రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, మార్చి 2024, సోమవారం

1414 : రివ్యూ

 

Sorry for the disappearence for so many days!
రచన- దర్శకత్వం : సుదీప్తో సేన్
తారాగణం : అదా శర్మ, ఇందిరా తివారీ, రైమా సేన్, విజయ్ కృష్ణ, సుబ్రతా దత్తా, యశ్పాల్ శర్మ తదితరులు
ఛాయాగ్రహణం : రాగుల్ ధరుమన్, సంగీతం : బిషాఖ్ జ్యోతి
బ్యానర్ : సన్‌షైన్ పిక్చర్స్, నిర్మాత : విపుల్ అమృతలాల్ షా
విడుదల : మార్చి 15, 2024
***
        ది కేరళ స్టోరీ (2023) దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, హీరోయిన్ అదా శర్మ కలిసి మరో కరుడుగట్టిన సమర్పణ బస్తర్ - ది నక్సల్ స్టోరీ ని అందించారు. ఇది ప్రచార సినిమా కాదని ముందే ప్రకటించారు. కానీ ఇది ఎన్నికల్లో పోలరైజ్ చేసే ప్రయత్నంతో తీసిన ప్రచార సినిమానే. ది కాశ్మీర్ ఫైల్స్ (2022) ని అనుకరిస్తూ చూపించిన హింసతో ఎవరిని టార్గెట్ చేస్తూ ప్రచార సినిమాగా మలిచారో స్పష్టంగా తెలిసిపోయే ప్రయత్నం. ఇందులో కూడా ఎంత నిజాయితీ వుందో కూడా బయటపడే దుందుడుకుతనం. ఇవేమిటో విపులంగా చూద్దాం...

కథ

ఇద్దరు న్యాయవాదులు నీలం నాగ్‌పాల్ (శిల్పా శుక్లా), ఉత్పల్ త్రివేది (యశ్పాల్ శర్మ) ల మధ్య కోర్టులో న్యాయ పోరాటంతో కథ ప్రారంభమవుతుంది. ఐపీఎస్ నీరజా భార్గవ (ఆదా శర్మ) అమాయక గిరిజనుల్ని ఎన్ కౌంటర్ చేసి చంపిందనీ, నక్సల్ హింసకి ప్రఖ్యాత రచయిత్రి వన్యా రాయ్ (రైమా సేన్) కుట్రపూరిత సపోర్టు వున్నట్టు తప్పుడు ఆరోపణ చేసిందనీ, నీలం నాగ్ పాల్ వాదిస్తుంది. దీన్ని తిప్పి కొట్టలేక పోతాడు ఉత్పల్ త్రివేది. ఈ కోర్టు సన్నివేశం ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్ గ్రామానికి మారుతుంది.
       
2010
లో బస్తర్ లో గిరిజనుల సమూహం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. స్కూల్ టీచర్ మిలింద్ కశ్యప్ (సుబ్రతా దత్తా), భార్య రత్న (ఇందిరా తివారీ), కొడుకు, కూతురు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో మావోయిస్టులు మెరుపుదాడి జరిపి అందర్నీ తమ శిబిరానికి లాక్కుపోతారు. అక్కడ కామ్రేడ్ లంకా రెడ్డి (విజయ్ కృష్ణ)  అనే పేరు మోసిన మావోయిస్టు, అతడి అనుచరురాలు లక్ష్మి (అనంగ్షా బిశ్వాస్) మిగతా దళ సభ్యులు వుంటారు. స్కూల్ టీచర్ మిలింద్ కశ్యప్  త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసినందుకు, ఐపీఎస్ నీరజా భార్గవకి ఇన్‌ఫార్మర్‌గావున్నందుకూ దేశద్రోహిగా ప్రకటించి, నరికి చంపేస్తాడు లంకా రెడ్డి.
       
లంకారెడ్డి ధ్యేయం ఒకటే- ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరేయడం. కళ్ళముందే భర్త దారుణ హత్యకి గురికావడంతో చలించిన రత్న
, ఈ హంతకుల్ని నిర్మూలిస్తానని
ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమెకి తగిన ధైర్యం నూరిపోసి తన స్క్వాడ్ లో పోలీసుద్యోగం ఇప్పిస్తుంది నీరజ. దీంతో వీళ్ళిద్దరు కలిసి చేసే పోరాటం ఏ ముగింపుకి దారి తీసిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

బస్తర్- ది నక్సల్ స్టోరీ తో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో నక్సలైట్-మావోయిస్టు తిరుగుబాటు అధ్యాయాల్నిబయటకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దర్శకుడు దీని కోసం చాలా రీసెర్చి చేసినట్టు కనిపిస్తాడు. బస్తర్ కి సంబంధించి బాధాకరమైన గతాన్ని నిశితంగా వర్ణించినందుకు అతడ్ని మెచ్చుకోవాల్సిందే. అయితే బస్తర్ లో ఆ పరిస్థితులు ఏర్పడడానికి కారణమైన తెరవెనుక శక్తుల్ని దాచీ దాచిపెట్టనట్టుగా చూపించడం దగ్గరే ప్రచార సినిమా లక్ష్యం దెబ్బతింది.
       
దీని నేపథ్యాన్ని పరిశీలిస్తే
, ఈ ప్రాంతంలో ఇనుము, బొగ్గు, బాక్సైట్, మాంగనీస్ వంటి సహజ వనరులు సమృద్ధిగా వుండి, కార్పొరేట్ రంగానికి ఈ ప్రాంతాన్ని అప్పజెప్పాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్ని అడ్డుకుంటూ పుట్టిందే అక్కడి నక్సలిజం. కార్పొరేట్లతో ఈ కేంద్రబిందువుని దాచిపెడుతూ లెఫ్టిస్టులు, మీడియా, బాలీవుడ్, ఎన్జీవోలు, జేఎన్ యూ లని ఈ ప్రాంతంలో నక్సల్ సపోర్టర్లుగా, అసలు స్వదేశీ విలన్లుగా చెప్పడం చేశారు. ఇంకోవైపు లష్కర్, ఎల్ టీటీఈ, బొకోహరామ్, ఐసిస్ మొదలైన టెర్రరిస్టు సంస్థల్ని నక్సలైట్లతో చేతులు కలిపిన విదేశీ విలన్లుగా చూపించారు.
       
దేశంలోని ఆ 
స్వదేశీ విలన్లు దేనికి నక్సలిజాన్ని సపోర్టు చేస్తున్నారో చెబితే కార్పొరేట్ శక్తుల గురించి, అక్కడి సహజ వనరుల పరిరక్షణ గురించీ చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రచార సినిమాకి అనుకూలంగా వుండదు. అందుకని ఈ కథ కల్పన-వాస్తవాల, అనేక కుట్ర కోణాల కలిపికొట్టుడుగా ముగుస్తుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నలాగా మిగిలిపోతుంది.
       
