రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, ఏప్రిల్ 2024, మంగళవారం

1423 : రివ్యూ

 

రచన -దర్శకత్వం: చిదంబరం
తారాగణం : సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్ జూనియర్, ఖాలిద్ రెహమాన్ తదితరులు
సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం :             షైజూ ఖాలీద్
నిర్మాతలు : సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ
బ్యానర్ : పరవ ఫిలిమ్స్
తెలుగు పంపిణీ : మైత్రీ మూవీ మేకర్స్
విడుదల : ఏప్రిల్ 6, 2024
***
        టీవల రెండు మలయాళం సినిమాలు వసూళ్ళలోనూ సంచలనం సృష్టించాయి.  వాటిలో ఒకటి ప్రేమలు’. ఇది 135 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్ కూడా బాగానే వసూలు చేసింది. అలాగే మంజుమ్మల్ బాయ్స్  230 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్  ఈ రోజు విడుదలైంది. దీని గొప్పదనమేమిటో ఓసారి చూద్దాం...

కథ
కేరళలోని కొచ్చి సమీపంలో మంజుమ్మల్ అనే చిన్న పట్టణానికి చెందిన రెండు స్నేహితుల సమూహాలుంటాయి. వీళ్ళెప్పుడూ తగాదాలు పడి కొట్టుకుంటూ వుంటారు. ఒకర్నిమించిన పనులు మరొకరు చేయాలని పోటీలు పడుతూంటారు. 2006 లో వీళ్ళల్లో ఆర్ట్స్ క్లబ్ గ్రూపు కొడైకెనాల్ విహార యాత్ర ప్లాన్ చేస్తారు. కొడైకెనాల్‌ అంతా తిరిగి ఎంజాయ్ చేశాక, గుణ గుహలు చూడాలని ఉత్సాహ పడతారు. కమలహాసన్ నటించిన గుణ షూటింగ్ ఇక్కడే జరగడంతో గుహల కీ పేరొచ్చింది. ప్రమాదకరమైన ఈ గుహాల్లోకి ప్రవేశాన్ని నిషేధించి  ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ దూకి సాహసం ఛేస్తారు మంజుమ్మల్ బాయ్స్. అలా గుహలు చూస్తూ తిరుగుతూంటే బాయ్స్ లో ఒకడైన సుభాష్ (శ్రీనాథ్ భాసి) మనిషి వెడల్పుగల లోతైన రంధ్రం లో పడిపోతాడు. ఇది ప్రాణాంతక బిలం. ఇందులోకి ఇంతవరకూ 16 మంది పడిపోతే శవాల్ని కూడా బైటికి తీయలేక పోయారు.
       
ఇప్పుడు సుభాష్ పడిపోవడంతో మిత్రబృందం భయంతో కేకలు వేస్తారు. పోలీస్ స్టేషన్ కి పరిగెడతారు. గ్రామస్థులకి చెప్పుకుంటారు. పోలీసులు ఉల్టా కేసు బనాయిస్తారు. కాళ్ళావేళ్ళా పడ్డాక పోలీసు
,లు, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులూ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తారు. తాడు సాయంతో లోపలికి వెళ్ళి బాధితుడ్ని పైకి తీసుకు రావడానికి సిబ్బంది ముందుకు రారు. మంజుమ్మల్ బాయ్స్ లో ఒకడైన కుట్టన్ (
సౌబిన్ షాహిర్) ముందుకొస్తాడు.
       
కుట్టన్ ఈ సాహసం చేయడానికి కారణముంది. ప్రాణాలు పణంగా పెట్టి  స్నేహితుడ్ని కాపాడేందుకు అతను పూనుకోవడానికి ప్రేరేపించిన ఆ కారణమేంటి
? అలా స్నేహితుడ్ని ప్రాణాలతో కాపాడుకోగలిగాడా? ఇందుకు అధికార్లు అందించిన సహాయక చర్యలేమిటి? అసలు వందల అడుగుల లోతులో పడిపోయింది గాక, భారీగా కురిసిన వర్షం నీళ్ళల్లో సుభాష్ బతికున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ. 

యదార్థంతో ప్రయోగం
ఇది యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సర్వైవల్ డ్రామా.  యదార్థ సంఘటనలతో మలయాళంలో వరుసగా మూడు సర్వైవల్ డ్రామాలు హిట్టయ్యాయి. కేరళ వరద బీభత్సం మీద ’2018’ (2023), గుణ గుహల మీద మంజుమ్మల్ బాయ్స్ (2024), సౌదీ వలస కార్మికుడి మీద ఆడు జీవితం (2024).  గుణ గుహలు  అనేవి తమిళనాడులోని కొడైకెనాల్ లో వున్న ఒక గుహల సముదాయం. ఈ సముదాయంలో మనిషి పట్టే వెడల్పుతో లోతైన బిలాన్ని 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి రికార్డు చేశాడు. దీనికి అతను డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. 1991 లో ఇక్కడ కమలహాసన్ సినిమా గుణ షూటింగ్ జరిగినప్పట్నుంచీ ఇది పర్యాటక కేంద్రంగా ఆకర్షించ సాగింది. 2016 వరకూ ఈ బిలంలో పడిపోయిన వ్యక్తుల కేసులు 16 నమోదయ్యాయి. కేవలం మంజుమ్మల్ బాయ్స్ ఘటనలో ఒక్కడే బతికి బయట పడ్డాడు.
       
ఈ సినిమా చూస్తూంటే ఒక సందేహం వెంటాడుతూ వుంటుంది. అంత మంది ఆ రంధ్రం లో పడిపోతున్నప్పుడు ఇనుప మెష్ తో ఆ రంధ్రాన్ని ఎందుకు మూసేయలేదు
? కేవలం అక్కడికి చేరుకోకుండా ఎక్కడో ఫెన్సింగులు మాత్రమే వేసి ఎందుకు వదిలేశారు? ఈ విషయం తట్టే కాబోలు-

సినిమా చివర్లో ఇదే చూపించాడు దర్శకుడు- ఆ రంధ్రం మీద ధడేలుమని ఇనుప మెష్ పడేసి! కానీ క్రోనాలజీ ప్రకారం చూస్తే ఇది కరెక్ట్ కాదు. మంజుమ్మల్ బాయ్స్ ఉదంతం 2006 లోనే జరిగింది. అప్పుడు ధడేలుమని ఇనుప మెష్ పడేస్తే
, 2016 వరకూ ఇంకొన్ని మరణాలు ఎలా జరిగినట్టు? ఇంతకీ ఇప్పుడైనా మూసి వుందా లేదా? ఎవరైనా గూగుల్ చేసి కనుక్కోవాలి.

