రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, డిసెంబర్ 2014, సోమవారం

కళ!

పాత్రలకి కూడా జీవంపోసే వాతావరణ సృష్టి!
కళా దర్శకుడు ఎస్. రవిందర్ రెడ్డి 
మొత్తానికి తెలుగు సినిమా కళా దర్శకత్వానికి మహర్దశ పట్టింది. ఒక బిగ్ స్టార్ తో సినిమా అనుకోగానే తక్షణం కళా దర్శకత్వానికి పెద్ద పీట వేసేసి భారీ బడ్జెట్ల తో  మెగా సెట్స్ నిర్మించడం  పరిపాటైంది. ఏమంటే మన సినిమాలెవరికీ తీసిపోవని ఇతరులకి చూపించడమే  దీని ముఖ్యోద్దేశమని కొందరంటున్నారు. ఇది కరెక్టేనా? తెలుగు సినిమాల్ని తెలుగేతరులే చూడనప్పుడు ఇలా మీసాలు మెలెయ్యడం సబబేనా? కనీసం ఇంకో భాషలో అనువాదాలకైనా నోచుకకోని మన సినిమాల్ని చూసి ‘శభాష్ టెల్గూమాన్’ అని ఎవరనాలి?

‘మగధీర’ ఫేమ్ కళాదర్శకుడు ఎస్.రవిందర్( రవీందర్ కాదు) రెడ్డి అభిప్రాయంలో కళా దర్శకత్వానికి ఇప్పుడింత మంచి రోజులు రావడానికి స్టార్ల మధ్య పోటీయే కారణం. వాళ్లకి ఇతర భాషల మీద కూడా ఆసక్తి వుండదు. అంటే ఆ మెగా సెట్స్ ని స్థానికంగానే ప్రదర్శించుకుని సంతృ ప్తిపడుతున్నారని అనుకోవాలి. ఏమైనా ఈ పరిణామాలతో కళా దర్శకులు, వాళ్ళ టీములు, కార్మికులూ అంతా హ్యాపీ. హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి, మెగా సెట్స్ లేస్తున్నాయి జోరుగా.. ఇదే రాజధాని అభివృద్ధి: ఏకంగా ఒక వర్చువల్ ప్రపంచాన్నే సృష్టించుకోవడం!

 ‘సరయూ ది డిజైన్’  స్టూడియో అధినేత రవిందర్  ‘ఐతే’ తో మొదలై,  ‘మగధీర’ చెయ్యి పట్టుకుని ‘గోల్కొండ హైస్కూల్’ కొచ్చారు. మధ్యలో మరో 14 ప్రసిద్ధ సినిమాలున్నాయి. ముడి ఫిలిం కి డిజిటల్ ప్రత్యాన్మాయం వచ్చేసి నిర్మాణ వ్యయం తగ్గిపోతున్నట్టే, సెట్స్ పరంగా కూడా అలాటి ఖర్చు తగ్గించే ఆవిష్కరణ లేమైనా  జరుగుతున్నాయా అని అంటే, లేదన్నారు. సెట్స్ కయ్యే వ్యయం దర్శకుడు, నిర్మాతల నిర్ణయాలపై ఆధారపడుతుందన్నారు.  కొంత భాగం సెట్ వేసి, మిగతా భాగాన్ని  గ్రాఫిక్స్ తో సృష్టించుకునే విధానంలో కూడా ఖర్చేం తగ్గదనీ, పైగా ఆ రెండిటికి నిర్దుష్టమైన మ్యాచింగ్ కూడా కష్టమనీ చెప్పారు రవిందర్. ‘మగధీర’ లో కొంతవరకూ ఇలాటి మ్యాచింగ్ ని సాధించామన్నారు. 

    డీఐ విషయానికొస్తే, దీనిపట్ల అవగాహన వున్న కెమెరామాన్ కి సెట్ కి వేసిన ఒక రంగు, డీఐ తర్వాత ఫలానా ఈ విధంగా కన్పిస్తుందని ముందు జాగ్రత్తలు చెప్పడం వల్ల, డీఐ తో కళా దర్శకుడి కళ వన్నె తగ్గే ప్రసక్తి లేదన్నారు. సెట్స్ మీద లైటింగ్ ని తను దగ్గరుండి చూసుకుంటా నన్నారు. అలాగే సౌండ్ గురించి కూడా పట్టించుకుంటా నన్నారు. అదెలా అనడిగితే-

    “హీరోయిన్ పరిగెడుతున్నప్పుడు కాలికి డబ్బా తగిలి పడిపోవచ్చు, చేతికి గ్లాసు తగిలి పగలొచ్చు, బయట పావురాల గుంపు ఒక్క పెట్టున ఎగిరిపోవచ్చు...సీన్ ని నేనిలా ఊహించి,  ఆ డబ్బా, ఆ గ్లాసు, ఆ పావురాల గుంపు నీ ఏర్పాటు చేశాననుకోండి, సంగీత దర్శకుడికి ఆయా శబ్దాలు వేసి జీవం పోసే అవకాశం వుంటుంది. దృశ్యం బాగా రక్తి కడుతుంది..” అని వివరించు కొచ్చారు. 

          వేరీవెల్, పోతే పోరాట దృశ్యాలకి ఆయుధాలు మీ కళా దర్శకులే తయారు చేస్తున్నప్పుడు, అది ఫైట్ మాస్టర్ల సృష్టిగా మా బోటి వాళ్ళం అనుకుంటున్నాం కదా..అంటే, ఫైట్ మాస్టర్లు ఏదీ సృష్టించరన్నారు. వాళ్లదంతా విధ్వంసమే నని జోకేస్తూ, ఇప్పుడు తాజాగా ‘రాజన్న’ కి తయారుచేసిన వేట కత్తు ల్లోంచి ఒకదాన్ని తీసి చూడమని చేతిలో పెట్టారు. మెత్తటి మెటీరియల్ తో తయారు చేసిన ఆ కత్తితో గాయలయ్యే ప్రసక్తే లేదు. ఇదే ఫైట్ మాస్టర్ తయారు చేస్తే కసిక్కున  దిగబడుతుందేమో...
     ఇక ఫైట్ మాస్టర్ల గురించి ఇంకో విషయం చెబుతూ, హీరో పిడికిలితో కొడితే అమాంతం గోడ పడిపోయేట్టు కట్టివ్వాలంటారు ఫైట్ మాస్టర్లు. అలా కాకుండా ముందు గోడ పగుళ్లిచ్చి, కొన్ని పెచ్చు లూడుతూంటే, అది ఫియర్ సైకోసిస్ ని సృష్టించి ప్రేక్షకులకి గాభార పెడుతుందని సైన్స్ వివరించారు రవీందర్.
    స్వేచ్ఛ విషయానికొస్తే, తనవరకూ పూర్తి స్వేచ్చతో పనిచేసే అవకాశం లభిస్తోందన్నారు. సినిమాకి వెన్నెముక లాంటిది కళా దర్శకత్వమని, అది పాత్రల మనస్తత్వాల్ని,  వ్యక్తిత్వాల్ని, స్థితిగతుల్నీ వెల్లడి చేసే ఒక వాతావరణ సృష్టి అనంటూ, ఒక ఆపిల్ పండు పెట్టాలన్నా ప్రొడక్షన్ బాయ్ పరుగెత్తి మార్కెట్లో దొరికిందల్లా పట్టు కొచ్చేస్తే కుదరదున్నారు. ముందు బ్యాక్ స్టోరీ ని వర్కౌట్ చేసి ప్రాపర్టీస్ ని సూచిస్తానన్నారు. కళా దర్శకత్వం కథని డామినేట్ చేయకూడదనీ, కథ వింటున్నప్పుడే దర్శకుడి ఊహా లోకపు ఫీల్ ని పసిగడతాననీ చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఇద్దరు దర్శకులు కథ చెప్పననడంతో ఆ సినిమాల్ని వదులుకున్నా నన్నారు.

       ప్రేక్షకులు సినిమా బాగా లేదనడానికి కళాదర్శకత్వం కూడా కారణ మౌతుందన్నారు. కొన్ని రకాల రంగులు, వస్తు సంచయం అన్ కాన్షష్ గా వాళ్ళని చీకాకు పెట్టి ఉండొచ్చు. కనుక వస్తువుల ఎంపికలో, వాటి అమరికల, రంగుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
    “కాలేజీ నుంచి వచ్చిన హీరోయిన్ ఇంట్లో అటో చెప్పూ ఇటో చెప్పూ విసిరేసుకుంటూ వస్తే అవి ఎక్కడెక్కడ పడాలి, బ్యాగు కూడా విసిరేస్తే అది పడేందుకు ఓ సోఫా ఉంటే, అదెక్కడ వుండాలి...వాచీ తీసేస్తే దాన్ని టేబుల్ మీద ఎక్కడ పడెయ్యాలీ...” అని తన ధోరణిలో చెప్పుకు పోతూంటే- 
    “చూస్తూంటే మీరే దర్శకత్వం వహించేసేట్టున్నారు, ఇక దర్శకులేం చెయ్యాలి?” అని  అడ్డు తగిలితే- “టాలెంట్ వుంది కదా అని డామినేట్ చెయ్యను. అన్ని శాఖల వారితో ట్యూన్ అవుతాను. కొందరికి తక్కువ టాలెంట్ ఉండొచ్చు. అలాంటప్పుడు అంతకు నన్ను తగ్గించుకుని పని చేస్తాను” –అన్నారు. 

