రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 24, 2025

1371 : స్క్రీన్ ప్లే అప్డేట్స్

 



సినిమాల్లోని సంఘటనలు ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్రించుకోవాలంటే

రూల్ ఆఫ్ త్రీస్ ని పాటించాల్సిందే...మూడు అనేది ఒక మ్యాజికల్ నంబర్.

ఏదైనా విషయం మూడుగా వుండడం మానసికావసరం. సినిమాల్లో,

టీవీ షోలలో సంఘటనలు మూడుగా జరిగి పూర్తవుతాయి.  మెదడు మూడుగా
జరిగే పాటర్న్ ని గుర్తుంచుకుంటుంది. సంఘటనల్లో ఈ పాటర్న్ ని
వెతుక్కుంటుంది. పాటర్న్ కనిపించలేదో ఆ సంఘటన
లేదా సీను సినిమాటిక్ గా విఫలమైనట్టే...


    సినిమా స్క్రిప్టుల్లో సీన్లు రాసేటప్పుడు, డైలాగులు రాసేటప్పుడు ఎంత ప్రామాణికంగా రాస్తున్నామన్న ప్రశ్న వస్తుంది. సీనంటే ఏమిటనే అర్ధం తెలుసుకోవడం దగ్గర్నుంచీ సీనుని ఎలా నడపాలన్న క్రమం వరకూ కొన్ని టూల్స్ లేదా సూత్రాలున్నాయి. ఒక సీను ప్రొడక్షన్ కాస్టు కొన్ని లక్షల రూపాయల వరకూ వుండొచ్చు. మరి ఇంత పెట్టుబడికి తగ్గ విషయం నిర్మాణాత్మకంగా సీన్లలో వుంటోందా అన్నది ఎవరికివారు ప్రశ్నించుకోవాల్సిన అంశం. అసలు స్క్రీన్ ప్లే అనేదే ఒక త్రి విధ అవస్థలతో కూడిన త్రయం. అంటే బిగినింగ్ మిడిల్ ఎండ్ లు కలిసి త్రయంగా ఏర్పడే అవస్థ. ఇవే అవస్థలు ఒక్కో సీనులోనూ వుంటాయి. ప్రతీ సీనూ దాని లోపల బిగింగ్ మిడిల్ ఎండ్ అనే త్రివిధ అవస్థల్ని అనుభవిస్తూ వుంటుంది. దీనికి ఉదాహరణగా ఇక్కడ క్లిక్ చేసి, 1982 నాటి జస్టిస్ చౌదరి సీను పోస్ట్ మార్టం చూడండి.  అంటే స్క్రీన్ ప్లేకి లాగే సీన్లు కూడా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనే వుంటాయన్న మాట. ఇంకా చెప్పాలంటే ఒక కథకి ఐడియా పుట్టడంలోనూ ఈ త్రివిధ అవస్థలుంటాయి. అంటే మూడు వాక్యాల ఐడియా నిర్మాణంలోనూ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుంటుందన్న మాట. ఐడియా స్ట్రక్చర్ ప్రకారం లేకపోతే ఇక స్క్రీన్ ప్లే, అందులోని సీన్లు, సీన్లలోని డైలాగులూ దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఇదంతా స్ట్రక్చర్ లో త్రివిధ అవస్థల అవశ్యకత గురించి. మరి కంటెంట్ కూడా కొన్ని కీలక దశల్లో త్రివిధ అవస్థల్ని అనుభవిస్తూ వుంటుందని తెలుసా? దీన్ని రూల్ ఆఫ్ త్రీస్ అన్నారు. ఇదేమిటో ఈ క్రింద తెలుసుకుందాం...

        రూల్ ఆఫ్ త్రీస్ అనేది క్వాలిటీ స్క్రిప్టు రచనలో ఒక ముఖ్యమైన టూల్. స్క్రిప్టులో రాస్తున్న కథలో భాగమైన కాన్సెప్ట్ ని, సన్నివేశాల్ని, సన్నివేశాల్లో ప్రతిపాదించ దల్చుకున్న భావాన్నీ- ఓ మూడు సార్లు వల్లెవేస్తే బాగా రక్తి కడతాయని  పండితులు కనిపెట్టిన కిటుకు. తర్వాత ఆంత్రోపాలజిస్టులు కూడా ఈ కిటుకు నిజ జీవితంలో మనం పలికే వాక్యాల్లో, ఎదుర్కొనే ఆయా పరిస్థితుల్లో, చెప్పుకునే కథల్లో బాగా వర్కౌట్ అవుతోందని తేల్చారు. ఉదాహరణకి కింద చూడండి-
The Good, the Bad, and the Ugly

Lock, Stock and Two Smoking Barrels

Stop, Look and Listen

Sex, Lies and Videotape
కట్టె కొట్టె తెచ్చె
కథ -స్క్రీన్ ప్లే- దర్శకత్వం
జడ చూస్తి, మెడ చూస్తి, జబ్బల నునుపు చూస్తి
నీచ్ కమీనే కుత్తే
రెడీ, వన్ టూ త్రీ!

2. పరస్పర సంబంధం, ఆరోహణా క్రమం

    ఇక త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు ఒక త్రయం. త్రివిధ దళాల్లోని సైనిక- నావిక-వాయు దళాలు ఒక త్రయం. త్రికాలాల్లోని  గతం -వర్తమానం -భవిష్యత్తు ఒక త్రయం... ఇలా త్రయంగా వున్న మూడు అవస్థలే రూల్ ఆఫ్ త్రీస్. ఈ మూడు అవస్థలు పరస్పర సంబంధంతో వుంటాయి. పరస్పర సంబంధం లేకుండా సైనిక- నావిక- పోలీసు దళాలు త్రయం కాదు. కాబట్టి అవస్థ కాదు, దురవస్థ. పైన ఇచ్చిన ఉదాహరణలు చూస్తే అన్నీ పరస్పర సంబంధంతో వున్నాయి. అలాగే అవి ఆరోహణా క్రమంలో వున్నాయి. అంటే మొదటి అవస్థ తీవ్రత కంటే రెండో అవస్థ తీవ్రత, రెండో అవస్థ తీవ్రత కంటే మూడో అవస్థ తీవ్రత పెరుగుతూ వున్నాయి.
       
గొప్పవాళ్లు కూడా తమ ప్రసంగాల్లో ఈ రూల్ ఆఫ్ త్రీస్ ని పాటించడం వల్లే అవి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి అంత ప్రఖ్యాత ప్రసంగాలయ్యాయి-
"I came, I saw, I conquered” (Julius Caesar),Government of  the people, by the people, for the people"  (Abraham Lincoln), Life, liberty, and the pursuit of happiness” (Thomas Jefferson)...మొదటి దానిలో I ని మూడు సార్లు వల్లె వేశాడు. అలా I తో మూడు అవస్థల్ని పేర్కొన్నాడు (came, saw, conquered). ఇలా కాకుండా డైరెక్టుగా  I conquered అని ఒకే అవస్థ అనేస్తే, రసోత్పత్తి వుండేది కాదు, ప్రసంగం ఆకట్టుకునేది కాదు. సర్లే వయ్యా, నీకు మాటాడ్డమే రాదు, రాయడం రాని తెలుగు నలుగు సినిమా డైలాగులా వుందనేసి వెళ్ళి పోయేవాళ్ళు జనాలు.
         
అలాగే రెండో దానిలో
people ని మూడు సార్లు వల్లె వేశాడు. people  తో మూడు అవస్థల్ని నొక్కి చెప్పాడు. మూడో ప్రసంగంలో Life, liberty, and the pursuit of happiness మూడూ పరస్పర సంబంధమున్న అవస్థలతో కూడిన త్రయం. త్రివిధ అవస్థలతో కూడిన పద త్రయం.
          
ఈ పద త్రయాన్ని సినిమాల్లో చూస్తే-   “నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికి వచ్చా”, “మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డపై కనుంటే, మీ అబ్బ మొలతాడు కట్టి వుంటే, నీ మూతి మీద వున్నది మొలిచిన మీసమే అయితే నన్ను చంపరా రా!”, “నాకు ఎమోషన్స్ వుండవ్, ఫీలింగ్స్ వుండవ్, కాలిక్యులేషన్స్ వుండవ్, మానిప్యులేషన్స్ వుండవ్'
         
కొందరు కొడితే ఎక్స్ రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది!”, “ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా!
        
