రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మండేలా ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మండేలా ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

5, ఫిబ్రవరి 2022, శనివారం

1126 : రివ్యూ


 

రచన - దర్శకత్వం: సుధీర్ రాజు
తారాగణం : శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, చంద్రమోహన్, సుధ, హేమ, మురళీ శర్మ, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్,  సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు
మాటలు: విక్రమ్ రాజ్
, స్వామి మండేలా, సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం : బుజ్జి
నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్
***

            1991 నుంచీ 120 కి పైగా సినిమాలు నటించి ఫ్యామిలీ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ 2022 లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ ప్రయోగం చేశారు. పాత ఫ్యామిలీ సినిమాల హీరో అయిన తను, ఈ మధ్య విలన్ పాత్రలేస్తూ అఖండలో కూడా కన్పించారు. ఇప్పుడు పాత ఫ్యామిలీ సినిమా హీరోగా పాత టైటిల్ కోతల రాయుడు తో, పాత ఫ్యామిలీ సినిమా నటిస్తూ, కొత్త ప్రేక్షకుల మీద పాత ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం చేసిన కొత్త దర్శకుడు, నిర్మాతలు బహుశా పాత కాలం లోంచి వచ్చారు. అందరూ పాత కాలం లొంచే వస్తారు, కానీ పాతగానే వుండిపోరు. శ్రీకాంత్ సహా దర్శకుడు నిర్మాతలూ పాతగానే వుంటూ పాతదనంతో మక్కువ తీర్చుకున్నారు. ఈ మక్కువ ఎలా వుందో చూద్దాం...

కథ
    ఓ ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా పని చేసే అజయ్ (శ్రీకాంత్) విలాసవంతమైన జీవితం గడుపుతూంటాడు. కోతలు కొస్తూ డబ్బు సంపాదిస్తూ, విచ్చల విడిగా ఖర్చు పెట్టేస్తూంటాడు. ఇలాటి వాడు బాగా డబ్బున్న ధనలక్ష్మి(నటాషా దోషి) ని ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఇంతలో నిశ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది. ఇక సంధ్య (డింపుల్) అనే ఇంకో అమ్మాయిని ని ప్రేమిస్తాడు. కానీ అసలు ధనలక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? మరి సంధ్యని పెళ్ళి చేసుకున్నాడా? ఈ క్రమంలో ఎదురైన అనుభవాలేమిటి? సమస్యలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది కథయితేగా ఎలావుందో చెప్పుకోవడానికి. కోతల రాయుడు పని కోతల రాయుడు పాత్ర చేయకుండా, కథకుడే కోతల రాయుడైతే ఎలా వుంటుందనడానికి శాంపిల్ ఈ సినిమా కథ. కథకుడు కథ వదిలేసి చాలా కోతలు కోశాడు. కథతో సంబంధంలేని కామెడీలు చేశాడు. డ్రామాలు చేశాడు. అసలు ధన లక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయిందో, ఈ సమస్యేంటో, పరిష్కారమేంటో చెప్పకుండా, ఏవేవో కోతలు సొరకాయల్లా తెగ కోస్తూ ఇదే కథ అనుకున్నాడు. పాతకాలంలో ఇలా వున్నాయా కథలు? పాత కాలపు కథకుడికి మతి మరుపు కూడా వున్నట్టుంది. కథలెలా వుంటాయో మర్చిపోయి, తలా తోకాలేని కథ పట్టుకుని, కోతల రాయుడులా తెలివైన కొత్త ప్రేక్షకుల మధ్యకి వచ్చాడు.

నటనలు- సాంకేతికాలు

    ఫ్యామిలీ సినిమాల హీరోగా శ్రీకాంత్ మరోసారి వెండి తెరమీద ఈ సినిమాతో ప్రకాశించాడు. ఈ ప్రకాశం వేషం, స్టయిలింగ్, నటనల వరకే. పాత్ర గురించీ, పాత్రకున్న కథ గురించీ చెప్పుకోకూడదు. ఇలా పాత శ్రీకాంత్ ని గుర్తుకు తెచ్చినప్పుడు, గుర్తుండే విషయంతో కూడా రావాలని ఎందుకు గుర్తుపెట్టుకో లేదో మరి. ఎలాపడితే అలా సినిమాలు ఒప్పుకుని నిర్మాతలు నష్టపోవడానికి కారకుడు కాకూడదని జాగ్రత్తలు తీసుకునే తను,  ఈసారి ఎలా మోసపోయాడో తెలీదు. ఇలా హీరోగా ప్రయోగాలు చేసేకన్నా విలన్ గా స్థిరపడితే మేలు.

        హీరోయిన్లు నటాషా, డింపుల్ లు గ్లామర్ ని బాగానే ఆరబోశారు. ముక్కలు ముక్కలుగా వున్న కథని  గ్లామర్ తో కవర్ చేయడానికి శ్రమిస్తున్నట్టు కసరత్తులన్నీ చేశారు. ఎన్ని కసరత్తులు చేసినా ఫలితం లేకుండాపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హేమ కలిసి ఒక కామెడీ ఎపిసోడ్ వేసుకున్నారు. కథతో సంబంధం లేకుండా జబర్దస్తీగా ఒక కామెడీ షో. పోసాని, మురళి శర్మలు కథ లేని సినిమాకి విషయంలేని పాత్రలు. ఇంకా చాలా మంది నటీనటులూ వాళ్ళ పాత్రలూ వున్నాయి నిండైన కుటుంబ సినిమా అన్పించుకోవడానికి.

        కొత్త దర్శకుడు సుధీర్ రాజుకి కథాకథనాలూ దర్శకత్వమూ ఏదీ సాధ్యం కాలేదు. సినిమా పేరుతో ప్రేక్షకుల నెత్తిన ఓ తమాషాని రుద్ది చేతులు దులుపుకున్నాడు. పూర్తిగా లేని కథ, కథతో సంబంధంలేని, లాజిక్ లేని సీన్లు, పాత్రలు, కామెడీలూ ... ఇలా ప్రతి నిమిషమూ ప్రేక్షకుల్ని ముళ్ళ మీద కూర్చోబెట్టి ఆనందం తీర్చుకున్నాడు. దీని పాటల చిత్రీకరణ కోసం సిక్కిం కూడా వెళ్ళాడు. సునీల్ కశ్యప్ తో పాటలు మాత్రం సరిగ్గానే చేయించుకున్నాడు. కెమెరామాన్ బుజ్జి నుంచి కూడా టాలెంట్ ని పిండుకున్నాడు. పిండడానికి తనదగ్గరే ఏమీ లేకుండా పోయింది.

