రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, నవంబర్ 2023, బుధవారం

1382 : r


 

దర్శకత్వం : రాబీ వర్గీస్ రాజ్
తారాగణం : మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, కిషోర్, విజయరాఘవన్ తదితరులు
రచన : రోనీ డేవిడ్ రాజ్, మహమ్మద్ షఫీ; సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం : మహమ్మద్ రహీల్
బ్యానర్ : మమ్ముట్టి కంపెనీ, నిర్మాత : మమ్ముట్టి
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ఓటీటీ)
***
        లయాళంలో సెప్టెంబర్ లో విడుదలైన సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్  థియేట్రికల్ రన్‌ ముగించకముందే  రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సెప్టెంబర్ 28160 స్క్రీన్‌లలో విడుదలై, మూడవ రోజుకే 330 స్క్రీన్‌లకి పైగా విస్తరించి  సూపర్ హిట్టయ్యింది. ఈ సంవత్సరం మలయాళంలో హిట్టయిన నాలుగే సినిమాల్లో ఇదొకటి. దీనికి రాబీ వర్గీస్ రాజ్ కొత్త దర్శకుడు. మమ్ముట్టి నిర్మాతగా రూపొందిన ఈ మూవీ ఇప్పుడు ఐదు భాషల్లో ఓటీటీలో విడుదలైయింది. దీని బాగోగులు చూద్దాం...

కథ

కేరళ లోని కన్నూర్ జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించడానికి 'కన్నూర్ స్క్వాడ్' పేరుతో ఒక పోలీసు బృందం ఏర్పాటవుతుంది. దీనికి జార్జి మార్టిన్ (మమ్ముట్టి) నాయకత్వం వహిస్తాడు. 2015లో జరిగిన ఒక  పాత హత్య కేసుని జార్జి టీమ్ తెలివిగా ఛేదిస్తుంది. దీంతో టీంని ఎస్పీ అభినందిస్తాడు. 2017లో కాసర గోడ్ లో ఒక రాజకీయనాయకుడి హత్య జరుగుతుంది. అతడి కూతురు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరుతుంది. ఈ హంతకుల్ని 10 రోజుల్లోగా పట్టుకోవాలని ఎస్పీ చోళన్ (కిశోర్) కి పైనుంచి వొత్తిడి పెరుగుతుంది. దాంతో కేసుని కన్నూర్ స్క్వాడ్ కి అప్పగిస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే ఈ టీమ్ సభ్యుడు జయన్ (రోనీ డేవిడ్ రాజ్) లంచం తీసుకుంటూ కెమెరాకి చిక్కుతాడు. టీం నుంచి అతడ్ని తొలగించమని పైఅధికారుల నుంచి ఆదేశాలందుతాయి. తామంతా కలిసే అన్ని ఆపరేషన్స్ నీ సక్సెస్ చేస్తూ వచ్చామనీ, జయన్ బాధ్యత తాను తీసుకుంటాననీ పై అధికారుల్ని ఒప్పిస్తాడు జార్జి.
       
ఇప్పుడు లంచగొండి జయన్ ని జార్జి వెనకేసుకు రావడానికి కారణమేమిటి
? తన టీం తో 10 రోజుల్లో హంతకుల్ని పట్టుకోగలిగాడా? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఆటంకాలు, ప్రమాదాలు ఏమిటి? అసలు రాజకీయ నాయకుడి కథ ఏమిటి? ఇవి ముందు కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

కేరళలో కన్నూర్ స్క్వాడ్ ని 2008 లో అప్పటి ఎస్పీగా వున్న శ్రీజిత్ ఏర్పాటు చేశారు. కన్నూర్‌లో నేరాల సంఖ్యని అరికట్టడానికి దర్యాప్తు విభాగంగా ఈ స్క్వాడ్‌ ని ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ ఇప్పటికీ పనిచేస్తోంది. 2017 లో ఈ స్క్వాడ్ చేపట్టిన రాజకీయ నాయకుడి హత్య కేసు ఆధారంగా ఈ సినిమా కథ చేశారు.  కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఈ కథని రచయితలు రోనీ డేవిడ్ రాజ్, మహమ్మద్ షఫీలు రాయడం ప్రారంభించారు. 15 డ్రాఫ్టులు రాసి ఫైనల్ స్క్రిప్టు తయారు చేశారు. ఈ సినిమాతో దర్శకుడైన ఛాయాగ్రహకుడు రాబీ వర్గీస్ రాజ్ తండ్రి సి.టి. రాజన్, 30 ఏళ్ళ క్రితం మమ్ముట్టితో మహాయానం అనే సినిమా తీసి సర్వం కోల్పోయాడు. ఇప్పుడు అదే మమ్ముట్టి నిర్మాతగా, రాబీ వర్గీస్ రాజ్ దర్శకుడుగా మారి కన్నూర్ స్క్వాడ్  సినిమా తీసి 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. ఈ సూపర్ స్టార్ సినిమా బడ్జెట్ 30 కోట్లు మాత్రమే. తెలుగులో తీస్తే 130 కోట్లు టేబుల్ మీద పెట్టాల్సిందే.
       
ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన ఇన్వెస్టిగేషన్ ప్రధాన కథ. హంతకుల్ని పట్టుకునేందుకు ఇచ్చిన పది రోజుల గడువుతో టైమ్ లాక్ కథ. తెర మీద కౌంట్ డౌన్ రికార్డవుతూంటే ఉత్కంఠ రేపుతూ పరుగులుదీసే కథ. కనుక ఈ కౌంట్ డౌన్ కి అడ్డుపడే పాటలు
, కామెడీలు, కాలక్షేపాలు వంటి వినోదాత్మక విలువలకి దూరంగా, సీరియస్ మూడ్ లో సీరియస్ గానే సాగుతుంది ఆద్యంతం. ఈ సీరియస్ నెస్ తో బోరుకొట్టకుండా, నిజ కేసులో వున్న సదుపాయం ఈ కథకి ఉపయోగపడింది. హంతకుల కోసం ఈ కథ కన్నూర్, కాసరగోడ్, వాయనాడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పుణే, ముంబాయి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బెల్గాం, మంగళూరు, కోయంబత్తూరు మొదలైన 12 ప్రాంతాలకి ప్రయాణిస్తుంది. వేల కొద్దీ మైళ్ళు రోడ్డు మార్గానే పోలీసు వాహనంలో తిరుగుతారు. ఎందుకంటే విమాన ప్రయాణాలకి తగ్గ బడ్జెట్ పోలీసు డిపార్ట్ మెంట్ దగ్గర లేదు.
       
ఇక బుద్ధి బలంతో ఇన్వెస్టిగేషన్
, కండబలంతో యాక్షన్ పుష్కలంగా జరుగుతాయి.
 హంతకులకి సహకరించిన ఒకడ్ని పట్టుకోవడానికి మారుమూల గ్రామానికి వెళ్ళే స్క్వాడ్ మీద అక్కడి జనం తిరగబడే సన్నివేశం సినిమాకి హైలైట్.  హంతకులు సిమ్ కార్డులు మారుస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జంప్ అవుతూంటే- మొబైల్ టవర్ డంప్ నాలిసిస్ వంటి అత్యాధునిక టెక్నాలజీ నుపయోగించి ఇన్వెస్టిగేట్ చేసే వాస్తవిక చిత్రణ ఇందులో కన్పిస్తుంది. ఈ ఔటర్ స్ట్రగుల్ ఒకవైపు, తొందరపెట్టే పై అధికారులకి సమాధానం చెప్పే, క్రుంగిపోకుండా టీంకి స్ఫూర్తి నింపే, ఇన్నర్ స్ట్రగుల్ ఇంకోవైపూ పడే మమ్ముట్టి పాత్రతో కథకి జీవం కూడా వస్తుంది.
       