ఇలా రూల్ ఆఫ్ త్రీస్ అనేది డైలాగుల్లో ఒక లయని, ఎఫెక్ట్ కోసం పునరుధ్ఘాటనని (వల్లె వేయడాన్ని) సృష్టిస్తుంది. పై డైలాగుల్లో దీన్ని గమనించ వచ్చు. ఎఫెక్ట్ కోసం పరస్పర సంబంధమున్న మూడు పాయింట్లతో మూడు అవస్థల్ని యాక్షన్ ఓరియెంటెడ్ గా క్రియేట్ చేసినప్పుడు, చప్పట్లు పడే పంచ్ లైనుగా ఆ డైలాగు హైలైటవచ్చు.  

3. ప్రేమ సంభాషణల్లో సీక్వెన్స్

    ప్రేమ సంభాషణలు చూస్తే- “ఐ...ఐ...ఐ...లవ్యూ!” (ఈ మూడో సారి పలికినప్పుడు ఎక్కువ ఎమోషన్ తో వొత్తి పలక్కపోతే, ఏడిశావ్ లే అని ఆమె జంప్ అయ్యే ఛాన్సు ఎక్కువుంటుంది).
       
    "నీతో మాటాడాలంటే భయపడ్డాను
, నెర్వస్ అయ్యాను, బట్ నిన్ను చూసి చాలా ఎక్సైట్ అయ్యాను” (రెండు నెగెటివ్ ఎమోషన్స్ దాటుకుని, బట్ చాలా ఎక్సైట్ అయ్యాను అన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్ కొచ్చాడన్నమాట ఆమె మెచ్చుకునేలా. మూడోది కూడా నెగెటివే అనొచ్చు- “బట్ నిన్ను చూశాక చచ్చూరుకున్నాను” అని- ఇది కామెడీ కథ అయినప్పుడు).
       
“ప్లీజ్ ఆగుతావా
? రిక్వెస్ట్ చేస్తున్నా! నే చెప్పేది వింటావా?”  అని ఆమె అడ్డుపడినప్పుడు మూడో మాట తీవ్రత పెంచుతూ అనాల్సి వుంటుంది.
       
ఆమె అతడికి తలంటు పోస్తూ ఇలా అన్నప్పుడు- “ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో
, తర్వాత నీకు తగ్గదాన్ని చూసి ప్రేమించుకో, ఆ తర్వాత హేపీగా ఆమెతో గడపడం నేర్చుకో, గుడ్ బై!” ఇందులో చివరి మాటల్లో  సలహా పాజిటివ్ స్వరంలో అనాల్సి వుంటుంది.
       
ప్రేమ సంభాషణలు త్రివిధా వస్థలతో ఒక సీక్వెన్సు లో సూటిగా
, పాయింటుకొస్తూ, సంక్షిప్తంగా వున్నప్పుడే రూల్ ఆఫ్ త్రీస్ రాణిస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. తోచిందల్లా రాయడం, రాసి ఆనందించడం కాదు. సీక్వెన్సులో వున్న ఒక్కో అవస్థని స్ట్రాంగ్ యాక్షన్ తో, వర్ణనతో చెప్పినప్పుడు ఆ సీక్వెన్స్  బాగా హైలైటయ్యే అవకాశముంటుంది. ప్రేమ  సంభాషణాల్లో రూల్ ఆఫ్ త్రీస్ ని ఆచి తూచి వాడాలి- ఎక్కడ పడితే అక్కడ వాడితే రిపీటీషన్ అన్పించుకుంటుంది.

4. దృశ్య త్రయాల విక్రయాలు  

    శివ బిగినింగ్ విభాగంలో దృశ్యపరమైన రూల్ ఆఫ్ త్రీస్ విజాతీయాలతో అసహజంగా కన్పిస్తుంది. అదే ఒక్కడు బిగినింగ్ విభాగంలో దృశ్యపరమైన రూల్ ఆఫ్ త్రీస్ సజాతీయాలతో అతిగా కన్పిస్తుంది. వీటిని తర్వాత చర్చిద్దాం. ముందుగా హాలీవుడ్ సినిమాల్లో చూద్దాం... వెన్ హేరీ మెట్ సాలీ రోమాంటిక్ కామెడీ టైటిల్ చూస్తే ఒకసారే మీటయినట్టు వుంటుంది. కానీ సినిమాల్లో సాలీని హేరీ మూడు వేర్వేరు సందర్భాల్లో కలుస్తాడు. బిగినింగ్ విభాగాన్ని స్ట్రక్చర్ చేయడానికి రచయిత్రి నోరా ఎఫ్రాన్ రూల్ ఆఫ్ త్రీస్ ని ఎఫెక్టివ్ గా వాడుకున్న విధం తెర మీద కనపడుతుంది. తెర మీద రాసింది కనపడాలి- అంతేగానీ పెట్టిన ప్రతీ రూపాయీ తెర మీద కనపడిందని రివ్యూలు  రాయడం కాదు- ఎలా కనబడుతుంది- ఆడిటర్ జనరల్ ని పక్కన కూర్చోబెట్టుకుని లెక్కిస్తారా?
        
ముందుగా హేరీ
, సాలీ
 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యూయార్క్ కి కారులో వెళ్తూ కలుస్తారు. ఈ మొదటి కలయిక స్క్రీన్ టైమ్ 14 వ నిమిషంలో వస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరి విభిన్న వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, నమ్మకాలూ ప్రేక్షకులకి పరిచయం చేస్తుంది రచయిత్రి.
        
తర్వాత రెండేళ్ళకి అనుకోకుండా ఫ్లయిట్ లో కలుస్తారు. ఈ సీనులో హేరీతో ఫ్రెండ్ షిప్ సాలీ కిష్టం లేదని ఎస్టాబ్లిష్ చేస్తుంది రచయిత్రి. ఫైనల్ గా మూడోసారి బుక్ స్టోర్ లో కలుస్తారు. ఇక్కడ్నుంచే కథ టేకాఫ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు.
       
ఇలాటి దృశ్యాలకి సంబంధించి రూల్ ఆఫ్ త్రీస్ ఒకటే ప్రతిపాదిస్తుంది- మొదటి సారి ఓ సంఘటనే కావొచ్చు
, రెండోసారి కాకతాళీయమే కావచ్చు, కానీ మూడోసారి కూడా ఇలాగే అనుకుని కొట్టి వేయలేం, మీనింగ్ వుంటుంది- అది ఆడ మగ అయినా, ఇద్దరు ఆడవాళ్ళయినా, ఇద్దరు మగవాళ్ళయినా, మున్ముందు తెలిసే ఏదో అర్ధం కోసమే కలిసి ట్రావెల్ చేయాలని యూనివర్స్ తీసుకున్న డెసిషన్ అయివుంటుందది. మనకిలాటివి జరుగుతూంటాయి.

    స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ లో ఆస్కార్ షిండ్లర్, ఐజాక్ స్టెర్న్ ల మధ్య సంబంధం బిగినింగ్, మిడిల్ విభాగాలు రెండిట్లో డెవలప్ అవుతూ, రెండు సార్లు షిండ్లర్ ఆఫర్ చేసే డ్రింక్ ని రెండుసార్లూ మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తాడు ఇజాక్.  ఎండ్ విభాగాని కొచ్చేసరికి, షిండ్లర్ వేలాది మంది యూదుల ప్రాణాల్ని కాపాడడానికి తన సంపద సర్వం త్యాగం చేశాక, ఐజాక్ షిండ్లర్ ఆఫర్ చేసిన డ్రింక్ ని అప్పుడు స్వీకరిస్తాడు. దీని అర్ధమేమిటి? సింబాలిజం. మొదటి రెండుసార్లు షిండ్లర్ అడిగినప్పుడు, ఐజాక్ తిరస్కరించడం షిండ్లర్ నైతిక స్థితికి ప్రతీక. అతను  డ్రింక్ షేర్ చేసుకునేంత మంచి వ్యక్తి కాదని నమ్మాడు ఐజాక్. కానీ మూడవ సీన్లో షిండ్లర్ సంపద సర్వం త్యాగం చేసి నైతికంగా ఎదిగాడని నమ్మిన తర్వాత సంతోషంగా కలిసి డ్రింక్ కొట్టాడు ఐజాక్. ఇదీ రూల్ ఆఫ్ త్రీస్ మ్యాజిక్!
        