—సికిందర్

 

2, సెప్టెంబర్ 2021, గురువారం

1055 : టిప్స్

       సినిమాల్లో హీరోలతో చూపించే ప్లాట్ పాయింట్ వన్ మలుపు అనే రొటీన్ ని బ్రేక్ చేసి, కొత్త పంథా పట్టిన ఉదాహరణలు రెండు చూశాం ఇటీవల :  రెండు తమిళంలో వచ్చిన సార్పట్టా’, మండేలా ల్లో. వీటి రివ్యూలలో  రొటీన్ ప్లాట్ పాయింట్ వన్ (కథా ప్రారంభం) మలుపు నుంచి హీరోలని తప్పించిన  క్రమాన్ని పాఠకుల దృష్టికి తెచ్చాక, ఒకరిద్దరు ఇన్స్పైరై  తెలుగు సినిమాల ఆధారంగా దీన్ని వివరించమని కోరాక, మొత్తం ఆసక్తి పరులందరికీ ఉపయోగపడ వచ్చన్న ఆలోచనతో ఇలా బ్లాగు ముఖంగా చెప్పుకోవాల్సి వస్తే - శివ నే తీసుకుందాం. శివ లో జేడీ, అమలని టీజ్ చేస్తే, నాగార్జున సైకిలు చైనుతో కొట్టడం ప్లాట్ పాయింట్ వన్ ఘట్టమని తెలిసిన విషయమే. ఇక్కడ నాగార్జునని ఈ ఘట్టం నుంచి తప్పిస్తే, ప్లాట్ పాయింట్ వన్ అమల - జేడీల మథ్యే వుంటుంది. అప్పుడు అమలని జేడీ టీజ్ చేస్తూంటే నాగార్జున అలా చూస్తూ వుంటాడు. అమలే జేడీని ఎదుర్కోబోయి, వల్లకాక ఏడ్చిందనుకుందాం. ఇది ఆమెని జేడీతో సమస్యలో పడేసే ప్లాట్ పాయింట్ వన్ మలుపు. ఇక ఈ సమస్యతో సంఘర్షణ, గోల్ ఆమెవే అవుతాయి. వుమన్ ఎంపవర్మెంట్ పేరుతో నాగార్జున మోటివేట్ చేస్తాడు. ఆమెకి ఎదురయ్యే ఒకానొక విషమ ఘట్టంలో తను జోక్యం చేసుకుని కథని అందుకుంటాడు. ఈ కోవలో ఆలోచిస్తే రొటీన్ ని బ్రేక్ చేసే వేరియెంట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.


      2. కమర్షియల్ సినిమాల్లో స్క్రీన్ ప్లే పరంగా ఏముండాలీ అంటే చాలా వుండాలి. ఆ వుండే వేమిటో వాటి అర్ధం తెలియాలి. ఎలా ఎక్కడ వాడాలో టెక్నిక్ తెలియాలి. ఇలాటివి ఓ పదహారు వుండొచ్చు : ప్రామాణికమైన కాన్సెప్ట్ చుట్టూ కథ, సంక్షుభిత డ్రామా, స్ట్రక్చర్, మాటలతో గాకుండా చేతలతో కథ చెప్పడం, పాత్రలకి పణం, రిస్కు ఎలిమెంట్స్, పరిపూర్ణ పాత్రలు, యాక్షన్ లో వుండే పాత్రలు, ఫోర్ షాడోలు, పేఆఫ్ లు, సస్పెన్సులు, సర్ప్రైజులు, రివర్సల్స్, ట్విస్టులు, హాఫ్ వేలో సీన్లు, సీను సీనుకీ డైనమిక్స్ మొదలైనవి... రెండు నిమిషాలు చొప్పున ఓ అరవై గొప్ప సీన్లుంటే విజయవంతమైన సినిమా అన్నాడు జార్జి లూకాస్.   


        3. ఒక సాఫ్ట్ వేర్ నుంచి సినిమాల్లోకి వచ్చి, కొంత స్క్రీన్ ప్లే అదీ తెలుసుకున్న అభ్యర్ధి నవలల్ని సజెస్ట్ చేయమని అడిగాడు. నవలలతో సినిమా కథ స్ట్రక్చర్ ఎలా తెలుస్తుందబ్బా అనుకుంటూ వుంటే ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాల్లో పాత్రచిత్రణ లోపాలు ఆనవాయితీగా మారిపోవడం గుర్తొచ్చింది. పాత్రచిత్రణలు, మనస్తత్వాలు. మానసిక సంఘర్షణలు స్పష్టంగా అర్ధమవాలంటే నవలలు చదవడమే బెస్ట్. మహోజ్వల నవలలని వుంటాయి. అలాటి తెలుగు, ఇంగ్లీషు క్లాసిక్స్ చదవాలి. గోపీచంద్ నుంచీ జేన్ ఆస్టిన్ వరకూ. కొత్త వాళ్ళకి సినిమాలు చూస్తూంటే పాత్రచిత్రణలు, మనస్తత్వాలు, మానసిక సంఘర్షణల తెరవెనుక నిర్మాణం అర్ధం గాదు. నవలలు చదివితే ఇవి అక్షరరూపంలో కళ్ళముందుంటాయి. బాగా అర్ధమవుతాయి. ఇందుకోసమైతే నవలలు చదవొచ్చు.  

సికిందర్ 

 

14, ఆగస్టు 2021, శనివారం

1052 : రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు


 సార్పట్ట (తమిళం)

రచన - దర్శకత్వం: పా. రంజిత్‌
తారాగణం : ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమా కుమార్‌, సంచనా నటరాజన్‌, జాన్‌ కొక్కెన్‌, జాన్ విజయ్, కలైరాసన్‌, సంతోష్ ప్రతాప్‌, షబీర్ కలరక్కల్ తదితరులు
 సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, ఛాయాగ్రహణం : మురళి.జి, కూర్పు: సెల్వ ఆర్‌.కె.
కళ:  టి.రామలింగం, పోరాటాలు : అన్బరీవ్‌ 
నిర్మాత: షణ్ముగమ్‌ దక్షణ్‌రాజ్‌; 
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌
***

