రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, ఏప్రిల్ 2023, శుక్రవారం

1319 : రివ్యూ

 

అయోతి  (తమిళం)
రచన- దర్శకత్వం : ఆర్. మంధిర మూర్తి
తారాగణం : శశి కుమార్, ప్రీతీ అస్రానీ, మాస్టర్ అద్వైత్, యశ్పాల్ శర్మ, అంజూ అస్రానీ, పాండీ తదితరులు
సంగీతం : ఎన్ ఆర్ రఘునందన్, ఛాయాగ్రహణం : మాధేష్ మాణిక్కం
బ్యానర్ : ట్రైడెంట్ ఆర్ట్స్
నిర్మాత : ఆర్ రవీంద్రన్
విడుదల :  ఏప్రెల్ 7, 2023, జీ 5
***
            మిళ సినిమా ఒక్కోసారి దాని సహజ రంగు దాచి పెట్టుకుని దర్శనమిస్తూంటుంది. రంగు చూస్తే రంగేళీ, హంగు చూస్తే కంగాళీ అన్నట్టు అరవ సినిమాలొస్తూంటాయి. అరవ సినిమాలకి కాస్త భిన్నంగా యూనివర్సల్ సినిమా అన్నట్టుగా తమిళ సినిమాలొస్తూంటాయి. వీటి కంటెంట్ గానీ, మేకింగ్ గానీ ప్రాంతీయ సరిహద్దుల్ని చెరిపేసే ప్రమాణాలతో వుంటాయి. అరవ సినిమాలు మూసలో పడి అక్కడే వుంటాయి. తమిళ సినిమాని నిలబెట్టుకునే కొత్త మేకర్లు కూడా అరుదుగా వుంటారు. ఆ అరుదైన కొత్త మేకర్లలో ఇవాళ ప్రశంసలు పొందుతున్న వాడు ఆర్ మంధిర మూర్తి.

        ప్రశంసలు దేనికంటే, అయోతి అనే మళ్ళీ తనే తీయలేడేమో అనేంత ఆశ్చర్య జనకంగా సినిమా తీసినందుకు. హీరో శశి కుమార్ తో హీరోయిజానికే హీరోయిజాన్ని నేర్పే నేర్పుతో ఆలోచనాత్మకంగా తీశాడు. ఆలోచనాత్మక విషయంతో సినిమాలు రావడం వేరు. ఆ విషయాన్ని చెప్పే విధం కూడా ఆలోచనలో పడేసే అయోతి లాంటి సినిమా వేరు.  విషయాన్ని చెప్పడంలో అమల్లో వున్న అన్ని పద్ధతుల్నీ తీసి పక్కనబెట్టి, తన పద్ధతిని విప్లవాత్మకంగా ముందుంచుతున్న కొత్త దర్శకుడి క్రియేటివ్ వైకల్పమేమిటో ఇక చూద్దాం...

కథ

అయోధ్య కి చెందిన బలరాం (యశ్పాల్ శర్మ) రామభక్తుడు. మతవాది. మహా కోపిష్టి. ఎవరి మాటా వినడు. మగ దురహంకారంతో భార్య జానకి (అంజూ అస్రానీ) తో క్రూరంగా ప్రవర్తిస్తాడు. పిల్లలు అతడ్ని చూసి వణికి పోతారు. కాలేజీకి వెళ్ళే టీనేజీ కూతురు శివానీ (ప్రీతీ అస్రానీ), స్కూలు కెళ్ళే కొడుకు సోనూ (మాస్టర్ అద్వైత్ ) ఇంట్లో తండ్రి లేనప్పుడు స్వేచ్ఛని అనుభవిస్తారు. తండ్రి కనపడగానే బిక్కచచ్చిపోతారు. ఇలాటి బలరాం కుటుంబంతో రామేశ్వరం తీర్థయాత్ర పెట్టుకుంటాడు. దురై చేరుకుని, అక్కడ్నించి టాక్సీలో వెళ్తారు. అసలే కోపిష్టి, పైగా గుట్కా తినే అలవాటు. గుట్కాతో టాక్సీని పాడు చేస్తూంటే డ్రైవర్ అభ్యంతరం చెప్తాడు. దీంతో పిచ్చి రేగిపోయిన బలరాం టాక్సీని స్పీడుగా తోలమని వేధిస్తాడు. తెల్లారేలోగా రామేశ్వరం చేరుకోవాలంటాడు. స్పీడు పెంచడానికి డ్రైవర్ ఒప్పుకోకపోవడంతో కొడతాడు. ఇద్దరూ మీద పడి కొట్టుకోవడంతో టాక్సీ అదుపు తప్పి యాక్సిడెంట్ పాలవుతుంది.

యాక్సిడెంట్లో తలకి తీవ్రగాయమైన జానకిని హాస్పిటల్ కి చేరుస్తారు. గాయపడ్డ డ్రైవర్, స్నేహితుడైన శశికుమార్ కి చెప్పడంతో, శశి కుమార్ అత్యవసరంగా వేరే హాస్పిటల్ కి తీసికెళ్ళాల్సిన జానకిని అంబులెన్స్ లో తీసుకుని బయల్దేరతాడు. మార్గ మధ్యంలో ఆమె చనిపోతుంది.
        
ఇప్పుడేం చేయాలి? భాష తెలియని ప్రాంతంలో మృత దేహంతో ఏకాకిగా మిగిలిన కుటుంబాన్నేం చేయాలి? ఎట్టి పరిస్థితిలో ఈ హిందీ కుటుంబానికి సాయపడాలని నిర్ణయించుకున్న తమిళ శశికుమార్, అయోధ్యకి మృత దేహం తరలింపుకి సంబంధించి ఎలాటి చట్టపరమైన అవాంతరాల్ని ఎదుర్కొన్నాడు? సాంప్రదాయం పేరుతో అడుగడుగునా అడ్డు తగులుతున్న బలరాంతో ఏ ఇబ్బందులు పడ్డాడు? దీనంగా మిగిలిన పిల్లల మొహాలు చూసి పట్టు వదలకుండా ఆ కుటుంబాన్ని ఎలా కష్టంలోంచి బైట పడేశాడు?   ఇదీ మిగతా కదిలించే కథ.

ఎలావుంది కథ

ఇది తమిళనాడులో నిజంగా జరిగిన కథ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తరాది వలస కూలీల మీద తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని అబద్ధపు ప్రచారం సాగించిన శక్తులకి చెంప పెట్టు లాంటి కథ. అయోధ్యలో నివసిస్తున్న ఉత్తరాది బ్రాహ్మణ కుటుంబాన్ని, తమిళనాడులోని రామేశ్వరం, మదురైలో నివసిస్తున్న తమిళుల్ని ఒకచోట చేర్చి, మానవత్వం మీద బలమైన విశ్వాసాన్ని కలిగించే - రచయిత ఎస్. రామకృష్ణన్ రాసిన కథ ఆధారంగా - తన తొలి సినిమా ప్రయత్నంగా దీన్ని అందించాడు కొత్త దర్శకుడు మంధిర మూర్తి.
        
ఒక మరణం ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తుంది. మనుషుల్లో, మానవ సంబంధాల్లో మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. అయితే మరణంతోనే ఈ మార్పులు జరగాలని కాకుండా ముందే మేల్కొంటే మరణమనే నష్టమే జరగదు. ఇది ఈ కథ చెప్పే ఒక వాస్తవమైతే, రెండో వాస్తవం- మతం కేవలం ఒక ఆచారం. ఇంకే అర్ధాలు కల్పించినా అది రాజకీయం. రేపటి భవిష్యత్తుకి ఆశాకిరణం (అయోతి) గా మతాన్ని చూడకపోయినా రాజకీయమే. రాజకీయంతో అవసరాలు తీరతాయా?
        
