ్చి చూడమంటాడో, అప్పుడు అలీజే ఆలోచనలో పడిపోతుంది. అయాన్ ఇరకాటంలో పడిపోతాడు. అలీతో వెళ్ళిపోతున్న అలీజేని దేబిరి మొహం వేసుకుని చూస్తాడు. 

        ఇప్పుడు గోలగోల చేసి ఏడిస్తే ఓదార్చే వాళ్ళే లేరు. కనుక  తానొక ఏడ్పనేదే  తెలీని దసరాబుల్లోడులాగా వుండాలని తనకితానే  ఫీలైపోతూ,  లక్నోలో అలీజే పెళ్ళికెళ్ళి అల్లరల్లరి చేసి పాట పాడతాడు. చివరికి అలీజే మొగుడు డీజే అలీ చేతిలో అవమానపడి వెళ్ళిపోతాడు.

        లండన్ వచ్చి మళ్ళీ షోకిల్లా రాయుడిలా ఫ్రాంక్ ఫర్ట్ కి బయల్దేరుతున్నప్పుడు, ఏర్ పోర్టులో సబాఖాన్ (ఐశ్వర్యా రాయ్) పరిచయమౌతుంది. ఈమె ఉర్దూ కవిత్వం రాస్తుంది, రాసింది చదువుకుంటుంది. ఈమె ఇప్పుడు వియన్నా వెళ్తోంది. ఈమెకి తాహిర్ ఖాన్ (షారుఖ్ ఖాన్ అతిధిపాత్ర) తో విడాకులయ్యాయి. ఈమెతో ఆ కాసేపు పరిచయంలోనే తన భగ్నప్రేమ వెళ్ళ బోసుకుంటాడు అయాన్. ఆమె తను రాసిన కవిత్వం చదువుకోమని ఇచ్చి వెళ్ళిపోతుంది. మూడు నెలల తర్వాత వియన్నాలో ఉంటున్న ఆమెకి ఫోన్ చేసి వెంటనే బయల్దేరతాడు. అక్కడ ఇద్దరూ సెక్స్ చేసుకుంటారు. సహజీవనం మొదలు పెడతారు. అప్పుడు అనుకోకుండా అలీజే వచ్చేస్తుంది. ఈమె రాకతో సబా ఆలోచనల్లో మార్పు వస్తుంది. రాత్రికి రాత్రి అయాన్ ని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేస్తుంది. ఇలా మరోసారి రోడ్డున పడ్డ అయాన్,  లబోదిబోమంటూ అలీజే ఉంటున్న హోటల్ గదికి మారథాన్ రన్ మొదలెడతాడు పరుగుల రాజులాగా...

ఎలావుంది కథ 
     పైన చెప్పుకున్నంతవరకూ సరదా రోమాంటిక్ కామెడీలానే వుంటుంది, అక్కడ్నించీ మాత్రం బరితెగించిన  రోమాంటిక్ డ్రామాలోకి తిరగబెడుతుంది. అలీజేకి క్యాన్సర్ అని తెలియడంతో! క్యాన్సర్!!
        ఎప్పటి క్యాన్సర్ కథలు...ఎప్పటి బాక్సాఫీసు ఫార్ములా!  ఎంత బరితెగింపు! కరణ్ జోహార్ @ 1980 లా తయారయ్యింది. తన రోమాంటిక్ కామెడీతో నేటి యూత్ మానసిక లోకాన్ని ఆవిష్కరించాల్సి వుండగా, అయిపోయిన తన పాత ముచ్చట్లు తీర్చుకునే పనికి పాల్పడ్డం చాదస్తం కాక  ఏమిటి? జానరో రక్షతి రక్షితః అన్నారు. రోమాంటిక్ కామెడీ జానర్ లోకి క్యాన్సర్ ని  తగిలించి విషాదమయ రోమాంటిక్ డ్రామాగా మార్చేస్తే,  దీన్నే జానర్ అనాలి- రోమాంటిక్ కామిడేడ్పు అనే కొత్త జానర్ అనాలేమో.  కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి దాకా జానర్ మర్యాద అనేదే పట్టడం లేదు.

        ఈ ప్రేమ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో అంతు చిక్కదు. ప్రేమ వంకరైనది...ఆ వంకరలోనూ సుఖపడ్డం కేవలం కొంత మందికే వచ్చు- అన్న కథానాయకుడి మాట పట్టుకునైనా ఈనాటి నగర- విదేశీ ‘ప్రేమలు’ ఎలా ముగుస్తున్నాయో, వాటికెలా రెస్పాండ్ అవ్వాలో (రియాక్ట్ కాదు) చూపించివుంటే, ఈ రోమాంటిక్ కామెడీకో అర్ధం వుండేది.

        చూపించిన కథ ప్రకారం చూస్తే, కథానాయకుడి కష్టాలూ చూస్తే, ఒకటే అర్ధమౌతోంది...ప్రేమలు దోమలు బంద్ చేయండి,  బయట అవి మీకు దక్కవు, శుభ్రంగా పెద్దలు చూసిన సంబంధం చేసుకుని అడ్జెస్ట్ అయిపోండి- అని చెప్పాలనుకున్నారేమో! చివరికి ఏ ప్రేయసీ లేకుండానే మిగిలిపోయాడు కథానాయకుడు...స్వగతంతో ఈ కథ చెప్పుకొస్తూ. చాలా  కన్ఫ్యూజన్ గా వుంది ఈ కాన్సెప్ట్!

ఎవరెలా చేశారు
      నిస్సందేహంగా రాజ్ కపూర్ మనవడు రణబీర్ కపూర్ చాలా టాలెంటెడ్ నటుడు. తన తల్లి, నాటి హీరోయిన్ నీతూ సింగ్ పోలికలొచ్చి, తండ్రి రిషీకపూర్ నే తలదన్నే నటవీరుడిగా విరివిగా చలామణిలో వున్నాడు. ‘రాక్ స్టార్’ లో పరమ మ్యాడ్ లవర్ పాత్రతో జ్వాలలు రేపినా, ‘బర్ఫీ’లో మూగవాడి కామెడీతో తెగ నవ్వించినా అతడికే చెల్లింది. ఇప్పుడూ తీసిపోలేదు. ఆమాట కొస్తే ఈ సినిమా ఫస్టాఫ్ అంతా ‘రాక్ స్టార్’ మ్యాడ్ లవర్ పాత్రే. కాకపోతే ఈసారి అమ్మాయిల తాకిడి ఎక్కువ. ఓ అమ్మాయి చేత ప్రేమలో తన్నించుకోవడం, మళ్ళీ ఇంకో అమ్మాయితో తన్నించుకోవడానికి రెడీ కావడం...ఇలా మూడుసార్లు ఫుట్ బాల్ లా అటూఇటూ తన్నించుకుంటూ వుండే క్రేజీ క్యారక్టర్ గా బాగా రక్తి కట్టిస్తాడు. ఇంత మాత్రాన ఇతను పాసివ్ క్యారక్టర్ కాదు. పాసివ్ క్యారక్టర్ అయితే మొదటి  అమ్మాయితో బ్రేకప్ దగ్గరే ఆగిపోయి ఏడుస్తూ కూర్చునే వాడు. ఇలాకాక మళ్ళీ తనే కొత్త ఖాతా తెరిచే యాక్టివ్ నెస్ తో, చొరవతో వుంటాడు. యాక్టివ్ క్యారెక్టర్ ఓడిపోకూడదని లేదు, తన ప్రయత్నాలు చేసి ఓడిపోయే యాక్టివ్ క్యారక్టర్ లోపాలు తెలుసుకుంటాడు.  ప్రయత్నమే చేయకుండా ఓటమిని అంగీకరించి కూర్చునే  పాసివ్ క్యారక్టర్ ట్రాజడీ కథగా  మిగిలిపోతాడు. రణబీర్ కపూర్ పాత్ర మెడకి హీరోయిన్ క్యాన్సర్ అనే ఆ ఒక్క గుదిబండ లేకపోతే,  ఈ ట్రెండీ లవ్ స్టోరీని ఇంకెంత క్రేజీగా ముగించి వుండేవాడో!


         అనూష్కా శర్మ సునాయాసంగా సీన్స్ ని పండించగలదు. ఈ కాలం రిచ్ అమ్మాయిల యాటిట్యూడ్ ని తనే బాగా పోషించగలదు.  కానీ తన పాత్రకి ఒక ఐడెంటిటీ అంటూ లేదు, రణబీర్ పాత్రకి సింగర్ అనే ఐడెంటిటీ వున్నట్టు. బ్రేకప్స్ ని ఈజీగా తీసుకుని- రణబీర్ పాత్రతో ఫ్రెండ్ షిప్ కే కట్టుబడి క్యాన్సర్ దాకా కొనసాగడం పాత్రకున్న చిత్తశుద్ధిని బయటపెడుతుంది గానీ, క్యాన్సర్ టర్నింగ్ తోనే తను ఆడియెన్స్ కనెక్ట్ కోల్పోయింది. సుమారు అరగంట పాటు ఈ క్యాన్సర్ డ్రామాని  తనతో భరించడం కనా కష్టంగా చేసుకుంది. ఒకచోట- ‘మహమ్మద్ రఫీ అంటే తక్కువ పాడి, ఎక్కువ ఏడుస్తాడు ఆయనేనా?’ అని రణబీర్ ముందు తన అమాయకత్వాన్ని వెల్లడించుకుంటుంది (ఈ డైలాగుకి సోషల్ మీడియా అంతా విరుచుకుపడింది కరణ్ జోహార్ మీద, అయినా ఈ డైలాగు తీసేయలేదు). కానీ ఈ అనూష్కా పాత్ర పాయింటాఫ్ వ్యూలో ఈ డైలాగు కరెక్టే. నేటి తరానికి మహమ్మద్ రఫీ ఏం తెలుసు? అందుకే అలా అజ్ఞానంతో మాట్లాడింది. అలాటి నేటి తరం పాత్రకి, పాత సినిమాల్లోలాగా  క్యాన్సర్ తగిలిస్తే, ఆ క్యాన్సర్ కి ఇప్పుడే ప్రేక్షకులు ఫీలైపోయి అయ్యో పాపమని చూస్తారు? ఇప్పుడు అంకిత్ తివారీ లాంటి సింగర్ ఉదాహరణ కావాలి;  క్యాన్సర్ కి బదులు, నేటి యువతుల ఆధునిక జీవన శైలుల పుణ్యమాని, అప్పుడే మెనోపాజ్ ప్రాప్తించి, ఇక పిల్లలు పుట్టని స్థితికి చేరుకుంటున్న- పెళ్లి అవకాశాలు చట్టుబండలు చేసుకుంటున్న - కొత్త సమస్య గురించి చెప్పాలి. ఇంకా క్యాన్సర్ తో ముసలి డ్రామా ఇప్పుడెవరికి కావాలి. 