       
ఈ సర్వైవల్ డ్రామా 2 గంటల పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్. హ్యూమన్ డ్రామా.  అడ్వెంచర్స్ లో ఒక లెసన్. పర్యాటకులు నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతారు
? ఈ గుహల్లో తేళ్ళు పాములైనా వుంటే? నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ ఈ సర్వైవల్ డ్రామా.
        
అందుకే దీన్ని హార్రర్ కామెడీలా తీసి ఎంటర్ టైన్ చేయాలనుకోలేదు. తెలుగు చేతులైతే ఈ పనే చేసి సినిమా తీస్తాయి. వాడు రంధ్రంలో పడిపోయి ఆర్తనాదాలు చేస్తూంటే అక్కడ దెయ్యాల్ని కూడా జొప్పించి కామెడీ చేస్తారు. చివరికి ఏ వేపమండల అమ్మవారి ముందో కాంతారా డాన్సులు చేసి బిలంలో దెయ్యాల్ని చంపి అర్భకుడ్ని కాపాడతారు.

1. క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ (స్టీవెన్ స్పీల్ బెర్గ్ -1977),
2.
 ‘మంజుమ్మల్ బాయ్స్’ (మలయాళం- 2024)
 
బిలం అంతర్భాగాన్ని సెట్ వేసి షూటింగు జరిపారు. ఈ కథని కేవలం బిలంలో పడిపోయిన మిత్రుడి రెస్క్యూ ఆపరేషన్ గా చూపిస్తే ఇది సినిమా అయ్యేది కాదు. డాక్యుమెంటరీ అయ్యేది. ఈ ప్రమాదానికి సమానాంతరంగా  చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ బాయ్సే అప్పటి పిల్ల మూక. వాళ్ళల్లో ఒకడు (సుభాష్) తన మీద ప్రాంక్స్ ప్లే చేసుకుంటూ వుంటాడు. ఆవిప్పుడు బిలంలో పడిపోవానికి సింబాలిక్ గా వుంటాయి. ఇలాటి ఫోర్ షాడోయింగ్ సీన్స్ తో సందర్భానుసారంగా ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఒకసారి అంతా నదిలో దూకేసి ఈత కొడుతూంటారు. సుభాష్ నీ దూకెయ్యమంటారు. భయపడుతూ దూకేసిన సుభాష్ ఏమయ్యాడు? అప్పుడు వాడ్నిఎవరు కాపాడారు. ఇది ఇప్పటి  ప్రమాదంతో ఎలా లింకప్ అయింది? ఇప్పుడు కుట్టన్ రంధ్రంలోంచి సుభాష్ ని కాపాడ్డానికి ప్రేరణ ఏమిటి? లోనైన ఎమోషన్స్ ఏమిటి?

కదిలించే ఎమోషనల్ డ్రామా కూడా ఇది.  ఫ్రెండ్ షిప్ స్టోరీ కూడా. యువనటులతో యూత్ ఆడియెన్స్ పల్స్ ని పట్టుకున్న ప్రయోజనాత్మక సినిమా. నిడివి కేవలం రెండు గంటలు. తారాగణ బలం లేని సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ప్రొడక్షన్ మీద పెట్టారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో వచ్చేదాకా ఆగకుండా బిగ్ స్క్రీన్ మీద చూస్తే దీని బలం పదింతలు తెలుస్తుంది. ఆడు జీవితం తర్వాత బలమైన సినిమా చూడాలనుకుంటే ఇదే.

2024 లో సందర్శకుల్ని ఆకర్షించడానికి గుహకు వెళ్ళే రహదారిని  తిరిగి తెరిచారు. అయితే పర్యాటకుల భద్రత కోసం గుహ ప్రవేశ ద్వారం ఇప్పటికీ మూసివేసే వుంచారు. ఈ సినిమా ప్రారంభ ముగింపుల్లో గుణ లో కమల హాసన్ వెంటాడే పాట ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఇళయరాజా స్వరకల్పనలో వస్తూంటుంది. గుహ బాధితుల్ని పరామర్శిస్తున్నట్టు.

—సికిందర్

14, ఏప్రిల్ 2024, ఆదివారం

1422 : రివ్యూ!

 

ర్శకత్వం : ఫిలిప్ మార్టిన్
తారాగణం : రూఫస్ సెవెల్, గిలియన్ ఆండర్సన్, కీలీ హవేస్, బిల్లీ పైపర్ తదితరులు
రచన : పీటర్ మోఫాట్, జియోఫ్ బుస్సేటిల్
సంగీతం : అన్నే నికితిన్, హన్నా పీల్; ఛాయాగ్రహణం : నానూ సెగల్
బ్యానర్స్ : ది లైట్‌హౌస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, వోల్టేజ్ టీవీ
నిర్మాతలు : రాడ్‌ఫోర్డ్ నెవిల్లే, హిల్లరీ సాల్మన్
విడుదల : నెట్‌ఫ్లిక్స్
***
        2019 నాటి ఒక బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని విడుదలైన నెట్ ఫ్లిక్స్ మూవీ స్కూప్ ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది. ఈ నెల 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తెలుగులో కూడా వుంది. బిబిసి జర్నలిజం నోయిడాలో కొలువుదీరిన మన గోదీ భజన మీడియా జర్నలిజానికి అందనంత సుదూరంగా, అందుకోలేని ఎత్తులో జర్నలిజం విలువలతో వుంటుంది. అందుకే ఎంత భారీ కూపీ లాగినా టీఆర్పీల కోసమని సొంత బాకా వూదుకుంటూ హంగామా చేయదు. వార్తల్లో ఆ దోషి వుంటాడు, తనుండదు. అందుకే బ్రిటన్ యువరాజు భాగోతాన్నిబట్టబయలు చేసి, అతడ్ని పదవీచ్యుతుడ్ని చేసిన విస్ఫోటక టెలివిజన్ ఇంటర్వ్యూని ప్రసారం చేస్తూ- ఇది విమానంవచ్చి ఆయిల్ ట్యాంకర్ని ఢీకొన్న పేలుడు కాదు, సునామీ ఉత్పాతం కాదు, అణుబాంబు విస్ఫోటం అంతకన్నా కాదు- ఇది కేవలం కారు ప్రమాదం కంటే తక్కువ రకం మామూలు ప్రసారం అని నిరాడంబరంగా చెప్పుకుంది. ఈ కొటేషన్ బాగా పాపులరైంది.
        ఇంతకీ ఎవరా బ్రిటన్ యువరాజు? అతనేం చేశాడు? తర్వాత ఏమయ్యాడు? ఏమా కథ? ఈ వివరాల్లోకి వెళ్దాం...