పై రెండు అంశాల్ని కలగలిపిన ఒక బలమైన భావోద్వేగభరిత కథగా ఇది తెరకెక్కింది. ఇందులో ముగింపులో తెలిసే అసలు విషయం కొసమెరుపుగా కథని ఆకాశానికెత్తేస్తుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే ఈ ముగింపులో చిన్న డైలాగు ఇంకో ఎత్తు. క్లుప్తంగా, మృదువుగా పలికే ఈ రెండు పదాల డైలాగు సినిమాని ఎక్కడికో తీసికెళ్ళిపోతుంది ఎమోషనల్ హై తో. ఇంతవరకూ కథలో తెలియని కోణం అమాంతం బయటపడి నిశ్చేష్టుల్ని చేస్తుంది. ఇందుకే ఇది రెగ్యులర్ అరవ సినిమా కాలేదు, అరుదైన తమిళ సినిమా అయింది.

నటనలు - సాంకేతికాలు

శశికుమార్ ది రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్ర కాదు. వూర మాస్ అరవ హీరోయిజాల తమిళ ప్రేక్షకులకి ఇదొక షాక్. అయితే ప్రారంభంలో సముద్ర తీరంలో సన్నాసుల్ని ఉతికే మాస్ ఎంట్రీ సీను పాత్రకి అవసరం లేకపోయినా దర్శకుడికి ఎత్తుగడగా తప్పనట్టుంది. ఇది తప్పితే శశికుమార్ సగటు మనిషి పాత్ర సహజత్వంతో ఎక్కడా రాజీపడదు. అతనెక్కడా నవ్వడు, పైగా ఒకే ఎక్స్ ప్రెషన్ తో వుంటాడు. మౌనంగా వుంటాడు. సన్నివేశం సహజ బలాన్ని ఉత్పత్తి చేస్తే నటుడికి భావ ప్రకటనతో పనుండదు. సన్నివేశాల్లో శశికుమార్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకపోయినా, అతడి మౌనంతో మైండ్ ని చదవగలం. ఈ సబ్ టెక్స్ట్ (ఉపవచనం) గురుదత్ ప్యాసా లోని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ టైపు కథనం వల్ల వస్తుంది.
        
ఎదుటి పాత్రలు వాటి ఆక్రోశాలతో ఎంత ప్రకోపితులైనా సరే, శశి కుమార్ సాక్షిలా వుంటాడు తప్పితే ఆ ఎమోషనల్ తూఫానులో తానూ సుడిగుండమై పోడు. సాక్షిలా గమనిస్తూ తగిన నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రత్యేకతే ఇతర పాత్రల్నుంచి అతడ్ని వేరు చేసి దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది. ఈ యాక్టివ్ పాత్ర హీరోయిజం విజువల్ గా, ఆబ్జెక్టివ్ గా  వుండకుండా, కనపడని సబ్జెక్టివ్ గా వుంటుంది.
        
కూతురి పాత్రలో ప్రీతీ అస్రానీ నటన బలమైన ముద్ర. యువ నటీమణుల్లో కావాల్సినంత సామర్ధ్యముంది. లపాకీ సినిమాల్లో వాళ్ళని టపాకీ పాత్రలకి పరిమితం చేయడంతో టాలెంట్ ని ప్రదర్శించుకోలేని స్థితిలో వుండిపోతున్నారు. తండ్రితో వేధింపులకి గురవుతూ అణిగిమణిగి వున్న కూతురు తను. ఇక మెడికల్ కాలేజీలో తల్లి శవపేటిక ముందు తండ్రి మీద తిరగబడి కళ్ళు తెరిపించే - లావాలా బ్రద్ధలయ్యే సీనుని హేండిల్ చేసిన విధం ఆమెకే సాధ్యమవుతుంది.  సినిమా మొత్తంలో సుడిగాలిలా కమ్మేసే సీను ఇదొకటే. తమ్ముడికి తనే దిక్కుగా మిగిలిన పరిస్థితి సహా సానుభూతి పొందే నటనకి గీటు రాయిలా నిల్చింది. శశి కుమార్ తర్వాత ప్రధాన ఆకర్షణ ఈమె నటనే. తమ్ముడుగా మాస్టర్ అద్వైత్ దైన్యంతో కూడిన మొహం ఒక వెంటాడే దృశ్యం.      
        
తల్లిగా అంజూ అస్రానీ భర్త పెట్టే బాధల్ని దాచుకుని ఓదార్పు చూపే సాత్విక పాత్రలో కన్పిస్తుంది. గుట్కా తినే తండ్రి బలరాం గా బాలీవుడ్ నటుడు యశ్పాల్ శర్మ వొంటి మీద రామభక్తి, ఇంట్లో రావణ కుయుక్తి పాత్రని బలంగా పోషించాడు. అయోధ్యలో అతడి వుండకూడని రావణ కుయుక్తి, రామేశ్వరంలో కూతురి చేతిలో హుళక్కి అయ్యే సన్నివేశంలో పురుగులా మిగిలి తెగ జాలిని పొందుతాడు. రామేశ్వరం వెళ్తే శని వదిలినట్టయింది. . 
        
భార్య మృతదేహంతో ప్రతీచోటా సాంప్రదాయం పేరుతో అడ్డుపడతాడు. పోస్ట్ మార్టం తో, పోలీస్ ప్రొసీజర్ తో, అవయవ దానంతో, ఏర్ పోర్టు రూల్స్ తో ప్రతీచోటా న్యూసెన్స్ చేస్తాడు. అవయవ దానమనేసరికి- నీయమ్మ ఏంట్రా -  గుండె తీసేసి, కళ్ళు తీసేసి, కిడ్నీలు కూడా తీసేసి స్వర్గాని కెలా పంపుతారురా? ఆమె ఆత్మ ఎలా శాంతిస్తుంది రా? - అంటూ కేకలేస్తాడు. శశికుమార్ మౌనం గా వుంటాడు.
        
శశి కుమార్ నేస్తంగా పాండీది కూడా కీలకపాత్రే.  విమాన టిక్కెట్ల కోసం బైక్ ని  అమ్మేసే శశికుమార్ ఇంకో స్నేహితుడు, ఉచితంగా శవపేటికని తయారు చేసిచ్చే ఇంకో పాత్ర, పోస్టుమార్టం విషయంలో పోలీసుల సహాయగుణం, మెడికల్ కాలేజీ సిబ్బంది ఔదార్యం, చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు లేకపోతే రూల్స్ లో లూప్ హోల్స్ ఏమున్నాయా అని వెతికే ఏర్ పోర్టు అధికారీ పాత్రలు కూడా ఆకట్టుకునే విధంగా వుంటాయి.
        
రెండు పాటలున్నాయి- పోలీస్ స్టేషన్లో దొంగలతో పోలీసులు పాడించే పాట (ఇది కావాలని రిలీఫ్ కోసం పెట్టినట్టుంది). ఈ పాటలో శశికుమార్, పాండీ బయట కూర్చుని వుంటారు. అరవ సినిమా అయితే దొంగలతో ఆడి పాడతారు. రెండో పాట సెకండాఫ్ లో మాంటేజ్ సాంగ్. ఈ సాంగ్ లో యశ్పాల్ శర్మ పాత్ర ఇంటి దగ్గర క్రూరత్వాలు బయట పడతాయి. అతడి పాత్ర నేపథ్యం ఇక్కడ వెల్లడవుతుంది.  
        