       ఇక ఐశ్వర్యారాయ్ తన ఫిట్నెస్ తో, కాపాడుకుంటున్న గ్లామర్ తో హూందాగా కన్పిస్తుంది పాత్ర ప్రకారం. పాత్ర మాత్రం డొల్లగా మిగిలిపోయింది. ఈమెని చూస్తే ‘పాకీజా’లో మీనా కుమారి పాత్ర గుర్తు కొస్తుంది. వెలయాలిగా మీనాకుమారి కవితాత్మకంగా వెల్లడించే హృదయబాధలాంటిది ( హర్ తవాయీఫ్ యేక్ లాష్ హై) ఒక డైవోర్సీగా తనూ  బాధని ప్రకటించి వుంటే పాత్ర వికసించేది. కవిత్వంతో రణబీర్ పాత్రని కట్టి పడేసిందీ లేదు. ‘కవయిత్రి పెళ్లి చేసుకోవాలి, అప్పుడు భర్తతో ఓకే అయితే మంచిదే, కాకపోయినా లాభమే, ఇంకా మంచి కవిత్వం వస్తుంది’ - అనే ఈమె, అలాటి మంచి కవిత్వం ఏం రాసిందో తెలీదు- భర్తతో విడాకులాయ్యాక. కవిత్వం కంటే రణబీర్ పాత్రతో ఇన్ స్టెంట్ రిలేషన్ షిప్, సెక్సూ సహ
జీవనమూ  ఇవే డామినేట్ చేస్తాయి. ఈ వయసులో ఈమెకిది ప్రేమో, మోహమో ఏమో...ఏమీ అర్ధంగాదు.


        ఈ సినిమాలో నటించి వివాదాస్పదుడైన పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ మీద సీన్లు తక్కువే. హోలీ సీను, పెళ్లి సీనూ ఇతడి మీద అద్భుతంగా తీశారు. ఈ కథ ఈ ఐదారు పాత్రల చుట్టే తిరుగుతుంది, వచ్చి పోయే బ్యాక్ గ్రౌండ్ పాత్రలు చాలా వున్నాయి. డైలాగ్  వెర్షన్ లో భాగంగా రణబీర్, అనూష్కాలు పాత పాటలు వల్లించడం (కొన్ని పాత సినిమాల డైలాగులు కూడా) వదిలేస్తే, సినిమా కోసం సంగీత దర్శకుడు ప్రీతమ్ ట్యూన్ చేసిన సాంగ్స్ ఫెంటాస్టిక్ గా వున్నాయి. వీటి చిత్రీకరణ కూడా హైలైట్ అనే చెప్పాలి. అదొక అద్భుత ఊహాప్రపంచం. అలాగే ఐయాన్ ఆండ్ర్యూస్ కళా దర్శకత్వం గానీ, మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ డిజైనింగ్ గానీ విజువల్ గా చాలా టాప్ రేంజికి తీసికెళ్ళాయి సినిమాని. ఇక అనిల్ మెహతా ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.



        నిరంజన్ అయ్యంగార్ రాసిన మాటలు రణబీర్, అనూష్కాల పాత్రల రీత్యా ట్రెండీ గానే వున్నప్పటికీ, ఈ ట్రెండీ నెస్ ని కిచిడీ చేస్తూ పాత్రలకి అతకని ఫిలాసఫికల్ డైలాగులూ వున్నాయి. సెకండాఫ్ లో ఐశ్వర్యారాయ్ కి సరేసరి. మీనాకుమారిలా పాత్రకి డెప్త్ వుంటే అయ్యంగార్ డైలాగులూ ఇంకా బాగా వచ్చేవేమో. 

        కరణ్ జోహార్ దర్శకత్వంలో ఏ లోటూ లేదు, పైగా కొత్త దర్శకుల టేకింగ్ ని బలాదూరు చేసేట్టు వుంది. ఇందులో సాధించిన విజయం మిగతా కథాకథానాల, పాత్ర చిత్రణల విషయంలో, మొత్తంగా కాన్సెప్ట్ పరంగా సాధించలేక పోయాడు కరణ్. నిడివి రెండు గంటలా 40 నిముషాలు చాలా ఎక్కువ. చాలా నిడివిని  క్యాన్సరే తినేసింది!

 నాణేనికి మరో వైపు
     పైన చెప్పుకున్న ప్రేమ కథ గానీ, పాత్రలుగానీ, ఆ చెప్పుకున్నంత సాదా సీదాగా లైటర్ వీన్ గా ఏమీ వుండవు. రణబీర్, అనూష్కాల నవతరం పాత్రలకి పాత చాదస్తాల మోతబరువు బ్యాగేజీ చాలా ఎక్కువ.  కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లో లాగే, మాటాడితే పాత సినిమా పాటెత్తుకుని వీరంగం వేస్తారు యువనటులూ పాత్రలూ అయిన రణబీర్, అనూష్కాలు. సింగర్ అవ్వాలనుకుంటున్న రణబీర్ ని పాడమని అనూష్కా అడిగిందే తడవు- ‘గాతా రహే మేరా దిల్’  అని కిషోర్ కుమార్ పాట ఎత్తుకుంటాడు. 1965 నాటి ‘గైడ్’ లోని ఈ పాట ఇప్పుడు 51 ఏళ్ల తర్వాత ఎంతమందికి తెలిసివుంటుంది? బహుశా నడివయసు వాళ్ళకి, ఆపై వయసు వాళ్లకీ తెలుస్తుందేమో ఎంజాయ్ చేయడానికి. సినిమాలో కూడా ఈ ఏజ్ గ్రూప్ పాత్ర పాడుకుంటే అతుకినట్టు వుంటుంది. యువ పాత్రకి చాలా చాలా ఎబ్బెట్టుగా, నీచంగా వుంటుంది. యువ పాత్రకి ఈ పాటలు తెలిసి వుండే అవకాశంలేదు. ఇంకా చెప్పాలంటే చిట్ట చివర్లో ఏనాటిదో లతామంగేష్కర్ పాడిన పాట కూడా ఎత్తుకుంటారు రణబీర్, అనూష్కాలు కలిసి! ‘ఈ ట్రాజడీలో మనం ఏం చేయాలి? ఆర్డీ బర్మన్ పాటలు పాడుకోవాలి-‘ అని చెప్పుకుని ‘జైజై శివ్ శంకర్...’ అంటూ మొదలెట్టి ఆర్డీ పాటలు కొన్ని పాడి పడేస్తారు! ఇప్పుడు ఆర్డీ బర్మన్! ఇలా తెరమీద  జరిగేదంతా ఈ సినిమా కొచ్చిన యువప్రేక్షకులకి తెలియని, సంబంధం లేని ‘సబ్జెక్టివ్’ వ్యవహారమే. సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ‘ఆబ్జెక్టివ్’ గా వుండాలని పెద్దలు చెప్తారు. 

       అసహజంగా రఫీ పిచ్చిగల రణబీర్ యువ పాత్ర, పారిస్ వెళ్ళగానే నైట్ క్లబ్ లో- ‘ఏన్ ఈవెనింగ్ ఇన్ పారిస్’ లో రఫీ పాడిన టైటిల్ సాంగ్ పాడేస్తుంది. శంకర్- జైకిషన్ ల సారధ్యంలో 1967 నాటి ఈ సూపర్ హిట్ సాంగ్ 49 ఏళ్ల తర్వత ఇప్పుడెందరికి తెలుస్తుంది-  పాడుతున్న పాత్రతో పాటు ఊగిపోతూ ఎంజాయ్ చేయడానికి? ఇలా దర్శకుడు తన కాలంనాటి సొంత టేస్టులన్నీ ఈనాటి పాత్రల మీద, ప్రేక్షకుల మీదా రుద్ది రంధి తీర్చుకుంటున్నట్టు వుంటుంది.

          ఇంకా వుంది- అనూష్కా తనకి శ్రీదేవిలా చీరకట్టుకుని పాడుకోవాలని వుందని చెప్పి- ఎల్లోసారీ కట్టుకుని ‘చాందినీ’ లో శ్రీదేవి సాంగేసుకుంటుంది! అంతకి ముందు రణబీర్ ‘కోరా కాగజ్ థా యే దిల్ మేరా’  అనే 47 ఏళ్ల నాటి మరో కిషోర్ సాంగ్ ని హమ్ చేస్తాడు!

        ఇప్పుడో అమ్మాయి కరీనా కపూర్ లానో, కత్రినా కైఫ్ లానో కత్తిలా చీర కట్టుకుని వాళ్ళ పాటేదైనా వుంటే ఎగిరెగిరి స్టెప్పు లేస్తుందేమో? హస్కీ వాయిస్ తో సునిధీ చౌహాన్ పాడే ‘బరస్తా హై బాదల్ బరస్తా’ సాంగ్ తో దుమ్ము రేపేస్తుందేమో? అసలు రణబీర్ తాను  మహమ్మద్ రఫీలా సింగర్ అవ్వాలనుకుంటున్నానని అనడం మరీ చోద్యం గాక పోతే ఏమిటి?  కరణ్ జోహార్ రఫీ కాలేకపోయిన పాత కోరికని తను తీర్చడమేమిటి ప్రేక్షకుల ప్రాణాల్ని బలిపెట్టి? తన పాత్ర కోరిక తీర్చడానికి  శంకర్ మహదేవన్, యోయో హనీ సింగ్, మికా సింగ్, ఆతిఫ్ అస్లం ఎవరూ ఈ కాలానికి తగ్గట్టు లేనట్టు. 

        పాటలతో పాట్లు ఇలా వుంటే- ఇక మాటల విషయానికొస్తే ఒకపక్క - ‘ప్రేమలో ఉన్మాదముంది, స్నేహంలో సుఖముంది’ లాంటి క్రేజీ డైలుగులు పలుకుతూనే, మరోపక్క-  ‘లోగ్ అక్సర్ కహెతే హై నా కీ దిల్ దిమాగ్ కే  బీచ్ మేఁ దిల్ కీ సున్నీ  చాహియే...లేకిన్ జబ్ దిల్ టూట్ జాతా హైతో ఉస్ సే బెహతర్ అడ్వైజ్ తో దిమాగ్ హీ దేతా హై...’  (మనసు చెప్పేది వినాలా, బుద్ధి చెప్పేది వినాలా అన్నప్పుడు, మనసు  చెప్పేదే  వినాలని అంటారు..కానీ మనస్సు విరిగిపోయినప్పుడు బుద్ధి మాత్రమే మంచి సలహా ఇస్తుంది)  లాంటి సాహిత్య సౌరభాలతో గుబాళించే బరువైన రాజభాష మాట్లాడుకోవడం రసభంగం కల్గించే వ్యవహారంలాగా వుంటుంది- పాత పాటల మోజులాగే.