   నెల్లూరుకి చెందిన రవిందర్ 1993 లో హైదరాబాద్ జేఎన్టీయూ లో ఫైనార్ట్స్ చేసి,  న్యూఢిల్లీ  ఐఐటీ లో మాస్టర్స్ ఇన్ డిజైన్ పూర్తి చేశారు. కొంతకాలం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసి, ‘అమృతం’  సీరియల్ కొచ్చారు. 2003 లో గుణ్ణం గంగరాజు తీసిన ‘ఐతే’ కి కళా దర్శకులయ్యారు. 
     “ ‘ఐతే’ లో అపోలో హాస్పిటల్ వెనుక మీరు వేసిన టీ స్టాల్ సెట్ మిస్టీరియస్ నేచర్ ని ఇప్పటికీ మరువ లేకున్నాం,  అంత రియలిస్టిక్ గా ఎలా క్రియేట్ చేయగలిగారు?” అనడిగితే, బహుశా పారితోషికం లేని పరిస్థితుల్లో పని చయడం వల్ల ఆ సహజత్వం వచ్చిందని చమత్కరించారు (సినిమా విడుదలయ్యాక పాతిక వేలు లభించాయట!)

    తర్వాత ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘సై’, ‘ఒక్క మగాడు’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘అమ్మ చెప్పింది’, ‘అష్టాచెమ్మ’, ‘మార్నింగ్ రాగ’, ‘నేను మీకు తెలుసా’, ‘మగధీర’...ఇలా ఆయన ఖాతాలో సినిమాలు జమ పడ్డాయి.
    ‘మగధీర’ ఒక చరిత్ర. అందులో రాజభవనాలు, రథం, ఊబి, హెలీకాప్టర్, కాస్ట్యూమ్స్ వంటి అద్భుత సృష్టులు రవీందర్ చేతుల మీదుగా జరిగాక, చెప్పుకోవాల్సిన మరో విశిష్టత ‘మర్యాదరామన్న’ లోని రైల్ కంపార్ట్ మెంట్, ట్రాలీసెట్లు, నది మీద కలప వంతెన యదార్థ నిర్మాణం (గత ఇంటర్వ్యూల్లో ‘మర్యాదరామన్న’ గ్రాఫిక్స్ నిపుణులు కణల్ కణ్ణన్, కెమెరా మాన్ సి. రాం ప్రసద్ లు ఆ వంతెనని పూర్తిగా గ్రాఫిక్స్ సృష్టిగా పేర్కొనడాన్ని రవీందర్ దృష్టికి తెస్తే, దీనికి ఆయన ఫీలై,  అది తను వేసిన సెట్ -నిజ కట్టడం- అని ఫోటోలు చూపించారు).

    పోతే, ‘మర్యాదరామన్న’ కోసం వేసిన ఇంటి సెట్ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది...ఇప్పటికీ ఇందులో వివిధ సినిమాల షూటింగులు జరిగిపోతున్నాయి. పూర్తిగా ప్లై వుడ్ తో నిర్మించిన ఈ సెట్ కి నాల్గేళ్ళ గ్యారంటీ వుంది. దీని పటిష్టత కోసం ప్లైవుడ్ మీద వేసిన కోటింగ్ లో రసాయనాల మిశ్రమం రవిందర్ సొంత డిస్కవరీయే. ఇప్పుడు దీనికే ఆయన పేటెంట్ హక్కులు పొందారు. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నవారమే స్విట్జర్లాండ్ నుంచి పత్రాలందాయని వాటిని చూపించారు. ఈ విషయం ముందుగా  ఇలా ‘ఆంధ్రజ్యోతి’ కే వెల్లడిస్తున్నాననీ, తర్వాత నిర్మాతల సమక్షంలో ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటిస్తామనీ చెప్పారు. కాబట్టి ఈ కెమికల్ కాంబినేషన్ ని ప్రపంచంలో ఎవరు వాడాలన్నా ముందుగా రవీందర్ కి రాయల్టీ చెల్లించాల్సి వుంటుంది. ఇలా ఒక కళా దర్శకుడికి పేటెంట్ హక్కులు దక్కడం దేశంలోనే మొదటిసారి!
      ప్రస్తుతం ‘శ్రీ రామరాజ్యం’ కి రామోజీ ఫిలిం సిటీలో రాజప్రాసాదాల సెట్, అల్వాల్ లో అడవి సెట్, ‘రాజన్న’ కి జూబ్లీహిల్స్ లో 1946 నాటి తెలంగాణా గ్రామం సెట్ వేసి, ఇంకా ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘ఈగ’ సినిమాలకి పనిచేస్తున్న రవిందర్ ఎలాటి అవార్డులకీ సన్మానాలకీ  దూరం!

సికిందర్  
(ఫిబ్రవరి 2011 ,ఆంధ్రజ్యోతి’ కోసం)

14, డిసెంబర్ 2014, ఆదివారం

రివ్యూ

ప్రాబ్లం ఫ్లాష్ బ్యాక్ తో! 

 



స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
తారాగణం :
రజనీకాంత్‌, సోనాక్షి సిన్హా, అనుష్కా శెట్టి, జగపతిబాబు, బ్రహ్మానందం, కె. విశ్వనాధ్‌, సంతానం, రాధా రవి, దేవ్ గిల్  తదితరులు
రచన: పొన్‌ కుమరన్‌, కె.ఎస్‌. రవికుమార్‌ *  సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ *
ఛాయాగ్రహణం: రత్నవేలు * కూర్పు: సంజిత్‌ * కళ: సాబు సిరిల్‌
బ్యానర్‌: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. * నిర్మాత :  రాక్‌లైన్‌ వెంకటేష్‌
విడుదల : డిసెంబర్‌ 12, 2014 
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త  సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా పండగే. ఆ పండగ  ఉత్సాహాన్ని ఇనుమడిం పజేయడం ఎప్పటికప్పుడు ఆయన సినిమాల దర్శకులకి గట్టి పరీక్షే. అయితే  స్టార్లతో కొత్త ప్రయోగాలు చేసే శంకర్ లాంటి టాప్ దర్శకుడి విజన్ ని చూడలేకపోతున్న ఇతర టాప్ దర్శకులకి మాత్రమే ఈ పరీక్ష. రజనీకాంత్ తో శంకర్ ఇంకో  ముప్ఫై సినిమాలు తీసినా అవి వేటికవి ముప్ఫై కొత్త రకాలుగానే  ఉండొచ్చు. ఇతరులే మామూలు మాస్ కమర్షియల్స్ తో సక్సెస్ ని ఇద్దామనుకుంటున్నారు. ఈ కోవకి చెందినవాడే దర్శకుడు కె ఎస్ రవికుమార్. రజనీకాంత్ తో గతంలో ముత్తు ( 1995), నరసింహా( 1999)  తీసిన కోవలోనే తిరిగి రజనీ స్టార్ పవర్ ని ఇంకా ఈ కాలంలో కూడా మరో మూస కథకి మాత్రమే పరిమితం చేయాలనుకున్నాడు. 

         మెగా స్టార్ చిరంజీవి కూడా తన 150 వ సినిమాకి ఇలాటి ‘లింగా’ లాంటి పీరియడ్ కథనే ఎంచుకుంటే రజనీ లాగే తప్పులో కాలేసినట్టే. ఈ కాలంలో ఇవి  ప్రేక్షకులెవరికీ పట్టవు. కేంద్రంలో ఆశలు రేపే కొత్త ప్రభుత్వం, స్థానికంగా రాష్ట్ర విభజన నేపధ్యాలు విసురుతున్న అనేక సవాళ్ళకి పరిష్కారాల కోసం ప్రేక్షకులు అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఎమోషన్ ఇక్కడుంది ఈ వర్తమానంలో. ఎప్పటివో గతించిపోయిన బ్రిటిషకాలపు కథల్లో కాదు. కాలక్షేపమే  కావాలనుకుంటే ఇతర హీరోల సినిమాలు చాలా వస్తాయి, అవి చూసుకుంటారు. రాజకీయంగా ప్రభావితం చేయగల, ప్రాబల్యమున్న సూపర్, మెగా స్టార్ల నుంచి స్వైరకల్పనల మసాలా సినిమాలకోసం ఎదురు చూడ్డం లేదు. తమిళంలో గత అక్టోబర్లో నేటి ప్రేక్షకుల ఎమోషన్స్ ని సరీగ్గా టార్గెట్ చేసిన  ‘కత్తి’ సమకాలీన సామాజిక సమస్యల్ని అతి  బలంగా చిత్రించి ప్రేక్షకుల భావోద్వేగాల్ని చక్కగా సంతృప్తి పర్చగల్గింది. ఈ అతి పెద్ద సక్సెస్ ని తీసింది విజయ్ లాంటి కమర్షియల్ స్టార్ తో, మురుగ దాస్ లాంటి కమర్షియల్ దర్శకుడే!

