దర్శకత్వం : మణిరత్నం
రచన : మణిరత్నం - కమల్ హాసన్
తారాగణం: కమల్ హాసన్, శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్య
లక్ష్మి, అభిరామి తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : రవి కె. చంద్రన్
బ్యానర్స్ : రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్
నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్
విడుదల : జూన్ 5, 2025
***
మణిరత్నం -కమల్ హాసన్ ఎందుకనో కలిసి రెండో సినిమా చేయడానికి మూడు దశాబ్దాలకి పైగానే పట్టింది. గడిచిపోయిన ఈ సుదీర్ఘ కాలంలో చాలా మార్పులు
జరిగాయి. కాలమే మారిపోయింది. మాఫియాలూ గ్యాంగ్ స్టర్లూ కాలగర్భంలో కలిసిపోయారు.
నక్సలైట్లూ టెర్రరిస్టులూ వెండి తెర మీద నుంచి తప్పుకున్నారు. మరి దుష్టులు ఎవరు
మిగిలారు? గ్యాంగ్ స్టర్ లే. గ్యాంగ్ స్టర్లు వాళ్ళలో
వాళ్ళు చంపుకునే కథల నుంచి బయటికొచ్చి ప్రజా జీవితం మీద పడ్డారు (కుటుంబం మీద దాడి -‘జైలర్’, వ్యవస్థ మీద దాడి-‘విక్రమ్’, ‘జవాన్’). ఈ ట్రెండ్ మార్కెట్
ని పట్టుకున్నాక, మళ్ళీ గ్యాంగ్ స్టర్ ముఠాల మధ్య కాలం
చెల్లిన హింసతో గత నెల ‘రెట్రో, ఈ నెల ‘థగ్ లైఫ్’ విడుదలై దెబ్బతిన్నాయి. మణి-కమల్ కాంబోలో ‘థగ్ లైఫ్’ వాళ్ళ పేరు ప్రతిష్టల్ని పూర్తిగా
దిగజార్చింది. ఈ తొలివారం రన్ లో బడ్జెట్ లో కేవలం 15 శాతం వసూలు చేసిందంటే విధ్వంసం
ఏ స్థాయిలో వుందో వూహించ వచ్చు. ఇలా ఎందుకు జరిగింది? కాలం
చెల్లిన గ్యాంగ్ స్టర్స్ సొంత గొడవల కథే అయినా, దీనికేం
చేసివుంటే ఒక ‘సత్య’ లా, ఒక ‘కంపెనీ’ లా ప్రేక్షకులకి
నచ్చే అవకాశముండేది? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
.jpg)
కథ
1994 లో గ్యాంగ్ స్టర్ శక్తిరాజు (కమల్ హాసన్) ప్రత్యర్థి ఢిల్లీ గ్యాంగ్ లీడర్ సదానంద్ యాదవ్ (మహేష్ మంజ్రేకర్) జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించి అతడి ఇద్దరు పిల్లలు అమర్, చంద్ర అనాధలవుతారు. శక్తి రాజు అమర్ ని చేర దీస్తాడు. చంద్ర కనిపించకుండా పోతుంది. శక్తి రాజు, అతడి అన్న మాణిక్యం (నాజర్) కలిసి అమర్ ని సొంత బిడ్డలా పెంచుకుంటారు. 2016 లో సదానంద్ మేనల్లుడు రణవిజయ్ యాదవ్ (రోహిత్ సరాఫ్) తో మోసపోయిన మాణిక్యం కుమార్తె ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రతీకారంగా అమర్ (శింబు) రణవిజయ్ ని బంధిస్తే, శక్తిరాజు అతన్ని చంపేస్తాడు. ఫలితంగా శక్తిరాజు జైలు పాలవుతాడు. జైలుకి వెళ్తూ గ్యాంగ్ స్టర్ సామ్రాజ్యపు బాధ్యతల్ని అమర్ కి అప్పగిస్తాడు.
తర్వాత, అమర్- మాణిక్యం లకి, సదానంద్ కీ మధ్య సయోధ్య కుదురుతుంది. దీని ప్రకారం సదానంద్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు, అతడి నేర సామ్రాజ్యాన్ని అమర్ స్వాధీనం చేసుకోవచ్చు. ఇది నచ్చనప్పటికీ శక్తిరాజూ చివరికి ఈ సయోధ్యని ఒప్పుకుని జైలు నుంచి విడుదలవుతాడు. విడుదలై కుమార్తె పెళ్ళి ఏర్పాట్లలో వుంటాడు. పెళ్ళి వేడుకల్లో తన సామ్రాజ్యంలో వచ్చిన మార్పుని గమనిస్తాడు. ఇప్పుడు అందరూ అమర్ ని తమ బాస్ గా భావిస్తూంటారు.