క్రిస్టఫర్ నోలన్ తీసిన 'ది డార్క్ నైట్' లో చూస్తే, డైలాగుల్లో రూల్ ఆఫ్ త్రీస్ నాట్యమాడుతుంది - సినిమాలో మూడుసార్లూ జోకర్ ఒకే లైను చెప్తాడు- "నా మొహం మీద ఈ గాయాలేంటో తెలుసుకో వాలనుందా?" అని.  మొదటి రెండు సార్లు, జోకర్ తన ముఖమ్మీద  గాయాల్ని వివరించడానికి వివిధ కథలు చెబుతూ, తనకు తానుగా సమాధానమిచ్చే అలంకారిక ప్రశ్నగా ఇది వుంటుంది.

    మూడోసారి షాకింగ్ గా వుండే క్రిస్టఫర్ నోలన్ క్రియేటివ్ ప్రతిభకి, సీట్లో మూర్ఛపోయి అంబులెన్స్ లో హాస్పిటల్ కి త్వరత్వరగా వెళ్ళి పోవాల్సిందే మనం- మూడోసారి జోకర్ శత్రువుకి అదే ప్రశ్న వేస్తాడు- "నా మొహం మీద ఈ గాయాలేంటో తెలుసుకోవా
లనుందా?" అని. ఈసారి ఇంకేం సమాధానం చెప్తాడో చెప్పే ముందే- "లేదురా, నాకు తెలుసుకోవాలని అస్సలు లేదు- నీ మోహమ్మీద ఆ గాయాలు నీకెలా అయ్యాయో నాకు తెలుసురా, తెలుసు!" అని కత్తులతో విరుచుకు పడి మొహం చెక్కి పారేస్తాడు బ్యాట్ మాన్ అనే వాడు! చాలా ఘోరం.
        
పై మూడు సందర్భాలతో కూడిన ఈ త్రివిధ అవస్థల రేంజి మేనేజి మెంటు ఒకదాన్ని మించొకటి ఎలా పెరిగిందో గమనించొచ్చు. మూడోది షాకింగ్ సంఘటన! అంటే రూల్ ఆఫ్ త్రీస్ కూడా మొత్తం స్క్రీన్ ప్లే లో వుండే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల లక్షణాలతోనే త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ కి లోబడి వుంటుందన్న మాట.

5. శివ కి ఒకటి తక్కువ - ఒక్కడు కి ఒకటి ఎక్కువ
    'శివ'లో దృశ్య త్రయం చూద్దాం- బిగినింగ్ విభాగంలో నాగార్జున ఎదురైనప్పుడల్లా జేడీ ఏదో గిల్లుతూ వుంటాడు. మొదటి సారి సైకిల్ స్టాండ్ దగ్గర తేడాగా మాట్లాడతాడు, రెండో సారి ఓ స్టూడెంట్ ని గర్ల్ ఫ్రెండ్ విషయంలో కొడతాడు, మూడో సారి హీరోయిన్ అమలకి డాష్ ఇస్తాడు. దీంతో నాగార్జున రెచ్చిపోయి సైకిలు ఛైను తెంపి కొట్టడం మొదలెడతాడు. ఇది ప్లాట్ పాయింట్ వన్ సీను. అయితే వరసగా ఈ మూడు సీన్లూ సజాతి సీన్లు కాదు, అమలని డాష్ ఇచ్చే మూడో సీను మొదటి రెండిటితో సంబంధం లేని, సీక్వెన్సులో లేని విజాతి సీను. ఇలా రూల్ ఆఫ్ త్రీస్ ఏర్పాటుకి రసభంగం కలిగింది.
        
నిజానికి ఈ మూడు సీన్లూ అమలతోనే వుంటే వచ్చే నష్టమేమీ లేదు. పైగా మూడు సార్లూ హీరోయిన్ తో జేడీ చెలగాటానికి ఎక్కువ యూత్ అప్పీలుంటుంది, నాగార్జున లవ్ ఇంట్రెస్ట్ అయిన హీరోయిన్ని టార్గెట్ చేయడం  బ్యాడ్ క్యారక్టర్ అయిన జేడీకి బాగా సూటవుతుంది. ఇది వదిలేసి సైకిల్ స్టాండ్ దగ్గర నాగార్జునతో తేడాగా మాట్లాడడం, ఇంకెవరో స్టూడెంట్ ని కొట్టడం వంటివి దృశ్య త్రయం సూత్రానికే విరుద్ధం. మూడు సీన్లూ జేడీ హీరోయిన్ని టార్గెట్ చేస్తూ వుండే త్రి విధ అవస్థలతో వుంటే అది రూలాఫ్ త్రీస్.
        
'ఒక్కడు లో ఇలా కాదు, రూల్ ఆఫ్ త్రీస్ ని దాటి రూలాఫ్ ఫోర్ అయింది. బిగినింగ్ విభాగంలోమహేష్ బాబువర్గం, ప్రత్యర్హి వర్గం చిటికెలేసుకుంటూ కాలు దువ్వుతున్నప్పుడు, ప్రత్యర్ధి వర్గం గెలవలేమని పారిపోతుంది, రెండో సారీ ఇలాగే జరుగుతుంది. మూడో సారి ప్రత్యర్ధి వర్గం వాడు ఒకమ్మాయితో మిస్ బిహేవ్ చేస్తే ఆమెతో చెంప దెబ్బ కొట్టిస్తాడు మహేష్ బాబు. వాడు వెళ్ళిపోయి ప్రతీకారంగా తన వర్గంతో వచ్చేసి పోరాటానికి తలపడతాడు.
        
ఇలా ఈ సీక్వెన్సులో నాల్గు సీన్లయ్యాయి- దృశ్య త్రయం గాక దృశ్య చతుష్టయం అన్నమాట. ఇందులో మొదటి రెండు సీన్ల తర్వాత మూడవది శివ లోలాగే విజాతీ సీను అన్పించవచ్చు- మధ్యలో అమ్మాయిని తేవడం. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆమె శివ లోలాగా హీరోయిన్ కాదు- ఎవరో ఒకమ్మాయి. కాబట్టి ఈమెతోనే అన్ని సీన్లూ వుంటే అప్పుడు తప్పవుంతుంది. హీరోయిన్ గా భూమిక వుండగా వేరే ఈమెతో యూత్ అప్పీల్ కూడా వుండదు. ఈ దృశ్య చతుష్టయాన్ని దృశ్య త్రయంగా కుదించాలంటే- ఆ అమ్మాయితో చెంప దెబ్బ కొట్టించిన మూడో సీన్లోనే ఫైట్ మొదలై పోవాలి.
       
సినిమాల్లో పాత్రచిత్రణ పరంగా చూస్తే- ప్రధాన పాత్ర మూడు దశల డెవలప్ మెంటుకి నోచుకోవాల్సిందే. లేదా దాని జీవితంలో మూడు విశిష్ట మార్పులు సంభవించాల్సిందే. అప్పుడే పరిపూర్ణ పాత్రగా నిలబడుతుంది. జోసెఫ్ క్యాంప్ బెల్ మిథికల్ (పౌరాణిక) స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగంలో ప్రధాన పాత్ర మూడు మార్పులకి లోనవుతుంది : గోల్ ని తిరస్కరించడం
, అప్పుడు గాడ్ ఫాదర్ పాత్ర వచ్చి మోటివేట్ చేయడం, ప్రధాన పాత్ర గోల్ ని స్వీకరించడం.
       
ఇలా రూల్ ఆఫ్ త్రీస్ తో దృశ్యాల్లో మంచి డ్రామానీ
, డైలాగుల్లో డెప్తునీ సృష్టించ వచ్చు. ఒకటే గుర్తు పెట్టుకోవాలి -రాయడం మొదలెడితే ప్రతీ ఛోటా, ప్రతి అణువులోనూ  త్రీ యాక్ట్ స్ట్రక్చరే వుంటుందని, అదే స్క్రీన్ ప్లే అనే విశ్వాన్ని నడిపిస్తుందనీ. ఈ ఆర్టికల్ నచ్చితే, సినిమాల్లో మెటా కామెంటరీ అనే మరో స్క్రీన్ ప్లే అప్డేట్ ని గురించి తెలుసుకుందాం.