అయితే చాలా చోట్ల లాజిక్
, కంటిన్యూటీ లేకపోవడం, స్పీడుతగ్గి బోరుకొట్టడం వంటి లోపాలుకూడా వున్నాయి. ఈ టైమ్ లాక్ వాస్తవిక కథని వేగమే ప్రధానంగా రెండుగంటల్లో ముగించేస్తే బావుండేది. రెండున్నర గంటలు సాగింది. ఓటీటీలో నిడివి తగ్గించి వుండొచ్చు. ఇక క్లయిమాక్స్ లో మంచి ఊపు వస్తుంది.
       
ఇలాటిదే నిజ కేసుతో కథ తమిళంలో కార్తీతో
ఖాకీ గా వచ్చింది 2017లో. ఇది కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో తమిళనాడు పోలీసులు సాగించే వేట. కాకపోతే ఇది ఆన్ని కమర్షియల్ హంగులూ వున్న మసాలా యాక్షన్.

నటనలు- సాంకేతికాలు

72 ఏళ్ళ మమ్ముట్టి కూడా రజనీకాంత్, కమల్ హాసన్, బాల కృష్ణ, శివరాజ్ కుమార్, సన్నీ డియోల్ ల వంటి హిట్లిచ్చిన 60 ప్లస్ స్టార్స్  క్లబ్ లో చేరిపోయాడు. ఇక చిరంజీవి కోసం వెయిటింగ్. మమ్ముట్టి చాలా తక్కువ స్థాయి పాత్ర పోషించాడు. అతను ఎఎస్సై. ఎస్సై కూడా కాదు. అతడి టీంలో వుండేది కానిస్టేబుల్సే. అందులో ఒకడు రచయిత  రోనీ డేవిడ్ రాజ్.  మరో ఇద్దరు అజీజ్, శబరీష్ వర్మ. ఇన్వెస్టిగేషన్లో ఎదుర్కొనే సమస్యల్లో, ప్రమాదాల్లో, ఇంకా కొన్ని వ్యక్తిగత విషయాల్లో టీంకి ధైర్యాన్ని నింపి, ముందుకు నడిపించే పాత్రలో - టీం లీడర్ అంటే ఇతనే అన్పించేలా నటించాడు మమ్ముట్టి. భారీ డైలాగులు, బిల్డప్పులు లేని సహజ నటన, టీంలో ముగ్గురూ కానిస్టేబుల్స్ కి స్ఫూర్తిగా వుంటారు.
       
రాజకీయ నాయకుడి ఇంట్లో దోపిడీకి వెళ్ళి చంపి పారిపోయే హంతకులుగా అర్జున్
, ధ్రువన్ లది పాత్రలకి తగ్గ జిత్తులమారి నటన. ఇంకా హంతకుల వేటలో 12 ప్రాంతాల్లో ఎదురయ్యే పాత్రలేన్నో వుంటాయి.  అయితే కెమెరా వర్క్ ఛాయాగ్రాహకుడైన దర్శకుడు నిర్వహించలేదు.
మహ్మద్ రహీల్ కెమెరా వర్క్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. నైట్ ఎఫెక్ట్ లో, ఫారెస్టులో తీసిన  సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక  సుశీన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథతో బాటు ప్రేక్షకులు ప్రయాణించేలా చేస్తుంది.
       
మొత్తం మీద
కన్నూర్ స్క్వాడ్ పోలీసు శాఖ గురించి ఒక ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్. చట్టాన్ని అమలు చేసే వాస్తవిక చిత్రణని అందిస్తుంది. పోలీసుల రోజువారీ సవాళ్ళని, నిధుల కొరతని, ఓ మాదిరి వేతనాల్ని భరిస్తూ, అదే సమయంలో రాజీపడని విధి నిర్వహణకి కట్టుబడి, సమాజం పట్ల మానవీయంగా ఎలా మారతారో చూపిస్తుంది.

—సికిందర్

20, నవంబర్ 2023, సోమవారం

1381 : రివ్యూ


 

రచన-నటన-నిర్మాణం- దర్శకత్వం : విక్రాంత్
తారాగణం: విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, నాజర్, సుహాసిని, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, గురు సోమసుందరం తదితరులు
సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : ఏఆర్ అశోక్ కుమార్
బ్యానర్: డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్,  నిర్మాత : లీలా రెడ్డి
విడుదల : నవంబర్ 17, 2023
***
        కంగా రచయితగా, ద్విపాత్రాభినయం చేస్తూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా అట్టహాసంగా భారీ స్థాయిలో  స్పార్క్- లైఫ్ అనే సినిమా పూర్తిచేసుకుని, టాలీవుడ్ రంగప్రవేశం చేశాడు విక్రాంత్ రెడ్డి అనే కొత్త యూత్. అతడి ధైర్యానికి టాలీవుడ్ లో అందరి దృష్టీ అతడి మీద పడింది. ట్రైలర్లు, ప్రమోషన్లు, పబ్లిసిటీలతో ఉత్కంఠ కూడా పెరిగింది. ఇది ధైర్యమనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఏమనుకోవాలి? ఏమనుకోవాలో ఈ క్రింద చూద్దాం...

కథ

    లేఖ (మెహ్రీన్ పిర్జాదా) తన కలల్లో కన్పిస్తున్న యువకుడ్ని ప్రేమిస్తూ అతడికోసం వెతుకుతుంది. ఇంట్లో వచ్చిన సంబంధాలు తిరస్కరిస్తుంది. ఓ హాస్పిటల్లో కలల్లో కనిపిస్తున్న యువకుడిలాగే వున్న ఆర్య (విక్రాంత్) ని చూసి వెంటపడుతుంది. విక్రాంత్ ఆమెని తిరస్కరిస్తాడు. ఇంతలో నగరంలో వరుస హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూంటాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు తమకి కావాల్సిన వాళ్ళనే చంపి ఆత్మహత్యలు చేసుకుంటూంటారు. ఇదంతా ఆర్యయే చేస్తున్నాడని అనుమానిస్తాడు లేఖ తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్).

మరోవైపు వైజాగ్ లో ఆర్యలాగే వున్న జై (విక్రాంత్ ద్విపాత్రాభినయం) అనన్య (రుక్సార్ ధిల్లాన్) ని ప్రేమిస్తూంటాడు. ఇతనెవరు? ఆర్య కేమవుతాడు? ఈ హత్యలు, ఆత్మహత్యల వెనుక వున్నది ఎవరు? వీటితో డాక్టర్ ఇందిర (సుహాసిని ), మేజర్ జనరల్ భరద్వాజ్ (నాసర్), సైనిక డాక్టర్ (గురు సోమసుందరం) లకి ఏం సంబంధం?వి  తెలుసుకోవాలంటే వెండి తెరని ఆశ్రయించాలి.

