రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, సెప్టెంబర్ 2024, శనివారం

1448 : రివ్యూ!

ఈ కథ హత్యల  గురించి కథ కాక, ఈ  రెండు పాత్రల జీవితాల గురించి కథ అయి వుంటే పూర్తి స్థాయి క్రైమ్ కామెడీగా అలరించేది.
రచన- దర్శకత్వం : రీతేష్ రాణా
తారాగణం : శ్రీ సింహా కోడూరి, సత్య, వెన్నెల కిషోర్, సునీల్, ఫరియా అబ్దుల్లా, రోహిణి తదితరులు
ఛాయాగ్రహణం : సురేష్ సారంగం,  ఎఢిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం : కాల భైరవ బ్యానర్: కాల భైరవ, నిర్మాతలు : చిరంజీవి (మైత్రీ చెర్రీ), హేమలత
మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్
***

        స్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీలు నేటి తెలుగు సినిమా ట్రెండ్ గా సాగుతోంది. ఈ ట్రెండ్ లో వారం వారం ఇవి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటిలో నిలబడేవి అతి కొన్నే. ఇలా తీస్తున్నవే క్రైమ్ కామెడీలు లేదా సస్పెన్స్ థ్రిల్లర్లు అని పొరబడి కనుమరుగయ్యేవి ఎన్నో. డబ్బు చుట్టూ లేదా హత్య చుట్టూ సాగే ఈ సినిమాలు చాలా వరకూ రొటీన్ గానే వుంటాయి. వీటికి కొత్త సబ్ జానర్లు కనిపెట్టలేక అవే లేజీగా తీస్తూ పోతున్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు సాహిత్యంలో కొత్త సబ్ జానర్ యాంటీ డిటెక్టివ్ కథలు. ఎవిరీ ఒన్ ఇన్ మై ఫ్యామిలీ కిల్డ్ సమ్ ఒన్’, గ్యాంగ్ ఆఫ్ లవర్స్ వంటి నవలలు ఈ సబ్ జానర్ లో పాపులర్ అయ్యాయి. యాంటీ డిటెక్టివ్ సబ్ జానర్ లో డిటెక్టివ్ కథల సాంప్రదాయాల్ని తారుమారు చేసి చూపిస్తారు. ఒక విధంగా ఇవి  ఫన్ పుట్టించేవిగా కూడా వుంటాయి.

    2019లో తెలుగులో మత్తు వదలరా అనే క్రైమ్ కామెడీ వచ్చి  హిట్టయ్యింది. ఇది హత్య చుట్టూ సాగే తెలుగు మార్కు పక్కా క్రైమ్ కామెడీ జానరే. అలాగే దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం విడుదలైన మత్తు వదలరా 2 కూడా క్రైమ్ కామెడీ అంటూ పొరబడి తీశారు. ఇది తేడా కొట్టింది. తేడా కొడితే సినిమా రిస్కులో పడుతుంది. జానర్ మర్యాదలకి కట్టుబడక ఫ్లాపయిన తెలుగు సినిమాలెన్నో వున్నాయి. అలాటి రిస్కులో పడింది మత్తు వదలరా 2 కూడా. ఆ తేడా ఏమిటో తెలుసుకుందాం...

కథేమిటి?
     మత్తు వదలరా లోని డెలివరీ బాయ్స్  బాబూ మోహన్  (శ్రీ సింహా), యేసు దాసు  (సత్య) ఇప్పుడు డబ్బు సంపాదన లేని ఆ జాబ్స్ వదిలేసి హై ఎమెర్జెన్సీ టీం (హీ టీం) లో స్పెషల్ ఏజెంట్స్  గా చేరతారు. ఇక్కడ కిడ్నాప్ కేసులు విజయవంతంగా సాల్వ్ చేస్తూ, పనిలో పనిగా చేతి వాటం చూపిస్తూ వుంటారు. అంటే కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయిన డబ్బులో కొంత కొట్టేస్తూ వుంటారు. డబ్బు కాదు బందీ ప్రాణాలు ముఖ్యమనే హీ టీం చీఫ్ (రోహిణి) మాటలు అవకాశంగా తీసుకుని చెలరేగుతారు. ఈ టీంలో సీనియర్ ఏజెంట్ గా నిధి (ఫరియా అబ్దుల్లా), ఆపరేషన్స్ హెడ్ గా మైకేల్ (సునీల్) వుంటారు.

అయితే ఇక్కడ కూడా చిల్లర మొత్తాలతో తృప్తి పడక పెద్ద మొత్తం లో డబ్బు కొట్టేసి సెటిలై పోవాలని ఆలోచిస్తారు బాబు, యేసులు. దీనికి తగ్గట్టుగానే ఒక రిచ్ లేడీ (ఝాన్సీ) నుంచి కిడ్నాప్ కేసు వస్తుంది. ఈమె కూతురు రియా కిడ్నాప్ కి గురయ్యింది. రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు కిడ్నాపర్స్. హీ టీం కి తెలియకుండా ఈ కేసు చేపట్టి ఆ రెండు కోట్లూ కొట్టేయలని ప్లాను వేస్తారు. అయితే కిడ్నాపయిన రియా శవ రూపంలో మీద పడడంతో  హత్య కేసులో ఇరుక్కుపోతారు.
        