     ‘లింగా’ మరోసారి  ఫ్యూడలిజంపట్ల ప్రజల భయభక్తుల్ని చాటే తిరోగమనపు కథ చెప్పింది. ఫ్యూడలిజం మీద ఎనలేని సానుభూతిని, ఫ్యూడలిజమే కొనసాగివుంటే ఎంత బావుండునన్న మమకారాన్నీ చాటింది. ఇది  అశేష రజనీ ఫ్యాన్స్ గా నేటితరపు యువప్రేక్షకులకి అర్ధమయ్యే ‘ఇజం’ కాదు. ఐనా సినిమాలో దీనిదే (దాదాపు రెండు గంటలు) సింహభాగం!

    ఈ ‘ఇజం’ సీరియెస్ నెస్ సినిమాలో సమకాలీనతనీ, వినోదాన్నీ మింగేసింది. ‘ఇజం’ తో హీరోయిజమైనా చూపించివుంటే యువప్రేక్షకులకి హుషారెక్కేది-  రజనీ సినిమా అంటే హుషారే గానీ, బేజారెత్తిన అతడిపాత్ర పడే బాధలూ ఏడ్పులూ కాదుగా? ప్రజలకి తమ బాధలు తీర్చే నాయకుడు కావాలి తప్ప, తన బాధలు చెప్పుకునే నాయకుడు కాదు. అది నాయకుడి లక్షణం కూడా కాదు. త్యాగమనే ప్యాసివ్ హీరోయిజం కంటే,  పోరాటమనే యాక్టివ్ నెస్సే రజనీ స్థాయి సినిమాకి పండుతుంది.

రాజావారు – దొంగోడు!  
      లింగా ( రజనీకాంత్) ఒక దొంగ. ఫ్రెండ్స్ నేసుకుని బంగారు నగలు కొట్టేస్తూంటాడు. ఒక సేటుకి అమ్ముతూంటాడు. అతడికి తనతాత రాజా లింగేశ్వర్ అంటే మంట. రాజభోగా లనుభవించిన అతను తన తండ్రికి ఏమీ ఇవ్వలేదనీ, తను దొంగలా మారడానికి అతనే కారణమనీ అంటూంటాడు. ఒక టీవీ జర్నలిస్టు లక్ష్మి పరిచయమవుతుంది. ఇతన్ని దొంగాగా పట్టివ్వడానికి  ప్రయత్నిస్తూంటుంది తన స్టింగ్ ఆపరేషన్స్ తో. ఒకసారి ఒక స్టార్ హోటల్లో ఒక విలువైన ఆభరణం ఎగ్జి బిషన్ జరుగుతూంటే దాని మీద కన్నేస్తాడు లింగా. అక్కడికి అనుసరించి వచ్చిన లక్ష్మీనీ తన ఆపరేషన్లో ఇన్వాల్వ్ చేసేస్తాడు తెలివిగా లింగా. తీరా ఆ ఆభరణం కాజేసి సీటు కిస్తే,  ఆ సేటు అరెస్ట్ అవుతాడు. ఇక లింగా తన ఫ్రెండ్స్ తో పారిపోవాల్సి వస్తుంది.  అప్పుడు లక్ష్మి అతన్ని సింగనూరు అనే వూరు తీసికెళ్తుంది.

    ఇక్కడికే ఎందుకంటే, ఈ వూళ్ళో లింగా తాత లింగేశ్వర్  కట్టిన దేవాలయం వుంది. 70 ఏళ్ల క్రితం నుంచీ ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఆ ప్రారంభోత్సవం రాజా లింగేశ్వర్ మనవాడే చేయాలని ఊరి పెద్ద అయిన లక్ష్మీ  తాత ( కె. విశ్వనాథ్) పట్టుదల. ఆ మనవడే లింగా అని  తెలుసుకున్న లక్ష్మి అతడ్ని ఇక్కడికి తీసుకొచ్చిందన్న మాట. 

    ఆనాడు లింగేశ్వర్ ఆలయంలో శివలింగాన్ని ఒక ఖరీదయిన మరకతమణి తో చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న లింగా, ఆ లింగాన్ని కొట్టేసేందుకు ప్రయత్నిస్తూ గ్రామస్థులకి దొరికిపోతాడు. దీంతో లక్ష్మీ తాత, రాజా లింగేశ్వర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు.

    1939 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రాజవంశీయుడైన లింగేశ్వర్ కలెక్టర్ గా వుంటాడు. ఇతను ఐసీఎస్ కంటే ముందు కేంబ్రిడ్జి యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఒకసారి సింగనూరు అనే ఊరికొచ్చి, అక్కడ నీటి ఎద్దడి కారణంగా కరువుకాటకాల్నీ, ఆత్మహత్యల్నీ చూసి చలించిపోతాడు. అక్కడ డ్యాం కట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాడు. ఆ గ్రామంలోనే భారతీ ( సోనాక్షీ సిన్హా) అనే అమ్మాయి పరిచయమై ప్రేమలో పడుతుంది.

    కానీ ఆ డ్యాం ప్రతిపాదనకి బ్రిటీష్ అధికారి (విలియం ఒరెండ్రాఫ్) అడ్డుతగిలి రైల్వే ట్రాక్ వేస్తానంటాడు. మీ రైల్వే ట్రాకులు మా సంపద దోచుకెళ్ళాడానికే నని ఎదురు తిరిగి, ఆ డ్యాం ని సొంత ఖర్చుతో నిర్మిస్తానని రాజీనామా చేసి వెళ్లి పోతాడు లింగేశ్వర్.

    ఇప్పుడీ డ్యాం ని లింగేశ్వర్ కట్టాడా, కడితే బ్రిటిష్ అధికారివల్ల ఏ ఏ ఇబ్బందు లొచ్చాయి, చివరి కేమయ్యాడు - అన్నవి ఈ ఫ్లాష్ బ్యాక్ లో మిగిలిన అంశాలు.

    ఇలా తాత ఔన్నత్యం గురించి తెలుసుకున్న లింగా మారి పోతాడు. అయితే ఇప్పుడు ఈ డ్యాంని కూల్చే కుట్ర ఒకటి ఎంపీ నాగభూషణం ( జగపతిబాబు) చేస్తున్నాడు. దీన్ని పేల్చేసి, కాలం చెల్లిపోవడం వల్లే అది కూలిపోయిందని చెప్పి కొత్త డ్యాంకట్టే కాంట్రాక్టుతో వేలకోట్లు వెన కేసుకోవాలని అతడి పథకం. ఈ పథకాన్ని లింగా ఎలా తిప్పి కొట్టాడనేది సినిమాకి ముగింపు.

రజనీ షో!

    సాంతం రజనీ షో ఈ సినిమా –మైనస్ రజనీ మార్కు హీరోయిజం, కేరింతలు కొట్టించే డైలాగులు కూడా శూన్యం. దాదాపు రెండు గంటలు సాగే ఫ్లాష్ బ్యాక్ పాత్రే దొంగోడి పాత్రని మింగేసింది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ద్వారా రజనీ కాంత్ లో గంభీర్యాన్నే, ఉదాత్తతనే చూస్తాం. దీని ప్రభావమే దొంగోడి పాత్ర మీద కూడా పడి అది కూడా డౌన్ ప్లే అయింది. మనకి తెలిసి మొట్ట మొదటిసారిగా రజనీ కాంత్ రజనీ కాంత్ లా కాక, ఏ అభిమానీ జీర్ణించుకో లేని ‘పాత్ర’ లా కనపడ్డాడు. రజనీ కాంత్ లో ‘పాత్ర’ని ఎవరూ చూడాలనుకోరు. కేవలం రజనీ కాంత్ నే చూస్తారు. రెండు పాత్రల్నీ ఎంత నీటుగా పోషించినా, ఆ నీట్ నెస్సే రజనీ అనే ఎట్రాక్షన్ కి ఎసరు పెట్టింది. దర్శకుడూ రచయితా కలిసి రజనీ పోషించిన ఉదాత్త పాత్రని ఎంతో పూజించ వచ్చు గాక, అభిమానులు మాత్రం రజనీనే పూజిస్తారు. ఆ వ్యక్తి పూజకి అవసరమైన గుణగణాలని పాత్రలకి పెయింట్ చేయడంలో విఫలమయ్యారు దర్శకుడూ రచయితా.

      హీరోయిన్లిద్దరూ సోనాక్షీ సిన్హా, అనూష్కా శెట్టీ లిద్దరూ ఒళ్ళు చేసి కాస్త ఇబ్బందికరంగానే కన్పిస్తారు. విలన్ గా జగపతిబాబుది సోసో పాత్ర. ఒక పెద్ద డ్యాం ని కూల్చి కొత్త డ్యాం కాంట్రాక్టు పట్టాలనే కుట్ర ఎంత సినిమా అయినా ఒప్పించని విషయం. అతడి కుట్ర కూడా కథనంలో ఎక్కడా కనీస గాభరా పుట్టించే విధంగా కూడా లేదు. కారణం ఫ్లాష్ బ్యాకే అసలు కథని మింగేయడం.
    ఏఆర్ రెహమాన్ సంగీతం, పాటలు కూడా హుషారెక్కించలేక పోయాయి. రత్నవేలు ఛాయగ్రహణం గురించి చెప్పాలంటే, అదొక అనిర్వచననీయమైన అనుభూతి. ఈ లెవెల్లో టాప్ సినిమాటోగ్రఫీ ఇంతవరకూ భారతీయ సినిమాలకి లేదు. రెడ్ డ్రాగన్ 6కె, పాంథమ్ ఫ్లెక్స్ 4కె వంటి అత్యాధునిక హైరిజల్యూషన్ కెమెరాలు వాడిన ఫలితమిది!