        స్పోర్ట్స్ సినిమాలు కాల్పనికంగా అనేకం వస్తూంటాయి. బయోపిక్స్ గా, చారిత్రకంగా, వచ్చినప్పుడు ఒక ఆసక్తిని రేకెత్తిస్తూంటాయి. రెండు చారిత్రక నేపథ్యపు పరంపరల బాహాబాహీ బాక్సింగ్ క్రీడగా - కాల్పనిక చరిత్రగా వచ్చినప్పుడు కాస్త ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. ఒకప్పుడు మద్రాసు బ్రిటిషిండియాలో  భాగం కాబట్టి పాశ్చాత్య ధోరణుల్ని ఆహ్వానించడానికి మద్రాసీలకి అభ్యంతరముండేది కాదని చెప్తున్నారు. బాక్సింగ్ ని అలా సొంత క్రీడగా మార్చుకున్న చరిత్ర మద్రాసుది. మద్రాసు చెన్నై అయింది.  అయితే  అప్పుడప్పుడు పీరియెడ్ సినిమాల పేరుతో మద్రాసు కథల్ని తవ్వి తీస్తూ చెన్నైకి అందిస్తూనే వున్నారు తమిళ దర్శకులు. దర్శకుడు పా రంజిత్ కూడా హీరో ఆర్యతో ఈ పనే చేశాడు. బాక్సింగ్ కి పేరెన్నిక గన్న ఉత్తర మద్రాసు బాక్సింగ్ పరంపరల నేపథ్యంతో ఆధిపత్య పోరుగా సార్పట్టా  పరంబరై తీశాడు. సార్పట్టా పరంపర దీని తెలుగు వెర్షన్. ఏమిటీ సార్పట్టా పరంపర, ఈ పరంపర చరిత్ర కెంత వరకు న్యాయం చేశాడు, స్పోర్ట్స్ సినిమాల్లో ఇదెలా ప్రత్యేకమయిందీ మొదలైనవి పరిశీలిద్దాం...

కథ


        1970 లలో సమర (ఆర్య) ఉత్తర మద్రాసులోని హార్బర్ లో కూలీగా పనిచేస్తూంటాడు. చిన్నప్పట్నుంచీ మనసంతా బాక్సింగ్ మీదే వుంటుంది. బాక్సరైన తండ్రి లాగా ఎదగాలని బలమైన కోరిక అతడిది. కానీ బాక్సరైన తండ్రి నేరాలవైపు మొగ్గి జీవితం పాడు చేసుకోవడంతో, సమర తల్లి భాగ్యం (అనుపమా కుమార్) బాక్సింగ్ అంటే ద్వేషం పెంచుకుని వుంటుంది. సమర బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్ళినా పట్టుకుని విపరీతంగా కొడుతుంది. ఐనా సమర పోటీలు చూడ్డానికి వెళ్ళడం మాత్రం మానడు. ఇంకోవైపు కుటుంబ మిత్రుడు కెవిన్ అలియాస్ డాడీ (జాన్ విజయ్) బాక్సింగ్ లోకి దిగమని సమరని ఒకటే రెచ్చగొడుతూంటాడు.

        ఆ ఏరియాలో ప్రధానంగా సార్పట్టా పరంపరకి చెందిన కోచ్ రంగయ్య (పశుపతి), ఎదుటి ఇడియప్ప పరంపర మీద విజయం కోసం విఫల యత్నాలు చేస్తూంటాడు. ఇతను డీఎంకే పార్టీ అభిమాని. ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని ఆరాధిస్తాడు. అయితే ఇడియప్ప పరంపరకి చెందిన బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) ని ఓడించడం రంగయ్య బాక్సర్ల వల్ల గావడం లేదు. ఇడియప్ప పరంపర రంగయ్యకి ఇంకొక్క అవకాశం ఇస్తుంది. ఇంకోసారి ఓడిపోతే శాశ్వతంగా సార్పట్టా పరంపర రంగంలోంచి తప్పుకోవాలని షరతు విధిస్తుంది.

        ఇంతలో 1975 లో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది. అంటే బాక్సింగ్ కి అవకాశముండదు. అయితే కరుణానిధి ఎమర్జెన్సీని వ్యతిరేకించడంతో ఉత్తర మద్రాసు బాక్సింగ్ కి ఢోకా వుండదు. దీంతో కోచ్ రంగయ్య ఇడియప్ప పరంపరతో చావో రేవో తేల్చుకోవడానికి రంగంలోకి దిగుతాడు.

        ఇప్పుడు బాక్సింగ్ కి దూరంగా వుంటున్న సమర, ఇడియప్ప బాక్సరైన  వేట పులిని ఓడించడానికి రంగంలో కెలా దిగాడు, దాంతో ఎదుర్కొన్న పరిణామాలేమిటి, ఆ అడ్డంకుల్ని అధిగమించి వేట పులినెలా మట్టి కరిపిస్తూ, సార్పట్టాకి విజయం కట్ట బెట్టాడన్నది మిగతా కథ.  

 ఎలావుంది కథ

    ముందుగా ఇది కథ కాదని, గాథ అనీ గుర్తించాల్సి వుంటుంది. గాథ ఎలా అయిందో తర్వాత చూద్దాం. సార్పట్టా అంటే నాల్గు పట్టా కత్తులని అర్ధం. ఉర్దూలో చార్ పట్టా తమిళంలో సార్పట్టా,అయిందని సమాచారమిచ్చారు. ఈ పేరు బాబూ భాయ్ పరంపర నుంచి వచ్చింది. సినిమాలో చూపించినట్టు సార్పట్టా పరంపర, ఇడియప్ప పరంపర అంటూ ఉత్తర మద్రాసులో రెండే బాక్సింగ్ పరంపరలు కాకుండా ఇంకా చాలా వుండేవి. ఇవి వంశాలకి చెందిన పరంపరలు కావు, గురుశిష్యులకి చెందిన పరంపరలు. ఇడియప్ప పరంపర అంటే పిడుగులా మెరుపు దాడి చేసే వాళ్ళని అర్ధం.

        1930 లలో సార్పట్టా పరంపరని ప్రారంభించింది కితేరి ముత్తు అనే అతను. అయితే తన తాత గారైన ఈయన పేరు సినిమాలో ఎక్కడా చెప్పలేదనీ, ఉత్తర మద్రాసు బాక్సింగ్ చరిత్రని వక్రీకరించారనీ పెద్ద మనవడు జాన్సన్ ముత్తు ఆరోపణ. పైగా 1942 లో బ్రిటిష్ బాక్సర్ టెరి ని తన తాత ఓడిస్తే, సినిమాలో రంగన్ వడియార్ ఓడించినట్టు హీరో ఆర్య పాత్రతో అన్పించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు. టెరిని ఓడించిన తన తాత గార్ని ద్రవిడ వీరన్ బిరుదుతో ఘనంగా సన్మానించారనీ గుర్తు చేశాడు జాన్సన్. ఇతడి తమ్ముడు స్టీవెన్ ముత్తు చెన్నైలో బాక్సింగ్ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఆనాడు ఈ పరంపరలు బాక్సింగ్ క్లబ్బులేనని స్టీవెన్ వివరణ.