—సికిందర్

Tuesday, March 11, 2025

1370 : సందేహాలు- సమాధానాలు

 

Q:  నేను గత నాలుగు నెలలు కష్టపడి స్క్రిప్టు రాసుకున్నాను. ఇది నాకు ఫ్రెష్ గా వచ్చిన ఒరిజినల్ ఐడియానే  తప్ప ఎక్కడ్నుంచీ లిఫ్ట్ చేయలేదు. దీన్ని పిచింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో నా కథ లాంటిదే కథతో ఒక భాషలో ఇటీవల హిట్ సినిమా వచ్చిందని తెలిసింది. ఆ సినిమా చూశాను. రెండూ ఒకటే. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్ళీ ఇంకో కథ ఆలోచించే మూడ్ లో లేను. పిచింగ్ చేయడానికి ఒక ముఖ్యమైన అపాయింట్ మెంట్ కోసం ట్రై చేస్తున్న సమయంలో ఇలా జరగడం భరించలేక పోతున్నాను. మళ్ళీ కొత్త కథ ఎప్పుడు రాసుకోవాలి, ఎప్పుడు పిచింగ్ చేయాలి నాకేం  అర్ధం గాలేదు. మీ సలహా కోసం ఎదురు చూస్తున్నాను. నేను త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో మీరు చెప్పే జాగ్రత్తలన్నీ తీసుకుని స్క్రిప్టు రాశాను.
ఎల్ కె ఆర్, అసోసియేట్
A: మొదటిది : ముందుగా కేక్ కట్ చేసి తినేయండి. ఎందుకంటే మీరు సాధీంచింది చిన్న విషయమేమీ కాదు. ఒక భాషలోవచ్చి హిట్టయిన కథే మీకు తెలియకుండా మీరు రాశారంటే మీకు హిట్ స్క్రిప్టులు రాసే టాలెంట్ వున్నట్టే. మీరనుకుంటున్న ఈ కష్ట సమయంలో దీన్ని సిల్వర్ లైనింగ్ గా తీసుకోండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీలోని రైటర్ ని చిన్నబుచ్చుకోకండి. వాడు మీరూహించని ఎత్తుకెదిగాడు. ఇక అన్నీ పక్కనబెట్టి వాడికో కేక్ కట్ చేసి తినిపించి ఎంజాయ్ చేయండి. ఇది చాలా ముఖ్యం ఇనుమడించిన ఉత్సాహంతో  ముందుకు సాగేందుకు.

రెండోది :  మీ కథ అచ్చం ఇంకో సినిమా కథలా ఎన్నటికీ వుండదు. ఎక్కడో తేడా వుంటుంది. ఆ తేడా పట్టుకుని కొత్త సీన్లు రాసుకుంటే పోలికే వుండదు. ఒకే లాంటి కథతో రెండు సినిమాలొచ్చిన చాలా సందర్భాలున్నాయి.
భరత్ అనే నేను’ - ‘లీడర్’,  ‘ఎక్స్ మెన్’ - ‘స్కై హైమొదలైనవి. ఇలాటి రెండు సినిమాల కథల్ని మూడు వాక్యాల లాగ్ లైన్లు గా రాసి చూడండి- ఎక్కడ డిఫరెంట్ గా వున్నాయి? అలాగే మీరు చెప్తున్న సినిమా (ఈ సినిమా పేరు మీరు రాయలేదు, రాయకూడదు కూడా), మీ కథ -  ఈ రెండిటి లాగ్ లైన్లు రాసి ఎక్కడ తేడాగా వున్నాయో గుర్తించండి. 

(సరీగ్గా పై పేరా పూర్తి చేయగానే పారిశ్రామిక రంగంలో ఓ ప్రముఖుడి నుంచి కాల్ వచ్చింది... మాట్లాడుతూ ఆయన లీడర్అన్నారు, కాసేపటి తర్వాత భరత్ అనే నేనుఅన్నారు. బుర్ర తిరిగిపోయింది ఈ కోయిన్సిడెన్స్ కి. టెలిపతీ అన్నమాట. అంటే సరైన వైబ్రేషన్స్ తోనే యూనివర్స్ తో కనెక్ట్ అయి వున్నామన్న మాటే!).

లాగ్ లైన్ లో ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ ని చూడండి. అది ఒకేలా వుంటే అందులో హీరో ఎదుర్కొనే సమస్యని మార్చండి. కథ మారిపోతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ కి మీరిచ్చే ట్రీట్ మెంట్ మార్చెయ్యండి. డాకూ మహరాజ్ఎన్నోసార్లు వచ్చిన పాత కథే. కానీ స్టయిలిష్ ట్రీట్ మెంట్ వల్ల డిఫరెంట్ గా మారింది. మీ కథకి నేపథ్యం కూడా మార్చవచ్చు. ఎక్స్ మెన్సీరియస్ కథయితే, ‘స్కై హైసున్నిత హాస్యంతో కూడిన అలాటిదే కథ. అలాగే మీ ప్లాట్ పాయింట్స్ తో పోలిక వుంటే వాటినీ మార్చవచ్చు. అలాగే గోల్ ని సాధించే మీ హీరో బలాల్ని, బలహీనతల్ని హైలైట్ చేయొచ్చు. పైన చెప్పినట్టు అన్ని  సీన్లూ మార్చేయండి. ముఖ్యంగా ఎమోషనల్ ట్రాకుని పవర్ఫుల్ గా మార్చండి. దీనికోసం ఏవైనా సినిమాలు చూడండి- ఖైదీఅయినా సరే. ఇకపోతే, మీ కథ తెర కెక్కితే -ఎక్కాలంటే- కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటికి పోలికలు గీలికలు చూస్తూ ఎవరూ కూర్చోరు.

Q: స్క్రిప్టు లో సీన్లు రొటీన్ గా కట్ అని రాసి ఇంకో సీను  మొదలుపెట్టే విధానం తప్ప మరొకటి లేదంటారా? ఇలా వుంటే తర్వాత ఎడిటర్ కి ఉత్సాహముంటుందా?
—జెఆర్ఎస్, అసోసియేట్  

A: ట్రాన్సిషన్స్ అన్నవి ఎడిటింగ్ లో చాలా ముఖ్యం. ఎడిటర్ కి ఉత్సాహాన్నివ్వాలి ట్రాన్సిషన్స్. ఇవి స్క్రిప్టు లోనే రాసుకుంటే ముందు స్క్రిప్టు చదువుతున్నపుడే కథ మూడ్ అంతా క్రియేటయి పోతుంది. కంటెంట్ కొక బ్యూటీ వస్తుంది. అవసరమైన ప్రత్యేక సందర్భాల్లో సౌండ్ కూడా రాసుకుంటే ఆట్మాస్ఫియరంతా క్రియేటై పోతుంది. స్క్రిప్టు అంటే కేవలం డైలాగులతో నింపే పేజీలు కాదు, అది హృదయాల్ని కుదిపే అర్టు.

ఈ మధ్య ఒక డైలాగు వెర్షన్ చూడాల్సి వచ్చినప్పుడు- అందులో అన్నిసీన్లకీ కింద -cut to- అని రాసి వుంది. దీన్ని బట్టి కథనం ఎలా వచ్చి వుంటుందో వూహించొచ్చు. ఒక సీను ముక్కకి ఇంకో సీను ముక్క వరుసగా అతికించుకుంటూ పోవడమే దీని కథనం అన్నమాట. దీనికి ఎడిటింగ్ ఏముంటుంది. చాలా పూర్వం ఎడిటర్ కెవి కృష్ణా రెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు-  డిజాల్వ్, ఫేడిన్, ఫేడవుట్, ఫ్రీజ్, స్ప్లిట్ స్క్రీ న్ వంటి ట్రాన్సిషన్స్ లేదా ఎడిటింగ్ టెక్నిక్స్, లేదా ఆప్టికల్ ఎఫెక్ట్స్ అన్నీ ఎడిటర్ దగ్గరే వుంటున్నాయన్నారు సాఫ్ట్ వేర్స్ రూపంలో. వీటితో  కథా స్వభావాన్ని సమన్వయం  చేసుకుంటూ కథాగమనం లో ఇమిడిపోయేట్టు వాడుకునే అవకాశం లేకుండా సీన్లు షూట్ చేస్తున్నారన్నారు. ఇప్పుడైతే  స్క్రిప్టు రాసేటప్పుడే -cut to- -cut to--cut to- అనేస్తున్నారు కత్తి పట్టుకుని!

-cut to- రాయకూడదని కాదు. నిజానికి ఇవే ఎక్కువుంటాయి. అయితే కథనంలో కొన్ని కీలక ఘట్టాల్లో మిగతా ఎఫెక్ట్స్ కూడా అవసరమే. అప్పుడే సినిమా వీక్షణానుభవం గొప్పగా వుంటుంది. నిజానికి వీటిని స్క్రీన్ ప్లే ట్రాన్సిషన్స్ అన్నారు, ఎడిటింగ్ ట్రాన్సిషన్స్ అనలేదు. ఈ స్క్రీన్ ప్లే ట్రాన్సిషన్స్ ని స్టోరీ టెల్లింగ్ టూల్స్ అని కూడా అన్నారు. ఇవి మొత్తం 12 విధాలుగా వుంటాయి. వీటి వాడకం గురించి  5C’s బుక్ లో తెలుసుకోవచ్చు- లేదా గూగుల్ చేస్తే లభిస్తాయి.