        ఈ కథ ఫస్టాఫ్ రణబీర్- అనూష్కాల రణగొణ ధ్వనుల ప్రేమలతో వుంటుంది. సెకండాఫ్ కొచ్చేసరికి ఇది ఐశ్వర్యా రాయ్ పాత్రతో, ప్రశాంత తటాకంలా మారిపోవాలి. ఈ ప్రశాంత తటాకపు అనురాగఝరిలో  రణబీర్ పాత్ర తాలూకు క్యారక్టర్ ఆర్క్, గ్రోత్ కన్పించాలి. ఐతే ఇది ప్రశాంత తటాకంలా ప్రేక్షకుల మనస్సులో ముద్రేసుకుని డిఫరెంట్ గా కనపడాలంటే, ఫస్టాఫ్ లో ప్రశాంత తటాకం తాలూకు ఫిలాసఫీ, గాంభీర్యం లాంటివేవీ రణబీర్- అనూష్కాల పాత్రల మధ్య కనపడకూడదు. ఫస్టాఫ్ కేవలం  పిచ్చి పిచ్చి డైలాగులతో, మదపిచ్చి ప్రేమలతో అల్లకల్లోలంగా చూపిస్తే, సెకండాఫ్ లో ఐశ్వర్యారాయ్ పాత్రతో దాన్ని ఒక కొలిక్కి తేవచ్చు. నిజానికి ఐశ్వర్యారాయ్ పాత్ర పాత సాంప్రదాయానికి ప్రతీక లాంటిది. దీన్ని దర్శకుడు చంపేశాడు. విన్ స్టన్ చర్చిల్ అంటాడు- పాత సాంప్రదాయమనే ములు గర్రతో పొడుస్తూ వుండకపోతే, ఆధునికత్వమనే గొర్రెల మంద చెల్లాచెదురై పోతుందని! శంకరాభరణం శంకర శాస్త్రి గొడవ కూడా ఇదే కదా-  ముందు సాంప్రదాయ సంగీతం నేర్చుకోండ్రా, అప్పుడు మీ కారుకూతల మ్యూజిక్ దార్లో వుంటుందనేసి?


     ఐశ్వర్యా రాయ్ రణబీర్ కి ఇలా ఒక గైడ్ లా వుండాల్సింది- చంద్రముఖి దగ్గర దేవదాసు సాంత్వన పొందినట్టు. అనూష్కా తో గోలగోల ప్రేమ ముగిశాక, ఐశ్వర్య దగ్గరకి రణబీర్ వచ్చినప్పుడు ఒక ప్రశాంతవాతావరణం కన్పించి, ఆమె కవిత్వంతో ఇన్స్పైర్ అయి, జీవితంలో మొదటిసారిగా కవితాత్మక ధోరణిలో-  ‘పాకీజా’ లో రాజ్ కుమార్ లా- ‘ఇస్ ఘర్ కే ఇన్సానోఁ కో హర్ సాన్స్ కే బాద్ దూస్రే సాన్స్ కే లియే భీ- ఆప్సే ఇజాజత్ లేనీ పడ్తీ హై...’ (ఈ ఇంట్లో మనుషులకి ఊపిరి పీల్చిన ప్రతీసారీ ఇంకో ఊపిరి కోసం కూడా మీ అనుమతి పొందాల్సి వుంటుంది) - లాంటి గుబాళింపు భాష ఇక్కడ మాట్లాడ్డం ప్రారంభిస్తే, క్యారెక్టర్ లో ఈ సర్పరైజ్ ఎలిమెంట్ కి ప్రేక్షకులు ఉలిక్కిపడి,ఇక్కడ్నించీ ఫ్రెష్ ఫీలింగ్ తో నిశితంగా గమనించే వీలుండేది. 

        ఆమె కవయిత్రి- అతను  గాయకుడూ అయినప్పుడు, ఈ సంబంధాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒట్టి లవర్స్ గా కలిపేశారు. అతను మామూలోడు కాదు, దేన్నైనా అందిపుచ్చుకుని  ఓ ఆటాడుకునే రకం. అలాటి వాడు ఆమె కవిత్వంతో తనలోని గాయకుణ్ణి మెరుగులు దిద్దుకుని గ్రేట్ సింగర్ గా మెరిసిపోగలడు. ఆమె వైవాహిక జీవితంలో దెబ్బతింది, తను ప్రేమలో దెబ్బ తిన్నాడు- ఇలాటి ఇద్దరి కలయిక కళ కోసమే అయ్యుంటే గొప్పగా వుండేది. ఇలాటిది సంజయ్ లీలా భన్సాలీ చేసి, ఎక్కడికో తీసికెళ్ళి పోగలడు. కరణ్ జోహార్ వీళ్ళిద్దరి మధ్య క్షణికమైన శారీరక సంబంధం ఏర్పాటుచేసి సాధించిందేమిటో అర్ధంగాదు. వీళ్ళిద్దరి సంబంధం ఖాయం కాదని ప్రేక్షకులు గ్రహించగలరని కరణ్ కి తెలుసు. అవతల ఎంత పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా అసలు హీరోయిన్ అనూష్కా పాత్ర బ్యాలెన్స్ గా వుండనే వుంది. మళ్ళీ ఏదో జరిగి ఎప్పుడో తిరిగి వస్తుందని ప్రేక్షకులు తమ అనుభవసారంతో ఇట్టే  ఘాట్టిగా పసిగట్టేయగలరనీ కరణ్ కి తెలుసు. అలా వీళ్ళిద్దరికీ పెళ్లితో ముగింపు అనే మాటకి తావే లేనప్పుడు, సెక్స్ చేయించడం దేనికి? సెక్స్ బదులు సంగీత సాహిత్యాలేవో  వాళ్ళముందు పడేస్తే పోదా? సీనియర్ నటి ఐశ్వర్యా రాయ్ పాత్రని చర్చిల్ కొటేషన్ ప్రకారం సాంప్రదాయ విలువలకి కాణాచిగా మార్చి, పెడ ధోరణి ప్రేమల్ని దారిలో పెడుతూ రణబీర్ పాత్ర కళ్ళు తెరిపించేదిగా చిత్రిస్తే ఏమయ్యేది?
        ఇక దీని తర్వాత క్యాన్సర్ పర్వం లోకి మనం పోనవసరం లేదు.


స్క్రీన్ ప్లే సంగతులు
       సౌలభ్యం కోసం దీన్ని కథ అంటూ చెప్పుకొచ్చాం గానీ, ఇది కథేనా, లేకపోతే గాథా అన్న సందేహాలు బయల్దేరతాయి. కథ అనుకోవడానికి ఇందులో ప్రతీసారీ ఓటమిని పొందే హీరోతో ఆర్గ్యుమెంట్ లేదు. జడ్జే మెంట్ లేదు. జడ్జ్ మెంట్ వుండని స్టేట్ మెంట్ లా గాథలాగా సాగిపోతూ వుంటుంది ప్రవాహం- ఒక ఇంటర్యూ ఇస్తూ హీరో చెప్పుకొచ్చే తన అనుభవాలతో. 

        మొదటి హీరోయిన్ ది ప్రేమ కాదు, కేవలం ఫ్లర్టింగ్. మెయిన్ హీరోయిన్ ఫ్రెండ్ షిప్ అంటూ వెళ్ళిపోయింది. రెండో  హీరోయిన్ మెయిన్  హీరోయిన్ మీద హీరో ప్రేమ చూసి వెళ్ళ గొట్టింది. మళ్ళీ మెయిన్  హీరోయిన్ ప్రేమకి పనికి రాకుండా క్యాన్సర్ పేషంట్ అయి వచ్చింది. ఇలా ఎక్కడా ఒక గీత గీసి- ఇప్పటి ప్రేమల్లో  ఇదీ తప్పు, ఇదీ ఒప్పూ  అనే పాయింటుతో ఆర్గ్యుమెంట్ కీ, దానికి జడ్జిమెంటు కీ అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి ఇది ఓ కథలా అన్పించదు. కేవలం వివిధ అమ్మాయిలతో హీరో అనుభవాల తాలూకు ఒక గాథ. అంటే ఐడియాని నిర్మించుకుంటున్న మొదటి అడుగులోనే తప్పటడుగు పడిందన్న మాట. 

        సరే, గాథలు కమర్షియల్ సినిమాలకి పనికి రావంటున్నప్పుడు ఈ సినిమా ఇంత హిట్టెలా అయిందని అనొచ్చు. ఈ సినిమాని చుట్టు ముట్టిన వివాదాలే కలిసివచ్చాయేమో. పైగా పెళ్ళయాక ఐశ్వర్యారాయ్ కన్పిస్తున్న మొదటి సినిమా ఇదే. పైగా కరణ్ జోహార్ సినిమా కూడా ఇది. ఇలాటి కొన్ని బాహ్య ఆకర్షణలు ప్రేక్షకుల్ని భారీగా రాబట్టాయేమో. తీరా లోపలి కెళ్తే కదా సినిమాతో అసలు పరిస్థితి తెలిసేది. 


        కరణ్ జోహార్ ‘కథ’ ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ ఎలాగో వర్కౌట్ అయిపోయినా, క్రియేటివ్ యాస్పెక్ట్ ఎలా వుందో పైన చెప్పుకుంటూ వచ్చాం. ఐడియాని మూడు మూలస్థంభాలు, రెండు పిల్ల స్థంభాల మధ్య సర్ది స్ట్రక్చర్ చేసిన విధానం బాగానే వుంది గానీ, ఈ స్థంభాల మధ్య నడిపించిన విషయమే దీని ద్వారా ఏం చెప్తున్నారో అర్ధంగాని గందరగోళాన్ని సృష్టించింది. పైన చెప్పుకున్నట్టు- బయట ప్రేమల్లో పడకండి, అమ్మాయిలు చెత్త- ఇంట్లో చూసిన  చక్కటి సంబంధం బుద్ధిగా చేసుకు చావండి- అనేట్టు వుంది. దర్శకుడు పక్కా స్త్రీ ద్వేషి అన్నట్టు తయారయ్యింది. 