        అలాగే ఎమ్జీఆర్ గురించి కూడా తప్పుడు సమాచారమిచ్చారన్నాడు జాన్సన్. సినిమాలో ఎమ్జీఆర్ బాక్సింగ్ ని ప్రోత్సహించ లేదనట్టుగా చూపించారనీ, కానీ ఎమ్జీఆర్ బాక్సింగ్ ని ప్రోత్సహించడమే గాక, మహ్మదాలీ వంటి అంతర్జాతీయ బాక్సర్స్ ని మద్రాసుకి రప్పించి స్థానిక బాక్సర్స్ తో ఈవెంట్స్ జరిపించారనీ జాన్సన్ వివరించాడు. ఎమ్జీఆర్ సార్పట్టా పరంపర ఫ్యాన్ కూడాననీ, తను నటించిన కావల్ కారన్ లో తను సార్పట్టా పరంపరకి చెందిన వాణ్ణని డైలాగు కూడా చెప్పారని జాన్సన్ చెప్పాడు. సార్పట్టా పరంపర కులాలకి, మతాలకి, రాజకీయాలకీ అతీతమని కూడా చెప్పాడు.

     ఉత్తర మద్రాసులో ఆనాటి ఈ పరంపరలు శ్రామిక వర్గాల క్రీడాభినివేశానికి ప్రతీకలు. కానీ సార్పట్టా కి కులమతాలు, రాజకీయాలూ లేవని జాన్సన్ చరిత్ర విప్పితే, సినిమాలో చరిత్రని కప్పి రాజకీయాల్ని ఆపాదించారు. అధికారంలో వున్న ముఖ్యమంత్రి కరుణానిధి కి సార్పట్టా మద్దతుగా వుండేదన్నట్టు చూపించారు. ఇలా చూపించడానికి కారణం 1975-77 ల మధ్య ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఈ సినిమా గాథా కాలంగా తీసుకోవడమే. ఇందువల్ల ఈ గాథకి ఎమర్జెన్సీ నేపథ్యం అతకకుండా పోయింది.

        1975 లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో 1976 జనవరిలో కరుణానిధి ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. డీఎంకే పార్టీ నాయకుల్ని జైళ్ళల్లో కుక్కింది. నేటి ముఖ్య మంత్రి ఎంకె స్టాలిన్, మురసోలి మారన్ వంటి నాయకులెందరో జైళ్ళల్లో చిత్రహింసలకి గురయ్యారు. అప్పుడు డీఎంకే లో వున్న ఎమ్జీఆర్ పార్టీని చీల్చి ఏఐఏడీఎంకే పార్టీ స్థాపించి, 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని సమర్ధిస్తూ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

        ఎమర్జెన్సీ కాలంలో ఈ రాజకీయ పరిణామాల్ని సినిమాకి వాడుకుంటూ, రాజకీయాలతో సంబంధం లేని సార్పట్టా పరంపరకి రాజకీయ రంగులు పులిమినట్టు అర్ధమవుతోంది. ఇంతకీ ఎమర్జెన్సీ నేపథ్యం సినిమాకి ఉపయోగపడింది కూడా పెద్దగా ఏం లేదు- కేవలం కరుణానిధి ప్రభుత్వం పడిపోయాక జరిగిన అరెస్టులు, అందులో కోచ్ రంగయ్య జైలు కెళ్ళడం వంటి గాథని ప్రభావితం చెయ్యని రెండు సన్నివేశాలు చూపించడం మినహా.

        ఇదీ సార్పట్టా పరంపర చరిత్రకి, దీనికి ఎమర్జెన్సీ నేపథ్యానికీ న్యాయం చేకూర్చిన విధం. ఇవి శ్రామిక వర్గాల పరంపరలు. పరస్పరం శ్రామిక వర్గాలు తలపడే ఈ బాక్సింగ్ పోటీలు వాళ్ళ మధ్య ఒక సెలబ్రేషనే తప్ప, పై వర్గాల అణిచివేతల తాలూకు సంఘర్షణలు ఇక్కడ చిత్రించేందుకు అవకాశంలేదు, చిత్రించ లేదు కూడా.

నటనలు- సాంకేతికాలు

     ఆర్య పోషించిన సమర పాత్ర స్పోర్ట్స్ సినిమా టెంప్లెట్ పాత్రే. స్పోర్ట్స్ సినిమాలు ఒక టెంప్లెట్ లోనే వుంటాయి. క్రీడలో రాణించాలని తపన, శిక్షణ, క్రీడలో ఓటమి, తిరిగి సంఘర్షణ, ఆత్మవిశ్వాసం,  చివరికి విజయం- ఇదే వరసలో వుంటాయి కాబట్టి ఆర్య పాత్ర కూడా ఇలాటి రొటీనే. కాకపోతే ఇది పాసివ్ పాత్ర. పాత్ర ప్రకారం కథ అనుకోవాల్సింది అనుకోకుండా, కథ ప్రకారం పాత్ర అనుకున్నారు కాబట్టి, కథానాయకత్వం లోపించి కథ గాకుండా ఈ సినిమా గాథ అయింది.

        పీరియెడ్ లుక్ తో ఆర్య పోషించిన సమర అనే పాత్ర మేకోవర్ కోసం, కండ పుష్టి కోసం తీసుకున్న కఠిన ట్రైనింగ్ కి నిలువెత్తు సాక్షిగా వుంటాడు. ఈ కఠిన ట్రైనింగ్ తో బాక్సింగ్ దృశ్యాల్ని రసవత్తరం చేశాడు. సమర బాక్సింగ్ పాత్రకి ఆనాటి వరల్డ్ ఛాంపియన్ మహ్మదాలీని మోడల్ గా తీసుకున్నట్టు దర్శకుడు వెల్లడించాడు. అయితే స్పీడ్ పంచ్ కి ప్రసిద్ధుడైన మహ్మదాలీ అతి సునాయాసంగా, పెద్దగా కష్టపడకుండానే, ప్రత్యర్ధిని ఔట్ చేసేసే నైపుణ్యంతో వుంటాడు. సాత్వికంగా అన్పించే ఈ సింపుల్ ట్రిక్ మాస్ సినిమాకి వర్కౌట్ కాదని ఆర్యతో హోరాహోరీ, రక్తసిక్త బాక్సింగ్ కి తెరతీశారు. ఆర్య మీద మొత్తం మూడు ఈవెంట్లు చిత్రీకరించారు.