పై కథలో కోర్టు సీనులో చెప్పే ప్రఖ్యాత రచయిత్రి వన్యా రాయ్ మరెవరో కాదు
, అరుంధతీ రాయే. నక్సలైట్లకి వ్యతిరేకంగా గిరిజనులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సల్వాజుడుం (శాంతి యాత్ర) దళానికి నాయకత్వం వహించిన మహేంద్రకర్మ పేరు రాజేంద్ర కర్మగా మారింది.
        
ఒక సన్నివేశంలో ప్రొఫెసర్, విద్యావేత్తల ర్యాంకుల్లోకి, బాలీవుడ్‌లోకి వామపక్ష తీవ్రవాద భావజాలాన్ని చొరబెట్టాల్సిందిగా వన్యా రాయ్ ని కోరడాన్ని చూడొచ్చు. ఇంటర్వెల్ సీనుగా వచ్చే దంతెవాడలో 76 మంది సీఆర్పీ ఎఫ్ జవాన్ల హత్యాకాండని జేఎన్ యూ విద్యార్ధులు పాటలతో సెలెబ్రేట్ చేసుకుంటూ, చనిపోయిన పోలీసుల్ని పోలీసు కుక్కలు గా పేర్కొనడం, ఎర్రకోట మీద జెండా ఎగరేస్తామనడం ప్రచార సినిమాకి పనికొచ్చేదే. కేంద్రహోమ్ మంత్రి ఐపీఎస్ నీరజని దొంగముండా అని తిట్టడం కూడా ఒక పార్టీకి వ్యతిరేకంగా పోలరైజేషన్ ని ఎగదోయడమే.
       
ఇక ఎలాటి క్రూరత్వాన్ని ఈ శక్తులు సపోర్టు చేస్తున్నాయో చెప్పి మరింత బలంగా పోలరైజ్ చేయడానికన్నట్టు
, హద్దుమీరిన హింసాత్మక దృశ్యాలున్నాయి. ప్రారంభంలో నక్సల్స్ స్కూల్ టీచర్ని చంపే దృశ్యం గగుర్పాటు కలిగిస్తుంది- గొడ్డలితో నరుకుతూనే వుంటాడు, ఎప్పుడో శవమైపోయినా, వివిధ అంగాల్ని భయంకరంగా నరుతూనే వుంటాడు. ఇది 30 సెకన్ల పాటు భయపెట్టే దృశ్యం. ఇలాటి దృశ్యాలు ది కాశ్మీర్ ఫైల్స్ లో వున్నాయి. అయితే వాటిని బ్లర్ చేశారు. ఇక్కడ మాత్రం బాహాటంగానే వదిలేసింది సెన్సార్.
       
ఒక పసిపిల్లని నక్సల్స్ మంటల్లోకి విసిరి చంపే దృశ్యం కూడా ఇలాటిదే. ఇక దంతెవాడ లో సీఆర్పీ ఎఫ్ శిబిరాన్ని రాత్రిపూట తగులబెట్టి 76 మంది పోలీసుల్ని సజీవదహనం చేసి చంపే సుదీర్ఘ భీకర దృశ్యం- స్టీవెన్ స్పీల్బెర్గ్ తీసిన 
షిండ్లర్స్ లిస్ట్ లో నాజీలు యూదుల్ని అగ్నికి ఆహుతి చేసే దృశ్యాలకంటే భయానకంగా వుంటాయి. ఇవన్నీ ప్రచార సినిమా లక్ష్యాన్ని నెరవేరుస్తాయి.
       
కొన్ని జాతీయ
, అంతర్జాతీయ పత్రికల సాక్ష్యంగా గణాంకాలు ముందుంచారు ఐపీఎస్ నీరజా పాత్ర ద్వారా- వందేళ్ళ కమ్యూనిజంలో పదికోట్ల మందిని చంపేశారని, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాల్లో చనిపోయిన సైనికుల సంఖ్యకంటే, నక్సలైట్లు బలిగొన్న పోలీసుల ప్రాణాలు అధికమనీ. ఇక ముగింపులో నీరజ వాదిస్తూ- ఉరిశిక్షకి కూడా భయపడకుండా లెఫ్ట్ లిబరల్స్ ని కాల్చి చంపాలంటుంది!
       
లెఫ్ట్ లిబరల్సో మరెవరో
, అసలు కారకులైన కార్పొరేట్స్ ని కూడా ముందుంచి కథ చెబితే బావుంటుంది. ఎలక్టోరల్  బాండ్స్ లో కార్పొరేట్స్ చిట్టా లాగా దాచిపెట్టాలన్న విఫల యత్నాలెందుకు? ఇదేం సినిమా కథ?

నటనలు- సాంకేతికాలు
గర్భవతియైన కరకు పోలీసాఫీసర్ నిరజగా అదా శర్మ బాగా నటించింది. క్లయిమాక్స్ లో ఏకపాత్రాభినయం లాగా సుదీర్ఘ డైలాగులు సినిమాగా బాగానే పేలతాయి. కానీ ఎలాటి సందేశం వెళుతోంది? ఎవరికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నట్టు? ఈమెతో పోటీపడి కామ్రేడ్ లంకారెడ్డిగా విజయ్ కృష్ణ నటించాడు. ఇతర పాత్రల్లో యశ్‌పాల్ శర్మ, శిల్పా శుక్లా, రైమా సేన్, పూర్ణేందూ భట్టాచార్య నటనలు సహజత్వానికి దగ్గరగా వున్నాయి. అయితే క్రూరురాలైన నక్సల్ పాత్ర లక్ష్మిగా అనంగ్షా బిశ్వాస్, భర్తని కోల్పోయి పగబట్టిన రత్నగా ఇందిరా తివారీ హైలైట్ గా వుంటారు. అలాగే స్కూల్ టీచర్ గా సుబ్రతా దత్తా కూడా.       