ఎవరీ హత్య కేసులో ఇరికించారు? ఈ హత్యే కాదు, మరో హత్య కూడా ఎవరు చేశారు? వీటితో సినీ స్టార్ రవితేజ (వెన్నెల కిషోర్), తజస్వి తోట (అజయ్) అనే మరో వ్యక్తికేం సంబంధం? అసలు అదృశ్య హస్తం ఎవరిది? ఇదెలా నిరూపించి ఈ హత్య కేసుల్ని బాబు, యేసులు సాల్వ్ చేసి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానమే ఇక్కడ్నుంచీ సాగే మిగతా కథ.

ఎలా తెరకెక్కింది కథ

    ఇది పక్కా క్రైమ్ కామెడీ అనీ, ఇందులో కథ, లాజిక్ చూడొద్దనీ దర్శకుడి విన్నపం. దీనికెలాటి అభ్యంతరమూ వుండనవసరం లేదు. ఒక వీడియో టేప్ కోసం జరిగే అనగనగా ఒక రోజు క్రైమ్ కామెడీ లో కథ స్వల్పమే. ఈ స్వల్ప కథకి చేసిన కామెడీ కథనమే దాన్ని నిలబెట్టింది. అలాగే మత్తువదలరా 2 ఫస్టాఫ్ క్రైమ్ కామెడీ కథకి పూర్తి న్యాయమే  చేసింది. శ్రీ సింహా, సత్యల క్యారక్టరైజేషన్ తో ప్రతీ సన్నివేశం నవ్వించడం కోసమే చేసే యాక్షన్ అడ్వెంచర్స్ ఎంటర్ టైన్ చేస్తాయి. మొదటి అరగంట ఇద్దరూ హీ టీం లో కేసులు చేపట్టి డబ్బులు కొట్టేసే ట్రాకు రిపిటీషన్ గా అనిపిస్తున్నా- అరగంటలోనే కథలోకి వచ్చేసి రియా కిడ్నాప్ కేసుతో కథనాన్ని నిలబెట్టుకున్నారు. ఈ హత్యకేసులో తామే ఇరుక్కున్నలాంటి ఇంటర్వెల్ సీను పరమ రొటీనే. దీంతో సెకండాఫ్ కథ ఏమై వుంటుందో ఇక్కడే తెలిసిపోతుంది. ఈ హత్య కేసులోంచి బయటపడడమే సెకండాఫ్ కథ.
        
ఈ సెకాండాఫ్ కథతోనే వచ్చింది సమస్య. అకస్మాత్తుగా కథనం ఫస్టాఫ్ లోని కామెడీని వదిలేసి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ తో, నేరంతో సంబంధమున్న బయటపడే రకరకాల పాత్రలు చెప్పే వాటి ఫ్లాష్ బ్యాకులతో సీరియస్ అయిపోతుంది. ఈ సీరియస్ నెస్ తో, హత్యల తాలూకు వివిధ వెర్షన్లతో, డీటెయిలింగ్స్ తో మెదడుకి  అతి భారమై పోతుంది కథ.  క్రైమ్ కామెడీ జనర్ మర్యాద పూర్తిగా తప్పి- సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోకి మారిపోవడమే  కొట్టిన తేడా. దీన్నే సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు.
        
ఇన్ని మలుపు తిరిగి చివరికి అసలు కిల్లర్ తెలిసేటప్పటికి షాక్ వేల్యూ కూడా మిస్సయ్యింది. సెకండాఫ్ ఇన్ని ఇన్వెస్టిగేషన్లు కాదు, కిల్లర్ తాలూకు ఒకే ఒక్క ఆధారం పట్టుకుని దాంతో ప్రాణాల మీదికి తెచ్చుకునే శ్రీ సింహా, సత్యాల కామెడీ పాత్రలతో నవ్వులు ఏడ్పులు చూపిస్తూ – దీనికంటే డెలివరీ బాయ్స్ జీవితమే బెటర్ అనుకునే స్థాయికి చేరుకునే ఫన్ సృష్టించి వుంటే సమస్య వుండేది కాదు. ఈ కథ హత్యల కథ గురించి కాక, ఈ పాత్రల జీవితాల గురించి కథ అయి వుంటే పూర్తి స్థాయి క్రైమ్ కామెడీగా అలరించేది.

నటనలేమిటి? సాంకేతికాలేమిటి?

    నిస్సందేహంగా ఇది కమెడియన్ సత్య మూవీ. అతను లేకపోతే ఈ మూవీ లేదు. సెకండాఫ్ అనే కీకారణ్యంలో అక్కడక్కడా అతను చేసే కామెడీయే వూరట. అతడి టైమింగ్, ఒన్ లైనర్లు, ట్రెండీ డైలాగులు; అతడి బాడీ లాంగ్వేజి, ఎక్స్ ప్రెషన్స్ ఈ పాత్రతో అతడి కమెడియన్ కెరీర్ ని ఎక్కడికో తీసికెళ్లిపోయాయి. సత్య కోసం ఈ సినిమా చూడాలి.
        
అలాగే హీరో శ్రీ సింహా పాత్రకి తగ్గ నటనతో మరోసారి నిలబడ్డాడు. పాత్రలో స్పీడు, కొన్ని యాక్షన్ సీన్లు కలిసి వచ్చాయి. ఈ కథలో ఎమోషన్లకి స్థానం లేదు కాబట్టి పాత్ర కాస్త ఫ్లాట్ గానూ కనబడుతుంది. ఈ కథ ఈ రెండు పాత్రల గురించి కథ అయివుంటే ఈ లోపం తీరిపోయేది.
        