        పై ఔటర్ స్ట్రగుల్ కి ఇన్నర్ స్ట్రగుల్నీ జత చేశారు : బాక్సింగ్ ని ద్వేషించే తల్లితో సంఘర్షణ, తాగుడు మరిగాక భార్యతో సంఘర్షణ. ఇలా ఇన్నర్, ఔటర్ స్ట్రగుల్స్ తో పరిపూర్ణ పాత్ర అన్పించే ప్రయత్నం చేశారు. ఈ స్ట్రగుల్స్ ని ఆర్య శక్తి వంచన లేకుండా పోషించాడు. అయితే ఇంత మాస్ కమర్షియల్ లో ఆర్య పాత్రకి ఎంటర్ టైనింగ్ పార్శ్వాన్ని కల్పించలేదు. ఏ పాత్రకీ కల్పించ లేదు కాబట్టి, సినిమాలో కామెడీ, వినోదం లాంటివి కన్పించవు.

        తల్లి పాత్రలో అనుపమా కుమార్, భార్య పాత్రలో దుషారా విజయన్ లకి సంఘర్షించడానికి రొటీన్ పాయింట్లే కావడంతో ఫార్ములా పాత్రలుగానే వుంటాయి. ఆర్య ప్రత్యర్ధి పాత్రలో వేట పులిగా జాన్ కొక్కెన్ కవ్వింపు ఎక్స్ ప్రెషన్స్ బావున్నాయి. ఈ బాక్సింగ్ పాత్రకి మైక్ టైసన్ ని మోడల్ గా తీసుకున్నట్టు చెప్పుకున్నారు. దీనికి కూడా వయొలెన్స్ ని జోడించి సినిమాటిక్ గా మార్చేశారు. ఇక ఇంకో బాక్సింగ్ పాత్రలో డాన్సింగ్ రోజ్ గా షబీర్ కలరక్కల్ నటించాడు. నిజానికిది ఆనాటి పాపులరైన డాన్సింగ్ మోహన్, డాన్సింగ్ ఎలుమలై వంటి రియల్ ఫైటర్స్ ఆధారంగా రూపొందించిన పాత్ర అని మనకి సమాచారమందుతోంది.

        ఈ బాక్సింగ్ కి యాక్షన్ కొరియోగ్రఫీ అన్బరీవ్ నిర్వహించాడు. 2015 లో హిందీలో వచ్చిన 'బ్రదర్స్' లో బాక్సింగ్ కి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో ఫ్యూజన్ చేసి బాక్సింగ్ టెంప్లెట్ ఇన్నోవేట్ చేశారు. మారిన కాలానికి సార్పట్టా వాస్తవిక పీరియెడ్ తో ఈ ప్రయోగం చేసే అవకాశం లేక, రెగ్యులర్ కమర్షియన్ బాక్సింగ్ నే చూపించారు. గొప్ప కోసం రూల్స్ జోలికి పోకుండా, సాంకేతిక భాష వాడకుండా, కామెంటరీ కూడా మాస్ భాషలో చెప్పిస్తూ, దేశవాళీ ఆటగానే చూపించడం మాత్రం కొత్తదనమే.

        మురళి ఛాయాగ్రహణం, గ్రేడింగ్, పీరియడ్ లుక్ ని తెస్తే, ఇతర కూర్పు, కళాదర్శకత్వం, వస్త్రాలంకరణ, కేశాలంకరణ మొదలైన సాంకేతిక విభాగాల పని తీరు ఉన్నత స్థాయిలోనే వున్నాయి. స్క్రిప్టు మాత్రం పోటీ పడలేదు.

చివరికేమిటి
     ఇండిపెండెంట్, రియలిస్టిక్ జానర్ కథనాలు ఈ రెండు స్కూల్స్ నుంచి వచ్చిన మేకర్లు కమర్షియల్ సినిమాలకి- అందునా బిగ్ బడ్జెట్  మూవీస్ కి చేస్తూంటారు. తమిళంలో 'మండేలా'తో ఎం. అశ్విన్, 'సార్పట్టా'లో పా రంజిత్ ఇదే చేశారు. కమర్షియల్ స్క్రిప్ట్ రైటర్స్ ని మొనటానీ పంజరంలోంచి బయటికి తీయించే కథన కలాపం 'మండేలా' లో వున్నట్టు, సార్పట్టా లోనూ  వుంది. అంటే బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్) విభాగంలో అన్నమాట.

        బిగినింగ్ అంటే ఏమిటి? ప్రధాన పాత్ర సహా కొన్ని కీలక పాత్రల్ని పరిచయం చేసి, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసి, దాంతో బిగినింగ్ ని ముగిస్తూ, అప్పుడు వచ్చే ప్లాట్ పాయింట్ వన్లో ప్రధాన పాత్రని సమస్యలో పడేసి, ఆ సమస్యలోంచి బయటపడాలన్న గోల్ ని ఏర్పాటు చేయడమేగా? ప్రతీ సినిమాలో మార్పు లేకుండా హీరో కిదే తంతుగా?

        స్ట్రక్చరనేది దాని చట్రంతో అది శాశ్వతమే. ఎన్ని యుగాలు గడిచినా ఈ చట్రం చట్రమే, మారదు. మార్చాలని  క్రియేటివిటీకి పాల్పడితే కాళ్ళో, మొండెమో, తలకాయో లేని వికృత కథ చేతికొస్తుంది. కనుక బిగినింగ్- మిడిల్- ఎండ్- ఈ మూడిట్లో దేన్నీ తీసేసే క్రియేటివిటీకి పాల్పడ లేరు. పాల్పడగల్గేది ఆ చట్రమనే ఏర్పాటు లోపల చేసుకునే కథనంతో క్రియేటివిటీ మాత్రమే.

        కానీ - మీరు చట్రంలో వున్నప్పుడు చట్రాన్ని చూడలేరన్నాడు సీడ్ ఫీల్డ్. నిజమే, దీంతోనే వస్తోంది చిక్కంతా. లోపల కూర్చుంటే చట్రమే ఫీలవలేరు. కథనమే కనిపిస్తూంటుంది-  చూసిన సినిమాల్లోని రొటీన్ కథనం. బయట నుంచి చట్రాన్ని చూడగల్గితే ఆ చట్రమే కథనానికి కొత్త ఐడియాలిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోకుండా శాశ్వతమైన స్ట్రక్చరనే చట్రం లాగే, కథనాన్ని కూడా శిలాశాసనంలాగా పర్మనెంట్ ఆకారంతో చెక్కి పడేస్తూ పోతే, సినిమాలేమౌతాయి? చూసిందే చూడరా... అన్నట్టు తయారవుతాయి.