Q:  అల్లరి నరేష్ బచ్చలమల్లి ఆ స్థాయిలో విఫలమవడానికి కారణం ఏంటి? ఆ కథ మీరు తరచూ చెప్పే గాథ అవ్వడమా? లేక హీరో మీద ఆడియన్స్ కి ఎంపతీ కలగకపోవడమా? లేక మరేదైనా కారణమా? కొంచెం వివరంగా చెప్పండి.
—ఏపీ, అసోసియేట్

A: మీరు చెప్పిన వాటిలో మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న రెండూ కరెక్టే. ముఖ్యంగా దీన్ని గాథగా గుర్తించ గల్గినందుకు మీకు అవార్డు. ఎందుకంటే గాథని గుర్తించే మేకర్లు చాలా కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మీరొకరు.  బచ్చల మల్లి దర్శకుడు తీసింది గాథ లాంటి ఆర్ట్ సినిమా. ఇలా అనుకుని తీసినా బావుండేది. తీస్తున్నది కమర్షియల్ సినిమాతో కథ అనుకుని పొరబడి తీయడంతో అంతా తారుమారైంది. ఇది మామూలు గాథ కూడా కాదు, కమర్షియల్ విలువలు ఏ కోశానా లేని ట్రాజడీ గాథ.
       
గాథకి తగ్గట్టు ఇందులో కాన్ఫ్లిక్ట్ లేదు. ఉన్న కొద్ది కాన్ఫ్లిక్ట్ తో హీరోకి పరిష్కార దిశగా గోల్ లేదు. ఇక మూర్ఖుడైన హీరో ఎవరిపట్లా ఎంపతీ లేకుండా మూర్ఖుడు గానే గాథ ముగించుకుంటే -చచ్చిపోతే- ఎవరికి సింపతీ
.  ఫస్టాఫ్ లో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాక మారతాడు. ఎంపతీతో మారిన వాడిని కొందరు చూడలేక తిరిగి మూర్ఖుడిగానే మార్చేసి బలి తీసుకుంటే ఎంత సింపతీ అయినా కలుగుతుంది ప్రేక్షకులకి.
       
ఇలాటి క్యారక్టర్ తో రాజశేఖర్ నటించిన
రౌడీయిజం నశించాలి (మలయాళం లో మోహన్ లాల్ నటించిన కిరీడం కి రీమేక్) మంచి ఉదాహరణ. స్థానిక మార్కెట్ మీద జులుం చెలాయిస్తున్న గ్యాంగ్ లీడర్ ఒకరోజు తన తండ్రిని కొట్టడం చూడలేక వాణ్ణి చిత్తుగా తంతాడు రాజేశేఖర్.  దాంతో మార్కెట్ లోని వ్యాపారులు అతడ్ని తమ హీరోగా చేసేసి అందలం ఎక్కించేస్తారు. అతడికి అందరి పట్లా ఎంతో ఎంపతీ. ఆ ఎంపతీతో రౌడీయిజంలోకి ప్రవేశంచిన రాజశేఖర్, చివరికి అందులోంచి బయట పడదామన్నా పడలేక అదే రౌడీయిజానికి బలై పోతాడు. బోలెడు సానుభూతి పాత్రకి. ఇది గాథ కాదు, కథ. పాసివ్ పాత్ర కాదు, యాక్టివ్ పాత్ర.
       
బచ్చల మల్లి ఇలాకాదు
, మల్లి చిన్నప్పుడు తండ్రి వేరు కాపురం పెట్టినప్పుడు,  ఎవరు కావాలో తేల్చుకోమన్నప్పుడు, అతను మల్లి తల్లిని వదిలేసి, అప్పటికే తన వల్ల బిడ్డ తల్లిగా వున్న పెళ్ళి కానామెతో వెళ్ళిపోతాడు. ఈ ఇన్సైటింగ్ ఇన్సిడెంటే - తండ్రి మీద పుట్టిన ద్వేషమే మల్లి మూర్ఖుడుగా మారడానికి, చెడిపోవడానికి కారణంగా చూపించారు. కానీ భర్త పోతే పోయాడు, కొడుక్కి మంచీ చెడులు చెప్పైనా దారిలో పెట్టుకోవాలన్న ఏ ప్రయత్నమూ చేయదు అతడి తల్లి. అంతా అయిపోయాక గాథ చివర్లో మూర్ఖత్వం గురించి పాఠాలు చెబుతుంది!
       
ఇక్కడ విశేషమేమిటంటే
, మల్లి మీద కంటే అతడి తండ్రి మీదే సానుభూతి కలుగుతుంది. తండ్రిని మల్లి అర్ధం జేసుకునే ప్రయత్నం చేయడు. రెండో ఆమెతో తండ్రి వెళ్ళి పోయాడంటే, ఆమెకి భార్య అనే హోదా నివ్వడానికే, ఆమెతో కన్న కొడుక్కి తండ్రిగా గుర్తింపు నివ్వడానికే. అంతేగానీ ఆమె మీద మోజుతో కాదు. ఈ తండ్రికి  కొడుకుగా తల్లితో సేఫ్ జోన్లోనే వున్నాడు మల్లి. త్రిశూల్ లో తండ్రి మోసం చేసి వెళ్ళి పోతే పెళ్ళికాని తల్లితో సేఫ్ జోన్లో లేడు అమితాబ్ బచ్చన్. ఇదే పుష్ప లో హీరో పరిస్థితీ కూడా. హీరోకి జరిగిన అన్యాయాన్ని చూపించే పద్ధతి ఇదీ. అప్పుడే సింపతీ.
       
ఇక గాథలు ఎంత మోసం చేస్తాయంటే
, అది కథ అనుకుని ప్లాట్ పాయింట్ వన్ కోసం, కాన్ఫ్లిక్ట్ కోసం, హీరో గోల్ కోసం ఎదురు చూస్తూంటాం. ఇవి ఎంతకీ రావు, ఇంటర్వెల్ కి కూడా. అయితే సెకండాఫ్ మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏమో- అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కావచ్చేమో నని ఇంకా ఓపిక పట్టి- ఎదురు చూస్తూంటే- ఇది కూడా కాక జారుకుంటూ వెళ్ళి ముగిసిపోయే సరికి - అప్పుడు తెలుస్తుంది ఈ చూసిందంతా గాథ అనీ, ఇలా మోసపోయి టైమ్ వేస్ట్ చేసుకున్నామనీ. కాబట్టి డియర్ మేకర్స్, ముందు వొళ్ళు దగ్గరెట్టుకుని కథ చెప్పడం నేర్చుకోండి ఇక నైనా- పనికి రాని సోది గాథలు కాదు!  
       
ఫస్టాఫ్ ముప్పావు గంటకి మల్లి హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ ఇంటర్వెల్ కి కూడా కాన్ఫ్లిక్ట్ రాదు. సెకండాఫ్ అరగంట గడిచాకే వస్తుంది- పెళ్ళిని ఆమె తండ్రి నిరాకరించడంతో. పెళ్ళి పత్రిక మీద నీ తండ్రి పేరుండాలని అనడంతో రెచ్చిపోయి కొట్టేందుకు దిగుతాడు. ఇక మళ్ళీ తాగేసి తిరిగేసి
, ఆమె వేరే పెళ్ళి చేసుకుంటోంటే వెళ్ళి రచ్చ చేసేసి, ఆమె చావు చూసి- తను చచ్చిపోతాడు!  ఇదీ మూర్ఖుడి గాథ. పాత్ర ఎక్కడ పుట్టింది? తండ్రి రెండో ఆమెతో వెళ్ళి పోవడం దగ్గర పుట్టింది. ఆ పుట్టుకే తప్పు. కాబట్టి పాత్ర నడక అంతా తప్పు తప్పు.

—సికిందర్

 

Wednesday, March 5, 2025


 

 

సక్సెస్ కి క్వాంటమ్ మెకానిక్స్ దారి చూపుతోంది...