2010-2019 రెండే ఆధారాలు
2010 లో న్యూయార్క్ లో సిటీలో డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ ఆండ్రూ (రూఫస్ సెవెల్), జెఫ్రీ ఎప్‌స్టీన్ (కొలిన్ వెల్స్) అనే అతడితో కలిసి నడుచుకుంటూ పోతూంటే, ఒక ఫోటోగ్రాఫర్ వెంబడించి ఫోటోలు  తీస్తాడు. డ్యూక్ ఆఫ్ యార్క్ బ్రిటన్లో ప్రభువుల బిరుదు. దీన్ని పాలిస్తున్న చక్రవర్తి రెండవ కుమారుడికి ఇస్తారు. తొమ్మిదేళ్ళ తర్వాత, 2019 లో లండన్లో బిబిసి న్యూస్ నైట్ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్‌అలిస్టర్ (బిల్లీ పైపర్), పత్రికలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రిన్స్ ఆండ్రూ స్పాన్సర్ చేసిన యువ వ్యాపారవేత్తల ఈవెంట్‌లోని ఫోటోల పక్కన ఫోటోని చూస్తుంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ తో ప్రిన్స్ ఆండ్రూ కలిసి వెళ్ళడం. న్యూయార్క్ లో ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికర్. అతడిమీద మైనర్ బాలికలతో పాల్పడిన లైంగిక నేరాల ఆరోపణలున్నాయి. సెక్స్ ట్రాఫికింగ్ కోసం అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూంటాడు. ఎందరో అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. అతను పలుకుబడిగల ధనిక అమెరికన్ ఫైనాన్షియర్.
       
ప్రిన్స్
ఆండ్రూ, ఎప్‌స్టీన్ లు చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా వున్నారు. 2006లో లైంగిక నేరాలకి పాల్పడిన తర్వాత కూడా ఎప్‌స్టీన్ తో యువరాజు స్నేహాన్ని కొనసాగించినట్టు ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది సామ్ కి. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ ని కాంటాక్టు చేసి ఎప్‌స్టీన్ వివరాలు మరిన్ని రాబడుతుంది. ఎప్‌స్టీన్ ఇంటికి వస్తూ పోతున్న చాలా మంది మైనర్ బాలికల ఫోటోలు ఆమె చేతికొస్తాయి.

   
రియల్ సీన్ 
ఇక ప్రిన్స్ ఆండ్రూని ఈ విషయంపై ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయిస్తుంది సామ్.
న్యూస్‌నైట్ ప్రోగ్రాం ప్రెజెంటర్ ఎమిలీ మైట్లిస్ (గిలియన్ ఆండర్సన్) ఇంటర్వ్యూల్ని ఎరేంజ్ చేస్తూంటుంది. ఆమె యువరాజు పర్సనల్ సెక్రెటరీ అమండా థిర్స్క్(కీలీ హవేస్) ని కలిసి ఇంటర్వ్యూని పిచింగ్ చేస్తుంది. ప్రిన్స్ ఆండ్రూ తేలిగ్గా తీసి పారేస్తాడు. సామ్ పట్టుదల వదలదు. కానీ ఆమె టీం ఇక దీనిపై ఆసక్తి చూపదు. సామ్ నిరాశగా గడుపుతూంటే, న్యూయార్క్ లో ఎప్‌స్టీన్ అరెస్టవడం, జైల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోతాయి.
       
ఇదే
సమయంలో, వర్జీనియా గుఫ్రే అనే ఎప్‌స్టీన్ బాధితురాలు యువరాజు తనతో మూడుసార్లు గడిపాడని బయట పెడుతుంది. దీంతో యువరాజు ఆండ్రూ, సామ్ కి ఇంటర్వ్యూ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
       
ఆ ఇంటర్వ్యూలో అతనేం చెప్పాడు
? 2010 లో ఆ
రోజు ఎప్‌స్టీన్ ని ఎందుకు కలిశాడు? వర్జీనియా చేసిన ఆరోపణలకి ఏం సమాధానం చెప్పాడు? ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఇంటర్వ్యూ బాగా వచ్చింది కదూ అని ఎందుకు సంతృప్తి చెందాడు? అసలు తన మీద ఆరోపణల్ని ఖండించి ఇంటర్వూని నిరాకరించకుండా ఎందుకు మొత్తం తన చిట్టా విప్పాడు? ఈ ఇంటర్వ్యూ ప్రసారమయ్యాక అతడి పరిస్థితి ఏమిటి? అతడిపై బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఏం నిర్ణయం తీసుకుంది? ఇవన్నీ ఈ 103 నిమిషాల పాటు సాగే ఈ మూవీ చూస్తే తెలుస్తాయి.