        ప్రతీ సినిమాలో హీరోయే ప్లాట్ పాయింట్ వన్లో సమస్యలో ఎందుకు పడాలి? గోల్ హీరోకే ఎందుకేర్పడాలి? తిరగేసి ఆలోచించ లేరా? విలన్సే సమస్యలో పడి, ప్లాట్ పాయింట్ వన్ గోల్ అనేది విలన్స్ కే ఏర్పడ కూడదా? మరి హీరో ఏమవుతాడు? ఏమీ కాడు, ఆగుతాడు. ఈ ఆపడమేగా క్రియేటివిటీ అంటే? మొన్న తమిళ మండేలా లో ఇదే చూశాం. ఇప్పుడు సార్పట్టా తమిళంలోనూ ఇదే చూస్తున్నాం.

    విలన్లయిన అన్నదమ్ములు ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు పోటీకి దిగడాన్ని ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంగా వుంటుంది మండేలా లో. ఇంతవరకూ ఈ బిగినింగ్ విభాగమంతా కథనం అన్నదమ్ముల మీదే వుంటుంది. బలహీనుడైన హీరో మండేలా అలా వెయిటింగ్ లో వుంటాడు. ఈ బిగినింగ్ విభాగమంతా బలహీనుడైన మండేలా మీద గాక, బలమైన విలన్లయిన అన్నదమ్ముల  మీద వాళ్ళ తగాదాలకి సంబంధించిన కథనం చేసి, వాళ్ళ మధ్యే వాళ్ళ కేర్పడే గోల్స్ తో ప్లాట్ పాయింట్ వన్ కి చేర్చాడు.ఈ విలన్ల గొడవతో సంబంధం లేకుండా మండేలాని బార్బర్ జీవితానికి పరిమితం చేశాడు. మరిప్పుడు ప్లాట్ పాయింట్ వన్ విలన్ల చేతి కెళ్ళిపోయాక మండేలా చేసేదేమిటి? దే సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది మిడిల్ (సెకండ్ యాక్ట్) లో.  

        ఇదే బిగినింగ్ కథనాన్ని సార్పట్టా లో కూడా చూడొచ్చు. ఇందులో హీరో ఆర్య బిగినింగ్ విభాగంలో మండేలా లాగే బలహీన క్యారక్టర్. మండేలా బార్బర్ అయితే ఆర్య హార్బర్ కూలీ. ఒకవైపు బాక్సింగ్ ఈవెంట్స్ భారే యెత్తున జరుగుతున్నా తల్లి భయంతో బాక్సింగ్ జోలికి పోకుండా, ఈవెంట్స్ చూస్తూ ఖాళీగా గడిపేస్తూంటాడు ఆర్య. మూస కమర్షియల్స్ లో హీరోనిలా ఖాళీగా చూపించే ధైర్యం చేయలేరు, స్ట్రక్చర్ గురించి తెలీక.

        బిగినింగ్ ప్రారంభంలో ఇరవై రెండు నిమిషాల సుదీర్ఘ నిడివితో సార్పట్టా - ఇడియప్ప పరంపరల మధ్య ఈవెంట్స్ ఒకే సీనుగా, ఒకే ఎపిసోడ్ గా వుంటాయి. బిగినింగ్ మొదలవగానే ఇలా ఇరవై రెండు నిమిషాల ఒకే సుదీర్ఘ సీనుతో కథనం చేయడం కొత్తగా అన్పించే క్రియేటివిటీ కాక ఏమిటి.

        ఈ ఈవెంట్స్ ని పని లేకుండా కేవలం ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేస్తూంటాడు ఆర్య. ఇదే మోనాటనీని వదిలించుకున్న ఇన్నోవేషన్. దీని తర్వాత పది నిమిషాలకి సార్పట్టా - ఇడియప్ప పరంపరల మధ్య ప్లాట్ పాయిట్ వన్ తో బిగినింగ్ ముగుస్తుంది. ఈ రెండు పరంపరల మధ్య ఫైనల్ షో డౌన్ గా, ఇడియప్ప పరంపర సార్పట్టాకి చివరి అవకాశ మివ్వడం సమస్య నేర్పాటు చేస్తుంది. అంటే ఇక సార్పట్టా కి చెందిన కోచ్ పశుపతికి,  ఇడియప్పని ఎట్టి పరిస్థితిలో ఓడించాలన్న గోల్ ఏర్పడడం...

(మిగతా రేపు)
సికిందర్

19, జూన్ 2021, శనివారం

1048 : స్పెషల్ ఆర్టికల్


     ఐడియాలు రెండు రకాలు : నిజ కథల ఐడియాలు, కల్పిత కథల ఐడియాలు. రీసెర్చి అన్నప్పుడు ఐడియాలకి రీసెర్చి అవసరం, కథలకి కాదు. కథలు క్రియేటివ్ కలాపం మాత్రమే. ఇది ఐడియాని బట్టి చేసుకోవచ్చు. ఐడియాలనేవి కథలకి క్రియేటివ్ కథనాన్నిచ్చే ఇంటలిజెన్స్ -మదర్ బోర్డ్ - కంట్రోల్ రూమ్ - ఏదైనా అవచ్చు-  అలా ఐడియాలు కథల్ని కంట్రోలు చేస్తాయి. కథ చేస్తున్నప్పుడు అనుకున్న ఐడియాని ఎక్కడో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కూడా జరుగుతూంటుంది. లైన్ ఆర్డర్ తర్వాత ట్రీట్ మెంట్ మారవచ్చు, ట్రీట్ మెంట్ తర్వాత డైలాగ్ వెర్షనూ మారవచ్చు. కానీ మొదట అన్నివిధాలా విశ్లేషించుకుని నమ్మి నిర్మించుకున్న ఐడియా మాత్రం ఏ దశలోనూ మారకూడదు. కథ- అంటే లైనార్డర్ ట్రీట్మెంట్ డైలాగ్వెర్షన్ వీటన్నిటినీ కలుపుకుని కంట్రోల్ చేసేదే ఐడియా. ఐడియా అంటే కథకి గోల్. అందుకని ఐడియా పాలనలో క్రియేటివ్ కల్పన వుండేట్టు చూసుకోవడం ముఖ్యం.