ఎలా వుంది కథ

    నిజానికిది మెడికో థ్రిల్లర్ కథ. పక్క దేశంలో టెర్రరిస్టుల బ్రెయిన్ ని  కంట్రోలు చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవచ్చని చెప్పడం ఈ కథ ఉద్దేశం. అయితే ఆర్మీలో కొందరు డాక్టర్ లు బ్రెయిన్ కంట్రోల్ పై చేస్తున్న ప్రయోగాల కారణంగా పౌరుల మరణాలు జరుగుతున్నాయని తేల్చారు. ఇంతవరకూ బాగానే వుంది. అమెరికా గూఢచార సంస్థ సిఐఏ ఇలాటి ప్రయోగాలే చేస్తూంటుంది. అయితే ఈ మెడికో థ్రిల్లర్ కథని ఏక సూత్రతతో మెడికో థ్రిల్లర్ గానే వుంచక కొత్త రచయిత, దర్శకుడు విక్రాంత్ - క్రైమ్, రోమాన్స్, మిస్టరీ, కామెడీ, సైంటిఫిక్, బయోలాజికల్ జానర్స్ అన్నీ కలిపేసి గందరగోళం చేశాడు.
       
పైగా హత్యలు- ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పడానికి కథని సెకండాఫ్ లో ఎక్కడో ప్రారంభించాడు. దీంతో ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయి ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఈ కథ క్రైమ్ గురించి కాదు
, రోమాన్స్ గురించి కాదు, కామెడీ గురింఛీ కాదు, మిస్టరీ గురించి కూడా కాదు, ఇంకేదో సైంటిఫిక్ అంశం గురించీ కాదు. కానప్పుడు వీటితోనే సమయమంతా వృధా చేసి- చెప్పాలనుకున్న కథకి కేంద్ర బిందువైన మైండ్ కంట్రోల్ బయోలజికల్ అంశాన్ని చిట్ట చివర్లో పైకి తీశాడు.
       
ఇలా
క్రైమ్, రోమాన్స్, మిస్టరీ, కామెడీ, సైంటిఫిక్ తదితర ఎలిమెంట్స్ తో బోలెడు సస్పెన్స్ పుట్టి ఆడియెన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతారనుకున్నాడు. కానీ అసలు చెప్పాలనుకుంటున్న కథేమిటో అర్ధంగాక తలలు పట్టుకుంటారని తెలుసుకోలేకపోయాడు.
        
మంగళవారం లో కూడా ఫస్టాఫ్ లో నాలుగు హత్యలు, వాటి తాలూకు దర్యాప్తు జరుగుతూ వీటి వెనుక ఎవరున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇంటర్వెల్ సీన్లో అంతవరకూ లేని హీరోయిన్ని దెయ్యంగా చూపించి ఆమే హంతకురాలని కథని ఓపెన్ చేసేశారు. స్పార్క్ కథ కూడా మైండ్ కంట్రోల్ ప్రయోగాల కారణంగా పౌరుల మరణాలు జరుగుతు
న్నాయని ఇంటర్వెల్లో ఓపెన్ చేసేస్తే ఈ సినిమా బతికి వుండేది. స్క్రీన్ ప్లే సూత్రాలు తెలియకుండా సినిమా తీస్తే ఫలితాలు ఏమంత బావుండవు. విక్రాంత్ ఈ కథని అనుభవమున్న రచయితకి అప్పజెప్పాల్సింది.
       
హత్యలు జరిగే తీరు మాత్రమే థ్రిల్లింగ్ గా వుంటుంది. మిగతా రోమాన్స్
, కామెడీ, మిస్టరీ సీన్లు, బయోలజీ ప్రయోగాల సీన్లూ పేలవంగా వుంటాయి. పైగా ద్విపాత్రాభినయంతో ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ దారుణంగా తయారైంది. సీన్ల ప్రారంభ ముగింపులు కూడా చూపించిన హత్యలంత ఘోరంగా వుంటాయి. ఇక హీరో దగ్గర్నుంచీ ఆర్మీ మేజర్, డాక్టర్ వరకూ, మధ్యలో నోబెల్ బహుమతీ గ్రహీత వరకూ పాత్రచిత్రణలు సరే. ఇది సినిమా గురించి తెలిసి చేసిన ధైర్యం కాదు. అన్నీ తెలుసనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన దుష్ప్రయత్నం.

నటనలు -సాంకేతికాలు

    ముందు విక్రాంత్ తనకి నటన రాదని తెలుసుకోవాలి. వచ్చిందల్లా కాస్త చిరునవ్వు ఒలికిచడం మాత్రమే. రోమాన్సులో ప్రేమ, రోషంలో కోపం, ఇతర ఎమోషన్లు వంటి కనీసావసరాలు తీర్చలేకపోయింది నటన. ఇంగ్లీషులో చెప్పాలంటే తనది బిగుసుకుపోయిన కార్డ్ బోర్డు ఫేసు. ఫైట్స్ కూడా అంతే. యాక్షన్ సీన్స్ లో తను అలా నిలబడి వుంటే శత్రువులే వచ్చి గుద్దుకుని చచ్చిపోతారని నమ్మకమేమో. యాక్షన్ సీన్స్ లో స్లోమోషన్ బిల్డప్ షాట్స్ కి తగ్గ కమర్షియల్ హీరోయిజం కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వుంది. ఇక ద్విపాత్రాభినయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనే ఓవరాక్షన్.
       
మెహరీన్ పీర్జాదా
, రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్లు ఇద్దరూ తమకి డబుల్ యాక్షన్ హీరో సరిపోక ఇబ్బంది పడి నటిస్తున్నట్టు అన్పిస్తారు.
వెన్నెల కిషోర్, సత్య లతో మూస కామెడీ ట్రాక్ తాము నవ్వించాలా, ఏడ్పించాలా అన్నట్టుంది. నోబెల్ అవార్డు విజేత డాక్టర్ గా సుహాసిని, ఆర్మీ మేజర్ జనరల్ గా నాజర్, ఆర్మీ డాక్టర్ గా గురు సోమసుందరం, ఫస్ట్ హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ తామింత భారీ పాత్రలు పోషించడానికి తగిన విషయం లేదని రాజీపడే నటించినట్టున్నారు.
       
సినిమా మొత్తం మీద బాగున్నది
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతంలో రెండు పాటలే. పేలవమైన కథాకథనాల కారణంగా అశోక్ కుమార్ ఛాయాగ్రహణం వృధా అయింది. అలాగే మిగతా టెక్నీషియన్ల పని తీరు. నిడివి రెండు గంటల 50 నిమిషాలు చాలా పెద్ద సహాన పరీక్ష.
       
తొలి సినిమాతోనే విక్రాంత్ తానే రచన
, ద్విపాత్రాభినయం, ఇద్దరు హీరోయిన్లతో రోమాన్సు, దర్శకత్వం, భారీ బడ్జెట్ వెచ్చించి మెడికో థ్రిల్లర్ వంటి హై కాన్సెప్ట్ సినిమా నిర్మాణం సాగించడం ఓవర్ గా లోడ్ చేసుకున్న కాన్ఫిడెన్సే!