       అరగంటలో వచ్చే మొదటి గర్ల్ ఫ్రెండ్ సెక్స్ సీన్ తో హీరో భూమ్యాకాశాలు ఏకం చేసే దగ్గర మొదటి మూల స్థంభం - ప్లాట్ పాయింట్ వన్ - ఏర్పడింది. ఇప్పుడు ఈ మిడిల్ వన్ విభాగం బిజినెస్ ప్రకారం  ప్రేమ వద్దనీ, ప్రెండ్ షిప్పే కావాలనీ అనే మెయిన్ హీరోయిన్ తో హీరో చేసే స్ట్రగుల్ చూపించుకొచ్చారు. హీరోయిన్ మొదటి బాయ్ ఫ్రెండ్ తిరిగి ప్రత్యక్షమై అతన్తో హీరోయిన్ వెళ్లిపోవడంతో ఇంటర్వెల్ కి దారి తీసే మొదటి పిల్ల మూలస్థంభం - పించ్ వన్- ఏర్పాటు చేశారు. మెయిన్ హీరోయిన్ పెళ్ళితో ఇంటర్వెల్. దీని తర్వాత మిడిల్ టూ విభాగంలో, హీరో స్ట్రగుల్ కొనసాగిస్తూ  సెకెండ్ హీరోయిన్ అయిన కవయిత్రితో రిలేషన్ షిప్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి మెయిన్ హీరోయిన్ రావడంతో రెండో మూలస్థంభానికి దారి తీయించే రెండో పిల్ల స్థంభాన్ని - పించ్ టూ- ఏర్పాటు చేశారు. రెండో హీరోయిన్ వెళ్ళ గొట్టడంతో హీరో వెళ్లి మళ్ళీ మెయిన్ హీరోయిన్ ని కలుసుకుని, ఆమె క్యాన్సర్ పేషంటని తెలుసుకోవడంతో రెండో మూల స్థంభం- ప్లాట్ పాయింట్ టూ - ఏర్పాటు చేశారు. ఇక్కడ్నించి ఎండ్ విభాగమంతా క్యాన్సర్ సంగతులు, ఇద్దరి స్ట్రగుల్, ఆమె మరణం వగైరాలతో ముగింపు. 

        మొదటి మూలస్థంభం గర్ల్ ఫ్రెండ్ మోసంతో హీరో చేసే అల్లరితో- ఫిజికల్, విజువల్ యాక్షన్తో గుర్తుండిపోయేలా బాగా ఎలివేట్ అయ్యింది. రెండో మూలస్థంభం కూడా విజువల్ గానే వుంది గానీ, ఎలివేట్ అవకుండా ఉస్సూరన్పించేలా వుంది- హీరోయిన్ క్యాన్సర్ అని చూపించడంతో! 


        రోమాంటిక్ కామెడీ, రోమాంటిక్ డ్రామాగా ట్రాజడీగా మారిపోవడం, ఫస్టాఫ్ ట్రెండీ పాత్రలకి అవసరం లేని పాతవాసనల పాటలూ మాటలూ పెట్టడం, సెకండాఫ్ లో సెకెండ్ హీరోయిన్ తో ఏ ప్రయోజనమూ లేకపోవడం వంటి కొట్టొచ్చే లోపాలతో -అసలేం తేల్చారో చెప్పని సందిగ్ధంతో, చూశామంటే ఏదో చూశామన్నట్టు వుంటుంది కరణ్ కళాపోషణ.



-సికిందర్
http://www.cinemabazaar.in

       



 



       


       
















13, నవంబర్ 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు!

        


    

యాక్సిడెంట్ దృశ్యాన్ని కళాత్మకం చేస్తూ ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేయడం, హీరో ని ఇంకో అవతారంలో  చూపిస్తూ ప్లాట్ పాయింట్ టూని సృష్టించడం, టైం లాప్స్ ని టైమర్ ద్వారా చూపించడం వంటి మూడు వినూత్న స్క్రిప్టింగ్  టెక్నిక్స్ ని ప్రదర్శించిన స్క్రీన్ ప్లే తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సకాలంలో మూడేళ్ళ క్రితమే ప్రేక్షకుల ముందు కొచ్చి వున్నా, అలరించాలంటే, మౌలికంగా కథతో పాత్రతో వున్న సమస్యలు తలనొప్పిగానే వుంటాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ నాగచైతన్య పాత్రని  ‘గాడ్ ఫాదర్’ లోని గాడ్ ఫాదర్ చిన్న కొడుకు మైకేల్ కార్లియోన్ స్ఫూర్తితో సృష్టించామన్నారు. ఇతను దుష్ట పోలీసు అధికారి కెప్టెన్ మార్క్ మెక్ క్లస్కీ మీద పగదీర్చుకునే అంశం ఆధారంగా కథ చేశామన్నారు. అయితే మీనన్ మిస్ అయ్యిందేమిటంటే,  మైకేల్ పగకి తన తండ్రి మీద మెక్ క్లస్కీ చేసిన హత్యాయత్నం అనే కారణంతో ప్రత్యక్ష భావోద్వేగాలున్నట్టు, నాగచైతన్య పాత్రకి కల్పించక పోవడం. కారణం, మీనన్ కథలో పోలీసు అధికారి వచ్చేసి హీరోయిన్ కుటుంబానికే హాని చేయడం....

         ఇందుకే కావొచ్చు, మీనన్ వేరే టర్న్ తీసుకున్నారు- తనకి సంబంధం లేని గొడవలో నాగచైతన్య పాత్ర  చిక్కుకుని, ఆత్మ రక్షణ కోసం హత్యలు చేయాల్సివస్తున్న పరిస్థితితో ఆ పోలీసు అధికారితో తలపడే పాత్రగా చేయాలనుకున్నారు. మరి దీని మీదైనా ఎంతవరకు నిలబడ్డారు?

        అసలు ఒక లైనుగా చెప్పుకోవాలంటే ఈ కథని ఎలా చెప్పుకోవాలి? ఓ సామాన్య  యువకుడు అనుకోకుండా ఓ హింసాత్మక సందర్భంలో ఇరుక్కుంటే ఏమవుతుంది?- అని చెప్పుకోవచ్చా? కథ చూస్తే ఇలాగే వుంది. ఈ కథకి  ఐడియా ఇదే అయితే, ఇందులో బిగినింగ్ (సామాన్య యువకుడు), మిడిల్ (అనుకోకుండా ఓ హింసాత్మక సందర్భంలో ఇరుక్కోవడం), ఎండ్ (అప్పుడేమవుతుంది?) మూడూ కన్పిస్తాయి. సమస్య ఎక్కడ వచ్చిందంటే,  అప్పుడేమవుతుంది? అన్న ప్రశ్నకి  చూపించిన  పరిష్కారం దగ్గరే సమస్య వస్తోంది. కథలో చూపించిన ప్రకారం- ఓ సామాన్య యువకుడు అనుకోకుండా ఇరుక్కున్న ఓ హింసాత్మక సందర్భాన్ని తనే పోలీసు అధికారిగా మారి పరిష్కరించుకున్నాడు-అనే అర్ధంలోనే  ఈ లైను వస్తోంది. చివరికతను పోలీసు అధికారిగానే మారిపోయి సమస్య పరిష్కరించుకున్నాడన్న మాట ఈ క్లయిమాక్స్ లో.

       ఇందులో తప్పేం లేదు, ఇది మూస ఫార్ములా మాస్ కథ అయివుంటే ఈ అవాస్తవిక, ఆచరణ సాధ్యం కాని- కాలక్షేపానికి పనికొచ్చే పరిష్కార మార్గంతో ఎలాటి అభ్యంతరం వుండదు. అయితే ఈ సినిమా జానర్ వచ్చేసి, ఇలా పోలీసు అధికారిగా మారిపోయే సినిమాటిక్- అవాస్తవిక -మూస ఫార్ములా మాస్ జానర్ కాదు. అంతవరకూ బిగినింగ్, మిడిల్ లతో రియలిస్టిక్ అప్రోచ్ తో నడుస్తున్న సెమీ రియలిస్టిక్ జానర్ ఇది. దీనికి ప్రేక్షకులకి పని కొచ్చే- జీవితాల్లో సాధ్యమయ్యే  రియలిస్టిక్ పరిష్కారమే చూపించాలి. ఇదే జరగలేదు. సెమీ రియలిస్టిక్ కథకి మూస ఫార్ములా ముగింపు ఇచ్చి జానర్ మర్యాదని చెడగొట్టుకున్నారు. ఎండ్ విభాగంలో నాగచైతన్య ధూమ్ ధామ్ చేస్తూ డీసీపీ రజనీ కాంత్ గా వస్తే, ఇందుకే నవ్వుకున్నారేమో కొందరు ప్రేక్షకులు. అంతవరకూ మన కెదురైతే మనమెలా సమస్యతో స్ట్రగుల్ చేస్తామో అలా సహజంగా స్ట్రగుల్ చేస్తూ వున్న నాగచైతన్య పాత్ర – ఉన్నట్టుండీ  డీసీపీ రజనీకాంత్ గా వస్తే- నవ్వకేం చేస్తారు. జీవితంలో మనకి సాధ్యమవుతుందా రజనీకాంత్ లా రావడం? సాధ్యం కాని పరిష్కారా లెందుకు. కాలక్షేపానికైతే సినిమా సాంతం కాలక్షేప బఠానీ లాగే చూపించుకు రావాలే తప్ప- రియలిస్టిక్ గా చూపించుకొస్తూ- వేళాకోళం కాలక్షేపంగా ముగిస్తే – ఆడియెన్స్ మూడ్ ని చెడగొట్టినట్టే.