స్క్రీన్ ప్లే సంగతులు 
      ఒక సినిమాకి కి ఏది అసలు కథ అవుతుంది? కథ చెబుతూ సందర్భవశాత్తూ ప్రస్తావించుకునే గడచిన కాలపు ఏదైనా ఒక విశేషమా( డ్రీమ్ టైం), లేక వర్తమానంలో నడుస్తున్న కథా (ప్రెజెంట్ టైం)? గతానిదెప్పుడూ కథే   కాదు. అది ప్రస్తుతం ఎత్తుకుని చెప్తున్న, లేదా వర్తమానంలో నడుస్తున్న కథకి అవసరమైన సమచారాన్నిఅందించే వనరు మాత్రమే. ఇలా ఫ్లాష్ బ్యాక్ ( డ్రీమ్ టైం) అనేది ఒక డేటా బ్యాంకే తప్ప, మెయిన్ స్టోరీ కాదు. మెయిన్ స్టోరీ కూడా అవుతుంది- ఎప్పుడంటే- మొత్తం ఫ్లాష్ బ్యాకూ, మెయిన్ స్టోరీ ( డ్రీమ్ టైం- ప్రెజెంట్ టైం) ఒకే పాత్ర వైనప్పుడు. ఉదాహరణకి చిరంజీవి నటించిన ‘ఖైదీ’. ఇందులో మెయిన్ స్టోరీ కంటే ఫ్లాష్ బ్యాక్ నిడివే ఎక్కువ. ( సిల్వెస్టర్ స్టాలోన్ హిట్ ‘ఫస్ట్ బ్లడ్’ కాపీ) అయినా ఫర్లేదు- అది ఒకే హీరో సమస్య కాబట్టి. ఆ హీరో కథనే సమగ్రంగా ఫాలో అవుతున్నాం కాబట్టి. ఇలాకాక, వర్తమానంలో నడుస్తున్న హీరో కథని పక్కన పెట్టి, ఇంకో  పాత్ర ఫ్లాష్ బ్యాక్ ని ఎత్తుకుని సుదీర్ఘంగా చెప్పుకుంటూ కూర్చోవడమంటే, వర్తమాన హీరో కథని దగా చేయడమే. ప్రేక్షకుల వీక్షణా నుభవానికి తీవ్ర భంగం కల్గించడమే.
   ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా ప్రెజెంట్ టైం -డ్రీమ్ టైంలు ఆ హీరోవే  అయివుండడం గమనించగలం. ఇలాటి డ్రీమ్ టైం లతో ప్రమాదం వుండదు గానీ, ప్రస్తుత ‘లింగా’ లో లాంటి అవధుల్లేని రెండో పాత్ర  డ్రీమ్ టైం తోనే  సమస్య వస్తుంది. వుంటే గింటే అది సుదీర్ఘంగా వుండకూడదు. ప్రెజెంట్ టైం నీ , హీరో పాత్రనీ అధిగమించకూడదు. అధిగమిస్తే సినిమా చప్పగా తయారవుతుంది.
    ఒక అపూర్వ సూపర్ స్టార్ గా రజనీ కాంత్ పాత్రపరంగా, నటనా పరంగా అన్ని నియమ నిబంధనలకీ అతీతుడే కావొచ్చు, కానీ స్క్రీన్ ప్లే సూత్రాలకి కాదు. కామెడీకి సంబంధించి అరిస్టాటిల్ ఏం చెప్పాడో- ముందు కామెడీ పుట్టడానికి ఆధారభూతమైన సంఘటన లాజికల్ గా వుంటే, దాని మీద నిలబడి ఎలాటి అసంబద్ధ కామెడీ నైనా నడపొచ్చని- అలా ముందు స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుంటే, ఆ స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకుని కథనంలో ఎన్ని అనూహ్య విన్యాసాలైనా చేసుకోవచ్చు.  రజనీతో ఇదే చేస్తూ వచ్చారు ఇంతకాలం. ఇప్పుడొచ్చి  స్ట్రక్చర్ ని కూలదోసి, స్ట్రక్చర్ కి కూడా రజనీ అతీతుడైనట్టు డ్రీమ్ టైం- ప్రెజెంట్ టైం లతో చెలగాట మాడి బ్యాడ్ టైం ని సృష్టించు కున్నారు. మనవడి కథని ఎత్తుకుని, తాత కథ చెప్పుకొచ్చారు రెండు గంటలపాటూ. 

      ఐతే ఇలా రివర్స్ లో, ఫ్లాష్ బ్యాక్ నే ప్రధాన కథగా మార్చిన స్ట్రక్చరల్ విన్యాసంతో కూడా సినిమాని నిలబెట్ట వచ్చు. కానీ  ‘లింగా’ మేకర్లు తాము ఫ్లాష్ బ్యాక్ తో ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోయారు. ప్రమాదంలో పడబోతున్నామని తెలుసుకుని వుంటే, చేయకూడని ఆ స్ట్రక్చరల్ విన్యాసానికి అనితర సాధ్య రజనీ విన్యాసాలతో చెక్ పెట్టేసే వాళ్ళు!
     ఫ్లాష్ బ్యాక్ లో రజనీ పాత్ర ని అలా పాసివ్ హీరోయిజంతో కాక, బ్రిటిష్ వాడితో అమీతుమీ తేల్చుకునే యాక్టివ్ పాత్రగా – దుమ్మురేపి వదిలేవాళ్ళు. బ్రిటిషర్ ప్రతినాయక పాత్రకి బిల్డప్పే లేక, రజనీ తలపడడానికి ముఠాయే లేక, ప్రతీచోటా రజనీ రాజీ పడిపోయే మనస్తత్వంతోనే  నడిపారు. బ్రిటష్ దోపిడీకి వ్యతిరేకంగా సొంతంగా ప్రజలకి డ్యాం కట్టించి ఇవ్వడానికి కలెక్టర్ పదవికి సైతం రాజీనామా చేసిన ప్పుడే రజనీ బ్రిటిషర్లకి అతీతుడైపోవాలి. అంతేగానీ, ఎలాగో డ్యాం కట్టిన తర్వాత మళ్ళీ ఆ బ్రిటిషర్ బ్లాక్ మెయిల్ కే  తలొగ్గి, సర్వం అతడిపరం జేసి, డ్యాం అతనే కట్టిచ్చినట్టు కూడా రాసిచ్చి, అతడి పేరే పెట్టుకునేట్టు చేసి బికారిలా వెళ్లి పోవడమనే ఫ్లాష్ బ్యాక్ కాన్సెప్టే
పాత్రోచిత్యాన్నీ, తద్వారా కమర్షియల్ గా కథనంలో పుట్టాల్సిన సంఘర్షణనీ  దెబ్బతీసింది. ప్యాసివ్ హీరోయిజం తో పనికిరాని త్యాగ ధనుడన్పించు కోవడంకంటే, ఫిజికల్ యాక్షన్ తో వీరమరణం పొందివుంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ నడకే వేరుగా వుండేది!
   పూర్తిగా ఫ్యూడలిజానికి పట్టంగట్టి, ప్రజలతో అడుగడుగునా రజనీకి పూజనీయ పాత్రగా దండాలు పట్టించడమే సరిపోయింది. దాంతో అది ఉదాత్త పాత్రగానే సెటిలయ్యింది. ఈ కాలం చెల్లిన కథా పాత్రా రజనీ ఇమేజినే డౌన్ ప్లే చేశాయి!
   ఈ రైతుల కథే ‘కత్తి’ లో కూడా చెప్పారు. అందులోనూ తమిళ స్టార్ విజయ్ ద్విపా త్రాభినయమే. అయితే అది సమకాలీనంగా. ఒకడు క్రిమినల్, రెండోవాడు రైతుజన బాంధవుడు. ఇతను కుట్రకి బలైతే, ఇతని స్థానంలో క్రిమినల్ విజయ్ వస్తాడు. రైతుల భూములు లాక్కునే కార్పోరేట్ కుట్ర అది. మన చుట్టూ ఇప్పుడు జరుగుతున్నవాటిని ఎత్తి చూపే చిత్రణ ఇది.. బ్యాంకులకి ఐదువేల కోట్లు ఎగ్గొట్టిన బీరు ఫ్యాక్టరీ వాడు సమాజంలో ఫ్రీగా తిరుగుతోంటే, ఐదు వేలు రుణం తీసుకున్న రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?-లాంటి కదిలించే డైలాగులున్న వర్తమాన కథ చెప్పారు. 2జి స్కాం మీదా, మీడియా అనారోగ్యకర ధోరణి మీదా, ఇంకా చాలా వాటి మీదా  పదునైన డైలాగులు విసురుతాడు హీరో విజయ్. రైతుల సామూహిక ఆత్మహత్యల సీను  ఒక్కటి చాలు ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ అయిపోవడానికి! రజనీ సర్, వేరార్యూ సర్?