కెమెరా వర్క్, ఎడిటింగ్ నాణ్యంగా వున్నాయి.  కెమెరా వర్క్ లో అయోధ్యా, మదురై, రామేశ్వరం దృశ్యాలు, పాత్రల భావోద్వేగాల విజువల్స్ జ్ఞాపకముండి పోతాయి. కేవలం మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే - ఒక రోజులో పూర్తయ్యే స్వల్ప కథకి, ఎమోషన్లని తోడే ఎక్కువ సందర్భాలకి తావుండదు. అటువంటప్పుడు డల్ అయిపోతూంటుంది రన్. అందుకని చనిపోయిన తల్లిని చూసి ఏడ్చే పిల్లల విజువల్స్ ని- కథనం డల్ అయ్యే అవకాశమున్న రెండు మూడు చోట్లా రిపీట్ చేస్తూ ఎమోషనల్ హైని, కంటిన్యూటీనీ సాధించినట్టున్నాడు ఎడిటర్. ఇది అరవ సినిమా ఓవర్ మేలో డ్రామా అన్పించ వచ్చుగానీ, రన్ ని కాపాడ్డానికి చేసిన ఎడిటింగ్ కళ కూడా కావొచ్చు.

చివరికేమిటి

ఈ మధ్య వస్తున్న సస్పెన్స్ సినిమాల్ని మధ్య మధ్యలో నిద్ర మేల్కొని చూడాల్సి వస్తున్న క్రాఫ్టు చచ్చిపోయిన రోజుల్లో- సోషల్ జానర్ స్వల్ప కథ అయిన అయోతి లో, దృష్టి మరల్చలేని రెండు గంటల పకడ్బందీ కథనం చేయడంలో అనుసరించిన విధానం చూస్తే- కృత్రిమ ఫార్ములాలకి భిన్నంగా, ఆర్గానిక్ గా సహజ భావోద్వేగాల సృష్టే స్పష్టమవుతుంది. కదిలించే సన్నివేశాల పరంపరే ఈ స్వల్పకథకి బలం. పూర్తి విషాదంతో కూడిన సినిమా ఈ రోజుల్లో రిస్కే అయినా, ఆ విషాదం కథ లోతుల్లోంచి నిజంగా కదిలించే విషాదమైతే టీనేజర్ కూడా అతుక్కుపోయి చూస్తాడని ఇందువల్ల తెలుస్తోంది.
       
టీనేజర్స్ కి ప్రీతీ అస్రానీ టీనేజి పాత్ర
, పిల్లలకి మాస్టర్ అద్వైత్ బాల పాత్ర, జనరల్ యూత్ కి హీరో శశికుమార్ పాత్ర, గృహిణులకి అంజూ అస్రానీ తల్లి పాత్ర, పెద్దలకి యశ్పాల్ శర్మ పాత్రా ముట్టడించి అన్ని ఏజి గ్రూపులకి విజువల్ అప్పీల్ ని ఎడతెరిపి లేకుండా పంచుతోంటే, విషాదంతో నిండిన రెండు గంటల ఈ స్వల్ప కథ తేలిపోయే అవకాశం లేదు.
       
ప్రేక్షకుల్ని ప్లీజ్ చేయడానికి  రోమాన్స్ లేదు
, కామెడీల్లేవు, టైమ్ పాస్ పాటల్లేవు, ఎలాటి కమర్షియల్ హంగులూ లేవు. అసలు సాధారణంగా అనుకునే హీరోయిజమే లేదు. సబ్ ఫ్లాట్స్ లేవు. ఎక్కువ పాత్రల్లేవు. కేవలం మరణమనే విషాదంతో, మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే ఒకే లైనుతో, దాని చుట్టూ సంఘర్షణతో మాత్రమే ఈ స్వల్ప కథ వుంది.
       
ఈ సంఘర్షణలో సాధారణంగా హీరోకి వుండే ప్రత్యర్ధి లేడు. పరిస్థితులే వివిధ అడ్డంకులుగా వుంటాయి. మృత దేహం తరలింపు కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి చేయాల్సిన పనులకి సంబంధించి. స్క్రీన్ ప్లేలో 25 వ నిమిషంలో యశ్పాల్ శర్మ - టాక్సీ డ్రైవర్ కొట్లాడుకుని జరిగే యాక్సిడెంట్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇదే కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ లో హీరో శశి కుమార్ వుండడు. అమల్లో వున్న నియమాల ప్రకారమైతే టాక్సీ డ్రైవర్ గా శశికుమారే వుంటాడు. కాన్ఫ్లిక్ట్ లో అతనుండాలి కాబట్టి. కానీ ఈ నియమాన్ని పాటించలేదు కొత్త దర్శకుడు. అయినా కథ గానీ
, పాత్ర గానీ దెబ్బ తినలేదు. ఇదొకటి గమనించాల్సిన విషయం.
       
ఫస్ట్ యాక్ట్ అయోధ్యలో 10 వ నిమిషంలో యశ్పాల్ శర్మ రామేశ్వరం ప్రయాణం గురించి కుటుంబానికి చెప్పాక
, రామేశ్వరం సముద్ర తీరంలో సన్నాసులతో పైటింగ్ తో ఎంట్రీ సీను వేసుకుని వెళ్ళిపోతాడు హీరో శశికుమార్. ప్లాట్ పాయింట్ వన్ లో మదురై సమీపంలో యాక్సిడెంట్ తర్వాత, టాక్సీ డ్రైవర్ ఫోన్ చేయడంతో, అంబులెన్స్ డ్రైవర్ గా శశికుమార్ కాన్ఫ్లిక్ట్ లోకి - సెకండ్ యాక్ట్ లో ఎంటరవుతాడు. ఇది గమనించాలి.
       
ఇక్కడ్నుంచి మృతదేహాన్ని అయోధ్యకి తరలించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకదాని తర్వాతొకటి కాన్ఫ్లిక్టుల వరస మొదలవుతుంది. ఆ రోజు దీపావళి పండుగ సెలవు కాబట్టి ఈ పరిస్థితి. కథనంలో ఐరనీ ఏమిటంటే
, ఒక  వైపు మృతదేహంతో పాట్లు, మరో వైపు తెల్లారినప్పట్నించే వీధుల్లో టపాకాయలతో పండుగ సందడి. అయితే ఎవరైనా శుభమా అని దీపావళి పండుగ రోజు ఇల్లు వదిలి తీర్ధ యాత్ర పెట్టుకుంటారా అన్నది ప్రశ్న.  పెట్టుకుంటారేమో అదేమంత పెద్ద విషయం కాదనుకుంటే, అఖండ సాంప్రదాయ వాదియైన బలరాం (యశ్పల్ పాత్ర) లాంటి వాడు పెట్టుకుంటాడా అన్న పాత్ర చిత్రణకి సంబంధించిన ప్రశ్న తలెత్తుతూనే వుంటుంది. పండుగ సెలవుతో అవాంతరాల కోసమే కొత్త దర్శకుడు పాత్రచిత్రణని బలిపెట్టి వుండాలి.
       
రెండోది యశ్పాల్ దగ్గర డబ్బుల్లేకపోవడం. పేదవాడైన శశికుమార్ పర్సులో వున్న రెండు మూడొందలు ఖర్చు పెట్టేసి ఇబ్బంది పడడం. ఎక్కడో పర రాష్ట్రానికి ప్రయాణం పెట్టుకున్న యశ్పాల్ దగ్గర టాక్సీ ఫేర్ కి మించి డబ్బులే వుండవా
? అయోధ్యలో మిత్రుడికి ఫోన్ చేస్తే, విమాన టికెట్లు నేను చూసుకుంటాను, దిగులు పడొద్దంటాడు మిత్రుడు. ఈ లోపాలు కూడా గమనించాలి.
       