                                                                     ***
      చెప్పొచ్చేదేమిటంటే, ఐడియాలోనే అంతా వుంటుందని- దర్శకుడు, హీరో, నిర్మాత అందరి జాతకాలూ దాంతోనే ముడిపడి వుంటాయని.  చూడాలా వద్దా అని ప్రేక్షకులు భయపడకుండా చూడగలిగే భద్రత కూడా ఐడియాలోనే వుంటుందని. పది నెలలు కథని రాసుకుంటూ కూర్చునే ముందు ఓ నెల పాటు ఐడియాతో తలపడాలని. మీనన్ ఐడియాకి వచ్చేసి మార్కెట్ యాస్పెక్ట్ తో బాటు క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా కొరవడ్డాయి. మార్కెట్ యాస్పెక్ వచ్చేసి ఆయన ఐడియాకి – రియలిస్టిక్  సినిమా + టార్గెట్ ప్రేక్షకులు యువకులే (యువతులు కాదు) + జానర్ మర్యాదగా వుండాలి. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి- ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్ గా వుండాలి. మీనన్ ఐడియాకి మార్కెట్ యాస్పెక్ట్ ఎలా వుందో పైన చూశాం. ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ విషయాని కొస్తే – ఆర్గ్యుమెంట్, స్ట్రక్చర్, లాగ్ లైన్ ఈ మూడూ కుదిరేదాకా ఐడియా మీద వర్క్ చేశాకే, స్క్రిప్టుతో  ముందు కెళ్లాలన్న గుణపాఠాన్ని వారం వారం ఎన్నో సినిమాల్లాగే ఇదీ నేర్పుతోంది. ఐడియా డీఎన్ఏ బాగోకపోతే ఇంకేదీ బాగోదు. జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా అవసరం. 

        కరణ్ జోహార్ తీసిన తాజా  ‘యే దిల్ హై ముష్కిల్’ కూడా సరీగ్గా మీనన్ పోకడలే పోయిందని గమనించవచ్చు. అల్ట్రా మోడరన్ ప్రేమ కథకి పాత మూస ఫార్ములా రొటీన్ ముగింపుతో జానర్ మర్యాద చెడింది.


***
బిగినింగ్ :
       
హీరో స్వగతంతో ప్రారంభమవుతుంది కథ. తనకి జరిగింది ఏదో అస్పష్టంగా చెబుతూంటే దాని తాలూకు మాంటేజెస్ పడుతూంటాయి. హింస, రక్తపాతం దృశ్యాలూ, ఒక రాజకీయ నాయకుడి క్రౌర్యమూ  కన్పిస్తాయి. ఈ కవరింగ్ ఇచ్చాక, హీరో జీవితంలోకి వస్తుంది కథ. తల్లిదండ్రులతో, ఒక చెల్లెలితో వుండే హీరో,  ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక, ఎంబీఏ చేసి ఉద్యోగమూ రాక, ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూంటాడు. ఓ రోజు చెల్లెలి ద్వారా హీరోయిన్ పరిచయమవుతుంది. ఈమె స్క్రీన్ ప్లే కోర్సు చేస్తూంటుంది. ఈమెని చూసి ప్రేమలో పడతాడు హీరో. కానీ వ్యక్తం చేయలేకపోతాడు. కన్యాకుమారి వెళ్లి సూర్యోదయం చూడాలనుకుంటాడు. వెంట ఈమె కూడా వెళ్తుంది. బైక్ జర్నీ. ఈ జర్నీలో ఒకరికొకరు దగ్గరవుతారు. తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు చనిపోతున్నాననుకుని ఆమెకి ప్రేమని వ్యక్తం చేస్తాడు. 

మిడిల్ -1 :
       
హాస్పిటల్లో హీరో బతికి ఉంటాడు. హీరోయిన్ తనని హాస్పిటల్లో  చేర్పించి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. తర్వాత ఫోన్ చేసి, తన తల్లిదండ్రుల్ని ఎవరో చంపాలని చూశారనీ అందుకే కొల్హాపూర్ వచ్చేశాననీ అంటుంది. ఎవరు ఎందుకు చంపాలనుకున్నారో చెప్పలేకపోతుంది. తామిద్దరికీ జరిగింది కూడా యాక్సిడెంట్ కాదనీ, అది తనని చంపాలనుకుని చేసిన ప్రయత్నమనీ అంటుంది. తన తల్లిదండ్రులు సహా తనని చంపెయ్యాలని చూస్తున్నారనీ అంటుంది. హీరో అక్కడికి బయల్దేరతాడు. అక్కడ హీరో హాస్పిటల్లో లో వుండగానే మళ్ళీ దుండగులు హీరోయిన్ తల్లిదండ్రుల మీద ఎటాక్ చేస్తారు. ఒక ఎస్సై వీళ్ళకి సహకరిస్తాడు. ఆ ఎస్సై రివాల్వర్ లాక్కుని అతన్ని చంపేస్తాడు హీరో. దుండగుల మీద కాల్పులు జరిపితే వాళ్ళు పారిపోతారు. ఎస్సైని చంపి తను ప్రమాదంలో  పడ్డానని హీరో ఆందోళన చెందడంతో ఇంటర్వెల్ పడుతుంది.

మిడిల్ - 2 :
        తనని పట్టుకోబోయిన ఇన్స్ పెక్టర్ తో కలబడి కాల్పులు జరిపి హీరోయిన్ సహా ఆమె తల్లిదండ్రుల్ని అంబులెన్స్ ఎక్కించుకుని పారిపోతాడు హీరో. అంబులెన్స్  మీద దుండగులు దాడి జరుపుతాడు. వాళ్ళని చంపేస్తాడు హీరో. తనకి తెలిసిన ఒక డాక్టర్ వున్నాడని చెప్పి అక్కడికి తీసి కెళ్తుంది హీరోయిన్. అక్కడ తల్లిదండ్రులకి ట్రీట్ మెంట్ చేస్తూంటే, ఇన్స్పెక్టర్ దుండగులతో వచ్చేసి దాడి జరుపుతాడు. ఆ దాడిని తప్పించుకుని హీరోయిన్ తో పారిపోతాడు హీరో. ఆమె తల్లి దండ్రులు చనిపోతారు. రక్షించాల్సిన పోలీసే ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేక పోతాడు హీరో. వీళ్ళ కారణంగా తను నేరస్థుణ్ణి అయ్యానని బాధ పడతాడు. అసలు ఎందుకు ఈ కుట్ర చేస్తున్నారో తెలుసుకోవాలని  హీరోయిన్ తో అంటాడు. ఆ ఇన్స్ పెక్టర్ని కూడా వదిలేది లేదని  అంటాడు. 

ఎండ్ :
       
రెండున్నరేళ్ళు గడిచిపోతాయి. అదే ఇన్స్ పెక్టర్ వున్న స్టేషన్ కి హీరో డిసిపిగా వచ్చేసి షాకిస్తాడు. అప్పుడు చెప్పుకొస్తాడు. ఈ రెండున్నర ఏళ్ళల్లో చాలా తెలుసుకున్నాననీ, హీరోయిన్ ఒక రాజకీయ నాయకుడికి పుట్టిన కూతురనీ, ఇది ఒప్పుకోవాలనీ  ఆమె తల్లి అంటే, తన రాజకీయ జీవితం దెబ్బ తింటుందని అతను ఒప్పుకోలేదనీ, దీంతో తిరగబడ్డ ఆమె తల్లినీ, పెంపుడు తండ్రినీ హీరోయిన్ సహా చంపేసి తన రాజకీయ ఎదుగుదలకి అడ్డంకులు తొలగించుకోవాలనే ఇదంతా చేశాడనీ, ఇందుకు ఇన్స్ పెక్టర్ చేతులు కలిపాడనీ  వెల్లడిస్తాడు హీరో. ఈ మొత్తం కుట్ర దారుల్ని పట్టుకోవడానికే ఈ రెండున్నరేళ్లల్లో యూపీపీఎస్ చదివి, ఐపీఎస్ ట్రైనింగై, డీసీపీగా ఇలా వచ్చాననీ అంటాడు. ఇంతలో రాజకీయ నాయకుడు వచ్చేస్తాడు. అతణ్ణి లాకప్ లో వేయిస్తాడు హీరో. తప్పించుకోవడానికి కాల్పులు జరిపిన ఇన్స్ పెక్టర్ తో కలబడి అతణ్ణి చంపేస్తాడు హీరో. ఇక హీరోయిన్ తో తన ప్రేమని పండించుకుంటాడు.
                                                          ***సమాప్తం***

      ఈ కథలో బిగినింగ్ లో యాక్సిడెంట్ అవడం దగ్గర ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతోంది. ఇక్కడ్నించీ  మిడిల్ రెండు విభాగాలూ సమస్యతో సంఘర్షణ జరిగి, హీరో అదృశ్యమవడం దగ్గర ప్లాట్ పాయింట్ టూ ఏర్పడుతోంది. ప్లాట్ పాయింట్ టూ అనేది సంఘర్షణకి ఒక పరిష్కార మార్గం కనుగొనే ఘట్టం. అంటే హీరో ఇక్కడ తను ఐపీఎస్ అయితేనే సమస్యని పరిష్కరించుకోగలనని భావించుకుని డిసిపిగా మారి తిరిగి వస్తూ, ఎండ్ విభాగాన్ని ప్రారంభించాడన్న మాట. మిడిల్ టూ చివర్లో ఇన్స్ పెక్టర్ అగడాల్ని చూపిస్తున్న దృశ్యాల మీద  టైమర్ ని రన్ చేయడం ప్రారంభిస్తాడు దర్శకుడు. ఈ టైమర్ 1,2,3...ఇలా గడిచిపోతున్న రోజుల్ని సూచిస్తూ,  945 వ రోజుకి ఆగిపోతుంది. ఇప్పుడు డిసిపిగా హీరో ఎంటర్ అవుతాడు. టైం లాప్స్ చూపించడానికి వాడిన ఈ టెక్నిక్  ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్ని భవిష్యత్తులోకి  ట్రావెల్ చేసేలా చేస్తుంది- ఎలాటి జంప్ కట్, జెర్కులూ లేకుండా ఇది బాగానే వుంది. సాధారణంగా ‘రెండేళ్ళ తర్వాత’ అని అక్షరాలు వేసో, డిజాల్వ్ చేసో లూ టైంలాప్స్ చూపిస్తూంటారు. దీనికి భిన్నంగా చూపెట్టారిక్కడ. ఈ టైమర్ రన్ అవుతూంటే ఒకరకమైన సస్పెన్స్ కూడా ఏర్పడుతుంది.  ఈ రోజుల లెక్క తర్వాత ఇంకే  సంఘటన జరుగుతుందోనని. ఆ సంఘటనే డిసిపి రజనీ కాంత్ గా హీరో రావడం. 