సాంకేతికంగా చెప్పుకోదగ్గ సినిమా.
యాక్షన్ సీక్వెన్సులతో సహా ఛాయాగ్రహణం, వీఎఫ్ ఎక్స్, అడవుల్లో లొకేషన్లూ, నేపథ్య సంగీతం, ప్రతి డిపార్ట్ మెంటులో నిర్మాణ విలువలూ అన్నీ నాణ్యంగా వున్నాయి. నాణ్యంగా విషయం మాత్రం లేదు. విషయం సినిమాకంటే ఎక్కువ డాక్యుమెంటరీ డ్రామాలాగా వుంది. ఎమోషనల్ డెప్త్ కాకుండా హద్దు మీరిన హింసతో, రక్తపాతంతో, వక్రీకరణలతో విషయం వుంది- ప్రచార సినిమాలు అర్ధసత్యాలుగానే వుండాలి కాబట్టి.
–సికిందర్

11, మార్చి 2024, సోమవారం

1413 : రివ్యూ

రచన- దర్శకత్వం: ఎ. హర్ష

తారాగణం : గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ, నరేష్, ముఖేష్ తివారీ,
నాజర్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్, ఛాయాగ్రహణం: స్వామి గౌడ
నిర్మాత: కేకే రాధామోహన్
విడుదల : మార్చి 8, 2024
***

        మాచో స్టార్ గోపీచంద్ ఒక హిట్ చూసి పదేళ్ళయింది. ఈ పదేళ్ళల్లో 10 ఫ్లాపులు తన వంతుకి సంపాదించుకున్నాడు. ఎందుకు ఫ్లాపవుతున్నాయంటే మార్పుకి అస్సలు అంగీకరించకపోవడం వల్ల. ప్రేక్షకులే మారి తన పాత మూస ఫార్ములా సినిమాల మార్గంలోకి రావాలని కోరుకోవడం వల్ల. ప్రేక్షకులు మారకుండా తమ మార్గాన కొత్త దారిని పోతున్నారు. దీంతో ప్రేక్షకులకి 10 ఫ్లాపుల దూరాన వుండి పోయాడు. ఇప్పుడు తాజాగా భీమా అనే మరో ప్రయత్నంతో వచ్చాడు. దీని పోస్టర్లు, ట్రైలర్లు చూస్తే ఇది పద కొండవ పిడుగు అని భయం పట్టుకుంటుంది. దీనికి హర్ష అనే కన్నడ దర్శకుడ్ని నమ్మాడు. ఈ దర్శకుడితో పిడుగు కాదు పరశు రాముడి గండ్ర గొడ్డలి అన్పించేలా తయారయ్యింది వ్యవహారం. ఇక ఆఖరికి ఆ గొడ్డలితో ప్రేక్షకుల్ని సంహరించడానికే దిగాడు గోపీ చంద్ అనుకుంటూ భయపడుతూనే ఈ పదకొండవ బండ చూస్తే ఎలా వుందంటే...

కథ

అది పురాణం. ఆ పురాణంలో పరశు రాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడ్ని కోరుతాడు. సముద్రంలో గొడ్డలి విసిరితే ఆ విసిరినంత మేరకూ సముద్రం వెనక్కి వెళ్ళి భూభాగ మేర్పడుతుందని వరుణుడు చెప్తాడు. అలా ఏర్పడిన భూభాగం కేరళలోని మహేంద్రగిరిలో కథ ప్రారంభమవుతుంది. దీన్నే పరశురామ క్షేత్రమని పిలుస్తూంటారు. ఇక్కడ భవానీ అనే దుర్మార్గుడు అరాచకాలు చేస్తూ ప్రజల్ని నరక యాతన పెడుతూంటాడు. అడవిలోంచి ట్యాంకర్లలో ఏదో రవాణా చేస్తూంటాడు. ఇంకో పక్క అక్కడి ఆలయం ఆత్మల్ని ప్రేరేపిస్తోందన్నభయంతో మూతపడుతుంది. మరోపక్క రవీంద్ర వర్మ (నాజర్) అనే ఆయుర్వేద వైద్యుడు మరణించిన మనిషిని బతికించే ఔషధం కోసం మొక్కల మీద పరిశోధనలు చేస్తూంటాడు.
       
ఈ నేపథ్యంలో అక్కడికి భీమా (మాచో స్టార్ గోపీచంద్) అనే ఎస్సై వస్తాడు. అక్కడే కామెడీగా
, గల్లీ రోమియోగా విద్య (ప్రియా భవానీ శంకర్) అనే మొక్కల పరిశోధకురాలి వెంటపడి ప్రేమిస్తూంటాడు. అక్కడే భవానీ అరాచకాల గురించి తెలుసుకుని చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఇతడికేదో గతం వుంటుంది. ఏమిటా గతం? రామా ఎవరు? భవానీతో తలపడి భీమా ఏమయ్యాడు? ఆలయం అసలెందుకు మూతబడింది? భీమా వెనకున్న అసలు విలనెవరు? ఇతనెలా అంతమయ్యాడు? రామాలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది? ట్యాంకర్ల రహస్యమేమిటి? ఇవన్నీ మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

కలగూరగంపలా వుంది. పరశురాముడి స్థల పురాణంతో ఆర్భాటంగా ప్రారంభమై ఆలయం కథ, భవానీ కథ, రవీంద్రవర్మ కథ, పిల్లల అక్రమ రవాణా కథ, భీమా కథ. రామా కథ, రామాలోకి ప్రవేశించిన ఆత్మ కథ...ఇలా ఎన్నెన్నో కథలతో గోపీచంద్ కాపీ మజిలీ కథలా తయారైంది. తను నటించిన పాత సినిమాల్నే కాపీ చేసి చివర్లో కాంతారా టైపు క్లయిమాక్సునే అతికించి ట్రెండ్ లో వున్నానని చాటుకునేలా వుంది. వారం క్రితమే భూతద్ధం భాస్కర్ నారాయణ లో ఇదే కాంతారా టైపు క్లయిమాక్స్ చూశాం. వెనక్కిపోతే ఇంకెన్నో సినిమాల్లో చూశాం.  ఇంకెన్ని సార్లు ఇదే చూపిస్తారు? ఇలా చూపించినవన్నీ ఫ్లాపవుతున్నాయి.
       
స్థల పురాణం
, భవానీ అరాచకాలు, ఆలయ కథ చెప్పాక, దాదాపు పదిహేను నిమిషాలు వెన్నెల కిషోర్ కామెడీ నడుస్తుంది. ఇదేం సినిమా ప్రారంభమో అర్ధం గాదు. ఎస్సై భీమాగా గోపీచంద్ ప్రవేశించాక నడుం వూపులతో వాంప్ లా కనిపించే హీరోయిన్ తో లవ్ ట్రాక్ మొదలు. ఆమె బాడీగార్డ్ ని అడిగితే ఎస్సైగా గోపీచందే బాడీ గార్డు గా వెంటపడి తిరుగుతూంటాడు. ఈ లవ్ ట్రాక్ హీరోయిన్ చేసే సంజ్ఞలతో అసభ్యంగా వుంటుంది. అరగంటపాటు ఈ అసభ్య లవ్ ట్రాక్ సాగేక, విలన్ గ్యాంగ్ తో పోరాటం, ఇంటర్వెల్. ఈ మధ్య టెంప్లెట్ కథనంతో సినిమాలు రావడం లేదు. గోపీచంద్ మాత్రం మారకుండా అదే ఫార్ములా కృతక టెంప్లెట్ కథనమే వడ్డించాడు. ఫస్టాఫ్ లో ఎన్నో పాయింట్లు ఎత్తుకుని దేని మీదా నిలబడక  భీమాగా వైదొలిగాడు.
       