Tuesday, March 4, 2025

1369 : స్క్రీన్ ప్లే సంగతులు


 

 దర్శకత్వం : త్రినాథ రావు నక్కిన
తారాగణం : సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, న్షూ, మురళీ శర్మ, అజయ్, శ్రీనివాస రెడ్డి, హైపర్ ఆది తదితరులు
కథ, మాటలు :  ప్రసన్న కుమార్ బెజవాడ, స్క్రీన్ ప్లే : ప్రసన్న కుమార్ బెజవాడ, సాయి కృష్ణ
సంగీతం : లియోన్ జేమ్స్, ఛాయాగ్రహణం : నిజార్ షఫీ
బ్యానర్స్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్,  జీ స్టూడియోస్
నిర్మాతలు : రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్
విడుదల : ఫిబ్రవరి 26, 2025

***
             ర్శకుడు నక్కిన త్రినాథ రావు నుంచి 'మజాకా' అనే మరో కామెడీ ఫిబ్రవరి 26 న పోటీ లేని సోలో రన్ ని ఎంజాయ్ చేస్తూ రిలీజైంది. కానీ ఆ సోలో రన్ ని క్యాష్ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. కారణం కంటెంట్. బాక్సాఫీసుకి వెళ్ళే ముందు రైటింగ్ టేబుల్ మీద దీనికి పని మిగిలే వుంది. కానీ సరాసరి బాక్సాఫీసు ముందే రైటింగ్ టేబులేసుకుని గబగబా రాసిచ్చేసినట్టుంది. దీంతో కంటెంట్ కి క్వాలిటీ అనేది లేకుండా పోయింది.  ఒక వైపు ప్రేక్షకులు ఇతర భాషల్లో క్వాలిటీ  కంటెంట్ కి అలవాటు పడుతూంటే ఇంకా ఇలాటి సినిమాలు తీసే కాలంలోనే వున్నారు. ఈ కంటెంట్ క్వాలిటీ చెక్ చేయాలంటే దీని స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్ళాల్సిందే.

కథ

కృష్ణ (సందీప్ కిషన్), వెంకట రమణ (రావు రమేష్) లు తండ్రీ కొడుకులు. వెంకట రమణ భార్య చనిపోయింది. ఇప్పుడు కొడుకు పెళ్ళి చేద్దామంటే ఇద్దరు మగాళ్ళ మధ్య మా అమ్మాయిని పంపమని చెప్పేస్తున్నారు. అయితే తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఇంట్లో ఇంకో ఆడది వుంటుందని తెలుసుకుంటాడు వెంకటరమణ. తెలుసుకున్నదే తడవు యశోద (అన్షూ) అనే ఏజ్ బార్ అమ్మాయి ని చూసి వెంటపడతాడు. ఇటు కృష్ణ కూడా మీరా (రీతూ వర్మ) అనే అమ్మాయిని ప్రేమిస్తూంటాడు. ఇద్దరికీ ఈ ప్రేమ వ్యహారాలు అంత సులువుగా వుండవు చివరికెలాగో ఒప్పించుకుంటారు. ఇదీ బ్యాక్ గ్రౌండ్.
       
ఇప్పుడు తామిద్దరూ దొంగ చాటుగా వ్యవహారాలు నడుపుతున్నట్టు తండ్రీ కొడుకులకి ఎప్పుడు తెలిసిపోయింది
? తెలిసిపోయి ఏం చేశారు? అటు యశోదా మీరా ల మధ్య వున్న బంధుత్వమేంటి? ఆ బంధుత్వంలో వాళ్ళిద్దరి మధ్య ఇంకే సమస్య పెళ్ళికి అడ్డుగా వుంది? దీన్నెలా పరిష్కరించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు? ....ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

రోమాంటిక్ కామెడీ కథ. తండ్రీ కొడుకులు ఒకే కుటుంబంలోని ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించడం. ఇందులో ట్విస్ట్ అనుకుని కల్పించిన కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే, ఆ ఇద్దరమ్మాయిలకి ఒకరంటే ఒకరికి పడదు. అందుకని తండ్రీ కొడుకుల్ని పెళ్ళి చేసుకుని ఒకే ఇంట్లో ఎలా వుంటారు? ఇదీ సమస్య. దీన్నెలా పరిష్కరించుకున్నారు తండ్రీ కొడుకులనేది కథ. ఈ కథకి చేసిన కథనంగానీ, పాత్ర చిత్రణలు గానీ పైపైన రాసేసి పైపైన తీసేయడంతో నవ్వుల పాలయింది కామెడీ. ఇదంతా పూర్తి ఔట్ డేటెడ్ సినిమా తీయడానికి దారి తీసింది. ఫస్టాఫ్ ప్రేమలు, ఏవో కామెడీలు చేసి నెట్టుకొచ్చినా, తీరా సెకండాఫ్ లోకొచ్చేసరికి కథకి సరైన దారీ  తెన్నూలేక, నాటు- మోటు కామెడీలతో వూపిరాడక విలవిల్లాడింది. వూపిరి కోసం కథ చేస్తున్న ఆర్తనాదాలే సెకండాఫ్.

స్క్రీన్ ప్లే సంగతులు

ఓపెనింగ్ లో బీచిలో తాగి పడిపోయిన తండ్రీ కొడుకుల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అడుగుతాడు ఇన్స్ పెక్టర్. వాళ్ళిద్దరికీ ఎఫైర్స్ వున్నాయని తెలుసుకుని, తను నవల రాస్తున్నానని- దాచకుండా ఎఫైర్స్ చెప్పమని దబాయిస్తాడు. ఈ ఓపెనింగే తేలిపోయింది. ఇలా ఇప్పటికిప్పుడు ఇన్స్ పెక్టర్ నవల రాస్తున్నాని చెప్తే కన్విన్స్ అవడానికి రెడీగా వుండరు ప్రేక్షకులు. లీడ్ ఇవ్వాలి. అంటే ఇలా పైపైన రాసేసి పైపైన తీసేయకుండా, లోతు పాతుల్లోకి వెళ్ళాలి. అతడికి నవలలు రాసే పిచ్చి వుంటే ముందు పాత్ర పరిచయంతో ఎస్టాబ్లిష్ చేయాలి. అతను కేసుల కోసం గాక, నవల కేదైనా ఐడియా దొరుకుతుందేమోనన్న దృష్టితో నేరస్థుల్ని టార్చర్ చేస్తున్నట్టుంటే ఆసక్తి కల్గించే లీడ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా ఐడియా కోసం తిరుగుతూ బీచికొస్తే, తాగిపడిపోయిన తండ్రీ కొడుకుల్ని చూసి ఇన్స్ ఫైర్ అయినట్టు చూపిస్తే పాత్రకి, ఓపెనింగ్ కి అందం చందం వుంటుంది.
       
ఇక తండ్రీ కొడుకులు ఇన్స్ పెక్టర్ కి చెప్పే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. పైన కథలో చెప్పినట్టు వెంకటరమణ కొడుక్కి సంబంధాలు చూస్తూంటే ఆడవాళ్ళు లేని ఇంట్లో పిల్లనివ్వమని వెనక్కి పంపించేస్తూంటారు. అటు కొడుకు కృష్ణ మీరాని ప్రేమిస్తూంటాడు. ఇక కొడుకు పెళ్ళి అవాలంటే తాను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని వెంకటరమణ యశోదతో ప్రేమలో పడతాడు. ఈ తండ్రీ కొడుకులకి ఆ హీరోయిన్లిద్దరూ లొంగరు. తర్వాత మెత్తబడతారు. తండ్రీ కొడుకులు ఒకరికి తెలియకుండా ఒకరు నడుపుతున్న వ్యవహారాలు బైటపడి పరస్పరం దొరికిపోతారు. అయితే మీరా యశోదా ఒకే ఇంట్లో వుంటున్న బంధువులని తెలుసుకుని షాకవుతారు. ఇదీ ఫస్టాఫ్ విషయం- కథ కాదు
, కథ ఇంకా మొదలవలేదు. ఎందుకంటే హీరోయిన్ల మధ్య బంధుత్వం హీరో లిద్దరితో వావివరసలకి అడ్డు కాలేదు. కేవలం హీరోయిన్ల బంధుత్వం రివీల్ చేయడానికే ఈ ఇంటర్వెల్. ఈ బంధుత్వమే ట్విస్టు అనుకున్నారు. వావివరసలకి బంధుత్వం అడ్డు కానప్పుడు ట్విస్టు ఎలా అవుతుంది? అదొక మలుపు (టర్నింగ్) మాత్రమే అవుతుంది.  తూర్పు- పడమర లో వావివరసలే అడ్డు- కాబట్టి అది మతిపోగొట్టే ట్విస్టు అయింది.