ఫరియా అబ్దుల్లాది పూర్తిగా యాక్షన్ పాత్ర. రోమాన్సుకి, యూత్ అప్పీల్ కీ పెద్దగా స్థానం లేదు. అలాగే హీ టీం చీఫ్ గా రోహిణీ పెద్దగా రాణించలేదు. ఇంకో హెడ్ గా సునీల్ ది ఎక్కువ మాట్లాడని పూర్తిగా సీరియస్ పాత్ర. నెగెటివ్ పాత్రలో అజయ్ ఫర్వాలేదు. అయితే సినీస్టార్ గా వెన్నెల కిషోర్ మాత్రం సత్యాతో బాటు సినిమాని కాస్త నిలబెట్టేందుకు పనికొచ్చాడు. ఇది అతడికి వినూత్న పాత్ర, వినూత్న కామెడీ కూడా.
        
సాంకేతికాల విషయానికొస్తే దర్శకుడు రీతేష్ రాణా పాక్షికంగా ఫస్టాఫ్ తో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో కథ చూడొద్దని చెప్తూనే, సెకండాఫ్ లో మెదడుకి బోలెడు పరీక్ష పెట్టె ఇన్వెస్టిగేవిటివ్ జానర్ కథలోకి వెళ్లిపోయాడు. పదేపదే మారిపోయే  ఆ క్లూలు, సాక్ష్యాలు కూడేసి విషయం తెలుసుకోవాలంటే ఇంటలిజెంట్ ప్రేక్షకులై వుండాలి. ఇది ఇలాటి ఇంటలిజెంట్ కథనాన్ని డిమాండ్ చేసే కథ కాదు. కథతో అవసరం లేని టాలెంట్ తో నష్టమే జరుగుతుంది.
        
పోతే ఇంకో ఇద్దరు హీరోలున్నారు. కెమెరా మాన్ సురేష్ సారంగం, సంగీత దర్శకుడు కాలభైరవ. ఇద్దరూ తేలిపోయే సన్నివేశాల్ని కూడా తమ ప్రభితతో నిలబెట్టారు. అలాగే దర్శకుడి ట్రెండీ టేకింగ్  కి తగ్గట్టు కార్తీకా శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా వుంది.
        
మొత్తానికి ఈ మూవీ సత్య మాస్ కామెడీ చేష్టల గురించి, మరికాస్త వెన్నెల కిషోర్ ట్రెండీ కామెడీ గురించీ చూస్తే సరిపోతుంది.

—సికిందర్

 

 

 


 

12, ఆగస్టు 2024, సోమవారం

1447 : స్క్రీన్ ప్లే సంగతులు



        మెరికన్ రచయిత్రి డోన్నా టార్ట్ పదేళ్ళకో నవల రాస్తుంది. ఒక్కో నవల పదేళ్ళ పాటూ రాస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంత టైం తీసుకుని రాస్తుంది. సాహిత్యాన్ని రూపొందించాలంటే చాలా ఓపిక, పరిపూర్ణత అవసరమని భావిస్తుంది.  స్పైరల్-బౌండ్ నోట్‌బుక్స్ లో సాదా బాల్‌పాయింట్ పెన్నులతో చేతితో రాయడానికే ఇష్టపడుతుంది. ఇది ప్రతీ వాక్యం గురించీ నెమ్మదిగా, లోతుగా ఆలోచించడానికి  అవకాశం కల్పిస్తుంది. ఎరుపు, నీలం, ఆపై ఆకుపచ్చ బాల్ పాయింట్ పెన్నుల్ని ఉపయోగించి సులభంగా చదవడానికి, ఏ మార్పు చేర్పులు ఎక్కడ జరిగాయో ట్రాక్ చేయడానికీ  వీలుగా రాస్తుంది. అవసరమైనప్పుడు నోట్‌బుక్స్ పేజీల్లో ఇండెక్స్ కార్డుల్ని కూడా చేరుస్తుంది.  క్వాలిటీ కంటే క్వాంటీటీ ప్రధానమైన నెట్ యుగంలో, అదీ వేగవంతమైన పని విధానాన్ని డిమాండ్ చేస్తున్న కాలంలో, ఆమె ఈ మూడు దశాబ్దాల్లో మూడు నవలలు మాత్రమే రాసింది. ఒక్కో నవల చరిత్రలో నిలిచిపోయేలా.

            ది సీక్రెట్ హిస్టరీ (1992), ది లిటిల్ ఫ్రెండ్ (2002), గోల్డ్ ఫించ్ (2013) ఆమె రాసిన మూడు నవలలు. ది సీక్రెట్ హిస్టరీ లో ఒక హత్య కేసులో చిక్కుకున్న కాలేజీ స్టూడెంట్స్ గురించి కథ. దీన్లోని క్లిష్టమైన కథ, పాత్రల మానసిక అంతర్దృష్టృలూ, కథనపు అంతర్లీన ఇతివృత్తాలూ సృష్టించడానికీ, పాత్రల్ని అభివృద్ధి చేయడానికీ రీసెర్చితో సంవత్సరాల తరబడి గడిపింది. ఒక నమ్మదగ్గ, పాఠకులు లీనమయ్యే ప్రపంచాన్ని సృష్టించడానికి శాస్త్రీయ అధ్యయనాలూ, చారిత్రక గ్రంథాల  పరిశీలనలూ భారీ యెత్తున చేసింది. నవల ఉన్నత ప్రమాణాలకి చేరుకోవడానికి చాప్టర్లు పదేపదే తిరగ రాసింది. రాసిన ప్రతీ పదం ఒక ప్రయోజనాన్ని, మొత్తం కథనానికి వొక అర్ధాన్నీ కల్పించేలా రాసుకొచ్చింది...
       