సెకండాఫ్ రామాగా గోపీచంద్ ఎంట్రీ. రామాతో ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ ఇంకో హీరోయిన్  మాళవికా శర్మతో ఇంకో లవ్ ట్రాక్. ఇది కూడా సహన పరీక్ష పెట్టాకా కథలోకి
, అక్కడ్నిం చి క్లయిమాక్స్ కి. ఏ మాత్రం సస్పెన్స్, థ్రిల్స్, మలుపులూ లేని, వాటికి వీలివ్వని కలగూరగంప కథతో కన్నడ దర్శకుడి 2000 నాటి సినిమా. ఈసారి ద్విపాత్రాభినయం చేసినా గోపీచంద్ కి దక్కని హిట్.

నటనలు- సాంకేతికాలు

ఈ ద్విపాత్రాభినయం ఏ పాత్రకీ బలమివ్వని వ్యవహారంగా మారింది. యాక్షన్ సీన్స్ మాత్రం విజృంభించి చేశాడు. కానీ యాక్షన్ సీన్లు మాత్రమే సినిమాని నిలబెట్టలేవు. ఇద్దరు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కూడా విఫలమైంది. హీరోయిన్లు ప్రియ, మాళవిక లవి కృత్రిమ ఫార్ములా పాత్రలు. నాజర్, ముఖేష్ తివారీ తదితరులు విలన్లుగా రొటీన్ నటనలతో సరిపెట్టారు.
        
కేజీఎఫ్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ని తెచ్చుకున్నాడు కన్నడ దర్శకుడు హరీష్, బస్రూర్ చేసింది ప్రత్యేకంగా ఏమీ లేదు. స్వామి గౌడ
ఛాయాగ్రహణంలో కూడా ప్రత్యేకత ఏమీ లేదు. గ్రాఫిక్స్ కి బాగా ఖర్చుపెట్టారు. నృత్య దర్శకుదే అయిన దర్శకుడు పాటలకి సమకూర్చిన కొరియోగ్రఫీ అతి మామూలుగా వుంది. నృత్య దర్శకులు, ఛాయాగ్రాహకులు దర్శకులైతే ఆ సినిమాలు ఫ్లాపవుతున్నాయి. ఇటీవలే ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని తీసిన ఈగల్  కూడా ఫ్లాపయ్యింది. ఇప్పుడు నృత్య దర్శకుడు తీసిన భీమా. ఇలా గోపీచంద్ చేసిన 11వ దండయాత్ర కూడా కాలం చెల్లిన పాత మూస ఫార్మలా జాబితాలోకి చేరింది.

—సికిందర్

 

  

1412 : రివ్యూ


 రచన- దర్శకత్వం : విద్యాధర్ కె

తారాగణం : విశ్వక్ సేన్, చాందినీ చౌదరి, అభినయ, హారిక, భయానంద్ రెడ్డి, మహ్మద్ సమద్ తదితరులు
సంగీతం : స్వీకార్ ఆగస్తీ, నరేష్ కుమారన్; ఛాయాగ్రహణం : విశ్వనాథ రెడ్డి, రాంపీ
నిర్మాత : కార్తీక్ శబరీష్ , శ్వేత ఏం.
విడుదల : మార్చి 8, 2024
***

        దాదాపు అయిదేళ్ళుగా నిర్మాణంలో నవున్న గామి ఈ రోజు విడుదలైంది.  రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాలు నటిస్తూ వచ్చిన హీరో విశ్వక్ సేన్ గామి తో తన మీద తను ఒక ప్రయోగం చేసుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాకుండా, రెగ్యులర్ కమర్షియల్ కథ కూడా కాకుండా, హాలీవుడ్ నుంచి వచ్చే సర్వైవల్ డ్రామా లాంటిది చేశాడు. దీనికి విద్యాధర్ కొత్త దర్శకుడు. కొత్త దర్శకుడు మూసకి పోకుండా వైవిధ్యాన్ని ప్రయత్నించడమన్నది ఒక అభినందించ దగ్గ విషయం. ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకుల కిచ్చిన ప్రత్యేక అనుభవమేమిటో చూద్దాం...

కథ

హరిద్వార్ లో శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. అఘోరాలతో కలిసి వుంటాడు. తనెవరు, ఎక్కడ్నించి వచ్చాడు గుర్తు లేవు. అతనొక వింత వ్యాధితో బాధపడుతూంటాడు. తనని ఎవరైనా ముట్టుకుంటే శరీర రంగు నీలి రంగులోకి మారి పోతుంది. స్పృహతప్పి పడిపోతాడు. దీంతో ఇతడి వల్ల ఇబ్బంది పడుతున్నామని తోటి అఘోరాలు వెలివేస్తారు. ఇక తన వ్యాధికి చికిత్స వెతుక్కుంటూ కాశీకి వెళ్తాడు. అక్కడొక సాధువు నివారణోపాయం చెప్తాడు. మాలీ పత్రాలు అనే పువ్వు వుంటుందని, అది 36 ఏళ్ళ కోసారి హిమాలయాల్లో కాస్తుందనీ, ఇప్పుడు 36 వ సంవత్సరం ప్రవేశించిందనీ, 15 రోజుల్లో వెళ్ళి దాన్ని సాధించుకోమనీ చెప్తాడు.
       