2. ఇంటర్వెల్ ప్రాబ్లం

అంటే ఇంటర్వెల్లో కూడా బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింటు- 1కి రాలేదు. అంటే ఫస్టాఫ్ లో ఇంటర్వెల్లో కూడా కథ ప్రారంభం కాలేదు. అంటే కథేమిటో ఇప్పుడు కూడా మనకి తెలియలేదు. కథేమిటో ఇప్పుడు సెకండాఫ్ ఓపెనింగ్ లో తెలుస్తుంది. బంధువులైన యశోదా మీరాలకి మధ్య బద్ధ వైరముందని. కాబట్టి ఈ తండ్రీ కొడుకులని  చేసుకుని ఒకే ఇంట్లో వుండలేరని. ఇదీ వాళ్ళిద్దరితో వీళ్ళిద్దరికీ ఏర్పడ్డ కాన్ఫ్లిక్ట్. అంటే ప్లాట్ పాయింట్ -1 ఇప్పుడు ఏర్పడిందన్న మాట. ఎక్కడో  ఫస్టాఫ్ లో 45 నిమిషాలకైనా రావాల్సిన ఫ్లాట్ పాయింట్-1, స్థానభ్రంశం చెంది మిడిల్ ప్రాంగణమైన సెకండాఫ్ ప్రారంభంలో వచ్చిపడింది. అంటే బిగినింగ్ వచ్చేసి మిడిల్ ని కబ్జా చేసిందన్న మాట. అంటే బిగినింగ్ విభాగమనే ఉపోద్ఘాతమే ఇంత బారుగా సాగిందన్న మాట. అంటే సుమారు ఈ గంటా 25 నిమిషాల సేపూ అసలీ సినిమా కథేమిటో తేలక తల్లడిల్లుతామన్న మాట!
       
స్ట్రక్చర్ రీత్యా కంటెంట్ ని విప్పిచూస్తే ఈ అనారోగ్యాలు కన్పిస్తాయి. ఇవి అనారోగ్యాలే కాదనుకుంటే నిరభ్యంతరంగా ఇలాగే చేసుకోవచ్చు. కథలో మిగతా సీన్లలో ఏదైనా సీనుని మధ్యలో ఆపేసి తర్వాత కలపొచ్చు. సీనస్ ఇంటరప్టస్ (దృశ్య భంగం అనొచ్చేమో) అంటారు దీన్ని. ఈ టెక్నిక్ ని ఇంటర్వెల్ సీనుకి కూడా వాడొచ్చు. అయితే ఇంటర్వెల్లో హీరోయిన్ల బంధుత్వం రివీల్ చేసినప్పుడు
, అది తండ్రీ కొడుకులతో పెళ్ళిళ్ళకి అడ్డొచ్చే బంధుత్వం కాదని తెలిసి పోతున్నప్పుడు, ఈ ఇంటర్వెల్ సీనుని మధ్యలో ఆపి  సెకండాఫ్ ఓపెనింగ్ లో పూర్తి చేయడం కుదరదు. ఎందుకంటే ఇంటర్వెల్లో బంధుత్వాన్ని రివీల్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడలేదు. అది కేవలం ఒక మలుపు (టర్నింగ్) మాత్రమే. దీన్నేదో ట్విస్టు అనుకుని, ఇంటర్వెల్ కి బావుందనుకున్నట్టుంది.
        
అజిత్ నటించిన ‘పట్టుదల’ లో త్రిషని కిడ్నాప్ చేసిన ముఠా, నిజానికి ఈ కిడ్నాప్ త్రిష పన్నిన పథకమేనని చెప్పినప్పుడు అది ఇంటర్వెల్ కి పూర్తి స్థాయి టర్నింగ్. సీనస్ ఇంటరప్టస్ జరగలేదు. కానీ సెకండాఫ్ మొదలు పెట్టగానే ఇంటర్వెల్లో చెప్పింది ఉత్తిదే అన్నప్పుడు  ఇంటర్వెల్లో ప్రేక్షకుల్ని చీట్ చేసినట్టయ్యింది. అంటే ఫేక్ ఇంటర్వెల్ అయింది.
        
మత్తు వదలరా లో కూడా ఇలాటిదే ఫేక్ ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్లో ఏదో ఘోరం జరిపోతోందన్నట్టు సీనుని ఆపి
, సెకండాఫ్ లో ఓపెన్ చేసినప్పుడు - ఆ ఇంటర్వెల్ ఉత్తిదే నని చెప్పడం ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడమే. దీని బదులు ఆ తలుపు కొట్టిన వ్యక్తిగా బ్రహ్మాజీనే చూపించి ఇంటర్వెల్ వేసి వుంటే, సస్పెన్స్ క్రియేట్ అయ్యేది- చచ్చిపోయిన బ్రహ్మాజీ పాత్ర ఎలా బ్రతికి వచ్చిందన్న ప్రశ్నతో. 
       
ఇంటర్వెల్ సీనుకి సీనస్ ఇంటరప్టస్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందంటే -ఇంటర్వెల్లో మధ్యలో ఆపిన సీను వల్ల సస్పెన్స్ పుట్టినప్పుడు. అంటే ఇంటర్వెల్లో ఎవరో బయటి నుంచి దబదబ తలుపు బాదుతున్నారనుకుందాం. అంత వరకూ నడిచిన కథ ప్రకారం  హీరో కోసం పోలీసులు వెతుకుతున్నారనుకుందాం. అప్పుడు తలుపు బాదుతోంటే పోలీసులేనన్న భావం వస్తుంది
, ఇప్పుడు హీరో ఏం చేస్తాడన్న సస్పెన్స్ పుడుతుంది. ఈ ఇంటర్వెల్ తర్వాత  సెకెండాఫ్ ఓపినింగ్ లో హీరో తలుపు తెరిస్తే- ఎదురుగా పోలీసులు గాక ఇంటి ఓనర్ నిలబడి వుంటే - అప్పుడు సీనస్ ఇంటరప్టస్ అవుతుంది.

3. కాన్ఫ్లిక్ట్ నిర్వహణ ఇంతేనా?

కాబట్టి మజాకా సెకండాఫ్ ప్రారంభంలో చూపించిన కాన్ఫ్లిక్ట్ ని వెనక్కెళ్ళి ఇంటర్వెల్లోనే చూపించాలి. అప్పుడు స్ట్రక్చర్లో దోషం తొలగిపోతుంది. ఏమిటా కాన్ఫ్లిక్ట్? బంధువులైన హీరోయిన్లకి ఒకరంటే ఒకరికి పడదని, కాబట్టి తండ్రీ కొడుకులు వాళ్ళిద్దర్నీ కలిపి పెళ్ళిళ్ళు చేసుకుంటే అభ్యంతరం లేదనీ, మీరా తండ్రి (మురళీ శర్మ) అంటాడు. ఇదేమీ కొత్త పాయింటు కాదు- ఒకరంటే ఒకరికి పడని రెండు కుటుంబాల్ని కలిపి పెళ్ళి చేసుకునే కథలు వచ్చినవే. కాకపోతే ఇక్కడ పడకపోవడాన్ని హీరోయిన్లతో పెట్టారు. బావుంది, పాతలోంచి ఇన్నోవేట్ చేసిన ఐడియా.
       
ఇదే ఇన్నోవేషన్ని కాన్ఫ్లిక్ట్ తో కూడా చూపించాల్సింది... కానీ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ మళ్ళీ పాత మూసలోకే తిరగబెట్టింది. హీరోయిన్లిద్దర్నీ కలపడమెలా అని చూసి చూసి వున్న రొటీనే హీరోలిద్దరి గోల్ అయింది. కానీ దీన్ని రివర్స్ చేసి
, అసలే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న హీరోయిన్లిద్దరి మధ్యా మరింత విద్వేష జ్వాలలు రగిలిస్తే ఎలా వుంటుందని  వ్యూహాత్మకంగా  గోల్ ని ఆలోచించలేదు.
       