జర్నలిజపు ఝలక్
2022 లో బిబిసి మాజీ ‘న్యూస్‌ నైట్’ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్అలిస్టర్ రాసిన స్కూప్స్ : బిహైండ్ ది సీన్స్ ఆఫ్ ది బిబిసీస్ మోస్ట్ షాకింగ్ ఇంటర్వ్యూ  అన్న పుస్తకం ఆధారంగా ఈ మూవీ నిర్మించారు. ప్రిన్స్ ఆండ్రూ పతనానికి కారణమయిన స్కూప్ కోసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌ సిబ్బందితో చర్చలు జరిపిన ముగ్గురు బిబిసి మహిళా జర్నలిస్టుల తెర వెనుక కథ ఇది.  మూవీ కోసం కథని బిబిసి న్యూస్‌నైట్ బృందం స్కూప్ ని ఎలా లాగింది, ఆండ్రూ అసలు  ఇంటర్వ్యూకి ఎందుకు అంగీకరించాడన్న రెండు అంశాల చుట్టూ కేంద్రీకరించా మని రచయితల్లో ఒకడైన పీటర్ మఫాట్ చెప్పాడు.
        
నిజ జీవితంలో ఇంటర్వ్యూ యువరాజు ఆండ్రూ పబ్లిక్ ఇమేజ్‌ని తుడిచిపెట్టేసింది.  ఇంటర్వ్యూలో 59 ఏళ్ళ ఆండ్రూతో అతడి ఇగోని ముక్కలు చేసే ఒక మాట అంటుంది సామ్- ఇది మీ బ్రాండ్ కి దెబ్బ కాదు, ఇది మాత్రమే మీ బ్రాండ్- అని! మనకేదో బ్రాండ్ వుందని మనసు లోపల అనుకుంటాం. బయటినుంచి చూసేవాళ్ళకి ట్రోలింగ్ మెటీరియల్ లా కనపడతాం. నా బ్రాండే నాకు రక్ష అని ఆండ్రూ చేయరాని పనులు చేశాడు. బహుశా ఈ కారణంగానే ఇవ్వరాని ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంతో ట్రోలింగ్ మెటీరీయల్ గా మారాడు.

     
మూవీ సీన్ 
2010 లో ఓ ఫోటో
, 2019 లో ఆ ఫోటో ఆధారంగా ఇంటర్వ్యూ ఈ రెండే అతడ్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు దారితీశాయి. అసలు రాజవంశంలో ఎంతో ప్రముఖుడైన అతను
అటువంటి ఇంటర్వ్యూకి ఆసలెందుకు అంగీకరించాడన్న ప్రశ్నకి ఈ మూవీ సమాధానమిస్తుంది. స్కూప్’ కథ రెండు పార్శ్వాల్ని అందిస్తుంది: బిబిసి మహిళా జర్నలిస్టులు ముగ్గురు ఒకవైపు, రాజ కుటుంబంలో ఆండ్రూ, అతడి కూతురు, సెక్రెటరీ మరోవైపు. అలాగని ఇదేమీ పెద్ద హై టెన్షన్ డ్రామాగా ఏమీ వుండదు. నాటకీయత వుండదు. అసలు రెండు పార్శ్వాల మధ్య సంఘర్షణే వుండదు. అన్ని సినిమా నియమాలకూ  విరుద్ధంగా డాక్యుమెంటరీలా కూడా వుండదు. రియలిస్టిక్ సినిమా అనడానికి కూడా లేదు. ఇదో వింత రూపం.
       
జర్నలిస్టుల వైపు నుంచి కథ సాగుతుంది. వాళ్ళలో టెన్షన్ ఏమీ వుండదు. పరుగులుండవు. బ్యాంకు ఉద్యోగులు తలవంచుకుని పని చేసుకుంటున్నట్టు డెస్కుల్లో కూర్చుని ప్రశాంతంగా పని చేసుకుంటూ వుంటారు. ఆండ్రూ మొదట ఇంటర్వ్యూకి ఒప్పుకోకపోతే భారీగా ఇంటర్వెల్ బ్యాంగేమీ పడదు. తెలుగు దర్శకుడు ఈ ఛాయాల్లో కనిపించడు. ఇంకెలా ఇంటర్వ్యూ సంపాదించాలన్న గోల్ కూడా వుండదు. విధివశాత్తూ జైల్లో
ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకుంటే, వర్జీనియా అనే బాధితురాలు ఆండ్రూ మీద ఆరోపణలు చేస్తే అలా కలిసి వస్తుంది.
       
ఇంటర్వ్యూ లో సామ్ ఆండ్రూని ప్రశ్నలతో అదరగొట్టదు.
మీరు మామిడిపండు ఎలా తీసుకుంటారు? చీకుతారా? లేక కోసుకు తింటారా? అని అభిమానంతో అడిగినట్టు, మీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది? ఏం డ్రింక్ తీసుకుంటారు? అని ప్రేమగా అడిగినట్టు, ప్రశ్నలు అడుగుతుంది.

కుతూహలమే బలం
గొప్ప తారాగణం లేకపోతే ఈ రకమైన మూవీ పని చేయదు. కల్పిత కథయితే ఎంత గొప్ప తారాగణ బలమున్నా పనిచేయదు. ఇది నిజ కథ. అందుకని ఏం జరిగి వుంటుందన్న సహజ ఆసక్తి, కుతూహలమే తారాగణానికి కలిసి వచ్చాయి. ప్రతి ఒక్కరికి బిబిసి గురించి తెలుసు. ప్రజల సొమ్ముతో నడిచే దానికో గౌరవముంది. అది ఇతర వార్తా సంస్థల్లాగా, సోషల్ మీడియాలాగా లాభార్జన దృష్టితో పోటీపడదు. సమగ్రతతో కూడిన బ్రాండ్‌ నేమ్ ని కాపాడుకునే ఔచిత్యం దానికవసరం- స్కూప్’ లోని పాత్రల్ని ఈ సూత్రమే నడిపిస్తుంది. అందుకే ఈ శతాబ్దంలో మీడియా స్వేచ్ఛ గురించి, విలువ గురించి, దాని ఆవశ్యకత గురించీ చాలా నిరాడంబరంగా, అంతర్లీనంగా మెసేజీనిచ్చే ఈ కథని రెగ్యులర్ జర్నలిజం థ్రిల్లర్ లా తీయలేదు దర్శకుడు ఫిలిప్ మార్టిన్.
        