సాహిత్యకారులు సినిమాలు చూడనవసరం లేదేమోగానీ
, సినిమా రచయితలు సాహిత్యాన్ని చదవాల్సిందే. ఇది చవకబారు సినిమాలు తీయకుండా కాపాడుతుంది. కథ కోసం సినిమాలు చూసి సినిమాలు తీస్తే డెప్త్ రాదు. దాంతో తమ కథ లోతుపాతులు తమకే తెలియక పైపైన రాసేసి పైపైన తీసేయడమే జరుగుతుంది. నవలల్ని గానీ, కథానికల్ని గానీ చదవడం వృత్తిలో భాగంగా చేసుకుంటే, కథల  లోతుపాతులు తెలుస్తాయి. ఆ కథ రాయడంలోని సృజనాత్మకత తెలుస్తుంది. విజువలైజ్ చేసుకోవడం అబ్బుతుంది.
       
ఎలాగంటే నవల్లో/కథానికలో చదివే సన్నివేశాలు
, వర్ణనలు, పాత్ర చిత్రణలు తీసుకుని మన మెదడు విజువలైజ్ చేసుకుంటూ పోతుంది. సినిమాలు చూస్తే ఈ అభ్యాసం అబ్బదు. చదివి వూహించిన దాన్నే మెదడు విజువలైజ్ చేస్తుంది (నిత్యజీవితంలో వూహించుకునేవి కూడా విజువలైజ్ చేసుకుంటుంది)- ఈ విజువల్స్ మెదడులో భాగమైన రెటీక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ ఏ ఎస్) లో రికార్డయి పోతాయి.
       
ఈ ప్రక్రియ సమగ్ర
, పరిపక్వ కల్పనా శక్తిని పెంచుతుంది. రచయితలు కథ కోసం సినిమాలు చూస్తే ఉన్న వూహా శక్తి కూడా పోతుంది మెదడుకి అభ్యాసం లేక. సాంకేతికాల కోసమో, అర్ధమైతే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కోసమో సినిమాలు చూడొచ్చు,
సినిమాలో చూసే ఏ దృశ్యమూ మెదడులోని ఆర్ ఏ ఎస్ తీసుకోదు. నిత్య జీవితంలో చూసే ఏ దృశ్యమూ తీసుకోదు. అవి జ్ఞాపకాలుగా వుండిపోతాయి. వూహించుకున్న దృశ్యాల్ని మాత్రమే  ఆర్ ఏ ఎస్ తీసుకుని సబ్ కాన్షస్ మైండ్ కి అందిస్తుంది. దీంతో సబ్ కాన్షస్ మైండ్ బలమైన కల్పనా శక్తిని డెవలప్ చేసి కాన్షస్ మైండ్ కి అందిస్తుంది. అప్పుడు కాస్త బాగా రాయగల్గుతాం.
       
ఇంకా బాగా రాయాలంటే పాషన్ ని కల్పించుకోవాలి. ఈ పాషన్ అనేది మెదడులో పుట్టదు. హృదయంలో పుడుతుంది. హృదయంలో పుట్టిన పాషన్ పాగస్ నెర్వ్ ద్వారా మెదడుకి చేరి జీవమున్న కథల్ని సృష్టిస్తుంది. హృదయంలో పాషన్ ఎలా పుడుతుంది
? చేతిలో వున్న విషయం పట్ల హృదయంలో అపారమైన ప్రేమ పుట్టించుకునప్పుడు మాత్రమే పుడుతుంది. హృదయం ప్రేమించని, హృదయం అనుమతించని  ఏ పనీ మెదడులో జీవమున్న కార్యాన్ని సృష్టించదు. లోతు పాతుల్లేకుండా పైపైన రాసేసి పైపైన తీసేసే సినిమాలన్నీ కేవలం కాన్షస్ మైండ్ తో ఆలోచించి తీసేవే- సబ్ కాన్షస్ మైండ్ తో పని పెట్టుకోకుండా. ఈ మధ్య మూడు నాలుగు కథలు విన్నప్పుడు జరిగిందిదే - కేవలం కాన్షస్ మైండ్ లోంచి వచ్చిన డెప్త్ లేని కథలవి!
        