ప్రీతీ అస్రానీ తల్లికి రామేశ్వరంలో కట్టుకోవడానికి సెలెక్టు చేసే చీర
, తమ్ముడు హుండీలో డబ్బు దాచుకునే చర్యా- ఈ రెండూ తర్వాత ప్లాట్ డివైసుల రూపంలో అవసరంలో అనూహ్యంగా తెరపైకొచ్చి థ్రిల్ చేస్తాయి. స్వల్ప కథ సింగిల్ లైను కుంగ కుండా ఇలాటి క్రియేటివ్ ఎలిమెంట్స్ ప్రయోగం కూడా తోడ్పడింది.
       
భాషల విషయంలో రాజీ పడలేదు కొత్త దర్శకుడు.
హిందీ మాట్లాడే పాత్రలు హిందీయే మాట్లాడడం, తమిళం మాట్లాడే పాత్రలు తమిళమే మాట్లాడడం చేస్తాయి. ఎవరి మాతృభాషలో ఆ పాత్రలు మాట్లాడ్డం వల్ల సహజత్వమే కాకుండా, ఎదుటి పాత్ర భాష అర్దంకాని టెన్షన్, భావోద్వేగాలు కూడా ఏర్పడుతూ కథనం బలీయమవుతూ పోవడానికి తోడ్పడింది.
       
ప్రత్యర్ధి లేని కథనంలో కథనం చప్పబడకుండా వివిధ ప్రభుత్వ లాంచనాల సమస్యలే టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫుని పెంచుతూపోయే క్రమం కన్పిస్తుంది. ప్రభుత్వ లాంచనాలకి సంబంధించి కొత్త దర్శకుడు మంచి రీసెర్చి చేసినట్టు కన్పిస్తుంది. సన్నివేశాల్లో బలీయమైన హ్యూమన్ డ్రామా సృష్టి వల్ల డాక్యుమెంటరీ అయ్యే ప్రమాదం కూడా తొలగిపోయింది. పౌరుల
జీవితాల భద్రత కోసం రూపొందించిన ప్రభుత్వ నిబంధనల మధ్య చిక్కుకున్న సామాన్య ప్రజల వేదనని, వాటిని పాటించడంలో వున్న ఆచరణాత్మక సమస్యల్ని, ఓ పరాయి పట్టణంలో చిక్కుకుపోయిన దిక్కులేని కుటుంబాన్ని ప్రతీకగా చేసి చూపించాడు కొత్తదర్శకుడు. పోలీసు రిపోర్టులో పేరులో స్పెల్లింగ్ తప్పులు చూసి ఏర్ పోర్టు అధికారి అనుమతి నిరాకరించే లాంటి బ్రిటీష్ కాలం నాటి ఆఫీసర్ల బాబు డమ్ ఇంకా వేళ్ళూ నుకోవడం ఒక విచారకర స్థితి.

'
అయోతీ
ని వైవిధ్యం కోసం ప్రయత్నించే మేకర్లు రిఫరెన్సుగా వుంచుకోవచ్చు. కథ చెప్పడంలో అమల్లో వున్న సాంప్రదాయాల్ని కాసేపు పక్కన బెట్టి, ఒక క్రియేటివ్ వైకల్పం చూపిస్తున్న కొత్త దర్శకుడు మంధిర మూర్తి మలి ప్రయత్నమెలా వుంటుందో ఇక చూడాలి.

—సికిందర్

 

11, ఏప్రిల్ 2023, మంగళవారం

1318 : మూవీ నోట్స్

 


టాలీవుడ్ (బెంగాలీ సినిమా పరిశ్రమ) లో ప్రోస్థెటిక్స్ మేకప్ ఆర్టిస్టు విన్సీ డాఇతను జగత్ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ వీరాభిమాని. డా విన్సీ పేరుని తిరగేసి తన పేరుగా పెట్టుకున్నాడు. ఇతను పరమ నీచంగా మారిన తన జీవిత కథ చెప్పుకొస్తూంటాడు. ఈ కథలో ఆది బోస్ అనే 18 ఏళ్ళ వాడు తల్లిని వేధించే తాగుబోతు తండ్రిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేస్తాడు. పోలీసులకి లొంగిపోతాడు. కోర్టు పిచ్చాసుపత్రికి పంపిస్తుంది. ఇలా వుండగా, టాలీవుడ్ లో మేకప్ ఆర్టిస్టు అయిన విన్సీ డా తండ్రి చనిపోవడంతో, అతడి కొడుకుగా టాలీవుడ్ లో మేకప్ ఆర్టిస్టు అవకాశాలు పొందడానికి స్ట్రగుల్ చేస్తూంటాడు. డావిన్సీ కళనే నమ్మిన తను, ఆ కళా ప్రక్రియతో రాణించే పరిస్థితుల్లేక తీవ్ర నిరాశతో వుంటాడు. ఇలా వుంటూనే జయ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.

ప్పుడు  ఆది బోస్ పెద్దవాడై జైలు నుంచి విడుదలవుతాడు. ఇతను తనని తాను సీరియల్ లాయర్ గా భావించుకుంటాడు. అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఒక దుర్మార్గమైన పథకాన్ని ఆలోచించుకుంటాడు. జైల్లో మానసిక చికిత్స అతడి క్రూర సైకో మనస్తత్వాన్ని ఏ మాత్రం రూపు మాపలేదు. ఆ పథకంతో సినిమా దర్శకుడుగా నటిస్తూ విన్సీ డా ని కలుస్తాడు. తనకి కొన్ని వందల కోట్లు బ్యాంకు స్కామ్ చేసిన శ్యామ్ సుందర్ అనే బిజినెస్ మాన్ రూపంతో మాస్కు కావాలంటాడు. ఆర్ధిక సమస్యల్లో వున్న విన్సీ డా ఈ పనికి ఒప్పుకుని మాస్క్ తయారు చేసి ఇస్తాడు. ఆది బోస్ ఆ మాస్క్ వేసుకుని బ్యాంకుని దోచుకుని, సెక్యూరిటీ గార్డ్ ని చంపేసి పారిపోతాడు. దీంతో బ్యాంకు స్కామ్ కేసులో తప్పించుకున్న బిజినెస్ మాన్ శ్యామ్ సుందర్, ఇప్పుడు బ్యాంకు దోపిడీ ప్లస్ హత్య కేసులో అరెస్టయి పోతాడు.

ఇది తెలుసుకున్న విన్సీ డా షాకవుతాడు. ఆది బోస్ తనని మోసం చేశాడని అర్ధమవుతుంది. ఇందులో అమాయకుడైన సెక్యూరిటీ గార్డుప్రాణాలు  కోల్పోవడమే కలచివేస్తుంది. తను ఆరాధించే ప్రోస్థెటిక్స్ కళ ఇలా నేరానికి ఉపయోగపడిందన్న భయంకర సత్యం నిద్రపోనివ్వదు. ఈ పరిస్థితుల్లో ఇక వీన్సీ డా మరిన్ని మాస్కులు తయారు చేయడని గ్రహించిన ఆది బోస్, విన్సీ డా మొదటి మాస్కు తయారు చేసినప్పుడు తీసిన వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తాడు.

దీంతో అరెస్టు భయంతో బ్లాక్ మెయిల్ కి లొంగిన విన్సీ డా
, రెండో మాస్కు తయారు చేసి ఇస్తాడు. ఈసారి ఒక రాజకీయ నాయకుడి కొడుకు మాస్కు. ఈ కొడుకు నిర్లక్ష్యంగా కారు నడిపి కొందర్ని చంపేసిన కేసు నుంచి బయటపడ్డాడు. ఇతడి మాస్కు వేసుకున్న ఆది బోస్, ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద కారు తోలి చంపేస్తాడు. దీంతో అప్పుడు అంత మందిని చంపి తప్పించుకున్న రాజకీయ నాయకుడి కొడుకు, ఇప్పుడు తప్పించుకోలేని విధంగా ఇరుక్కుంటాడు.