—సికిందర్

19, నవంబర్ 2023, ఆదివారం

1380 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : హేమంత్ రావు
తారాగణం : రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర జె అచార్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర తదితరులు  
సంగీతం: చరణ్ రాజ్, ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వప్రసాద్!  
విడుదల : నవంబర్ 17, 2023
***

        న్నడ హిట్ సప్త సాగర దాచే ఎల్లో- సైడ్ ఏ తెలుగులో  సప్త సాగరాలు దాటి -సైడ్ ఏ గా సెప్టెంబర్ లో విడుదలైంది. రక్షిత్ శెట్టి నటించిన ఈ రోమాంటిక్ డ్రామా తెలుగులో అభిరుచిగల ప్రేక్షకుల ప్రశంసలందుకుంది గానీ బాక్సాఫీసు దగ్గర పనిచేయ లేదు. ఇప్పుడు దీని రెండో భాగం- సైడ్ బి కూడా నాలుగు దక్షిణ భాషల్లో విడుదలైంది. ఒక ప్రేమకథకి ప్రతీకారాన్ని జోడించి వాస్తవిక/కళాత్మక దృష్టితో నిర్మించిన ఈ రెండో భాగం ఎలా వుంది? మొదటి భాగమంత బలంగా ఇది కూడా వుందా? ఇది పరిశీలిద్దాం...
కథ

    మొదటి భాగంలో జైల్లో వున్న మను (రక్షిత్ శెట్టి) పదేళ్ళ తర్వాత ఇప్పుడు విడుదలవుతాడు. మొదటి భాగంలో ఎన్నో కలలతో తనూ ప్రియా (రుక్మిణీ వసంత్)  ప్రేమించుకున్నారు. కానీ విధి విడదీసింది. ఇప్పుడామె జ్ఞాపకాలు వెంటాడుతూంటే ఆమె అన్వేషణకి పూనుకుంటాడు. మరోవైపు తనని అన్యాయంగా జైలుకి పంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ప్రియాకి పెళ్ళయి పోయిందని తెలుసు. అయితే ఆమె ఎలా జీవిస్తోంది, కలలు తీరాయా, సింగర్ గా పాటలు పాడుతోందా? ఇవి తెలుసుకునే క్ర మంలో సురభి (చైత్ర) అనే కాల్ గర్ల్ పరిచయమవుతుంది. ఆమెతో గడుపుతూ ప్రియాని అన్వేషించి జాడ తెలుసుకుంటాడు. తెలుసుకుంటే, సముద్రపుటొడ్డున విశాలమైన భవంతి లో నివసించాలన్న కలలకి బదులు, క్రిక్కిరిసిన సందులో ఇరుకు ఇంట్లో వుంటుంది కొడుకుతో, భర్తతో. ఇది చూసి చలించిపోయి- ఆమె ఉన్నతి కోసం తను అజ్ఞాతంగా వుంటూ ఏమైనా చేయాలని సంకల్పించుకుంటాడు మనూ.
       
అతడి ఆశయం నెరవేరిందా
? శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకున్నాడా? సురభి ఏమైంది? మనూని చూసి ప్రియా ఎలా రియాక్టయింది? ఈ కథ చివరికి ఏ తీరాలకి చేరింది? ఇవీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలా వుంది కథ

    ఒక సినిమాకి రెండో భాగం తీస్తే, లేదా సీక్వెల్ తీస్తే ఎప్పుడూ రిస్కే. మొదటి భాగమంత క్వాలిటీ వుండదు. టెక్నికల్ గా, కళాత్మకంగా క్వాలిటీ వుండొచ్చు, కానీ కంటెంట్ పరంగా కాదు. రక్తచరిత్ర మొదటి భాగం తర్వాత రెండో భాగం బలంగా వుండదు. బాహుబలి రెండో భాగం కూడా ఇంతే. ఇప్పుడు సప్తసాగరాలు దాటి సైడ్ బి కూడా ఇంతే. సీక్వెల్స్ కంటే భాగాలుగా తీసినప్పుడే ఇలా జరుగుతుంది. హాలీవుడ్ లో భాగాలుగా ఏ కథలు తీసే వారంటే, నవలా కథలు. బాగా పాపులరైన నవలని రెండు మూడు భాగాలుగా సాగదీసి తీసి సొమ్ములు చేసుకోవచ్చనే  ఐడియాతో తీసేవాళ్ళు. అలా నవల చదివిన పాఠకులు రెండో భాగం, మూడో భాగం ఎలా వుంటాయోనని  ఎగబడి చూసేవాళ్ళు. వారపత్రికల్లో సీరియల్స్ కి ఎగబడినట్టు. తర్వాత్తర్వాత మోసం బయట పడింది. నవల్లో ఒక సినిమా తీసేంత విషయమే వుంటే, కల్పితాలు చేసి సాగదీసి సాగదీసి, భాగాలుగా తీస్తున్నారని అర్ధమయ్యాక అలాటి సినిమాలు తీయడం ఆపేశారు.
        
సప్త సాగరాలు దాటి -సైడ్ బి విషయం కూడా ఇలాటిదే. కాకపోతే ఇది తప్పక చూడాలని ఆసక్తి రేపడానికి నవలా భాగం కాదు. మొదటి భాగం లోని కథా బలాన్ని, పాత్రచిత్రణల్ని, భావోద్వేగాల్ని, కొనసాగించడానికి తగ్గ కథ ఇందులో వుండాలి. కథని ఒప్పించడానికి రెండు విషయాలు అడ్డుపడతాయి : పదేళ్ళ తర్వాతా అంతే బలంగా ప్రేమని కలిగి వుండడం, పెళ్ళయిపోయి తన బ్రతుకేదో తను బ్రతుకుతున్న మాజీ ప్రేయసి సంతోషం కోసం ఏదో చేయాలనుకోవడం. పదేళ్ళ తర్వాత ఎవరికివారే యమునా తీరేనే. అందుకని కథ ప్రాక్టికల్ గా అన్పించదు.
       
అజ్ఞాతంగా వుంటూ ఆమెకి సాయపడాలనుకునే సన్నివేశాలు స్టాకింగ్ (రహస్యంగా ఫాలో అవడం) తో ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఆమె కాపురంలో చిచ్చు పెట్టడానికే వచ్చినట్టు అనిపిస్తాడు. నేరుగా ఆమెని కలిసి ఫ్రెండ్స్ గా వుందామని చెప్పేస్తే అయిపోతుంది.  అప్పటికీ ఆమె భర్తతో సమస్యే ఎదురుకావొచ్చు. ఇలా ఇంకొకరి భార్యని సంతోష పెట్టాలన్న బాధ నీకెందుకురా బాబూ అనిపిస్తాడు. చివరికి ఫ్రెండ్సే అవుతారు. అదేదో ముందే అనుకుంటే అయిపోయేది.  ఆమె తనని మర్చి పోయి పెళ్ళి చేసుకుందంటే సంతోషంగా వున్నట్టే కదా
? అసలే అన్యాయమై పోయిన అతన్నుంచి సాయం ఎందుకు తీసుకుంటుంది? ఇలా అనిపిస్తే ఇంకా కథ ఎక్కడుంది?
       