        ప్లాట్ పాయింట్ వన్ లో యాక్సిడెంట్ జరగడం ఈ కథకి మొదటి మలుపన్నాం. ఈ యాక్సిడెంట్ లో ఓ లారీ డివైడర్ ఎక్కేసి హీరో బైక్ కి ఎదురు వచ్చేయడంతో జరుగుతుంది. ఇలా డాష్ ఇచ్చినట్టు చూపించి, వెంటనే కట్ చేసి, సాంగ్ ప్రారంభించారు.  ఇక్కడ ఉన్నట్టుండి పాట రావడం వెంటనే జీర్ణం కాకపోయినా, మేనేజ్ చేశారు. ఈ పాట వస్తూంటే అప్పుడు మాంటేజెస్ ద్వారా ఈ యాక్సిడెంట్ బిగినింగ్- మిడిల్- ఎండ్ లతో కలుపుకుని ఓ కథలా అవిష్కరించారు. బహుశా ఏదో మ్యూజిక్ వీడియో స్ఫూర్తి కావొచ్చు. ఈ పాట నేపధ్యంలో యాక్సిడెంట్ ఎలాగెలా జరిగిందో వివరంగా, గ్రాఫికల్ గా చూపించుకొస్తారు. ఈ పాట హీరో వేదన. చనిపోతున్న తనని వదిలేసి వెళ్ళ వద్దంటూ హీరోయిన్ కి నివేదించుకుంటూంటాడు.

         ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ అనే మొదటి మలుపుని విజువల్ గా యాక్షన్ లో చూపించాలనే సూత్రం ప్రకారం ఇలా దృశ్యీ కరిస్తూ బలంగా రిజిస్టర్ చేశారు. దీన్ని హింసాత్మకంగా కాకుండా, కళాత్మకంగా చిత్రీకరించడంతో వన్నె చేకూరింది. ఇలాటి డైలాగులతో కాకుండా దృశ్యాత్మక ప్లాట్ పాయింట్ వన్ లు ‘భజరంగీ భాయిజాన్’ లో లాగా, ‘24’ లో లాగా విజువల్ యాక్షన్ తో బాగా గుర్తుండి పోతాయి. కరణ్ జోహార్  ‘యే దిల్ హై ముష్కిల్’  లో కూడా ప్రేమకథలో అద్భుతంగా ప్లాన్ చేసిన గుర్తుండిపోయే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టాన్ని సృష్టించారు. తెలుగులో కేవలం ఇంటర్వెల్ బ్యాంగు లంటూ లో- గ్రేడ్ రచన చేస్తూంటారు. ఇంటర్వెల్ బ్యాంగే కాకుండా,  రెండు ప్లాట్ పాయింటుల దగ్గరా ఇంకో రెండు బ్యాంగులు కూడా వుంటాయని ఎప్పటికీ తెలుసుకోరు. 

        మీనన్ కథకి  ప్లాట్ పాయింట్లు  రెండూ విజువల్ యాక్షన్ తో ( ఒకటి,  యాక్సిడెంట్- రెండు, డిసిపి రజనీ కాంత్ గా హీరోఎంట్రీ) ఉత్తేజం కల్గిస్తాయి. దీన్ని సమసౌష్టవం అంటారు, శిల్పం అంటారు, శైలీ అని కూడా అంటారు.

        అయితే ఈ రెండు ఘట్టాల్నీ అర్ధాన్ని జోడించి చూస్తే  మాత్రం ఇవి విలువ కోల్పోతాయి. ఉత్తుత్తి తాటాకు చప్పుళ్ళా వుంటాయీ బ్యాంగులు. కేవలం కమర్షియల్ గిమ్మిక్కే తప్ప- జానర్ మర్యాద కాదు. జానర్ మర్యాద ప్రకారమైతే ప్లాట్ పాయింట్ టూ లో హీరో కనుగొనే పరిష్కార మార్గం ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా ఉండాల్సిన అవసరముంది. అలాగే ప్లాట్ పాయింట్ వన్ సజీవంగా హీరో పాత్రలోంచి పుట్టాల్సి వుంది.
***
       ఇలా రెండు ప్లాట్ పాయింట్స్, మధ్యలో హత్యలో ఇరుక్కున్న ఆందోళనతో సామాన్యుడైన హీరో మీద ఇంటర్వెల్ బ్యాంగ్ - ఈ మూడు మలుపులూ లేదా మూల స్థంభాలూ పైకి చూడడానికి అలంకరణతో  బాగానే కనిపిస్తాయి. గట్టి దనం చూస్తే తేలిపోతాయి. కథకి కావాల్సిన ఆస్థి పంజరాన్ని బాగానే తయారుచేశారు. అందులో రక్తమాంసాలు కూర్చడం దగ్గరే విఫలమయ్యారు. కథకి అస్థిపంజరం, రక్తమాంసాలూ హీరో పాత్రకే చెందినవై వుంటాయనీ, ఇంకెవరికీ హక్కులుండవనీ  గుర్తుంచుకుంటే ఇలా జరగదు.

        కథ ఎక్కడ్నించో పుట్టదు, కథ ఎప్పుడైనా హీరో పాత్రలోంచే పుడుతుంది. హీరో పాత్రలోంచే కథ పుడుతుందనడానికి సింపుల్ ఉదాహరణ- హీరో ఏదో చేయాలను కుంటాడు. అది చేయకుండా అడ్డు తగలడానికి విలన్ పుట్టుకొస్తాడు. అంటే హీరో ఏమీ చేయాలనుకోక పోతే విలనేమీ పుట్టుకురాడన్న మాట. హీరో పాత్రలోంచే కథే కాదు, విలన్ కూడా పుడతాడన్న మాట-  బుష్ ఏదో అనుకుంటేనే బిన్ లాడెన్ పుట్టుకొచ్చినట్టు. రాముడు వనవాసాని కెళ్తేనే రావణుడనే వాడు పుట్టి కాచుక్కూర్చున్నట్టు. ‘శివ’ లో నాగార్జున జేడీని సైకిలు చైనుతో కొడితేనే కథ పుట్టింది. ‘ఒక్కడు’ లో మహేష్ బాబు భూమికని కాపాడుకొస్తేనే కథ పుట్టింది. 

        ఇలా మీనన్ కథలో ప్లాట్ పాయింట్ వన్ యాక్సిడెంట్  సంఘటన హీరో పాత్రలోంచి పుట్టలేదు. హీరోయిన్ తల్లి రాజకీయ నాయకుడితో, హీరోయిన్ కి అతడి కూతురిగా గుర్తింపు కోసం గొడవపడిన ఫలితంగా, అతను తీసుకున్న నిర్ణయం కారణంగా, ఆ తల్లిదండ్రులతో బాటు,  హీరోయిన్నీ చంపేసే పథకంలో భాగంగా, జరిపించిన యాక్సిడెంట్ మాత్రమే అది. కాబట్టి ఈ కథ హీరో పాత్రలోంచి పుట్టలేదు. హీరోయిన్ పాత్రలోంచీ పుట్టలేదు- ఎందుకంటే కన్యాకుమారి వెళ్దామని తను బయల్దేరదీయలేదు, తనే హీరో వెంట వెళ్ళింది. కాబట్టి ఆమె వైపు నుంచీ కాజ్ అండ్ ఎఫెక్ట్ సైకిల్  మొదలవలేదు. అందువల్ల ఈ కథ ఆమె తల్లి పాత్రలోంచి మాత్రమే పుట్టిందని అర్ధం జేసుకోవాలి. తల్లి పాత్ర  రాజకీయ నాయకుడితో గొడవ పడ్డం కాజ్- దాని ఎఫెక్టే మిగతా జరిగిన, హీరోకి సంబంధం లేని సంఘటనలన్నీ.

        ఇక్కడే తప్పులో కాలేశారు. ఇందుకే హీరో పాసివ్ రియాక్టివ్ గా ఉండిపోయాడు- ఈ హత్యలు ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోలేకపోతూ. రియాక్టివ్ అంటే, ఎవరు దాడులు చేస్తున్నారో తెలుసుకోకుండా ఎంత సేపూ ఆత్మ రక్షణ చేసుకుంటూ, దాడుల్ని తిప్పి కొడుతూ కూర్చునే వాడన్న మాట. యాక్టివ్ అయితే, విలన్ ఎవడో తెలుసుకుని తనే వాడి భరతం పట్టడం మొదలెడతాడు. ఇందుకే ప్లాట్ పాయింట్ టూ లో అమాంతం డిసిపి అవతారం ఎత్తాడు. బండ గుర్తు- ఎప్పుడైతే ప్లాట్ పాయింట్ వన్ మలుపు హీరో పాత్రలోంచి రాదో, అది అర్ధవంతంగా కూడా ఉండదో, అప్పుడు ప్లాట్ పాయింట్ టూ కూడా అర్ధం లేకుండా తయారై ముగింపు తేలిపోతుంది. ఇందుకే ఈ కథలో హీరో డిసిపిగా రాగానే ఆ ఒక్క సీనుతోనే  అవకతవకగా ముగిసిపోయింది కథ.  

        అసలు బిగినింగ్ విభాగపు బిజినెస్ ఏమిటి? పాత్రల్ని పరిచయం చేయడం, కథా  నేపధ్యాన్ని ఏర్పాటు చేయడం, ప్లాట్ పాయింట్ వన్ సంఘటనకి దారి తీయించే పరిస్థితుల కల్పన చేయడం, ప్లాట్ పాయింట్ వన్ సంఘటనని సృష్టించడం, దాంతో బిగినింగ్ విభాగాన్ని ముగించడం. ఇంతే కదా, ఇది కూడా చూసుకోకపోతే ఎలా? మీనన్ కథలో ప్లాట్ పాయింట్ వన్ సంఘటనకి దారి తీయించే పరిస్థితుల కల్పన ఏది? ఇదే లేకపోయాక ఇక జవజీవాలేముంటాయి సంఘటనలో? ఆ యాక్సిడెంట్ జరగడానికి దారి తీయించే పరిస్థితుల కల్పన చేయకుండా, సడెన్ గా యాక్సిడెంట్ సృష్టించడం ఎలా సమగ్రమైన ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది? 

        ఈ పరిస్థితుల కల్పన చేయాలంటే హీరోయిన్ తల్లి కథని  ఓపెన్ చేయాలి. ఇది బిగినింగ్ విభాగంలో చేయకూడదు కాబట్టి ఆ పరిస్థితుల కల్పనకి సాధ్యం కాలేదు. కథ ఆమె పాత్రలోంచి పుట్టినప్పుడు ఏదీ సాధ్యం కాదు. ఇందుకే  బిగినింగ్ విభాగపు అతి ముఖ్య బిజినెస్ అయిన పరిస్థితుల కల్పన అనే విలువ ఆవిరైంది. 