ఆ చనిపోయిన వాళ్ళల్లో ఒకడి కొడుకు విన్సీ డా ని కలుసుకోవడంతో విన్సీ డాకి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇంకా ఈ నేరాల్లో ఆది బోస్ కి భాగస్థుడ్ని కాలేనని ఎదురు తిరుగుతాడు. ఆది బోస్ విన్పించుకోకుండా, చివరి మాస్కు ఒక రేపిస్టుది తయారు చేయమంటాడు. ఆ మాస్కు వేసుకుని రోడ్డు మీద పోతున్న ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు. ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాడు. ఇది వరకు రేప్ కేసులో విడుదలై పోయిన రేపిస్టు ఈసారి బయటపడలేని విధంగా ఇరుక్కుంటాడు. అయితే ఆ వీడియో చూసిన విన్సీ డా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆది బోస్ రేప్ చేసింది ఎవర్నో కాదు,  తన గర్ల్ ఫ్రెండ్ జయనే! ఆమె ఆత్మహత్య చేసుకోబోతూంటే కాపాడుకుంటాడు.

ఇక ఆది బోస్ మీద పగబట్టి అతడి మీద విష ప్రయోగం చేస్తాడు విన్సీ డా. ఆది బోస్ మాస్కు వేసుకుని ఆది బోస్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా నమ్మిస్తూ వీడియో తీస్తాడు. ఈ వీడియో చూసిన పోలీస్ ఇన్స్ పెక్టర్, వీడియోలో ఆది బోస్ గొంతు తేడాగా వుందని ఇన్వెస్టిగేట్ చేసి విన్సీ డా ని పట్టుకోబోతే, వృద్ధులుగా మారువేషాల్లో వున్న విన్సీ డా, జయా దేశం విడిచి పారిపోతారు.

ఆ కథతో ఈ కథ

పై కథ 2019 లో శ్రీజిత్ ముఖర్జీ దర్శకతంలో వచ్చిన విన్సీ డా అనే బెంగాలీ సినిమాలోది. క్రైమ్ జానర్ సినిమాని పునర్నిర్వచించిన మూవీ ఇది. నేరస్థుల్ని శిక్షించ డానికి అమాయకుల్ని బలిగొనే దుర్మార్గపు శిక్షా స్మృతి వీక్షకుల్ని, అదే సమయంలో సమీక్షకుల్నీ ఉలిక్కి పడేలా చేసింది. ఇది చూసి దర్శకుడు సుధీర్ వర్మ, రచయిత శ్రీకాంత్ విస్సా కూడా సముచిత రీతిలో ఉలిక్కిపడి వుంటారు. మాస్ మహారాజా రవితేజకి చెప్తే, ఆయన కూడా తగు విధంగా ఉలిక్కిపడి వుంటారు. ఉలిక్కిపడ్డ ముగ్గురూ కలిసి  విన్సీడా కి రుసుము చెల్లించకుండా ఉచితంగా సంగ్రహించి, రావణాసుర గా ప్రేక్షకుల్ని ఉలిక్కిపడేలా చేద్దామనుకుంటే, చీమ కుట్టినట్టుగా కూడా లేదు ప్రేక్షకులకి! 

కథ ఫ్రీగా దొరికిందని రవితేజ హీరోయిన్ని రేప్ చేసి, ఒరిజినల్లో కూడా లేనివిధంగా  -బోనస్ గా గొంతు కూడా కోసి క్రూరంగా చంపితే ఎలా? విన్సీ డా లో చిన్న హీరోలిద్దరూ ఏమైనా చేయొచ్చు. అందులోని  ఆది బోస్ విలన్ పాత్ర వేయాలని ఏ పాపులర్ స్టారూ అనుకోడు. అది రెగ్యులర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న హీరో కథ కాదు. దానికి నెక్స్ట్ జన రేషన్ కథ. పాపులర్ స్టార్ నటించాల్సింది కాదు. నటిస్తే విన్సీ డా పాత్ర నటించుకోవచ్చు. ఆది బోస్ పాత్రతో రవితేజ కోసం కథ మార్చినప్పుడు చేసిన ఇంకో చేయరాని పనేమిటంటే, రొటీన్ సీరియల్ కిల్లర్- ఇన్వెస్టిగేషన్ జానర్ కథగా చుట్టేయడం.

మెడికల్ మాఫియా అనే పాత రొటీన్ కి, ఆ మాఫియాలు ఒక్కొక్కర్ని  చంపడానికి విన్సీ డా లోని మాస్కులు తగిలిస్తే, ఈ చంపుతున్న సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే- కథంతా లాజిక్కుల సమస్యతో కలగాపులగమైపోయింది. పైగా ఇలాటి పోలీస్ వెర్సెస్ కిల్లర్ కథకి సస్పెన్స్, థ్రిల్ అనేవి లేకుండాపోయాయి. ఎందుకు చంపుతున్నాడని ఫ్లాష్ బ్యాక్ చెప్తే, అది వందల సినిమాల్లో చూపించిన మూస కారణమే. ఇలా ఏదో అన్యాయానికి గురైన హీరో, చట్టాన్ని  చేతుల్లోకి తీసుకున్న కాన్సెప్ట్ కాదు విన్సీ డా. ఆడుతున్న నెమలిని తీసుకొచ్చి అరుస్తున్న కాకిని చేశారు.

ఇక మాస్కులు తయారు చేసే విన్సీ డా పాత్ర నటించిన సుశాంత్ కి  విన్సీ డా లోని మేకప్ ఆర్టిస్టు బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. వూరికే మాస్కులు తయారు చేసే పాత్రగా ఫ్లాట్ గా వుంటాడు. అసలు  విన్సీ డా పోలీస్ వర్సెస్ కిల్లర్ కథ కాదు. విన్సీ డా ఇద్దరు హీరోల మధ్య విన్సీ డా వర్సెస్ సైకో కిల్లర్ కథ! అందుకని విన్సీ డా లో లాజిక్కులు, సస్పెన్సులు, థ్రిల్సు వుండవు. విన్సీ డా కథ వీటి గురించి కాదు. రెండు భిన్న ధృవాలుగా వున్న పాత్రల మధ్య, నైతికతలకి సంబంధించిన - ఒక డిస్టర్బింగ్ ఐడియాలజీని స్థాపించే డ్రామా. ముందు ఈ జానర్ మర్యాదని అర్ధం జేసుకోవాలి!

అతి మానవుడి అవతరణ

ఈబర్ మెంచ్ (Übermensch) అనేది 1883 లో జర్మన్ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే కాయిన్ చేసిన పదం. అంటే తనని తాను అతి మానవుడు (సూపర్ హ్యూమన్) గా భావించుకునే వాడని అర్ధం. తను రాసిన  'థస్ స్పేక్ జరతూస్త్ర' లో దేవుడు ఎలా చనిపోయాడో వివరిస్తాడు నీషే. దరిమిలా మెరుగైన భవిష్యత్తు కోసం ప్రపంచాన్ని క్రమబద్ధీకరించే బాధ్యత ఈబర్ మెంచ్ పై వుంటుంది.  దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ  'విన్సీ డా' కథా కథనాలకి ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. ఇది మానసికంగా కుంగిపోయిన ఆది బోస్ కథ.  ఇతను తనని తాను నీషే తలపోసిన ఈబర్ మెంచ్ గా భావించుకుంటాడు. అవినీతి వ్యవస్థ కారణంగా న్యాయాన్ని తప్పించుకునే, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులకి వ్యతిరేకంగా తను పాల్పడే చర్యల్లో, అమాయకుల్ని బలి చెయ్యాల్సిందేనన్న దుర్మార్గాన్ని ఈజీగా తీసుకునే రకం.