      కనుక ఐడియాలకే రీసెర్చి అవసరం. తర్వాత పాత్రలకి కథనానికి రీసెర్చి అవసరముంటే చేసుకోవడం అది వేరే అనుబంధ ప్రక్రియ. ఐడియా రీసెర్చి వుంటేనే ఈ ప్రక్రియ. ఇది సమస్య కాదు. ఐడియాల విషయానికొస్తే, ఈ వ్యాసం మొదటి భాగం 1045 లో ఐడియా రీసెర్చికి ముందుగా ఐడియా పూర్తి స్థాయి మార్కెట్ యాస్పెక్ట్ విశ్లేషణ, స్ట్రక్చర్ చూసుకున్న తర్వాతే, ఇవి కుదిరినప్పుడే, రీసెర్చికి పూనుకోవాలని చెప్పుకున్నాం. ఐడియాని  రీసెర్చి చేయడమంటే ఐడియాకి సంబంధించిన విషయకరణ చేయడం. విషయ సేకరణ కష్టమేం కాదు. దీనికి అందుబాటులో చాలా వనరులుంటాయి. ముందుగా ఐడియాని అది కోరుకుంటున్న గరిష్ట స్థాయి వినియోగ శక్తిని గుర్తించడమే కష్టం. దీన్ని సులభతరం చేయడానికే ఈ వ్యాసం.
        
    ఐడియా రబ్బరు బ్యాండు లాంటిది. ఎంత లాగితే అంత సాగుతుంది. తక్కువ లాగితే తక్కువలో వుండిపోతుంది. అందుకని దాని సాగే గుణాన్ని (స్థితి స్థాపక శక్తిని) గుర్తించడం అవసరం. లేకపోతే గత వ్యాసంలో చెప్పుకున్నట్టు నాంది’, మోసగాళ్ళు’, ఒన్ లాంటి పానిండియా వైరల్ అవాల్సిన ఐడియాలు లూజ్ రబ్బర్ బ్యాండులై పోతాయి.
         
    ఒక వేళ ఐడియా గరిష్ట సామర్ధ్యాన్ని గుర్తించినా, ఇదంతా మన తెలుగు సినిమాల కెందుకులే అని రిస్కు తీసుకోకుండా, ప్రేక్షకులకి అలవాటైందని భావించుకుంటున్న ఫార్ములా చట్రంలో బిగించేద్దామనుకుంటే- ఆ ఐడియాలు పై మూడిటి ఐడియాల్లాగే కాలం చెల్లిన రొటీన్ ఫార్ములా కథలై పోతాయి. ప్రేక్షకులే రిస్కు అనుకోకుండా, మెయిన్ స్ట్రీమ్ కాదనుకోకుండా, వివిధ రియలిస్టిక్, ఆల్టర్నేట్, ఇండీఫిలిం వెరైటీలు చూస్తున్నప్పుడు, వాళ్ళ స్థితి స్థాపక శక్తి ని కూడా ఆదరించనట్టే అవుతుంది. ఇలా చేయాలనుకున్నప్పుడు రీసెర్చి అవసరమే లేదు.

వ్యతిరేకంగా ఆలోచించాలి
     మండేలా’, బర్ఫీ’, మనం’, హాలాహల్ లాంటి ఐడియాలు వైరల్ అవడానికి కారణం ఇవి ఇన్నోవేట్ చేసిన ఐడియాలు. పాత ఐడియాల్నే మరికొంత లాగి చూస్తే రబ్బర్ బ్యాండులా సాగిన ఐడియాలివి. అపార్ధాలతో విడిపోయి చివరికి కలిసిపోవడం ప్రేమ సినిమాల రెగ్యులర్ టెంప్లెట్. ఇంతవరకే లాగిన ఈ రబ్బర్ బ్యాండుతో వున్న ఐడియాని, మరింత సాగలాగితే, అపార్థాలతో విడిపోవడం గాకుండా, కొట్టుకుని చివరికి విడిపోయే రాడికల్ ఐడియా అవచ్చు. ఐడియాలని what if? ఫ్యాక్టర్ తో ఆలోచించడం అవసరం. అంత వరకూ వచ్చిన, అమల్లో వున్న ఐడియాలనే 'ఇలా జరిగితే?' అని ప్రశ్నించుకుని, వ్యతిరేకంగా ఆలోచిస్తే వైరల్ ఐడియాలవుతాయి.

    ఓటు హక్కు అనే పాత ఐడియా 'మండేలా' గా కొత్త రూపం సంతరించుకుంది. ట్రాజిక్ గా చూపిస్తూ వస్తున్న అంగవైకల్యపు ఐడియాని కామిక్ గా, క్రైమ్ తో కలిపితే 'బర్ఫీ' వైరల్ అయింది. వికలాంగుణ్ణి నేరగాడుగా, కామెడీగా చూపడమేమిటని ధైర్యం చేయకపోతే 'బర్ఫీ' లేదు. 'మనం' లో మూడుతరాల ఐడియానే రీబూట్ చేస్తే, పాత వాసనలు వదిలి ట్రెండీ ఫ్యామిలీ డ్రామా అయింది. హాలాహల్ లో ఒక మెడికల్ స్కామ్ ని తీసుకుని జీవితంలో జరిగే యాంటీ క్లయిమాక్స్ చేశారు. ఇలా హీరో విలన్ చేతిలో చావకూడదనేం లేదు. 'మిస్ ఇండియా' లో అమెరికాలో ఎప్పుడో పరిచయమున్న ఇండియన్ టీని పరిచయం చేసే ఐడియా, వాస్తవ విరుద్ధంగా వుండి బెడిసికొట్టింది. ఇది రీసెర్చి చేయని, వాస్తవాలు తెలుసుకోని విఫల ఐడియా. 
        
    ఐడియాకి రబ్బరు బ్యాండు గుణం కల్పించడానికి చేసే రీసెర్చిలో పత్రికలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, టీవీ, యూట్యూబ్ వంటి ప్రాప్తి స్థానాలు చాలా వుంటాయి. Weird news వెబ్సైట్లు వుంటాయి. చాలా విచిత్ర, నమ్మశక్యం గాని వార్తలు వీటిలో వుంటాయి. ఐడియాకి రబ్బర్ బ్యాండ్ గుణాన్ని కల్పిస్తాయి. ట్రెండింగ్ న్యూస్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సంఘటనలు ఐడియాని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళడానికి పనికొస్తాయి.

ఒక ఉదాహరణ
     రబ్బర్ బ్యాండ్ లా సాగే గుణం గురించి ఒక ఉదాహరణ చూస్తే - మమ్ముట్టి నటించిన మలయాళం ‘ఒన్’ ని తీసుకోవచ్చు. దేశంలో  అనేక సమస్యలుంటాయి. సినిమాల్లో   సమస్యలకి సినిమాటిక్ గా పరిష్కారాలు చూపించడం దగ్గరే ఆగి పోతే సరిపోదు. సమస్యల పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించే కొత్త ఆలోచనకి తెర తీసినప్పుడే రబ్బరు బ్యాండులా సాగుతుంది ఐడియా. కళ్ళ ముందున్న సమస్యని కాక, దాంతో రేపటి కలని చూడగల్గినప్పుడు నెక్స్ట్ లెవెల్ కథల్ని అందించే అవకాశం వుంటుంది.