        ఒకవేళ మొదట హీరో స్వగతంగా చెబుతూ ప్రారంభించిన, మాంటేజెస్ లో కన్పించే క్రూరుడైన రాజకీయనాయకుడి కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగిందని మనం అనుకోవాలన్నా, అది దర్శకుడు మనల్ని తప్పు దోవ పట్టించడం అవుతుంది- ఎందుకంటే, ఆ విలన్ (రాజకీయ నాయకుడు) తో హీరో కె సంబంధమూ లేదు కాబట్టి. అప్పుడా స్వగతం వేయడమే అర్ధరహితమైపోతుంది.
***
      హీరో పాత్ర ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథ పుట్టించే అవకాశాన్ని దర్శకుడి పుణ్యాన మిస్ చేసుకున్నా, ఇంటర్వెల్లో మరో ఛాన్సు దొరికింది. దీన్ని కూడా దర్శకుడు లాగేసుకున్నాడు. ఇంటర్వెల్ ఘట్టంలో హీరో ఎస్సైని అతడి రివాల్వర్ తో చంపి ఆ హత్యాయుధం రివాల్వర్ పట్టుకుని  దిమ్మదిరిగిపోయి నిలబడిపోతాడు. తను హత్య చేశాడన్న ఎవేర్ నెస్ తో భయపడతాడు. ఇది ఆత్మరక్షణ కోసం జరిగిందని నిరూపించ వచ్చని హీరో ఫ్రెండ్ అంటాడు. స్టోరీ అయిడియా ఇదే అయితే, ఓ సామాన్య  యువకుడు అనుకోకుండా ఓ హింసాత్మక సందర్భంలో ఇరుక్కుంటే ఏమవుతుంది?-అన్న పాయింటు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇక్కడ హీరో హత్య చేశాడు కాబట్టి ఈ హత్య చేయడంలోంచి (తనలోంచి)  కథ పుట్టింది. ప్లాట్  పాయింట్ వన్ దగ్గర యాక్సిడెంట్ లో కథ తన లోంచి పుట్టలేదు కాబట్టి అదసలు ప్లాట్ పాయింట్ వన్నే కాదనుకుందాం- ఇంటర్వెల్లోనే హీరో హత్య చేయడం  ద్వారా కథ పుట్టింది గాబట్టి ఇదే ప్లాట్ పాయింట్ వన్ అనుకుందాం. ఇక్కడ్నించే కథ మొదలవుతోందని అనుకుందాం కాస్సేపు- అప్పుడు ఇక్కడ్నించైనా ఈ పాయింటు పట్టుకుని సెకండాఫ్ ఏం జరగాలి? ఇది ఆత్మ రక్షణ కోసం చేసిన హత్య అని నిరూపించ వచ్చని ఇంటర్వెల్ లో చెప్పించినప్పుడు, ఇదే సెంట్రల్ పాయింటనీ, దీని చుట్టే ఇక కథ నడుస్తుందనీ అభిప్రాయం కల్గించారు. లేకపోతే ఈ ఇంటర్వెల్ ఘట్టానికి అర్ధమే లేదు. కానీ సెకండాఫ్ లో దీని వూసే వుండదు. చంపడానికి ఆ ఇన్స్ పెక్టర్ సహా దుండగులు వెంటపడ్డమే, హీరో తప్పించుకోవడమే జరుగుతూంటుంది. 

        అసలెందుకు చంపాలనుకుంటున్నారో రివీల్ చేయకుండా, చిట్ట చివర రివీలయ్యే ఎండ్ సస్పెన్స్ గా పెట్టుకుని నడపడంతో హీరోకి ఒక గోల్ లేకుండా పోయింది. ఎందుకంటే ఆసలు విలనెవరో సెకండాఫ్ లో కూడా తనకే  తెలీదు. ఒక చోట అంటాడు అసలు ఎందుకిలా జరుగుతోందో, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని. కానీ ఆ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. దర్శకుడు ఇలాగే  ప్రేక్షకులకి ఆశలు కల్పిస్తూ వమ్ము చేస్తూ వుంటాడు. ఇంటర్వెల్లో ఎస్టాబ్లిష్ చేసే  పాయింటుతో ఆశలు కల్పించి దాన్ని అలా వదిలేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఎట్టకేలకు హీరో చేత అన్పించి, మనకి కొత్త ఆశలు కల్పిస్తాడు. మళ్ళీ దీన్ని కూడా మర్చిపోతాడు దర్శకుడు -ఇచ్చిన హామీల్ని మర్చిపోయే పొలిటీషియన్ లా. ఒకటేదనా సెటప్ చేస్తే,  దాన్ని పే - ఆఫ్ చేసి తీరాలి- లేకపోతే  సెటప్ చేయనే కూడదనేది కామన్ సెన్సు.

         ఫస్టాఫ్ లో మాత్రం హీరోయిన్ తమని ఎవరు ఎందుకు చంపాలను కుంటున్నారో
తెలీదని అంటుంది. ఆమెకి తెలీకపోతే హీరో ఆమె తల్లిదండ్రుల్ని అడగవచ్చుగా? అడక్కపోయినా ఆ తల్లి, ఫలానా పొలిటీషియన్ తో నా కూతురి గురించి గొడవపడ్డా, వాడే మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు- అని చెప్పాలిగా? ఆమె మీద ఆన్ని దాడులు జరుగుతూంటే  హీరో కాపాడుతూన్నా,  అలాటి హీరోకే ఏమీ చెప్పకుండా చనిపోతుంది. డాక్టర్ ఇంట్లో చికిత్స పొందుతున్నప్పుడు ఇన్స్ పెక్టర్ దుండగులతో  వచ్చి దాడి జరిపే సుదీర్ఘ ఎపిసోడ్ వుంటుంది. ఎదురు కాల్పులు జరుపుతూ తప్పించుకుంటూ, ఏడుస్తున్న హీరోయిన్ ని తీసుకుని డాబా మీది కొస్తాడు హీరో. కింద కాల్పులు జరుగుతూనే వుంటాయి. ఆమె పేరెంట్స్ ఏమవుతారన్న ఆలోచనే  వుండదు హీరోకి. పైగా- నేనింత కా లం చిన్న పిల్లాణ్ణి అనుకుంటూ గడిపేశాను, ఇప్పుడు పెద్ద వాణ్ణయ్యాను- లాంటి డైలా గులేవో చెప్తాడు. మంచిదే, ఈ అనుభవాలతో మెచ్యూర్ అవడం మంచిదే. ఇక్కడ కూడా దర్శకుడు హీరో మీద మనకి ఆశలు కల్పిస్తాడు- ఇలా మెచ్యూర్ అయిన హీరో ఇప్పుడేం చేస్తాడోనని. ఆ డైలాగులు చెప్పిన హీరో,  హీరోయిన్ పేరెంట్స్ ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి, హీరోయిన్ తో ఉడాయింస్తాడు! మెచ్యూరిటీ అంటే హీరోయిన్ పేరెంట్స్ ని ముఠా చేతిలో చావనిచ్చి, హీరోయిన్నేసుకుని పారిపోవడమన్న మాట!
        ఫోకస్ చెదిరిపోయిన కథాకథనాలు, పాత్రచిత్రణలు ఇవి.

***
       ఇక ఎండ్ విభాగానికొస్తే ఇది ఎన్నో ప్రశ్నల్ని మిగుల్చుతుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత డిసిపి రజనీకాంత్ గా వచ్చిన వాడు చెప్పే మాటలు నమ్మశక్యంగా వుండవు. కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తాడు. ఇది రజనీకాంత్ పరువు తీయడమే. ఈ ఇన్స్ పెక్టర్ అంతు చూడాలంటే తనే పోలీసుగా మారాలనుకుని, దీర్ఘకాలిక ప్రణాళికేసుకుని,  యూపీపీఎస్ పాసైపోయి, ఐపీఎస్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసేసి,  డిసిపినై ఇలా వచ్చానంటాడు- ‘మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను’ - అని నాగార్జున పాడుకున్న టైపుని గుర్తుకు తెస్తూ. 

        ఆల్రెడీ ఇంజనీరింగ్,ఎంబీఏ పట్టాలున్నాయి. ఈ చదువుల తల్లి - కాదు- చదువుల తండ్రి - రెండున్నర సంవత్సరాలలో ఐపీఎస్ అయిపోవడం రికార్డే. ఐపీఎస్ అయి నేరుగా డిసిపి ఎలా అయిపోతాడో అర్ధం గాదు. ఇదలా ఉంచితే- ఈ స్క్రీన్ ప్లేలో ఇప్పుడు కథా కాలం మారింది. మిడిల్ ముగిసే వరకూ ఒక కథా కాలం, మిడిల్ తర్వాత  రెండున్నరేళ్ళూ ఇంకో కథా కాలం. మొదటి నడుస్తున్న కథాకాలంలో కుట్ర దారులెవరో తెలుసుకుంటా నన్న హీరో, ఆ కథా కాలంలో ఆ పని ముగించలేదు. ఆ కథాకాలంలో ఆ పని పూర్తి చేయకపోతే, రెండో కథాకాలం  వరకూ రెండున్నరేళ్ళూ విలన్ చూస్తూ కూర్చుంటాడా?       

        రాజకీయనాయకుడైన విలన్ కి,  మొదటి కథా కాలంలోనే మొత్తం హీరోయిన్ కుటుంబాన్నీ అడ్డు  తొలగించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తను ఎన్నికల్లో నిలబడబోతున్న సందర్భమది. కాబట్టి హీరోయిన్నీ, ఆమెతో బాటు హీరోనీ వెతికి పట్టుకుని  చంపే తీర్తాడు. తీరుబడిగా కోర్సులు చదువుకుంటూ కూర్చునే ఛాన్సే వుండదు హీరోకి. 

        రెండోది, ఒక ఎస్సైని చంపి, మరి కొందరు రాజకీయ నాయకుడి అనుచరుల్నికూడా  చంపి పరారీలో వున్న హీరో,  ఐపీఎస్ అయ్యే ఛాన్సే లేదు.

        ఒక జానర్ దానికి సంబంధించిన కథాలక్షణాలతో పరిశుభ్రంగా వుంటుంది. తీస్తున్న సినిమా జానర్ పట్ల స్పష్టత వుండనప్పుడు అదొక సినిమాగానే అన్పించదు!