సికిందర్
   








    

12, డిసెంబర్ 2014, శుక్రవారం

ఎడిటింగ్

 కన్నూ చెవీ సంబంధం కాలరాస్తే ఎలా?
 క సందేహం : ఫిలిం ఎడిటింగ్ లో ఫిజికల్ కంటిన్యూటీ ఎడిటర్ కి చాలా ముఖ్యం. షాట్స్ ని సీక్వెన్సులుగా, సీక్వెన్సుల్ని మొత్తం సినిమాగా ఏర్చి కూర్చే ప్రయత్నంలో ఎక్కడో ఒక షాటేదో మిస్సయిందన్పించ వచ్చు . హీరో పలికిన ఒక డైలాగుకి విలన్ రియాక్షన్ పడలేదన్పించ వచ్చు. ఆ  రియాక్షన్ షాట్ కోసం దర్శకుడ్ని సంప్రదిస్తాడు ఎడిటర్. ఇలా కంటిన్యూటీ షాట్స్ ని తర్వాత తీయడాన్నే ప్యాచ్ వర్క్ అంటారు. ఆ వొక్క షాట్ తీయడానికి పది  వేలు ఖర్చయినా, దానివల్ల పది లక్షల కలెక్షన్ పెరగ వచ్చు. బాగానే వుంది,  మరి 35 కోట్లు ఖర్చుపెట్టి ‘ఆరెంజ్’ తీసినప్పుడు, అందులో చివర్లో హీరో రాం చరణ్, హీరోయిన్ జెనీలియాని కలుసుకోబోతూండ గానే, హఠాత్తుగా శుభం పడి, రీలేదో  మిస్సయినట్టు థియేటర్లో  గందరగోళం ఏర్పడింది. అలాంటప్పుడు అది కలెక్షన్లని దెబ్బతీసే కంటిన్యూటీ సమస్యలా తోచి, వెంటనే ప్యాచ్ వర్క్ కి ఆదేశించాలన్పించ లేదా సుప్రసిద్ధ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ కి? ఆ అర్ధాంతరపు ముగింపునలా ఉపేక్షించి , సినిమాకి జరగబోయే భారీ నష్టాన్ని చూస్తూ కూడా ఎందుకు వదిలేసినట్టు?

          దీనికాయన ఇచ్చిన జవాబు : దర్శకుడి లాజిక్ ననుసరించే ముగింపుని అనుమతించామని! రొటీన్ గా ముగించకుండా కాస్త సాంప్రదాయేతరంగా  ఉండాలన్న దర్శకుడి ఆలోచన మేరకే అది జరిగిందని వివరించారు.

          దర్శకుడి విజ్ఞతే శిరోధార్యమైనప్పుడు ఎడిటర్ చేసేదేమీ వుండదు. అయితే ఎడిటింగ్ లో తను ప్రేక్షకుల్లో ఒకడిగా ఫీలయ్యి నిస్సంకోచంగా దర్శకులకి తన అభిప్రాయం వ్యక్తం చేస్తానన్నారు వెంకటేష్. నిజానికి ఈ విమర్శనా  దృష్టే తనని ఎడిటర్ గా చేసిందన్నారు. ‘కూలీ నెం-1’ తీసిన కె. రాఘవేంద్ర రావు దానిమీద తన విశ్లేషణ కోరినప్పుడు, నిర్మొహమాటంగా చెప్పడమే ఆయనకి  నచ్చి ఆ తర్వాత ‘అల్లరి ప్రేమికుడు’ కి ఎడిటింగ్ బాధ్యతల్ని అప్పజెప్పారన్నారు. 1995 లో అలా ఎడిటింగ్ పగ్గాలందుకున్న వెంకటేష్, అంతవరకూ సుప్రసిద్ధుడైన తన తండ్రి ఎడిటర్ మార్తాండ్ దగ్గర సహాయకుడుగా వున్నారు. ఇప్పటికి ఈ పదిహేనేళ్ళ ప్రస్థానంలో 250 తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా అగ్రస్థానంలో వుంటున్నారు. 
    మాన్యువల్ ఎడిటింగ్ కాలానికి చెందిన ఈయన మొదట రాఘవేంద్రరావు తిట్టి కొట్టి చెప్పిన పాఠాలెన్నో నేర్చుకున్నారు. తర్వాత రామానాయుడు స్టూడియోలో ఎవిడ్ వ్యవస్థ నెలకొల్పినప్పుడు, నిర్మాత డి. సురేష్ కోప్పడుతూంటే, మాన్యువల్ ని వదిలి వెళ్లి ఎవిడ్ ఎడిటింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు సరికొత్త వెర్షన్ ఎవిడ్ -5 మీద పనిచేస్తున్నారు.

           అయితే చాలా మంది దర్శకులు ఎడిటింగ్ లో వస్తున్న కొత్త టెక్నాలజీని దుర్వినియోగ పరుస్తున్నారని బాధ పడ్డారు వెంకటేష్. ఫ్లాష్ లు, డిజాల్వ్ లు, వైప్ లు, స్ప్లిట్ ఫ్రేములు, ఇష్టారాజ్యంగా వేయిస్తున్నారన్నారు. ఫారిన్ లో షూటింగ్ ఎందుకు చేస్తారు? అక్కడి సుందర దృశ్యాలతో కనువిందు చేయాలనేగా? మరి ఆ వివిధ లోకేషన్స్ లో తీసిన సుందర దృశ్యాల్ని నాలుగేసి బొమ్మలుగా విభజించి, ఒకేసారి తెరమీద స్ప్లిట్ స్క్రీన్ లో వేస్తే  ప్రేక్షకులు వాటినెలా ఆస్వాదిస్తారని ప్రశ్నించారు.


           సరే, ఇప్పుడు పెరిగిపోయిన జీవన వేగం కారణంగా ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ (ఒక దృశ్యం పై ధ్యాస నిలిపే కాలం) కొన్ని సెకన్లకి పడిపోయిందని హాలీవుడ్ సినిమాల్లో కూడా ఎంటీవీ తరహా మైక్రో షాట్స్ తో సినిమాలు తీస్తున్నారు, ఇది సబబేనా అంటే- అది కంటికీ చెవికీ మధ్యన వుండే  4 ఫ్రేముల తేడా థియరీని కాలరాసి, డబ్బులిచ్చుకుని సినిమా కొచ్చిన ప్రేక్షకులకి తలనొప్పి తెప్పించడమేనని ఆయన దుయ్యబట్టారు! ఈ జాడ్యం తెలుగు సినిమాల్లోనూ ప్రబలిందన్నారు. షాట్స్ ని గజిబిజిగా వేయాలని నేటి దర్శకులు కోరుతున్నారన్నారు.


          తన వరకూ సంప్రదాయ స్కూల్ నే అనుసరిస్తున్నానని అన్నారు వెంకటేష్. డాక్టర్ డి. రామానాయుడు తన ప్రతీ సినిమానీ ప్రేక్షకుల మధ్య కూర్చుని- మొదటి రోజు, మూడో రోజు, రెండు వారల తర్వాతా..ఇలా మూడేసి సార్లు చూసి, ఎక్కడ ప్రేక్షకులు ఏడుస్తున్నారు, ఎక్కడ నవ్వుతున్నారు, ఎక్కడ చప్పట్లు కొడుతున్నారూ స్టడీ చేసి రమ్మనేవారు వెంకటేష్ ని. ఈ అనుభవం బగా తోడ్పడింది. అలాగే తన తండ్రి మార్తాండ్ కూడా ఒక విషాద సన్నివేశంలో కళ్ళు చెమర్చేలా  చేయని ఎడిటర్ మంచి ఎడిటరే  కాదని చెప్పేవారన్నారు వెంకటేష్. తను ఏ సినిమా కథ విననీ, తను ఫీలుయిన పద్ధతిలో కథని షాట్స్ గా కూర్చి, దర్శకుడికి చూపించి, అప్పుడు మాత్రమే  మార్పు చేర్పులుంటే చేస్తానని తన పని విధానాన్ని వివరించుకొచ్చారు.


       మరి తన ఎడిటింగ్ వెనకాల ఇంత వృత్తితత్త్వం ఉంటున్నప్పుడు, థియేటర్లలో ప్రొజెక్షన్ బాయ్స్ వాళ్ళ సొంత ఎడిటింగులూ అవీ చేసుకుని, బోరుకోడుతున్న సినిమాల నిడివినీ, కొన్ని భరించలేని పాటల్నీ వాళ్ళే ఎందుకు తీసిపారేస్తున్నట్టు? ఈ ప్రశ్నేఅడిగితే, అక్కడ ఎడిటర్ విఫలమైనట్టేనని ఒప్పుకున్నారు వెంకటేష్. 