    ‘'ఒన్ లో రైట్ టూ రీకాల్ చట్టం గురించి ఐడియా. ప్రజలు తామెన్నుకున్న  ప్రజా ప్రతినిధి పనితీరు నచ్చకపోతే, వెనక్కి పిలిచే 'రైట్ టూ రీకాల్'‌ చట్టం ఇంకా పార్లమెంటులో ఆమోదం పొందకుండానే వుంది. పొందదు కూడా. ఈ ఐడియా తీసుకుని రైట్ టూ రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడం లక్ష్యంగా కథ చేశారు. చివరికి పార్లమెంటులో పాస్ అయినట్టు కల్పన చేసి చూపించారు. అసెంబ్లీలో కాలేదని ముగించారు. ఇంతే. ఇలా ఈ కథ రైట్ టూ రీకాల్ ఐడియాతో  కథ పూర్తి వికాసం చెందకుండా అర్ధోక్తిలో ఆగిపోయింది. రైట్ టూ రీకాల్ చట్టం ఆపరేటివ్ పార్టు చూపించకపోవవడంతో, ఉపోద్ఘాతంలా వుందే తప్ప, అసలు కథ చెలామణిలోకి రాకుండా వుండి పోయింది.

     ఏమిటా తవ్వి తీయాల్సిన అసలు కథ? చట్టం పాసయిందా కాలేదా అని కాకుండా, పాసైతే ఎలాటి కొత్త రాజకీయ వాతావరణాన్ని కళ్ళ జూస్తామా అని ప్రజలు ఎదురు చూస్తూంటారు. ఈ తృష్ణ తీర్చాలి. ఇందుకు రైట్ టు రీకాల్ చట్టం గురించి డేటా ఏమేముందో సేకరించాలి. ఇదీ రీసెర్చి.  రైట్ టు రీకాల్ చట్టం పాసై అమల్లోకి వస్తే ఎలాటి పరిణామాలుంటాయో వివరిస్తూ ఇప్సితా మిశ్రా రాసిన ఆర్టికల్ వుంది. ఇందులో చట్టం అమలైతే ఎలా వుంటుందో సినిమా తీయడానికి పనికొచ్చే పాయింట్లన్నీ వున్నాయి. ఈ పాయింట్లు తీసుకుని ‘ఒన్’ ని మించిన హిలేరియస్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తీయవచ్చు. చెప్పాల్సిన కథ ఇందులో వుంది.  అంతేగానీ కేవలం చట్టాన్ని పాస్ చేయించడమనే డ్రామాగా సరిపెట్టడంలో లేదు.

ఉపోద్ఘాతం కూడా...

       పార్లమెంటులో మహిళా బిల్లు కూడా పాస్ కాకుండా వుంది. ఈ ఐడియాని పాస్ చేయించే ఐడియాగా చేసి కథ చేస్తే ఏమిటి ఉపయోగం. పాసైతే ఎన్నికల్లో పాల్గొనడానికి మహిళలు 33 శాతం రిజర్వేషన్ తో రాజకీయాల్లో ఎలాటి మార్పు తేవచ్చో చూపించడంలో థ్రిల్లింగ్ వైరల్ ఐడియా పాయింటు వుంది. ఇదీ పట్టుకోవాల్సిన సరైన మార్కెట్ యాస్పెక్ట్.         

    సూర్య నటించిన తమిళ డబ్బింగ్ ఆకాశమే నీ హద్దురా ఐడియాకూడా దాని గరిష్ట సామర్ధ్యాన్ని అందుకోలేక పోయింది. చూపించాల్సిన కథ అది కాకుండా పోయింది. ప్రేక్షకులు చూడాల్సిన కథ సినిమాలో చూపించిన కథ కాదు. అది కథ కూడా కాదు. కేవలం ఉపోద్ఘాతం. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ విభాగాల బిజినెస్ దృష్ట్యా చూస్తే, అది కేవలం బిగినింగ్ విభాగం. బిగినింగ్ లో వుండే బిజినెస్సే, అంటే కథకి ముందుండే ఉపోద్ఘాతమే సినిమా అంతా.

    ఐడియాలో కథ వుందా గాథ వుందా ముందుగా సరి చూసుకోవాలని గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఒన్’, ఆకాశమే నీ హద్దురా లాంటివి చూస్తే- ఐడియాలో కథ వుందా, గాథ వుందా అని మాత్రమే గాకుండా, కొంపదీసి ఉపోద్ఘాతముందేమోనని కూడా అదనపు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కన్పిస్తోంది.      

      ఆకాశమే నా హద్దురా  కెప్టెన్ గోపీనాథ్ నిజ కథ. చవకలో సామాన్యుల విమానయాన కోరిక నెరవేర్చిన ఘన చరిత్ర అతడి జీవితం. విజయవంతంగా అలాటి విమానయాన సంస్థని కొంత కాలం నడిపి అమ్మేశాడు. ఇది గరిష్ట స్థాయి స్టోరీ ఐడియా. కానీ సినిమాలో చూపించింది మాత్రం అతనా సంస్థని ప్రారంభించడానికి పడిన కష్టాలే. అప్పుడిది పాక్షిక ఐడియా మాత్రమే కాదు, ఉపోద్ఘాతం కూడా అయింది. మెక్ డోనాల్డ్స్ వ్యాపార చరిత్ర ఐడియాతో ది ఫౌండర్ తీశారు. అప్పటికి కేవలం ఒక సెంటర్ నడుపుతున్నమెక్డొనాల్డ్స్ సోదరులతో ఒప్పందం కుదుర్చుకుని, విస్తృతంగా ఫ్రాంచైజీలు ప్రారంభించిన రే క్రాక్, ఏకంగా టేకోవర్ పథకమేసి సంక్షోభం సృష్టిస్తాడు. దీన్ని ఆ సోదరులెలా ఎదుర్కొన్నారన్నది పూర్తి స్థాయి ఐడియా. ఇదీ రీసెర్చి చేయాలి. సంస్థని ప్రారంభించడం కథకాదు, ప్రారంభించాక ఏం జరిగిందన్నది కథవుతుంది. ప్రేమలో పడడం కథ అవదు,డు, పడ్డాక ఏం జరిగిందన్నది కథవుతుంది. హత్య జరగడం కథవదు. జరిగాక ఏం జరిగిందన్నది కథవుతుంది. ఐడియాని ఇలా విశ్లేషించుకున్నప్పుడు గరిష్టంగా దాని సామర్ధ్యం కనపడుతుంది.

సికిందర్