హిమాలయాలకి బయల్దేరిన శంకర్ కి జాహ్నవి (చాందినీ చౌదరి) తోడవుతుంది. ఈమె మెడికల్ రిసెర్చర్. శంకర్ కి ఓ ఇద్దరి గురించిన ఆలోచనలు వేధిస్తూంటాయి : ఉమ (హారిక)
, సీటీ 333 (మఃహ్మద్ సమద్). వీళ్లెవరో అర్ధంగాదు. అలాగే ప్రయాణం సాగిస్తాడు. ఈ మానసిక సంఘర్షణతో కూడిన ప్రయాణంలో అతను మాలీ పత్రాలు సంపాదించగలిగాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

సర్వైవల్ డ్రామా. జీవన్మరణ పోరాటం చేస్తూ సాగించే ప్రయాణపు కథ. ఇందులో ప్రకృతి వైపరీత్యాలుండొచ్చు, క్రూర మృగాలతో ప్రమాదాలుండొచ్చు. ఇవన్నీ ఎదుర్కొని  ప్రాణాలతో బయటపడే హ్యూమన్ స్పిరిట్ కథ. విశ్వక్ సేన్ నటించడానికి బాగా అవకాశమున్న కథ. పూర్తిగా అవుట్ డోర్ అడ్వెంచర్. హిమాలయాల్లో సాహసకృత్యాలు. శంకర్ కి తనెవరో తెలీదు. దీనికి సమాంతరంగా రెండు ఉప కథలు వస్తూంటాయి ఫ్లాష్ బ్యాకులుగా. గ్రామంలో ఉమ అనే అమ్మాయిని సర్పంచ్ దేవదాసిగా మార్చేందుకు ప్రయత్నిస్తూంటే ఆమె ఎలా తప్పించుకుందన్న ఉప కథ ఒకటి, ఇంకోచోట సీటీ 333 అనే నెంబరు గల  యువకుడు తన మీద చేస్తున్న అక్రమ వైద్య ప్రయోగాల నుంచి ఎలా తప్పించుకున్నాడనే ఉప కథ. ఈ రెండూ సమాంతరంగా సాగుతూ వచ్చి చివర్లో శంకర్ కథతో కలుస్తాయి. అప్పుడు శంకర్ ఎవరో తెలుస్తుంది.
       
అయితే ఈ ఉప కథల్లో బలం లేదు పాత్రలకి తగిన స్ట్రగుల్ లేకపోవడం వల్ల. పైగా ఇవి శంకర్ దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తూండడంతో కంటిన్యూటీ సరిగ్గా లేక కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇక శంకర్ కథ ఆసక్తికరంగా సాగేబదులు ఓపికని పరీక్షిస్తూ నిదానంగా సాగుతూంటుంది. శంకర్ స్ట్రగుల్
, అపాయాలతో పోరాటాలు మాత్రం  బావుంటాయి.
       
ఫస్టాఫ్ కథని పరిచయం చేస్తూ కాస్త వేగంగానే సాగినా
, ఇంటర్వెల్ సీను అకస్మాత్తుగా వచ్చేస్తుంది లీడ్ లేకుండా. ఆ తర్వాత సెకండాఫ్ నత్త నడక నడుస్తుంది. జాహ్నవి తనెందుకు ఈ ప్రయాణం చేయాల్సివచ్చిందో చెప్పడం, అతడి సమస్య తెలుసుకుని చలించడమూ వగైరా వుంటాయి. ఇక ఇద్దరి ప్రయాణం హిమాలయాల్లో ప్రమాదాలతో కూడి వుంటుంది సింహంతో పోరాటం సహా. ఈ రెండు పాత్రల అనుభవాలు, ఆవేదనలు, ఆక్రందనలు సినిమాని గంభీర ముద్రలోకి తీసికెళ్ళి పోతాయి. అభిరుచి గల ప్రేక్షకులకిదొక మంచి అవకాశమేగానీ సాధారణ ప్రేక్షకులకి కాదు. మమ్ముట్టికి ‘భ్రమయుగం’ ఎలాగో,  విశ్వక్ సేన్ కి ‘గామి’ అలాగ.

నటనలు- సాంకేతికాలు

నిస్సందేహంగా విశ్వక్ సేన్ కిది మంచి పాత్ర. అఘోరా పాత్రని స్టడీ చేసి నటించినట్టున్నాడు. తనలోని నటుడ్ని బయటికి తీసుకొచ్చాడు. అతడి ఫ్యాన్స్ జీర్ణించుకున్నా జీర్ణించుకోక పోయినా డోంట్ కేర్ అన్నట్టు పాత్రలోకి దూరిపోయి నటించాడు/జీవించాడు. అందులోనే సర్వస్వం ధారబోశాడు. డైలాగులు అతి తక్కువ. హావభావాలే ఎక్కువ. ముఖం కూడా పూర్తిగా, సరిగ్గా కనిపించదు. కమర్షియల్ హీరోలు ఇలా కనిపించడానికి ఒప్పుకోరు. మొహం నిండా బాగా లైటు పడాలి, బోలెడు డైలాగులు చెప్పాలి. అప్పుడే బొమ్మ పడాలి.
       
మెడికల్ రిసెర్చర్ పాత్రలో చాందినీ చౌదరికి నటించడానికి కీలక సన్నివేశాలు లేకపోయినా హీరోతో పాటు స్ట్రగుల్ బాగా నటించింది. అలాగే  ఉపకథల్లో ఉమగా హారిక
, సీటీ 333గా మహ్మద్ సమద్, ఉమ తల్లిగా అభినయ ఫర్వాలేదు.
       
సాంకేతికంగా- ఛాయాగ్రహణపరంగా ఎగుడుదిగుడుగా వుంది. ఐదేళ్ళు నిర్మాణంలో వుండడం వల్లనేమో ఏకత్వం కరువైంది. హిమాలయా దృశ్యాలు మాత్రం అద్భుతంగా వున్నాయి. శివరాత్రికి విడుదలైన ఈ సినిమా శివుడి ప్రస్తావనలతో
, శివుడి మీద ఓ పాటతో భక్తుల్ని భక్తి సాగరంలో ముంచెత్తుతాయి.
       
గత రెండు వారాలుగా టపా కట్టేస్తున్న సినిమాల్లా కాకుండా
, ఈ సినిమా ఆడినా ఆడక పోయినా విషయమున్న చలన చిత్రంగా మాత్రం గుర్తుండి పోతుంది.
—సికిందర్

       




5, మార్చి 2024, మంగళవారం

1411 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : పురుషోత్తం రాజ్
తారాగణం : శివ కందుకూరి, రాశీ సింగ్, దేవీ ప్రసాద్, ర్శిణీ సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం : గౌతమ్. జి
నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడింబి
విడుదల : మార్చి 1, 2024
***
        రో సస్పెన్స్ థ్రిల్లర్ ఈవారం వెండి తెరనలంకరించింది. హీరో శివ కందుకూరి చూసీ చూడగానే’, గమనం అనే రెండు సినిమాల్లో నటించిన నటుడు. వీటితో గుర్తింపేమీ రాలేదు. ఇక టైటిల్ రోల్ పోషిస్తేనే గుర్తింపుకి అవకాశం వుండగలదని భూతద్దం భాస్కర్ నారాయణ లో నటించినట్టుంది.  ఇది డిటెక్టివ్ పాత్ర. దీని కథకి ప్రయోగాత్మకంగా పురాణ కథతో లింకు పెట్టారు. అదేమిటో చూద్దాం.