ఇంతవరకూ విజిలాంటీ జస్టిస్ (న్యాయం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం) సినిమాలు చూశాం. 1974 లో డెత్ విష్ దీనికి పెద్ద బాట వేస్తూ, అదే సమయంలో ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొంది. అప్పటి విలువలకి - సమాజాలకి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మింగుడు పడని వ్యవహారంగా వుంది. కానీ సినిమా టెంప్లెట్ల లంపటంలో చుట్టుకుని అక్కడక్కడే పడి వుండదు. కాలానికి ముందుంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే డెత్ విష్ తర్వాత నెక్స్ట్ లెవెల్  ఏంటి? దీనికి సమాధానమే నేటి కాలాని కంటే ముందున్న విన్సీ డా’.

నీషే ప్రకారం దేవుడు చనిపోయి ఈబర్ మెంచ్ అవతరిస్తే వేరేగా వుంటుంది లోకం. నేరస్థులు న్యాయ స్థానం నుంచి, దేవుడి శిక్షనుంచీ తప్పించుకుంటే ఇంకేం జరగాలి? చట్టమూ చచ్చిపోయి, దేవుడూ చచ్చిపోతే ఇక న్యాయం కోసం ఎక్కడికెళ్ళాలి? అందుకని ఈ సామాజిక రొష్టులోంచి అతిమానవుడు రొష్టుగా అవతరిస్తాడు. నేరస్థులు చేసిన నేరాల్నే పిచ్చెక్కి అమాయకుల్ని బలి పశువుల్ని చేసి రీక్రియేట్ చేస్తాడు. నేరస్థుల్ని జైల్లో కుక్కేస్తాడు. అతిమానవుడి కచ్చ నేరస్థులతో కాదు. నేరస్థుల్ని చంపే విజిలాంటీ జస్టిస్ కాదు. ఆ రోజులు పోయాయి. చట్టం మీద, దేవుడి మీద అతడి కచ్చ. చట్టమూ, దేవుడనే వాడుంటే  దేవుడూ వొళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించకపోతే అతి మానవుడు అతలాకుతలం చేసి  చూపించే సన్నివేశం ఇదే!

        ఇంత అర్ధంతో స్టడీ చేసి శ్రీజిత్ ముఖర్జీ విన్సీ డా తీస్తే, ఇదా రావణాసుర తో మర్యాద?

9, ఏప్రిల్ 2023, ఆదివారం

1317 : టైమ్ పాస్ పోస్టు

 

చాట్ జిటిపి రాసిచ్చిన ప్రేమ కథ!

Raj and Priya had been childhood friends, growing up in a small village in India. They were inseparable and spent most of their time together, exploring the countryside and dreaming about their future.

As they grew older, Raj realized that he had fallen in love with Priya. But he was too afraid to tell her, fearing that it might ruin their friendship.

Priya, on the other hand, had no clue about Raj's feelings. She was busy with her studies and didn't pay much attention to the boys in the village.

Years passed, and Raj moved to the city to pursue higher education. He missed Priya terribly and wrote to her every week, pouring out his heart in the letters. But he never mentioned his feelings, afraid that he might lose her forever.

Priya, meanwhile, had also moved to the city for her studies. She was doing well and had made many friends, but she still missed Raj and looked forward to his letters.

One day, Raj mustered up the courage to tell Priya how he felt. He poured his heart out in a long letter, telling her how much he loved her and how he had always dreamed of spending his life with her.

Priya was surprised and touched by Raj's words. She had never thought of him in that way before, but as she read the letter, she realized that she too had fallen in love with him.

They met in person, and it was as if they had never been apart. They talked for hours, catching up on all the years they had missed. And then, Raj took Priya's hand and told her that he wanted to spend the rest of his life with her.

Priya smiled, tears in her eyes, and said yes. They hugged each other, feeling the warmth of each other's embrace.

They got married in a small ceremony, surrounded by family and friends. And as they exchanged their vows, they knew that they had found true love, a love that would last a lifetime.

 

నేటి తెలుగు ప్రేమ సినిమాలా వుంది!

4, ఏప్రిల్ 2023, మంగళవారం

1316 : రివ్యూ!


 

        మితాబ్ బచ్చన్ నేవీ కెప్టెన్. సముద్రం మీద ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు షిప్పులోని 300 మంది ప్రాణాలని  పణంగా పెట్టి పారిపోతాడు. దీంతో అత్యంత నీచుడైన పిరికివాడుగా ముద్రవేసుకుంటాడు. సమాజం, కుటుంబం అతడ్ని బహిష్కరిస్తుంది. ఆ తప్పు చేసిన ఆపరాధభావంతో కుమిలిపోతూ, గతాన్ని మర్చిపోవడానికి  బొగ్గు గనుల్లో  కార్మికుడుగా చేరతాడు. శశికపూర్ ఆ గనుల్లో ఇంజనీర్. శశికపూర్ తో అమితాబ్ స్నేహం చేస్తాడు. అమితాబ్ కి నిద్రపోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ  గతం వెంటాడుతూంటుంది. శత్రుఘ్న సిన్హా పారిపోయిన ఖైదీ. గని కార్మికుడుగా చేరి రహస్య జీవితం గడుపుతూంటాడు. అయినా నేర బుద్ధి పోనిచ్చుకోక తోటి కార్మికుల్ని ఇబ్బంది పెడుతూంటే అమితాబ్ ఎదుర్కొంటాడు. ఇలాటి ఒక సంఘటనలో శత్రుఘ్న గాయపడితే అమితాబ్ అతడ్ని శస్త్ర చికిత్సకి రాఖీ దగ్గరికి తీసుకుపోతాడు. రాఖీ అక్కడ డాక్టర్. అక్కడ అమితాబ్ శత్రుఘ్న కి రక్తదానం చేస్తాడు. అలా శత్రుఘ్న అమితాబ్ స్నేహితుడవుతాడు.

        ప్రేమ్ చోప్రా బొగ్గుగనుల కాంట్రాక్టర్. ఇతను నాసిరకం పరికరాలతో, అరకొర వైద్య సామాగ్రితో, ఇతర సౌకర్యాల కొరతతో, కార్మికుల జీవితాల్ని కష్టతరం చేస్తాడు. అమితాబ్, శశి, శత్రుఘ్న ఇతడి దురాగతాలకి వ్యతిరేకంగా ఏకమవుతారు. ప్రేమ్ చోప్రా విలనీ భూగర్భంలో వరద ముప్పుకి దారితీస్తుంది. గనుల్లో విరుచుకు పడుతున్న జలాల్లో చిక్కుకున్న వందలాది కార్మికుల ప్రాణాలు అమితాబ్ కి  తిరిగి ఆ నాటి షిప్పు ఘటనని కళ్ళముందుకి తెచ్చి పెడతాయి. జీవితం వృత్త సమానం. పాత కళంకాన్ని తుడిచి వేసుకునే అవకాశాన్ని జీవితం ఎప్పుడూ ఇస్తుంది...
        
కథానాయకుడు అమితాబ్ కి పాప విముక్తి కల్గించే ఈ కదిలించే కథ 1978 నాటి కాలా పథ్థర్ లోనిది. సలీం -జావేద్ రచన, యశ్ చోప్రా దర్శకత్వం. 1975 లో ఝార్ఖండ్ లోని ఛాస్నాలా బొగ్గుగనుల్లో 375 మంది కార్మికుల ప్రాణాల్ని బలిగొన్న దుర్ఘటన దీనికాధారం. ఇది డిజాస్టర్ జానర్ మూవీ.
          