ఇంటర్వ్యూ తర్వాత పరిణామాల్ని కొన్ని చిన్న చిన్న  సన్నివేశాలతో, టైటిల్ కార్డ్స్ తో, అలాగే సోషల్ మీడియా రియాక్షన్స్ తో కలిపి, ప్రిన్స్ ఆండ్రూ స్కాండల్ కి ముగింపు నిచ్చాడు. రాణి ఎలిజబెత్ తీసుకున్న నిర్ణయం కూడా ఇందులోనే వచ్చేస్తునది. ఆఖర్న వర్జినియా విషయంలో ఆండ్రూ లో వచ్చిన మార్పు కూడా. ఇది జర్నలిస్టులు తప్పక చూడదగ్గ మూవీ.
—సికిందర్ 

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

1421 : రివ్యూ

 

దర్శకత్వం : శివ తుర్లపాటి
తారాగణం : శ్రీనివాస రెడ్డి, అంజలి, సత్య, సత్యం రాజేష్షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు
రచన : కోనవెంకట్, భాను; సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ
నిర్మాత : ఎంవీవీ సత్యనారాయణ
విడుదల ; ఏప్రిల్ 11, 2024
***
          2014 లో హిట్టయిన 'గీతాంజలి' కి సీక్వెల్ గా 'గీతాంజలి  మళ్ళీ వచ్చింది' తో తిరిగొచ్చింది అంజలి. ఇది కూడా హార్రర్ కామెడీ. దీనికి కోనవెంకట్ రచయిత. శివ తుర్లపాటి కొత్త దర్శకుడు. మరి ఇది కూడా హర్రర్ తో భయపెట్టిందా, బోలెడు మంది కమెడియన్లతో నవ్వించిందా తెలుసుకుందాం...
కథ
సినిమా దర్శకుడుగా శ్రీను (శ్రీనివాస రెడ్డి) వరుసగా మూడు ఫ్లాప్స్ తీసి ఇక ఛాన్సులు రాక యాతన పడుతూంటాడు. ఇలాంటప్పుడు హీరో అవ్వాలనుకుంటున్న ఫ్రెండ్ అయాన్ (కమెడియన్ సత్య) ని బుట్టలో వేసుకుంటాడు. హీరో చేస్తానంటూ డబ్బులు గుంజుతూంటాడు. అయాన్ కి ఈ మోసం తెలియడంతో ఇరకాటంలో పడ్డ శ్రీనుకి ఊటీ నుంచి ఆఫర్ వస్తుంది. విష్ణు (రాహుల్ మాధవ్) అనే ప్రొడ్యూసర్ సినిమా తీద్దాం రమ్మని కాల్ చేస్తాడు. ఊటీలో అంజలి (అంజలి) కాఫీ షాప్ నడుపుతూంటుంది. శ్రీనుకి సినిమా ఆఫరిచ్చిన విష్ణు ఇక్కడ సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని, అంజలినే హీరోయిన్ గా తీసుకోవాలనీ కండిషన్స్ పెడతాడు. ఆ సంగీత్ మహల్ లో ఒక శాస్త్రి (రవిశంకర్), అతడి భార్య(ప్రియా), కూతురూ దెయ్యాలుగా వుంటారు.
        
వీళ్ళు దెయ్యాలెలా అయ్యారు? ఈ దెయ్యాల మహల్లో సినిమా తీయాలన్న విష్ణు ఉద్దేశమేమిటి? అంజలినే హీరోయిన్ గా తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? ఈ సినిమాలో అయాన్ హీరోగా నటించాడా? పూర్వం అంజలి అక్క గీతాంజలి ఆత్మ ఏమైంది? ఆమె మళ్ళీ తిరిగి వచ్చిందా? అసలీ మొత్తం వ్యవహారమేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
హార్రర్ కామెడీలని వదిలిపెట్టడం లేదు. మూడు వారాల క్రితమే ఓం భీమ్ బుష్ అనే హార్రర్ కామెడీ విడుదలైంది. ఇప్పుడు ఇది మరో హార్రర్ కామెడీ. ఇది 2014 లో హిట్టయిన హార్రర్ కామెడీ గీతాంజలి కి సీక్వెల్. దీనికి కూడా కోన వెంకట్ రచయిత. అయితే హార్రర్ కామెడీల్లో హార్రర్ కి భయపడ్డం ఎప్పుడో మానేశారు ప్రేక్షకులు. కేవలం అందులో  కామెడీనే పట్టించుకుంటున్నారు. ఇందులో మొదటిది ఎలాగూ వర్కౌట్ కాలేదు, రెండోది సెకండాఫ్ లో కాసేపు వర్కౌట్ అయింది.
       
అంటే నవ్వించడం కూడా కష్టమైపోతోంది. నవ్వించే కళ కనుమరుగైపోతోంది. మహల్లో దెయ్యాలతో కామెడీకి వాటితో నటించాల్సిన సినిమా షూటింగుకి సంబంధించిన సీన్లు అవి వున్నంత వరకే నవ్విస్తాయి. దర్శకుడుగా శ్రీనివాస రెడ్డి దెయ్యాల్ని జూనియర్ ఆర్టిస్టులుగా నమ్మించి సత్యా
, అంజలీలతో నటింపజేయడం, సత్య చాలా ఫన్నీ సిట్యుయేషన్లు క్రియేట్ చేయడం తెగ నవ్వించే అంశాలే. అలాగే కెమెరామాన్ కిల్లర్ నానిగా సీనియర్ కమెడియన్ సునీల్ దెయ్యాలతో హిలేరియస్ కామెడీ క్రియేట్ చేస్తాడు. దీనికి పదే పదే నవ్వుకోవచ్చు. అతడి స్కిల్స్ అలాటివి. ఈ రెండు ఎపిసోడ్స్ తర్వాత క్లయిమాక్స్ లో, మొదటి భాగంలోని గీతాంజలి ఆత్మ రావడం దగ్గర మాత్రం కథ కుదరక అసంతృప్తిగా ముగింపుకి చేరుకుంటుంది.
       