హాలీవుడ్ లో స్క్రీన్‌ప్లేల్ని (అన్నీకాదు) సాహిత్య రూపంగా పరిగణిస్తారు. ఆ స్క్రీన్ ప్లేలు సీన్ నెంబర్లు కూడా వేయకుండా నవలా రూపంలా వుంటాయి. అందుకని చదివేటప్పుడు ఆ నిర్మాతని లేదా, స్టూడియో ఎగ్జిక్యూటివ్ ని సినిమా చూస్తున్న అనుభవానికి లోనుజేస్తాయి. ఎందుకంటే చదువుతున్నది నవలా పాఠంలా విజువలైజ్ అవుతూ వుంటుంది కాబట్టి. జేమ్స్ మొనాకో హౌ టు రీడ్ ఏ ఫిల్మ్ అనే ప్రసిద్ధ పుస్తకం రాశాడు. అంటే సినిమాని చదవడమెలా అని. సినిమాలో కళ వున్నప్పుడే ఆ సినిమాని చూడడం గాక చదవడం చేస్తాం. ఇలాటి సినిమాలు కొన్నే వుంటాయి. ఇది విజువల్ నేరేషన్ కి సంబంధించిన ప్రక్రియ, లేదా టెక్నిక్. ప్రతి ప్రేములో, సన్నివేశంలో, సీక్వెన్స్ లో దాగి వున్న లోతైన భావార్ధాల్ని  గ్రహిస్తూ, ఆ క్లిష్టమైన సినిమా భాషని డీకోడ్ చేసుకుంటూ పోవడం సినిమాని చూడడం గాక, సినిమాని చదవడమనే కొత్త అనుభవానికి లోనుజేస్తుంది.
         
ఈ పనే
మహారాజా చేసింది. ఈ పనితో బాటు పైన చెప్పుకొచ్చిందంతా పూర్తి చే సింది. దాని డెప్త్,
క్లిష్టమైన కథ, పాత్రల మానసిక అంతర్దృష్టృలూ, కథనపు అంతర్లీన ఇతివృత్తాలూ, ఒక నమ్మదగ్గ, ప్రేక్షకుల్ని లీనంజేసే కథా ప్రపంచపు సృష్టీ, పాగస్ నెర్వ్ ద్వారా హృదయమందించిన ఫాషన్ తో సబ్ కాన్షస్ మైండ్ కల్పన చేసిన సమగ్ర, పరిపక్వ కల్పనా, డస్ట్ బిన్, నాగు పాము, నకిలీ బంగారం వంటి ప్లాట్ డివైసులతో కల్పించిన సినిమా భాషా వగైరా.
       
పొరపాట్లు లేకపోలేదు
, పాత్రచిత్రణని దెబ్బతీసే పొరపాట్లు కూడా వున్నాయి. ఇంకా ఈ నాన్ లీనియర్ కథకి ఒకే గత కాలానికి సంబంధించినవి గాకుండా, వివిధ కాలాలకి సంబంధించిన మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకుల వల్ల ఏర్పడిన తికమక. ఉదాహరణకి సెకండాఫ్ లో వచ్చే ఒక కీలక దృశ్యం కొనసాగింపు సీను, ఫస్టాఫ్ లో ప్రారంభ సీనుగా వుండడం!
       
దీనివల్ల ఈ స్క్రీన్ ప్లే సంగతులు రాయడం దాదాపు డోన్నా టార్ట్ నవలలు రాసేంత పనిగా మారింది! కాకపోతే పదేళ్ళు పట్టలేదు. ముందుగా ఈ ఆర్టికల్ రెండో భాగంలో లీనియర్ కథగా మార్చి చెప్పుకున్న కథనానికి
, నాన్ లీనియర్ కథనమెలా వుందో చూద్దాం. ఇందులో రెడ్ మార్క్ చేసిన నెంబర్లు సింబాలిజమ్స్, ప్లాట్ డివైసులు. లేదా ట్రాన్సిషన్ టూల్స్ గా వుంటాయి. వీటి గురించి చివర్లో చెప్పుకుందాం...

(రేపు మూడవ భాగం)
-సికిందర్

10, జులై 2024, బుధవారం

1446 : స్క్రీన్ ప్లే సంగతులు!

 

టీటీల్ని డీల్ చేయాలంటే రోమాంటిక్ కామెడీలకి చుక్కెదురవుతూండడంతో ఓటీటీలు డిమాండ్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ల జోరు పెరిగింది. దీంతో ఇటీవలి కాలంలో వారం వారం రోమాంటిక్ కామెడీల తాకిడి తగ్గి, సస్పెన్స్ థ్రిల్లర్ల ఉత్పత్తి వూపందుకుంది. అయితే ఇవి ఏ ఓటీటీల్ని టార్గెట్ గా చేసుకుని వస్తున్నాయో, ఆ ఓటీటీల లైబ్రరీల్లోకి చేరే ముందే థియేటర్లలో గల్లంతవుతున్నాయి. సస్పెన్స్ అంటే ఏమిటో తెలీదు, థ్రిల్ అంటే ఏమిటో తెలీదు, కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటో తెలీదు, లాజిక్ తో పనే లేదు. అపర హిచ్ కాకులం అనుకుని చుట్టి పారేయడమే. ఈ రకంగా మార్కెట్లోకి చాలా స్క్రాప్ డంప్ అవుతోంది. ఇలాంటప్పుడు ఒక మహారాజా అనే తమిళ క్రాఫ్ట్ విడుదలైంది. క్రాఫ్ట్ ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ కి ఆత్మ క్రాఫ్టే. క్రాఫ్ట్ అంటే శిల్పం. కథని నడిపించే తీరు. కథ వొక శిల అయితే దాన్ని ఉత్కంఠభరితంగా చెక్కడం శిల్పం లేదా క్రాఫ్ట్. అందుకని క్రాఫ్ట్ లేని సస్పెన్స్ థ్రిల్లర్ కాకి రెట్టతో సమానం. కథని దాచిపెడుతూ విప్పుతూ పోవడమే సస్పెన్స్ థ్రిల్లర్ కథనమైతే, ఇక్కడ ప్రధానపాత్ర వహించేదే క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ తోనే  మహారాజా అనే సస్పెన్స్ థ్రిల్లర్ ని నిలబెట్టేందుకు ప్రయత్నించాడు దర్శకుడు నిథిలన్ సామినాథన్.