మొదటి భాగం లాగే రెండో భాగం అతి సాగుతుంది. మేకింగ్ పరంగా నాణ్యత కూడా మొదటి భాగంతో సరిపోలుతుంది. కానీ నేపథ్య సంగీతం అక్కడక్కడ మాత్రమే బావుంటుంది. సినిమా భారంగా అన్పించడంతో రెండున్నర గంటల నిడివి కూడా ఓపికని పరీక్షిస్తుంది. కథ ముగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. హీరోయిన్ తో కథ ముగిసిపోయిన చోట
, పాటతో మళ్ళీ సాగదీశాడు దర్శకుడు.
       
అయితే శత్రువుల మీద ప్రతీకార కథని ప్రధానం చేయలేదు. ప్రేమ మీదే దృష్టి పెట్టాడు. మాజీ ప్రేయసికి ఆర్ధికంగా సాయపడాలనుకున్నప్పుడు మాత్రమే
, అందులో భాగంగానే శత్రువులతో సంపర్కంలోకొస్తాడు హీరో.  

నటనలు- సాంకేతికాలు 

    రక్షిత్ శెట్టి మొదటి భాగంలో యంగ్ లుక్ పదేళ్ళ కథాకాలం తర్వాత ఇప్పుడు వయసుకి తగ్గట్టు వొళ్ళు కూడా పెరిగింది. ఐతే అహర్నిశలూ మాజీ ప్రేయసిని తల్చుకుంటూ పదేళ్ళు బాధలో గడిపిన తను ఇంత బలంగా,  ఆరోగ్యంగా వుంటాడా అన్న సందేహం తలెత్తుతుంది. నటనతో మాత్రం సున్నిత భావాల్ని ప్రకటించగల ఈజ్ తో ఆకట్టుకుంటాడు. కొన్ని చోట్ల గుండెల్ని కూడా బరువెక్కిస్తాడు. మస్తిష్కంతో గాకుండా హృదయంతో చూస్తే క్లిష్ట సన్నివేశాల్లో అతడి అభినయానికి పాస్ మార్కులే.
       
పెళ్ళయిన హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్ పాత్ర నిడివి తక్కువే. మొదటి భాగంలోలాగే ఉద్విగ్నంగా కళ్ళతో నటించింది. కళ్ళతో నటించిన ఇంకో నటి కాల్ గర్ల్ పాత్ర పోషించిన చైత్ర. ఈమె క్షోభ
, స్ట్రగుల్ అర్ధవంతంగా వుంటాయి. ఇంకా మిగిలినవి సహాయ పాత్రలు. విలన్ గా నటించిన అచ్యుత్ కుమార్ ఫర్వాలేదు.
       
పూర్తిగా కెమెరా వర్క్
, ప్రొడక్షన్ విలువలూ ఉన్నతంగా వుంటే, సంగీతం మాత్రం అక్కడక్కడా డ్రాప్ అయింది. ఈ రోమాంటిక్ డ్రామా రెండో భాగం ప్రేమకథ కంటే బలంగా, ప్రతీకార కథతో వుంది. శత్రువులతో రక్షిత్ శెట్టి నడిపే రివెంజీ డ్రామా సృజనాత్మకంగా, కమర్షియల్ సి నిమాలకి భిన్నంగా ఆకట్టుకునే తీరులో వుంది.

—సికిందర్

18, నవంబర్ 2023, శనివారం

1379 : రివ్యూ


 రచన -దర్శకత్వం: అజయ్ భూపతి

తారాగణం : పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్ తదితరులు  
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్
బ్యానర్ : ముద్ర  మీడియా వర్క్స్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
విడుదల : నవంబర్ 17, 2023
***

        ‘ఆర్ ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి మూడో సినిమా ‘మంగళవారం’. ఇందులో పాయల్ రాజ్పుత్ హీరోయిన్. అజయ్ భూపతి పాయల్ రాజ్పుత్ తో అడల్ట్ మూవీ ఆర్ ఎక్స్ 100 తీసిన తర్వాత శర్వానంద్- సిద్ధార్థ్ లతో తీసిన మహాసముద్రం హిట్ కాలేదు. పాయల్ కూడా ఆర్ ఎక్స్ 100  తర్వాత నటించిన 8 సినిమాలూ హిట్ కాలేదు. తిరిగి ఇప్పుడు ఇద్దరూ ఇంకో అడల్ట్ మూవీ మంగళవారం తో తిరిగి వచ్చారు. మరి ఈసారి ఆర్ ఎక్స్ 100 లాంటి మ్యాజిక్ వర్కౌట్ అయిందా? ఈ విషయం తెలుసుకుందాం...

కథ  

    రాజమండ్రి దగ్గర్లో ఓ గ్రామంలో గ్రామ దేవతకి ఇష్టమైన  మంగళవారం రోజు రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. దీనికి ముందు రోజు మృతులిద్దరికీ అక్రమ సంబంధముందని గోడ మీద ఎవరో రాస్తారు. కొత్తగా వచ్చిన ఎస్సై మాయ (నందితా శ్వేత) వీటిని హత్యలుగా అనుమానించి పోస్ట్ మార్టంకి పంపించబోతే జమీందారు (కృష్ణ చైతన్య) అడ్డుపడతాడు. తిరిగి మళ్ళీ మంగళవారం ఇలాగే ఇంకో రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. వీళ్ళిద్దరికి కూడా అక్రమ సంబంధముందని ముందురోజు ఎవరో గోడ మీద రాస్తారు. దీంతో ఎస్సై మాయ  ఈ నాలుగు మరణాలని హత్యలుగా భావించి చర్యలు తీసుకుంటుంది. ఇవి హత్యలైతే ఎవరు ఎందుకు చేస్తున్నారు? గోడల మీద రాస్తోందెవరు రు? ఈ వ్యవహారంలో జమీందారు, జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), ఫోటోగ్రాఫర్ (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్) ల ప్రమేయం ఏమిటి? కొన్నాళ్ళ ముందు ఊరంతా వెలి వేసిన శైలు (పాయల్ రాజ్పుత్) కథ ఏమిటి? ఆమె ప్రేమించిన మదన్ (అజ్మల్ అమీర్) వ్యవహారమేమిటి? చివరికి ఏం తేల్చింది ఎస్సై మాయ? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    ఏ- సర్టిఫికేట్ పొందిన ఈ అడల్ట్ సినిమా కథ నింఫోమేనియక్(అదుపులో లేని  కామకోరికల) యువతి గురించి. నింఫోమేనియా మీద హాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. దీన్ని తెలుగులో ప్రయత్నించారు. ఈ నింఫోమేనియా బాధితురాలి చుట్టూ వాళ్ళవాళ్ళ అవసరాలతో చాలామంది నేరాలు ఘోరాలకి పాల్పడతారు. చివరి అరగంట కథలో ఇవి పొరలుపొరలుగా బయటపడతాయి. అయితే కథంతా ఈ బాధితురాలి సమస్యకి పరిష్కారం వెతికే మానవత్వం చూపించక, అడుగడుగునా ఆమె పట్ల క్రూరత్వమే ప్రదర్శించి అంతమొందించడం సినిమాకోసం అవసరమై వుండొచ్చు.
       