అసలే విరోధంతో వున్న హీరోయిన్లని ఇంకా విడదీసే
, వాళ్ళు తట్టుకోలేక ఇక చాలనుకుని వాళ్ళే కలిసిపోయే పాఠంగా వుంటే ఇందులో చాలా డైనమిక్స్ వర్కౌట్ అవుతాయి. అంటే వేల్యూ యాడెడ్ స్క్రిప్టుగా అప్ గ్రేడ్ అవుతుంది.  ఇంకా విడదీసే ప్రయత్నాలతో కథనం యాక్షన్ లో వుంటుంది, కొత్త సిట్యుయేషన్స్ క్రియేటవుతాయి, హీరోలు పైకి హెల్ప్ గా, వెనుక విలన్లుగా డబుల్ గేమ్ ప్లే చేస్తారు, కథనం కొత్తగా మారితే కామెడీ కూడా కొత్తగా మారుతుంది, ఇంకా కొత్త మలుపులు కూడా ఎదురై థ్రిల్స్ పెరుగుతాయి.
       
ఇలా కాకుండా వాళ్ళని కలపాలన్న చాదస్తపు కథనంతో నేలబారుగా తయారయింది స్క్రిప్టు. ఇలా కలిపే ప్రయత్నాలు సిల్లీగా ఓ అయిదు సార్లు చేసి విఫలమవుతారు. వీటిలో పెళ్ళి దగ్గర ఒకటి
, చావుదగ్గర ఒకటి చేసే ప్రయత్నాలు లౌడ్ కామెడీ. ఇంత కంటే  క్రియేటివిటీ చేతగాలేదు. ఇక కలపలేమని తెలుసుకుని మీరా తండ్రినే అడుగుతారు. వెళ్ళి సపరేట్ గా పెళ్ళిళ్ళు చేసుకుని సపరేట్ గా కాపురాలు పెట్టమంటాడతను. ఈ ఆలోచన మనకి ముందెప్పుడో వస్తుంది. కథలో పాత్రలకి లేటుగా వస్తాయి. లేదా తండ్రీ కొడుకుల్లో ఒకరు పెళ్ళి చేసుకుని ఇంకొకరు త్యాగం చేయమంటాడు. ఇలా చెప్పి కూతురు మీరాకి  వేరే సంబంధం చూస్తాడు. వెంకటరమణ యశోదని లేపుకు పోయే ప్లానేస్తాడు. యశోదా కృష్ణని కొడుకులా చూడడంతో కరిగిపోయి, తాను పెళ్ళి మానుకుని తండ్రి పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇలా కథ ఎలా పడితే అలా మలుపులు పెరుగుతూ చివరి అరగంట తెచ్చి పెట్టుకున్న త్యాగాలతో సీరియస్ అయిపోతుంది సెకండాఫ్.

4. ట్విస్టులంటూ టర్నింగులు

ఈ సెకండాఫ్ తో మెప్పించాలన్న ప్రయత్నంతో, స్పెషల్ ఎట్రాక్షన్  అనుకుంటూ కథకి చాలా ట్విస్టు లిచ్చామనుకున్నారు. అవి ట్విస్టులు కాదు సాధారణ టర్నింగులు. ట్విస్టులు  వేరు, టర్నింగు వేరు. ట్విస్టులో పజిల్ ఇమిడి వుంటుంది. అంటే చిక్కుముడితో వుంటుంది. ఈ చిక్కుముడిని విప్పడమే కథగా వుంటుంది. టర్నింగు కథని ముందుకు నడిపించే సాధారణ ప్రక్రియ. ట్విస్టు  ఎలా వుంటుందో ఉదాహరణకి-
        
1973 లో హాలీవుడ్ నుంచి  40 క్యారట్స్అనే సినిమా వచ్చింది. ఇది బేతాళ కథలా వుంటుంది. దీన్ని తమిళంలో కె బాలచందర్ కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధ, మేజర్ సౌందరరాజన్, రజనీ కాంత్ లతో 1975 లో అపూర్వ రాగంగళ్గా తీశారు. దీన్నే దాసరి నారాయణరావు 1976 లో నరసింహ రాజు, శ్రీవిద్య, మాధవి, సత్యనారాయణ, మోహన్ బాబులతో తూర్పు -పడమరగా తీశారు.
          
కథలో  నరసింహ రాజు-శ్రీవిద్య ప్రేమించుకుంటారు, మరో వైపు మాధవి - సత్యనారాయణ ప్రేమించుకుంటారు. ఇలా వుండగా, మాధవి శ్రీవిద్య కూతురని, నరసింహరాజు సత్యనారాయణ కొడుకని కథ మధ్యలో రివీలై ట్విస్టు పడుతుంది.
          
ఇప్పుడేం చేయాలి? ఈ ట్విస్టులో పజిల్ నెలా విప్పాలి? తండ్రీ కొడుకులు తల్లీ కూతుళ్ళని ప్రేమించారు. తండ్రి కూతుర్ని ప్రేమించాడు, కొడుకు ఆమె తల్లిని ప్రేమించాడు.
          
ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది? అని పాట. బేతాళ కథల్లో 24 వ కథ ఇదే. కొడుకు రాణిని ప్రేమిస్తాడు, తండ్రి రాకుమారిని ప్రేమిస్తాడు.
          
ఈ వావివరసల చిక్కు ముడిని విప్పడానికి తమిళంలో రజనీ కాంత్ పాత్రని ప్రవేశపెడతారు, తెలుగులో మోహన్ బాబు పాత్రని ప్రవేశపెడతారు.
          
అంటే ఇక్కడ కథ మధ్యలోపడ్డ ట్విస్టు విప్పడానికి తాళంచెవి పాత్రని వాడారు. ట్విస్టులో మలుపు వుండదు, పజిల్ వుంటుంది. ఈ పజిల్ ని విప్పే తాళం చెవిని కనుగొన గల్గితేనే కథ ముందుకెళ్తుంది.
          
కథ మధ్యలో ట్విస్టు వేస్తే దాన్ని విప్పే తాళం చెవి పాత్రని కనుగొని చివర్లో వాడతారు. అంతవరకు ఈ చిక్కుముడి ఎలా వీడుతుందన్న సస్పన్స్ తో కథ నడుపుతారు. కాబట్టి మజాకా లో ట్విస్టులంటూ  ప్రేక్షకుల్ని మభ్య పెట్టనవసరం లేదు. అవి సాధారణంగా కథలో వచ్చే మలుపులే. వాటిలో పజిల్ వుండదు.

5. చివరికేమిటి

ఫస్టాఫ్ లో రహస్య ప్రేమాయణాలు నడుపుతున్న తండ్రీ కొడుకులు ఒకరి కొకరు దొరికిపోయినప్పుడు- ప్లాట్ పాయింట్ -1 ని ఏర్పాటు చేసి కథ ప్రారంభించి వుంటే మొత్తం స్క్రిప్టు ఆర్డర్ లో వుండేది. తండ్రికి పెళ్ళయితేనే కొడుక్కి పెళ్ళవుతుంది కాబట్టి, ముందు తండ్రి తను పెళ్ళి చేసుకోవడానికి సహకరించమంటే, అలాగే కొడుకు రచనా సహకారం అందించి ఈ కథని దారిలో పెడితే- అప్పుడు ముందు హీరోయిన్ల బంధుత్వంతో ఒక షాకు, తర్వాత ఇంటర్వెల్లో హీరోయిన్ల మధ్య వైరంతో ఇంకో షాకు ఇస్తే - ఈ కాన్ఫ్లిక్ట్ ని సెకండాఫ్ లో రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ పోతే సరిపోయేది.
       
పోతే
, పైపైన రాసేసి పైపైన తీసేశారనడానికి ఇంకో ఉదాహరణ- యశోద పాత్ర. ఈమె 30 దాటినా పెళ్ళి చేసుకోకుండా ఎందుకుందంటే- టీనేజిలో ప్రేమించిన వాడు మళ్ళీ వస్తానని మాటిచ్చి వెళ్ళాడుట. కానీ ఎంతకీ రాలేదట! మాటిచ్చాడు కాబట్టి తను అభిసారికలా ఎదురుచూస్తూ ఇలా భ్రహ్మచారిణిగా మిగిలిపోయిందట!
       
ఈమె అమోఘ మెచ్యూరిటీకి తోటి బంధువైన మీరాతో మోరల్ పోలీసింగ్ ఒకటి! నీతులు చెబుతూ మీరాని తన చెప్పుచేతల్లో వుంచుకుని స్వేచ్ఛ లేకుండా చేసే పెత్తనం. కానీ తను వెంకటరమణతో లేచిపోవా లనుకోవడానికి నీతులేం అడ్డురాలేదు. రైటింగ్ టేబులంటే ఈమెకి వొళ్ళు మంటలా వున్నట్టుంది...ముందు కానీయ్
, తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లో చూసుకుందాం అన్నట్టుంది.
—సికిందర్