హారాజా భారీగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో కూర్చిన స్క్రీన్ ప్లే. ఈ కూర్పులో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు ఒకే కాలానికి చెందినవి కావు. వివిధ కాలాలకి చెందినవి. అంటే మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకులు. దీన్ని స్క్రిప్టు చేయాలంటే, ముందు కథని స్ట్రెయిట్ నేరేషన్ గా కార్డుల మీద లైన్ ఆర్డర్ వేసుకుని, తర్వాత సస్పెన్సు నిమిత్తం ఏ కార్డులో సీను ఎక్కడ వుండొచ్చో అక్కడ జంబ్లింగ్ చేసుకు పోవడమే. అలా జంబ్లింగ్ చేసిన లైన్ ఆర్డర్ తోనే నాన్ లీనియర్ నేరేషన్ గా స్క్రీన్ ప్లే వస్తుంది.

అయితే ఇలాటి స్క్రీన్ ప్లేలో స్ట్రక్చర్ ని వెతుక్కోవడం పెద్ద పనే. స్ట్రక్చర్ అనేది ఫ్లాష్ బ్యాకుల్లో కాక, రియల్ టైమ్ యాక్షన్ కథతో వుంటుంది. రియల్ టైం యాక్షన్ కథలో బిగినింగ్, మిడిల్, ఎండ్ లని విభజించే ప్లాట్ పాయింట్లు వుంటే, అప్పుడు ఫ్లాష్ బ్యాకులు ఏ ప్లాట్ పాయింటు పరిధిలోకి ఏవి వచ్చాయో తెలుస్తుంది.  ఇలాగాక స్ట్రెయిట్ నేరేషన్ కథలో స్ట్రక్చర్ నేరుగా కనిపిస్తుంది. అది ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ గా వున్నప్పుడు కనిపించదు. పోస్ట్ మార్టం చేసుకోవాల్సిందే.     

స్ట్రక్చర్ ని అలా వుంచి, మహారాజా లో ఈ టైమ్ లైన్లు ఎక్కువై పోవడం వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది. ముఖ్యంగా సెకండాఫ్ లో. టైమ్ లైన్లకి డేట్ స్టాంప్ లేకపోవడంతో ఫ్లాష్ బ్యాక్స్ ని గుర్తుపట్టడం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు మొదట ఈ కథ స్ట్రెయిట్ నేరేషన్ లో ఎలా వుందో తెలుసుకుని, నాన్ లీనియర్ విశ్లేషణ చేద్దాం.

1. స్ట్రెయిట్ నేరేషన్ కథ

2009 లో మహారాజా (విజయ్ సేతుపతి) వృత్తిరీత్యా క్షౌరకుడు. అతడికి భార్య సెల్వి (దివ్యభారతి) తో బాటు రెండేళ్ళ కూతురు జ్యోతి వుంటారు. ఇంకో వైపు సెల్వం (అనురాగ్ కశ్యప్), శబరి (వినోద్ సాగర్) దోపిడీ ముఠాగా ళ్ళ మీద దాడులు చేయడం, దోచుకున్న తర్వాత ఇంట్లో ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి చంపడం చేస్తూంటారు. ఒక రోజు శబరి సెల్వంకి ఫోన్ చేసి, తమ నేరాల గురించి పేర్లు వెల్లడించకుండా దినపత్రికలో వచ్చిందని హెచ్చరిస్తాడు. అప్పుడు సెల్వం గడ్డం ట్రిమ్ కోసం మహారాజా సెలూన్‌లోనే వుంటాడు. మహారాజా ఆ ఫోన్ సంభాషణ వింటాడు. సెల్వం అనుమానంగా చూస్తాడు. గడ్డం ట్రిమ్ చేయించుకుని వెళ్తూ తన రెండేళ్ళ కూతురు అమ్ము (బేబీ షైనిక) కి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న లాకెట్ సెలూన్ లో మర్చిపోతాడు. మహారాజా ఆ లాకెట్ ని ఇచ్చేయడానికి సెల్వం ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పోలీసులు సెల్వంని, శబరిని అరెస్టు చేయడానికి వచ్చేసి వుంటారు. ఆ ఘర్షణలో పోలీసులు శబరిని కాల్చివేసి, సెల్వంని అరెస్టు చేసి తీసికెళ్తారు. సెల్వం నేరాల గురించి తెలియని భార్య కోకిల (అభిరామి) అతడ్ని అసహ్యించుకుని, తాము చచ్చిపోయినా చూడ్డానికి రావద్దని చెప్పేస్తుంది. 

తర్వాత మహారాజా భార్యని
, కూతుర్నీ తీసుకుని, ఆ లాకెట్ ఇచ్చేయడానికి కోకిల ఇంటికి వెళ్తాడు. ఆ
ఇంట్లోకి ఒక ట్రక్కు దూసుకెళ్ళడంతో భార్యతో బాటు కోకిల, ఆమె కూతురూ చనిపోతారు. మహారాజా కూతురు జ్యోతి మాత్రం ప్రమాదం లోంచి బయటపడుతుంది. పడిపోతున్న ఇంటి అటక మీంచి ఒక మెటల్ డస్ట్ బిన్ తలకిందులుగా పడడంతో అందులో ప్రాణాలు దక్కించుకుంటుంది. తర్వాత జ్యోతి పెద్దయ్యాక  (సచనా నమిదాస్)  ఆ చెత్తబుట్టకి  ప్రేమతో లక్ష్మి అని పేరు పెడతారు.