ప్రధాన పాత్ర పోషించిన పాయల్ ఇంటర్వెల్ వరకూ కనిపించదు. ఫస్టాఫ్ గ్రామంలో మరణాలు
, వివిధ పాత్రలు వాటి పరిచయాలు, స్వభావాలు, వేడుకలు, కొట్లాటలు ఇవే సాగుతూ, ఇంటర్వెల్ షాట్ లో పాయల్ మిస్టీరియస్ గా కనిపించడంతో ముగుస్తుంది. ఇలా ప్రధాన పాత్ర లేని, కథ ప్రారంభం కాని ఫస్టాఫ్ తో బోరు కొట్టకుండా కాస్త ఎంటర్ టైన్ కూడా చేస్తూ నడిపాడు దర్శకుడు.
       
ఇంటర్వెల్లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ తో సెకండాఫ్ కథ ఒక ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆమె కాలేజీకి వెళ్ళడం
, కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ మదన్ తో ప్రేమాయణం చాలా పేలవంగా సాగుతాయి.  అయితే ఈ ఎపిసోడ్ లోనే పాయల్ మానసిక రుగ్మత తాలూకు చిహ్నాలు కన్పిస్తాయి. అవి పెరిగి పెరిగి లైంగికంగా ఆమె విచ్చల విడితనానికి దారి తీస్తాయి. ఈ మలుపు దగ్గర్నుంచి కథ ఇంకెన్ని మలుపులు తిరిగిందన్నది వెండి తెరపైనే చూడాలి.  
       
చివరి అరగంటలోనే ఐదారు మలుపులు
, వాటి ఫ్లాష్ బ్యాకులు మొత్తం జరిగిన నేరాల చుట్టూ కథని సమప్ చేస్తాయి. దీన్ని లాజికల్ గా పకడ్బందీగా పోషించాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో కనిపించిన వివిధ పాత్రలు ఇక్కడ సర్ప్రైజింగ్ గా రివీలవుతాయి. అయితే చివర్లో ముసుగు వ్యక్తి ఎవరన్న సస్పెన్స్ ని విప్పినప్పుడు ఈ హైడ్రామా తేలిపోతుంది. అసలు ముసుగు వ్యక్తి ఎవరై వుంటాడో పెద్ద సస్పెన్స్ కాదు. ఎందుకంటే ఫస్టాఫ్ ప్రారంభంలో పాయల్ చిన్నప్పటి కథలో అతను చనిపోయినట్టు చూపించారుగానీ, పాత్రని బట్టి బతికే వుంటాడనీ, తిరిగి వస్తాడనీ వూహించేయ వచ్చు.
       
కాబట్టి ముగింపులో హల్చల్ చేస్తున్న ముసుగు వ్యక్తి ఎవరై వుంటాడో ఇట్టే తెలిసిపోతుంది. అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం ఇంకో ఫినిషింగ్ టచ్ ఇచ్చి వుండొచ్చు. ముసుగు తీసినప్పుడు అతను ఎవరైనా పాపులర్ హీరో అయివుంటే సర్ప్రైజ్ చేసే వాడు. ముగింపు నెక్స్ట్ లెవెల్లో వుండేది. ఈలలు పడేవి. ఇలా కాకుండా ఎవరో తెలియని ఆర్టిస్టుని చూపించారు. ఆ స్థానంలో వుండాల్సింది ఎంతో కొంత గుర్తింపు వున్న హీరో. ఎవరైనా తెలిసిన హీరో అయివుంటే పాయల్ లాంటి హీరోయిన్ కోసం డ్రామా ఎక్సైటింగ్ గా ఎలివేట్ అయ్యేది. అనామకుడితో
, అతడి అనుభవం లేని నటనతో పూర్తిగా విఫలమైంది. దీని తర్వాత రెండు పాత్రలతో వేరే ట్విస్టులు ముగింపుని నిలబెడతాయి.

నటనలు- సాంకేతికాలు

    ఫస్టాఫ్ ప్రారంభంలో పాయల్ చిన్ననాటి కథ వుంటుంది. ఇంటర్వెల్లో హార్రర్ ఎంట్రీ ఇచ్చాక సెకండాఫ్ లో అరగంట ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కనిపిస్తుంది. కాకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే మూసి పెట్టిన ఆమె కథని, వివిధ పాత్రలు వాటి ఫ్లాష్ బ్యాకులు చెప్తూ ఆమెని తెరపైకి తీసుకొస్తూంటారు. దీంతో పాయల్ సెకండాఫ్ అంతా కన్పిస్తుంది. ఈ సెకండాఫ్ అంతా ఆమెది నాన్ స్టాప్ ఏడుపే. ప్రతీ సీనులో ఆమని కొట్టడం,వాడుకోవడం, వెళ్ళగొట్టడం తాలూకు ఏడ్పులే వుంటాయి. ఇలా పాత్ర మానసిక సంఘర్షణతో బలమైనదే. దీన్ని పకడ్బందీగా పోషించింది. ఆర్ ఎక్స్ 1000 కంటే ఈ పాత్ర బలమైనదే. ఇది నటించడానికి ధైర్యం కూడా కావాలి. కాకపోతే కథగా పాత్రకి న్యాయం జరగలేదు. ఆమె పాత్రని మిగతా పాత్రల కథలు కమ్మేయడంతో, ఆఖరికి పటానికి దండేసి వూరంతా కొలిచే పాత్ర వేరే అయింది.
        
ఇక బాగా ఆకట్టుకునే ఇంకో పాత్ర డాక్టర్. ఈ పాత్రలో రవీందర్ విజయ్ చివరి ట్విస్టుల్లో పాయల్ కంటే ఎక్కువ సానుభూతిని కొట్టేస్తాడు. రియల్ హీరో అనిపిస్తాడు. జమీందారుగా చైతన్య కృష్ణకి నటించే అవకాశమున్న పాత్ర దక్కింది. జమీందారు భార్యగా దివ్యా పిళ్ళై ముగింపులో విజృంభిస్తుంది. అన్ని పాత్రల మధ్య కరివేపాకు పాత్ర ఎస్సైగా వేసిన నందితా శ్వేతదే. ఈమె వూళ్ళో పోలీసు గస్తీ పెట్టిస్తే ఒక్క మర్డర్ జరగదు. ఆ పని చేయదు. పాత్రలిచ్చే ట్విస్టులు చూసి తెల్లబోవడం తప్ప.
       
అంధుడి పాత్ర వేసిన ఆర్టిస్టుతో అజయ్ ఘోష్ కామెడీ చేశాడు- డబుల్ మీనింగుల కామెడీ. ఫోటో గ్రాఫర్ గా శ్రవణ్ రెడ్డిది కీలక పాత్రే. ఇంగ్లీష్ లెక్చరర్ గా అజ్మల్ అమీర్ కి పాయల్ తో రోమాన్స్
, ఒక పాట, కొన్ని అడల్ట్ సీన్స్ కుదిరాయి.
       