కథ

ఆంధ్ర -కర్ణాటక సరిహద్దులోని అడవుల్లో కర్ణాటక వైపు కొన్నేళ్ళుగా స్త్రీల శవాలు బయటపడుతూంటాయి. అవి తలలు తెగి, మొండెమ్మీద దిష్టి బొమ్మలు అమర్చి వుంటాయి. ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని తెలిసిపోతున్నా ఆ సీరియల్ కిల్లరెవరో దొరకడు. తలలు దొరక్కపోవడంతో శవాలెవరివో గుర్తించడం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఆంధ్రావైపు గ్రామంలో చిన్నతనం నుంచీ డిటెక్టివ్ అవ్వాలన్న కోరికతో భాస్కర్ నారాయణ పెరుగుతాడు. గ్రామంలోనే డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. లుంగీ కట్టుకుని వుంటాడు. ఇతడి తెలివి తేటలకి మెచ్చి పోలీసులు హత్య కేసుల్లో సైతం ఇతడి సాయం తీసుకుంటూ వుంటారు. ఇలా వుండగా, ఈసారి ఆంధ్రా గ్రామం వైపు అడవిలో దిష్టి బొమ్మ అమర్చిన మరో స్త్రీ శవం బయటపడుతుంది. ఇక డిటెక్టివ్ భాస్కర్ ఈ కేసుని పరిశోధించడానికి రంగంలోకి దిగుతాడు.
       
ఈ శవాలు అసలెవరివి
? అజ్ఞాతంగా వుంటున్న సీరియల్ కిల్లరెవరు? ఎందుకీ రకంగా హత్యలు చేస్తున్నాడు? వీణ్ణీ పట్టుకోవడమెలా? పరిశోధన మొదలెట్టిన డిటెక్టివ్ భాస్కర్ తెలుసుకున్న కొత్త సంగతులేమిటి? అసాధ్యుడుగా వున్న సీరియల్ కిల్లర్ని చివరికి పట్టుకోగలిగాడా లేదా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ మధ్య కాంతారా హిట్టయినప్పట్నుంచీ డివైన్ జానర్ సినిమాలు ఒక ట్రెండ్ గా వస్తున్నాయి. కార్తికేయ 2’, విరూపాక్ష’, హిడింబ’, మా వూరి పొలిమేర’, మంగళవారం హనుమాన్’, ఊరి పేరు భైరవకోన లాంటివి. ఈ వరుసలో భూతద్దం భాస్కర్ నారాయణ చేరింది. అయితే ఒక డిటెక్టివ్ కథకి డివైన్ జానర్ ని కల్పించడం ఇదే తొలిసారి. అదీ పురాణంతో కలిపి. పురాణంలో మహిషాసురుడి కథకి, కథలో జరుగుతున్న హత్యలతో ముడిపెట్టి డిటెక్టివ్ జానర్ లో కొత్త ప్రయోగం చేశారు. దీంతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా తయారయ్యింది.
       
అయితే విషయం కొత్తగా వున్నా చెప్పడం అంత కొత్తగా లేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది. భాస్కర్ డిటెక్టివ్ అవడానికి చిన్నప్పటి సన్నివే శాలు
, పెద్దయ్యాక కుటుంబ సభ్యులతో సీన్లు, అతను గాయపడితే వాళ్ళ ఏడ్పులతో డ్రామా, జర్నలిస్టుతో అతడి ప్రేమ, ఇలా డిటెక్టివ్ జానర్ మర్యాదలకి పాత మూస సీన్లు అడ్డుపడుతూ కథ థ్రిల్లింగ్ గా సాగదు. యాక్షన్ తో గాకుండా డైలాగులతో కథ నడపడం ఎక్కువవడంతో ఫస్టాఫ్ నత్త నడక నడుస్తున్నట్టు వుంటుంది.
       
సెకండాఫ్ లోనే డిటెక్టివ్ కథ ప్రొఫెషనల్ గా సాగుతుంది. జరుగుతున్న హత్యలకి క్లూస్ సంపాదించడం
, అవి సీరియల్ కిల్లర్ కి దారితీయించే క్రమంలో ఒకొక్కటే ఇతర పాత్రలు సీరియల్ కిల్లర్ అన్నట్టుగా రివీలవడం, ఈ క్రమంలో ఈ వరస హత్యలకి పురాణంతో సంబంధముందని ఆధారాలు దొరకడంతో కథ మిస్టీరియస్ గా కొత్త మలుపు తిరుగడం... ఇలా సాగుతున్నాక, హంతకుడు శవాలకి తగిలిస్తున్న దిష్టిబొమ్మలు నిజానికి మహిషాసురుడి దిష్టి బొమ్మలని తెలియడంతో ఉత్కంఠ పెరుగుతుంది. ఇక దీంతో హంతకుడికేం సంబంధమనే ప్రశ్నతో చిట్టచివర్లో హంతకుడ్ని పట్టుకుంటే - అతను మొత్తం రివీల్ చేస్తాడు. అయితే పురాణకథని వాడుకోవడం బాగానే వున్నా, ముగింపు మూఢనమ్మకంగా ముగుస్తుంది. డిటెక్టివ్ క్యారక్టర్ ఆ హంతకుడి ఆలోచనలు మూఢనమ్మకమని ఖండించి వుంటే సరైన సందేశం వెళ్ళేది.

నటనలు –సాంకేతికాలు

దృష్టి లోపంతో చిన్నప్పుడే కళ్ళద్దాలు వచ్చిన హీరోకి ఆ అద్ధాలతో కలిపి భూతద్దం  భాస్కర్ నారాయణ పేరొచ్చింది. డిటెక్టివ్ కి అలంకారం భూతద్దమే కాబట్టి టైటిల్ కూడా ఇలా జస్టిఫై అయింది. గ్రామంలో ఈ డిటెక్టివ్ పాత్ర హాస్య పాత్రే అయినా హీరో శివ కందుకూరి నవ్వించే ప్రయత్నం చేయడు. ఆ పని అసిస్టెంట్ చేస్తాడు. మరొకటేమిటంటే,  డిటెక్టివ్ పాత్ర లుంగీ కట్టుకుని తిరగగడం. ఈ పాత్రకి యాక్షన్ తో కూడిన ఫన్నీ సీన్స్ వుండుంటే ఫస్టాఫ్ స్పీడుగా సాగేది. డిటెక్టివ్ కథంటే అద్భుత రసంతో చెప్పాల్సిన కథ అనీ జానర్ మర్యాద మర్చిపోతే ఎలా?
        