ఇలావుండగా, శక్తిరాజు మీద అతను చంపిన రణవిజయ్ యాదవ్ అన్న హత్యాయత్నం చేస్తాడు. దీంతో శక్తిరాజు అమర్ ని అనుమానించడం మొదలెట్టి ఎదుర్కొంటాడు. ఇది అమర్ ని తీవ్రంగా కలవరపెడుతుంది. ఇది చూసి మాణిక్యం అమర్ కి ఒక అబద్ధాన్ని నూరిపోస్తాడు. చిన్నప్పుడు అమర్ తండ్రి మరణానికి శక్తిరాజే కారణమని చెప్పి నమ్మిస్తాడు.
ఇలా అమర్ కి నమ్మకాన్ని, శక్తిరాజుకి అనుమానాన్నీ పెంచుతూ మాణిక్యం పన్నిన కుట్రలో వాళ్ళిద్దరి జీవితాలూ ఏమయ్యాయన్నదీ మిగతా కథ.
పైన చెప్పుకున్నట్టు, గ్యాంగ్ స్టర్లు వాళ్ళలో వాళ్ళు చంపుకునే కథల నుంచి బయటికొచ్చి ప్రజా జీవితం మీద పడే కథలుగా మారేక హిట్టవసాగారు. అయితే అప్పుడైనా ఇప్పుడైనా ఒక కామన్ పాయింటుంది - సామాన్యుడి పాత్ర. ‘నాయకన్’ లో కమల్ ది గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన సామాన్యుడి పాత్రే. అప్పట్లో గ్యాంగ్ స్టర్ సామాన్యుల పక్షాన పోరాడేవాడు. సామాన్యుల పక్షాన పోరాడక పోయినా ‘సత్య’ లో బాధితుడుగా సామాన్యుడే జేడీ చక్రవర్తి రూపంలో వుండేవాడు, అలాగే ‘కంపెనీ’ లో వివేక్ ఒబెరాయ్ పాత్ర. ఈ రెండూ ఎంత హిట్టయ్యాయో తెలిసిందే.
'థగ్ లైఫ్’ లో అసలు సమస్యేమిటంటే ఈ సామాన్యుడు మిస్సవడం. సమాజంలో మన లోంచి నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రాతినిధ్య పాత్రగా ఓ సామాన్యుడు వున్నప్పుడే గ్యాంగ్ స్టర్ మూవీస్ కనెక్ట్ అవుతున్నాయి. ఇలా ప్రాతినిధ్య పాత్ర లేకపోతే ప్రేక్షకులు ఎవరితో కనెక్ట్ అవ్వాలి? ఎవర్ని ఫీలై సినిమా చూడాలి? ఎవరి భావోద్వేగాల్ని తమవిగా చేసుకోవాలి? కమల్ పాత్రకి ఈ నేపథ్యం లేదు. దీంతో మనం ఫాలో కాదగ్గ ప్రతినిధ్య పాత్ర కాలేదు. శింబు పాత్రకి తండ్రి హత్య తర్వాత బాల్యం నుంచీ సామాన్యుడైన బాధితుడి బ్యాక్ డ్రాప్ వున్నా దాంతో ప్రాతినిధ్య పాత్రగా మార్చలేదు. ఈ గ్యాంగ్ స్టర్ పాత్రల్లో ఒక్కటి కూడా సామాన్యుల పక్షాన వున్నట్టు గానీ, సమాజం కోసం నిలబడ్డట్టు గానీ కనపడవు. వాళ్ళ సొంత కుటుంబ గొడవలతో వాళ్ళు కొట్టుకోవడమే. ఇదీ సమస్య. ఇలా ఏ పాత్రకీ ఆడియెన్స్ కెనెక్ట్ లేకపోవడంతో గ్యాంగ్ స్టర్ పాత్రలు మనకు సంబంధం లేని, మనం ఫీల్ కాలేని వాళ్ళ గొడవేదో వాళ్ళు పడుతున్నట్టు తయారయ్యింది కథ.