       ఫిలిం ఎడిటింగ్ లో ఎమోషనల్ కంటిన్యూటీ చూసుకోవడం కూడా వుంటుంది. దర్శకుడు ఏ ఉద్దేశంతో దృశ్యాన్ని ప్రతిపాదిస్తున్నాడో గ్రహిస్తే, ఆ ప్రకారం షాట్స్ ని ఎంపిక చేసుకుని, ఆ వరసలో  పేర్చుకుంటూ పోయి దృశ్యానికి న్యాయం చేయవచ్చు. శేఖర్ కమ్ముల తీసిన ‘ఆనంద్’ లో కమలినీ ముఖర్జీ భోగి మంటలో ఫోటోలు వేసేస్తూ వుంటుంది. దీన్ని వెంకటేష్ ఎడిట్ చేశాక, దర్శకుడు శేఖర్ కమ్ముల చూసి, ఆమె తన మనసులోంచి చెత్తని తీసి మంటలో పారేస్తున్న అర్ధంలో ఆ దృశ్యం తీశానని వివరించారు. అప్పుడు వెంటనే వెంకటేష్ మరోసారి చూసుకుంటే, ఆమె గుండెల దగ్గర ఫోటోలు పట్టుకుని మంటలో వేస్తున్న షాట్ ఉండనే వుంది! ఇంకాలోచించ కుండా ఆ షాట్ ని కేంద్రబిందువుగా చేసుకుని, మొత్తం దృశ్యాన్ని రీ- ఎడిట్ చేస్తే, ఎమోషనల్ కంటిన్యూటీ అప్పుడు బాగా వచ్చింది!


        ఇప్పుడు ‘నాగవల్లి’, ‘రగడ’, ‘శక్తి’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మనసారా’ మొదలైన సినిమాల ఎడిటింగ్ పనులతో బిజీగా వున్నారు మార్తాండ్ వెంకటేష్.

సికిందర్
(2010 డిసెంబర్ ‘ఆంధ్రజ్యోతి’ కోసం)
         
                  

10, డిసెంబర్ 2014, బుధవారం

స్క్రిప్ట్చరైంది...



మరో ఫ్రాక్చర్ టార్చర్!
రచన – దర్శకత్వం : వేమా రెడ్డి
తారాగణం : సుమంత్ అశ్విన్,
రెహానా, వైవా హర్ష, తాగుబోతు రమేష్, చైతన్య కృష్ణ తదితరులు.
సంగీతం : మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం : సాయి శ్రీరాం
బ్యానర్ : మహీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
, ఇలవల ఫిలింస్‌
నిర్మాతలు: సిహెచ్‌. నరసింహాచారి
, ఇలవల నరసింహారెడ్డి
విడుదల : డిసెంబర్‌
05, 2014 , సెన్సార్ :U/A
***
      రుసగా రచయితలు దర్శకులవుతున్నారు. చాలా గ్లామరస్ పోస్ట్ గా దర్శకత్వం మారి పోయింది. ఇప్పుడు హీరో వేషాలకోసం ప్రయత్నించే యూత్ బ్రిగేడ్ లేరు. అరచేతిలో టెక్నాలజీ పుణ్యామా అని కెమెరా లు పట్టుకుని సినిమా దర్శకత్వం మీద కన్నేసి, షార్ట్ ఫిలిం డైరెక్టర్ లైపోతూ కుప్ప తెప్పలుగా వచ్చి పడుతున్నారు. ఎవర్ని చూసినా డైరెక్షన్- డైరెక్షన్ తప్ప మరో మాటేలేదు!
          దర్శకులవుతున్న రచయితలు రచన మీద ఏకాగ్రత చెదిరి ఏవో  తీరాలకి చేరిపోతున్నారు. ఈ వారం కొత్తగా మరో ఇద్దరు రచయితలు దర్శకులయ్యారు. ‘చక్కిలిగింత’ తో ఒకరు, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ తో మరొకరు. షరా మామూలుగా ఇద్దరూ ప్రూవ్ చేసుకోలేకపోయారు. ‘చక్కిలిగింత’ తీసిన వేమారెడ్డి దర్శకుడుగా రాణించాలంటే ముందు తానున్న రచయిత స్థానానికి న్యాయం చేసుకో గల్గాలి. రచనే పేలవంగా వున్నప్పుడు  ఆ మెట్టు మీద కాలేసి దర్శకత్వం మీదికి ఎగబాకడమనేది అత్యాశే అవుతుంది.
          యంగ్ హీరో సుమంత్ అశ్విన్ తో మరో ప్రేమ సినిమా  తీశారు. మార్కెట్లో ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అన్ని ప్రేమ సినిమాలు వచ్చిపడుతున్నాయి. ఒకటే రొటీన్  తప్ప తేడా గల ప్రేమ సినిమా అంటూ ఒక్కటీ రావడం లేదు. తేడా అనగానే నిర్మాతలకి భయం. రొటీన్ అనగానే యువ ప్రేక్షకులు పారిపోయి తేడా గల షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడం.  తేడాతో  తొక్కుడు బిళ్ళాట అంత ఈజీ కాకపోయినా, ఈ సంధికాలంలో ఏదో ఒకటి చేయక తప్పదు. లేకపోతే టీవీ సీరియళ్ళు వచ్చేసి  స్త్రీలని సినిమాలకి దూరం చేసినట్టు, సినిమాలకి మిగిలిన ఈ కాస్తా  యువ ప్రేక్షకుల్ని షార్ట్ ఫిలిమ్స్ తన్నుకు పోగలవు!
          ఈ లెక్కింపు లేకుండా వచ్చి పడిందే  ‘చక్కిలిగింత’ అనే మరో రొటీన్. ఐతే దీనికో వెసులు బాటుంది. ఇదేం తేడా కనబర్చక పోయినా, ఇందులో వున్న సింపుల్ పాయింటుతోనే చివరిదాకా కాలక్షేప పాప్ కార్న్ సినిమాగానైనా  తయారు చేయవచ్చు. అయితే దర్శకుడు తన అమ్ముల పొదిలో అస్త్రాల్ని అమాంతం ముందే పారేసుకోవడం వల్ల సగం దాకే వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. మిగతా సగం స్మార్ట్ ఫోన్లో షార్ట్ ఫిలిమ్స్  చూసుకుంటూ గడపడానికి వీలిచ్చింది.
          ముందు కథలోకి వెళ్దాం...
అతడి ప్లాను-ఆమె కౌంటర్ ప్లాను 
   ఆ కాలేజీలో అమ్మాయిలు  అబ్బాయిల్ని వెంట తిప్పుకుంటూ నానా రకాల పనులూ చేయించుకుంటూంటారు. వాళ్ళకి గులాములుగా మారిపోయి ప్రేమించమని అడుక్కుంటూంటారు అబ్బాయిలు. ఎంతకీ ఫలితంలేక విసిగిపోతారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఆడి (సుమంత్ అశ్విన్) వాళ్లకి ఇలాకాదని క్లాసు తీసుకుంటాడు. అబ్బాయిలే వెంటపడి ఎందుకు అడుక్కోవాలి, అమ్మాయిలే మన వెంటపడి అడుక్కోవాలంటూ హితబోధ చేస్తాడు. కాబట్టి ఇకనుంచి వాళ్ళకి దూరంగా వుండి, వాళ్ళే దగ్గరయ్యేట్టు ప్లాన్ ఇస్తాడు. సడెన్ గా అబ్బాయిలు తమని పట్టించుకోకుండా తిరగడంతో అమ్మాయిల లోకంలో కలకలం రేగుతుంది. ఇలాగైతే ఎలా, మన కెలా గడుస్తుందని అలమటించిపోతూంటే, కొత్తగా ఆ కాలేజీకి  అవంతిక (రెహానా) అనే  అమ్మాయి వస్తుంది. రావడం రావడంఎడారిలా  వున్న అక్కడి  వాతావరణాన్ని చూసి- విషయం తెలుసుకుని- అబ్బాయిలకి ఈ ప్లాన్ ఇచ్చిన వాణ్ణే లవ్ లోకి దింపితే సరి, అంతా దారి కొస్తారని తను నడుం బిగిస్తుంది.
          ఆమెదే పైచేయి అవుతుంది. అతడ్ని ప్రేమలో పడేసేందుకు ఆమె ప్రయోగించిన చిట్కాలు పనిచేసి, ప్రేమ దాసుడై పోతాడు. అందరి ముందూ ప్రేమని ప్రకటిస్తాడు. అమ్మాయిలే అబ్బాయిల వెంట పడాలన్న ప్రకృతి విరుద్ధమైన నీ  కాన్సెప్ట్ ఎంత తప్పో తెలియజేయడానికే ప్రేమ నటించాను తప్ప, నిన్నసలు ప్రేమించలేదని పంచ్ ఇస్తుందామె. కాన్సెప్ట్ విషయంలో ఓటమిని అంగీకరించి,  తనది నిజమైన ప్రేమంటూ మళ్ళీ వెంట పడతాడు. అసలు ప్రేమించని ఆమెని ప్రేమించేట్టు ఎలా చేశాడో ఇక్కడ్నించీ మరో కథ!