తెలంగాణా మణిహారమైన, దేశంలోనే పెద్దదైన, సింగరేణి బొగ్గు గనులు ఏర్పాటై వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా  దసరా సినిమా నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కి పండగే. ఇది బొగ్గుగనుల కార్మికుల జీవితాల గురించి గాక, ఫ్యాన్సుకి కిక్కునిచ్చే మద్యపానం కథగా బాగా అలరిస్తోంది. కాలమహిమ. తెలంగాణా సినిమా ఇలా ఎదుగుతోంది. కానీ ఫ్యాన్స్ కేం కావాలో అదిచ్చారు నాని, కొత్త దర్శకుడు. ఎలా వుందని కాదు, ఆడిందా లేదా అన్నదే లెక్క. ఐమాక్స్ నుంచి బయటికొచ్చిన ప్రేక్షకుల్లో ఇద్దరు 16-17 ఏళ్ళ లోపు టీనేజర్లు మైకు ముందు కొచ్చి చేసిన కామెంట్లు లెక్కలోకి తీసుకోనవసరం లేదు. దర్శకుడికి కథ చేసుకోవడం రాలేదనీ, ఎవరైనా పెద్ద దర్శకుడితో కథ చేయించుకుని వుండాల్సిందనీ అప్పుడే అంతంత పెద్ద మాటలనేశారు. వీళ్ళనేమనాలి? ఏ లోకంలో వున్నారు వీళ్ళు? ఈ బాల మేధావుల్ని వెంటనే నిషేధించాలి.
        
త్రాగుట తెలంగాణా సంస్కృతి అని చెప్తున్నారు. ఈ సంస్కృతి ఆధారంగా ఈ సినిమా తీశారు. దీనికి సింగరేణి కాలరీస్ బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నారు. దీంతో ఏ సంబంధం లేకుండా మద్యపానం కథ చేశారు. అలాంటప్పుడు గ్రామంతో బాటు తాగుబోతుల సిల్క్ బార్ సెట్స్ ఇంకెక్కడైనా చూపించొచ్చు. సింగరేణి దేనికి? ఇలాటి సందేహాలొస్తే అది సినిమా పరిజ్ఞాన మన్పించుకోదు.
        
గోదావరి ప్రాంతంలో బాటసారులు వంట కోసం కట్టెలు ముట్టించినప్పుడు, పొయ్యికి పెట్టిన రాళ్ళు ఎర్రగా కాలడం చూడడమే సింగరేణి బొగ్గు గనుల అంకురార్పణకి ఆవిష్కరణ. బొగ్గు పడింది, ప్రభుత్వం బాగు పడింది. సినిమాలో మందు పడింది, కలెక్షన్ పండింది. సినిమా విడుదల రోజున పొద్దున్నే శ్రీరామ నవమికి పూజ చేసుకుని వెళ్ళే ఫ్యాన్స్ కి మాంఛి మందు మైకం. త్రాగుట తెలంగాణా ఆట. ఇక వూరూరా సిల్కు బార్సు నెలకొల్పుట. పురస్కారాలు పంచుట.

హిట్టయ్యాక ఇంతే!

    ఫ్యాన్స్ కేం కావాలో అదివ్వడమే సినిమా పని. సినిమా హిట్టయ్యాక ఇచ్చిన మద్యపానం ప్యాకేజీ లోపల విషయం ఎలా వుందన్నది అనవసరం. ఇచ్చిన విషయం లోంచే నేర్చుకోవాల్సిన విషయాలున్నాయి, ఇవి తెలుసుకోవడం సమాచార హక్కు చట్టం కింద మన ధర్మం.
        
చిన్నప్పుడు నాని, కీర్తి, దీక్షిత్ ఒక జట్టు. పెద్దయ్యాక కీర్తి టీచర్. నాని దీక్షిత్ తో కలిసి గూడ్స్ లో బొగ్గులు దొంగిలించి సిల్క్ బార్ లో తాగుతాడు. తను పిరికివాడు. తాగితేనే ధైర్యం వచ్చి కొడతాడు. నాని, దీక్షిత్ ల మధ్య గాఢ స్నేహం. కీర్తితో నానికి మానసిక ప్రేమ. కీర్తికి దీక్షిత్ మీద భౌతిక ప్రేమ. దీంతో నానికి మూగ వేదన. వూళ్ళో ఏర్పాటైన సిల్క్ బార్లో గ్రామస్థులు తాగుడుతో, కుటుంబ సమస్యలతో అల్లకల్లోలంగా జీవిస్తూ వుంటారు. నానికి చిన్నప్పటి నుంచి కీర్తి అంటే మానసిక ప్రేమే కానీ ఆమె దీక్షిత్ ని భౌతికంగా ప్రేమిస్తోందని తెలుసుకుని -తన మానసిక ప్రేమని చంపుకుని - వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలని నిశ్చయించుకుంటాడు.
        
గ్రామంలో సముద్రకని, అతడి కొడుకు షైన్ చాకో ఇద్దరూ సాయి కుమార్ రాజకీయ ప్రత్యర్ధులు. పంచాయితీ ఎన్నికల్లో సాయికుమార్ దీక్షిత్ ని నిలబెడతాడు. దీక్షిత్ గెలుస్తాడు. షైన్ చాకో ఓడిపోతాడు. దీక్షిత్ కీ కీర్తికీ పెళ్ళయిపోతుంది. పెళ్ళి రోజు రాత్రి షైన్ చాకో ముఠా దీక్షిత్ ని నాని కళ్ళ ముందే చంపేస్తారు. దీంతో నాని షైన్ చాకో మీద పగబడతాడు...
        
ఈ ఫస్టాఫ్ కథలో నాని పిరికి వాడు, పాసివ్ క్యారెక్టర్. దీక్షిత్ యాక్టివ్ క్యారెక్టర్. కథని అతనే లీడ్ చేస్తూంటాడు. కీర్తితో ప్రేమ, క్రికెట్లో గెలుపు, బార్ లో క్యాషియర్ ఉద్యోగం, సర్పంచ్ గా గెలుపు, కీర్తితో పెళ్ళి - ఈ ప్రధాన ఘట్టాలన్నీ అతడి మీదే వుంటాయి. ముఠా బారి నుంచి నానిని కాపాడుతూ చనిపోయే ఘట్టం కూడా.
        
ఈ కథలో విలన్ షైన్ చాకోని సీత (కీర్తి) మీద కన్నేసిన రావణుడిలా చూపించారు. నాని రాముడికి హనుమంతుడిలా వుండిపోయాడు. కానీ రాముడ్ని పోగొట్టుకున్న సీతకి హనుమంతుడి (నాని) తో పెళ్ళి జరిపించేశారు! ఈ పిచ్చి కథ ప్రేక్షకులకి నచ్చి తీరాలి. ముత్యాల ముగ్గు రామాయణమే, గోరంత దీపం రామాయణమే. ఇలాటి రామాయణం కాదు.
        
దీక్షిత్ చనిపోయే ఘట్టం... తాగితేనే ధైర్యంవచ్చి కొట్టే నాని, దీక్షిత్ మీద దాడి జరుగుతున్నప్పుడు తాగి వుండి కూడా ముఠా మీద తిరగగబడక, దీక్షిత్ తనని కాపాడుతూంటే పారిపోతూంటాడు. ముఠా దీక్షిత్ ని చంపేస్తుంది.
        