2. 2023 కి వస్తే...
ఇప్పుడు పల్లికరనైలో సొంతింట్లో నివసిస్తూంటాడు బార్బర్ మహారాజా. ఎదిగిన కూతురు జ్యోతి స్కూల్లో స్పోర్ట్స్ లో చురుగ్గా వుంటుంది. ఒక రోజు స్పోర్ట్స్ టీచర్ ఆసిఫా (మమతా మోహన్ దాస్) తో కలిసి కోయంబత్తూరులో స్పోర్ట్స్ క్యాంప్ కి బస్సులో బయల్దేరుతుంది.

తర్వాత ఒక రాత్రి తనని 14 ఏళ్ళ క్రితం జైలుకి పంపాడని అపార్ధం జేసుకున్న సెల్వం ఇప్పుడు జైలు నుంచి తిరిగివచ్చి మహారాజాని చంపడానికి అనుచరులు ధన  (మణికందన్), నల్ల శివం (సింగం పులి) లతో మహారాజా ఇంటికొస్తాడు. మహారాజా ఇంట్లో వుండడు. అప్పుడే కూతురు జ్యోతి  కోయంబత్తూరు నుంచి తిరిగి వస్తుంది.  వాళ్ళు జ్యోతి మీద శారీరకంగా దాడి చేసి కొట్టడంతో  అపస్మారక స్థితిలో కెళ్ళిపోతుంది. నల్లశివం ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేస్తాడు. ముగ్గురూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.

మహారాజా ఇంటికి చేరుకోగానే జ్యోతిని ఆ స్థితిలో చూసి, ఆసుపత్రికి తీసుకువెళతాడు. దీనికి కారణమైన వాడ్ని తనకి చూపించమని ఆమె తండ్రిని అభ్యర్థిస్తుంది. జ్యోతిని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత, మహారాజా ఇంటికి తిరిగి వస్తాడు. చాలా వేదనతో తనని తాను కొట్టుకుని పడిపోతాడు. మేల్కొన్నాక,  అక్కడపడున్న స్థానిక కౌన్సిలర్  కారు నంబర్‌తో కూడిన టోల్ ప్లాజా రసీదుని చూస్తాడు.

సెల్వం అనుచరుడు ధన కారు సర్వీసింగ్ లో పనిచేస్తూంటాడు. అక్కడికి కౌన్సిలర్ కరుణాకరన్ (కళ్యాణ్) వచ్చి  తన కారు లోంచి సన్ గ్లాసెస్ దొంగిలించాడనే ఆరోపణతో ధనని కొట్టి, గ్లాసెస్ తెచ్చివ్వాలని బెదిరిస్తాడు. తర్వాత ధన ఒక బార్‌ కెళ్ళి అక్కడున్న కరుణాకరన్ ని కొట్టి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది ఇక్కడున్న మహారాజా గమనిస్తాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతున్న ధనని అనుసరిస్తాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. తన ఇంటికొచ్చిన సహచరులు ఇంకెవరని మహారాజా అడుగుతాడు. వాళ్ళలో ఒకడు  పోలీస్ స్టేషన్‌లోనే వున్నాడని ధన చెప్పడంతో అతడ్ని చంపేస్తాడు.

మహారాజా ఉదయం పోలీస్ స్టేషన్ కెళ్ళి తన ఇంట్లో లక్ష్మిని దొంగలెత్తుకుపోయారని కంప్లెయింట్ ఇస్తాడు. దొంగల ముఠా తన మీద దాడి చేసి లక్ష్మిని తీసుకెళ్ళి పోయారని మొత్తం సంఘటనని వివరిస్తాడు. తన లక్ష్మిని వెతికిపెట్టమని కోరుతాడు. చెత్త బుట్టని వెతకడమేమిటని పోలీసులు తిట్టి వెళ్ళ గొడతారు. మహారాజా వూరుకోడు. ఐదు లక్షలు ఆఫర్ చేసేసరికి, ఆశ పుట్టి పోలీసులు చెత్త బుట్ట వెతకడానికి ఒప్పుకుంటారు. చెత్త బుట్టని వెతకడంలో పాత నేరస్థుడు, సెల్వం అనుచరుడు నల్లశివం (సింగం పులి) పోలీసులకి తోడవుతాడు.

ఇన్స్ పెక్టర్ వరదరాజన్ (నటరాజ సుబ్రహ్మణ్యం) అధ్వర్యంలో పోలీసులు చెత్తబుట్టని గాలించే పనిలో వుంటారు. నల్లశివం సహాయంగా వుంటాడు. గాలింపు ఫలించక లక్ష్మి ని పోలిన చెత్తబుట్టని తయారు చేయిస్తారు. దీన్ని దొంగిలించిన దొంగగా నటించమని కొందరు దొంగల్ని అడుగుతారు. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇన్స్ పెక్టర్ వరదరాజన్ ఆఫర్ చేసిన 50 వేలకి నల్లశివం దొంగలా నటించడానికి ఒప్పుకుంటాడు.