ఇక ఫస్టాఫ్ చూస్తే శ్రీనివాస రెడ్డి సినిమా చాన్సు ప్రయత్నాలు
, సత్యాని బకరా చేసి వాడుకోవడం, అతడి రచయితలుగా సత్యం రాజేష్, షకలక శంకర్ చేసే  కామెడీ వగైరాలతో చాలా బలహీనంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు ఊటీ నుంచి ఆఫర్ వచ్చాకే బోరు తొలగి ఆసక్తి పెరుగుతుంది. ఇక మహల్లో దెయ్యాలతో ఇంటర్వెల్ మలుపు కూడా ఫర్వా లేదు. ఇలా మొత్తంగా చూస్తే, హార్రర్ తో భయపెట్టడం పూర్తిగా విఫలమై, కామెడీతో నవ్వించడం సెకండాఫ్ లో రెండు ఎపిసోడ్లలో మాత్రమే సఫలమైందని చెప్పాలి.

నటనలు –సాంకేతికాలు
అంజలి, గీతాంజలి ఆత్మ పాత్రలు రెండిటినీ అంజలి మామూలుగానే నటించేసింది. షరా మామూలుగా ఈ సినిమాలో కూడా ఎమోషన్లు లేకపోవడం వల్ల నటనలు పైపైనే వుంటాయి. దాదాపు ప్ర్తఈ తెలుగు సినిమాలో ఎమోషన్లనేవి కరువైపోతున్నాయి. ఇక కమెడియన్ల శ్రేణి  బారుగానే వుంది - శ్రీనివాస్ రెడ్డి, సత్య, సత్యం రాజేష్షకలక శంకర్, అలీ, సునీల్ తదితరులు. సునీల్, సత్యలకి మాత్రమే  నవ్వించడానికి బాగా కుదిరింది. మిగిలిన వారి స్కిల్స్ వృధా అయ్యాయి. రవిశంకర్, ప్రియా దెయ్యాలుగా వాళ్ళ కథేమిటో కూడర్లేదు. విలన్ గా రాహుల్ మాధవ్ ఫర్వాలేదు.
       
ఛాయాగ్రహణం
, మహల్ సెట్, గ్రాఫిక్స్,ఇతర సాంకేతికాలు రిచ్ గా వున్నాయి గానీ సంగీతం బలహీనంగా వుంది కథా కథనాల్లాగే. కొత్త దర్శకుడు శివ తనదైన ఒక శైలి అంటూ, ముద్ర అంటూ ఏమీ క్రియేట్ చేసుకోకుండా యావరేజీ దర్శకత్వంతో సరిపెట్టేశాడు.
—సికిందర్

 


రచన- దర్శకత్వం : అమిత్ శర్మ
తారాగణం : అజయ్ దేవగణ్,  ప్రియమణి, గజరాజ్ రావ్, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ తదితరులు
సంగీతం :  ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : తుషార్ కాంతి రాయ్, ఫ్యోడర్ లియాస్
నిర్మాతలు: బోనీ కపూర్, జీ స్టూడియోస్, అరుణవ్ రాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా
విడుదల : ఏప్రిల్ 11, 2024
***

        త రెండు సంవత్సరాల్లో దృశ్యం 2’, షైతాన్ అనే రెండు హిట్స్ తో ముందున్న అజయ్ దేవగణ్ తాజాగా స్పోర్ట్స్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సచిన్’, ఎంఎస్ ధోనీ’, 83 వంటి హిందీలో వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్స్ లో చివరిది తప్ప మిగిలిన రెండూ సూపర్ హిట్టయ్యాయి. ఈ క్రమంలో మైదాన్ ని దర్శకుడు అమిత్ శర్మ తాజా స్పోర్ట్స్ బయోపిక్ గా అందిస్తూ పోటీలోకి దిగాడు. ఇతను గతంలో బధాయీ హో అనే మీడియం బడ్జెట్ సూపర్ హిట్ అందించిన దర్శకుడు. మైదాన్ లో ప్రియమణి ఒక ముఖ్యపాత్ర పోషించింది. ఇది వర్తమాన కాలపు కథ గాకుండా, దాదాపు 72 సంవత్సరాల నాటి పీరియడ్ కథ అవడంతో బడ్జెట్ బాగానే రూ. 100 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అయితే దీన్ని హిందీలో మాత్రమే విడుదల చేశారు. ఇంతకీ ఈ స్పోర్ట్స్ బయోపిక్ ప్రత్యేకటేమిటి, ఇది ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందా లేదా, దీనికి హైదరాబాద్ తో వున్న సంబంధమేమిటి మొదలైన ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...

కథ 
1952లో కోచ్ ఎస్ఏ రహీమ్ (అజయ్ దేవగణ్) నాయకత్వంలోని ఫుట్ బాల్ జట్టు ఆటలో ఓడిపోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఆటగాళ్ళు బూట్లు లేకుండా ఆడినందున గాయపడతారు. రహీమ్ తిరిగి స్వస్థలం హైదరాబాద్ వచ్చేస్తాడు. అతడికి బ్రోకెన్ ఇంగ్లీషు మాట్లాడే భార్య సైరా (ప్రియమణి), ఓ కొడుకు (దివ్యాంశ్ త్రిపాఠీ), ఇద్దరు కూతుళ్ళు (నితాంశీ గోయెల్, ఆయేషా వింధర), తల్లీ (మీనల్ పటేల్) వుంటారు. చైన్ స్మోకర్ అయిన అతను  సిగరెట్లు మానెయ్యమనే భార్య మాటల్ని పెడ చెవిని పెడతాడు.
       