ముఠా ఎవర్ని చంపడానికొచ్చింది? బార్ లో నాని వుంటాడు. బార్ మీదికి ముఠా వచ్చినప్పుడు దీక్షిత్ అప్పుడే అక్కడికొస్తాడు. దీక్షిత్ శోభనం రాత్రి కీర్తిని వదిలి బార్ లో నాని దగ్గరికి ఎందుకొచ్చాడు? ముఠా దీక్షిత్ ని చంపాలనుకుంటే అతడి ఇంటి మీది కెళ్ళకుండా నాని కోసమన్నట్టుగా బార్ కెందు కెళ్ళారు?
        
తాగితే చెలరేగిపోయే నాని దీక్షిత్ తనని కాపాడుతూంటే అతడి వెంట వురకడమే తప్ప ముఠా మీద దాడి ఎందుకు చేయలేదు? హీరోయిన్ ని కాపాడడానికి హీరో ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్తున్నట్టు, దీక్షిత్ నాని చేయి పట్టుకుని అలా వురకడమేమిటి? అంటే నాని కావాలనే ముఠాని ఎదుర్కోలేదా? ముఠా దీక్షిత్ ని చంపేస్తే కీర్తి తనకి దక్కుతుందని తెలివిగా ఆలోచించాడా?

మరిన్ని పాసివ్ గైడెన్సులు

        పాసివ్ క్యారెక్టర్ నాని సెకండాఫ్ లో షైన్ చాకో, దీక్షిత్ ని రాజకీయ కక్షతో కాకుండా, కీర్తి మీద కన్నేసి చంపాడనీ తెలుసుకుని కీర్తికి తాళి కట్టేస్తాడు! కీర్తి ఎవడో ఒకడు మగాడి సొత్తుగా వుండాలన్నట్టు. ఆమె ఇంకా భర్తని పోగొట్టుకున్న బాధలో వుండగానే. ఆమె కూడా ఆ తాళిని తెంచి పారెయ్యకుండా, దీక్షిత్ తో చైల్డ్ హుడ్ లవ్ లేదు గివ్ లేదన్నట్టు నానితో వెళ్ళిపోవడం. ఈమెది కూడా సెల్ఫిష్ క్యారెక్టరయింది.
        
ఇక్కడ కథ అయిపోయినట్టే. తర్వాత అమ్మ చెప్పిందని నాని అస్త్రసన్యాసం చేసినప్పుడూ కథ అయిపోయినట్టే. షైన్ చాకో భార్య చెప్తే దీక్షిత్ హత్యకి కారణం తెలియడం, అమ్మ చెప్తే అస్త్ర సన్యాసం చేయడం వంటివి నాని పాసివ్ క్యారెక్టరైజేషన్ కి అదనపు హంగులు. పాసివ్ క్యారెక్టర్లు సృష్టించాలనుకునే వాళ్ళకి గైడెన్స్.
        
చివరికి అస్త్రసన్యాసం చేసిన నానికి చాకో తో పనే లేదు. కథ అయిపోయింది కాబట్టి. చాకోకే నానితో పనుంది. అతడ్ని చంపి రెండు సార్లు పెళ్ళయిన కీర్తిని దక్కించుకోవడానికి. కీర్తికీ అభ్యంతర ముండనవసరం లేదు. ఒకసారి బానిస ఎప్పటికీ బానిసే. ఇక నాని ప్రారంభించాల్సిన క్లయిమాక్స్ తను పాసివ్ కాబట్టి తను ప్రారంభించకుండా చాకో ప్రారంభిస్తాడు. ఇలా చాకో యాక్షన్ తీసుకుంటే- ఎజెండా అతను సెట్ చేస్తూంటే- ఆ ట్రాప్ లో పడ్డ పాసివ్ నాని, దానికి రియాక్షన్ ఇస్తాడు పాసివ్ కాబట్టి. ఇక దసరాకి రావణ దహనంతో బాటు చాకో మరణం పూర్తి.

ఏది భావోద్వేగం

    బాలమేధావులు చెప్పిందేమిటాని ఆలోచిస్తే పై విధంగా వచ్చింది. మనం రాయాలి కాబట్టి ఆలోచిస్తాం, లేకపోతే అవసరమేముంది. ఏదో చూపింది చూశామా, ఇంటికెళ్ళి పడుకున్నామా ఇంతే. వారం రోజులుగా ఏం రాశాడా అని పాఠకులు బ్లాగుని క్లిక్కు మీద క్లిక్కు చేసి చూస్తున్నారు. క్లిక్కులతో బ్లాగు పగిలిపోయేట్టుంది. చివరికి బద్ధకం వదిలించుకుని లేటుగా చూసి లేటుగా రాశాం.
       
కాలా పథ్థర్ అమితాబ్ మీద కథ. పాప విముక్తి కోసం అల్లాడే ఇన్నర్ జర్నీ, గని కార్మి కుల కోసం పోరాటం అతడి ఔటర్ జర్నీ. ఇందులో ఈ రెండు త్రెడ్స్ ని డిస్టర్బ్ చేసే లవ్ లో సమస్యలు, ట్రయాంగులర్ లవ్ సమస్యలు, ఫ్రెండ్ షిప్పుల్లో సమస్యలు వుండవు. ఇది డిజాస్టర్ జానర్ మూవీ. అమితాబ్ కి రెండు డిజాస్టర్ లు - సముద్రం మీద షిప్పుతో, గనుల్లో వరదతో. కాబట్టి అమితాబ్ కి రాఖీతో సాఫీ ప్రేమ. శశి కపూర్ కి పర్వీన్ బాబీతో, శత్రుఘ్న సిన్హాకి నీతూ సింగ్ తో సాఫీ ప్రేమలు. కథలో భావోద్వేగం ప్రేమలతో కాదు, స్నేహాలతో కాదు. భావోద్వేగం చెదిరిపోకుండా ఏకధాటిగా, బలంగా వుండాల్సింది ప్రధాన కథ అయిన అమితాబ్ అంతర్ సంఘర్షణతో, విపత్తులో గని కార్మికులతో. హై డ్రామా ఇక్కడుంది, స్టార్లు ముగ్గురి హీరోయిజాలూ, ఆత్మబలి దానాలూ అన్నీ ఇక్కడే. దీంతోనే  భావోద్వేగం. ఇలాగే వుంది సినిమాలో. చివరికి ఇన్నర్, ఔటర్ జర్నీలు విజయవంతంగా ముగించుకునన్న అమితాబ్ మెచ్యూర్డ్ క్యారెక్టరవడం ఉత్తమ కథా లక్షణం ప్రకారం జరిగిన ప్రక్రియ.
        
దసరా లో ఏ భావోద్వేగం పట్టుకోవాలి? ఫ్రెండ్ షిప్పా? లవ్వా? రాజకీయమా? కులతత్వమా? మద్యపాన సమస్యా? రామాయణం ఫీలవ్వాలా? ...రాముడు పది హిట్లు కొడితే రావణుడు చచ్చిపోలేదు. రావణ దహనమంత ఈజీ కాదు. హిట్లు కొట్టిన కొద్దీ తలలు పుట్టుకొస్తున్నాయి. ఇలా ఈ కలుపుతో కాదని, మూలం మీద కొట్టాలని, బ్రహ్మాస్త్రంతో ఛాతీ మీద కొట్టి నేల కూల్చాడు. దసరా లో భావోద్వేగాలన్నీ కలుపు మొక్కలే.  కాలా పథ్థర్ లో భావోద్వేగం రాముడు వేసిన బ్రహ్మాస్త్రం. కానీ ఏ బ్రహ్మాస్త్రమూ లేకపోయినా దసరా సూపర్ హిట్టయ్యింది. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకుని, కలుపు మొక్కలతో ఆధునిక తెలుగు సినిమాలు ఇలాగే నిర్మించుకోవచ్చు. ఆప్ట్రాల్ బాక్సాఫీసుని మించిన కొలమానం లేదు.

—సికిందర్