సెకండాఫ్ లో శివ కందుకూరి యాక్షన్ లో కొచ్చి పాత్రని పాక్షికంగా నిలబెడతాడు. ఎలాగంటే డిటెక్టివ్ గా అతడికి ఏ ప్రత్యేకతలుండవు. ఇలాటి పరిస్థితుల్లో ఒక సాధారణ యూత్ ఎలా ప్రవర్తిస్తాడో ఆ లెవెల్లో వుంటాడు. డిటెక్టివ్ అయినందుకు ఇంట్లో వ్యతిరేకతతో బాటు, చిన్నప్పుడు అన్న చావు ఆత్మహత్యకాదనీ, అది హత్య  అనీ నిరూపించలేకపోయిన అసమర్ధత, అతడి పర్సనాలిటీలో పట్టుదలని, అసాధారణ స్కిల్స్ నీ కల్పించి వుండాలి. అప్పుడే క్యారక్టర్ పోషించడానికి, అందులో రాణించ డానికీ వీలుంటుంది.
       
జర్నలిస్టు పాత్రలో రాశీ సింగ్ ది చిన్న పాత్ర. పోలీసు అధికారిగా దేవీ ప్రసాద్ ది క్లయిమాక్స్ ని మలుపు తిప్పే పెద్ద పాత్ర. ఈ పాత్రని సమర్ధవంతంగా పోషించాడు. షఫీ, శివ కుమార్, సురభి సంతోష్ తదితరులు సహాయ పాత్రల్లో కనిపిస్తారు.
        
శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం, గౌతమ్ జి ఛాయాగ్రహణం మరీ గొప్పగా ఏం లేవు. పరిమిత బడ్జెట్ కి తగ్గట్టున్నాయి. కొన్ని అవసరం లేని షాట్స్ బడ్జెట్ పెరగడానికే పనికొచ్చాయి. ఒక విషయం అడగడానికి హీరో బృందం ఇన్స్ పెక్టర్ ఇంటి దాకా రావడం, అడిగి వెళ్ళి పోవడం అనవసరం లేని సీను. ఫోన్లో అడిగితే సరిపోయేది. ఇక సెకండాఫ్ లో కాస్త కథ, మలుపులు తగ్గిస్తే సినిమా భారంగా వుండేది కాదు. ఈ థ్రిల్లర్ కి రెండు గంటల నిడివి చాలు. 
        
మొత్తానికి ఈ కొత్త ప్రయోగపు డిటెక్టివ్  సినిమా సెకండాఫే కథ అన్నట్టు  గాకుండా ఫస్టాఫ్ లో కూడా కాస్త బిగి వున్న కథతో -యూత్ అప్పీల్ తో ప్రొఫెషనల్ గా నడిపివుంటే ఎక్కువ రోజులు ఆడే అవకాశముంటుంది. డిటెక్టివ్ కథలో డిటెక్టివ్ కి కుటుంబ పాత్రలు, సెంటిమెంట్లు, డ్రామాలు ఫీల్ ని చెడగొడతాయి. డిటెక్టివ్ లకి, గూఢచారులకి కుటుంబాలు, కుటుంబ సమస్యలూ వుండవు. ప్రపంచ సమస్యలే  ఈ పాత్రల సమస్యలు!

—సికిందర్

1410 : రివ్యూ

 

రచన- దర్శకత్వం : రాంగోపాల్ వర్మ
తారాగణం :   అజ్మల్ అమీర్, వాసు ఇంటూరి, కోట జయరాం, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి పార్వతి, తదితరులు  
సంగీతం: బాలాజీ, ఛాయాగ్రహణం : సజీష్ రాజేంద్రన్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
విడుదల : మార్చి 2, 2024
***
        రాంగోపాల్ వర్మ రాజకీయ సినిమాల పరంపర కొనసాగుతోంది. వీటిని సినిమాలనేకంటే డాక్యుమెంటరీలనడం సబబు. రాజకీయ రంగంలో జరిగిన సంఘటనలని పేర్లు మార్చి నటులతో కలిపి చూపిస్తే, కొన్ని సెటైర్లువేస్తే సినిమా అయిపోతోంది. ఈ కోవలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ని తీసుకున్నాడు. ఇటీవల యాత్ర 2 పేరుతో జగన్మోహన్ రెడ్డి బయోపిక్ వచ్చింది. అది విఫలమైంది. ఇప్పుడు వ్యూహం పేరుతో మరొకటి. ఇదెలా వుందో చూద్దాం...

కథ

14 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం వీరశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడు. ఈ సంఘటనకి వెలుగు దేశం అధ్యకుడు ఇంద్రబాబు నాయుడు ఆనందిస్తాడు. జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడ ప్రయోజనం పొందాలో ఆలోచనలు చేస్తూంటాడు. అధికార భారత్ పార్టీకి చెందిన 150 మంది నాయకులు తదుపరి సీఎం గా వీఎస్సార్ కుమారుడు మదన్ మోహన్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తూ సంతకాలు చేస్తారు. దీంతో భారత్ పార్టీ అధ్యక్షురాలు మేడమ్ ఆగ్రహించి  కాశయ్యని సీఎంగా చేస్తుంది. దీంతో అసంతృప్తి చెందిన మదన్, భార్య మాలతి (మానస రాధాకృష్ణన్) ప్రోత్సాహంతో తండ్రి మృతికి తట్టుకోలేక చనిపోయిన మృతుల కుటుంబాల్ని పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతాడు. దీని మీద మేడమ్ మళ్ళీ అగ్రహిస్తుంది. మదన్ ఆగకుండా వేరేగా వీఎస్సార్ సీపీ పార్టీ పెడతాడు. ఇక మేడమ్ అవినీతి కేసులు మోపి జైల్లో వేస్తుంది.          