అప్పుడప్పుడే
దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో, ఏ గుర్తింపూ లేని దేశం  ఫుట్‌బాల్ ఆడడం వల్లే ప్రపంచ గుర్తింపు పొందుతుందని రహీమ్ నమ్ముతాడు. అయితే బెంగాల్ నేతృత్వంలోని ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో స్వార్ధ రాజకీయాలు ప్రతిబంధకంగా మారతాయి. ఈ ఫెడరేషన్ దేశం కోసం వేరే జట్టుని నిర్మించడం కంటే బెంగాల్ ఆటగాళ్ళు జట్టులో వుండాలని పట్టుబడుతుంది. రహీమ్ దీన్ని వ్యతిరేకించి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పర్యటించి ఔత్సాహిక ఆటగాళ్ళని పోగేస్తాడు. జట్టులో వివిధ రాష్ట్రాలకి చెందిన పీకే బెనర్జీ (చైతన్య శర్మ), చునీ గోస్వామి (అమర్త్యా రే), జర్నైల్ సింగ్ (దవీందర్ గిల్), తులసీదాస్ బలరామ్ (సుశాంత్ వేదాండే), పీటర్ తంగరాజ్ (తేజస్ రవిశంకర్) సహా చాలా మంది వుంటారు. వీళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి, మంచి బూట్లు కొనిచ్చి, గట్టి టీంని ఏర్పాటు చేస్తాడు.
        
'మనది పెద్ద దేశం కాదు, మనం ధనవంతులం కాదు. సగం ప్రపంచానికి మన గురించి తెలియదు. ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ ఆడుతోంది కాబట్టి ఫుట్‌బాల్ మనకో గుర్తింపుని  తెచ్చిపెట్టగలదు. అందువల్ల, వచ్చే 10 సంవత్సరాల పాటు ప్రపంచ స్థాయి జట్టుని నిర్మించాలని భారత్ గుర్తుంచుకోవాలి అని ఉద్బోధించి సమరం ప్రారంభిస్తాడు.
       
ఈ సమరంలో ఒలంపిక్స్ సహా విజయాలు సాధిస్తూ
, అంతిమంగా ఆసియా కప్ లో  గోల్డ్ మెడల్ లక్ష్యంగా పెట్టుకుంటే, దురదృష్టం వెంటాడి క్యాన్సర్ బారిన పడతాడు. ఇప్పుడేం చేశాడు? ఎక్కువకాలం బ్రతకడు. మరణించే లోగా దక్షిణ కొరియాతో ఆసియా కప్ గెలిచాడా? క్యాన్సర్ వల్ల ఇప్పుడు తనతో తను కూడా సమరం చేయాల్సి వచ్చిన గడ్డు పరిస్థితి. ఈ పరిస్థితిలో లక్ష్యాన్ని ఎలా సాధించాడన్నది ఉద్విగ్నతకి లోనుజేసే మిగతా కథ.

ఎలావుంది కథ
స్పోర్ట్స్ బయోపిక్ లెజెండరీ ఫుట్ బాల్ కోచ్, మేనేజర్, హైదరాబాద్ వాసి  సయ్యద్ అబ్దుల్ రహీమ్ కథ. కొన్ని మరుగున పడిన మాణిక్యాలుంటాయి. అలా ఎవరికీ  తెలియని కాల గర్భంలో కలిసిపోయిన మాణిక్యాన్ని వెలికి తీసి సినిమా తీశాడు దర్శకుడు అమిత్ శర్మ. రహీమ్ జట్టు  ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఒలింపిక్స్ నుంఛీ ఆసియా క్రీడల వరకూ బంగారు పతకాల్ని  సాధించి పెట్టింది. అతడి ఏలికలో 1952 నుంచి 1962 మధ్య కాలాన్ని భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణ యుగం న్నారు.
          
రహీమ్ చివరి విజయం 1962 లో జకార్తాలో జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాని ఓడించి స్వర్ణం గెలవడం. 1963 లో క్యాన్సర్ తో కన్నుమూయడంతో అతడి శకం ముగిసింది. ఈ కథ ఫస్టాఫ్ లో అప్పటి దేశంలో ఫుట్‌బాల్ స్థితిని, రహీమ్ మెరికల్లాంటి  ఆటగాళ్ళని సృష్టించిన విధానాన్నీ చూపిస్తుంది. మరో పక్క, సోషలిస్టు అయిన రహీమ్ కి అడుగడుగునా మతం పేర, కుదరకపోతే కులాల పేర, ఇంకా కుదరకపోతే ప్రాంతీయతల పేరా ఫెడరేషన్ కమిటీ సృష్టించే ఆటంకాలుంటాయి. వాళ్ళకి బెంగాల్ ఆటగాళ్ళే కావాలి.
        
కమిటీలోని రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి ఫస్టాఫ్ ని ఉద్దేశించాడు దర్శకుడు.  ఇంకో పక్క కుటుంబ జీవితం గురించి క్లుప్తంగా చెప్పాడు. ఇలా నెమ్మదిగా సాగే ప్రథమార్ధం కొన్నిసార్లు కథ పెద్దగా ముందుకు సాగకపోవడంతో అసహనానికి గురిచేసే మాట మాత్రం  నిజం. అయితే ఈ సినిమా 2019 నుంచీ సుదీర్ఘకాలం నిర్మాణంలో వుందన్న విషయం గుర్తుంచుకోవాలి. గంట సెపే సాగే ఫస్టాఫ్ లో మొదటి ప్రధాన ట్విస్ట్ వచ్చే చివరి 15 నిమిషాల వరకూ ఇంతే. భావోద్వేగాలుండవు. అతడికి క్యాన్సర్ అని బయటపడ్డంతో ఒక ఉలికి పాటునిస్తుంది ఫస్టాఫ్ ముగింపు.
       
ఇక గంటా 45 నిమిషాలూ సాగే
సెకండాఫ్ మొత్తం ఒక యాక్షన్ డ్రామా.  ఫుట్ బాల్ ఆటే క్షణం క్షణం పరుగులెత్తే యాక్షన్ లో వుండే క్రీడ. పెద్ద తెర మీద ఈ యాక్షన్ స్టేడియంలో కూర్చుని ప్రత్యక్ష ఆట చూస్తున్నట్టే వుంటుంది. ఇక భావోద్వేగాలు- గోల్ కొడితే హర్షాతి రేకాలు, ఔట్ అయితే దీన విలాపాలు. పైగా క్యాన్సర్ తో కుంగుతున్న రహీమ్. సినిమాలోని ఈ మ్యాచ్ సన్నివేశాల్ని చూస్తున్నప్పుడు కలిగే భావోద్వేగాలు, థ్రిల్స్ పతాక స్థాయిలో వుంటాయి. టీమ్ ఇండియా గోల్ చేసిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి చప్పట్లు. ముగింపు చాలాసెంటిమెంటల్ గా వుంటుంది. బరువెక్కిన హృదయాలతో బయటికొస్తారు.