ఎవరెలా చేశారు...
         హీరో హీరోయిన్లు, సంగీతదర్శకుడు, ఛాయాగ్రహకుడు, నిర్మాతలు ఈ సినిమాకి ఎస్సెట్స్. ప్రొడక్షన్ విలువల కోసం నిర్మాతలు పాటుపడ్డారు. తమ ప్రొడక్టు కి రిచ్ నెస్ ని తీసుకొచ్చారు.  కథా నిర్మాణానికి (స్ట్రక్చర్) కి తప్ప దాని క్రియేటివ్ హంగులకి కొలమానాలు వుండవు గాబట్టి,  ఎవరి చూపులకి తగ్గట్టు వాళ్లకి అది అద్భుతంగానే  కన్పిస్తుంది. క్రియేటివిటీ  ఎమోషనల్ బాపతు. క్రియేటివిటీ వెనుకాల స్ట్రక్చర్ మేధోపరమైనది. మొదటిది హృదయంతో చూస్తే  రెండోది మెదడుతో చూడాల్సి వుంటుంది. ఈ రెండూ బ్యాలెన్స్ అయితేనే అంతిమంగా ప్రొడక్టు కి విలువ. ఈ సినిమాకి నిర్మాతలు వ్యయం చేసింది హృదయ సంబంధమైన క్రియేటివిటీ పైనే తప్ప, దానికి ఆధారభూతమైన మేధో పరమైన స్ట్రక్చర్ మీద కాదు. అంటే వాస్తు చూడకుండా పైపై నగిషీలు చూసి భవనం కొనడం లాంటిదన్నమాట. 
          హీరో సుమంత్ అశ్విన్ నటనలో ఇంప్రూవ్ అయాడు. అయితే అది ఒక కోణంలోనే. జీవం పోసే విషయంలో కాదు. కమల్ హాసన్ ఏం చేసి జీవం పోసేవాడో చూసి నేర్చుకుంటే బావుంటుంది. కట్టె-కొట్టె-తెచ్చె లాంటి ఫ్లాట్ క్యారక్టర్స్ ని కూడా ఏవో గిమ్మిక్కులు చేసి కలర్ ఫుల్ గా మార్చే వాడు. సుమంత్ అశ్విన్ కేవలం తన పాత్ర  ఏం చేస్తోందనే గాక, ఎలా చేస్తే తనకో బ్రాండ్ ఏర్పడుతుందో ఆలోచించి చేస్తే, కనీసం నటనలోనైనా డిఫరెంట్ హీరో అన్పించుకుని క్రేజ్ సృష్టించుకో వచ్చు. కమల్ హాసన్ కేవలం నటించడం మాత్రమే చేయలేదు, క్రేజ్ ని కూడా సృష్టించు కున్నాడు. రొటీన్ ప్రేమ సినిమాలకి  ఫ్రెష్ నెస్ ని తీసుకురావడానికి ఇదొక మార్గం కూడా కావొచ్చు.
          హీరోయిన్ రెహానా చలాకీగా పాత్రని పోషించు కొచ్చింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ తోనే చాలా చెప్పింది. గ్లామర్ కి తక్కువైనా నటనలో ఎక్కువే ఆ వయసుకి. కానీ దర్శకుల ధోరణి కొద్దీ సినిమాకొక కొత్త హీరోయిన్ రావడం - పోవడం జరుగుతున్న కాలంలో, రెహానా దర్శకుల దృష్టిలో పడి మరికొన్ని  సినిమాల్లోనటించే అవకాశాలు తక్కువే. చిన్న బడ్జెట్ సినిమాలకి చెప్పుకోదగ్గ టాప్ డైరెక్టర్ లేనట్టే, లీడింగ్ హీరోయిన్ కూడా లేదు. ఇదీ టాలీవుడ్ ట్రెండ్.
          మిక్కీ జె. మేయర్ కి ఈసారి స్వరాలు కుదిరి పాట లప్పుడు కూర్చో బెట్టగలిగాడు. ఛాయాగ్రహణం...జయంత్ పానుగంటి మాటలు ఓమాదిరిగా వున్నాయి. సినిమా టైటిల్ కి తగ్గట్టు చక్కిలిగింతలు పెట్టి వుండాలి డైలాగులు. టైటిల్ కీ చూపించిన సినిమాకీ సంబంధం లేదనేది వేరే విషయం. టేకింగ్ పరంగా, షాట్ కంపోజింగ్ పరంగా దర్శకుడు మంచి టెక్నీషియనే. అయితే మంచి స్క్రిప్టు చేతిలో వున్నప్పుడు ఈ టెక్నికల్ అంశాలకి సార్ధకత చేకూరుతుంది.