పైన చెప్పుకున్న విధంగా ఫస్టావ్ సాగుతూ వున్నాక, శక్తి రాజు మీద అమర్ మనసులో మాణిక్యం అనుమాన బీజాలు వేశాక- అందరూ కలిసి టిబెట్ వెళ్తారు. అక్కడ శక్తిరాజుని అమర్ కొండ మీద నుంచి తోసెయ్యడంతో ఇంటర్వెల్ వస్తుంది. అంటే ఇంటర్వెల్ కి ముందు అమర్ మనసులో మాణిక్యం అనుమాన బీజాలు నాటడం ఫస్ట్ యాక్ట్ లో వచ్చే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అయితే, శక్తి రాజుని అమర్ కొండమీద నుంచి తోసెయ్యడం ఇంటర్వెల్లో వచ్చే ప్లాట్ పాయింట్ వన్. ఇంతసేపూ సొంత గొడవల పాత్రలతో ఏకపక్షంగా ఫ్లాట్ గా వెళ్తున్న కథ ఇంటర్వెల్లో కూడా భావోద్వేగాల్ని పుట్టించదు. కారణం, శక్తి రాజు- అమర్ ల మధ్య తగిన బాండింగ్ చూపించక పోవడం. శక్తిరాజుని చూసి అయ్యో పాపం అనుకోవడానికి- చిన్నప్పత్ముంచీ అమర్ ని పెంచిన శక్తిరాజు చేసిన త్యాగాలు, పడ్డ కష్టం ఏమీ చూపించకపోవడం. సొంతగొడవలు చూపించడానికైనా పాత్రల మద్య ఎమోషనల్ బాండింగ్ లేకపోతే ఎలా.
ఇక సెకండాఫ్ ప్రారంభంలోనే బ్రతికి వచ్చేసే శక్తిరాజు ఇక సొంత గ్యాంగ్ లో ద్రోహులు ఒక్కొక్కర్నీ వరసబెట్టి చంపుకుంటూ వెళ్ళడమే సెకండాఫ్ కథ. చాలా సహనపరీక్ష పెట్టే చవకబారు కథ. ఫస్టాఫ్ నుంచీ చూసుకుంటే ఎక్కడా కథలో సస్పెన్స్ గానీ థ్రిల్ గానీ వుండవు. అందుకని యాక్షన్ సీన్లు కూడా ఫ్లాట్ గానే వెళ్ళి పోతూంటాయి. చివరికి అమర్ తో అపార్ధాలు తొలగి సుఖాంతమవుతుంది కథ.
నిజానికి ఇలాటి అనుమానాలు, శతృత్వాలు, అంతమొందించడాలతో కూడిన పాత ఫార్ములాని కాలానుగుణంగా కొత్త మార్చే వీలుందేమో చూడాలి. కాన్ఫ్లిక్ట్ ని రివర్స్ చేస్తే కొత్తగా మారుతుంది. శక్తిరాజు గ్యాంగ్ బాధ్యతలు అమర్ కి అప్పగించినప్పుడు, కుట్రలు చేసే అవకాశం మాణిక్యం కివ్వకుండా శక్తిరాజు తనమీద తనే అనుమానాలు సృష్టించు చుకుంటే - మూడు జరగొచ్చు - తనని పెంచి పెద్ద చేసిన శక్తిరాజు తన తండ్రిని చంపే అవకాశం లేదని అమర్ గట్టిగా నమ్మడం, వినకుండా మాణిక్యం తీవ్రంగా ఎగదోయడం, మణిక్యాన్ని శిక్షించేందుకు శక్తిరాజు తన మీద చేసుకున్న ప్రయోగాన్ని ఏ స్థాయి కైనా తీసికెళ్ళడం. రీళ్ళు పోయి డిజిటల్ వచ్చాక, ఇంకా రీళ్ళే చూసుకుంటూ కీబోర్డు మీద కథ టైపు కొడితే ఆ కథకి తగ్గ లైఫే మిగులుతుంది బాక్సాఫీసులో.
ఇందులో త్రిష ఎందుకు నటించిందో అర్ధంగాదు, అర్ధం లేని పాత్ర. శింబుది కూడా స్పార్క్ లేని పాత్ర, నటన. నాజర్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, జోజు జార్జి, మహేష్ మంజ్రేకర్ - ఇంకా చాలామంది తారాగణంతో కుంభ మేళా వెళ్తున్న ట్రైనులా కిటకిట లాడుతూ వుంటుంది సినిమా- బాక్సాఫీసు కటకట!
అతి కష్టం మీద రెహ్మాన్ రెండు పాటలు బావున్నాయి. సినిమాలో విషయం లేకపోవడంతో బీజీఎం మీద దృష్టి పోదు. ఎడిటింగ్ నిడివిని తగ్గించిన జాడ లేదు. యాక్షన్, కెమెరా ఈ రెండే సాంకేతికంగా హైలైట్.
మణిరత్నం దర్శకత్వ విలువలేమైనా వుంటే అవి కూడా మాసిన కథ కింద నలిగిపోయాయి.
—సికిందర్