నటనలు – సాంకేతికాలు
ఫస్టాఫ్ లో అజయ్ దేవగణ్ పాత్ర కథని సెటప్ చేసే వంట తయారీ పనిలో వుంటుంది కాబట్టి మెకానికల్ గా కన్పిస్తుంది. ఒకసారి వంట తయారై ఇంటర్వెల్లో వడ్డించడం మొదలెట్టాక కట్టి పడేస్తుంది. అతను సంకల్పబలంతో స్పోర్ట్స్ ఒకదాన్నే వడ్డించడం లేదు- తనని తినేస్తున్న క్యాన్సర్ నీ వడ్డిస్తున్నాడు. ఈ రోజుల్లో క్యాన్సర్ కథలతో సినిమాలొస్తే నవ్వుతారు. కానీ నిజ కథలో క్యాన్సర్ పాత్ర సానుభూతినంతా ప్రోది చేసుకుంటుంది. ఎస్ ఏ రహీమ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొని వుంటాడా అన్న నిజ జీవితపు ప్రశ్న ఈ బయోపిక్ కి బలమైన హుక్ ని ఏర్పాటు చేస్తుంది. కల్పిత పాత్రయితే ఇదంతా కేర్ చెయ్యం. క్యాన్సర్ తో ఈ నిజ జీవిత పాత్ర ఇప్పుడెలా టీం ని గెలిపించుకుని వుంటాడా అన్న కృత్రిమత్వం లేని బలమైన డ్రమెటిక్ క్వశ్చన్ ఇక్కడ క్రియేటవుతుంది. ఇక్కడే అజయ్ తన నటనతో మార్కులన్నీ స్కోరు చేశాడు. కమిటీలో ప్రత్యర్ధులు, ఫీల్డులో ప్రత్యర్ధులు, శరీరంలో ప్రత్యర్ధి- ఈ త్రిముఖ పోరాటాన్ని సాగించే పాత్రగా శక్తివంచన లేకుండా నటించాడు. రహీమ్ ని మర్చిపోలేని విధంగా ప్రెజెంట్ చేశాడు.
       
భార్య పాత్రలో ప్రియమణి సంఘర్షణ కూడా కట్టి పడేస్తుంది. ఇంటికొచ్చి క్యాన్సర్ తో కూడా అతను సిగరెట్లు కాల్చేస్తూంటే-
యింటికొచ్చి మృత్యువు కోసం నిరీక్షిస్తున్నావా? ఇది నా ఇల్లు- ఇది జీవించడానికి, మరణించడానికి కాదు... నువ్వు కంటున్న కలలకి నువ్వొక్కడివే మూల్యం చెల్లించుకోవడం లేదని గుర్తు పెట్టుకో అంటుంది. కొడుకుని ఇంజనీరు చేయాలన్న తన కలల సంగతి ఏమిటన్న బాధలోంచి. ఈ ఫ్యామిలీ డ్రామా సబ్ ప్లాట్ గా వుంటుంది.
       
స్పోర్ట్స్ జర్నలిస్టుగా
గజరాజ్‌రావు రహీమ్ కి ఎసరుపెట్టే కన్నింగ్ పాత్ర నటించాడు. అతడి దుష్టత్వం చాలా కరుగ్గా వుంటుంది. ఫుట్‌బాల్ ప్లేయర్‌లుగా నటించిన యువ నటులకి ఎక్కువగా మాటల్లేవు. ఆటలతోనే దృష్టి నాకర్షిస్తారు. ఆ జయాపజయాలతో కూడిన భావావేశాల్ని బలంగా ప్రకటిస్తూ. ఈ మొత్తం డ్రామాలో దేశభక్తి కనిపించదు. దేశభక్తి నినాదాలుండవు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో రాజకీయాలకింకా దేశభక్తి ముడిసరుకు కానందువల్లనేమో. నేషనల్స్-యాంటీ నేషనల్స్ సోది ఆ కాలంలో లేనట్టుంది.  అజయ్ దేవ గణ్ రైట్ వింగ్ మద్దతుదారైనా ఈ సినిమాని వేరుగా వుంచాడు.
       
టెక్నికల్ గా అత్యున్నతంగా వుంది. 1950 ల నాటి హైదరాబాద్ ట్యాంకు బండ్ నీ
, పురానా పుల్ నీ బాగానే రీక్రియేట్ చేశారు. ఇతర సెట్స్ కి కళా దర్శకత్వం, నటుల కాస్ట్యూమ్స్ వగైరా 70 ఏళ్ళ నాటి కాలాన్ని ప్రతిబింబిస్తాయి. ఆరుగురు రచయితలు పని చేశారు. రెహమాన్ సంగీతంలో 5 పాటలున్నాయిగానీ మామూలుగా వున్నాయి. ఎక్కువ పాటలు మనోజ్ ముంతసిర్ రాశాడు. మనోజ్ ముంతసిర్ అంటే ఆదిపురుష్ లో యాక్షన్ సినిమా పంచ్ డైలాగులు రాసి అల్లరైన వాడే. 
       
ఫుట్ బాల్ మ్యాచుల యాక్షన్ కొరియోగ్రఫీకి స్పోర్ట్స్ యాక్షన్ డైరెక్టర్ రాబర్ట్ మిల్లర్
, కో ఆర్డినేటర్ దినేష్ నాయర్, యాక్షన్ డైరెక్టర్ ఆర్పీ యాదవ్ పని చేశారు. వీళ్ళ పనితనం అద్భుతంగా వుంది. ఈ స్పోర్ట్స్ బయోపిక్ విభిన్నమైనది. ఎందుకంటే ఇది క్యాన్సర్ ఎలిమెంట్ తో వుంది. క్యాన్సర్ ఎలిమెంట్ లేకపోతే రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా అయ్యేది.
—సికిందర్