అజనీష్ లోక్‌నాథ్
సంగీతంలో మూడు పాటలున్నాయి. జాతర పాట చిత్రీకరణ సహా హైలైట్. దాశరథి శివేంద్ కెమెరా వర్క్ చెప్పుకోదగ్గది సీజీ సహా. సాంకేతికంగా సినిమా బలంగా వుంది. దర్శకుడు అజయ్ భూపతి తిరిగి ఆర్ ఎక్స్ 100 రేంజికి చేరుకోకపోయినా యూత్ అప్పీల్ లేని అడల్ట్ మూవీతో ఫర్వాలేదనిపించే కొత్త ప్రయోగం మాత్రం చేశాడు.
—సికిందర్

12, నవంబర్ 2023, ఆదివారం

1378 : రివ్యూ

రచన- దర్శకత్వం మనీష్ శర్మ
తారాగణం : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హాష్మి, రేవతి, సిమ్రాన్, కుముద్ మిశ్రా, షారూఖ్ ఖాన్ (గెస్ట్) తదితరులు
సంగీతం (పాటలు) :  ప్రీతమ్, సంగీతం (నేపథ్యం) : తనుజ్ టికూ, ఛాయాగ్రహణం : అనయ్ గోస్వామి  
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్, నిర్మాత : ఆదిత్యా చోప్రా
విడుదల : నవంబర్ 12, 2023
***

        శ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాల్లో టైగర్3 ఐదవది. మొదటి నాలుగు ఏక్ థా టైగర్’, టైగర్ జిందా హై’, వార్’, పఠాన్ మొదలైనవి. ఇవికాక వార్2’, టైగర్ వర్సెస్ పఠాన్ మరో రెండు రాబోయే స్పై యూనివర్స్ సినిమాలు. మొదటి నాలుగు సినిమాల వసూళ్ళు 2,426 కోట్ల రూపాయలని చెబుతున్నారు. టైగర్ పేరుతో సినిమాల్లో సల్మాన్ ఖాన్ నటిస్తే, వార్ పేరుతో హృతిక్ రోషన్ ఒకటి నటించాడు. వార్ 2 లో హృతిక్- ఎన్టీఆర్ లు నటించబోతున్నారు. అలాగే టైగర్ వర్సెస్ పఠాన్ లో సల్మాన్- షారుఖ్ లు బద్ధ శత్రువులుగా నటించ బోతున్నారు. టైగర్ సిరీస్ లో సల్మాన్- కత్రినా కైఫ్ లు గూఢచారులుగా నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుత టైగర్ 3 లో కూడా ఇద్దరూ అవే పాత్రల్ని కంటిన్యూ చేశారు.

        యితే ఈసారి దర్శకుడు యాక్షన్ సినిమాలు తీసిన దర్శకుడు కాదు. ఇతను బ్యాండ్ బాజా బారాత్’, లేడీస్ వర్సెస్ విక్కీ బహల్’, శుధ్ దేశీ రోమాన్స్ వంటి చిన్న రోమాంటిక్ సినిమాలు తీసిన దర్శకుడు మనీష్ శర్మ. అయాన్ ముఖర్జీ కూడా ఇలాటి చిన్న సినిమాలు తీసిన దర్శకుడే. ఇతను బ్రహ్మస్త్ర వంటి బిగ్ యాక్షన్ మూవీ తీసి హిట్ చేశాడు. మరి టైగర్3 తో మనీష్ శర్మ ఈ రేంజిని అందుకోగలిగాడా?ఈ విషయం పరిశీలిద్దాం...

కథ

    అవినాష్ సింగ్ రాథోడ్ అలియాస్ టైగర్ (సల్మాన్ ఖాన్) రా ఏజెంట్.  జోయా (కత్రినా కైఫ్) పాకిస్తానీ ఐఎస్సై ఏజెంట్. ఇద్దరూ గత టైగర్ జిందా హై లో భార్యాభర్తలయ్యారు. ఇప్పుడు ఎదిగిన కొడుకు వున్నాడు. మైథిలీ మీనన్ (రేవతి) రా చీఫ్. ఈమె రష్యాలోని పీటర్స్ బర్గ్ లో టైగర్ కి ఒక ఎసైన్మెంట్ అప్పజెప్తుంది. ఆ ఎసైన్మెంట్ మీద వెళ్ళిన టైగర్ కి అదే ఎసైన్మెంట్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న జోయా దొరికి పోతుంది. ఏమంటే, మాజీ ఐఎస్సై ఏజెంట్ ఆతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హాష్మి) తమ కొడుకుని బంధించి బ్లాక్ మెయిల్ చేశాడని చెప్తుంది. ఇప్పుడు ఆతీష్  అదే కొడుకుని అడ్డం పెట్టుకుని జోయా, టైగర్ లు ఇంకో ఆపరేషన్ చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు.
       
దీంతో ఇస్తాన్బుల్ లో భద్రపర్చిన పాకిస్తాన్ కి చెందిన సీక్రెట్ న్యూక్లియర్ కోడ్స్ దొంగిలించడానికి వెళ్తారు టైగర్-జోయా. ఆ కోడ్స్ తో ఇండియా మీద పగదీర్చుకోవాలను కుంటున్నాడు ఆతీష్. 1999 కార్గిల్ యుద్ధంలో శాంతి ప్రక్రియకి ఆతీష్ అడ్డుపడడంతో సైన్యం అతడ్ని తొలగించింది. ఇండియాతో శాంతిని వ్యతిరేకించే ఆతీష్ పగబట్టి వున్నాడు. ఇప్పుడా సీక్రెట్ కోడ్స్ తో ఇండియా మీద దాడి చేయాలనుకుంటున్నాడు. టైగర్
- జోయా
లు ఆ సీక్రేట్ కోడ్స్ అతడికి అప్పగించి కొడుకుని కాపాడుకున్నతర్వాత, ఈ దొంగతనం టైగర్ మీద వేసి పాక్ ఆర్మీకి పట్టిస్తాడు ఆతీష్. ఇక పాకిస్తాన్ లో బందీ అయిన టైగర్ కి ఉరిశిక్ష నిర్ణయిస్తుంది సైన్యం.
       
ఇప్పుడేం చేశాడు టైగర్
? ఉరిశిక్షని ఎలా తప్పించుకున్నాడు? సైనిక నియంతృత్వాన్ని వ్యతిరేకించే పాక్ ప్రధాని నస్రీన్ ఇరానీ (సిమ్రాన్) పాక్ జనరల్ తో ఎలాటి ప్రమాదంలో పడింది? ఇందులో టైగర్ తీసుకున్న చర్యలేమిటి? పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆతీష్ తలపెట్టిన కుట్ర ఏమైంది? జోయాతో బాటు మరి కొందరు రా ఏజెంట్లు పాక్ లో చొరబడి చేసిన ఆపరేషన్ ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ
?

    ఖలేజా లో మహేష్ బాబు ఎక్కడో రాజస్థాన్ వెళ్ళి అక్కడి జనం సమస్యల గురించి పొరాడి ఫ్లాప్ చేసుకున్న కథలా వుంది. ఎక్కడో రాజస్థాన్ ప్రజల కష్ట సుఖాలు తెలుగు ప్రేక్షకుల కేమవసరం? అలాగే ఎక్కడో పాకిస్థాన్ ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసే కథ ఇండియన్ ఆడియెన్స్ కేమవసరం? ఇది పాకిస్థాన్ కోసం పాకిస్థానీ పాత్రలతో పాకిస్థాన్లో తీసిన పాకిస్థానీ సినిమాలా వుంది చివరి వరకూ. నేటివిటీ ప్రాబ్లం. ఇదే దెబ్బకొట్టింది. పాక్ లో సైనిక నియంతృత్వాన్ని రూపుమాపి, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఐడియాతో సినిమా తీయాలనే ఆలోచనే అతి తెలివితో కూడుకున్నదిలా కనిపిస్తోంది.
       