స్క్రీన్ ప్లే సంగతులు          
      ఒక సినిమా తీసి ఒప్పించాలంటే ఇవ్వాళ బయటి ప్రపంచంలో పుట్టుకొస్తున్న కొత్త కొత్త పోకడల్ని  కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన మానసిక శ్రమ పెరిగిపోతోంది. పెరగాలి కూడా. లేకపోతే ప్రపంచం ముందుకు, సినిమాలు వెనక్కీ వెళ్ళిపోతాయి. డిజిటల్ టెక్నాలజీ సినిమాలకెంత కలిసి వచ్చిందో, అంతే సమానంగా సినిమాల కావల సమాజంలో ప్రేక్షకుల చేతికీ అందివచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుడే సినిమా తీసేస్తున్నాడు!
          సినిమా టెక్నాలజీ అతి చవకలో అరచేతిలో ఇమిడిపోయే సాధనంగా మారిపోవడంతో, యువత కోరికలు గుర్రాలవుతున్నాయి, వాటికి  ఆకాశమే హద్దు అవుతోంది. ఇలా తమలో దాగివున్న సృజనాత్మకతని వెల్లడించుకునే మార్గంగా షార్ట్ ఫిలిమ్స్ అనే కొత్త స్ట్రీమ్ అంది వచ్చింది. ఎప్పుడూ కాల్పనిక సాహిత్యం పట్ల ఆసక్తి చూపని యువత, షార్ట్ ఫిలిమ్స్ పుణ్యామాని ఇప్పుడు ఏకంగా కథా రచనకి శ్రీకారం చుట్టేస్తున్నారు! ఇదెంతో ఆహ్వానించదగ్గ పరిణామం. డిటెక్టివ్ సాహిత్యం వచ్చేసి ఒకప్పుడు రిక్షావాడిలో సైతం పఠనాసక్తిని పెంచినట్టు- షార్ట్ ఫిలిమ్స్ వల్ల  యువతలో కథా రచనా, నటనా, దర్శకత్వం, నిర్మాణమూ  అనే బహుముఖీన  క్రియేటివ్ ద్వారాలు బార్లా  తెరచుకుంటున్నాయి.
          నిత్యం కుప్పలు తెప్పలుగా యూ ట్యూబ్ లో అప్ లోడ్ అవుతున్న తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ని చూస్తే ఇప్పటి యువత  ఆలోచనా ధోరణి తెలుస్తుంది. వాళ్ళు ఇంకా మూసలో వస్తున్న తెలుగు సినిమాల కథా కమామీషుల్ని దాటుకుని చాలా ముందు కెళ్ళి పోయారు. సినిమా ప్రేమలకి నిరసనగా అన్నట్టుగా  ఇప్పటి తమ ప్రేమలు అసలెలా వున్నాయో వాస్తవికంగా, ఆధునికంగా  చూపించేస్తున్నారు. వీళ్ళ ముందు మన సినిమా దర్శకులు వెలవెల బోతున్నారు. ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘క్యాంపస్ సెలెక్షన్’, ‘అద్వైత’ ..ఇలా ఎన్నెన్నో ‘షార్ట్స్’ రచనలో, డెప్త్ లో, దర్శకత్వంలో సినిమాలకే పాఠాలు నేర్పే స్థితికి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. యూత్ నాడిని ఇవి పట్టుకున్నంతగా సోకాల్డ్ ప్రేమ సినిమాలు పట్టుకోవడంలేదు. ఇది చెప్పినా అర్ధం చేసుకునే స్థితిలో లేరు. ప్రమాద ఘంటికలు మాత్రం మోగుతున్నాయి. ఈ షార్ట్స్ ని ఎంతమంది యూట్యూబ్ లో చూస్తారని కొట్టిపారేస్తే కూడా కాదు. విలేజి కుర్రాడు సెల్ ఫోన్లో చూసుకోవడానికి నికి కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. గంట కూర్చుని వరుసగా మూడు నాల్గు షార్ట్స్ చూసిన కుర్రాడికి ఇంకే ప్రేమ సిన్మాకూ వెళ్ళబుద్ధి కాదు.
          ఈ నేపధ్యంలో ఇంకా హీరో హీరోయిన్ల మధ్య అదే అరిగిపోయిన పాత ఛాలెంజిల ఫార్ములా ప్రేమ కథ చూపించు కొచ్చారు. దీనికి కూడా స్ట్రక్చర్ లేదు. లేకపోవడం వల్ల ఇది ఇంటర్వెల్ కే ముగిసిపోయింది. ముగిసిపోయిన కథలోంచి ఇంకో కథ లాగి సెకండాఫ్ నడిపించారు. అందుకే మొదలెట్టింది లగాయత్తూ ద్వితీయార్ధం కుప్పకూలింది.
          హీరో ఒక నియమం పెట్టుకున్నాడు. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడకుండా, అమ్మాయిలే అబ్బాయిలకి ప్రేమని ప్రతిపాదించాలని... హీరోయిన్ వచ్చింది, హీరోని ప్రేమలోకి దింపి అతడి నియమాన్ని పటాపంచలు చేసింది. ఉపసంహారంగా ఆడా మగా మధ్య కెమిస్ట్రీ గురించి ఇంత పొడుగు లెక్చ రిచ్చింది. ఓటమిని ఒప్పుకున్నాడు, ఇంటర్వెల్లో ఐపోయింది కథ. ఇంకేంటి?
          అయినా-  నన్ను ప్రేమలో పడేసి నిజంగానే నాలో ప్రేమని పుట్టించావంటూ ఇంకో రాగం ఎత్తుకున్నాడు హీరో. ఇంకా ఇదెవరి క్కావాలి?  సినిమా ప్రారంభ దృశ్యాల్లోనే ఎత్తుకున్న పాయింటుకి ఇంటర్వెల్లో నే జడ్జ్ మెంట్ ఇచ్చేశాక, మళ్ళీ అందులోంచి ఇంకో పాయింటు లాగి కథ నడిపితే అది స్ట్రక్చర్ లో వున్న స్క్రీన్ ప్లే అవుతుందా?
          ఆ ఎత్తుకున్న మొదటి పాయింటుతోనే సినిమా సాంతం నడిపించడం ఎలా అసాధ్యమో, సెకండాఫ్ లో ఎత్తుకున్న రెండో  పాయింటు తో సెకండాఫ్ నడపడం కూడా అంతే  అసాధ్యం. ఇది ప్రత్యక్షంగా కన్పిస్తోంది. తనలో వున్నది కూడా ప్రేమేనని హీరోయిన్ ఒప్పుకోవడానికి ఎన్ని రంగులు మారుస్తూ ఎంత నస పెట్టింది? చివరికి ఎంత బేలగా ముగింపు పలికింది?
          ఒక సినిమా కథకి ఒకే పాయింటు వుంటుందనేది, పాత్రకి ఒకే లక్ష్య ముంటుందనేది, రెండేసి పాయింట్లు, రెండేసి లక్ష్యాలూ ఒకే ఒరలో ఇమడవనేది, స్క్రీన్ ప్లే రచనలో ఎలిమెంటరీ పాఠం కదా! ఇలా ఇంటర్వెల్లో కథ ముగింపు కొచ్చిన, ఫ్రాక్చర్ అయిన స్క్రీన్ ప్లేల గురించి ఇదే బ్లాగ్ లో ఈ మధ్యే విడుదలైన రెండు  సినిమాల రివ్యూల్లో తెలియజేశాం. అవి ‘రేసుగుర్రం’, ‘రభస’ అనే బిగ్ బడ్జెట్ సినిమాలు. ఇంకా వెనక్కెళ్తే ‘ఊసరవెల్లి’, ‘అశోక్’ లలోనూ ఇదే ఇంటర్వెల్ లో ముగింపు సిండ్రోమ్! ఈ నాల్గింటిలోనూ  మూడు సురేందర్ రెడ్డి దర్శకత్వం లోనివే కావడం గమనార్హం. ఫ్రాక్చర్ స్క్రీన్ ప్లే (ఎఫ్సీ) ల దర్శకుడిగా సురేందర్ రెడ్డికి అవార్డు ఇవ్వొచ్చు. ఎఫ్సీల దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన  ‘రేసుగుర్రం’ రచయితే ప్రస్తుత ‘చక్కిలిగింత’ కి మరో ఎఫ్సీ దర్శకుడు కావడం సహజంగానే జరిగే పరిణామం.
          మరో ఎఫ్సీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. అతను ‘రభస’ అనే ఎఫ్సీకి ముందు అలాటిదే ఇంటర్వెల్లో ముగిసిన కథతో, ఫ్రాక్చర్ అయిన స్క్రీన్ ప్లే తో,  రామ్ హీరోగా ‘కందిరీగ’ తీసిన చరిత్ర వుంది. ఈ సంవత్సరం బోయపాటి శ్రీను తీసిన ‘లెజెండ్’ కూడా ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లేనే. మరి ఇలాటి స్క్రీన్ ప్లే లతో ‘రేసుగుర్రం’, ‘కందిరీగ’, ‘లెజెండ్’ హిట్టయి, మిగిలిన ‘అశోక్’, ‘ఊసరవెల్లి’, ‘రభస’ ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే, ‘రేసుగుర్రం’, ‘కందిరీగ’, ‘లెజెండ్’ లు క్యారక్టర్స్ లో పస వల్ల ఫ్రాక్చర్స్ ని అధిగమించగల్గాయి (‘రభస’ రివ్యూని ఒకసారి బ్రౌజ్ చేయండి).
          ‘చక్కిలిగింత’ హీరో పాత్రకి స్క్రీన్ ప్లే పగుళ్ళకి ప్లాస్టరింగ్ చేసేంత క్యారక్టర్ సరుకు లేదు. అందుకు పెద్ద మేస్త్రీ అయి వుండాలి. ‘కందిరీగ’, ‘లెజెండ్’ ‘రేసుగుర్రం’ హీరోలు  పాత్రలు కుదిరిన, చేయి తిరిగిన కమర్షియల్ మాస్ మేస్త్రీలు.

మరేం చేసివుండాలి?
         ఒకరు  తీసిన కథలో లోపాలు కొన్ని చెప్పి దిద్దుబాటు చేసే ప్రయత్నం చేయవచ్చుగానీ, ఈ కథని ఇలా తీయాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. కొన్ని అరుదైన సందర్భాల్లో చెప్పకపోతే, సమీక్షే ప్రశ్నార్ధకంగా, అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు. ఇంత చెప్పావ్, మరేం చేయాలో చెప్పవయ్యా అని నిలదీసే అవకాశం కూడా వుంది.  కాబట్టి తప్పో ఒప్పో ఇది చెప్పుకుని ముగిద్దాం.
          ఇప్పటి సినిమాలకి మానసిక సంఘర్షణలు కాక, ఫిజికల్ యాక్షనే  అవసరం. ఒక లాయర్ కోర్టులో లా పాయింట్లు వాదించడం గాక, యాక్షన్ లోకి దిగి  మర్డర్ కేసు సాధించడమే విజువల్ మీడియాకి అవసరం. మానసికంగా పెట్టుకున్న  ‘పెంట’ కి, హీరో  అడుగడుగునా మంటల్లో పడి  మలమల మాడిపోవడం చాలా అవసరం. అమ్మాయే  అబ్బాయి వెంట పడాలన్న  హీరో పెట్టుకున్న  రూలు ప్రకృతి సూత్రాల పట్ల ఒక పోగాలపు క్రైమ్ గా ఎష్టాబ్లిష్ చేస్తే, దానికి పనిష్మెంట్ గా అతడ్ని రకరకాల ఇబ్బందులకి గురి చేయవచ్చు. ప్రేమని గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేయకపోవచ్చు, కానీ ప్రపోజ్ చేసే అమ్మాయిలు వేరే చాలా మంది వుంటారు. మనవాడి పైత్యం ఊరంతా తెలిసిపోయి- ప్రపోజ్ చేసే వేశ్యలు, ఆంటీలు, పెళ్లి కాని ప్రౌఢలు, క్రిమినల్ ఆలోచనలున్న గొప్పింటి అమ్మాయిలూ అందరూ వెంట పడతారు. పీకలోతు కష్టాలు, చెప్పుకోలేని చెడ్డ అనుభవాలు. పోలీస్ కేసులు, అరెస్టు వారెంట్లు, చక్కటి కాలేజీ కుర్రాడు కాస్తా, తెలివిమాలిన రూలు పెట్టుకుని,  కరుడుగట్టిన క్రిమినల్ గా ముద్రేసుకుని పారిపోవడాలూ (క్యారక్టర్ ఆర్క్ అంటే ఇదే, ఇది లేకపోతే కథనంలో మజా రాదు)...అంతా కడుపుబ్బ నవ్వించే కామెడీతో. హీరోయిన్ వుంటుంది, తన ఆడతనపు సహజాతం కొద్దీ ప్రపోజ్ చేయకుండా, అతడ్ని కష్టాల్లోంచి బయట పడేస్తూ... ఇంటర్వెల్లో ఏదైతే చక్కటి అభిభాషణ చేసిందో- అది చిట్టచివరికి, అనుభవమైతే గానీ తత్త్వం బోధపడని హీరోకి క్లాసు పీకుతుంది.
          ‘థండర్ ప్యాంట్స్’ (2002) అనే చిన్న పాయింటు తో కామెడీ,  ఎక్కడ్నించి మొదలై విస్తరించుకుంటూ మతులు పోగొడుతూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి చూస్తే, రెండున్నర గంటల సినిమాకి చాలని చొప్పదంటు పాయింటుతో ‘చక్కిలిగింత’ ని ఎలా చక్కదిద్దవచ్చో కథా పథకం తెలుస్తుంది. ఇంగ్లిష్ సినిమాల్ని ప్రధానంగా క్యారక్టర్ ఆర్క్ తో, టైం అండ్ టెన్షన్ థియరీతో ఆద్యంతం రక్తి కట్టిస్తారని గమనించాలి.

  సికిందర్