-సికిందర్
http://www.cinemabazaar.in/
         




       
       
         

       






11, నవంబర్ 2016, శుక్రవారం

రివ్యూ

రచన-  దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 
తారాగణం : :నాగచైతన్య, మంజిమా  మోహన్‌, బాబా సెహగల్‌, రాకేందుమౌళి, సతీష్‌ కృష్ణన్‌, అజయ్‌ గొల్లపూడి తదితరులు 
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, 
ఛాయాగ్రహణం : డాన్‌మాక్‌ ఆర్థర్‌, 
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్‌ 
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 
విడుదల
:11 నవంబర్, 2016.
***
          సుదీర్ఘ కాలం నిర్మాణంలో వుండిపోయి ఇవ్వాళ విడుదలైన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఒక యాక్షన్ థ్రిల్లర్ గా గౌతమ్ మీనన్- నాగ చైతన్యల కాంబినేషన్ నుంచి ఎదురుచూడని నజరానా. వినోదపరుస్తూ సరదాగా సాగే ఓ ఎంటర్ టైనర్ గా ఆశించే వెళ్ళే ప్రేక్షకులకి వూహించని అనుభవం ఎదురయ్యే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అసలేముందో ఈ కింద చూద్దాం...

కథ 
     అతను (నాగచైతన్య) ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక ఎంబీఏ కూడా చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగి. ఖాళీగా ఉంటూ  అమ్మాయిల గురించి ఆలోచిస్తూ,  ఫ్రెండ్స్ తో చర్చిస్తూ గడిపేస్తూంటాడు. చెల్లెలు మైత్రేయి ఫ్రెండ్ గా లీలా (మంజిమా  మోహన్‌,) రావడంతో ఆమెతో ప్రేమ ఖాయం చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఆమె స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సు చేయడానికి వైజాగ్ వచ్చింది. అతడి ఇంట్లోనే బస కూడా చేయడంతో అతడి పంట పండుతుంది. కానీ ప్రేమని వ్యక్తం చేసే అవకాశం ఎప్పుడూ  లభించదు. ఒకరోజు బైక్ మీద లాంగ్ టూరు వేస్తాడు- కన్యాకుమారి వెళ్లి అక్కడ సూర్యో దయాన్ని చూడాలని. అతడి వెంట ఆమె కూడా వెళ్తుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు ఇంకా బాగా తెలుసుకుంటారు. వీళ్ళ బైక్ ని ఒక లారీ గుద్దేస్తుంది. దీంతో ఇద్దరి జీవితాలూ డిస్టర్బ్ అయిపోతాయి. అది మమూలుగా జరిగిన ప్రమాదం కాదనీ, ఎవరో లీల ని చంపడానికే చేయించారనీ తెలుస్తుంది. లీలా తల్లిదండ్రులు మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో వుంటారు.  వాళ్ళ మీద కూడా హత్యాయత్నం జరిగినట్టు తెలుసుకున్న అతను -అనుకోకుండా ఒక పోలీసు అధికారిని చంపి ప్రమాదంలో పడతాడు. కామత్ అనే మరో పోలీస్ అధికారి (బాబాసెహగల్) కూడా కుట్రలో భాగస్తుడుగా బయటపడతాడు. 

          అసలీ కుట్ర దార్లెవరు, లీలా కుటుంబాన్ని ఆమె సహా అంత మొందించాలని ఎవరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు, చివర్లో తప్ప తన పేరు కూడా వెల్లడించని కథానాయకుడు లీలా కోసం ఈ ఇరుక్కున్న పరిస్థితి లోంచి  ఎలా బయటపడ్డాడూ అన్నవి మిగతా కథలో టెలి అంశాలు.  

ఎవరెలా చేశారు
      ఫస్టాఫ్ లవర్ బాయ్ గా- సెకండ్ హాఫ్ యాక్షన్ హీరోగా నాగచైతన్య కన్పిస్తాడు. అయితే కథ సరిగ్గా కుదరని కారణంగా ఎమోషన్ లేని రియాక్టివ్ క్యారక్టర్ గా మిగిలిపోతాడు.  ఎప్పుడైతే కథలో  విలన్ ని దాచి పెట్టి ఎండ్ సస్పెన్స్ చేశారో, అప్పుడు చైతన్య  పాత్ర కూడా దిక్కుతోచక కథ నడప లేని స్థితిలో పడిపోయింది. కథ అనేది హీరో లేదా హీరోయిన్ – ఎవరు ప్రధాన పాత్ర అయితే ఆ ప్రధాన పాత్రలోంచి పుడుతుందే తప్ప- బయట నుంచి రచయిత పుట్టించేది కాదు. ఈ పొరపాటు వల్ల నాగచైతన్య పాత్ర – నటన కూడా ఏకపక్షంగా కన్పిస్తాయి. క్లయిమాక్స్ లో పాత్ర ఇచ్చిన ట్విస్టు బాగానే ఉన్నప్పటికీ- ఈ ఒక్క సీనుతోనే అనూహ్యంగా కథ ముగిసిపోవడంతో తీవ్ర  అసంతృప్తే మిగులుతుంది. హీరోయిన్ తో  కెమిస్ట్రీ – రోమాన్సూ  మాత్రం ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తాయి.

          కేరళ  హీరోయిన్  మంజిమా మోహన్ టాలెంట్ వున్న గ్లామరస్ నటియే. అయితే సెకండాఫ్ కొచ్చేసరికి పాత్ర పూర్తిగా సీరియస్ గానూ, ఎక్కడా రిలీఫ్ లేకుండా శాడ్ గానూ మారిపోయి ఏడుస్తూ వుండడమే పనిగా పెట్టుకోవడంతో (రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఏడ్వడం దేనికి?) యూత్ అప్పీల్ కి వ్యతిరేకంగా మారింది. పాత్రపరంగా తను  స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సు చేస్తున్న రచయిత్రి అయినప్పుడు తన కెదురయ్యే కష్టాలకి ఏడ్వడం అసహజంగా అన్పిస్తుంది. తన గురించి ఏడ్చే రచయిత్రి స్క్రీన్ ప్లేలు ఏం రాస్తుంది?  పేరుకి హీరోయిన్ కి గొప్పగా ఒక క్వాలిఫికేషన్ చూపించి ఆతర్వాత వదిలేసే మూసఫార్ములా చిత్రణకి గౌతమ్ మీనన్ కూడా పాల్పడ్డారు. ఆమెని స్క్రీన్ ప్లే రైటర్ గానే పూర్తి స్థాయిలో చూపించి వుంటే, ఈ డ్రైగా వున్న  థ్రిల్లర్ ని  ఆమె పాత్ర కూడా చేసే సాహసాలు చైతన్యం నింపేవి. 

          సింగర్ బాబా సెహగల్ బోడి గుండుతో నెగెటివ్ పాత్ర  నటించాడు. టెర్రర్ సృష్టించే పోలీసు పాత్రలో ఓకే అన్పించుకున్నాడు. అయితే చివరి దాకా హీరోని వేధించే తను విలన్ కాదు- విలన్ కి అనుచరుడు మాత్రమే. ఇకపోతే ఒక్క నాగచైతన్య తప్ప ఈ  సినిమాలో మరో తెలుగు ఆర్టిస్టు ఎవరూ లేరు.

         
డాన్‌మాక్‌ ఆర్థర్‌ ఛాయాగ్రహణం అత్యున్నతంగా వుంది. కన్యాకుమారి సముద్ర తీర దృశ్యాలు చాలా అందంగా వున్నాయి. చాలా భాగం రాత్రి సమయాల్లో సాగే కథకి ఆ మేరకు నైట్ సీన్స్ ని డెప్త్ తో చిత్రీ కరించాడు. ఇక  ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఒక ఎసెట్టే ఈ సినిమాకి. అయితే ఆరు పాటలూ ఫస్టాఫ్ లోనే పెట్టేశారు. సెకండాఫ్ లో పాటల్లేవు. 

చివరి కేమిటి?
     గౌతం మీనన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ని మాత్రమే తీశారు. దీనికి ప్రేమ కథతో సంబంధం లేదు. యాక్షన్ కి కారణమైన అంశం పూర్తిగా వేరు. అందుకే సెకండాఫ్ లో కథ రోమాంటిక్ ఫీల్ ని కోల్పోయింది. ఫస్టాఫ్ లో రోమాన్స్- సెకండాఫ్ లో దాంతో సంబంధం లేని యాక్షన్ గా తీశారు. అయితే యాక్షన్ కథకి హీరోయిన్ తో సంబంధముంది- కానీ ఆమె హీరోని ప్రేమించడంతో సంబంధం లేదు. గౌతం మీనన్ సెకండాఫ్ లో రోమాన్స్ నీ, సాంగ్స్ నీ ఇంకెలాటి వినోదాన్నీ కూడా పూర్తిగా  పక్కన బెట్టేయడంతో, యాక్షన్ కథ ఏకబిగిన మంచి పట్టుతోసాగే  థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ని సృష్టించిందని చెప్పొచ్చు.  చివర్లో నాగచైతన్య పాత్రతో ఇచ్చిన ట్విస్టు మాంచి కమర్షియల్ గిమ్మిక్కు. గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఎలా తీశారంటే తన సహజమైన న్యూవేవ్ ధోరణికి మూస ఫార్ములా కూడా జోడించారు. దీంతో చివరి ట్విస్టు బాగానే వున్నా అది ఈ జానర్ లో పొసగనట్టు అన్పిస్తుంది. హీరోయిన్ ని స్క్రీన్ ప్లే రైటర్ గా పరిచయం చేసి ఆ తర్వాత మూస ధోరణికి వెళ్ళిపోవడం కూడా ఇలాటిదే.

          గౌతమ్ మీనన్ ఎండ్ సస్పెన్స్ కథనంలో  చిట్ట చివర్లో రివీల్ చేయడానికి పెట్టుకున్న సస్పెన్స్ అంశం ఏ మాత్రం బలంగానూ లేదు. పైగా మరాఠా ప్రాంతంపు నేటివిటీతో, పాత్రలతో మరాఠీ – హిందీ సంభాషణలతో నడిపితే తెలుగు ప్రేక్షకులు అర్ధం జేసుకోవడం ఇబ్బందే- ఎంత  తెలుగులో సబ్ టైటిల్స్ వేసివప్పటికీ అవి చదువుకుంటూ కూర్చోలేరు. 

          ఫస్టాఫ్ రోమాన్స్, సెకండాఫ్ యాక్షన్ అనే స్కీము  పెట్టుకుని, గౌతమ్ మీనన్ నాగ చైతన్యతో చేసిన ఈ ప్రయత్నాన్ని  వినోదాన్ని మాత్రం ఆశించి చూడకూడదు. సెకండాఫ్ లో పాత్ర పరంగా, కథా పరంగా లోపాలున్నా, బలహీనతలున్నా సాధారణ ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చుని చూసేలా చేస్తుంది.

-సికిందర్