కనుక ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథ
, భావోద్వేగాలు, ఏదైనా కాస్త దేశభక్తీ కరువయ్యాయి. ఇండియన్ ప్రధానిని కాపాడే కథకుండేంత పౌరుషం పాక్ ప్రధానిని కాపాడే కథతో లేకుండా పోయాయి. ఫస్టాఫ్ వివిధ టైగర్ ఆపరేషన్స్ తో ఆఫ్ఘనిస్తాన్, పీటర్స్ బర్గ్, ఇస్తాన్బుల్, ఆస్ట్రియాల్లో యాక్షన్ సీన్స్ తో కథ సాగుతున్నంత సేపూ బాగానే వుంటుంది.       

ఇంటర్వెల్లో టైగర్ పాక్ ఆర్మీకి చిక్కాక ఇక సెకండాఫ్ అంతా పాకిస్థాన్ గురించి పాకిస్థాన్లోనే జరుగుతుంది. ఇండియాకి ప్రమాదకరంగా వున్న సీక్రెట్ కోడ్స్ ని చేజిక్కిం
చుకోవడం గురించి మొత్తం సినిమా అంతా పాక్ లోనే నడిపినా ఇబ్బంది వుండేది కాదు. హేపీ భాగ్ జాయేగీ లో హీరోయిన్ ప్రేమించిన వాడికోసం పాకిస్థాన్ పారిపోతే, ఆమెని పట్టుకోవడం కోసం పాకిస్థాన్లో నడిపిన కామెడీ ఇందుకే హిట్టయ్యింది. పాకిస్థాన్లో నడిపినా కథ ఇండియా గురించై వుండాలి.
       
కానీ ఇండియాకి పొంచి వున్న ముప్పుని నివారించకుండా
, అక్కడి సైన్యం నుంచి పాక్ ని కాపాడే కథ చేయడంతో రిజల్టు రివర్స్ అయింది. అసలు సెకండాఫ్ లో సీక్రెట్ కోడ్స్ ప్రస్తావనే వుండదు. టైగర్ ని ఎందుకైతే పాక్ ఆర్మీ పట్టుకున్నారో, ఆ సీక్రెట్ కోడ్స్ కోసం టార్చర్ చెయ్యనే చెయ్యరు. ఉరిశిక్ష వేసి పారేస్తారంతే!

నటనలు- సాంకేతికాలు

    టైగర్ స్పైగా ఈసారి సల్మాన్ వయసు తాలూకు అలసటతో కనిపిస్తాడు. ఎమోషన్స్ ఒలికించి అలసటని దాయడానికి పాత్రకి ఎక్కడా ఎమోషన్స్ పుట్టే కథే లేదు. అందుకని ఎంత భారీ యెత్తున హైరేంజి యాక్షన్ సీన్స్, ఛేజింగులు చేసినా ఫ్లాట్ గా వుంటాయి. అతను ఇండియా గురించి పోరాడితే ఫీలింగు వుంటుంది. కనీసం కొడుకుని అడ్డం పెట్టుకుని అతీష్ బ్లాక్ మెయిల్ చేసినప్పుడు - దేశమా, కొడుకా అన్న డైలెమాలో పడాలి. తను దేశమే అంటే, భార్య కొడుకు కోసం ఆతీష్ డిమాండ్ ని తీర్చాలన్నప్పుడు సంఘర్షణ పుట్టి - తగు భావోద్వేగాలతో డ్రామా ఏర్పడేది. ఇలాటి ఘట్టాలే కరువయ్యాయి.
       
యాక్షన్ హీరోయిన్ గా కత్రినాకైఫ్ చేసే ఫైట్స్
, ముఖ్యంగా టవల్ ఫైట్ హైలైట్ గా నిలుస్తాయి. ఇక విలన్ గా ఒకప్పటి హీరో ఇమ్రాన్ హాష్మీ ఒక్కడికే లక్ష్యంతో కూడిన తగిన ఎమోషన్స్ వున్నాయి. తనకు సాధ్యమయ్యెంత విలనీ పోషించాడు. షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో సల్మాన్ ని కాపాడే సుదీర్ఘమైన 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ సెకెండాఫ్ కి హైలైట్. చాలా గగుర్పాటు కల్గించేదిగా వుంటుంది. అయితే ఇక్కడ పఠాన్ లో యాక్షన్ సీన్లో ఇద్దరూ చేసినంత ఫన్ లేదు. ఇక రాచీఫ్ గా రేవతి, పాక్ ప్రధానిగా సిమ్రాన్ పాత్రల్లో సరిపోయారు.
       
ప్రీతమ్ సంగీతంలో రెండే పాటలున్నాయి. రెండూ బావున్నాయి. ఏదో చేసి ప్రీతమ్ పాటల్ని సక్సెస్ చేస్తాడు. తనుజ్ టికూ నేపథ్య సంగీతం చెప్పుకోదగ్గది. భార్యా భర్తలుగా సల్మాన్ - కత్రినాలు పరస్పర విరోధాలతో చేసుకునే ఫైటింగ్ కి నేపథ్య సంగీతంలో శోకరసం ప్రవహించడం యాక్షన్ సీనుకి బలం చేకూర్చేదిగా వుంటుంది. అలాగే మిగిలిన యాక్షన్ సీన్స్ కి నేపథ్య సంగీతం వాటి పరిస్థితులకి అద్దం పడుతుంది. ఇక అనయ్  గోస్వామి ఛాయాగ్రహణం హై క్వాలిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. యాక్షన్ కొరియోగ్రఫీ
, ఔట్ డోర్ లొకేషన్స్ ప్రత్యేకంగా వున్నాయి.
       
కానీ చిన్న సినిమాల దర్శకుడు మనీష్ శర్మ ఈ భారీ స్పై యాక్షన్ ని భుజానెత్తుకుని అన్యాయమే చేశాడు. చిత్రీ కరణతో కాదు
, రచనతో. కనీసం కాస్త కామెడీ, ఫన్, ఎంటర్టయిన్మెంట్ లాంటి ఎలిమెంట్సే లేకుండా, రిలీఫ్ లేకుండా, సాంతం యమ సీరియస్ కథ చేశాడు. ఆ కథకి నేటివిటీ లోపమే కాకుండా, కథనంలో థ్రిల్, సస్పెన్స్, మలుపులు వంటి సినిమా కోరుకునే కనీసావసరాలు కూడా తీర్చలేక పోయాడు. సినిమాలో దీపావళి ప్రస్తావన వుంటుంది రెండు మూడు సార్లు విలన్స్ తో. పాకిస్థాన్ కోసం పాకిస్థాన్లో జరిగే ఈ కథ, పాకిస్థానీ పాత్రలకి దీపావళి టపాసులేమో గానీ, స్థానిక భారతీయ బాధిత ప్రేక్షక జీవులకి మాత్రం దీపావళి రోజు దీంతో అంత సీను లేదు.
—సికిందర్