ఇలావుండగా సినిమా స్టార్ కిరణ్ జీవి ప్రారంభించిన మన రాజ్యం పార్టీని భారత్ పార్టీలో విలీనం చేస్తే తమ్ముడు శ్రవణ్ కళ్యాణ్ అడ్డం తిరుగుతాడు. ఇప్పుడు జైల్లో వున్న మదన్ ఏం చేశాడు? తండ్రి ఆశయాల్ని నెరవేర్చాలని తపిస్తున్న తనకి ఎదురవుతున్న అవాంతరాల్ని ఎలా దాటాడు? ఏ వ్యూహం రచించాడు? దీన్ని అడ్డుకుంటూ ఇంద్రబాబు నాయుడు పన్నిన ప్రతి వ్యూహాలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

2009 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి దగ్గర నుంచి, 2019 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకూ జరిగిన కొన్ని సంఘటనలని ఏకరువు పెట్టే కథ ఇది. పూర్తిగా జగన్ పక్షం వహిస్తూ ప్రత్యర్ధుల్ని జోకర్లుగా చూపించే ఎన్నికల ప్రచార సినిమా అనొచ్చు. యాత్ర 2 కథాకాలం కూడా ఇదే కాబట్టి అందులో చూపించిన సంఘటనలే ఇందులో వుంటాయి. ఓదార్పు యాత్రతో ప్రారంభమయ్యే జగన్ రాజకీయ ప్రయాణం పాద యాత్రతో ఎన్నికల్లో గెలిచి సీఎం అవడం వరకూ. అయితే యాత్ర 2 లో జగన్ పాత్రని తన లక్ష్యం కోసం సంఘర్షించే కథానాయక పాత్రగా సినిమాటిక్ గా చూపిస్తే, వ్యూహంలో అదేమీ లేకుండా ప్రత్యర్ధుల్ని జోకర్లుగా మార్చి, సెటైర్లు వేయడానికే చూపించడంతో, బలహీన సినిమాగా మారింది. ప్రత్యర్ధుల్ని బలంగా చూపిస్తేనే కదా కథానాయకుడికి సంఘర్షణ వుంటుంది. ఈ సంఘర్షణ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనల్ని పేర్చుకుంటూ పోవడంతో కథలా కాకుండా డాక్యుమెంటరీలా తయారయ్యింది.
       
వై ఎస్ బగన్
, భారతి, విజయలక్ష్మి, షర్మిల, అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు, లోకేష్, కన్నా లక్ష్మీనారాయణ, కె. రోశయ్య, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ పాత్రలన్నీ పేర్లు మార్చి వుంటాయి. ఐతే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన వుండవు. ఇలాటి కీలక పరిణామాల్ని దాటవేస్తూ జంప్ చేస్తూంటుంది డాక్యుమెంటరీ. చంద్రబాబు సీఎం అయితే వేర్పడిన ఆంధ్రప్రదేశ్ సీఎం అని తెలియదు.
        
ఇక వై ఎస్ మదన్, వీఎస్సార్ సీపీ పార్టీ అని చెప్తూనే దృశ్యాల్లో జగన్ పేర, వైఎస్సార్ సీపీ పార్టీ పేర జెండాలు కనిపిస్తూంటాయి. ఒక పాట కూడా జగన్ ని కీర్తిస్తూ వుంటుంది. పాత్ర చూస్తే మదన్, పాటలు బ్యానర్లు చూస్తే జగన్. పాటలు బ్యానర్లు సరే, మరి ఈ మదన్ ఎవరు? – అని అడిగితే ఎన్నికల ప్రచార సినిమా కేం చెబుతారో తెలీదు.ఒక పద్ధతి లేకుండా రాంగోపాల్ వర్మ తీసిన తన పద్ధతి సినిమా వ్యూహం’.

నటనలు –సాంకేతికాలు

దాదాపు నటులందరూ అచ్చం నిజజీవిత పాత్రలకి తగ్గట్టే వుండేలా వెతికి పట్టుకోవడం వర్మ సాధించిన గొప్పదనం. జగన్ లాంటి అజ్మల్ అమీర్, చంద్రబాబులాంటి ధనంజయ్ ప్రభునే, భారతి లాంటి మానస రాధాకృష్ణన్...ఇలా అందరూ పోలికలు కుదిరి, అనుకరణలు కుదిరి దృశ్యాల్ని ఆసక్తికరంగా మారుస్తారు. లోకేష్ నటుడెవరో కనిపించడు. తిండిపోతుగా తింటున్న చేతులు మాత్రమే కనిపిస్తూంటాయి. తిండి గురించి చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తూంటాయి.
       
ఇంద్రబాబు నాయుడుని తోటి నాయకులే మెత్తగా దెప్పి పొడవడం
, ముఖ్యంగా అవసరానికి ఎవరి కాళ్ళయినా పట్టుకునే దిగజారుడు మనిషిగా చెప్పడం వుంటాయి.  ఇంద్రబాబు శ్రవణ్ కళ్యాణ్ ని అవసరానికి వాడుకుని, ఎన్నికల్లో ఓడించి మూలన కూర్చోబెట్టడం, రెండు లక్షల పుస్తకాలు చదివాననే చేగువేరా అరాధకుడు శ్రవణ్ కళ్యాణ్  పరమ జోకర్ లా బిహేవ్ చేయడం, అన్న కిరణ్ జీవి కూడా తెలివి తక్కువ రాజాకీయాలు మాట్లాడడంగా ఈ పాత్రలుంటాయి.
       
ఇన్నేసి పాత్రలున్నా సినిమా పేలవంగా వుంటుంది డాక్యుమెంటరీలా తీశారు కాబట్టి. ఇదే సినిమా కోడిరామకృష్ణ గనుక తీసి వుంటే ఒక ఊపు వూపేది. రాజకీయ సినిమాలు తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. బ్యాక్ గ్రౌండ్ రాజకీయ పాటలు కూడా వాటి దారిన అవి వచ్చి పోతూంటాయి- సన్నివేశాల్లో బలం వుండదు కాబట్టి. ఓదార్పు యాత్ర
, పాద యాత్ర,  మదన్ అరెస్టప్పుడు అడ్డుకునే కార్యకర్తల క్రౌడ్ దృశ్యాలు మాత్రం హెవీగా వుంటాయి.
       
ఇంతకీ మదన్ రాజకీయ భావజాలమేమిటి
? మేనిఫెస్టో చూసి, ఇందులో సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి, అభివృద్ధి గురించి ఏది?- అంటుంది మాలతి. భవనాలూ రోడ్లతో మెరిసి పోయే అభివృద్ధికన్నా, సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధికి పాటుపడడమే నిజమైన అభివృద్ది- అంటాడు మదన్.
       
అయితే ఇది బలమైన ఎన్నికల ప్రచార సినిమా అవ్వాలంటే మొదట్నుంచీ సింగిల్ ఎజెండాతో మదన్ తన ఐడియాలజీ కోసం సంఘర్షించే బలమైన పాత్రగా చూపించుకు రావాలే తప్ప
, చివర్లో సంక్షేమం- అభివృద్ధి గురించి ఓ మాట అనేస్తే సరిపోదు సినిమాకి.
—సికిందర్