నల్లశివం తదనుగుణంగా నటించడానికి మొత్తం సంఘటననని మరోసారి వివరించమని ఇన్స్ పెక్టర్ వరదరాజన్ స్పీకర్ ఫోన్‌లో మహారాజానీ కోరతాడు. మహారాజా సంఘటనని అదే పద్ధతిలో వివరిస్తాడు. ఇది నల్లశివంకి వినిపించి, ఇన్‌స్పెక్టర్ వరదరాజన్, అతడి బృందం మర్నాడుదయం చెత్త బుట్ట తిరిగి ఇవ్వడానికి నల్లశివంతో మహారాజా ఇంటికి చేరుకుంటారు. మహారాజా ముందు నల్లశివం తానెలా చెత్తబుట్టని దొంగిలించాడో నటించి చూపిస్తాడు. ఇప్పుడు మహారాజాకి నల్లశివం ఎవరో, ఏం చేశాడో అర్ధమైపోతుంది.  

ఇక వీడికి ఏ శిక్ష వేస్తాడో వేసెయ్యమని మహారాజాకి చెప్పేసి బృందంతో బయటికెళ్ళి పోతాడు ఇన్స్ పెక్టర్ వరదరాజన్. అతను ధన మృతిపై దర్యాప్తు చేస్తూంటే నల్లశివం ధనకి ఫోన్ చేసినట్టు తెలిసింది. తర్వాత మహారాజా కూతురు జ్యోతి గురించి డాక్టర్  సమాచారమివ్వడంతో, విషయం పూర్తిగా అర్ధమైపోయి- నల్లశివం ని మహారాజా దగ్గరికి తీసికెళ్ళేలా ప్లాన్ చేశాడు ఇన్స్ పెక్టర్ వరదరాజన్.

మహారాజా నల్లశివంని చంపేస్తాడు. ఇక మూడో వాడ్ని కనిపెట్టి,మూడో వాడు సెల్వం పనిచేసే నిర్మాణ స్థలం దగ్గరికి చేరుకుంటాడు మహారాజా. ఇద్దరూ కొట్టుకుంటారు. ఇప్పుడు గాయపడి కదలలేని స్థితిలో వున్న సెల్వం దగ్గరికి జ్యోతిని తీసుకొస్తుంది ఆసిఫా. జ్యోతి సెల్వంని తనని ఇలా చేసినందుకు అనాల్సిన మాటలు అని, నువ్వొచ్చింది వీటికోసమేగా అని నగలున్న బ్యాగుని అతడి మీదికి విసిరి వెళ్ళిపోతుంది. సెల్వంకి చిన్నప్పుడు కూతురు అమ్ము పుట్టినరోజున అమ్ము కోసం కొన్న లాకెట్ ఆ నగల్లో వుండడంతో షాక్ అవుతాడు. ఈ జ్యోతి తన అమ్ము అని తెలుసుకుని బావురుమంటాడు. చేసిన పాపానికి పై నుంచి దూకి చచ్చి పోతాడు.

అసలు జరిగిందేమిటంటే, ఆ నాడు సెల్వం అరెస్టు తర్వాత, లాకెట్ ని  తిరిగి ఇవ్వడానికి మహారాజా, భార్య సెల్వి,కూతురు జ్యూతిలతో సెల్వం భార్య కోకిల కొత్త ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన ట్రక్కు ప్రమాదంలో, అమ్ము తప్ప సెల్వి, జ్యోతి, కోకిల చనిపోయారు. మహారాజా అమ్ముని  దత్తత తీసుకుని తన సొంత కూతురు జ్యోతిలా పెంచాడు. ఆ జ్యోతి మీద సెల్వం అత్యాచారానికి ఒడిగట్టాడు.

స్ట్రక్కఃర్ లో ఏది ఎక్కడ?

ఇదీ స్ట్రెయిట్ నేరేషన్ కథ. ఇందులో జ్యోతి మీద అత్యాచారం జరిగే వరకూ బిగినింగ్ విభాగం, అదే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. తర్వాత లక్ష్మిని వెతికి పెట్టమని మహారాజా పోలీస్ స్టేషన్ కెళ్ళడంతో మిడిల్ 1 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మహారాజా ధన ని చంపడంతో మిడిల్ 1 ముగిసి ఇంటర్వెల్ వస్తుంది. తర్వాత ఇన్స్ పెక్టర్ వరదరాజన్ కేసు తాలూకు సంఘటనని మహారాజా చేత  చెప్పించి స్పీకర్ ఫోనులో నల్లశివంకి వినిపించడం దగ్గర మిడిల్ 2 ముగిసి, ప్లాట్ పాయింట్ 2 వస్తుంది. ఆ తర్వాత జరిగేదంతా ఎండ్ విభాగం.

అయితే ఈ స్ట్రెయిట్ నేరేషన్ స్క్రీన్ ప్లేని, నాన్ లీనియర్ మల్టీపుల్ టైమ్ లైన్ స్క్రీన్ ప్లేగా మార్చడంలో జరిగినవి తెలియక చేసిన పొరపాట్లా, లేక ఉద్దేశపూర్వకంగా చేసిన కన్వీనియెంట్ రైటింగా? అయినా గందరగోళం ఎందుకైంది? ఇవీ అసలు తెలుసుకోవాల్సిన విషయాలు.

(రేపు మూడవ భాగం)
—సికిందర్